ముఖ్య‌మంత్రిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌.. త్రిపుర షేక్‌.. బీజేపీ షాక్‌..

ఆయ‌నో రాష్ట్ర ముఖ్య‌మంత్రి. చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. నిత్యం మందీమార్బ‌లం. రెప్ప వేయ‌కుండా ఆయ‌న్ను కాపు కాస్తుంటారు బాడీగార్డ్స్‌. అలాంటి సీఎంపైనే  మ‌ర్డ‌ర్ అటెంప్ట్ జ‌ర‌గ‌డం మామూలు విష‌య‌మా? ఆ ముఖ్య‌మంత్రి అల‌ర్ట్‌గా ఉన్నారు కాబ‌ట్టి సరిపోయింది.. లేదంటే ఎంత ఘోరం జ‌రిగిపోయి ఉండేది? అందుకే, త్రిపుర సీఎం బిప్ల‌వ్ కుమార్ దేవ్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంతో యావ‌త్ దేశం ఉలిక్కిప‌డుతోంది. గురువారం జరిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. బిప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చారు. అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్‌ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు ప‌రారీ అయ్యారు.  సీఎం బిప్ల‌వ్ దేవ్‌పై జ‌రిగిన మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌తో పోలీసులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే నాకాబంధీ నిర్వ‌హించారు. అదేరోజు అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారనేది ఇంకా తెలియ‌రాలేదు. దర్యాప్తు వివ‌రాలు గోప్యంగా ఉంచుతున్నారు త్రిపుర‌ పోలీసులు.   

రైతు గెట‌ప్‌లో స‌బ్ క‌లెక్ట‌ర్‌.. ఆ త‌ర్వాత సీన్ సితార్‌..

ఈ ఫోటోలో క‌నిపించే వ్య‌క్తి మామూలోడు కాదు. గ‌ళ్ల లుంగీ.. పాత చొక్కా వేసుకుని ఎరువుల దుకాణాల‌కు వెళ్లాడు. ఎవ‌రో రైతు వ‌చ్చాడ‌నుకుని లైట్ తీసుకున్నారు షాపువాళ్లు. ఆ.. ఏం కావాలి? అంటూ అడిగారు. మ‌నోడు త‌న‌కు కావాల్సిన లిస్ట్ చెప్పాడు. ఆ షాపు వాళ్లు.. వాళ్ల వాళ్ల రెగ్యుల‌ర్ స్టైల్‌లో ఆ రైతును డీల్ చేశారు. ఇక అంతే. క‌ట్ చేస్తే.. సీన్ సితార‌. వ‌చ్చినోడు రైతు కాద‌ని.. రైతు గెట‌ప్‌లో ఉన్న స‌బ్ క‌లెక్ట‌ర్ అని తెలిసి అంతా నోరెళ్ల బెట్టారు. శ్రీమంతుడు సినిమాలో మ‌హేశ్‌బాబులా లుంగీ మీద వ‌చ్చిన ఆయ‌న.. యువ ఐఏఎస్‌.. విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ సూర్య‌సాయి ప్ర‌వీణ్‌చంద్‌. ఈ సినిమాటిక్ సీన్ కృష్ణాజిల్లా కైక‌లూరు, ముదినేప‌ల్లిలో జ‌రిగింది.  విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్.. రైతు వేషంలో ఎంట్రీ ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న ఎరువుల షాపు యాజమాన్యానికి చుక్కలు చూపించారు. మారు వేషంలో తిరిగి.. ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న మోసాన్ని రట్టు చేశారు. మొద‌ట‌ కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. అక్కడ ఓ దుకాణానికి వెళ్లి ఎరువులు కావాలని అడగ్గా.. స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు యజమాని. అక్కడి నుంచి మరో షాప్‌కి వెళ్లారు. ఎరువులు కావాలని అడిగారు. ఎరువులైతే ఇచ్చాడు కానీ, ఎంఆర్‌పి ధర కన్నా ఎక్కువ‌గా వసూలు చేశాడు. వసూలు చేసిన సొమ్ముకు బిల్లు కూడా ఇవ్వలేదు.  ఎరువుల షాపుల తీరుతో ఆగ్రహానికి గురైన సబ్ కలెక్టర్.. వెంట‌నే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి షాపు ద‌గ్గ‌ర‌కు పిలిపించారు. స్టాక్ ఉన్నా లేదని చెప్పిన షాపుతో పాటు, అధిక ధర వసూలు చేసిన షాపునూ సీజ్ చేయించారు.  ఆ త‌ర్వాత లొకేష‌న్ ఛేంజ్‌. కైక‌లూరు నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. అయితే, ముదినేపల్లిలో ఎరువుల‌ షాపు మూసివేసి ఉంది. అక్కడే ఉన్న రైతులను ఎంక్వైరీ చేస్తే.. ఆ షాపు వాడు ఎంఆర్‌పి కన్నా అధిక ధరకు ఎరువులు అమ్ముతున్నాడ‌ని సబ్ కలెక్టర్‌కి రైతులు తెలిపారు. దీంతో.. యజమానిని పిలిపించి.. ఎరువుల‌ షాపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. అఫీస‌ర్ అంటే ఇలా ఉండాలి క‌దా.. సినిమాల్లో మాత్ర‌మే ఇలాంటి సీన్స్ చూస్తుంటాం.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోలా యాక్ష‌న్‌కు దిగిన విజయవాడ స‌బ్ క‌లెక్ట‌ర్‌ను అంతా అభినందిస్తున్నారు. శ‌భాష్‌.. సూర్యసాయి ప్రవీణ్ చంద్.  

ఇంద్రవెల్లి వేదికగా రేవంత్ స్కెచ్ ? కారు, కమలం పార్టీల్లో టెన్షన్..

తెలంగాణ రాజకీయాలను హుజూరాబాద్ ఉపఎన్నిక ఎంతగా ఆకర్షిస్తుందో.. అంతకన్నా ఎక్కువే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. రేవంత్ పేలుస్తున్న మాటల తూటాలకు కేసీఆర్ పరివారం బిక్కచచ్చిపోతోందంటే అతిశయోక్తి లేదు. రేవంత్ ఏ రోజు ఏం మాట్లాడతాడు... ఏ శిబిరం నుంచి ఎవర్ని లాగుతాడు.. ఏ ఈక్వేషన్స్ లో బ్యాలెన్స్ ను తప్పిస్తాడు.. అనే సస్పెన్స్ దాదాపు ప్రతిరోజూ తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటోంది. ఇప్పుడు 9వ తేదీ కూడా ఆ కోవలోనే రాజకీయ నాయకుల్ని, పరిశీలకుల్ని ఆకర్షిస్తోంది.  ఈ నెల 9న రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో సభకు హాజరవుతున్నారు. గిరిజనులు, గిరిజన నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదివరకే గత ఏప్రిల్ 20న అక్కడికి సమీపంలోని హీరాపూర్ సందర్శించి వచ్చిన రేవంత్... అక్కడ గూడెంలో హనుమాన్ టెంపుల్ నిర్మాణం కోసం రూ. 50 వేలు విరాళం ఇచ్చారు. ఆదివాసీ నాయకులు, యువకులతో రేవంత్ అప్పట్నుంచే టచ్ లోకి వెళ్లారు. ఆ సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవడం మీద రేవంత్ కన్నేసారు. హుజూరాబాద్ ఎన్నిక దృష్ట్యా అమల్లోకి వచ్చిన దళితబంధు స్కీముకు సమాంతరంగా గిరిజన బంధు కోసం డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో రేవంత్ 9వ తేదీన ఇంద్రవెల్లిలో పర్యటించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారింది. దళితబంధుతో ఎస్సీలకు దగ్గరై హుజూరాబాద్ ఎన్నికను ఏకపక్షం చేయాలనుకున్న కేసీఆర్ ఎత్తుగడను చిత్తు చేసేందుకు రేవంత్ ఇంద్రవెల్లి నుంచి నరుక్కొచ్చేందుకు భారీ స్కెచ్ వేసినట్టు విశ్వసనీయ సమాచారం. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేసీఆర్ హామీ పట్టాలకెక్కలేదు. 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు నిబంధన విధించింది. అయితే కులాలు, మతాలవారీ రిజర్వేషన్ లను ఎన్నికల వాగ్దానంగా మార్చుకున్న కేసీఆర్ కు.. తాజా ఉపఎన్నికల దరిమిలా... అదే వాగ్దానాన్ని రివర్స్ అయ్యేలా చూడాలని రేవంత్ ఆలోచిస్తున్నట్టు పక్కా సమాచారం. అందుకే ఇంద్రవెల్లి పర్యటనను టీఆర్ఎస్ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  అటు బీజేపీ నేతలు కూడా రేవంత్ కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా నుంచి గత టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన రమేశ్ రాథోడ్... ఆ తరువాత బీజేపీలో చేరిపోయారు. అయితే రేవంత్ కు పీసీసీ పోస్టు అప్పుడే ఇచ్చి ఉంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉండేవారన్న అభిప్రాయాలున్నాయి. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఆయన క్రియాశీలంగా ఏమీ లేరన్నది లోకల్ టాక్. మరోవైపు సోయం బాపూరావుతో ఆయనకు పొసగడం లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ కు జంప్ చేయడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఎవరెవరు రేవంత్ తో టచ్ లో ఉన్నారో ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఆరా తీస్తోంది. ఈ క్రమంలో రేవంత్ పర్యటన రోజు ఏయే నేతలు ఆ సభకు హాజరవుతారు.. కీలకమైన నేతల వెంట ఎవరుంటారు.. అసలు ఆ సమావేశానికి లోపాయికారీగా సహకరిస్తున్న స్థానిక నేతలెవరూ.. అనే విషయంలో ఇప్పటికే నిఘా పెట్టినట్లు సమాచారం.  అందుకే ఎలాంటి అభిప్రాయాలకు తావు లేకుండా.. ఇంద్రవెల్లికి ఎవరూ రావొద్దని, ఒకవేళ వస్తే తన అంచనాలు, వ్యూహాలు లీకై.. ఫలించకుండా పోతాయని రేవంత్.. ఆయా నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. మరి ఈ క్రమంలో రేవంత్ వెంట బీజేపీ నేతలు ఎవరు వెళ్తారు.. టీఆర్ఎస్ నేతలు ఎవరుంటారు.. అనేది బయట పడాలంటే కొద్ది గంటలు వేచి చూడక తప్పదు.

సోముకు సెండాఫ్‌! క‌న్నాకు కిరీటం!

సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు. పేరుకు బీజేపీనే అయినా.. ఫ‌క్తు వైసీపీ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే  విమ‌ర్శ. పాల‌క వ‌ర్గానికి కొమ్ముకాస్తార‌నే ఆరోప‌ణ‌. వైసీపీని వ‌దిలేసి.. టీడీపీనే త‌ప్పుబ‌డ‌తార‌నే ప్ర‌చారం. జ‌గ‌నే.. సోమును ఆ స్థానంలో కూర్చోబెట్టార‌నే అనుమానం. వీర్రాజు అధ్య‌క్షత‌న జ‌రిగిన తిరుప‌తి ఎంపీ ఉప ఉన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం. జ‌న‌సేన‌తో జ‌ట్టుక‌ట్టినా.. క‌నీసం డిపాజిట్ కూడా రాక‌పోవ‌డం ఆయ‌న అస‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌నమ‌ని అధిష్టానం ఆగ్ర‌హం.  ఏపీలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నా.. మ‌త‌మార్పిడులు జోరుగా సాగుతున్నా.. బీజేపీ త‌ర‌ఫు పోరాటం అంతంత మాత్ర‌మేనంటున్నారు. అమ‌రావ‌తి విష‌యంలోనూ హ్యాండ్స‌ప్ అన్నారు. ప్ర‌భుత్వ అప్పులు, అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌పైనా చేష్ట‌లుడిగి చూస్తున్నారు. అందుకే, పార్టీ బ‌లోపేతానికి సోము చేసిందేమీ లేదంటూ హైక‌మాండ్‌కు నివేదిక‌లు వెళ్లాయ‌ని తెలుస్తోంది. వైసీపీతో ఆయ‌న అంత‌లా అంట‌కాగుతుంటే.. ఏపీలో ఇక బీజేపీ ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మార‌నుంద‌నే ఆందోళ‌న పార్టీలో వ్య‌క్తం అవుతోంద‌ట‌.  ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ ఆదేశాల‌తో ఏపీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు క‌మ‌ల‌నాథులు. అందులో భాగంగా సోము వీర్రాజును అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది. ఇందుకు ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని.. వారం రోజుల్లోనే అధ్య‌క్ష మార్పు ఉంటుంద‌ని ఢిల్లీ నుంచి స‌మాచారం అందుతోంది. సోము ప్లేస్‌లో మ‌ళ్లీ మాజీ అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కే కిరీటం క‌ట్ట‌బెడ‌తార‌ని అంటున్నారు. ఏపీ వ్యూహంపై బీజేపీ పెద్ద‌ల్లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ ప‌త్రి ది ఆర్గ‌నైజ‌ర్‌లో సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ప‌దునైన క‌థ‌నం రావ‌డం.. ర‌ఘురామ‌కు స‌పోర్ట్ చేయ‌డం.. చంద్ర‌బాబుపై సాఫ్ట్‌కార్న‌ర్ చూపించ‌డం తెలిసిందే. ఏపీని క్రైస్త‌వ రాష్ట్రంగా మారుస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరుపై సంఘ్ ప‌రివార్ ఆగ్ర‌హంగా ఉంద‌ని.. ఆ మేర‌కు జ‌గ‌న్‌కు యాంటీగా బీజేపీపై ఒత్తిడి పెంచింద‌ని ఢిల్లీ వర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అక్క‌డ ఢిల్లీలో స్విచ్ వేస్తే.. ఇక్క‌డ సీబీఐ కోర్టులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌లో వేగంగా ప‌రిణామాలు మారిపోతున్నాయ‌ని అంటున్నారు.  ఆర్ఎస్ఎస్ క‌న్నెర్ర‌తో.. వైసీపీతో బీజేపీ చేస్తున్న ర‌హ‌స్య స్నేహానికి రాం రాం ప‌ల‌క‌నుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబుతో జ‌త‌క‌ట్టేలా.. సంఘ్ పెద్ద‌లు క‌మ‌ల‌నాథుల‌పై ప్రెజ‌ర్ పెడుతున్నార‌ని తెలుస్తోంది. అందుకే.. టీడీపీతో స్నేహానికి అడ్డుగా ఉన్న‌.. వైసీపీ శ్రేయోభిలాషి అయిన‌ బీజేపీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు సోము వీర్రాజును ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని అంటున్నారు. ఆ ప్లేస్‌లో ఒక‌ప్పుడు టీడీపీ-బీజేపీ స‌ఖ్య‌త‌కు చోద‌కుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను మ‌ళ్లీ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని.. మ‌రో వారం రోజుల్లో ఆ మేర‌కు కీల‌క రాజ‌కీయ మార్పు జ‌ర‌గ‌నుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం.

శరీరంలో యాంటీబాడీలు ఎన్ని నెల‌లు ఉంటాయో తెలుసా?

ఒక‌సారి క‌రోనా వ‌స్తే మ‌ళ్లీ రాద‌నుకోవ‌డం అపోహే. రెండుసార్లు కొవిడ్ బారిన ప‌డిన కేసులు చాలానే చూస్తున్నాం. అయితే, ఒక‌సారి క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయాక‌.. శ‌రీరంలో యాంటీబాడీలు జ‌న‌రేట్ అవుతాయి. అవి రెండోసారి కొవిడ్ సోక‌కుండా ఫైట్ చేస్తుంటాయి. వైర‌స్ ఎప్ప‌టిక‌ప్పుడు రూపాంత‌రం చెందుతూ.. కొత్త వేరియంట్స్ పుట్టుకువ‌స్తుండ‌టమే సెకండ్ టైమ్ క‌రోనా రావ‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. అయితే, క‌రోనా వ‌చ్చి పోయిన వారిలో యాంటీబాడీలు ఎంత కాలం పాటు ఉంటాయ‌నే ప‌రిశోధ‌న జ‌రిగింది. అందులో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు 7 నెలల తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. కొద్దిమందిలో క్ర‌మ‌క్ర‌మంగా యాంటీబాడీలు తగ్గుతుంటే.. మ‌రికొంద‌రిలో మాత్రం నెల‌లు గడుస్తున్నా కొద్దీ అవి పెరుగుతుండ‌టం మ‌రింత ఆస‌క్తిక‌రం. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.  గతేడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు భిన్న సమయాల్లో రక్త నమూనాలు సేకరించి, పరిశీలించారు. కరోనాలోని ఆరు భిన్న భాగాలపై పనిచేసే ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల స్థాయిని కొలిచారు. కరోనాలోని న్యూక్లియోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా.. మిగతా ఐజీజీ యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు తేల్చారు. మ‌రోవైపు.. జ‌లుబు మూలంగా శ‌రీరంలో ఏర్ప‌డిన యాంటీబాడీలు సైతం క‌రోనాపై పోరాడుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. సో.. ఒక్క‌సారి క‌రోనా సోకిని వారు.. కొన్ని నెల‌ల పాటు బిందాస్‌గా ఉండొచ్చ‌న్న మాట‌. 

పులిచింతల పాపం ఎవరిది? జగన్ రెడ్డి మౌనానికి అర్ధమేంటీ? 

అసలు సంగతి చూడమంటే.. కొసరు సంగతులు చెప్పమన్నాడంట వెనకటికి ఒకడు. గేటు ఎలా విరిగిపోయింది.. పెట్టినోడు ఎవడు.. అప్రూవ్ చేసినోడు ఎవడో చూడవయ్యా బాబూ అంటే.. అసలు చంద్రబాబు ఉన్నప్పుడు అంటూ చరిత్ర చెప్పుకొస్తున్నారు వైసీపీ నేతలు.. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఏదొచ్చినా చంద్రబాబేనా.. అంటూ కౌంటర్లు పడుతున్నా సరే.. వైసీపీ నేతలు పాడిందే పాడుతున్నారు.  పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద నీరు వదలగానే కొట్టుకుపోయింది. గేటును డ్యామ్ పిల్లర్ కు కనెక్ట్ చేసే గడ్డర్ విరిగిపోవడం వలనే గేటు ఊడిపోయింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో గుంటూరు జిల్లాలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేటు కొట్టుకుపోయిన ఘటన కృష్ణా, గుంటుూరు జిల్లాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇది విజయవాడ పై నీటి బాంబు గా నిపుణులు చెప్తున్నారు. గేట్ విషయం, ప్రాజెక్ట్ నాణ్యతపైనే సందేహాలు కలిగేలా చేస్తోంది. గేటు ఎలా విరిగింది, కొత్త గేటు ఎలా బిగించాలన్న దానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. ఆ పని వదిలేసి బాబును ఎలా ఇరికించాలా అన్న ప్రయత్నాలు చేస్తోంది. పనులు ఎప్పుడు మొదలయ్యాయే చెప్పకుండా.. కాంట్రాక్టర్ పేరుతో కొత్త డ్రామాలు ఆడుతోంది.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఢంలో భాగంగా 2004-05లో ఈ ప్రాజెక్టుకు బీజాలు వేశారు. అయితే నిధుల కొరత, భూసేకరణ వంటి సమస్యల కారణంగా దీని నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా పూర్తయ్యాయి. కాంట్రాక్ట్ ఇచ్చిన వైఎస్ హయాంలో.. క్వాలిటీ చెకింగ్ జరగలేదనుకోవాలి.. అలాగే ఓపెనింగ్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి టైములోనైనా  చెక్ చేసుకోవాలి. వీళ్లెవరూ సరిగా చెక్ చేయకపోబట్టే  ఆ గేటు అలాగే కొనసాగింది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1850 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.  2013 లోనే రికార్డ్ సమయం లో, కేవలం మూడు ఏళ్లలో పూర్తి అయిన పులిచింతల ప్రాజెక్టును అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడం, ఈ ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వ చేస్తే తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు మునుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.  అందుకే ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 45 టీఎంసీల నీటి నిల్వకే ప్రాధాన్యమిచ్చింది. చంద్రబాబునాయుడు హాయాంలో క్వాలిటీ లేదని రిపోర్టు వస్తే.. బిల్లులు ఆపితే.. కాంట్రాక్టర్ కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో కోర్టు రూ.400 కోట్లు ఆ సంస్థ కు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వం గాని.. రెండేళ్ల క్రితం వచ్చిన జగన్ ప్రభుత్వం గాని.. వాటిని సరి చేసే ప్రయత్నం చేయకపోవడం తప్పే. అది వదిలేసి.. చంద్రబాబు టైములోనే నివేదిక వచ్చింది.. చర్య తీసుకోలేదనడం.. మరి ఆ విషయం తెలిసిన మీరెందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. ఇప్పుడు చంద్రబాబు పేరెత్తకపోతే..టీడీపీ వాళ్లు రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తుతారు. అందుకే ముందే చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తే..వారు డిఫెన్స్ లో పడి వివరణలు ఇఛ్చుకుంటూ ఉంటారు. ఈ లోపు గేటు పెట్టేయొచ్చు.. మన పని అయిపోతుంది.. ఇలా నడుస్తుంది వైసీపీ వ్యూహం. వరద ప్రవాహం ఎక్కువున్నట్లయితే.. దిగువన లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేవి.. అప్పుడు ప్రాణనష్టం జరిగి ఉండేది.. అప్పుడు కూడా ఇలాగే సాకులు వెతుకుతూ ఉంటారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పంటకు నీరు అందాలంటే ..కాంట్రాక్టర్ ఇంట పంట పండాలి..అలాగే కాంట్రాక్టు ఇచ్చినవారి ఇంటనూ పంట పండాల్సిందే.. ఈ కాన్సెప్ట్ నడిచినంత కాలం.. ఈ క్వాలిటీ కాకరకాయ అన్నీ గాలికి కొట్టుకుపోతూనే ఉంటాయి.. ఏదైనా జరిగితే .. ఈ అవినీతిని పట్టించుకోని జనం కూడా కొట్టుకుపోతారు.అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపడిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  ఏ తప్పు జరిగినా చంద్రబాబు ఖాతా లో వేసి, మంచి మాత్రమే, తన ఖాతాలో మాత్రమే వేసుకునే జగన్ రెడ్డి ఈ ఒక్క విషయం పై మౌనం ఏలనో.. 

వామ్మో... ఇయర్‌ఫోన్స్‌ పేలి యువకుడు దుర్మ‌ర‌ణం..

ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ జ‌మానా. రోజంతా ఫోన్‌తో ఏదో ఒక ప‌ని. మ‌ల్టీ టాస్కింగ్ పెరిగింది. గ‌తంలోలా చెవి ద‌గ్గ‌ర‌ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంటే మిగ‌తా ప‌నుల‌కు ఇబ్బంది. గంట‌ల త‌ర‌బ‌డి అలా మాట్లాడితే చేతి నొప్పి.. మెద‌డుపై రేడియేష‌న్ ప్ర‌భావం అంటూ వైద్యులు సైతం హెచ్చ‌రిస్తున్నారు. అందుకే, ఇయ‌ర్‌ఫోన్స్‌ను విరివిగా వాడుతున్నారు. చెవిలో బ‌డ్స్ పెట్టేసుకొని మాట్లాడుతున్నా, పాట‌లు వింటున్నా.. స్టైల్‌కు స్టైట్‌.. కంఫ‌ర్ట్‌కు కంఫ‌ర్ట్. ఓ యువ‌కుడు సైతం అప్ప‌టి వ‌ర‌కూ అలానే చెవిలో ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమైందో ఏమోగాని స‌డెన్‌గా ఆ ఇయ‌ర్‌ఫోన్స్ పేలిపోయాయి. వెంట‌నే అత‌ను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పేలడంతో ఆ సౌండ్‌కు షాక్‌కు గురై.. బాధితుడికి గుండెపోటు వ‌చ్చి ఉంటుంద‌ని వైద్యులు భావిస్తున్నారు. ఇయ‌ర్‌ఫోన్స్ పేల‌డం.. వ్య‌క్తి చ‌నిపోవ‌డం.. దేశంలో దాదాపు ఇదే తొలిసార‌ని అంటున్నారు. ఫోన్ పేల‌డం చూశాం కానీ, ఇయ‌ర్‌ఫోన్స్ పేల‌డానికి కార‌ణ‌మేంటో తెలీదంటున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌ జిల్లా చౌమూలో జరిగింది. మృతుడు ఉదయ్‌పుర గ్రామానికి చెందిన రాకేశ్‌ నాగర్‌. 

జగన్ కు బెయిల్ టెన్షన్! బీజేపీ జాతీయ నేత సంచలనం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం దోస్తులుగా ఉన్న బీజేపీ, వైసీపీ నేతల మధ్య ఒక్కసారిగా వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ గురించి మాట్లాడాలంటేనే భయపడిపోయిన వైసీపీ నేతలు.. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తుందంటూ కాక రాజేస్తున్నారు. సీఎం జగన్ కూడా బీజేపీని టార్గెట్ చేయాలని మంత్రులను ఆదేశించడం ఆసక్తిగా మారింది. అసలు వైసీపీ, బీజేపీ మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతోందనే చర్చ సాగుతోంది. బీజేపీ నేతల దూకుడు, వైసీపీ నేతల కలవరం చూస్తే.. సీఎం జగన్ సర్కార్ కు గండం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుని కూల్చే కుట్ర‌లు బీజేపీ చేస్తోందంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లకు కమలనాధులు సీరియస్ గా కౌంటర్లు ఇచ్చారు. దీనికి  సంబంధించి ఓ దిన‌ప‌త్రిక‌లో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ.. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ తీవ్రంగా మండిపడ్డారు. 'పేర్ని నాని గారు.. మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు, ఆ ఆలోచన కూడా మాకులేదు. ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి, అది చాలదన్నట్టు వేలకోట్ల రూపాయ‌ల‌ అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు' అని సునీల్ దేవ‌ధ‌ర్ ట్వీట్ చేశారు. 'కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి? కేంద్రానికున్న ఆర్థిక స్తోమత, వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నాయా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు. మేం దేశ ప్రతిష్ఠ‌ పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు' అని సునీల్ దేవధర్ తన ట్వీట్ లో ఘాటు విమ‌ర్శించారు. ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లుంది' మీ వ్యవహారం సీఎం గారు. అప్పులతో రాష్ట్రాన్ని ఈదలేక, కేంద్రంపై నిందలుమోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును ఫాలో అవుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉందని అర్ధమవుతోంది అంటూ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ట్వీట్ చేశారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

ఏపీ అప్పులపై కేంద్రం నజర్.. ఏజీ ఎంట్రీతో అధికారులు హడల్

పరిమితికి మించిన అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ సర్కార్ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యతే ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న ప్రతి నెలా అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. అయినా రుణం దొరికే అవకాశం లేకపోవడంతో దొడ్డిదారిన నిధులు తెస్తోంది జగన్ రెడ్డి సర్కార్. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను తనాఖా పెడుతోంది. ఇలా అయితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి పోయే పరిస్థితి ఉందని ఎకనమిస్టులు చెబుతున్నారు. ఏపీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుండటంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది.నిబంధనలను తుంగలో తొక్కి.. జగన్‌ సర్కారు అడ్డదారుల్లో సాగిస్తున్న ఆర్థిక అక్రమాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. తన అనుమతి లేకుండా రాష్ట్రప్రభుత్వం తెచ్చిన అప్పుల వివరాలు తెలుసుకోవడానికి అకౌంటెంట్‌ జనరల్‌ను రంగంలోకి దించింది. రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక అక్రమాలను నిగ్గుతేల్చేందుకు కేంద్రం తవ్వకాలు ప్రారంభించింది. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్‌ జనరల్‌(ఏజీ)కు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏజీ కార్యాలయ అధికారులు రాష్ట్ర అధికారులను సంప్రదించారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌  ద్వారా తెచ్చిన రుణాలు.. ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం పరిమితిని దాటి చేసిన అప్పుల వివరాలు అడిగారు.కేంద్రం రంగంలోకి దిగడంతో ఏపీ ఆర్థికశాఖ అధికారులు హడలిపోతున్నారు. ఇది ఎటొచ్చి ఎటువైపు దారి తీస్తుందోమోనన్న ఆందోళన చెందుతున్నారు.  కేంద్రానికి, ఆర్‌బీఐకి, ఏజీకి తెలియకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చింది.ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధించే  జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ నిధులను కూడా వదలకుండా వాడుకుంది. ఈ రెండేళ్లలో దాదాపు రూ.18 వేల కోట్లను అవసరాలకు ఖర్చుచేసింది.రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.32 వేల కోట్ల అప్పు తెచ్చింది. ధాన్యం సేకరణ, కొనుగోలు పేరు చెప్పి ఈ అప్పును రాష్ట్రం దాచే అ వకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నుంచి కూడా సుమారు రూ.16 వేల కోట్ల రుణాలు సేకరించారు.  ఏపీఎ్‌సడీసీ నుంచి దొడ్డిదారిన తెచ్చిన రూ.21,500 కోట్లు, 5 శాతం వడ్డీ ఆశ చూపి విద్యాసంస్థల నుంచి ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మళ్లించిన రూ.3,000 కోట్లు, ఇవి కాకుండా రోడ్లు బాగుచేస్తామంటూ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి రూ.1,100 కోట్ల అప్పులు తెచ్చారు.  అక్రమ అప్పుల సమాచార సేకరణ కోసం.. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడితే అసలు అక్రమాలు ఎప్పటికీ వెలుగులోకి రావని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడూ తన తప్పుల తీవ్రతను తగ్గించి చూపుతూ సమాచారమిస్తుందని గుర్తుచేస్తున్నారు. అయితే అప్పుల వివరాల సేకరణలో ఏజీ కార్యాలయం కేవలం రాష్ట్రం తీసుకున్న రుణాలకే  పరిమితమవుతుందా? రాష్ట్రం బకాయిపడిన అప్పులను సైతం పరిగణనలోకి తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ రెండేళ్ల నుంచి పెండింగ్‌ బిల్లులు రూ.లక్ష కోట్లు దాటాయి. ఇవన్నీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, సప్లయర్స్‌, వెండర్లకు ఇవ్వాల్సిన బకాయిలు. డీఏల రూపంలో ఉద్యోగులకు రూ.15 వేల కోట్లు బాకీ పడ్డారు. ఇవి కూడా ప్రభుత్వం చెల్లించాల్సినవే. ఇవన్ని సేకరిస్తే మాత్రం జగన్ సర్కార్ చిక్కుల్లో పడినట్లే. కేంద్ర కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. చేతులెత్తేయాల్సిన పరిస్థితులు రావచ్చు.   

జగన్ ప్రభుత్వం కూలిపోనుందా? వైసీపీలో కలవరం అందుకేనా? 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా? వైసీపీ సర్కార్ త్వరలో కూలిపోబోతోందా? బీజేపీతో జగన్ రెడ్డికి లింక్ కటైందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో, ఏపీలో జరుగుతున్న పరిణామాలు అందుకు బలాన్నిస్తున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామ రాజు ఎపిసోడ్, జగన్ బెయిల్ రద్దు కేసు అన్నింటిల్లోనూ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ వైఖరిలో సడెన్ గా మార్పు రావడం, ఆగస్టు 25న తీర్పు రానుండటం ఉత్కంఠగా మారింది. ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజన్ లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కథనాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ విధానాలపై అందులో తూర్పారాబట్టారు.  ఏపీ బీజేపీ నేతల తీరు కూడా గతంలో కంటే మారింది. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు కమలం నేతలు. ముఖ్యంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమవడం బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి వివాదం ముగిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల స్వరంలోనే మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం బీజేపీ జోలికి వెళ్లని వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం కమలనాధులను కార్నర్ చేస్తున్నారు. బీజేపీ నేతలపై మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని, కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళు సీఎం కావాలని అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఎలా మాట్లాడుతుందని నాని నిలదీశారు. కేంద్రం అప్పులు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. తాజాగా జరిగిన కేబినెట్‌ భేటీలోనూ బీజేపీ టార్గెట్ గా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కొంత మంది మంత్రుల వ్యవహరశైలిపై జగన్  సీరియస్‌‌గా అయ్యారని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నించారని చెబుతున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని సీఎం నిలదీసినట్లు సమాచారం.  కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారని తెలుస్తోంది. బీజేపీ నేతల మాటలకు కౌంటర్‌ ఇవ్వాలని మంత్రులకు జగన్‌ ఆదేశించారని సమాచారం. పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు విరిగిపోతే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, దాని మంత్రులు ఎందుకు కౌంటర్‌ వ్యాఖ్యలు చేయడం లేదని, ఇలా అయితే టీడీపీ నేతల తప్పుడు వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్తాయని, కౌంటర్‌గా మంత్రులు ఎందుకు స్పందించలేకపోతున్నారని సీఎం మంత్రులను నిలదీశారని చెబుతున్నారు. పద్దతి మార్చుకోవాలని మంత్రులుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ముగ్గురు మంత్రులను జగన్‌ అడిగారని, ఇక నుంచి ప్రతి అంశాన్ని పరిశీలిస్తానని మంత్రులతో జగన్‌ అన్నారని చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో బీజేపీని టార్గెట్ చేయాలని మంత్రులను జగన్ ఆదేశించడం, వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని పేర్ని నాని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారాయి. అదే సమయంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు వేసిన పిటిషన్ పైనే ఆగస్టు 25న తీర్పు రాబోతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలతో  బీజేపీతో వైసీపీకి సంబంధాలు తెగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఏదో జరుగబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ కు గండం ఉందనే చర్చే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.   

ఖేల్ రత్న.. రాజకీయ రచ్చ! 

కాదేడీ కయ్యానికి అనర్హం అని  ఏ కవి అయినా అన్నారో లేదో గానీ, రాజకీయాలలో మాత్రం, ప్రతి  చిన్నా పెద్ద విషయంపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు కాలుదువ్వడం, పరస్పర దుశనలకు దిగడం,  ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రస్తుతం జరుగతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలో కొవిడ్, అధిక ధరలు, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, రైతుల ఆందోళన .. ఇంకా వందల సంఖ్యలో  సమస్యలు ఉన్నాయి. అయినా, ‘పెగాసస్ స్పైవేర్’ ఒక్కటే దేశం ముందున్న భయంకర సమస్య అన్నట్లుగా ఆ ఒక్క విషయం చుట్టూనే, తిరుగుతూ అధికార, విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను రాజకీయ మైదానంగా మార్చి వేశారు. సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అయినా, ఇంతవరకు ఒక్క రోజు సభ సక్రమంగా జరగలేదు. కొవిడ్ సహా ఏ ఒక్క ప్రధాన ప్రజా సమస్య చర్చకు రాలేదు.  ఇప్పుడు మరో వివాదం, తెరపైకొచ్చింది.  రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్ర ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మార్చింది. మార్చ వచ్చును, అయితే, ఆ నిర్ణయం ఏదో ప్రజాసామ్య బద్ధంగా తీసుకుంటే, ఇంత వివాదం అయ్యేది కాదు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని పేరును ఒక ట్వీట్‌’ తో తీసేశారు. అంతే కాకుండా, దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మాజీ ప్రదాని, కాంగ్రెస్ నేత పేరును తీసేయడం  దేశ ప్రజల మనోభావాలను గౌరవించడం అవుతుందా? అంతే కాదు ప్రదాని తమ ట్వీట్ లో, ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని దేశం నలుమూలల నుంచి వినతులు వస్తున్నాయని, ఆ అందరికి ధన్యవాదాలు చెప్తున్నానని పేర్కొన్నారు.  “ఖేల్ రత్న అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తాం. జై హింద్!’’ అని పేర్కొన్నారు. ఇది  ఒక విధంగా పుండు మీద కారం చల్లడమే అవుతుంది. దీనిపై సహజంగానే, కాంగ్రెస్ పార్టీ, కాస్త ఘాటుగానే స్పందించింది. క్రీడా పురస్కారం పేరు మార్పుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. మోడీ ప్రభుత్వం సాగిస్తున్న కాషాయీకరనకు ఇదొక నిదర్శన మని కాంగ్రెస్ భగ్గుమంది. ఈపేరు మార్పుకు ధ్యాన్ చంద్ పై గౌరవం కారణం కాదని, రాజీవ గాంధీ ప్రతిష్టను దిగజార్చడమే మోడీ లక్ష్యమని, కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ ఆరోపించారు. నిజమే, కావచ్చును, నిజానికి  ధ్యాన్ చంద్ పై గౌరవమే ఉంటే కాంగ్రెస్ నాయకులు సూచించిన విధంగా ఆయనను ‘భారత రత్న’ పురస్కారంతో గౌరవిస్తే మరింత సమంజసంగా ఉంటుందని, క్రీడాభిమానులు సైతం పేర్కొంటున్నారు.  క్రీడా రంగంలో జీవిత కాల సాఫల్యం సాధించిన వారికి ధ్యాన్ చంద్ పేరున  2002లో అవార్డును ఏర్పాటు చేశారు. అలాగే, న్యూఢిల్లీలోని ఓ స్టేడియంకు కూడా 2002లో ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.ఇప్పుడు మరో పురస్కారాన్ని అయన పేరున ఏర్పాటు చేసినా ఎవరికీ అబ్యంతరం ఉండక పోవును. కానీ, ఒకరి పేరును తుడిచేసి ధ్యాన్ చంద్ పేరును చేర్చడం ఒక విధంగా ఆయన్ని అవమానించడమే అవుతుందనే మాట వినిపిస్తోంది. అదీ కాక ఈ మధ్యనే గుజరాత్ లోని మొతోరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంగా మార్చారని,ఒక స్టేడియంకు తమ పేరు పెట్టుకున్న ప్రధాని, మాజీ ప్రధాని పేరున ఉన్న పురస్కారం పేరును మార్చడం వలన అయన ప్రతిష్టే దిగాజరుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  అయితే పేరు పేరున రాజకీయ వివాదం చెలరేగడం ఇదే తోలి సారి కాదు, గతంలో  రాజీవ్  గాంధీ ఇంటర్నేషనల్ విషయంలో కూడా చాలా పెద్ద  వివాదమే జరిగింది. అలాగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నగరాలు, పట్టణాలు, వీదుల  పేర్ల మార్పుపై కూడా వివాదం చెలరేగుతోంది, అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పథకానికి వైఎస్సార్ లేదా జగనన్న పేరును తగిలించడం విషయంలోనూ వివాదం ఉంది. ఈ నేపధ్యంలో పురస్కారాల మొదలు పథకాల వరకు పేరు పెట్టడంలో ఒక జాతీయ విధానమ ఉంటే మంచిందని అంటున్నారు విజ్ఞులు. 

లోకేశ్ అరెస్ట్‌కు జ‌గ‌న్ స్కెచ్ వేశారా? అదే జరిగితే పతనమేనా? 

వ‌రుస‌గా టీడీపీ వికెట్లను ప‌డ‌గొడుతున్నారు. అచ్చెన్నాయుడు నుంచి దేవినేని వ‌ర‌కు.. అరెస్టుల‌తో బెంబేలెత్తిస్తున్నారు. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వినిపించే ప్ర‌తీ గొంతునూ జైల్లో వేసేస్తున్నారు. సొంత‌పార్టీ ఎంపీ ర‌ఘుర‌మనూ వ‌ద‌లి పెట్ట‌లేదు. ఓ లిస్టు రాసి పెట్టుకొని మ‌రీ.. టేబుల్ మీద ఉంచుకున్నార‌ట సీఎం జ‌గ‌న్‌. ప్ర‌తీరోజూ చెక్ చేసుకుంటున్నార‌ట‌. ఇంకా ఎవ‌రు మిగిలారు? నెక్ట్స్‌ అరెస్ట్ చేయాల్సింది ఎవ‌రిని? ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చెక్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఆ లిస్ట్‌లో దేవినేని త‌ర్వాత నెక్ట్స్ టార్గెట్ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశా? టీడీపీ యువ‌రాజును మూసేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారా? మాజీ మంత్రి వ్య‌క్తం చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌? లోకేశ్‌ను అరెస్ట్ చేసేంత సాహ‌సానికి స‌ర్కారు తెగిస్తుందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌ణ‌లు.    వేల కోట్ల అక్ర‌మ సంపాద‌న కేసుల్లో ఏ1గా దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉన్నారు జ‌గ‌న్‌. టీడీపీ వారంతా స‌చ్చీలురుగా స‌మాజంలో స్వేచ్ఛ‌గా తిరుగుతుండ‌టాన్ని చూసి స‌హించ‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు. అందుకే, ఒక్క రోజు.. క‌నీసం ఒకే ఒక్క రోజైనా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను జైల్లో ఉంచాల‌నే ప‌ట్టుద‌ల‌కు జ‌గ‌న్‌ పోతున్నార‌ని అనుమానిస్తున్నారు. వ‌రుస‌బెట్టి నోరున్న టీడీపీ నేత‌ల‌ను ఏదో ఒక కేసులో ఇరికించి.. బ‌ల‌వంతంగా బ‌నాయించి.. కోర్టుల్లో ఆ కేసులు నిల‌బ‌డ‌వ‌ని తెలిసినా.. అరెస్టుల‌కు తెగ‌బ‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ రాజ‌కీయ క‌క్ష్య సాధింపులపై అంతా మండిప‌డుతున్నారు.  త‌న‌కు వ్య‌తిరేకంగా గొంతు వినిపిస్తే చాలు.. వారిని జైల్లో వేయ‌కుంటే జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదంటున్నారు. అవ‌స‌రం లేకున్నా.. అవ‌కాశం చిక్కించుకుని మ‌రీ.. క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టి రాజ‌కీయంగా క‌సి తీర్చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ వ్య‌వ‌హారం ఇందుకు ప‌రాకాష్ట‌. అక్ర‌మ మైనింగ్‌ను వెలుగులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన ఉమాపై ఓవ‌రాక్ష‌న్ చేశారు వైసీపీ నాయ‌కులు. బాధితుడైన ఉమాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపి.. జైల్లో మూసేయాల‌ని చూశారు. హైకోర్టు తీర్పుతో బెయిల్‌పై వ‌చ్చారు. విడుద‌ల త‌ర్వాత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌కలం రేపుతున్నాయి. "ప్రభుత్వం.. నారా లోకేశ్‌ను వచ్చే నెలలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు నేను అనుమానిస్తున్నాను" అంటూ దేవినేని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. మాజీ మంత్రి ఉమా చేసిన ఆరోప‌ణ‌లు రాజ‌కీయంగా ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి. నిజ‌మేనా? ఉమా అన్న‌ట్టు నారా లోకేశ్ అరెస్ట్‌కు కుట్ర చేస్తున్నారా? వ‌చ్చే నెల‌లోనే అరెస్ట్‌కు డేట్ ఫిక్స్ చేశారా? అంటూ చ‌ర్చ‌.. ర‌చ్చ జ‌రుగుతోంది.  జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యాలు, అడ్డ‌గోలు విధానాల‌పై దాదాపు ప్ర‌తీరోజూ పోరాడే ఇద్ద‌రు నేత‌ల్లో ఒక‌రు నారా లోకేశ్‌. ఇంకొక‌రు ఎంపీ ర‌ఘురామ‌. నారా వారి మాట‌లు, ట్వీట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కుళ్ల‌బొడిచేలా ఉంటాయి. తూటాల్లాంటి మాట‌లు, పిడుగుల్లాంటి పంచ్‌లు, ఘాటు విమ‌ర్శ‌లు, తొడ‌పాశం పెట్టేలా సెటైర్లతో జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జాక్షేత్రంలో నిప్పుల‌తో క‌డిగేస్తుంటారు నారా లోకేశ్‌. ఇంకా చెప్పాలంటే.. చంద్ర‌బాబుకంటే నారా లోకేశే జ‌గ‌న్‌కు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. అందుకే, నారా లోకేశ్ నోరు మూయ‌డానికి వైసీపీ పెద్ద‌లు ఎప్ప‌టి నుంచో స్కెచ్ వేస్తున్నార‌ని అనుమానిస్తున్నారు. లోకేష్ టార్గెట్ గానే ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయనే వాదన పైకి తెచ్చారంటున్నారు. పైబర్ నెట్ లో స్కాం జరిగిందంటూ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆ కేసులోనే లోకేష్ ను అరెస్ట్ చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.  నారా లోకేశ్‌ పై జగన్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్రలకు సంబంధించి టీడీపీ ద‌గ్గ‌ర ప‌క్కా స‌మాచారం ఉంద‌ని.. ఆ విష‌యాన్నే దేవినేని ఉమా తాజాగా బ‌య‌ట‌పెట్టార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే.. వ‌చ్చే నెల‌లో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే..? ఇక ఏపీలో పెను ఉప్ప‌నే.. ప్ర‌జా ఉద్య‌మ‌మే... ఆ సునామీలో జ‌గ‌న్ స‌ర్కారు కొట్టుకుపోక త‌ప్ప‌దు...అంటున్నారు. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి...

విలపించిన ప్లేయర్లు.. ఓదార్చిన ప్రధాని మోడీ

ఒలింపిక్స్ లో అద్బుత పోరాట పటిమ ప్రదర్శించారు భారత హాకీ మహిళా ప్లేయర్లు. సంచలన విజయాలతో సెమీఫైనల్ కు వెళ్లారు. సెమీస్ లోనూ గట్టిగా పోరాడినా.. ఓడిపోయారు. ఒలింపిక్స్  కాంస్య పతకం కోసం జరిగిన పోరులోనూ చివరి వరకు పోరాడి ఓటమిపాలయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత మహిళలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దేశానికి పతకాన్ని అందించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకోవడాన్ని తట్టుకోలేక మైదానంలో కన్నీరు పెట్టుకున్నారు. జట్టు ఓటమి పాలైన వెంటనే హాకీ జట్టు కోచ్‌కు ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కన్నీరు పెట్టుకోవద్దంటూ వారిని ఊరడించారు. అద్భుతంగా ఆడారని, దేశ ప్రజల హృదయాలు గెలుచుకున్నారని అన్నారు. ‘‘పతకం కోసం మీరు చిందించిన స్వేదం ఈ దేశానికి ప్రేరణ అవుతుంది. కోచ్ సహా, జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా’’ అని మోదీ చెప్పారు. ఫోన్ స్పీకర్ ఆన్ చేయగా అందరూ ఒక దగ్గరికి చేరి మోదీ చెప్పింది విన్నారు. అలాగే, ఆటలో కంటికి గాయమై నాలుగు కుట్లు పడిన నవనీత్ కౌర్ ఆరోగ్యంపైనా మోదీ ఆరా తీశారు. వందన కటారియా, సలీమా ప్రదర్శనపై మోదీ ప్రశంసలు కురిపించారు. అనంతరం జట్టు సభ్యులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోగా.. ఏడవొద్దంటూ మోడీ ఊరడించారు.  ‘‘ఏడ్వొద్దు. మీరు ఏడుపు నాకు వినిపిస్తోంది. మమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. నిరుత్సాహం వద్దు. భారత్‌కు గుర్తింపు అయిన హాకీకి మీ ప్రదర్శన కారణంగా దశాబ్దాల తర్వాత మళ్లీ పునర్‌వైభవం లభించింది’’ అని ప్రధాని మోడీ వారికి ధైర్యవచనాలు చెప్పారు. అలాగే కోచ్ జోరెడ్ మారినే‌ను కూడా మోడీ అభినందించారు. ‘‘మీరు శాయశక్తులా కృషి చేశారు. అమ్మాయిలను మీరు ప్రోత్సహించారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్’’ అని అన్నారు. చివర్లో కోచ్ మాట్లాడుతూ.. అమ్మాయిలతో తానూ అదే చెప్పానని, ఈ స్థాయి వరకు రావడం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమని చెప్పానని అన్నారు. 

దళిత బంధు అమలు అనుమానమే? 

అనుకున్నదొకటి .. అయినది ఇంకొకటి,, అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, దళిత బంధు పథకాన్ని ముందుగా అనుకున్నట్లుగా హుజురాబాద్ లో కాకుండా, తమ దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు. ఆగష్టు 16 న హుజురాబాద్ లో ఘనంగా పథకం ప్రారంభించి ఉపఎన్నికలో కీలక దళిత ఓటును, గంపగుత్తగా కారు డిక్కీలోకి ఎక్కించేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకున్నారు. అయినా తానొకటి తలిస్తే ఈసీ ఇంకొకటి తలవడంతో  కథ అడ్డం తిరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆగష్టు 15 కంటే ముందే ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందనే ఉప్పందడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, మూడు రోజుల క్రితం (ఆగష్టు 4న) వాసాలమర్రిలో వాలిపోయారు. దళితులకు ప్రత్యేకం అన్నట్లుగా సుమారు మూడు గంటలకు పైగా, దళితుల ఇళ్లు వాకిళ్లు చుట్టేశారు. అదే సమయంలో అక్కడికక్కడే, నోటిమాట గానే గ్రామమలోని 76 దళిత కుటుంబాలకు, కుటుంబానికి రూ.10 లక్షల వంతున దళిత బంధు పథకం మంజూరు చేశారు. అక్కడితో పథకం ప్రారంభమై పోయినట్లే అని ప్రకటించారు. ఆ తర్వాతనే ఉత్తర్వులు, కలెక్టర్ ఎకౌంటులోకి క్యాష్ ట్రాన్స్ఫర్ వంటి ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ముఖ్యమంతి నిజంగానే, కేంద్ర ఎన్నికల సంఘం రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందనే అనుకుంటున్నారా, అందుకే పథకం ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డం రాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద పథకాన్ని వాసాలమర్రి నుంచి  లాంచనంగా ప్రారంభించారా? లేక ఇందులోనూ ఏదైనా మతలబు ఉందా అంటే  ఉందనే అంటున్నారు.  నిజానికి, ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించింది కానీ, ఫలానా తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేయాలనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న సమాచారం అయితే లేదు. ఉప ఎన్నికలు అంటే ఎదో ఒకటి అరా నియోజక వర్గాలకు  కాదు, దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరప వలసి వుంది. మరో వంక కరోనా పరిస్థితి ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక విధంగా వుంది. థర్డ్ వేవ్ తలుపు తడుతోంది, ఇలాంటి పరిస్థితిలో, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం, నో’ చెప్పిన తర్వాత  కేంద్ర ఎన్నిక సంఘం  ఉప ఎన్నిక ముహూర్తం ఖరారు చేస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అలాగే, నేడో రేపో నోటిఫికేషన్ విడుదల చేస్తుందనే విషయంలోనూస్పష్టత లేదు. అదీ గాక ఆగష్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలున్నాయి. ఆతర్వాత ఆగష్టు 16 నుంచి, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రవర్తించిన తీరును ఎండ గట్టేందుకు కేంద్ర మంత్రులు దేశ వ్యాప్త రాజకీయ పర్యటనలకు బయులు దేరుతున్నారు. ఈ పరిస్థితులలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అనుకోలేమని  అంటున్నారు.  దళిత బంధు పథకానికి విపక్షాలు మోకాలు అడ్డుతాయని ముఖ్యమంత్రి ఆశ పడ్డారు. అయితే విపక్షాలు అడ్డు పడలేదు సరి కాదా ఏరా తివాసీ స్వాగతం పలుకుతున్నాయి. ఒక్క హుజురాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం ఒకేసారి పథకాన్ని అమలు  చేయాలని కోరుతున్నారు. దీంతో ఈరోజు కాకపోయినా రేపైనా ఇది తలకు చుట్టుకునే వ్యవహారంగా కనిపించడంతో ఎదో ఒక వంకన పథకానికి బ్రేక్ వేసే ఆలోచనతోనే కేసీఆర్ కొత్త ఎత్తు వేసారని అంటున్నారు. కేసీఆర్ మనస్సులో ఏముందో ఏమో గానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించినంతవరకు అధికార పార్టీ వేస్తున్న పిల్లి మొగ్గలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయనేది మాత్రం నిజం. అందుకే సామాన్య ప్రజలకు, ముఖ్యంగా దళితులకు దళిత బంధు పథకం అమలవుతుందన్న విశ్వాసం ఏర్పడలేదు. ఏదో విధంగా ఉప ఎన్నికల పబ్బం గడుపుకుని, ఆ తర్వాత  మూడు ఎకరాల భూమి ఖాతాలో కలిపెస్తారన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల మొదలు ఇదిగో అదిగో అంటూ ఉద్యోగ నియమకాల, నిరుద్యోగ భ్రుతి  దస్త్రాలను పక్కకు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే, అనేక సందర్భాలలో ఇచ్చిన హమీలను ఇంచక్కా మడత పెట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.  దళిత బంధు కూడా అదే జాబితాలో చేరుతుందనే అనుమానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

కొవిడ్ కొత్త వేరియంట్ 'ఈటా' .. ఇండియాలో తొలికేసుతో అల‌ర్ట్‌..

కప్పా.. ఆల్ఫా.. బీటా.. డెల్టా.. గామా. ర‌క‌ర‌కాల వేరియంట్స్‌తో కొవిడ్‌-19 ఓ రేంజ్‌లో కుమ్మేస్తోంది. ప్ర‌పంచంతో ఆటాడుకుంటోంది. ఆ దేశం ఈ దేశమ‌నే తేడా లేకుండా.. కోట్లాది మంది ప్రాణాలతో చెల‌గాట‌మాడుతోంది. మందులేవీ పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌డం లేదు. వ్యాక్సిన్ ఒక్క‌టే కాస్త సుర‌క్షితం. క‌రోనా క‌ట్ట‌డికి మాన‌వ ప్ర‌యత్నాలు ఎంత ముమ్మ‌రంగా సాగుతుంటే.. వైర‌స్ సైతం మ‌నుషుల‌తో పోటీనా అన్న‌ట్టు అంత‌గా రూపాంత‌రం చెందుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు రూపు మార్చుకుంటూ.. కొత్త వేరియంట్ల‌తో మ‌రింత వ్యాపిస్తోంది. ఆ వేరియంట్ల‌నే శాస్త్ర‌జ్ఞులు ఆల్ఫా, బీటా, గామా, డెల్టాగా పిలుస్తున్నారు. డెల్టా ప్ల‌స్ అనేది లేటెస్ట్ వేరియంట్‌. డెల్టా వేరియంట్ పుట్టుక భార‌త్‌లోనే జ‌రిగింది. ఇన్ని వేరియంట్లు ఉన్న‌వి చాల‌వ‌న్న‌ట్టు.. తాజాగా వైర‌స్ మ‌రోసారి రూపాంత‌రం చెంది మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని గుర్తించారు. ఆ కొత్త వేరియంట్‌ను 'ఈటా' అని పిలుస్తున్నారు. 'ఈటా' ఉనికి ఇలా బ‌య‌ట‌ప‌డింతో లేదో అలా ఇండియాకు వ‌చ్చేసింది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన 'ఈటా' వేరియంట్ భారత్‌లో ప్రవేశించడం ఆందోళ‌న రేపుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కర్ణాటకలోని మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ క‌నిపించింది. జన్యు పరీక్షల్లో ఆ మేర‌కు నిర్ధార‌ణ జ‌రిగింది. 4 నెలల కిందట బాధితుడు దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చాడు. కరోనా లక్షణాలు క‌నిపించ‌గా.. కొవిడ్ టెస్టులో పాజిటివ్‌ వచ్చింది. చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నాడు. అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపగా.. ఆ వ్యక్తిలో కొత్త రకం 'ఈటా' వేరియంట్ బయటపడినట్టు వైద్యులు తెలిపారు.  కర్ణాటకలో 77 శాతం కొవిడ్ కేసుల‌కు డెల్టా వేరియంటే కారణమంటున్నారు. 1,413 కేసులకు గానూ 1,089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. 159 కప్పా, 155 ఆల్ఫా, 7 బీటా, 3 డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. తాజాగా, ఈటా వేరియంట్ క‌ర్ణాట‌క‌లో వెలుగుచూసింది. ఈటా ల‌క్ష‌ణాలు, వ్యాప్తి వేగంపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సి ఉంది.   

హరీష్ దూకుడు.. కేటీఆర్ సైలెంట్! కేసీఆర్ ప్లాన్ ఎందుకు మారింది? 

తెలంగాణ రాజకీయాలన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుందని భావిస్తున్న ప్రధాన పార్టీలన్నీ ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తున్నాయి. హుజురాబాద్ లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఈటలను ఓడించేందుకు అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నారు గులాబీ బాస్.  హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ దూకుడు పెంచినా..  ఓ విషయం మాత్రం రాజకీయ వర్గాలు, జనాల్లో చర్చగా మారింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ .. హుజురాబాద్ పై మాట్లాడకపోవడం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కేటీఆర్.. హుజురాబాద్ పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాని అందుకు భిన్నంగా ఆయన సైలెంటుగా ఉంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్నా .. ఆ నియోజకవర్గం వైపు కేటీఆర్ కన్నెత్తి చూడకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా అక్కడికి వెళ్లి గెలుపు బాధ్యతలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కీలకమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మెదక్ జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు సీఎం కేసీఆర్.కొన్ని రోజులుగా ఆయన హుజురాబాద్ రాజకీయాలను నడిపిస్తున్నారు. నియోజకవర్గానికి వెళ్లకుండానే.. సిద్ధిపేట నుంచే కథ నడిపిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాలతో సిద్ధిపేటలో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తాయిలాలు ప్రకటిస్తున్నారు. అభివృద్ది పనుల కోసం నిధులు కేటాయిస్తున్నారు. హరీష్ రావు సమక్షంలోనే వివిఝ పార్టీల నుంచి కారు పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ పైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు హరీష్ రావు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మోడీ ఫొటోను ఎందుకు దాచిపెడుతున్నారంటూ ప్రశ్నించి కమలనాధులను డిఫెన్స్ లోకి నెట్టేశారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయంటూ వివిధ వర్గాలు వల వేస్తున్నారు హరీష్ రావు.  హరీష్ రావు దూకుడుగా వెళుతుండటం.. కేటీఆర్ అసలు మాట్లాడకపోవడం టీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ లో గెలుపు అంత సులువు కాదు కాబట్టి ముందు జాగ్రత్తగా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును రంగంలోకి దించారని అంటున్నారు.హుజూరాబాద్ లో గెలిచే చాన్స్ లేదని..అందుకే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారని.. ఓడిపోయినా నెపాన్ని హరీష్ రావు మీద నెట్టి కేటీఆర్ ను సేఫ్ చేసేలా రాజకీయాన్ని కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. దుబ్బాక విషయంలోనూ ఇదే చర్చ జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలోనూ అంతా తానే వ్యవహరించారు హరీష్ రావు. బీజేపీ నుంచి గట్టి పోటీ ఉన్నా.. కేటీఆర్ అటు వైపు వెళ్లలేదు. బీజేపీ ప్రచారం కోసం కేంద్రమంత్రులు వచ్చినా... ఒక్క హరీష్ రావుపైనే భారం వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీనే విజయం సాధించింది. ఆ ఫలితాన్ని ముందుగానే ఊహించిన కేటీఆర్.. అక్కడికి వెళ్లకుండా దూరంగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. దుబ్బాక ఓటమిని హరీష్ రావు ఖాతాలో వేసేందుకు అలా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు హుజారాబాద్ లోనూ దుబ్బాక సీనే రిపీట్ అవుతుందని అంటున్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గట్టి పట్టుంది. మంత్రివర్గం నుంచి తొలగించారనే సానుభూతి కూడా ఆయనపై జనాల నుంచి కన్పిస్తోంది. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ గెలవడం ఈజీ కాదనే నిర్ణయానికి వచ్చిన కేటీఆర్.. అక్కడికి వెళ్లకుండా తప్పించుకుంటున్నారనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రగతిభవన్ వర్గాలు మాత్రం ఈటల వ్యవహారాల్నని తెలుసు కాబట్టే.. హరీష్ రావును కేసీఆర్ రంగంలోకి దింపారని అంటున్నారు. ఈటలను దెబ్బతీసే బాధ్యతలను హరీష్ సమర్థవంతంగా నిర్వహిస్తాడని ఈ స్కెచ్ గీశారని చెబుతున్నారు.

షేమ్ షేమ్ జ‌గ‌న్‌!.. తాడేప‌ల్లి రే-ప్ కేసులో 2 నెల్ల‌ త‌ర్వాత నిందితుడి ఆచూకీ..

కాబోయే దంప‌తులు న‌దీ తీరంలో విహారానికి వ‌చ్చారు. ఇసుల తిన్నెల్లో కూర్చొని క‌బుర్లు చెప్పుకుంటున్నారు. సాయంసంధ్య వేళ‌లో వెద‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుప‌క్క‌ల జ‌న‌సంచారం అంతగా లేకున్నా వారేమీ భ‌య‌ప‌డ‌లేదు. ఎందుకంటే.. స‌మీపంలోనే ముఖ్య‌మంత్రి ప్యాలెస్ ఉందిగా.. సెక్యూరిటీ బాగానే ఉంటుందిగా.. త‌మ‌కేమి భ‌యం అనుకొని బిందాస్‌గా ఉన్నారు. కానీ, వారి అంచ‌నా పొర‌బాటుగా తేలింది. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్ సేద‌తీరుతున్నా.. ఆ స‌మీపంలోనే తాము విహ‌రిస్తున్నా.. త‌మ‌కు ఏ మాత్రం ర‌క్ష‌ణ లేద‌నే విష‌యం ఆ త‌ర్వాత గానీ తెలిసిరాలేదు. అంత‌లోనే జ‌ర‌గ‌రాని ఘోరం జ‌రిగిపోయింది. బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఆ జంట‌పై అటాక్ చేసింది. ఆ యువ‌కుడిని క‌ట్టేసి.. యువ‌తిని చెర‌బ‌ట్టింది. అమానుషానికి పాల్ప‌డి.. ఎంచ‌క్కా వ‌చ్చిన దారినే వెళ్లిపోయింది.  విష‌యం తెలిసి అంతా షాక్‌. తాడేప‌ల్లిలో ఈ ఘోరం ఏంట‌ని ఏపీ ఉలిక్కిప‌డింది. సీఎం జ‌గ‌న్ ఇంటి స‌మీపంలోనే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోవ‌డాన్ని అంతా త‌ప్పుబ‌ట్టారు. తాడేప‌ల్లి ప్యాలెస్ స‌మీప ప్రాంతాల్లో గంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌లు ఇంత‌లా చెల‌రేగిపోవ‌డం స‌ర్కారు చేత‌గానిత‌న‌మంటూ విమ‌ర్శ‌లు ముంచెత్తాయి. ఆ జ‌న చీద‌రింపుల నుంచి త‌ప్పించుకోడానికే అన్న‌ట్టు.. అప్ప‌టిక‌ప్పుడు దిశ యాప్ పేరుతో పెద్ద డ్రామాలాంటి ప్రొగ్రామ్ తీసుకొచ్చార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంత వ‌ర‌కూ ఓకే.. దిశ యాప్ స‌రే.. మ‌రి, ఆ రే-ప్ కేస్ నిందితుల జాడేది? ఘ‌ట‌న జ‌రిగి రెండు నెల‌లు గ‌డుస్తున్నా.. ఆ బ్లేడ్ బ్యాచ్‌ను ప‌ట్టుకోలేక‌పోయారేం? ఇద్ద‌రు నేర‌గాళ్ల సంగ‌తే తేల్చ‌లేని స‌ర్కారు.. ఇక ప్ర‌జ‌ల‌ను సుర‌క్షితంగా కాపాడుతుంద‌నే న‌మ్మ‌కం ఎలా క‌లుగుతుంది? ప‌క్క‌రాష్ట్రం తెలంగాణ‌లో ఇలాంటి దారుణాలు జ‌రిగితే.. 24 గంట‌ల్లోనే అక్క‌డి పోలీసులు ప‌ట్టుకుని.. త‌మ‌దైన స్టైల్‌లో శిక్షిస్తుంటే.. సీఎం జ‌గ‌న్ అధికారిక నివాసం ఉన్న తాడేప‌ల్లి ప్రాంతంలోనే ఇంత‌టి దారుణ ఘ‌ట‌న జ‌రిగితే.. రెండు నెల‌లైనా నిందితుల‌ను అరెస్ట్ చేయ‌లేక‌పోవ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కాదా? అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఇలాంటి ఆరోప‌ణ‌ల మ‌ధ్య‌.. రెండు నెల‌ల త‌ర్వాత లేటెస్ట్‌గా తాడేప‌ల్లి మండ‌లం సీతాన‌గ‌రం గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి క‌నిపించింది. కీలక నిందితుడు ఒక‌డు పోలీసులకు చిక్కాడని తెలుస్తోంది. ఒంగోలులో నిందితుడిని అదుపులోకి తీసుకుని.. రహస్య ప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్నట్టు స‌మాచారం.   

కేరళలో కరోనా కరాళ నృత్యం.. ఎందుకలా ? 

కరోనా ఫస్ట్ వేవ్ దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. కానీ కేరళలో మాత్రం కరోనా మహమ్మారి ఆటలు సాగలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం కరోనా కట్టడిలో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. శభాష్ అనిపించుకుంది. దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేరళలో వామపక్ష కూటమి అనుసరించిన మోడల్ రోల్ మోడల్ గా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.  కానీ, అదే కేరళలో  కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. పగపట్టిన పాములా బుస కొడుతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసులలో సగానికి దగ్గరగా కేసులు ఒక్క కేరళ నుంచే రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది, ఇంతలోనే ఇంత  మార్పుకు కారణం ఏమిటి? అప్పుడున్న వామ వామపక్ష కూటమి ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు ఇప్పుడు కూడా పినరయి విజయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజానికి గత మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆనవాయితీకి భిన్నగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వరసగా రెండవ సారి అధికారంలోకి రావడంలో, కరోనా కట్టడి చప్పట్లు కూడా ఒక కారణమని,లెఫ్ట్ మేథావులు విశ్లేషించారు. అలాంటిది ఇప్పుడు అదే రాష్ట్రంలో, అదే ప్రభుత్వం కరోనాను ఎందుకు కట్టడి చేయలేక పోతోంది?  మిగిలిన దేశమంతా కలిపి ఎన్ని కేసులు నమోదవుతునన్నాయో, ఇంచుమించుగా అందుకు సమాన సఖ్యలో కరోనా కేసులు ఒక్క కేరళలోనే ఎందుకు నమోదవుతున్నాయి? అయితే, చిత్రంగా కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహా ఉదృతికి, పినరయి ప్రభుత్వమే కారణమని అంటున్నారు. ఫస్ట్ వేవ్ సందర్భంగా ఆయన్ని ప్రశంసలలో ముంచెత్తిన మీడియానే ఇప్పుడ ఆయన ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పు పడుతోంది. తాజాగా  రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కూడా అదే తేల్చింది.  కేరళలో ప్ర‌స్తుతం క‌రోనా తీవ‌త్ర‌కు ప్రధాన కారణం కాంటాక్ట్-ట్రేసింగ్ లో వైఫ్య‌లమేన‌ని కేంద్ర బృందం తేల్చింది. ఇళ్లల్లో ఐసోలేషన్ ఉంటున్న‌ రోగుల‌ను ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించ‌డం లేద‌ని తెలిపింది. క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా క‌రోనా బారిన ప‌డితే 20 కాంటాక్ట్‌ల‌ను గుర్తించాల‌ని కేంద్రం సూచించింది. కానీ కేర‌ళ‌లో క‌రోనా విజృంభిస్తున్నా.. ఒక్క రోగికి సంబంధించిన క‌నీసం అత‌డితో కాంటాక్ట్ ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కూడా గుర్తించ‌డం లేద‌ని కేంద్ర బృందం త‌మ నివేదిక‌లో అభిప్రాయ‌ప‌డింది.  మ‌రోవైపు కేర‌ళ‌లో ప్ర‌తి క‌రోనా మ‌ర‌ణాన్ని లెక్కిస్తున్న‌ప్ప‌టికీ.. కొన్ని కేసుల్లో చ‌నిపోయిన త‌ర్వ‌ాతే క‌రోనా ఉంద‌ని గుర్తిస్తున్నార‌ని తెలిపింది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి లేఖ రాశారు.కేరళ అనుభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా మహమ్మారి విషయంలో జాగ్రతగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుకు గురయినా, కేరళ కథే అంతటా పునరావృతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఏపీ కొంప ముంచుతున్న జగన్! అంతా ఆయన వల్లేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మామూలుగా పెరగడం లేదు. ఓ రేంజ్ లో పెరుగుతోంది. ప్రముఖ జర్నలిస్టులు సైతం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వంటి ప్రాధాన్యత గల ప్రభుత్వ అవార్డులను తిరస్కరించారంటే వ్యతిరేకత ఏ రేంజ్ లో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం పలు శాఖల ఉద్యోగులను ఆకలితో చంపుతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్టుకు పడాల్సిన వేతనాలు 15 వరకు వెళ్తున్నాయి. జగన్ పాలనతో ఏపీ భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందనే ఆవేదన కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ఏపీకి ఈ పరిస్థితి రావడానికి కారణం  ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పీకే (ప్రశాంత్ కిషోర్) మాటలు జగన్ వినడం వల్లేనన్న వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు నవరత్నాలు అనే కాన్సెప్టును ప్రొజెక్ట్ చేసి జగన్ ను విపరీతంగా ఆకాశానికెత్తిన పీకే మార్కు వ్యూహం కారణంగా ఇప్పుడు ఏపీ ఎన్నడూ లేనన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణే నిండా అప్పుల్లో మునుగుతుంటే అసలే కొత్త రాష్ట్రమైన ఏపీ పరిస్థితి అంతకన్నా దారుణంగా తయారై.. భవిష్యత్తేంటో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందంటున్నారు. గత ఎన్నికలకు ముందే పీకే ప్రజల్ని ఆకర్షించే నవరత్నాలు అనే కాన్సెప్టును వైసీపీ శ్రేణుల ద్వారా ఎక్కించాడు. తాహతుకు మించిన ఉచిత హామీలతో ఓట్లనైతే రాబట్టారు గానీ.. కుండకు చిల్లు పడ్డట్టు ఖజానా మాత్రం ఖాళీ అయిపోయింది. ఎంతో ప్రెస్టీజ్ గా భావించిన ప్రవేశపెట్టిన ఆ నవరత్నాలే.. ఆంధ్రా ప్రజల నవనాడుల్లోని జవసత్వాలనూ లాగేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  1) వైఎస్సార్ రైతు భరోసా, 2) ఫీ రీయింబర్స్ మెంట్, 3) ఆరోగ్యశ్రీ, 4) జలయజ్ఞం, 5) మద్యపాన నిషేధం, 6) అమ్మ ఒడి, 7) వైఎస్సార్ ఆసరా, 8) పేదలందరికీ ఇళ్లు, 9) పెన్షన్ల పెంపు. జగనన్న పథకాల్లో చాలావరకు కూడా ప్రజలకు అందించే ఉచిత వరాలే. వాటి ద్వారా ప్రభుత్వానికి అధికారమైతే వచ్చింది కానీ.. రాష్ట్ర నిర్వహణ మాత్రం అసాధ్యంగా మారింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రెండో సంవత్సరం నుంచి ఏటా రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50 వేలు అందిస్తున్నారు. ఉచిత బోర్ వెల్స్, వడ్డీ లేని రుణాలు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీ నిలుపుకోవాలంటే అప్పులు చేయడం తప్ప వేరే మార్గమే లేదు. వెయ్యి రూపాయలకు పైబడ్డ జబ్బులను ఆరోగ్య శ్రీలో చేర్చడం ప్రజాసంక్షేమ చర్యే అయినా... దాని నిర్వహణ గురించి ఏమాత్రం ఆలోచించకపోవడంతో అదే ఇప్పుడు గుదిబండలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇక దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ మేధావీ వర్గాన్ని ఆకర్షించినా.. దాన్ని అమలు చేయలేక చేతులెత్తేస్తున్న వైనం కళ్లకు కడుతోంది. పలు బ్రాండ్ల లిక్కర్ ధరలు పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరచేందుకు చేసిన చర్యలేవీ సత్ఫలితాలివ్వలేదు. ఇతర రాష్ట్రాల నుంచి అడ్డదారుల్లో మద్యం ప్రవహించింది. దీంతో ఖజానాను దృష్టిలో ఉంచుకొని మళ్లీ ధరలు సవరించాల్సి వచ్చింది. వైఎస్సార్ ఆసరా, పేదలకు ఇళ్లు, పెన్షన్లు.. ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా తాహతుకు మించిన వ్యయాన్ని డిమాండ్ చేస్తోంది.  ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పథకాల అమలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఫలితంగా అది కాస్తా వేతనాల మీద ప్రభావం చూపుతోంది. రాష్ట్రం ఇప్పుడు పదుల వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోతున్న దృశ్యం ఏపీ మేధావులను, ప్రజల్ని కలవరపరుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు పీకే ఐడియాలు తు.చ. తప్పకుండా పాటించిన జగన్.. మరి ఖజానా కళకళలాడాలంటే కనీసం ఒక్క ఐడియా కూడా ఎందుకని తీసుకోలేకపోయాడన్న సెటైర్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఖజానా కోసం జగన్.. ఇప్పుడేం చేస్తారు... మరి జగన్... ఈ వైఫల్యాన్ని ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి..