కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర: బొత్స

    తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై కథనం వచ్చిన ఆంగ్ల దినపత్రికపై తాను పరువు నష్టం దావా వేస్తానని బొత్స చెప్పారు. తాను నామినేటెడ్ అభ్యర్థినని, తనను మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తనకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా లేఖ రాసినట్లు తనకు తెలియదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. జాతీయ సమైక్యతను కాపాడగలిగేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు. కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనను మాఫియా డాన్‌తో పోల్చిన పత్రికపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన కూతురు వివాహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబువి వంకరమాటలా?

    ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, దమ్ముంటే వైకాపా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూల్చేయాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో బాబు బండి ఆగినచోటల్లా పిల్లకాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గొడవతప్ప మరోటి మాట్లాడ్డంలేదని జనంకూడా అనుకుంటున్నారు.   నిజానికి కాంగ్రెస్ అంటే గిట్టనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత సీన్ లేదని తెలిసినప్పుడు ప్రథాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టొచ్చుగా అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబుకి ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ములేక డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ప్రచారం చేస్తున్నారు.   వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలకు చంద్రబాబు సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం తమకు లేదని ప్రజలే రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ది చెబుతారని అంటూ బండిని నెట్టుకొస్తూ ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. సత్తా ఉంటే పడేసి చూపించాలి తప్ప కాకమ్మ కబుర్లు చెబితే ప్రజలు వినే స్థితిలో లేరంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి చంద్రబాబుకి ప్రతి సవాల్ విసిరాకకూడా ఆ విషయానికి సంబంధించి బాబు గట్టిగా మాట్లాడలేకపోవడం జనానిక్కూడా విడ్డూరంగానే ఉంది.   మొత్తానికి కాంగ్రెస్ ని విమర్శించడమే పనిగాపెట్టుకున్న బాబుకూడా తొందరపడడానికి సిద్ధంగా లేరన్న విషయం జనానిక్కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో.. ఇప్పట్లో ప్రభుత్వానికొచ్చిన ఢోకీ ఏం లేదన్నమాట..

వైకాపావైపు మల్లాది విష్ణు అడుగులు

    బెజవాడ సెంట్రల్ శాసన సభ్యుడిగా ఉన్న మల్లాది విష్ణుకి ఇప్పుడు లగడపాటి రాజకీయం ఊపిరాడనివ్వడంలేదు. విష్ణుకి పరమశత్రువైన అడపానాగేంద్రని పట్టణ అధ్యక్షుడిగా, మీసాల రాజేశ్వరరావుని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం వెనక లగడపాటి హస్తం పూర్తిగా ఉందన్న విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.   తనకి బద్ధ వ్యతిరేకి అయిన అడపా నాగేంద్రని తీసుకొచ్చి తన నెత్తిన కూర్చోబెట్టడమేంటని లగడపాటిపై విష్ణు చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఇక తన హవా కొనసాగడం కష్టమని తెలుసుకున్న విష్ణు వైకాపా నేతలతో బేరసారాలు సాగిస్తున్నట్టు సమాచారం.   సెంట్రల్ స్థానాన్ని ఇచ్చేస్తే వైకాపాలో చేరడానికి తనకేమీ అభ్యంతరం లేదని వైఎస్సాఆర్ సీపీ నేతలతో మల్లాది విష్ణు చెప్పినట్టు సమాచారం. విష్ణుకి అత్యంత సన్నిహితుడైన అంబటి వైకాపా కీలక నేత అంబటి రాంబాబు రంగంలోకి దిగారు. భూమన కరుణాకర్ రెడ్డితో విష్ణుని పార్టీలోకి లాగే వ్యవహరం విషయమై అంబటి ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.   మల్లాది విష్ణు దివంగత రాజశేఖర్ రెడ్డికి అనుంగు శిష్యుడిగా చెలామణీ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విష్ణుకి ఉడా చైర్మన్ పదవిని కట్టబెట్టారు. 2009లో సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు.   వై.ఎస్ మరణం తర్వాత ఆయనకు దగ్గరగా ఉన్న నేతలందరికీ పార్టీలో ఎదురౌతున్న పరిస్థితులే విష్ణుకి కూడా ఎదురౌతున్నాయి. కాబట్టి వైకాపాలోకి దూకేయాలన్న ఆలోచన బలంగా చేస్తున్నారని, జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

జగన్ పై మండిపడ్డ ఈటెల

    జగన్ స్వాతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్లాడా అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగిందని మండిపడ్డారు. జగన్‌కు బుద్ధి చెప్పే రోజులొస్తాయన్నారు. ప్రజలందరికీ అరచేతిలో బెల్లం పెట్టి నాకించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ పాలన గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజాం సుగర్స్ పైన విచారణ జరిపిస్తానన్న వైయస్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక నివేదికలను తొక్కిపెట్టారని ఆరోపించారు. వైయస్ 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత తెలంగాణను అడ్డుకున్నారన్నారు. జగన్ ఎంపీగా ఉంటూ తెలంగాణకు వ్యతిరకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నారని, వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్నారు.

డిజిపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

  హైదరాబాద్ లో డిజిపి కార్యాలయంముందు ఓ వ్యక్తి ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించాడు. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న తనని హత్య చేయించిన కార్పొరేటర్ రోజూ బెదిరిస్తున్నాడని, వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొంటూ ఆ వ్యక్తి ఓ సూయిసైడ్ నోట్ కూడా రాశాడు. ఆత్మహత్యా యత్నం గురించి మీడియాకి ముందుగా సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడి ప్రయత్నాన్ని అడ్డుకుని వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి పంపించారు. బాధితుడు చెబుతున్నది నిజమేనా, లేక మానసిక స్తితి సరిగ్గా లేక అలా ప్రవర్తించాడా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

వేదాంతం సత్యనారాయణ శర్మ కన్నుమూత

  ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు.. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ (78) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కూచిపూడిలో అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు ఈ అంత్యక్రియలకు హాజరై అశ్రునివాళి అర్పించారు. మచిలీపట్నం నుంచివచ్చిన ప్రత్యేక పోలీసుబృందం గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేసింది. సత్యనారాయణ శర్మకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఈనాటి ఈ బంధమేనాటిదో..!

    ఇద్దరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు.. కలసిఉంటే కలదు సుఖం.. విడిపోతే తీరని దుఃఖం అన్న సత్యాన్నికూడా తెలుసుకున్నారు. కాకపోతే ఇన్నాళ్లూ ఇగోలు అడ్డొచ్చాయ్.. నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటూ ఇద్దరమూ నష్టపోతున్నామన్న విషయాన్ని ఇద్దరూ తెలుసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ ఒక్కటైతే గట్టిగా నిలబడొచ్చన్న నిర్ణయానికొచ్చారు.   అయితే.. విభేదాల్ని పక్కనబెట్టి ఎవరు ముందుగా ఎవర్ని పలకరిస్తారన్నదే ఇక్కడ మీమాంస.. కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారు. పాత మిత్రుణ్ణి ఇంటికి పిలిచిమరీ పలకరించారు. కోదండరాముడుకూడా నరసింహావతారమెత్తిన కెసిఆర్ ని పరామర్శించారు. ఇద్దరూ మళ్లీ భాయీభాయీ అనుకుని కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.   ఢిల్లీ పెద్దల చేతుల్లో పార్టీని పెట్టేస్తానంటూ సాగిలపడ్డా లాభం లేని పరిస్థితిలో తిరిగొచ్చి ఎవరికీ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ పరిస్థితీ, నోరుజారీ కేసులో ఇరుక్కున్న కోదండరాముడి పరిస్థితీ ఒకేలా ఉన్నాయ్. కలహాల కాపురంతో నష్టపోయేకంటే కలిసి ఉండి లాభపడడం మేలనుకుని ఇద్దరూ మళ్లీ ఒక్కతాటిమీదికి చేరుతున్నారని టిఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయ్.

భగ్గుమన్న పాతబస్తీ

    పాతబస్తీలో మరోసారి ఆందోళనకర వాతావరణం నెలకొంది. శుక్రవారం చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ప్రార్ధనలు పూర్తయిన అనంతరం కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి పరిస్థతిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చార్మినార్ వద్ద ఆంక్షలు పెట్టడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి వీలుగా పోలీసులు 144 వ సెక్షన్‌ను విధించారు. శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలు జరుగనున్న సందర్భంగా పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యగా చార్‌మినార్ పక్కన గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మూసివేశారు. అయితే ప్రార్థనల అనంతరం ఒక వర్గానికి చెందిన యువకులు చార్‌మినార్ వైపు పరుగులు తీస్తూ రావడం మొదలుపెట్టగా వారిని అడ్డుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులపై వారు రాళ్లు విసరడంతో పరిస్థితిని అదుపుచేయడానికి చర్యలు తీసుకున్నట్టు పోలీసు చెప్పారు.

గీతారెడ్డిపై కామెంట్స్: కోదండ ఇంటివద్ద ఉద్రిక్తత

  తెలంగాణ జేఈసీ కోదండరాంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ విద్యార్థి సమాఖ్యలు ధ్వజమెత్తాయి. గీతారెడ్డిపై ఇటీవల కోదండరాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యంలో ఈ రెండు సంఘాల ప్రతినిధులు తార్నాకలోని కోదండరాం ఇంటిముందు ఆందోళనకు దిగాయి. గీతారెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని.. అది కూడా స్వయంగా ఆమెను కలిసి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.   ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొందరు నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.   గీతారెడ్డిపై కోదండరాం చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.

మతతత్వపార్టీ మజ్లిస్ : కాంగ్రెస్ ఎదురుదాడి

    యూపీయే సర్కారుకీ, రాష్ట్ర సర్కారుకీ రామ్ రామ్ చెప్పి వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపు అడుగులువేస్తున్న మజ్లిస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడిని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలమేరకు నేరుగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంఐఎంని కడిగిపారేసి 24 గంటలైనా గడవకముందే మంత్రి శైలజానాథ్ కూడా మజ్లిస్ పై నోరు చేసుకున్నారు.   కొత్తి మిత్రుల్ని వెతుక్కుని, చాలా కాలంగా ఉన్న పాతమిత్రులకు గుడ్ బై చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్న మజ్లిస్ వైనాన్ని జనం చూస్తున్నారంటూ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మజ్లిస్ పార్టీయే పెద్ద మతతత్వ పార్టీ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే షాజహాన్ విమర్శించారు.   మజ్లిస్ పార్టీలా ప్రాంతం, మతం పేరుతో రాజకీయాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని కిల్లి కృపారాణి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ శక్తులకు కొమ్ముకాస్తోందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.  

మజ్లిస్ కి గోనె ప్రకాష్ మద్దతు – కిషన్ రెడ్డి మండిపాటు

    కాంగ్రెస్ నేత, ఆర్టీసీ మాజీ ఎండి గోనె ప్రకాశరావ్ మజ్లిస్ పార్టీని వెనకేసుకొస్తున్నారు. ఇంతక్రితం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్దతుని కోరి కూడగట్టిన విషయాన్ని మర్చిపోకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   దివంగత ప్రథాని ఇందిరాగాంధీ సహా చాలామంది కాంగ్రెస్ నేతలు మజ్లిస్ మద్దతుని కోరి తెచ్చుకున్నవారేనని గోనె ప్రకాశరావ్ వ్యాఖ్యానించారు. కిందటి ఎన్నికల్లో మజ్లిస్ తో పొత్తు కారణంగానే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాంతాల్లో మైనారిటీల ఓట్లు దక్కాయన్నారు.   మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అటు మజ్లిస్ పైన ఇటు ఆ పార్టీని వెనకేసుకొస్తున్న గోనె ప్రకాశ్ రావ్ పైన మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ మరో వర్గం ముస్లిం ఓటర్లకు అస్సలు ప్రాపకం లేకుండా చేస్తోందంటూ విమర్శించారు. పాతబస్తీ రాజకీయాన్ని రాష్ట్రరాజకీయం చేయాలనుకోవడం మజ్లిస్ అవివేకమని మండిపడ్డారు.   భాగ్యలక్ష్మీ దేవాలయం విషయంలో ఒక్క బిజెపి మాత్రమే మజ్లిస్ పార్టీని నిలదీస్తోందని, మిగతా పార్టీలేవీ పట్టించుకోవడంలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఉపసంహరించుకున్న మరుక్షణమే రాజీనామా చేయాల్సిన హైదరాబాద్ మేయర్ ఇంకా ఎందుకు పదవిలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  

జైల్లో జగన్ రికార్డ్

      అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సగటున రోజుకు ఒకరి కంటే ఎక్కువ మంది కలిశారు. మే 28 వ తేదీని ఆయన జైలుకు వెళ్లిన మరుసటి రోజు నుంచి సెప్టెంబర్ 27 వరకు జరిగిన ములాఖత్ వివరాలు పోలీసులు వెల్లడించారు. మొత్తం 42 ములాకత్‌ల ద్వారా 134 మందితో మాట్లాడిన జగన్ ఇందులోనూ రికార్డు సృష్టించారు. రెండో స్థానం గాలి జనార్దన్ రెడ్డిది. ఆయన ఏడాదికి పైగా జైల్లో ఉన్నా కూడా నాలుగు నెలల్లో జగన్ సృష్టించిన రికార్డును అధిగమించలేకపోయారు!   జగన్ బయటి వారి కంటే కుటుంబ సభ్యులనే ఎక్కువగా కలిశారు. జగన్ తల్లి విజమయ్మ 19 సార్లు కలవగా, భార్య భారతి 36 సార్లు, సోదరి షర్మిల తొమ్మిదిసార్లు జగన్‌న జైల్లో కలిశారు. జగన్ బావ బ్రదర్ అనిల్‌ కుమార్ ఎనిమిది సార్లు కలిశారు. అయితే, ఆయన పేర్లు మార్చి కలవడంపైనే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ఆయన కలిశారు.

ఏటీఎం చోరులు దొరికారు

        నల్గొండలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో నిన్న పాతికలక్షలకుపైగా చోరీ జరిగింది. సీసీ కెమెరాల్ని పగలగొట్టాకే నిందితులు చోరీకి పాల్పడ్డారు. దొంగల్ని పట్టుకోవడం చాలా కష్టం.. మామూలుగానే మన పోలీసులు అదిగో అంటే ఆరు నెలలు..   కానీ.. ఈసారి మాత్రం అలా జరగలేదు. మెదడుకు పనికల్పించిన నల్గొండ పోలీసులు అనుమానితుల్ని పట్టుకుని ప్రశ్నించారు. ఇద్దరు మాజీ కేడీలు తడబడ్డారు. వాళ్లకి సరైన ట్రీట్ మెంట్ ఇచ్చేసరికి విషయం గటగటా కారింది..   మజీ నేరస్తులు ఇచ్చిన ఆధారాల ప్రకారం చోరశిఖామణుల్ని పట్టుకున్న నల్గొండ పోలీసులు.. వాళ్ల దగ్గర్నుంచి 10 లక్షల రూపాయల్ని రికవర్ చేశారు. మిగతావాళ్లు పట్టుబడితే మిగిలిన సొత్తు చేతికి చిక్కుతుంది. అప్పటిదాకా నేరస్తుల వివరాల్ని బైటపెట్టడం కుదరదని పోలీసులు చెబుతున్నారు.  

ఎంఐఎం నిర్ణయం హర్షణీయ౦: గాలి

  టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, టీడీపీ, బీజేపీ తమను తీవ్ర ఇబ్బందులు పెట్టాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనడాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు నాయుడులు స్పందించారు. రాష్ట్రంలో మత సామరస్యం కాపాడింది తమ పార్టీనేనని, టీడీపీ హయాంలోనే హైదరాబాద్ లో అస్సలు మతకల్లోలాలు లేవని వారు అన్నారు. మజ్లిస్ నేతలు కళాశాలలు పెట్టుకుంటే మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అని అన్నారు. మైనార్టీలకు రాష్ట్రవ్యాప్తంగా  షాధీఖానాలు, సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ హయాంలోనే చేపట్టారని అన్నారు. ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం హర్షణీయమని, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ముస్లింలను మోసం చేసే పార్టీలేనని వారు అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు ఉపసంహరణ వెనక ఉన్న ఉద్దేశ్యం నాలుగు రోజుల్లో బయటపడుతుందని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ వి. హనుమంతరావు అన్నారు. ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెసు అన్యాయం చేసిందని మజ్లీస్ నేత అసదుద్దీన్ అనడం సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు కూడా ఇవ్వని ప్రాధాన్యం మజ్లీస్‌కు ఇచ్చామని ఆయన చెప్పారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా ఈ విషయం చెప్తారని ఆయన అన్నారు.

చంద్రబాబు పాదయాత్రకు ఐటీ నిపుణుల సంఘీభావం

  రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు ముందుచూపే కారణమని తెదేపా సీనియర్ నేత యనమల్ రామకృష్ణుడు అన్నారు. చెంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఐటీ నిపుణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రంగారెడ్డి జిల్లా పరిగి వరకూ ర్యాలీ నిర్వహించారు. నాడు రైతు బిడ్డలుగా ఉన్నవారంతా సాఫ్ట్ వేర్ పరిశ్రమ ద్వారా ఉద్యోగాలు పొంది నేడు లక్షల్లో జీతాలు తీసుకొనే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు యాత్రకు మద్దతు తెలుపుతున్న ఐటీ నిపుణులంతా భవిష్యత్తులో చంద్రబాబు నాయకత్వం మళ్ళీ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. టిడిపి నేత పెద్దిరెడ్డి తో పాటు ఐటీ పరిశ్రమలకు చెందిన నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బ్రాహ్మణుల 'చలో వరంగల్'

  దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ రేగిన వివాదం రోజురోజుకూ పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఏకంగా చలో వరంగల్ పేరుతో భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. బ్రాహ్మణులను కించపరిచేలా నిర్మించే సినిమాలను నిషేధించాలంటూ వరంగల్‌లో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు బ్రాహ్మణ సం ఘాలు, బ్రాహ్మణులు భారీ సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వేముల జయశ్రీ, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య పిలుపునిచ్చారు. వినోదం పేరుతో బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా నిర్మించిన ‘దేనికైనా రెడీ’, ‘ఉమెన్ ఇన్ బ్రామ్మనిజం’ చిత్రాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. మోహన్‌బాబును, ఆయన కుమారుడు విష్ణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు మహాసభల కోసం ఆరు కమిటీలు

    అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబరు 27, 28, 29 తేదీలలో తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆరు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. మహాసభలకు అతిథుల ఆహ్వానం, వసతి ఏర్పాట్లు, బోజన సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, ఆరోగ్యం, పారిశుద్యం, భద్రత తదితర అంశాలకు సంబంధించి ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి వేరు వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు. సభలకు వచ్చే అతిథులకు స్వాగతం పలకడం దగ్గర నుండి వాలంటీర్లకు శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఆహ్వాన కమిటీ టీటీడీ కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన పనిచేస్తుంది. ప్రతినిధులకు వసతి కల్పించే బాధ్యతను పర్యవేక్షించే కమిటీకి చిత్తూరు జిల్లా కలెక్టర్ సారధ్యం వహిస్తారు. భోజన విభాగాన్ని పర్యవేక్షించే ఆహార కమిటీకి పౌరసరఫరాల విభాగం కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రవాణా కమిటీకి రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యం వహిస్తారు. ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీ వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రాయలసీమ ఐజీ ఆధ్వర్యంలో  భద్రతా కమిటీ ఏర్పాటయింది.

కేసీఆర్ పై మోత్కుపల్లి ఫైర్

  కేసీఆర్ పై మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎన్ని అవతారాలు ఎత్తిన ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వంద సీట్లు, 17 ఎంపీలు అంటూ కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలే కారణమని మోత్కుపల్లి ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వలస వచ్చారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని మోత్కుపల్లి ఆరోపించారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలుగుదేశం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కేసీఆర్ మాట్లాడాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ హెచ్చరించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై బ్లాక్‌మొయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.