కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేనా?
కేంద్రం రాష్ట్ర విభజనపై తన నిర్ణయం ప్రకటించేందుకు నెలరోజుల గడువు ప్రకటించిన నాటినుండి రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం నెలకొంది. మిగిలిన పార్టీలకన్నా కూడా ఎక్కువగా కాంగ్రేసు పార్టీలోనే తెలంగాణా అంశంపై రాద్దాంతం జరుగుతోంది. కాంగ్రేసులో కొందరు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తే లేదని గట్టిగా చెపుతుంటే, మరి కొందరు ఆవాదనలు బలపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలకి ఆందోళన చెందుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ వారి మాటలు ఖండించలేకపోవడంతో, తెరాస వంటి పార్టీల ముందు చులకనయిపోతున్నారు. అందుకే, రేపు తెలంగాణా కాంగ్రెస్ నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకొన్నారు.
సమైక్యంద్రవాదిగా పేరుపడిన లగడపాటి రాగోపాల్ ఈ రోజు విజయవాడలో పత్రికల వారితో మాట్లాడుతూ తెలుగు ప్రజలను, నేలను, నీటిని ఎవరూ కూడా విడదీయలేరన్నారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని, పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై తమకు స్పష్టమైన సంకేతాలు అందాయని తెలియజేస్తూ, తమకు అర్ధమయిన ఈ విషయం, ఇతరులకి ఎందుకు అర్థం కాలేదో తెలియదని అన్నారు.
పూర్తీ విశ్వాసంతో చెపుతున్న అయన మాటలువిన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, హైదరాబాదులో మీడియా వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్ప తాము ఎలాంటి ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లకు అంగీకరించబోమని తెలిపారు. తద్వారా ఆయనకూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా ఈయబోదని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకు, రాష్ట్ర కేంద్ర మంత్రులు మాట్లాడిన తీరు చూసినట్లయితే కాంగ్రెస్ తెలంగాణాకి ప్రత్యెక ప్యాకేజి వంటిదేదో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పరిచే ఆలోచన ఉన్నట్లు కనిపించట్లేదు. ఇక, ఈ ఊహాగానాలకు తెరపడాలంటే ఈ నెలాకరు వరకు వేచిచూడవలసిందే.