జగన్ కేబినెట్ నుంచి 18 మంది అవుట్? కొత్తగా చోటు దక్కేది వీరికేనా?
సమయం దగ్గర పడుతోంది. పాత నీటిని సాగనంపి కొత్త నీటితో కొత్త కలరివ్వాలి. ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పినట్టు రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని, అందుకు అందరూ సమ్మతించాలని, ఎవ్వరు కూడా తోకలు జాడించకుండా వారి నుంచి ప్రమాణ పత్రాలు కూడా జగన్ రాయించుకున్నారు ఎంతో ముందుచూపుతో. జగన్ మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు 20 మంది కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. వచ్చే దసరాకు కేబినెట్ రీషఫుల్ చేయాలనే యోచనలో జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరి సీటుకు ఎసరొస్తుందో.. ఎవరు కంటిన్యూ అవుతారనేది వైసీపీలోనే గాక ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం పద్దెనిమిది మందికి పైగా మంత్రులకు ఉద్వాసన తప్పదంటున్నారు. కొత్తవారికి చాన్స్ ఇవ్వడంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. తొలి దఫాలో రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కర్నూలు), మేకపాటి గౌతమ్రెడ్డి ( నెల్లూరు), బాలినేని శ్రీనివాస రెడ్డి ( ప్రకాశం)కి కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు, అనంతపురం నుంచి గెలుపొందిన రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలుచేసినా జగన్ కరుణించలేదు. తరువాత చూద్దాం లే అంటూ దాటవేశారు. ఇప్పుడు వారంతా తమకు తప్పకుండా చోటు దక్కుతుందన్న భావనలో ఉన్నారు.
శ్రీకాకుళం నుంచి:
ధర్మాన కృష్ణ దాస్, సీదిరి అప్పల రాజు మంత్రివర్గంలో వున్నారు. నర్సన్నపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన ధర్మాన కృష్ణ దాస్ ది కొప్పులవెలమ సామాజిక వర్గం. సీదిరి అప్పల రాజు అనూహ్యంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నవారు. గుంటూరు జిల్లా రేపల్లె లో వైకాపా అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణరావుకి సామాజిక సమీకరణలో భాగంగా జగన్ కేబినెట్ లో చోటు దక్కింది. మోపిదేవిని ఆ మధ్య రాజ్యసభకు పంపడంతో ఏర్పడిన ఖాళీని అప్పల రాజుతో పూరించారు. ధర్మాన కృష్ణ దాస్ ను తొలగించి ధర్మాన సోదరుడు మాజీ మంత్రి అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక స్పీకర్ గా ఉన్న ఒకనాటి మాజీ మంత్రి కళింగ సామాజికవర్గానికి చెందిన ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. స్పీకర్ గా వైదొలిగి మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం నుండి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మహిళా కోటాలో... ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లు మంత్రి పదవి ఆశిస్తున్నా వీరిద్దరూ మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి చాన్స్ లేనట్టేంటున్నారు.
విజయనగరం నుంచి:
చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో కొనసాగుతున్నారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. గిరిజన కోటాలో అత్యున్నత పదవి పొందిన పుష్పశ్రీవాణి పనితీరు బాగుందని టాక్. అయితే జిల్లాలో బొత్స శిష్యుడు వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
ఇదే సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస రావు (కృష్ణా జిల్లా) ని మంత్రి మండలి నుండి తప్పిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. జిల్లాలో తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ తో పాటు బొత్స సోదరులు అప్పల నర్సయ్య, మేనల్లుడు బడుకొండ అప్పల నాయుడు ఎమ్మెల్యేలు గా రాణిస్తున్నారు. పుష్పశ్రీవాణి ని మార్చాల్సి వస్తే జిల్లాలోని సాలూరు ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలుపొందిన గిరిజనుడు పి. రాజన్నదొర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
విశాఖపట్నం నుంచి:
విశాఖ జిల్లా మొత్తం మీద ఒకే ఒక్కడిగా మంత్రిమండలిలో వెలుగొందుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందుగా వైకాపా లో చేరారు. అప్పటి వరకు తెదేపా ఎంపిగా అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించిన ముత్తంశెట్టి వైకాపాలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి ఎకాఎకిన మంత్రి అయిపోవడం వైకాపా లోని చాలామంది సీనియర్ నేతలకే అంతుచిక్కలేదు. అయితే ముత్తంశెట్టిని మార్చాల్సి వస్తే ఇదే సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తూర్పు కాపు (బిసి) సామాజిక వర్గం నుండి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కొప్పుల వెలమ (బిసి)ల కోటా లో నర్సీపట్నం ఎమ్మెల్యే, సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర గణేష్ లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమా శంకర్ గణేష్ అప్పటి మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడ్ని భారీ ఆధిక్యతతో ఓడించడం కలిసొచ్చే అంశం. కొప్పుల వెలమల నుండి ధర్మాన బ్రదర్స్ లో ఒకరికి శ్రీకాకుళం జిల్లా నుండి ఛాన్స్ ఇచ్చినా మరొకరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవ్వాల్సి వస్తే తనకు అవకాశం ఇవ్వాలంటూ ఉమా శంకర గణేష్ ప్రయత్నాలు వేగిరం చేశారు. ఇందుకు సోదరుడు పూరీ జగన్నాధ్ కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
తూర్పు గోదావరి నుంచి:
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్న బాబు, అమలాపురం ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ లు మంత్రి మండలిలో వున్నారు. కురసాలను కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతోంది. తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా కూడా మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో రేసులో ఉన్నారు. ఇటీవలే శాసనమండలికి ఎంపికైన తోట త్రిమూర్తులు కూడా పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. తోట త్రిమూర్తులుకి వరసకు వియ్యంకుడైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్న నేపథ్యంలో త్రిమూర్తులుకి చోటు లేనట్టేనంటున్నారు. దళిత సామాజికవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ని మార్చబోవడం లేదు. శాఖ మారితే మారొచ్చు అంటున్నారు.
ఈ జిల్లా లో కాపులుగా చలామణీ అయ్యే తెలగ బలిజ సామాజిక వర్గం నుండి కురసాల కన్నబాబును మినహాయిస్తే దాడిశెట్టి రాజా(తుని), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు ( పిఠాపురం), జక్కంపూడి రాజా ( రాజానగరం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట)తో పాటు.. తోట త్రిమూర్తులు ఒక్క ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
పశ్చిమ గోదావరి నుంచి :
ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), ఆచంట ఎమ్మెల్యే సి.హెచ్. శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే తానేటి వనితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆళ్ల నాని కొనసాగనుండగా రంగనాథ రాజు, తానేటి వనితల్ని తొలగించనున్నట్టు సమాచారం. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రంగనాథరాజు స్థాననంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకి చోటు దక్కనుండగా యాదవ సామాజిక వర్గం నుండి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనున్నారన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉండడంతో కారుమూరి నాగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షంచుకోబోతున్నారు. ఆళ్లనాని సామాజికవర్గానికే చెందిన భీమవరం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఈసారి రేసులో ఉన్నారు.
కృష్ణా నుంచి:
కృష్ణా జిల్లా బందరు నుండి పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రివర్గంలో ఉండగా తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానికి ఉద్వాసన కలిగించి ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుకి చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. వైశ్యుల కోటాలో వెలంపల్లి శ్రీనివాసరావు ప్లేస్ మెంట్ సురక్షితంగానే కనిపిస్తున్నా... విజయనగరం నుండి వీరభద్రస్వామి, ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి అన్నా రాంబాబు తమ ప్రాధాన్యతను గుర్తించాల్సిందిగా పట్టు బడుతున్నారు. వెలంపల్లిని తప్పిస్తేనే మరొకరికి ఛాన్స్ దొరుకుతుంది. బ్రాహ్మణుల కోటాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం ఆశిస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ సారథి యాదవ్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గౌడ్ లు వెనుకబడిన తరగతుల కోటాలో మంత్రి పదవి ఆశిస్తుండగా వీరిలో ఒకరికి తప్పక అవకాశం ఉంటుందని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే తానేటి వనితను తప్పించి ఆ ఖాళీని కృష్ణా జిల్లా నుండి భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాలు కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో మంత్రులు కొలువు తీరే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుండి నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముగ్గురు గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఒక్కొక్క జిల్లా నుండి నలుగురికి తగ్గకుండా అవకాశం లభించే వీలుంది.
గుంటూరు నుంచి:
పత్తిపాడు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఎం.సుచరిత హోమ్ మంత్రిగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల నుండి మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణ రావు రాజ్యసభకు ఎంపికయ్యారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంది. వరుసగా నాలుగుసార్లు గెలిచిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుసగా రెండుసార్లు గెలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి తప్పదనే ప్రచారం సాగుతోంది. ఆశావహులలో ప్రత్యేకించి పేర్కొన దగినవారు ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బి.సి. రజక సామాజికవర్గానికి చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇరువురు మహిళలు తెలగ బలిజ కులస్తుల్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇరువురు మహిళా ఎమ్మెల్యేలు విద్యాధికులే. ఇటీవల విడుదల రజిని ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేకంగా చర్చించడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
ముస్లిం మైనారిటీల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రివర్గంలో చోటు కోసం తహతహలాడుతున్నారు. వరుసగా రెండుసార్లు వైకాపా అభ్యర్థిగా గెలిచి రావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక అంబటి రాంబాబు 1989 తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో గెలిచి వచ్చారు.తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నుండి 2014 లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావు పై భారీ ఆధిక్యంతో గెలుపొంది మంత్రి పదవి ఆశించారు. భంగపాటు తప్పలేదు. ఇప్పుడు తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు.
ప్రకాశం నుంచి:
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎర్రగొండ పాలెం (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుండి ఎం.మహీధర్ రెడ్డి (కందుకూరు) కి అవకాశం ఉందంటున్నారు. వైశ్యుడైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నా రాంబాబు 78 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఒక కారణంగా చూపుతున్నారు.
నెల్లూరు నుంచి:
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనుండగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి వర్గంలో కొనసాగుతారు. ఒకవేళ గౌతమ్ రెడ్డిని తప్పించాల్సివస్తే.. సీనియర్ అయిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే చాన్సుంది.
సూళ్లూరుపేట (ఎస్సీ) రిజర్వుడ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే చిత్తూరు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కె.నారాయణ స్వామిని తప్పిస్తేనే కిలివేటి సంజీవయ్య కు ఛాన్స్ అని తెలుస్తోంది.
చిత్తూరు నుంచి:
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వర్గంలో కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దళిత సామాజికవర్గం నుండి కె.నారాయణస్వామిని తప్పిస్తే నెల్లూరు జిల్లాలో కానీ అనంతపురం, కడప జిల్లాల నుండి కానీ దళితులకి అవకాశం కల్పిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.కె. రోజా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
కడప నుంచి:
కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా కొనసాగుతారు. ఈసారి ముస్లిం మైనారిటీల నుండి మరొకరికి కూడా అవకాశం కల్పించాలనే సమీకరణాలలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగన్ సొంత జిల్లా కావడంతో మైనారిటీలతో పాటు దళితులకు కూడా పెద్దపీట వేయాలని యోచిస్తున్నారు. బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మరణించడంతో రైల్వే కోడూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒక్కరే మిగిలారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు మూడుసార్లు వైకాపా తరపున గెలిచి రావడం ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశం. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తమ్మీద ఇద్దరు తక్కువ కాకుండా మంత్రుల్ని దళిత సామాజిక వర్గం నుండి ఎంపిక చేసే అవకాశం ఉంది.
అనంతపురం నుంచి:
పెనుకొండ ఎమ్మెల్యే, కురబ(బిసి) సామాజిక వర్గానికి చెందిన ఎమ్.శంకర్ నారాయణ ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న ఏకైక మంత్రి. కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి పదవిని ఆశిస్తున్న జిల్లా అనంతపురం జిల్లా కావడం విశేషం. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరి స్థాయిలో వారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసం రకరకాల కారణాలు చూపుతున్నా... పరిటాల సునీతపై రెండు సార్లు ఓడిపోయి పరిటాల శ్రీ రామ్ ని 2019లో ఓడించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్.పి. కూడా అయిన అనంత వెంకటరామిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో అంతిమ విజేత ఎవరో చూడాలి. ఈ జిల్లా నుండి రెడ్డి కులస్తులెవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే ఉషశ్రీ చరణ్... రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. తను కురబ (బి.సి) సామాజిక వర్గం, భర్త రెడ్డి కావడంతో సమీకరణ సరిపోతుందంటున్నారు.
దళితుల కోటాలో శింగనమల (ఎస్సీ రిజర్వుడ్) నుండి జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర (ఎస్సీ రిజర్వుడ్) నుండి డాక్టర్ ఎమ్.తిప్పేస్వామి పోటీపడుతున్నారు. తిప్పేస్వామి సీనియర్. ఆయన వరుసగా మూడుసార్లు గెలిచారు. అయితే తిప్పేస్వామి... ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఆదిమూలపు సురేష్ స్వయంగా బావా-బావమరుదులు. సురేష్ ని తప్పిస్తేనే తిప్పేస్వామికి అవకాశం లేకుంటే నో ఛాన్స్.
కర్నూలు నుంచి:
ఆలూరు ఎమ్మెల్యే బోయ (బి.సి) సామాజికవర్గానికి చెందిన పి.జయరామ్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తొలిసారి మంత్రివర్గ సమయంలో ఒత్తిడికి గురైన వైకాపా అధినాయకత్వం అప్పుడు తట్టుకోగలిగిన ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. శ్రీశైలం నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టు బడుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కూడా పైరవీలు చేసుకుంటున్నారు. మొత్తానికి 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత కొందరిని సంతృప్తి పరిచిన జగన్... మరికొందరిని రెండున్నర ఏళ్ల పాటు అని ఊరించడం వల్లే ఈ తిప్పలన్నీ అంటున్నారు. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే దసరా వరకు ఎదురు చూడాల్సిందే.