political-news-img

రేవంత్, బండి మధ్య రహస్య ఒప్పందం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నేపధ్యంలో బీఆర్ఎస్ విమర్శల దాడి ఉధృతం చేసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సీక్రెట్ బంధం ఉందంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి. మైనర్ బాలికపై జరిగిన అకృత్యానికి సంబంధించిన కేసులో నిందితులకు కొమ్ముకాసేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ మధ్య ఉన్నరహస్య పొత్తు కారణంగానే ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారయ్యాయ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నారుల భద్రతను కూడా ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో బాధితులకు అండగా ఉండాల్సిన పాలకులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Publish Date: May 13, 2026 10:05PM

political-news-img

ట్రంప్ చైనా పర్యటన.. విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్

అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా పగ్గాలను డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేపట్టిన తరువాత దౌత్యపరమైన సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ కు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అలాగే పలు టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది. గతంలో అంటే 2017లో ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు తక్కువ స్థాయి నేతలు విమానాశ్రయానికి వచ్చారు. ఇప్పుడీ మార్పు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పోతే దాదాపు దశాబ్ద కాలం తరువాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో అమెరికా తరువాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో వాణిజ్య బంధాన్ని పటిష్ఠం చేసుకుని కొన్ని ఒప్పందాల దిశగా ట్రంప్ ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: May 13, 2026 9:52PM

political-news-img

20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం : మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన “SME IPO – Alternative Funding Option For Growth” అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... యువగళం పాదయాత్రే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణ యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన ఒక సంఘటన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణగా నిలిచిందని మంత్రి లోకేష్ తెలిపారు. “226 రోజులు, 3132 కిలోమీటర్లు నడిచిన యువగళం పాదయాత్రలో ఎన్నో కుటుంబాల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను దగ్గరగా చూశాను. ఒకరోజు పెనుగొండలో కియా వద్ద సెల్ఫీలు దిగేందుకు దారుణమైన ఎండల్లో 23 కి.మీ నన్ను జాతీయ రహదారిపై నడిపించారు. అక్కడే కియా అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న పద్మావతి అనే చెల్లి నాతో కలిసి నడిచింది. కియా, అనుబంధ పరిశ్రమలు రాకముందు ఆమె గృహిణి. బాగా చదువుకుంది కానీ ఉద్యోగం చేయలేదు. కియా అనుబంధ సంస్థలు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించి ఉద్యోగంలో చేరింది. నెలకు రూ.30 వేలు సంపాదిస్తోంది. అప్పటివరకు భర్త మీద ఆధారపడిన ఆమె, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని కూడా చూసుకుంటోంది. ఆమె కథ విన్న తరువాత నాకు ఉద్యోగ కల్పన ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆ ఆలోచనల నుంచే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది. మేము ఇచ్చిన మ్యానిఫెస్టో ‘సూపర్ 6’ హామీల్లో కూడా మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే. ఈ లక్ష్య సాధన కోసం అందరం పని చేస్తున్నాం.” అని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ “గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌లా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. గూగుల్ రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చాయి. వాటికి శంకుస్థాపనలు జరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాయలసీమలోని పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ‘AMCA’ ప్రాజెక్టు కూడా ఏపీలో ఏర్పాటు కానుంది” అని వెల్లడించారు. గూగుల్ వల్లే క్యారియర్ ఏపీకి వచ్చింది – ఇదే మల్టిప్లయర్ ఎఫెక్ట్ “ప్రతి పెట్టుబడి వెనుక ఒక ప్రత్యేక కథ ఉంటుంది. డేటా సెంటర్లు వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని చాలా మంది నన్ను ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ శంకుస్థాపన జరగగా, మరికొద్ది రోజుల్లో ఇంకో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానుంది. దానికి కూడా మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలపనుంది. డేటా సెంటర్ ఎంత ముఖ్యమో, డేటా సెంటర్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్ కూడా అంతే ముఖ్యం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతోనే రాయలసీమకు క్యారియర్ కంపెనీ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్స్ అవసరం అవుతాయి. ఆ అవసరాన్ని తీర్చేందుకు క్యారియర్ కంపెనీ శ్రీసిటీలో పెట్టుబడులు పెడుతోంది. దీనినే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఒక పెద్ద పెట్టుబడి వస్తే, దాని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ” అని వివరించారు. క్లస్టర్ మోడల్‌తో అభివృద్ధి వికేంద్రీకరణ “మొదటిసారిగా మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలిసికట్టుగా పని చేస్తున్నాం. ‘ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ’ ప్రభుత్వ లక్ష్యం. మన ఎకానమీ 200 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. దాని కోసం క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాం. రాయలసీమలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ కోస్తాంధ్రలో CBG ప్లాంట్లు, ఆక్వా, అమరావతిలో క్వాంటం టెక్నాలజీ ఉత్తరాంధ్రలో ఫార్మా, డేటా సెంటర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఐటీ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలు కీలకం “మాకు గూగుల్ ఎంత ముఖ్యమో, రూ.50 లక్షలతో ప్రారంభమయ్యే ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యం. ఆర్సెలార్ మిట్టల్ ఎంత ముఖ్యమో, కోటి రూపాయలతో ప్రారంభమయ్యే చిన్న సంస్థ కూడా అంతే ముఖ్యం. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాధించాలంటే ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు అడుగులు వేస్తున్నాం. ప్రతి ఎంఎస్ఎంఈకి అనుమతుల నుంచి రాయితీల వరకు అన్ని ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లు ఎక్కడికీ వెళ్లకుండా అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు 20 లక్షలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ ప్రోత్సహించే బాధ్యత ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిదే. ఇది సాధ్యం కావాలంటే ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కావాలి. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వాటి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు. మూడు నెలల్లో 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలి “NSE ద్వారా చిన్న కంపెనీలు పెద్ద సంస్థలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు NSEలో 723 కంపెనీలు లిస్టై రూ.22,415 కోట్ల నిధులు సమీకరించాయి. అందులో 158 సంస్థలు మెయిన్ బోర్డుకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సంస్థలు మాత్రమే NSEలో లిస్ట్ అయి రూ.100 కోట్ల నిధులు సమీకరించాయి. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ శాఖ పనిచేయాలి” అని సూచించారు. దేశం చూపు..మ‌న వైపు ఔత్సాహికవేత్తల్లో పోటీతత్వం.. పట్టుదల ఉండాలి. మ‌న దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికి రావడం గర్వకారణం. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా ఒక మెసేజ్ దూరంలో నేను ఉంటా. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయి పెద్ద సంస్థలుగా ఎదగాలి. మరిన్ని ఉద్యోగాలు, మరింత‌మంది పారిశ్రామికవేత్తలు, మరిన్ని విజయగాథలు సృష్టిద్దాం” అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు NSE సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఎం. విశ్వ, SEBI, NSE, ఇండోరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Publish Date: May 13, 2026 9:39PM

political-news-img

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్‌లకు రింగ్ రోడ్డు : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సూచించారు. రాబోయే ఎయిర్‌పోర్టులను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికత వినియోగించాలని, ఖర్చులు తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ ప్రభావం తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ సాంకేతికత వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ద్వారా శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వినియోగించేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సూచించారు. అలాగే నల్గొండ–యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్–నాగోబా–బాసర–కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ ప్రత్యేక కారిడార్, కొత్తగూడం–పాల్వంచ–సుజాతనగర్ ప్రాంతాలను అనుసంధానిస్తూ మరో కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్లు భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Publish Date: May 13, 2026 9:32PM

political-news-img

నా కాన్వాయ్‌ వాహనాలు తగ్గించండి...సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఇంధన పొదుపు దిశగా ముఖ్యమంత్రి అడుగులు.. ప్రధాని మోదీ పిలుపుతో కీలక నిర్ణయం.. ఏపీలో సరికొత్త 'పొదుపు' మంత్రం.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. జిల్లా పర్యటనల్లో వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని డీజీపీని ఆదేశించారు. మంత్రులు, వీఐపీలు కూడా వీలైనంత తక్కువ వెహికల్స్ వాడేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తన సొంత కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండానే, అనవసరమైన వాహనాల రాకపోకలను నియంత్రించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంలో పొదుపు సంస్కృతిని తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన వినియోగం తగ్గించడం వల్ల కేవలం ఆర్థిక భారమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆ నిధులను ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో మరియు సామాన్య ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో భారీ కాన్వాయ్‌లతో సామాన్యులకు కలిగే ఇబ్బందులు కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలకులే స్వయంగా పొదుపు పాటిస్తే, అది ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు. రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఇంధన పొదుపుతో పాటు పరిపాలనా వ్యయాల తగ్గింపుపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పొదుపు, డిజిటల్ పరిపాలన పెంపు వంటి అంశాలపై కూడా సీఎం దృష్టి సారించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలతో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

Publish Date: May 13, 2026 9:16PM

political-news-img

సామర్ధ్యం పెంపుతోనే పటిష్ట ఆర్ధిక వ్యవస్థ : సీఎం చంద్రబాబు

రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జీఎస్డీపీ అంచనాలను సంప్రదాయ విధానంలో కాకుండా రియల్‌టైమ్ మానిటరింగ్ ద్వారా రూపొందించేలా శిక్షణ అందించాలన్నారు. సచివాలయంలో బుధవారం ప్రణాళిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... త్వరలోనే పూర్తి స్థాయిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుడతామన్నారు. సమీక్షలో జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్, ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రధాన సర్వేలు, జిల్లా-మండల స్థాయి అధికారులకు శిక్షణ, కేపీఐల ఆడిటింగ్ అనుసంధానం వంటి అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ అంచనాలు మూడు నెలలకు, ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. చారిత్రక డేటాపై ఎక్కువ ఆధారపడటం వల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రతీ నెలా... ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో ట్రాక్ చేయగలిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం జీఎస్డీపీ విధానాన్ని అర్థం చేసుకునేలా, అంచనాలు వేగంగా రూపొందించేలా అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. మొత్తం 5 జోన్లు, 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మూడు నెలల పాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లు, జోనల్-జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల తయారీపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. మరోవైపు వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రస్తుతం ట్రాక్ చేయని సూచికలను గుర్తించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

Publish Date: May 13, 2026 8:55PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img