Road accident in Vijayawada

విజయవాడ లో ఘోర రోడ్డు ప్రమాదం

        నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఎస్వీఆర్ ట్రావెల్ బస్సు బెంజ్ సర్కిల్ వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.   ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలయ్యాయి. డ్రైవర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. అటు బస్సులో ప్రయాణిస్తున్న వారు.. భయంతో వణికిపోయారు. యాక్సిడెంట్‌ జరగ్గానే స్థానిక నేతలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అర్థరాత్రి వేళల్లో ట్రావెల్స్‌ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో నిఘా పెంచాలని కోరారు. ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే యాక్సిడెంట్‌ జరిగిందని వారు చెబుతున్నారు.

tdp leader

బాలయ్య పుంగనూరు యాత్ర పెద్దిరెడ్డి కోసమేనా?

  నిన్న అంటే సంక్రాంతి పండుగరోజున బాలయ్యబాబు చిత్తూర్ జిల్లాలో పుంగనూరుకు వెళ్లి అక్కడ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామరావు విగ్రహావిష్కరణ చేసారు. ఆ తరువాత జరిగిన ఒక బహిరంగ సభలో వచ్చేఎన్నికలలో తెలుగుదేశం పార్టీనే గెలిపించ మని ప్రజలను కోరారు. అయితే బాలకృష్ణ పుంగనూరు పర్యటన మాత్రం కాంగ్రెస్ పట్ల కినుకవహించి, మంత్రి పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తమ పార్టీ వైపుకు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఏర్పాటయిందని తెలుస్తోంది. ఒకప్పుడు టిడిపికి కంచుకోట అని చెప్పబడ్డ పుంగనూరు నియోజకవర్గం, టిడిపి నేత అమరనాధరెడ్డి నిష్క్రమణతో బలమయిన నాయకత్వంలేకుండా పోయింది.   ప్రస్తుతం, రాజకీయంగా మంచి బలమైన నాయకుడయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కిరణ్ కుమార్ నిర్లక్ష్యం చేయడంవల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను తమ వైపు తిప్పుకోవడానికి ఇదే తగిన సమయమని భావించిన తెలుగుదేశం పార్టీ బాలకృష్ణను హుటాహుటిన ‘నారావారి పల్లెలో నందమూరి వారి సంక్రాంతి సంభరాలు’ అనే వంకతో అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. తద్వారా, పెద్దిరెడ్డిని తమవైపు తిప్పుకోవడమే గాకుండా, నందమూరి మరియు నారా కుటుంబాలు చాలా ఐకమత్యంగా ఉన్నాయనే సందేశాన్ని ప్రజలలోకి పంపినట్లు అవుతుందని భావించినట్లు తెలుస్తోంది.   అయితే, పెద్దిరెడ్డి ఇప్పటికిప్పుడు ఎటువంటి సంకేతాలు ఈయకపోయినా, బాలకృష్ణ పర్యటన ద్వారా అయనకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందజేసింది గనుక, అయన ఎప్పుడయినా పార్టీ మారవచ్చును.

cpm state secretary

రాజ్యాంగం మైనార్టీలకు వ్యతిరేఖం అంటున్న రాఘవులు

  భారత రాజ్యాంగం దేశంలో మైనార్టీలకు ఎప్పుడూ వ్యతిరేఖమే. దానిని నమ్ముకోవడం కన్నా మైనార్టీలు తమ స్వంతశక్తినే నమ్ముకోవడం మేలని ఉచిత సలహా ఇస్తున్నారు సీపీయం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు. తోగాడియాను అరెస్టు చేయని ప్రభుత్వం అక్బరుదీన్ను మాత్రం ఎందుకు అరెస్ట్ చేసింది? అని ప్రస్నించేరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చినంత కాలం మజ్లిస్ ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకోగానే ఈ విదంగా మైనార్టీలను వేదింపులకు గురిచేస్తోందని ఆన్నారు. అయితే, అక్బరుద్దీన్ అరెస్ట్ మాత్రం సరయిన చర్యేనని ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించేరు.   అపారమయిన రాజకీయానుభవమున్న అయన భారత రాజ్యాంగ పట్ల అపనమ్మకం ప్రకటించడం విస్మయం కలిగిస్తుంది. భారత రాజ్యాంగం ప్రతీ భారతీయ పౌరుడికీ సమాన హక్కులు కల్పించి, వాటిని కాపాడవలసిన భాద్యతను ప్రభుత్వానికి అప్పగించిందనే విషయం ఆయనకు తెలియనిది కాదు. భారతదేశంలో మైనార్టీలకు ఉన్న స్వేచ్చ, సమానత్వపు హక్కుల వల్లనే మొన్న అక్బరుదీన్ ఆవిధంగా మాట్లాడగలిగేడని ఆయన తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరం. మైనార్టీలపట్ల భారత రాజ్యాంగం ఏనాడు వివక్ష చూపలేదు, అది నిర్దేశించిన హక్కులను అమలుజేయడంలో ప్రభుత్వాలు మాత్రమే విఫలమవుతున్నాయని ఆయనకీ తెలియనిది కాదు.   ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు మధ్యనున్న సన్నటి గీత చెరిగిపోయిన ఈ రోజుల్లో, ఏ ప్రభుత్వమయిన తన పార్టీకి అనుకూల నిర్ణయాలు మాత్రమే తీసుకొంటుంది. ఒక వేళ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే, అప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయాలు మజ్లిస్ ఆలోచనలకి అనుగుణంగానే ఉంటాయి తప్ప, భారత రాజ్యాంగం ఏమి చెప్పిందో తెలుసుకోవాలని అనుకోదు. ఆయన చెప్పినట్లు దేశంలో మతసామరస్యం దెబ్బ తీసి, ప్రజల మధ్య చిచ్చుపెట్టే వాళ్ళు తొగాడియా అయినా, అక్బరుద్దేన్ అయిన అరెస్ట్ కావలసిందే. గానీ, చట్టాలను అమలుచేయవలసిన ప్రభుత్వాలకి, వాటిని నడిపించే రాజకీయ పార్టీల ప్రయోజనాలే ముఖ్యం అయినప్పడు ఇటువంటి తప్పులు జరుగుతుంటాయి. అటువంటప్పుడు, భారత రాజ్యాంగాన్ని తప్పు పడుతున్న ఇటువంటి రాజకీయ నేతలు చొరవ తీసుకొని, ఇప్పుడు మాట్లాడినట్లే అప్పుడూ ప్రభుత్వాన్ని నిలదీస్తే వారి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.   రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపద్యంలో రాఘవులు ఆవిధంగా మాట్లాడటం చూస్తే, సీపీయం కూడా ఇప్పుడు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని భావించవలసిఉంటుంది.

film nayakm film svsc

నాయక్ కు చురకలు వేసిన కుర్ర హీరో

  మొన్న విడుదలయిన ‘నాయక్’ సినిమా మరో మాస్ సినిమా అయినప్పటికీ, దర్శకుడు వినాయక్ సినిమాను మలిచిన తీరుకి మాస్ ప్రేక్షకులు పడిపోయారని చెప్పవచ్చును. కమర్షియల్ సినిమాకి ఉండవలసిన అన్ని హంగులూ అమర్చిన ఈ సినిమాకి మాస్ ప్రేక్షకులు నీరాజనం పడుతుంటే, మిగిలిన వారితో బాటు మహేష్ అభిమానులు కూడా సీతమ్మ వాకిట్లోకి వెళ్లి కూర్చొంటున్నారు.   ఇంత మంచి సినిమా తీసినందుకు నిర్మాత దిల్ రాజు పై ప్రశంసల జడివాన కురుస్తోందిప్పుడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్లనే, అభిమానులతో బాటు, సినీ పరిశ్రమకు చెందినవారు కూడా రెంటినీ పోల్చి తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.   తెలుగు సినిమా పరిశ్రమలో తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు కొట్టేవారు ఇద్దరున్నారు. ఒకరు రామ్ గోపాల్ వర్మ కాగ, మరొకరు లవర్ బాయ్ గా పేరుపడ్డ హీరో సిద్దార్థ్. అతను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి తన ట్వీటర్ లో ఏమి వ్రాసాడంటే, ఈగ సినిమా తరువాత విడుదలయిన సినిమాలలో ఈ సినిమా ఒక్కటే సకుటుంబ సమేతంగా చూడదగినది. ఈ రోజుల్లో విడుదలవుతున్నమూస ఫార్ములా సినిమాలకి, అందులో ఉండే విపరీతమయిన హింసకి భిన్నంగా సీతమ్మ వాకిట్లో సినిమా చాలా అద్భుతంగా తీసారు. అందుకు సినిమా నిర్మించినవారితో బాటు, సినిమాలో నటించిన వెంకటేష్, మహేష్ బాబులకి కూడా నా అభినందనలు,” అని వ్రాసాడు.   నాయక్ సినిమా గురించి సిద్దార్థ్ ప్రత్యక్షంగా ఏమి అనకపోయినా, అతను ఎవరిని గిల్లేడో అర్ధం అవుతూనే ఉంది. నాయక్ సినిమా సీతమ్మతో కాకుండా మరెప్పుడు విడుదలయి ఉంటే, బహుశః ఇటువంటి చర్చ వచ్చేదికాదేమో. అయితే, రెండు విబిన్నమయిన సినిమాలు ఈవిదంగా ఒకేసారి విడుదల కావడంవల్లనే తెలుగు ప్రేక్షకులు ఏమి కోరుకొంటున్నారో స్పష్టంగా తెలియజేసారు. ఇది మన తెలుగు చిత్ర సీమకి తప్పక మేలు చేస్తుందని ఆశిద్దాము.

Jackie Chan calls US most corrupt

అమెరికా పై నటుడు జాకీచాన్‌ ఫైర్

      అమెరికా పెద్దన్న తరహా వైఖరిపై హాంగ్‌ కాంగ్‌కు చెందిన నటుడు జాకీచాన్‌ మండిపడ్డారు. అమెరికానే ప్రపంచంలో అతిపెద్ద లంచగొండి దేశమని ఆయన చైనాకు చెందిన ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చైనా ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న దేశమని అమెరికా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి తెలివి తక్కువతనానికి తార్కాణమని చాన్‌ అన్నారు. ఇతర దేశాలలో మాదిరిగానే చైనాలో కూడా అవినీతి ఉండొచ్చు, అయితే అమెరికాలో ఉన్నంత అవినీతి ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ హాలీవుడ్‌ నటుడు విమర్శిం చారు. చైనా నేతలు భారీ స్థాయిలో ముడుపులు పుచ్చుకున్నారని లెక్కలతో సహా న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాయడంపై జాకీచాన్‌ విమర్శలు గుప్పించారు. చైనా నేత జియాబావో కుటుంబం 2.7 బిలియన్ డాలర్లు లంచం పుచ్చుకున్నారని పలు అమెరికా పత్రికలు వెల్లడించాయి.  

Suman Rathod jail

చంచల్‌గూడ జైలుకి సుమన్ రాథోడ్

        ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్‌ మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. ఓ భూకబ్జా కేసులో సుమన్ రాథోడ్ పై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ప్రయత్నించిన సుమన్ రాథోడ్ కు ఇటీవల సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దాంతో ఆమె తప్పని పరిస్థితుల్లో మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. ఆమెను పోలీసులు సుమన్‌రాథోడ్‌ను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. గత కొన్నాళ్లు సుమన్ రాథోడ్ అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఓ వ్యక్తి పేరు మీద ఉన్న స్థలాన్ని వీరు తప్పుడు దృవపత్రాలు సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారు అడ్డంగా దొరికిపోయారు.    

chandrababu naidu

డాక్యుమెంటరీ సినిమాలో నటించిన చంద్రబాబు

  ఖమ్మం జిల్లాలో పాద యాత్ర చేస్తున్న చంద్రబాబు ఈ రోజు నటుడిగా మారి రాజకీయాలకి అతీతంగా దేశఅభివృద్ది’ అనే అంశంతో మణిశంకర్ నిర్మిస్తున్న డాక్యుమెంటరీ సినిమాలో మూడు నిమిషాలు నటించేరు. దానికోసం అయన దాదాపు అరగంట ప్రాక్టీసు కూడా చేసారు. షూటింగ్ తరువాత దర్శకుడు మణిశంకర్ మాట్లాడుతూ ఈ సినిమాకోసం చంద్రబాబు చాల బాగా సహకరించేరని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ రాజకీయలకి అతీతంగా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వ్యక్తుల గురించి తెలియజేసేదని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ ఎవరినీ పొగడడానికి కానీ, ఎవరినీ విమర్శించడానికి గానీ ఉద్దేశించినది కాదని తెలిపారు.

mim president

కాంగ్రెసుతో ఇక చేలగాటమే: మజ్లిస్

  నిన్న మొన్నటి వరకు పాతబస్తీ పార్టీగా మిగిలిపోయిన మజ్లిస్ పార్టీ అక్బరుద్దీన్ వ్యవహారంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పాపులర్ అయిపోయింది. కాంగ్రేసుకు తోకపార్టీగా ఉండే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ నే ఆడిస్తానంటోంది. ఇంతవరకు ఆపార్టీ ఉనికిని కూడా గుర్తించని ప్రజలు ఇప్పుడు ఆపార్టీ ఏమి మాట్లాడుతుందో, ఏమి చేస్తోందో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విషయాన్నీ మజ్లిస్ పార్టీకూడా బాగానే గుర్తించింది. తమ్ముడు జైలుకి వెళ్తేవెళ్ళేడు గానీ పార్టీ పాతిక ఏళ్ళు కష్టపడినా సంపాదించలేని పేరు పాపులారిటీనీ రాత్రికే రాత్రే సంపాదించిపెట్టేడని సంతోషపడుతోంది. ఇదే ఊపులో రాష్ట్రం మొత్తం తన పార్టీక్యాడర్ను మెరుగు పరుచుకొని వచ్చే ఎన్నికలలో మరో పది సీట్లయినా అదనంగా గెలుచుకొని నిర్ణాయాత్మక శక్తిగా ఎదగాలని భావిస్తోంది.   మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వులో అక్బర్ కేసు గురించి, తదనంత పరిణామాల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు.   “నిజం చెప్పాలంటే నా మాట నా తమ్ముడు అక్బర్ మాట వేరు కాదు. ఇద్దరిదీ ఒక్కటే మాట. అతనిపై ప్రభుత్వము చేస్తున్న కుట్రని మేము కోర్టుల్లో సమర్దంగా ఎదుర్కొంటాము. హైకోర్టు ఇటీవల మాపై చేసిన విమర్శలు దాని వ్యక్తిగతమే తప్ప తీర్పులో భాగంగా చూడరాదు. అందరూ భావిస్తున్నట్లు మమ్మల్ని ఏ హిందువూ వ్యతిరేకించట్లేదు. కేవలం బీజేపీ, సంఘ్ పరివార్ మాత్రమే, ఈ అంశాన్ని అవకాశంగా తీసుకొని మా పార్టీపై యుద్ధం ప్రకటించాయి. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోతున్నందునే బీజేపీ ఈవిదంగా రాజకీయం చేస్తోంది. అయినా వాటిని చూసి మేము భయపడము. మా పార్టీ ఏ మతానికి, కులానికి, ప్రాంతానికి గానీ వ్యతిరేఖం కాదు. వచ్చే ఎన్నికలలో అణగారిన వర్గాలవారినందరినీ ఏకత్రాటిపైకి తెచ్చి ప్రభుత్వంలో మాభాగం పొందేందుకు తప్పక ప్రయత్నిస్తాము. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డే అధికారంలో కొనసాగినప్పుడే ఎన్నికలలో అతనితో చెలగాటం ఆడుకోవడంలో మాకు ఆనందం కలుగుతుంది."   "తెరాస మిలియన్ మార్చ్ సందర్బంగా ట్యాంక్ బ్యాండ్ మీద ఉన్న విగ్రహాలను ఆ పార్టీ కార్యకర్తలు ద్వంసం చేస్తే కేసులు పెట్టడానికి దైర్యం లేని ప్రభుత్వం, మరిప్పుడు మాపై కేసులు పెట్టడానికి ఎవరిని చూసుకొని అంట దైర్యం వచ్చిందంటే బీజేపీ వల్లనే అంటాము. అదే విదంగా బాబ్రీ మసీదు కూల్చినవారిపై కేసులు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీని ఎందుకు లక్ష్యం చేసుకొంటోందిప్పుడు? ఆ రెండు పార్టీలు కుమ్మకయి మా పార్టీపై తప్పుడు కేసులు వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నాయి. అయితే, మా తడాఖా ఏమిటో వచ్చే ఎన్నికలలో తప్పక చూపిస్తాము.”

 Patabasti under Police patrol

పాతబస్తీలో ఉద్రికత వాతావరణం, టెన్షన్..టెన్షన్ !

        హైదరాబాద్ పాతబస్తీలో శుక్రవారం ఉద్రికత వాతావరణం నెలకొంది. మక్కా మసీదులో ప్రార్ధనల అన౦తరం ఆందోళనకారులు రెచ్చిపోయారు. చార్మినార్ వద్ద భారిగా మోహరించిన పోలీసుల పై రాళ్ళురువ్వారు. దీంతో పోలీసులు ఆందోళన కారులు పై లాఠీఛార్జ్ చేసి బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ దాడిలో కొంత మంది మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. అయితే కొంతమంది అక్బరుద్దీన్ కు అనుకూలంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్బరుద్దీన్ ను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ అందోళనల వెనుక ఎంఐఎం హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సిసి టివీ కెమెరాల ద్వారా ఆందోళన కారులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.

Singer Kushi Murali Dead|Kushi murali death

సినీ గాయకుడు మురళి మృతి

        ప్రముఖ సినీ గాయకుడు హాఠాన్మరణం పాలయ్యారు. కాకినాడలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ కు వెళ్ళుతుండగా ఆయన గుండె పోటుతో మరణించారు. ఆయనతో పాటు ఉన్న బృంద సభ్యులు చెన్నై నుండి వస్తున్నారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ కు గానీ, చెన్నైకి గాని తరలించనున్నారు. ఆయన మరణం పరిశ్రమలో విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు మణిశర్మ, గాయకుడు సింహలు మాట్లాడుతూ ఆయన మరణం తీవ్రంగా కలిచివేసిందని, ఆయన ఎప్పుడూ నవ్వూతూ, నవ్విస్తూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన ‘కెవ్వుకేక’ పాట, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో ‘జరమొచ్చింది..జరమొచ్చింది’, సారొచ్చారు చిత్రంలో ‘కాటుక కళ్లు’ పాటలు మురళి పాడినవే.

 nayak ysrcongress

'నాయక్' గండి బాబ్జీ పై వైసీపీ ఫైర్

            రామ్‌చరణ్ 'నాయక్' మూవీలో విలన్ పాత్ర పేరుపై వివాదం నెలకొంది. ఆ సినిమాలో విలన్ రాహుల్‌దేవ్ పాత్రకు 'గండి బాబ్జీ' అని పేరు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   దీనిపై తీవ్రంగా స్పందించిన గండి బాబ్జీ వెంటనే చిత్ర దర్శకుడు వి వి వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విలన్ పాత్రధారికి తన పేరు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే సినిమా థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో పెందుర్తి స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు.. కేంద్ర మంత్రి చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని నాయక్ చిత్రంలో తన పేరును విలన్ పాత్రధారికి పెట్టించారని మండిపడ్డారు.  

motkupalli narasimhulu

చంద్రబాబు పై అలిగిన మోత్కుపల్లి

  తెలుగుదేశం తరపున తెలంగాణా వాదులను ముఖ్యంగా తమపై దాడి చేస్తున్న తెరాస మరియు తెలంగాణా జేయేసి నాయకుల మీద ఎదురుదాడిచేసే పార్టీ మిస్సైల్ అని చెప్పుకోబడే మోత్కుపల్లి నరసింహులు, కొద్దికాలం క్రితం తమపార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన కీలకమయిన పోలిట్ బ్యూరో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంతో అలిగి, నిన్న మాదిరాపురంలో జరిగిన పార్టీ సమావేశానికి, పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చంద్రబాబు 100 రోజుల పాదయాత్ర విజయోత్సవ సభకి గైర్హాజరు అయ్యేరు. చంద్రబాబు తన ప్రతినిదులను పంపి ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన రాలేదు. పార్టీకి అనేక సం.లుగా సేవలందిస్తూ తెలంగాణా విషయంలో పార్టీకి రక్షణ కవచంగా నిలుస్తున్న తనను, కీలక సమావేశానికి ఆహ్వానించకుండా చంద్రబాబు అవమానించారని మనస్తాపం చెందిన మోత్కుపల్లి, పత్రికలకెక్కి ఆ విషయాలను బయట పెట్టి పార్టీ పరువు తీయడం ఇష్టం లేకనే మౌనం వహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు కూడా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి బుజ్జగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

jagan

వస్తాడోస్తాడు...సారోస్తాడు...

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతీ సభలో, సమావేశంలో తప్పనిసరిగా వినిపించే మాటలు కొన్ని ఉన్నాయి. ‘జగన్ త్వరలోనే బయటికివస్తాడని,’ ‘ప్రజల కష్టాలు తీరుస్తాడని,’ ‘దివంగత నేత వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాడనే’ అనే మూడు ముఖ్యమయిన వాక్యాలతో ఆపార్టీ నేతల ప్రసంగం మొదలయి, చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీని, సిబిఐని తిట్టడంతో ముగుస్తుంటుంది. చంచల్ గూడా జైల్లోంచి బయటకి రాలేక నానకష్టాలు పడుతున్న జగన్ బయటకొచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడని చెప్పడం ఎవరికయినా నవ్వు తెప్పిస్తుంది. అంతకంటే, జగన్ జైల్లో ఏవిదంగా భాదలు పడుతున్నాడో ప్రజలకి వివరించి చెప్పుకొంటే అతనిపట్ల ప్రజలలోకొంత సానుభూతినయినా ప్రోదిచేసే అవకాశం ఉండేది. గానీ, ప్రతీ సభ, సమావేశంలో ‘వస్తాడోస్తాడు...సారోస్తాడు...’అనే పల్లవి ఎత్తుకోవడం ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తుంది తప్ప, ఒరిగేదేమి ఉండదు.   ఇక ‘దివంగత నేత వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాడనే’ అనే వాక్యం వినగానే, ప్రస్తుతము చంచల్ గూడా జైల్లో కిక్కిరిసిఉన్న ఐ.యే.యస్. ఆఫీసర్లు, మంత్రులు, రాజకీయ నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆడిటర్లూ, కోర్టులు, ఈ.డీ. జప్తులు వగైరావగైరాలన్నీమన కళ్ళముందు సినిమారీలు తిరిగినట్లు గిర్రున ఒకసారిగా తిరిగి, మళ్ళీ మరోసారి రాజన్న రాజ్యం....అదే జగనన్న రాజ్యం వస్తుందంటే ఒళ్ళు జలదరిస్తుంది.   ఐ.యే.యస్. ఆఫీసరు శ్రీలక్ష్మి తానూ వ్యక్తిగతంగా తప్పుచేయడం ఇష్టం లేకపోయినప్పటికీ, తానూ రాజన్నరాజ్యంలోఉన్నపాపానికి సమిష్టి తప్పు చేసి ఇలాగ జైలు పాలయేనని బోరున కోర్టులో విలపిస్తుంటే రాజన్నరాజ్యం తడాఖా ఎలాఉంటుందో అర్ధమవుతుంది. అటువంటి రాజన్నరాజ్యం మళ్ళీ అంటే అమ్మో! అంటారు జనం.   ఇక చివరిగా చెప్పుకోవలసిన విషయం ఈ రోజు కర్నూలు పట్టణంలో విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో  వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. షరా మాములుగా, ఆమె ముందుగా ప్రజలకు ఆ మూడు పవిత్ర వాక్యాలు చెప్పుకొన్నాక, నేటి సర్వానర్ధాలకి చంద్రబాబు, కిరణ్ కుమారులే కారణమని తిట్టిపోయడంతో సభ ముగించేరు. అదృష్టవశాత్తూ మన రోశయ్యగారు కిరణ్ కుమారూడి చేతికి రాష్జ్త్రం అప్పజెప్పి తెలివిగా చెన్నై చెక్కేశారు. లేకపోతె కిరణ్ కుమారుడి పేరుకు బదులు ఆయన పేరు ఉండే ఆ తిట్లదండకంలో.

Akbaruddin Owaisi Arrest

అక్బరుద్దీన్‌కు నిర్మల్ కోర్టులో చుక్కెదురు

          ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌కు నిర్మల్ మున్సిఫ్ కోర్టులో చుక్కెదురైంది. ఆరోగ్యం సరిగా లేనందున తనను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు లేదా వరంగల్ జైలుకు తరలించాలని అక్బర్ తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అదిలాబాద్ జిల్లా కేంద్రం జైలులోనే ఉంచి, రిమ్స్‌లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోర్టు అదేశించింది. వైద్య చికిత్సల నిమిత్తం అక్బరుద్దీన్‌ను ఈ సాయంత్రం 6 గంటలకు రిమ్స్‌కు తరలించనున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని బుధవారం ఉదయం పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నెం 7546ను కేటాయించారు. ఈ తెల్లవారుజామున అక్బరుద్దీన్‌ను మెజీస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది.

హత్య కేసులో టిడిపి ఎమ్మెల్యే యరపతినేని అరెస్ట్

        కాంగ్రెస్ కార్యకర్త హత్యకేసులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం యరపతినేని శ్రీనివాసరావును పిడుగురాళ్ల న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.   యరపతినేని శ్రీనివాస రావు డిసెంబర్ 19వ తేదీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ముమ్మరంగా యత్నించారు. ఇందులోభాగంగా నరసరావుపేట కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో 7వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై 9వ తేదీ బుధవారం విచారణకు రానుంది. హత్యకు గురైన ఉన్నం నరేంద్ర తొలుత తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రియల్ ఎస్టేట్ వివాదాలు, క్రికెట్ బెట్టింగ్‌ల నేపథ్యం కలిగిన నరేంద్ర నవంబర్ 27వ తేదీన హత్యకు గురయ్యారు. తన అన్నను హత్య చేసేందుకు ఎమ్మెల్యే యరపతినేని కుట్ర పన్నారని నరేంద్ర సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను మూడో నిందితుడిగా చేర్చారు.  

ధర్మానా! ఇది నీకు ధర్మమేనా?

  ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? మన గౌరవనీయ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారు, ఆయనగారి పుత్రరత్నం రామ్ మనోహర్ నాయుడు కధ వింటే ఆ సామెత వారిరువురి కోసమే పుట్టిందా అని అనిపించకమానదు.   సిబిఐ చార్జ్ షీట్లో మన మంత్రివర్యులపేరు ఎక్కడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, తన కార్యాలయం వైపు తొంగి చూడకుండానే, నెలనెలా టంచనుగా జీత భత్యాలు మాత్రం ఏంతో హుందాగా స్వీకరిస్తూ, కోర్టులచుట్టూ మంత్రిగారు తిరుగుతుంటే, మరో వైపు సదరు మంత్రివర్యుల గారి పుత్రరత్నం, తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో పులిపట్టి గ్రామ పరిధిలోగిరిజనుల సాగు చేసుకొంటున్న సర్వ్ నం.289లో ఉన్నకన్నెధార అనే కొండ ప్రాంతం మీద మనసు పడ్డాడు. అంతే, ప్రభుత్వం ఆఘమేఘాలమీద కదిలి అతనికి చెందిన వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కన్నెధార ప్రాంతాన్ని క్వారీ మైనింగ్ కోసం ధారాదత్తం చేసేసింది.   ప్రజల అభ్యంతరాలు, గిరిజనుల ఆక్రందనలు ఏవీ కూడా వారి చెవులకి గానీ, ప్రభుత్వ చెవులకు గానీ ఎక్కలేదు. స్థానికుల అభ్యంతరాలు పట్టించుకోకుండా క్వారింగుకి ఏర్పాట్లు చేస్తున్నమంత్రిగారి పుత్రరత్నంగారి కంపెనీపై విచారించి అడ్డుకోవలసిన జిల్లా కలెక్టర్ సౌరవ్ గౌర్ ఆయనకే అనుకూలంగా నివేదిక ఇచ్చి అభాసుపాలయేరు. ఆయన నివేదికతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినందున, క్వారీ లీజుపై అభ్యంతరాలు తెలియజేస్తూ దాఖలయిన పిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీకరిస్తూ, కలక్టర్ గారినే స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వమని ఆదేశించింది.   ఇక, ఈ కధ ఈవిదంగా నడుస్తుంటే, మరో వైపు మంత్రిగారి పుత్రరత్నం గారికి చెందిన కొందరు వ్యక్తులు (స్థానికులు వారిని గూండాలు అంటున్నారు) కన్నెధార కొండ మీద గిరిజనులు తరతరాలుగా పూజలుచేసుకొంటున్న సీతారాములవారి ఆలయంలో విగ్రహాలను ద్వంసం చేసి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మళ్ళీ ఆ గిరిజనులు కొత్త విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటే మళ్ళీ ఇటీవలే మరోసారి కొందరు ‘వ్యక్తులు’ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్నిబయట పడేసి, హుండీ పగులగొట్టి డబ్బులు కాజేసినట్లు మరోవార్త వచ్చింది. ప్రస్తుతం అమాయకులయిన గిరిజనులు తమ గోడు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక బాధపడతున్నారు. యధా తండ్రీ! తదా పుత్రా! అనుకోవాలేమో మరి!  

పరిటాల శ్రీరామ్ బెయిలు తీర్పు వాయిదా

  ఆనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌ పై జరిగిన హత్యకుట్రలో పరిటాల రవి కుమారుడయిన పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేడు. గానీ, అతను తన లాయర్ ద్వారా ఈ నెల 2వ తేదిన ఆనంతపురం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసాడు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును రేపటికి అనగా బుధవారానికి వాయిదా వేసింది. పరిటాల శ్రీరామ్ ఈ నెల 7వ తేదిన సింగపూర్ వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తరుణంలో పోలీసులు కేసు నమోదు చేయడం, అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అతని తల్లి పరిటాల సునీత,మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు ఆరోపించారు.