ఉపరాష్ట్రపతి వెంకయ్య కంటతడి.. లోక్ సభ నిరవధిక వాయిదా

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలోకంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన  వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.  మంగళవారం సభలో జరిగిన పరిణామాలను తనను తీవ్రంగా బాధించాయంటూ  బుధవారం గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు.   ‘‘చైర్మన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిది. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆవేదన కలిగించే విషయం. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.’’ అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు హితవు చెప్పారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఆప్, కాంగ్రెస్ సభ్యులు పోడియం ఎదుట టేబుట్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు.  ప్రతిప‌క్షాలు పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున ఆందోళ‌న కొన‌సాగిస్తుండ‌డంతో షెడ్యూల్ క‌న్నా ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది.ఆశించిన స్థాయిలో స‌భ జ‌ర‌గ‌క‌పోవ‌డం బాధించింద‌ని చెప్పారు. లోక్‌స‌భ ప్ర‌తిష్ఠ‌ను త‌గ్గించేలా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పారు. లోక్‌స‌భ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై స్పీక‌ర్ ఓం బిర్లా వివ‌రాలు తెలిపారు. లోక్‌స‌భ‌లో 20 కీల‌క బిల్లుల‌కు ఆమోద ముద్ర ప‌డింద‌ని వివ‌రించారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీలు స‌హ‌క‌రించాయ‌ని చెప్పారు. వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం 21 గంట‌ల 14 నిమిషాల పాటు జ‌రిగాయ‌ని వివ‌రించారు. 

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ టికెట్.. ఈటలకు విద్యార్థి నేత పోటీ ఇచ్చేనా? 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోరాటంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎవ‌రిని ఉప ఎన్నిక బ‌రిలోకి దింపుతుంద‌న్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో ప‌లు సార్లు అరెస్ట‌యి జైలుకెళ్లారని చెప్పింది. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధ‌తను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది. దళిత బంధు పథకం ప్రారంభ సమావేశ సందర్భంగా.. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం పరిచయం చేయనున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నందున ఆయన వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు.. రాజేందర్ రాజీనామా తర్వాత తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. భారీ బైక్ ర్యాలీతో హడావుడి చేశారు. హరీష్ రావు హుజురాబాద్ లో పర్యటిస్తున్న సమయంలోనే పార్టీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. దీంతో పక్కా ప్రణాళికతోనే టీఆర్ఎస్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.  హుజురాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. ఈటల పాదయాత్ర మొదలు పెట్టి పల్లెపల్లె చుట్టేస్తుండగా.. ఇటు టీఆర్ఎస్ కూడా సామాజిక వర్గాల వారిగా ఓటర్లకు గాలం వేసే ఎత్తుగడలు అమలు చేస్తోంది. 

గవర్నర్ కు చేరని ఎమ్మెల్సీ ప్రపోజల్! కౌశిక్ రెడ్డికి కేసీఆర్ షాకిస్తారా? 

తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న సీఎం కేసీఆర్... ప్రభుత్వ పథకాలతో పాటు పదవుల పందేరం కూడా హుజురాబాద్ కేంద్రంగానే అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ ప్రతిపాదనకు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాని అదంతా అసత్యమని తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా నియమించబడలేదని సమాచారం.  పాడి కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినా... దానికి సంబంధించిన ప్రపోజల్ ఇంకా గవర్నర్ కార్యాలయానికే వెళ్లలేదని తెలుస్తోంది. కేబినెట్ లో తీర్మానం చేసినట్లు చెప్పారు కాని... గవర్నర్ కు పంపించలేదని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని అధికారిక వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గవర్నర్ అందుబాటులో లేరని చెప్పడానికి కూడా లేదు. కొన్ని రోజుల క్రితం పుదిచ్చేరిలో ఉన్న తమిళిసై... గత వారం హైదరాబాద్ వచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరూ ఆమెను సంప్రదించలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినట్లు ప్రచారం చేసిన అధికార పార్టీ.. ఆ ప్రతిపాదనను గవర్నర్ కు ఇంకా ఎందుకు పంపలేదన్నది చర్చగా మారింది.  కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత ఉప ఎన్నిక కోసం కసరత్తు కూడా చేశారు. అయితే హుజురాబాద్ లో తమకు బలమైన అభ్యర్థి లేరని గ్రహించిన టీఆర్ఎస్.. కౌశిక్ రెడ్డికి గాలం వేసింది. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను కౌశిక్ రెడ్డి కలిసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని కౌశిక్ రెడ్డి చెప్పినా.. కాంగ్రెస్ లో మాత్రం అనుమానమే ఉంది. చివరకు అదే నిజమవుతూ కౌశిక్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది. కాంగ్రెస్ లో ఉండగానే.. తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ సీరియస్ గా స్పందించడంతో.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ బరిలో ఉంచాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసినా... ఆడియో లీక్ కావడంతో సీన్ మారిపోయింది. దీంతో అతనికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత పరిణామాలే కౌశిక్ రెడ్డి టీమ్ ను కలవరపరుస్తున్నాయి. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందట. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్లు లీడర్లను కాదని కౌశిక్ రెడ్డికి ఇవ్వడం సరికాదనే అభిప్రాయం కొందరు నేతలు చెప్పారని తెలుస్తోంది.  అంతేకాదు కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ లో వ్యతిరేకత ఉందని, ఆయన సెటిల్ మెంట్ విషయాలు బయటికి వస్తే పార్టీకి ప్రమాదమని కొందరు నేతలు సూచించారట. హుజురాబాద్ ఎన్నికల వరకు వెయిట్ చేస్తేనే బెటరని మరికొందరు నేతలు కేసీఆర్ కు సూచించారట. పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు కౌశిక్ రెడ్డిపై పెండింగులో ఉన్న కేసులు బయటికి రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలను కొందరు గవర్నర్ కు నివేదించారని సమాచారం. నామినేటెడ్ కోటాలో నియామకం కాబట్టి...కేసుల కారణంతో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ నిలుపుదల చేసే అవకాశం ఉందనే సమాచారం కూడా సీఎం కేసీఆర్ కు వెళ్లిందని అంటున్నారు. అలా జరిగితే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అందుకే నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీపై మంత్రివర్గంలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు ప్రభుత్వం పంపించలేదని చెబుతున్నారు.  మరోవైపు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారనే సంతోషంతో సంబరాలు చేసుకున్న ఆయన అభిమానులు మాత్రం తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఇంతకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారా లేదా... కాకుంటే ఎందుకు కాలేదు, ఎప్పుడు అవుతారనే ప్రశ్నలు వాళ్లలే వాళ్లే వేసుకుంటున్నారట. మరికొందరు కౌశిక్ రెడ్డి అనుచరులు మాత్రం కేసీఆర్ రాజకీయాలు ఇలానే ఉంటాయి... ఊబీలో ఇరుకున్నాకా చేసేదేమి ఉండదు.. వెయిట్ చేయాల్సిందేనని సెటైర్లు వేస్తున్నారట. చూడాలి మరీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందో..

హస్తానికి హాయ్.. బీజేపీకి బైబై! పీకే డైరెక్షన్ లో జగన్ రూట్? 

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూట్ మార్చారా? కాంగ్రెస్ సారధ్యంలో వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో ఏర్పడే బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమితో చేతులు కలిపారా? అందుకే కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు ముందు అంగీకరించి, ఆపైన వెనక్కి తగ్గారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అందుకే ఇంతకాలం రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలను చూసి చూడనట్లు వదిలేసిన కేంద్రం.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కన్నేసిందని చెబుతున్నారు ఇరు పార్టీల మధ్య సాగిన చీకటి చర్చల లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషుకులు... రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇక చీకటి పొత్తులు, చీకటి ఒప్పందాల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నువ్వోకందుకు పోస్తే, నేనోకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, చీకటి సంబంధాలు సాగిపోతుంటాయి. గత రెండున్నర సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీల నడుమ ఇదిగో, ఇలాంటి చీకటి ఒప్పందమే ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  నిజానిజాలు ఎలా ఉన్నా, నిన్న మొన్నటి దాక  రెండు పార్టీల నడుమ సంబంధాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే విధంగా ఉన్నాయి అనేది మాత్రం నిజం.  నిజానికి, 2019 ఎన్నికలకు ముందే బీజేపీ, వైసీపీ సంబంధాలకు బీజం పడింది. టీడీపీ, బీజేపీ బంధం తెగిపోయిన తర్వాత బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఇది బహిరంగ రహస్యం. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీ రావడానికి, ఇంకా అనేక కారణలు ఉన్నా, బీజేపీ వైసీపి వైపు మొగ్గు చూపడం కూడా ఒక కారణం అనేది అందరూ అంగీకరిస్తున్నదే. అదే రహస్య బంధం నిన్న మొనంటి వరకు సాగుతూ వచ్చింది. స్నేహ బంధ ఇప్పుడు కొంత చెడి నట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య విబేధాలు బజారున పడడానికి ముందు, రెండు పార్టీలను మరింత దగ్గర చేసే, మరో రహస్య యవ్వారం, చివరి క్షణంలో చేజారినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణ సమయంలో, ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే ఎత్తుగడలో భాగంగా, బీజేపీ నాయకత్వం,ఇతర ప్రాంతీయ పార్టీలతో పాటుగా  వైసీపీతోనూ మంతనాలు సాగించింది. కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు, వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక కాబినెట్, ఒక ఇండిపెండెంట్ చార్జి, ఒక సహాయ మంత్రితో  మొదలైన బేరసారాలు  రెండు కాబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి వద్ద ఫైనలైజ్ అయిందని, అయితే, చివరి క్షణంలో వైసీపీ, వెనక్కి తగ్గిందని సమాచారం.  అయితే ఇలా వైసీపీ వెనకడుగు వేయడం వెనక ప్రశాంత్ కిశోర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు, విపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిశోర్, డీల్ నుంచి జగన్ రెడ్డిని వెనక్కి లాగినట్లు సమాచారం. ఒక దశలో  వైసీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయి రెడ్డి కూడా, అవును మాటలు అయితే జరిగాయి, డీల్ కుదిరిందో లేదో మాత్రం గౌరవ ముఖ్యమంత్రే  చెప్పాలని అన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.  వైసీపీ ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయం ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్లు  తెప్పించినట్లు తెలుస్తోంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక అరాచకం మీద కేంద్రం దృష్తి పెట్టిందని అంటున్నారు. అయితే, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ అవసర సమయంలో అందిస్తున్న సహకారం ఇకపై కూడా కొనసాగుతుందని జగన్ రెడ్డి బీజేపీ నేతలకు తెలిపినట్లు సమాచారం. జగన్ రెడ్డి 2014 నుంచి కూడా అవసరార్ధం బీజేపీకి, ముఖ్యంగా  పెద్దల సభలో కీలక బిల్లులు పాస్ చేసుకోవడంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. కానీ, అవకాశం చిక్కితే దెబ్బ తీసేందుకు సిద్దంగా ఉన్నారని, లేటెస్ట్ డెవలప్మెంట్ తో తెలిసిపోయిందని అంటున్నారు.  అంతే కాదు 2024 ఎన్నికలకు ముందు, బీజేపీ వ్యతిరేక శక్తుల కూటమి ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమత బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ప్రయత్నాలతో జగన్ సైతం చేతులు కలిపారని  మరోసారి రుజువైందని అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి, 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. దురదృష్ట వశాత్తు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, అందుకని ఇక ప్రత్యేక హోదాను మరిచి పోవడమే మంచిదనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకొంత బయట పడ్డారు. కానీ కనీసం మరో రెండున్నర సంవత్సరాలు అయితే కేంద్రంలో బీజీపీనే అధికారంలో ఉంటుంది.. జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి..

విపక్షాలకు కపిల్ సిబాల్ వింద్.. టీఆర్ఎస్ హాజరుతో ట్విస్ట్ 

కాంగ్రెస్ సహా బీజేపీ యేతర పార్టీలు అన్నీ, మూడేళ్ళ తర్వాత 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికలలో  ప్రధాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా ఏకం కావాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్’ తో కలిసి బీజేపీకి ప్రత్యాన్మాయ కూటమిని ఏర్పాటు  చేయడమా? కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి తృతీయ ప్రత్యాన్మాయం ఏర్పాటు చేయడమా అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మూల కారణమని భావిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  గత జూన్’లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ను కలవడంతో మొదలైన ఏకతా క్రతువు చివరకు కాంగ్రెస్ అసమ్మతి నేతల శిబిరానికి చేరింది.  ఇంచుమించుగా సంవత్సరం క్రితం  కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖస్త్రాని సంధించిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు (జీ 23) ఇప్పుడ మరో సారి తెరమీదకు వచ్చారు. అప్పట్లో లేఖాస్త్రం సంధించడంలో ముందున్న జీ 23 కీలక నేత కపిల్ సిబల్ , సోమవారం తమ జన్మదినాన్ని పురస్కరించుకుని, విపక్ష పార్టీల నేతలకు విందు ఇచ్చారు. ఈ సమావేశానికి, జీ 23 కీలక నేతలు గులాం నబీ ఆజాద్, చిదంబరం, ఆనంద శర్మ, భూపేంద్రసింగ్ హుడా, శశి థరూర్ సహా ఇంచుమించుగా అందరూ హాజరయ్యారు. అలాగే, ఆర్జేడీ అధినేత లాలలు ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సిపిఐ, సిపిఎం నాయకులు డి.రాజా, సీతారం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, శివసేన రాజ్య సభ ఎంపీ సంజయ్ రౌత్, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రిఎన్, డిఎంకే నేత తిరుచ్చి శివ తో పాటుగా తెరాస, ఆమ్ ఆద్మీ పార్టీ,  ఆర్ఎల్డీ పార్టీల నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. నిజానికి ఈ విందు సమావేశానికి ఎవరు హాజరయ్యారు అనే దాని కంటే, ఎవరు హాజరు కాలేదు, హాజరు కాని వారు ఎందుకు హాజరు కాలేదు, అనేది కీలకంగా మారింది. పన్నెండు పార్టీల నాయకులు పాల్గొన్న ఈ విందు సమావేశంలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు ఎవరూ, హాజరు కాలేదు. మరో వంక కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకురావాలనే తమ డిమాండ్’,లో మార్పు లేదని కపిల్ సిబల్ స్పష్టం చేశారు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, జీ23 చేస్తున్న ప్రయత్నాలను విపక్ష పార్టీల నేతలు కొనియాడారని ఆయన పేర్కొన్నారు.  అయితే ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిశోర్  డైరెక్షన్ లో రాహుల్ గాంధీని జాతీయ నేతగా చూపించే ప్రయత్నాలలో ఉన్న సమయంలో, జీ 23 గ్రూప్ నేత కపిల్ సిబలో త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీజేపీ ఓడించడమే లక్ష్యంగా సమాజ్ వాదీ పార్టీ గొడుగు కింత ఒకటవ్వాలని, బేషజాలకు పోకుండా, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో పనిచేయాలని పిలుపు నిచ్చారు. కపిల్ సిబాల్ ఉద్దేశ పూర్వకంగానే, రాహుల్ నాయకత్వాన్ని తక్కువ చేసి చూపేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.  బీజేపీని ఓడించేందుకు, అన్ని పార్టీలు ఏకం కావడం ఎంత అవసరమో, కాంగ్రెస్ పార్టీని  ఫస్ట్ ఫ్యామిలీ సంకెళ్ళ నుంచి విముక్తి చేయడం కూడా అంతే అవసరమని, జీ23 నాయకులు పేర్కొన్నట్లు సమాచారం. అంటే, కాంగ్రెస్’లోనే కాంగ్రెస్ నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతోంది.  రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు జీ 23 నాయకులు సిద్దంగా లేరని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ ఎటు  దారి తీస్తుందో, చూడవలసి వుంది. అయితే ఇంతవరకు జరిగిన కథలో, విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ నాయకత్వ సమస్య ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. ఆ కారణంగానే, ఐక్యతా యత్నాలు ఒకడుకు ముందుకు మూడు అడుగులు వెనక్కి అనంట్లుగా సాగుతోంది. అటు అధికార బీజేపీ కూటమికి, ఇటు విపక్షాల కూటమికి కూడా వ్యుహా, ప్రతి వ్యూహాల రచనకు, ఇంకా చాలా సమయం వుంది. ప్రస్తుతానికి అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికలే ఇరు కూటముల ముందున్న సవాలు... యూపీ ఫలితాలు తేలిపోతే, ఆ తర్వాత కథ, కధనం మారిపోతుంది.  

పీకేకు కరోనా పాజిటివ్.. మాస్క్ లేకుండానే పబ్లిక్ మీటింగ్! 

తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గినట్లు ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. జిల్లాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితమే బీఎస్పీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. కొవిడ్ నిర్దారణ కావడంతో ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్లి కాక్ టెయిల్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, మైల్డ్ లక్షణాలే కనిపిస్తున్నాయని చెబుతున్నారు.  గత నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం బీఎస్పీ పార్టీలో చేరారు. నల్గొండ ఎన్జీ కాలేజీలో నిర్వహించిన భారీ సభలో ఆయన బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి  లక్ష మంది వరకు హాజరయ్యారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఆయన చాలా ప్రాంతాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్వేరోస్ సభలు నిర్వహించారు. వేలాది మందితో ఇంటరాక్ట్ అయ్యారు.  ఇటీవల జరిన సమావేశాల్లో ప్రవీణ్ కుమార్ ఎక్కువగా మాస్క్ ధరించలేదని చెబుతున్నారు. నల్గొండ సభలోనూ ఎక్కువ సమయం ఆయన మాస్క్ లేకుండానే కనిపించారు. వేదికపై ఉన్న అతిథులు కూడా ఎవరూ మాస్క్ పెట్టుకోలేదు. ఆయన సభలకు వచ్చిన వారు కూడా కొవిడ్ రూల్స్ పాటించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కొవిడ్ సోకడంతో.. ఆయన సభలకు వచ్చిన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. 

సీఎం జ‌గ‌న్ మ‌రోసారి పాద‌యాత్ర చేయాలి.. వైసీపీ నేత‌ కీల‌క స‌ల‌హా..

జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి అంద‌లమెక్కారు. రెండున్న‌రేళ్ల‌ క్రితం రాష్ట్రం న‌లుమూల‌లా కాలిన‌డ‌క‌న చుట్టేశారు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించారు. ఒక్క ఛాన్స్ అంటూ గ‌ద్దె నెక్కి.. జ‌నాల నెత్తిన చెయ్యి పెట్టారు. అంతా ఆగ‌మాగం. జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అంటూ విప‌క్షం విమ‌ర్శిస్తోంది. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేసి.. అమ‌రావ‌తి అడ్ర‌స్ గ‌ల్లంతు  చేసి.. త‌మాషా చూస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. పోనీ, ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ విశాఖ‌నైనా ఏమైనా బాగు చేశారా అంటే అదీ లేదు. కూల్చివేతలు, క‌బ్జాల‌తో.. పీస్ సిటీని క్రైమ్ సిటీగా మార్చేశార‌ని అంటున్నారు. అందుకే, విశాఖలో క‌బ్జాల ప‌ర్వాన్ని క‌ళ్లారా చూసేందుకు సీఎం జ‌గ‌న్ ఓసారి వైజాగ్‌లో పాద‌యాత్ర చేస్తే బాగుంటుందంటూ స‌ల‌హా ఇస్తున్నారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.  ఏపీలో తిరోగమన పాలన న‌డుస్తోందంటూ ఎంపీ ర‌ఘురామ విమ‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి హైదరాబాద్‌కు వలసలు పెరిగిపోయాయన్నారు. ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి పోతున్నాయని, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనబడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో కబ్జాలు పెరిగిపోయాయ‌ని.. ఒకసారి సీఎం జగన్ వైజాగ్‌లో పాదయాత్ర చేస్తే బాగుంటుందన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని రఘురామ ఆరోపించారు.  పాల‌కుల అడుగుల‌కు మ‌డుగులు ఒత్తుతున్న‌ అధికారుల‌నూ ఓ ఆట ఆడుకున్నారు ర‌ఘురామ‌. రాజకీయ నాయకుల మెప్పు కోసం అధికారులు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తప్పును తప్పుగా చెప్పాలని అధికారులకు రఘురామ హితవు పలికారు. అనవసర అత్యుత్సాహం ప్రదర్శిస్తే శిక్ష తప్పదన్నారు. గ‌త అనుభ‌వాల‌ను గుర్తుంచుకోవాలంటూ అధికారుల‌ను అల‌ర్ట్ చేశారు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.   

మ‌రో విజ‌యమాల్యాలా జ‌గ‌న్‌? బ్యాంకుల నుంచి రూ. 56,076 కోట్ల అప్పు..

అప్పు చేసి ప‌ప్పుబెల్లాలు పెడుతోంది ఏపీ స‌ర్కారు. అప్పంటే అప్పు కాద‌ది.. ఏపీ నెత్తిన గుదిబండ‌. భ‌విష్య‌త్తులో పేల‌నున్న ఆర్థిక బాంబు. లిక్క‌ర్ ఆదాయాన్ని షూరిటీగా పెట్టిమ‌రీ అప్పులు తెస్తున్న ఘ‌త‌న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుదే. ఇలా కూడా అప్పులు తీసుకురావ‌చ్చా.. సంస్థ‌లు ఇలాంటి అప్పులు కూడా ఇస్తాయా? అనే రీతిలో మునుపెన్న‌డూ లేని త‌ర‌హాలో.. కొత్త త‌ర‌హా అప్పుల‌తో రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తోంది ప్ర‌భుత్వం. గుట్ట‌లా పేరుకుపోయిన ఆ అప్పుల చిట్టాను తాజాగా కేంద్రం బ‌య‌ట‌పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఏయే బ్యాంకుల నుంచి ఎంతెంత అప్పు తీసుకొచ్చిందో లెక్క‌ల‌న్నీ పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించింది. ఆ అప్పులోళ్ల లిస్టు చూసి.. ఆ అప్పు అమౌంట్ చూసి.. స‌గ‌టు ఆంధ్రుడి గుండె గుబేల్ అంటోంది.  ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వం భారీగా బడ్జెట్‌యేతర అప్పులు చేసినట్టు కేంద్రం ప్ర‌క‌ట‌న‌తో వెల్ల‌డైంది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్‌లు, కంపెనీల పేరుతో రూ. 56,076 కోట్లు.. అక్ష‌రాల 56వేల 76 కోట్లు.. అప్పుగా తీసుకుందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.  ఏపీకి అత్య‌ధికంగా అప్పు ఇచ్చింది ఎస్‌బీఐ. ఏకంగా రూ.15,000 కోట్లకుపైగా ఎస్‌బీఐ నుంచి ఏపీ స‌ర్కారు రుణం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్లకుపైగా అప్పు తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి  రూ. 6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 4వేల కోట్లకుపైగా ఏపీ అప్పులు చేసింది. మొత్తం క‌లిపితే 56,076 కోట్ల రూపాయ‌ల‌ని తేలింది. అంటే.. ల‌క్ష కోట్ల‌లో స‌గానికంటే ఎక్కువే. ఇవి కేవ‌లం బ్యాంకుల నుంచి చేసిన అప్పు మాత్ర‌మే. ఇక‌, ఇత‌ర కార్పొరేష‌న్ల నుంచి కూడా భారీగానే అప్పు చేసింద‌ని అంటున్నారు.  న‌వ‌ర‌త్నాల పేరుతో.. సంక్షేమ ప‌థ‌కాల మాటున‌ ప్ర‌జ‌ల‌కు తాయిలాలు ఎర‌వేస్తూ.. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దివాళా అంచుల‌కు తీసుకొచ్చింది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అంటూ విప‌క్షం మండిప‌డుతోంది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వ‌డానికి కూడా ఖ‌జానాలో చిల్లి గ‌వ్వ ఖాళీ లేకుండా మొత్తం ఊడ్చేశార‌ని అంటున్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌లు రాక‌.. ఉన్న‌వాటిని వెళ్లిపోయేలా చేస్తూ.. అభివృద్ధిని అట‌కెక్కించేశార‌నే విమ‌ర్శ ఉంది. ఇటు ప్ర‌భుత్వం, అటు సంక్షేమం సాగాలంటే.. అప్పులు మిన‌హా వేరే గ‌త్యంత‌రం లేదంటున్నారు. అందుకే, చేతికందిన కాడికి అప్పులు చేసేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. రెండంటే రెండు ఏళ్లలో 56 వేల కోట్ల అప్పులంటే మాట‌లా? ఇదేదో ఏపీ కొంప ముంచేలా ఉందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. 

అబద్దాలు మానకపోతే నరికేస్తాం.. రేవంత్ కు టీఆర్ఎస్ వార్నింగ్ 

ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు అధికార టీఆర్ఎస్ నేతలు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన దొంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కై ఇంద్రవెల్లిలో సభ పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడటం మానుకోవాలని జోగు రామన్న అన్నారు. లేదంటే కాళ్లు నరికేస్తామని హెచ్చరించారు.  ఓటుకు నోటు కేసులో అతి త్వ‌ర‌లో గాంధీ భ‌వ‌న్ నుండి ఇడ్చుకు వ‌చ్చి  రేవంత్‌రెడ్డిని జైలుకు పంపే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్ అన్నారు. చ‌రిత్ర తెలియ‌ని రేవంత్ రెడ్డికి ఆదివాసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. 1981లో గిరిజనులను పోలీసులతో చంపించిన సంస్కృతి కాంగ్రెస్‌ వాళ్లదేనని, ఇప్పుడు అదే స్థలం వద్ద దండోరా నిర్వహించడం సిగ్గు చేటన్నారు. స‌భ‌కు ల‌క్ష‌కు పైగా జ‌నం హాజ‌ర‌య్యార‌ని, ల‌క్ష మందికి జ‌నం త‌గ్గిన‌ట్లు నిరూపిస్తే త‌ల‌న‌రుకుంటా అని అన్న రేవంత్ త‌ల న‌రుక్కోవ‌డానికి సిద్దంగా ఉండాల‌న్నారు. రూ.20వేల ప‌రిమితి ఉన్న మైదానంలో ల‌క్ష మంది జ‌నాలు ఎక్క‌డి నుండి వచ్చార‌ని ఎమ్మెల్సీ ప్ర‌శ్నించారు. జ‌నం 20వేల‌కు మించి రాలేద‌ని నిరుపించేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని, త‌న స‌వాల్ ను స్వీక‌రించే ద‌మ్ము నీకు ఉందా రేవంత్ అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పేరు త‌ల్చేందుకు కూడా రేవంత్‌కు అర్హ‌త లేద‌ని, తెలంగాణ‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ జిమిక్కులు చేయాల‌ని చూస్తోంద‌న్నారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని బొంద‌పెట్టే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని ఎమ్మెల్సీ చెప్పారు.  రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్‌ ఒక్కమాట అంటే రేవంత్‌ రోడ్లపై తిరగలేడు అని కామెంట్ చేశారు.మాకు కేసీఆర్‌ సంస్కారం నేర్పారు.. రేవంత్ కన్నా ఎక్కువ మాట్లాడగలం అన్నారు సైదిరెడ్డి. హుజూర్ నగర్‌లో నియోజకవర్గానికి సంబంధించి లక్ష మందితో సభ పెట్టే సత్తా నాకుందని.. ఇంద్రవెల్లి సభ ఓ లెక్కా ? అని ఎద్దేవా చేశారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ విద్యలు ఇక నడవవని హెచ్చరించిన ఆయన.. రేవంత్ రెడ్డి టీపీసీసీ రాగానే అక్కడి సీనియర్లు అందరూ మధనపడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి తనను తాను హైలైట్ చేసుకోవడానికి సభ పెట్టినట్లు ఉందని.. ఇంద్రవెల్లి సభకు 10 వేల మంది వచ్చారా..? లేదా లక్షమంది వచ్చారా…? అనేది అందరూ చూశారన్నారు.

జ‌గ‌న్ స‌ర్కారును శ‌పించిన స్వామీజీ...

జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనేక అరాచ‌కాలు. వ‌రుస‌గా ఆల‌యాల‌పై దాడులు.. చ‌ర్చిల నిర్మాణం.. మ‌త మార్పిడిలు.. ఇలా రాష్ట్రాన్ని క్రైస్త‌వంలోకి మార్చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ సైతం జ‌గ‌న్ స‌ర్కారు పాల‌న‌పై మండిప‌డుతూ త‌న ప‌త్రిక ది ఆర్గ‌నైజ‌ర్‌లో సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. తాజాగా, ఓ స్వామీజీ సైతం ఏపీ ప‌రిస్థితుల‌పై ధ్వ‌జ‌మెత్తారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై స్వామి శ్రీనివాసానంద సరస్వతి సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలు, దేవాలయాల భూములు, హిందూ సనాతన సంప్రదాయాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఒక క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి బలవంతపు మతమార్పిడిలు జరుగుతున్నాయన్నారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వమే టెండర్లు పిలిచి ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోందని ఆరోపించారు.  రాష్ట్రంలో హిందూసనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్వామి శ్రీనివాసానంద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు దోషులను పట్టుకోలేదని విమర్శించారు. కొంతమంది మంత్రులు కూడా హిందు సనాతన సంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప‌డ్డారు. ఏపీలో ఇన్ని దుశ్చర్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దోషులను శిక్షించి హిందూ సమాజానికి మనో ధైర్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతోందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. స్వామి ఆగ్ర‌హించార‌ని కాదు కానీ.. అంత‌ర్వేది ర‌థ ద‌గ్థం, రామ‌తీర్థం విగ్ర‌హ ధ్వంసం వెనుక ఉన్న‌దెవ‌రో ఇప్ప‌టికీ గుర్తించ‌లేక‌పోవ‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే.   

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వేరో వార్నింగ్.. ఆడియో వైరల్ 

తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇంతకాలం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ జరగగా... తాజాగా బీఎస్పీ కూడా ఇందులో చేరింది. ఈనెల 8న రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్  బీఎస్పీలో చేరారు. నల్గొండలో నిర్వహించిన సభలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేశారు గులాబీ లీడర్లు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోనికి వచ్చిన ఓ ఆడియో వైరల్ గా మారింది. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రవీణ్ కుమార్ అనుచరుడు ఫోన్ చేసి బెదిరించారు ఆ ఆడియోలో.  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి ఫోన్‌ చేసి.. తాను సంపత్ స్వేరో అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టాడు.. ఫోన్‌లో ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించాడు.. ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి నీదా అంటూ.. కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడిన సంపత్‌.. మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు.. అయితే, అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే కిషోర్‌.. నా స్థాయి ఏంటో నాకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చిన ఆయన.. గాదరి కిషోర్ అంటే ఏంటో చూస్తావా.. 172 కేసులు పెట్టుకుని జైలు పాలై వచ్చిన వ్యక్తిని.. ఉద్యమాలు చేసి వచ్చానన్నారు.. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రవీణ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి బెదిరించాలని చెప్పాడా..? ఇకనైనా ఫోన్ చేసి బెదిరింపులు బంద్‌ చేయండి.. జాతి పేరు ఆగం చేయకండి అంటూ హితవుపలికారు.. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావని.. పీఎస్‌లో కేసు పెడతానని హెచ్చరించారు ఎమ్మెల్యే.. అయితే.. ఇప్పుడా ఆడియో వైరల్‌గా మారి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌.. అయితే.. ఆ తర్వాత ఓ వ్యక్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు ఫోన్‌ చేసి బెదిరించిన ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

విజ‌య‌వాడ‌లో ల‌వ్‌.. యూపీలో మ‌ర్డ‌ర్‌.. అమ్మాయిలూ జాగ్ర‌త్త‌..

అవును, వాళ్లిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఒక‌రి కోసం ఒక‌రు బ‌తుకుదాం అనుకున్నారు. పెళ్లి చేసుకొని బిందాస్‌గా బ‌తికేయొచ్చ‌ని భావించారు. అంత‌లోనే ఆ ప్రేమికుడు స‌డెన్‌గా త‌న సొంతూరికి వెళ్లాల్సి వ‌చ్చింది. నీ వెంటే నేనంటూ.. ఆమె సైతం వాళ్ల ఊరికి వెళ్లింది. క‌ట్ చేస్తే.. య‌మునా న‌ది ఒడ్డున శ‌వ‌మై ప‌డుంది. విజ‌య‌వాడ‌కు చెందిన యువ‌తి.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ర్డ‌ర్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. విజయవాడకు చెందిన త‌స్లిమా ఫాతిమా అనే యువ‌తి.. స్థానికంగా ఉంటున్న ఓ యువ‌కుడిని ప్రేమించింది. కొద్దిరోజుల క్రితం ఆ ప్రియుడు తన స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లిపోయాడు. ల‌వ‌ర్ త‌న‌ను కూడా రమ్మని చెప్పడంతో గత నెల పదో తేదీన ఫాతిమా విజయవాడలోని ఇంటి నుంచి ఎవ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోయింది. కుమార్తె ఆచూకీ తెలీక‌పోవ‌డంతో తల్లిదండ్రులు స్థానిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.  ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ యువతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా నదీ తీరంలో మృతిచెందినట్టు గుర్తించారు. ప్రియుడిని న‌మ్మి యూపీ వెళ్లింది ఆ యువ‌తి. అక్క‌డికెళ్లాక గానీ వాడి నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డ‌లేదు. ప్రేమ పేరుతో ఇన్నాళ్లూ డ్రామా ఆడార‌ని తెలుసుకుంది. కానీ, అంత‌లోనే ఆమె ల‌వ‌ర్‌, అత‌ని స్నేహితులు క‌లిసి ఆమె ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దు, బంగారం లాక్కొని.. ఫాతిమాను చంపేశారు. డెడ్‌బాడీని యుమునా న‌దిలో తోసేశారు.  నిందితులు ఫాతిమాది ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశారు. అనుమానించిన యూపీ పోలీసులు మిస్ట‌రీ డెత్‌గా కేసు నమోదు చేశారు. అప్పటికే విజ‌య‌వాడ‌ కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదై ఉండటంతో.. సమాచారం అందుకున్న ఇక్క‌డి పోలీసులు యూపీ వెళ్లి విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి విజయవాడ తీసుకొచ్చారు. ప్రేమ పేరుతో ఎవ‌రినిప‌డితే వారిని న‌మ్మొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. మృతురాలు ఫాతిమా ఇంట విషాదం నెల‌కొంది.   

సోనియా గాంధీ కొత్త రికార్డ్ ..అధ్యక్ష పదవిలో 20 ఏళ్లు..

కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరో చరిత్రను సృష్టించారు. ఇంతవరకు, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యధిక కాలం (19ఏళ్ళు) అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రికార్డును సొంతం చేసుకున్న ఆమె పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా రెండేళ్ళు పూర్తి చేసుకుని మరో రికార్డ్  సృష్టించారు. సోనియా గాంధీ 2019  ఆగష్టు 10 వ తేదీన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆగష్టు 10తో ఆమె తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు  చేపట్టి రెండేళ్ళు పూర్తవుతాయి. ఆ విధంగా కాంగ్రెస్ చరిత్రలో ఆమె మరో రికార్డు నమోదు చేశారు.  నిజానికి, కాంగ్రెస్ పార్టీకి గతంలో తాత్కాలిక అధ్యక్షుల అవసరం ఏర్పడలేదు.  ముఖ్యంగా అత్యవసర పరిస్థితి అనంతరం 1978లో ఇందిరాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, మద్యలో ఒక సీతారం కేసరి (1996-98) ఒక పీవీ నరసింహ రావు,(1992-94) వంటి వారు కొద్దికాలం పార్టీ అధ్యక్షులుగా ఉన్నా,1998లో సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాంధీ నెహ్రూ కుటుంబం గడప దాటలేదు. ఆ భారాన్ని, బాధ్యతను సోనియా గాంధీ 19 ఏళ్ల పార్టీ  మోస్తునే  వచ్చారు. 19 ఏళ్ల కాలంలో వరసగా రెండు సార్లు (2004, 2009) కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో విజయపథంలో నడిపించిన సోనియా గాంధీ, 2017 లో వయోభారం, అనారోగ్యం కారణంగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే, ఆమె నుంచి అధ్యక్ష బాధ్యతలు అందుకున్న ఆమె కుమారడు, రాహుల గాంధీ, 2019 ఎన్నికల ఓటమి తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తప్పు కున్నారు. ఎవరు ఎన్ని విధాలా చెప్పినా, ఎంతగా వేడుకున్నా ఆయన అధ్యక్ష పదివిలో కొనసాగేందుకు ససేమిరా అన్నారు. అంతే కాదు , నెహ్రు గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నికోవాలని రాహుల్ గాంధీ సూచించారు.అయితే, అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో,   సుమారు ఆరేడు నెలల అనంతరం, అనివార్య పరిస్తితులలో 2019 ఆగష్టు 10 వతేదీన మరోమారు,సోనియా గాంధీ  తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.  అయితే, 70 ఏళ్ళు పైబడిన వయసు, అనారోగ్యం కారణంగా ఆమె పూర్తి స్థాయిలో బాధ్యతలను నిర్వర్తించలేక పోతున్నారు. మరో వంక ఆరు నెలలులో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావించినా అది కూడా ఇంతవరకు ముడి పడలేదు. దాంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె ఇంకా కొనసాగుతున్నారు. ఇప్పటికి రెండేళ్ళు పూర్తి చేసుకుని కొత్త రికార్డ్ సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ కోడా నిండా రెండేళ్ళు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేని పార్టీ గా మనుగడ సాగించి మరో రికార్డ్ సాధించింది.ఒకప్పుడు రాజకీయాల పట్ల అంతకా ఆసక్తి చూపని సోనియా గాంధీ, 1998లో అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారం కేసరి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏకబీకిన 19 సంవత్సరాలు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. చరిత్రను సృష్టించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీనే కాదు, కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల చరిత్రలో ఎవరూ కూడా అంచలంచెలుగా కూడా ఇంత సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్ష పదవిలో లేరు. ఇదొక చరిత్ర. ఆ చరిత్రను సోనియా సృష్టించారు.   సోనియా  సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు కేంద్రంలో, సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అనేక రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కేసరి సమయంలో, అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ హయంలో పునర్జీవనం పొందింది.అయిన ఆమె, ప్రధాని పదవిని ఆశించలేదు. ఆమె ప్రదాని పదవిని ఎందుకు వద్దనుకున్నారు అనే విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నా, ఆమె అభిమానులు మాత్రం ఆమె ఆ పదవిని త్యాగం చేశారని అంటారు. అయితే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా నియమించినా సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్’గా , నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షురాలిగా, లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఇలా అనేక హోదాలలో ఆమె ప్రభుత్వ పాలనలో, విధాన నిర్ణయాలలో కీలక పాటను పోషించారు. మహత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం వంటి యూపీఏ ప్రభుత్వ కీలక నిర్ణయాలు సోనియా గాంధీ అలోకాహనల నుంచి పుట్టినవే అంటారు.  సోనియా గాంధీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఘోర ఓటమినీ చవిచూసింది. సోనియా గాంధీ సారధ్యంలోనే 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కేవల 44 లోక్ సభ స్థానలకు పరిమితం అయింది.అలాగే, రాహుల్ గాంధీ సారధ్యంలో పోరాడిన 2019 ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ మూడంకెల సఖ్యకు చేరుకోలేక, 52 స్థానాలకే పరిమితం అయింది. అయితే, సోనియా గాంధీ 74 ఏళ్ల వయసులో  (1946 డిసెంబర్ 9 న ఆమె ఇటలీలో జన్మిచారు) కూడా, కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు, ఆయనని ఆ పదవిలో చూసేందుకు సోనియా గాంధీ, ఇప్పటికీ పరితపిస్తున్నారు.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పొందడం సాధ్యం కాదని కాదు కానీ, అంత తేలికగా అయ్యే పని కాదని అంటున్నారు. గుర్రాన్ని రేవు వరకు తీసుకు పోవచ్చును  కానీ, నీరు తాగించడం సాధ్యం కాదు. అల్లాగే, స్వతహాగా అధికార దాహం లేని రాహుల్ గాంధీ విషయం కూడా అంతే,అయిన సోనియా గాంధీ పుత్రా ప్రేమతో రాహుల్ గాంధీని ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. అదే, కాంగ్రెస్ పార్టీకి ముందడుగుకు ప్రధాన అవరోధం, అని కాంగ్రెస్ నాయకులే అంటుంటారు.  ప్రత్యర్ధి పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ,   బీజేపీ, అన్నివిధాలా శక్తి వంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇంచుమించిగా 30 ఏళ్లకు పైగా సాగిన సంకీర్ణ యుగానికి 2014లో చుక్క పెట్టిన బీజేపీ, 2019 మరోమారు, మరింత సంఖ్యా బలం (303 సీట్లు)తో రెండవసారి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా సంకీర్ణమే అయినా వాస్తవంలో కాదు. అలాగే, అర్హిక వనరులు, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ బలం ఇలా అనేక విషయాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా చాలా ముందుంది. సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగిన కాలంలో అద్వానీ మొదలు జేపీ నడ్డా వరకు కనీసం పదిమంది అధ్యక్షులు మారారు. ఇలా ఒకే వ్యక్తీ నాయకత్వం, ఒకే కుటుంబ నాయకత్వం కొనసాగడం ఒక విధంగా మంచిదే అయినా, మరో రకంగా  అదే అనర్ధంగానూ మారుతుందని అంటారు. కాంగ్రెస్ పార్టీ క్రమానుగతి పతనానికి, కుటుంబ వారసత్వ పార్టీగా ముద్ర పడడం కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తారు. ఏమైనా, రాజకీయాలలో బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బడ్లవుతాయి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటనేది, కాలమే నిర్ణయిస్తుంది.

రేవంత్ అంటే సీనియ‌ర్ల‌కు జ‌ల‌సీనా? అందుకే అలా చేస్తున్నారా?

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంద్ర‌వెల్లి వేదిక‌గా ద‌ళిత‌-గిరిజ‌న దండోరా మోగించారు. ల‌క్ష గొంతుక‌ల‌తో.. ల‌క్ష నినాదాల‌తో.. ల‌క్ష‌ చ‌ప్ప‌ట్ల‌తో.. ల‌క్ష డ‌ప్పుచ‌ప్పుల్ల‌తో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టించారు. కాస్కో కేసీఆర్‌.. ఇక ఇర‌వై నెల‌లే నీ పాల‌న‌.. చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ఊచ‌లు లెక్క‌బెట్ట‌డం ఖాయ‌మంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టి దాకా ఓ లెక్క‌.. ఇవాళ్టి నుంచి మ‌రో లెక్క‌.. దెబ్బ‌కు దెబ్బ‌.. ఒక‌టికి వంద‌.. అంటూ కేసీఆర్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇంద్ర‌వెల్లి దండోరా రేవంత్‌రెడ్డి స‌త్తాకు మ‌చ్చుతున‌క‌గా నిలిచింది. కాంగ్రెస్‌లో, ప్ర‌జ‌ల్లో.. రేవంత్ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని ఘ‌నంగా చాటింది. ఇంద్ర‌వెల్లి గ‌డ్డ మీద నుంచి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగిపోయారు కాంగ్రెస్ అధినేత‌ రేవంత్‌రెడ్డి.   అంతా బాగుంది. స‌భ సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్‌. రేవంత్ స‌వాల్ చేసిన‌ట్టుగానే.. దండోరాకు ల‌క్ష మంది త‌ర‌లివ‌చ్చారు. వేదిక‌పై హేమాహేమీలు ఆసీనుల‌య్యారు. సీత‌క్క‌, భ‌ట్టి, దామోద‌ర‌, మ‌ధుయాష్కీ, పొన్నాల‌, గీతారెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, మ‌హేశ్వ‌ర్‌రెడ్డి.. బ‌డా నేత‌లంతా త‌ర‌లివ‌చ్చారు. డ‌యాస్ మీద‌ అంత‌మంది ఉన్నా.. కొంద‌రి లేని లోటు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. స‌భ‌కు న‌ల్గొండ రెబ‌ల్స్‌ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి డుమ్మా కొట్ట‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లంగా మారింది. కావాల‌నే ఆ ముగ్గురు ఇంద్ర‌వెల్లికి గైర్హాజ‌రు అయ్యార‌ని.. ఇది రేవంత్ నాయ‌క‌త్వాన్ని ధిక్క‌రించ‌డ‌మేన‌ని మండిప‌డుతున్నారు. వీరితో పాటు జ‌గ్గారెడ్డి కూడా స‌భ‌కు రాలేదు. త‌న‌కు జ్వ‌రం వ‌చ్చింద‌ని, దండోరాకు రాలేన‌ని ఆయ‌న ముందే స‌మాచారం ఇవ్వ‌డంతో జ‌గ్గారెడ్డి డుమ్మా కొట్టార‌ని పార్టీ భావించ‌డం లేదు. జానారెడ్డి వ‌యోభారంతో హాజ‌రు కాలేదు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌. మొద‌టి నుంచీ రేవంత్‌రెడ్డి అంటే క‌ళ్ల‌మంట‌తో ఉన్నారు. ఆయ‌న‌కు పీసీసీ చీప్ ప‌ద‌వి రాగానే వెంక‌ట్‌రెడ్డి.. డ‌బ్బులిచ్చి ప‌ద‌వి కొనుక్కున్నారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అధిష్టానం గ‌ట్టిగా మొట్టికాయ‌లు వేయ‌డంతో.. అప్ప‌టి నుంచీ అన్నీమూసుకొని గ‌మ్మున కూర్చుంటున్నారు. త‌న‌కు రేవంత్‌రెడ్డితో విభేదాలు లేవంటూ లేటెస్ట్‌గా త‌న నిబ‌ద్ద‌త‌ను నిరూపించుకునే ప్ర‌య‌త్నం కూడా చేశారు. అంత‌లోనే మ‌ళ్లీ ఏమైందో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇంద్ర‌వెల్లి దండోరాకు డుమ్మా కొట్టి.. రేవంత్‌కు రెబ‌ల్ సిగ్న‌ల్ పంపారు.  అన్న‌ద‌మ్ములు ప‌దురుకున్న‌ట్టున్నారు. రాజ‌గోపాల్‌రెడ్డి సైతం స‌భ‌కు రాలేదు. ఇటీవ‌ల పార్టీ ప‌ర్మిష‌న్ లేకుండానే సొంతంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత గ‌ర్జ‌న చేప‌ట్టారు. అటు, మునుగోడులో దీక్ష చేస్తున్న‌ వైఎస్ ష‌ర్మిల‌కు సైతం ఫోన్ చేసి అభినందించారు. పీసీసీతో ప‌ని లేకుండా రాజ‌గోపాల్‌రెడ్డి సొంత ఎజెండా అమ‌లు చేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ ఉంది. ఆయ‌న బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చార‌మూ ఉంది. పీసీసీ చీఫ్ అయ్యాక ఇంత‌వ‌ర‌కూ రేవంత్‌రెడ్డి-- కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ క‌లిసింది లేదు. ఎవ‌రికి వారే అన్న‌ట్టు ఉన్నారు. న‌ల్గొండ‌లో బ‌ల‌మైన నాయ‌కులైన ఈ సోద‌రులు రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష పీఠం ద‌క్క‌డంపై గుర్రుగా ఉన్న‌ట్టున్నారు. అందుకే ఇంద్ర‌వెల్లికి రాకుండా మేం వేరు.. మీరు వేరు అన్న‌ట్టు మెసేజ్ ఇచ్చారని చెబుతున్నారు.  ఇక‌, తాజా మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సైతం ఇంద్ర‌వెల్లి స‌భ‌కు రాక‌పోవ‌డం చిన్న విష‌య‌మేమీ కాదు. అన్నేళ్లు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న కాంగ్రెస్ చేప‌ట్టిన ఇంత పెద్ద కార్య‌క్ర‌మానికి ఎలా డుమ్మా కొడ‌తారు? ఇది కావాల‌నే చేసిన చ‌ర్య‌గా భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఉత్త‌మ్ క‌జిన్ కౌశిక్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తిపోస్తూ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. కౌశిక్‌రెడ్డికి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి స‌పోర్ట్ ఉంద‌ని.. ఆయ‌న‌కు తెలిసే అదంతా జ‌రిగింద‌నే ప్ర‌చారం ఉంది. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌తో ఉత్త‌మ్ స‌చ్చీల‌త‌ను శంకించాల్సి వ‌స్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న త‌న నిబ‌ద్ద‌త‌ను నిరూపించుకోవాలంటే ఇంద్ర‌వెల్లి స‌భ‌కు త‌ప్ప‌క హాజరుకావాల్సి ఉండేది. అయినా, ఆయ‌న రాలేదంటే..? అర్థ‌మేంటి? ఉత్త‌మ్ రేవంత్‌ని డోంట్ కేర్ అంటున్నారా? లేక‌, కాంగ్రెస్‌నే వీడిపోనున్నారా? అనే అనుమానం.  ఇటు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, అటు కోమ‌టిరెడ్డి బీజేపీతో ట‌చ్‌లోకి వెళ్తున్నారా? న‌ల్గొండ కాంగ్రెస్‌లో వేరు కుంప‌టి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? ఇదంతా రేవంత్‌రెడ్డిపై ధిక్కార స్వ‌ర‌మా? మ‌రి, ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌బోనంటూ, క‌ఠినంగా ఉంటానంటూ ముందే హెచ్చ‌రించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ ముగ్గురి ధిక్క‌ర‌ణ‌ను స‌హించునా? వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనునా? చూడాలి.. రేవంత్‌రెడ్డి రియాక్ష‌న్ ఎలా ఉంటుందో.....

బీరువా మీద పడి చిన్నారి మృతి.. పాఠ‌శాల‌లో దుర్ఘ‌ట‌న‌.. బంధువుల ఆందోళ‌న‌..

అప్ప‌టి వ‌ర‌కూ ఆడుతూపాడుతూ అక్క‌డే తిరిగింది. ప‌క్క‌నే త‌ల్లి కూడా ఉంది. ఆమె త‌న ప‌నిలో తానుంది. ఈ చిన్నారి ఎంచ‌క్కా ఆడుకుంటోంది. అంత‌లోనే ఊహించ‌ని ఘ‌ట‌న‌. ప్ర‌మాదం పెను ఉప్పెన‌లా విరుచుకుప‌డింది. ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. అనూహ్య ఘ‌ట‌న‌తో ఆ త‌ల్లి బిత్త‌ర‌పోయింది. కూతురు ప్రాణాలు కాపాడేందుకు చివ‌రి వ‌ర‌కూ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. విగ‌త‌జీవిగా మారిన క‌న్న బిడ్డ‌ను చూసి వెక్కివెక్కి ఏడుస్తోంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో బీరువా మీద ప‌డి ఎనిమిదేళ్ల చిన్నారి చ‌నిపోయిన ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. తల్లి వెంట వచ్చిన కుమార్తెపై ప్రమాదవశాత్తు బీరువా పడటంతో చిన్నారి మృతి చెందింది. హైద‌రాబాద్‌, బోడుప్పల్‌ దేవేందర్‌నగర్‌కాలనీలో ఉండే లత.. స్థానిక సిద్ధార్థ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. సోమ‌వారం పాఠశాలకు కుమార్తె కీర్తి(8)తో కలిసి వెళ్లింది ల‌త‌. స్కూల్‌లో బీరువాలు శుభ్రం చేస్తోంది. త‌న కూతురు అక్క‌డే ఆడుకుంటోంది.  ప్రమాదవశాత్తు ఓ బీరువా చిన్నారిపై పడింది. బాలిక‌కు తీవ్ర‌ గాయాల‌య్యాయి. వెంట‌నే కీర్తిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో ఆ త‌ల్లి కుప్ప‌కూలిపోయింది.  మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు వారికి మద్దతుగా నిర‌స‌న‌కు దిగ‌డంతో.. స్థానికంగా ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. 

టీఆర్ఎస్ లో సోషల్ మీడియా చిచ్చు.. హరీష్ రావే టార్గెట్? 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత కీలకంగా భావిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. తమకు కొరకరాని కొయ్యలా మారిన ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించేందుకు అన్ని అస్త్రాలు బయటికి తీస్తోంది గులాబీ పార్టీ. దళిత బంధు లాంటి పథకాలను హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. వివిధ వర్గాలకు వరాలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా కేంద్రంగా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ లో కొత్త వివాదానికి కారణమైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తున్న హరీష్ రావు.. దుబ్బాక‌లో జ‌రిగిన లోపాల‌ను, లోటుపాట్ల‌ను స‌మీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుబ్బాకలో బీజేపీకి సోషల్ మీడియానే ప్లస్ గా మారిందనే అంచనాకు వచ్చిన హరీష్ రావు.. హుజురాబాద్ లో ముందే అప్రపమత్తమయ్యారు. సిద్దిపేట్లో సోష‌ల్ మీడియా యాక్టివ్ మెంబ‌ర్స్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేశారు హరీష్ రావు. విపక్షాలకు ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలో, ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల పోస్టుల‌ను ఎలా కౌంట‌ర్ చేయాలో దిశా నిర్దేశం చేశారు. సోష‌ల్ మీడియా మీటింగ్‌లో పాల్గొన్న వారియ‌ర్స్ హ‌రీశ్‌రావుతో ఫోటోలు దిగి ఏఫ్‌బీలో పోస్ట్ చేశారు. ఇది కొత్త ర‌గ‌డ‌కు తెరతీసింది. సిద్దిపేటలో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి కొందరికి ఆహ్వానం వచ్చిందట. దీంతో సమావేశానికి పిలుపు రాని వారంతా గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది యాక్టివ్ మెంబ‌ర్స్ టీఆరెఎస్ నాయ‌కుల‌తో ప్ర‌త్యేక్ష సంబంధాలు లేక‌పోయినా కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ప్రేమ‌తో ఎప్ప‌టిక‌ప్పుడు టీఆరెఎస్ అనుకూల పోస్టుల‌ను పెడుతూ వ‌స్తున్నారు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల దాడుల‌ను త‌మ‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కూడా హ‌రీశ్‌రావు నుంచి ఆహ్వానం అంద‌క‌పోవ‌డం వారిని తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. దీంతో ఫేస్‌బుక్‌లో త‌మ వాల్స్ పై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. ఇంత ప‌నిచేస్తున్నా క‌నీస గుర్తింపు లేద‌నే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది హ‌రీశ్‌రావుకు కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెట్టింది. సోషల్ మీడియా సమావేశానికి సంబంధించి మరో ప్రచారం కూడా సాగుతోంది. హరీష్ రావు టార్గెట్ గా కొందరు పోస్టులు పెడుతున్నారు. హరీష్ రావుకు మద్దతుగా ఉండేవారికి  మాత్రమే సిద్దిపేట సమావేశానికి ఆహ్వానం వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా సమావేశం పేరుతో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు హరీష్ రావు చేస్తున్నారని కొందరు పోస్టులు పెట్టారు. త్వరలో హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటికి వెళతారేమోనని, అందుకే ఇలా చేస్తున్నారని కూడా వాదన తెరపైకి వస్తోంది.  మొత్తానికి సిద్ధిపేటలో జరిగిన టీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం కొత్త వివాదానికి దారి తీసిందనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. 

ముడుపుల కోసం వాట్సాప్ గ్రూప్.. ఏసీబీకి చిక్కిన అవినీతి ఏవో 

ప్రభుత్వ ఉద్యోగి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది లంచం. అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అలా ఫిక్సై పోయారు. అలా అని అధికారులంతా అవినీతి పరులని కాదు. కొందరు నిజాయితీగా విధులు నిర్వహించేవారున్నారు. అయితే మెజార్టీ మాత్రం లంచాలు తీసుకోకుండా పని చేయడనే అభిప్రాయమే జనాల్లో ఉంది. ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. రోజు ఏదో ఒక చోట లంచాలు తీసుకుంటూ దొరుకుతూనే ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో దొరికిన అధికారి వ్యవహారం మాత్రం షాకింగ్ కు గురి చేస్తోంది. లంచాల కోసం ఏకంగా వాట్సాప్ గ్రూప్ నే పెట్టాడు సదరు అధికారి. ఈ నెలలో ఎవరు ఎంతెంత ముడుపులు చెల్లించుకోవాలో చెబుతూ ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న మండల వ్యవసాయాధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేశ్‌చందర్‌ ఛటర్జీ 8 సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి (ఏవో)గా పనిచేస్తున్నారు. లంచాల రుచిమరిగిన ఆయన ఎరువులు, పురుగుమందుల దుకాణాల యజమానుల నుంచి ముడుపులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను తనిఖీలు నిర్వహించకుండా ఉండాలంటే నెల నెలా ముడుపులు సమర్పించుకోవాలంటూ ఏకంగా వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేశారు. ఈ నెలలో ప్రతి దుకాణం రూ. 15 వేల చొప్పున ఇవ్వాలంటూ మెసేజ్‌లు పంపారు. ఆయన వేధింపులు భరించలేని వ్యాపారులు గత నెల 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఆరు దుకాణాల నుంచి సేకరించిన సొమ్మును తీసుకునేందుకు రావాలంటూ దుకాణదారులు ఏవోను కోరారు. నిన్న చంద్రుగొండ రైతు వేదికలో యజమానుల నుంచి రూ. 90 వేల లంచం సొమ్ము తీసుకుంటుండగా వల పన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. ఏవోపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. 

వివేకాను చంపిందెవరో జగన్‌కు తెలుసు! సునీల్ సోదరుడి కామెంట్లతో కలకలం.. 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇటీవలే అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ ను  కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది .వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం పులివెందుల్లో సీబీఐ బృందాలు మూడు రోజులుగా గాలించాయి. నిందితుడు సునీల్‌తో కలసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గెరెండాల వాగు, రోటరిపురం వంకలలో సీబీఐ బృందాలు గాలించాయి.  అయితే వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై నిందితుడు సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.సీబీఐ అధికారులకు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని  ఆరోపించారు. అంతేకాదు వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న పెద్దలు, సీబీఐ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని  సునీల్‌కుమార్ యాదవ్ సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.  పులివెందులలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన కిరణ్.. కీలక విషయాలు చెప్పారు. వివేకా హత్య కేసులో ఉన్న కొందరు పెద్ద నాయకులు తప్పించుకునేందుకు తన అన్నని ఇరికిస్తున్నారని అన్నారు. వివేకాను హత్య చేసింది ఎవరో ముఖ్యమంత్రి జగన్‌కు, ప్రజలకు కూడా తెలుసన్నారు. తన అన్నను నిందితుడిగా చూపించేందుకు కాలువలో మారణాయుధాల పేరుతో సీబీఐ అధికారులు లేనిపోనివన్నీ సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యపై ఇప్పటి వరకు మాట్లాడని రంగన్న రెండేళ్ల తర్వాత ఇప్పుడు తన వాంగ్మూలంలో తన అన్న పేరు చెప్పారని కిరణ్ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి, తన అన్న మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదని  చెప్పారు. వివేకానందరెడ్డి రెండుమూడుసార్లు తమ ఇంటికి వచ్చినట్టు కిరణ్ తెలిపారు. వివేకానందరెడ్డి కుమార్తె హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు విచారించడం లేదని  సునీల్ భార్య లక్ష్మి  ప్రశ్నించారు. తన భర్తను ఢిల్లీలో 2 నెలల 25 రోజులపాటు దారుణంగా హింసించారని, వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఒప్పుకోవాలని కొట్టారని ఆమె ఆరోపించారు. ధైర్యం ఉంటే అసలైన నిందితులను పట్టుకోవాలని సీబీఐకి సవాల్ విసిరింది సునీల్ కుటుంబం. వివేకా హత్యకేసుతో సునీల్‌కు సంబంధం లేదన్నారు. వివేకాతో సునీల్‌ సన్నిహితంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికే గోవా వెళ్లామని చెప్పారు. అయితే అక్కడ చనిపోతే నిందలు నిజమవుతాయనే తిరిగి పులివెందులకు వచ్చామని సునీల్ కుటుంబం తెలిపింది. వాచ్‌మన్ రంగన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. 24 గంటల్లో సునీల్‌ను సీబీఐ అధికారులు ఇంటికి పంపకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని సునీల్ కుటుంబం హెచ్చరించింది.  

షర్మిలకు ఇగో.. జగన్ కు అధికార పిచ్చి! కొండా సురేఖ హాట్ కామెంట్స్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొండా దంపతులు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళీ, సురేఖలు వైఎస్సార్ నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కొండా దంపతులు ఇబ్బందులు కూడా పడ్డారు. జగన్ కోసం ఏకంగా మంత్రి పదవికి కూడా కొండా సురేఖ రాజీనామా చేసి రోశయ్య కేబినెట్ నుంచి వైదొలిగారు సురేఖ. వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. వైఎస్ షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అసెంబ్లీలోనూ విజయమ్మకు అండగా నిలిచారు కొండా సురేఖ. తర్వాత వైఎస్ జగన్ సమైక్య నినాదం ఎత్తుకోవడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ.. 2018లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చాకా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గతంలో చంద్రబాబు కోసం వైఎస్సార్ ను టార్గెట్ చేస్తూ తమపైనా ఎన్నో ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచి అందరికి షాకిచ్చారు కొండా దంపతులు. అంతేకాదు తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో వైఎస్సార్ కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. షర్మిల-జగన్.. చివరకు విజయమ్మపైనా  కీలక కామెంట్లు చేశారు.  వైఎస్ షర్మిలకు ఇగో అని కొండా సురేఖ హాట్ కామెంట్ చేశారు. ఆమె పార్టీలో చేరే ఆలోచన లేదని స్ఫష్టం చేశారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత షర్మిల పాదయాత్ర చేసే సమయంలో తాను ఆమె తీరు చూశానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి అసలు అలాంటి స్వభావం ఉండరాదని సురేఖ చెప్పుకొచ్చారు. ప్రజలతో సాఫ్ట్ గా .. ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు కొండా సురేఖ.హైప్రోఫైల్ తో వెళితే మనుగడ కష్టమన్నారు. అన్న జగన్ అక్కడ ఒక తీరు మాట్లాడి.. చెల్లి ఇక్కడ మరో తీరు మాట్లాడుతున్నారని.. షర్మిల అధికారంకోసం వచ్చిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నుంచి తనకు ఆహ్వానం వచ్చినా తాను ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. విజయమ్మపై కూడా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో విజయమ్మకు తెలియదని.. పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్లనుకుంటోందా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కోటరీలో కీలక నేతగా ఎదిగి, ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన కొండా సురేఖ .. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.