కేసీఆర్-జగన్ మధ్య దూరం.! ఉమ్మడి ప్రాజెక్టుపై వెనకడుగు?

కేసీఆర్, జగన్ మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. ఇటీవల తన సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డిపై కేసీఆర్ నెగటివ్ కామెంట్స్ చేశారనే టాక్ బయటికొచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేలకోట్లు సంపాదించారని, అందుకే సీబీఐ కేసులు పెట్టిందని అన్నారట. అయితే, చంద్రబాబు పేరు ఎత్తితే చాలు అంతెత్తున లేస్తూ మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్.... తన సన్నిహితులతో ముందు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఆంధ్రోళ్లు చాలా స్వార్ధపరులని, అవకాశవాదులని... లేకపోతే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడిన చంద్రబాబును ఘోరంగా ఓడించడమేంటి? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదించి జైలుకెళ్లొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమేంటంటూ అన్నారట. ఇటీవల తనను కలిసిన ఏపీ విపక్ష నేతలతోనూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని జనం వ్యతిరేకంగా ఓటేశారని.... జగన్మోహన్ రెడ్డి ఏమైనా నిజాయితీగా సంపాదించారా? అంటూ అన్నారట. అయినా, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే అవినీతి జరిగిందా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారట. అమరావతిలో అంతర్జాతీయస్థాయి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు ఆశపడ్డారని, కానీ జగన్మోహన్ రెడ్డేమో.... రాజధానినే మార్చేస్తున్నాడని తనను కలిసిన ఏపీ విపక్ష నేతలతో అన్నారట. కేసీఆర్ కామెంట్స్ ను పక్కనబెడితే, రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల తెరపైకి వచ్చిన గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కి తరలించడం ద్వారా... ఏపీలో రాయలసీమకు.... తెలంగాణలో మారుమూల ప్రాంతాలను నీళ్లు అందించాలని కేసీఆర్, జగన్ భావించారు. ఈ ప్రాజెక్టును ఇరురాష్ట్రాలకు కలిసి చేపట్టాలని నిర్ణయించారు. అనుమతితోపాటు నిధులు కూడా కావాలంటూ ఇరువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కూడా కోరారు. కానీ, ఈ ప్రాజెక్టుపై కేసీఆర్, జగన్ మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఎవరికి వాళ్లు... తమతమ భూభాగాల్లోనే ప్రాజెక్టును నిర్మించడానికి మొగ్గుచూపుతున్నట్లు  తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై మనసు మార్చుకోవడంపై ఇరువురి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

10 ఆవులు... 7 లేగ దూడలు... ఇవే ముఖ్యమంత్రి ఆస్తి...

2010 నుంచి ఏటా తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తోన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... 2019 సంవత్సరాంతంలో తన ఆస్తుల వివరాలను మీడియా ముందు పెట్టారు. 2018లో పోల్చితే... 2019లో ఒక్క రూపాయి కూడా పెరగలేదని ప్రకటించారు. తన ఆస్తిలో ఎలాంటి వృద్ధి జరగలేదని సీఎం నితీష్ వెల్లడించారు. 2018లో నితీష్ కుమార్ దగ్గర 42వేల నగదు ఉండగా... 2019 సంవత్సరాంతానికి దాదాపు నాలుగు వేలు తగ్గి 38వేల 39 రూపాయలున్నట్లు తెలిపారు. ఇక చరాస్తులు 16వేలు ఉండగా, స్థిరాస్తులు 40లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. అయితే, నితీష్ కుమారుడు పేరిట కోటీ 39 లక్షలు ఉండగా... స్థిరాస్తులు మాత్రం కోటీ 48లక్షలుగా తెలిపారు. అయితే, నితీష్ కుమార్ ఆస్తి ఒక్క రూపాయి కూడా పెరగకపోయినా, ఆయన పాడి సంపదలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. నితీష్ పాడి సంపదలోకి కొత్తగా రెండు ఆవులు, ఒక లేగ దూడ చేరింది. ఏడాది క్రితం అంటే 2018 చివరి వరకు 8 ఆవులు మాత్రమే ఉండగా, 2018 ఎండింగ్ కి మరో రెండు ఆవులు జత కలిశాయి. అలాగే, గతంలో ఆరు లేగ దూడలు ఉండగా... ఇప్పుడు మరో బుల్లి లేగ వచ్చింది చేరింది. అయితే, నితీష్ కుమార్ తరహాలోనే 2011 నుంచి చంద్రబాబు కూడా తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక, నితీష్ కుమార్ ఆస్తులు పెరగకపోయినా, బీహార్ మంత్రుల ఆదాయంలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. ఒకరిద్దరు మినహా అందరూ మంత్రుల ఆస్తులూ కోట్లల్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాదే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండ్ మంత్రుల ఆస్తుల ప్రకటన ప్రజలపై ఎంతోకొంత ఇంపాక్ట్ చూపించే అవకాశముంది. ప్రస్తుతం మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్.... నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

నన్ను చూస్తే వైఎస్ భయపడేవారు... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను చూస్తే భయపడేవారని, గౌరవించేవారని పాత రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తానొస్తున్నప్పుడు లేచి నిలబడుతుంటే.... రాజశేఖర్ రెడ్డీ తప్పు చేస్తున్నావ్ జాగ్రత్త అంటే... గమ్మున కూర్చునేవారని అన్నారు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని మండిపడ్డారు. తనను చూసి జగన్ వెకిలి నవ్వులు నవ్వుతున్నారని అన్నారు. అలాగే, జగన్ పక్కనుండే వాళ్లంతా ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల చేష్టలను చూస్తుంటే అసహ్యమేస్తోందని... కానీ, ఇవన్నీ ప్రజల కోసమే భరిస్తున్నానంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఆనాడు అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఒప్పుకుని ఇఫ్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. మాట తప్పను మడమయ తిప్పను అంటే ఇదేనా అన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుందనే అమరావతిని ఎంపిక చేశామని... కానీ, ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేసేందుకు చూశామని, అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. అమరావతి రైతులు కారుణ్య మరణాలు కావాలని అడిగారంటే అసలు ఈ సీఎంకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఇదే విధంగా పోరాడి ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పారిపోవడం ఖాయమన్నారు.  అమరావతి జోలికొస్తే ఎవరైనాసరే కాలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ ప్రజల ఆస్తులను కొట్టేయడానికే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్నారని బాబు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ అభివృద్ధే ఆగిపోయిందన్న చంద్రబాబు.... ఇక, రాజధానిని అక్కడికి తరలిస్తే... ఇంకెన్ని దారుణాలు జరుగుతాయోనని అన్నారు. అమరావతి రైతుల తరపున పోరాడతానన్న చంద్రబాబు.... అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనన్నారు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి... అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలను పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనతోనే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని బాబు మండిపడ్డారు. ఒక్కసారి సీఎం కావాలన్న జగన్ కోరిక తీరిందని, రెండోసారి ముఖ్యమంత్రి కాడని అన్నారు.

ముఖ్యమంత్రి పదవిపై కేటీఆర్ ఏమన్నారంటే...

త్వరలోనే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగనుందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఈ ఏడాది తాను ముఖ్యమంత్రి అవుతానంటూ జరుగుతోన్న చర్చ అర్ధంలేనిదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో పదేళ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందన్నారు. 2030వరకు టీఆర్ఎస్ ను ఎవరూ కదిలించలేరని ధీమా వ్యక్తంచేశారు. 2019 తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందన్న కేటీఆర్... 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి శుభారంభం చేస్తామని అన్నారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలపై ఎలా వ్యవహరించాలో... తమ విధానమేంటో... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక, ఏపీ సహా పొరుగు రాష్ట్రాలన్నింటితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. అయితే, ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని, ఇందులోనూ రాజకీయాలు చేయాలనుకుంటే అది దేశానికి మంచిది కాదన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల కల సాకారం కావాలంటే రాష్ట్రాలను మరింత ప్రోత్సహించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక, ఇప్పటికీ కాంగ్రెస్సే తమకు ప్రధాన ప్రత్యర్ధి అంటూ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, ఆ పార్టీని తక్కువ అంచనా వేయబోమన్నారు. ఇక, తెలంగాణలో బీజేపీ తన చిన్నప్పుడు ఎలాగుందో... ఇప్పుడూ అలాగే ఉందంటూ కాషాయ బలాన్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇక, ఎంఐఎంతో స్నేహసంబంధాలు ఉంటాయే తప్ప.... ఎన్నికల్లో పొత్తు మాత్రం ఉండదన్నారు. అంతేకాదు రాజకీయాల్లో తమకు శత్రువులు ఎవరూ లేరని.... కేవలం ప్రత్యర్ధులు మాత్రమే ఉన్నారని అన్నారు.  

మొదటిసారి చూస్తున్నా... భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

రాజధానిని తరలించొద్దంటూ అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల రైతులు, ప్రజల నిరసన దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతమంది మహిళలు రోడ్డెక్కి పోరాటం చేయడం తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానన్నారు. ఇది చాలా గొప్ప విషయమని... మీరు అనుకున్నది సాధించి తీరుతారని అన్నారు. దేశానికే ఆదర్శంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు తపన పడ్డారని భువనేశ్వరి గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం రాజధానిని తరలించాలని చూస్తోందని మండిపడ్డారు. అమరాతి ప్రజలకు తాము అండగా ఉంటామన్న నారా భువనేశ్వరి.... అవసరమైతే తమ జీవితాలను సైతం అడ్డుపెట్టి పోరాడతామన్నారు. ఇక, అమరావతి రైతులు, మహిళలు, ప్రజల పోరాటానికి విరాళంగా తన చేతి బంగారు గాజులను తీసి ఇచ్చారు. రాజధాని మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా తాను అర్ధం చేసుకోగలనని అన్నారు. అయితే, భువనేశ్వరి విరాళంగా ఇచ్చిన బంగారు గాజులను బహిరంగ వేలం వేసి వచ్చిన డబ్బును అమరావతి ఉద్యమానికి వినియోగించాలని చంద్రబాబు సూచించారు.

బీసీజీ, జీఎన్ రావు రిపోర్ట్ ల పై హైకోర్ట్ ఆదేశాలు: విచారణ 23కి వాయిదా.......

ఏపీ రాజధాని వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు త్వరలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇవ్వనున్న నిపేదికను తమ ముందుంచాలని రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో పూర్తి వివరాలతో వచ్చే జనవరి 21లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హై కోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించేలా ఆదేశించాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 585 ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోసం తాజాగా మరో రెండు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనల్లో వినిపించారు. జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదికలు దాఖలు చేసిందని దానిపై గత 27న మంత్రివర్గం చర్చించిందని తెలిపారు. త్వరలో బీసీజీ కమిటీ కూడా నివేదిక ఇవ్వనుందన్నారు. ఈ రెండు కమిటీల నివేదికను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అందువల్ల అనుబంధ పిటిషన్ల పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని వివరించారు. అయితే సీఆర్డీఏ చట్టం రైతుల హక్కులను పరిరక్షిస్తూందని పిటిషనర్ తరపు న్యాయ వాది తెలిపారు.సీఆర్డీఏను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని కానీ ఎలాంటి చట్టబద్ధత లేదని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ రాజధాని అభివృద్ధి పనుల పై ఎలా పునః సమీక్ష జరుపుతోందని ప్రశ్నించినట్లు సమాచారం. జీఎన్ రావు కమిటీ నివేదిక అమలైతే రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. బీసీజీ ఏర్పాటును ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని దానికి సంబంధించిన జీవో గురించి కూడా ఎవరికీ తెలియదని తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిర్దేశిత కాలం లోపు రైతుల భూముల్ని అభివృద్ధి చేసి ఇస్తామని సీఆర్డీఏ చట్టంలో లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అధికారిక నిర్ణయం వెలువడక ముందే దాఖలైన పిటిషన్లు అపరిపక్వమైన ఉన్న కోర్టు తాము ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తాము పిటిషనర్ వాదనతో విభేదించటం లేదని అలాగే ప్రభుత్వానికి మద్దతుగా వెళ్లడం లేదని స్పష్టం చేసింది.బీసీజీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు,అందుకు సంభందించిన వివరాలను కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేయాలని ఆదేశించింది. అదే విధంగా రెండు కమిటీల నివేదికలను వచ్చే జనవరి 21వ తేదీలోపు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖల్యు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.జీఎన్ రావు కమిటీ సిఫార్సులు సబబేనని రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్ లో తమను ప్రతివాదులుగా చేర్చుకోవాలని అభ్యర్థిస్తూ కడప కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొంత మంది వ్యక్తులు హై కోర్టు లో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. రావు కమిటీ సిఫార్సుల అమలైతే తమ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు. మొత్తం మీద రాజధాని మార్పు అంశం ఒక చోట తీరని అన్యాయం చేస్తే మరోచోట మేలు చేయబోతోందా అనే విషయం వేచి చూడాలి.

ఉమ్మడి వరంగల్ లో మొదలైన పార్టీ నేతల హడావిడి: మున్సిపల్ ఎన్నికల మేళా......

మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ అంతా నేతల సందడి మొదలైయ్యింది.ఎన్నికల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.  జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి సమీకరణాల చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రచారం, పోలింగ్ కు సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అన్నింటికీ గెలుపు అగ్నిపరీక్షలా మారింది. దీంతో ముందస్తు వ్యూహాలను రచిస్తున్నారు.ఇందులో అధికార పార్టీ ఒక్క అడుగూ ముందు వరుసలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారైన మరుసటి రోజునే టీఆర్ఎస్ నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా పట్టణాలలో అంతర్గత సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఎన్నిక లకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్య నాయకులు సైతం జిల్లాలోని ఆయా మున్సిపాల్టీలకు చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొని ఉండటంతో ఈ రెండు పార్టీల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. బిజెపి వామపక్షాలు కూడా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అంటున్నాయి.కానీ వార్డుల రిజర్వేషన్ మున్సిపల్ ఛైర్మన్ ల రిజర్వేషన్ లు ఇంకా ఖరారు కాకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. వార్డుల్లో తమకు రిజర్వేషన్ కలిసి వస్తుందా లేదా అన్న డైలమాలో నేతలు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు తీసుకెళ్తాయని టీఆర్ఎస్ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలే తమను గెలిపిస్తాయి అని విపక్షాలు ధీమాగా చెబుతున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఎన్నికల రణరంగానికి పార్టీలూ సిద్ధమవుతున్నాయి. పోరు పోరులో సత్తా చాటాలని అందరూ అంచనాలు వేస్తున్నారు. మరి ఎవరి అంచనాలు నెగ్గుతాయి తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

2019 ఇస్రో రిపోర్ట్... ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న భారత్...

శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా 2019 ఒక మైలురాయిగా నిలిచింది. చంద్రయాన్ 2 మొదలుకొని క్షిపణి సంబంధిత పరీక్షల దాకా ఎన్నో ముఖ్య సంఘటనలు ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్నాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పాక్షికంగా విజయం సాధించింది. రోవర్ చంద్రునిపై సరిగా ల్యాండ్ కాలేకపోయింది. కానీ, అతి తక్కువ ఖర్చుతో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రపంచ దృష్టికి ఆకర్షించింది. అలాగే, అగ్రరాజ్యాల తనవైపు తిప్పుకుని ఆలోచించజేసింది.  ఇక తాజాగా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ పనులను కూడా ఇస్రో ప్రారంభించింది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కు వీరు ముత్తవేల్ సారథ్యం వహించనున్నారు. ఉపరితలం నుండి అంతరిక్షానికి సత్వరమే ప్రయోగించగల రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. తాజాగా బ్రహ్మోస్ ను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఇక, పీఎస్-ఎల్వీ సిరీస్ లో మూడు రాకెట్లను... జీఎస్-ఎల్వీ సిరీస్ లో మరో రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

షేక్ పేట్ లో పేలిన పెట్రోల్ బంక్.. భయాందోళనలో స్థానికులు 

హైదరాబాద్ షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కారులో పెట్రోల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు బంక్ మొత్తం వ్యాపించగా, దీంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ కారులో ఉన్న ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయారు. పెట్రోల్ పోస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెట్రోల్ నాజిల్ లో ఉన్న పెట్రోల్ కూడా అక్కడున్న పెట్రోల్ బంకుకు వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసారు. అగ్రిమాపక శాఖ మంటలన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది పెట్రోల్ బంక్ కావడం.. పెట్రోలు భారీగా నిల్వ ఉండడంతో ఒక్క సారిగా మంటలు  ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలు పక్కన ఉన్న వేరే నాజీల్ తో వ్యాపించకుండా పెట్రోల్ బంక్ యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆ మంటలు అదుపు లోకి రాకపోతే.. అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కింద ఉన్న ట్యాంకుల్లో భారీగా పెట్రోల్ స్తోరేజ్ ఉంటుంది. ఒకవేళ ఆ స్తోరేజ్ కి మంటలు వ్యాపిస్తే ఒక్కొక్కసారి బ్లాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించి ఉండటంతో పక్కనే నిర్మాణాలు, బిల్డింగులు కూడా ఉండటం తో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు అదుపులోకి వస్తేనే ప్రమాదం నుంచి బయట పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం.    

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్ధులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా.. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీ ఢీకొనడంతో ఆటో మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఇంటి నుంచి ఆడుతూ పాడుతూ బయలుదేరిన విద్యార్థులను లారీ రూపంలో మృత్యువు కబళించడంతో విషాదం చోటుచేసుకుంది. ఒక విద్యార్థికి తల భాగం బాగా దెబ్బ తినడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.  ప్రమాదంకి గురైన వారు హబ్సిగూడలో ఉన్న భాష్యం స్కూల్ కి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో మొత్తం ఏడుగురు ముందు విద్యార్థులన్నారు.బ్యాంక్ కాలనీ నుండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 వెళ్తున క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా లారీ సిగ్నల్ పడిన తరువాత దానిని గమనించకుండా, ఆటోను ఢీ కొట్టిన కారణాంగానే ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం లారీ డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తొంది. సిగ్నల్ పడిన తర్వాత దాదాపు 20 మీటర్ల దూరం లారీ ముందుకు రావడంతో ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న అవంతి కుమార్ స్పాట్ లోనే చనిపోగా..తీవ్ర గాయాలతో ఉన్న వారందరిని ఉప్పల్ లో ఆదిత్య ఆసుపత్రి అలాగే మాట్రిక్స్ ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా మొత్తం లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.  

2019 పార్లమెంట్ రిపోర్ట్... సంచలన చట్టాలకు ఆమోదం...

పలు కీలక చట్టాలను ప్రవేశపెట్టడానికి 2019 వేదికగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం మొదలుకొని పౌరసత్వ సవరణ చట్టం దాకా ఎన్నో చట్టాలు వీటిలో ఉన్నాయి. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు జనవరి 9న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పది శాతం కోటాని ఫిబ్రవరి నుంచే అమలు చేయడం ప్రారంభించారు. పలు విద్యాసంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.  జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గా విభజించారు. కంపెనీల చట్టం 2013ని సవరిస్తూ  కంపెనీస్ బిల్ 2019ని పార్లమెంట్ ఆమోదించింది. దివాళా, అపరిష్కృత కోడ్‌ - ఐబీసీ రెండవ సవరణ బిల్లు-2019ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జులైలో మొదటి సవరణ జరిగింది. వేతనాల కోడ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార హక్కు సవరణ బిల్లును జులై 19న లోక్ సభలో ప్రవేశపెట్టారు. చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. మోటార్ వాహనాల సవరణ బిల్లు కింద జరిమానాలను భారీగా పెంచారు. మానవ హక్కుల రక్షణ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. మధ్యవర్తిత్వం, సెంట్రల్ యూనివర్సిటీలు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాంటి మరెన్నో బిల్లులను కూడా పార్లమెంట్ ఆమోదించింది.  తాజాగా పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. 2019లో పార్లమెంట్ లో 59 బిల్లులను ప్రవేశపెట్టారు. మొత్తం మీద 47 బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. మొత్తానికి 2019 సంవత్సరం పార్లమెంట్ పలు కీలక చట్టాల ఆమోదానికి వేదికైంది.  

రైతులకు అండగా జనసేనాని

అమరావతి రైతులకు అన్యాయం చేసి ఒక్క అడుగు ముందుకేసినా చూస్తూ ఊరుకునేదిలేదని  మండిమడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు భరోసా కల్పించకుండా.. అమరావతి రైతులకు భరోసా కల్పించకుండా.. వారికి అండగా నిలబడకుండా.. మీకు మీరే చర్యలు తీసుకుని  ముందుకెళ్తే పరిణామాలు చాలా బాధ కలిగించే స్థితికి దారి తీస్తాయని పవన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి కదిలిస్తున్న విషయం మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసే అంశంగా మారిందన్నారు. మనల్ని మభ్య పెట్టి, భయపెట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్లాన్ తప్ప మరొకటికాదని ఆయన తెలియజేశారు. హైకోర్ట్ అమరావతి నుంచి కదిలించాలంటే సుప్రీం కోర్టు చెప్పాలి.. కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి.. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మోసం చేస్తొందని ఆయన మండిపడ్డారు. జీఎన్ రావు కమిటీ వాళ్లు చెప్పింది లిజిస్లేటివ్ అసెంబ్లీ విజయనగరంలో పెట్టాలని అన్నారు కానీ భీమిలిలో పెట్టాలని చెప్పలేదన్నారు. ఈ విషయం పై కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని జనసేన అధినేత తెలియజేశారు. రైతుల భూములు కోసం 40 సంవత్సరాలుగా గుమ్మం లోపలి నుంచి బయటికి రాని ఆడపడుచులు ఈ రోజు రోడ్ల మీద వస్తున్నారంటే అన్యాయాన్ని తట్టుకోలేక తప్పక మరే రాజకీయం చెయ్యడానికి కాదన్నారు. రోడ్లపైకి వచ్చిన ఇలాంటి ఆడపడుచులను..వారి కష్టాలను వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులు అనే పదజాలంతో మాట్లాడటం క్షమించలేనిదని అన్నారు. మనుషుల్ని పశువులుగా వర్ణిస్తున్న తీరు తనకెంతో బాధనిచ్చిందన్నారు. స్పష్టత లేకుండా గనుక వైసిపి ఇలాగే ముందుకెళ్తే చాలా ప్రమాదముందన్నారు. రాజధాని ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని..రైతులు తమ సాగు భూములను ప్రజలు గురించి..రాష్ట్ర భవిష్యత్తు గురుంచి ఆలోచించి భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. కావున అమరావతి ప్రజల భవిష్యత్తును కాపాడటం జనసేన ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలబడతామని అక్కడి ప్రజలకు మాటిచ్చారు జనసేనా అధినేత.  ప్రజలు భూములిచ్చింది ప్రభుత్వానికి కనుక వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ప్రభుత్వం మోసం చేస్తే నిలదీసే హక్కు.. ధర్నాలు చేసే హక్కు కూడా ప్రజలకు ఉందని అడ్డుకోకుండా మానవత దృష్టిగల చూడండి అంటూ పోలీస్ శాఖకు విన్నవించారు. ప్రజలపై, రైతులపై, రైతుకూలీలపై దయచేసి క్రిమినల్ కేసులు పెట్టవద్దని ఆయన విన్నవించారు. ఎప్పటికి 151 సీట్లు శాశ్వతం కాదని..అవి ఏ రోజైనా కూలిపోవచ్చని రైతు కన్నీరు పెట్టిన.. వారిని కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు ఇంత వరకు నిలబడ్డ దాఖలాలు లేవని ఆయన తెలియజేస్తూ ఎల్లప్పుడు జనసేన రైతులకు తోడుగా ఉంటుందని తెలియజేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ నేతల అసంతృప్తి!!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుల్లో పలువురు సీనియర్లు కాలక్రమేణా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు గులాబిదళంలో గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన నాయకులు నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో అధినాయకత్వం అందరికీ న్యాయం చేయకపోవడం ఆ పార్టీ రెండో సారి అధికారంలోకొచ్చి ఏడాది అయినప్పటికీ అతీగతి లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అనేక మంది కీలక పదవుల్లో ఉంటూ హవా కొనసాగిస్తుండటంతో పలు నియోజక వర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రస్తుతం అందరూ కలిసి ఉన్నట్లే కనిపిస్తున్న అసంతృప్త జ్వాలలు మాత్రం లోలోపల రగులుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న హవా కనిపిస్తుంది. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలంలోనే ఇక్కడ టిఆర్ఎస్ బలోపేతానికి పలువురు నాయకులు చమటోడ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర కూడా పోషించారు. అయితే ఆ సమయంలో జోగు రామన్న గులాబీ కండువా కప్పుకోవడం వరుసగా ఎన్నికల్లో గెలవడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లోక భూమారెడ్డికి డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి దక్కింది. ఆ తరవాత జోగు రామన్న తన సన్నిహితులైన వారికే పలు పదవులు వచ్చేలా చక్రం తిప్పారు. కానీ ఇప్పటికీ చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు ఆయా పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.  అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతి నిధ్యం వహిస్తున్న నిర్మల్ శాసన సభ నియోజకవర్గం లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొనడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన కొత్తలో నిర్మల్లో గులాబీ కండువా కప్పుకునేందుకు చాలామంది వెనుకాడరు. పూజాడి శ్రీహరిరావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసారు. కొన్నాళ్లు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2009,2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణ వాదం బలంగానే ఉన్న స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో శ్రీహరిరావు పై బిఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గులాబీ గూటికి చేరారు. ఇంద్రకరణ్ కారు పార్టీలో చేరడం ఆ వెంటనే ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కూడా దక్కడంతో నిర్మల్లో పరిస్థితి పూర్తిగా మారింది. ఇంద్రకరణ్ రెడ్డి ప్రాబల్యం పెరిగింది. నామినేటెడ్, పార్టీ పదవులు, కాంట్రాక్టులు, ఇతర అన్ని లావాదేవీల్లోనూ మంత్రి చెప్పిందే వేదంగా కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని శ్రీహరిరావు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇక ఇదే నియోజకవర్గంలో మరో సీనియర్ నేత సత్యనారాయణగౌడ్ ఉన్నారు. ఈయన భార్య శోభారాణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నారు.  మరోవైపు ముథోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లోని కొందరు సీనియర్లు తమను పార్టీ అధిష్టానం ఎప్పుడు కరుణిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.  ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ బలోపేతం కోసం అనేక మంది నేతలు కష్టనష్టాలకోర్చి పనిచేసారు. టిడిపి ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ లో చేరారు. 2014 లో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది, అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ రెడ్డి విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో వేణుగోపాలాచారి మరుగునపడ్డాయి. గులాబీ బాస్ కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో క్యాబినెట్ హోదాతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారు. పోయిన ఎన్నికల్లోనూ విఠల్ రెడ్డికే పార్టీ టికెట్ ఇచ్చింది. భారీ మెజార్టీతో గెలుపొందడం ద్వారా విఠల్ రెడ్డి తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తన స్థాయికి తగ్గ పదవి దక్కకబోతుందా అని వేణుగోపాలాచారి ఆశగా ఎదురు చూస్తున్నారు.  కీలకమైన మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివాకర్ రావు గెలుపునకు దోహదపడ్డ మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి నామినేటెడ్ పోస్టు రేసులో ఉన్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధిష్టానంతో వచ్చిన అభిప్రాయ భేదాలతో 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు, రాజకీయంగా నష్ట పోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దివాకరరావు గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. దీంతో ఒకనొక దశలో ఓటమి తప్పదనుకున్న టీఆర్ఎస్ ఎట్టకేలకు గెలిచింది. ఈ క్రమంలో అరవింద్ రెడ్డికి తగిన గుర్తింపు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి పదవి ఇస్తారనదే ప్రశ్నగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ నగేష్, టీఆర్ఎస్ పార్టీ మరో సీనియర్ నేత అరిగెల నాగేశ్వర్ రావులు కూడా నామినేటెడ్ పదవులో ఆశిస్తున్నారు. టిడిపిలో కీలక నేతలుగా పని చేసిన వీరిరువురూ గతంలో పలు పదవులను నిర్వహించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ప్రజా ప్రతినిధులుగా గెలుపొందారు. పార్లమెంట్ ఫలితాల్లో నగేష్ ఓటమిని చవిచూడక నాగేశ్వరావు స్థానిక సంస్థల ప్రతినిధిగానే కొనసాగుతున్నారు. ఇప్పటికైనా తమ స్థాయిని అధిష్ఠానం గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.  వీరేగాక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జెండా మోసిన అనేక మంది తమను అధిష్టానం గుర్తించాలని కోరుతున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి పదవులతో పాటు మార్కెట్ కమిటీలను ఎమ్మెల్యేల కనుసన్నలలోనే భర్తీ చేస్తుండడంతో ముందు నుంచి పని చేసిన తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పదవుల పందేరంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

2019 బ్యాంకింగ్ రిపోర్ట్... ఇందిర తర్వాత మోడీనే...

2019 ఇక కాలగర్భంలోకి వెళ్తోంది...2020 రాబోతుంది. 2019లో దేశంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్, పార్లమెంట్, ఉగ్రవాదం, ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పులు కీలక అంశాలుగా నిలిచాయి. ఒక్కో ముఖ్యమైన ఘటన దేశంపై తనదైన రీతిలో ప్రభావాన్ని కనబర్చింది. ముఖ్యంగా 2019 ముఖ్యమైన  ఆర్థికపరమైన సంఘటనలకు వేదికైంది. దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే రీతిలో పలు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలు చోటు చేసుకున్నాయి. దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రధాన నిర్ణయాలు 2019లో తీసుకున్నారు. జనవరిలో మొదలైన బ్యాంకుల విలీన ప్రక్రియ ఏడాది చివరి వరకూ కొనసాగింది. ఒకప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తరహా చరిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనంచేసి నాలుగు  పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2017లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా విలీనాల తరువాత వాటి సంఖ్య 12కు తగ్గిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైపోయాయి. దాంతో, దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా పీఎన్ బీ రూపుదిద్దుకుంది. ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానుంది. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ కలసిపోయింది. దాంతో, నాలుగో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా కెనరా బ్యాంక్ మారింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. దీంతో దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ నిలిచింది.  మొత్తానికి బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులకు 2019 వేదికైంది. మొత్తం దేశ బ్యాంకింగ్ రంగమే ప్రభావితమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిర తర్వాత బ్యాంకింగ్ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధానిగా మోడీ నిలిచారు.  

2019 సుప్రీం రిపోర్ట్... సంచలన తీర్పులు...

అనేక సంచలన తీర్పులకు 2019 వేదికైంది. 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లో ముఖ్యమైనది అయోధ్య అంశం. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి వీలు కల్పించేలా నవంబర్ 9న తీర్పు ఇచ్చింది సుప్రీం. ఇక, రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యల సందర్భంలో రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కి సూచిస్తూ ప్రొసీడింగ్స్ ను ముగించింది సుప్రీంకోర్టు. ఇక శబరిమల తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన కేసును ఏడుగురు జడ్జిల బెంచ్ కు రిఫర్ చేసింది. కొన్ని మసీదుల్లోకి, పార్సీ ఆలయాల్లోకి మహిళల ప్రవేశంలాంటి అంశాలన్నీ కూడా శబరిమల రివ్యూ కేసులోని అంశాల తరహాలోనివే అంటూ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందన్న సుప్రీం..... కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ కింద న్యాయమూర్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అలాగే, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఫ్లోర్ టెస్ట్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదివారం నాడు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపట్టడం ఓ అరుదైన సందర్భం.  ఇక, ఎస్సార్ స్టీల్ ను ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు. ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. కర్నాటక రెబెల్ ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.   ఇలా, 2019లో సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులు ఇచ్చింది. దేశంలో మత, రాజకీయ, సామాజిక వ్యవస్థలను ఇవి ప్రభావితం చేశాయి. వీటిలో అత్యధికం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ ఉన్నప్పుడు వెలువడ్డాయి.

త్రిముఖ పోటీ ఉండేనా ?.. నిజామాబాద్ జిల్లాలో పెరిగిన మునిసిపల్ సీట్లు

కమలం జోరు, కాంగ్రెస్ ఫైట్ నిజమాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చిత్రమిది. బల్దియా ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత మున్సిపల్ ఎన్నికల తరవాత ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఇప్పుడు నిజామాబాద్ కారు ఓవర్ లోడ్ తో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ లో 10 డివిజన్లను టిఆర్ఎస్, 16 డివిజన్లను కాంగ్రెస్, 16 డివిజన్లలో ఎంఐఎం, బీజేపీ 7 డివిజన్లు, ఇండిపెండెంట్లు 1 డివిజన్ లో గెలుపొందారు. అప్పటి రాజకీయ సమీకరణాల్ని బట్టి ఎంఐఎం, టిఆర్ఎస్ స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అయితే ఆ తరువాత కాంగ్రెస్ తరపున గెలిచిన 14 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరారు. బిజెపి నుంచి ఆరుగురు కారు లోకి జంప్ అయ్యారు. దీంతో 30 మంది కార్పొరేటర్ల బలం టిఆర్ఎస్ కు చేకూరింది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ లో రాజకీయ పరిస్థితులు మారాయి. శివారు గ్రామాలు కార్పొరేషన్ లో చేరాయి. దీంతో డివిజన్ల సంఖ్య 60 కి చేరింది. గ్రామీణ ప్రాంతాలు విలీనం కావడం తమకు కలిసొస్తుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ గతంలో లాగానే ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే అవకాశముంది. మిగిలిన ప్రతి పక్ష పార్టీలో ఒంటరి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ రాజకీయ ముఖచిత్రం మారింది. సీట్ల సంఖ్య 36 కు పెరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు చాలామంది అధికార పార్టీ లోకి వలస వచ్చారు. కాంగ్రెస్ గతంలో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. బీజేపీ ఈ సారి ఇక్కడ పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 146 వార్డులు ఉన్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల సగం సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు నడిచే అవకాశముంది.

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా... న్యూఇయర్ వేడుకలపై మాఫియా కన్ను...

  డిసెంబర్ 31... 2019కి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరం 2020కి స్వాగతం పలికే రోజు... అందుకే... హైదరాబాద్ నగరం అంతా ఒకటే సందడి... కేరింతలు... తుళ్లింతలతో పబ్‌లు, క్లబ్‌లు హోరెత్తిపోతాయి. పార్టీల పేరుతో జనం ఊగిపోతారు. ఇదే డ్రగ్స్‌ మాఫియాకు వరంగా మారబోతోంది. న్యూఇయర్ పార్టీలపై డ్రగ్స్ మాఫియా కన్నేసింది. వందల కోట్ల వ్యాపారానికి తెర లేపింది. దాంతో, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు చెబుతున్నారు. అలాగే, శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులే లక్ష్యంగా కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు విక్రయాలు చేస్తున్నారు. ఒక్క గ్రాము కొకైన్ మూడు వేలకు... హెరాయిన్ పదివేలకు అమ్ముతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇదంతా జరిగిపోతోంది. అయితే, కాలేజీలతో పాటు పబ్‌లు, క్లబ్‌లు, రిసార్టుల్లో మత్తు పదార్ధాల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో, డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా పెంచారు. అలాగే... హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి మత్తు పదార్థాలు హైదరాబాద్ కి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. దాంతో, హైదరాబాద్‌కు భారీగా గంజాయి సరఫరా అయ్యే అవకాశం ఉండటంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు పోలీసులు. పబ్‌లకు డ్రగ్ పంపిణీ చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్‌లు... డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్‌ ముఠాపై ఫోకస్‌ పెట్టారు. హెరాయిన్, కొకైన్‌, గంజాయితోపాటు అతితక్కువ ధరకు లభించే మత్తు ఇంజక్షన్లను వాడుతున్నట్లు కూడా గుర్తించారు. అయితే, కొత్త రూట్స్‌లో డ్రగ్ రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, సీసీఎస్ లతో నిఘా పెంచారు. ప్రైవేటు బస్సుల్లో డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో సెర్చ్ చేస్తున్నారు. అలాగే, డ్రగ్స్‌ అక్రమ వ్యాపారానికి ఆన్‌లైన్ వేదికగా మారుతోంది. నేరుగా అమ్మితే పోలీసులు పట్టుకుంటారని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లతో కొకైన్, బ్రౌన్ షుగర్, సిలికాన్ వంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొరియర్స్ పార్సిళ్లలో డ్రగ్స్ సేల్‌ చేస్తుండటంతో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. ఇప్పటికే రహస్య ప్రదేశాల్లో నిల్వచేసి న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. వేడుకల నేపథ్యంలో గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దఎత్తున మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.   పబ్‌, రిసార్ట్‌ నిర్వాహకులు డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా... మత్తు పదార్థాలు సప్లయ్ చేసినా జైలుకు పంపిస్తామంటున్నారు. న్యూ వేడుకల సందర్భంగా ఫైర్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, పబ్‌లు, రిసార్టులపై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, పార్టీలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి సంగీత కచేరీలు, డీజే సౌండ్స్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. అసభ్య నృత్యాలు, అశ్లీల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లు సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.

ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా శాఖ.. జనవరి 1 నుండి ప్రభుత్వంలోకి పూర్తిగా విలీనం

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రజా రవాణా శాఖగా మారిపోయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అధికారుల హోదాలను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆర్టీసీ ఎండీ హోదాను పీటీడీ కమిషనర్ లేదా డైరెక్టర్ గా.. ఈడీలను అడిషనల్ కమిషనర్లుగా.. ఆర్ఎంలు జాయింట్ కమిషనర్లుగా.. డీవీఎంలు డిప్యూటీ కమిషనర్లుగా.. డిపో మేనేజర్లను అసిస్టెంట్ కమిషనర్లుగా.. వ్యవహరించాలని జీవోలో తెలిపింది. ఆర్టీసీ సిబ్బందికి సీఎంఎఫ్ఎస్ నుంచి జీతాల చెల్లింపు జరుగుతుందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగే వరకు ఆర్టీసీ సిబ్బందికి ప్రస్తుతమిస్తున్న అలవెన్సులు కొనసాగుతాయని తెలిపింది. పీఆర్సీ వచ్చాక వీటిని కొనసాగిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేకపోవటంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.  జనవరి 2020 నుంచి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని చెప్పిన అధికారులు అందుకు అనుగుణంగానే ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో మొత్తం 51,488 మంది ఆర్టీసీ సిబ్బంది టీటీడీలో విలీనం కాబోతున్నారు. కార్పొరేషన్ గా కొనసాగుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే విలీన కమిటీ ఇచ్చిన నివేదికలో ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉన్నందున పార్లమెంటు ఆమోదం లేకుండా సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో సిబ్బంది వరకే విలీనం చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనిపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2 నెలలకు పైగా కసరత్తులు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధుల అభిప్రాయాలు తీసుకుని విలీన ప్రక్రియను కొలిక్కి తీసుకు వచ్చింది.  కాగా పెన్షన్ లేనపుడు విలీనం జరిగిన ప్రయోజనం ఉండదని ఆర్టీసీ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. పెన్షన్ ఇస్తేనే తమకు అసలైన విలీన పండుగ అని చెబుతున్నారు. ప్రభుత్వంలో విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ విమర్శించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలకు సంబంధించి స్పష్టత ఇవ్వకుండా కేవలం విలీనం జపం చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.  అటు ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ను ప్రభుత్వం నియమించింది. సెప్టెంబర్ లో సురేంద్రబాబును బదిలీ చేసిన ప్రభుత్వం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుకు ఆర్టీసీ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే కొత్త సంవత్సరం నుంచి కార్పొరేషన్ సిబ్బంది మొత్తం ప్రజా రవాణా శాఖలోకి మారుతున్న తరుణంలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రతాప్ ను పూర్తిస్థాయిలో ప్రభుత్వం నియమించింది.

అడుగడుగునా ఆంక్షలే.. న్యూ ఇయర్ వేడుకలకి వెళ్తే జాగ్రత్త.. కేసులు తప్పవు

నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లు సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్టు వెళ్ళేవారు ఫ్లైట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు. మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకోవాలని అంటున్నారు పోలీసులు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూయర్ ఈవెంట్స్ పబ్ల పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికల్స్ ను అనుమతించరు. పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపైన వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వరు. కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డు పైకి అనుమతిస్తారు. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్లు తెలుగుతల్లి, కామినేని, ఎల్ బీనగర్, పంజాగుట్ట ఫ్లైవోర్లతో పాటు నల్గొండ చౌరస్తా పైవంతెన, చింతల్ కుంట అండర్ పాస్లను మూసివేయనున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పైకి వాహనాల రాకపోకలను నిలిపి వేస్తామని ప్రకటించారు. ఆ దారుల మీదుగా వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.