బోస్టన్ నివేదికలోనూ జగన్ మాటే... ఇక అధ్యయనాలు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి, రాజధానిపై బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ నివేదిక సమర్పించింది. అయితే, అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌కే బోస్టన్‌ సంస్థ కూడా జైకొట్టింది. అమరావతిని పక్కన పెట్టేసిన బోస్టన్ గ్రూప్... రాజధాని నిర్మాణం కోసం రెండు ఆప్షన్లను సూచించింది. ఆప్షన్-1 ప్రకారం... విశాఖలో సచివాలయం, ప్రభుత్వ శాఖలు... అత్యవసర అసెంబ్లీ సమావేశాలు, కౌన్సిల్, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, 15 శాఖల ఏర్పాటు... కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక, రెండో ఆప్షన్ ప్రకారం.... అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, విశాఖలో సెక్రటేరియట్, సీఎం, గవర్నర్ కార్యాలయాలు, కర్నూలులో హైకోర్టు నిర్మాణం చేపట్టాలని సూచించింది. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్ కనెక్టివిటీ ఉందని... అలాగే, విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులు ఉన్నాయంటూ వైజాగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరోవైపు అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టకూడదో కూడా బోస్టన్ గ్రూప్ వివరించింది. 2009లో వచ్చిన వరదల్లో ప్రస్తుత అమరావతి ప్రాంతం మునిగిపోయిందని... అందుకే ఆ ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నివేదికలో తెలిపింది. అమరావతి మట్టిలో నాణ్యత లేదని... బహుళ నిర్మాణాలు అసాధ్యమని బోస్టన్ గ్రూప్ వివరించింది. 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి... అధ్యయనం చేసిన బోస్టన్ సంస్థ... 7 జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయని... అలాగే 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని తెలిపింది. ఇక, ఏపీకి ప్రస్తుతం 2.25 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని... దక్షిణాదిలోనే ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉందని వివరించింది. అదే సమయంలో, ఏపీ అభివృద్ధికి ఏ విధానాలు చేపట్టాలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సూచించింది. ఇక, ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్ ఇవ్వడం... ఇఫ్పుడు బోస్టన్ సంస్థ కూడా నివేదిక ఇవ్వడంతో... ఈ రెండు నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. జనవరి ఆరున తొలిసారి సమావేశంకానున్న హైపవర్ కమిటీ.... జీఎన్‌రావు అండ్ బోస్టన్ నివేదికలపై చర్చించనుంది. అలాగే, జనవరి 8న సమావేశంకానున్న ఏపీ మంత్రివర్గం కూడా జీఎన్‌రావు అండ్ బోస్టన్ నివేదికలపై చర్చించనుంది.

జగన్ కి సీబీఐ కోర్టు షాక్.. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని మినహాయింపు ఇవ్వటం కుదరదని జగన్ తరఫు లాయర్‌కు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిగిన అనంతరం..  ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని కోర్టు పేర్కొంది.

బోస్టన్ కమిటీ నివేదిక పై సర్వత్రా ఉత్కంఠత...

ఆంధ్రపదేశ్  రాజధాని పై తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అలాగే కొనసాగుతుందా లేక మరో ప్రాంతం రాజధానిగా మారుతోందా, ప్రభుత్వం చెబుతున్నట్టుగా మూడు ప్రాంతాలనూ రాజధానులుగా చేస్తుందా అని తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు రాజధాని ప్రజలు.బోస్టన్ కమిటీ ఇవాళ ఏమని నివేదిక నివ్వబోతోంది,దానిపై ఏపీ క్యాబినెట్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానుల పై జియన్ రావు కమిటీ పలు సూచనలు చేసింది. 8 న జరిగే క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారు లేక మరోసారి భేటీ అయ్యి తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.అమరావతిని తరలించడం పై ఆ ప్రాంత రైతులు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తుంటే విశాఖ, కర్నూలులో మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజధానుల పై రగులుకున్న వివాదం సజ్జమనచేయటంలో కమిటీల మీద కమిటీలు వేసినా ఏపీ ప్రభుత్వం వాటి ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అందర్నీ తొలుస్తున్న ప్రశ్న. కమిటీల నిర్ణయాల ఆధారంగా మంత్రివర్గం ఒక డెసీషన్ తీసుకుంటోందని ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిసిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వానికి ఇవ్వనున్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఎలా ఉండబోతుంది అన్నది చర్చ నీయాంశంగా మారింది.మరోవైపు పదిమంది మంత్రులూ ఉన్నతాధికారులతో వేసిన హైపవర్ కమిటీ రెండు నివేదికలను అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణపై సూచనలు కూడా చేసి 20 లోగా నివేదికను సమర్పిస్తుంది. ఇందులో ఉన్న సూచనలు సలహాల ఆధారంగా ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకొనున్నట్లు సమాచారం. బోస్టన్ రిపోర్ట్ కూడా వికేంద్రీకరణకు అనుకూలంగా ఉంటే హైపవర్ కమిటీ ఇచ్చే సూచనలు కీలకం కానున్నాయి. మూడు వారాల్లగా నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీని ఆదేశించిన నేపథ్యంలో వాటి సూచనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి.

టీఆర్ఎస్ నేతల్లో రాజ్యసభ రెండో స్థానం పై పెరిగిన ఉత్కంఠత...

మాజీ ఎంపీ కవిత రాజ్య సభకు వెళ్లడం దాదాపు ఖాయమైందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒకటి ఆమెకు కేటాయిస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. రెండవ సీటు ఎవరికి దక్కుతుందనే విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 7, ఆంధ్ర ప్రదేశ్ కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించగా  ప్రస్తుతం తెలంగాణ నుంచి 5 రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, కెప్టెన్ వి లక్ష్మికాంతరావు, డి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తూన్నారు.వాటిలో మరో రెండు స్థానాలకు బిజెపికి చెందిన గరికపాటి మోహన్ రావు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటాలోకి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఏడాదిలో ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో 2 తెలంగాణకు, 4 ఏపీకి చెందినట్లు సమాచారం. తెలంగాణ నుంచి గరికిపాటి, కేవీపీ పదవీ విరమణ చేస్తారు. ఏపీ కోటాలో ఉన్న కేకే కూడా అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ కు చెందిన వారు కాదు. అయితే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల బలం దృష్ట్యా ఆ రెండు స్థానాలు టిఆర్ఎస్ కి ఏకగ్రీవంగా దక్కుతాయి.  వాస్తవానికి ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ 9 న ఖాళీ కానున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి, మార్చిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించనుంది. గడువు సమీపిస్తుండటంతో అధికార టీఆర్ఎస్ లో రెండు రాజ్యసభ అభ్యర్ధులు ఎవరివనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ కోటాలో ఉన్న కేకేకు మళ్లీ సభ్యత్వం దక్కడం అనుమానమేనన్న చర్చ కూడా టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది. వయసు రీత్యా ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపక పోవచ్చునంటూ కొన్న ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి . కేకే అనుభవానికి తగినట్లుగా ఏదో ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒక స్థానం సీఎం కేసీఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు ఖాయమంటున్నారు కొందరు నేతలు. ఢిల్లీ స్థాయిలో పార్టీ పరమైన వ్యవహారాలను గతంలో వినోద్ కుమార్ చూసుకునేవారు. ప్రస్తుతం ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి పరిమితమయ్యారు. దీంతో కేసీఆర్ కు నమ్మకంగా ఢిల్లీ స్థాయిలో పార్టీ ప్రభుత్వ పనులను చక్కబెట్టే వారు లేకుండా పోయారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్ సభ సభ్యురాలిగా పనిచేసి ఉండటం ఢిల్లీలో ఉన్న పరిచయాలు తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ భాషలపై పట్టు, చొరవ రాజ్యసభ అభ్యర్ధిగా కవిత ఎంపికకు మార్గం సుగమం చేస్తాయని పార్టీలో చర్చ జరుగుతోంది. 2 వ సీటుకోసం పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, నాయిని నరసింహరెడ్డి, సిరికొండ మధుసూధనాచారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పొంగులేటికి 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రాజ్యసభ సీటు పై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి ఎమ్మెల్సీగా వెళ్లటానికి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రెన్యువల్ కాకపోవడంతో నాయిని కొంత అసంతృప్తిగా ఉన్నారు.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాతే రాజ్యసభ బెర్తుల పై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.రాజ్యసభ రెండో స్థానం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం.. నిధులు ఉన్నాయా? ఎన్నేళ్లు పడుతుంది?

కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదని బడ్జెట్ అంచనాలను కూడా సవరించామని గతంలో చెప్పిన ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి ఎన్ని నిధులు కేటాయించగలదని,అంత మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేయగలదా అని ప్రశ్నించింది. ఆర్ధిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భవన నిర్మాణానికి ఎన్నాళ్లు పడుతుంది అని నిలదీసింది. సచివాలయ భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హై కోర్టు డివిజన్ బెంచ్ మరోసారి విచారించింది. సచివాలయ భవన సముదాయంలోని 25 ఎకరాల స్థలంలో ఎంత విస్తీర్ణంలో కొత్తగా కడతారని, నూతన భవనానికి ప్లాన్ ఎక్కడని అదనపు ఏజీని ప్రశ్నించింది. భవన సముదాయాన్ని ఫేజ్ ల వారీగా నిర్మించాల్సి ఉంటుందని ఈ లెక్కన 5 నుంచి 6 ఏళ్ల పాటు నిర్మాణం కొనసాగే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజస్థాన్ హై కోర్టు నిర్మాణాన్ని 2007లో ప్రారంభిస్తే 2018 లో పూర్తయ్యిందని సుమారు 12 ఏళ్లు పట్టిందని గుర్తు చేసింది. దీని ప్రకారం చూస్తే సచివాలయం నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని పదేళ్ల,పన్నెండేళ్ల అని ప్రశ్నించింది. పుట్టగొడుగుల్లా రాత్రికి రాత్రే భవనాల నిర్మాణం పూర్తి కాదు కదా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని హై కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.  నూతన సచివాలయ భవనం నిర్మాణానికి గత ఏడాది జూన్ 27 న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో పాటు 2016 లో దాఖలైన మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. సచివాలయ భవనాలను కూల్చివేసి అదే స్థలంలో కొత్త భవనం నిర్మించాలని అందుకు అనువుగా ప్రస్తుత సచివాలయాన్ని ఇతర భవనాల్లోకి తరలించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ఇది మధ్యంతర నిర్ణయం మాత్రమేనని తుది నిర్ణయం ఏది అని ధర్మాసనం ప్రశ్నించింది. సచివాలయ భవనాలను కూల్చవద్దని మాత్రమే మౌఖిక ఆదేశాలు ఇచ్చామని ఎటువంటి స్టే ఇవ్వలేదని తెలిపింది. నూతన సచివాలయానికి డిజైన్ల రూపకల్పన చెయ్యొద్దని ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదని గుర్తు చేసింది. ఉన్న సచివాలయాన్ని కొన్ని నెలల్లో తరలిస్తామని చెప్పారని కొత్తది కట్టడానికి ఎంత కాలం పడుతుందని కోర్టు ప్రశ్నించింది. మూడు నుంచి ఐదేళ్లలో కడతారు అనుకుంటే అంతకాలం అధికారులు ఎక్కడి నుంచి ఎలా పనిచేస్తారో అని శాఖల మధ్య సమన్వయం ఎలా చేయగలరని ప్రశ్నించింది. రహస్యంగా ఉండాల్సిన ఫైళ్లను ఆయా శాఖలకు ఎలా తీసుకెళ్తారని వాటి భద్రత మాటేంటని మార్గ మధ్యంలో ఎవరైనా దోచేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. సచివాలయ సమీపంలోని బూర్గుల రామకృష్ణా రావు భవన్ లోకి 70 % శాఖలను తరలించామని హెచ్వోడీలు మిగిలిన శాఖలను వేరువేరు భవనాల్లోకి మార్చామని ఏఏజీ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయన్నారు. అయితే సుప్రీం కోర్టు ఏం చెబుతుందో తమకు తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సహేతుకంగా ఉండాలని లేని పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద తాము కల్పించుకోవచ్చునని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం హైకోర్ట్ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

మున్సిపల్ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేస్తున్న కేసీఆర్...

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడులైనప్పటి నుంచి తెలంగాణ నేతల్లో జోరు పెరిగింది. ఎన్నికల కోసం టిఆర్ఎస్ పార్టీ కసరత్తును కూడా వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు నేతలను పార్టీ సమావేశాలకు ఆహ్వానించింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రాథమికగా మున్సిపోల్స్ పై చర్చించారు. శనివారం నాలుగైదు గంటల పాటు జరిగే సమావేశంలో మున్సిపోల్స్ పై లోతుగా చర్చించి గెలుపు వ్యూహాలను కేసీఆర్ ఖరారు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చర్చ నడుస్తొంది.మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలోనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సీనియర్ నేతలను ఇన్ చార్జీలుగా నియమించింది టీఆర్ఎస్. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఉన్న రాజకీయ పరిస్ధితులు బలాబలాలు సమస్యల పై నివేదిక సిద్ధం చేసిన ఇన్ చార్జిలు ఇప్పటికే పార్టీకి అందచేశారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ నివేదికలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాల్టీలు కార్పొరేషన్ల వారీగా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సూచనలు, సలహాలు రెబల్స్ తో వ్యవహరించాల్సిన తీరు ఇలాంటి అంశాల పై నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని సమాచారం.ఈ ఎన్నికల్లో పని చేసేందుకు కొంత మంది సీనియర్లకు కూడా బాధ్యత అప్పగించే అవకాశమున్నట్టు సమాచారం. జడ్పీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న టీఆర్ఎస్ మున్సిపోల్స్ లో కూడా అదే స్థాయిలో ఫలితాలు రాబట్టుకోవాలనుకుంటున్నట్టు అంచనా. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం టిఆర్ఎస్ వ్యూహాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికల పై అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నా నేపధ్యంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్దను చూస్తూ నేతల సైతం ఆశ్చర్య పోతున్నారు.

స్థానిక నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. ఎవరి కాళ్లూ పట్టుకోను

స్థానిక వైసీపీ నేతలపై కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ అసహనం వ్యక్తం చేశారు. జూపాడుబంగ్లా మండలం బన్నూరు గ్రామసచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు గురువారం ఆయన విచ్చేశారు. అయితే ఆయన స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా నేరుగా వచ్చేశారు. దీంతో సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమకు చెప్పకుండా రావటం ఏంటని.. పార్టీ కోసం పనిచేసిన తమకు కనీసం కబురు చేయకుండా అవమానించారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. తానిక ఓట్లు అడుక్కోనని.. ఎమ్మెల్యే గా పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికే నాకు చాలా అయింది. ఈ ఐదేళ్లలో ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరి దగ్గరకూ వచ్చి కాళ్లు పట్టుకోను. మీకేమైనా పని కావాలంటే నా దగ్గరకు రండి అని కార్యకర్తలపై ఆర్థర్‌ విరుచుకుపడ్డారు.

ఓరుగల్లులో పన్నుల మోత... టీఆర్ఎస్ కు వార్నింగ్ బెల్స్...

వరంగల్‌ కార్పొరేషన్‌లో పన్నుల మోత మోగుతోంది. వరంగల్‌ నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.... కార్పొరేషన్ పాలకులు మాత్రం... ప్రజలపై భారం మోపుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... ఆస్తి, ఇంటి పన్నులను భారీగా పెంచేయడంపై వరంగల్ వాసులు భగ్గుమంటున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్లే పెద్ద పట్టణం. టూరిజం, వ్యాపారం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ రంగాల్లో హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. కానీ కనీస సౌకర్యాల కల్పనతో మాత్రం వెనుకబడిపోతోంది. గుంతల మయమైన రోడ్లతో నిత్యం నరకం చూస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అయితే అధ్వాన్నంగా తయారైంది. 58 డివిజన్లు, 15లక్షలకు పైగా జనాభా ఉన్న వరంగల్‌ కార్పొరేషన్‌లో ప్రజల దుస్థితి ఇలాగుంటే... మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... ఆస్తి, ఇంటి పన్నులను భారీగా పెంచేశారు. అయితే, పాలకమండలి నిర్ణయంపై ప్రజలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరో ఏడాదిన్నరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత పాలకపక్షానికి బుద్ధి చెబుతామంటున్నారు. ఎన్నికలు జరుగుతోన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే, వరంగల్‌లో మాత్రం పన్నుల భారం మోపడం సరికాదని  ప్రజలు మండిపడుతున్నారు. ముందుగా, రోడ్ల మరమ్మతు చేపట్టి, పారిశుద్ధ్యాన్ని చక్కదిద్దాలని కోరుతున్నారు. వరంగల్ నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 12వందల కోట్లు కేటాయించాయని, అవన్నీ ఏమైపోయాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నరేశ్ వచ్చాకే ఎందుకిలా? రాజశేఖర్ కోపానికి కారణమేంటి?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ లో గొడవలు కొత్త కాదు... నరేష్ అధ్యక్షుడు కాకముందు కూడా జరిగాయి. అయితే, 2019 సెప్టెంబర్‌ 10న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా నరేశ్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ప్రమాణ స్వీకారం రోజున నరేశ్‌ మాట్లాడిన తీరుపై 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నరేశ్‌... నేను, నేను అని కాకుండా... మేమంతా అని ప్రస్తావిస్తే బాగుండేదని చురకలు అంటించారు. అప్పటి నుంచి నరేశ్‌కు, రాజశేఖర్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. 2019 అక్టోబర్‌లో కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో వివాదం చోటు చేసుకుంది. మా అధ్యక్షుడు నరేష్‌కు, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు మా సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని... కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదన్నారు. మా సభ్యులకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉండటం వల్లే... ఈ మీటింగ్ పెట్టుకున్నామని జీవితా రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఇది ఒక నార్మల్ మీటింగ్ మాత్రమేనని... దీనికి కోర్టు పర్మిషన్లు ఏం అవసరం లేదని చెప్పుకొచ్చారు. మాలో 1000 మంది సభ్యులు ఉన్నారని... అందులో 20 శాతం సభ్యుల ఆమోదం ఉంటే... మీటింగ్ పెట్టుకోవచ్చని... దీనికి కోర్టు పర్మిషన్ అవసరం లేదని జీవిత వివరణ ఇచ్చారు. అలాగే... మీటింగ్‌కు అటెండ్ కాని సభ్యులు కూడా... తమతో ఫోన్‌లో టచ్‌ ఉన్నట్లు జీవిత వెల్లడించారు. తమకు.... మా అధ్యక్షుడు నరేష్‌కి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని జీవిత తెలిపారు. అయితే, నరేశ్, జీవిత, రాజశేఖర్... మా ఎన్నికల్లో గెలవడానికి మెగా మద్దతే కారణమంటున్నారు. అందుకే, ఎన్నికల సమయంలో జీవితా రాజశేఖర్ లు... చిరంజీవి ఇంటికెళ్లి మద్దతు కోరారు. అభిప్రాయభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, చిరంజీవి వారిస్తున్నా రాజశేఖర్.... మాలో గొడవలను బయటపెట్టడంతో... కథ అడ్డం తిరిగింది. రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు. రాజశేఖర్ ది చిన్న పిల్లాడి మనస్తత్వమంటూ జీవిత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా... వేదికపై వేడి సెగలు కొనసాగాయి. అయితే, రాజశేఖర్ వాదనలోనూ నిజం ఉందంటున్నారు కొందరు. ఏదేమైనా మెగాస్టార్ మాటకు విలువ లేకుండా చేసి రాజశేఖర్ అనవసరంగా కొత్త తలనొప్పులు తెచ్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై... వైసీపీ వీడియో ప్రజెంటేషన్...

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే, అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు, బంధువులు భారీగా భూములు కొనుగోలు చేశారంటూ వీడియోను ప్రదర్శించారు. రాజధాని ప్రకటన నాటి కంటే ముందే అంటే 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు భూముల కొనుగోల్ మాల్ జరిగిందంటూ వివరించారు. పథకం ప్రకారం రకరకాల పేర్లను ప్రచారం చేస్తూ... ఈలోపు అమరావతిలో తక్కువ ధరకే భూములు కొన్నారని ప్రధానంగా ఆరోపించారు. కావాల్సిన వాళ్లంతా భూములు కొన్నాకే రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించారని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు, తన అనుయాయులకు అనుగుణంగా సీఆర్డీఏ అలైన్ మెంట్ ను మార్చారని... ఇన్నర్  రింగ్ రోడ్డును ఇష్టానుసారంగా మార్చారని వివరించారు. మొత్తంగా 4వేల 70 ఎకరాలు ఇన్ సైడర్  ట్రేడింగ్ జరిగినట్లు వీడియోలో తెలిపారు.  చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా... సర్కారుకు వెన్నుదన్నుగా నిలిచిన వారంతా... ఇన్ సైడర్  ట్రేడింగ్ ద్వారా లబ్ది పొందారంటూ... వీడియోలో ఆరోపించారు వైసీపీ నేతలు. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ...తన కుటుంబ సభ్యుల పేర్లపై 15.30 ఎకరాలు... అలాగే, పయ్యావుల వ్యాపార భాగస్వామి, తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా భూములు కొన్నారని వివరించారు. పల్లె రఘునాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యులపై 7.5 ఎకరాలు.... అభినందన హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై టీడీపీ నేత కొమ్మలపాటి శ్రీధర్ 68.6 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. అలాగే, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్ ఆర్ ఇన్ ఫ్రా అవెన్యూస్ పేరుపై భూములు కొనుగోలు చేశారని వివరించారు. యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్ పేరుపై 7 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ...శశి ఇన్ ఫ్రా పేరుతో 17.13 ఎకరాలు..... గుమ్మడి సురేశ్  పేరుపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు.... ధూళిపాళ్ల నరేంద్ర... తన కుమార్తె వీర వైష్ణవి, దేవరపు పులయ్య పేరుపై 13.5 ఎకరాలు కొనుగోలు చేశారని వివరించారు. ఇక, అప్పటి పురపాలక మంత్రి నారాయణ... తన దగ్గర పనిచేస్తున్న వారి పేర్లపై 55.27 ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. రావెల కిశోర్ బాబు ...విశాఖకు చెందిన మైత్రీ ఇన్ ఫ్రా పేరుపై 40.85 ఎకరాలు.. జీవీ ఆంజనేయులు అనుమానిత బినామీల పేరుపై 53.48 ఎకరాలు కొన్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్  తన కుటుంబ సభ్యులపై మొత్తంగా 62.77 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మాజీ ఎంపీ మురళీ మోహన్ కు చెందిన 53.29 ఎకరాలను ఇన్నర్  రింగ్ రోడ్డులోకి తీసుకొచ్చి లబ్ది చేకూర్చారని తెలిపారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేశ్ తో క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని వీడియోలో ఆరోపించారు. లింగమనేని కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన 351.25 ఎకరాలను... సీఆర్డీఏ పరిధి నుంచి మినహాయిండం ద్వారా లబ్ది చేకూర్చారని చెప్పుకొచ్చారు. లింగమనేని భూములకు రాజధాని సరిహద్దు రేఖ... కేవలం 10 మీటర్ల దూరంలోనే ఆగడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. అందువల్లే కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్ ను చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారని వీడియోలో ఆరోపించారు.  ఇక, నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితులకు సీఆర్డీఏ పరిధిలో ప్లాట్లు దక్కాయని... వైసీపీ విడుదల చేసిన వీడియోలో వివరించారు. ముఖ్యంగా దళితులు, నిరుపేదల నుంచి అసైన్డ్  భూములు లాక్కుని.. వాటిని ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చి ప్లాట్లు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. అందులో కొల్లి శివరాం 47.39 ఎకరాలు, గుమ్మడి సురేశ్  49.925 ఎకరాలు, బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలు.. ఇలా మొత్తం మొత్తం 338.887 ఎకరాలను స్వాధీనం చేసుకుని.. వీటికి అనుగుణంగా ప్లాట్లను పొందారని వీడియోలో వివరించారు. అయితే, వైసీపీ వీడియో ప్రజెంటేషన్ లో అన్నీ అబద్ధాలేని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై టీడీపీ... ఏ విచారణకైనా సిద్ధమన్నారు. మొత్తం కలిపితే 50 ఎకరాలు కూడా లేవని... మరి, 4వేల 69 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

నిజామాబాద్‌ పై కమలం కన్ను... పరువు కోసం అర్వింద్ పోరాటం...

నిజామాబాద్‌ కార్పొరేషన్‌పై కమలం కన్నేసింది. నిజామాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాషాయ జెండాను ఎగురవేసి అధికార టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్.... ఇప్పుడు నిజామాబాద్‌ కార్పొరేషన్‌పై గురిపెట్టారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం దగ్గర్నుంచి ...గెలుపు బాధ్యతలను తానే తీసుకుంటూ... కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గల్లీగల్లీలో ప్రచారం నిర్వహించి ఎలాగైనాసరే నిజామాబాద్‌ కార్పొరేషన్‌‌‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్‌-ఎంఐఎం దోస్తీనే ప్రచారాస్త్రంగా మార్చుకోవాలనుకుంటున్నారు అర్వింద్. నిజామాబాద్ కార్పొరేషన్‌ పరిధిలో బీజేపీ బలంగానే కనిపిస్తోంది. అయితే, 20 డివిజజన్లపై ఎంఐఎం ప్రభావం తీవ్రంగా ఉండటంతో... మిగతా డివిజన్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌-ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. టీఆర్‌ఎస్‌ 10, ఎంఐఎం 16, కాంగ్రెస్‌ 16, బీజేపీ 6 డివిజన్లను గెలుచుకున్నాయి. ఇక, బీజేపీ నుంచి గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లలో ఐదుగురు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే, ఈసారి కరుడుగట్టిన కాషాయవాదులకే టికెట్లు ఇవ్వడంతోపాటు కనీసం 30 డివిజన్లు గెలిచేలా రూట్‌ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు ఎంపీ అర్వింద్‌. కాంగ్రెస్ నుంచి మెజారిటీ నేతలు బీజేపీలో చేరడం.... టీఆర్ఎస్‌ కార్పొరేటర్లపై ప్రజల్లో వ్యతిరేకత... టీఆర్ఎస్‌-ఎంఐఎం దోస్తీ తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి, నిజామాబాద్ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న ఏకైక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కంకణం కట్టుకున్నారు. పార్టీలో తన పట్టు నిలుపుకోవాలన్నా... తన మాట నెగ్గాలన్నా... నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించుకోవడం ఎంపీ అర్వింద్‌కు కీలకంగా మారింది. మరి, నిజామాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాషాయ జెండాను ఎగురవేసిన ధర్మపురి అర్వింద్‌.... అదే జోరును కొనసాగిస్తారో లేదో చూడాలి.

అమ్మఒడి కోసం ఆపసోపాలు... అప్పుల వేటలో జగన్ సర్కారు...

పథకం మీద పథకం ప్రకటిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... అసలా పథకాలకు డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నారనే చర్చ మంత్రుల్లో సైతం జరుగుతోంది. అయితే, ఆరు నెలల పాలనలో 30వేల కోట్లకు పైగా అప్పులు చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకం అమలు కోసం మరోసారి జగన్ ప్రభుత్వం అప్పుల వేటలో పడింది. వడ్డీ రేట్లు ఎక్కువైనాసరే అప్పు తీసుకొస్తున్నారు. తాజాగా, ఆంధ్రాబ్యాంకు నుంచి 8.5శాతం వడ్డీకి 15వందల కోట్ల రుణం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ఆస్తులుగా చూపించి పదివేలకోట్ల రుణం సమీకరించాలని చూస్తున్నారు. అలాగే, మరో బ్యాంకు నుంచి 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అమ్మఒడి, రెండో విడత రైతు భరోసా గడువు ముంచుకొస్తుండటంతో వీలైనంత త్వరగా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క అమ్మఒడికే 6వేల 500కోట్లు అవసరం కాగా, రెండో విడత రైతు భరోసాకి 2వేల 500కోట్లు కావాలి. మొత్తంగా సుమారు 10వేల కోట్లు అవసరముందని ఆర్ధికశాఖ లెక్కగట్టింది.     అయితే, ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లే అవకాశమున్నా ప్రభుత్వం అటువైపు చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఎందుకంటే, ఓడీకి వెళ్తే 7.15శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. కానీ, 8.5శాతం అధిక వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకునేందుకే జగన్ ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా డిసెంబర్ వరకు 29వేల కోట్ల రుణాలను ప్రభుత్వం సమీకరించింది. ఈ రుణాలపై వడ్డీ 8శాతంలోపే ఉంది. అయితే, సెక్యూరిటీల వేలం ద్వారా ఇంకా 3వేల కోట్లకుపైగా అప్పు తెచ్చుకునే అవకాశమున్నా...  కేంద్రం అనుమతి ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది. అప్పుల పరిమితిని ఏపీ దాటేయడమే దీనికి కారణమంటున్నారు. మొత్తానికి అమ్మఒడి, రెండో విడత రైతు భరోసా చెల్లింపుల కోసం జగన్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని అంటున్నారు.

ఠాగూర్ నుంచి పార్క్ హయత్ వరకు... చిరంజీవి-రాజశేఖర్ రగడలో ఎన్నో మలుపులు...

మెగాస్టార్ చిరంజీవి... యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ మధ్య విభేదాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ఠాగూర్ సినిమా నాటినుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమిళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్ అయిన రమణ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకున్నాడు. కానీ చిరంజీవి చివరి నిమిషంలో రంగంలోకి దిగి... ఆ హక్కులను చేజిక్కించుకున్నాడు. ఆ సినిమాను ఠాగూర్‌గా తెలుగులో నిర్మించారు... అది సెన్సేషనల్ హిట్ అయింది. తనకు రావాల్సిన క్రెడిట్ అంతా చిరంజీవి కొట్టాడనే కోపం పెంచుకున్నారు రాజశేఖర్. ఆ తర్వాత చిరంజీవి, రాజశేఖర్ మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు. దూరం మరింత పెరిగింది. ఇక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. దాంతో, చిరంజీవే స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇలా ఇద్దరి మధ్య సఖ్యత కుదరడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. దాసరి నారాయణరావు సంతాప సభలో చిరంజీవి మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఒకరికొకరు తారసపడకుండా ఉండేందుకే ...ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని టాక్ వినిపించింది. ఇది వీరిద్దరి మధ్య సఖ్యత లేదన్న సంకేతాలను ఇచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య విబేధాలు తగ్గుతాయని అంతా భావించారు. అయితే, ఇటీవల ఇరువురి మధ్యా కొంచెం దూరం తగ్గినట్లు అనిపించినా, తాజాగా మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి-రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం కలకలం రేపింది. ఠాగూర్ సినిమా నుంచి ప్రజారాజ్యం వరకూ వీరిమధ్య చిటపటలు కొత్తేంకాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయ పరిణామాలు, ఇండస్ట్రీలో మారుతున్న కొన్ని లెక్కలు సైతం, వీరిమధ్య తాజా రగడకు ఆజ్యం పోశాయన్న చర్చ జరుగుతోంది.

అమరావతిలో సకల జనుల సమ్మె... భువనేశ్వరిపై అంబటి సెటైర్లు...

అమరావతి రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఇక, రాజధాని గ్రామాల్లో సకల జనుల సమ్మెకు రైతులు పిలుపునిచ్చారు. సమ్మె నుంచి హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, పాల కేంద్రాలను మినహాయింపు ఇచ్చారు. ఇక, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ధర్నాలు, వంటావార్పులతో నిరసనలను హోరెత్తిస్తున్నారు. అలాగే, తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే నిరాహర దీక్ష 17వ రోజుకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు, రైతు కూలీలు దీక్షలో పాల్గొంటున్నారు. రాజధాని పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం తాము భూములు ఇచ్చామని...చంద్రబాబుకు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇదిలాఉంటే, రాజధాని రైతుల ఉద్యమం కోసం చంద్రబాబు సతీమణి గాజులివ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు... గోదావరి పుష్కరాల్లో 30 మంది మరణించినప్పుడు... సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు... ఈ భువనేశ్వరి గారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అసలు భువనేశ్వరి ప్రేమ.. అమరావతి రైతుల మీదా... లేక అక్కడి భూముల మీదా అంటూ ఎగతాళి చేశారు.

ఆర్మూరులో కాంగ్రెస్ ఆగమాగం... టీఆర్ఎస్-బీజేపీ మధ్యే పోటీ...!

ఆర్మూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆగమాగం అవుతోంది. ఆర్మూరులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హస్తం పార్టీకి... ఇప్పుడు నాయకుడే కరువయ్యాడు. దాంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో తెలియక ద్వితీయశ్రేణి నేతలు, కేడర్ అయోమయానికి గురవుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు... కనీసం పోటీయే చేయలేని పరిస్థితి నెలకొందంటున్నారు. దాంతో, ఎన్నికలకు ముందే ఆర్మూరులో కాంగ్రెస్ చేతులెత్తేసిందనే ప్రచారం జరుగుతోంది.  అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఆర్మూరులో కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పటికీ...ఇప్పుడు పూర్తిగా డీలా పడింది. దాంతో, ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంటోంది. ఆర్మూరు మున్సిపాలిటీలో 54వేల మంది ఓటర్లు ఉండగా, వార్డుల సంఖ్య 36కి పెరిగింది. అయితే, గత ఎన్నికల్లో 11 వార్డుల్లో గెలుపొంది కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 10 వార్డులను గెలుచుకున్న టీఆర్ఎస్‌.... బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లను తనవైపు లాక్కుని ఆర్మూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసింది. అయితే, ఇప్పుడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కాంగ్రెస్‌ కనిపించడం లేదంటున్నారు. ఆర్మూరులో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న సురేష్‌రెడ్డి... అసెంబ్లీ ఎన్నికలకు ముందే గులాబీ గూటికి చేరగా.... కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఆకుల లలిత ...ఆ తర్వాత హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. దాంతో, ఆర్మూరులో కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేకుండా పోయారు. ద్వితీయ శ్రేణి నేతలున్నా... నియోజకవర్గాన్ని నడిపించే సత్తా లేకపోవడంతో... కాంగ్రెస్‌ కేడర్ మెల్లగా టీఆర్‌ఎస్‌, బీజేపీ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఆర్మూరులో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించిన బీజేపీ... స్థానికంగా మంచి పట్టు సాధించింది. దాంతో, ఆర్మూరు మున్సిపాలిటీలో పోటీ... టీఆర్ఎస్‌, బీజేపీగా మారింది. ఆర్మూరులో కాంగ్రెస్ డీలా పడటంతో... వార్ వన్ సైడేనంటూ టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. బీజేపీ అసలు తమకు పోటీనే కాదంటున్నారు. అయితే, ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తోన్న బీజేపీ నేతలు...  ఆర్మూరు మున్సిపాలిటీపై ఈసారి కాషాయ జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు.  

చిరంజీవి, రాజశేఖర్‌ రగడలో జగన్ పాత్ర ఉందా?

చిరంజీవి, రాజశేఖర్‌ రగడ, రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. జీవిత, రాజశేఖర్‌ దంపతులు ఎన్నికల టైంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌‌లో చేరారు. ఏపీలో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందంటూ జగన్‌ హామీ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో నామినేటెడ్ పదవులపై జీవిత, రాజశేఖర్‌ లో ఆశలు మరింత పెరిగాయి. అయితే, అదే సమయంలో చిరంజీవి, సీఎం జగన్‌కు దగ్గర కావడం... జీవిత, రాజశేఖర్‌లకు అస్సలు నచ్చడం లేదంటున్నారు. చిరంజీవి దంపతులు స్వయంగా జగన్‌ క్యాంపు హౌస్ కి వెళ్లి కలవడం, ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి సపోర్ట్‌ ఇవ్వడంతో, జగన్‌-చిరు బంధం బలపడిందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి క్లోజ్‌ అవుతుండటంతో, వైసీపీలో అసలు ప్రాధాన్యతే ఉండదన్న అభద్రతాభావంలోకి జీవిత-రాజశేఖర్‌లు వెళ్లారని అంటున్నారు. అంతేకాదు, ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఒకే సామాజికవర్గం ఆధిపత్యం ఉందని... అందుకే, చిరంజీవిని అస్త్రంగా ప్రయోగించి, ఆ వర్గం డామినేషన్‌కు చెక్‌ పెట్టాలన్నదే జగన్‌ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. దాంతో, మొన్నటివరకు ‘మా‘తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన చిరంజీవి, ఈమధ్య ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. అయితే, ‘మా‘లో చక్రం తిప్పాలనుకున్న జీవిత-రాజశేఖర్‌లకు, చిరు వ్యవహారం పుండుమీద కారం చల్లినట్లు అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనికి, కొనసాగింపుగానే ‘మా‘ డైరీ ఆవిష్కరణలో ఇన్ డైరెక్ట్ గా చిరంజీవిని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో తనకు ఎలాంటి గొడవుల్లేవని పైకి చెబుతున్నా, రాజశేఖర్ మనసులో ఉన్నది బయటపడిందని, అందుకే, చిరు కూడా కొంచెం ఘాటుగా రియాక్టయ్యారని విశ్లేషిస్తున్నారు. మరి, ఈ ‘మా‘ రచ్చ... ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

తెలంగాణ ఆర్టీసీలో అవినీతి.. సమ్మె కాలం లెక్కలు తేలుస్తారా? 

తెలంగాణలో ఇటీవల సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె పెద్ద ప్రభావమే చూపింది. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కొందరు కార్మికులు కూడా మరణించారు. ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ కార్మికులు అన్నట్టుగా ఈ పోరాటం సాగింది. ఒకానొక దశలో కార్మికులు సమ్మెకు ముగింపు పలికారు. దసరాకు ముందు నుంచి మొదలైన సమ్మె కాలంలో తాత్కాలిక సిబ్బంది తోనే బస్సులను నడిపింది ఆర్టీసీ యాజమాన్యం. నాడు చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా ఆ మధ్య యూనియన్ల నాయకుల సవాళ్లతో మొదలైంది అసలు కథ. సమ్మె కాలంలో నూటికి నూరుపాళ్లు అవినీతి జరిగిందని వారు బలంగా ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు అందినకాడికి దండుకున్నారుని దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ నాయకులు చేసిన డిమాండ్లు ఆర్టీసీలో అంతర్గత చర్చకు దారితీశాయి. బిల్లులూ, రసీదులు అసలు లేకపోవటంతో ఆర్టీసీలో ఆ 52 రోజుల లావాదేవీల లెక్క తేలక పోవడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోందనే గుసగుసులు వినిపిస్తున్నాయి.  అసలే అప్పుడు దసరా పండుగ సీజన్, ఆపై లెక్కాపత్రం లేని వ్యవహారం, అసలు సమ్మె కాలంలో వచ్చినది ఎంత? పోయింది ఎంత? అనే దానిపై అధికారులకు ఇప్పటికే స్పష్టత లేదు. అందుకే అసలు ఏ డిపోలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మొత్తం ఖర్చయింది ఆ లెక్కలేమిటీ అనే దానిపై ఆర్టీసీలో ఇంటర్నల్ ఆడిటింగ్ చేశారని తెలిసింది. దాదాపు నెల రోజుల పాటు 15 డిపోలో ఆడిటింగ్ నిర్వహించగా అంతటా లెక్కలూ గజిబిజి కనిపించింది. సమ్మె తొలినాళ్లలో తాత్కాలిక కార్మికులు టికెట్ లెస్ కలెక్షన్ లతో బస్సులు నడిపారు. ఈ కారణంగా అసలు ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై స్పష్టత కొరవడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా రోజులకు సంబంధించి కొంత క్లారిటీ ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే ఎక్కడో లెక్క తప్పుతుందనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోందని సమాచారం. టీఎస్ ఆర్టీసీలో కొందరు అధికారులైతే సమ్మె కాలంలో అసలు ఆదాయం వచ్చిందెంతో పోయింది ఎంతో ఎవరికి తెలుసు అని నిర్లక్ష్య ధోరణిలో వ్యాఖ్యానిస్తున్నారు. పైగా అప్పుడు కార్మికులు ఎవరూ లేక పోయినా తాత్కాలిక సిబ్బందితో తాము కష్ట పడి పనిచేయించామని అధికారులు తమకు తామే కితాబిచ్చుకున్నారు.  మొత్తం 97 డిపోలలో ఆడిటింగ్ జరిగాక అసలు ఎంత డబ్బు పక్కదారి పట్టింది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. అయితే ఈ తతంగ మంతా పూర్తి కావటానికి ఇంకా కొంత కాలం పడుతుందని అయినా అందులో తేలని లెక్కలు జాబితానే ఎక్కువగా ఉంటుందనీ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నల్ ఆడిటింగ్ మొత్తం పూర్తయిన సందట్లో సడేమియాలా ఎవరిదనేది తేలడం కష్టమేనని కూడా భావిస్తున్నారు.మొత్తం మీద ఆర్టీసీ సమ్మె రోజుల్లో నోటి లెక్కల కాలం సాగినందున అసలు లెక్కల ఆధారాల కోసం వెతకటం వృధా అనే అంటున్నారు. ఆడిటింగ్, విచారణల్లో బయటపడుతుందో లేక ఆరోపించినవారే ఆధారాలను బయటపెడతారో తెలియదు కానీ సమ్మె కాలంలో జరిగిన లావాదేవీల్లో అవినీతి అంశం మాత్రం తేలని గజిబిజి లెక్కగానే మిగిలిపోతోంది. పైగా అధికారుల పొంతన లేని మాటలతో ఈ అంశం సమాధానం దొరకని బేతాళ ప్రశ్నలా మిగిలి పోతుందనే వాదనలు ఉన్నాయి.

పబ్లిక్‌గా మోహన్ బాబుకి ముద్దిచ్చిన చిరంజీవి... గొడవలపై క్లారిటీ...

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో అరుదైన దృశ్యం ఆవిష్కృమైంది. మెగాస్టార్ చిరంజీవి... డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహాన్ని, ప్రేమను మరోసారి చాటుకున్నారు. మోహన్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చిరంజీవి... తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదంటూ ప్రేమగా బుగ్గపై ముద్దుపెట్టారు. ఈ సన్నివేశం అక్కడున్న సినీ ప్రముఖులను, మీడియా ప్రతినిధులను కట్టిపడేసింది. అయితే, మోహన్ బాబు, చిరంజీవి బంధాన్ని టామ్ అండ్ జెర్రీతో పోల్చుతున్నారు. ఎందుకంటే, పలు వేదికలపై ఒకరిపై మరొకరు పంచ్ డైలాగులు విసురుకుంటారు... అంతలోనే తమ మధ్య ఎలాంటి గొడవులు లేవంటారు. తామిద్దరమూ మంచి స్నేహితులమని, తమ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు. అయితే, ఇరువురి మధ్య ఉండే సత్సంబంధాలు, స్నేహం కంటే... ఆయా వేదికలపై ఒకరిపై మరొకరు పేల్చుకున్న మాటల తూటాలే ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో, మోహన్ బాబు, చిరంజీవి మధ్య శత్రుత్వం ఉందని భావన ఎక్కువమందిలో కలుగుతోంది. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురూ తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చాటి చెప్పారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తుంటాయని.... తమ మధ్య కూడా అంతేనని.... కానీ తామిద్దరమూ మంచి స్నేహితులమంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతే... కుర్చీలో నుంచి లేచి మోహన్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చిరంజీవి.... బుగ్గపై ముద్దిచ్చి.... తమ మధ్య ఎలాంటి గొడవల్లేవంటూ క్లారిటీ ఇచ్చారు.

ఆపరేషన్ కమలం.. భద్రాద్రి జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పై ప్రస్తుతం బీజేపీ కన్నేసింది. ఆపరేషన్ కమలం పేరుతో గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 5 స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. 6 నెలలు తిరిగే సరికి కాంగ్రెస్ పక్షాన గెలిచిన వనమా వెంకటేశ్వరావు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్ లు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాత్రమే ప్రతిపక్షంలో మిగిలారు.  గత ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున కోరం కనకయ్య, కాంగ్రెస్ తరపున హరిప్రియ పోటీ చేశారు. ఎన్నికల్లో గెలిచిన హరిప్రియ ఆ తరవాత గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో పరిస్థితి ఒకే ఒరలో రెండు కత్తులు చందంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ సిట్టింగ్ టీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉంది కనుక కోరం కనకయ్య డైలమాలో పడ్డారు ఇదే అదనుగా ఆయన వైపు బీజేపీ దృష్టి సారించింది. మొన్నటి ఎన్నికల్లో పినపాకలో టీఆర్ఎస్ పక్షాన పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పక్షాన రేగా కాంతారావు పోటీ చేశారు. ఎన్నికల్లో పాయం వెంకటేశ్వరరావు ఓడిపోయారు. గెలిచిన రేగా కాంతారావు అధికార పక్షంలోకి చేరి పోయారు. ఇక్కడ కూడా పాయం పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఆయనపై కూడా బిజెపి కన్నేసినట్టు సమాచారం. అశ్వరావుపేటలో గత ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు ఓడిపోయారు. ఆయన పై టీడీపీ నేత మెచ్చా నాగేశ్వరావు గెలిచారు. ఇక్కడ ఓడిన నేత లేదా టిడిపి పక్షాన గెలిచిన నేత వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీలోకి వచ్చేలా బిజెపి స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది. కోరం కనకయ్య ప్రస్తుతానికి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతానికి అధికార పార్టీలో కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాం కదా ఎన్నికల నాటికి టికెట్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే అని కోరం కనకయ్య తన అనుచరులతో అంటున్నారు. పినపాకలో కాంగ్రెస్ పక్షాన గెలిచిన రేగా కాంతారావు టీఆర్ఎస్ లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉక్కపోత గురవుతున్నారు. ఏదో ఒక ముహుర్తం చూసుకొని ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు పైకి గంభీరంగా ఉంటున్నప్పటికీ లోలోపల మాత్రం బిజెపి తోనే తమ భవిష్యత్ ని తలపోస్తున్నట్టుగా వారి అనుచరులు చెప్పుకుంటున్నారు.  ఇదిలా వుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ విస్తరణ కోసం చాప కింద నీరులా తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ నేతలను తమ వైపు ఆకర్షించాలని భావిస్తోంది. వచ్చే 6 నెలల వ్యవధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరున్న ఒక మాజీ ఎంపి బిజెపిలో చేరతారని ఆయన వెంట పెద్ద ఎత్తున అనుచర గణం కూడా కమలం పార్టీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. సదరు నేత బిజెపి లోకి వస్తే ఈ జిల్లాలో బీజేపీకి ఇక తిరుగుండదని చెప్పుకుంటున్నారు. దీంతో పాటు టీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని భావిస్తున్న నేతలు బిజెపి గూటికి వస్తారని పలువురంటున్నారు.  భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడానికి బీజేపీ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. భద్రాద్రి రామాలయాన్ని 100 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట తప్పారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీ హామీలు కూడా అమలు కాలేదు. దీనికి తోడు పోడు భూముల వివాదాన్ని కూడా సీఎం కేసీఆర్ పరిష్కరించలేకపోయారు.ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బిజెపి రంగంలోకి దిగబోతోంది. తెలంగాణలో ఎలాగైనా గద్దెనెక్కాలన్న పట్టుదలతో ఉంది బిజెపి. అందువల్ల ఆ పార్టీలో చేరితే వారే పోల్ మేనేజ్ వంటి అంశాలను చూసుకుంటారని గులాబీ పార్టీలోని అసంతృప్తులు భావిస్తున్నారు. గతంలో టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కోనేరు చిన్ని కొత్తగూడెంజిల్లా కమలం పార్టీలోకి తొలిగా చేరారు. అప్పటి వరకు స్థబ్దుగా ఉన్న బిజెపి చిన్ని చేరిక తరువాత స్పీడ్ పెంచింది. సింగరేణిలో తమ అనుబంధ సంఘమైన బీఎంఎస్ ను పటిష్టం చేయడంతో పాటు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ను బలహీనపరచే పనిలో కమలదళం ఉంది. ఈ పరిస్థితిలో వచ్చే రోజులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని బిజెపి నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఖమ్మం జిల్లా నుంచే టీఆర్ఎస్ పతనం మొదలవుతోందని, రాముడు కొలువైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.