మోదీని ఓడిద్దాం.. మాజీల ఐక్య‌తారాగం..

ఒకప్పుడు వారంతా దేశ రాజకీయాలలో కీలక పాత్రను పోషించిన నాయకులు. సిద్ధాంతపరంగా సోషలిస్టులు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలిచిన నాయకులు. ముఖ్యంగా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అరాచక పాలనకు వ్యతిరేకంగా సాగిన మరో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర  సమరయోధులు. ఈ నాయకులే 1970 దశకంలో జయ ప్రకాష్ నారాయణ్  (జేపీ) నేతృత్వంలో సాగిన, సంపూర్ణ క్రాంతి పోరాటంలో కీలక పాత్రను పోషించారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించి నిలిచిన అప్పటి యువ నేతలు. ఇప్పుడు వృద్ధ నాయకులు. అయినా ఇంకా వారిని రాజకీయ వాసనలు వదలేదు. ఇంకా ఏదో చేయాలని, ఏదో చూడాలనే తాపత్రయం వారిని వెంటాడుతూనే ఉంది.  అవును, మాజీ ప్రధాని దేవేగౌడ (88), ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ (81), జేడీయూ బహిష్కృత నేత, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్, (76), అంతగా పరిచయం అవసరం లేని, వృద్ధ నేతలలో యంగ్ స్టార్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్రనేత లాలూప్రసాద్ యాదవ్ (73). వీరంతా వయసు మీద పడినా ఇంకా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు తరచూ ఒకరినొకరు కలుస్తూ, ఒకరి యోగక్షేమాలు ఒకరు  తెలుసుకుంటున్నారు. అంతేకాదు వ్యక్తిగత యోగక్షేమాలతో పాటుగా, రాజకీయ మంచి చెడుల మీద  చర్చలు సాగిస్తున్నారు.  ఒకప్పుడు వీరంతా జేపీ సృష్టించిన జనతా పార్టీలోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఎవరికీ వారు విడిపోయారు. సొంత కుపంట్లు పెట్టుకున్నారు.జనతా పరివారంగా మిగిలి పోయారు. ఇప్పుడు మళ్ళీ ఇలా కలుసుకుంటున్నారు. కలుసుకున్న ప్రతిసారి, రాజకీయాలు చర్చకు వస్తూనే ఉన్నాయి.  ఈ వృద్ధ నేతలు ముఖ్యంగా, ప్రధాని మోడీని తమకు, తమ పరివారానికి ముప్పుగా చూస్తున్నారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు మోడీ నుంచి పొంచి ఉన్న ముప్పును తల్చుకుని, కుమిలి పోతున్నారు. అందుకే, మోడీ విసురుతున్న రాజకీయ సవాళ్ళ చుట్టూనే  వీరి ఆలోచలు సాగుతున్నాయి. ఇప్పటికే, మోడీ, జనతా పరివార్ కోటలను చాలా వరకు కూల్చి వేశారు. యూపీలో ములాయం పార్టీ వరస ఓటములను రుచి చూస్తోంది. కర్ణాటకలో దేవెగౌడ, అయన కుమారుడు కుమార స్వామి రాజకీయ భవిష్యత్ గురించి కలత చెందుతున్నారు. అలాగే, లూలు. ఒకప్పుడు వీరంతా కూడా, ప్రస్తుత బీజేపీ పూర్వరూపం భారతీయ జన సంఘ్, (బీజేఎస్) తో చెట్టాపట్టాలేసుకు తిరిగినవారే, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడిన వారే, అయినా, ఇప్పుడు బీజేపీ పొడ గిట్టదు.  అవును, మాజీ సోషలిస్ట్ నాయకులకు, మోడీ ఎదుగుదల అసలు మింగుడు పడడం లేదు. ఈ విషయంలో  సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ఎవరి కష్టాలు వారివిగా ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ విషయాన్ని తీసుకుంటే, ఆయన సారధ్యంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సమాజ్ వాదీ పార్టీ వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో దిక్కు దివాణం లేకుండా పోయింది. అలాగే, 2017  ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘనంగా ఓడి పోయింది. బీజేపీ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీతో  గెలిచింది. కర్ణాటకలో దేవే గౌడ పార్టీ జనతా దళ (ఎస్) బీహార్’లో లాలూ పార్టీ ఆర్జేడీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. ఇక శరద్ యాదవ్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. మోడీతో తిరిగి చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన ఆయన్ని, బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ నుంచి బహిష్కరించారు. ఇలా, మాజీ సోషలిస్టు నాయకులకు బీజీపీ ఎదుగుదల మింగుడుపడని మహా కషాయంగా మారింది.  ఇదలా ఉంటే, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద యాదవ్ కామన్ కష్టాలతో పాటుగా, సోనియాగాంధీ ఇతర ప్రాతీయ కుటుంబ పార్టీల నాయకులు పేస్ చేస్తున్న కుటుంబ వారసత్వ పరిరక్షణ పరంగానూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే శరద్ యాదవ్ కుల గోత్రాల పట్టిపులు, పార్టీలు, సిద్దాంతాలను పక్కన పెట్టి, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒకటై పోయి, బీజీపీ, ఆర్ఎస్ఎస్ ముప్పు నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు ఆయన ములాయం, లాలూ , దేవే గౌడతోనూ  చర్చలు జరిపారు. ఏమైనా, చీలికలు, పేలికలుగా చీలిపోయిన జనతా పరివారం మోడీ భయంతో మరోమారు ఏకమవుతున్నారు. ఇప్పడు, దేశ రాజకీయాలలో వినిపిస్తున్న ఒకే ఒక్క మంత్రం మోడ... అందుకు ప్రతి ధ్వనిగా వినిపిస్తున్న నినాదం విపక్ష్ల ఏకత. వయసుతో విశేషణాలతో సంబంధం లేకుండా విపక్ష నాయకులు అందరి నోటా వినిపిస్తున్న మాట.. మోడీని ఓడిద్దాం...  

నాడు-నేడుపై లోకేశ్ మ‌న్‌కీ బాత్‌.. దేశంలోనే ఏపీ 4వ స్థానం..

జాబ్ క్యాలెండ‌ర్ అంటోంది స‌ర్కారు. జాబ్‌లెస్ క్యాలెండ‌ర్ అని మండిప‌డుతోంది ప్ర‌తిప‌క్షం. జాబ్ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట్టుడుకుతోంది. నిరుద్యోగులంతా రోడ్డెక్కి ఉద్య‌మిస్తున్నారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌తో హోరెత్తిస్తున్నారు. నిరుద్యోగుల‌కు టీడీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ప్ర‌భుత్వంపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తోంది. వెంట‌నే ఖాళీల‌న్నీ భ‌ర్తీ చేసేలా జ‌గ‌న్ స‌ర్కారుపై ఒత్తిడి తెస్తోంది.  ఇటు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌నే కాదు.. ప్రైవేటులోనూ ప‌రిస్థితి ఏమాత్రం బాగా లేదు. రెండేళ్లుగా కొత్త ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చింది లేదు. కొత్త ఉద్యోగాలు క‌ల్పించింది లేదు. పైగా ఉన్న కంపెనీలే వ‌రుస‌క‌ట్టి వెళ్లిపోతున్న దుస్థితి. రిల‌య‌న్స్ నుంచి అమ‌ర‌రాజా వ‌ర‌కు ఇదే తీరు. అదే చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడైతే.. అనేక అంత‌ర్జాతీయ స్థాయి సంస్థ‌లు న‌వ్యాంధ్ర‌కు వ‌ల‌స వ‌చ్చాయి. స‌న్‌రైజ్ స్టేట్‌గా ఏపీ వెలిగిపోయింది. ఒక్క ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రాన్ని సీఎం జ‌గ‌న్‌ దివాళా తీయించేశార‌ని ప్ర‌తిప‌క్షం విరుచుకుప‌డుతోంది. తాజాగా, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. నాడు-నేడును పోల్చి స‌ర్కారుపై మండిప‌డ్డారు.  చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నెలకో పెద్ద సంస్థ వచ్చేదని నారా లోకేశ్ గుర్తు చేశారు.  టీడీపీ హయాంలో రూ.5లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని స్వయంగా వైసీపీ మంత్రే చెప్పారన్నారు. జ‌గ‌న్‌ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా.. ఎన్నో పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయని దుయ్య‌బ‌ట్టారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయన్నారు నారా లోకేశ్‌.  ఏపీలో ఇక ఉద్యోగాలు రావని తెలిసి యువత నిరాశలో మునిగిపోయిందని.. ఉద్యోగాలు రావనే బెంగతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్‌ సీఎం అయిన తర్వాత ఏపీలో 300 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్ మండిప‌డ్డారు. నిరుద్యోగిత‌లో దేశంలోనే ఏపీ 4వ స్థానంలో ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా లోకేశ్‌.   

హ‌రీశ్ వ‌ర్సెస్ ఈట‌ల‌.. పొలిటిక‌ల్‌ స‌వాల్స్‌.. ఎవ‌రికి బూమ‌రాంగ్‌?

18 ఏళ్ల అనుబంధం. జాన్  జిగ్రీ దోస్తులు. కేసీఆర్ పుణ్యాన ఇప్పుడు బ‌ద్ద శ‌త్రువులు. హుజురాబాద్‌లో ఎవ‌రి ద‌మ్మెంతో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈట‌ల‌ను ఓడించే టాస్క్ హ‌రీష్‌కే అప్ప‌గించి..  టూ బ‌ర్డ్స్ ఎట్ వ‌న్ షాట్ కొట్టాల‌నిచూస్తున్నారు కేసీఆర్‌. మిత్రుడిపైకి మిత్రుడినే ఉసిగొల్పి.. అల్లుడి నిబ‌ద్ధ‌త‌కు అగ్నిప‌రీక్ష పెట్టారు. తాను నిలువెల్లా కాలిపోతున్నా.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా సాధించ‌డానికి బాగానే ట్రై చేస్తున్నాడు. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్ర‌క‌టించ‌గానే. భారీ ఎత్తున బైక్ ర్యాలీ తీసి.. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. గారు..గారు.. అంటూనే ఈట‌ల గుండెల్లో మాట‌ల ఈటెలు గుచ్చారు. రాజేంద‌రేమైనా త‌క్కువోడా. మీరు..మీరు.. అంటూ హ‌రీశ్‌పై సైతం అవే ఈటెల‌ను ప్ర‌యోగించి ఈట‌ల ప‌దునెంతో చూపించారు. ఇద్ద‌రు పాత దోస్తులు..కొత్త దుష్మ‌న్‌ల మ‌ధ్య రాజ‌కీయ పోరు రంజుగా మారింది. హ‌రీశ్ డైరెక్ట్‌ ఎంట్రీతో హుజురాబాద్ సినిమా.. ఈల‌లు గోల‌ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా మారుతోంది.  టీఆర్ఎస్‌లోకి రాక‌ముందు ఈట‌ల స‌ర్పంచా? ఎమ్పీటీసీనా? జెడ్పీటీసీనా? ఎమ్మెల్యేనా? అని ప్ర‌శ్నించారు హ‌రీశ్‌. రాజేంద‌ర్‌కు కేసీఆరే రాజ‌కీయ బిక్ష పెట్టార‌ని ఎద్దేవా చేశారు. సేమ్ టూ సేమ్‌.. అవే ప్ర‌శ్న‌లు తిరిగి హ‌రీశ్‌పైకి సంధించారు ఈట‌ల‌. నా సంగ‌తి స‌రే.. మ‌రి మీరు.. టీఆర్ఎస్‌లోకి రాక‌ముందు స‌ర్పంచా? ఎమ్పీటీసీనా? జెడ్పీటీసీనా? ఎమ్మెల్యేనా? అంటూ హ‌రీశ్‌రావును నిల‌దీశారు రాజేంద‌ర్‌. త‌న డైలాగ్ త‌న‌కే బూమ‌రాంగ్ అవుతుంద‌ని హరీశ్ ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. రాజ‌కీయాల్లో అంతా ఆ తాను ముక్క‌లేన‌ని చెప్ప‌డానికి మ‌రో ఎగ్జాంపుల్ హ‌రీశ్‌, ఈట‌ల క్వ‌శ్చ‌న్స్‌.    హుజురాబాద్‌లో 2 గుంటలకు.. 2 వందల ఎకరాలకు మధ్య పోటీ జరుగుతోందంటూ ఈట‌ల సంప‌ద‌ను బూచీగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు హ‌రీశ్‌రావు. దీనిపైనా రాజేంద‌ర్ ఖ‌త‌ర్నాక్ కౌంట‌ర్ వేశారు. టీఆర్ఎస్‌లోకి రాక‌ముందే తాను బ‌డా పారిశ్రామికవేత్త‌న‌ని.. ల‌క్ష‌ల సంఖ్య‌లో కోళ్లు ఉన్న ఫౌల్ట్రీ ఫాములు, వంద‌ల ఎక‌రాల భూములున్న ఆసామినంటూ చెప్పుకొచ్చారు ఈట‌ల‌. 2001 నుంచి 2021 వ‌ర‌కూ నా ఆస్తులు ఎంత పెరిగాయో లెక్క‌లేద్దామ‌ని.. అదే స‌మ‌యంలో 2001లో మీ ఆస్తులు, ఇప్పుడు మీకున్న ఆస్తులు ఎంతో.. సీబీఐతో గానీ, మెజిస్ట్రేట్‌తో గానీ విచార‌ణ‌కు సిద్ధ‌మా? అంటూ హ‌రీశ్‌కు స‌వాల్ విసిరారు ఈట‌ల రాజేంద‌ర్‌. దెబ్బ‌కు దిమ్మ తిరిగి ఉంటుంది హ‌రీశ్‌రావుకు.  అన్నేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈట‌ల హుజురాబాద్‌ను డెవ‌ల‌ప్ చేయ‌లేక‌పోయారంటూ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ఇక్క‌డ కూడా రివ‌ర్స్ పంచ్ ఓ రేంజ్‌లో ప‌డింది. అయ్యా.. హ‌రీశ్‌రావు గారు.. నేను వేయించిన 4 లైన్స్ రోడ్ల మీదుగానే తమ‌రు హుజురాబాద్‌లో ప‌ర్య‌టించారంటూ అదిరిపోయే పంచ్ వేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఇలా, హరీశ్‌రావు వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్‌.. ఎపిసోడ్ హుజురాబాద్‌తో పాటు యావ‌త్ తెలంగాణ‌లో కాక రేపుతోంది. 

ఆయన అడ్డుకున్నా గెల్లుకు ఇలా టికెటొచ్చింది..

హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పెను సాహసమే చేస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్.. ఎక్కడా పేరు వినిపించని సాదాసీదా యువ నాయకుణ్ని ప్రకటించడం సాహసమే అంటున్నారు నిపుణులు. ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ లాంటి సీనియర్ ను ఢీకొనేందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లాంటి యూత్ లీడర్ను ఎంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఒకవైపు పీడిస్తుండగా.. గెల్లుకు టికెట్ కన్ఫామ్ అవడానికి కూడా పార్టీలోని కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని అత్యంత విశ్వసనీయ సమాచారం.  గెల్లు శ్రీనివాస్ కు టికెట్ కన్ఫామ్ చేసి విపక్షాలతో ఓటాట ఆడేందుకు మైదానానికి రమ్మని సవాల్ చేశారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. దీంతో కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించడానికి రూట్ క్లియర్ అయిపోయింది. ఇప్పటివరకూ అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది తేలకపోవడంతో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఆయన భార్య జమున మధ్య ఊగిసలాటలో ఉన్నారు. అయితే ఇటువైపు గెల్లుకు టికెట్ ఖాయమవడంతో బీజేపీ నుంచి ఈటలనే కన్ఫామ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఈటలతో పాటు గెల్లు శ్రీనివాస్ సైతం ఎదురుదెబ్బలు తిన్నారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకెళ్లారు. ఇలా ఈటలకు దాదాపుగా సమానమైన క్యారెక్టర్ గెల్లుకు ఉందన్న ఉద్దేశంతో గెల్లునే కన్ఫామ్ చేసింది అధిష్టానం. అయితే టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలోనే పనిచేసి, గతంలో ఎంపీగా పనిచేసిన ఓ యువనేత గెల్లుకు టికెట్ కన్ఫామ్ చేయడాన్ని అడ్డగించినట్టు విశ్వసనీయ సమాచారం. గెల్లుతో పాటు ఆ యువ నేత కూడా విద్యార్థి విభాగం నుంచి వచ్చినవారే కావడంతో అధిష్టానం ముందు గెల్లు మీద నెగెటివ్ ప్రాపగాండా చేశాడని, ఆయనకు టికెట్ ఇస్తే విపక్షాలకు అమ్ముడు పోవడం ఖాయమని, గెల్లు అంతగా నమ్మదగిన వ్యక్తి కాదని... ఇలా ఒకటికి నాలుగు కల్పించి చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధిష్టానం మాత్రం... అన్నీ ఆలోచించే గెల్లును బరిలోకి దించడం విశేషం.  ఇక మరో విశ్వసనీయ సమాచారం ప్రకారం 2018 ఎన్నికల్లోనే గెల్లును హుజూరాబాద్ నుంచి పోటీలో దింపితే ఎలా ఉంటుందని లోలోపల చర్చ జరిగినట్లు ఆనాడే మీడియాకు లీకులొచ్చాయి. అయితే ఈటల మీద అధిష్టానానికి ఆ రోజుల్లోనే ఆగ్రహం ఉన్నా... పార్టీ నుంచి బహిష్కరించే స్థాయిలో లేకపోవడం, ఒకవేళ బహిష్కరిస్తే ఆ తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించకపోవడంతో అప్పట్లో ఈటలపై వేటును లైట్ తీసుకున్నారు. అందుకే ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ఈటలకు మంత్రివర్గంలో చోటు దక్కపోవడాన్ని గుర్తించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ విధంగా అప్పట్లోనే అధిష్టానం దృష్టిలో నమ్మకస్తుడిగా ఉన్న గెల్లు... అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం కాస్తా ఉపఎన్నిక రూపంలో ఇప్పుడొచ్చింది. మరి ఉపఎన్నికలో ఓడిపోతే గెల్లు పరిస్థితేంటన్న ప్రశ్న కూడా వస్తోంది. ఒకవేళ ఉపఎన్నికలో గెల్లు ఓడిపోయినా.. ఒకసారి పోటీ చేసి ఓడిన వ్యక్తిగా పాపులారిటీ వస్తుంది. అధికార పార్టీ సభ్యుడిగా  విపక్షాలు, ప్రజలు,  మీడియా గుర్తిస్తాయి. యువ నాయకుడి నుంచి ప్రధాన పార్టీ బాధ్యతల్లోకి మారే చాన్సొస్తుంది. రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు కావాల్సిన ప్రొఫైల్ డెవలప్ చేసుకునే అవకాశంగా ఈ ఉపఎన్నిక పనికొస్తుందంటున్నారు. ఒకవేళ గెల్లు గెలిస్తే సీనియర్ నాయకుడు ఈటల మీద గెలిచిన వ్యక్తిగా గెల్లుకు అనూహ్యమైన పాపులారిటీ రావడం ఖాయం.  మొత్తానికి హుజూరాబాద్ ఉపఎన్నిక... ప్రధాన పక్షాలైన బీజేపీ, టీఆర్ఎస్ ల నుంచి ఆ రెండు పార్టీల పోరాటం కన్నా.. ఆ ఇద్దరు అభ్యర్థుల పోరాటంగానే ఉంటుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.  

పంటికింద రాయిలా ర‌ఘురామ‌.. వైసీపీలో ఆందోళ‌న‌..

కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు. ఢిల్లీలో ఎక్క‌ని గ‌డ‌ప లేదు. వెళ్ల‌ని ఇల్లు లేదు. స్పీక‌ర్ ఓం బిర్లా నుంచి న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు వ‌ర‌కూ.. అంద‌రినీ క‌లుస్తున్నారు వైసీపీ ఎంపీలు. మా సీఎం జ‌గ‌న్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న‌.. ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై ఎలాగైనా వేటు వేయండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. ఎందుకు వేయాలి అనే దానిపై స‌రైన సాక్షాలు మాత్రం చూప‌లేక‌పోతున్నారు. దీంతో.. వైసీపీ నేత‌ల క‌న్నీటికి.. కేంద్రంలో ఏ ఒక్క ప్ర‌ముఖుడూ క‌రిగిపోవ‌డం లేదు. ర‌ఘురామ‌పై అనర్హ‌త వేటు ప‌డ‌టం లేదు.  ఈ లోక్‌స‌భ సెష‌న్‌కి ర‌ఘురామ‌ను హౌజ్‌లో అడుగుపెట్ట‌కుండా చేద్దామ‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. కానీ, వారి ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. ర‌ఘురామ వైసీపీ ఎంపీగా స‌భ‌లో భాగ‌మ‌య్యారు. ప‌లుమార్లు అధ్య‌క్షా అంటూ త‌న గొంతు బ‌లంగానే వినిపించారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే.. పార్ల‌మెంట్‌లో అంద‌రికంటే ఎక్కువ ప్ర‌శ్న‌లు అడిగిన వైసీపీ ఎంపీగా ర‌ఘురామ‌నే టాప్‌లో నిలిచారు. ఈ ప‌రిణామాన్ని ఆ పార్టీ త‌ట్టుకోలేక‌పోతోంది. ఆయ‌న‌పై వేటు ప‌డ‌టం లేద‌ని ఉడికిపోతోంది.  ఇక త‌న‌ను ఏమీ చేయ‌లేక పోతున్న వైసీపీని చూసి ర‌ఘురామ మ‌రింత రెచ్చిపోతున్నారు. విమ‌ర్శ‌ల డోసు మ‌రింత పెంచేశారు. మాట‌ల‌తో పాటు చేత‌ల్లోనూ దూకుడు పెరిగింది. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేయ‌డం.. ఆగ‌స్టు 25న తీర్పు రాబోతుండ‌టంతో పార్టీలో విప‌రీత‌మైన ఆందోళ‌న‌. దాదాపు బెయిల్ ర‌ద్దు క‌న్ఫామ్ అనే వార్త‌లతో తీవ్ర క‌ల‌వ‌రం. జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తోంది చాల‌ద‌న్న‌ట్టు.. నెంబ‌ర్ 2 అండ్ ఏ2.. విజ‌య‌సాయిరెడ్డిని సైతం టార్గెట్ చేశారు ర‌ఘురామ‌. ఆయ‌న బెయిల్ కూడా ర‌ద్దు చేయాలంటూ కోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో వైసీపీలో ఉలిక్కిపాటు. ఓవైపు కేసులు న‌డుస్తుండ‌గా.. మ‌రోవైపు.. డైలీ ర‌న్నింగ్ కామెంట్రీ య‌ధావిధిగా కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా, న్యాయ‌శాఖ మంత్రిగా ఇటీవ‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించిన కిర‌ణ్ రిజిజును వైసీపీ ఎంపీలు క‌లిశారు. ఈ విష‌యం తెలిసి ఎంపీ ర‌ఘురామ వైసీపీ బృందంపై మరోసారి సెటైర్లు వేశారు. ఫిరాయింపు చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని కోరుతూ త‌మ ఎంపీలు కేంద్ర న్యాయ‌మంత్రిని క‌లిశార‌ని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్‌ 10ని తాను ఉల్లంఘించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌పై చ‌ర్య‌ల కోసం ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంకి లేఖ రాసిన‌ట్టు చెప్పారు ఎంపీ ర‌ఘురామ‌. కర్నూలుకు హైకోర్టు మార్చాలని కేంద్ర మంత్రిని తమ ఎంపీలు కోరారని.. పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకన్ననూ వదలడం లేదని.. టీటీడీ నుంచి రూ.50 కోట్లు తీసుకోవాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారని మండిప‌డ్డారు. సీఎం జ‌గ‌న్ పాల‌న‌ను మ‌రోసారి ఆటాడుకున్నారు ర‌ఘురామ‌. 

షా ఇటు, గవర్నర్ అటు.. ఏదో జరుగుతోంది? కేసీఆర్‌కు చెక్ పెడుతున్నారా?

తెలంగాణలో ఏదో జ‌రుగుతోంది. అవును, హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే రాష్ట్ర రాజకీయం చక్కర్లు కొడుతోంది. ఇది అందరికీ తెలిసిన, అందరూ అంటున్న, వింటున్న మాట. నిజమే, ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, అదే మాట్లాడుకుంటున్నారు. కమ్ముకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ కంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికే, అందరి నోటా నలుగుతోంది. ఇది పైకి కనిపిస్తున్న రాజకీయం, కనిపించని కథ ఒకటి తెరచాటున నడుస్తున్నదని రాజకీయ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. ఈటల విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకున్నారని రాజకీయ వర్గాలలో కొత్త చర్చ ప్రారంభమైంది. ఈటల రాజకీయంగా హతమార్చే కుట్రలో భాగంగా, ముఖ్యమంత్రి తెలియకుండానే, కేంద్రం ఉచ్చులో చిక్కుకున్నారని కూడా రాజకీయ, మీడియా వర్గాలలో చర్చ మొదలైంది. ఒక విధంగా, అయన గొయ్యి ఆయనే తవ్వుకున్నారని, పులినోట్లో తల పెట్టారని అంటున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం నుంచి తొలిగించాలనుకుంటే, అదేమీ పెద్ద విషయం. కాదు, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే సారి ఏకంగా డజను మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. అందులో ఒకరో, ఇద్దరో ఆ.. ఊ అన్నా, కొంపలు ఏమీ అంటుకోలేదు. పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రధాని మోడీకి ఏమాత్రం తీసిపోరు. సో, అదే విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ పేరున ఈటలను ఇంటికి పంపితే, ఆ కథ అక్కడితో ముగిసి పోయేది. అలా కాకుండా, కుక్కను కొట్టిచంపే ముందు పిచ్చిదనే ముద్ర వేయాలన్న అరాచక ఆచారాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి ఈటలపై అవినీతి ముద్ర వేసి బయటకు గెంటారు.  ఇప్పుడు ఆ చిన్న తప్పు పెద్ద ఉప ద్రవానికి దారి తీసినట్లు కనిపిస్తోంది. అసలే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం మీద కన్నేసింది. తెలంగాణ‌లో బలాన్ని పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అదే విధంగా, పనిలో పనిగా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేసీఆర్  ఉమ్మడి కుటుంబ ఇంటి గుట్టును, అవినీతి భాగోతాలను బయటకు తీసి, సరైన సమయంలో కొరడా తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అందుకే, ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి శాంతి జపాలు చేయించుకు వచ్చారు. అయినా, మళ్ళీ తెలిసో, తెలియకో ఈటలను గిల్లి, కేంద్రంతో కయ్యానికి తెర తీశారు.  ఇప్పుడు ఆ కయ్యం తాలుకు ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు పార్లమెంట్ సమావే శాల కారణంగా రాజకీయాలను పక్కన పెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం, తాజాగా తెలంగాణపై దృష్తి పెట్టిందని, అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్’ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. విపక్షాల గోలతో, రెండురోజుల ముందుగానే పార్లమెంట్ సమావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా పడడంతో, ఏ మాత్రం సమయం వృధా చేయకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి అమిత్ షాతో సమావేశ మయ్యారు. ప్రధానమంత్రితోనూ సమావేశమవుతారని సమాచారం. అదలా ఉంటే , గవర్నర్ తో సమావేశం ముగిసిన వెంటనే హోమ్ మంత్రి అమిత్ షా, శ్రీశైలం వయా హైదరాబాద్ పర్యటన ఫిక్స్ అయింది. గవర్నర్ ఢిల్లీ పర్యటన, హోమ్ మంత్రి  శ్రీశైలం వయా హైదరాబాద్ యాత్ర అంతర్యం ఏమిటనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంట చోటు చేసుకుంది. ఒక విధంగా ఇది రాష్ట్ర రాజకీయాలపై ఏరియల్ సర్వే అనుకోవచ్చని, బీజేపీ నాయకుడు ఒకరు జోక్ లాంటి నిజం చెప్పారు.  హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసేఆర్’కు ముక్కుతాడు బిగించడం కోసమే, కేంద్ర ప్రభుత్వం గవర్నర్’ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం, అతని పై ఉన్న కేసులు, అదే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీల ఖరారు వ్యవహారం, ఈ అన్నిటినీ మించి, ముఖ్యమంత్రి ఉమ్మడి కుటుంబ అవినీతికి సంబదించిన సమాచారం, ఇత్యాదులు అన్నీ ఢిల్లీ చేరాయని అంటున్నారు.  ఏది ఏమైనా, ఈటల రాజేందర్’కు గతంలో ఇచ్చిన మాట ప్రకారం హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ పనైపోగానే, హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు.. ఇక ముందు జరిగే కథ ఇంకోఎత్తు.. అసలు ఆట ఇప్పుడే మొదలైందంటున్నారు క‌మ‌ల‌నాథులు. 

మ‌నోళ్లేగా కేసులు ఎత్తేయ్‌!.. సుప్రీం ఆదేశాల‌తో వైసీపీ షేక్‌...

చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదంటారు. ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లో మాత్ర‌మే వినిపిస్తాయి. రియ‌ల్‌గా చ‌ట్టంలోని లూప్‌హోల్స్‌ను త‌మ చుట్టంగా మార్చేసుకుంటున్నారు పాల‌కులు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కేసులు న‌మోద‌వుతాయి. అధికారంలోకి రాగానే అవ‌న్నీ మాఫీ అవుతాయి. ఇవి రాజ‌కీయాల్లో కామ‌నే. ఇక‌పై అలాంటివి కుద‌ర‌దంటూ నాయ‌కుల‌పై క్రిమిన‌ల్ కేసులు చిట్టా విప్పుతోంది సుప్రీంకోర్టు. దీంతో.. అధికార వైసీపీలో గుబులు మొద‌లైంది. అదెక్క‌డ త‌మ మెడ‌కు బిగుసుకుంటుందోన‌నే టెన్ష‌న్ మొద‌లైంది. హైకోర్టు అనుమతి లేకుండా ఎత్తేసిన కేసుల విషయంలో అధికార పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న రేపుతోంది.  జ‌గ‌న్ సీఎం కాగానే.. ప‌లువురు అధికారపక్ష నేతలపై ఉన్న ప‌లుకేసుల‌ను ఉన్న‌ప‌ళంగా ఎత్తేశారు. అందుకు సీఎం జ‌గ‌న్ సైతం మిన‌హాయింపు కాదు. జ‌గ‌న్‌పై ఉన్న 15 కేసులు ఉప‌సంహ‌రించుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్‌తో పాటు మ‌రో 8 మంది కీల‌క నేత‌ల‌పై ఉన్న 30 వ‌ర‌కూ కేసుల్ని మూసేయ‌డంపై ప్ర‌తిప‌క్షం మండిప‌డినా ప‌ట్టించుకోలేదు. కానీ, తాజాగా సుప్రీం వ్యాఖ్య‌ల‌తో వారందిరి గుండె ద‌డ పెరిగింది. మ‌ళ్లీ త‌మ‌పై కేసులు పెడ‌తారా? అనే ఆందోళ‌న నెల‌కొంది. ఇంతకీ ఆ ఎనిమిది మంది నేతలు ఎవరు? ఆ కేసులు ఏమిటన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.  కేసుల విత్‌డ్రాలో ప్ర‌భుత్వ విప్ సామినేని ఉద‌య‌భాను టాప్‌లో ఉన్నారు. అత్య‌ధికంగా 10 కేసులు ఉప‌సంహ‌రించుకున్నారు. ఆ తర్వాతి స్థానం వైసీపీ లోక్‌సభ పక్ష నేత అయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఆయ‌న‌పై ఉన్న మూడు కేసుల్ని ఎత్తేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీద రెండు కేసులు.. ఎంపీ అవినాష్‌రెడ్డి, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేశ్, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డిలపై ఒక్కొక్క కేసును ఉపసంహరించుకున్నారు.  ఆయా నేత‌లు త‌మ ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో తెలిపిన కేసుల వివ‌రాల మేర‌కు.... మిథున్‌రెడ్డి..  - 2009లో ఎంవీ క్రిష్ణారెడ్డి, మరో నలుగురితో వెళుతున్న వాహనాన్ని అడ్డగించి రక్తం వచ్చేలా గాయపరిచారు. -15 మందికి బోర్డింగ్ పాసులు ఇవ్వాలని కోరితే ఇవ్వనందుకు రేణిగుంట ఎయిర్ పోర్టులో ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్‌పై దౌర్జన్యానికి దిగారు.  -2015లో ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండానే పీహెచ్‌సీని ప్రారంభించి అక్రమ చొరబాటుకు పాల్పడ్డారన్న అభియోగం. జక్కంపూడి రాజా -పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా నిర్వహించిన భారత్ బంద్‌లో రాజమండ్రిలోని స్పెన్సర్ షాపు మేనేజర్‌ను దుర్భాషలాడి కొట్టారు. అతన్ని రక్షించేందుకు వెళ్లిన తనను తిట్టి అంతు చూస్తానని బెదిరించినట్లుగా సుబ్రమణ్యేశ్వరరావు అనే ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు. -పోలీసు అధికారుల్ని బెదిరించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. వైఎస్ అవినాశ్‌రెడ్డి -2015లో బెదిరింపు.. ఉద్యోగుల అడ్డగింత అభియోగంపై కేసు నమోదు పేర్ని నాని -2015లో బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డటం.. ప్రభుత్వ ఉద్యోగినిని విధులు నిర్వర్తించకుండా బలప్రయోగం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు. జోగి రమేశ్ -2017లో నందిగామ ద‌గ్గ‌ర‌ జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో మరణించిన వారి డెడ్ బాడీలను వారి కటుంబ సభ్యులకు అప్పగిస్తున్న వేళ..చట్టవిరుద్దంగా గుమిగూడారన్న ఆరోపణతో కేసు నమోదు కాకాణి గోవర్ధన్ రెడ్డి -మాజీ మంత్రి సోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. తన ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఫోర్జరీ పత్రాల్ని క్రియేట్ చేసి మోసం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు. గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి -2019లో ఎన్నికల పోలింగ్ రోజున అహోబిలం ప్రభుత్వం పాఠశాల ద‌గ్గ‌ర‌ బ్రిజేంద్రనాథ్ వర్గం.. భార్గవ్ రామ్ వర్గం చట్టవిరుద్ధంగా పరస్పరం కర్రలు.. రాళ్లు విసురుకొని దాడి చేసుకున్నారన్న ఆరోపణ.  

సీఎం జగన్‌కు బిగ్‌షాక్‌!.. ముఖ్య కార్యదర్శి ప్ర‌వీణ్‌ప్రకాశ్‌ సంచలన నిర్ణయం?

ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్‌. సీఎం జ‌గ‌న్‌. ముఖ్య కార్య‌ద‌ర్శి. సీఎంవోలో ఆయ‌నే కీల‌క అధికారి. ప్ర‌వీణ్‌ప్రకాశ్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు జ‌గ‌న్‌. ఈయ‌న‌తో విభేదాల వ‌ల్లే.. ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం సీఎస్ ప‌ద‌విని కోల్పోవాల్సి వ‌చ్చింది. సీఎస్ కంటే ప్ర‌వీణ్‌కే ముఖ్య‌మంత్రి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తార‌ని అంటారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌న్నీ ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతాయ‌ని చెబుతారు. అత్యంత న‌మ్మ‌కంగా ఉంటున్న ప్ర‌వీణ్‌.. జ‌గ‌న్‌కు స‌డెన్ షాక్ ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా ఉన్న‌ ప్రవీణ్ ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేంటి? కీల‌క ప‌ద‌విలో ఉన్న అధికారి స‌డెన్‌గా రాజీనామా చేయ‌డ‌మేంటి? జ‌గ‌న్‌తో విభేదాలే కార‌ణ‌మా? ముఖ్య‌మంత్రి తీరుతో విసుగెత్తే త‌న బాధ్య‌త‌ల నుంచి వైదొలుగుతున్నారా? ఇలా అనేక అనుమానాలు. సీఎంవోలో ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్ ఒంటెద్దు పోక‌డ‌లతో ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. త‌న‌కు తెలీకుండానే ప‌లు జీవోలు విడుద‌ల‌వ‌డంపై సీఎం నిల‌దీశార‌ని అంటున్నారు. మిగ‌తా అధికారుల‌తో స‌ఖ్య‌త లేక‌పోవ‌డం.. మోనోపాలిజంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంపై సీఎం జ‌గ‌న్ మంద‌లించార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ముఖ్య‌మంత్రి ఆయ‌న‌పై ప‌లు అంశాల్లో ఒత్తిడి తెస్తున్నార‌ని.. అలా చేయ‌డం కుద‌ర‌ద‌ని చెప్పినా, చేయాల్సిందేనంటూ మండిప‌డుతుండ‌టంపై ప్ర‌వీణ్‌ప్రకాశ్ తెగ ఇబ్బంది ప‌డుతున్నార‌ని కూడా అంటున్నారు. గ‌తంలో కొంద‌రు ఐఏఎస్‌లు ముఖ్య‌మంత్రి చెప్పిన దానిక‌ల్లా త‌లాడిస్తూ.. చెప్పిన చోట గుడ్డిగా సంత‌కాలు చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు పాలైన విష‌యం గుర్తెరిగే.. ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్ కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటున్నార‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పినా కొన్ని సంత‌కాలు చేసేందుకు స‌సేమిరా అంటుండ‌టంతో.. వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని.. అందుకే ఆయ‌న ప‌ద‌వి వీడ‌బోతున్నార‌ని అంటున్నారు.   మ‌రోవైపు, మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్ ముఖ్య కార్య‌ద‌ర్శి ప‌ద‌వి మాత్ర‌మే కాకుండా ఏకంగా ఐఏఎస్‌కే రాజీనామా చేయ‌బోతున్నార‌ని అంటున్నారు. ఐఏఎస్ వ‌దిలి.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఏపీలో కాదు యూపీలో. ఆ మేర‌కు ఆయ‌న ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకున్నార‌ని.. త్వ‌ర‌లోనే బీజేపీలో చేరుతార‌ని.. వార‌ణాసి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని అంటున్నారు.  జ‌గ‌న్‌తో విభేదాలు.. పొలిటిక‌ల్ ఎంట్రీ.. ఈ రెండింటిలో ఏ కార‌ణం క‌రెక్టో త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. రీజ‌న్ ఏమైనా.. అతిత్వ‌ర‌లోనే ఐఏఎస్ ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్ త‌న ప‌ద‌వికి గుడ్‌బై చెప్ప‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

వానాకాల‌మా? ఎండాకాల‌మా? ఈ ఉక్కపోత ఏందిరా బాబోయ్‌..

జూన్‌లో రుతుప‌వ‌నాలు వ‌స్తాయ్‌. జులైలో వాన‌లు కురుస్తాయ్‌. ఆగ‌స్టులో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారుతుంది. ఇది స‌హ‌జం. ప్ర‌కృతి నియ‌మం. కానీ, ఆ వ‌రుస క్ర‌మం ఆగ‌మాగం అవుతోంది. ప్ర‌కృతి ప్ర‌కోపిస్తోంది. గ్లోబ‌ల్ వార్మింగ్‌తో వార్ చేస్తోంది. మ‌నుషులు చేసిన పాపం తిరిగి మ‌నుషుల‌కే శాపంగా మారుతోంది. అందుకే, నేచ‌ర్ కుత‌కుత ఉడుకుతోంది. ఆగ‌స్టులో మునుపెన్న‌డూ లేనివిధంగా అనూహ్య వాతావ‌ర‌ణం. ఓ వైపు వ‌ర్షం. మ‌రోవైపు ఉక్క‌పోత‌. ఉద‌యం లేవ‌గానే చెమ‌ట‌. రాత్రి వేళ‌లోనే మంట‌. ఇది ఆగ‌స్టు నెలా? ఏప్రిల్ నెలా? అర్థంకాని ప‌రిస్థితి. తెలంగాణ‌లో ఈ టార్చ‌ర్ మ‌రీ ఎక్కువ‌గా ఉంది. డే అండ్ నైట్ టెంప‌రేచ‌ర్ పెరిగిపోతోంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత న‌మోద‌వుతోంది. పగటిపూట గరిష్ఠంగా 34 డిగ్రీల వరకు, రాత్రివేళ‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు చేరుతోంది.  పశ్చిమం నుంచి పొడిగాలులు వస్తుండటంతో వేడి ఎక్కువగా ఉంటోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏవి లేకపోవడంతో తేమ గాలులు రావడం లేదు. వర్షాలు పడటం లేదు. ఇలాంటి వెద‌ర్ మ‌రో మూడు రోజుల పాటు ఉంటుంద‌ని.. 16 నుంచి వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ చెబుతోంది.  ఉక్క‌పోత విప‌రీతంగా పెర‌గ‌డంతో.. కరెంట్‌ వినియోగం ఒక్క‌సారిగా పెరిగింది. ఈ సీజన్‌లో మంగళవారం గరిష్ఠ వినియోగం న‌మోదైంది. గతేడాది ఆగస్టు 5 నుంచి 10 మధ్య గరిష్ఠ వినియోగం 44.2 మిలియన్‌ యూనిట్లు ఉంటే.. ఈఏడాది గరిష్ఠంగా 58.78 మిలియన్‌ యూనిట్లపైనే కరెంట్‌ వినియోగం ఉంది. విద్యుత్ డిమాండ్‌ వేసవిలో 2800 మెగావాట్లు ఉంటే.. ప్రస్తుతం 2746 మెగావాట్ల వరకు ఉంది. వానలు కుర‌వ‌కపోతే క‌రెంట్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప‌వ‌ర్ క‌ట్స్ కూడా పెర‌గ‌నున్నాయి. 

 చేతి ఉంగరంపై జగన్ ఫోటో.. డిప్యూటీ సీఎం స్వామి భక్తి మామూలుగా లేదుగా..

చేతి వేళ్లకు చాలా మంది ఉంగరాలు ధరిస్తారు. కొందరు సాధారణంగా తయారు చేసే గోల్డ్ రింగ్స్ ధరిస్తారు.. మరికొందరు ఖరీదైన వజ్రాలు పొదిగిన ఉంగరాలు వేసుకుంటారు. కొందరు జాతక చక్రం ఆధారంగా జాతిరత్నాలతో ప్రత్యేకంగా తయారు చేయించుకుని వేళ్లకు ఉంగరాలు వేసుకుంటారు. ఎక్కువ మంది తమ చేతికి దేవుడి ఫోటోలు ఉన్న ఉంగరం ధరించడానికే ఇష్టపడతారు. కానీ అంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అధికార వైసీపీ నేతలు తమిళ రాజకీయాల ఫార్ములాను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవుల కోసం.. అధిష్టానం చూపు తమపై పడేందుకు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. తమ అధినాయకుడి ఫోటోలతో కూడిన ఉంగరాలు ధరిస్తున్నారు. పదవుల కోసం ఆశపడే ఓ చిన్నా చితకే లీడర్లే కాదు.. ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రే.. సీఎం జగన్ ఫోటో ఉన్న ఉంగరం ధరించడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సారి మంత్రి వర్గంలో భారీగా మార్పులు ఉంటాయని.. ఈ రెండున్నరేళ్ల పని తీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన తప్పదని.. కొత్తగా కొందర్ని కేబినెట్ లో చేర్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో చాలామందిలో టెన్షన్ మొదలైంది. తమ పదవి ఉంటుందా ఊడుతుందా అంటూ చర్చ మొదలెట్టారు. కొందరైతే బహిరంగంగానే తమ భయం వెలిబుచ్చుతున్నారు. సన్నిహితుల దగ్గర తమ పదవి పోతుందా అంటూ వాపోతున్నారంట.. మరికొందరైతే తమ పదవి పోయినా భయం లేదు.. జగన్ కు విధేయులుగా ఉంటామంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ డిప్యూటీ సీఎం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   చిత్తూరు జిల్లాకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తన చేతికి పెట్టుకున్న ఉంగరమే తాజా చర్చకు కారణమైంది.ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో నారాయణ స్వామి తన ఉంగరాన్ని చూపిస్తూ.. పదవికోసం కాదు.. అభిమానంతో పెట్టుకున్నాను అని చెప్పడంతో అందరి దృష్టీ దానిపై పడింది. ఆ ఉంగరంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌తోపాటు ప్రస్తుత సీఎం జగన్‌ బొమ్మలు ఉండటంతో చర్చకు ఎక్కడ లేని హైప్‌ వచ్చింది.అది కూడా రెండున్నరేళ్ల కేబినెట్‌ ప్రక్షాణళనకు ముందు ఇలా ఉంగరంతో ప్రత్యక్షం కావడం చర్చకు ఇంకాస్త మసాలా దట్టించినట్టు అయింది.  స్వామి భక్తిని ప్రదర్శించడం తమిళనాడు నేతలు ముందు ఉంటారు. తమిళనాడు ప్రజలు అక్కడి రాజకీయాలను ఇంటిలో భాగంగా చేసుకుంటారు. మాజీ సీఎంలు ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి సహా ఇతర నేతలను వారి గుండెల్లోనే కాదు.. చేతికి పెట్టుకునే ఉంగారాల్లోనూ బంధిస్తుంటారు. ఆ గోల్డెన్‌ రింగ్స్‌ ఎంత పెద్దగా ఉంటే అంత అభిమానం ఉందని లెక్క. అది అక్కడి స్పెషల్. ఆ ట్రెండ్‌ను ఆంధ్రా రాజకీయాలకు పరిచయం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. . కానీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వారినే మించిపోయరంటూ కేడరే చర్చించుకుంటోంది. ఇదేదో బాగుందని అనుకున్న ఆయన అభిమానులు.. పార్టీ కేడర్‌ అటువంటి ఉంగరాలు కోసం ఆర్డర్స్‌ ఇచ్చారట. ఇన్నాళ్లూ లేంది ఇప్పుడు ఆయన ఈ ఉంగరం పెట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణే కారణం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం అమరావతిలో కరకట్టపై విస్తరణ పనుల శంకుస్థాపనలో ఆయన అధినేత జగన్ కాళ్లు మొక్కారు. ఇప్పుడు ఉంగరాన్ని నమ్ముకున్నారు. చాలా మంది జాతకం బాగుంటుందని.. మంచి భవిష్యత్‌ ఉంటుందని జాతిరత్నాలతో కూడిన ఉంగరాలు పెట్టుకుంటారని..  నారాయణస్వామికి తన జాతకం ఎవరి చేతిలో ఉందో తెలుసు కాబట్టి వారి ఫొటో ఉన్న ఉంగరాన్నే పెట్టేసుకున్నారని ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.  

వివేకా హత్యకు వాడిన ఆయుధాలు లభ్యం.. ఇద్దరు ప్రముఖులు వాళ్లేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్యకు నిందితులు  వాడిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్ల ఇండ్లలోనే ఆయుధాలు దొరికాయి. ఏక కాలంలో నలుగురు ఇండ్లలో సోదాలు చేసిన సీబీఐ అధికారులకు..  వివేకాను చంపేందుకు ఉపయోగించిన ఆయుధాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ తమ్ముడి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు సీబీఐ అధికారులు.  సునీల్ యాదవ్ పాసు పుస్తకాలతో పాటు బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫోన్ నెంబర్లతో కూడిన డైరీని కూడా సునీల్ నివాసంలో సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం విచార‌ణ కొన‌సాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్ప‌టికే అనేక మంది అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. ఇటీవలే గోవాలో సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసింది. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మొదట కేసుతో తనకు సంబంధం లేదని బుకాయించిన సునీల్.. సీబీఐ అధికారుల విచారణలో అసలు నిజం అంగీకరించారని తెలుస్తోంది. ప్రత్యేక టీంలుగా వచ్చిన అధికారులు ఒకే సమయంలో పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. వారితో పాటుగా.. జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు.  సునీల్ యాదవ్ సీబీఐ విచారణలో .. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తు లేదని చెప్పడంతో తనదైన శైలిలో విచారణ నిర్వహించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమాచారం మేరకు ఈ రోజు నాలుగు చోట్ల ..అనుమానితుల నివాసాల్లో సోదాలు చేయగా.. అక్కడ హత్యకు వినియోగించిన ఆయుధాలు దొరికినట్లుగా తెలుస్తోంది. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ తో స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సీబీఐ  అధికారులు.. తమను సునీల్ తప్పు దోవ పట్టించాడని నిర్ధారణకు వచ్చారు.   2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఆ తరువాత విచారణ సమయంలోనూ...రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారాయి. దీని పైన విచారణ చేస్తున్న సీబీఐ గత నాలుగు రోజులుగా విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వ్యక్తిగత సిబ్బందితో పాటుగా ఒక పత్రిక కు చెందిన ప్రతినిధులను సీబీఐ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను పులివెందులలోని పలు చోట్లకు తిప్పుతూ వివరాలు సేకరిస్తున్నారు. రహస్యంగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు సునీల్ అసలు విచారణలో ఏంచెప్పాడనే విషయం మాత్రం బయటకు పొక్కనీయటం లేదు.

వైసీపీ నేతలే రాజధాని రోడ్ల దొంగలు!

అభివృద్ధి అంటే నచ్చదు.. విధ్వంసం అంటే హుషారు... ఇదీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతల గురించి జనాల్లో జరుగుతున్న చర్చ. గత రెండేండ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగపోగా విధ్వంసాలు యథేచ్చగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి ప్రజా వేదిక కూల్చివేత మొదలు ఎన్నో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆలయాల్లో దేవతా విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరికి ఏపీ కలల రాజధాని అమరావతి రోడ్లను కూడా వదకలపోవడం విధ్వంసకాండకు పరాకాష్టగా నిలిచింది.  గత కొన్ని రోజులుగా అమరావతిలోని రోడ్లు విధ్వంసానికి గురవుతున్నాయి. రాత్రికి రాత్రే రోడ్లు మాయమవుతున్నాయి. జేసీబీలతో రహదారులను తవ్వేస్తూ ఇసుక, కంకర తరలిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే అమరావతిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లంతా మెటీరియల్ ను రోడ్డు మీదే వేసుకుంటారు కాబట్టి అదే పని చేశారు. ఇసుక, కంకర, స్టీల్ అన్నీ సైట్ల పక్కనే ఉన్నాయి. సడెన్ గా జగన్ ఆ నిర్మాణాలకు పేమెంట్స్ నిలిపేశారు.. మళ్లీ చేస్తారో చేయరో చెప్పలేదు. దీంతో లేబర్ అంతా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు కూడా వేరే పనులు చూసుకున్నారు. దీంతో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి ప్రాంతం శిథిలమైన భవనంలా మారింది.  ఇదే దొంగలకు వరంగా మారింది  ఇసుక, కంకర, స్టీల్ ఎత్తుకుపోవడం మొదలెట్టారు. దొంగలు పడి ఎత్తుకుపోతుంటే.. పట్టించుకునేవాడే కరువయ్యాడు. అమరావతిలో రోడ్డు తవ్వి కంకర ఎత్తుకుపోయారంటే.. ఎత్తుకుపోయినా ఎవరూ పట్టించుకోలేదదంటే..ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు పోలీసులకు కంప్లయింట్ చేశారు. మొదట పోలీసులు కూడా  పట్టించుకోలేదు. అయితే రోడ్లను తవ్వేస్తున్న దృశ్యాలను కొందరు సెల్ పోన్లలో చిత్రీకరించారు. అవి వైరల్ గా మారాయి. దీంతో విచారణ జరపాల్సిన తప్పనిసరి పరిస్థితి పోలీసులకు ఎదురైంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాజధాని రైతులు, విపక్షాలు అనుమానించినట్టే వైసీపీ నేతలే ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అమరావతి రాజధాని సాధన కోసం ఓవైపు రైతులు, ప్రజలు ఆందోళనలు చేపడుతుంటే.. వైసీపీ నాయకులు ప్రధాన రహదారులను తవ్వి, ఆ మెటీరియల్‌ను గ్రామాల రోడ్లకు వినియోగిస్తున్నారు. విచారణలో తేలడంతో వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రాజధాని రోడ్డు ఎన్‌-14ను తవ్వి.. ఆ మెటీరియల్‌ను శాఖమూరు గ్రామంలో రోడ్డుకు వినయోగించడంపై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వైసీపీ నాయకుడు  తాడికొండ మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ జొన్నకూటి ప్రశాంత్‌ కీలక పాత్ర వహించారని సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. రోడ్డు మెటీరియల్‌ పోయిందని బీఎస్‌సీపీఎల్‌ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు.  శాఖమూరు ప్రధాన రహదారి మరమ్మతుల కోసం పంచాయతీ నిధులు రూ.2.50లక్షలు కేటాయించారు. ఆ పనులను అధికార పార్టీకి చెందిన ప్రశాంత్‌, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు కొయ్యకూర వినోద్‌ చేస్తున్నారు. మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీతో రోడ్డు తవ్వారని సీఐ తెలిపారు.  వైసీపీ మండల ఉపాధ్యక్షుడు కొయ్యగూర వినోద్‌, ప్రశాంత్‌పై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.రాజధానిని నాశనం చేయాలనే దృఢ సకల్పంతో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ విమర్శించారు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లను వైసీపీ నాయకులు తవ్వి.. వేరే చోట రోడ్డు వేసుకొని బిల్లులు చేసుకొని, జేబులు నింపుకుంటున్నారని మార్టిన్‌ ఆరోపించారు. వైసీపీ నేతల ఆగడాలకు ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. 

పీకేకు ఆతిథ్యం.. తహశీల్దార్ పై బదిలీ వేటు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రవీణ్ కుమార్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు ఓ తహశీల్దార్ పై వేటు వేసిందనే ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్‌ పొడపంగి రాధపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆమెను పెద్దఅడిశర్లపల్లి మండలానికి బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో పెద్దఅడిశర్లపల్లి తహసీల్దార్‌ దేవదాసును నియమించారు.  రెండేళ్లుగా నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రాధ.. స్వేరో సంస్థ కార్యక్రమాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత ఆయనకు మద్దతుగా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ప్రవీణ్‌కుమార్‌ నార్కట్‌పల్లికి వచ్చిన సందర్భంగా ఆమె భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఖమ్మంలో జరిగిన సమావేశం అనంతరం హైదరాబాద్‌ వెళుతూ మార్గమధ్యలో నార్కట్‌పల్లిలోని ఓ హోటల్‌లో 400మంది కార్యకర్తలతో ప్రవీణ్‌కుమార్‌ సమావేశంకాగా, తహసీల్దార్‌ రాధ అక్కడే ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.  ఈ నెల 8వ తేదీన నల్గొండలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభతో పాటు అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో రాధ చురుగ్గా పాల్గొన్నందునే బదిలీ వేటు పడిందని చర్చ సాగుతోంది. బుధవారం కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్‌ రాధ బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకుని తక్షణం రిలీవ్‌ అయ్యారు. నల్గొండలో జరిగిన సభలో బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు. పీకే ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. ఈ నేపథ్యంలో స్వేరో సంస్థకు చెందిన సంపత్ అనే వ్యక్తి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు ఫోన్ చేసి నిలదీసిన ఆడియో వైరల్ గా మారింది. ప్రవీణ్ కుమార్ విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఉన్నారనే చర్చ సాగుతోంది. అందుకే ఆయనకు మద్దతుగా ఉన్నవారిపై వేటు వేస్తున్నారని భావిస్తున్నారు. 

జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ఎటు వైపు? ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ?

కేంద్రంలో రాజకీయ సమీకరణలు చకచకా మారి పోతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. 2024లో బీజీపీని ఓడించి, మోడీని గద్దె దించడమే లక్ష్యంగా మమత మొదలు పవార్ వరకు, రాహుల్ మొదలు కపిల్ సిబల్ వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.  అయితే ఎందుకనో గానీ ఒకప్పుడు మోడీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల కూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, హైదరాబాద్ నుంచే దండయాత్ర మొదలవుతుందని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఢిల్లీ కేంద్రంగా విపక్షాలు సాగిస్తున్న ప్రస్తుత సందడిలో మాత్రం ఇంతవరకు వేలు పెట్టలేదు. ఈ జాతరలో ఆయన ఎక్కడా కనిపించ లేదు, వినిపించ లేదు. కనీసంగా అయన పేరున కాకపోయినా పార్టీ పరంగా అయినా ఒక ప్రకటన కూడా లేదు.  కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ జీ 23 నాయకుడు కపిల్ సిబల్ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెరాస నాయకులు హాజరైనట్లు కొన్ని పత్రికలలో ఓ చిన్నవార్త అయితే వచ్చింది. కానీ, కపిల్ సిబల్ ఎవరికి ఆహ్వానం పంపించారు, తెరాస తరపున విందులో పాల్గొన్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు, ఒక మాజీ ఎంపీ సహా కేసీఆర్’కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఇద్దరు కీలక నాయకులు ఈ విందు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. అంతేకాదు, కేసీఆర్  కూడా అటు మమతతో, ఇటు పవార్ తో అలాగే కాంగ్రెస్ నాయకులతో టచ్ లోనే ఉన్నారని సమాచారం. కపిల్ సిబల్ విందులో పాల్గొనడం ద్వారా  జాతీయ స్థాయిలో జరుగతున్న విపక్షాల ఐక్యతా దిశగా తెరాస తొలి అడుగు వేసింది. అయితే  ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అందుకే, కేసీఆర్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నా,నిజానికి ఇప్పటికిప్పుడు, జాతీయ జాతరలో ప్రత్యక్షంగా పాల్గొనే ఆలోచన తెరాసకు లేదు.అందుకే, కపిల్ సిబాల్ విందులో పాల్గొన్న విషయాన్ని కూడా రహస్యంగా ఉంచిందని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఢిల్లీలో  ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అనేది గులాబీ బాస్ ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అలాగే,  రాష్ట్ర రాజకీయాలపై ఆ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుంది అనే కోణంలోనూ ఆయన  విశ్లేషణలు సాగిస్తున్నారు.    అయితే ప్రస్తుతానికి అయితే ఢిల్లీ పరిణామాలపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని కేసీఆర్ పార్టీ నాయకులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో జరుగుతున్న బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలనేది కేసీఆర్ ఆలోచనగా చెపుతున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే తీవ్ర ముప్పును ఎదుర్కుంటున్న ప్రాంతీయ పార్టీల మనుగడకు మరింత ప్రమాదంలో పడుతుందని, కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా,కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వినా ప్రాంతీయ పార్టీలకు మరో మార్గం లేదని, ఎన్నికల వ్యూహకర్తః ప్రశాంత్ కిశోర్ చేసిన సూత్రీకరణతో కేసీఆర్ ఏకీభవించారని అంటున్నారు. అయితే, అదే సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచి కాదనే అభిప్రాయం కూడా ఉందని, అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే అది రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని, హుజూరాబాద్  ఉప ఎన్నిక తర్వాత, ఢిల్లీ వైపు మరో అడుగు వేసే విషయం అలోచిద్దామనే ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నారని తెలుస్తోంది హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీ గెలిస్తే మాత్రం కేసీఆర్ కాంగ్రెస్’తో చేతులు కలుపుతారని, తెరాస గెలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఒంటరిగానే ముందుకు సాగుతారని ఆ తర్వాతనే జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు వేస్తారని అంటున్నారు.  నిజానికి కేసీఆర్ స్నేహ సంబంధాలు క్షణాల్లో మారిపోతుంటాయి, 2001లో తెరాస ఏర్పడిన కొత్తలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. సుముఖత వ్యక్తం చేయడం మాత్రమే కాదు, రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయతో చర్చలు జరిపారు. కానీ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే, కాంగ్రెస్’తో జట్టు కట్టారు. అలాగే గతంలో ఒక సారి, అసెంబ్లీ ఎన్నికల్లో  ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఫలితాలు రాక ముందే బీజేపీ జాతీయ నాయకులతో మంతనాలు జరిపిన విషయాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి, కేసేఆర్ మార్క్ రాజకీయాలు, అర్థం చేసుకోవడం కష్టం. ఆయన తాత్కాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆదరికీ అనుభవంలో ఉన్న విషయమే, సో రేపు కేసీఆర్ ఏమి చేస్తారో ఊహించడం అయ్యే పనికాదు.. 

జగన్ సర్కార్ మరో షాక్.. మాన్సాస్ ట్రస్ చైర్మెన్ గా అశోకే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఇప్పటికే చుక్కెదురుకు గురైన జగన్ రెడ్డి సర్కార్ కు హైకోర్టు మరోసారి షాకిచ్చింది. మాన్సాస్‌ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజే కొనసాగుతారని స్పష్టం చేసింది. అశోక్‌గజపతిరాజును పునర్‌ నియమిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. అశోకగజపతి రాజుకు మద్దతుగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం, సంచయితలు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సీజే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.  గతంలో అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర ప్రభుత్వం రహస్య ఉత్తర్వులతో విరుచుకుపడింది. ఆయనను సింహాచల దేవస్థానం చైర్మన్‌గా తొలగించింది.  విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి రహస్య ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అశోకగజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పువెలువరించింది. 

రా.. ఒరేయ్ అనడమే ఆత్మగౌరవమా ఈటల! రెచ్చిపోయిన హరీష్ రావు

హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో ఉప సమరం ఒక్కసారిగా వేడెక్కింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజే మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో హల్చల్ చేశారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు.. భారీగా బల ప్రదర్శన చేశారు. ఇల్లందుకుంట, వీణవంకలో బైక్ ర్యాలీ తీశారు. హరీష్ రావు పర్యటనకు టీఆర్ఎస్ కేడర్ భారీ ఏర్పాట్లు చేయడంతో.. అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజురాబాద్ పర్యటనలో హడావుడి చేసిన మంత్రి హరీష్ రావు.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈటల రాజేందర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు హరీష్ రావు. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పై ,సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇల్లందకుంటలో పర్యటించిన మంత్రి.. బీజేపీ, ఈటల లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందన్నారు హరీష్ రావు. ఈటల గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడు తప్ప నియోజకవర్గానికి ఏమీ చేయలేడన్నారు. రైతుబంధు వద్దు, దళిత బంధు వద్దు, ఆసరా పెన్షన్లు ఎవరడుగుతున్నారని ఈటల అంటున్నాడని.. రైతు బంధు వద్దంటూనే రూ. 10 లక్షల రైతు బంధు సాయం ఎందుకు తీసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఈటలకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన కేసీఆర్‌ను ఇప్పుడు ఈటల రా అంటున్నారని అన్నారు. ఒరేయ్ హరీష్ రారా అంటున్నాడని చెప్పారు. బీజేపీలోకి వెళ్లాక ఈటల బాష మారిందన్న హరీష్ రావు.. ఇదేం సంస్కారమని ప్రశ్నించారు. రారా.. ఒరేయ్ అనడమే ఆత్మగౌరవమా ఈటల అని హరీష్ ప్రశ్నించారు.గడియారాలు, మిక్సీలు పంచి పెట్టడం ఆత్మగౌరవమా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ చెప్పేదొకటి చేసేది మరొకటి అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.  ఓటమి భయంతోనే ఈటల అలా మాట్లాడుతున్నాడని, తాను ఓడి పోతున్నానని ఈటల ఒప్పుకున్నారని హరీష్ రావు అన్నారు. సిరిసేడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈటల ఒక్క పని చేయలేదని, నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు కట్టాలని ముఖ్యమంత్రి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడ కట్టలేదని విమర్శించారు.  హుజురాబాద్‌లో 2 గుంటలకు 2 వందల ఎకరాలకు మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసిందన్నారు. బీజేపీ పార్టీ ఏం చేయలేకపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ లాక్కుంటోందని హరీష్ రావు మండిపడ్డారు.  ఈటల గెలిస్తే వ్యక్తిగా గెలుస్తాడు తప్ప ప్రజలుగా మనమంతా ఓడిపోతామన్నారు హరీష్ రావు. మంత్రిగానే ఏమీ పనిచేయలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు కోరారు. ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని, గెల్లు శ్రీనివాస్‌ను ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ప్రజలకు లాభం జరగాలో ఈటలకు లాభం జరగాలోనన్న విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. రాజేందర్‌ను ఎమ్మెల్యేను మంత్రిని చేసింది కేసీఆరేనని, తల్లి లాంటి పార్టీని గుండెలమీద తన్నాడని, ఆయనను గులాబీ జెండానే ఇంతవాన్ని చేసిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. 10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ది చేస్తానని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. సిద్దిపేటలో మహిళా సంఘ భవనాలు లేని ఊరు లేదని, ఇక్కడ కూడా గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే కట్టించి తీరుతామన్నారు.   

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు? మరో ఉప ఎన్నికకు పార్టీలు రెడీ? 

తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే రాష్ట్రంలో త్వరలో మరో ఉప ఎన్నిక కూడా రాబోతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే మరో ఉప ఎన్నిక రాజకీయ పార్టీలు సిద్ధం కావాల్సిందే. కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నానుతున్న  వేములవాడ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేశ్ బాబు కేసులో తీర్పు త్వరలో వెలువడబోతోంది. ఈ కేసులో మంగళవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత కోర్టు 24న పూర్తి విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో 24న ఎమ్మెల్యే రమేశ్ బాబు పౌరసత్వంపై తీర్పు వెలుడనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో ఎమ్మెల్యే పౌరసత్వంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంతో గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తోంది. ఆయన 2019 లో బెర్లిన్లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ తీసుకున్నారని మరియు OCI కార్డ్ కోసం తన దరఖాస్తులో జర్మనీగా పేర్కొన్నాడని ఆయనపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ తరపున న్యాయవాది రవికిరణ్ రావు కోర్టులో తెలిపాడు. ఎమ్మెల్యే OCI కార్డుపై భారతదేశానికి వచ్చారని జర్మన్ పాస్పోర్ట్తో జర్మనీ వెళ్లొస్తున్నారని అన్నారు. 2009 లో భారతీయ పౌరసత్వం పొందినప్పుడు 2013 వరకు చెల్లుబాటు అయ్యే జర్మన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడన్నారు. ఓ వైపు భారతీయుడినని చెప్పుకుంటూనే 2023 వరకు జర్మన్ పాస్పోర్ట్ను పునరుద్ధరించాడని అయితే భారతీయ పాస్పోర్ట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువాదలను విన్న కోర్టు చెన్నమనేని న్యాయవాదిని OCI కార్డులో జర్మనీగా ఎందుకు పేర్కొనారని ప్రశ్నించింది. అలాగే ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 24నకు వాయిదా వేసింది. కోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే గతంలో చెన్నమనేని పౌరసత్వం రద్దయితే రెండో స్థానంలో ఉన్న వారిని ఎన్నుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కోర్టు మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది.  తెలంగాణలో 2018లో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా... వరుసగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలన్ని రాజకీయ కాక రేపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 2019మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగగా.. కాంగ్రెస్,టీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఉత్తమ్ కంచుకోటలో ఆయన సతీమణిని చిత్తుగా ఓడించి సంచలనం నమోదు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవడంతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2020 నవంబర్ లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా, టీఆర్ఎస్ కంచుకోటగా చెప్పుకునే దుబ్బాకలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని అధికార పార్టీకి చెమటలు పట్టించింది. చివరకి దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలనం స్పష్టించారు. దుబ్బాక ఫలితం కారు పార్టీని కంగారులో పడేసింది. తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య చనిపోవడంతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 ఏప్రిల్ లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా రాజకీయ సెగ రాజేసింది. నాగార్జున సాగర్ లో మూడు పార్టీలు శ్రమించాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఓడించేందుకు అన్ని అస్త్రాలు బయటికి తీసిన కేసీఆర్.. సక్సెస్ అయ్యారు. రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డిపై నోముల తనయుడు భగత్ అనూహ్య విజయం సాధించారు.  కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే హుజురాబాద్ ఉప సమరం వేడెక్కింది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. 

గుండెపోటు వార్తలపై సీబీఐ ఆరా! వివేకా హత్య కేసులో మరో మలుపు 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకనంద రెడ్డి హత్య కేసు విచారణ పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా మరోసారి వైఎస్ వివేకా గుండెపోటు చిత్రీకరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. వివేకా చనిపోయిన రోజు మొదట ఆయన  గుండెపోటుతో మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయనది హత్యగా తేలింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో నాటి గుండెపోటు చిత్రీకరణ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ఎలా ప్రసారం చేశారని సాక్షి ప్రతినిధిని ప్రశ్నించినట్లు సమాచారం. ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలను కూడా గుండెపోటు వ్యవహారంపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం విచార‌ణ కొన‌సాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్ప‌టికే అనేక మంది అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు.ఆ అతిథి గృహానికి క‌ర్ణాట‌క నుంచి 20 వాహ‌నాల్లో అధికారులు రావ‌డం ఆసక్తిగా మారింది. క‌ర్ణాట‌క రెవెన్యూ, బ్యాంకు అధికారులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వారంతా వ‌చ్చి సీబీఐ అధికారుల‌ను క‌లిసి ప‌లు అంశాల‌ను వివ‌రించారు. ఆ త‌ర్వాత సీబీఐ అధికారుల‌తో క‌లిసి ప‌లు ప్రాంతాల‌కు వెళ్లారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే క‌డ‌ప ఎస్‌బీఐకి చెందిన ముగ్గురు అధికారుల‌ను సీబీఐ విచారించింది.  మ‌రోవైపు  క‌డ‌ప‌లో సీబీఐ అధికారుల‌ను వివేక కూతురు, అల్లుడు క‌లిశారు. అనంత‌రం కొంద‌రు అధికారులు వివేక హ‌త్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఇంటికి వెళ్లి అత‌డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు.  ఈ కేసులో సునీల్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు ఇటీవ‌ల‌ గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారుల‌పై అత‌డి కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే వారిని సీబీఐ అధికారులు క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. పులివెందులలో సునీల్ నివాసానికి సీబీఐ అధికారులు వెళ్ళారు. ఇటీవల సునీల్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించడంపై వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆరోజు ఎవరెవరు ఇంటికి వచ్చింది.. అలాగే  సీబీఐకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయంపై.. అధికారులు సునీల్  కుటుంబ సబ్యులతో సీరియస్‌గా చర్చించినట్లు తెలియవచ్చింది. సీబీఐ అధికారులు తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని సునీల్ కుటుంబ సభ్యులు తెలిపారు.

కేంద్రమంటే భయం పీకేకేనా? కేసీఆర్ కు లేదా?

నిన్న గాక మొన్న కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ ఐపీస్ అధికారి, ప్రవీణ్ కుమార్ అధికార తెరాస పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంగా ముఖ్యమంతి కేసీఆర్’ను టార్గెట్ చేస్తున్నారు. విమర్శల తూటాలు సంధిస్తున్నారు. చివరకు, నాలుగు రోజుల  క్రితం బీఎస్పీలో చేరిన సందర్భంలో అయితే, ఏనుగుపై ప్రగతి భవన్’కు వస్తా ... కాసుకో .. కేసీఆర్ అంటూ సినిమా ఫక్కీలో సవాలు విసిరారు. అయితే ఇప్పుడు ఆయన విసిరిన సవాలు కాదు, ఆ సవాలుకు తెరాస స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్’ను మాత్రమే నిందిస్తున్నారు, కానీ, దళితులకు ఏమీ చేయని, ఇచ్చిన ఏ హామీని నిలుపుకోని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు.  కేంద్రాన్ని, ప్రధాని మోడీని  పన్నెత్తు మాట అనరా, అనే ధైర్యం మాజీ ఐపీస్ కు లేదా? అంటూ తెరాస నేతలు ప్రవీణ్ కుమార్ ను నిలదీశారు. అంతేకాదు  ప్రవీణ్ కుమార్ తప్పు చేశారు, హిందూ వ్యతిరేకతను ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు, ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. అందుకే, రాజీనామా చేశారు, రాజీనామా చేసినా కేంద్ర తలచుకుంటే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అందుకే ఆయన కేంద్రానికి భయపడుతున్నారు. దాసోహం అంటున్నారు. కేంద్రాన్ని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తున్నారు, అంటూ తెరాస నేతలు ప్రవీణ్ కుమార్ పై ఎదురు దాడి చేస్తున్నారు.  అయితే ఒక వేలు ప్రవీణ్ కుమార్ వైపు చూపితే, నాలుగు వేళ్ళు తమ వైపు చుస్తాయనే విషయం తెరాస నాయకులు గుర్తించలేక పోతున్నారని అంటున్నారు. అది కూడా ఇంకెవరో కాదు తెరాస నాయకులే అంటున్నారు. ప్రవీణ్ కుమార్, నిజంగా భయపడుతున్నారో లేదో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఎన్ని బింకాలు పోయినా, లోలోపల కేంద్రానికి దాసోహం అంటారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, ఏమి తప్పులు చేశారో ఏమో కానీ,  కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్’షాను విమర్శించడం లేదు. అంతే కాదు, రాజకీయ, వ్యక్తి గత విమర్శల విషయం పక్కన పెట్టినా, కేంద్ర ప్రభుత్వ విధానాల విషయంలోనూ తెరాస ప్రభుత్వం రాజీ పడుతోందనే విమర్శలున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. రైతు సంఘాలు ఇచ్చిన భారత బంద్ కు తెరాస మద్దతు నిచ్చింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర  ప్రజాప్రతినిధులు. నాయకులు రోడ్లెక్కారు, రాస్తా రోకోలో పాల్గొన్నారు. కానీ జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత హడావిడిగా ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ టోన్ మారిపోయింది.  అలాగే దుబ్బాక ఎన్నికల సందర్భంగా, ఆతర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, ఒక సారి ఢిల్లీ వెళ్ళివచ్చిన వెంటనే ఆ విషయమే మరిచి పోయారు. అప్పట్లో విపక్షాలు, ముఖ్యమంత్రిని విమర్శించడం కాదు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అయినా, తెరాస నాయకులు రియాక్ట్ అయ్యే సాహసం కూడా చేయలేదని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఈడీ, సిబిఐ అస్త్రాలను ప్రయోగించి, విపక్షాల నోరు నొక్కేస్తుందని, మీడియాను మాట్లాడకుండా చేస్తోందన్న విమర్శలు వినిపించినంతగా చర్యలు కనిపించడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అభార్ధులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా, 42 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి, కానీ, ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిపై చర్యలు లేవు. చర్యల సంగతి దేవుడెరుగు, విచారణ అయినా ప్రారంభమైందా లేదా అనేది అనుమానమే.నిజానికి కేసుల విచారణ పూర్తయ్యే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది.  మరో వైపు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అప్పుడప్పుడు రెచ్చిపోయి హెచ్చరికలు చేస్తారు. తెరాస ప్రభుత్వ అవినీతి, అక్రమాల చిట్టా తీస్తున్నామని,  రేపో మాపో కేసీఆర్’ను జైలుకు పంపడం ఖాయమని అంటుంటారు. కానీ, రేపో మాపో మాత్రం అదేమిటో ఎప్పటికీ రాదు. ఎందుకు రాదో అందరికీ తెలుసు, గల్లీలో గోలచేసే నాయకులు, ఢిల్లీ వెళితే ఎలా ప్రవర్తిస్తారో, అందరికీ తెలిసిన విషయమే..