‘ఇద్దరు’ ఫై కాంగ్రెస్ లో తర్జన భర్జనలు

          ఈ నెల 28 న తెలంగాణా విషయం ఫై ఢిల్లీ లో జరుపతలపెట్టిన సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఇద్దరేసి నేతలను పిలవాలని సూచించడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి హాజరయ్యేందుకు ఒక్కరే రావాలని సూచించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే, కోస్తాంధ్ర నేతలు మాత్రం, ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.   ప్రతి పార్టీ నుండి ఎందరు వెళ్లారనేది ముఖ్యం కాదని, ఆయా పార్టీలు తెలంగాణా కు అనుకూలంగా మాట్లాడారా లేదా అనేది ముఖ్యమని మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు.     ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లు త్వరలో సమావేశం అయిన తర్వాత ఈ సమావేశానికి ఎవరిని పంపించాలనే విషయంఫై తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. గతంలో ఈ విషయం ఫై జరిగిన సమావేశానికి కావూరి సాంబశివ రావు, ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే, కావూరి ప్రస్తుతం కాంగ్రెస్ కు దూరంగా ఉండడంతో, ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోవకపోవచ్చు.   ఈ నెల 15,16 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న పార్టీ సదస్సులో పాల్గొనడానికి గులాం నబీ అజాద్ హైదరాబాద్ వస్తున్నారు. అయితే, ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంఫై చర్చ జరగదని బొత్స చెపుతున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణా నేతలు భావిస్తున్నారు.

జగన్ పై లోకేష్ ఫైర్

       చంద్ర బాబు నాయుడు తనయుడు లోకేష్ తన ట్విట్టర్ పేజీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విజయమ్మ, షర్మిలా లఫై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ అవినీతిని ఎందుకు ప్రస్తావించడం లేదని లోకేష్ వారిని ప్రశ్నించారు.   వంద రూపాయల నోట్ల కట్టలను వెయ్యి లారీలలో నింపితే ఎంత మొత్తం ఉంటుందో, అంత మొత్తాన్ని జగన్ మోహన్ రెడ్డి సంపాదించారని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ కు త్వరలో బెయిల్ వస్తుందని చెప్పే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆయన నిర్దోషిగా వస్తారని ఎందుకు అనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు ఎంఎల్ఏ లను కొనుగోలు చేయడానికి, దొంగ సర్వేలకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని లోకేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని చెప్పుకొనే ఆ పార్టీ నేతలు డబ్బెందుకు ఖర్చు పెడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు.     రాష్ట్రంలో విద్యుత్ కోతలకు తన తండ్రే కారణమని టిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర రావు అంటున్నారని ఇదెక్కడి వింత అని లోకేష్ అన్నారు. తన తండ్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తుండగా అక్కడ వర్షం పడదని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు 25 లక్షలు పందెం కట్టిందని, అయితే అక్కడ వర్షం పడిందని ఆయన అన్నారు. ఈ డబ్బును పేదలకు ఖర్చు పెట్టాలని లోకేష్ సూచించారు.   వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లో క్రియాశీలకం అవ్వాలని భావిస్తున్న లోకేష్ తన అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారని భావిస్తున్నారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు జగన్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మళ్ళీ ఇద్దరే : పార్టీలకు షిండే లేఖ

            తెలంగాణా విషయాన్ని చర్చించడానికి జరుప తలపెట్టిన అఖిల పక్ష సమావేశం ఈ నెల 28 నే జరుగుతుందని, దానికి అన్ని రాజకీయ పక్షాలు తమ తరపున ఇద్దరేసి నేతలను పంపించాలని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రంలోని తొమ్మిది రాజకీయ పార్టీలకు ఈ రోజు లేఖలు రాసారు.   ఈ సమావేశం శుక్రవారం ఉదయం పది గంటలకు ఢిల్లీ లోని నార్త్ బ్లాక్ లో జరుగుతుందని ఆయన ఆయా పార్టీల నేతలకు లేఖలు రాసారు. ఈ సమావేశంలో ఇతర అంశాలేవీ చర్చకు రావని, కేవలం తెలంగాణా అంశంఫైనే చర్చ జరుగుతుందని షిండే ఆ లేఖలో వివరించారు.   ఈ సమావేశం వాయిదా పడక పోవడంతో టిఆర్ఎస్ నాయకులు, తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, మళ్ళీ ప్రతి పార్టీ నుండి ఇద్దరు నేతలు రావాలని సూచించడం ఫై తెలంగాణా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తామంతా ఢిల్లీ వెళ్లి తమ నేత సోనియా గాంధీ కి తమ అభ్యంతరాన్ని తెలియ చేస్తామని వారన్నారు. ఇలా ఇద్దరినీ పిలవడం వల్ల సమస్య మరలా మొదటికి వస్తుందని వారు వెల్లడించారు.   ఇద్దరిని ఆహ్వానించడం కుట్రలో భాగమని ఓ తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఏ వ్యాఖ్యానించారు. ఏది ఎలా ఉన్న, ఇలా పార్టీ నుండి ఇద్దరినీ పిలవడం వల్ల సమస్య పరిష్కారం మాత్రం కాదని, ఈ అఖిల పక్ష సమావేశం కేవలం ఓ వృధా ప్రయత్నమేనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

‘ఓటింగ్’ అంశం ఇక సద్దుమణిగిందా ?

            ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎంపి లు రాజ్య సభ లో ఎఫ్ డి ఐ ఓటింగ్ కు దూరంగా ఉన్న అంశం ఇక సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు. తనకు చెప్పే దేవేందర్ గౌడ్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారని ఇప్పటికే చంద్ర బాబు నాయుడు ప్రకటించారు.   ఇక మిగిలిన సుజన చౌదరి, సుధా రాణి లు కూడా పార్టీ అధినేతకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చి ఉండడంతో ఈ అంశాన్ని ఇంతటితో వదలివేయాలని పార్టీ నాయకులు గాలి ముద్దు కృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, సోమిరెడ్డి వంటి నేతలు చంద్ర బాబుకు సూచించినట్లు సమాచారం.     అయితే పార్టీ ని నడిపేది తలసాని, పయ్యావుల, కొత్త కోట వంటి నేతలు కాదని, పార్టీకి అధ్యక్షుడు ఉన్నారని సుజన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీ శ్రేణుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేతలు మాట్లాడినప్పుడు కొంత సంయమనం పాటించాలని చంద్ర బాబు సుజన కు సూచించినట్లు సమాచారం. అయితే, ఈ ముగ్గురు నేతలకు క్షమాపణ చెప్పాలని పార్టీ నేతలు కూడా సుజన కు సూచించడంతో ఇక ఈ విషయం ఇంతటితో ముగిసినట్లేనని భావిస్తున్నారు.

‘విగ్రహం’ ఫై ఎన్ టి ఆర్ కుమారుల్లో చీలిక

                పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో జరుగుతున్న మాటల యుద్దాల స్థాయి రోజుకు రోజుకు పెరుగుతోంది. నిన్న బాల కృష్ణ తన సోదరి పురందేశ్వరి ఫై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ రోజు టి డి పి నేత హరి కృష్ణ అనూహ్య రీతిలో వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవి చంద్ర బాబు కు కాకుండా, పురందేశ్వరి కి మద్దతు తెలిపే విధంగా ఉండటం విశేషం. పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అనేది ప్రతి తెలుగు వాడు గర్వించాల్సిన విషయమని, ఈ విషయంలో పార్టీ గానీ, అల్లుళ్ళు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హరి కృష్ణ అన్నారు.     ఈ విషయంలో బాల కృష్ణ, హరి కృష్ణ లు భిన్న ప్రకటలను చేయడం చూస్తుంటే ఈ విషయంలో ఎన్ టి ఆర్ కుమారులలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని నేలేకోల్పడమనేది పూర్తిగా తమ కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు జరిగిందనీ, ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని హరి కృష్ణ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా మాట్లాడినట్లు భావించాల్సి వస్తోంది. ఏది ఎలా ఉన్నా, ఈ అంశం దివంగత నాయకుని కుమారుల్లో చీలికకు దారి తీయడం మాత్రం విచారకరం.

హై కోర్టులో సత్యం కు ఊరట

            సత్యం కంపెనీకి రాష్ట్ర హై కోర్టులో ఊరట లభించింది. 822 కోట్ల రూపాయల కంపెనీ ఆస్తుల జప్తునకు సంభందించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులఫై హై కోర్టు స్టే విధించింది.   ఆస్తుల జప్తు ఫై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు రాష్ట్ర హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిఫై విచారణ జరిపిన హై కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంభందించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత అక్టోబర్ 18 న ఆస్తుల జప్తు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.   ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు ప్రధాన నిందితునిగా ఉన్నారు. జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

కుప్పం లో చంద్ర బాబు, వై ఎస్ భారతి ?

              వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో చంద్ర బాబు కు పోటీగా, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిని పోటీకి దింపాలని ఆ పార్టీ భావిస్తోందని మీడియాలో కధనాలు వస్తున్నాయి. ఒక వేళ అదే నిజం అయితే, ఇది ఆసక్తిదాయకమైన పోటీగానే ఉంటుంది.   బాబు 1989 నుండి ఇక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయనకు దీటుగా అభ్యర్ధిని నిలపడం ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీకి సాధ్యపడలేదు.   ఇక్కడ భారతి బాబుఫై ఘన విజయం సాధిస్తారని ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేనప్పటికీ, ఆ పార్టీ నేతల ఆలోచన మరోలా ఉంది. అయితే, భారతి ఒక వేళ విజయం సాధిస్తే, అది తెలుగు దేశం పార్టీ పతనానికి నాంది అవుతుంది. ఒక వేళ ఆమె ఓడిపోయినా, ఓడిపోయింది మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చేతిలో కావడంతో పెద్దగా ఆ విషయానికి ప్రాముఖ్యత ఉండకపోవచ్చు.   ఒక వేళ భారతి ఇక్కడ నుండి పోటీ చేయడం ఖరారు అయితే, విజయమ్మ, షర్మిలా కుప్పంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

రాజకీయాల నుండి దాసరి రిటైర్మెంట్ ?

          మాజీ కేంద్ర మంత్రి, సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు దాసరి నారాయణ రావు రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 65 సంవత్సరాల దాసరి కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు.   ఇక తాను రాజకీయాల్లో రాణించే అవకాశం లేదనే తుది నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఒక దశలో జగన్ పార్టీ వైపు తన దృష్టి సారించినప్పటికీ, చివరికి ఆ ఆలోచనను కూడా విరమించుకున్నట్లు తెలుస్తోంది. దాసరి ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో మాత్రం తెలియ రాలేదు. బహుశా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే విషయంలో ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చి ఉండక పోవడమే ఆయన నిర్ణయానికి కారణం కావచ్చు.   దాదాపు 140 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు, మోహన్ బాబు, ఆర్. నారాయణ మూర్తి,ముత్యాల సుబ్బయ్య వంటి వ్యక్తులను సిని పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.

బెజవాడ గజ గజ...వంశీ, నెహ్రూల మధ్య కోల్డ్ వార్

         విజయవాడలో రాజకీయ వాతావరణం మరలా వేడెక్కినట్లు కనిపిస్తోంది. నగర పరిధిలోని గుణదలలో నిన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ఆ పార్టీ నేత వల్లభనేని వంశీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమన్నంతా ఓ వ్యక్తి వీడియో తీయడమే ఇందుకు కారణం.   అనుమానం వచ్చిన పార్టీ నేతలు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. నగర కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రు అనుచరుడు సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని వీడియో తీస్తే, ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడని రమేష్ అనే వ్యక్తి తెలుగు దేశం నేతలకు చెప్పాడు. దీనితో పార్టీ నేతలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో చిత్రాల ద్వారా నెహ్రు తన ఫై దాడి చేయాలని పధక రచన చేస్తున్నారని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అవసరం తమకు లేదని, కేవలం ప్రచారం కోసమే వంశీ ఈ ఆరోపణలు చేస్తున్నారని నెహ్రు వర్గీయులు తిప్పి కొట్టారు.   ఏది ఏమైనా గుణదలలో ఏ చిన్న రాజకీయ కార్యక్రమం జరిగినా అక్కడి సాధారణ ప్రజానీకం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పరిస్థితి దృష్ట్యా పోలీసులు కూడా బారీ ఎత్తున బలగాలను మొహరిస్తూఉండడంతో అక్కడ ప్రజలలో ఆందోళనలు నెలకొని ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు నేతలు మాటల యుద్దానికి తలపడుతూ ఉండటం సహజంగా మారింది.   ఇలా ఒకరి కార్యకలాపాలఫై మరొకరు నిఘా పెట్టడంతో విజయవాడ రాజకీయాలు మరలా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కేసిఆర్ ‘దాడుల’ ఫై జగ్గా రెడ్డి సీరియస్

            తెలంగాణా ప్రత్యెక వాదం పేరుతో కాంగ్రెస్ మంత్రులు, ఇతర నాయకులఫై దాడులు చేస్తే, ప్రతి దాడులు తప్పవని టిఆర్ఎస్, జెఏసి లను ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి హెచ్చరించారు.   శాసనసభలో తెలంగాణా వ్యతిరేక వైఖరి తీసుకొన్న ఎంఐఎం ను ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ను ఎదిరించే సత్తా టిఆర్ఎస్ కు గానీ, జెఏసి కి గానీ లేదనీ జగ్గా రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎం పార్టీ బహిరంగ సమావేశం పెట్టినప్పటికీ వారు ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ను ఎదుర్కోలేని కేసిఆర్, కోదండ రామ్ లు వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కొంటారని జగ్గా రెడ్డి ప్రశ్నించారు.   తమ పార్టీ నేతల ఫై దాడులు చేయడం ఇక నుండి అయినా మానుకోవాలని ఆయన సూచించారు. తిరిగి తమ పార్టీ నేతలు కూడా దాడులు చేస్తే పరిస్థితి ఏమిటని ఆయన హెచ్చరించారు.

ఒక్కరూ లేక ఇద్దరు చాలు

  ఒకవైపు తెలంగాణా కోసం వేసిన అఖిలపక్ష సమావేశం అంతా ఒట్టి భూటకమని ఒకవైపు కాంగ్రేసుని దుయ్యబడుతూనే, మరో వైపు అఖిలపక్ష సమావేశంలో పార్టీల బండారాలు బయట పడతాయని తే.రా.స. నేతలు మరియు టీజేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు బల్లగుద్ది మరీ చెపుతున్నారు. అయితే, ఇప్పుడు అంతటా నంబర్ గేమ్ (ఉదా:యఫ్.డి.ఐ.)నడుస్తోంది కాబట్టి, అఖిలానికికూడా అదేరూల్ వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారు. అదే పనిలో నేడు తెలంగాణా యంపీలు డిల్లీలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేను కలిసి, ముఖ్యమంత్రి, పీ.సి.సి అధ్యక్షుడు కోరినట్లు అఖిలపక్ష సమావేశం వాయిదావేయవద్దని, ముఖ్యంగా పార్టీకి ఒక్కరినే చొప్పున ఆహ్వానించాలని కోరేరు. అప్పుడే, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణాపై తమ ఖచ్చితమయిన అభిప్రాయం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని నొక్కి మరీ జెప్పారు.   గానీ, ఇటువైపు లగడపాటివంటివారి వాదన మరోలా ఉంది. కేవలం, ఒక వర్గంవారి వాదననే వినేసి ఎదో ఒక నిర్ణయం తీసేసుకొంటే కుదరదుగాక కుదరదు, కనీసం పార్టీకి ఇద్దర్నినయిన ఆహ్వానించాలని అప్పుడే అందరి అభిప్రాయాలూ వ్యక్తం అవుతాయని చెప్పుతున్నారు. ఏది ఏమయినప్పటికీ, ఇప్పుడు గేమ్ అంతా కాంగ్రేసు ప్రకటించబోయే ఆ ‘మాజిక్ నంబరు’ మీదే ఆదారపడి ఉంది. అది, ‘ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు’ అని అంటుందా లేక ఒక్కరు లేక ఇద్దరు ముద్దు అని అంటుందా అనేది తెలిసిపోతే అప్పుడు రాష్ట్రంలో అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పుడు బంతి కాంగ్రేసు కోర్టులో ఉంది. సర్వ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ సర్వ్ చేయకపోతే, అది డిసెంబర్ 2009లో చేసిన ప్రకటనల్లా తయారవుంది పరిస్తితి.

త్వరలో విడుదల....జయప్రద!

  ఒకనాడు తన అందచందాలతో, అపూర్వమయిన నటనతో తెలుగు సినిమాని ఒక ఊపుఊపిన అందాలతార జయప్రద, తరువాత తెలుగుదేశంలో జేరి రాజకీయ ఓనామాలు దిద్దికున్న తరువాత, ఎందువల్లో ఆమెకి చంద్రబాబుతో పొసగక, మూట ముల్లె సర్దుకొని ఏకంగా డిల్లి రైలు ఎక్కేసింది. అక్కడి నుండి, ఆమె ఉత్తర ప్రదేశ్ రైలు క్యాచ్చేసి అమర్సింగ్ తో కలిసి చాలా ఏళ్ళు అసలు సిసలు ‘సమాజ్వాది’గా ఒక వెలుగు వెలిగింది. అయితే, అక్కడ మారిన రాజకీయ పరిణామాలతో కొద్ది కాలం క్రితమే, మళ్ళీ హైదరాబాదు ట్రైను ఎక్కివచ్చేసింది ఆమె. అలా వచ్చినప్పటినుండీ, తిరుపతి వెంకన్న ముందొకసారి, శ్రీశైలమల్లన్నముందు మరోసారి ప్రజలకి అప్పుడప్పుడు తళ్ళుకుమని కనిపిస్తూ, ఇదిగో ‘వచ్చేస్తున్నా మీకోసం’ అంటూ, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకి తన రాజకీయ ఆఫర్ (సంసిద్దత) ఈయసాగింది. అయితే, బొత్తిగా సినిమా సెన్స్ లేని మన రాజకీయ పార్టీలు ఆమె ఆఫర్లను పట్టించుకొన్న దాఖలాలు లేవు. జయప్రధ ముందుగా, ‘చంద్రబాబు చాలా మంచి మనిషి. రాజకీయాలలో చాలా నిబద్దతగలవాడు’ అని అతనికి ఒక సర్టిఫికేటు జారి చేసి చూసింది, గాని అటువైపునుండి రెస్పాన్సు లేకపోవడంతో ఆమె కొంచెం నిరాశకు గురయింది. ఇక మిగిలిన వాటిలో వై.యస్.ఆర్.కాంగ్రెసులోకి వెళ్దామని ఉన్నాఅక్కడ ఇప్పటికే తనకు పోటీగా అందాలభామ రోజా సెటిల్ అయిపోయుంది. పోనీ, వై.యస్.ఆర్.కాంగ్రెసు ‘ద్వారములు తెరిచియే యున్నవి’ గనుక దైర్యం చేసి జేరిపోయినా తరువాత పదవులకోసం పెద్ద నోర్రున్న రోజాతో పోటీ పడక తప్పదు. కావాలంటే డ్యాన్సులలో పోటీ పడగలదు గానీ, ఆమెతో తూ...తూ! మై...మై! అనుకోవలసి వస్తే కష్టమే మరి. మళ్ళీ ‘మౌనమేలనోయి...’ అని పాడుకొంటూ వేరే రైలు పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని దైర్యం ఉంటే మహాసముద్రంవంటి కాంగ్రెస్లోకి దూకి ఈదాలి. కావాలంటే, ఆమెకు ఈత వచ్చేదాకా సాయపడేందుకు మన మెగాస్టారు చిరంజీవి ఎలాగు ఉన్నాడక్కడ. ఇప్పటికే అతను డిల్లీకి దారి కనిపెట్టడమే గాకుండా, కాంగ్రేసు రాజకీయాలును కూడా కొంత మేర వంటబట్టిన్చుకొన్నాడు గనుక, ఆ పార్టీలో జేరితే అతను యధా శక్తితో స్వచ్చమయిన ‘కాంగ్రేసు హస్తం’ అందించి ఆమెకు సహాయ పడవచ్చును. ఎంతయినా వెండితెర అనుబందాలు ఉండనే ఉంటాయి కదా. ఇక అదీ వీలు కాకపోతె, ఏ సినిమా ఎట్రాక్షన్స్ లేక బోసిపోయున్న బి.జే.పీ.లో జేరి అదృష్టం పరీక్షించుకోవాలి. పొతే అక్కడ “ఎగిరెగిరి దంచినా అంతే కూలి, రోటి కాడ పాటపాడినా అంతే కూలన్నట్లు” ఉటుంది ఆపార్టీలో వ్యవహారం. ఇప్పటికే సగం వయసయిపోయిన ఆ పార్టీ నేతలకే తమ రాజకీయ భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా ఉంది. ‘ఎక్కడున్నావే గొంగళీ అని అడిగితే...నువ్వేసినచోటనే ఇదిగో ఇలా పడి ఉన్నాను...’అన్నట్లు ఉంది వారి పరిస్తితి. ఇక అందులో జేరి మళ్ళీ కొత్తగా ఒనమాలనుండి ప్రారంబించాలా లేక దైర్యం చేసి చిరంజీవి ‘హస్తం’ పట్టుకొని ‘కాంగ్రెస్ సముద్రంలోకి’ దూకాలో ఆమె నిర్ణయించు కోవాలి. ఏమయినప్పటికీ, ఇప్పుడేమి ఎలక్షన్ సీజను కూడా కాదు గాబట్టి, ఇప్పుడు ఆమెకి ఎర్ర తివాచీలు పరిచి స్వగతం పలికేవారులేరు గనుక, తనే ఆ పనేదో చేసుకొంటూ ఏదో పార్టీ వైపు జేరుకొంటే ఆమె రాజకీయ అనుభవాన్ని పరిశీలించిన తరువాత ఎవరో ఒకరు అవకాశం ఇవ్వకపోరు. మరికొద్ది రోజులు ఆమె గోడ మీద ఒప్పిగ్గా కూర్చోనగలిగితే, ఎన్నికలు సీజను ఎలాగు వచ్చేస్తోంది గాబట్టి అప్పుడు ఆమెకి డిమాండ్ ఏర్పడవచ్చు. పైనుంచి చూసి ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి సేఫ్ ల్యాండింగ్ అయిపోవచ్చు. ఆమె జయప్రదంగా రాష్ట్ర రాజకీయాలలోకి దూకాలని కోరుకుందాము.

విమర్శల ఫై దేవేందర్ గౌడ్ మనస్తాపం

        పార్లమెంట్ లో ఓటింగ్ విషయం లో తనఫై విమర్శలు చేయడంఫై తెలుగు దేశం పార్లమెంట్ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ తో అప్పాయింట్మెంట్ ఉన్న కారణంగానే తాను ఓటింగ్ కు హాజరు కాలేక పోయానని ఆయన అన్నారు. ఈ విషయం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు కు కూడా తెలుసని, ఆయన అనుమతిన్చాకే తాను పార్లమెంట్ నుండి బయటకు వెళ్లానని గౌడ్ అన్నారు.   తాను నిజాయితీగా పని చేసే రాజకీయ నాయకుడినని, ఈ విషయం ఇంత రాద్దాంతం అవుతుందని తాను ఊహించలేదని ఆయన అన్నారు. తనను కొనే మగాడు కాంగ్రెస్ పార్టీ లో లేడని ఆయన అన్నారు.   ఓటింగ్ సమయంలో ములాయం, మాయావతి పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తున్నందున, ఓటింగ్ ఫలితం ముందే తెలిసిపోయిందని అందువల్లే ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకోలేదని గౌడ్ వివరణ ఇచ్చారు. ఈవిషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆయన మీడియాను కోరారు. మరో వైపు తన రాజీనామాకు డిమాండ్ వస్తున్న నేపధ్యంలో గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.   పార్లమెంట్ నుండి బయటకు వెళ్ళడానికి తాను బాబు అనుమతి తీసుకున్నానని అనడం తప్పుడు సంకేతాలను ఇస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాజ్య సభలో ఓ పార్టీ నేతగా ఉన్న వ్యక్తి ఓటింగ్ ను సీరియస్ గా తీసుకోవకపోవడం ఏమిటని కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నారు.

పురందేశ్వరి, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం

      పార్లమెంట్లో దివంగత ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు, కేంద్ర మంత్రి పురందేశ్వరి ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయంలో చంద్ర బాబు మొదటి నుండి రాజకీయాలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని పురందేశ్వరి స్పష్టం చేశారు.   ఇదే విషయం ఫై ఆమె ఎన్ టి ఆర్ అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాసారు. విగ్రహ ప్రతిష్టాపన లో ఉన్న వాస్తవాలను గ్రహించాలని ఆమె వారికి సూచించారు. విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తాను అడ్డుపడుతున్నానని చంద్ర బాబు, ఆ పార్టీ నాయకులు మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు.   ప్రజల దృష్టిలో తనను దోషిగా నిలిపెందుకే ఆయన అలా చేస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్టించే అవకాశం వచ్చినా, అందుకు సంతోషించకుండా ఆరోపణలు చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.     బాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఆ సమయంలో తాను విగ్రహం ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు, హడావిడిగా ఎర్రం నాయుడుతో లేఖ ఇప్పించారని ఆమె గుర్తు చేశారు.

ఎమ్మెల్యేగా పోటిచేస్తా : కంఠమనేని రవిశంకర్

    రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి 'బి' ఫారం సాధించి అవనిగడ్డ నియోజక వర్గం నుంచి పోటిచేస్తానని కంఠమనేని రవిశంకర్ గారు తెలిపారు. స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశంపార్టీకి అత్యధిక ఓటుబ్యాంకు కలిగిన మండలం కోడూరు అని అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న "మీకోసం పాదయాత్ర" కు మద్దతుగా జనవరిలో మండల పార్టీ అధ్యక్షుడు బండే శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పార్టీ అభివృద్దికి కృషిచేస్తున్న 'బండే' ను హతమర్చేందుకే కొందరు నేతలు ప్రణాళికలు వేస్తున్నట్లు ఆరోపించారు. మండలంలో గ్రూప్ రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీ అభివృద్దికి అందరూ ఐక్యంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఉల్లిపాలెంకు చెందిన అరిక రాజ రాష్ట్ర స్థాయిలో ఎఇఇఇలో 134వ ర్యాంక్ సాధించి వసతి గృహంలో ఉంటున్న౦దున ఖర్చుల నిమిత్తం పార్టీ తరుపున 20వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో బండే శ్రీనివాస్ రావు, ఉప్పాల పోతురాజు, బత్తిన వెంకటచలం, పెద్ది గోపాలస్వామి, గోగినేని సోమశేఖర రావు, వేములపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.      

ప్లీజ్! నన్ను ప్రజాసేవ చేసుకోనీయరూ!

  నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే, ప్రజాసేవలో ‘ప్రజలకు సేవ’ కూడా ఉండదు. అయినా, మన నేతలు ఆ పడికట్టుపదాన్ని అలవోకగా వాడేసుకొంటూ ప్రజలతో ఆడేసుకొంటున్నారు. అయినా కూడా భూదేవంత సహనమూర్తులయిన ప్రజలు మళ్లీమళ్లీ వాళ్ళనే ‘ప్రజాసేవ’ చేయాలని గట్టిగా కోరేస్తుండటం వల్ల, వాళ్ళ మీద గౌరవంతోనో లేక వాళ్ళమాట కొట్టేయలేని తమ బలహీనతవల్లనో పాపం శ్రమ అనుకోకుండా ప్రజాసేవ చేసుకుపోతున్నారు సదరు ప్రజా ప్రతినిధులు.   ఇక, విషయానికి వస్తే, గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజాసేవకే అంకితమయిపోయి, కాంగ్రేసు యంపీగా ఇటు పార్టీకి, అటు ప్రజలకి సేవలందిస్తున్న శ్రీ కావూరి సాంబశివరావుగారు, తనకు మంత్రి పదవి ఇవ్వక పోవడముతో ప్రజలకి మరింత ఎక్కువగా సేవచేయలేకపోతున్నని బాధపడుతూ కొద్ది రోజుల క్రితమే తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసేసారు. యఫ్.డి.ఐ. బిల్లు వోటింగు సమయంలో పాల్గొనకుండా కాంగ్రేసు ‘హస్తాన్ని’ కొంచెంమెలి తిప్పి చూసారు. కాని, పార్టీ హై కమాండులో పెద్దగా చలనం రాలేదు. అటు పార్టీలోంచి పొమ్మని చెప్పకుండా, ఇటు మంత్రి పదవీ ఇయ్యకపోతే ఇక ప్రజాసేవ ఎలాగ చేసుకోవాలో తెలియక ఆయన సతమతమయిపోతూ ఆ ఆవేదనని మీడియా ముందు ఉంచేరు ఇలా... “ఇన్ని సంవత్సరాలుగా నిస్వార్దంగా పార్టీకి సేవలందిస్తున్న నాకే పార్టీలో గుర్తింపు లేకపోతె, ఇక మా వంటి సామాన్య పార్టీ కార్యకర్తలమేమైపోవాలి అని కార్యకర్తలు నిలదీస్తుంటే వాళ్ళకి నేను జవాబు చెప్పుకోలేక పొతున్నను. నిజమే! మా అధిష్టానానికి ‘పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనట్లు’, పాత కాపులమయిన మేము పనికి రాకుండా పోయాము. నిన్న గాక మొన్న పార్టీలో జేరిన వారికి మంత్రి పదవులు మాకు శూన్య ‘హస్తం.’’   “గత అనేక సంవత్సరాలుగా నాంచబడుతున్న ‘కొల్లేరు సరస్సు ఉద్యమాన్ని’ మళ్లీ ప్రారంభించాలని అనుకొంటున్నాను. అవసరమయితే, రైల్ రోకో, హైవే రోకో వంటి ఆందోళనలకీ మేము సిద్దం” అని ప్రకటించేరు కావూరి వారు. ఇప్పుడు ఆయనని ‘ప్రజాసేవ’ చేసుకొనీయాలో వద్దో కాంగ్రెసు అధిష్టానమే ఆలోచించుకోవాలి మరి.

టిడిపి ఓటింగ్ కు గైర్ హాజరు, సర్వత్రా విమర్శలు

        ఎఫ్ డి ఐ ల ఫై రాజ్య సభ లో జరిగిన ఓటింగ్ లో తెలుగు దేశం సభ్యులు పాల్గొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పార్టీకి రాజ్య సభ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. టి డి పి కి చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణి, సుజన చౌదరి ఓటింగ్ లో పాల్గొన లేదు. దీనితో యూపిఏ ప్రభుత్వం గట్టెక్కింది. వీరితో పాటు బి ఎస్ పి, ఎస్ పి సభ్యులు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.     ఈ విషయంతో టి డి పి విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడానికి చంద్ర బాబు ఎంత పాకేజ్ తీసుకున్నారని ఇటీవలే టి డి పి నుండి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తో టి డి పి కుమ్మక్కు అయినదానికి ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలని నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.     అయితే, ఈ ముగ్గురు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్లే ఓటింగ్ లో పాల్గొనలేక పోయారని ఆ పార్టీ ఎంపి సి ఎం రమేష్ వివరణ ఇచ్చారు. అసలు ఈ విషయం తమ నేత చంద్ర బాబు కు తెలియదని, తానే ఈ విషయాన్ని మొదటగా ఆయనకు తెలియచేసానని రమేష్ వివరణ ఇచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం దేవేందర్ గౌడ్ ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని రమేష్ అన్నారు. అయితే, సుజన, సుధా రాణి ఇంకా ఈ విషయంలో వివరణ ఇవ్వలేదు. సుజన చౌదరికి ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఓటింగ్ కు దూరంగా ఉన్నారని కూడా కధనాలు వస్తున్నాయి.   ఏది ఏమైనా  ఈ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.    

తెలంగాణా అఖిల పక్ష సమావేశం ఫై ‘టి’ కాంగ్రెస్ నేతల ఆశ

      ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై జరిగే అఖిల పక్ష సమావేశం తగిన ఫలితాలను ఇస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.   ఈ అంశం ఫై ఏదో ఒక ప్రకటన చేస్తూ, కేంద్రం తుది నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తుందనే అపప్రద ఉన్న తరుణంలో కూడా, కాంగ్రెస్ నేతలు ఈ రకమైన ఆశాభావంతో ఉన్నారు.   అఖిల పక్షం తర్వాత తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవిస్తుందని రాష్ట్ర మంత్రి జానా రెడ్డి అన్నారు. ఎఫ్ డి ఐ లఫై ఓటింగ్లో గట్టేక్కడానికే ఈ తేదీని ప్రకటించారనడం సబబు కాదని, వ్యతిరేక ఆలోచనలు వద్దని ఆయన అన్నారు. చక్కటి వాతావరణంలో ఈ చర్చలు జరగనున్నాయని జానా అన్నారు.   తెలంగాణా రాష్ట్ర సాధన దిశగా ఈ సమావేశం ఓ ముందడుగు అని మరో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని తమకు గట్టి నమ్మకం ఉందని ఆయన అన్నారు. ప్రతి పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని, ఇద్దరినీ పిలిస్తే ఈ సమావేశం ఏర్పాటు లక్ష్యం నెరవేరదనే మంత్రి అభిప్రాయం సరైనదే.   అయితే, ఎంత మందిని పిలవాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ అనడం చూస్తుంటే ప్రత్యేక రాష్ట్రం విషయం మరలా మొదటికి వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది.