50పెళ్లిళ్లు చేసుకున్న కేరళకుట్టి షహనాజ్‌

కేరళలోని తిరువనంతపురానికి చెందిన షహనాజ్ నిత్య పెళ్లి కూతురు అవతారమెత్తి మగాళ్ల నుండి లక్షల వరకు వసూలు చేసి ఆ తర్వాత వారికి తెలియకుండా వదిలి వెళుతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు యాభై వరకు పెళ్లిళ్లు చేసుకుని మగాళ్లను మోసం చేస్తున్న షహనాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిత్య పెళ్లి కూతురులా మారిన షహనాజ్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌లలో అనర్గళంగా మాట్లాడగలదట. అందుకే ఎక్కడకు వెళ్లినా అక్కడి వారిని వీజీగా బుట్టలో పడేస్తుందని భావిస్తున్నారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులే ఆమె టార్గెట్ అని పోలీసులు గుర్తించారు.

2జి కేసులో చిదంబరానికి ఊరట

 2జి స్కామ్ కేసులో చిదంబరానికి ఊరట దొరికింది. ఆర్థిక మంత్రిగా తన హోదాను చిదంబరం దుర్వినియోగం చేశారంటూ జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదు ఆధారాలు లేవుకనుక చిదంబరాన్ని తప్పుపట్టలేమని సుప్రీం వ్యాఖ్యానించింది. దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని సుబ్రమణ్యస్వామి చెబుతున్నారు. మొదటి పిటిషన్ లో చిదంబరం హోదాని దుర్వినియోగం చేశారని ఆరోపించిన సుబ్రమణ్యస్వామి ఇప్పుడు తన వాదనను కాస్తంత  మార్చబోతున్నారు. 2జి స్కామ్ వల్ల దేశానికి చాలా నష్టం కలిగిందని, ఆర్థికమంత్రిగా చిదంబరం దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుని ఉండాల్సిందని చెప్పబోతున్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారంపైకూడా ఢిల్లీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. 

మంత్రి పార్థసారధికి చుక్కెదురు

మంత్రి పార్థసారధికి చెందినా కెపిఆర్ టెలీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ ఫేరా నిబంధనలను ఉల్లంఘించారని ఎక్సైజ్ మరియు సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథిపై ఆర్ధిక నేరాల సెషన్స్ కోర్టు విధించిన శిక్ష విదితమే. బుధవారం పార్థసారథి తనకు శిక్ష విధిస్తూ ఆర్ధిక నేరాల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి పార్థసారథి తరపున లాయర్ పద్మనాభరెడ్డి వాదిస్తూ 1994లో ఫేరా నిబంధనలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. కానీ కెపిఆర్ సంస్థ విదేశీ మిషనరీ కోసం రూ.69 లక్షలు చెల్లించిన పిదప మిగిలిన సొమ్మును చెల్లించలేక విదేశాలనుంచి మిషనరీ దిగుమతి చేసుకోలేదని కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో పార్థసారధి ఎటువంటి అవినీతికి గానీ, దురేద్దేశ పూర్వకంగా గానీ ఎటువంటి మోసాలకు పాల్పడలేదని కావున పార్థసారథికి విధించిన శిక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈడీ తరపున న్యాయవాది పార్థసారథి రాజకీయ జీవితంపై ఈ కేసు ప్రభావం చూపుతుందనే కారణంతో కేసును కొట్టేయ కూడదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీకి కిరణ్ కుమార్ రెడ్డి

సిబీఐ చార్జిషీటులో ఎ5 ముద్దాయిగా ధర్మాన ప్రసాద రావు ను చేర్చడంతో మనస్తాపం చెందిన ధర్మాన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని మిగతా మాత్రులు ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని కిరణ్ పై ఒత్తిడి చేస్తున్నారు. మరొక ప్రక్క ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని తప్పు పడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి ధర్మాన రాజీనామా విషయంతో పాటు మిగతా మంత్రులపై సిబీఐ విచారణ తీరుతెన్నులను, అలాగే రాష్ట్రంలోని కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టడానికి వెళ్ళినట్లు సమాచారం.

యర్రబెల్లికి సిఎం ఫోన్

రాష్ట్రంలో కరెంట్ కోట్లపై టిడిపి ఎమ్మెల్యేలు చేస్తున్న నిరసనదీక్షను భగ్నం చేసిన పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను బలవంతంగా వారి వారి ఇళ్ళవద్ద విడిచిపెట్టారు. నేడు టిడిపి ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి బయలుదేరారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను గేటు దాటి బయటకు రానివ్వకుండా కట్టడి చేయడంతో వారు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే బయతాయించి నిరసనలను తెలుపుతున్నారు. సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద  టిడిపి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, రత్నం లను పోలీసులు అరెస్ట్ చేసారు. క్యాంప్ ఆఫీస్ నుండి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ కు ఫోన్ చేసి నిరసనలను నిలపాలని కోరారు. ఎర్రబెల్లి సిఎం కిరణ్ కు టిడిపి యొక్క డిమాండ్ లను తెలిపినట్లు సమాచారం.

వరద గోదావరితో లంక గ్రామాలకు ముప్పు

మొన్నటిదాకా ఇసుక దిబ్బలతో కనిపించిన గోదావరి ఇప్పుడు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. బుధవారం ఉదయం కాటన్ బ్యారేజీ వద్ద 10.7 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 12.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తివేసి 11, 21, 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. అలాగే జిలా యంత్రాంగం అధికారులను, నదీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేసింది, దేవీపట్నం మండలంలోని కొండమొదలు ప్రాంతాలలోని 33 గ్రామాలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. రాజమండ్రి సమీపంలోని లంక గ్రామాలోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కోనసీమ పరిథిలోని 24 లంక గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగం కలక్టరేట్, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లకు ప్రారంభించింది.  

స్తంభించిన బ్యాంకింగ్ సేవలు

 దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఎటీఎంలు మాత్రం పనిచేయడంతో వినియోగదారులకు కాస్తంత ఊరట కలిగింది. కానీ గురువారంకూడా సమ్మె కొనసాగుతుంది కనుక ఏటీఎంలలో డబ్బు అయిపోతే పరిస్థితి మరింత గడ్డుగా తయారవుతుంది. ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో 5 యూనియన్లు, ప్రభుత్వ బ్యాంకుల అధికారులకు చెందిన నాలుగు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఎస్బీఐ, ఐడీబీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు 12 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 8 విదేశీ బ్యాంకులకు సంబంధించిన  అధికార్లంతా సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్రం నియమించిన ఖండేల్వాల్ కమిటీ మానవవనరుల విధానాలపై చేసిన సిఫార్సుల్ని యూఎఫ్ బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో  యూనియన్లు సమ్మెకు దిగాయి. సమ్మెకారణంగా నగదు బదిలీలు, చెక్కుల క్లియరెన్స్ లు, విదేశీ మారక సేవలు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగింది. ఖాతాదారులు నానా కష్టాలూ పడ్డారు. ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎమ్ లలో నగదును ఉంచడానికి ఎస్బీఐ ప్రైవేట్ సంస్థ సేవల్ని వినియోగించుకుంది.

విద్యుత్‌సౌధ ముట్టడి: ఎర్రబెల్లి, తలసాని అరెస్ట్

రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా టీడీపీ, వామపక్ష నేతలు బుధవారం ఉదయం విద్యుత్‌సౌధ ముట్టడికి యత్నించారు. ప్రజల కష్టాలను ఆలోచించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని వారు ఆరోపించారు. పోలీసులు ఆందోళన చేస్తున్ననేతలు ఎర్రబెల్లి, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం సహా పలువురిని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎర్రబెల్లి పోలీసు స్టేషన్‌లోనే తన ఆందోళనను కొనసాగిస్తున్నారు. సికింద్రాబాదులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.