వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ చేసుకుంటామంటున్న సునీల్ ఫ్యామిలీ 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన సీబీఐ.. ఇటీవలే అరెస్ట్ చేసిన సునీల్ కుమార్ ను కస్టడీలో విచారిస్తోంది .వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం పులివెందుల్లో సీబీఐ బృందాలు అన్వేషిస్తున్నాయి. పులివెందుల్లో ఆయుధాల కోసం మూడవరోజు గాలింపు కొనసాగింది. నిందితుడు సునీల్‌తో కలసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గెరెండాల వాగు, రోటరిపురం వంకలలో సీబీఐ బృందాలు గాలించాయి.  మరోవైపు  వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్‌కు సంబంధం లేదని అతని కుటుంబం తెలిపింది. సీబీఐ అదుపులో ఉన్న సునీల్ కుటుంబం మీడియా సమావేశం  నిర్వహించింది.  సీబీఐ అధికారులకు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ధైర్యం ఉంటే అసలైన నిందితులను పట్టుకోవాలని సీబీఐకి సవాల్ విసిరారు. వివేకా హత్యకేసుతో సునీల్‌కు సంబంధం లేదన్నారు. వివేకాతో సునీల్‌ సన్నిహితంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికే గోవా వెళ్లామని చెప్పారు. అయితే అక్కడ చనిపోతే నిందలు నిజమవుతాయనే తిరిగి పులివెందులకు వచ్చామని సునీల్ కుటుంబం తెలిపింది. వాచ్‌మన్ రంగన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. 24 గంటల్లో సునీల్‌ను సీబీఐ అధికారులు ఇంటికి పంపకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని సునీల్ కుటుంబం హెచ్చరించింది.    

బీజేపీ స‌ర్పంచ్ కాల్చివేత‌.. చంపింది ఎవ‌రంటే...?

వారికి బీజేపీ నాయ‌కులే టార్గెట్‌. కాషాయ కండువా క‌ప్పుకున్న వారంటే క‌ళ్ల‌మంట‌. భ‌ర‌త‌మాత కోసం.. దేశం కోసం నిన‌దించ‌డ‌మే వారి ఆగ్ర‌హానికి కార‌ణం. స‌రిహ‌ద్దుల ర‌క్ష‌ణ‌.. ఉగ్ర‌మూక‌ల ఏరివేత వారికి మింగుడు ప‌డ‌టం లేదు. ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో దేశం సుర‌క్షితంగా ఉండ‌టం.. టెర్ర‌రిజం తోక క‌ట్ చేస్తుండ‌టం.. వాళ్లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. అందుకే, దేశం మీది కోపం.. మోదీ మీది ధ్వేషం.. స్థానిక బీజేపీ నేత‌ల మీద చూపిస్తున్నారు ఉగ్ర‌వాదులు. క‌శ్మీర్‌లో క‌మ‌ల‌నాథులే టార్గెట్‌గా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా, ఓ గ్రామానికి చెందిన బీజేపీ స‌ర్పంచ్‌ను టెర్ర‌రిస్టులు కాల్చి చంప‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగారు. అనంత్‌నాగ్‌లో బీజేపీ కిసాన్‌ మోర్చా కుల్గాం జిల్లా అధ్యక్షుడు, ఓ గ్రామానికి స‌ర్పంచ్ కూడా అయిన‌ గులాం రసూల్‌దర్‌తో పాటు ఆయన భార్యను ముష్క‌రులు కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అనాగరిక చర్యంటూ మండిప‌డింది. గ‌త‌ జూన్‌లోనూ పుల్వామాలో బీజేపీ నేత, మున్సిపల్‌ కౌన్సిలర్ రాకేశ్ పండితను ఉగ్రవాదులు కాల్చి చంప‌డం.. ఇప్పుడు మ‌రో కాషాయ నేతపై దారుణానికి ఒడిగ‌ట్ట‌డంపై బీజేపీ వ‌ర్గాలు ఆగ్ర‌హంగా ఉన్నాయి. మ‌రోవైపు.. స్వతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున క‌శ్మీర్‌లో పోలీస్ కూంబింగ్ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. అణువ‌ణువు గాలిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేసినట్టు పోలీసులు ప్ర‌క‌టించిన కొన్ని గంటల వ్యవధిలోనే గులాం ర‌సూల్‌ద‌ర్‌ను టెర్ర‌రిస్టులు కాల్చి చంపడం భ‌ద్ర‌తా ద‌ళాల‌కు స‌వాల్‌గా మారింది.  

20 నెలల తర్వాతే చిప్పకూడే.. కేసీఆర్ ఫ్యూచర్ చెప్పిన రేవంత్ 

ఇంద్రవెళ్లి వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గర్జించారు. దళిత, గిరిజన దండోరా సభలో కేసీఆర్ సర్కార్ పై దండోరా మోగించారు. కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి తరిమేసేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చాడని మండిపడ్డారు. కేసీఆర్ కథ ముగిసిందని, 20 తర్వాత ఆయన చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నియంత పాలనలో నిజాంను మించిపోతే.. అప్పటి ఖాసిం రజ్వీ కన్న ఘోరంగా ప్రభాకర్ రావు వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క దెబ్బకు వంద దెబ్బలు కొడతామని చెప్పారు. అన్ని డైరీలో రాసి పెట్టుకుంటున్నామని, లెక్కకు లెక్క సరి చేస్తామని తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా కాకుండా చట్టప్రకారం నడుచుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.  హుజురాబాద్ ఉపఎన్నికలు వస్తున్నాయని దళిత బంధు తీసుకొచ్చాను అంటూ సీఎం కేసీఆర్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని  రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 70 ఏండ్ల కాంగ్రెస్ చరిత్ర.. ఏడేళ్ల కేసీఆర్ నేరాలు ఘోరాలు చూడాలంటూ చురకలు వేశారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తాను అంటున్నారని.. తాను మఠం నడపడం లేదు.. రాజకీయ పార్టీ నడుపుతున్నా అంటూ కేసీఆర్ నిస్సిగ్గుగా, భరితెగించిన మాటలు మాట్లాడుతున్నారని.. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడలేదని విమర్శించారు. అందుకే దండుగట్టి.. దళిత దండోరా పెట్టి.. 118 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అప్పుడైనా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అందుకే కాంగ్రెస్ యువనేతలు, యువకులు ఏకతాటిపైకి వచ్చి.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇస్తాడా.. సస్తాడా అనేది తేల్చుకునేలా చేయాలన్నారు దళిత సోదరులకు అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే... ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు. 

పీకే బీజేపీ సంధించిన బాణ‌మా? కారు, కాంగ్రెస్‌ల‌కు చిక్కేనా?

ష‌ర్మిల పార్టీ పెట్టారు. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణ‌మ‌న్నారు. బీజేపీ ఏజెంట్ అని ఆడిపోసుకున్నారు. ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా.. ఆమె త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఐపీఎస్‌కి రిజైన్ చేసి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. బీఎస్సీలో చేరి కేసీఆర్‌పై దండ‌యాత్ర స్టార్ట్ చేశారు. ఏనుగుపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వ‌స్తామంటూ స‌వాల్ చేశారు.  కేసీఆర్‌ను విమ‌ర్శిస్తే ఊరుకుంటారా? ద‌ళిత ఎమ్మెల్యేతో ఎదురుదాడి ప్రారంభించింది గులాబీద‌ళం. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారంటూ ఆరోపించింది. కేవ‌లం మ‌మ్మ‌ల్నే తిడ‌తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్ర‌శ్నించ‌రా? అంటూ అటాక్ చేస్తోంది. మ‌రో అడుగు ముందుకేసి.. ప్ర‌వీణ్‌కుమార్ అలియాస్ పీకే.. బీజేపీ మ‌నిషంటూ ప్ర‌క‌టించేశారు.  'బీజేపీ ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగానే ప్ర‌వీణ్‌కుమార్‌ వస్తున్నారు. వాళ్లు పావుగా వాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను విచ్ఛినం చేసే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌ గ్రహించాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాద‌రి కిశోర్ విమ‌ర్శించారు. టీఆర్ఎస్ చేసిన ఈ ఆరోప‌ణ సంచ‌ల‌నంగా మారింది. నిజ‌మేనా? అనే అనుమానమూ వ్య‌క్త‌మ‌వుతోంది.  'ఒక్క రూపాయి దళితుల కోసం పని చేయకుండా, ఇస్తామన్న ఉద్యోగులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు. ఎందుకంటే, ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉండి, ఇష్టం వచ్చిన ప్రమాణాలు చేయించి, ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో, పోతుందోనన్న భయాందోళనతో.. జాతి కోసం బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బహుజన్‌ సమాజ్‌పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అంటే, ఏమవుతోందనన్న భయం ఆయనలో ఉంది' అంటూ క‌ల‌క‌లం రేపారు ఎమ్మెల్యే కిశోర్‌.  'గతంలో చాలా మంది అధికారులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చి కారు విజయం తథ్యం' అని కిషోర్‌ అన్నారు.   టీఆర్ఎస్ ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ ఆరోపిస్తున్న‌ట్టే.. పీకే.. మోదీని కానీ, బీజేపీని కానీ ఒక్క మాట కూడా అన‌లేదు. బీఎస్పీ జాతీయ స్థాయిలో బీజేపీతో స‌న్నిహితంగా రాజ‌కీయం నెరుపుతుంటుంది. కానీ, ప్ర‌వీణ్‌కుమార్‌పై హిందూ వ్య‌తిరేకి అనే ముద్ర ఉంది. ప్ర‌స్తుతానికైతే ఆయ‌న వెనుక ఉన్న‌దంతా ద‌ళిత వ‌ర్గ‌మే. ఆ లెక్క‌న‌ బీజేపీకి ప‌డే ఏ ఒక్క ఓటు కూడా బీఎస్పీకి ప‌డే అవ‌కాశ‌మే లేదు. పీకే వైపు మ‌ళ్లేదంతా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఓటు బ్యాంకే అంటున్నారు.  ఏళ్లుగా ద‌ళితులు కాంగ్రెస్ వెంట ఉన్నారు. తాజాగా ద‌ళిత బంధుతో ఆ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది టీఆర్ఎస్‌. మ‌ధ్య‌లో ప్ర‌వీణ్‌కుమార్ ఎంట్రీతో ద‌ళితుల‌తో మూడు ముక్క‌లాట మొద‌ల‌వుతుంది. త‌మ‌కు ప‌డ‌ని ఓట్లు.. ఏ ఒక్క పార్టీకీ ప‌డ‌కుండా.. వాటిని విచ్చిన్నం చేయ‌డం వ‌ల్ల‌.. అంద‌రికంటే బీజేపీకే ఎక్కువ లాభం అంటున్నారు. ఇక బీసీలు.. టీడీపీ మిన‌హా ఫ‌లానా పార్టీకి మ‌ద్ద‌తుదారుల‌నే విధంగా కేంద్రీకృత‌మై లేరు. ప్ర‌వీణ్‌కుమార్ పొలిటిక‌ల్ ఎంట్రీతో ఇక‌పై బ‌హుజనులు కీల‌కంగా మార‌నున్నారు.  మ‌రి, బ‌హుజ‌న రాజ్య స్థాప‌న కోస‌మే పీకే బీఎస్పీలో చేరారా? ఆయ‌న బీజేపీ సంధించిన బాణ‌మా? ప్రాంతీయ పార్టీల‌ను క‌మ్మేసే ప్ర‌య‌త్న‌మా? ఒక్క ప్ర‌వీణ్‌కుమార్‌తో.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప్ర‌మాదంలో ప‌డనుందా? పీకేది సంక‌ల్ప‌మా? బీజేపీ చాణ‌క్య‌మా? కాల‌మే క్లారిటీ ఇవ్వాలి...

రియ‌ల్‌ ‘నారప్ప’ సీన్.. దళిత ఉద్యోగితో కాళ్లు మొక్కించుకోవ‌డంపై ఆగ్ర‌హం..

శ‌తాబ్దాలు మారుతున్నా కుల అహంకారం వ‌ద‌ల‌డం లేదు. కుల తార‌త‌మ్యాలు స‌మాజాన్ని ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. అగ్ర‌కులాలు ద‌ళితుల‌ను ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి వెన‌క‌బాటుత‌నమే ఇతివృత్తంగా ఇటీవ‌ల రిలీజైన నార‌ప్ప చిత్రం ప్రేక్ష‌కాధ‌ర‌ణ పొందింది. అందులో ఓ సీన్.. కుల దుర‌మంకారానికి పరాకాష్ట‌గా నిలుస్తుంది. నార‌ప్ప‌గా న‌టించిన వెంక‌టేశ్.. గ్రామంలోని ఇత‌ర కులాల వారి కాళ్ల‌పై ప‌డి క్ష‌మాప‌ణ‌లు అడిగే సీన్.. స‌మాజంలోని దారుణ ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టినట్టు చూపుతుంది. ఇలాంటివి సినిమాల్లోనే ఉంటాయ‌ని అనుకోడానికి లేదు. నిజంగానూ అక్క‌డ‌క్క‌డ‌ ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, కులం పేరుతో ప్ర‌భుత్వ ఉద్యోగితో త‌న కాళ్లు మొక్కించుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఆ దారుణం వైర‌ల్‌గా మార‌డంతో తీవ్ర దుమారం రేగుతోంది.  త‌మిళ‌నాడు, కోయంబత్తూర్‌లోని అన్నూర్‌ పంచాయితీలో ముత్తుస్వామి పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి ఇటీవల భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో అక్కడున్న మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు. ముత్తుస్వామి అడ్డుకోవ‌డంతో ఇద్ద‌రి మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన గోపాలస్వామి దళితుడైన ముత్తుస్వామిని కులం పేరుతో తిట్టాడు. తన కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలని, లేకపోతే తన పలుకుబడితో ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరింపులకు దిగాడు. భయపడిన ముత్తుస్వామి.. గోపాలస్వామి కాళ్లు పట్టుకుని క్ష‌మించ‌మ‌ని కోరాడు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని అక్క‌డే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంట‌నే విచారణకు ఆదేశించారు. స‌మాజంలో కుల దురంహ‌కారానికి సాక్షంగా నిలుస్తోంది ఈ ఘ‌ట‌న‌.   

గంజాయి స్మగ్లర్లు, సెక్స్ వర్కర్లుగా కూలీలు! కరోనా కాటుతో దుర్భర బతుకులు..

"మనం ఉన్నామన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి. లేకపోతే మనం ఉండీ లేనట్టే". న్యాయవ్యవస్థ మీద ప్రజల్లో కల్పించాల్సిన నమ్మకం గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు మన పాలక ప్రభుత్వాలకు కనువిప్ప కావాలి. లేకపోతే భవిష్యత్తు అంధకారమే అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ తరువాత ఉపాధి దెబ్బతిన్న క్రమంలో పెరిగిన క్రైమ్ రేట్ ను దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వాలు ఏం చేయాలో తెలుస్తుందంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా చేష్టలుడిగి చూస్తుంటే... రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుల పరిస్థితేంటి? అసంఘటిత రంగంలో ఉన్న వృత్తి పనివారు, కూలీపనివారు, ఆటోడ్రైవర్లు, ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, ఉపాధి కోసం వెదుకుతున్న యువకులు.. ఇలా అనేక సెక్షన్ల ప్రజల దీనావస్థను అర్థం చేసుకునేదెవరు? ఎవరికీ పట్టని, ఎవరూ పట్టించుకోని ఇలాంటి కోట్లాది మందికి ఏ వైపు నుంచి కూడా భరోసా లేకపోవడంతో దాని దుష్ప్రభావం సామాజికంగా పడుతోందంటున్నారు విశ్లేషకులు.   హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న కొన్ని చీకటి కార్యకలాపాల ఆనవాళ్లు ఈ మధ్య బయటపడ్డాయి. వాటి లోతుల్లోకి వెళ్తే దిమ్మతిరిగిపోయే నిజాలు వెలుగుచూశాయి. బతుకుదెరువు లేక.. భరోసా ఇచ్చే నాథుడు లేక.. ఆకలితో పస్తులు ఉండలేక కొందరు యువకులు పక్కదార్లు తొక్కారు. తప్పుడు బాటను ఎంచుకున్నవారిలో పాత నేరస్తులకు తోడు కొందరు కొత్తవారు కూడా ఉండడం ఆందోళన రేపుతోంది. ఇక పాత చిల్లర నేరగాళ్లయితే తాజాగా చాలా తీవ్రమైన, విస్తృతమైన నేర సామ్రాజ్యంలోకి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఆ నేరాల్లో అక్రమ గుట్ఖా వ్యాపారం నుంచి మొదలుకుంటే స్మార్టుగా చేసే సైబర్ క్రైమ్స్ వరకూ ఉన్నాయి. 2020 మార్చి తరువాత అనూహ్యంగా వచ్చిన లాక్ డౌన్ తరువాత విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయి అక్రమ రవాణా ఎంతగా పెరిగిందో పోలీసు నివేదికలే రుజువు చేస్తున్నాయి. అలాగే ఉద్యోగాలు కల్పిస్తామని, మంచి శాలరీలు ఇప్పిస్తామని, విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చంటూ స్మార్ట్ గా వల వేసే సైబర్ నేరగాళ్ల ఉదంతాలు కూడా లెక్కకు మించి బయటపడుతున్నాయి. ఎన్నడూ లేంది ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.  ఈ మధ్య హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ ఓ నేరస్తుడు వెల్లడించిన విషయాలు లాక్ డౌన్ ప్రభావానికి అద్దం పడుతున్నాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ పండ్ల వ్యాపారి.. కొద్దిరోజుల క్రితం గంజాయి సరఫరా కేసులో పట్టుబడ్డాడు. అతను చెప్పిన వివరాలు వింటే విస్తుపోవాల్సిందే. లాక్ డౌన్ కారణంగా పండ్ల వ్యాపారం కూడా దారుణంగా దెబ్బ తిందని, కొనేవారు లేక బతుకు భారమైపోయిన తరుణంలో వేరే ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలోనే అతనికి తన మిత్రులు చేస్తున్న గంజాయి తరలింపు లాభసాటిగా కనిపించింది. ఇప్పటివరకు బుద్ధిగా పండ్లు అమ్ముకునే ఇతన్ని గంజాయి తరలింపు ఆకర్షించింది. వెంటనే ఆ బ్యాచ్ లో కలిసిపోయి విశాఖ నుంచి గంజాయి తరలించే పనికి ఒప్పుకున్నాడు. వ్యాపారం బాగుందని, అంతకుముందు నెలకు 30 వేలు కూడా గగనకష్టంగా వచ్చేవని, కానీ గంజాయితో 60 వేల సంపాదన సులభ సాధ్యమైందని పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు.  ఇక మరో కూలీని హషిష్ ఆయిల్ ఆకర్షించింది. హషిష్ ఆయిల్ కూడా గంజాయే. కాకపోతే ఇది ఆకురూపంలో కాకుండా గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేసి, దానికి గాఢమైన వాసన వచ్చేందుకు ఆల్కహాల్, వార్నిష్ వంటి పదార్థాలను కలుపుతారట. 5 ఎంఎల్,   10 ఎంఎల్ లాంటి చిన్నసైజు బాటిళ్లలో నింపి అత్యధిక ధరలకు అమ్ముతున్నట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ హషిష్ బాటిల్ మూత తీయగానే ఆ వాసనకే మత్తు నషాళానికి అంటుతుందని పోలీసులు చెబుతున్నారు. హషిష్ గాల్లో కలిసిపోయి.. ఆ పరిసరాల్లో ఉన్నవారికి కూడా మత్తు సోకుతుందని చెబుతున్నారు. అందుకే ఒక చిన్న బాటిల్ ఖరీదే వేలల్లో ఉంటుందని పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ నల్లబజారులో కనిపించని ఈ హషిష్.. లాక్ డౌన్ తరువాతనే పుంజుకుందని చెబుతున్నారు.  అంతేకాదు.. ఉపాధి కోల్పోయిన పురుషులు కుటుంబాలను వదిలేస్తే... ఆ భారం కాస్తా మహిళలపై పడుతోంది. ఇప్పటివరకు ఇంటిపట్టునే ఉండి పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకున్న మహిళలు... భర్తల నిర్వాకంతో అడ్డదార్లు తొక్కాల్సి వస్తోంది. అందుకే ఈజీ మనీ ప్రాసెస్ లో భాగంగా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా సెక్స్ వర్కర్ల అవతారం కూడా ఎత్తుతున్నారని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటివాటికి చెక్ పడాలంటే పాలకులు, ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు కాకుండా సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథక రచన చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

షర్మిల భర్తతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ! అసలు కథ పెద్దదే..

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు... ఇటీవలే కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలతో సమావేశమైన ఫోటో వైరల్ గా మారింది. తమ పార్టీలోకి కీలక నేతలు వస్తున్నారంటూ షర్మిల పార్టీ నేతలు చెబుతున్న సమయంలోనే  ఈ ఫోటో బయటికి రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది షర్మిల. అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆమె భర్తను కలిస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తెలంగాణలోనూ అదే జరిగింది. కేసీఆర్ కు షాకిచ్చి ఎమ్మెల్యే షర్మిల పార్టీలోకి జంపు కానున్నారనే ప్రచారం జరిగింది.  వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆదివారం భేటి అయినట్లు ప్రచారం జరిగింది. వాళ్లిదరు మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ భేటి లోటస్ పాండ్ లో కాకుండా వేరే ప్రాంతంలో జరిగినట్లు కూడా ప్రచారం జరిగింది. కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ తో రాజయ్య తరచూ భేటి అవుతున్నారనే సమాచారం లీకైంది. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో రాజయ్య అసంతృప్తిగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాజయ్య. అయితే కొన్ని రోజులకే ఆరోపణలతో రాజయ్య తొలగించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. రాజయ్య, శ్రీహరి ఇద్దరికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమే. ఇద్దరికి మొదటి నుంచి విభేదాలున్నాయి.  ఇటీవల కాలంలో రాజయ్య, శ్రీహరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇరు వర్గాల నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. అదే సమయంలో కడియంకు సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల వరంగల్ వెళ్లిన కేసీఆర్.. కడియం నివాసంలోనే లంచ్ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజయ్యను తప్పించి కడియంకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు భర్తతో రాజయ్య సమావేశం అయ్యారంటూ ఫోటోలు బయటికి రావడం చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య క్లారిటీ ఇచ్చారు. అనిల్ తో కలిసి ఉన్న ఫోటోలు పాతవని, గతంలో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో కావాలనే వైరల్ చేశారని ఆయన చెప్పారు. తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని.. బ్రదర్ అనిల్ ను కలవలేదని క్లారిటీ ఇచ్చారు.  పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని రాజయ్య హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపరచవద్దని రాజయ్య విన్నవించారు. పార్టీ మార్పుపైనా స్పష్టతనిచ్చారు రాజయ్య.  జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ తనకు భిక్ష పెట్టారన్నారు. మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేకపోయారు కాబట్టే కేసీఆర్ దళిత ఎంపవర్ మెంట్ తెచ్చారని  రాజయ్య తెలిపారు. రాజయ్య ఫొటోల ప్రచారం వెనుక ఆయన ప్రత్యర్థి. టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఉన్నారన్న ప్రచారంపై కూడా స్పందించారు. ‘కడియం శ్రీహరి నేను ఒకే జాతి బిడ్డలం.. అందుకే మా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఆయన రెండు సార్లు గెలిస్తే.. నేను నాలుగు సార్లు గెలిచా.. కొన్ని విషయాల్లో నేను కడియం శ్రీహరిని ఆదర్శంగా తీసుకుంటా.. అందుకే నేను గురువును మించిన శిష్యుడనయ్యా’ అంటూ కడియంతో తనకు విభేదాలపై రాజయ్య క్లారిటీ ఇచ్చారు.

ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. స్కూల్ ఆవరణలో రాజకీయాలా? జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్..

మూడు కేసులు.. ఆరు చివాట్లు. ఇది ఏపీలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి సర్కార్ కు హైకోర్టులో ఎదురవుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా కేసుల్లో జగన్ సర్కార్ విధానాలను తప్పుపడుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చాలా నిర్ణయాలను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రభుత్వమే మార్చేసుకుంది. పలు కేసుల్లో అధికారుల తీరుపైనా అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఐఏఎస్ లపైనా చర్యలకు దిగింది. అయినా జగన్ సర్కార్ తీరు మారడం లేదు. అధికారులు నిర్లక్ష్యం వీడటటం లేదు. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు, పంచాయితీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దివ్వేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీ, ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ స్కూలు ఆవరణలో భవనాలు నిర్మించవద్దని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదంటూ  ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల భవనాల్లో రైతు భరోసా, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారణ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. స్కూల్‌ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని...ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్స్‌లో వాతావరణ కలుషితం చేస్తున్నారని ధర్మాసనం మండిపడింది. తమ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడంలేదని నలుగురు ఐఏఎస్ లను నిలదీసింది ధర్మాసనం. తమ ఆదేశాలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘మీలో ఏవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా’ అని  హైకోర్టు జడ్జి దేవానంద్‌ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలోకి రాజకీయాలను ఎలా తీసుకెళ్తారని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. 

లైట్ తీసుకున్నారా.. రాజకీయ వ్యూహమా? పీకే చేరికకు మాయావతి ఎందుకు రాలేదు?   

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. నేతల వలసలు జోరందుకున్నాయి. తాజాగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహుజన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. కొన్ని రోజుల క్రితమే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. బహుజన వాదంతో ముందుకు వెళుతున్న ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర వ్యాప్తంగా అనుచర వర్గం ఉందని చెబుతున్నారు. ఆయన సారథ్యంలో నడుస్తున్న స్వేరోస్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఉన్నాయి. దీంతో ప్రవీణ్ కుమార్ రాజకీయ అడుగులపై జనాల్లో ఆసక్తి నెలకొంది.  నల్గొండలో నిర్వహించిన రాజ్య సంకల్ప సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ కుండువా కప్పుకున్నారు. అయితే ఆయన చేరిక కార్యక్రమం బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో జరగకపోవడం పలు చర్చలకు తావిస్తోంది. ప్రవీణ్ కుమార్ కు బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌ ఆ పార్టీ కండువాను కప్పి సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు సభలోనే ఆయన ప్రకటించారు. రిటైర్డ్ ఐపీఎస్, బహుజనుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లుగా చెప్పుకుంటున్న ప్రవీణ్ కుమార్ చేరిక కార్యక్రమానికి మాయవతి రాకపోవడంతో.. ఆమె అతన్ని లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రవీణ్ కుమార్ తో పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదని భావించడం వల్లే రాంజీ గౌతమ్ ను పంపించారా లేక ఇతరత్రా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది.  నిజానికి ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీఎస్పీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. గతంలో అధికారం చేపట్టిన యూపీలోనూ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరో ఆరేడునెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా మాయావతి ఇంకా జనంలోకి రాలేకపోతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రాల్లో పార్టీకి బలం పెరిగితే ఎంతో ఉపయోగం. ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణలో బహుజన వాదం బలంగానే పనిచేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ ప్రవీణ్ కుమార్ లాంటి బలమైన నేత పార్టీలోకి వస్తున్నా.. మాయావతి రాకపోవడంపై రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.  ప్రవీణ్ కుమార్ ,మాయావతి కాంబినేషన్ విషయంలో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. మాయావతి అనుసరిస్తున్న రాజకీయ పంథాకు, ప్రవీణ్ కుమార్ ప్రకటిత పంథాకు మధ్య చాలా చాలా దూరం ఉన్నట్లు కనిపిస్తోంది. మాయావతి, ఇంతవరకు నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, రెండుసార్లు, బీజేపీ మద్దతుతోనే గద్దె  నెక్కారు. అంతే కాదు ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఓబీసీ జనగణన చేపడితే, పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని ఆమె ప్రకటించారు. అలాగే, ప్రస్తత పార్లమెంట్ ప్రతిస్తంభన వ్యవహారంలోనూ బీఎస్పీ ఎంపీలు, కాంగ్రెస్ ఇతర విపక్షాల మొండి వైఖరిని తప్పుపడుతున్నారు. మాయావతి అనుసరిస్తున్నఈ  బీజేపీ, హిందుత్వ అనుకూల వైఖరిని కరడు కట్టిన హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న ప్రవీణ కుమార్ ఎంతవరకు జీర్ణం చేసుకుంటారన్నది అనుమానమే.  తెలంగాణలో ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా గతంలో హిందూ సంస్థలు, బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. ముఖ్యంగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రతిజ్ఞ చేయడం తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రవీణ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రవీణ్ కుమార్ కరుడుగట్టిన హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసుకోగా.. అటు వైపు మాత్రం మయావతి బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమని చెబుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదిరినా కుదరొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రవీణ్ కుమార్ చేరిక కార్యక్రమానికి మాయావతి రాలేదంటున్నారు. బెహన్ జీకి యూపీనే అత్యంత కీలకం కాబట్టి.. ఆ దిశగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ల మద్దతు తీసుకోవడం ఆమెకు అవసరం ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే అన్ని అలోచించే ప్రవీణ్ కుమార్ విషయంలో.. మాయావతి అడుగులు వేశారని చెబుతున్నారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  బీఎస్పీ ప్రయోగం ఎందుకనో సక్సెస్ కాలేదు. 1994 ఎన్నికల సముయంలో  స్వయంగా కాన్షీ రామ్ హైదరాబాద్ లో మకాం చేసి, పార్టీని పటిష్ట పరిచేందుకు చాలా గట్టి కసరత్తే చేశారు. 1993 యూపీ ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా బీఎస్పీకి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత 1995లో తొలి సారిగా బీజేపీ మద్దతుతో మాయావతి యూపీ ముఖ్యమంత్రి  అయ్యారు. యూపీ తర్వాతగా ఏపీ అనే నినాదంతో 1994  ఎన్నికలకు ముందు రాష్ట్రలో దళిత బహుజనుల జెండా పాతేందుకు కాన్షీ రామ్ చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కూడా కాన్షీరామ్ ఎవరి కొంప ముంచుతారో అని లెక్కలు వేసుకున్నాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో కాన్షీ రామ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ, రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలను సృష్టించింది. కానీ కాన్షీ రామ్ ప్రభంజనం ఫలితాలలో కనిపించలేదు. ఆ ఎన్నికలలో నిజమైన ప్రభంజనం ఎన్టీఅర్ సృష్టించారు. మొత్తం 294 స్థాన్లాకు గానూ 220కి పైగా స్థానాలలో తెలుగు దేశం విజయ దుందుభి మోగించింది. అలా 1994 ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత, రాష్ట్రంలో బీఎస్పీ ఉందంటే ఉందనే గానీ, బలమైన శక్తిగా మాత్రం లేదు. కత్తి పద్మారావు వంటి కొదంరు పార్టీని బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. 

వ్య‌భి-చారం కోసం అమ్మాయి కావాలి.. అంబ‌టి పేరుతో ఆడియో వైర‌ల్‌..

అంబ‌టి రాంబాబు. స‌త్తెన‌ప‌ల్లి వైసీపీ ఎమ్మెల్యే. నిత్యం వివాదాల్లో ఉంటారు. ప్ర‌తిప‌క్షాల‌పై విమర్శ‌లు చేయ‌డంలో ఎంత‌ ముందుంటారో.. విమ‌ర్శ‌ల పాల‌వ‌డంలోనూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇటీవ‌ల తెలుగువ‌న్ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ.. ఓ కులం వారంతా తాగుబోతులంటూ, బ‌ద్ద‌క‌స్తులంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. తెలుగువ‌న్‌లో వ‌చ్చిన ఆ ఇంట‌ర్వ్యూ క్లిప్స్ వైర‌ల్ కావ‌డం.. అంబ‌టిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో.. ఆ త‌ర్వాత త‌న వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు కోరాల్సి వ‌చ్చింది. ఆ వేడి ఇంకా త‌గ్గ‌క‌ముందే.. అంబ‌టి రాంబాబు విష‌యంలో మ‌రో హాట్ హాట్ న్యూస్ వైర‌ల్ అవుతోంది. అది మ‌రింత కొంప‌ముంచేలా ఉంది.  సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వాయిస్ పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఓ అమ్మాయిని పంపమని ఓ మహిళకు చెబుతున్నారు. మసాజ్‌తో పాటు అన్నీ కావాలంటూ సదరు మహిళను అంబటి అడిగారు. వ్యభి-చారం కోసం సైతం పనికొచ్చేలా మహిళని పంపమని ఆయన అడిగారు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అవుతోంది.  గతంలోనూ పలుమార్లు మహిళల విషయంలో అంబటి ఇలానే వివాదాస్పదమయ్యారు. గ‌త అనుభ‌వాల‌తో..  ఇప్పుడు వైర‌ల్ అవుతున్న ఆడియో కూడా ఆయనదేనని భావిస్తున్నారు. లేడిస్ మేట‌ర్ కావ‌డంతో.. ఆ ఆడియో క‌నుక అంబ‌టిదేన‌ని తేలితే.. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఇబ్బంది త‌ప్ప‌దు.  

ఫోన్లు చాలు.. ఇక న‌జ‌రానాలు ఇవ్వండి.. మోదీకి రాహుల్ ఝ‌ల‌క్‌..

ఒలింపిక్స్‌లో భార‌త ఆట‌గాళ్లు ఈసారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌నే క‌న‌బ‌రిచారు. ఏడు ప‌త‌కాల‌తో టోక్యోలో త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడించారు. అథ్లెటిక్స్‌లో 120 ఏళ్ల లోటును తీరుస్తు.. ఏకంగా స్వ‌ర్ణం సాధించి యావ‌త్ దేశంలో ఉత్సాహం నింపారు నీర‌జ్ చోప్రా. ఏడు ప‌త‌కాలు.. వేటిక‌వే ప్ర‌త్యేక‌మే. విశ్వ క్రీడ‌ల్లో భార‌తీయుల‌ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నాలే. ఇలా ఒలింపిక్ మెడ‌ల్ రాగానే.. అలా ప్ర‌ధాని మోదీ నుంచి ఫోన్ కాల్ వెళ్లేది. ప‌త‌కం సాధించిన ఆట‌గాళ్ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించే వారు మోదీ. మీ ప్ర‌తిభ అద్భుత‌మ‌ని.. దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని.. ప్ర‌శంశించేవారు. కొంద‌రు ఓడిన వారికీ ఫోన్ చేసి.. నిరుత్సాహం వ‌ద్దంటూ.. ఓడినా పోరాడారంటూ.. ప్రోత్స‌హించారు ప్ర‌ధాని. ఇక ట్వీట్ల సంగ‌తి స‌రేస‌రే. మోదీ చొర‌వ‌ను అంతా శ‌భాష్ అంటూ కొనియాడారు. ప్ర‌ధాన‌మంత్రే స్వ‌యంగా ఫోన్ చేసి ఒలింపిక్స్‌లో గెలిచిన వారిని అభినందించ‌డం.. ఓడిన వారిని ఓదార్చ‌డం.. మోదీ ఇమేజ్‌ను మ‌రింత పెంచింది.  ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. మోదీ మంచి ప‌నే చేశారు. అంతేనా? ఇంకేం లేదా? అంటూ తాజాగా రాహుల్‌గాంధీ కొత్త చ‌ర్చ లేవ‌నెత్తారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మోదీని గిల్లేలా ఘాటైన కామెంట్లు చేశారు.  ‘క్రీడాకారులకు చేసిన ఫోన్లు చాలు.. ఇక నగదు బహుమతులు ఇవ్వండి. శుభాకాంక్షలతో పాటు నగదు బహుమతులు కూడా వారికి అందాలి.. క్రీడలకు కేటాయించిన నిధుల్లో కోత కాదు’’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎక్క‌డా ప్ర‌ధాని పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. ఆ కామెంట్లు మోదీని ఉద్దేశించి చేసిన‌వేన‌ని అంద‌రికీ తెలిసేలా పోస్టు పెట్టారు.  ఇన్‌స్ట్రా పోస్టుతో పాటు.. ‘‘4 ఏళ్ల గడిచినా హరియాణ అథ్లెట్లకు అందని నగదు బహుమతులు’’ టైటిల్‌తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో జులైలో వ‌చ్చిన స్టోరీ క్లిప్పింగ్‌ను సైతం త‌న పోస్టుకు జ‌త చేశారు రాహుల్‌గాంధీ. వార్తా క‌థ‌నంలో.. గ‌తంలో వివిధ టోర్నీల‌లో, వివిధ ఆట‌గాళ్ల‌కు హ‌రియాణ‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన న‌జ‌రానాలు.. ఎవ‌రెవ‌రికి ఎంతెంత క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారో ఆ వివ‌రాలతో పాటు అవి ఇప్ప‌టికీ అంద‌ని వైనాన్ని ఆ క‌థాంశంలో డిటైల్‌గా రాసుకొచ్చారు. ఆ హ‌రియాణ ఎపిసోడ్‌ను గుర్తు చేస్తూ.. మోదీని టార్గెట్ చేసేలా.. ఆట‌గాళ్ల‌కు ఫోన్లు చాలు.. న‌గ‌దు బ‌హుమ‌తులు ఇవ్వాలంటూ రాహుల్‌గాంధీ డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.   

ఏపీపై ఆర్టిక‌ల్ 360 ప్ర‌యోగం?.. రంగంలోకి రాష్ట్ర‌ప‌తి?.. జ‌గ‌న్ స‌ర్కారుకు ముప్పు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెల‌కొంది. ఏపీ దివాళా తీసింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సంక్షోభ ప‌థ‌కాల పేరుతో ఖ‌జానా ఖాళీ చేసేశారు. ఉద్యోగులకు ఒక‌టో తారీఖు జీతాలు ఇవ్వ‌డ‌మే క‌ష్ట‌మైపోతోంది. ఒక్క కొత్త ప‌రిశ్ర‌మ వ‌చ్చింది లేదు. అభివృద్ధి జాడే క‌నిపించ‌దు. ఉన్న కంపెనీలే పెట్టాబేడా స‌ర్దేసుకుంటున్నాయి. రిల‌య‌న్స్ నుంచి అమ‌ర‌రాజా వ‌ర‌కూ ఇదే తీరు. ఇప్ప‌టికే హ‌ద్దు దాటేశారు. హ‌ద్దు మీరి అప్పులు చేశారు. లెక్క‌ల‌తో త‌మ్మిని బ‌మ్మి చేస్తున్నారు. కాగ్, పీఏసీ క‌డిగేస్తున్నా స‌ర్కారు ద‌గ్గ‌ర స‌రైన స‌మాధానం లేదు. అటు కేంద్రం సైతం అప్పుల‌పై వివ‌రాలు అడుగుతోంది. ఏకంగా ఏజీని రంగంలోకి దింపడంతో జ‌గ‌న్ స‌ర్కారు కంగుతింది. ఉన్న స‌మ‌స్య‌లు స‌రిపోన‌ట్టు.. ఎంపీ ర‌ఘురామ మూలిగేన‌క్క‌పై తాటిపండు ప‌డ్డట్టు ప‌దే ప‌దే ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతున్నారు. కొత్త కొత్త ఆలోచ‌న‌లు, కొత్త కొత్త ఫిర్యాదులతో స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేస్తున్నారు. తాజాగా, ర‌ఘురామ కీల‌క‌మైన పాయింట్ తెర మీద‌కు తీసుకొచ్చారు. ఏపీలో ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించాలంటూ ఏకంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొందని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ఆర్టికల్‌ 360 ద్వారా ఏపీలో ఆర్థిక అత్యయిక స్థితి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.  ‘‘ఏపీ రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రాష్ట్ర ఆర్థిక లోటు డిసెంబర్‌ నాటికే రూ.68,536 కోట్లు దాటింది. ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా ప్రభుత్వానికి గగనమైపోతోంది. జులైలో రెండో వారం వరకూ కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో రఘురామ కోరారు. ఈ ప‌రిణామం, ర‌ఘురామ ఫిర్యాదు.. జ‌గ‌న్ సర్కారును క‌ల‌వరానికి గురిచేస్తోంది.    

రఘురామ ఫిర్యాదుపై రాష్ట్రపతి యాక్షన్.. వాళ్లిద్దరికి మూడినట్టేనా?

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై  కొంత కాలంగా పోరాడుతున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం జగన్ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఫిర్యాదులు చేశార. ఎంపీ రఘురామ రాజుఫిర్యాదులపై ఢిల్లీలో సత్వర స్పందన లభిస్తోంది.  ఏపీ సీఎం  జగన్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న ఛార్జ్ షీట్ల గురించి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు జూలై 26న లేఖ రాశారు ఎంపీ రఘురాజు లేఖ. దీనిపై రాష్ట్రపతి స్పందించారు. ఈ అంశాన్ని సంబంధిత శాఖలకు పంపినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి రఘురాజుకు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ రఘురామ రాజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.'గౌరవ రాష్ట్రపతికి జగన్, విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, వారిపై సీబీఐ కోర్టులో ఉన్న పెండింగ్ ఛార్జ్ షీట్లపై నేను పంపిన పూర్తి నివేదికను... పరిశీలించాలని సంబంధిత శాఖలకు పంపించారు' అని అందులో ఆయన తెలిపారు.  రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన లేఖను షేర్ చేశారు. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురాజు పిటిషన్లు వేశారు. దీనిపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈనెల25 తీర్పు రాబోతోంది. జగన్ కు బెయిల్ రద్దు కావడం ఖాయమని చెబుతున్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ బెయిల్ కేసులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీలోనూ కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి కోర్టు కేసులు, కేంద్రానికి ఫిర్యాదులతో వైసీపీతో పాటు సీఎం జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. 

ఇంద్ర‌వెల్లి దండోరా.. రేవంత్‌రెడ్డి గ‌ర్జ‌న‌.. కాస్కో కేసీఆర్‌..  

క్విట్ ఇండియా మ‌ర్నాడే.. క్విట్ కేసీఆర్ స‌మ‌రశంఖాన్ని పూరించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇంద్ర‌వెల్లి ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌తో గులాబీబాస్‌కు రేవంత్ స‌త్తా తెలిసొచ్చేలా చేశారు. ఉద‌యం నుంచి ఒక‌టే హంగామా. బండెన‌క బండి క‌ట్టి.. ఇంద్ర‌వెల్లికి దండు క‌ట్టి.. ద‌ళితులు, గిరిజ‌నుల ప‌క్షాన దండోరా మోగించారు. కేసీఆర్ కుట్ర‌లు, కుతంత్రాల‌ను చీల్చి చెండాడుతున్నారు.  అది స‌భ కాదు. జ‌న ప్ర‌భంజ‌నం అనేలా భారీ ఏర్పాట్లు. కాంగ్రెస్ ప్ర‌ముఖులంతా త‌ర‌లివ‌చ్చే త‌రుణం. పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి స‌త్తాకు నిద‌ర్శ‌నం. 18 ఎక‌రాల స్థ‌లం. ల‌క్ష మంది జ‌నం. లెక్క పెట్టుకో కేసీఆర్‌.. ఒక్క‌రు త‌క్కువైనా దేనికంటే దానికి సై.. అంటూ ముందే స‌వాల్ చేశారు చిచ్చ‌ర‌పిడుగు. అన్న‌ట్టుగానే.. అన్ని జిల్లాల నుంచి.. జ‌నం.. చీమ‌ల‌దండులా క‌దిలారు.   హైద‌రాబాద్ నుంచి ర్యాలీగా రేవంత్‌రెడ్డి. దారిపొడువునా జ‌న జాత‌రే. జై కాంగ్రెస్‌.. జై రేవంత్‌.. నినాదాలే. అడుగ‌డుగునా కాంగ్రెస్ జెండా రెప‌రెప‌లే. కాంగ్రెస్‌లో మునుపెన్న‌డూ చూడ‌ని ఉత్సాహం. గ‌త వైభ‌వం దిశ‌గా హ‌స్తం పార్టీ అడుగులు.  ఇంత‌టి జోష్‌ రేవంత్‌రెడ్డి వ‌ల్లే సాధ్యం.   ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ. ద‌ళిత‌బంధుతో కేసీఆర్ చేస్తున్న రాజ‌కీయ డ్రామాకు దండోరాతో దుమ్ముదులిపేయ‌నున్నారు రేవంత్‌రెడ్డి. జీతాల‌కే డ‌బ్బులు లేక భూములు అమ్ముకున్న స‌ర్కారు.. ల‌క్ష కోట్ల‌తో రాష్ట్రంలోని ద‌ళిత కుటుంబాల‌న్నిటికీ 10 ల‌క్ష‌లు ఇస్తారంటే ఎవ‌రైనా న‌మ్ముతారా? ద‌ళితుడికి డిప్యూటీ సీఎం, ద‌ళితుల‌కు 3 ఎక‌రాల భూమి.. లానే ద‌ళిత బంధును రాజ‌కీయ ప‌బ్బం కోసం వాడుకుంటున్నార‌నే విష‌యాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డానికే ఈ ద‌ళిత దండోరా. తెలంగాణ‌లో ద‌ళితులు మాత్ర‌మే ఉన్నారా? పాపం.. గిరిజ‌నులు,. అభంశుభం తెలీని అడ‌వి బిడ్డ‌ల.. దుస్థితి అంత‌క‌న్నా దారుణం. వారి అభివృద్ధి మాటేంటి? పోడు భూములు స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మేంటి? తెలంగాణ‌లో గిరిపుత్రుల‌ను ఆదుకోరా? వారి అభ్యున్న‌తికి కృషి చేయ‌రా? అందుకే గిరిజ‌న దండోరా. ఇంద్ర‌వెల్లి గ‌డ్డ మీద నుంచి.. రేవంత్‌రెడ్డి చేస్తున్న ద‌ళిత‌-గిరిజ‌న దండోరా. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చేలా.. కేసీఆర్‌ను బ‌య‌ట‌కు గుంజేలా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంద్ర‌వెల్లి వేదిక‌గా స‌మ‌ర‌శంఖం పూరిస్తున్నారు. ద‌ళిత గిరిజ‌న దండోరాతో గులాబీ బాస్‌లో గుబులు రేపుతున్నారు. ల‌క్ష‌.. అక్ష‌రాల ల‌క్ష మంది జ‌నంతో.. ఇంద్ర‌వెల్లి.. ఈ రాజకీయ ఇంద్రుడి స‌త్తాకు సాక్షంగా నిలుస్తోంది. జ‌నాన్ని లెక్కేసుకో కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డి దెబ్బ‌ను కాస్కో కేసీఆర్‌..

నంద్యాలలో జర్నలిస్ట్ దారుణ హత్య.. అవినీతిని వెలికితీయడమే పాపమా? 

ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం జరిగింది. ప్రశ్నించే గొంతుక దారుణ హత్యకు గురైంది. కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో  కిరాతకం హత్య జరిగింది. యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది.  మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్న వివరాల  ప్రకారం కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్‌ కానిస్టేబుల్‌ సుబ్బయ్యకు సంబంధాలు ఉన్నాయని బయటపెట్టారట. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారం జరగ్గా.. జిల్లా ఎస్పీ కానిస్టేబుల్‌ సుబ్బయ్యను సస్పెండ్‌ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించారట. కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని ఓ గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ చనిపోయాడు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు గుర్తించారు. కానిస్టేబుల్‌ అవినీతిని బట్టబయలు చేసిన విలేకరిని హత్య చేశారని జర్నలిస్ట్‌ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ అన్నారు. కర్నూలు జిల్లా  నంద్యాలలో  జరిగిన రిపోర్టర్ కేశవ్ హత్య ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు డి‌జి‌పి గౌతమ్ సవాంగ్. హత్య కు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ కి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో పాటు  హత్య తో ప్రమేయం ఉన్న అందరినిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఏపీ డి‌జి‌పి.  

సీఐ మూతి ప‌గ‌ల‌గొట్టిన మందుబాబులు! చ‌ర్య‌ల‌కు ఖాకీలు వెన‌క‌డుగు?

ఖాకీ డ్రెస్ వేసుకుంటే అదో ప‌వ‌ర్‌. వెయ్యి ఏనుగులంత బ‌లం. త‌మ‌కు ఎదురు లేద‌నే ధైర్యం. ఎదుటివారిని లెక్క‌చేయ‌ని టెంప‌ర్‌. అంత ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌నే మూతి ప‌గిలేలా కొట్టారంటే మాట‌లా? కొట్ట‌డ‌మే త‌ప్ప‌.. కొట్టించుకునే అల‌వాటు లేని కాప్స్.. ఇంత పెద్ద విష‌యాన్ని ఊరికే వ‌దిలేస్తారా? అంటే, వ‌దిలేశారు మ‌రి. మామూలుగా అయితే ఇలాంటి సీన్ల‌లో పోలీసుల‌ను కొట్టినోళ్ల తాట తీస్తారు. కేసులు పెట్టి.. స్టేష‌న్లో వేసి.. సీసీకెమెరాలు ఆఫ్ చేసి.. లాఠీల‌తో కుమ్మేస్తారు. రోక‌లిబండ ఎక్కిస్తారు. అని అంటుంటారు. కానీ, ఈ కేసులో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఏకంగా సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయి అధికారి పెద‌వులు ప‌గిలేలా ముఖంపై కొట్టిన వారిపై ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌లేద‌ని అంటున్నారు. వారిని అదుపులోకి తీసుకోవ‌డం కానీ, వారిపై ర‌క‌ర‌కాల కేసులు పెట్ట‌డం కానీ చేయ‌లేదు. చివ‌రాఖ‌రికి అస‌లు ఆ విష‌య‌మే జ‌ర‌గ‌న‌ట్టు.. త‌మ సీఐని ఎవ‌రూ కొట్ట‌లేద‌న్న‌ట్టు.. మేట‌ర్‌ను చాలా సీక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తున్నారు. మీడియా ఉందిక‌దా.. అందుకే విష‌యం ఆఫ్‌ది రికార్డ్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ సీఐని కొట్టినోళ్ల‌పై చ‌ర్య‌లెందుకు తీసుకోవ‌డం లేదంటే..... శుక్ర‌వారం. అర్థ‌రాత్రి. మాదాపూర్‌లోని ఓ ప్రాంతం. వీకెండ్ క‌దా.. అందుకే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీలు చేస్తున్నారు. అంత‌లోనే ఓ రేంజ్‌ రోవర్‌ కారు అటువైపుగా వేగంగా దూసుకొచ్చింది. పోలీసులు ఆ కారును ఆపే ప్ర‌య‌త్నం చేశారు. అందులో వారు స‌డెన్ బ్రేక్ వేసి.. కారును రివ‌ర్స్‌లో వెన‌క్కి తీసుకెళ్లేందుకు ట్రై చేశారు. అస‌లే సైబ‌రాబాద్ పోలీసులు క‌దా.. డ్రంకెన్ డ్రైవ్‌లో ఫుల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. అందుకే ఆ రేంజ్ రోవ‌ర్ కారు ప‌ప్పులేమీ ఉడ‌క‌లేదు. రివ‌ర్స్‌లో వెళ్తున్న కారుకు పోలీస్ వెహికిల్స్ అడ్డుపెట్టి మ‌రీ ఆపేశారు. కారులో ఉన్న ఇద్దరికి బ్రీత్‌ అనలైజర్ టెస్ట్ చేయ‌బోయారు. అందుకు వారు నిరాక‌రించారు. ఒక్క‌సారిగా పోలీసుల‌పై రెచ్చిపోయారు. మమ్మల్నే ఆపుతారా? మేము ఎవ‌ర‌మో తెలుసా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్‌ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ ఓవ‌రాక్ష‌న్ చేశారు. అక్క‌డితో ఆగ‌లేదు ఆ మందుబాబులు. మ‌రింత రెచ్చిపోయారు. పోలీసుల‌పైనే అటాక్ చేశారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారు. ముఖంపై పిడిగుద్దులు గుద్ద‌టంతో సీఐకి గాయాల‌య్యాయ‌ట‌. పెదాలు ప‌గిలాయ‌ని అంటున్నారు.  విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనపై దాడికి పాల్పడిన ఇద్దరిపై బాధిత‌ ఇన్‌స్పెక్టర్‌.. మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశార‌ని తెలుస్తోంది. అయితే.. ఈ కేసుపై పోలీసులు ఎలాంటి యాక్ష‌న్ తీసుకోవ‌డం లేదు. సీఐని కొట్టినా నిందితుల‌పై వ‌దిలేశార‌ని తెలుస్తోంది. ఓ సీఐపై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదు? పెదవులు పగిలేలా కొట్టినా ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారు?  సీఐని కొట్టిన వారిలో ఒకరు సివిల్‌ కాంట్రాక్టర్‌ కాగా మరొకరు వైద్యుడు. ఈ ఇద్ద‌రిలో ఒకరు పోలీస్‌ శాఖలో పనిచేసే సీనియర్‌ అధికారికి బంధువని అంటున్నారు. ఆ బాస్ ఫోన్ చేయ‌డం వ‌ల్లే.. ఆ ఇద్ద‌రు ఓవ‌రాక్ష‌న్ గాళ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. పైనుంచి ఆదేశాల మేర‌కే.. విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచారు. అసలు కేసు నమోదయిందా లేదా? నిందితులను అరెస్ట్‌ చేశారా, లేదా? అనే వివ‌రాలు కూడా చెప్ప‌డం లేదు పోలీసులు. సీఐనే మూతిప‌గిలేలా కొట్టిన మందుబాబుల తాట తీయాల్సింది పోయి.. ఇలా ఉన్న‌తాధికారుల‌కు చుట్ట‌మ‌నే కార‌ణంతో వ‌దిలేయ‌డం దారుణం అంటున్నారు. 

ఒక పార్టీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించాం.. హెడ్ కానిస్టేబుల్ కామెంట్ల కలకలం..

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించింది వైసీపీ. నిజానికి 150కి పైగా అసెంబ్లీ వచ్చాయంటే వైసీపీ నేతలు కూడా నమ్మలేని పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఏపీ ఫలితం సంచలనమైంది. అదే సమయంలో ఎన్నికలపై అనేక అనుమానాలు వచ్చాయి. అప్పుడు టీడీపీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న బీజేపీ... ఏదో మాయ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేశారని కొందరు బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల సంఘం వైసీపీకి అనుకులంగా నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు కూడా వచ్చాయి. పోలీస్ శాఖ కూడా అక్రమాల్లో పాలు పంచుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు. 2019 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. శాఖలోని కొందరి సహకారంతో తపాలా ఓట్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామంటూ ప్రకాశం జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హెడ్ కానిస్టేబుల్ కామెంట్లతో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలపడుతున్నాయి.  ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో జులై 30న ఒంగోలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రణీత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సమావేశంలోనే ఇతర అధికారుల సమక్షంలోనే హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తపాలా బ్యాలెటు ఓట్ల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనతోపాటు మల్లారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారావు, వేణు, హోంగార్డు కిషోర్, ఓ మహిళా కానిస్టేబుల్ కలిసి జిల్లా వ్యాప్తంగా 700కుపైగా పోస్టల్ బ్యాలెట్ల వివరాలు సేకరించి పార్టీకి ఇచ్చామని, తమ కృషిని గుర్తించి మేలు చేయాలని కోరారు.   అంతేకాదు గత త ప్రభుత్వంలో ఉన్న వారే ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారని చెప్పిన  వెంకటరెడ్డి.. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. ఒకే పార్టీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించాంటూ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో  స్పందించిన జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అతడిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపుతూ  ఉత్తర్వులు జారీ చేశారు.

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా? 

తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా  హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికపై  నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్ని అక్కడే మోహరించాయి. ఇక్కడి నుంచి గత ఆరు ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పోటీ పడబోతున్నారు. గతంలో కారు గుర్తుపై గెలిచిన ఈటల.. ఈసారి మాత్రం బీజేపీ కమలం పువ్వు గుర్తుతో బరిలో ఉండబోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్ తీసుకుంటున్న అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాని ప్రచారం మాత్రం ముమ్మరంగా చేస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండానే.. నాగార్జున సాగర్ తరహాలో గులాబీ లీడర్లు గ్రామాలు చుట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కారెక్కారు. దీంతో ఆయనే అధికార పార్టీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంతో హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది.  అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.  దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ కోసమే వెలుగులోకి తెచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో 45 వేలకు పైగా దళిత ఓటర్లున్నారు. అందుకే ఆ సామాజిక వర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.అధికార పార్టీ అభ్యర్థి మాత్రం బీసీ వర్గం నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, వకుళాభరణం ఎల్.రమణ పొనగంటి మల్లయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు ఇవ్వాలనుకున్నా పెద్దిరెడ్డి మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న పాడి ఉదయానందరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. హుజురాబాగ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నియోజకవర్గంపై ఫోకస్ చేయగా కాంగ్రెస్ వెనకబడింది. ఈటల కోసమే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో హుజురాబాద్ ఉప ఎన్నికను కాంగ్రెస్ కూడా సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. కేసీఆర్ దళిత బంధుకు కౌంటర్ గా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిందట. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర్ రాజనర్సింహా పేరు అనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరును పరిశీలిస్తున్నారట.  టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తే.. బీసీనే పోటీకి దింపాలని పీసీసీ ముఖ్య నేతలు దాదాపుగా నిర్ణయానికి వచ్చారట. బీసీ కోటాలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నిలబెట్టాలని అనుకున్నా.. ఆయన ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో  అనూహ్యంగా కొండా దంపతుల పేర్లు తెరపైకి వచ్చాయంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు. ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో  టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ..  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లోకి మారారు. కాని వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు కొంత కాలంగా  స్తబ్ధుగా ఉండిపోయారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపినట్లు సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గానికి వరంగల్ జిల్లాతో లింకులుంటాయి. నియోజకవర్గంలోని కమలాపుర్ మండలం ఇప్పుడు కూడా వరంగల్ జిల్లా పరిధిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన శాయంపేట, పరకాల నియోజకవర్గాలకు పక్కనే హుజురాబాద్ ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో కొండా దంపతులకు భారీగా అనుచర గణం ఉందని చెబుతున్నారు. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల తర్వాత ఎక్కువగా ఓటర్లున్నది మున్నురు కాపులే. దాదాపు 28 వేలకు పైగా వీరి ఓట్లు ఉన్నాయి. పద్మశాలీ ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి. కొండా దంపతుల్లో మురళీ కాపు కాగా.. సురేఖ పద్మశాల. ఈ లెక్కన  కొండా బరిలో ఉంటే మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు పద్మశాలి ఓట్లు కూడా కలిసివస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుందని చెబుతున్నారు. 

ప్రత్యేక అధికారాలు కలవారిపై థర్డ్ డిగ్రీనా! సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. 

భారత ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి జస్టిస్ ఎన్వీ రమణ హాట్ కామెంట్స్ చేశారు.  మన దేశంలో కస్టోడియల్ టార్చర్, ఇతర పోలీసు దుశ్చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం మినహాయింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పోలీసులకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీని ఆయన కోరారు. నల్సా మొబైల్ యాప్‌ను, ‘విజన్ అండ్ మిషన్ స్టేట్‌మెంట్‌’ను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీజేఐ జస్టిస్ రమణ.. మానవ హక్కులకు, శారీరక భద్రతకు ముప్పు పోలీస్ స్టేషన్లలో అత్యధికంగా ఉందన్నారు.  పోలీసు కస్టడీలో నిర్బంధంలో ఉన్నవారిపై హింస, ఇతర పోలీసు దుశ్చర్యలు  మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న సమస్యలని చెప్పారు జస్టిస్ ఎన్‌వీ రమణ. రాజ్యాంగపరమైన ప్రకటనలు, హామీలు ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్లలో సమర్థవంతమైన న్యాయ ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్టయినవారికి, నిర్బంధంలో ఉన్నవారికి అత్యంత తీవ్ర నష్టదాయకమని చెప్పారు. ఇటీవల వస్తున్న వార్తలను పరిశీలించినపుడు ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి మినహాయింపు ఉండటం లేదన్నారు.  పోలీసుల అతి ప్రవర్తనను నిరోధించేందుకు చేపట్టవలసిన చర్యలను వివరిస్తూ, న్యాయ సహాయం పొందడం, ఉచిత న్యాయ సహాయ సేవలు అందుబాటులో ఉండటం ప్రజలకు రాజ్యాంగ హక్కులనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. దీనికి సంబంధించిన డిస్‌ప్లే బోర్డులను, ఔట్‌డోర్ హోర్డింగ్స్‌ను ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ, జైలులోనూ ఏర్పాటు చేయాలన్నారు. నల్సా దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు వీటిపై చురుగ్గా అవగాహన కల్పించాలన్నారు.