పవిత్ర బంధానికి తూట్లు.. ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య!

  ఏడు అడుగులు వేసి, జీవితాంతం తోడుంటానని బాస చేసిన భార్యే కాలయముడిగా మారింది. పరాయి వ్యక్తి మోజులో పడి, కట్టుకున్న వాడినే కడతేర్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు "గుండెపోటు" నాటక మాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బట్టబయలైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ‌... అశోక్,పూర్ణిమ దంపతులు... వీరికి పిల్లలున్నారు. బోడుప్పల్, ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసముంటు న్నారు. వి.జె. అశోక్ (45) శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య జె. పూర్ణిమ (36) ప్లే స్కూల్ నడుపుతోంది. పైకి అన్యోన్యంగా కనిపిస్తున్న వీరి కాపురంలో 'అక్రమ సంబంధం' చిచ్చు రేపింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, అది వివాేహేతర సంబంధానికి దారితీసింది.భార్య తీరుపై అనుమానం వచ్చిన అశోక్, ఆమెను పలుమార్లు మందలించారు. తన ఆనందానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన పూర్ణిమ.. ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి జరిగింది ఇదే.. డిసెంబర్ 11, 2025 సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన అశోక్‌పై, పథకం ప్రకారం మాటు వేశారు. మహేష్ తన స్నేహితుడు సాయి కుమార్ (22) సహాయం తీసుకున్నాడు. అశోక్ ఇంట్లోకి రాగానే మహేష్, సాయి ఆయనను పట్టుకోగా.. కట్టుకున్న భార్య పూర్ణిమ భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. అనంతరం మహేష్ మూడు చున్నీలతో అశోక్ మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. అనుమానం రాకుండా హైడ్రామా.. హత్య అనంతరం నిందితులు అశోక్ బట్టలు మార్చి, రక్తపు మరకలున్న దుస్తులను, సాక్ష్యాలను మాయం చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త బాత్‌రూమ్‌లో పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందాడని, గుండెపోటు వచ్చి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల చాకచక్యం.. మొదట సాధారణ మరణంగా కేసు నమోదు చేసినా, దర్యాప్తులో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. అశోక్ మృతదేహంపై బుగ్గలు, మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ పుటేజీలు, టెక్నికల్ ఆధారాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అశోక్ దిన దిశ కర్మ అయి పోయిన వరకు కూడా పూర్ణిమ చాలా చాకచక్యంగా వ్యవహరించింది ..అంతేకాదు పది రోజులపాటు తన భర్త లేడు అనే విషయాన్ని జీర్ణించుకో లేకుండా పోయింది.. ఒకవైపు భర్త లేడని నాటకం ఆడుతూనే మరోవైపు తన ప్రియుడితో నిత్యం చాటింగ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటి కప్పుడు చేరవేసింది..  తన భర్త తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడని నిత్యం రోదించింది ..కానీ ఇదంతా నాటకం అని పోలీసుల విచారణలో బయటపడింది.. దీన దిశ కర్మ పూర్తి అయిన వెంటనే పోలీసులు  విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి విచారించారు.. తనదైన స్టైల్ లో ఏమీ తెలియనట్టు బుకాయించే ప్రయత్నం చేసింది ..కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో చివరికి నిజాన్ని బయటకు వెళ్ళ గక్కింది.. తన ప్రియుడుతో కలిసి తాను ఈ హత్య చేశానని పేర్కొంది ..ఈ వరకు ప్రియుడు అయిన మహేష్ తో పాటు పూర్ణిమనీ పోలీస్ లు అరెస్టు చేశారు.. క్షణికావేశం, అక్రమ సంబంధాల మోజులో పచ్చని కాపురాన్ని కూల్చుకుని, కటకటాల పాలైన పూర్ణిమ ఉదంతం స్థానికులను విస్మయానికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఛేదించి సంచలన హత్యకేసును వెలికితీసిన మేడిపల్లి పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు  

జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటెషన్‌పై పిటిషన్ కొట్టివేత

  జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 7 కార్పోషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.  వార్డుల విభజను సవాల్‌ చేస్తూ హైకోర్టులో  పిటిషన్‌ దాఖలైంది.  ఎంసీహెచ్‌ఆర్‌డీలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని తెలంగాణ సర్కార్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. చట్టపరిధిలోనే వార్డుల విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ బుధవారమే కోర్టుకు వివరించారు. 

రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం

  టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని శాలువతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.  బ్ర‌హ్మీ కేవలం నటుడే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్‌లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీస్తారు. ఖాళీ సమయాల్లో తన మనసుకు నచ్చిన చిత్రాలను గీయడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయా చిత్రాలను తనను కలిసే ప్రముఖులకు బహుమతిగా అందించడం బ్రహ్మానందం ప్రత్యేకత. కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు ఎంతోమందికి ఆయన గీసిన చిత్రాలను అందించారు. 

కూటమి పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ ఎలక్షన్ ఫండ్స్

  తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.  రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి. ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.  ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.   పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.  తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.  వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవంలో రభస

  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా డీజేలో పెట్టిన పాటకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా  చెన్నారావుపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన కంది శ్వేత కృష్ణచైతన్య రెడ్డి ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.  ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి శోభన్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించారు. అనంతరం చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట శివానంద్ సర్పంచ్ మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణ చేయించారు.

ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ

  సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయో గిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియా వేదికలపై తమ చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అవమా నకరమైన పోస్టులు పెడుతు న్నారని, వాటి ద్వారా తమ ప్రతిష్ఠకు భంగం కలుగు తోందని పిటిషన్లలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.  ఈ విధమైన చర్యలు తమ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తు న్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈపిటిషన్లపై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు కోర్టు కు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆయన కోర్టుకు వివరించారు.ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ సంస్థ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ప్రతివాదులు ఇప్పటికే కొన్ని వివాదాస్పద లింకులను తొలగించామని కోర్టుకు తెలిపారు.  అయితే, తొలగించబడిన లింకులపై తుది ఆదేశాలు జారీ చేసే ముందు సంబంధిత లింకులను వినియోగించిన ఖాతాదారుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల విషయంలో ప్రత్యేకంగా స్పష్టమైన నిరాకరణ (డిస్‌క్లైమర్) ఉండాలని కోర్టు సూచిం చింది.ఈ అంశంపై గూగుల్ సంస్థ తమ ఖాతాదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, అవసరమైతే సంబంధిత ఖాతాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే, వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల లోపు కోర్టుకు సమ ర్పించాలని ప్రతివాదులకు సూచించింది. వాదప్రతివాదనలు పూర్తి అయినా తరువాత కోర్టు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

అంబటి.. అహంకారమా? అవివేకమా?

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 

అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల

  అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయునున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్‌ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో  ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని  మూవీ టికెట్‌ రేట్లు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.  

లోకేష్ విషెస్ కు జగన్ నో రిప్లై.. కారణమేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు.  అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు. 

ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ ఉడత ఊపులు!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి అహంకారంతో కన్నూమిన్నూగానక వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందా? గతంలో మాట్లాడితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందా? అంటే.. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఔననే అంటున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు  ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.  క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందనీ, దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారనీ,  అందుకే రేవంత్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేసీఆర్ చేసిన  తోలు తీస్తా  వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేడర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి తోలు ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఇప్పుడు  ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఇప్పుడు ఉడత ఊపుల మాదిరి విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు నిదర్శనంగా జూపల్లి అభివర్ణించారు.  బీఆర్ఎస్, బీజేపీ లు లోపాయికారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా కూడా  మూడింట్ ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయన్న జూపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారనడాని కి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.  పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కావడం వల్లే కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారంటే అర్ధమ దేనన్నారు.  ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని జూపల్లి విమర్శించారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసింది కేసీఆరేనన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది అంటూ విమర్శలు గుప్పించారు.

ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు

  ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఏపీ శాసనమండలి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కించపరిచే విధంగా ట్వీట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు మండలి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపధ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న హక్కుల కమీటి ముందు హాజరు కావాలని ఆదేశించింది.  అమ్మిరెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. గతంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదును పరిశీలించిన శాసనమండలి, ఈ అంశాన్ని హక్కుల కమిటీకి (ప్రివిలేజెస్ కమిటీ) నివేదించింది.

జగన్ బర్త్ డే.. సంబరాల పేరిట పశుబలులు!

ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో.. అలా ఉంటారు జగన్. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు జగన్. ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ, ఆయన నేతృత్వంలోని వైసీపీకి లేవు అంటారు పరిశీలకులు. ఔను మరి యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నాయకుడిని బట్టే ఆయన పార్టీ, ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ అలా కాకుండా మరెలా ఉంటాయం టున్నారు రాజకీయ పండితులు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఆనవాలు అన్నదే రాష్ట్రంలో కనిపించలేదు. కక్షసాధింపు, వ్యతిరేకించిన వారిపై కేసులు, అరెస్టులే పాలనగా ఆయన అధికారంల ఉన్న ఐదేళ్లూ కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి.  సరే జనం విషయం గుర్తించి 2019లో తాము  కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.  అది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తీరు, ఆయన పార్టీ తీరు ఇసుమంతైనా మారలేదు. తాజాగా ఆదివారం జగన్ 53వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీయులు నానా హంగామా సృష్టించారు. జనం ఈసడించుకునేలా పశుబలులు ఇచ్చి రక్తం చిందించారు.  ఇక జగన్ కు జనాభిమానం తగ్గలేదని చాటేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలూ వేయించారు. జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి ఫ్లయిట్ ఎక్కగానే  ఆయన పేరున్న గౌన్లు వేసుకున్న చిన్నారులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశారు. అసలు ఆ విమాన ప్రయాణీకులలో జగన్ ఉంటారని వైసీపీయులకు వినా మరొకరికి తెలిసే చాన్సే లేదుగా. అందుకే చిన్నారులతో చేసిన ఆర్భాటమంతా పెయిడ్ ఆర్టిస్టుల పనేనని ఇటే తెలిసిపోతోందంటున్నారు పరిశీలకులు. సరే ఫ్లైట్ సీన్లు అలా ఉంటే..  ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జగన్ పై అభిమానమంటూ వైసీపీ యులు చేసిన విన్యాసాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రప్ప రప్ప గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు హోర్డింగులే కాకుండా  మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో , మండల కేంద్రమైన విడపనకల్లు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో జగన్ జన్మదినం సందర్భంగా  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేశారు. ఇక  ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారంలో లేకుండానే ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీయులు.. పొరపాటున వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఆ హింసాకాండను, అరాచకత్వాన్నీ తట్టుకోగలమా అన్న భయాందోళనలు ఇప్పటి నుంచే జనంలో వ్యక్తమౌతున్నాయి. 

సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు

  నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.  ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

మేడ్చల్ లో విద్యార్థి మిస్సింగ్.. బతికున్నాడా లేదా అంటూ తల్లిదండ్రుల ఆందోళన

మేడ్చల్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.  ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ అనే 14 ఏళ్ల విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ గత ఎనిమిది రోజులుగా లభించకపోవడంతో ఆ విద్యార్థి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.  తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆవరణలో చలి మంట వేసుకున్న కారణంగా వార్డెన్ తమ కుమారుడిని చితకబాదాడని, ఆ దాడి కారణంగానే కార్తీక్ భయంతో స్కూల్ నుంచి వెళ్లిపోయి ఉంటాడనీ వారంటున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజ మాన్యం సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలింతకీ తమ కుమారుడు బతికి ఉన్నాడా? లేదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.   ఇలా ఉండగా.. కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ పరిసరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. 

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం- 15 మంది దుర్మరణం

ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తు న్నాయి.  రోడ్డు, రైలు విమాన అన్న తేడా లేకుండా ఈ ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల ఉసురు తీస్తున్నాయి. సాంకేతిక సమస్య, మానవ తప్పిదం కారణమేమైతేనేం ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం  టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  సోమవారం (డిసెంబర్ 22) తెల్లవారుజామున  ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.    క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలి, డోర్లు మూసుకుపోయాయి. దీంతో బస్సులోకి వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసుకురావడం సమస్యగా మారింది. స్థానికుల సహకారంలో ఎలాగో బస్సు డోర్లను తెరిచి లోపలకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.   అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.   పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.   కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.  ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు.