హుజురాబాద్ లో దళిత బంధు సెగలు.. టీఆర్ఎస్ నేతల్లో గుబులు

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఈ పాట ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా అతికిపోయినట్లుగా మారింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకం..  ఆ పార్టీకి గండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును ప్రవేశపెట్టారని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇప్పుడా హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులే ఆందోళనలు చేస్తుండటం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దళిత బంధులో తమ పేర్లు లేవంటూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ దళితులు నిరసనలకు దిగారు.  దళిత బంధుపై రెండు రోజులుగా హుజురాబాద్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళిత బంధును అర్హులకు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హుజురాబాద్‌లో దళితులు ధర్నాకు దిగారు. దళితులు చేపట్టిన రాస్తారోకోతో  వరంగల్- కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత బంధు అందరికి ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దళితుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.  హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట నర్సింగ పూర్ గ్రామ దళితుల ఆందోళన చేశారు. గ్రామంలో ఉన్న దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరికి మొదటి దఫాలో ఇస్తే మిగతా వారికి వస్తాయన్న గ్యారెంటీ లేదని నినాదాలు చేశారు.  పోలీసులతో దళితులు వాగ్వాదానికి దిగారు. దళితుల ఆందోళనతో టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు. కరీంనగర్‌లో ముగ్గురు మంత్రులు సమావేశం నిర్వహించారు. సీఎం సభ, అర్హుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు.  సీఎం కేసీఆర్ పర్యటనతో పాటు దళితుల ఆందోళనలపై చర్చించారు. మరోవైపు హుజూరాబాద్‌లో ధళిత బంధు తొలి లబ్దిదారులుగా 15 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు తెలంగాణ దళితబంధు పథకం చెక్కులను సీఎం కేసీఆర్ అందజేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శనివారం రాత్రి వరకూ జాబితా ఖరారు చేయనున్నారు. జాబితాను  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్ కర్ణన్ పంపనున్నారు. సీఎం ఆమోదంతో తొలి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 

న‌దిలో 132 లారీలు.. ముంచెత్తిన‌ కృష్ణా వ‌ర‌ద‌.. డ్రైవ‌ర్లు విల‌విల‌..

అది కృష్ణాన‌ది. ఎప్ప‌టిలానే ఇసుక త‌వ్వ‌కాలు జరుగుతున్నాయి. లారీ వెనుక లారీ.. అలా వంద‌లాది లారీలు.. న‌ది తీరంలో వ‌రుస క‌డుతున్నాయి. ఎప్పుడూ జ‌రిగేదే ఇది. కానీ, ఈసారి రొటీన్‌కు భిన్నంగా ప‌రిస్థితులు మారిపోయాయి. ఒక్క‌సారిగా కృష్ణ‌మ్మ పొంగిపొర్లింది. బిర‌బిరా వ‌ర‌ద పోటెత్తింది. చూస్తుండ‌గానే న‌ది నిండుగా మారిపోయింది. అంతే.. లారీల చుట్టూ నీళ్లు. నీళ్ల‌లో లారీలు. ఈ అనూహ్య ప‌రిణామం ఇప్పుడు ప్రాణాల‌తో చెల‌గాటంగా ప‌రిణ‌మించింది. న‌దిలో నుంచి బ‌య‌ట‌ప‌డే దారిలేక‌, న‌దిలో ఉండ‌లేక‌.. లారీ డ్రైవ‌ర్లు విల‌విల్లాడుతున్నారు. ఇంత‌కీ అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందంటే..... కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు ద‌గ్గ‌ర‌ కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరదలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 132 లారీలు వరదలో ఇరుక్కుపోయినట్టు స‌మాచారం. ఒడ్డుకు ఎలా చేరాలో తెలీక‌ లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు.   పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు. న‌దీ ఉధృతి త‌గ్గితేనే.. వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసుకురాగ‌ల‌మ‌ని అంటున్నారు అధికారులు. 

బీజేపీకి 'విష్ణు' నామాలు.. విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో డ్రామాలు!

కోవ‌ర్టులు అన్నిపార్టీల్లోనూ ఉంటారు. కుట్ర‌లు, కుతంత్రాలు చేసే కుహానా లీడ‌ర్లకు సిద్ధాంత పార్టీగా చెప్పుకునే బీజేపీ సైతం అందుకు అతీతం కాదు. ఏపీ బీజేపీ మొత్తాన్ని జ‌ల్లెడ ప‌డితే.. అంద‌రికంటే నెంబ‌ర్‌వ‌న్ ఫ్రాడ్‌గా తేలే లీడ‌ర్ ఒక‌రున్నారు. కమలంలో ఆ ఏ1 కోవర్డు లీడరు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి అని అంటారు. ఆయ‌న అధికార‌పార్టీలో ఉన్న ఏ2 లీడ‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తార‌ని చెబుతారు. అదేమి రాజ‌కీయ‌మో కానీ, ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండి.. ప్ర‌భుత్వం మీద కంటే మ‌రో ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ మీదే ఎక్కువ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. రెడ్డిగా రెడ్ల పార్టీకి ఫుల్‌ స‌పోర్ట్ చేస్తుంటార‌నే విమ‌ర్శ ఉంది. క‌మ్మ నాయ‌కులే ఆయ‌న మెయిన్ టార్గెట్ అనే ఆరోప‌ణ కూడా ఉంది. అందుకే కాబోలు, వైసీపీ నాయ‌కులు సైతం విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని ప‌ళ్లెత్తి మాట అన‌రు. ఈయ‌న మాత్రం క‌మ‌లం పువ్వుల‌తో కొట్టిన‌ట్టు.. అధికార పార్టీపై సుతిమెత్త‌ని విమ‌ర్శ‌ల‌తో దాడి చేసిన‌ట్టు భ‌లే న‌టిస్తారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆశీస్సులు ఈ కాషాయ కండువా క‌ప్పుకున్న నీలి మ‌నిషికి ఫుల్లుగా ఉన్నాయ‌ని అంటారు. ఈ వీర భ‌క్త‌ విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి గుండెలు చీల్చితే.. న‌రేంద్రుడు కాకుండా జ‌గ‌న్మోహ‌నుడు క‌నిపిస్తాడ‌ని ఏపీలో సెటైర్లు పేలుతుంటాయి.  ఇక గురివింద గింజ‌లా ఆయ‌న కింద ఉన్న న‌లుపునంతా కాషాయ వ‌ర్ణంతో క‌ప్పేసుకొని.. మీడియా వేదిక‌ల‌పై పేద్ద నోరేసుకొని ప‌డుతూ.. త‌న‌ పాపులారిటీ మాత్రం బాగా పెంచేసుకుంటారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తికి బీజేపీ పార్టీ ప‌రంగా మ‌ద్ద‌తు పలికితే.. ఈయ‌న మాత్రం వ్య‌క్త‌గ‌తంతా అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని, నాయ‌కుల‌ను అవ‌హేళ‌న చేస్తుంటారు. క‌డుపు మండిన జేఏసీ నాయ‌కుడు.. ఓ టీవీ ఛానెల్ డిస్క‌ష‌న్‌లో చెప్పుతో కొట్టినా.. విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి డ‌బుల్‌గేమ్ పాలిటిక్స్‌లో ఏమాత్రం మార్పురాక‌పోవ‌డం సిగ్గు..సిగ్గు... ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల‌తోనే విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి బీజేవైఎమ్ అధ్య‌క్షుడి నుంచి బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ స్థాయి వ‌ర‌కూ ఎదిగార‌ని అంటారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌విపైనే క‌న్నేసార‌ని అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఎపిసోడ్‌లో అధ్య‌క్షుడు సోము వీర్రాజును ట్రాప్‌లో ఇరికించి.. ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసి.. సోము ప‌ద‌వికే ఎస‌రు వ‌చ్చేలా చేశారు. వీర్రాజును బ‌ద్నామ్ చేసి.. ఆయ‌న సీటును కొట్టేయాల‌నేది ఈయన స్కెచ్‌లా క‌న‌బ‌డుతోందని బీజేపీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి.   టిప్పుసుల్తాన్ విగ్ర‌హ రాజ‌కీయంపై పొద్దుటూరులో హైడ్రామా న‌డిచింది. విగ్ర‌హం ఏర్పాటుకు క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ అనుమ‌తి నిరాక‌రిస్తూ.. జులై 23న ఉత్త‌ర్వులు ఇచ్చారు. కామెడీగా.. విగ్ర‌హ ఏర్పాటు వ‌ద్దంటూ జులై 27న సోము వీర్రాజు ఆధ్వ‌ర్యంలో ప్రొద్దుటూరులో బీజేపీ ధ‌ర్నా చేసింది. అప్పటికి నాలుగు రోజుల ముందే క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యాన్ని విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి కావాల‌నే మ‌రుగున పెట్టి.. పార్టీ అధ్య‌క్షులు సోము వీర్రాజును ఉసిగొల్పి.. ఆయ‌న‌తో ధర్నా చేయించి.. పార్టీ ప‌రువు తీయ‌డంతో పాటు అధ్య‌క్షులు వీర్రాజునూ కామెడీ పీస్‌గా మార్చేశార‌ని.. అదంతా విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ఆడిన పొలిటిక‌ల్ డ్రామా అనేది బీజేపీ వ‌ర్గాల అనుమానం. త‌మ వాడైన విష్ణును ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెట్టాల‌నేది విజ‌య‌సాయి స్కెచ్‌. సోము వీర్రాజు సైతం త‌మ వాడేనైనా ఆయ‌న రెడ్డి కాదుగా. అందుకే, వీర్రాజును త‌ప్పించి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని క‌మ‌ల ద‌ళ‌ప‌తి చేసి.. టీడీపీపై దండెత్తేలా చేయాల‌నేది వైసీపీ పెద్ద‌ల స్కెచ్‌. అందుకే, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని రెండేళ్లుగా ప‌రోక్షంగా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది అధికార పార్టీ. బీజేపీ ఇంట‌ర్న‌ల్ మేట‌ర్‌ను.. నీలి మీడియాకు లీక్ చేసేది కూడా విష్ణునే అంటారు.  ఇక విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి విష‌య ప‌రిజ్ఞానం, మేధావిత‌నం గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. ఆయ‌న చేసే ట్వీట్లలో కొన్ని మాస్ట‌ర్ పీస్‌లు ఉంటాయి. బిర బిర కృష్ణమ్మ శ్రీశైలం నుండి సాగుతు గోదావరిలో క‌ల‌వ‌డం.. గోమాత సంర‌క్ష‌ణ అంటూ ఎద్దు ఫోటో పెట్ట‌డం.. మ‌హిళ‌ల‌పై అస‌భ్య పోస్టులు.. "హేమమాలిన చర్య" లాంటి కామెంట్లు.. ఇలా తిక్క‌తిక్క‌ ట్వీట్ల‌తో త‌న ప‌ర‌మానంద‌య్య శిష్య‌రికాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లుమార్లు  ఘ‌నంగా చాటుకున్నారు. లంక దిన‌క‌ర్ లాంటి మేధావి నాలెడ్జ్‌లో చిటికెడంత ప‌రిజ్ఞానం కూడా లేని విష్ణువ‌ర్థ‌న్‌.. కేవ‌లం రెడ్డి కార్డు మీదే బాగా నెట్టుకొస్తున్నారనే విమ‌ర్శ‌ ఉంది. టీడీపీ, క‌మ్మ నాయ‌కులే టార్గెట్‌గా.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సూచ‌న‌ల‌తో చెల‌రేగిపోతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  ఇక మ‌నోడి క్రైమ్ హిస్ట‌రీపైనా ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. అనంతపురంలో మహిళ మిస్సింగ్ కేసు.. కల్కి ఆశ్రమంలో 30 కోట్ల దందా.. బెంగుళూరులో మెడికల్ కాలేజీ.. బినామీల పేరుతో నర్సింగ్ కాలేజీలు.. స్పా సెంటర్ల లీలలు.. అబ్బో విష్ణులీల‌ల‌పై అనేక ఆరోపణలు.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌హ‌కారంతో కోట్ల రూపాయ‌ల అక్ర‌మ సంప‌ద పోగేశార‌నే విమ‌ర్శ‌లు.. ఉన్నాయి. ఇప్పుడు అదే విజ‌య‌సాయి మ‌ద్ద‌తుతో ఏకంగా ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి కొట్టేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. త‌న ఎదుగుద‌ల‌కు అడ్డుగా ఉన్న సోము వీర్రాజును అడ్డు తొల‌గించుకునేందుకే.. ప్రొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్ర‌హంపై అవుట్‌-డేటెడ్ ధ‌ర్నా చేయించి.. వీర్రాజు వెర్రివాడిని చేశార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో అధికార‌ప‌క్ష నేత‌గా ఉన్న విష్ణు.. బీజేపీకి పంగ‌నామాలు పెడుతూ.. వైసీపీపై ఉత్తుత్తి పోరాటం చేస్తూ.. టీడీపీ-క‌మ్మ శ్రేణుల‌పై మాట‌ల‌తో క‌త్తియుద్ధం చేస్తుంటార‌ని అంటారు. విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి వ‌ల్ల బీజేపీకి ఎలాంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు, ప‌రోక్షంగా వైసీపీకి ఫుల్ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతున్నాయ‌ని చెబుతారు. క‌మ‌లం పూదోట‌లో క‌లుపుమొక్క విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి అనేది క‌మ‌ల‌నాథుల‌ మాట‌.

సీఈసీ వెబ్ సైట్ హ్యాక్.. కోటి ఫేక్ ఐడీ కార్డ్స్! ఈవీఎమ్ లు సేఫేనా? 

దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. బ్యాంకింగ్ రంగాన్ని షేక్ చేస్తున్నారు కేటుగాళ్లు, సైబల్ ఛీటర్ల వలలో చిక్కుకుని జనాలు విలవిలలాడుతున్నారు. తాజాగా సైబర్ హ్యాకర్ల మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా  భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ను హ్యాక్ చేశారు. హ్యాకర్లు పదివేలకు పైగా నకిలీ ఓటర్ ఐడి కార్డులను సృష్టించారని తెలుస్తోంది. ఈ కేసులో మొరెనాకు చెందిన నలుగురు యువకులను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు గురువారం 24 ఏళ్ల విపుల్ సైనీ.. వందలాది నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేస్తు పట్టబడ్డారు. సైనీ విచారణలో అసలు సంగతి బయట పడింది.  అర్మాన్ మాలిక్ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌లోని హర్దా నివాసి సైనీ పనిచేస్తున్నాడని.. 3 నెలల్లో 10,000 కంటే ఎక్కువ నకిలీ ఓటర్ ఐడీలను సృష్టించాడని తేలింది. మొరెనాలోని అంబాలో నివసించే 18 ఏళ్ల హరియోమ్ ప్రమేయం గురించి UP పోలీసులు MP పోలీసులకు సమాచారం అందించారు. హరియోమ్..  సైనీతో నేరుగా సంప్రదింపులు జరిపారని.. దానిని ఇతరులకు విక్రయించడానికి ID ని ఉంచారని తెలుస్తోంది. శుక్రవారం హరియోమ్‌తో సంబంధం ఉన్న 17 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి తన వద్ద కనీసం కోటి నిజమైన .. నకిలీ ఓటర్ IDలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు.  సిమ్ కార్డులు కొనడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆన్‌లైన్ మోసానికి ప్రధానంగా నకిలీ ఐడీలను ఉపయోగించే మోసగాళ్లకు డేటాను నిందితులు విక్రయించేవారు. పోలీసుల ప్రకారం ఈ టీనేజర్స్ వారు హరియోమ్ వద్ద పని చేస్తున్నట్లు తెలిపారు. వారు ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇతర ముఠా సభ్యుల గురించి మరింత తెలుసుకోవడానికి ఎంపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులంతా పేద కుటుంబాలకు చెందినవారే. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా  అర్మాన్ మాలిక్ ను గుర్తించారు పోలీసులు. నకిలీ ఓటరు ఐడి తయారు చేయడం గురించి మాలిక్ తనకు తెలియజేసేవారని సైనీ పోలీసులకు చెప్పాడు. అతను ఓటర్ ఐడి కోసం 100 నుండి 200 రూపాయలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. పని ఆధారంగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు వచ్చేవాని నింధితులు తెలిపారు.  ఫేక్ ఓటర్ కార్డులు, వెబ్ సైట్ హ్యాకింగ్ పై ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పందించారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లు (ఇరోస్) పౌరులకు సేవలను అందిస్తారని.. ఓటర్ ఐడి కార్డుల ముద్రణ సకాలంలో పంపిణీకి బాధ్యత వహిస్తారని చెప్పారు. AERO కార్యాలయం డేటా ఎంట్రీ ఆపరేటర్ తన ఐడి , పాస్‌వర్డ్‌ని సహరన్‌పూర్‌లోని నకుడ్‌లోని ఒక ప్రైవేట్ అనధికార సర్వీస్ ప్రొవైడర్‌కు చట్టవిరుద్ధంగా ఇచ్చారని తద్వారా అతను కొన్ని ఓటర్ కార్డులను ముద్రించగలడని ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రతినిధి తెలిపారు. ఎన్నికల కమిషన్ డేటాబేస్ పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పారు.  ఎన్నికల కమిషన్ డేటా సురక్షితంగా ఉందని అధికారులు చెబుతున్నా.. వైబ్ సైట్ హ్యాక్ కావడంపై సంచనంగా మారింది. సీఈసీ కార్యకలాపాలన్ని రహస్యంగా జరుగుతుంటాయి. తాజా ఘటనపై సీఈసీకి భద్రత లేదని తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ కేసం సీఈసీ ఉపయోగిస్తున్న ఈవీఎమ్ ల భద్రపైనా మళ్లీ చర్చ మొదలైంది. ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేయవచ్చనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. కొన్ని పార్టీలు ఈవీఎమ్ ల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ట్యాంపరింగ్ కు ఎలాంటి అవకాశం లేదని సీఈసీ చెబుతున్నా.. వెబ్ సైట్ హ్యాక్ కావడం ఇప్పుడు చర్చగా మారింది. వెబ్ సైట్ కే పూర్తి రక్షణ లేనప్పుడు ఈవీఎమ్ లు ట్యాంపరింగ్ కావలని ఎలా చెప్పగలమనే ప్రశ్న వస్తోంది. 

చలానాల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం?

నకిలీ చలానాల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది.  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో జరిగిన అక్రమాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేస్తున్నాయి. చలానా మార్ఫింగ్ తో దాదాపు 10 కోట్ల రూపాయల అక్రమాలకు  పాల్పడ్డారని తెలుస్తోంది. చలనాల కుంభకోణంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పై అధికారులు వేటు వేశారు. కడపలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే నకిలీ చలానాలకు సంబంధించి మొత్తం 5.5 కోట్ల రూపాయలు తేడా వచ్చినట్టు గుర్తించామని ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు నిర్ధారించారు. కృష్ణా, కడప జిల్లాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేరుకున్నాయి.  నకిలీ చలానాల కుంభకోణంలో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రజాప్రతినిధులకు వాటాలు ఇచ్చే కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా కుంభకోణానికి తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి చలానాల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. మంత్రి నుంచి అనేకమంది వైసీపీ పెద్దలకు కోట్ల రూపాయలు వాటాలు వెళ్ళాయన్నారు. చాలనాల కుంభకోణంలో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేస్తే కొంత అయినా నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారులపై విచారణ చేసి చేతులు దులుపుకోవాలను కోవటం కుట్రలో భాగమే అని అన్నారు. ఇది గతంలో జరిగిన నకిలీ స్టాంపుల స్కాం తెల్గిని మించి ఏపీలో వైసీపీ నాయకులు దోచేశారని వ్యాఖ్యానించారు. వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ చేస్తే నిజాలు నిగ్గు తెలుతాయని బోండా ఉమా అన్నారు.  మరోవైపు నకిలీ చలానాల అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన చర్చించారు. సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సమాధానంగా ఇప్పటికే రూ. 40 లక్షలు రికవరీ చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంపై పూర్తి  స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

గాలి కేసులో అలా.. జగన్ కేసులో ఇలా! సీబీఐ ఎందుకిలా? 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న రఘురామ.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు ఇవ్వబోతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో ఏం జరగబోతుందన్న టెన్షన్ వైసీపీలో నెలకొంది. అంతేకాదు ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా మరో పిటిషన్ వేశారు ఎంపీ రఘురామ రాజు. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. విజయసాయికి కౌంటర్ కు గడవు కావాలని కోరవడంతో విచారణను ఆనెల 16కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.  జగన్, విజయసాయి రెడ్డి కేసుల సమయంలోనే గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసులోనూ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సీబీఐ తీరుపై కొన్ని అనుమానాలకు కారణమవుతున్నాయి. మైనింగ్ అక్ర‌మాల కేసు వెంటాడుతున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసులో సీబీఐ వాదనకు... జగన్ , విజయసాయి కేసుల్లో  సీబీఐ వినిపిస్తున్న వాదనకు పొంతన లేకుండా ఉందనే చర్చ  రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వీరిద్ద‌రి విష‌యంలో సీబీఐ కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.  విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ఈ నెల 7వ తేదీన ర‌ఘురామ పిటిష‌న్ వేయ‌గా.. ఆ రోజునే కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని విజ‌యసాయిని, సీబీఐని ఆదేశిస్తూ.. ఇందుకోసం మూడు రోజుల గ‌డువు విధించింది. కేసు విచార‌ణ‌ ఈ నెల 10కి వాయిదావేసింది. ఆ రోజు విచార‌ణ సంద‌ర్భంగా.. కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సీబీఐ కోరింది. దీంతో.. మ‌రో మూడు రోజుల గ‌డువు ఇస్తూ.. కేసును 13వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. శుక్రవారం జరిగిన విచార‌ణ‌లో సీబీఐ త‌నదైన వాద‌న ఏమీ వినిపించ‌లేదు. కోర్టు మెరిట్ ప్ర‌కార‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని అఫిడ విట్ లో కోరింది. దాని ప్ర‌కార‌మే బెయిల్ ర‌ద్దు చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. సీబీఐ అఫిడ విట్ స్వీకరించిన కోర్టు.. విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ విచార‌ణ‌లోనూ సీబీఐ ఇదేవిధ‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేసింది. కోర్టు మెరిట్ ప్రకార‌మే బెయిల్ ర‌ద్దు చేయాలా? వ‌ద్దా? అనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని తెలిపింది.  అయితే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి విష‌యంలో సీబీఐ ఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌రిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చిన‌ప్ప‌టికీ.. అందులో ప‌లు ష‌ర‌తులు ఉన్నాయి. అందులో బ‌ళ్లారికి వెళ్ల‌కూడ‌ద‌నే రూల్ కూడా ఉంది. ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సి వ‌స్తే.. కోర్టు అనుమ‌తి తీసుకుని మాత్ర‌మే వెళ్లాలి. ఈ విష‌యంలో త‌న‌కు స‌డ‌లింపు ఇవ్వాల‌ని ప‌లుమార్లు ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. కానీ.. ఫ‌లితం రాలేదు. ఇప్పుడు మ‌రోసారి కూడా సుప్రీం కోర్టులో ఈ మేర‌కు ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. బెయిల్ ష‌ర‌తుల‌ను స‌డ‌లించాల‌ని కోరేందుకు చూస్తున్నారు. అయితే.. సీబీఐ మాత్రం స‌సేమిరా అని వాదిస్తోంది. ఆయ‌న బ‌ళ్లారి వెళ్ల‌డం జ‌రిగితే.. సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేస్తార‌ని సీబీఐ చెబుతోంది. అందువ‌ల్ల ఆయ‌న బెయిల్ ష‌ర‌తుల‌ను స‌డ‌లించొద్ద‌ని బ‌లంగా కోరుతోంది సీబీఐ. విజ‌య‌సాయి రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని వేసిన‌ పిటిష‌న్లో.. న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు కోర్టు దృష్టికి ప‌లు విష‌యాలు తీసుకెళ్లారు. ఆయ‌న బెయిల్ ఎందుకు ర‌ద్దు చేయాలో అందులో వివ‌రించారు. ఎంపీ విజ‌యసాయిరెడ్డి త‌న అధికారాన్ని ఉప‌యోగించి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు తీర్పు వెలువ‌డ‌నున్న‌ నేప‌థ్యంలో.. ఏ2గా ఉన్న విజ‌య‌సాయి విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల‌ ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరారు. స‌రిగ్గా.. ఈ విష‌యం ద‌గ్గ‌ర‌నే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి మ‌ధ్య పోలిక తెస్తున్నారు కొంద‌రు. జ‌గ‌న్‌, విజ‌య‌సాయి విష‌యంలో ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న సీబీఐ.. మ‌రి, గాలి విష‌యంలో మాత్రం మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తోందా? అని చ‌ర్చించుకుంటున్నారు.  

లీటర్ పెట్రోల్ పై రూ. 3 తగ్గించిన స్టాలిన్.. ప్రజలను బాదుడే జగనన్న స్టైల్? 

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ ఎప్పుడో దాటేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేట్ 110 రూపాయలకు చేరువలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ రేటు కూడా దూసుకుపోతోంది. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్కుకు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వందకు దరిదాపులో ఉంది లీటర్ డీజిల్ ధర. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో పెట్రోల్ పై రూ.13 డీజిల్ పై రూ.16 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రతి రాష్ట్రానికి వ్యాట్ శాతంలో మార్పు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆయిల్ ధరలు మరింత భగ్గుమంటున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం ట్యాక్సులు భారీగా పెంచడంతో దక్షిణాదిలో ఏపీలోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు మాత్రం ఖజనా నింపుకునేందుకు భారం మోపతూనే ఉన్నాయి. కేంద్ర సర్కార్ వల్లే ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రాలే పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం చెబుతూ జనాల నడ్డి విరుస్తున్నాయి. ఏపీ సర్కార్ పెంచిన ట్యాక్సులు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు రాష్ట్రాల చేతుల్లో లేదంటూ కవరింగ్ చేసుకుంటోంది. అయితే తాజాగా తమిళనాడు సర్కార్ మాత్రం తమ ప్రజలపై భారం పడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తూ తమిళనాడు సీఎం స్టాలిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ ధర లీటరుకు రూ.3 తగ్గిస్తూ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించారు.  తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆ విషయాన్ని సభలో ప్రకటించారు. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ.3 తగ్గించామని చెప్పారు. ఇప్పటిదాకా లీటర్ పెట్రోల్ పై రూ.32.90 ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా తాజా ప్రకటనతో అది రూ.29.90కు తగ్గింది. స్టాలిన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు ఏటా రూ.1160 కోట్లు నష్టం వాటిల్లనుంది. అయితే సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు. స్టాలిన్ నిర్ణయంతో ఏపీలోని జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ధరల తగ్గింపు రాష్ట్రాల పరిధిలో లేదంటున్న ప్రభుత్వం.. స్ఠాలిన్ నిర్ణయంపై ఏం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికేనా ప్రజలపై బాదుడు ఆపండి జగన్ రెడ్డి గారు అంటూ పోస్టులు పెడుతున్నారు.   

రేవంత్‌-సంజ‌య్‌.. కేసీఆర్‌తో సంగ్రామంలో గెలిచేదెవ‌రు?

తెలంగాణ‌లో కేసీఆరే అంద‌రికీ రాజ‌కీయ‌ విల‌న్‌. మ‌రి, హీరో ఎవ‌రు? విల‌న్‌తో పోరాడి గెలిచేదెవ‌రు? ఈ మ‌ల్టీస్టార‌ర్ పొలిటిక‌ల్ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతోంది? హీరోలు, విల‌న్ ఉన్న ఈ నాట‌కంలో ఎవ‌రి పాత్ర ఏంటి? చాలా ఆస‌క్తిగా సాగుతోంది తెలంగాణ సంగ్రామం. కేసీఆర్, రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, వైఎస్ ష‌ర్మిల‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌.. ఇలా అంద‌రూ కీల‌క పాత్ర‌దారులే. పోరుకు అనేక మంది ఉన్నా.. పోరాడి నిలిచేదెవ‌ర‌నేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌.   పీసీసీ చీఫ్ ప‌ద‌వితో రేవంత్‌రెడ్డి రెచ్చిపోతున్నారు. ధ‌ర్నాల‌తో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ద‌ళిత‌-గిరిజ‌న దండోరాతో కేసీఆర్ ద‌ళిత బంధు ఎత్తుగ‌డ‌కు విరుగుడు మంత్రం పారిస్తున్నారు. వ‌రుస‌బెట్టి భారీ బ‌హిరంగ స‌భ‌ల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారు రేవంత్‌రెడ్డి. చేష్ట‌లుడిగి, స్త‌బ్దుగా మారిన కాంగ్రెస్‌లో పున‌రుత్తేజం నింపుతున్నారు. రెండు నెల‌లుగా తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి పేరు డైన‌మైట్‌లా పేలుతోంది. రేవంత్ దూకుడుతో వేటాడే పులిలా కాస్త వెన‌క్కిత‌గ్గిన బీజేపీ.. ఇప్పుడు పంజా విసిరి దాడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. బీజేపీ ర‌థ‌సార‌ధి బండి టాప్ గేర్‌లో దూసుకొస్తున్నారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో తెలంగాణ‌ను చుట్టేయ‌నున్నారు. బీజేపీ బండికి ఫ‌స్ట్ టార్గెట్ హుజురాబాద్‌.. మెయిన్ టార్గెట్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌.  ఈసారి జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీకి అత్యంత కీల‌కం. ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌నే ధీమాగా ఉన్న క‌మ‌ల‌నాథుల‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో గ‌ట్టి స‌వాల్ ఎదురైంది. స్మూత్‌గా సాగుతుంద‌నుకున్న బండికి.. గ‌ట్టి హార్డిల్ అడ్డు వ‌చ్చింది. అందుకే, కాషాయ‌ద‌ళం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించుకొని.. తెలంగాణ‌లో కేసీఆర్‌ను దెబ్బ కొట్ట‌గ‌ల మొన‌గాళ్లం తామేన‌నే మెసేజ్ పంపేలా పావులు క‌దుపుతోంది. అందుకే, హుజురాబాద్ ఎన్నిక‌ల నాటికి బీజేపీ హ‌వా బ‌లంగా వీచేలా.. పాద‌యాత్ర‌గా బ‌య‌లిదేరి వ‌స్తున్నారు క‌మ‌ల ద‌ళ‌ప‌తి. బ్రేకులు లేని బీజేపీ బండి.. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌గా ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తోంది.  ఇటు రేవంత్‌రెడ్డి దూకుడు.. అటు బండి జోరు.. ఇద్ద‌రు పోటుగాళ్ల సంగ్రామం.. కేసీఆర్‌ను దెబ్బ కొడుతుందా? లేక‌, ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక‌త చీలిపోయి దొర‌కే క‌లిసొస్తుందా? ఏమో...   

రేవంత్ రెండో దండోరా వేదిక చేంజ్.. కోమటిరెడ్డి భయమే కారణమా? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దూసుకుపోతున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్నారు. పీసీసీ చీఫ్ కాగానే ఛలో రాజ్ భవన్ నిరసనలతో రాజకీయాలను హీటెక్కించారు రేవంత్ రెడ్డి. పార్టీలోని సీనియర్లను కలుస్తూ వారి మద్దతుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోగా సూపర్ సక్సెస్ అయిందనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అదే జోష్ తో ఇబ్రహీంపట్నంలో రెండో గర్జన ఉంటుందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే కొత్త సమస్య ఎదురైంది.  పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి నియామకం తర్వాత అసమ్మతి స్వరం వినిపించారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా వివాదాస్పద కామెంట్లతో పార్టీలో కాక రేపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డి.. రేవంత్ పిలుపిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇంద్రవెల్లి సభకు దూరంగానే ఉన్నారు కోమటిరెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సీనియర్లందరిని కలిశారు కాని ఇంతవరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ను మాత్రం కలవలేదు. కలిసేందుకు రేవంత్ ఆసక్తి చూపినా.. కోమటిరెడ్డి సోదరులు ఇష్టపడలేదని చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి బ్రదర్స్ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఇబ్రహీంపట్నంలో రెండో దళిత గిరిజిన దండోరా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడంతో వాళ్లిద్దరి మధ్య వివాదాన్ని మరింత పెంచేసింది. ఇంద్రవెల్లి సభ ముగియగానే ఇబ్రహీంపట్నం దండోరా ప్రకటించారు పీసీసీ చీఫ్. అయితే ఇబ్రహీంపట్నం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్ సభ పరిధిలోకి వస్తోంది. ఎంపీగా ఉన్న తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇబ్రహీంపట్నంలో సభ పెట్టడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు పార్లమెంటరి కమిటీ సమావేశాలు ఉన్నందున.. 18వ తేదీన తాను అందుబాటులో ఉండబోనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీకి సమాచారం ఇచ్చారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో సభ పెట్టడానికి వ్యతిరేకంగానే కోమటిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది.  పార్టీ పెద్దలకు కూడా ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారట, అటు పీసీసీ కూడా ఈ విషయంలో లోతుగా చర్చించదని తెలుస్తోంది. లోకల్ ఎంపీకి తెలియకుండా ఆయన నియోజకవర్గంలో సభ పెట్టడాన్ని కొందరు పార్టీ సీనియర్లు తప్పుపట్టారని సమాచారం. ఇబ్రహీంపట్నంలో జరిగే దండోరా సభకు.. లోకల్ ఎంపీ రాకపోతే పార్టీలో విభేదాలు ఉన్నాయనే అంశం తెరపైకి వస్తుందని హెచ్చరించారట. అందుకే మధ్యేమార్గంగా సభను అదే రోజు కొనసాగిస్తూనే వేదిక మార్చాలని డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించాల్సిన దళిత గిరిజన దండోరా సభను మహేశ్వరంలో నిర్వహించబోతున్నారు.మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వస్తుంది. కోమటిరెడ్డికు సంబంధం లేకుండా ఉండటానికే రేవంత్ రెడ్డి టీమ్ అలా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అనుకున్న రోజు సభ పెట్టడంతో పాటు కోమటిరెడ్డి నుంచి వ్యతిరేకత లేకుండా ఇలా నరుక్కొచ్చారని చెబుతున్నారు.  మొత్తానికి ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభ మహేశ్వానికి మారడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే కారణమని చెబుతున్నారు. దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కొంత బ్రేకులు వేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

గెల్లుకు టికెట్ వెనుక అసలు కారణం ఇదా.. కేసీఆర్ అంతగా భయపడ్డారా? 

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్  స్కెచ్ గీస్తే  చాలా పక్కాగా ఉంటుంది. ముఖ్యంగా,రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. అలాంటి సందర్భాలలో అయన అనూహ్యంగా పావులు కదుపుతారు. రాజకీయ చతురతను చూపుతారు. మాటల గారడీ చేస్తారు. కనికట్టుతో అందరినీ కట్టిపడేస్తారు. ఇప్పుడు, కాదు ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్’ నైజం అదే అంటారు, ఆయనేమిటో  తెలిసిన, అయన నిజ నిజాన్నిరుచి చూసిన మాజీ మిత్రులు. నిజానికి, రాజకీయంగా ఎంతగా వత్తిడి ఎదురైతే అంతగా కేసీఆర్ నిజరూపం బయటకు వస్తుందనేది మాజీ మిత్రుల మాట.    ప్రస్తుతం కేసీఆర్ అదే పరిస్థితిలో ఉన్నారా? రాజకీయంగా వత్తిడి ఎదుర్కుంటున్నారా, అంటే అవునననే అంటున్నారు. ఒక దిక్కు నుంచి కాదు అష్ట దిక్కుల నుంచి కేసీఆర్ చిక్కులను ఎదుర్కుంటున్నారని, అంతర్గత సమాచారం తెలిసిన పార్టీ వర్గాల సమాచారం. ఈటలతో అనవసరంగా తలగోక్కుని, తిప్పలు కొనితెచ్చుకున్నారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు,  వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ పెద్దలు వ్యక్త పరుస్తున్న అభిప్రాయం. కారణాలు, ఏవైనా హుజూరాబాద్  నియోజక వర్గంలో తెరాస అంటే ఈటల, ఈటల అంటే తెరాస. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చివరకు ఆరడుగుల బులెట్ హరీష్ రావే అయినా ఈటల తర్వాతనే. అంతే కాదు ఈటలను కాదంటే ఎన్నికలో పోటీ చేసేందుకు పార్టీకి అభ్యర్ధి దొరకడం కూడా కష్టమే. అదే ఇప్పుడు చూస్తున్నాం.  ఇంచుమించుగా రెండు నెలలకు పైగా ఆ పార్టీ వాళ్ళను, ఈ పార్టీ వాళ్ళను ఎక్కడెక్కడి వారిని తోలుకొచ్చి దొడ్లో కట్టేసుకున్నా కేసీఆర్ కు ఈటలకు సమ ఉజ్జీగా నిలిచే అభ్యర్ధి దొరకలేదంటే, పరిస్థతి ఏమిటో అర్థం చేసుకోవచ్చును. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా ఎవరూ లేక, ఎవరు దొరక్కనే, కేసీఆర్  చివరకు విద్యార్ధి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ని బరిలో దించుతున్నారని అంటున్నారు. అలాగన  ఇంచు మించుగా 40 ఏళ్ళు దగ్గర పడిన విద్యార్ధి నాయకుదు గెల్లును ఎంపిక చేయడం వెనక వ్యూహం, ఎత్తుగడ లేదని కాదు. అయితే, ఆ వ్యూహం ఎత్తుగడ గెలిచేందుకు మాత్రమే, కాదు ఓడిపోయినా, పరువును కాపాడుకునే వ్యూహంలో భాగంగానే ఉందని, పడిపోయినా మళ్ళీ పైకి లేచే విధంగా  కేసీఆర్ గెల్లును ఏంపిక చేశారని అంటున్నారు.  నిన్న మొనంటి వరకు హుజూరాబాద్ లో పోటీ పార్టీలు, అభ్యర్ధుల మధ్య కాదు. పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటల, పోటీ ఉద్యమకారులు వర్సెస్ ఉద్యమ ద్రోహుల మధ్య అనే భావన బలంగా జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు, ఆ పర్సెప్షన్ కొంత మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఈటల దమ్ముంటే కేసేఆర్ లేదా హరీష్ పోటీ చేయాలని సవాలు విసిరిన 24 గంటలలోనే, గెల్లు శ్రీనివాస్  పేరును ప్రకటించారు. నిజానికి ఆగష్టు 16 న దళిత బంధు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి స్వయంగా సభా ముఖంగా, ఘనంగా తెరాస అభ్యర్ధి పేరును ప్రకటిస్తారని ప్రచారం జరిగిన అదేమీ లేకుండా,అందుకు ఐదు రోజులు ముందుగానే, తూతూ మంత్రం గెల్లు పేరును ప్రకటించారు. ఈటల సవాలును స్వీకరించే ధైర్యం లేకనే, ముందుగానే గెల్లు పేరును ప్రకటించారని, ఇది కూడా కేసీఆర్ వ్యూహంలో బాగమే అంటున్నారు. ఒక విధంగా చూస్తే కేసీఆర్, వ్యూహాజనిత పోటీ నుంచి కూడా  పారిపోయారు, లేదా తప్పుకున్నారు. అలాగే, ఉద్యమాల నుంచి వచ్చిన గెల్లుని  బరిలో దించడం ద్వారా ఉద్యమ వాదాన్ని కొంతవరకు పక్కకు తప్పించారు. అలాగే, బీసీ ఫాక్టర్’ను కూడా పరిగణన లోకి తీసుకునే గెల్లు ఎంపిక చేశారు.  అయితే  కేసీఆర్ స్కెచ్ ఎంత పక్కగా ప్లాన్ చేసినా, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరి నుంచి కేసీఆర్ vg ప్పించుకోలేరని అంటున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, హుజూరాబాద్ బరిలో నిలిచింది, కేసీఆర్, ఈటల. అంతే కాదు, అందరూ ఉహిస్తున్నట్లుగా హుజూరాబాద్ తెరాస ఓడిపోతే, అది గెల్లు ఓటమీ కాదు కేసీఆర్ ఓటమిగానే జనం చూస్తారు.అలాగే తెరాస ఓటమిని ఉద్యమ ద్రోహుల ఓటమిగానే చరిత్ర గుర్తిస్తుందని అంటున్నారు.

జగన్ అనుచరుడిని విచారించిన సీబీఐ... వివేకా హత్య కేసులో ట్విస్ట్! 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. 68 రోజులుగా విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు దూకుడుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా సునీల్ కుమార్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేశాకా కీలక అంశాలు బయటికి వచ్చాయి. సునీల్ కుమార్ ఇస్తున్న సమాధానాల ఆధారంగానే ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు ముందుకు సాగుతోందని తెలుస్తోంది.  వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన సీబీఐ దృష్టి సారించింది. శుక్రవారం విచారణకు  రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి హాజరైనారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రఘునాధ్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. పులివెందులలో సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. శివశంకర్‌రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. అంతేకాదు ప్రస్తుతం ఆయన వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు  సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు విచారించాయి.  శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠరెడ్డిపై వివేకా కుమారై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సునీతా రెడ్డి పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని సునీత కోరారు. సునీత ఫిర్యాదు ఇవ్వడం, శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం ఇప్పుడు చర్చగా మారింది.

వైఎస్సాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర.. ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్‌..

వైఎస్ వివేకానంద‌రెడ్డిని ఎవ‌రు చంపారో ఇంకా తేల‌లేదు. సీబీఐ అదే ప‌ని మీద ఉంది. విచార‌ణ జ‌రుగుతున్న క్ర‌మం చూస్తుంటే.. అంతా అనుమానించిన‌ట్టుగానే వివేక స‌న్నిహితులే హ‌త్య‌కు తెగించార‌నే విష‌యంపై కాస్త క్లారిటీ వ‌చ్చేస్తోంది. హ‌త్య వెనుక ఉన్న అస‌లు పెద్ద‌లు త‌ప్పించుకున్నా.. పాత్ర‌దారులు మాత్రం దొరికిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌ర్డ‌ర్ అని సుస్పష్టంగా క‌నిపించినా.. గుండెపోటంటూ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలు చెప్ప‌డంతో అప్ప‌ట్లో అంతా ముక్కున వేలేసుకున్నారు. మ‌రింత బ‌రితెగించి వివేక హ‌త్య‌కు చంద్ర‌బాబే కార‌ణ‌మంటూ ప్ర‌చారం కూడా చేసేశారు. ఎంత విడ్డూరం.. ఎక్క‌డో క‌డ‌ప జిల్లా పులివెందుల‌లోని వైఎస్ వివేకా ఇంట్లోకి చొర‌బ‌డి చంపేంత సాహ‌సం వేరే వారికి ఉంటుందా? ఇదంతా ఇంటిదొంగ‌ల ప‌నేన‌ని అంద‌రికీ తెలిసిందేన‌ని ఆనాడే టీడీపీ విమ‌ర్శించింది. ఆ ఇంటిదొంగ‌లే ఇప్పుడు సీబీఐ విచార‌ణ‌కు క్యూ క‌డుతుండ‌టంతో నిజాలు నిల‌క‌డ మీద తెలుస్తున్నాయ‌ని అంటున్నారు.  వైఎస్ వివేక హ‌త్య‌, సీబీఐ విచార‌ణ మీద టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. కోట్ల‌ కోసం సొంత‌ బాబాయ్‌ పైనే గొడ్డ‌లి వేటు వేయించి.. ఆ నెత్తురుని చంద్ర‌బాబు గారికి అంటించాలని చూశారని లోకేశ్ మండిప‌డ్డారు.  నారాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంటూ విష‌ పుత్రిక సాక్షిలో అదే గొడ్డ‌లి చంద్ర‌బాబు గారి చేతికి గ్రాఫిక్స్‌లో పెట్టి మ‌రీ అచ్చేయించారన్నారు. వారి తరతరాల వైఎస్సాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంతా నేరాల‌మ‌యమని మ‌రోసారి సీబీఐ ద‌ర్యాప్తుతో తేట‌తెల్ల‌మైందని మండిప‌డ్డారు. ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్ అని.. అరాచ‌కాల‌కు వైఎస్ ఫ్యామిలీ కేరాఫ్ అడ్ర‌స్ అంటూ ఓ రేంజ్‌లో ఘాటుగా ట్వీట్లు చేశారు నారా లోకేశ్‌.  సొంతింటి వేట‌కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్ప‌ష్టం అవుతోంది. డ‌బ్బు, ఆధిప‌త్యం, గ‌నులు, అక్ర‌మాల కోసం సొంత బాబాయ్‌నే చంపుకున్న వైఎస్సాసుర కుటుంబ‌ ర‌క్త‌చ‌రిత్ర‌ని నీ దొంగ పేప‌ర్ సాక్షిలో ఎలా అచ్చేస్తావో చూస్తాను జ‌గ‌న్‌రెడ్డీ! అంటూ స‌వాల్ విసిరారు లోకేశ్‌.

సునీత ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ!.. ప్రాణ‌హాని ఉందంటూ ఫిర్యాదు.. అది వారి ప‌నేనా?

సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ వివేక హ‌త్య కేసు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. రెండు నెల‌లుగా సీబీఐ ఇదే ప‌ని మీద ఉంది. వాచ్‌మెన్ వాంగ్మూలం కీల‌కంగా మారింది. కొంద‌రు పెద్ద‌లు మిన‌హా అనుమానితులంద‌రినీ ప్ర‌శ్నిస్తోంది. వేరు వేరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడు సునీల్‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. గొడ్డ‌లిపోటును గుండెపోటుగా ప్ర‌క‌టించిన వారినీ విచారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సీబీఐ ద‌ర్యాప్తు వేగం పుంజుకుంటున్న నేప‌థ్యంలో.. స‌డెన్‌గా వైఎస్ వివేకా కూతురు సునీత ఇంటి ద‌గ్గ‌ర ఓ అగంత‌కుడు రెక్కీ నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. స‌కాలంలో గుర్తించిన సునీత వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తమ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని.. భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటికి స‌మీపంలో ఆగి ఎవ‌రికో ఫోన్‌ కాల్స్ చేశాడని లేఖలో సునీత తెలిపారు.  శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని రాశారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని.. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు.  తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, అత‌ని అనుచ‌రుడు మ‌ణికంఠ‌రెడ్డి త‌మ ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ నిర్వ‌హించడం త‌మ‌కు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోందని సునీత వాపోతున్నారు. త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో పాటు.. త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు సునీత‌.   

హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా?

హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? షెడ్యూలు ఎప్పుడు విడుదలవుతుంది? ఎప్పుడో తెలియదు కానీ, ఇప్పుడైతే కాదు. ఆగష్టు చివరి వరకు అయితే, ఖాయంగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమే లేదు. నిన్న మొన్నటి వరకు ఆగష్టు 16 తేదీలోగానే, ఎన్నికల నోటిఫికేషన్  వచ్చేస్తుందని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని, కేంద్ర ఎన్నికల సంఘం చల్లని కబురు మెల్లగా చెప్పింది. ఆగష్టు 16 లోగానే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వస్చేస్తుందనే, ముఖ్యమంత్రి 16 తేదీన హుజురాబాద్ నుంచి ప్రారంభించవలసి ఉన్న దళిత బంధు పథకన్ని, అనుకున్న రీతిలో హుజూరాబాద్ లో కాకుండా, దత్తత గ్రామా వాసాలమర్రిలో ముందుగానే మమ అనిపించారు. నోటి మాటగానే ప్రారంభించినట్లే అనుకోండని ప్రకటించారు.  అయితే, తాజా సమాచారం ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ సహా దేశంలో  ఖాళీగా ఉన్న వందకు పైగా అసెంబ్లీ, లోక్ సభ, మండలి  స్థానాలకు ఎన్నికలు/ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలానే విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. ఉప ఎన్నికలే కాదు, వచ్చేసంవత్సరం (2022)ప్రారంభంలో జరగవలసి ఉన్న ఉత్తర పదేశ్ సహా ఐదు రాష్టాల శాసన సభ  ఎన్నికల విషయంలోనూ ఈసీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  ఈ పరిస్థితిని గమనిస్తే ఎన్నికల నిర్వాహణపై గతంలో ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపధ్యంలో,  ఎన్నికల సంఘం  రాజకీయ పార్టీల అభిప్రాయాలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అంతే, కాదు, కొవిడ్ పరిస్థితులను పట్టించుకోకుండా, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన అధికారిని, ఉరి తీయాలని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో,  కేంద్ర ఎన్నికల సంఘం.  కొవిడ్ మహమ్మారి విషయంలో ఒక స్పష్టత వచ్చే వరకు అన్ని ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదన్న ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికలసంఘం తాజాగా దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతూ లేఖలు రాసింది. ఉప ఎన్నికలతో పాటుగా ఐదు  రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై పార్టీలు తమ అభిప్రాయాలు ఆగస్టు 30 లోగా  తెలియజేయాలని లేఖలో  కోరింది. అంటే ఆగష్టు 30కి ముందు, ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదు. ఆగస్టు 30 తరువాతే హుజూరాబాద్ ఉపఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే, అప్పటికీ కొవిడ్ మహమ్మారి పరిస్థితిలో మార్పు  రాకుంటే, ఉప ఎన్నిక ఇంకా వెనక్కి వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదు.  అదలా ఉంటే ఉప ఎన్నిక ఆలస్యం అయితే, అది అధికార పార్టీ ఉపకరిస్తుందని అంటున్నారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పట్ల ప్రస్తుతమున్న సానుభూతి చల్లారడంతో  పాటుగా, ప్రభుత్వం ఓటర్లకు వలవేసేందుకు ఉద్దేశించిన దళిత బంధు వంటి పథకాలను అమలు చేసేందుకు వెసులుబాటు లభిస్తుందని గులాబీ పార్టీలో వినవస్తోంది. మరోవంక బీజేపీ ఎన్నికలు ఎంత త్వరగా ముగిస్తే, అంట మంచిదని భావిస్తోంది.  అయితే, అల్టిమేట్’గా ఏ నిర్ణయం అయినా తీసుకోవలసింది కేంద్ర ఎన్నికల సంఘం, తీర్పును ఇవ్వవలసింది హుజూరాబాద్ ప్రజలు.

గుండెపోటా.. గొడ్డలి పోటా? వివేకా కేసులో విజ‌యసాయి ఇరుక్కుంటారా?

ఆ సీన్ చూడ‌గానే చిన్న‌పిల్లాడికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది. చుట్టూ ర‌క్తం ప‌డుగు.. మ‌ధ్య‌లో శ‌వం.. త‌ల‌పై పెద్ద పెద్ద గాట్లు.. ఒంటినిండా గాయాలు.. అది ప‌క్కా మ‌ర్డ‌ర్ అని ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు. కానీ, వాళ్లు అలా చెప్ప‌లేదు. అలాగ‌ని వాళ్లేమీ క‌ళ్లులేని క‌బోదులో, మాన‌సిక విక‌లాంగులో కాదు.. అచ్చంగా పార్ల‌మెంట్ స‌భ్యులు.. అందుకే ఇంత‌టి ఆశ్చ‌ర్యం. సీబీఐ సైతం ఇదే అంశంపై ఫోక‌స్ పెంచింది. వైఎస్ వివేకానంద‌రెడ్డిది మ‌ర్డ‌ర్ అని అంత స్ప‌ష్టంగా తెలుస్తున్నా.. ఆయ‌న గుండెపోటుతో చ‌నిపోయార‌ని వైఎస్ అవినాశ్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలాంటి వాళ్లు ఎలా ప్ర‌క‌టించారు? ఎందుకు అలాంటి మెసేజ్ ఇచ్చార‌నే యాంగిల్‌పై సీబీఐ దృష్టి సారించింది. దీని వెనుక ఎవ‌రినైనా కాపాడే ప్రయ‌త్నం ఉందా? పెద్ద ఎత్తున కుట్ర దాగుందా? అని కూడా అనుమానిస్తున్నారు. ఇదే అంశాన్ని అటు టీడీపీ సైతం ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తోంది. తాజాగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  వివేకానందరెడ్డిది గుండెపోటా.. గొడ్డలి పోటా? అని ప్రశ్నించారు బుద్దా వెంక‌న్న‌. వాస్తవాలు బయటకు రావాలంటే, ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి చనిపోయిన వెంటనే ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పింది విజయ సాయి రెడ్డే అని అన్నారు. అసలు విషయం బయటకు రాకముందే.. ఆయన ఎందుకు అలా చెప్పార‌ని నిలదీశారు.  తొలుత గుండెపోటని, తరువాత హత్యని, ఆ తరువాత చంద్రబాబే వివేకానందరెడ్డిని చంపించాడని ఏ2 విజ‌య‌సాయిరెడ్డి పొంతనలేకుండా ఎందుకు మాట్లాడో తేల్చాలన్నారు బుద్దా వెంక‌న్న‌. సీబీఐ పులివెందులలో విచారణకు వచ్చినప్పుడల్లా విజయసాయి ఎంపీనంటూ ఢిల్లీ పారిపోతున్నారని విమ‌ర్శించారు. విజయసాయి దోపిడీపై ఉత్తరాంధ్రవాసులు ఎందుకు తిరగబడటం లేదని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు విజ‌య‌సాయిని ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు టీడీపీ నేత‌ బుద్దా వెంక‌న్న‌.  

జ‌గ‌న్‌లానే విజ‌య‌సాయికి బిగుస్తున్న ఉచ్చు?.. సీబీఐ మెమోతో కీల‌క మ‌లుపు..

బెయిల్ ర‌ద్దుపై మాకు అభ్యంత‌రం లేదు అంటేనే.. ఇటు ఏ1 జ‌గ‌న్‌కు, అటు ఏ2 విజ‌యసాయిరెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లుగా బెయిల్‌పై బ‌య‌ట ఉంటూ.. ఏపీని ఏలుతున్నారు. అట్టెట్టా.. ఏ1, ఏ2లు బెయిల్‌పై బ‌య‌ట ఉంటే ఎట్టా? సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నారంటూ ఎంపీ ర‌ఘురామ అదే సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో.. సీన్ మొత్తం సితార్ అవుతోంది. సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వేగంగా ప‌రిణామాలు మారిపోతున్నాయి. ఆగ‌స్టు 25న తుది తీర్పుకు కోర్టు సిద్ద‌మ‌వుతోంది. ఫైన‌ల్ జ‌డ్జిమెంట్‌లో జ‌గ‌న్ బెయిల్ త‌ప్ప‌కుండా ర‌ద్దు అవుతుంద‌ని ర‌ఘురామ ధీమాగా ఉండ‌గా.. వైసీపీ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.  బెయిల్ ర‌ద్దై త‌మ ఏ1 నేత జైలుకెళ్లినా.. ఏ2 విజ‌య‌సాయిరెడ్డి ఉన్నారుగా.. ఆయ‌న‌తోనైనా అడ్జ‌స్ట్ అవుదామ‌ని క‌ల‌లుకంటున్న వైసీపీ వ‌ర్గానికి ర‌ఘురామ మ‌రో షాక్ ఇచ్చాడు. విజ‌య‌సాయి బెయిల్ కూడా ర‌ద్దు చేయాలంటూ అదే సీబీఐ కోర్టులో మ‌రో పిటిష‌న్ కూడా వేయ‌డంతో అంతా ఉలిక్కిప‌డ్డారు. ఏ1, ఏ2 ఇద్ద‌రూ ఒకేసారి జైలుకు వెళితే ఎలా అని మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని అంటున్నారు.  తాజాగా, కోర్టులో సీబీఐ దాఖ‌లు చేసిన మెమోతో మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. సేమ్ టూ సేమ్‌.. జ‌గ‌న్ కేసు విష‌యంలో ఎలాగైతే న‌డుచుకుంటోందో అచ్చం అలానే అడుగులు వేస్తోంది. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై నిర్ణ‌యాన్ని కోర్టుకే వ‌దిలేస్తూ.. కోర్టు విచ‌క్ష‌ణ మేర‌కు పిటిష‌న్‌పై నిర్ణ‌యం తీసుకోవాలంటూ న్యాయ‌స్థానంలో మెమో దాఖ‌లు చేసింది సీబీఐ. అంటే, బెయిల్ ర‌ద్దు విష‌యంలో సీబీఐ ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు. మరోవైపు, సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా ప‌డింది.  రూల్ ఈజ్ రూల్‌.. రూల్ ఫ‌ర్ ఆల్ అన్న‌ట్టు.. కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేయ‌డం.. జ‌గ‌న్‌-విజ‌య‌సాయిల‌కు సీబీఐ స‌హాయ‌నిరాక‌ర‌ణ చేస్తోంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు. ఇటు బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కానీ, అటు బెయిల్ ర‌ద్దు చేయొద్ద‌ని గానీ చెప్ప‌కుండా.. త‌ట‌స్థంగా సీబీఐ వ్య‌వ‌హ‌రించ‌డం.. వ్యూహాత్మ‌కమ‌ని అంటున్నారు. సీబీఐ ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డించినా.. అది ప‌రోక్షంగా కేంద్ర వైఖ‌రికి నిద‌ర్శ‌నంగా మారుతుంది. అందుకే, త‌మ‌పై అలాంటి ఎలాంటి మ‌చ్చ ప‌డ‌కుండా.. కోర్టు నిర్ణ‌యానికి వ‌దిలేయ‌డం.. కీల‌క ప‌రిణామం అంటున్నారు.  నిబంధ‌న‌లు, ర‌ఘురామ త‌ర‌ఫు వాద‌న‌లు, సాక్షాలు.. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌నేది న్యాయ‌నిపుణుల మాట‌. ఆ లెక్క‌న‌.. ఆగ‌స్టు 25న జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కావ‌డం.. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ కూడా క్యాన్సిల్ కావ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ న్యాయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఇలా.. ర‌ఘురామ ఒకేసారి జ‌గ‌న్‌-విజ‌య‌సాయి ధ్వ‌యాన్ని.. మ‌ళ్లీ జంట‌గా జైలు పాలు చేసేలా ఉన్నారంటూ ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే, వైసీపీ శ్రేణుల‌కు ర‌ఘురామ విల‌న్‌గా మారితే.. జ‌గ‌న్‌ వ్య‌తిరేకుల‌కు హీరోలా క‌నిపిస్తున్నారు. ఏక‌కాలంలో హీరో+విల‌న్ అయిన ఘ‌న‌త ర‌ఘురామ‌కే ద‌క్కుతుంది. చాలాకాలంలో జ‌గ‌న్‌పై.. వ‌న్‌మ్యాన్ ఆర్మీలా వార్ చేయ‌డం ర‌ఘురామకే సాధ్య‌మ‌వుతోంది.   

'ప్ర‌జా సంగ్రామ యాత్ర‌'.. క‌మ‌ల ద‌ళ‌ప‌తి దండ‌యాత్ర‌..

కాషాయ 'బండి' వ‌స్తోంది.. క‌ద‌నోత్సాహంతో వ‌స్తోంది.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండ‌యాత్ర‌కు 'ప్ర‌జా సంగ్రామ యాత్ర‌'గా వ‌స్తోంది.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు పేరు పెట్టేశారు.. ముహూర్తం కూడా నిర్ణ‌యించేశారు.. స్పాట్ సైతం డిసైడ్ చేసేశారు.. ఆగ‌స్టు 24.. పాత‌బ‌స్తీ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యం నుంచి బండి సంజ‌య్ తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌నున్నారు.  పేరులోనే 'సంగ్రామం'.. ఇది సీఎం కేసీఆర్‌పై సంగ్రామం.. గ‌డీల పాల‌న‌కు వ్య‌తిరేకంగా సంగ్రామం.. దొర‌ను గ‌ద్దె దింప‌డానికి జ‌రుగుతున్న సంగ్రామం. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకే ప్ర‌జా సంగ్రామ యాత్ర అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ను క‌మ‌లం పూదోట‌గా మార్చేందుకే పాద‌యాత్ర అని క‌మ‌ల‌నాథులు అంటున్నారు.  పాద‌యాత్ర వివిధ ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నుంది. ముందు హుజురాబాద్ ఎన్నిక‌లే టార్గెట్‌. అందుకే, తొలిద‌శ‌లో హైద‌రాబాద్‌ భాగ్య‌ల‌క్ష్మి టెంపుల్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా వ‌ర‌కు.. బండి న‌డ‌వ‌నుంది. సుమారు రెండు నెల‌ల పాటు తొలిద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర కొన‌సాగ‌నుంది.  ఆగ‌స్టు 24న పాదయాత్ర పాత‌బ‌స్తీ- మెహదీపట్నం మీదుగా షేక్‌పేటకు చేరుకుంటుంది. మరుసటి రోజు గోల్కొండ కోట ద‌గ్గ‌ర‌ జరిగే బండి సంజ‌య్ భారీ సభ నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం.. చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట మీదుగా మెదక్‌ చేరుకుంటారు.  ప్రతిపాదిత రూట్‌మ్యాప్‌ హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే వరకు కొనసాగుతుందని, షెడ్యూల్‌ విడుదలయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  బండి సంజయ్‌ పాదయాత్ర విజయవంతానికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లిపోయాయి. పాదయాత్రను విజయవంతం చేసేందుకు 30 నిర్వహణ కమిటీలు ఏర్పాటు కాగా.. అవి వాటి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి. బీజేపీ శ్రేణుల‌తో పాటు ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర స‌క్సెస్‌కు ప‌క్కాగా గ్రౌండ్‌వ‌ర్క్ చేస్తున్నాయి. 

థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేసిందా? 10రోజుల్లో 543మంది పిల్ల‌ల‌కు క‌రోనా..

ఆగ‌స్టు.. సెప్టెంబ‌ర్‌.. అక్టోబ‌ర్‌.. థ‌ర్డ్ వేవ్ ఎప్పుడైనా రావొచ్చు. ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌దు. వ‌చ్చీ రాగానే కుమ్మేస్తుంది. ఈసారి పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపుతుంది. ఇలా అనేక వార్తా క‌థ‌నాలు.. సూచ‌న‌లు..హెచ్చ‌రిక‌లు. ఏ చిన్న సింప్ట‌మ్ క‌నిపించినా క‌రోనానేమో అనే టెన్ష‌న్‌. కేసులు పెరుగుతున్నాయంటే థ‌ర్డ్ వేవ్ ఏమోన‌నే భ‌యం. తాజాగా, బెంగ‌ళ‌రులో కొవిడ్ కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి. అందులోనూ చిన్నారుల‌కు భారీగా సోకుతోంది. ఇదిగో థ‌ర్డ్ వేవ్ అంటూ ప్ర‌చారం మొద‌లైపోయింది. ప్ర‌జ‌ల్లో కంగారు పెరిగిపోయింది.  ఒక్క బెంగ‌ళూరులోనే ఆగ‌స్టు నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 543మంది చిన్నారులు క‌రోనా బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. బాధితులంతా 19 ఏళ్ల లోపు వ‌య‌సు ఉన్న‌వారే. ఇదే ఇప్పుడు ఆందోళ‌న‌క‌రంగా మారింది. మూడో ముప్పు బెంగ‌ళూరు నుంచి మొద‌లైపోయిందా? అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది.  మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. 40వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క్రియాశీల రేటు 1.20కి పెరిగింది. అటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెర‌గ‌డం ఆందోళ‌న‌క‌రం.  తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,120 కేసులు వ‌చ్చాయి. ఒక్క రోజులోనే 585 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.46 శాతం ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 52.95 కోట్ల టీకాలు పంపిణీ చేశారు. 

ఏపీకి రేవంత్‌రెడ్డి కావ‌లెను.....

ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. చచ్చిపోతుందని తెలిసి కూడా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ... కొద్ది రోజుల క్రితం ఇంద్రవెల్లి సభలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజం అయినా  కాక పోయినా, చాలా మందిలో అదే అభిప్రాయం ఉంది. రాష్ట్ర విభజన కారణంగానే, ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందనే అభిప్రాయం చాలా మందిలో నాటుకు పోయింది.  అదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కొత్తగా నడుంబిగించిన ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏపీ మీద కూడా దృష్టి పెట్టారు. దేశ వ్యాప్తంగా పీసీసీలకు యంగ్ బ్లడ్ ఎక్కించే పనిలో పడిన రాహుల్ గాంధీ ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించే పనికి శ్రీకారం చుట్టారు. ఏడున్నర ఏళ్లలో తొలిసారిగా ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఎమీ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవ పరిస్థతికి చేరుకుంటుందని విచారించారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్య సభ మాజీ ఎంపీ కేవీపే రామచంద్ర రావు. కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, జేడీ శీలం, చింతా మోహన్, మాజీ ఎంపీ హర్ష కుమార్, పీసీసీ చీఫ్ శైలజానాథ్, మరి కొందరు నేతలతో ఆయన విడివిడిగా, సమిష్టిగా చర్చలు జరిపారు.  అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం సాధ్యమా అంటే, అది సమీప భవిష్యత్తులో అయ్యే పనికాదని, అలాగని, ఎప్పటికీ ఇంతే, అని అనుకోవడానికి వీలు లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి, రాష్ట్ర విభజనకు ముందు నుంచే, ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వైఎస్ ఆకస్మిక మృతితోనే కాంగ్రెస్ పతన యాత్ర మొదలైనదని, విశ్లేషకులు చెపుతున్నారు. అందుకే, తెలంగాణ ఇచ్చినా అక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందే కానీ, బలపడింది లేదు, ఇది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్’ను తమ ఖాతాలో వేసుకున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరున హస్తం పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కేసీఆర్ సంధించిన  ‘ఆకర్ష్’ అస్త్రానికి హస్తం పార్టీ చాలా వరకు ఖాళీ ఐపోయింది.కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు,ఇతర ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరిపోయారు.  పాత పద్దును పక్కన పెట్టినా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19  మందిలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస గూటికి చేరారు. అలాగే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన హుజూర్’నగర్ ఉపఎన్నిక మొదలు నిన్నమొన్నటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకు ఇంద్రవెల్లి సభ సక్సెస్సే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే, ఈ కొత్త వింత ఎంతకాలం ఉంటుందనే చర్చ ఒకటి ఉంది, అయినా ఒడిదుడుకులు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడిందని అనేది మాత్రం నిజం.   ఈ నేపధ్యంలో ఏపీలో కూడా, రేవంత్ రెడ్డి లాంటి నోరున్న లీడర్’కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, రాష్ట్రంలోనూ పార్టీ పునర్జీవనం పొందుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు,తెలుస్తోంది. అయితే అలా అనుకోవడం పొరపాటే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ డౌన్ బట్ నాట్ అవుట్ , కానీ, ఏపీలో పరిస్థితి అది కాదు. రేవంత్ రెడ్డే అన్నట్లుగ్గా  ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. ఉంటే గింటే కొంత కొన ఊపిరి ఇంకా మిగిలుందేమో కానీ, అంతకు మించిని పరిస్థితి అయితే లేదు.  రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఇంచిమించుగా 20 అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. చివరకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి 28 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకుంది. అదే ఏపీ విషయానికి వస్తే విభజన తర్వాత జరిగిన  రెండు ఎన్నికలలోనూ  హస్తం పార్టీకి ఒక్క సీటు గెలవలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క సీటులోనూ డిపాజిట్ దక్కలేదు.  ఓటు షేర్ చూసుకున్నా ఒక శాతానికే, కొంచెం అటూ ఇటుగానే ఉంది.  మరోవంక  కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంక్’ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, రెడ్డి ఓటు బ్యాంకును వైసీపీ గంప గుత్తగా తమ ఖాతాలో చేర్చుకుంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం, గతంలో కాంగ్రెస్’కు అండగా ఉన్న‌ ఇతరత్రా కులాలను కూడా వైసీపీ లాగేసుకుంది. నిజానికి, నిన్నటి కాంగ్రెస్సే నేటి  వైసీపీ, అన్నవిధంగా రాజకీయ కుల సమీకరణలు మారిపోయాయి. గుర్తు మారింది, నాయకుడు మారాడు. మిగిలినిదంతా సేమ్ టూ సేమ్... నిజానికి, కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. తెలుగు దేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్న పుణ్యానే 2014లో బీజేపీకి నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు దక్కాయి. ఒంటరిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాగే, కొద్ది నెలల క్రితం  జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో, బీజీపీ, జనసేన కలిసి పోటీచేసినా డిపాజిట్ దక్కలేదు. సో, జాతీయ పార్టీలకు ఏపీలో, సమీప భవిష్యత్తులో గొప్ప భవిష్యత్ ఆశించడం  అత్యాశే అవుతుంది.   ప్రస్తుతానికి అయితే, ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు, వైసీపీ, తెలుగు దేశం బలంగా ఉన్నాయి. తమిళనాడులో ఏ విధంగా అయితే, జాతీయ పార్టీలకు స్థానంలేదో, అదే విధంగా ఏపీ లోనూ రెండు బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ ఒక జాతీయ పార్టీ ఎదిగి రావడం ఇప్పట్లో అయ్యే పనికాదని విశ్లేషకులు బావిస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమి సారధ్యం కోసం పాకులడుతున్న కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీతో పోటీ పడుతున్న రాహుల గాంధీ, ఎపీలోనూ హస్తం పార్టీ ఉందని చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే, రాహుల్ గాంధీ చేస్తున్నప్రస్తుత పునర్జీవన ప్రయత్నాలను చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు, అదలా ఉంటే, ఇంతకీ ఏపీ రేవంత్ ఎవరు? రాహుల్ గాంధీని కలిసిన, ‘ముఖ్య’ నేతల్లో రేవంత్ పోలికలు ఎవరిలోనూ కనిపించడం లేదు.