ఢిల్లీ గ్యాంగ్ రేప్ భాదితురాలికి న్యాయం చేయాలి: ఎంపీ రాథోడ్ రమేష్

      ఢిల్లీ లో మెడికల్ విద్యార్ధిని పై గ్యాంగ్ రేప్ జరగటం చాల దారుణమని టిడిపి ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. నిందితులపై కటినచర్యలు తీసుకొని వెంటనే భాదితురాలికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. విద్యార్డులపై పోలీసుల లాటీ చార్జీలు, బాష్ప వాయు ప్రయోగాలు చేయడం చాలా ఘోరమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు కడతేరుతాయన్నారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు.  తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారన్నారు. కుంభకోణాలు మినహాయిస్తే ప్రభుత్వం సాధించింది శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణకు మొదటి నుంచి తమ పార్టీ అనుకూలమని చెబుతున్నప్పటికీ ప్రజాదరణ లేని కొన్ని పార్టీలు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.  

జనవరిలోనే టిడిపి అభ్యర్దుల తొలి జాబితా ?

      ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్దుల తొలి జాబితాను జనవరిలోనే ప్రకటించాలని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటి నుండే ఈ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. అభ్యర్దుల ఎంపిక కార్యక్రమాన్ని బాబు ఇప్పటికే ప్రారంభించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.   అభ్యర్దుల ఎంపికలో బాబు ఎలాంటి వత్తిళ్ళకూ అవకాశం ఇవ్వడంలేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనే వారు తమ పని తీరు మెరుగుపరచుకోకుంటే తాను ఎట్టి పరిస్తితుల్లోనూ వారికి అవకాశం ఇవ్వనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ‘టికెట్ ను ఆశిస్తున్నవారు కష్టపడక తప్పదు. నేను జీవితంలో అనుభావించాల్సినదంతా అనుభవించాను. అయినా, రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టడం కోసం, కార్యకర్తలను ఆదుకోవడం కోసం కష్టపడుతున్నాను. నాయకులంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి’, అని చంద్ర బాబు వ్యాఖ్యానిస్తున్నారు.   అభ్యర్ధి లక్షణాలే కాదు, ప్రజా సమస్యలఫై ఆయా నాయకులు పోరాడే విధానం కూడా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయని బాబు అంటున్నారు.   పలువురు నాయకులు హైదరాబాద్ లోనే తిరుగుతున్నారని, వారంలో ఐదు రోజులు తమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయాల్సిందేనని బాబు వారికి స్పష్టం చేస్తున్నారు. తమ సీటు ఎటూ పోదనే ధీమాతో నియోజక వర్గాల ఇంచార్జ్ లు ఉండరాదని కూడా బాబు సలహా ఇస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసు: మోపిదేవి బెయిల్ ఫై విడుదల

      జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు కు సిబిఐ ప్రత్యెక న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఆయన ఈ ఉదయం జైలు నుండి విడుదల అయ్యారు.   శబరిమల వెళ్లేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి కోర్టు ను అభ్యర్ధించిన విషయం తెలిసిందే. ఆయనకు జనవరి 2 వ తేదీ వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విడుదల అయిన తర్వాత మోపిదేవి పంజగుట్ట లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు.   మోపిదేవి దాదాపు నెల రోజుల నుండి అయ్యప్ప దీక్షలో ఉన్నారు. దీనితో ఆయన శబరిమల యాత్ర కు వెళ్ళే అవకాశం లభించింది.

ఇక నామినేటేడ్ పదవుల భర్తీ ?

        రాష్ట్రం లో కార్పోరేషన్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సమయంలో పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయాలంటే, ఈ పదవులను వెంటనే భర్తీ చేయాల్సి ఉంటుందని పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   ప్రతి జిల్లాకు ఓ కార్పోరేషన్ పదవి, ప్రతి నియోజక వర్గానికి ఓ డైరెక్టర్ పదవి ఇవ్వాలనేది పార్టీ వ్యూహంగా సమాచారం. ఈ పదవులకు కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యానారాయణ, చిరంజీవి ఇప్పటికే తమ తమ వర్గాల జాబితాలను పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వరకూ కార్పోరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రతి కార్పోరేషన్ కు ఓ చైర్మన్, సుమారు పదివరకూ డైరెక్టర్ పదవులూ ఉంటాయి.   వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళుతున్న వలసలను ఆపేందుకు కొంత మంది ఎంఎల్ఏ లకు కీలకమైన కార్పోరేషన్ పదవులను ఇవ్వాలని కూడా కిరణ్ కుమార్ వద్దకు ఓ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిగేలవలేని ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను పొందడానికి ఆయా వర్గాల నేతలకు కూడా ఈ నామినేటేడ్ పదవులను ఇవ్వాలనేది పార్టీ వ్యూహమని తెలుస్తోంది. గాదె వెంకట రెడ్డి కి ఎపిఎస్ ఆర్టిసి చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

అఖిల పక్షానికి టిడిపి తరపున దేవేందర్, యనమల ?

      ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి తెలుగు దేశం పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడు దేవేందర్ గౌడ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లను పంపించాలని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.   కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పాద యాత్రలో బాబు గౌడ్ ను పిలిపించుకొని మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ తరపున హాజరయ్యేందుకు సిద్దంగా ఉండాలని బాబు గౌడ్ కు సూచించినట్లు సమాచారం.   కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేందుకు ఈ సమావేశంలో తెలంగాణా కు అనుకూల వైఖరి అవలంభించాలని బాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీ విజయావకాశాలఫై బాబు కు పెద్దగా నమ్మకాలు లేవని, తెలంగాణాకు అనుకూల వైఖరి అవలంబిస్తే, కనీసం ఆ ప్రాంతంలోనైనా పార్టీ విజయం సాధిస్తుందనేది బాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది.

పోలీసు లాఠీఛార్జ్: సొమ్మసిల్లిన టిడిపి మాజీ మంత్రి

      సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ తెదేపా నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ఆదివారం నర్సరావుపేటలో ధర్నా చేపట్టారు. సహకారశాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు తెదేపా నేతలు, కార్యకర్తలు యత్నించారు. వీరిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. కోడెలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టణంలో పోలీసులు 144సెక్షన్ విధించినా తెదేపా శ్రేణులు ధర్నా చేస్తున్నారు. దీంతో స్టేషన్ ముందు బైఠాయించిన కార్యకర్తలపై పోలీసులు మరోసారి లాఠీఛార్జి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కోడెల శివప్రసాదరావుపై కూడా పోలీసులు చేయిచేసుకున్నారు. దీంతో కోడెల పోలీస్‌స్టేషన్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు సపర్యలు చేశారు. అనంతరం పోలీసుల దాడిని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోడెల సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల చర్యకు నిరసనగా దుకాణాలు మూసివేశారు.

‘ఆంధ్రోడు’ అనొద్దన్న ఆర్.నారాయణమూర్తి

      ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి ‘ఆంధ్రోడు’ అని సంభోదించవద్దని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రజా కళాకారిణి విమల ఫై అక్రమ కేసులను నిరసిస్తూ ధూమ్ ధూమ్ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందని, వారిని ఉద్దేశించి ‘ఆంధ్రోడు’ అనే పదాలు వాడవద్దని తెలంగాణా ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. విమలఫై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, తెలంగాణా భాషను పట్టించుకోని ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు.   తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అసలు సిద్దంగా లేదని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి ఆ పార్టీనేనని ఈ సమావేశంలో పాల్గొన్న గద్దర్ అన్నారు. తెలంగాణా ఉద్యమం అనేది సాంస్కృతిక ఉద్యమమని, ఇది రాజకీయ ఉద్యమం మాత్రమే కాదని ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణా భావానికి అధిక ప్రచారం రావడంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.   ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు వివేక్ మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాలు కలిసి పోరాడాల్సి ఉందని అన్నారు. టిఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రజలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారని ఆర్టిసి గుర్తింపు సంఘ ఎన్నికల ఫలితాలు రుజువు చేసాయని అన్నారు.   తెలంగాణా జెఏసి చైర్మన్ కోదండ రామ్, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

జగన్ కేసు వేగం పెంచిన సిబిఐ

        జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంభందించి సిబిఐ తన కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంభందించి సిబిఐ ఇప్పటికే పూర్తి అవగాహనకు వచ్చింది. ఇందులో నిందితులుగా ఉన్న మంత్రులను, అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి రాకపోతే ఉన్న ఇతర బ్రహ్మాస్త్రాలను ప్రయోగించేందుకు కూడా దర్యాప్తు సంస్థ సిద్దం అయినట్లు తెలుస్తోంది.   ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇప్పటికే పొందింది. మంత్రులు ధర్మాన, మోపిదేవిలను ప్రాసిక్యూషన్ చేసేందుకు రంగం సిద్దం చేసింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అసలు ఈ విషయంలో ప్రభుత్వ అనుమతి అవసరం లేదనే కొత్త అంశాన్ని సిబిఐ తెరఫైకి తెచ్చింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను సిబిఐ అధికారులు కోర్టు ముందు ఉంచారు. ఇక ఐఏఎస్ అధికారులకు సంభందించిన ఫైలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చక్కర్లు కొడుతోంది.   ప్రభుత్వం ధర్మాన విషయంలో వ్యవహరించిన తీరుకు కాస్త ఊపిరి పీల్చుకున్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు సిబిఐ కొత్త ఎత్తుగడకు ఖంగు తిన్నారు. కాగా, సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వచ్చే మార్చి నెలాఖరుకు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఈ అనుమతుల్లో జాప్యం పెద్ద ప్రతిభందకంగా నిలుస్తోంది.

సంక్రాంతి తర్వాత కేబినేట్ విస్తరణ ?

        రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత కేబినేట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతకు ముందే నామినేటేడ్ పదవుల భర్తీ జరపడానికి కూడా పార్టీ అధిష్టానం ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   తనకు అనుకూలంగా లేని మంత్రులకు ఉద్వాసన చెప్పడానికి కిరణ్ ఢిల్లీ పెద్దల వద్ద అనుమతి పొందినట్లుగా సమాచారం. ముఖ్యంగా తన వారికి ఈ పదవులను కట్టబెట్టాలని ముఖ్య మంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ పదవుల ఫై కన్నేసిన నేతలు ప్రస్తుతం వాటిని పొందడానికి తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ వర్గానికి మరో రెండు మంత్రి పదవులు కావాలని చిరంజీవి పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   వైఎస్ వివేకానంద రెడ్డి, కోమటి రెడ్డి, జూపల్లి ల రాజీనామాలతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మూడు ఖాళీలు ఉన్నాయి. మరో నలుగురు మంత్రులకు ఉద్వాసన చెపితే (పార్టీ నేతల అంచనా ప్రకారం), మొత్తం ఏడు పదవులు ఖాళీ అయినట్లు లెక్క. డి. శ్రీనివాస్ తనకు తిరిగి మంత్రి పదవి కావాలని కోరినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఎవరిని వారించినా, ఈ సారి శాఖల మార్పు మాత్రం భారీగానే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అఖిల పక్షానికి ఉండవల్లి, సురేష్ షెట్కార్ ?

        ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రా నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణా నుండి సురేష్ షెట్కార్ లను పంపించవచ్చని తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ తరపున ఎవరిని పంపించాలనే విషయాన్ని చర్చించడానికి ముఖ్య మంత్రి, పిసిసి అధ్యక్షుడు నిన్న సమావేశం అయ్యారు.   గతంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి కావూరి సాంబశివ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం కావూరి పార్టీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను పంపిస్తారా అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో ఉంది.     ఉండవల్లి ఈ విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించడం తప్ప, సమైక్యాంధ్ర ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదు. షెట్కార్ కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెలంగాణా ఎంపి లకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో పెద్దగా క్రియాశీలకంగా లేని వీరిద్దరినీ పార్టీ అధిష్టానం ఎంపిక చేయవచ్చని సమాచారం.   అయితే, రాష్ట్ర మంత్రి జానా రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది.

తెలుగు మహాసభలకు జగన్ పార్టీ వ్యతిరేకమా ?

      ప్రపంచ తెలుగు మహాసభలకు జగన్ పార్టీ వ్యతిరేకమా ? ఇప్పుడు ఈ ప్రశ్న తిరుపతిలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ తెలుగు భాషోద్యమ సమితి శనివారం భారీ ర్యాలీ నిర్వహించింది. తెలుగు మహాసభలను కాంగ్రెస్ నేతలు జాతరలా నిర్వహిస్తున్నారని సమితి సభ్యులు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ నిరసనలకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల తీరును భూమన కరుణాకర్ రెడ్డి మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ పార్టీ తెలుగు మహా సభలను వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్న మొదలైంది.

ధర్మాన ఫైల్ వెనక్కి పంపిన గవర్నర్...కిరణ్ పై డీఎల్ ఫైర్

    ధర్మాన ప్రాసిక్యూషన్ వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్‌లో చిచ్చురేగింది. ధర్మాన ఫైలును గవర్నర్ తిప్పిపంపడంతో తదుపరి చర్యలపై పలువురు మంత్రులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరుపుతున్న సమయంలో మరో మంత్రి డీఎల్ సీఎంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. సీబీఐ, కోర్టుల తప్పు చూపినప్పటికీ ధర్మానను వెనుకేసుకు రావడం సరికాదని మండిపడ్డారు. ధర్మాన విషయంలో గవర్నర్ సూచన ప్రభుత్వానికి ఇబ్బందకరమే అన్నారు. కేబినేట్ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదన్నారు. సబంధిత శాఖ-మంత్రికి సంబంధం లేకపోతే ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న సుప్రీం నిర్ణయాన్ని డీఎల్ గుర్తుచేశారు. మరోసారి ధర్మాన ఫైలు కాబినేట్ ముందుకు వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సహచర మంత్రిగా ధర్మానపై ప్రాసిక్యూషన్ కోరానన్న బాధ తనకు ఉందని మంత్రి డీఎల్ ర వీందర్‌రెడ్డి అన్నారు.

24 న జగన్ బెయిల్ ఫై తీర్పు?

    అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ఫై కోర్టు ఈ నెల 24 న తీర్పు ఇవ్వనుంది. ఆయన స్టాట్యూటరీ బెయిల్ పిటీషన్ ఫై వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ ఇంత క్రితం సిబిఐ కోర్టును ఆశ్రయించాడు. అక్కడ తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో, హై కోర్టు ను ఆశ్రయించాడు.   సిబిఐ అధికారులకు విచారణలో సహకరిస్తున్నప్పటికి, జగన్ ను అసలు ఎందుకు అరెస్టు చేసారని జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సిబిఐ విచారిస్తున్న ఏడు అంశాలలో ఇప్పటికే జగన్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్నందున ఇక సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్ న్యాయవాదులు వాదించారు.   అయితే, సిబిఐ వాదన మరోలా ఉంది. జగన్ తాము విచారిస్తున్న కేసుల్లో కీలక నిందితుడని, ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే సామర్ధ్యం గల వ్యక్తి అని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరింది. తమ క్లెయింట్ కు కనీసం షరతులతో కూడిన బెయిల్ అయినా మంజూరు చేయాలని జగన్ న్యాయవాదులు కోర్టును కోరారు.

ఇంకా దొరకని టిడిపి ఎంఎల్ఏ ?

      ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న తెలుగు దేశం పార్టీ గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస రావు కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారనే పక్కా సమాచారంతో రెండు పోలీస్ బృందాలు నగరంలో గాలిస్తున్నాయి.   ఆయన నగరానికి చేరుకున్న విధానం, ఇందుకు ఆయన సహకరించిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. గత నెల 27 న పిడుగురాళ్ళ వద్ద జరిగిన కాంగ్రెస్ కార్యకర్త నరేంద్ర హత్య కేసులో ఎంఎల్ఏ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ హత్య లో ఎంఎల్ఏ ప్రమేయం ఉందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.   ఆయన ఆచూకి తెలియకపోవడంతో, ఆయన ఇద్దరు గన్ మెన్లు జిల్లా ఎస్ పి వద్దకి వెళ్లి జరిగిన విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియచేయడంతో ఆయన పరారీ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు యరపతినేని హైదరాబాద్ లో ఓ పోలీస్ ఉన్నతాధికారి నివాసంలో ఉన్నారని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

’ఎన్టీఆర్ ఇంటిని కూలిస్తే ఆమరణ దీక్షకు రెడీ’ ‘

      సినీ ప్రపంచంలో, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్ టి రామారావు తుది శ్వాస విడిచిన ఇంటిని ఇతరులకు అమ్మి, కూలగొట్టే ప్రయత్నాలు చేస్తే, తాను ఆమరణ దీక్ష చేస్తానని ఆయన భార్య నందమూరి లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 13 లోని ఇంట్లో ఎన్టీఆర్ మరణించిన విషయం తెలిసిందే.   ‘ఎన్టీఆర్ తన కోసమే ఈ ఇంటిని కొనాలని అనుకొన్నారు. అయితే, ఆదాయపు పన్ను శాఖతో సమస్య వస్తుందనే కారణంతో అమెరికాలో ఉంటున్న తన చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి పేరుతో దీనిని కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ తన కుమార్తెకు చెప్పే ఇలా చేశారు. ఆయన మరణానంతరం ఆమెకు కొందరు మాయమాటలు చెప్పి నా ఫైకి ఉసిగొల్పారు’, అని లక్ష్మి పార్వతి అన్నారు.   ఎన్టీఆర్ జ్ఞాపకాలను శాశ్వతంగా కాపాడే విషయంలో తాను చివరి వరకూ ఎవరితోనైనా పోరాడటానికి సిద్దంగా ఉన్నానని లక్ష్మి పార్వతి తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడు రామ కృష్ణ చేస్తున్న ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మి పార్వతి అన్నారు.

ముందస్తు బెయిల్ కోసం ఎంఎల్ఎ ప్రయత్నం

    ఓ కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల ఎంఎల్ఎ యరపతినేని శ్రీనివాస రావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.   గత నెల 28 న పిడుగురాళ్ళ లో జరిగిన ఉన్నం నరేంద్ర హత్య కేసుకు సంభందించి పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరు నిందితులు లొంగిపోయారు. మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కొందరు డబ్బుల కోసం ఈ హత్య చేసినట్లు సమాచారం.   అయితే, యరపతినేని వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఎ కృష్ణా రెడ్డి పోలీసులఫై వత్తిడి తెచ్చి తనను ఈ కేసులో ఇరికించారని అంటున్నారు. తన బెయిల్ పిటీషన్ లో ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో తాను ఇంతవరకూ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని యరపతినేని అంటున్నారు. ఈ బెయిల్ పిటీషన్ విచారణ నరసరావుపేట కోర్టులో జరుగనుంది.

రాష్ట్ర రాజకీయాలఫై పట్టుకు చిరు ప్రయత్నం ?

  కాంగ్రెస్ నేత, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి రాష్ట్ర రాజకీయాలఫై పూర్తి పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ సదస్సులో చిరు ఆకట్టుకొనే ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.   త్వరలో రాష్ట్రంలో కార్పోరేషన్ పదవులకు నియామకాలు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు కీలక కార్పోరేషన్ల తో పాటు, మొత్తం పది కార్పోరేషన్ పదవులను తన వర్గానికి చెందిన నాయకులకు ఇప్పించుకొని, తద్వారా రాష్ట్ర పార్టీలో బలమైన గ్రూప్ గా ఎదగాలని చిరు భావిస్తునట్లు సమాచారం. పార్టీలో తన వర్గానికి చెందిన కోటగిరి, డి.టి. నాయక్, బసవరాజు శ్రీనివాస్ వంటి వారిని చిరు ఈ పదవులకు నామినేట్ చేస్తారని తెలుస్తోంది.   ఆయన కేంద్ర మంత్రి అయినప్పటికీ, వారంలో రెండు రోజులు రాష్ట్రంలోనే విధంగా తగిన ప్రణాళిక రూపొందించారని సమాచారం. వచ్చే ఎన్నికలనాటికి ముఖ్య మంత్రి పదవికి తగిన పరిపాలనా అనుభవాన్ని సంపాదించేందుకు కేంద్ర మంత్రి పదవిని చిరు ఉపయోగించుకుంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

75 రోజులు పూర్తయిన ‘వస్తున్నా...మీ కోసం’

      ప్రజల కష్ట సుఖాలు తెల్సుకోవాలని, వారి కష్టాల్లో భాగస్వామి కావాలనే ఉద్దేశ్యంతో తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు ఎంతో చిత్తశుద్దితో మొదలు పెట్టిన ‘వస్తున్నా...మీ కోసం’ పాద యాత్రకు నిన్నటితో 75 రోజులు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లా ఓ ఆంజనేయ స్వామి గుడి నుండి గత అక్టోబర్ 2 వ తేదీన బాబు తన పాద యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.   ఈ 75 రోజుల్లో ఆయన ఆరోగ్యం నానా రకాలుగా దెబ్బతింది. ఒంట్లో షుగర్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. ఆయన కాళ్ళకు సగటు వ్యక్తి దాదాపు నడవలేని స్థితిలో ఉండే విధంగా బొబ్బలు కట్టాయి. అయినా, ఆయన ఇవేమీ ఆయన లెక్క చేయలేదు. ఈ యాత్రలో బాబు ఇప్పటివరకూ అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు పూర్తి చేశారు. ప్రస్తుతం బాబు కరీంనగర్ జిల్లాలో తన యాత్రను సాగిస్తున్నారు. ఈ యాత్ర 74 రోజులు పూర్తయ్యేటప్పటికి బాబు 1251 కిలోమీటర్ల మేర తన యాత్రను పూర్తి చేశారు.   ఆయన యాత్ర ప్రారంభమయి ఇప్పటికి 79 రోజులయింది. అయితే, మధ్యలో కాలికి గాయం అయిన కారణంగా ఓ సారి, ఎర్రన్నాయుడు మృతి కారణంగా మరో సారి మొత్తం నాలుగు రోజులు ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బాబు ఎంతో సాహసోపేతంగా తన యాత్రను కొనసాగిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అజ్ఞాతంలో యరపతినేని?

గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అరెస్టు నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. గత సోమవారం రాత్రినుండి ఆయన అందుబాటులో లేరు. ఆయన గన్ మెన్ లు సోమవారం అర్థరాత్రి వరకూ వేచి చూసి ఆయన ఆచూకీ తెలియకపోవడంతో గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్.పి. కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం. గతనెల 27వ తేదీన పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామానికి చెందినా కాంగ్రెస్ కార్యకర్త ఉన్నం నరేంద్ర (35) హత్యలో యరపతినేని మూడో నిందితునిగా ఉన్నారు. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ హత్యకేసులో ఇప్పటికే పోలీసులు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. యరపతినేనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాల్సిందేనని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గత కొంతకాలంగా పోలీసులపై వత్తిడి తెస్తూ వచ్చారు. అరెస్టు తదనంతరం పరిణామాలపై పోలీసులు సమీక్షిస్తున్నారు. గత మూడురోజుల నుండి యరపతినేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉండటంతో ఆయనను అరెస్టు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు.