కాక్రోచ్ జనతాపార్టీ  జంతర్ మంతర్ ఉద్యమానికి మెచ్యూరిటీ లోపించిందన్న డోలేంద్రప్రసాద్!
కాక్రోచ్ జనతాపార్టీ జంతర్ మంతర్ ఉద్యమానికి మెచ్యూరిటీ లోపించిందన్న డోలేంద్రప్రసాద్!

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు, నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్ వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు. ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్.. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు.. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా లేదని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని.. కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ.. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్‌షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో.. క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

Publish Date: Jun 20, 2026 5:34PM
జగన్  టార్గెట్ సీఐ నాగరాజు కాదు.. అప్పసాని రాజేష్!
జగన్ టార్గెట్ సీఐ నాగరాజు కాదు.. అప్పసాని రాజేష్!

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ కేసు తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న యువకుడు సాయికృష్ణ అదృశ్యం కావడం లేదా మరణించి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఈ కేసులో వైసీపీ చేస్తున్న విమర్శల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం, హిడెన్ అజెండా ఉందన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, తెలుగుదేశం కూటమి అధికార ప్రతినిథి అప్పసాని రాజేష్. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ఉదంతంపై కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే విఆర్ కు పంపి, ఆపై సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోనే సిట్ విచారణ అత్యంత వేగంగా సాగుతోందని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు అందాయని, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్టు చేశారనీ.. త్వరలోనే ఈ విచారణ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. జగన్మోహన్ రెడ్డి ఇటికి చేరే అవకాశం ఉందని అన్నారు. ఈ మద్యం కుంభకోణం విచారణను పక్కదారి పట్టించడానికి, సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీపీ రాజశేఖర్ బాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే వైసీపీ ఈ కేసును రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని అప్పసాని రాజేష్ అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆనాడు పౌర హక్కుల ఉల్లంఘనలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు హఠాత్తుగా మానవ హక్కుల నేతగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందనీ, జూన్ 29వ తేదీ నాటికి పోలీసులు కోర్టుకు సమర్పించే నివేదికతో అసలు నిజాలు అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కేసులో ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ కమిషన్ కూడా ఏర్పాటైందనీ.. బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒక యువకుడి అదృశ్యం కేసును అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారనీ, విచారణ పూర్తయితే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని అప్పసాని చెప్పారు.

Publish Date: Jun 20, 2026 5:04PM
కస్టోడియల్ డెత్ వివాదం: కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు!
కస్టోడియల్ డెత్ వివాదం: కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు!

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ విజయవాడలో చోటుచేసుకున్న సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీస్ కస్టడీలోనే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, ప్రభుత్వంపై విమర్శల దాడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని, బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టటే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత అతను అనుమానాస్పద రీతిలో అదృశ్యం కావడం, అతని మృతదేహం కూడా లభించకపోవడంతో ఇది కస్టోడియల్ డెత్ అనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పోలీసులు విచారణ పేరిట థర్డ్ డిగ్రీ ఉపయోగించి, అతడి మరణానికి కారణమయ్యారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుడు ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఈ సున్నితమైన ఉదంతంపై అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు. మరోవైపు, ఈ దురదృష్టకర ఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యవ్యమవుతోంది. ఒక వ్యక్తిగత కేసును లేదా కొందరు పోలీసులు చేసిన అతిని మొత్తం ఒక సామాజిక వర్గంపై జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ రాజకీయ నాయకుడు సాంబశివరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన సామాజిక వర్గాల ముసుగులో చేసే రాజకీయాలు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ అసలు ఎక్కడున్నాడు? సజీవంగా ఉన్నాడా లేదా అనే కోణంలో నిష్పక్షపాత విచారణ జరగాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే పోలీసుల వైఫల్యం ఉంటే వారిని కోర్టుకు అప్పగించి కఠినంగా శిక్షించడమే ఏకైక మార్గమన్నారు. సమాజంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన సామాజిక వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోకుండా, ప్రజలు కూడా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం త్వరితగతిన ఈ కేసుపై స్పష్టతనిచ్చి బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, శాంతిభద్రతలను కాపాడటంలో తన నిబద్ధతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు.

Publish Date: Jun 20, 2026 4:32PM
 తెలంగాణ రాజకీయాల్లో   కొత్త పార్టీకి స్పేస్ ఉందా?
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా?

తెలంగాణ ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా చలామణి అవుతున్న శక్తుల మధ్య స్పష్టమైన పొలిటటికల్ వాక్యూమ్ ఏర్పడిందని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి, కాదంటే.. బలమైన ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఉన్నాయా? అన్నచర్చ రాష్ట్రరాజకీయాలలో జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా లేదా ఇతర రాష్ట్రాల్లో ఒక పార్టీ బలహీనపడితే మరో పార్టీ పుంజుకోవడం సాధారణం.. కానీ తెలంగాణలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటిపైనా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవున్న పరిస్థితి. ఇక ఈ రెండూ కాకుండా బీజేపీ కూడా తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నట్లుకనిసిస్తున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. హైదరాబాద్మినహాయిస్తే.. బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. దీంతో ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తరహా కేంద్రీకృత పాలనకు భిన్నమైన పరిపాలనను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో ఆ మార్పులు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ మౌలిక ప్రయోజనాలను, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల తెలంగాణ సమాజంలోని మేధావులు, ఉద్యమకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకత్వం తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లోనే కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేటీఆర్ శైలి తెలంగాణ సంస్కృతికి, ఇక్కడి మట్టి మనుషుల ఆలోచనలకు దూరంగా కార్పొరేట్ తరహాలో ఉంటోందనే విమర్శలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వస్తున్నాయి4. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత సొంతంగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. అయితే ఆమే ముందుకు సాగడానికి పాత నీడలు, వివాదాలు ఆమెను వెన్నాడుతున్నాయి. ఆమె జోరుకు ఇవిసహజంగానే అవరోధాలుగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్, బీఆర్‌ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో వెనుకబడుతోంది. ఈ వ్యూహాత్మక రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జరిగిన కొన్ని చారిత్రక ప్రయోగాలను మేధావులు గుర్తుచేస్తున్నారు. గతంలో దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఏర్పాటైన 'మహాజన ఫ్రంట్' తరహా ప్రయోగం ప్రస్తుత తెలంగాణలో అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మైనారిటీ వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి, మహిళా లోకాన్ని భాగస్వామ్యం చేస్తూ ఒక బహుజన ఫ్రంట్ లేదా విస్తృత సామాజిక వేదికను ఏర్పాటు చేయడానికి తెలంగాణలో స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నికల వేళ సీట్ల సర్దుబాట్లు, సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఒక చక్కని వేదిక కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ అధికారమే పరమావధిగా కాకుండా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వం కోసం ఒక పటిష్టమైన ఎజెండాతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. ఈ అనుకూల సమయాన్ని సామాజిక శక్తులు సరిగ్గా ఉపయోగించుకోకపోతే, తెలంగాణ రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.

Publish Date: Jun 20, 2026 3:37PM
లోక్ సభలో టూధర్డ్స్ మెజారిటీ కోసం బీజేపీ వ్యూహంలో బలిపశువులు విపక్ష రెబల్సే!
లోక్ సభలో టూధర్డ్స్ మెజారిటీ కోసం బీజేపీ వ్యూహంలో బలిపశువులు విపక్ష రెబల్సే!

కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కీలకమైన రాజ్యాంగ బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందాలంటే.. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహాలకు పదును పెట్టి సొంతంగా మెజారిటీ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. లోక్‌సభలో కేవలం సాధారణ మెజార్టీతో సరిపెట్టుకోకుండా, ఏకంగా రెండు బై మూడు వంతుల తిరుగులేని మెజార్టీని సాధించాలని భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దేశ భవిష్యత్తును మార్చే డీలిమిటేషన్ అదే నియోజకవర్గాల పునర్విభజన , అలాగూ మహిళా రిజర్వేషన్ వంటి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం. ఇండియా కూటమి ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో, అధికార ఎన్డీఏ కూటమి తన రూట్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం 540 మంది సభ్యులు ఉన్న లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీల బలం ఉంది. అయితే, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే సభలో కనీసం 360 మంది ఎంపీల (అనగా 2/3 వంతు) మద్దతు తప్పనిసరి. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీఏ కూటమికి ఇంకా 67 మంది ఎంపీల కొరత స్పష్టంగా ఉంది. ఈ భారీ అంతరాన్ని ఎలాగైనా అధిగమించేందుకు బీజేపీ చాణక్య వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్త, రెబల్ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు తెర వెనుక వేగంగా పావులు కదుపుతోంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ప్రధానంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలపై బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు, అలాగే మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నుంచి 6గురు ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సొంత పార్టీలపై అసంతృప్తి, వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలే ఈ పరిణామాలకు ప్రధాన కారణాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల నుండి ఆశించిన విధంగా 26 మంది ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరితే, అప్పుడు కూటమి బలం 319 స్థానాలకు చేరుకుంటుంది. అయినప్పటికీ లక్ష్యానికి ఇంకా 41 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. ఈ మిగిలిన లోటును భర్తీ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ పై బీజేపీ చూపు పడింది. యూపీలో అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్‌లతో కూడిన సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీల బలం ఉంది. అయితే అక్కడ అంతర్గత విభేదాలు, టికెట్ల పంపకాలపై అసంతృప్తి, స్థానిక నాయకత్వ వివాదాల కారణంగా కొందరు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. వీరిలో కనీసం 10 నుండి 15 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇచ్చినా కూటమి బలం 330 నుండి 335 మార్కును తాకుతుంది. అప్పుడు కేవలం పాతిర నుండి 30 స్థానాల అంతరం మాత్రమే మిగులుతుంది, దీనిని ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్రుల ద్వారా సులభంగా సాధించవచ్చని బీజేపీ యోచన. ఈ వ్యూహం గనుక నూటికి నూరు శాతం ఫలించి ఎన్డీఏకు 2/3 మెజార్టీ వస్తే, దేశంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. డీలిమిటేషన్ వంటి సున్నితమైన అంశాలను ప్రతిపక్షాల ఆందోళనలతో నిమిత్తం లేకుండా ముందుకు తీసుకెళ్లవచ్చు. అయితే, ఈ వ్యూహం వెనుక చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఇలా ఎంపీలను ఆకర్షించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఉత్తరాది ఎంపీల బలంతో ఈ బిల్లులను ఆమోదిస్తే దేశంలో ఉత్తర-దక్షిణ విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

Publish Date: Jun 20, 2026 3:14PM
జనసేన తెలంగాణ ఎంట్రీ వెనుక ప్రధాని మోడీ?
జనసేన తెలంగాణ ఎంట్రీ వెనుక ప్రధాని మోడీ?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన పార్టీని తెలంగాణలో కూడా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా.. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రయాణం అనే నినాదంతో నిర్వహించిన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ కీలక ప్రకటన చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విస్తరణ ప్రణాళిక వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రకటించిన 9 వేల 400 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. గుడెబల్లూరు - మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్-167 రహదారి విస్తరణ, జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్, రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టులను పవన్ కల్యాణ్ బాహాటంగా ప్రశంసించారు. వికసిత్ తెలంగాణ కోసం వికసిత్ భారత్ నినాదంతో కేంద్రం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను జనసేన క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను దక్షిణాదిలో ఒక బలమైన జాతీయవాద ముఖచిత్రంగా నిలబెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం కూడా ఆసక్తి చూపిస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఈ కారణంతోనే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పవన్ తెలంగాణలో జనసేన విస్తరణ అంటూ ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తే.. పవన్ కళ్యాణ్ దీటుగా కౌంటర్ ఇస్తూ.. గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులు తమ సొంత రాష్ట్రాలు కాకపోయినా ఇతర ప్రాంతాల నుండి పోటీ చేసినప్పుడు లేని అభ్యంతరం, తనపై ఎందుకంటూ నిలదీశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలిలో జనసేన సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ తన జూబ్లీహిల్స్ నివాసంలో దాదాపు 50 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగట్టారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకుని వారాహి యాత్ర ను ఇక్కడ కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో మోదీ అండ, క్షేత్రస్థాయిలో యువత క్రేజ్ కలగలిసి తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి ప్రభావాన్ని చూపనుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.

Publish Date: Jun 20, 2026 11:58AM
కాపు సామాజికవర్గంపై జగన్ వ్యూహం.. మొదటికే మోసం..  వైసీపీలో మధనం
కాపు సామాజికవర్గంపై జగన్ వ్యూహం.. మొదటికే మోసం.. వైసీపీలో మధనం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. వ్యవహార శైలి, ఆయన అమలు చేస్తున్న వ్యూహాల పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి కూటమికి అండగా నిలబడటం, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడవటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కోసం, రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించడం కోసం కాపు సామాజికవర్గం విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ విషయంలో జగన్.. వరుసగా తప్పుడు వ్యూహాలు, నిర్ణయాలతో కాపు సమాజికవర్గాన్ని పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి కాపు సామాజికవర్గాన్నిపార్టీకి అనుకూలంగా మర్చుకోవడానికి ప్రయత్నించడం మాని, ఆ వర్గం అదే సమాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దూరం అయితే చాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారనీ, కానీ ఇది అంతిమంగా వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది. జగన్ ఈ తీరునువైసీపీలోని పలువురు సీనియర్లు ప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతను పెంచడం వల్ల, వారి మధ్య చిచ్చు పెట్టడం వల్ల వైసీపీకి ఇసుమంతైనా ప్రయోజనం, రాజకీయ లబ్ధి ఉండకపోవడం అటుంచి.. అది బూమరాంగ్ అయ్యి మొత్తం కాపు సామాజికవర్గాన్నే పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Publish Date: Jun 20, 2026 11:45AM
అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే..  శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్
అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్

మహా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శివసేన పార్టీ 60వ వ్యవస్థాపక వేడుకల వేళ ముంబై వేదికగా శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి. గోరెగావ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఏక్‌నాథ్ షిండే ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా కొందరు నేతలు తమపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, అయితే టైగర్ బెదరదనీ అన్నారు. తమదే అసలైన శివసేన అని ఆయనీ సందర్భంగా ప్రకటించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు తమ వైపు రాబోతున్నారనే ప్రచారంపై షిండే నేరుగా స్పందించారు. ఇది కేవలం ఆపరేషన్ టైగర్ ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించబోతున్నామన్నారు. బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ఉద్ధవ్ థాకరే పూర్తిగా విస్మరించారని షిండే ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి పదవి, అధికారం కోసమే బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాము చేసిన చారిత్రాత్మక తిరుగుబాటు వల్లే శివసేన పార్టీ మళ్లీ సాధారణ ప్రజలకు, కార్యకర్తలకు చేరిందన్నారు. ఒకవేళ బాలాసాహెబ్ బతికి ఉంటే, దేశాన్ని గర్వపడేలా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వాన్ని కచ్చితంగా అభినందించేవారని షిండే పేర్కొన్నారు. ఇక మరోవైపు ఉద్ధవ్ థాకరే వర్గం నిర్వహించిన సభలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీని వీడి షిండే వర్గంలోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా ఆ ఆరుగురు లోక్‌సభ ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలకు తన నాయకత్వం నచ్చకపోతే, గౌరవంగా శివసేన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమేనంటూ ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. ఈ రాజకీయ తిరుగుబాటు, పార్టీ చీలిక వెనుక కేంద్ర శక్తుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. పార్టీ ఉనికిని, బాలాసాహెబ్ వారసత్వాన్ని కాపాడుకోవడానికి తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.

Publish Date: Jun 20, 2026 10:45AM
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు  చంద్రబాబు చెక్
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్

విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పరిపాలనా దక్షతతో, సత్వర నిర్ణయాలతో చెక్ పెట్టారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈ సున్నితమైన ఉదంతంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా బాధితుడి నివాసానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిబిఐకు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఈ వివాదానికి కుల రంగు అద్దే ప్రయత్నం చేస్తూ సామాజిక వర్గాల నేతలను కూడా రంగంలోకి దించారు. సాధారణంగా ఇలాంటి విషాద సమయాల్లో బాధితులకు మానవత్వంతో అండగా నిలవాలి. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా, రాజకీయ మైలేజీ కోసం కులం కార్డును తెరపైకి తీసుకువచ్చింది. అంబటిరాంబాబు, తోట త్రిమూర్తులు, కొరసాల కన్నబాబు వంటి వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలను సాయికృష్ణ విషయానికి కులం రంగు అద్ధి విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం పరిణామాలు చోటుచేసుకునే సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌లో ఉన్నారు. అయినప్పటికీ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ, . ప్రతిపక్షాలు ఈ కేసును సాకుగా చూపి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించారు. వెంటనే.. ఎక్కడా రాజకీయ లేదా విమర్శలకు పోకుండా.. కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పరస్పరం సంప్రదించుకుని బాధిత కుటుంబంలో నమ్మకాన్ని నింపేలా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా ముందుగా స్థానిక కూటమి శాసనసభ్యుడిని సాయికృష్ణ ఇంటికి పంపారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తక్షణ స్పందన బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. జగన్ పరామర్శ ముగించుకుని వెళ్లిన మరుసటి రోజే అంటే శుక్రవారం (జూన్ 19) దర్యాప్తు అధికారి దైవప్రసాద్ స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర చర్యల పట్ల సాయికృష్ణ కుటుంబ సభ్యులు పూర్తి సంతృప్తివ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. దీంతో సాయికృష్ణ వ్యవహారంలో పొలిటికల్ మైలేజీ పొందాలన్న వైసీపీ ఆశలు ఆవిరయ్యాయి. ఈ వివాదాన్ని చక్కదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి శాంతిభద్రతల విభాగంపై, ముఖ్యంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, బాధితులకు తక్షణ న్యాయం అందాలన్న స్పష్టమైన సంకేతాలను పంపారు.

Publish Date: Jun 19, 2026 6:03PM
మల్కాజ్‌గిరి రౌడీలకు భయపడొద్దు.. మీ వెంటే ఉంటాం : కేటీఆర్
మల్కాజ్‌గిరి రౌడీలకు భయపడొద్దు.. మీ వెంటే ఉంటాం : కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది. స్థానికంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ శ్రేణుల దూకుడుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అత్యంత ఘాటుగా స్పందించారు. శుక్రవారం మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రౌడీయిజానికి, గూండాయిజానికి పాల్పడుతున్న నాయకులకు ఆయన ముక్కుతాడు వేసేలా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మల్కాజ్‌గిరిలో కొందరు నాయకులు తామేదో పెద్ద గూండాలమని, రౌడీలమని విర్రవీగుతున్నారని, అలాంటి వారి ఆటలు సాగనివ్వబోమని కేటీఆర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గులాబీ సైనికులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత భావోద్వేగంగా భరోసా ఇచ్చారు. మల్కాజ్‌గిరి గడ్డపై రౌడీయిజం ప్రదర్శిస్తున్న నాయకుడికి గట్టి కౌంటర్ ఇస్తూ, నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా వందల సంఖ్యలో ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానికంగా ఏ రౌడీ వచ్చినా కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తానే స్వయంగా మల్కాజ్‌గిరికి వస్తానని హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఏ చిన్న అక్రమ కేసు పెట్టినా, తానే స్వయంగా ముందుండి వారిని విడిపించుకుంటానని క్యాడర్‌లో కొత్త జోష్ నింపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అధికార బలంతో వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. ఈ పోరాటంలో పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క కార్యకర్తకు కొండంత అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇదే వేదికపై నుంచి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల జడివాన కురిపించారు. అడ్డగోలు మాటలు చెప్పి, నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కేవలం 100 రోజుల్లోనే ప్రతిష్టాత్మకమైన 420 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠం దక్కించుకుని నేటికి ఏకంగా 900 రోజులు దాటిపోయిందని కీలక గణాంకాలను బయటపెట్టారు. 100 రోజుల గడువు కాస్తా 900 రోజులు దాటినా, ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలు ఊసే లేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 420 గ్యారంటీల అమలు ఇంకెప్పుడు చేస్తారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రులను కేటీఆర్ నిలదీశారు. ఈ అన్యాయమైన పాలనపై కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

Publish Date: Jun 19, 2026 5:42PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds