రుషికొండలో సచివాలయం..! నెలరోజుల్లోనే తరలింపు

ఇంకా, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానే లేదు... కానీ అప్పుడే ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయింది. సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటనకు ముందే విశాఖలో పరిపాలనా రాజధాని కోసం భవనాల అన్వేషణ జరిగిపోతోంది. అధికారిక ప్రకటక చేశాక నెలరోజుల్లో వీలైనన్ని కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే భవనాల అన్వేషణ చేపట్టాలంటూ ఉన్నతాధికారుల నుంచి విశాఖ స్థానిక అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు అవసరమైన భవనాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అయితే, రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో సచివాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో ప్రస్తుతం నాలుగు అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. మరో నాలుగు అంతస్తుల్లో ఒక ఐటీ కంపెనీ నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. ఇక, దీని పక్కనే మిలీనియం టవర్-2 శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల క్యాంపస్ అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్స్ కి పక్కనే వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సోదరుడు నిర్మిస్తోన్న ఐదు అంతస్తుల భవనం కూడా ఉంది. ప్రభుత్వం కోరితే దీన్ని ఇచ్చే అవకాశముంది. అలాగే, మిలీనియం టవర్స్ కి సమీపంలోనే నాలుగు ఎకరాల్లో నిర్మించిన ఐబీఎం క్యాంపస్ ఉంది. అయితే, ఐబీఎంతో చర్చించి ఆ క్యాంపస్ ను తీసుకుంటారని అంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంపెనీకి చెందిన 70వేల చదరపు అడుగుల క్యాంపస్ ప్లగ్ అండ్ ప్లేతో రెడీ ఉంది. దీని పక్కనే మిరాకిల్ కంపెనీ భవనం ఖాళీగా ఉంది. అలాగే, రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలోనే ఆదిత్య కంపెనీ నిర్మిస్తోన్న భారీ అపార్ట్ మెంట్ దాదాపు సిద్ధమైంది. ఇందులో వందకు పైగా ప్లాట్లు ఉన్నాయి. ఆ పక్కనే విల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే, విశాఖ నడిబొడ్డున్న ఉన్న ఏడెకరాల విప్రో క్యాంపస్ ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగుల నివాసాల కోసం మధురవాడ దగ్గర సుమారు 20 ఎకరాల్లో భారీ రహదారులు, పార్కింగ్, వాకింగ్ ట్రాక్, హాస్పిటల్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ... ఇలా సకల సౌకర్యాలతో నిర్మించిన హరిత ప్రాజెక్టు ఫ్లాట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే, సిరిపురం ప్రాంతంలో ఐటీ కేటాయించిన పలు భారీ భవంతులు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా వినియోగించుకునేందుకు పరిశీలిస్తున్నారు. ఇన్ని భవనాలు, సదుపాయాలు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటంతో....ఇక్కడే సచివాలయం ఏర్పాటు చేస్తారని అంటున్నారు.  మొత్తానికి, అధికారిక ప్రకటన రాకముందే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు చకచకా పనులు జరిగిపోతున్నాయి. మంత్రివర్గం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే ముందస్తు ప్రకాళిక ప్రకారం అన్నీ నడిచిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ భవంతులు నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడంతో.... ప్రస్తుతం ఉన్నవాటినే తీసుకుని నెలరోజుల్లో కార్యాలయాలను తరలించాలని భావిస్తోంది.

దమ్ముంటే నిరూపించు... జగన్ కు బాబు సవాల్

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సవాలు విసిరారు. కేవలం ఆరోపణలు చేసి రాజధానిని తరలించడం సరికాదన్న చంద్రబాబు... నిజంగా ఇన్ సైడర్ జరిగిందని వైసీపీ భావిస్తే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం రైతులు నిస్వార్ధంగా భూములిస్తే... ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని భావించానని... కానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉంటే అమరావతి అభివృద్ధి జరగదన్న చంద్రబాబు... జగన్ మాటలనే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుందామని... కానీ తనపై కోపంతో అమరావతిని తరలించి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సూచించారు. మరోవైపు, అమరావతిని తరలించొద్దంటూ రాజధాని రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. రాష్ట్రాభివృద్ధి, రాజధాని కోసం తమ భూములను త్యాగం చేస్తే తమను నట్టేట ముంచారని జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 29 రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు చేపడుతుతోన్న రైతులు, ప్రజలు... మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల తొలగింపు పై తల పట్టుకుంటున్నఆర్టీసీ అధికారులు.....

నగరంలో వెయ్యి ఆర్టీసీ బస్సుల తొలగించాలనీ నిర్ణయించింది సర్కారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 29 డిపోలకు చెందిన 3,500ల బస్సులు సిటీలో తిరుగుతున్నాయి. వీటి వల్ల ఆర్టీసీకి ప్రతి నెలా 44 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. నష్టాలను తగ్గించుకోవడానికి 1000 బస్సులు తొలగించాలని ఆదేశించింది సర్కార్. తొలగించిన బస్సులను కార్గో సేవలను వినియోగించుకోవాలని చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కార్గో బస్సులను తయారు చేసే పనిలో ఉన్నారు. జనవరి ఒకటి నుంచి సిటీలో కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. ఆర్టీసీ అధికారులకు బస్సుల తొలగింపు అధికారులకు సవాల్ గా మారింది. ఇప్పటి వరకు నగరం లోని అన్ని డిపోల నుంచి 600 ల బస్సులను క్యాన్సిల్ చేశారు. ప్రాధాన్యత లేని రూట్లు అదనపు సర్వీసులను రద్దు చేశారు. ఆదాయం రాని మార్గాల్లో బస్సులను తిప్పడం మానేశారు. ఇంత చేసినా వెయ్యి బస్సులు తొలగించడం సాధ్యం కావడం లేదంటున్నారు అధికారులు. సిటీలో ఒక కిలో మీటరు బస్సు నడిపేందుకు ఆర్టీసీకి 52 రూపాయల ఖర్చవుతుంది. వచ్చే ఆదాయం మాత్రం 44 రూపాయలే ఉంటోంది. కొన్ని రూట్లలో 18 రూపాయలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో డీజిల్, బస్సు మెయింటెనెన్స్ కూడా సరి తూగడం లేదు. లాభాలు రాని మార్గాల్లో ముందుగా బస్సులను తొలగించారు అధికారులు. ప్రస్తుతం కిలోమీటరుకు 25 నుంచి 30 రూపాయలు వచ్చే బస్సులను తొలగిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ప్రధాన రోడ్ల పై నిఘా పెట్టారు. కోటి, పటాన్ చెరువు, సికింద్రాబాద్ పటాన్ చెరువు, ఉప్పల్ మెహిదీపట్నం, ఉప్పల్ కొండాపూర్, ఉప్పల్ మెహిదీపట్నం వయా కోటి, కుషాయిగూడ ఉప్పల్, లింగంపల్లి ఉప్పల్, ఆరాంఘార్ సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్ ఈసీఐఎల్, రాంనగర్ కాళిమందిర్, సికింద్రాబాద్ జియాగూడ వయా కోటి, కుషాయిగూడ అఫ్జల్ గంజ్, ఈసీఐఎల్ సుచిత్ర, చర్లపల్లి సికింద్రాబాద్ వయా సీతాఫల్ మండీ, ఈసీఐఎల్ మల్కాజ్ గిరి, పటాన్ చెరువు కోటి, లింగపల్లి ఎల్బీనగర్, పటాన్ చెరు సికింద్రాబాద్ మార్గాల్లోని సర్వీసులను తగ్గించారు. వీటితో పాటు నగర శివారు ప్రాంతాల్లో తిరిగే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. బస్సుల తొలగింపుతో తీవ్ర ఇబ్బందుల పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రాధాన్యత ఉండే రూట్లలో కూడా బసులను తొలగించడమేంటని మండిపడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు.ఇప్పుడు ఈ అధికారులు బస్సులు తొలగింపు అంశం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.

గజం లక్షన్నర... చుక్కల్లో విశాఖ భూములు

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం... ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇవ్వడంతో.... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమైపోయింది. అంతేకాదు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్వయంగా భీమిలి ప్రాంతంలోనే రాజధాని మహానగరం రాబోతోందంటూ ప్రకటించడంతో... విశాఖలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. విశాఖతోపాటు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున ల్యాండ్ ట్రేడింగ్ జరుగుతోంది. అయితే, పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందన్న ప్రకటనతో విశాఖ భూములు హాట్ కేకుల్లా మారడమే కాదు... ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. సాగర నగరం విశాఖలో భూములకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అనే అదనపు హంగు చేరడంతో ఆ డిమాండ్ మరింత రెట్టింపు అయ్యింది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలోని ద్వారకానగర్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, సీతమ్మధరా, ఎంవీపీకాలనీ, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో గజం ధర అక్షరాలా లక్షన్నర రూపాయలు పలుకుతోంది. అదే విశాఖ శివారు ప్రాంతాలైన కొమ్మాది, మధురవాడ, సింహాచలం, పెందుర్తి, రుషికొండ, భీమిలి తదితర ఏరియాల్లో గజం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. ఇక, కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. మరోవైపు, ఏపీ రాజధాని నగరంగా విశాఖ మారనుండటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో, భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ల్యాండ్ ట్రేడింగ్ లో 12.5శాతం వృద్ధిరేటు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, రాజధాని వార్తలతో అది మరింత దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకోనుంది. మొత్తంగా విశాఖలో భూములు హాట్ కేకుల్లాగానూ.... ధరలు చుక్కలను తలపిస్తున్నాయి.

యుగాంతం కాబోతోందా? కొన్ని గంటలే బతుకుతామా? ఆరు గ్రహాల కలయిక ప్రళయమేనా?

డిసెంబర్ 25... సాయంత్రం 4గంటల 41నిమిషాలకు ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయ్‌. ఆరు గ్రహాలు ఒకేరాశిలో కలబోతున్నాయ్‌. ఇది డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 27 రాత్రి 11గంటల 40 నిమిషాల వరకు కొనసాగనుంది. షష్టి గ్రహ కూటమిగా దీన్ని పిలుస్తున్నారు. అయితే, ఇలాంటి అద్భుతం వందేళ్ల క్రితం ఏర్పడిందని కొందరు చెబుతుంటే, కాదుకాదు 297ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ ఏర్పడలేదని మరికొందరు చెబుతున్నారు. అయితే, ఏదో జరగబోతున్నదనే ప్రచారం మాత్రం పెద్దఎత్తున జరుగుతోంది. ఎందుకంటే, ఒకేసారి ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుండటంతో అరుదైన విశేషమే అయినా... ఏవైనా దుష్పరిణామాలు జరుగుతాయేమోనని భయపడుతున్నారు. వాస్తవానికి గోచారంలో పంచ గ్రహకూటమి కానీ... షష్టగ్రహ కూటమి కానీ... లేదా సప్త గ్రహ, అష్ట గ్రహకూటమి జరిగినప్పుడు ఫలితం ఏవిధంగా ఉంటుదో కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, దాంతో అంచనా వేయడం కష్టమంటున్నారు. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20 శాతం వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయని చెబుతున్నారు‌. ఆయా రాశుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుందే తప్ప అన్ని రాశుల వారికి చెడు ఫలితం ఇస్తుందనుకోవటం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు పది రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనుస్సులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినందున... ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు గానీ, మంచిగానీ ఏదైనా నామమాత్రంగానే ఉంటుందని అంటున్నారు. ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నామని ఖగోళ శాస్త్రవేత్తలు అంటుంటే... పండితులు మాత్రం ప్రళయం తప్పదని అంటున్నారు. మరికొందరైతే యుగాంతం ఖాయమంటున్నారు. కొన్ని గంటలే మన బతుకుతామనే మాటలు చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి ప్రకృతి ఒడిలో చిచ్చు పెట్టబోతోందని అంచనా వేస్తున్నారు. గ్రహాల కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యగ్రహణం కూడా ఉండటంతో డిసెంబర్ 25న అసలేం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.

మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం..!

విజయనగరం కలెక్టరేట్‌ సాక్షిగా మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం బయటపడింది. మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు... స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన బాధితులు... మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ ఆగడాలపై ఏకరువు పెట్టారు. మంత్రి బొత్స అండదండలు ఉన్నాయనే భరోసాతో తమ భూముల్లో బొత్స ఆదినారాయణ దౌర్జన్యంగా గోడలు కట్టారంటూ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. విజయనగరం జిల్లా జేసీ, ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాము మధ్యతరగతి కుటుంబాల వారమని, దాదాపు 40ఏళ్లు కష్టపడి విజయనగరం సత్యసాయినగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 53/4, 53/5లో స్థలాలను కొనుగోలు చేశామని... అయితే ఇఫ్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు బొత్స ఆదిబాబు ప్రయత్నిస్తున్నారంట కిరణ్, బి.రాజేష్, టీఏ సూర్యనారాయణ, అశోక్ కుమార్, వాసవి, పద్మావతి, గోవిందమ్మ తదితరులు దాదాపు 40మంది బాధితులు వాపోయారు.  సొంతిళ్లు కట్టుకోవాలని రూపాయి రూపాయి కూడబెట్టి స్థలం కొనుక్కుంటే ఇఫ్పుడు ఇలా కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా అధికార వైసీపీ నేతలే భూకబ్జాలకు పాల్పడుతుంటే తమ గోడు ఇంకా ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించి భూములు కట్టేశారని... అయితే, భూములకు సంబంధించిన అన్ని పత్రాలు, అనుమతులు తమ దగ్గర ఉన్నాయని అధికారులకు ఆధారాలు సమర్పించారు. తాము ఇల్లు కట్టుకోవడంలో ఆలస్యం కావడంతో ... తన అంగబలంతో మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ... ఆ స్థలం చుట్టూ గోడను నిర్మించారని బాధితులు వాపోతున్నారు. తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.  

వైజాగే ఏపీ రాజధాని... రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన..!

ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే యథాతథంగా జీఎన్ రావు కమిటీ నివేదిక రూపంలో ఇవ్వడంతో ఇక ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్... వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... అంటూ సింపుల్ స్టేట్-మెంట్ గా చెప్పుకున్నా... ఏదో ఒకటి మాత్రమే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందనేది వాస్తవం. కర్నూలు, అమరావతి, విశాఖల్లో ఏది ఏపీ రాజధాని అంటూ జీఎన్ రావు కమిటీని మీడియా ప్రతినిధులు అడిగితే మాట దాటవేసినా... ఎక్కడ సచివాలయం ఉంటుందో అదే రాజధానిగా చెలామణి అవుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఈ లెక్కన చూస్తే విశాఖపట్టణమే... ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నది తేలిపోతుంది. అంతేకాదు భీమిలి దగ్గరే రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహానగరంగా మారబోతోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది, పార్టీపరంగా దాదాపు అధికారిక ప్రకటనే అయినా... ప్రభుత్వపరంగా మరో మూడ్రోజుల్లో జగన్ సర్కారు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.   జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించనున్న జగన్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే మీడియా ముందుకొచ్చి ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్ మీటింగ్ తర్వాత రోజు అంటే డిసెంబర్ 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే పనులకు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. అదేవిధంగా త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు... భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స తెలిపారు. ముంబై తర్వాత విశాఖే అభివృద్ధి చెందే నగరమని జీఎన్ రావు కమిటీ గుర్తించిందన్న బొత్స... రాజధాని నగరంగా మారేందుకు వైజాగ్ కు అన్ని హంగులూ ఉన్నాయన్నారు.    అయితే, మూడు రాజధానులపైనా... అలాగే... విశాఖే ...ఏపీ కేపిటల్ అంటూ... రెండు మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో... అమరావతిలో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశముందని ముందుజాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను అమరావతికి తరలించారు. మరి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్దఎత్తున ఉద్యమిస్తోన్న రైతులు.... ఒకవేళ విశాఖే ఏపీ రాజధాని అని అధికారికంగా ప్రకటిస్తే ఏవిధంగా రియాక్టవుతారో... ఏస్థాయిలో పోరాటం చేస్తారో చూడాలి.  

రాజధాని ఏమైనా జగన్ సొంతిల్లా...ఇష్టమొచ్చినట్లు మార్చడానికి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని మందకృష్ణ మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తప్పుబట్టిన మందకృష్ణ.... సొంత ఇంటి నిర్మాణంలా ఏపీ రాజధానిని మార్చేస్తే కుదరదని అన్నారు. రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, భద్రతకు సంబంధించినదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్‌కు సూచించారు. అయినా, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇవ్వక ముందే సీఎం జగన్మోహన్‌రెడ్డి... మూడు రాజధానులు ఉండొచ్చేమోనని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. జగన్ మాటలనే జీఎన్ రావు కమిటీ తన నివేదికగా ఇచ్చిందనేది స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు. అంటే, తాము అనుకున్నట్లుగా జీఎన్‌ రావు కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారని మందకృష్ణ ఆరోపించారు. అయినా, నిర్మాణ దశలో ఉన్న అమరావతిని వదిలేసి మూడు రాజధానుల ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిని ఇలా మార్చుకుంటూ పోవడం మంచిది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని మందకృష్ణ సూచించారు. రాజధాని పేరుతో కాకుండా.... పరిపాలనా సౌలభ్యం, శ్రీభాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే అందరూ మద్దతిస్తారని అన్నారు. అయితే, ప్రకాశం జిల్లా దొనకొండలో రాజధానిని ఏర్పాటు చేసుంటే మూడు ప్రాంతాల మధ్య సమతుల్యత వచ్చేదన్న మందకృష్ణ..... జగన్, చంద్రబాబు తీరుతో ఆంధ్రులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు.

కర్నూలు జిల్లా టీడీపీ నేత హత్య కేసును చేదించిన పోలీసులు

కర్నూలు జిల్లా టీడీపీ నేత మంజుల సుబ్బారావు హత్య కేసును చేధిందించారు పోలీసులు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లు, రెండు స్కార్పియో వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. కొలిమిగుండ్ల మండలం చింతలాయి పల్లెకు చెందిన టీడీపీ నేత మంజుల సుబ్బారావు ఈ నెల 17 న హత్యకు గురయ్యారు. బెలూం గుహల దగ్గర టీ తాగుతుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా నరికి చంపేశారు. కత్తులతో నరికినా కసితీరని దుండగులు నిస్సహాయస్థతిలో ఉన్న సుబ్బారావు పై బండరాళ్లతో కొట్టి దాడి చేసి చంపేశారు. టిడిపి నేత మర్డర్ జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పోలీసులు రంగం లోకి దిగి నిందితుల కోసం వేట కొనసాగించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట క్రాస్ రోడ్ దగ్గర నిందితులు కనిపించటంతో వారిని అదుపు లోకి తీసుకున్నారు. సుబ్బారావు హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడు గతంలో నిందితులతో సన్నిహితంగా ఉండేవాడని ఆర్థికంగా కాస్త బలోపేతమైన తరువాత వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడంతో తట్టుకోలేకే 11 మంది కలిసి అతన్ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. తమ గ్రామ ఆధిపత్యానికి అడ్డొస్తున్నాడనే కారణం గానే హత్య చేసినట్లుగా నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

సింగరేణి 131 వ వార్షికోత్సవం... లాభాల్లో కార్మికులకు సైతం వాటా పంచుతూ రికార్డ్

బొగ్గు వెలికితీతలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది సింగరేణి సంస్థ. ఒకప్పుడు తట్ట చెమ్మస్ తో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బొగ్గు ఉత్పత్తి మొదలైన 1889 లో ఏటా 59,671 టన్నుల బొగ్గు తవ్విన కంపెనీ ప్రస్తుతం 20 మంది అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల పరిధిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో దూసుకుపోతోంది. 2013 లో 50 మిలియన్ టన్నులుగా ఉన్న సంస్థ లక్ష్యం ఏటా 10 శాతం వృద్ధితో పరుగులు పెడుతోంది. బొగ్గు ఉత్పత్తిలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి సంస్థ 131 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.  సంస్థ ప్రారంభంలో ఓపెన్ కాస్టు ప్రాజెక్టులోని భారీ యంత్రాలను వినియోగించారు అధికారులు. ఇప్పుడు భూగర్భ గనుల్లోనూ ఎస్డీఎల్, ఎల్హెచ్డీ, కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్, హైవాల్ టెక్నాలజీతో బొగ్గు తవ్వుతున్నారు. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుతో సమానంగా ఆసియా ఖండంలోనే మొదటిసారిగా సింగరేణిలో అడ్రియాల ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓసిపిల్లో బొగ్గు తీసేందుకు గతంలో 35,60,85 టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్లను వాడగా, ఇప్పుడు 100 టన్నుల కెపాసిటీ డంపర్లు ఉపయోగిస్తున్నారు. వచ్చే పదేళ్లలో కొత్తగా 14 ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు, 8 భూగర్భ గనులను ప్రారంభించేందుకు 7,429 కోట్ల అంచనాతో ప్లాన్ రెడీ చేసింది సింగరేణి. దీనితో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏటా వంద టన్నుల బొగ్గు వెలికితీయాలనే టార్గెట్ తో ఉంది.  బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలపై దృష్టి పెట్టింది సింగరేణి సంస్థ. 2016 లో మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1200 ల మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు విద్యుత్ ప్లాంట్లను స్టార్ట్ చేసి విద్యుత్ ఉత్పత్తి లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో మరో ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ కరెంటు ప్లాంట్ ఏర్పాటుకు ఈ మధ్యే పర్యావరణ అనుమతులొచ్చాయి. ఇక సోలార్ పవర్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది సింగరేణి సంస్థ. 1,350 కోట్లతో 300 ల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో 600 ల కోట్ల రూపాయలతో 129 మెగావాట్ల కెపాసిటీ గల ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. గతంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేయగా ప్రస్తుతం సొంతంగా రెండు ఎక్స్ ప్లోజివ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. జీతాలు చెల్లించలేని పరిస్థితి నుంచి కార్మికులు ఉద్యోగులకు లాభాల్లో వాటా పంచే స్థాయికి చేరుకుంది సింగరేణి.  వరుస సమ్మెలతో 1991 నాటికి సింగరేణి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. 1997 నాటికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ సంస్థను బతికించుకోవాలని కార్మికులు అధికారుల కృషితో 2000 నుంచి సంస్థ లాభాల్లోకి వచ్చింది. 2018,19 లో సంస్థ 1766 కోట్ల రూపాయల లాభం ఘటించగా అందులో వాటా కింద 493 కోట్లను కార్మికులు ఉద్యోగులకు పంచారు. కేంద్ర రాష్ట్రాలకు ఫైనాన్స్ సపోర్టు చేస్తోంది సింగరేణి. పన్నుల కింద రాష్ట్రానికి 13,105 కోట్లు, కేంద్రానికి 14,362 కోట్లు చెల్లించింది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో అభివృద్ధికీ డిస్ట్రిక్ మిల్డ్రన్ ఫండ్ ట్రస్ట్ కింద 1844 కోట్లు చెల్లించింది. ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశంలోనే ఎక్కడా లేనట్లుగా లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది సింగరేణి.

బులెట్ రాణి: యువతి శరీరంలో దొరికిన బులెట్.....

యువతి శరీరంలో బులెట్ దొరకడం హైదరాబాద్ లో సంచలనం రేపుతోంది. బహదూర్ పురా మండలం జహనుమా ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె అస్మా బేగం వెన్ను నొప్పితో రెండు నెలల క్రితం నిమ్స్ ఓపి విభాగానికి వచ్చింది. సాధారణ వెన్ను నొప్పిగా భావించిన వైద్యులు మందులు రాసి పంపారు. నెల రోజుల తర్వాత ఆమె మళ్లీ హాస్పిటల్ కి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గత శనివారం వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయించారు. వెన్నుపూసలో ఎల్ 1, ఎల్ 2 భాగంలో ఏదో ఫారిన్ బాడి ఉన్నట్టు గుర్తించారు. దాన్ని బయటకు తీయడానికి శస్త్ర చికిత్స చేయగా తుపాకీ తూటా బయటపడింది. దీంతో దీనిని మెడికో లీగల్ కేసుగా భావించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశారు. బుల్లెట్ ఆమె శరీరం లోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తెలపలేదని హాస్పిటల్ వర్గాలు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఆమె శరీరంలో తూటా ఏడాదిన్నరగా వుందని పోలీసులే చెబుతున్నారు. బాధిత యువతి ఫలక్నుమా ప్రాంతానికి చెందినది కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. రెండు, మూడు రోజుల్లో కేసును చేధిస్తామని సిపి అంజనీ కుమార్ తెలిపారు. అయితే అస్మా బేగం కుటుంబ సభ్యులు మాత్రం రెండేళ్ల క్రితం ఆమె పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ వారు చెప్పినట్లు రెండేళ్ల క్రితం నిజంగానే కాల్పులు జరిపి ఉంటే పోలీసులకు అప్పట్లోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తూటా శరీరంలోకి దూసుకెళ్తే గాయమవుతుంది. ఆ గాయానికి వైద్యం ఎక్కడ చేయించారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అంతేకాదు యువతి తండ్రి కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యవహారం వెనుక అతని పాత్ర పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రేమ వ్యవహారమని యువతి పై ప్రియుడు కాల్పులు జరిపాడనే వాదన కూడా వినిపిస్తోంది

తెలంగాణలో మరో సంగ్రామం... మోగిన మున్సిపోల్స్ నగారా

తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియరైంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కూడా చర్యలను వేగవంతం చేయడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం... మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రస్తుతం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, జనవరి 8 నుంచి 10వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. అదేవిధంగా తిరస్కరించిన నామినేషన్లపై జనవరి 12, 13 తేదీల్లో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14వరకు గడువు ఇచ్చారు. జనవరి 22న పోలింగ్ నిర్వహించి... జనవరి 25న ఫలితాలఅను వెల్లడించనున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు  రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించడం... అలాగే, ఎన్నికల హామీల్లో చాలా వరకు ఇంకా అమలు చేయకపోవడం... మరోవైపు విపక్షాలు కూడా మున్సిపోల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో... ఈసారి ఏకపక్ష ఫలితాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు.

జగన్ 3 రాజధానుల నిర్ణయం పట్ల బీజేపీ నేతల విభిన్న వ్యాఖ్యలు .....

ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనతో బిజెపిలో రాజకీయ దుమారం మొదలైంది. పార్టీ ఏపీ నేతలలో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేయటంతో కేడర్ అయోమయంలో పడింది అంటున్నారు. పార్టీ ముఖ్యనేతలు రోజుకో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకటన వెలువడిన తొలి రోజు విష్ణువర్ధనరెడ్డి, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మినారాయణ, మాధవ్ లాంటి నేతలు కాస్త అటు ఇటుగా జగన్ నిర్ణయాన్ని దాదాపుగా సమర్ధించినట్టే మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించగానే పెను దుమారం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ ఆగ్రహించింది, జనసేన పార్టీ మండి పడింది, వామపక్షాలు భగ్గుమంటున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ లోనే తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి మాత్రం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. దాని వెనుక బలమైన కారణాలున్నాయి. వారు ఏదో ఒక కారణం వెతుక్కొని వైసీపీ లోకి వెళ్లాలని చూస్తున్నారనే టాక్ ఉందని సమాచారం. కానీ బిజెపి నేతలకు ఏమయిందని ఇప్పుడు పార్టీ లోనే చర్చ మొదలైంది. బీజేపీలో జగన్ ప్రకటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ సీనియర్ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. తాను గతంలోనే మూడు రాజధానుల విషయమై ఊహించానని ఆ ఊహలకు తగ్గట్టు గానే జగన్ నడుచుకుంటున్నారని సెలవిచ్చారు జీవీఎల్. ఇలా బీజేపీలో మూడు రాజధానుల విషయమై భిన్న స్వరాలు వినిపిస్తుండటం గమనార్హం. బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అయితే మూడు రాజధానుల విషయంలో జగన్ ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూడు రాజధానుల వ్యవహారంతో బీజేపీని వైఎస్ఆర్సిపి చాలా గట్టిగా దెబ్బకొట్టినట్లే కనిపిస్తుందటున్నారు. టీజీ వెంకటేష్ ఇప్పటికే వైసీపీతో టచ్ లోకి వెళ్లారంటున్నారు. సుజనా చౌదరి మాత్రం ఈ వ్యవహారంలో చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అంటున్నారు. జీఎన్ రావు కమిటీ అనేకంటే దాన్ని జగన్ మోహన్ రెడ్డి కమిటీ అంటే బావుంటుందని వ్యాఖ్యానించారు. అంతకుముందు అదే విష్ణువర్దన్ రెడ్డి జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయా అన్నది ఆయన వాదన. టిడిపిని గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదంటున్నారు. హైకోర్టును కర్నూలులో పెట్టమంటే నాడు చంద్రబాబు వినలేదు, రాష్ట్రాన్ని ఫుట్ బాల్ ఆడుకున్నారని విష్ణు వ్యాఖ్యానించడం విశేషం. హైకోర్ట్ రావడం వల్ల కొత్తగా కర్నూలుకి మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్ లు నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప ఇంకే లాభం లేదంటున్నారు ఆయన. ఇక బీజేపీలో ఏ ప్రాంత నాయకుడు ఆ ప్రాంతానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. దీంతో పార్టీ కేడర్ లో గందరగోళం ఏర్పడింది. మరో పక్క ఇదంతా పార్టీ వ్యూహంలో భాగంగానే చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏ ప్రాంతంలోనూ పార్టీ బలహీన పడకూడదనుకుంటే ఇలాంటి వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించాకే ఈ ప్రకటనలు చేస్తున్నారని జనాలు అభిప్రాయపడుతున్నారు..  

ఎవరికి ఏం చెప్పాలో అదే చెబుతా... రాజధాని రగడపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు

రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నిస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజధానిని తరలించొద్దంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న అమరావతి రైతులు, కుటుంబాలు... ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. రాజధానిని తరలిస్తే అమరావతి కోసం భూములిచ్చిన తమ పరిస్థితేంటని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మోడీ భూమిపూజ చేసిన చోట రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తుంటే తమ నిద్ర పట్టడం లేదని... కనీసం అన్నం కూడా సహించడం లేదని అమరావతి రైతులు, మహిళలు... ఉపరాష్ట్రపతికి తమ బాధను చెప్పుకున్నారు. రాజధాని వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరిన రైతులు... ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా కేంద్రంతో ప్రకటన చేయించాలని కోరారు.  అయితే, తాను రాజకీయాలు మాట్లాడకూడదంటూ అమరావతి రైతులు, మహిళలకు నచ్చజెప్పిన వెంకయ్యనాయుడు... మీ బాధను అర్ధం చేసుకోగలను.... ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుందో అది జరిగేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు... దేశ భవిష్యత్ కు ఏది మంచిదో అదే చేస్తానని... ఎవరికి ఏం చెప్పాలో అదే చెబుతానని భరోసా కల్పించారు. అయితే, తాడేపల్లిగూడెం నిట్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.... అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కేవలం జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరముందన్నారు. అయితే, తన వ్యాఖ్యలను ప్రస్తుతం ఏపీలో వికేంద్రీకరణ రగడతో ముడిపెట్టొద్దని సూచించారు.  

బీజేపీకి బిగ్ షాక్.. ఐదు రాష్ట్రాల్లో అధికారం పోయింది!!

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. 81 స్థానాలకు గాను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 46 సీట్లు గెలుచుకొని ఈ కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. బీజేపీ కేవలం 25 సీట్లతో ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అధికారం కోల్పోయిన బీజేపీ.. తాజాగా జార్ఖండ్‌లోనూ అధికారానికి దూరమైంది. ఏడాది కాలంలో ఐదో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీజేపీ అధిష్టానంలో కలవరం మొదలైంది.   కొన్నేళ్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ నినదిస్తోంది. దానికి తగ్గట్టే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి వరుసగా రెండు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. కానీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీకి షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ కూటమికి చెందిన పార్టీలు పలు రాష్ట్రాలలో బీజేపీని అధికారానికి దూరం చేస్తున్నాయి. ఇదే బీజేపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఏడాదిలో ఐదు కీలక రాష్ట్రాలు చేజారిపోవడంతో బీజేపీ పెద్దలు ఢీలా పడిపోతున్నారు. త్వరలో జరగనున్న ఢిల్లీ మరియు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సవాలుగా మారనున్నాయని పరిశీలకులంటున్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీల చేతిలో కూడా బీజేపీకి ఓటమి ఎదురైతే.. బీజేపీకి కష్టాలు తప్పవని అంటున్నారు.

న్యూ ఇయర్ ఎఫెక్ట్..  డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే పదివేలు ఫైన్, వాహనం సీజ్!!

డిసెంబర్ 31 రాత్రి వచ్చిందంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరైతే పీకల దాకా తాగి రోడ్ల మీదకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. అరుపులు కేకలతో హోరెత్తించి పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తుంటారు. మరికొందరైతే రోడ్ల మీద రైడింగ్ పోటీలు పెట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చిల్లర మల్లర వేషాలను కట్టడి చేసేందుకు పోలీసులు కూడా ఈ సారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తాగే తందానా బ్యాచ్ కు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే 10,000 ల జరిమానాతో పాటు వాహనం సీజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇందు కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా, న్యూయిర్ వేడుకల్లో ప్రమాదాలతో పాటు న్యూసెన్స్ చోటు చేసుకోకుండా హోటళ్లు, పబ్బులకు గైడ్ లైన్స్ జారీ చేశారు పోలీసులు. రాత్రి ఎనిమిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. 45 డెసిబుల్స్ మ్యూజిక్ సిస్టం కంటే పెద్దవి వాడొద్దని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో మందు బాబుల భరతం పట్టనున్నారు పోలీసు అధికారులు. మొత్తం మీద మందు బాబులకు గట్టి మోత పడునుంది.

దిశ నిందితుల మృతిదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి...

దిశ నిందితుల మృతిదేహాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు దిశ అత్యాచార నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం ముగిసింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్తా నేతృత్వంలోని నలుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. మృతదేహాలను కుటుంబ సభ్యుల గుర్తించిన తరువాత రీపోస్టుమార్టం మొదలు పెట్టారు. ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉండగా, శివ శరీరంలో మూడు బులెట్ గాయాలు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్ గాయాలు,చెన్నకేశవులు శరీరంలో ఒక బులెట్ గాయాన్ని గుర్తించారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టు మార్టం పూర్తి చేసేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టింది. రిపోస్టుమార్టం అనంతరం నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ,జొల్లు నవీన్ ,చెన్నకేశవుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ భద్రత మధ్య స్వస్థలాలకు మృతదేహాలను తరలించారు. ఎట్టి పరిస్థితిలో ఇవాళ అంత్యక్రియల పూర్తయ్యేలా ఏర్పాట్లు  చేస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఐదు లోపు నివేదిక సమర్పించాల్సిందిగా ఇప్పటికే హై కోర్టు ఆదేశించింది. ఈనేపధ్యంలో రీపోస్టుమార్టం వీడియో ప్రక్రియ సీడీ, పెన్ డ్రైవ్ను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. పోస్టుమార్టం మొత్తం వీడియో రికార్డింగ్ జరిగిందనీ మృతదేహాలు 50% కుల్లిపోయాయని అయ్యాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ తెలిపారు.

మోడీకి పోటీగా చాపకింద నీరులా ఎదుగుతున్న యువ నాయకుడు!!

రాజకీయ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే వారి ప్రసంగం ఆకట్టుకునేవిధంగా ఉండాలి. ప్రసంగంతో ప్రజల్ని ఉత్తేజపరచాలి.. ఆలోచనలో పడేయాలి.. వారి వెంట నడిచేలా చేసుకోవాలి.. అలాంటి వారే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. బలమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, ఎన్టీఆర్, కరుణానిధి వంటివారు ఆ కోవలోకే వస్తారు. వారి ప్రసంగం ప్రజల్ని ఉత్తేజ పరిచేది. వారి ప్రసంగం వినడం కోసం అప్పట్లో ప్రజలు కొన్ని కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లేవారు. అయితే ఈ తరంలో ఆ స్థాయిలో ప్రసంగించే నేతలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న అతి తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అసలు విపక్ష పార్టీల నేతల్లో ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకునే నేతలు లేకపోవడమే మోడీకి కసిసొచ్చిందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇప్పుడొక యువ నాయకుడు మోడీకి పోటీగా చాపకింద నీరులా బలమైన శక్తిగా ఎదుగుతున్నాడని అంటున్నారు. ఆ యువ నాయకుడు ఎవరో కాదు కన్నయ్య కుమార్. గతంలో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేసిన కన్నయ్య కుమార్... ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతగా, సిపిఐ శక్తివంతమైన నేతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడటంలో కన్నయ్య ముందుంటాడు. ఎందర్నో ఆ పోరాటంలో నడిచేలా చేస్తాడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం నుండి పౌరసత్వ సవరణ బిల్లు వరకు ఇలా ఎన్నో అంశాలపై కన్నయ్య పోరాటం చేసాడు, చేస్తున్నాడు. కన్నయ్య ప్రభావం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తోంది. ఆయన ప్రసంగం వినడానికి యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన మాటలతో యువతలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగుతున్నాయి. ఇక ఇటీవల ఆయన ఆజాదీ నినాదం యువతలోకి బలంగా వెళ్లింది. ఆయన గొంతు వినిపిస్తే చాలు వేల గొంతులు జత కలుస్తున్నాయి. మొత్తానికి ఈ 32 ఏళ్ళ దళిత యువ నాయకుడు.. తన ప్రసంగాలతో యువతని కదిలిస్తూ బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అతని ప్రస్థానం ఇలాగే కొనసాగితే.. కాన్షీరాం, మాయావతి వంటి శక్తివంతమైన దళిత నాయకుల సరసన చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పల్లె ప్రగతి పై సీఎం సంచలన నిర్ణయం...

పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పని తీరును పరిశీలించేందుకు జనవరి ఒకటి నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని రంగంలోకి దించుతున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమాల పురోగతి నాణ్యతను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం గతంలో 30 రోజుల పాటు జరిగింది. ప్రతీ పల్లెలో అక్కడున్న లోకల్ సమస్యల పరిష్కారం కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో పూర్తి స్థాయిలో విజయవంతమైందని దీంతో పాటు మరోక పది రోజుల పాటు పల్లెప్రగతి నిర్వహించాలని, ఇప్పటి వరకు ఏదైతే 30 రోజులలో నిర్వహించిన కోణంలో పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మరొక 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించినట్లు సమాచారం. దాంతోపాటు అధికారులపై గతంలో జరిగినటువంటి సమస్యల పై చాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్లె ప్రగతిలో ప్రజలు చాలా చురుగ్గా పాల్గొనడమే కాక ప్రజా ప్రతినిధులు కూడా చాలా ఆశక్తి చూపించారు. కానీ అధికారులు మాత్రం సమస్యలను నమోదు చేసుకుని, అక్కడ పరీష్కారం కాని సమస్యలను  ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విషయంలో విఫలమయ్యారంటూ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈ సారి జరిగేటువంటి పల్లె ప్రగతి పని తీరుని జనవరి ఒకటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ లను ఏర్పాటు చేశారు. ప్రతి పల్లెలో వాళ్ళు పర్యటిస్తారు. ఈ సారి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకునెలా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.