ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?!

ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?!

Publish Date:May 20, 2025

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణఏం కేసులు మాజీ సీఎం జగన్ బ్యాచ్ కి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ నలుగురూ జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.  మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికీ తెలిసి కొన్ని విషయాలు జరిగాయనీ,  అందువల్లే నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. ఈ నలుగురినీ కలిపి విచారించిన తరువాతనే ఈ కేసులో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయని సీట్ చెబుతోంది.  ఈ నలుగురినీ కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ( మే 20) విచారణ జరగనుంది.  మరోవైపు రాజ్‌కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ కోర్టులో మూడు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై  ఏసీబీ కోర్టు సోమవారం (మే 19) విచారణకు వచ్చింది. ఈ విచారణను కూడా ఏసీబీ కోర్టు మంగళవారం (మే 20)కి వాయిదా వేసింది. దీంతో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో ఏ30 పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు మంగళవారం (మే 19) విచారించనుంది. అలాగే ఈ కేసులో ఏ 6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారమే.   విచారించనుంది.మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్  అడ్డంగా బుక్కైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
గాంధీలు జైలుకు వెడతారా?

గాంధీలు జైలుకు వెడతారా?

Publish Date:Apr 19, 2025

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 

సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!

Publish Date:Apr 19, 2025

రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు..  పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు.  చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు.  దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.  ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం స‌ృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో  ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని  తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు.  కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్‌కి  బ్రేక్‌లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్‌‌లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది.  ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం.  బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్..  సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్‌ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్  చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు. ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా,  తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే.  చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్‌ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు  కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ,  అభివ‌ృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు.  అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.  ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్‌మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే,  పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను  రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే.   ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్‌ సహా అందరూ ఆమోదించారు. అయితే..  2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి.  రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు .బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు.  పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు.  గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు.  అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం  జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు.  అయితే పేరుకి  ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార  బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు.  నవరత్నాలని  వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో  చంద్రబాబు దూసుకుపోయారు.  జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసిరారు.  టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో  జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు .  పని రాక్షసుడిగా టాగ్‌లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20.  14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు. . ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్‌కళ్యాణ్, జగన్‌.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు.  ఒక్కసారి కూడా బ్రేక్‌ తీసుకోకుండా,  అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు..  రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై  తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు.  ఓవరాల్‌గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.  ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు.  ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.  అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.

తల్లిదండ్రులే చేతులారా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.. కారణాలు ఇవే!

Publish Date:May 20, 2025

పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే.. నిర్ణయాలు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు. తల్లిదండ్రుల తప్పేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది. కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.                                              *నిశ్శబ్ద.  
[

Health

]

టీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ...

Publish Date:May 20, 2025

ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద.