జగన్ పార్టీలో కొత్తరకపు పోరు!

రోజు రోజుకూ అందరూ బలోపేతం అవుతోందని భావిస్తున్న జగన్ పార్టీలో అంతా బాగాలేదని ఇటీవల జరుగుతున్న ఓ కొత్తరకపు పరిణామం రుజువు చేస్తోంది. అధిక వలసలే దీనికి కారణం. పార్టీ పెట్టినప్పటినుండి ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్యం చేలాయిస్తోన్న నాయకులకు, ఈ మధ్యే ఆ పార్టీలోకి వెళ్ళిన నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో అంతర్గత విబేధాలు ప్రారంభమై, అవి పార్టీ అధినాయకత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని సమాచారం. ఈ విషయంలో నెలకొన్న అసంతృప్తులు క్రమక్రంగా తీవ్రతరమవుతున్నాయి. జగన్ పార్టీలో వలసలను అధికంగా ప్రోత్సహిస్తుండటం ఇలాంటి పరిణామాలకు కారణం. వచ్చే ఎన్నికల్లో తమకే టిక్కెట్ వస్తుందని భావించిన నాయకులు, కొత్తగా వచ్చిన వారినుండి రాష్ట్రంలోని కొన్ని నియోజక వర్గాల్లో గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లె, పలమనేరు, కడపజిల్లా కమలాపురం, కర్నూలు జిల్లా డోన్, గుంటూరు వెస్ట్, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లాంటి నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

రానున్న ఎన్నికల్లో సిపీఐ, సిపియం చెరోవైపు?

వచ్చే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎవరికీ అంతుబట్టని విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు! గత ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి 'మహాకూటమి'గా ఏర్పడి పోటీ చేసిన సిపీఐ, సిపియం పార్టీలు ప్రస్తుతం చెరోవైపు నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారాన్ని బట్టి, సిపీఐ పార్టీ తెలుగుదేశం, టి.ఆర్.ఎస్.లతోను, సిపియం పార్టీ జగన్ పార్టీతోనూ జతకట్టనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం, జగన్ పార్టీలు వ్యక్తం చేసే వైఖరిపైనే ఈ సమీకరణాలు కొలిక్కి వస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ, తెలుగుదేశం సమైక్యాంధ్ర వైఖరి అవలంభిస్తే మాత్రం ఒక్క టి.ఆర్.ఎస్.తోనే పొత్తు పెట్టుకోవాలనేది సిపీఐ వ్యూహంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కామ్రెడ్ల వైఖరి ఏమిటో తెలియాలంటే మాత్రం తెలంగాణా అఖిలపక్షం ముగిసేవరకూ వేచి చూడాల్సిందే!

మోపిదేవి కి మధ్యంతర బెయిల్‌

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి వాన్‌పిక్ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు మంగళవారం కొన్ని షరతులతో కూడి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. శబరిమల యాత్రకు వెళ్లేందుకు ఈనెల 24 నుంచి జనవరి 2వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మోపిదేవి వెంట కొంత మంది గార్డులు కూడా ఉంటారని, కేసుకు సంబంధించి ఎవరినీ కలవకూడదని, మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించింది. కాగా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మోపిదేవి బెయిల్ పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది.

మీడియా ముందు చేస్తేనే మజా! విజయ శాంతి

  తే.ర.స.లో అప్పుడప్పుడు కనిపిస్తూ తళ్ళుకుమని మెరిసే విజయశాంతి మొన్న నల్గొండలోజరిగిన భారి తే.ర.స. బహిరంగసభకు మొహం చాటేయడంతో, మీడియా ఆమెకి కేసిర్కి మద్య విబేధాలే అందుకు కారణం అని కోడయికూయడమే గాకుండా ‘త్వరలో మీరు బిజెపిలో జేరబోతున్నారట కదా?’ అంటూ గాల్లోకి ఒక బాణంకూడా విసిరిచూసింది. దానితో కంగుతిన్న విజయశాంతి ఆ పుకార్లను గట్టిగా ఖండించేసి మళ్ళీ తే.ర.స. సభ్యులతో ఫోటోలు దిగుతూ మీడియాకి పోజులు ఇవ్వడం ప్రారంబించేరు. పనిలో పనిగా ఎక్కడోపాడయిపోయిన ఓ రైల్వే ట్రాకుని కూడా వెతికి పట్టుకొని ‘చూసారా...చూసారా... తెలంగాణాపట్ల చివరికి రైల్వేవాళ్ళు కూడా యెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో!’ అంటూ తానూ ఇంకా ఉద్యమంలోనే ఉన్నానని ప్రజలకి పత్రికముఖంగా మరో మారు తెలియజేసారు.   కేసిర్ తనని పార్లమెంటుకి వెంటరానిచ్చినా అఖిలపక్ష సమావేశాలకి తనని ఎలాగు వెంట తీసుకుపోడని తెలుసు గనుక అదేదో లైవ్ లో చూడగలిగితే బాగుంటుందని ఆలోచన రాగానే, అఖిలపక్ష సమావేశం మీడియా ముందు జరపాలని డిమాండ్ చేసారావిడ. మీడియా ముందయితే ఎవరెవరు ఏమేమి మాట్లాడారో లైవ్లో ప్రజలే చూస్తారు గాబట్టి, తెలంగాణాకి వ్యతిరేకులెవరో అనుకూలురెవరో తేలిపోతుంది అని ఆవిడ అభిప్రయపడారు. అయితే, అమూల్యమయిన ఆవిడ సూచనని కనీసం తే.ర.స. వర్గాలు సైతం పట్టించుకోలేదు పాపం.

ఆచార్యులవారికి సంకట స్థితి కల్పించిన కేసిఆర్

  కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం, అన్నట్లుంది తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫసర్ కోదండరాంగారి పరిస్తితి ఇప్పుడు. నిన్న కెసిఆర్ పత్రికల వారితో మాట్లాడుతూ “నేను ప్రొఫసర్ కోదండరాం కలిసి డిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేశానికి వెళ్తున్నాము” అని ప్రకటించడంతో కొత్త కధ మొదలయింది.   తెలంగాణా జెఎసి చైర్మన్ గా వ్యహరిస్తున్నపటికీ ఆయన కేసిర్ వెనుకే తిరుగుతూ కేసిర్ తొత్తుగా తయారయడని నిత్యం విమర్శించే తెలుగుదేశం, బిజెపి పార్టీలు ఇప్పుడు కేసిర్ ప్రకటనతో ఒక్కసారిగా అతని మీద మళ్ళీ విరుచుకు పడ్డాయి. అసలు తెలంగాణా రాకుండా అడ్డుకొంటున్నది ప్రొఫసర్ కోదండరామేనని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు విమర్సించారు. కేసిర్ అనుచరుడిగా మారిన అయన ఏవిదంగా తెలంగాణా జెఎసి చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేసారు. కేసిర్ ప్రకటనతో సంకట స్థితిలోపడ్డ ఆచార్యులవారు అందరూ తనకే సుద్దులు చెప్పడం చూసి బాధపడుతూ “నేను తెలంగాణా జెఎసి సభ్యులతో చర్చిoచిన తరువాతే నా నిర్ణయం తెలియజేస్తాను’ అని పత్రికలద్వారా తన శత్రువులకి విన్నవించుకొన్నారు.   అయితే, కేసిర్ ప్రకటన కూడా చేసేసాక ఇప్పుడు అతని వెంట రానంటే, ఇప్పటికే తన మీద గుర్రుగా ఉన్న కేసిర్ తో మళ్ళీ మనస్పర్ధలు మొదలవుతాయేమోనని ఒక వైపు టెన్షన్ గా ఉంటె, మరో వైపు అతని వెంట వెళ్లి బిజేపి, తెలుగుదేశం పార్టీలకు మరింత అలుసయిపోతానేమోనని దిగులు పడుతున్నాడాయన.

కాంగ్రెస్ కుట్రల పార్టీ : చంద్రబాబు

    కాంగ్రెస్ కుట్రల పార్టీయని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి చూస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గానీ, మంత్రులు గానీ గ్రామాల్లోని కనీస సమస్యలు కూడా పరిష్కరించడంలేదని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరిస్తామంటే వెటకారం చేస్తున్నారని, తమని విమర్శించే హక్కు ముఖ్యమంత్రికి లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర 73వ రోజైన సోమవారం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది.  జిల్లాలో మూడో రోజు యాత్ర జగిత్యాల నియోజక వర్గం, రాయికల్ మండలం, ఇటిక్యాల నుంచి చంద్రబాబు ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం అందరినీ విమర్శించడం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశమంతా తిరిగినా టీడీపీ అధికారంలోకి రాదని అంటున్నారని, ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వమని, దద్దమ్మ ప్రబుత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ళయినా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు.

షర్మిల పాదయాత్రకు బ్రేక్ : మోకాలికి ఆపరేషన్

      వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిలా చేస్తున్న పాద యాత్రకు మూడు వారాలు బ్రేక్ పడనుంది. మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె పాద యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాద యాత్ర చేస్తున్న సమయంలో తన వాహనం ఫై నుండి పడటంతో ఆమె మోకాలికి గాయం అయింది.   గత శని, ఆది వారాల్లో ఆమె పాద యాత్ర జరగలేదు. సోమ వారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,మోకాలి నొప్పి కారణంగా అది సాధ్య పడలేదు. దీనితో, వైద్యులు జరిపిన ఎమ్మార్ స్కాన్ లో గాయం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. మరో రెండు రోజుల్లో ఆమెకు వైద్యులు కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు తెలియచేశారు.   దీనితో, ఆమె పాద యాత్ర కు మూడు వారాలు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. షర్మిలా కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో గానీ, మరో ఆసుపత్రిలోగానీ ఆపరేషన్ చేయనున్నారు.

కాంగ్రెస్ సమావేశంలో పొన్నం విసుర్లు

  ఈ రోజు అనగా ఆదివారం హైదరాబాద్ యల్.బీ.నగర్ వద్ద జరుగుతున్న కాంగ్రేసు సమావేశాలలో తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పొన్నంప్రభాకర్ తనదయిన శైలిలో మాట్లాడి సభలో కలకలం రేపారు. ఆయన ముందుగా, తెలంగాణాకోసం అమరులయిన యువకుల ఆత్మశాంతికి సభ రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరడంతో వేదిక మీద ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు అభ్యతరం చేప్పేసరికి సభలో ఒక్కసారిగా కలకలం మొదలయింది. తీవ్ర ఉద్రిక్తులయిన తెలంగాణా సభ్యులందరూ ఒక్కసారిగా నిల్చొని ‘జై తెలంగాణా’ అంటూ నినాదాలు చేసారు. అందుకు పోటీగా సీమాంద్ర ప్రాంతాలనుండి వచ్చినవారు కూడా ‘జై సమైక్యాంద్రా’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టేసరికి సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కలుగ జేసుకొని సభని రెండు నిమిషాలు మౌనం పాటించమని ఆదేశించడంతో పరిస్తితి అదుపులోకి వచ్చింది.   తరువాత మళ్ళీ మాట్లాడిన పొన్నం ప్రభాకర్, వేదిక మీద ఆసీనులయిన పెద్దలందరికీ మరింత షాకులు తినిపిస్తూ “ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపటికీ, తెలంగాణాలో పార్టీ కార్యకర్తలెవరూ కూడా సంతృప్తిగా లేరని అన్నారు. సభలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఉద్దేశిస్తూ ‘మాజీ మంత్రి మోపిదేవి వెంకట రామనకో న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద రావుకొక న్యాయం ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణా సమస్యని వెంటనే పరిష్కరించాలని సభ ముఖంగా పార్టీకి ఆయన విజ్ఞప్తి చేసారు.

వేదికపై అంజన్ అసంతృప్తి

    కేంద్ర మంత్రిగా నేను అర్హుణ్ని కాదా అని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశంలో ఎంపీ అంజన్‌కుమార్ ప్రశ్నించారు. దేశంలో 22 కోట్ల మంది యాదవులు ఉన్నారని.. దక్షిణాది నుంచి గెలిచిన ఏకైక యాదవ ఎంపీని తానేనని అంజన్‌కుమార్ మండిపడ్డారు. యూపీఏ వచ్చిన నాటినుంచి బీసీలకు మంత్రి పదవి దక్కలేదని, కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ అంజన్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇతరపార్టీలోకి బీసీల వలసలు పెరుగుతున్నాయని అంజన్‌కుమార్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అంజన్‌కుమార్ ఫైర్‌ అవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు అవమానం

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఘోర పరాభవం జరిగింది. పాసులు లేవంటూ పోలీసులు ఎంపీలను సదస్సుకు అనుమతించలేదు. దీంతో ఎంపీలు పోలీసుల తీరుమీద మండిపడ్డారు. పాసుల్లేక పోవడంతో కార్యకర్తలు కూర్చున్న చోటే ఎంపీలు కూడా కూర్చున్నారు. పోలీసుల తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ పెద్దది కాకుండా మంత్రి జానారెడ్డి వచ్చి పోలీసులకు, ఎంపీలకు నచ్చజెప్పి ఎంపీలను వేదిక మీదకు తీసుకెళ్లారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు జై తెలంగాణ నినాదాలతో సమావేశాన్ని హోరెత్తించారు. తమ చొక్కాలకు తెలంగాణ బ్యాడ్జీలు ధరించి వారు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, సమైక్యాంధ్ర వివాదాలు సదస్సులో తేవొద్దని పీసీసీ చెప్పినా ఎంపీలు మాత్రం వాటిని పక్కకు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ సదస్సులో నెలకొంది. నేతలంతా సదస్సుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సదస్సుకు హాజరయ్యారు. 11 అంశాల మీద ఈ సదస్సు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది.

షర్మిలాకు గాయం, వైఎస్ భారతి పరామర్మ

    వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా నిర్వహిస్తున్న పాద యాత్ర కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రాత్రి హైదరాబాద్ నగర శివారు ఎల్ బి నగర్ లో తన వాహనం దిగుతుండగా మోకాలికి గాయం కావడంతో ఆమె యాత్ర వాయిదా పడింది. షర్మిలా కు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఆమె కుడి కాలికి బలంగా గాయం కావడంతో, రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. గాయంతో భాదపడుతున్న షర్మిలను వైఎస్ భారతి పరామర్మించారు. షర్మిల మోకాలి నొప్పిపై వైజగన్ మోహన్ రెడ్డి తానుంటున్న చంచల్‌గూడ జైలు నుంచే వాకబు చేసినట్టు సమాచారం.

‘తెలంగాణా’ ఫై పార్టీకి మంత్రుల అల్టిమేటం !

        ప్రత్యెక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ సానుకూలంగా లేకపొతే తెలంగాణా మంత్రులంతా పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటారనీ, అవసరమైతే తమ దారి తాము చూసుకుంటామని తెలంగాణా ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ కు తేల్చి చెప్పారు.   రేపు కాంగెస్ సదస్సు జరగనున్న తరుణంలో జానా రెడ్డి నాయకత్వంలో ఎనిమిది మంది మంత్రులు ఈ రోజు బొత్సను కలిసారు. ఢిల్లీ లో తెలంగాణా ఫై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి పార్టీ నుండి ఒక్కరినే పంపించాలని, సదస్సు లో తెలంగాణాఫై తీర్మానం చేయాలని మంత్రుల బృందం బొత్స కు సూచించింది. ఈ సమావేశానికి ఒక్కరినే పంపించాలని తాము సోనియా గాంధీ కి లేఖ రాస్తామని జానా రెడ్డి వెల్లడించారు. అలాగే, ప్రత్యెక రాష్ట్రం విషయంలో పార్టీ వైఖరి వెల్లడించాలని గులాం నబీ అజాద్ ను కూడా కోరతామని జానా అన్నారు.   తెలంగాణా విషయంలో మంత్రులందరికీ బాధ్యత ఉందని, అందరికన్నా ఎక్కువ బాధ్యత సీనియర్ మంత్రిగా తనఫైన ఉందని జానా ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ కీలక దశకు చేరుకొందని కూడా మంత్రి అన్నారు.

‘తెలంగాణా’ తప్పదంటున్న నేతలు

    రేపు హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ సదస్సులో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించక తప్పదని తెలంగాణా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా అంశంపై అఖిల పక్ష సమావేశం జరగనుంది కాబట్టి సదస్సు లో ఈ అంశం ప్రస్తావించవలసిన అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన పార్టీ నేతలకు నచ్చ చెప్పడానికి అష్ట కష్టాలు పడుతున్నారు.   అయితే, పార్టీకి సంభందించిన ఇంత కీలక సమావేశంలో ఈ అంశం ప్రస్తావించకుండా ఎలా ఉంటామని ఎంపి మధు యాష్కి గౌడ్ అంటున్నారు. ఒక వేళ ఈ అంశాన్ని లేవనేత్తకపోతే, ఈ అంశాన్ని చిన్న చూపు చూసినట్లవుతుందని అయన అన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించ వద్దని అంటున్న బొత్స ఫై తెలంగాణా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజు సమావేశం సరిగా జరుగుతుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. సదస్సులో అనుకోని పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావించిన నేతలు మీడియా ను కూడా దూరంగా ఉంచాలని నిర్ణయించారు.   కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ ముఖ్య అతిదిగా జరిగే ఈ సమావేశంలో ఎన్ని వివాదాలు జరుగుతాయోనని కొంత మంది పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కష్టాల్లో ఉందని, అందువల్ల తెలంగాణా అంశాన్ని సదస్సులో లేవేనేత్తవద్దని పాలడుగు వంటి నేతలు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పధకాలు, పార్టీకి సంభందించిన 15 అంశాల ఫై ఈ సదస్సు లో చర్చించనున్నారు.

షర్మిలాకు గాయం, పాదయాత్ర కు బ్రేక్

    వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా నిర్వహిస్తున్న పాద యాత్ర కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రాత్రి హైదరాబాద్ నగర శివారు ఎల్ బి నగర్ లో తన వాహనం దిగుతుండగా ఆమె మోకాలికి గాయం అయింది.   ఆమెకు నొప్పి అధికంగా ఉండడంతో ఈ యాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చిందని షర్మిలా పాద యాత్ర సమన్వయకర్త మహేంద్ర రెడ్డి పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ రోజు ఆమెకు ప్రత్యేక డాక్టర్లు చికిత్స చేయనున్నారు. అయితే, ఈ యాత్ర ఒక్క రోజు మాత్రమే వాయిదా పడే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెపుతున్నారు.   షర్మిలా పాద యాత్రకు బ్రేక్ ఇవ్వడం ఇది రెండో సారి. ఈ నెల 9 వ తేదిన, చికిత్స నిమిత్తం ఆమె ఒక్క రోజు తన పాద యాత్రకు విరామం ఇచ్చారు. డాక్టర్ల సలహా అనంతరమే తిరిగి ఎప్పుడు పాద యాత్ర నిర్వహించేదీ చెప్పగలమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

వేడెక్కిన ఏపీ రాజకీయం...ఢిల్లీ లో గవర్నర్ బిజీ

      రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన మూడు రోజుల ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా విషయం ఫై అఖిల పక్షం జరగనుండడం,వచ్చే నెలలో రాష్ట్రంలో నేతల మార్పు జరగనున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో జరిగిన గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.   నిన్న సాయంత్రం ఢిల్లీ లో గవర్నర్ సోనియా గాంధీ తో అరగంట పాటు సమావేశమయ్యారు. ముఖ్య మంత్రి పనితీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ వంటి కీలక అంశాలను ఆయన సోనియా కు వివరించినట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది అంశాల ఫై గవర్నర్ కాంగ్రెస్ అధినేత్రికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. కొన్ని విషయాల్లో ముఖ్య మంత్రి వైఖరి గురించి ఆయన సోనియా కు వివరించినట్లు సమాచారం. జైలులో ఉంటూనే, జగన్ తన పార్టీని బలోపితం చేసుకుంటున్న తీరును ఆయన సోనియా కు వివరించినట్లు తెలుస్తోంది.   కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబి అజాద్, మంత్రి వయలార్ రవి ని కూడా ఆయన కలిసినట్లు తెలిసింది. ఈ రోజు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, మంత్రులు అంటోనీ, చిదంబరం, సుశీల్ కుమార్ షిండే లను కలిసే అవకాశం ఉంది.   శనివారం ఉదయం గవర్నర్ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.  

కాంగ్రెస్ హస్తవాసి తెలంగాణాకి మేలు చేస్తుందా?

  రాష్ట్రంలో ‘డ్డాo’ అని ‘అఖిలపక్షం బాంబు’ ను పేల్చిన కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో మంటలురాజేసి ఆ మంటలో చలికాచుకొంటోంది. రేపు ౨౮న జరుగ బోయే అఖిలపక్ష సమావేశంలో ఏవో అద్బుతాలు జరిగిపోతాయని ఏపార్టీకి పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ, తెలంగాణా సమస్యతో సతమతమవుతున్న రాష్ట్రానికి ఇప్పుడయినా బయటపడే అవకాశం దొరకకపోదా? అని అందరు అడియాసకిపోయి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే, సమావేశం తేది ప్రకటించిననాటి నుండి నేటి వరకు డిల్లీకాంగ్రెస్ పెద్దలు మొదలుకొని నిన్న బొత్ససత్తిబాబు వరకు “అఖిలం అంతా ఒక టైం పాస్ వ్యవహారం’ అని ప్రత్యక్ష పరోక్షంగా ఎంత నెత్తి మొత్తుకొని చెపుతున్నపటికీ అమాయకులయిన ప్రజలు ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.   కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా ప్రకటించేసి ఆ క్రెడిట్ అంతా ఇంతకాలం తెలంగాణా కోసం ఉద్యామాలు చేస్తున్న కెసిఆర్ చేతిలో ఎందుకు పెడుతుంది? అయితే గియితే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకొంటుంది గానీ ఇతరులకు ఎందుకు ఇస్తుంది? అని ఆలోచిస్తే అది ప్రస్తుత పరిస్తితుల్లో ఇవ్వదని తెలుస్తుంది. రాష్ట్రంలో తనకి ఎప్పుడయితే అనుకూల వాతావరణం సృష్టిoచుకోవాలని అది తలస్తుoదో అప్పుడే అది ఏ ప్రకటనయినా చేస్తుంది. అంటే, ఎన్నికలు సమీపిస్తున్నపుడో, లేక తనకి ఓటేస్తేనే ఇస్తామనో చెప్పుకొని తెలంగాణా సమస్యని బ్రహ్మాస్త్రంలాగ అది వాడుకొంటుంది. అంతవరకూ, ఈ అఖిలాలు అనేకం జరుపుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ.   అయితే, పై కారణాలవల్లనే కాంగ్రెస్ ఇప్పట్లో తెలంగాణా ఇవ్వదని రాజకీయాలలో కాకలుతీరిన తెలంగాణా కాంగ్రెస్ నేతలకి మరి తెలియకనే ఒత్తిడి తెస్తున్నారనుకోవాలా? లేక కాంగ్రెస్ అధిష్టానం వారు కలగలిసి ఆడుతున్న నాటకం ఇది అనుకోవాలా? ఇప్పుడు తెలంగాణా ఇవ్వడంవల్ల పార్టీకి జరిగే నష్టం గురించి వారికి అధిష్టానం వివరించి ఉండవచ్చును. అప్పుడు, వారుకూడా ప్రజలలో తమకు ఏర్పడుతున్న ఇబ్బందులు, తే.ర.స. నుండి ఎదురవుతున్న ఒత్తిళ్ళ గురించి తమ అధిష్టానానికి వివరించినట్లు వారే తెలుపుతున్నారు. మీరు పార్టీలో ఉంటూనే మీ ఉనికిని కాపాడుకొంటూ, రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు మీరుకూడా ఉద్యమాలు చేసుకోండని కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలుగుదేశం పార్టీ లాగానే తన పార్టీ తెలంగాణా నేతలకి చెప్పి ఉండవచ్చును. అందుకే వారు ఎంత తీవ్ర పదజాలం వాడుతున్న పార్టీ పట్టించుకోవట్లేదు. పార్టీ పట్టించుకోక పోయినా వారు పదవులు వీడట్లేదు అనుకోవాల్సి ఉంటుంది.   కాంగ్రెస్ పార్టీలో లోపాయికారిగా సాగుతున్న ఈ నాటకం తెల్సుండబట్టే కెసిఆర్ ఆపుదపుడు కాంగ్రెస్ మీద విరుచుకు పడుతున్నడా?

కావూరి సీటు ఫై ఓ ఎంఎల్ఏ కన్ను ?

      ఐదు సార్లు ఎంపి గా గెలిచిన తనకు కేంద్ర మంత్రి పదవి రాలేదని తీవ్ర అసహనంతో ఉన్న కావూరి సాంబశివ రావు కొంత కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.   వచ్చే ఎన్నికల్లో ఆయన ఏలూరు స్థానం నుండి పోటీ చేయకపోతే, ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వర రావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కావూరి పోటీ చేయకపోతే, ఇక్కడి నుండి ఎవరిని బరిలోకి దింపాలని ఇటీవల ఏలూరు వచ్చిన రాహుల్ గాంధీ దూతలు ప్రశ్నించగా, కొంత మంది నాయకులు నాగేశ్వర రావు పేరు చెప్పినట్లు తెలిసింది. ఆయన ఇక్కడి నుండి పోటీ చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.   2014 లో ఈ స్థానం నుండి కావూరి మనవడు జగన్ పార్టీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కావూరి కాంగ్రెస్ లోనే కొనసాగితే, ఆయన తన మనవాడి ఫైనే పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితో కావూరి అసలు వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. ఆయన అసలు పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.   అయితే, కొల్లేరు సమస్య ఫై కావూరి చేసిన హెచ్చరికకు ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందిచడంతో ఆయన శాంతించి ఉంటారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఖైదీలకు తీర్దయాత్రా బెయిల్ సౌకర్యం?

  సత్యం రామలింగరాజుగారు ఏ ముహుర్తాన్నచంచల్ గూడా జైల్లోకి అడుగు పెట్టారో గానీ అయన తన రాకతో జైలుకి మంచి బోణీ చేసారని చెప్పవచ్చును. అంట వరకు ఏ గుర్తింపుకూ నోచుకోని చంచల్ గూడా జైలు, నాటినుండి పెద్ద రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. ఇవాళ్ళ రేపు, సి.బి.ఐ. పుణ్యామాని అక్కడకి చేరుకొంటున్నరాజకీయనేతలకి కొదవలేదు. వారిని పరామర్శించేందుకు వచ్చే పెద్దలకు అంతూలేదు. ‘మా చంచలగూడ జైలుకి ఇంత రాజయోగం పట్టిందని’ జైలు సిబ్బంది సంతోషంతో ఉప్పొంగి పోతున్నారంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక, ప్రస్తుతం రాజకీయఅడ్డాగా మారిన చంచల్ గూడ జైలులో విశ్రమిస్తున్నఅనేకమంది హేమా హేమీలతో జైలుగోడల మద్య తమ అనుభావాలు పంచుకొనే భాగ్యం పొందిన మాజీ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తానూ గత 18 సం.లుగా అయ్యప్పదీక్ష చేస్తున్నందున మళ్ళీ ఈ యేడు కూడా అయ్యప్ప మాల వేసుకోవడం జరిగిందని అందువల్ల కోర్టు వారు తనకి ఈ నెల 24 నుండి వచ్చే నెల 2వ తేది వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేయవలసిందిగా అయన కోర్టుకు విజ్ఞప్తి చేసారు. యధావిదిగా ‘సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ’ సి.బి.ఐ. అభ్యంతరం తెల్పింది. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను ఈ నెల ౧౮కి వాయిదా వేసింది. ఇదంతా, నిత్యం చూస్తున్న తంతే గనుక ఇందులో ఎవరికీ ఆసక్తి ఉండకపోవచ్చు. గానీ, ఇలా మతపరమయిన కారణాలు చూపించి జైలులో ఉన్న ఖైదీలు బెయిలు అడిగినప్పుడు అందుకు కోర్టులు అంగీకరిస్తే అదోక కొత్త సాంప్రదాయం సృష్టించినట్లు అవుతుంది కదా? రేపు మిగిలిన ఖైదీలు కూడా వివిధ మాలలు వేసుకొని కోర్టువారిని బెయిలు కోరితే అప్పుడు పరిస్తితి ఏమిటి? అప్పుడు రాజకీయ ఖైదీలుగా ఉన్నపెద్దలకి ఒక న్యాయం సాధారణ ఖైదీలకు మరొక న్యాయం కోర్టులు అమలు చేయలేవు కదా? ఇప్పడు హిందూ మతస్తులయిన ఖైదీలు మాలలు వేసుకొని బెయిలు పొందే అవకాశం పొందగలిగితే, రేపు ఇతర మతస్తులయిన ఖైదీలు కూడా మత పరమయిన సంప్రదాయాలు పాటించేందుకు ఏ మక్కాకో లేక జేరుసలెంకో వెళ్ళడానికి బెయిలు కోరితే అప్పడు పరిస్తితి ఏమిటి? అసలు ఖైదీలుగా ఉన్నవారిని మతపరమయిన కారణాలతో బెయిలు మంజూరు చేయవచ్చా లేదా? అందుకు రాజ్యంగా ఏమి చెపుతుంది? ఈ ప్రశ్నలకి సి.బి.ఐ. కోర్టు ఈ నెల 18న తన నిర్ణయం తో తెలియజేయవచ్చునని ఆశిద్దాము.

ఎప్పటి కోపమో ఇప్పుడు ?

              పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయం లో ఉన్న వివాదాన్ని ఆసరాగా తీసుకొని తెలుగు దేశం ఎంపి హరి కృష్ణ చంద్ర బాబు నాయుడు ఫై ఎప్పటి నుండో, ఏదో విషయంలో ఉన్న కోపాన్ని ప్రస్తుతం ప్రదర్శించారని భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంభందాలు ఎప్పటి నుండో సరిగా లేని విషయం తెలిసిందే.   ఎఫ్ డి ఐ లఫై పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఓటింగ్ కు దూరంగా ఉన్న ముగ్గురు పార్టీ ఎంపి లు దేవేందర్ గౌడ్, సుజన చౌదరి, గుండు సుధా రాణి లను క్షమించి వదిలేయడాన్ని కూడా హరి కృష్ణ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ విప్ ను ధిక్కరించిన వారిఫై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేయటం ఏమిటని హరి కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం సరిగా లేదనే వివరణ సరి కాదని, తనకు కూడా ఆ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ ఓటింగ్ కు హాజరయ్యననీ, ఓటింగ్ కు హాజరయ్యేందుకు కొంత మంది సభ్యులు ప్రత్యేక విమానాల్లో వచ్చారని ఆయన గుర్తు చేస్తున్నారు.     ఎన్ టి ఆర్ విగ్రహ ప్రతిష్ట అనేది ఆయన కుమారులు, కూతుళ్ళకు సంభందించిన విషయమని,ఈ విషయంలో అల్లుళ్ళు, పార్టీ ప్రస్తావన ఉండకూడదని హరి కృష్ణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంటే, చంద్ర బాబు కు ఈ విషయం తో సంభందం లేదని సూటిగా చెప్పడమే కదా ?