టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వేరో వార్నింగ్.. ఆడియో వైరల్
posted on Aug 10, 2021 @ 1:46PM
తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇంతకాలం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ జరగగా... తాజాగా బీఎస్పీ కూడా ఇందులో చేరింది. ఈనెల 8న రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. నల్గొండలో నిర్వహించిన సభలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేశారు గులాబీ లీడర్లు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోనికి వచ్చిన ఓ ఆడియో వైరల్ గా మారింది. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రవీణ్ కుమార్ అనుచరుడు ఫోన్ చేసి బెదిరించారు ఆ ఆడియోలో.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి ఫోన్ చేసి.. తాను సంపత్ స్వేరో అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టాడు.. ఫోన్లో ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించాడు.. ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి నీదా అంటూ.. కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడిన సంపత్.. మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు.. అయితే, అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే కిషోర్.. నా స్థాయి ఏంటో నాకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చిన ఆయన.. గాదరి కిషోర్ అంటే ఏంటో చూస్తావా.. 172 కేసులు పెట్టుకుని జైలు పాలై వచ్చిన వ్యక్తిని.. ఉద్యమాలు చేసి వచ్చానన్నారు.. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రవీణ్ కుమార్ ఫోన్ చేసి బెదిరించాలని చెప్పాడా..? ఇకనైనా ఫోన్ చేసి బెదిరింపులు బంద్ చేయండి.. జాతి పేరు ఆగం చేయకండి అంటూ హితవుపలికారు.. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావని.. పీఎస్లో కేసు పెడతానని హెచ్చరించారు ఎమ్మెల్యే.. అయితే.. ఇప్పుడా ఆడియో వైరల్గా మారి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్కుమార్ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్.. అయితే.. ఆ తర్వాత ఓ వ్యక్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.