ఎంపీ పదవికి కోమటిరెడ్డి రాజీనామా? టీఆర్ఎస్ కు మద్దతు? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నేతలు అనూహ్య నిర్ణయాలతో కాక రేపుతున్నారు. హాట్ కామెంట్లతో హీట్ పెంచుతున్నారు. వివాదాస్పద, సంచలన ప్రకటన చేయడంలో ముందుంటారు కాంగ్రెస్ సీనియర్ నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్. సొంత పార్టీపైనే ఆరోపణలు చేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలకు సపోర్టుగా మాట్లాడుతుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అవకాశం లేదని గతంలో  కామెంట్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే.. పీసీసీ పోస్టును కొనుగోలు చేశారని వ్యాఖ్యానించి కాకా రేపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  తాజాగా మరోసారి సంచలన ప్రకటన చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తానని కూడా ప్రకటించి సంచలనానికి తెర లేపారు. అయితే వీటిన్నంటికి  ఓ కండీషన్ పెట్టారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ... వాసాలమర్రిలాగే నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు చేయాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో రోడ్లు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయమని, కావాలంటే బాండ్ రాసి ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను పోటీ చేయకుండా ఉండటమే కాదు.. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తానని కూడా కోమటిరెడ్డి ప్రకటించారు. చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివిధ పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంటేనే.. ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో మాట్లాడతానని అన్నారు. హిట్లర్ బతికుంటే.. కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులకు క్యాబినెట్‌లో స్థానం లేదని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసని చెప్పారు. ఎంపీ స్థానంలో ఉంటూ.. రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని ఆయన పేర్కొన్నారు.

సీజేఐ సీరియస్ తో సీబీఐ దూకుడు... వైసీపీలో  హైటెన్షన్ 

న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ఘాటు వ్యాఖ్యల ప్రభావం కనిపిస్తోంది.సీజేఐ  అసహనం వ్యక్తం చేయడంతో.. దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇలాంటి కేసుల్లో దూకుడు పెంచాయి. అరెస్టులు చేస్తున్నాయి. ఏపీలో జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ  మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. పి. ఆదర్శ్‌, ఎల్‌. సాంబశివరెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.  జడ్జీలపై వ్యాఖ్యల కేసులో ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో జులై 28న కొండారెడ్డి, సుధీర్‌.. జులై 9న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఎంపీ నందిగం సురేశ్‌, ఆమంచి కృష్ణ మోహన్‌ పాత్రను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నట్లు పేర్కొంది వైసీపీ అభిమానులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ... సోషల్‌ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది.  ఇప్పటికే తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపీ నందిగం సురేశ్‌, ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. జడ్జీలపై వ్యాఖ్యల కేసులో  సీబీఐ వేగం పెంచడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిందనే  ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇంకా ఎంత మంది అరెస్టు అవుతారోనన్న ఆందోళనలో నేతలు ఉన్నారు. మరోవైపు జడ్జీలపై అసభ్య పదజాలంతో దూషించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది. అలా అయితేనే ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అలుపెరగని అమరావతి పోరుకు ఫలితమెప్పుడు?

అది ఒక స్వప్నం.. మరొకరికి పీడకల. కొందరు సాకారం చేసుకోవాలని పోరాటం చేస్తున్నారు. ఆ స్వప్నాన్ని నలిపేయాలని అధికారంలో ఉన్నవారు ఆరాటపడుతున్నారు. ఆ పీడకల కనపడకుండా పోవాలని..కనుమరుగైపోవాలని.. కొత్తగా కలలు కంటున్నారు అధినేతలు. అది నీ వల్ల కాదు.. నీ తరం కాదు.. మా తరమే కాదు.. భావితరాలు కూడా పోరాడుతూనే ఉంటాయని.. సవాళ్లు విసురుతున్నారు ఆ ఉద్యమకారులు. ఎవరు గెలుస్తారో తెలియదు గాని.. ఆ పోరాటానికి 600 రోజులు నిండాయి. ఆరు వందల రోజుల నుంచి అలుపెరగకుండా వారు ఉద్యమిస్తూనే ఉన్నారు. అంతకంటే వేగంగా అణచివేత ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అమరావతి. అనుకున్నట్లే జరిగి ఉంటే.. అదో అద్భుత నగరం అయి ఉండేది. కాని జగన్మాయ ఫలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చుంది. అయినా ఆ స్వప్నం ఆగదనుకున్నారు.. ఎందుకంటే జగనన్న నేను ఇక్కడే ఉంటున్నా ఇల్లు కట్టుకుంటున్నా.. అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకే ఇక్కడ సొంతిల్లు లేదు. అందుకే జనం నమ్మారు. కాని జగన్ ఎప్పుడూ అమరావతి అనే పదాన్ని కూడా తన నోటితో ఉచ్ఛరించలేదన్న విషయాన్నిఎవరూ గమనించలేదు. ఎన్నికల ముందు ప్రచారంలో అయినా.. అధికారంలోకి వచ్చాక అయినా.. సరే ఎవరైనా ప్రశ్న వేస్తే ..ఆ ప్రశ్నలో అమరావతి ఉంది తప్ప.. ఈయన జవాబులో కుంభకోణం అనే వస్తుంది తప్ప అమరావతి అని ఎప్పుడూ ఇప్పటికీ అనలేదు. ఆఖరికి మూడు రాజధాను ప్రకటనలో సైతం.. ఇక్కడ అన్నాడే తప్ప.. అమరావతిలో శాసనరాజధాని అని అనలేదు. అంతగా దానిపై ద్వేషాన్ని పెంచుకున్న జగన్.. ముందు అమరావతిలో పనులు ఆపేశారు. అవినీతి అంటూ విచారణ అన్నారు.. ఇప్పటివరకు ఏం తేల్చలేదు.. కాని పనులు ఆగిపోయాయి. అమరావతి ఆగిపోయింది. ఇక మూడు రాజధానుల ప్రకటన చేశాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. అమరావతిని ఉంచరని.. దీంతో అమరావతికి తమ ప్రాణమైన భూములనే ఇచ్చేసి.. తమ భావి తరాలు బాగుపడతాయని ఆశపడ్డ రైతులు భగ్గుమన్నారు. డిసెంబర్ 17 2019న మొదలైన ఆ నిరసన.. నేటికీ సాగుతూనే ఉంది. పొలం మట్టిలో ఆనందంగా వేసిన అడుగులు.. నడిరోడ్డుపై చెప్పులు కూడా లేకుండా కాళ్లు కాలేలా తిరుగుతున్నాయి. వ్యవసాయంలో చేదోడుగా ఉండి.. కమ్మగా వంట చేసే చేతులు పిడికిళ్లు బిగించి మరీ.. నడిరోడ్డుపై నిలబడ్డారు. వ్యవసాయం, భర్త, పిల్లలు.. పండగలు తప్ప ఇంకోటి ఎరుగని ఆ మహిళలు పోలీసుల లాఠీ రుచి చూడాల్సి వచ్చింది. రోడ్డుపై బూట్లతో తొక్కినా పడ్డారు. అరెస్టులు చేసి కులం పేరుతో దూషించినా.. భరించారు. కాని బిగిసిన ఆ పిడికిలి మాత్రం సడలలేదు. నినదించిన ఆ స్వరం మూగబోలేదు. అమరావతి రాజధానిగా కొనసాగితే తప్ప.. మండుతున్న ఆ గుండెలు చల్లారేలా లేవు. చెంబు, నీళ్లు తెచ్చి అద్భుత రాజధాని నిర్మిద్దామన్న పెద్దమనిషి మోదీ ఇప్పుడు అసలు ఇటే చూడటం లేదు. మాట కూడా మాట్లాడటం లేదు. మేం వస్తే ఇదే రాజధాని అంటున్నారు తప్ప...జగన్ చేసేది తప్పు అని మాత్రం బిజెపివారు అనటం లేదు. పోరాడతానన్న పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం అండగా నిలబడ్డాయి.  అమరావతి రైతులు మాత్రం కొడవలి లాంటి చేతులను ఎక్కుపెట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నారు. 600 కాదు 6000 రోజులైనా పోరాడతాం.. ఈ అమరావతిని రాజధానిగా చేసే వరకు వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ స్ఫూర్తిని అభినందించాల్సిందే... ఆ పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే.. అలాంటి పోరాటానికి అండగా నిలబడాల్సిందే. మళ్ళీ ఎన్నికలు జరిగి.. ఫలితాలొచ్చేవరకు .. ఈ పోరాట ఫలితం ఏంటో తెలిసే అవకాశమైతే లేదు.

దమ్ముంటే హుజురాబాద్ లో పోటీ చేయ్.. కేసీఆర్ కు ఈటల ఓపెన్ ఛాలెంజ్

తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ సవాల్ చేశారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో చూసుకుందాం రమ్మంటూ సవాల్ చేశారు.  వస్తవా.. రా.. హరీశ్ ఇక్కడ పోటీ చేద్దాం.  వస్తవా.. రా.. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటల. బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని అనుకుంటున్నారేమో.. నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా  హుజురాబాద్ తో తన గెలుపును ఆపలేరని తేల్చి చెప్పారు ఈటల రాజేందర్.  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ లో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.  హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన యూత్ నాయకులు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఈటల రాజేంజర్.. కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా..  వాళ్ల గుండెళ్లో తానే ఉన్నాన్నారు రాజేందర్. ప్రజల ఓట్లతో వచ్చిన  పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారని హెచ్చరించారు.  ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేయడానికి సిద్దమయ్యారని అన్నారు. గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు అని ప్రశ్నించారు. దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదన్నారు రాజేందర్.  హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్ అంటూ మండిపడ్డారు ఈటల. దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలని సవాల్ చేశారు. ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతని, ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే తన మీద కేసీఆర్ కోపం పెంచుకున్నారని రాజేందర్ చెప్పారు. కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు.. ఆ సొమ్మంతా మీదే తీసుకోండని ప్రజలకు పిలుపిచ్చారు. తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు... అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈటల రాజేందర్.  

అమ‌రావ‌తిలో హైటెన్ష‌న్‌.. పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌.. త‌గ్గేదే లే అంటున్న రైతులు..

అమ‌రావ‌తిలో తీవ్ర ఉద్రిక్త‌త‌. రైతులు వ‌ర్సెస్ పోలీసులు. మ‌హిళ‌లు వ‌ర్సెస్ ఖాకీలు. ఇనుప కంచెలు, ఖాకీల లాఠీల‌కు వెర‌వ‌కుండా రాజ‌ధాని వాసులు రోడ్డెక్కారు. అమ‌రావ‌తి ఉద్య‌మం 600 రోజుల‌కు చేరిన సంద‌ర్భంగా నిర‌స‌న ర్యాలీల‌తో హోరెత్తారు. భారీగా మోహ‌రించిన పోలీసుల‌కు ఉద్య‌మ సెగ రుచి చూపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల ఆంక్ష‌లు కొనసాగుతున్నాయి. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మందడం, వెంకటపాలెంలో తీవ్ర‌ ఉద్రిక్తత  నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామంలోని రోడ్లను దిగ్బంధించారు. మందడంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు- రైతులు, పోలీసులు-మహిళల మధ్య తోపులాట జరిగింది.  అమ‌రావ‌తి ఉద్య‌మ‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ అనంతవరంలో రోడ్డుపై మహిళలు, రైతులు భైఠాయించడంతో హైటెన్ష‌న్ నెల‌కొంది. రాజ‌ధాని గ్రామాల‌న్నీ స్థానికుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్నాయి. కడుపు మండిన రైతుల ప‌ద‌ఘ‌ట్ట‌న‌లో ఖాకీల బూట్ల చ‌ప్పుడు స‌ద్దుమ‌నిగింది. 

పులిచింతలలో భూకంపం.. ప్రాజెక్టుకు ప్ర‌మాదం..?

ఓవైపు పులిచింత‌ల‌పై రాజ‌కీయ ప్ర‌కంప‌ణలు.. ఇదే స‌మ‌యంలో పులిచింత‌ల ప్రాంతంలో భూప్ర‌కంప‌ణ‌లు.. ప్ర‌కృతి ప‌గ బ‌ట్టిన‌ట్టుంది. పులిచింత‌ల‌తో ఆటాడుకుంటోంది. ఉన్న‌ట్టుండి ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. బంగారు పంట‌లు పండించాల్సిన జ‌లం.. వృధాగా స‌ముద్రం పాలైంది. చుట్టుప‌క్క‌ల గ్రామాల‌ను ముంపు భ‌యంతో వ‌ణికించింది. పులి..చింత‌ల‌కు రాజ‌కీయ అవినీతే కార‌ణ‌మంటూ ర‌చ్చ మొద‌లైంది. నాసిర‌కం ప‌నుల‌తోనే గేటు ఊడిందంటూ ర‌గ‌డ జ‌రిగింది. ఆ పాపం మీదంటే మీదంటూ పార్టీలు నీళ్లెత్తి పోసుకుంటున్నాయి. ఆ నీటిమంట‌లు స‌ల‌స‌ల కాగుతుండ‌గానే.. .పులిచింత‌ల మ‌రోసారి ఉలిక్కిప‌డింది. ఈసారి భూకంపం అందుకు కార‌ణ‌మైంది.  గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల వరకు భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్యశాస్త్రవేత్త శ్రీనగేశ్‌ తెలిపారు. మూడు సార్లు భూమి కంపించినట్టు చెప్పారు.  భూకంపలేఖినిపై ప్ర‌కంప‌ణ‌ల‌ తీవ్రత 3.0,  2.7,  2.3గా నమోదైనట్లు ఆయన వివరించారు. పులిచింతలతోపాటు తెలంగాణ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ భూ ప్రకంపలను వచ్చాయి. గత వారం రోజులుగా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. భూకంప‌ణాల‌తో పులిచింతల ప్రాజెక్టుకు ఏమైనా ప్ర‌మాదం ఉందా అనే దిశ‌గా అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.

భార‌త బాహుబ‌లి.. ఆనంద్‌ మహీంద్రా బహుమతి ఇది..

ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం సాధించి ప్ర‌పంచ‌ బాహుబ‌లిగా నిలిచాడు నీర‌జ్ చోప్రా. ఈటె విస‌ర‌డంలో భారతీయుల‌కు సాటి మ‌రెవ‌రూ లేర‌ని నిరూపించాడు. అందుకే, భ‌ళి భ‌ళిరా అంటూ నీర‌జ్‌ను బాహుబాలితో పోలుస్తోంది యావ‌త్ భార‌తం. నీర‌జ్ చోప్రా జావెలిన్ విసిరే ఫోటోతో పాటు బాహుబ‌లిలో ప్ర‌భాస్ ఈటె విసిరే పిక్‌ను జ‌త చేసి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు ఆనంద్ మ‌హీంద్రా. జ‌స్ట్.. ట్వీట్ కాదండోయ్‌.. ఓ మాంచి బ‌హుమ‌తి కూడా ఇచ్చేశారు.. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ బహుమతి ప్రకటించారు. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న XUV 700 మోడల్‌ వాహనాన్ని అతడికి బహుమతిగా ఇవ్వనున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.   ‘‘మేమంతా నీ సైన్యంలో ఉన్నాం.. బాహుబలి’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈటెను విసురుతున్న నీరజ్‌ చోప్రా ఫొటోతో పాటు.. తన వెనక భారీ సైన్యంతో.. చేతిలో ఈటెను పైకెత్తి గుర్రంపై వస్తున్న ప్రభాస్‌ ఫొటోను షేర్‌ చేశారు.  ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌కు బదులిస్తూ నీరజ్‌కు XUV 700 బహుమతిగా ఇవ్వాలంటూ ఓ నెటిజ‌న్ కోరాడు. అతడి ట్వీట్‌కు రిప్లైగా.. ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. తన సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగులను ట్యాగ్‌ చేస్తూ.. నీరజ్‌ కోసం ఓ XUV 700 మోడల్‌ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. ఆనంద్ మ‌హీంద్రా నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూ నెటిజ‌న్లు రీట్వీట్ల‌తో అభినందిస్తున్నారు.

600 అల‌జ‌డి.. సంకెళ్ల‌తో స‌మ‌రాన్ని ఆప‌గ‌ల‌రా? ప్ర‌భుత్వం ప‌డిపోతే మంచిరోజులు రావా?

అమ‌రావ‌తి. న‌వ్యాంధ్ర‌ క‌ల‌ల రాజ‌ధాని. అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రం. ఆంధ్రుల నిండు గౌర‌వం. అలాంటి అమ‌రావ‌తితో మూడుముక్క‌లాట ఆడుకున్నారు పాల‌కులు. అద్బుత న‌గ‌రంగా విలసిల్లాల్సిన రాజ‌ధానిని.. అడ్ర‌స్ లేకుండా చేశారు. ప్ర‌జ‌లు వ‌ద్దంటున్నా.. హైకోర్టు కుద‌ర‌దంటున్నా.. ప్ర‌భుత్వం మాత్రం మంకు ప‌ట్టు వీడ‌టం లేదు. అమ‌రావ‌తిని నాశ‌నం చేసేవ‌ర‌కూ వ‌దిలేది లేదంటూ స‌ర్కారు పంతానికి పోతోంది. 33 గ్రామాలు, అక్క‌డి వారు చేసిన‌ త్యాగాలు, కోట్లాది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు.. అన్నిటినీ నిర్బంధంతో, కేసులు, కుట్ర‌లు, కుతంత్రాల‌తో.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఉక్కుపాదం మోపుతోంది సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు.    గోడ‌కు కొట్టిన బంతిలా.. అమ‌రావ‌తి ప్ర‌జ‌లు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డుతున్నారు. అలుపు, సొలుపు లేకుండా 600 రోజులుగా ఉద్య‌మిస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌లు, విన్న‌పాలతో అమ‌రావ‌తి నినాదాన్ని వారి భుజాల‌పై మోస్తున్నారు. సీఎం జ‌గ‌న్ మారుతాడ‌నే న‌మ్మ‌కం వారిలో ఏ కోశాన లేదు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మార‌బోతోంద‌నే ఆశనే వారిలో మ‌రింత ఉత్సాహం నింపుతోంది. కేంద్రంలో వేగంఆ మారుతున్న ప‌రిణామాలు, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు తీర్పుతో.. అమ‌రావ‌తివాసుల్లో మ‌నోధైర్యం పెరుగుతోంది. మ‌ళ్లీ మంచి రోజులొస్తాయ‌నే న‌మ్మ‌కంతో.. 600 రోజుల ఉద్య‌మాన్ని రెట్టింపు జోష్‌తో జ‌రుపుతున్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరనున్న సందర్భంగా ’న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట బైక్‌ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు హైకోర్టు వద్ద నిర్మాణంలో ఉన్న జడ్జిల క్వార్టర్స్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించాల‌నేది షెడ్యూల్‌. అయితే, రాజధాని ప్రాంతంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. గ్రామాల్లో ఇనుప కంచెలు ఏర్పాటుచేశారు.  రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. పెదపరిమి ద‌గ్గ‌రే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు.  మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు.  పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అమరావతిని అంతం చేసేందుకు వైసీపీ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో చేధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం...బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు.  ‘‘రోడ్లను సయితం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తామని ఆనందపడుతున్న జగన్ రెడ్డి గారూ! మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు.. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

మోడీ దూకుడుకు కళ్ళెం.. విపక్షాలదే విజయం! 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు విజయం సాధించాయి. దిగ్విజయంగా సభా కార్యక్రమాలను స్తంభింప చేశాయి. ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలనుకున్న కీలక అంశాలు, ఏవీ ప్రస్తావనకు రాలేదు. పైగాసస్’ ఒక్కటే ఇష్యూగా ఇంతవరకు సభ సమయం  పుణ్యకాలం ముగిసిపోయింది. ప్రతిపక్షాల మంకు పట్టును ప్రజలు హర్షిస్తారా, ఆమోదిస్తారా అనే విషయాన్నిన్ని పక్కన పెడితే, మొత్తానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడంలో  చాలా వరకు సఫల మయ్యాయి. మోడీ దూకుడుకు కళ్ళెం వేయగాలిగాయి.   మరో వంక సభలోపల వెలుపలా కూడా ప్రతిపక్షాలు ఐక్యతను చూపగలిగాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తొలిసారిగా, కాంగ్రెసేతర విపక్షాలతో మాట కలిపారు. విపక్షాల ఉమ్మడి వ్యూహా సమావేశాలలో చురుగ్గా పాల్గొన్నారు. బహుసా మొదటిసారి, స్వయంగా రాహుల్ విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు.  పార్లమెంట్’కు ఒక రోజు రైతుల ఆందోళలను హై లైట్ చేస్తూ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ, మరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను హైలైట్ చూస్తూ సైకిల్ మీద వచ్చి మీడియా ఫోకస్ ను తమ వైపుకు తిప్పుకున్నరు ఈ సమావేశాలలో రాహుల్ గాంధీ, ఎన్నో కొన్ని అదనపు పాయింట్స్  అయితే కొట్టేశారు. రాహుల్ నాయకత్వాన్ని అందరూ కాకపోయినా కొందరైనా ఆమోదించారు. పార్లమెంట్ సమావేశాలు మరో నాలుగు రోజులు జరుగుతాయి... ఈనాలుగు రోజుల్లో బ్రహ్మాండం ఎదో జరిగితే ఏమో కానీ, లేదంటే చివరాఖరుకు, పార్లమెంట్ వర్షాకాల సంవేశాలలో ప్రతిపక్షాలు పై చేయి సాధించాయి, అనే మాటే జనంలోకి వెళుతుంది. కొవిడ్ సెకండ్ వేవ్’కు చెక్ పెట్టడంలో మొదలైన మోడీ ప్రభుత్వ వైఫల్యాల చిట్టాలో పార్లమెంట్’ ప్రహసనం కూడా వచ్చి చేరుతుంది.  ఒక విధంగా పార్లమెంట్ లోపల వెలుపలా జరుగుతున్న పరిణామాలు. అధికార కూటమిని మరీ ముఖ్యంగా బీజేపే నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అందుకు సంకేతమే అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు, ఇంతక ముందు ఎప్పుడూ లేని విధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేమంగళ వారం నుంచి మూడు రోజుల పాటు, తమ మంత్రి మండలి సభ్యులో  సమావేశాలు కాదు, ఏకంగా సమ్మేళనమే నిర్వహిస్తున్నారు. ప్రదాన మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించి నెలరోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని. మిగిలి మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం అనుసరించవలసిన వ్యూహం, అదే విధంగా  మూడేళ్ళ తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటుగా,  2022 లో వచ్చే వివిధ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై కూడా కూలకషంగా చర్చించి, విధానాలను ఖరారు చేస్తారని సమాచారం. అదే  విధంగా, ఈ నెల రోజుల్లో కొత్త మంత్రుల పనితీరును కూడా సమీక్షిస్తారు. లక్ష్యాలను నిర్దేశిస్తారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆగష్టు 16 నుంచి కేంద్ర మంత్రులు తమ తమ రాష్ట్రాలలో పర్యటించాలని పార్టీ ఆదేశించింది. ఈ పర్యటనలలో పార్లమెంట్ ద్వారా ప్రజల ముందు ఉంచాలనుకుని, విపక్షాలు సభను సాగనీయక పోవడం వలన చెప్పుకోలేక పోయిన విషయాలను ప్రజల  ముంచుతారని, పార్టీ వర్గాల సమాచారం, ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల ఏకైక మంత్రి కిషన్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు.  ఇంతవరకు కారణాలు ఏవైనా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా మొదలు కేంద్ర మంత్రులు, బీజీపే నాయకులు విపక్షాలు విసురుతున్న సవాళ్ళకు సమాధానం ఇవ్వడం లేదు. అయితే, ఇక ఎదురు దాడి చేయక తప్పదని లేదంటే ప్రజలలో ఇంకా ఇంకా పలచన అవుతామని బీజేపీ పెద్దలు గుర్తించారు. సంఖ్యాబలం అండగా పార్లమెంట్ వేదికగా విపక్షాల మీద విరుచుకు పడేందుకు పక్కా వ్యూహంతో సిద్దమైనా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి  ఒక రోజు ముందు, వచ్చిపడిన పైగాసస్  హ్యాకింగ్ దుమారంలో ఆ ఎజెండా కొట్టుకు పోయింది. అందుకే, నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని, కమల దళం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మందు గూడును ప్రధాని మోడీ బీజీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు అందించారు. విపక్షాల తీరును ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. విపక్షాలు పార్లమెంట్’ను అడ్డుకోవడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడమే, ప్రజలను అవమానించడమే అని ప్రధాని పేర్కొన్నారు.  పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయడం వలన ప్రజల సంస్యలు చర్చకు రాకపోవడంతో పాటుగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ప్రధాని పేర్కొన్నారు. ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని ఎంపీ లను ఆదేశించారు. ఒక విధంగా చూస్తే విపక్షాలపై  దండయాత్రకు కమల దళం, మోడీ సేన సిద్డంవుతున్నాయి. అయితే, కొవిడ్ సెకండ్ వేవ్ మొదలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు ఒకటొకటిగా క్యూ కట్టి బయటకు వస్తున్నాయి. అన్నివర్గాల ప్రజలు ఏదో ఒక విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజులు, కార్మికులు , వివిధ రంగాల ప్రైవేటు ఉద్యోగులు ఉపాధి కోల్పోయి, ఆదాయాలు కుదించుకుపోయి, పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు, మంత్రులు, ఎంపీలు ఇచ్చే ఊక దంపుడు ఉపన్యాసాలు,ఊరటనిస్తాయా.. ప్రజల ఆగ్రహాన్ని చల్లారుస్తాయా .. చూడాలి..

ప్రకాశం వైసీపీలో వర్గపోరు.. చీరాలలో కరణం వర్గీయులపై దాడి

ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంటోంది. మరోసారి అధికార పార్టీ కార్యాకర్తలు నడిరోడ్డుపైనా బాహాబాహీకి దిగారు. చీరాల నియోజకవర్గంలో వైసీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. చీరాల మండలంలోని గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే  గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన వివాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుంది. రెచ్చిపోయిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే, పోలీసులు సర్దిచెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. అధికార పార్టీ నేత బుర్ల మురళి ఈ ఘటనపై ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొందరు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాంకృష్ణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలోనూ చాలా సార్లు రెండు వర్గాలు గొడవకు దిగాయి. గత ఎన్నికల్లో ఆమంచి వైసీసీ నుంచి పోటీ చేయగా.. కరణం బలరామకృష్ణమూర్తి  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రమంతై వైసీపీ గాలీ వీచినా.. చీరాలలో మాత్రం కరణం విజయం సాధించారు. అయితే తర్వాత కొన్ని రోజులకే కరణం వైసీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కరణం, ఆమంచి మధ్య సయోధ్యకు సీఎం జగన్ ప్రయత్నించినా కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందని అంటున్నారు.   

తిట్ల‌లో పీహెచ్‌డీ చేశారా? ఆ పంచ్‌లు ఏందిరా బాబోయ్‌..

సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది ఎవ‌రు? నిత్యం తిట్లు, బూతుల‌తో విరుచుకుప‌డేది ఎవ‌రు? మొబైల్ ఓపెన్ చేస్తే.. మాట‌ల‌తో కంపు రేపేది ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్స్ చాలా చాలా సింపుల్‌. కాస్త అప్‌డేట్‌లో ఉండే వారెవ‌రైనా ఈజీగా చెప్పేయొచ్చు. రెండు గ్రూపులు సోష‌ల్ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉంటాయి. పోటాపోటీగా రెచ్చిపోతుంటాయి. ప్ర‌త్య‌ర్థుల‌ను మాట‌ల‌తో, తిట్ల‌తో, బూతుల‌తో ర‌చ్చ రంబోలా చేస్తాయి. అందులో నెంబ‌ర్ వ‌న్‌.. జ‌గ‌న్ బ్యాచ్‌. వైసీపీ పెయిడ్ గ్రూప్స్‌. ముద్దుగా పేటీఎమ్ బ్యాచ్‌ల‌ని కూడా అంటారు. ఇక సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయే సెకండ్ బ్యాచ్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌. త‌మ నాయ‌కుడిని ప‌ల్లెత్తి మాట అన‌కుండానే.. అంటారేమోన‌నే అనుమానం వ‌చ్చినా.. ఇక అంతే సంగ‌తులు. అభిమానం పేరుతో జ‌న‌సైనికులు చేసే ఓవ‌రాక్ష‌న్ అంతాఇంతా కాదు. సోష‌ల్ మీడియాలో ఇటు జ‌గ‌న్ బ్యాచ్‌, అటు పీకే గ్రూప్స్ చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు మ‌రి.  ఇక మెగా ఫ్యాన్స్‌కి వాళ్ల పాత నాయ‌కుడు ప‌ర‌కాల ప్రభాక‌ర్‌తో అస్స‌లు పొస‌గ‌దు. మెగా లీడ‌ర్‌ను ఆడిపోసుకున్నార‌నే అక్క‌సుతో ప‌ర‌కాల టాపిక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెడుగుడు ఆడుకుంటుంటారు మెగా అభిమానులు. అయితే, హుందాగా క‌నిపిస్తూ, ప‌ద్ద‌తిగా మాట్లాడిన‌ట్టు అనిపించే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లేటెస్ట్‌గా పీకే ఫ్యాన్స్ దారిలోనే న‌డుస్తున్న‌ట్టున్నారు. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త‌.. ఒక‌ప్ప‌టి ప్ర‌జారాజ్యం లీడ‌ర్‌.. గ‌త ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. ప్ర‌స్తుతం ఏ పార్టీలో ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలీని.. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌.. వారం రోజులుగా ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. పీకే ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. జ‌న‌సైనికుల‌కు దిమ్మ‌తిరిగేలా వారి భాష‌లోనే పంచ్‌ల‌తో పిచ్చెక్కిస్తున్నారు. ప‌ర‌కాల ట్వీట్లు మామూలుగా ఉండ‌టం లేదు. అయితే, ఎక్క‌డా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు గానీ, వారి ఫ్యాన్స్ అనిగానీ నేరుగా అన‌కుండా.. ప‌రోక్షంగా జ‌న‌సైనికుల‌ను ట్వీట్ల‌తో కుమ్మేస్తున్నారు. మాంచి మ‌సాలా ద‌ట్టించి.. నూనెలో స‌ల‌స‌లా కాగేలా క‌ర్రు కాల్చి వాత‌పెడుతున్నారు. ప‌ర‌కాల ఫేస్‌కు.. ఆయ‌న చేస్తున్న ట్వీట్ల‌కు అస్స‌లు సింక్ అవ‌డం లేదు. డౌట్ ఉంటే మీరూ ఓసారి ఆ ట్వీట్ల‌పై ఓ లుక్కేయండి... ఆ పంచ్ ప‌టాకాలు ఎలా పేలుతున్నాయో చ‌దివేయండి.. ఇటీవ‌ల‌ ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పెట్టిన ట్వీట్ ఇది.... ఇంకా గోక్కుంటున్న గ‌జ్జి బ్యాచ్‌కు అంటూ మ‌రో ట్వీట్‌.. ఇంకా ఇక్క‌డిక్క‌డే తిరుగుతున్న గ‌జ్జి బ్యాచ్‌కి ఇవాళ్టి డోస్ అంటూ మ‌రో ట్వీట్‌.. ఇంకా ఆ మూలా, ఈ మూలా త‌చ్చాడుతున్న పిత్త‌ప‌రిగి సైన్యానికి అంటూ మ‌రో పంచ్‌.. పాపం అక్క‌డ‌క్క‌డా మూలుగుతూ ప‌డిఉన్న పిత్త‌ప‌రిగి సైన్యానికి.. ఈ సీజ‌న్ చివ‌రి డోస్.. మ‌ళ్లీ ఈ ఛాయ‌ల‌కొచ్చారో.. ఖ‌బ‌డ్దార్‌! అంటూ త‌న ట్వీట్ల‌కు క్రాఫ్ హాలిడే ప్ర‌క‌టించేశారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌..  

మహా ‘మేత’ దే పులిచింతల పాపం?.. ఇదిగో సాక్ష్యం.. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న  పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన  దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గేటు కొట్టుకుపోవడంతో అధికార వైసీపీ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో  ఆ నెపాన్ని గత టీడీపీ ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు వల్లే పులిచింతల ప్రాజెక్టు  నాసిరకం నిర్మాణంగా మిగిలిందని వైసీపీ నేతలంటున్నారు.  వైసీపీ నేతలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ అనే మహానేత…ప్రాజెక్టుల పేరుతో మేత మేశాడు తప్ప ఏమీ చెయ్యలేదని, అందుకే పులిచింతల సహా ఆయన హయాంలో కట్టిన అనేక ఫ్లై ఓవర్లు,అనేక ప్రాజెక్టులు నాసిరకంగా మారాయని ఆధారాలతో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. పులిచింతల డిజైన్లను చంద్రబాబు కాంట్రాక్టర్ మార్చారని, గేట్లు తగ్గించాడని, దాని వల్లే ఈరోజు గేటు ఊడిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం అనడానికి 2006 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల రికార్డులే సాక్ష్యమని టీడీపీ నేతలు నిరూపిస్తున్నారు. 2006, ఫిబ్రవరి 25 అసెంబ్లీ రికార్డ్ నంబర్ 6301 ప్రకారం పులిచింతలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభ వాయిదా పడింది. కాంట్రాక్టర్ డ్యామ్ డిజైన్స్ కాంక్రీట్ నుండి మట్టికి మార్చారని, గేట్లు తగ్గించారని నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో గొడవ చేస్తే సమాధానం చెప్పలేక సభను వాయిదా వేసి నాటి సీఎం వైఎస్సార్ వెకిలి నవ్వులు నవ్వారని ఆరోపిస్తున్నారు. డిజైన్లు మారిస్తే ఏమీ కాదంటూ వైఎస్ చెప్పారని,  కాంట్రాక్టర్ కి దాదాపు 50 కోట్లు మిగిలిందని ఆరోపిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పనుల నిర్వహణలో కాంట్రాక్టరుకు రూ.56.52 కోట్ల అనుచిత లబ్ది చేకూరింది'' అని 2009-10లో కాగ్‌ వైఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.  ఆ తర్వాత మాజీ సీఎం రోశయ్య హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ హయాంలో రెండు సార్లు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయి చివరకి సగం గేట్లతో ప్రాజెక్టు ఓపెన్ చేశారు.  అయితే నాసిరకం నిర్మాణం అంటూ కిరణ్ ప్రభుత్వం కాంట్రాక్టర్ పై కోర్టులో కేసు వేసింది. కానీ జలయజ్ఞం క్లాజుల వల్ల కాంట్రాక్టరే గెలిచాడు. దీంతో, 2014లో కాంట్రాక్టర్ కి 120 కోట్లు పరిహారం చెల్లించాలని కిరణ్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ నాసిరకం ప్రాజెక్టులో 8 టిఎంసిలకు మించి నీరు నిల్వ ఉంచకూడదని సీడబ్ల్యూసీ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ప్రభుత్వంపైనా కాంట్రాక్టర్ గెలిచారు. దీంతో, కోర్టులకి వెళ్లటం దండగని రూ.190 కోట్లు రిలీజ్ చేసి, భూసేకరణకు రూ.70 కోట్లిచ్చి ఆ కాంట్రాక్టర్ కు దండం పెట్టారు చంద్రబాబు.ఆ తర్వాత వేరే కంపెనీతో పనులు చేయించి 2017 నాటికి 20 టిఎంసీల సామర్థ్యం తెచ్చిన ఘన చంద్రబాబుది. 2018 కల్లా ఫుల్ స్టోరేజ్ కి వచ్చేలా పనులు పూర్తి చేసింది చంద్రబాబు సర్కార్. అయితే బేస్ డిజైన్ మారలేదు కాబట్టి…ఎన్నికోట్లు పెట్టినా పులిచింతల అతుకుల బొంతగానే మిగిలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం, ఈ నాసిరకం పనులు దృష్టిలో పెట్టుకునే, పూర్తిస్థాయిలో నీటిని నిల్వను ఎప్పుడూ చేయలేదు. జాగ్రత్తగా ఫ్లడ్ మానిటర్ చేస్తూ, డ్యాంను కాపాడుతూ వచ్చారు. డ్యామ్ మెయిన్ టినెన్స్ కు నిధులు కేటాయించారు. పులిచింతల ప్రాజెక్టును 1988 నవంబర్ 13న ఎన్.టి.ఆర్ గారు మొదట శంకుస్థాపన చేశారు. 1994-95లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.501 కోట్లు. 2004 అక్టోబర్ 15న పులిచింతల ప్రాజెక్టుకు వైఎస్ భూమి పూజ చేశారు. 30-9-2004 తేదీన మెస్సర్స్‌ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ మరియు చైనా రైల్వే 18 బ్యూరో జాయింట్ వెంచర్ తో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 18.11.2005 న జీవో నెం 208 ద్వారా సవరించిన అంచనా రూ.681 కోట్లు. 04.08.2009న జీవో నెం 90  ద్వారా వైఎస్ ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1281 కోట్లు. 29.01.2014న జీవో నెం. 7 ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1861 కోట్లు. భూసేకరణలో జాప్యం వలన ధరలు పెరిగినందుకున అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ 2012లో ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పరిశీలించిన డీఏబీ రూ.199 కోట్లను అధనంగా చెల్లించాలని 03.10.2013న ప్రతిపాదించారు. ఇది అమలు కాకపోవడంతో కోర్టుకు వెళ్లారు.  సుదీర్ఘంగా విచారణ జరిపి మచిలీపట్నం కోర్టు.. 02.06.2016న రూ.199 కోట్లతో పాటు 2013 నుండి వడ్డీ కల్పి రూ.399 కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానిపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లగా కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అనగా రూ.199 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాన్ని 01.01.2019న ప్రభుత్వం అమలు పరిచింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పులిచింతల మునక రైతుల పరిహారం కోసం రూ.128 కోట్లు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.199 కోట్లు చెల్లింపులు చేయడమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులకు పరిహారం చెల్లించి వారిని ఖాళీ చేయించడంలో వైఎస్ గాని, కాంగ్రెస్ గాని తగినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి, దానిపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు.వారు చేసిన పాపానికి చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ప్రకారం రూ.199కోట్లు చెల్లించింది. మరో 128 కోట్లు భూములు కోల్పోన రైతులకు చెల్లించింది.వైఎస్ ప్రభుత్వం కమీషన్లు పుచ్చుకునే పనులకు నిధులు విడుదల చేసి, రైతులకు పరిహారంలో కమీషన్లు రావు కనుక దాన్ని నిర్లక్ష్యం చేసింది.  డ్యాంకు గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్ లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్‌ గరిష్ఠంగా ఆరు మిల్లీ మీటర్లకు మించి ఉండకూడదని తెలిసినా, పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా పెట్టారు. దీంతో గేట్ల పై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా సివిల్‌ పనుల్లో, మెకానికల్‌ పనుల్లో కూడా లోపాలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు. 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మించాల్సి ఉండగా, 546 మీటర్లకు తగ్గించారు. 33 గేట్లు పెట్టాల్సి ఉండగా, కేవలం 24 గేట్లు పెట్టారు. కాంక్రీటు డ్యాం నిర్మించాల్సి ఉండగా, 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. డిజైన్ మార్చి, స్పిల్ వే తగ్గించటం, గేట్లు తగ్గించటం, కాంక్రీటు డ్యాం లేకుండా మట్టి మట్టికట్ట నిర్మాణం చేయటంతో, మొత్తంగా ఈ రోజు వరద ఉదృతికి, గేటు కొట్టుకుపోయింది. జలయజ్ఞంలో జరిగిన ధనయజ్ఞంలో భాగంగానే డిజైన్ మార్పులు నాశిరకం పనులు జరిగాయి. తండ్రిని అడ్డం పెట్టుకొని నాడు జగన్ రెడ్డి కమీషన్లు కొల్లగొట్టారు. ఆ పాపమే నేటి పులిచింతల దుస్థితి.  పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్ ది అని అక్కడ 45 అడుగుల వైఎస్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని 07.10.2019న నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ ప్రకటించారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అన్నారు. మరి పులిచింతల గేటు కొట్టుకుపోయిన పాపం పూర్తిగా జగన్ కుటుంబానిది కాదా?..    

సాహో చోప్రా.. ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం సాధించెన్‌.. వందేళ్ల క‌ల ఫ‌లించెన్‌..

ఒలింపిక్స్‌లో భార‌త్‌ అద్భుతం చేసింది. అథ్లెటిక్స్‌లో వందేళ్ల స్వ‌ప్నం సాకారం చేసింది. జావెలిన్ త్రోలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించి.. నీర‌జ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. 130 కోట్ల భార‌తీయుల‌ను ఆనందంలో ముంచెత్తాడు. టోక్యో ఒలింపిక్స్‌ను మ‌రుపురాని తీపి జ్క్షాప‌కంగా మార్చాడు.  జుల‌పాల జుట్టుతో.. ప‌దునైన బ‌ల్లెంతో.. జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా ప్ర‌పంచంలోర‌నే తిరుగులేని ఆట‌గాడిలా నిలిచాడు. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు.   ముందే ఊహించారు. అంతా అనుకున్నారు. నీర‌జ్ చోప్రా ప‌త‌కం తీసుకొస్తాడ‌ని. కానీ, ఏకంగా బంగారు ప‌త‌క‌మే గెలుపొంద‌డంతో ఆనందం ఆకాశాన్ని అంటుతోంది. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫైన‌ల్లో 12 మందితో పోటీ ప‌డి.. జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి.. ఒలింపిక్స్‌లో భార‌త పేరును, త‌న పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు.   2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.   నీరజ్‌ 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఏడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.  ఇప్పుడు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడంతో యావ‌త్ భార‌తం ఉప్పొంగిపోతోంది. నీర‌జ్ చోప్రాను చూసి గ‌ర్వ ప‌డుతోంది. 

బీజేపీ+టీడీపీ+జ‌న‌సేన‌.. వైసీపీ షేక్‌.. ప్ర‌భుత్వం ప‌డిపోనుందా?

ఏదో జరుగుతోంది. ఏపీలో ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు సంభ‌విస్తున్నాయి. జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా కేంద్రంలో వేగంగా పావులు క‌దులుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం ప‌త‌న‌మ‌య్యేలా బ‌ల‌మైన సంకేతాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎప్పుడులేనిది.. ఏపీ మంత్రులు కేంద్రంపై విరుచుకుప‌డుతున్నారు. మునుపెప్పుడూ లేనివిధంగా వైసీపీ పెద్ద‌లు క‌మ‌ల‌నాథుల‌పై క‌స్సుమంటున్నారు. మా ప్ర‌భుత్వాన్ని కూల్చేసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి పేర్ని నాని మీడియా ముఖంగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాకా అవ‌స‌రం లేదంటూ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జి సునీల్ దియోద‌ర్‌లు వెంట‌నే స్పందించారు. ఇక, సీఎం జ‌గ‌న్ ఆంత‌రింగిక పెద్ద‌మ‌నిషి స‌జ్జ‌ల సైతం కేంద్రం-బీజేపీల‌పై చెల‌రేగిపోవ‌డం.. అప్పుల తిప్ప‌ల‌పై రివ‌ర్స్ అటాక్‌కు దిగ‌డంతో.. ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే ప్ర‌చారం ఢిల్లీ నుంచి తాడేప‌ల్లి వ‌ర‌కూ హోరెత్తుతోంది.  మంత్రి పేర్ని నాని వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. కాషాయం కప్పుకొన్న వ్యక్తిని సీఎంను చేయాలని బీజేపీ కలలు కంటోందంటూ బాంబు పేల్చారు. రాజకీయ పార్టీలు ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకోవడం మామూలే. బీజేపీ కూడా రాజకీయ పార్టీయే. ఎన్‌జీవో కాదు కదా.. అంటూ నాని మాట్లాడిన మాట‌లు మామూలుగా లేవు. సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశం ముగిసిన వెంట‌నే పేర్ని ఇలాంటి కామెంట్లు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. మంత్రిమండ‌లిలో ఆ మేర‌కు పెద్ద చ‌ర్చే జ‌రిగిందంటున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌నే ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం వ‌స్తుండ‌టం.. అప్పుల‌పై కేంద్రం స‌ర్కారును మెలిపెడుతుండ‌టం వ‌ల్లే.. ఇలా ఎదురుదాడికి దిగార‌ని అంటున్నారు. గోతులు త‌వ్వ‌డం.. ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డం.. లాంటి డైలాగులు య‌ధాలాపంగా వ‌చ్చిన‌వి కావ‌ని.. ప‌క్కా చ‌ర్చ జ‌రిగాకే ఇలా ర‌చ్చ రాజేశార‌ని చెబుతున్నారు.  మంత్రి పేర్ని నానితో ఆగిపోలేదు ఎదురుదాడి. బీజేపీకి యాంటీగా.. ముస్లిం నాయ‌కుడితోనూ ప‌దునైన‌ విమ‌ర్శ‌లు చేయించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని, ఏపీలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మ‌రింత అల‌జ‌డి రాజేశారు. ఇక సీఎం జ‌గ‌న్ షాడో స‌జ్జ‌ల సైతం ఈ కాంట్ర‌వ‌ర్సీలో నోరు పెట్టారు. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు క‌లిసి ప‌ని చేస్తున్నాయంటూ అగ్గిపుల్ల గీచి మ‌రింత అగ్గి ఎగ‌దోశారు. కేంద్రంపై త‌న‌దైన శైలిలో కౌంట‌ర్లు వేశారు. ఏపీ అప్పులపై కేంద్ర జోక్యాన్ని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అప్పులెంతో లెక్క చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అటు, పేర్ని నాని సైతం కేంద్రం అప్పులు చేయ‌డం లేదా? అంటూ ప్ర‌శ్నించ‌డం.. మంత్రులు, వైసీపీ పెద్ద‌లంతా పోలోమంటూ కేంద్రం-బీజేపీపై దాడికి దిగ‌డం వెనుక జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానం.  ఇప్ప‌టికే ఏపీ అప్పుల చిట్టాపై కేంద్రం లెక్క‌లు అడుగుతోంది. కొత్త అప్పులు చేయ‌కుండా చెక్ పెడుతోంది. ఇది ఏపీ స‌ర్కారులో అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంది. అటు, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు విష‌యంలోనూ కేంద్రం నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌వుతోంద‌ని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్‌.. జ‌గ‌న్ పాల‌న‌పై క‌న్నెర్ర చేయ‌డం.. క‌మ‌ల‌నాథులు పాత మిత్రుడు చంద్ర‌బాబు విష‌యంలో సాఫ్ట్ కార్న‌ర్‌తో ఉండ‌టం.. ఇలా వ‌రుస ప‌రిణామాల‌ను చూసి సీఎం జ‌గ‌న్ త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని అంటున్నారు. అందుకే, తాజా కేబినెట్ భేటీలో ఎదురుదాడికి వ్యూహ‌ర‌చ‌న చేశార‌ని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. మంత్రులను గ‌ట్టిగా ఆదేశించారనే తెలుస్తోంది. ప్ర‌తిప‌క్ష నేతల విమర్శలకు ఎందుకు మౌనంగా ఉంటున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని.. మంత్రుల‌ను సీఎం నిలదీసినట్టు సమాచారం. అందుకే, జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే పేర్ని నాని, అంజాద్ బాషాల‌తో పాటు స‌జ్జ‌ల సైతం రంగంలోకి దిగి.. క‌మ‌ల‌నాథుల‌పై, కేంద్రంపై తోక‌తొక్కిన తాచుపాముల్లా బుస‌లుకొడుతున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. అయితే, ప్ర‌భుత్వాన్ని కూల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ చేయ‌డం అత్యంత కీల‌కాంశం. దాని అర్థం, ప‌ర‌మార్థం.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కాబోతోందా? అనే అనుమానం. వైసీపీ వాళ్లు ఇంత‌లా రెచ్చిపోతుంటే.. కాషాయ ద‌ళం మాత్రం చాలా కూల్‌గా ఆన్స‌ర్ ఇస్తోంది. జ‌గ‌న్  స‌ర్కారును కూల్చాసిన అవ‌స‌రం త‌మ‌కేమీ లేద‌ని.. అలాంటి ప్ర‌య‌త్నాలేవీ బీజేపీ చేయ‌డం లేదంటూ సోము వీర్రాజు లైట్-మోడ్‌లో రిప్లై ఇచ్చారు. ఇక ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోద‌ర్ చేసిన ట్వీట్ మ‌రింత సంకేతం ఇచ్చేలా ఉంది. ఎప్పుడు బెయిల్ ర‌ద్దు అవుతుందో తెలీక‌, రోజు గ‌డ‌వ‌డానికి అప్పు పుట్ట‌క‌.. వేల‌కోట్ల అవినీతి చేసి.. మీ ప్ర‌భుత్వానికి మీరే పాతాళం లోతు గొయ్యి త‌వ్వి రెడీగా ఉంచారంటూ.. వ‌రుస ట్వీట్ల‌తో సీఎం జ‌గ‌న్ ప‌రువంతా తీసేశారు సునీల్ దియోద‌ర్‌. గ‌తానికి భిన్నంగా త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గోతులు తీస్తున్నార‌ని, కాషాయం క‌ప్పుకున్న వ్య‌క్తిని సీఎం చేయాల‌ని చూస్తున్నార‌ని.. ప్ర‌భుత్వంలోని వారే ఆరోపించ‌డం తీవ్ర క‌ల‌క‌లంగా మారుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌త‌నం కాబోతోంద‌నే సంకేతాలు అంద‌డం వ‌ల్లే.. ఏపీ మంత్రులు, వైసీపీ పెద్ద‌లు ఇంత‌లా అరిచి గోల‌ పెడుతున్నార‌ని అనుమానిస్తున్నారు. అది అప్పులపై కేంద్రం జోక్య‌మో.. లేక‌, అంతా అనుకుంటున్న‌ట్టు జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కాబోతోంద‌నే భ‌య‌మో.. కార‌ణం ఏదైనా వైసీపీలో క‌ల‌వ‌ర‌పాటు సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి, ఈ రాజ‌కీయ ర‌చ్చ ఎంత వ‌ర‌కూ దారి తీస్తుందో చూడాలి...

ఒలింపిక్స్ లో భారత్ కు ఆరో పతకం.. రెజ్లర్ పునియాకు కాంస్యం

టోక్సో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది.  భారత రెజ్లర్ బజరంగ్ పునియా కాంస్య పతకం గెలిచాడు. 65 కేజీల పురుషుల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఘన విజయం సాధించాు బజరంగ్ పునియా. కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్ నియాజ్‌బెకోవ్‌తో జరిగిన పోరులో తిరుగులేని విజయం సాధించాడు. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 8-0తో ఘన విజయం సాధించాడు. పునియా మెడల్ తో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 6కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో అజర్‌బైజన్‌కు చెందిన అలియేవ్ చేతిలో బజరంగ్ 5-12తో ఓటమి పాలయ్యాడు. ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్‌కు తృటిలో పతకం చేజారింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన మహిళ విభాగం గోల్ఫ్‌ మ్యాచ్‌లో అదితి నాలుగో స్థానంలో నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అదితి అంచనాలకు మించి రాణించింది. సంచలన ప్రదర్శనతో పతకానికి చేరువైంది. మూడో రౌండ్ ముగిసేరికి రెండో స్థానంలో ఉన్నా అదితి.. నాలుగో రౌండ్‌లో కొంత నిరాశపరిచింది. దాంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. మొదటి స్థానంలో నిలిచిన అమెరికాకు చెందిన కొర్డా నెల్లి గోల్డ్ గెలిచింది. నమి నోమ్(జపాన్)- సిల్వర్, కో లాడియా(న్యూజిలాండ్)- కాంస్యం గెలిచారు. ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన అదితిదే. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన అదితి 41వ స్థానానికి పరిమితమైంది. 

ఛీ అన్న కార్పొరేట్.. చేరదీసిన సీఎం! భారత హాకీకి ఆయనే గాడ్ ఫాదర్..

టోక్యో ఒలంపిక్స్  హాకీలో 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం వచ్చింది. పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించింది. జర్మనీతో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కెప్టెన్ మన్ ప్రీత్ సేన భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. 41 ఏళ్ల క్రితం మాస్కో ఒలంపిక్స్ లో హాకీలో ఇండియాకు మెడల్ వచ్చింది. మహిళల జట్టు కూడా అసామాన్య పోరాటాన్ని ప్రదర్శించింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సెమీపైనల్ చేరింది. చివరికి కాంస్య పతక పోరులో మహిళల జట్టు ఓడిపోయినా.. యావత్ భారతావని మనసులు గెలుచుకుంది. పతక పోరులో ఓటమి తర్వాల విలపిస్తున్న ప్లేయర్లను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఓదార్చారు. నిజానికి ఏసారి ఎలాంటి ఆశలు లేకుండానే భారత హాకీ బృందం టోక్సో వెళ్లింది. అందుకే హాకీ టీమ్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పతకం రావడంతో అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.. కీర్తిస్తున్నారు.  భారత హకీ జట్టు మెడల్ సాధించడంలో అసలు హీరో మాత్రం మరొకరు ఉన్నారు.  తెర వెనక హాకీ జట్టుకు సపోర్ట్ చేసింది.. ప్రోత్సహించింది ఆయనే. ఆయనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. దేశం మొత్తం పట్టించుకోని వేళ ఆయన ఇచ్చిన 100 కోట్లే ఈ రోజు హాకీ జట్టు విజయానికి కారణం అయ్యాయి. అసలు విషయంలోకి వస్తే.. భారత హాకీ జట్టు పేవలమైన ప్రదర్శన కారణంగా అప్పటి వరకు స్పాన్సర్ షిఫ్ గా ఉన్న సహారా కంపెనీ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2018 సంవత్సరంతో పురుషుల, మహిళల జట్టుతో ఉన్న అన్ని కాంట్రాక్టులను రద్దు చేసుకుంది సహారా కంపెనీ. దీంతో స్పాన్సర్ షిప్ కోసం భారత హాకీ ఫెడరేషన్ ఎన్నో కార్పొరేట్ కంపెనీలను సాయం కోరింది. కాని ఎవరూ ముందుకు రాలేదు. హాకీ జట్టు గెలిచేది లేదూ చచ్చేదీ లేదు.. అనవసరం డబ్బులు బొక్క అంటూ పట్టించుకోలేదు. హాకీ మ్యాచ్ లు చూసేది ఎవరు అంటూ ఎగతాళి చేశాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు. సరిగ్గా ఇక్కడే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఎంటర్ అయ్యారు. హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు కుర్చుకున్నారు. 2023 వరకు ఒడిశా ప్రభుత్వం భారత హాకీ జట్లకు స్పాన్సర్ గా ఉంది. భారతీయ క్రీడ ఏదీ అంటే హాకీ.. అలాంటి జాతీయ క్రీడకు కంపెనీలు ముందుకు రాకపోవటం అతన్ని కలిచివేసింది. దీనికి మించి.. మంచి హాకీ ప్లేయర్ నవీన్ పట్నాయక్. చిన్నతనంలో హాకీ ఆడేవారు. డూన్ స్కూల్ లో చదివే రోజుల్లో హాకీ జట్టుకు గోల్ కీపర్ గా ఉన్నారు. ఇప్పటికీ రెగ్యులర్ గా హాకీ మ్యాచులు చూస్తూ ఉంటారు సీఎం నవీన్ పట్నాయక్. క్రికెట్ కంటే హాకీనే ఇష్టం అంటారు ఆయన హాకీపై అతనికి ఉన్న మక్కువతోనే.. ఒడిశా ప్రభుత్వం తరపున భారత హాకీ జట్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు.100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.  క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించటానికి అవసరం నిధులు సమకూర్చారు నవీన్ పట్నాయక్. 2023 సంవత్సరం వరకు భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు అవసరం అయిన అన్ని ఖర్చులు భరించటానికి ముందుకు వచ్చారు. అతను ఆ రోజు ఆదుకోకపోయి ఉంటే ఇవాళ భారత జట్టు ఇంతలా ప్రదర్శన ఇచ్చేదా.. ప్రాక్టీస్ చేసేదా.. పతకం వచ్చేదా. మెడల్ రాగాలనే కార్పొరేట్ సంస్థల మళ్లీ రూట్ మార్చాయి. భారత హాకీ జట్టును ఆకాశానికెత్తుతున్నాయి తన బ్రాండ్ల ప్రమోషన్ కోసం కోట్లు కుమ్మరించేదుకు సిద్ధమవుతున్నాయి. సో.. ఇప్పుడు చెప్పండి భారత హాకీ జట్టుకు అసలైన గాడ్ ఫాదర్ ఎవరో..

పీకేతో బీఎస్పీ బలపడేనా? ఎవరికి లాభం.. ఏ పార్టీకి గండం?

బహుజన సమాజవాదీ పార్టీ ( బీఎస్పీ) కొత్త పార్టీ కాదు, కానీ, కొత్తగా వస్తున్న పార్టీ.  సుదీర్ఘ  విరామం  తర్వాత, తెలంగాణ రాజకీయ వేదిక మీదకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ కుమార్ రూపంలో బీఎస్పీ మళ్ళీ వస్తోంది. ఆరేళ్ళ సర్వీస్ ఉండగానే, స్వచ్చంద పదవీ విరమణ చేసి, రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ రేపు (ఆగష్టు 8) బీఎస్పీలో చేరుతున్నారు. బీఎస్పీ అధినాయకురాలు, మాయావతి ఈ విషయాన్నీ అధికారికంగా దృవీకరించారు. అంతే, కాదు ప్రవీణ్ కుమార్’ను  పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఈ సందర్భంగా నల్గొండలో రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు.  నిజానికి అయన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై  చాలా చాలా ఊహాగానాలు వినిపించాయి. సమయ సందర్భాలు, ఆయనకు అధికార పార్టీ నాయకులతో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆయన అంతర్గత కుటుంబ కోటరీతో ఉన్న సన్నిహిత  సంబందాల కారణంగా ఆయన గులాబీ పార్టీలో చేరతారని అనుకున్నారు. సమయ సందర్భాలను బట్టి అయన  హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తారు,అని కూడా అన్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఆయన తెరాస మీద యుద్ధం ప్రకటించారు. కారెక్కడం లేదని స్పష్టం చేశారు. సర్వీస్’లో ఉండగానే ముందు చూపుతో స్వేరోస్ స్వచ్చంద సంస్థను స్థాపించి, రాజకీయ పునాదులు నిర్మించుకున్న ప్రవీణ్ కుమార్, జిల్లాల వారిగా నిర్వహించిన స్వేరోస్ సమావేశాలలో తెరాసను, కేసీఆర్ నే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు. గడీల రాజ్యానికి చరమగీతం పాడే పరిస్థితులు త్వరలోనే వస్తాయంటూ ఆయన, హెచ్చరించారు.తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ, అవినీతి జరిగిందని ఆరోపించారు. చివరకు దలితుల కోసం, తెరాస ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని కూడా ప్రవీణ్ కుమార్ ఎండ గట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్ళలో ఏనాడు కూడా దళితుల పేరు ఎత్తని కేసీఆర్.. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం దళిత బంధు అంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉపఎన్నిక కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని.. కేసీఆర్‌ తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.కేసేఅర్ కుట్రలో తాను  పావును కాదు, అని నిరుపించుకోవడం కోసం కావచ్చును, ఆయన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కంటే గట్టిగానే కేసీఆర్ని తిట్టిపోస్తున్నారు.  సరే అవ్వన్నీ ఎలా ఉన్నా, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఎస్పీ ప్రయోగం ఎందుకనో సక్సెస్ కాలేదు. 1994 ఎన్నికల సముయంలో, స్వయంగా కాన్షీ రామ్ హైదరాబాద్’లో మకాం చేసి, పార్టీని పటిష్ట పరిచేందుకు చాలా గట్టి కసరత్తే చేశారు. అంతకు ముందు కూడా  కాన్షీ రామ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.కానీ, అప్పట్లో ఇటు మీడియా గానే, అటు ప్రజలు గానీ ఆయన్ను, ఆయన పార్టీని అంతగా పట్టించుకోలేదు.  అయితే 1993 యూపీ ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా బీఎస్పీకి గుర్తింపు వచ్చింది. (ఆతర్వాత 1995లో తొలి సారిగా బీజేపీ మద్దతుతో మాయావతి యూపీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.) ఈనేపధ్యంలో యూపీ తర్వాతగా ఏపీ అనే నినాదంతో 1994  ఎన్నికలకు ముందు రాష్ట్రలో దళిత బహుజనుల జెండా పాతేందుకు కాన్షీ రామ్ చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా గుర్తించింది. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కూడా కాన్షీరామ్ ఎవరి కొంప ముంచుతారో అని లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టాయి. అదే సమయంలో, హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో కాన్షీ రామ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ, రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలను సృష్టించింది. కానీ, కాన్షీ రామ్ ప్రభంజనం ఫలితాలలో కనిపించలేదు. ఆ ఎన్నికలలో నిజమైన ప్రభంజనం ఎన్టీఅర్ సృష్టించారు. మొత్తం 294 స్థాన్లాకు గానూ 220కి పైగా స్థానాలలో తెలుగు దేశం విజయ దుందుభి మోగించింది.  అలా 1994 ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత, రాష్ట్రంలో బీఎస్పీ ఉందంటే ఉందనే గానీ, బలమైన శక్తిగా మాత్రం లేదు. కత్తి పద్మారావు వంటి కొదంరు పార్టీని బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. అలాగే, తెరాస నుంచి బహిష్కరణకు గురైన ఆలే (టైగర్) నరేంద్ర 2008 లో మాయావతి సమక్షంలో బీస్పీపీ లో చేరారు. అయితే ఆయన ఎక్కువకాలం ఆపార్టీలో కొనసాగలేదు, పాత గూటికి (బీజేపీ) చేరిపోయారు. అయితే, ఎన్నికల ముందు సొంత పార్టీ టికెట్ రాని కొందరు బీస్పీపీ టికెట్ తెచ్చుకుని గెలిచిన సందర్భాలున్నాయి. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా 2014 ఎన్నికల్లో బీఎస్పీ టికెట్ మీద గెలిచి తెరాసలో చేరారు.అలాగే, గతమంలోనూ కొందరు బీఎస్పీ టికెట్ కొనుక్కుని పోటీ చేసిన సందర్భాలున్నాయి.  ఇక ఇప్పుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, మరో ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాయావతి అనుసరిస్తున్న రాజకీయ పంథాకు, ప్రవీణ్ కుమార్ ప్రకటిత పంథాకు మధ్య చాలా చాలా దూరముంది. మాయావతి, ఇంతవరకు నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. రెండుసార్లు బీజేపీ మద్దతుతోనే గద్దె  నెక్కారు. అంతే కాదు ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓబీసీ జనగణన చేపడితే, పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని ఆమె ప్రకటించారు. ప్రస్తత పార్లమెంట్ ప్రతిస్తంభన వ్యవహారంలోనూ బీఎస్పీ ఎంపీలు, కాంగ్రెస్ ఇతర విపక్షాల మొండి వైఖరిని తప్పుపడుతున్నారు. మాయావతి అనుసరిస్తున్నఈ  బీజేపీ, హిందుత్వ అనుకూల వైఖరిని కరడు కట్టిన హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న ప్రవీణ కుమార్ ఎంతవరకు జీర్ణం చేసుకుంటారనేది అనుమానమే అంటున్నారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలలో రేపేమి జరుగుతుంది, అనేది ఊహాకు అందని ప్రశ్న.

ముఖ్య‌మంత్రిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌.. త్రిపుర షేక్‌.. బీజేపీ షాక్‌..

ఆయ‌నో రాష్ట్ర ముఖ్య‌మంత్రి. చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. నిత్యం మందీమార్బ‌లం. రెప్ప వేయ‌కుండా ఆయ‌న్ను కాపు కాస్తుంటారు బాడీగార్డ్స్‌. అలాంటి సీఎంపైనే  మ‌ర్డ‌ర్ అటెంప్ట్ జ‌ర‌గ‌డం మామూలు విష‌య‌మా? ఆ ముఖ్య‌మంత్రి అల‌ర్ట్‌గా ఉన్నారు కాబ‌ట్టి సరిపోయింది.. లేదంటే ఎంత ఘోరం జ‌రిగిపోయి ఉండేది? అందుకే, త్రిపుర సీఎం బిప్ల‌వ్ కుమార్ దేవ్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంతో యావ‌త్ దేశం ఉలిక్కిప‌డుతోంది. గురువారం జరిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. బిప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చారు. అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్‌ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు ప‌రారీ అయ్యారు.  సీఎం బిప్ల‌వ్ దేవ్‌పై జ‌రిగిన మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌తో పోలీసులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే నాకాబంధీ నిర్వ‌హించారు. అదేరోజు అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారనేది ఇంకా తెలియ‌రాలేదు. దర్యాప్తు వివ‌రాలు గోప్యంగా ఉంచుతున్నారు త్రిపుర‌ పోలీసులు.   

రైతు గెట‌ప్‌లో స‌బ్ క‌లెక్ట‌ర్‌.. ఆ త‌ర్వాత సీన్ సితార్‌..

ఈ ఫోటోలో క‌నిపించే వ్య‌క్తి మామూలోడు కాదు. గ‌ళ్ల లుంగీ.. పాత చొక్కా వేసుకుని ఎరువుల దుకాణాల‌కు వెళ్లాడు. ఎవ‌రో రైతు వ‌చ్చాడ‌నుకుని లైట్ తీసుకున్నారు షాపువాళ్లు. ఆ.. ఏం కావాలి? అంటూ అడిగారు. మ‌నోడు త‌న‌కు కావాల్సిన లిస్ట్ చెప్పాడు. ఆ షాపు వాళ్లు.. వాళ్ల వాళ్ల రెగ్యుల‌ర్ స్టైల్‌లో ఆ రైతును డీల్ చేశారు. ఇక అంతే. క‌ట్ చేస్తే.. సీన్ సితార‌. వ‌చ్చినోడు రైతు కాద‌ని.. రైతు గెట‌ప్‌లో ఉన్న స‌బ్ క‌లెక్ట‌ర్ అని తెలిసి అంతా నోరెళ్ల బెట్టారు. శ్రీమంతుడు సినిమాలో మ‌హేశ్‌బాబులా లుంగీ మీద వ‌చ్చిన ఆయ‌న.. యువ ఐఏఎస్‌.. విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ సూర్య‌సాయి ప్ర‌వీణ్‌చంద్‌. ఈ సినిమాటిక్ సీన్ కృష్ణాజిల్లా కైక‌లూరు, ముదినేప‌ల్లిలో జ‌రిగింది.  విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్.. రైతు వేషంలో ఎంట్రీ ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న ఎరువుల షాపు యాజమాన్యానికి చుక్కలు చూపించారు. మారు వేషంలో తిరిగి.. ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న మోసాన్ని రట్టు చేశారు. మొద‌ట‌ కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. అక్కడ ఓ దుకాణానికి వెళ్లి ఎరువులు కావాలని అడగ్గా.. స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు యజమాని. అక్కడి నుంచి మరో షాప్‌కి వెళ్లారు. ఎరువులు కావాలని అడిగారు. ఎరువులైతే ఇచ్చాడు కానీ, ఎంఆర్‌పి ధర కన్నా ఎక్కువ‌గా వసూలు చేశాడు. వసూలు చేసిన సొమ్ముకు బిల్లు కూడా ఇవ్వలేదు.  ఎరువుల షాపుల తీరుతో ఆగ్రహానికి గురైన సబ్ కలెక్టర్.. వెంట‌నే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి షాపు ద‌గ్గ‌ర‌కు పిలిపించారు. స్టాక్ ఉన్నా లేదని చెప్పిన షాపుతో పాటు, అధిక ధర వసూలు చేసిన షాపునూ సీజ్ చేయించారు.  ఆ త‌ర్వాత లొకేష‌న్ ఛేంజ్‌. కైక‌లూరు నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. అయితే, ముదినేపల్లిలో ఎరువుల‌ షాపు మూసివేసి ఉంది. అక్కడే ఉన్న రైతులను ఎంక్వైరీ చేస్తే.. ఆ షాపు వాడు ఎంఆర్‌పి కన్నా అధిక ధరకు ఎరువులు అమ్ముతున్నాడ‌ని సబ్ కలెక్టర్‌కి రైతులు తెలిపారు. దీంతో.. యజమానిని పిలిపించి.. ఎరువుల‌ షాపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. అఫీస‌ర్ అంటే ఇలా ఉండాలి క‌దా.. సినిమాల్లో మాత్ర‌మే ఇలాంటి సీన్స్ చూస్తుంటాం.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోలా యాక్ష‌న్‌కు దిగిన విజయవాడ స‌బ్ క‌లెక్ట‌ర్‌ను అంతా అభినందిస్తున్నారు. శ‌భాష్‌.. సూర్యసాయి ప్రవీణ్ చంద్.