‘కమీషన్ల’ వరకే నామినేటేడ్ పరిమితం ?
ఎంతో కాలం నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్న నామినేటేడ్ పదవుల భర్తీ ఇప్పట్లో జరగక పోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వీటిని జనవరి మొదటి వారంలో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే, ఇంతలో తెలంగాణాఫై అఖిల పక్ష సమావేశం జరగడం, ఈ విషయంపై నెల రోజుల్లో తమ నిర్ణయాన్ని తెలియచేస్తామని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించడంతో ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల ఆశలఫై నీళ్ళు చల్లినట్లయింది.
కేంద్రం ఈ విషయంలో నిర్ణయాన్ని ప్రకటించేంతవరకూ ఈ భర్తీ చేపట్టకూడదని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీటిని భర్తీ చేస్తే, కొత్త సమస్యలు వస్తాయని కిరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అయితే, కీలకమైన ఎస్సీ, ఎస్టీ కమీషన్, మహిళా కమీషన్ల లోని చైర్ పర్సన్, సభ్యుల పదవులను మాత్రం ప్రస్తుతానికి భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆలోచనగా తెలుస్తోంది.
వీటిలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ లోని పదవి కోసం 140 మంది పార్టీ నాయకులు, పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే, మహిళా కమీషన్ చైర్ పర్సన్ కు కూడా పోటీ అంతే స్థాయిలో ఉందని సమాచారం. దీని కోసం 38 మంది కాంగ్రెస్ నేతలతో పాటు, మొత్తం 120 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కమీషన్ల లోని పదవులను మాత్రమే భర్తీ చేయాలని, మిగిలిన వాటిని తెలంగాణాఫై నిర్ణయం వెలువడిన తర్వాతే భర్తీ చేయాలనేది ముఖ్య మంత్రి ఆలోచనగా సమాచారం.