కాంగ్రెస్ పార్టీకి మరో యువ నేత షాక్.. రాహుల్ మౌనంపై సీనియర్ల ఫైర్.. 

కాంగెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో క్రియాశీల నాయకురాలు, సుస్మితా దేవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సుమారు మూడు దశాబ్దాలకు పైగా, పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన మాజీ ఎంపీ, మహిళా కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ వెంటనే  తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది.  సుస్మితా దేవ్ రాజీనామా ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అధిష్టానంపై కత్తులు దూస్తున్న జీ 23 నాయకులు, ఇదే అదనుగా మరో మారు అధిష్టానంపై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జీ 23 కీలక నేత కపిల్ సిబల్, మరో  సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ, ట్విటర్ వేదికగా కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు.‘‘పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సుస్మితా దేవ్ రాజీనామా చేశారు.యువనేతలు పార్టీని ఒకపక్క వీడుతుంటే.. పార్టీ బలోపేతానికి చేసే కృషిపై మా ‘ముసలాళ్ల’ను నిందిస్తారు. అదే సమయంలో పార్టీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని సాగిపోతోంది’’ అంటూ కపిల్ సిబల్ తమదైన శైలిలో అధిష్టానానికి చురకలు అంటించారు.  సుస్మితా దేవ్ రాజీనామా పై  మనీష్ తివారీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె రాజీనామా చేయడమే నిజం అయితే, అది అత్యంత దురదృష్టకరం అంటూ ట్వీట్ చేశారు.అంతటితో ఊరుకోకుండా, ఇంత చిన్న ఉత్తరం ముక్క రాసి వెళ్లి పొతే ఎలా, పార్టీ వదిలి పోవడానికి కారణాలు ఏమిటో, పార్టీ చేస్తున్న తప్పులు ఏమిటో చెప్పి వెళ్ళాలని అన్నారు. అంటే పార్టీని మరింతగా ఇరుకున పెట్టమని, ఆయన చెప్పకనే చెప్పారు.  రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా, పార్టీలో భవిష్యత్ తరం నాయకురాలిగా గుర్తింపు పొందిన సుస్మితా దేవ్ రాజీనామా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా, పార్లమెంట్ వెలుపల లోపలా కూడా కాంగ్రెస్ వాణిని గట్టిగా వినిపించే, దేవ్ పార్టీని వదిలి పోవడం,పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి గట్టి దెబ్బగానే బావిస్తున్నారు. జ్యోతి రాజాదిత్య సిందియా మొదలు  ఇలా వరసగా ఒకరొకరుగా, రాహుల్ గాంధీ సన్నిహిత నాయకులు పార్టీని వదిలిపోవడంతో, జీ 23 వృద్ద నేతలు తమకు అనుకూలంగా మలుచు కుంటున్నారు. కేవలం రెండు నెలలో క్రితమే ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువ నేత జితిన్ ప్రసాద, పార్టీని వదిలి బేజీపే చేరారు. మరో వంక, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, కూడా త్వరలోనే పార్టీని వదలడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.  అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల గాంధీ మాత్రం ఎంత మంది పార్టీ వదిలిపోయినా, భయపడేది లేదని అంటున్నారు. అంతేకాదు, పొడలచుకున్న వారంతా పోవచ్చని అంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భయంతోనే, యువ నాయకులు పార్టీని వదిలి పోతున్నారని భావిస్తున్నారో ఏమో కానీ,  రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు భయపడే వాళ్ళు ఇంకా ఎవరైన ఉంటే అలాంటి వారందరూ నిరభ్యంతరంగా వెళ్లి బీజేపీలో చేరచ్చని  నెల రోజుల క్రితమే తలుపులు తెరిచారు.  అయితే పార్టీని వదిలి పోతున్న వారందరూ, బీజేపీలో మాతమ్రే చేరడం లేదు, ఇతర పార్టీలలోకి వెళుతున్నారు. సుస్మితా దేవ్ విషయమే తీసుకుంటే ఆమె బీజేపీలో చేరలేదు, ఆమె తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే కొద్ది రోజుల క్రితం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా, బీజేపీలో చేరలేదు తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే, ఉత్తర పదేశ్’లో కూడా కొందరు  కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరితే, ఇంకొందరు సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ, అన్నిటికీ బీజేపీ, మోడీనే కారణమని అనుకుంటే, ఆత్మ వంచన, పర నింద ఇలాగే కొనసాగిస్తే, అందుకు వందేళ్ళు పైబడిన కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా పెద్ద మూల్యం చెల్లించ వలసి వస్తుందని, జీ 23 నేతలు హెచ్చరిస్తున్నారు.

దళితులందరికి ఇస్తా.. లక్షా 70 వేల కోట్లు ఓ లెక్కా! కిరికిరిగాళ్ల ఆటలు సాగవన్న కేసీఆర్.. 

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. 15 మంది లబ్దిదారులకు దళిత బంధు స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభకు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్.. దళిత బంధు పథకం గురించి వివరిస్తూనే విపక్షాలపై విరుచుకుపడ్డారు. దళిత బంధుతో కొత్త చరిత్రను సృష్టిస్తామని చెప్పారు. ఈ పథకంతో ఎస్సీలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు సీఎం. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు మహా ఉద్యమమని చెప్పారు. ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది కిందటే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నామని, అయితే కరోనా వల్ల ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికి ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.  దళిత సోదరసోదరీమణులందరికీ "జై భీమ్" అంటూ ప్రసంగం ప్రారంభించారు కేసీఆర్. తాము ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు విజయవంతంగా నడుస్తోందని, రైతాంగంలో ఎంతో సంతోషం కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు దళిత బంధు అదే రీతిన విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధు దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే ఓ క్రీడ అని, టీఆర్ఎస్ పార్టీకి మాత్రం సామాజిక అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక లక్ష్యాలను అందుకోవడం టీఆర్ఎస్ పార్టీకి పవిత్ర కర్తవ్యం అని, దళిత బంధును విజయవంతం చేయడంలోనూ అదే రీతిన కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ ఆలోచన వాళ్ల మదిలోకైనా వచ్చిందా? అని నిలదీశారు. పిల్లి తన సంసారాన్ని చక్కదిద్దుకున్నట్టు నేను ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ వస్తున్నానని కేసీఆర్ వివరించారు. తాను దళిత బంధు ప్రకటించానో లేదో కిరికిరిగాళ్లు, కొండెగాళ్లు ఒకరు కీ అంటే ఒకరు కా అంటే... ఒకడు ఇంత ఇవ్వాలంటే, ఇంకొకడు అంత ఇవ్వాలంటే అందరూ దుకాణం మొదలుపెట్టారు అని విమర్శించారు. ఏనాడూ ఐదు రూపాయలు ఇవ్వాలని మాట్లాడనివాడు కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు."ఇంకొకడు మాట్లాడుతున్నాడు... ఎలా ఇస్తారో చెప్పాలె, ఎవరెవరికి ఇస్తారో చెప్పాలె అంటుండు. ఎందుకు చెప్పం... కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. ఎట్లా చెప్పాలో అట్లా చెబుతాం. నాకొకటి అర్థం కావడం లేదు... ఇచ్చేవాడు ఇస్తాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు... మధ్యలో వాళ్లకు ఏంటి కడుపుమంట?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుబంధు పథకం అద్భత ఫలితాలు సాధిస్తోంది. కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగింది. అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుట్టాము. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలి. దళితబంధు కచ్చితంగా విజయవంతం అవుతుంది. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి పట్టుదల ఉండాలి. 25 ఏళ్లక్రితం నుంచే దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవకాశాలు, ఆస్తుల లేక దళితులు అణగారిపోయి ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న పని 75 ఏళ్ల కిందే మొదలు పెట్టి ఉంటే ఈ దుస్థితి ఉండేదా? హుజురాబాద్‌లో దళితబంధు అమలు ఒక ప్రయోగశాల లాంటిది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు వర్తింపు. ఎస్పీలలో నిరుపేదలకు ముందుగానే దళితబంధు నిధులు. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. తెలంగాణలో 17 లక్షలకుపైగా దళిత కుటుంబాలున్నాయి’’ అని కేసీఆర్‌ తెలిపారు. 

CMOలోకి రాహుల్ బొజ్జా.. ఈట‌ల విమ‌ర్శ‌ల‌తో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..

సీఎం కేసీఆర్‌ను న‌మ్మొచ్చా? ద‌ళిత బంధు అంద‌రికీ ఇస్తారా? కేసీఆర్‌ మాట మీద నిల‌బ‌డ‌తారా? గ‌తంలో ద‌ళిత ముఖ్య‌మంత్రి.. ద‌ళితుల‌కు 3 ఎక‌రాల భూమిలానే ఇది కూడా అవ‌స‌రం తీరాక అట‌కెక్కిస్తారా? ఇలా అనేక అనుమానాలు, విమ‌ర్శ‌ల మ‌ధ్య వాసాలమ‌ర్రి, హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మం ప్రారంభించేశారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ‌లో మొత్తం ద‌ళిత కుటుంబాల‌కు త‌లా 10 ల‌క్ష‌లు ఇవ్వాలంటే..  మొత్తం ల‌క్షా 70 వేల కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని ఆయ‌నే లెక్కేసి చెప్పారు. ఇందుకోసం ఏటా 40వేల కోట్లు కేటాయిస్తామ‌ని.. ఆ లెక్క‌న 4 ఏళ్ల‌లో ద‌ళిత కుటుంబాలంద‌రికీ ద‌ళిత బంధు అమ‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించేశారు. హుజురాబాద్ స‌భ‌తో ద‌ళిత‌బంధును ఘ‌నంగా మొద‌లుపెట్టిన సీఎం కేసీఆర్‌.. అదే వేదిక‌గా ద‌ళితుల‌పై త‌న‌కున్న క‌మిట్‌మెంట్‌ను నిరూపించుకునేందుకు మ‌రో ప్ర‌క‌ట‌న కూడా చేసేశారు. ఆ అంశం ద‌ళిత‌బంధుకంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదే.. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారిగా ఎంపిక చేసుకోవ‌డం.  సీఎం కేసీఆర్ బాగా అప్‌డేట్ అవుతున్నారు. మున‌ప‌టిలా త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను లైట్ తీసుకోవ‌డం లేదు. ఆ.. వాళ్లు అట్ల‌నే వాగుతారులే.. మ‌న‌ల్ని ఎవ‌రేం చేస్తారులే.. అని ఏమాత్రం ఉదాసీనంగా ఉండ‌టం లేదు. ఎవ‌రెవ‌రు ఏమేం విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నేది ఎప్ప‌టిక‌ప్పుడు నోట్ చేసుకుంటున్న‌ట్టున్నారు. అందులో భాగంగానే, హ‌ఠాత్తుగా నాగార్జున‌సాగ‌ర్‌లో ప‌ర్య‌టించి.. ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోర‌నే విమ‌ర్శ‌ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు.  కేసీఆర్‌లో ఇంత‌టి మార్పు ఎందుకంటే కాంగ్రెస్‌, బీజేపీల రూపంలో రెండు బ‌ల‌మైన పార్టీలు త‌న‌ను గ‌ద్దె దింపేయ‌డానికి రెడీగా కాచుకు కూర్చున్నాయి కాబ‌ట్టి. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజ‌డ‌మే టార్గెట్‌గా దూసుకువ‌స్తున్నారు. అటు, ఇన్నేళ్లూ త‌న ప‌క్క‌నే ఉన్న‌ ఈట‌ల రాజేంద‌ర్ త‌న మైన‌స్‌ల‌న్నీ ప‌ట్టేసి.. ఒక్కోటి పూస‌గుచ్చిన‌ట్టి విడ‌మ‌రిచి చెప్పేసి.. ప్ర‌జ‌ల్లో అనుమానాలు రెట్టింపు చేసేశారు. రెండేళ్ల‌లో కొత్త రేష‌న్ కార్డులు ఇచ్చారా? కొత్త పింఛ‌న్లు ఇచ్చారా? అంటూ ఈటెల్లాంటి ప్ర‌శ్న‌లు సంధించారు. వెంట‌నే తేరుకున్న కేసీఆర్ కొత్త రేష‌న్‌కార్డులు, పింఛ‌న్ల‌ను ఆగ‌మేఘాల మీద జారీ చేసేస్తూ.. త‌ప్పు స‌రిచేసుకుంటున్నారు. ఈట‌ల‌లాంటోళ్ల విమ‌ర్శ‌ల‌కు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు.  ఇక పార్టీ వీడే క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్ లేవ‌నెత్తిన మ‌రో కీల‌కాంశాన్ని.. హుజురాబాద్ వేదిక‌గా స‌రి చేసేశారు సీఎం కేసీఆర్‌. దొర పాల‌న‌లో బీసీల‌కు, ఎస్సీల‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని.. CMOలో ఒక్క‌రైనా ఎస్సీ అధికారి ఉన్నారా? అంటూ స‌ర్కారును షేక్ చేసే క్వ‌శ్చ‌న్ సంధించారు ఈట‌ల రాజేంద‌ర్‌. ద‌ళిత బంధుతో దాదాపు ల‌క్ష‌న్న‌ర కోట్లు ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మైన కేసీఆర్‌.. ఈట‌ల నిల‌దీసిన ఆ ప్ర‌శ్న‌ను ఆన్స‌ర్ స‌రి చేసుకోక‌పోతే.. ఇంతా చేసి వృధా ప్ర‌యాసేన‌ని భావించిన‌ట్టున్నారు. ద‌ళితుల‌పై త‌న చిత్త‌శుద్ధిని శంకించే అవ‌కాశం ఉంద‌ని భ‌య‌ప‌డిన‌ట్టున్నారు. అందుకే, ఈట‌ల నిల‌దీసిన అంశంపై.. ఈట‌ల ఇలాఖా నుంచే ఆన్స‌ర్ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ద‌ళితుడైన‌ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను.. CMOలోకి తీసుకుంటున్నానంటూ వేదిక‌పై ప్ర‌క‌టించేసి.. ఇన్నేళ్లూ సీఎం కార్యాల‌యంలో ద‌ళిత అధికారి ఒక్క‌రు కూడా లేర‌నే అప‌వాదును అప్ప‌టిక‌ప్పుడు తుడిపేసుకునే ప్ర‌య‌త్నం చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ప‌నిలో ప‌నిగా రాహుల్ బొజ్జాతో పాటు ఆయ‌న తండ్రి బొజ్జా తార‌కంనూ బాగా పొగిడేసి.. ద‌ళితుల‌ను ఆకాశానికెత్తేశారు సీఎం కేసీఆర్‌.     

పాతికేళ్ల తర్వాత మళ్లీ తాలిబన్ రాజ్యం.. భయంభయంగా అప్ఘనీస్తాన్ జనం..

పాముల పుట్ట ఒక్కసారిగా చెదిరితే ఎలా ఉంటుంది? కలుగులో దాక్కున్న విషనాగులన్నీ వీధుల్లో స్వైర విహారం చేస్తే ఎలా ఉంటుంది? ఆఫ్ఘనిస్థాన్లో 1994 తరువాత నెలకొన్న దారుణ పరిస్థితులను ప్రపంచం ఇంకా మరచిపోలేదు. అవే దుష్పరిణామాలను మరోసారి నెమరు వేసుకునే పరిస్థితులు ఆఫ్ఘన్లో దాపురించాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్ నుంచి క్రమంగా వెను దిరుగుతున్న క్రమంలోనే ఆఫ్-పాక్ సరిహద్దుల్లో మాటువేసి ఉన్న తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్ ను కైవసం చేసుకున్నారు. అధ్యక్షుడి భవనాన్ని హస్తగతం చేసుకున్నారు. అటు అధ్యక్షుడు తన సిబ్బంది సహా కజకిస్తానో, కిర్గిజిస్తానో పారిపోయాడు. ఇంకేముంది? తాలిబాన్లు పాలనా పగ్గాలు చేపట్టడం లాంఛనంగానే మిగిలింది.  తాలిబాన్లంటే ఇంత వణుకెందుకు? తాలిబాన్ల పరిపాలన ఎలా ఉంటుందో ప్రపంచం ఇప్పటికే రుచి చూసింది. వారి ఆలోచనలు, వారి కార్యాచరణ ఎలా ఉంటుందో పసిపిల్లవాడిని అడిగినా చెబుతారు. అసలు తాలిబాన్ల డిక్షనరీలో ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థమే లేదంటే అతిశయోక్తి కాదు. షరియా చట్టాన్ని విశ్వవ్యాప్తం చేయడమే వీరి లక్ష్యం. తాలిబాన్లు, ఐసిస్, ముజాహిదీన్లు.. ఇలా ఏ పేరు చెప్పుకున్నా.. అందరి లక్ష్యం ఒకటే. అందుకే వేర్వేరు ఆర్గనైజేషన్ల కింద పనిచేస్తున్నవారు సైతం ఏ సమయంలోనైనా ఒక్కటిగా మారిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో జరిగింది కూడా అదే. 1994 ప్రాంతంలో ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగుపెట్టిన తాలిబాన్లు 1996 లో అక్కడి పాలకుల్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి.. వారి అరాచకాలతో ప్రపంచాన్ని వణికించారు.  చిన్నా చితకా విగ్రహాలే కాదు.. బమియాన్ వంటి అతిభారీ బుద్ధ విగ్రహాలను శక్తిమంతమైన మందుపాతర్లు, రాకెట్ లాంచర్లు పెట్టి కూల్చేశారు. యునెస్కో వారసత్వ హోదా ఉన్న అనేక గొప్పగొప్ప కట్టడాలను నేలమట్టం చేశారు. ఇక ఆఫ్ఘనిస్థాన్లో గంజాయి అక్రమ వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న శీతల అటవీప్రాంతాలే గంజాయి సాగుకు కేంద్రాలు. అదే వారికి వస్తు మారకానికి, తాలిబాన్ల విలాసాలకు, ఆఫ్ఘన్లోని ధనవంతులైన కుటుంబాలకు ఆదాయం సమకూర్చే వస్తువు. ఏటా నాలుగు బిలియన్ డాలర్ల గంజాయి వ్యాపారం జరుగుతుందని అంచనా.  ఇక పరిపాలన విషయానికొస్తే వారి టార్గెట్ అంతా మహిళలు, చిన్నపిల్లలే కావడం గమనించాలి. ఈ విషయమే ఆధునిక ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. మొదటిసారి పవర్లోకి వచ్చిన తాలిబాన్లు మహిళల డ్రెస్ కోడ్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినట్టే ఈసారి కూడా వచ్చీ రావడంతోనే మహిళల డ్రెస్ కోడ్ మీదనే పడ్డారు. ఇంకా కాబూల్ కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఓ మహిళ టైట్ గా డ్రెస్ వేసుకుందని భారీ కత్తితో నడిబజారులో అందరూ చూస్తుండగానే నరికేశారు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. వాటిని తలుచుకునే ప్రజలంతా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు రావడానికి జంకుతున్నారు. భవంతుల్లో ఉంటే ఎక్కడ పేలుస్తారోనని ధనవంతులు సైతం ఆరుబయటకొచ్చి తాలిబాన్లకు కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక అధికారంలోకి వస్తే ఎలా చెలరేగిపోతారో ఊహించుకొని భయపడుతూ.. అక్కడ బతకలేనివారు చాలా వేగంగా పట్టణాలు విడిచిపోతున్నారు. రాజధాని కాబూల్ లో ఇప్పుడంతా ఎటు చూసినా గడ్డాలు పెంచుకొని, సంప్రదాయ ఇస్లామిక్ దుస్తుల్లో ఆయుధాలు ధరించిన జిహాదీలే కనిపిస్తున్నారు.  తాలిబాన్ల పాలనలో స్కూళ్లు, కాలేజీలు నడవవు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. ఆడపిల్లలు సైతం చదువుకోవడానికి అవకాశం లేదు. పదేళ్లు దాటిన అమ్మాయిలు బుద్ధిగా ఇంటిపట్టునే ఉండాలి. ఆ వయసు దాటినవారు మగతోడు లేకుండా బయటికి రారాదు. ఒకవేళ వస్తే కఠిన దండన తప్పదు. అలా వచ్చినా కూడా తల నుంచి కాలి బొటనవేలు వరకు పూర్తిగా కవరయ్యేలా వస్త్రధారణ ఉండాలి. అంతేకాదు.. శరీర సౌష్టవం కూడా తెలిసేలా బిగుతైన కాస్ట్యూమ్స్ వాడరాదు. ఇవన్నీ పాటిస్తేనే తాలిబాన్ల రాజ్యంలో బతికే వీలుంది. ఇక రేపోమాపో విపరీతమైన ఆంక్షల నడుమ తాలిబాన్ల పాలన మొదలవుతుంది.  1996లో తొలిసారి ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లను 2001లో అమెరికా ఆధ్వర్యంలోని నాటో సైన్యాలు తరిమేశాయి. ఇప్పుడు పాతికేళ్ల తరువాత అమెరికా సైన్యం వెనక్కి మళ్లడంతో మరోసారి ఆటవిక రాజ్యానికి తెర లేచింది.

లోకేశ్‌కు జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారా? అరెస్ట్ అందుకేనా..?

నారా లోకేశ్ అరెస్ట్‌. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరెస్ట్ కావ‌డం ఇదే తొలిసారి. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఆ ఘ‌ట్టం కూడా ముగిసింది. ఓట‌మి నారా వారి తన‌యుడిని రాటుదేల్చిన‌ట్టుంది. అనుభ‌వం యువ‌నేత‌ను మ‌రింత ప‌దును పెట్టిన‌ట్టుంది. ఇటీవ‌ల కాలంలో అన్నింటా ఆయ‌నే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బాధ్య‌తంతా లోకేశే త‌న భుజాల‌పై మోస్తున్నారు. తండ్రి డైరెక్ష‌న్‌లో ప్ర‌భుత్వంపై అలుపెర‌గ‌ని దండ‌యాత్ర చేస్తున్నారు. ప్ర‌తినిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం.. ప్రజ‌ల చెంత‌.. ప్ర‌జాక్షేత్రంలో.. రాకెట్‌లా దూసుకుపోతున్నారు.   తాజాగా, గుంటూరులో ర‌మ్య మృత‌దేహానికి నివాళులు అర్పించి.. బాధిత కుటుంబాన్ని పరామ‌ర్శించారు నారా లోకేశ్‌. అంతే. పోలీసులు పోలోమంటూ దిగిపోయారు. లోకేశ్‌ను అదుపులోకి తీసుకొని అక్క‌డి నుంచి త‌ర‌లివ‌చ్చారు. కార‌ణం.. లోకేశ్ రాకవ‌ల్ల బాధితురాలి ఇంటికి జ‌నం పోటెత్తారు. ఆ కుటుంబానికి మ‌ద్ద‌తుగా క్ష‌ణాల్లో వేలాది మంది త‌ర‌లివ‌చ్చారు. ఆడ‌పిల్ల‌కి భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని ప్రభుత్వ చేత‌గానిత‌నంపై ఆగ్ర‌హం వెల్లువెత్తింది. పెద్ద స్థాయి నేత వ‌స్తే.. ఆ ప్ర‌భావం.. ఆ ఫ‌లితం ఇలానే ఉంటుంది. ఇష్యూకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్ర‌జ‌ల్లో అటెన్ష‌న్ క్రియేట్ అవుతుంది. ప్ర‌భుత్వంపై ఎక్క‌డ‌లేని ప్రెజ‌ర్ వ‌స్తుంది. నారా లోకేశ్ గుంటూరు రాక‌తో అదే జ‌రిగింది. పే..ద్ద లీడ‌ర్ల వ‌ల్ల‌నే ఇలాంటి ప‌రిణామాలు సాధ్యం. అందుకే, స‌ర్కారు ఉలిక్కిప‌డింది. వెంట‌నే ఖాకీల‌ను రంగంలోకి దింపి లోకేశ్‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. అంటే.. దీని అర్థం.. నారా లోకేశ్‌కు స‌ర్కారు భ‌య‌ప‌డిన‌ట్టేగా..? యువ‌నేత‌ను చూసి పాల‌కుల‌కు వ‌ణుకు పుట్టిన‌ట్టేగా..? నారా లోకేశ్ దూకుడు మామూలుగా లేదు. కరోనా కాలంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వ‌ద్దే వ‌ద్దంటూ ఆయ‌న చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ ఉన్నా.. త‌న వెనుక జ‌న‌స‌మూహం లేక‌పోయినా.. జూమ్ మీటింగుల‌తోనే స‌ర్కారుపై తీవ్ర ఒత్తిడి పెంచారు. నిత్యం విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతూ.. వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ.. ప్ర‌భుత్వం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి దిగొచ్చేదాకా ప‌ట్టువ‌ద‌ల‌నే లేదు లోకేశ్‌. మామూలుగా వేరే వారైతే ఏ రెండు-మూడు రోజులో నినాదాలు చేసి వ‌దిలేసేవారే. కానీ, లోకేశ్ అలాకాదు.. దాదాపు రెండు నెల‌ల పాటు విక్ర‌మార్కుడిలా ప‌రీక్ష‌ల ర‌ద్దు కోసం గొంతెత్తి నిన‌దించారు. నిజ‌మైన లీడ‌ర్ అనిపించుకున్నారు. జూమ్‌లాంటి ఆన్‌లైన్ వేదిక‌ల‌ను ఇంత‌లా ఉప‌యోగించుకొని.. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసిన ఏకైక నాయ‌కుడు బ‌హుషా లోకేశ్ ఒక్క‌రేనేమో...! ఇక నారా లోకేశ్ అస‌లైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలోనే బ‌య‌ట‌ప‌డ్డాయి. టీడీపీ అభ్య‌ర్థిగా ప‌న‌బాక ల‌క్ష్మి పేరు ప్ర‌క‌టించ‌గానే.. ప్రచార బాధ్య‌త‌ల‌న్నీ ఆయ‌నే మీదేసుకున్నారు. వారాల త‌ర‌బ‌డి తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనే మ‌కాం వేసి.. ఊరూరా, వాడ‌వాడ‌లా ప‌ర్య‌టించారు. రోడ్‌షోలు, పాద‌యాత్ర‌లు, స‌భ‌లు, స‌మావేశాలు, ప‌బ్లిక్‌తో సెల్ఫీలు, జ‌నాల‌తో మాటామంతి.. అలుపెర‌గ‌కుండా, విసుగుచెంద‌కుండా.. ప్ర‌చారాన్ని హోరెత్తించారు. కేడ‌ర్‌లో ఉత్సాహం నింపారు. తిరుప‌తిలో నారా లోకేశ్ నిర్వ‌హించిన ప్ర‌తీ ర్యాలీకి జ‌నం పోటెత్తారు. ఆయ‌న ప్ర‌సంగాలు సైతం ఆలోచింప‌జేసేవిగా సాగాయి. పంచ్‌ల‌తో ఈల‌లు వేయించాయి.. కేక‌లు పెట్టించాయి. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ర్యాలీలు అలానే సాగేవ‌ని జ‌నం చ‌ర్చించుకున్నారు. జ‌గ‌న్‌లానే లోకేశ్ సైతం ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ఆయ‌న ప్ర‌సంగాలు వాడి-వేడిగా ఉండేవ‌ని మాట్లాడుకున్నారు. ఆనాడు జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైసీపీ శ్రేణులు విజ‌య‌తీరాల వైపు న‌డిచిన‌ట్టు.. ఇప్పుడు మ‌ళ్లీ లోకేశ్ లీడ‌ర్‌షిప్‌లో టీడీపీ కొత్త ఉత్సాహంతో ముందుకు క‌దులుతోంద‌ని అంటున్నారు.  తిరుప‌తి ఉప ఎన్నిక‌లు అనే కాదు.. టీడీపీ నాయ‌కుల‌ను అక్ర‌మ కేసుల‌తో అరెస్ట్ చేసిన‌ప్పుడు.. టీడీపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌జ‌లకు స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు.. ఇలా ఏ ఒక్క సంద‌ర్భానికీ ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా.. ప్రాబ్ల‌మ్ ఉన్న‌చోట‌ల్లా వాలిపోతున్నారు నారా లోకేశ్‌. మొద‌టినుంచీ ఇంగ్లీష్‌మీడియం కావ‌డం, ఫారిన్‌లో చ‌దువుకొని రావ‌డంతో.. గ‌తంలో తెలుగు స‌రిగ్గా మాట్లాడ‌లేక‌.. ప‌ప్పు అనే విమ‌ర్శ ఎదుర్కొన్నారు. ఇప్పుడు బాడీతో పాటు బాడీలాంగ్వేజ్‌నూ మార్చేశారు. స్లిమ్ అండ్ షార్ప్‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌నలానే ఆయ‌న స్పీచుల్లోనూ ప‌స పెరిగింది. పప్పు కాస్తా నిప్పులా మారారు. తూటాల్లాంటి మాట‌లు, ప‌దునైన విమ‌ర్శ‌లు, ఘాటు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వ తుప్పు వ‌ద‌ల‌గొడుతున్నారు. ఇక లోకేశ్ చేసే ట్వీట్లు.. జ‌గ‌న్‌ను, విజ‌య‌సాయిని తూట్లు పొడుస్తుంటాయి. అందుకే, నారా లోకేశ్ అంటే స‌ర్కారు షేక్ అవుతోంది. గుంటూరు ర‌మ్య‌శ్రీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళితే.. ఆ ఒత్తిడి త‌ట్టుకోలేక పోలీసుల‌తో అరెస్ట్ చేయించింది. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌లో తొలిసారి అరెస్టై.. తాను రాటుదేలిన నాయ‌కుడిన‌ని నిరూపించుకున్నారు నారా లోకేశ్‌. తాజా, అరెస్ట్‌తో లోకేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌భుత్వం లోకేశ్‌తో పెట్టుకొని మ‌రోసారి ప‌ప్పులో కాలేసింది. నిప్పుతో చెల‌గాట‌మాడుతోంది.

ఏపీలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణేది? దిశ ఏమైంది? జ‌గ‌న‌న్న వ‌ల్ల కాదా?

'అర్ధ‌రాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం. ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా దిశ చట్టాలు, యాప్‌లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ‌ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?' అంటూ యువనాయ‌కుడు ప‌రిటాల శ్రీ‌రామ్ వ్య‌క్తం చేసిన‌ ఆగ్ర‌హం నిజంగా చ‌ర్చ‌ణీయాంశం.  అవును, ఏపీకి ఏమైంది? దిశ చ‌ట్టం ఆడ‌పిల్ల‌ల‌పై నేరాలు-ఘోరాల‌ను ఆప‌గ‌లిగిందా? దిశ యాప్ ఆప‌త్కాలంలో ఆదుకుందా? ప్ర‌భుత్వ ప్ర‌చార ప్ర‌టోపాలే కానీ.. అమ‌లులో దిశ విఫ‌ల‌మైందా? జ‌గ‌నన్న పాల‌న‌లో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ క‌రువైందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.. వాటిపై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌లు.  ఒక‌టి రెండు కాదు.. వ‌రుస ఘ‌ట‌న‌లు.. గ‌డిచిన రెండేళ్ల‌లో అనేక దారుణాలు. ఆడ‌పిల్ల‌ల‌నే కాదు చిన్నారుల‌పైనా ఘోరాలు. మొన్న‌టికి మొన్న తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ ప్యాలెస్ ఉన్న ఏరియాలోనే కృష్ణాన‌ది తీరంలో యువ‌తిపై అత్యా-చారం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇద్ద‌రే నిందితులు. వారిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసుల‌కు చుక్కలు క‌నిపించాయి. నెల‌లు గ‌డిచాక ఇద్ద‌రిలో ఒక్క‌రిని మాత్ర‌మే ఇటీవ‌ల ప‌ట్టుకున్నారు. మ‌రొక‌డు ఇప్ప‌టికీ ప‌రారీలోనే ఉన్నాడు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాస చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతంలోనే ఆడ‌పిల్ల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌లేక‌పోయిన ఈ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలి? ఏం చేయాలి? స‌ర్కారు వైఫ‌ల్యాన్ని క‌ప్పుపుచ్చుకునేందుకే అన్న‌ట్టు హ‌డావుడిగా దిశ యాప్ తీసుకొచ్చారు. పే..ద్ద స‌భ పెట్టి హంగామాగా దిశ యాప్ ప్రారంభించేశారు. ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టారు. అయినా ఏం లాభం? మ‌హిళ‌ల‌కు ఏం ప్ర‌యోజ‌నం? దిశ యాప్ అమ‌ల్లోకి వ‌చ్చి నెల గ‌డ‌వ‌గానే.. గుంటూరులో ఉన్మాది శివ‌కృష్ణ చేతిలో బీటెక్ స్టూడెంట్‌ ర‌మ్య‌శ్రీ దారుణ హ‌త్య‌కు గురికావ‌డం.. ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే అంటున్నారు. నేర‌గాళ్ల‌లో భ‌యం క్రియేట్ చేసేలా స‌ర్కారు స‌రైన‌న చ‌ర్య‌లు తీసుకోలేక‌పోవ‌డం వ‌ల్లే క్రిమిన‌ల్స్ ఇలా చెల‌రేగిపోతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ర‌మ్య‌శ్రీని ఆ ఉన్మాది వెంటాడాడు. చేయిప‌ట్టుకొని బ‌ల‌వంతంగా లాగాడు. కొంత‌దూరం పాటు ఆమెవెంటే ప‌డ్డాడు. వాడి నుంచి త‌ప్పించుకునేందుకు పాపం ఆ అమ్మాయి పెనుగులాడుతూనే ఉంది. ఆ స‌మ‌యంలో ఎవ‌రైనా అదే చేస్తారేమో. అయినా వాడు వ‌ద‌ల‌కుండా ఆమెను క‌త్తితో ఆరు పోట్లు పొడిచాడు. ఆ దుర్ఘ‌ట‌న‌ను అడ్డుకోడానికి దిశ యాప్ ఎలా ప‌నికొస్తుంది? దాని వ‌ల్ల ఉప‌యోగ‌మేంటి? త‌న‌ను అలా క‌త్తితో పొడుస్తాడ‌ని ఆమె ముందే ఊహించ‌క‌పోవ‌చ్చు. ఆ స‌మ‌యంలో అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌నే చూస్తారు కానీ.. దిశ యాప్ అనేది ఒక‌టుంది. ఫోన్ తెర‌చి.. దిశ యాప్ ఓపెన్ చేసి.. బ‌ట‌న్ నొక్కాల‌నే ఐడియా వెంట‌నే త‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఒక‌వేళ ఆ ప‌ని చేసినా.. దిశ పోలీసులు వ‌చ్చే స‌రికి.. జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగిపోయి ఉండేది. అంటే, దిశ యాప్ అన్నివేళ‌లా, అంద‌రికీ, అన్ని ఘ‌ట‌న‌ల్లో ఉప‌యోగ‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అంటే, కేవ‌లం దిశ తీసుకొచ్చి.. ఇక తాము మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేశామంటూ జ‌గ‌న్ స‌ర్కారు జెబ్బ‌లు చ‌రుచుకోవ‌డం సిగ్గుచేటు..అంటున్నారు.  తమ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆడ‌పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ జ‌గ‌న్ చెబుతున్నారు. మ‌హిళల ర‌క్ష‌ణ కోస‌మంటూ.. దిశ చ‌ట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. ఇవేవీ అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోతున్న తీరు చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఓ మ‌హిళ‌ను నియ‌మించామ‌ని జ‌గ‌న్ గొప్ప‌లు చెబుతున్నారు. ఆ మ‌హిళా హోం మినిస్ట‌ర్ సొంత జిల్లాలోనే ఉన్మాది చేతిలో ర‌మ్య‌శ్రీ దారుణ హ‌త్య‌కు గురికావ‌డం స‌ర్కారు వైఫ‌ల్య‌మే అంటున్నారు. నిందితుడిని ప‌ట్టుకొని క‌ఠిన శిక్ష విధించినా.. బాధిత కుటుంబానికి 10 ల‌క్ష‌లు ప‌రిహారం అందించినా.. పోయిన ప్రాణం తిరిగి వ‌స్తుందా? ఆ కుటుంబ శోకం తీరుతుందా? ప్రాణం పోకుండా క‌దా ప్ర‌భుత్వం చూడాల్సింది? అంటున్నారు.  గుంటూరు ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్య‌క్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని మండిప‌డ్డారు. సీఎం నివాసానికి దగ్గర్లో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జ‌గ‌న్‌ పాలనలో ఇప్పటిదాకా 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని ఆరోపించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నాగానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. సీఎం జ‌గ‌న్‌ సోదరి.. వైఎస్‌ సునీతారెడ్డికి ప్రాణహాని ఉందంటే, సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అటు, ర‌మ్య‌శ్రీ మృత‌దేహానికి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. మ‌హిళ‌ల‌పై నేరాలు-దారుణాలు ఆగ‌డం లేదంటూ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు నారా లోకేశ్‌.  ర‌మ్య‌శ్రీ ఘ‌ట‌న‌తో జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన‌ట్టైంది. ఏపీలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నేరం చేయాలంటేనే భ‌యం క‌లిగేలా, దారుణం జ‌ర‌గ‌కుండా అడ్డుకునేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు, విధానాలు ఉండాలి కానీ.. ఏదో ప్ర‌చారం కోసం పైపై చ‌ర్య‌లు చేప‌డితే.. స‌రైన ఫ‌లితం ఉండ‌ద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ అరెస్ట్.. ఇదేం రాజ్యమని చంద్రబాబు ఫైర్ 

ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి అరాచక పాలన సాగుతుందో మరోసారి రుజువైంది. దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య నివాసం దగ్గర పోలీసులు జులుం ప్రదర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ తో పాటు దూళిపాళ నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర, నక్కా ఆనంద్ బాబులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. లోకేశ్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేశ్ పిడికిలి బిగించి, చేయెత్తి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు. మిగిలిన నేతలను నల్లపాడు పీఎస్ కు తరలించారు.  మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థిని రమ్యను ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. గుంటూరులోని కాకాని రోడ్డులో ఆదివారం ఈ దారుణం సంభవించింది. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. గుంటూరులో ఉన్నాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. రమ్య మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. నారా లోకేష్ రావడంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.  రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు ఆరోపించాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పోలీసులు జులుం ప్రదర్శించారు. రమ్య ఇంటి వద్ద చిత్రీకరణకు వెళ్లిన టీవీ5 టీవీ5 కెమెరాను లాగి పడేశారు. పోలీసుల దాడితో టీవీ5 కెమెరా  నుజ్జునుజ్జైంది. కెమెరాను లాక్కొని నేలకేసి కొట్టారు పోలీసులు. మీడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల తీరుపై  మీడియా సంఘాలు మండిపడుతున్నాయి.  నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యులను పరామర్శించానని, వాళ్లతో మాట్లాడానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలు  అవసరం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని వాళ్లు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తాను ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే వైసీపీ రౌడీలు వచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. పోలీసులు కూడా టీడీపీ నేతలపై దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నాయకులు ఏమన్నారంటే.. గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పారని.. జగన్ ఎక్కడ? గన్ ఏదీ అని లోకేష్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలకే సీఎం న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను దారుణంగా చంపేస్తే.. వాళ్లకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  నారా లోకేష్ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై పోలీసుల దౌర్జన్యం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. రమ్య కుటుంబసభ్యులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై కాదు సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవడంలో జగన్ ప్రతాపం చూపించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్య జరగిందంటే.. మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని విమర్శించారు. గుంటూరులోనే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే ప్రభుత్వం పాలన ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. . టీడీపీ నేతలపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పరామర్శకు వెళ్లిన లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ నరేంద్ర లపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు చంద్రబాబు. పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్యగావించబడుతుంటే దిశ యాప్ ఏం చేస్తుంది? సిసి కెమెరాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.   

సింధుకి ఐస్‌క్రీం.. ఒలింపిక్స్ వీరుల‌కు విందు.. మోదీ అదిరిపోయే ఆతిథ్యం..

పీవీ సింధుకు ప్ర‌ధాని ఐస్‌క్రీం తినిపించారు. నీరజ్‌ చోప్రాకు చుర్మా రుచి చూపించారు. ఒలింపిక్స్ ప‌త‌క‌దారుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వారిని ప్ర‌శంషించారు. వారి ప్ర‌తిభ‌ను కొనియాడారు.  క్రీడాకారులతో కలిసి ఫొటోలు దిగారు. స్వాత్రంత్య్ర‌ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్ర‌ధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్స్‌ అథ్లెట్లకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.  టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అథ్లెట్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పీవీ సింధుకు ఐస్‌క్రీం ఇష్టమని తెలిసి.. పతకం గెలిచి వచ్చాక కలిసి ఐస్‌క్రీం తిందామని స్ఫూర్తినింపారు. ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం సాధించి దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు. ఇచ్చిన మాట ప్ర‌కారం సింధుకి ఐస్‌క్రీం తినిపించి మోదీ మాట నిలుపుకున్నారు. నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో వ్యక్తిగత స్వర్ణం.. అథ్లెటిక్స్‌లో 120 ఏళ్ల త‌ర్వాత తొలి బంగారు పతకం గెలిచి.. చ‌రిత్ర సృష్టించారు. చోప్రాకు ఇష్ట‌మైన చుర్మా అందించి.. నీర‌జ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు ప్ర‌ధాని.   ఒలింపిక్ మెడ‌ల్ సాధించిన వారంద‌రినీ తన నివాసానికి ఆహ్వానించి.. వారికి ప్ర‌త్యేక ఆతిథ్యం ఇచ్చారు ప్ర‌ధాని మోదీ. వారితో క‌లిసి డిన్న‌ర్ చేసి.. ఫోటోలు దిగి.. వారంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రించి.. ఆత్మీయంగా మాట్లాడి.. వారు సాధించిన విజయాలను కొన‌యాడారు. మున్ముందు మరింత బాగా రాణించాలని సూచించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. 

పార్టీ మారొద్దని ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన కేసీఆర్? రాజాసింగ్ సంచలనం.. 

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మల్కాజ్ గిరిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ కార్పొరేటర్ మధ్య  జరిగిన గొడవ.. రాజకీయ సెగలు రేపుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడగా.. ఆయనకు కౌంటర్ గా కమలనాధులు రెచ్చిపోతున్నారు. మైనంపల్లి టార్గెట్ గా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మైనంపల్లిని అరెస్టు చేయాలంటూ మల్కాజ్ గిరి బంద్ నిర్వహిస్తోంది బీజేపీ. అటు టీఆర్ఎస్ వర్గాలు సై అంటుండటంతో మల్కాజ్ గిరిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరడానికి మైనంపల్లి ప్రయత్నాలు చేశారని, ఆయన నేర చరిత్ర తెలిసే పార్టీలోకి చేర్చుకోలేదని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తాము తలుచుకుంటే మైనంపల్లి తట్టుకోలేరని హెచ్చరించారు.  బీజేపీ కార్పొరేటర్‌పై మైనంపల్లి దాడి చేయడాన్ని రాజాసింగ్ ఖండించారు. పిచ్చి పట్టిన అనంతరం కుక్క ఏ మాదిరిగా ప్రవర్తిస్తుందో మైనంపల్లి కూడా అలా మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన తీరు ఇలానే ఉంటుందా? అని నిలదీశారు.  బీజేపీలోకి రావాలని ప్రయత్నించిన మైనంపల్లి... బండి సంజయ్ చుట్టూ తిరిగాడని, ఢిల్లీలో కూడా తిరిగాడని, ఇది వాస్తవం కాదా? అని  రాజా సింగ్ ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి నా కాళ్లు మొక్కిండు అందుకే టీఆర్ఎస్‌లో ఉండిపోయా అని మైనంపల్లి చెప్పారంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మైనంపల్లి పరిస్థితి అక్కడ, ఇక్కడ కాకుండా పోయిందనేది అర్ధం అవుతోందన్నారు. టీఆర్ఎస్ వాళ్లు నిన్ను లాట్ కొట్టి బయటకు పంపిస్తారు.. ముఖ్యమంత్రి చెబితేనే నీ పైన ఎఫ్ఐఆర్ అయిందని తెలుసుకో మైనంపల్లి అంటూ రాజాసింగ్ విరుచుకుపడ్డారు. 

పీడీల‌తో ఖ‌జానాకు పిడి.. జ‌గ‌న్ స‌ర్కారు కిరికిరి!..

నెల‌నెలా జీతం రాగానే అంతా ఖ‌ర్చైపోతుంది. వ‌చ్చే శాల‌రీ కూడా చాల‌క అప్పులు చేయాల్సి వ‌స్తుంది. ఆ అప్పులు కూడా ముట్ట‌క‌పోతే.. అప్పుడు ఆ ఇంటి య‌జ‌మాని ఏం చేస్తాడు? గ‌ల్లా గురుగు ప‌గ‌ల‌గొడ‌తాడు. దాచుకున్న చిల్ల‌ర మొత్తం ఊడ్చేస్తాడు. ఆ చిన్న మొత్త‌మైనా ఏదైనా అవ‌స‌రానికి ప‌నికొస్తుంద‌ని తీసేసుకుంటాడు. అయినా, అత‌ని ఖ‌ర్చులు తీర‌క‌పోతే? ఈసారి దేవుడికి క‌ట్టిన ముడుపు విప్పుతాడు. ఓ దేవుడా మ‌ళ్లీ ప‌రిస్థితి బాగుప‌డితే నీ ముడుపు నీకు ఇచ్చేస్తా.. ఇప్ప‌టికైతే నీ సొమ్ము నేను వాడేసుకుంటానంటూ అది కూడా స్వాహా చేస్తాడు. అలా ఇలా ఏదో ఒక‌టి చేసేసి.. ఇళ్లంతా ఊడ్చేసి.. సంసారం నెట్టుకొస్తాడు. ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కారు దుస్థితి కూడా ఇలానే త‌యారైందని అంటున్నారు. ఖ‌జానాలో చిల్లిగ‌వ్వ కూడా లేదు. ఖ‌ర్చులు మోపెడు. సంక్షేమం బోలెడు. ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖు జీతాలు కూడా ఇవ్వ‌లేని దయ‌నీయ ప‌రిస్థితి. అందిన‌కాడికి అప్పులు చేసేస్తున్నారు. వాటిని ప‌ప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. కొత్త అప్పులు ముట్ట‌డం లేదు. కేంద్రం సైతం కొర్రీలు పెడుతోంది. మ‌రి, ఇక దారేది? ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌కు మార్గ‌మేది? ఇందుకు స‌ర్కారు ఓ దొంగ‌దారి క‌నుగొంది. పీడీ అకౌంట్ల పేరుతో.. వివిధ శాఖ‌ల ద‌గ్గ‌ర తాత్కాలికంగా ఉన్న నిధుల‌న్నిటినీ దోచేస్తోంది. అదీ ఇదీ అని లేదు.. విద్యార్థుల ప‌రీక్ష ఫీజుల నుంచి.. కోర్టులో డిపాజిట్ల వ‌ర‌కూ దేన్నీ వ‌ద‌ల‌కుండా ఊడ్చేస్తోంది. పైసా వాస‌న వ‌స్తే చాలు.. ప‌సిగ‌ట్టేసి.. పీడీ అకౌంట్ల‌తో పిప్పి పీల్చేస్తోంది. ప్ర‌భుత్వ దోపిడీకి.. ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ ల‌బోదిబోమ‌న‌డం మిన‌హా ఏమీ చేయ‌లేక‌పోతున్నాయి. తేలుకుట్టిన దొంగ‌ల్లా.. అన్ని విభాగాలు అన్నీ మూసుకొని భ‌రిస్తున్నాయి.  ప్రభుత్వ ఖజానా మాత్రమే కాదు.. ఇతర శాఖల గల్లాపెట్టెలూ ఖాళీ అయ్యాయి. చలానాలు, పరీక్ష ఫీజులు, పంచాయతీలు, మున్సిపాల్టీలకు వచ్చే ఆదాయం.. ఎక్కడా పైసా మిగలకుండా మొత్తం స్వాహా చేసేశారు. పీడీ ఖాతాల దెబ్బకు ఇప్పుడు ఏ శాఖ వద్దా కనీసం కార్యాలయాల నిర్వహణకు కూడా చిల్లిగవ్వ మిగల్లేదని అధికారులే వాపోతున్నారు.  ఏ శాఖకు, ఎక్కడి నుంచైనా ఒక్క పైసా ఆదాయం వస్తున్నట్లు తెలిస్తే చాలు.. దానికో పీడీ ఖాతా తెరిచేసి ఆ మొత్తాన్ని లాగేసుకోవడమే ఆర్థికశాఖ పనిగా పెట్టుకుంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి అలా అదేశాలు ఉన్నాయి మ‌రి. పరీక్షల కోసం ఏపీపీఎస్సీకి అభ్యర్థులు కట్టిన ఫీజులనూ ప్రభుత్వం వదల్లేదు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీపీఎస్సీ కూడబెట్టుకున్న దాదాపు రూ.100కోట్లకు పైగా పీడీ ఖాతాలతో లాగేశారని తెలుస్తోంది. దీంతో, పరీక్షలు నిర్వహించాలంటే కమిషన్ ద‌గ్గ‌ర‌ డబ్బుల్లేని పరిస్థితి. తిరిగి ఇచ్చేయ‌మ‌ని అడుగుతున్నా.. ప్ర‌భుత్వం మాత్రం కాల‌యాప‌న చేస్తూ ఆ బిల్లుల‌న్నీ పెండింగ్‌లోనే ఉంచుతోంద‌ట  బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, అభివృద్ధి పనులకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు వచ్చినా రాష్ట్రంలో ఎక్కడా ఏ పని జరక్కపోవడానికి ఇదే కారణం అంటున్నారు. బడ్జెట్‌లో ఇచ్చిన నిధులను పీడీ ఖాతాల రూపంలో తిరిగి ఖజానాలకే మళ్లించుకోవడంతో ఏ శాఖలోనూ డ‌బ్బులలేక‌ పనులు సాగడంలేదంటున్నారు. ఇలా ఏపీలో దాదాపు అన్ని ప్ర‌భుత్వ విభాగాల్లో ఏ మూల‌న‌, ఏ రూపంలో దాగున్న నిధుల‌నైనా.. పీడీ ఖాతాల‌తో స‌ర్కారు శ‌ఠ‌గోపం పెడుతోంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలే మండిప‌డుతున్నాయి. విచ్చ‌ల‌విడిగా నిధుల‌ను కొల్ల‌గొడుతున్న పీడీ అకౌంట్ల విధానాన్నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు శాఖాధిప‌తులు.   

ఎవరిది ద్రోహం ఎవరిది నేరం ? ఎల్ రమణకు సోషల్ మీడియా చురకలు..

చెప్పేవాడికి వినేవాడు లోకువ ... లేదంటే నిన్న గాక మొన్న, ఉన్న పార్టీలో గౌరవ స్థానాన్ని వదలి అధికార పార్టీలో చేరిన ఎల్. రమణ కూడా ఈటల రాజేందర్ పార్టీ మారి తెరాసకు ద్రోహం చేశారని ఆరోపించడం ఏమిటి? తెలుగు దేశం పార్టీ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు ఏ అన్యాయం చేశారని, రమణ పార్టీ వదలి వెళ్లారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, తాను తెలుగు దేశం పార్టీకి చేసింది ద్రోహమా లేక మెడపట్టుకుని గెంటిన తర్వాత, గత్యంతరం లేక పార్టీ వదిలి పోయిన ఈటల రాజేందర్’ చేసింది  ద్రోహమా, అనేది ఆయనకే అర్థం అవుతుంది.  నిజమే 2016 నుంచి 2021 వరకు పార్టీలో, ప్రభుత్వంలో అవమానాలు భరిస్తూ కూడా పదవి వదులుకోలేక ప్రగతి భవన్ గేట్లు పట్టుకు వేళ్లాడిన ఈటల రాజేందర్, ఇప్పుడు ఆత్మగౌరవం గురింఛి మాట్లాడితే, ఎంత విన సొంపుగా, ఎబ్బెట్టుగా ఉంటుందో, ఈటల పార్టీ మారడం గురించి ఎల్ రమణ మాట్లాడినా అలాగే ఉంటుంది. నిజానికి ఈటల తనంతటతాను పార్టీ మారలేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మెడపట్టి బయటకు గెంటిన తర్వాతనే మరోదారి లేక వెళ్లి బీజేపీలో  చేరారు. అంతేగాని, తెరాస సిద్దాంతం నచ్చకనో, బీజేపీ సిద్దాంతం తెగ నచ్చేసో ఆయన పార్టీ మారలేదు.ఇప్పటికి కూడా ఈటల రాజేందర్ ఎక్కడా కూడా గట్టిగా బీజేపీ గురించి మాట్లడ లేదు.అంతే కాదు, పార్టీని చూసి కాదు, నన్ను చూసి ఓటేయమనే ఓటర్లను అభ్యర్దిస్తున్నారు. నిన్నగాక మొన్న తెరాసలో చేరిన రమణ, గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించి నట్లు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో, ఉద్యమంలో. ప్రభుత్వంలో ఉండి కష్టసుఖాలు పంచుకున్న ఈటల పార్టీ మారడం పార్టీకి ద్రోహం చేయడమని మాట్లాడడం విడ్డూరంగానే కాదు, వికారంగా కూడా ఉందని ఎవరైనా అంటే, అది సబబే అనిపిస్తుంది. కాదనేందుకు కారణం కనిపించదు.  తెలుగు దేశం పార్టీ  జాతీయ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు ఏనాడూ ఎల్.రమణను పల్లెత్తు మాట అనలేదు. ఒక సారి కాదు, రెండు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేశారు. పార్టీ టిక్కెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడ లేక పోయినా, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైనా,ఆయన్ని పార్టీ పదవి నుంచి తప్పించలేదు. అయినా, కేసేఆర్ ఏమి ఎరవేశారో, ఏ పదవి ఆశ చుపారో, ఏమోకానీ, కేసీఆర్ రమ్మనగానే, రమణ ఆ పిలుపు కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నట్లు వెళ్లి కారెక్కారు. ఒక విధంగా రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, రమణ పదవులకు ఆశ పడి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయిన నాయకుడు, అవమానాలకు గురై మరో మార్గం లేక పార్టీ వదిలిన ఈటలను ద్రోహిగా పేర్కొనడం, ఏదైతే వుందో అది, ఆయన్ని అయన అవమాన పరచుకోవడమే అవుతుంది. అందుకే, రమణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.  ఈటల చేసింది పార్టీ (తెరాస) ద్రోహం అయితే, రమణ చేసింది ఏమిటో ... ఇంకేమనాలో ఆయనే చెపితే బాగుంటుందని సోషల్ మీడియాలో  రమణను నిలదీస్తున్నారు. అంతే కాదు, నమ్మి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడుకి, తెలుగు దేశం పార్టీకి రమణ చేసింది ద్రోహం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ఈటల అవమానాలను భరిస్తూ తెరాసలో కొనసాగి ఉంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికే వచ్చేది కాదు, రమణకు కారెక్కే అవకాశము ఉండేది అలాగే కౌశిక రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్లుగా రేపు పొరపాటున రమణకు కూడా చిన్నదో, పెద్దదో ఎదో ఒక పదవి దక్కితే, అది కూడా ఈటల పుణ్యమే అవుతుందని నెట్జనులు చురకులు వేస్తున్నారు.   నిజమే రాజకీయాలలోపరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం ఎవరికి అయినా అయ్యే పని కాదు. కానీ, అద్దాల మేడలో కూర్చున్నవాళ్ళుఇతరుల మీద రాళ్ళేస్తే, ఏమవుతుందో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుటుందని హితవు పలుకుతున్నారు.అంతేకాదు, సుదీర్ఘ కాలం తెలుగు దేశం పార్టీలో కొనసాగిన ఎన్నికలలో గెలిచినా, ఒడి పోయినా రమణ ఎప్పుడూ ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఒక విధంగా రమణ జెంటిల్మెన్ పాలిటీషియన్ అనే మంచి పేరుంది,  పార్టీ మారి పట్టుమని నెలరోజులు కాకముందే, టీడీపీ  సంస్కారాన్ని వదిలి  కారు కల్చర్’లోకి జారిపోవద్దని మిత్రులు హితవు పలుకుతున్నారు.

కత్తితో పొడుస్తున్నా సినిమా చూసిన జనం.. సిగ్గుపడేలా మానవత్వం 

ఉదయం 10 గంటలు.. గుంటూరు నగరంలోని ప్రధాన కూడలి పరమయ్యకుంట ప్రాంతం.. పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరమే. రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న సమయం.. ఈ సమయంలోనే ప్రేమోన్మాది కిరాతకానికి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలైపోయింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు.  పంద్రాగస్టు వేళ.. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు కేవలం కిలోమీటరు దూరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నడి రోడ్డు మీద రమ్య అనే యువతిని రెండు దెబ్బలు కొట్టి రోడ్డు మీద పడేసి.. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను ఆరు పోట్లు పొడి చేసి.. పారిపోయాడు. ఇంత జరుగుతున్నా.. ఎవరు ముందుకు రాకుండా.. జరుగుతున్నదంతా చూశారే తప్పించి..ఆదుకునేందుకు ఒక్కరు అడుగు ముందుకు వేయలేదు.కొన్ని నిమిషాల పాటు సాగిన ఈ హత్యాకాండకు సీసీ కెమేరాలో చిక్కింది. వీడియోలు సాక్ష్యంగా నిలిచాయి. మానవత్వం సిగ్గుపడేలా.. అక్కడే ఉండి సినిమా చూస్తున్న జనం తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రమ్య (19) గుంటూరు సమీపంలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. పరీక్షలు రాసేందుకు నెల క్రితం గుంటూరులోని పెదకాకాని రోడ్డు దగ్గర ఉండే నానామ్మ ఇంటికి వచ్చి ఉంటోంది. ఆమెకు ముట్లూరు గ్రామానికి చెందిన శశికృష్ణతో ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడు. ఆదివారం ఉదయం నానమ్మకు టిఫిన్ తెచ్చింది రమ్య. ఇది జరిగిన కాసేపటికి శశికృష్ణ నుంచి ఫోన్ రావటంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లింది. రోడ్డు మీదకు వచ్చిన రమ్య.. శశికృష్ణ బైక్ మీద ఎక్కగా వారు కొంతదూరం ప్రయాణించారు. మధ్యలో వచ్చిన మాట తేడాతో ఆమె బండి దిగి రోడ్డు దాటి అవతలవైపునకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహంగా బండిని తిప్పి వచ్చిన అతడు.. రమ్యను కొట్టాడు. దీంతో.. ఆమె కింద పడిపోయింది. వెంటనే.. తనతో తెచ్చుకున్న కత్తితో ఆరు పోట్లు విచక్షణారహితంగా పొడిచేశాడు. రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా.. ఏ ఒక్కరు దీన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.ఆమెను చంపేసి.. అనంతరం పరారయ్యాడు. అతని ఫోన్ స్విచాప్ చేసుకున్నాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించే సమయానికే ఆమె చనిపోయింది. రమ్య చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మనిషిలోని మానవత్వం మేలుకుంటే రమ్య గాయాలతో బతికేది. ఆమె ప్రాణాలు నిలబడేవి. కానీ వ్యక్తి చేతిలో కత్తి ఉందని ఆమె దగ్గరకూ ఎవరూ పోలేదు. చుట్టుపక్కల జనం అందరూ వస్తే ఓ నలుగురు కలిస్తే కత్తి పట్టుకున్న యువకుడు భయపడేవాడు. రాళ్లతో కొట్టినా ఆ యువతి బతికేది. కానీ ఏ ఒక్కరూ ఆమెను కాపాడిన పాపాన పోలేదు. సభ్యసమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. సమాజంలో నిర్లిప్తతత నిర్లక్ష్యం పెరిగిపోయిందని తెలుస్తోంది, రమ్య హత్య ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.  రమ్యను పొడిచేసిన తర్వాత పరారైన శశికృష్ణ అతడి తల్లి ఉండే గోళ్లపాడు గ్రామానికి వెళ్లిపోయాడు. శశికృష్ణ తల్లిదండ్రులు విడిగా ఉంటున్నారు. దీంతో.. తల్లి ఉండే గ్రామానికి వెళ్లి శశికృష్ణను గుర్తించారు. అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రమ్యను పొడిచిన కత్తితో తన మెడను గాయపర్చుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు నిలువరించారు. మెడ దగ్గర స్వల్ప గాయం కావటంతో అతడికి చికిత్స చేయించి.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మాజీగానే మహోపకారం.. ఈటలకు జైకొడుతున్న హుజురాబాద్ జనం

మాజీ మంత్రి, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రిగా ఎమ్మెల్యేగా నియోజక వర్గం ప్రజలకు ఏమి మేలు చేశారో, ఏమి మేలు చేయలేదో కానీ, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మాజీగా మారిన తర్వాత మాత్రం, నియోజకవర్గ పజలకు మహోపకారమే చేశారు. నిజానికి, ఒక్క హుజూరాబాద్ నియోజక వర్గం ప్రజలకే కాదు యావత్ తెలంగాణ ప్రజానీకానికి, మాజీ మంత్రి ఈటల మంచి  మేలు  చేశారు.  ఈటల రాజీనామాకు ముందు, రేషన్ కార్డు కావాలంటే అధికారుల కాళ్ళావేళ్ళా పడ్డా ప్రయోజనం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అధికారులే ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ రేషన్ కార్డు ఇచ్చి పోతున్నారు. ఈటల రాజీనామాకు ముందు గతుకుల రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్  మరమ్మతులు అడిగినా, పట్టిచుకున్ననాధుడు లేడు. ఇప్పుడు అధికారులు ఊరూరు తిరిగి మరీ రోడ్ల మరమ్మతులు కాదు, కొత్త రోడ్లే వేస్తున్నారు. వద్దన్నా నిధులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఇరుగు పొరుగు నియోజక వర్గాలే కాదు, రాష్ట్రంలోని మిగిలిన నియోజక వర్గాల్లో ఆ ‘మూడు’ మినహా మిగిలిన అన్ని నియోజక వర్గాల పజలు ఈర్ష పడేలా పనులు చకచకా జరిగిపోతున్నాయి. డ్వాక్రా మహిళలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సబ్సిడీలు ఇప్పుడు అడగకుండానే మంజూరవుతున్నాయి.ఇంతవరకు 65 ఏళ్లుగా ఉన్న వృద్ధాప్య  పెన్షన్ వయసు ఉప ఎన్నిక దెబ్బకు  57 ఏళ్ల దిగివచ్చింది.   ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, వీటన్నిటినీ మించిన, అల్లా ఉద్దీన్ అద్భుత దీపం, దళిత బంధు. ఈటల రాజేందర్’ను ఓడించడమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న ముఖ్యమంత్రి మేథస్సు నుంచి పుట్టిన, మానస పుత్రిక  దళిత బంధు, ఒక్కటీ ఒకెత్తు.  ప్రతి దళిత  కుటుంబానికి పది లక్షల రూపాయలు చేతుల్లో పెట్టే మహాద్భుత పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతే కాదు, ఈ పథకాన్ని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే తీసుకొచ్చామని, ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు.సో ... ‘మాజీ’  మంత్రి పుణ్యానే దళితుల బంధు పథకం వచ్చిందనేది, కాదనలేని నిజం. ఒక్క రాజేందర్ రాజీనామా చేయడం వలన  ఇన్నిని ప్రయోజనాలు జరుగుతున్నాయి,కాబట్టే ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు డప్పులు మోగుతున్నాయి. మీరూ రాజీనామా చేయండి అన్న డిమాండ్ మోత మోగుతోంది.  అయితే ఈ పథకం వలన ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా ? ఈటల రాజేందర్’ను ఓడించాలన్న అయన కల నిమవుతుందా? అంటే, అదెలా ఉన్నా, ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఆమలు చేయలేక పోతే మొదటికే మోసం తప్పదని మాత్రం అధికార పార్టీ ముఖ్య నేతలే హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా ఈటలను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా ముఖ్యమంత్రి,  పులి మీద స్వారీకి సిద్ధమయ్యారని, కొంచెం అటూ ఇటూ అయినా, హుజురాబాద్’లో గెలిచినా రాష్ట్రంలో భారీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని, హెచ్చరిస్తున్నారు. ఈ పథకం వల్ల హుజూరాబాద్‌లో ఓట్ల వర్షం కురుస్తుందని కేసీఆర్‌ లెక్కలు వేసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రుల్లో మాత్రం అది గుబులు పుట్టిస్తోంది.మాజీ ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు కడియం శ్రీహరి మర్మగర్భంగా వ్యక్తపరిచిన ఆందోళన కూడా అదే సూచిస్తోంది. మంత్రులు సైతం, ప్రైవేటు సంభాషణల్లో ఈ పథకం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళనలోనే  ఉన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆహా ఓహో అన్నా, ఇప్పటికే అనేక ఇతర వర్గాల నుంచి కుల బంధు కోసం వస్తున్న వత్తిళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు దళిత బంధు కొంప ముంచుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు సంభాషణల్లో ఈ పథకం వల్ల అనర్థం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  ఉప ఎన్నిక తేదీ ఆలస్యం అయ్యేకొద్దీ, ఈటల పట్ల సానుభూతి తగ్గుతుందని,ఆ విధంగా అధికార తెరాసకు ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నా, ఇప్పుడు కాలం గడిచే కొద్దీ దళిత బంధు గుదిబండగా మారుతుందని అంటున్నారు. అయితే, కేసీఆర్ ను తక్కువగా అంచనా వేయడం సరికాదు. ఏదైనా చేయగల ఘటనా ఘటన సమర్ధుడు. సో.. హుజూరాబాద్ ఏమి చేస్తుంది? దళిత బంధు ఏమవుతుంది? ఏమి చేస్తుంది? అనే విషయంలో ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం అంత క్షేమకరం కాదు.  

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా? రేవంత్ దెబ్బతో కారు,కమలంలో గుబులు.. 

తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టే తిరుగుతోంది. 2004 నుంచి ఇక్కడ బీసీ నేతగా ఈటల రాజేందరే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయనే బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే ఈటల సగం బీసీ, సగం ఓసీ అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. అంతేకాదు బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ యాక్టివ్ రోల్ పోషించారు. దళిత బంధు పథకంతో ఆ వర్గం ఓట్లను..  గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఆశ పెట్టుకుంది. హుజురాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థులే ఉండటంతో.. కాంగ్రెస్ కూడా బీసీనే బరిలోకి దింపాలని డిసైడైందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగబోతోందని సమాచారం. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసిందని తెలుస్తోంది. శనివారం జరిగిన పీసీసీ కార్యవర్గ  సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలించిన పీసీసీ నేతలు.. కొండా సురేఖ పేరును ఆ పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.మొదట  కేసీఆర్ దళిత బంధుకు కౌంటర్ గా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిందట. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర్ రాజనర్సింహా పేరు అనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.  హుజురాబాద్ బరిలో కొంజా సురేఖను పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్‌కు ఓ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.  హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల తర్వాత ఎక్కువగా ఓటర్లున్నది మున్నురు కాపులే. దాదాపు 28 వేలకు పైగా వీరి ఓట్లు ఉన్నాయి. పద్మశాలీ ఓట్లు కూడా దాదాపు 18 వేల వరకు ఉన్నాయి. కొండా దంపతుల్లో మురళీ కాపు కాగా.. సురేఖ పద్మశాల. ఈ లెక్కన  కొండా బరిలో ఉంటే మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు పద్మశాలి ఓట్లు కూడా కలిసివస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గానికి వరంగల్ జిల్లాతో లింకులుంటాయి. నియోజకవర్గంలోని కమలాపుర్ మండలం ఇప్పుడు కూడా వరంగల్ జిల్లా పరిధిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన శాయంపేట, పరకాల నియోజకవర్గాలకు పక్కనే హుజురాబాద్ ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో కొండా దంపతులకు భారీగా అనుచర గణం ఉందని చెబుతున్నారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు. ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో  టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ..  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లోకి మారారు. కాని వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు కొంత కాలంగా  స్తబ్ధుగా ఉండిపోయారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపారని నట్లు సమాచారం. కొండా సురేఖ అభ్యర్థి అయితే హుజురాబాద్ లో ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ కాకుండా త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ బలపడటంతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మున్నురుకాపు, పద్మశాలీ ఓట్లతో పాటు మైనార్టీ ఓట్లు కూడా కొండా దంపతులకు గంపగుత్తగా పడే అవకాశం ఉందంటున్నారు. ఆర్థికంగా బలమైన వారే కావడంతో గట్టిగా శ్రమిస్తే హుజురాబాద్ లో కాంగ్రెస్ సంచలన నమోదు చేస్తుందని గాంధీభవన్ లోనూ చర్చ సాగుతోంది. తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. దీంతో ఆచితూచి సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ రాసలీలలు బయట పెడతా! టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అనేక మలుపులు తిరుగుతూ సంచలనాలకు కారణమవుతోంది. మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బండి సంజయ్ తనను రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి అన్నారు. బండి సంజయ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను యూజ్ సెల్ ఫెలో అన్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మైనంపల్లి..  తన గురించి బండి సంజయ్ కి ఏం తెలుసని మండిపడ్డారు.  బండి సంజయ్ భరతం పడతానని హెచ్చరించాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. బండి సంజయ్ రాసలీలల వ్యవహారాలన్నీ మీడియా ముందు పెడతానని మైనంపల్లి హెచ్చరించారు. బండి సంజయ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, ఎంపీకి తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ అని వ్యంగ్యం ప్రదర్శించారు. మరోసారి మల్కాజ్ గిరిలో అడుగుపెడితే బండి గుండు పగలడం ఖాయమన్నారు మైనంపల్లి హన్మంతరావు. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా తప్పుడు సంజయ్ ఆరోపణలు చేశాడని ఆరోపించారు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ... ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్ళతో దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ  మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదన్నారు. పోలీసు అధికారుల ముందు దాడి చేస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని సంజయ్ నిలదీశారు. బీజేపీ నేతలు చనిపోవడానికైనా.. చంపడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ జెండా, మహాత్మాగాంధీ ఫొటో కింద పడేసారని దీనిపై డీజీపీ, కమిషనర్ వెంటనే స్పందించాలన్నారు. తమ కార్పొరేటర్ శ్రావణ్‌పై దాడి చేసినవారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై  పోలీసు కేసు నమోదైంది. ఈ కేసులో 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కార్యకర్తపై టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది.   

మాస్క్ తో మూతి తుడుచుకున్న జగన్.. నెవ్వర్ బిఫోర్ మెసేజ్ అంటూ ట్రోలింగ్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైలే డిఫరెంట్. ఆయన తీరు అందరికి భిన్నంగా ఉంటుంది. అందరిది ఒకదారి ఉలిపికట్టెది మరో దారి అన్నట్లుగా దేశమంతా ఒక దారిలో పోతుంటే.. ఏపీలో జగన్ రెడ్డి పాలన మరో దారిలో పోతుందనే విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఆయన రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త పాలసీ తీసుకురావడం కూడా ఇందులో భాగమే అంటారు. రివర్స్ టెండరింగ్ పాలసీ లాగానే జగన్ రెడ్డి పాలనంతా రివర్స్ గానే ఉందనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి.  కరోనా కట్టడి విషయంలోనూ సీఎం జగన్ తీరు అందరికింటే భిన్నంగానే ఉంది. ఏపీ సీఎం జగన్ కు, కరోనాకు ఉన్న అవినాభావ సంబంధం గురించి గతంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది.కరోనా మామూలు జలుబులాంటిదని, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాను తరిమేయొచ్చంటూ జగన్ చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనాతో సహజీవనం తప్పదంటూ జగన్ అన్న మరో మాట ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయింది. కరోనా కట్టడికి మాస్క్ ధరించడమే ప్రధానమని వైద్య నిపుణులు చెబుతుంటే .. ఏపీ సీఎం జగన్ మాత్రం మాస్క్ జోలికే వెళ్లలేదు. మాస్క్ లేకుండా సమావేశాలకు హాజరయ్యారు. బహిరంగ వేదికపైనా జగన్ మాస్కు పెట్టుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనాలు మాస్కు పెట్టకోకపోతే ఫైన్ గా ఫైన్ వేస్తానని చెప్పే జగనన్న మాస్కు పెట్టుకోరంటూ విమర్శలు వచ్చాయి. కరోనా సమయంలో ఎక్కువగా బయటికి రాలేదు జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే అంతా నడిపించారు.  మాస్కులు, శానిటైజర్లు… నాకెందుకు వచ్చిన గోల అనుకున్న జగన్…తాడేపల్లి ప్యాలెస్ వదిలి అడుగు బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో జగన్ మాస్కు పెట్టుకొని జనాలకు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు ఏపీ సీఎం. సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేయక తప్పదు కాబట్టి…తాజాగా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే దాకా అంతా బాగానే ఉంది.  ఏపీ ప్రజలను  ఉనుద్దేశించి మాట్లాడాల్సిందిగా జగన్ ను ఆహ్వానించగానే…ఏపీ ప్రజలకే కాదు యావత్ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ గొప్ప సందేశాన్నిచ్చారు జగన్.  ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన జగన్…అప్పటిదాకా అతి కష్టం మీద పెట్టుకున్న మాస్కును…అతి సులువుగా తీసి పడేశారు. అయితే  అప్పటిదాకా కరోనా నుంచి తనకు రక్షణనిచ్చిన మాస్క్ అని చూడకుండా…మాస్క్ పై ఏమాత్రం కనికరం లేని జగన్… అదే మాస్క్ ను కర్చీఫ్ లా భావించి మూతి తుడుచుకున్నారు. దీంతో, మాస్కును ఇలా కూడా వాడవచ్చా అంటూ అక్కడున్న వారితో పాటు…ఆ వేడుకలను లైవ్ చూస్తున్న వారంతా మాస్కు మీద వేలేసుకున్నారు. నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జగన్ ఇచ్చిన ఈ సందేశం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.  స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏ సీఎం, ఏ పీఎం, ఏ దేశాధ్యక్షుడు ఇవ్వలేని గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఘనత జగన్ దే నంటూ నెటిజన్లు  ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. మాస్క్ ను ఇలా కూడా వాడతారా…నువ్వు దేవుడివి స్వామి అంటూ మీమ్స్, సెటైర్లు పేలుస్తున్నారు. ఇన్నాళ్లు ఈ టెక్నిక్ తెలీక ఎన్ని కర్చీఫ్ లు కొన్నానో…అంటూ మన్మథుడు సినిమాలో బ్రహ్మి డైలాగ్ తో మీమ్స్ పేలుస్తున్నారు. రాక రాక…ఆర్నెల్ల తర్వాత జనం మధ్యలోకి వచ్చిన వచ్చిన జగన్…మరో 6 నెలలకు ట్రోలింగ్ కు సరిపడా కంటెంట్ ఇచ్చిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్క్ వాడకంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన జగన్…అంటూ ట్రోలింగ్ జరుగుతోంది.

బంధు.. అందరికా లేక కొందరికా? కేసీఆర్ కొంప ముంచబోతోందా? 

టీఆర్ఎస్ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోంది. దళిత బంధుతో తమకు బాగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు గులాబీ బాస్. అయితే క్షేత్రస్థాయిలో  పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దళిత బంధుతో అసలుకే ఎసరు వచ్చేలా ఉందని అధికార పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. దళిత బంధుకు అందరికి పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని లేదంటే టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి ఓపెన్ గానే చెప్పేశారు. కడియమే కాదు గులాబీ నేతలంతా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధుతో ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు.  సీఎం కేసీఆర్ దళిత బంధు వ్యూహం పెద్దగా పనిచేసే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా, దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం వారికి, “దళిత బంధు” పేరుతో రూ.10 లక్షలు నేరుగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ ముందుగా హుజరాబాద్ లో “పైలెట్ ప్రాజెక్టు” చేపట్టారు.  ఇప్పటికే, ఈ పథకం కింద వాసాలమర్రి లో 76 దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.7.76 కోట్లను అందజేశారు. తన దత్తత గ్రామం వాసాలమర్రి లో దళిత వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు బాసటగా నిలిచారు.  వాసాలమర్రి పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా, తమకు అనుకూలంగా మలుచుకునే ఆలోచనతో సీఎం కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు.  హుజరాబాద్ కోసం, మొదటి విడతగా రూ.500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 54 వేల మంది దళిత ఓటర్లు ఉన్నారు. దాదాపు 16 వేల దళిత కుటుంబాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీరందరికీ ‘దళిత బంధు” పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంది. మొదటి విడత రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో, కేవలం 5 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. దీంతో మిగతా 11 వేల మంది కుటుంబాల పరిస్థితి ఏంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.  మొదటి విడతలో కొంత మందికి ప్రయోజనం చేకూర్చితే  మిగతావారు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలున్నాయి. దళిత కుటుంబాల్లోని 65 శాతం మంది లబ్ధి పొందని కారణంగా టీఆర్ఎస్ పై కోపంతో రగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాల అందరికీ రూ. 10 లక్షల చొప్పున అందించేందుకు మరో రూ.1100 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఇదంతా కేవలం మరో 15 రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేయగలిగితే, దళిత వర్గాల్లో ఉన్న మొత్తం ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్ కు అనుకూలంగా పడే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో దళిత వర్గాల్లో చిచ్చు రాజేసిన అపవాదును టిఆర్ఎస్ మూటగట్టుకుని చతికిల పడే అవకాశాలు ఉన్నాయి. “దళిత బంధు పథకం” లబ్ధి పొందని దళితులు సాధారణంగానే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.  కేవలం దళిత కుటుంబాలకే కాకుండా, పేద, అణగారిన వర్గాల కుటుంబాల అందరికీ రూ.10 లక్షల చొప్పున అందించాలని ఆయా కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అగ్రవర్ణాల అయిన రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాల సంఘం నేతలు కూడా తమకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో “రెడ్డి” సామాజిక వర్గానికి చెందిన 22,600 ఓట్లు, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం మైనారిటీ, ఓసి వర్గాలకు చెందిన ఓట్లు దాదాపు 40 వేల వరకు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన లబ్ధి పొందని కారణంగా, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.  ప్రధానంగా వెనుకబడిన జాతిగా ఉన్న గిరిజనులకు, దళితుల వలే రూ. 10 లక్షలు తమకు, ఇవ్వనట్లయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. అలాగే యాదవులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో అందే తోక సహాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే రూ. 10లక్షల సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాదవులకు గొర్రెలు ఇచ్చి, మచ్చిక చేసుకోవడం కుదరదని ఆ వర్గాలు తేల్చి చెబుతున్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంటు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇటీవలే కల్పిం చింది. దీన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ఈ రెండు వర్గాలు, తమకు ఖచ్చితంగా రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. యాదవ సామాజిక వర్గానికి 22,150, రజక సామాజిక వర్గానికి 7,600, నాయి బ్రాహ్మణులకు 3,300, ముదిరాజ్ సామాజిక వర్గానికి 23 220, పద్మశాలి లకు 26,350 ఓట్లు, మున్నూరు కాపులకు దాదాపు 30 వేల ఓట్లు ఉన్నాయి. మైనారిటీలకు 5,100 ఓట్లు ఉన్నాయి. ఇతర అణగారిన సామాజిక వర్గాలకు కలిపి 12 వేల కోట్లు ఉన్నాయి. ప్రధానంగా, దళిత సామాజిక వర్గానికి అంటే అత్యంత వెనుకబాటుకు గురైన ఎస్టి సామాజికవర్గానికి 7,600 ఓట్లు ఉన్నాయి. వీరికి కూడా ఇలాంటి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందకపోవడం వల్ల, తమకు సైతం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్లు, రైతు బంధు పథకాలు హుజురాబాద్ నియోజకవర్గంలో వెలవెలబోతున్నాయి. రూపాయలు 10 లక్షల ఆర్థిక సాయంతో “దళిత బందు” ప్రవేశపెట్టిన పథకంతో.. ఇప్పటికే ఇస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకం ద్వారా వచ్చే లబ్ధి పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆసరా పింఛన్లు రైతుబంధు పథకం రూ.10వేలకు మించి కనిపించడం లేదు. కానీ “దళిత బంధు” పథకం రూ. 10 లక్షలు అనేసరికి ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇటీవల కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పక్కా భవనాలు ప్రతి గ్రామంలో నిర్మిస్తామని, వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఇవేమీ హుజురాబాద్ ప్రజలకు పెద్దగా ఎక్కడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడి ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ, అవి వారి చెవికి ఎక్కడం లేదు. ఏ నోట విన్నా, తమకు 10 లక్షలు ఖచ్చితంగా కావాలని డిమాండ్ వస్తోంది. మర  ప్రభుత్వం అన్ని కులాల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉందా..? లేకుంటే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి..? అనేది అగమ్యగోచరంగా కనిపిస్తోంది.

మెగాస్టార్స్ మళ్ళీ మెరిశారు.. జగన్ ఆహ్వానం అందుకేనా?

మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే సారి వార్తల్లో  తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. చిరంజీవిని జగన్ రెడ్డి పిలిచింది సినిమా ఇండస్ట్రీ సమస్యలు చర్చించేందుకే అయినా.. ఇద్దరి మద్య గత కొంతకాలంగా  ఇంకేవో సంబంధాలు ఎదుగుతూ వస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుంచి చిరంజీవికి పిలులు రావడం, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ సీరియస్  చర్చకు దారి తీసింది.  చిరంజీవి కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి, అంతేకాకుండా,ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నా.. ఈ మధ్య కాలంలో అయన మళ్ళీ రాజకీయ వార్తల్లోనూ కనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానం కాంగ్రెస్ నాయకులకే వచ్చింది. అయినప్పటికీ ఆయనేమీ స్పందించలేదు కానీ, కాంగ్రెస్ నాయకులే చర్చించుకుని, చివరకు ఉన్నారనే నిర్ణయానికి వచ్చారు. అలాగే, చిరంజీవిని ఏపీసీసీ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అదలా ఉంటే, చిరంజీవికి  జగన్ రెడ్డి రాజ్య సభ టికెట్ ప్రామిస్ చేసినట్లు మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో .. ఏపీ సీఎం మెగాస్టార్’ను ఎందుకు పిలిచినా, మీడియాలో మాత్రం ఇంకేందుకో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ‘అన్నయ్య’ కథ అలా ఉంటే జనసేన అదినేత ‘తమ్ముడు’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలం తర్వాత ఏపీలోలో ఎంట్రీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకే ఆయన శనివారమే విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు (ఆదివారం) మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. స్వాతంత్ర స్పూర్తితో రాజకీయాలలో మార్పు రావాలని, అందుకు ఈతరం ముందుండాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే, అలాంటి స్పూర్తిని రగిల్చేందుకు ప్రభుత్వ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెడతామని, అన్నారు.  ఈసారి ఏపీ పర్యటనలో పవన్ కళ్యాణ్ లో  మార్పు కనిపిస్తోంది. గతంలో చాలా కాలంగా ఆయన ఏపీకి వచ్చినా మిత్ర పక్షం బీజేపీకి సమాచారమే ఉండేది కాదు. జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని, అటు నుంచి అటే వెళ్ళిపోవడం జరుగుతోంది. అయితే, ఇటీవల బీజేపీ నాయకులు, ఇదేమి మిత్ర ధర్మం, ఉమ్మడి పోరాటాలు చేయాలని చెప్పుకున్న సంకల్పం ఏమైందని, కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ, జనసేన పొత్తు పుటుక్కుమన్నట్లే, అన్న ప్రచారం జరిగింది. బీజేపీ నాయకుల హెచ్చరికలే పనిచేశాయో, ఏమో కానీ, ఈసారి  విజయవాడలో కాలు పెడుతూనే, నాయకుల టచ్’లోకి వెళ్ళిపోయారు. పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌’తో కలిసి జనసేన- బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌, దగ్గుబాటి పురందేశ్వరితో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.  మాములుగా అయితే పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవును కానీ, విడిపోయాయి అనుకున్న పార్టీలు  మళ్ళీ కలవడంతో  రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది.

అమరావతికే జగన్ జై కొడతారా? పంద్రాగస్టు ప్రసంగంలో సంకేతమిచ్చారా? 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్ మనసు మారిందా? మూడు రాజధానుల సిద్ధాంతాన్ని పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అమరావతి పేరు వింటేనే విసుక్కునే  వైసీపీ అధినేత.. ఇప్పుడు అమరావతి అభివృద్ధిపై ఫోకస్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రశ్నలే అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. కొన్ని రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయి. మూడు రాజధానుల సిద్ధాంతాన్ని సీఎం జగన్ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కిలిక విరామామా లేక నిజంగానే ఆయన మనుస మారిందా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.  చాలా కాలంగా సీఎం జగన్ సచివాలయానికి వెళ్లడం లేదు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సడెన్ గా ఆయన మానసు మార్చుకున్నారు. ఇక నుంచి సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించారు. ప్రతి పది రోజులకోసారి సచివాలయానికి వెళ్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇటీవలకాలంలో సచిలవాలయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో సీఎం జగన్ సచివాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  సీఎం జగన్ నిర్ణయంతో సచివాలయంతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.  ఇక నుంచి సచివాలయానికి వెళ్ళాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారు?. ఆకస్మిక నిర్ణయానికి దారితీసిన పరిణామాలు ఏమైఉంటాయి?. సచివాలయ విషయంలో ఐఏఎస్‌లపై చీఫ్ సెక్రెటరీ ఎందుకు సీరియస్‌గా ఉన్నారు ?. అమరావతి నుంచి విధులు నిర్వర్తించడం ఇన్నాళ్లూ ఎందుకు జరగలేదు?. మూడు రాజధానుల సిద్ధాంతానికి జగన్ తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నారా?.’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగానే స్వాత్రంత్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి.. మూడు రాజధానుల ప్రస్తావనే తన ప్రసంగంలో తేలేదు. దీంతో అమరావతి విషయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తుందనే చర్చ జోరందుకుంది.  స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏమేం చేసింది..? అనేదానితో పాటు పలు విషయాలపై నిశితంగా మాట్లాడారు సీఎం జగన్. అయితే.. గతంలో పలు సభల్లో, సమావేశాల్లో, పంద్రాగస్టులో కూడా మూడు రాజధానుల గురించి జగన్ చాలా సార్లే ప్రస్తావించారు. ఈసారి ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావనే అస్సలు కనిపించలేదు. ఆయన ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రాకపోవడంతో వేడుకలకు వచ్చిన పెద్దలు, వైసీపీ నేతలు, వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. పాలనలోని ముఖ్య అంశాలను ప్రస్తావించిన జగన్.. అత్యంత కీలకమైన మూడు రాజధానుల గురించి మాట్లాడకపోవడంతో... ఏదో జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.  అమరావతి రైతుల ఉద్యమం 600 రోజులకు పైగా కొనసాగుతోంది. రైతులు, రైతు కూలీలు పోరాచం చేస్తున్నారు. మరోవైపు ఏపీలోని తీరప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం, గతంలో పట్టించుకోని సచివాలయానికి రెగ్యులర్ గా వెళ్లాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తీరుతో అమరావతి విషయంలో ఆయన కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుందనే చర్చ వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.