హుజూరాబాద్ కోసం అబద్ధాలా? త్వ‌ర‌లో 80వేల ఉద్యోగాలు..

దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని.. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం. పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా? అని అన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. 75 లక్షల మంది దళితులుంటే.. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.    ప్రభుత్వ లైసెన్సు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చాం. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ముఖ్య‌మంత్రి. ఇక‌.. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని చెప్పారు. ‘‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ప్రధానికి మారెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తాం. కేంద్ర సహకరిస్తే ఇంకా బలంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతాం. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉటుంది. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలు అడిగితే ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలన్నారు కేసీఆర్‌.

కేటీఆర్‌కు రేవంత్‌ ఫీవ‌ర్ ప‌ట్టుకుందా? అందుకేనా అలాంటి డైలాగ్స్‌?

మంత్రి కేటీఆర్‌ మునుపెన్న‌డూ లేనంత క‌ల‌వ‌ర‌పాటు ప‌డుతున్నారు. గ‌తంలో ఏ అమావాస్య‌కో, పున్నానికో పొలిటిక‌ల్ స్టేట్‌మెంట్స్ చేసే ఏ-క్లాస్ మినిస్ట‌ర్‌.. ఇప్పుడు డైలీ రెండు మూడు సార్లు రాజ‌కీయంగా ఓ రౌండ్ వేసుకుంటున్నారు. కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌న్నీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గురించే. ఇంత‌కుముందు ఇలా ఉండేది కాదు. క‌నీసం రేవంత్‌రెడ్డి పేరెత్తేందుకు కూడా కేటీఆర్ ఇష్ట‌ప‌డే వారు కాదు. ర‌క‌ర‌కాల వంక‌ర పేర్ల‌తో ప‌రోక్షంగా విమ‌ర్శించే వారు. కానీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక సీన్ మారిపోయింది. కేసీఆర్‌కంటే కేటీఆర్‌నే రేవంత్ ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ.. ఆయ‌న ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేస్తుండ‌టంతో.. చిన‌బాస్ సైతం నోటికి పని చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చిందంటున్నారు. రేవంత్‌రెడ్డి ఎంత‌లా డిస్ట‌ర్బ్ చేసుంటే.. కేటీఆర్ రోజూ ఆయ‌న్ను ఏదో ఒకటి అన‌కుండా ఉండ‌లేని త‌ప్ప‌నిస‌రి పరిస్థితి వ‌చ్చుంటుంది.   తాజాగా కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన నిరుద్యోగ జంగ్ సైర‌న్‌.. బాగా స‌క్సెస్ అవుతోంది. తెలంగాణ‌వ్యాప్తంగా జంగ్‌.. హోరెత్తుతోంది. రేవంత్‌రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో మునుప‌టి ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. మొద‌టిరోజు నిర‌స‌న కార్య‌క్ర‌మాలైతే ఓ రేంజ్‌లో సాగాయి. ఎల్బీన‌గ‌ర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసేందుకు.. పోలీసుల లాఠీలు, ఇనుప కంచెల‌ను కాచుకుంటూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రోజంతా దండ‌యాత్ర చేస్తూనే ఉన్నారు. చివ‌రాఖ‌రికి సాయంత్రానికి శ్రీకాంతాచారి విగ్ర‌హానికి పూల దండ వేసి.. కాంగ్రెస్ జెండా ఎగ‌రేయ‌డంలో విజ‌యం సాధించారు. ఆ ప్ర‌య‌త్నంలో ఖాకీల లాఠీ దెబ్బలు తిన్నా.. ఒంటిమీద వాత‌లు తేలినా.. ఏమాత్రం వెన‌కంజ వేయ‌కుండా తెగువ ప్ర‌ద‌ర్శించారు. ఆ ఎపిసోడ్‌లోనే ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడు, హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ న‌ర్సింగ్‌రావు తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రి పాల‌య్యారు. ఇదంతా రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రేసుగుర్రాల్లా మారిన కాంగ్రెస్ శ్రేణుల తెగువ‌, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు.    రేవంత్‌రెడ్డి దూకుడు, కాంగ్రెస్‌లో ఉత్సాహం చూసి.. కేటీఆర్‌లో తీవ్ర‌ క‌ల‌వ‌రం, అస‌హ‌నం పెరిగిపోయిందంటున్నారు. అందుకే, ఇటీవ‌ల మంత్రి కేటీఆర్‌.. ప‌దే ప‌దే రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నార‌ని భావిస్తున్నారు. రేవంత్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప‌నిలో నోటికి ప‌ని చెబుతున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల కేటీఆర్ చేసిన కామెంట్లు ప‌రిశీలిస్తే....  జంగ్ లేదు.. సైరన్ లేదు.. అది జంగు పట్టిన పార్టీ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ‘తుపాకీ లేదు.. ఉత్తి తుపేల్ పార్టీ’ అని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకొని ఉద్యమకారులపైకి రేవంత్‌రెడ్డి వెళ్లారంటూ పాత విష‌యాల‌ను కొత్తగా కెలుకుతున్నారు కేటీఆర్‌. చంపిసోడే సంతాపం తెలిపినట్టు.. శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్ పూలదండ వేశారని.. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్ అంటూ మంత్రి కేటీఆర్ పేలాల్లా పేలుతున్నార‌ని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా.. రేవంత్‌రెడ్డి దూకుడు చూసి.. కేటీఆర్‌లో క‌లుగుతున్న కంగారేన‌ని భావిస్తున్నారు.   

టాప్ న్యూస్ @ 1PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్‌గా  ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందన్నారు సీఎం. బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్‌ అందించడమే 'స్వేచ్ఛ' ఉద్దేశ్యమన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.---------అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూపురం నియోజకవర్గం రాజుపాలెంలోరైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  ------ జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా  గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం  చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.  -------- సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు బిల్లులతో షాక్ కొట్టేలా చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ట్రూ అప్ పేరుతో ప్రజల జేబులను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ బిల్లులతో దళిత కుటుంబాలు చీకటిలో బ్రతకాల్సి వస్తుందన్నారు. జగ్జీవన్ జ్యోతిని ఆర్పాలనే జగన్ ఆలోచనని, ఉచిత కరెంట్ సంగతి ఎలా ఉన్నా, బిల్లులతో సామాన్యుడు బేజారెత్తిపోతున్నాడని, రైతు మెడకు మీటర్లతో ఉచ్చు బిగుస్తున్నారని మండిపడ్డారు ------- కడప ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారుక్ షిబ్లీ నిర్బంధంపై సమితి నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో మైనారిటీలపై పెరుగుతున్న దాడుల గురించి లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్ఆర్సీ పూర్తి వివరాలు పంపాలని కడప ఎస్పీని ఆదేశించింది ------- లఖీంపూర్‌ ఖేరీ ఘటనను మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. యూపీ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్_ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌ను చూసి షాక్, భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు --------- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద  మాట్లాడుతూ కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ‘‘యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?’’ అని ప్రశ్నించారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని షర్మిల వ్యాఖ్యానించారు.  --------- కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు నిర్వహించారు. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు అటువైపు వెళ్లాలంటే భయపెడుతున్నారు. ఫారెస్ట్‌లో క్షుద్రపూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  ------------- లఖింపూర్ కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం కాదని సమాజ్‌‍వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.మంగళవారం లక్నోలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ తాజా ట్వీట్ చేశారు. రైతులను కోల్పోయిన విషాదంలో యూపీ ఉందని, సెలబ్రేషన్లు జరుపుకునేందు ఇదెంత మాత్రం సమయం కాదని అన్నారు ----------  గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 18,346 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 209 రోజుల్లో అత్యల్ప రోజువారి కేసులు నేడు నమోదవడం గమనార్హం. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902 ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 97.93%గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీరీ వీరీ 'గూగుల్‌'పండు.. ఏపీ రాజ‌ధాని పేరేంటి? దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్‌..

వీరీ వీరీ గుమ్మ‌డిపండు వీరి పేరేంటి? అని చిన్న‌పిల్ల‌లు స‌ర‌దాగా అడుకుంటారు. క‌ళ్లు మూసి ఉంటాయి కాబ‌ట్టి ఆ పేరు చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ, గూగుల్ అలాకాదు. ప్ర‌పంచంలో ఏ విష‌యం గురించి అడిగినా.. గూగుల్‌కు ట‌క్కున స‌మాధానం ఇస్తోంది. అలాంటి గూగుల‌మ్మ‌కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే క్వ‌శ్చ‌న్ ఒకే ఒక్క‌టుంది. అది, ఏపీ రాజ‌ధాని ఏంటి? ఈ ప్ర‌శ్న అడిగితే మాత్రం.. గూగుల్ నేరుగా, సూటిగా ఒక ఆన్స‌ర్ చెప్ప‌లేక పోతోంది. డౌట్ ఉంటే మీరే గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి.. వాట్ ఈజ్ ఏపీ కేపిట‌ల్ అని కొట్టి చూడండి.. త‌మాషా ఏంటో మీకే తెలుస్తుంది.. చూశారుగా.. వాట్ ఈజ్ ఏపీ కేపిట‌ల్ అని గూగుల్ త‌ల్లిని అడిగితే.. నాలుగు ఆన్స‌ర్లు ఇస్తోంది. విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి, క‌ర్నూల్‌. అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నాలుగు రాజ‌ధానులు ఉన్నాయ‌ని గూగుల్ భావ‌న‌. ఇంత‌కుముందు ఇలా వ‌చ్చేది కాదు. ఏపీ కేపిట‌ల్ అని కొడితే.. నేరుగా అమ‌రావ‌తి అని చూపించేది. రాజ‌ధానితో జ‌గ‌న్ మూడుముక్క‌లాట త‌ర్వాతే.. ఇలా నాలుగు పేర్లు చూపిస్తోంది. విశాఖ‌, అమ‌రావ‌తి, క‌ర్నూలుతో పాటు ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని కాబ‌ట్టి.. ప‌నిలో ప‌నిగా హైద‌రాబాద్ పేరునూ చూపిస్తోంది. ఇక‌, వికీపీడియాలోనైతే దేశంతో మూడు రాజ‌ధానులున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ కీర్తిస్తోంది కూడా.    సీఎం జ‌గ‌న్ కేపిట‌ల్ గేమ్‌తో గూగుల్ సెర్చ్ ఇంజ‌నే క‌న్ఫ్యూజ్‌ అవుతోందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధానిని క‌నుమ‌రుగు చేసే కుట్ర‌లో.. జ‌గ‌న్ ఆడిన జ‌గ‌న్నాట‌కంలో.. రాజ‌ధాని నాలుగు ముక్క‌లు అయింద‌నేది గూగుల్ అభిప్రాయం. ఒక‌ప్పుడు ఏపీ కేపిట‌ల్ అని సెర్చ్ చేస్తే.. అమ‌రావ‌తి పేరుతో పాటు.. స‌న్ రైట్ స్టేట్ అంటూ.. అంత‌ర్జాతీయ స్థాయి రాజ‌ధానంటూ.. అద్భుత‌మైన ఫోటోలు, అత్య‌ద్భుత‌మైన రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ న‌మూనాలు గూగుల్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేవి. ఒక్క ఛాన్స్ అంటూ జ‌గ‌న్ రాక‌తో.. ఏపీ ఆగ‌మాగ‌మైంది. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని కుప్ప‌కూలిపోయింది. జ‌గ‌న్ ఆడిన మూడు ముక్క‌లాట‌తో.. రాజ‌ధాని పీలిక‌లు, చీలిక‌లుగా మారి.. ఎటూ కాకుండా.. ఎవ‌రికీ కాకుండా పోయింది. అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు.. పేరుకే రాజ‌ధానులు కానీ.. వీటిలో ఏ ఒక్క న‌గ‌రానికైనా జ‌గ‌న్ హ‌యాంలో అభివృద్ధి కానీ, ప్రాధాన్యం కానీ ద‌క్కిందా?  రాజ‌ధాని కోసం కొత్త‌గా ఒక్క బిల్డింగ్ అయినా క‌ట్టారా? ఒక్క ప్రాజెక్ట్ అయినా చేప‌ట్టారా? మ‌రెందుకీ మూడు రాజ‌ధానులు? ఎవ‌రి బాగు కోసం? ఇంకెవ‌రి నాశ‌నం కోసం? అంటూ సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు.   

సీఎంలను ఏకం చేస్తున్న స్టాలిన్.. మోడీ ప్రభుత్వానికి షాకేనా?

పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తన నిర్ణయాలతో విపక్షాలను సైతం మెప్పిస్తున్నారు. జయలలిత పేర్ల మీద ఉన్న పథకాలను కొనసాగించడం, అమ్మ క్యాంటీన్లను అలాగే కంటిన్యూ చేయడం వంటి నిర్ణయాలు ఆయనను గ్రాఫ్ మరింత పెంచాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న తరహాలో పాలనను అందిస్తూ.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలోనూ గతానికి భిన్నంగా విపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు స్టాలిన్. వ్యక్తిపూజ ఎక్కువగా కనిపించే తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. సభలో తనను పొగిడిన డీఎంకే ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.  తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలనానికి తెర తీశారు.  జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో కేంద్రం ఒత్తిడి పెంచేలా ఆయన తీసుకుంటున్న తాజా చర్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీట్ పై తన వైఖరిని స్పష్టం చేస్తూ  పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖలు రాశారు స్టాలిన్. ఎన్టీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. ఏపీ, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా,పంజాబ్,రాజస్థాన్, తెలంగాణ. పశ్చిమ బెంగాల్ తో పాటు గోవా ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నీట్ ను వ్యతిరేకించటమే కాదు.. విద్యా రంగంలో రాజకీయ ఏకాగ్రతను పొందేందుకు.. అందరూ ఏకతాటి మీద రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతో ఆయనీ లేఖలు రాసినట్లుగా చెబుతున్నారు.  ‘మనంతా ఏకగ్రీవం’ కావటానికి అవసరమైన పరిస్థితుల గురించి లేఖలో ప్రస్తావించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. నీట్ ను వ్యతిరేకించటంతో పాటు.. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. తానే స్వయంగా లీడ్ తీసుకున్నారు. నీట్ కు ప్రత్యామ్నాయంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్ కమిటీ నివేదికను కమిటీ నివేదిక తాను రాసిన లేఖకు జత చేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. తాజాగా తాను టార్గెట్ చేసిన అంశాన్ని సమయానికి తగ్గట్లుగా తెర మీదకు తీసుకురావటం ద్వారా ఆసక్తికరంగా మారింది.  ముఖ్యమంత్రులను ఏకం చేసే విషయంలో తమిళనాడు సీఎం  స్టాలిన్ ఎంతవరకు సక్సెస్ అవుతారు.. స్టాలిన్ చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నీట్ విషయంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వీళ్లంతా స్టాలిన్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అనంతలో మంత్రి అనుచరుల దౌర్జన్యం! బాధిత రైతు సెల్పీ వీడియో వైరల్..

మూడు దాడులు.. ఆరు ఆక్రమణలు.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ ఇలానే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని అంటున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వైసీపీ నేతలు తీరు మారడం లేదు. వైసీపీ గ్రామ స్థాయి నేతల నుంచి మంత్రుల వరకూ అందరికి ఇదే పరిస్థితి. రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై బహిరంగంగా వైసీపీ నేతల లంచగొండులుగా మారిపోయారని కామెంట్ చేశారు.  తాజాగా అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూపురం నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో రైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను, మంత్రి అనుచరుల దౌర్జాన్యాన్ని ఆయన సెల్పీ వీడియోలో వెలిబుచ్చారు.  ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  అనంతపురం జిల్లాలో మంత్రి అనుచరుల అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని  వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా  రాజుపాలెంలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని స్వయంగా మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా  గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం  చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.  

హుజూరాబాద్ లో రేవంత్ వ్యూహం ఇదేనా.. అందరి లక్ష్యం ఒక్కటేనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి? పీసీసీ అధ్యక్ష్ బాధ్యతలు చేపట్టిన తొలిక్షణం నుంచే  తెరాస ప్రభుత్వంతో చెడుగుడు ఆడుతూ, ముఖ్యమంత్రి కంటికి కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ విషయంలో ఎందుకు, ఆస్థాయిలో దూకుడు చూపడం లేదు? ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? చివరకు  అభ్యర్థి ఎంపిక విషయంలోనూ నియోజకవర్గంతో అంతగా పరిచయం లేని, విద్యార్ధి నాయకుడు బల్మూర్ వెంకట్ ను  ఎందుకు బరిలో దింపారు? ఇలా చాలానే ప్రశ్నలు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ మ్యాన్ అనుకున్నమాజీ ఎంపీ కొండ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధికి కాకుండా, బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. నిజానికి విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అభ్యర్ధి ఈటలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, కేసీఆర్’కు వ్యతిరేకంగా,  తమ బృందాన్ని ఈటల తరపున ప్రచారానికి దించారు. దీంతో  రేవంత్ రెడ్డి వ్యూహం విషయంలో అనుమానాలు ఇంకొంత బలపడుతున్నాయి. అలాగే, తెరాస నాయకులు రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్ధి ఈటలతో కుమ్ముక్కయ్యారని ఆరోపిస్తున్నారు.  అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం వెనక దీర్ఘకాల వ్యూహం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  ఈటల ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్న ఉద్యమ స్పూర్తికి ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతే కానీ, కేవలం బీజేపీ అభ్యర్ధిగా మాత్రమే ఆయన పోటీచేయడం లేదు.   హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నమాట నిజం. కానీ, గెలిచేందుకు సరిపడే ఓటు బ్యాంక్ అయితే లేదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ హుజూరాబాద్ లో కనీసం ఒక్కసారి కూడా గెలవలేదు. ఈని సార్లు ఎన్నికలు జరిగినా అన్ని సార్లు, రన్నరప్ గానే సంతృప్తి పడవలసి వస్తుంది. బీజేపీ పరిస్థితి ఇంకా అద్వాన్నం, ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా డిపాజిట్ దక్కిందో లేదో కూడా అనుమానమే. అయితే  మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అనివార్యంగా బీజేపీలో చేరిన ఆ పార్టీ అభ్యర్థి ఈటలకు హుజూరాబాద్ పెట్టని కోట. గత 18 ఏళ్లుగా, అక్కడ నుంచి ఆయనే గెలుస్తున్నారు. ఇలా అన్ని కోణాలలో లెక్కలు వేసిన తర్వాతనే, రేవంత్ రెడ్డి, ప్రధాన శత్రువు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించే లక్ష్యంతోనే హుజూరాబాద్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషణలు వినవస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతి అడుగు, కేసీఆర్ టార్గెట్ గానే ఉంటుందని, ఇది కూడా అందులో భాగంగానే చూడాలని విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలదు,కానీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం వలన తెరాస గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. నిజంగానే, చివరకు తెరాస అభ్యర్ధి గెలిస్తే,  కాంగ్రెస్ పార్టీ అపనిందలు మోయవలసి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి తెరాసను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా హుజూరాబాద్ విషయంలో ఇటు తెరాస నుంచి అటు సొంత పార్టీలోని తెరాస అనుకూల వర్గాల నుంచి, వ్యూహాత్మక  వత్తిళ్ళు వచ్చినా, రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల కంటే, 2023 ఎన్నికలపై దృష్టి నిలిపారని అంటున్నారు.  నిజానికి, కొండా విశ్వేశ్వర రెడ్డి సహా కేసీఆర్’ పాలనను వ్యతిరేకిస్తున్న ఉద్యమ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమనాయకులు అందరూ కూడా, ఈటలను బీజేపీ అభ్యర్ధిగా కంటే, తమ ప్రతినిధి గానే చూస్తున్నారు. అందుకే ఈటలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే, హుజూరాబాద్’ ఉప ఎన్నిక పార్టీలు, అభ్యర్ధుల మధ్య జరుగతున్న ఎన్నిక కాదు, కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరుగతున్న ఉప ఎన్నికగానే, పరిశీలకులు కూడా భావిస్తున్నారు. అలాగే, ఇది కేవలం హుజూరాబాద్ కు పరిమితం అయిన ఉప ఎన్నిక కాదు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికగానే పరిశీలకు ప్రజలు భావిస్తున్నారు. అందుకే, సిద్ధాంత  రాద్దంతాలను పక్కన పెట్టి కేసీఆర్’ను ఓడించడమే లక్ష్యంగానే అందరి అడుగులు పడుతున్నాయని అంటున్నారు.

దసరాకి జీతాలు వచ్చేనా.. పండుగ గడిచేదెలా! 

ఉద్యోగులంతా ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ రోజున వచ్చే వేతనం కోసమే వాళ్ల వెయిటింగ్. జీతం రాగానే నెలసరి బడ్జెట్ సెట్ చేసుకుని ఖర్చు చేసేస్తుంటారు. ఒకటో తేదీతో వాళ్ల జీవితాలు అలా ముడిపడి ఉంటాయి. ఈఎమ్ఐలు, నిత్యావసరాల కొనుగోళ్లు ఇతరత్రా పనులన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి. గతంలో ఠంచన్ గా ఒకటో తారీఖే జీతాలు రావడంతో.. ఆ రోజుకే అందరూ అలా సెట్ చేసుకున్నారు. కాని కొన్ని రోజులుగా సీన్ మారిపో.యింది. ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో వేతనాలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సార్లు 15వ తారీఖు వరకు కొందరు ఉద్యోగులకు సాలరీలు అందడం లేదు. గతంలో రాష్ట్రమంతా ఒకేసారి వేతనాలు ఇచ్చేవారు. కాని ప్రస్తుతం జిల్లాకోరోజు... ఇంకా చెప్పాలంటే శాఖల వారీగా ఒక్కోరోజు వేతనాలు జమ చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో తమ వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉంటున్నారు. మొదటి వారంలోనే ఈఎమ్ఐలు కట్టాల్సిన వాళ్లు అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.  తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకలు దసరాకి స్పెషల్. ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలు పేర్చి ఆడిపాడుతారు. దసరా ఉత్సావాలు ఆరవ తేదీ బుధవారం నుంచి మొదలవుతున్నాయి. కాని ఉద్యోగులకు వేతనాలు మాత్రం ఇంకా అందలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు ఆలస్యమవుతున్నాయి. ఆగస్టు జీతాన్ని సెప్టెంబరు 6 వరకు చెల్లిస్తూ వచ్చారు. బతుకమ్మతో పాటు దసరా ఉన్నందున కనీసం సెప్టెంబరు వేతనాన్ని అయినా అక్టోబరు 1న లేదా 4న చెల్లిస్తారని ఉద్యోగులు ఆశించారు. కానీ సోమవారం వరకు ఏడు జిల్లాలవారికే అందాయి. మిగితా 27 జిల్లాల వారికి ఎప్పుడు ఇస్తారన్నది క్లారిటీ లేదు. బతుకమ్మ నేపథ్యంలో.. ఈసారి కాస్తముందుగా అయినా జీతాలు వస్తాయని ఆశించిన మహిళా ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. అతిపెద్ద పండుగ అయిన దసరా ముందు కూడా ఆలస్యంగా ఇవ్వడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐకి వెళ్లిన సంకేతాల మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్‌ జిల్లాల ఉద్యోగులకు మాత్రమే సోమవారం వేతనాలు, పెన్షన్లు జమయ్యాయి. మిగతా 26 జిల్లాల వారికి ఎప్పుడు అందుతాయో, ఏ జిల్లావారికి ముందుగా అందుతాయో ఇంకా స్పష్టత లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రాబడి పెరిగినందున ఈసారైనా 1వ తేదీన చెల్లిస్తారని అనుకుంటే ఎందుకు చెల్లించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు కోసం ఉద్యోగులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారని, వాటికి నెల వాయిదాలు కట్టాల్సి ఉంటుందని అంటున్నారు. కొంతమంది పిల్లలకు ఫీజులు చెల్లిస్తుంటారని, అద్దె ఇళ్లలో ఉండేవారికి మరీ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇలాంటివాటికి వేతనాలపైనే భరోసా ఉంచుతామని.. కానీ అవి ఎప్పుడు చేతికందుతాయో తెలియని అయోమయం నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు.  30 ఏళ్లుగా ఒకటో తేదీన ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తూ వచ్చాయని,  ఇప్పుడే విధానం మారిందని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు పెదవి విప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంతో వివాదం ఎందుకన్న ధోరణితో తప్పించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా ప్రభుత్వం కూడా జీతాలు ఆలస్యంగా మంజూరును తీవ్రంగా తీసుకోవడం లేదని తెలిపారు. దసరాకు దుస్తులు, ఇతర వస్తువులు కొనాల్సి ఉంటుందని కొందరు వివరిస్తున్నారు. పెద్ద పండుగ ముందైనా వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం దురదృష్టమని మండిపడుతున్నారు. 

పర్యాటకులను మోసం చేస్తే జైలుకే.. కొత్త చట్టానికి ఆమోదం

పర్యాటకుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ చట్ట ప్రకారం పర్యాటకులను మోసం చేస్తే జైలుకు వెళ్లేలా కఠిన చట్టాలను బిల్లులో పొందు పరిచారు. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వాళ్ల భద్రత కోసమే కొత్త బిల్లును తీసుకొచ్చామని టీఆర్ఎస్ సర్కార్ ప్రకటించింది.  రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే వారిపై కఠినచర్యలు తీసుకొనేలా చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును సోమవారం అసెంబ్లీలో మంత్రి మహమూద్‌ అలీ ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పర్యాటకులు, ప్రయాణికులను మోసంచేయడం, దురుసుగా ప్రవర్తించడం, దళారీతనానికి ప్రయత్నించడం వంటి చర్యలను నిరోధించడమే దీని లక్ష్యం.  కొత్త బిల్లు ప్రకారం.. పర్యాటకులను మోసంచేసిన వారికి 10 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మోసాన్ని ప్రేరేపించిన వారికి ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా వేస్తారు. మోసగించేందుకు ప్రయత్నించిన వారికి 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దీనితోపాటు సీఎం కేసీఆర్‌ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రవేశపెట్టిన తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో పర్యాటకన అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నదిలో 160 కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉంటున్నదని.. అద్భుత సుందర దృశం ఆవిష్కృతమవుతున్నదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు విద్యుత్తు, వ్యవసాయం, సాగు, తాగునీరు మీద దృష్టి పెట్టడం వల్ల పర్యాటకం, చారిత్రక ప్రదేశాలపై అంతగా దృష్టి పెట్టలేదన్నారు. అన్ని జిల్లాల శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రతిపాదనలు అందించాలని సూచించారు. వాటన్నింటిపై చర్చించి అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక పరంగా కోటలు, బురుజులు విశిష్ట దేవాలయాలు, ప్రాకృతిక ప్రాంతాలు ఇలా అన్ని ప్రముఖ ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

ఆదిత్యనాథ్ దాస్ కు ఢిల్లీ బాధ్యతలు.. సాయిరెడ్డికి ఇక బ్యాండేనా?  

విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత.  సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. జగన్ తో పాటు జైలుకు వెళ్లారు. కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి. వైసీపీలోనూ నెంబర్ టు అంటారు. జగన్ తర్వాత పార్టీలో ఆయనే సూపర్ బాస్ అని, కీలక నిర్ణయాల్లో జగన్ ఆయన సలహా తీసుకుంటారనే టాక్ కూడా ఉంది.  పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా చూస్తున్నారు సాయిరెడ్డి. అయితే విశాఖలో విజయసాయి రెడ్డి అరాచకాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్.. ముందస్తుగా విజయసాయి రెడ్డిని అక్కడ మోహరించారనే విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీలో నెంబర్ టుగా చెప్పుకునే  విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు బాగాలేదని తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన్ను దూరం పెట్టారని అంటున్నారు. కొన్ని నెలలుగా జగన్ ను విజయసాయి కలవకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. తాడేపల్లి సీఎంవో వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో సాయిరెడ్డి క్యాంప్ ఆఫీసు రావడం లేదని తెలుస్తోంది. తాజాగా  ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఉన్న బాధ్యతలన్నీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా సలహాదారు పదవి పొందిన ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.  ఢిల్లీలో ఉంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పని చేసేందుకు విధివిధానాలు , జీత భత్యాల ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్రంతో పనులు చక్కబెట్టడం గురించే అన్ని పనులే ఇకపై దాసే చేయనున్నారు. దీంతో  విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని వస్తున్న వార్తలు నిజమేనని భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ  వ్యవహారాలను చూసే బాధ్యత విజయసాయిరెడ్డికి ఇచ్చారు జగన్. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిని.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయనకు విరుద్ధ ప్రయోజనాల కింద పదవీ గండం ఉందని న్యాయనిపుణులు చెప్పడంతో అప్పటికప్పుడు చట్టాన్ని కూడా మార్చేశారు. ఢిల్లీలో వైసీపీ అంటే తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. ఢిల్లీలోఆయన పాత్ర తగ్గుతూ వస్తోంది. తాజాగా ఆయన నిర్వహించాల్సిన బాధ్యతలన్నీ ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించడంతో పార్టీలో ఆయన భవిష్యత్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  విజయసాయిరెడ్డి తీరు కూడా ఇటీవల మారిపోయింది. గతంలో దూకుడుగా వ్యవహరించిన ఆయన ఇటీవల సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటం లేదు. ఆయనపై వైసీపీ హైకమాండ్‌కు పూర్తి స్థాయిలో విశ్వాసం సన్న గిల్లిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కొనసాగించడం కష్టమని.. చివరికి పార్టీ తరపున ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా తొలగిస్తారని అంటున్నారు. త్వరలో జరగనున్న మంత్రి వర్గ పునర్ వ్యవస్థికరణలో మంత్రి వర్గం నుంచి తొలగించే సీనియర్ నేతకు విజయసాయి  స్థానం ఇస్తారన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది. అదే జరిగితే వైసీపీలో నెంబర్ టూ స్టేజ్‌లో ఉండి చక్రం తిప్పిన మైసూరారెడ్డి లాంటి వారి పరిస్థితే విజయసాయిరెడ్డికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.  

వంగ‌వీటి-ప‌వ‌న్ కాంబినేష‌న్‌? కాపులంతా ఏకమ‌వుతున్నారా? జ‌గ‌న్‌కు మూడిన‌ట్టేనా?

ఏపీ రాజ‌కీయ‌మంతా కాపుల చుట్టూనే తిరుగుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ట్రాట‌జీతో కాపు రాజ‌కీయం రంజుగా మారింది. కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి.. కులాలంతా క‌లిసి మిగ‌తా వెన‌క‌బ‌డిన‌ సామాజిక వ‌ర్గాల‌కు నాయ‌క‌త్వం వ‌హించాలంటూ పిలుపు ఇచ్చారు జ‌న‌సేనాని. ప‌వ‌న్ పిలుపును ఇప్ప‌టికే చాలా మంది స్వాగ‌తిస్తున్నారు. కాపు సంఘం నేత‌లు పీకే ప్ర‌తిపాద‌న‌కు సై అంటే సైసై అంటున్నారు.  మంగ‌ళ‌గిరి మీటింగ్‌లో ప‌వ‌న్.. కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న‌రంగా హ‌త్యోదంతం గురించి ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అభిమానులు రంగాకు కాపు కాసి ఉంటే ఆయ‌న చ‌నిపోయేవారు కాదుగా? అంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న లేవ‌నెత్తారు. ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా రంగా టాపిక్ తీసుకొచ్చార‌ని.. కాదు కాదంటూనే ఆయ‌న కాపు రాజ‌కీయం చేస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎవ‌రి ఉద్దేశ్యాలు, ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా.. ప‌వ‌న్ లేవ‌నెత్తిన కాపుల ఐక్య‌త.. బాగానే వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్టుంది. తాజాగా, వంగ‌వీటి రంగా త‌న‌యుడు రాధా సైతం కాపుల ఏకీక‌ర‌ణ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  తెలంగాణ‌లోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో త‌న తండ్రి మోహనరంగా విగ్రహాన్ని వంగ‌వీటి రాధా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగానికి రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. వైసీపీలో ప్ర‌కంప‌ణ‌లు రేపుతోంది. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే...   ‘‘నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే.. అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు. మన నాయకుడు రంగాను మనం కాపాడుకోలేక పోయాం. ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ.. పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి’’ అంటూ వంగ‌వీటి రాధా సంచలన కామెంట్స్‌ చేశారు. రాధా ప్ర‌సంగంలో కీల‌క అంశాలు ప్ర‌స్తావించార‌ని అంటున్నారు. ముందుగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టడ‌మే ల‌క్ష్యం అన్న‌ట్టు మాట్లాడారు. ఇటీవ‌ల.. తాను, ప‌వ‌న్ కాపు నా కొడుకులం.. అంటూ వాగిన మంత్రి పేర్ని నానిపై ప‌రోక్షంగా ఫైర్ అయ్యారు రాధా. పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందంటూ.. పేర్ని నాని టార్గెట్‌గానే ఆయ‌న ఆ వ్యాఖ్య‌లు చేశారు.  ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని.. ఐకమత్యమే బలమ‌ని.. ఉన్నవారిని అయినా కాపాడుకోండని.. రాధా చేసిన ప్ర‌సంగం ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించే అంటున్నారు. అంటే, వంగ‌వీటి జ‌న‌సేన‌కు స‌పోర్ట్‌గా.. వైసీపీకి యాంటీగా మారార‌ని విశ్లేషిస్తున్నారు. ఇటు ప‌వ‌న్‌, అటు వంగ‌వీటిలు క‌లిసి.. కాపులంద‌రినీ ఏకం చేసి.. తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి కులాల‌ను క‌లుపుకొని.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుపై తిర‌గ‌బ‌డే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని అంటున్నారు. అలా జ‌రిగితే.. ఇక వైసీపీ ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకే.    

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన మున్సిపల్ చైర్ పర్సన్

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ కేడర్ యాక్టివ్ అయ్యారని, గతంలో పార్టీని వీడిన నేతలంతా తిరిగి హస్తం గూటికి వస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కొందరు నేతలు సొంత గూటికి చేరుకున్నారు కూడా. ఇటీవల భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇకపై కాంగ్రెస్ లోకి వెల్లువలా వలసలు ఉంటాయని అంతా భావించారు. కాని అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చింది అధికార టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో మున్సిపల్ చైర్ పర్సన్ హస్తానికి హ్యాండిచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపల్ చైర్మన్  తోకల చంద్రకళ వెంకన్న  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా కారెక్కారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫైర్ బ్రాండ్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయినా కోమటిరెడ్డిని కాదని, రేవంత్ రెడ్డి షాకిస్తూ కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చగా మారింది.  కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ టీఆర్ఎస్ లో చేరడంలో నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కూసుకుంట్ల. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం హైదరాబాద్ కు పరిమితం అవుతున్నారు. రెండు ,మూడు నెలలకొకసారి అలా వచ్చి ఇలా వెళుతున్నారో తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై విసిగిపోయిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. గతంలోనే చండూరు జడ్పీటీసీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. చౌటుప్పల్ మండలంలోనూ ఎంపీపీ సహా పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు కారెక్కారు. మున్సిపల్ చైర్ పర్సన్ ను చేరిక సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్.  కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏం లేదన్నారు కేటీఆర్. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గానికి ఫ్లోరోసిస్ ఇచ్చిందన్నారు. తెలంగాణ తొలి ఉద్యమ కారుడు శ్రీకాంత చారి అయితే ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం టైం లో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమ కారులపై దాడుల చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మునుగోడు ఎమ్మెల్యే మాటి మాటికి రాజీనామా చేస్తా అంటున్నడు.. ఆయినా రాజీనామా చేసిన చేయకపోయినా రాష్ట్రం అంతట దళిత బందు అమలు చేస్తామని తెలిపారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రంలో  చిచ్చు పెట్టాలని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.  

TOP NEWS @ 7pm

1. పండోర పేపర్ లీక్స్‌లో వైసీపీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయ‌ని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమ ఆరోపించారు. జగన్ కేసులలో విదేశాల్లో ఉన్న డబ్బు భారత్‌కు రప్పించేదుకు సీబీఐ ఇప్పటికే 6 దేశాలకు లేఖలు రాసిందన్నారు. ‘జే’ బ్రాండ్స్ మద్యంలో డ్రగ్స్ కలుపుతునట్లు వార్తలు వస్తున్నాయన్నారు. దేశం మొత్తానికి వైసీపీ నాయకులు గంజాయిని స‌ప్లై చేసి డబ్బు సంపాదిస్తున్నారన్నారు. ఇలా వ‌చ్చిన‌ అక్రమ డబ్బును సూట్ కేసు కంపెనీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని బోండా ఉమ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 2. ‘మా’ ఎన్నికలకు, వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. మా ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఏ వ్యక్తినీ, వర్గాన్నీ సమర్ధించడం లేదని చెప్పారు. మా ఎన్నికలకు రాజకీయం రంగు పులముకున్న నేప‌థ్యంలో మంత్రి పేర్ని నాని చేసిన‌ ప్రకటన ఆస‌క్తిక‌రంగా మారింది.  3. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మండిప‌డ్డారు. టూరిజంతో పాటు పలు విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు. పద్మశ్రీ అవార్డుల్లో అన్యాయం జ‌రుగుతోంద‌ని.. తెలంగాణలో ప‌ద్మశ్రీకి అర్హులు లేరా? అని ప్ర‌శ్నించారు. పద్మశ్రీ అవార్డు కోసం జాబితా పంపాలా? వ‌ద్దా? అని మోదీ, అమిత్‌షాల‌ను కలిసిన‌ప్పుడు విజ్ఞప్తి చేశానని చెప్పారు. 4. ఏపీలో వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా, అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి కుటుంబం.. వారి పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందన్నారు. వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చేయడం దారుణమన్నారు నారా లోకేశ్‌.  5. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త‌న‌కు కులం ప్రాధాన్యత లేదని చెప్పి.. ఇప్పుడు కులాలను రెచ్చగొడుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌లను పక్కన పెట్టేందుకు ప్ర‌యత్నిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే పవన్, సీఎం జగన్‌ల కుట్రని హర్షకుమార్ ఆరోపించారు. నిజంగా పవన్‌కు చిత్తశుద్ది ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లు బాగుచేయాలన్నారు.  6. ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో కేసులు ఉన్నంత వరకూ ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. దీంతో, విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.  7. విశాఖలో ఆస్తుల తాకట్టు పెట్టి 2900 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని, అది ప్రజల ఆస్తి అంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మండిప‌డ్డారు. మద్యం తాగే వాళ్ల‌ తలలు తాక‌ట్టు పెట్టడమే కాకుండా.. సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రజల ఆస్తులు, డబ్బులు తాక‌ట్టు పెడుతున్నారని ఆరోపించారు. కరోనా కారణం చెపుతూ కాకమ్మ కథలు చెప్తున్నారని ప్ర‌భుత్వంపై ర‌ఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.  8. స్థల వివాదంలో వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఏపీ హైకోర్టు ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్ర‌యత్నించింది. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్లకు చెందిన వ్యక్తి భూమిని గతంలో ఆర్టీసీకి ఇవ్వాలని ప్రభుత్వం భావించగా.. బాధితుడు కోర్టు నుంచి త‌న‌కు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ భూమిపై వైసీపీ నేతలు కన్నేశారు. ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ కుంటుంబం హైకోర్టు ముందు డీజిల్‌ ఒంటిపై పోసుకుని సూసైడ్ అటెంప్ట్‌ చేయగా అక్కడే ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   9. డ్ర‌గ్స్ కేసులో షారుఖ్ త‌న‌యుడు ఆర్య‌న్‌ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది. ఈ నెల 7 వ‌ర‌కు ఎన్సీబీ క‌స్ట‌డీకి అనుమ‌తించింది ముంబై సిటీ కోర్టు. అంత‌కుముందు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు అతడు ఏడ్చాడ‌ని అంటున్నారు. గత 4 ఏళ్లుగా ఆర్య‌న్‌ డ్రగ్స్‌ను తీసుకుంటున్నట్టు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. దుబాయ్, బ్రిటన్ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా మాదక ద్రవ్యాలను వాడుతున్నట్టు సమాచారం. ఎన్సీబీ అధికారులు ప్రశ్నించే సమయంలో తన తండ్రి షారుఖ్‌ఖాన్‌తో 2 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడేందుకే అవకాశమిచ్చారు పోలీసులు.  10. వైద్య‌రంగంలో ఇద్ద‌రు అమెరిక‌న్ సైంటిస్టుల‌కు నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. వేడి, చల్లదనం, స్పర్శకు సంబంధించిన జ్ఞానం మెదడుకు చేరే క్రమంలో నరాలు ఎలా ప్రేరేపించబడతాయి? వాటి స్పందనలు ఎలా ప్రారంభం అవుతాయి? అనే అంశంలో పరిశోధన చేసి.. గ్రాహ‌కాల‌ను క‌నుగొన్న‌ డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌కు సంయుక్తంగా నోబెల్ అవార్డు ప్రకటించారు.

ప్రియాంక అరెస్టుతో యూపీలో హై టెన్షన్! దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..

ఉత్తర్ ప్రదేశ్ లో హై టెన్షన్ కనిపిస్తోంది. రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నాయి. కాంగ్రెస్ యువ నేత ప్రియాంక గాంధీ పోరాటంతో యూపీ పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నా. ఆదివారం మొద‌లైన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు సోమవారం మరింత ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, ఆ పార్టీ యూపీ ఇంచార్జీ ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. తీవ్ర వాగ్వాదం నేప‌థ్యంలో ప్రియాంకా గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌కు ముందు ప్రియాంక గాంధీపై పోలీసులు చేయి చేసుకున్నార‌న్న వాద‌న‌లూ క‌ల‌క‌లం రేపుతున్నాయి. పోలీసుల తీరుపై నిర‌స‌న తెలిపిన ప్రియాంకా గాంధీ.. త‌న‌ను ఉంచిన జైలు గ‌దిని స్వ‌యంగా చీపుపు ప‌ట్టి ఊడ్చిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ వీడియోల‌ను చూసిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నారు.  ఆదివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌ఖీంపూర్ భేరీలో ప‌ర్య‌టించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో  రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మంత్రి కారు రోడ్డు పక్కనే ఆందోళనలు చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందడంతో లఖీంపూర్‌ ఖేరి జిల్లాలో హింసాకాండ ప్రారంభమైందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో వాహనాలు దగ్ధం చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలో చ‌నిపోయిన‌ బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ సోమవారం బయలుదేరారు. సీతాపూర్ రాగానే అక్కడ పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. “మీరు చంపిన వ్యక్తులు, మీరు సమర్థిస్తున్న ప్రభుత్వం కంటే నేను ముఖ్యం కాదు కదా! మీరు నాకు లీగల్ వారెంట్, లీగల్ ప్రాతిపదిక ఇచ్చి అడ్డుకోండి. లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. మీరు నన్ను తాకడానికి కూడా వీలు లేదు” అని సీతాపూర్‌లో ఆమె పోలీసులపై ధ్వజమెత్తారు. పక్కకి జరగాలంటూ ఒక మహిళా పోలీసు ఆమెను అభ్యర్థించిన్నట్లు సమాచారం. అదే స‌మ‌యంలో ప్రియాంక గాంధీ వాద్రాను సీతాపూర్ పోలీస్ లైన్‌కు తీసుకువెళుతున్నారని.. ప్రజలు అక్కడికి రావాలని యూపీ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక వీడియోను ట్వీట్ చేసింది. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్‌ ఇచ్చి తనని అడ్డుకోవాలంటూ ఆమె పోలీసులకు తెలిపారు. ఒకవేళ మీరు నన్ను ఆ కారులో ఎక్కించుకుంటే.. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్లు కేసు ఫైల్ చేస్తానని ఆమె హెచ్చరించారు.  ఈ కేసు అనేది మొత్తం పోలీసులపై కాదు కానీ తనని అడ్డుకునే ఒక్క పోలీస్ పైనే పెడతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆమె పక్కన కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హుడా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రాపై ఎలా చేయి చేసుకుంటారని అతడు ఒక పోలీసును ప్రశ్నించారు. ఈ ఉద్రిక్తతలలో ప్రియాంకపై పోలీసులు చెయ్యి చేసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ హుడా మాట్లాడుతూ.. పోలీసుల భౌతిక దాడి గురించి తాను సాక్ష్యం ఇమివ్వబోతున్నానని.. వారి అరాచకాలు కళ్లారా చూశానని చెప్పారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి హుడాని ఒక కారులోకి తరలించే ముందు గట్టిగా తోస్తూ తీసుకెళ్లారు. ఇది చూసి.. “మళ్లీ మొదలెట్టారా.. ఆపండి” అని ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్ర‌మంలో పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్రియాంకా ఒక మహిళతో కూడా మాట్లాడలేని మీరు హుడాని కొడతారా? అంటూ జోక్యం చేసుకున్నారు. అనంతరం హుడాపై దాడి చేయనివ్వకుండా పోలీసుల బృందానికి అడ్డుగా నిలబడ్డారు. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్‌ ఇచ్చి తమని అడ్డుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇలా ఇరు వ‌ర్గాల మధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోగా.. పోలీసులు ప్రియాంకాను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత స‌మీపంలోని పోలీస్ లైన్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆమెను ఓ గ‌దిలో ఉంచారు. అయితే ఆ గ‌ది అపరిశుభ్రంగా ఉన్న వైనాన్ని గ్రహించిన ప్రియాంకా అక్క‌డే ఉన్న చీపురుని చేత‌బ‌ట్టి గ‌ది మొత్తాన్ని శుభ్రంగా ఊడ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసిన మరుక్ష‌ణ‌మే ప్రియాంకా సోద‌రుడు రాహుల్ గాంధీ ఆమెకె మ‌ద్ద‌తుగా ఓ ట్వీట్ చేశారు. “ప్రియాంక.. మీరు వెనక్కి తగ్గరని నాకు తెలుసు.. మీ ధైర్యానికి వారు ఆశ్చర్యపోయారు. న్యాయం కోసం జరిగే ఈ అహింసా పోరాటంలో మనం ఈ దేశ అన్నదాతలు గెలిచేలా చేయగలం” అని రాహుల్ గాంధీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మంత్రి కారు అడ్డ‌గింపు.. అభినందించిన కేటీఆర్‌..

అస‌లే అది మంత్రి కేటీఆర్ కారు. ఆ కారు వ‌స్తుందంటే.. మిగ‌తా వాహ‌నాల‌న్నిటినీ ఆపేసి.. రూట్ క్లియ‌ర్ చేయ‌డ‌మే ట్రాఫిక్ పోలీసుల ప‌ని. కానీ, ఆ ఇద్ద‌రు పోలీసులు మాత్రం అలా చేయ‌లేదు. మంత్రి కారైతే ఏంటంటూ.. ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా రాంగ్‌రూట్‌లో వ‌స్తున్న కేటీఆర్ కారును ఆపేశారు. అక్క‌డే ఉన్న టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు గొడ‌వ ప‌డినా బెద‌ర‌కుండా మంత్రి కారుకు ఫైన్ వేసి.. రాంగ్‌రూట్ నుంచి వెన‌క్కి పంపించేశారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాకు ఎక్క‌డంతో అక్క‌డ ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. రాంగ్‌రూట్‌లో  మంత్రి కారు రావ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ నెటిజ‌న్లు కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు. సిన్సియ‌ర్‌గా డ్యూటీ చేసిన‌ ట్రాఫిక్ పోలీసుల‌ను అభినందిస్తున్నారు.  ఈ విష‌యం తెలిసి మంత్రి కేటీఆర్ సైతం ఆ ట్రాఫిక్ పోలీసుల‌ను అభినందించారు. రాంగ్‌రూట్‌లో వస్తున్న తన కారును అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను, కానిస్టేబుల్ వెంక‌టేశ్వ‌ర్ల‌ను మంత్రి కేటీఆర్ ప్ర‌సంశించారు. నిబంధనల ప్రకారం పని చేసిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకున్న మంత్రి కేటీఆర్.. వారిని శాలువాల‌తో స‌న్మానించారు.  నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒకటే అని మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజున తాను ఆ వాహనంలో లేనని కేటీఆర్ చెప్పారు. గాంధీ జయంతి రోజున బాపూ ఘాట్ ద‌గ్గ‌ర‌ అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తన కారుకు విధించిన చలాన్‌ను చెల్లించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం బాపూఘాట్‌ వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించేందుకు వెళ్లినప్పుడు ఆయన కారును ట్రాఫిక్ ఎస్‌ఐ అడ్డుకున్న విషయం తెలిసిందే. రాంగ్‌రూట్‌లో మంత్రి కారు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్య అడ్డుకున్నారు. రాంగ్‌ రూట్‌లో ఎందుకొస్తున్నావు? వెనక్కి వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో ట్రాఫిక్ సిబ్బందిని అభినందించి మంత్రి కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకున్నారు.  

వైసీపీ నేత‌ల‌ వేధింపులు!.. హైకోర్టు ముందు సూసైడ్ అటెంప్ట్‌..

ఏపీలో అధికార‌పార్టీ ఆగ‌డాలు ఆగ‌డం లేదు. వైపీసీ నేత‌లు బెదిరింపులు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారు. గుంటూరు జిల్లా ధూళిపాళ్ల‌కు చెందిన ఓ కుటుంబాన్ని కొంత‌కాలంగా వేధిస్తున్నారు గ్రామ పెద్ద‌లు. దీంతో విసిగి వేశారిపోయిన ఆ దంప‌తులు హైకోర్టు ముందు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టు ద‌గ్గ‌ర‌ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్ర‌యత్నించారు. వెంటనే గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఆ దంపతుల చేతిలో ఉన్న డీజిల్ సీసాను లాక్కున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.   2003 నుంచి తమకు ఉన్న స్థలంలో నివాసం ఉంటున్నామని.. త‌మ స్థ‌లాన్ని బస్ షెల్టర్ నిర్మాణానికి బలవంతంగా తీసుకొనేందుకు ప్ర‌యత్నించగా తాము హైకోర్టును ఆశ్రయించామని బాధితుడు దేవేంద్ర తెలిపారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. గ్రామంలో కొంత మంది పెద్దలు తమను నిత్యం వేధిస్తున్నారని వాపోయారు. దీంతో విసుగు చెంది హైకోర్టు ద‌గ్గ‌రే ఆత్మహత్యకు య‌త్నించామ‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు.  మ‌రోవైపు, ఏపీలో వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా, అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి కుటుంబం.. వారికి జీవనాధారమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందన్నారు. వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చేయడం దారుణమన్నారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నారా లోకేష్.

కేసీఆర్‌ను గుత్తా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ప‌ద‌వీ కోస‌మే లీకులా?

గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి. మూడుసార్లు ఎంపీ, ఒక‌సారి ఎమ్మెల్యే, మ‌రోసారి ఎమ్మెల్సీ. శాస‌న‌ మండ‌లి మాజీ ఛైర్మ‌న్‌. గ‌త‌మెంతో ఘ‌న‌మైన ఆయ‌న‌ ప్ర‌స్తుతం మాత్రం ఖాళీ. ఇన్నేళ్లూ ప‌ద‌వులు అనుభ‌వించిన నేత కావ‌డంతో.. ఇప్పుడు ఎలాంటి ప‌ద‌వీ లేకుండా ఉండ‌టం ఆయ‌న వ‌ల్ల కావ‌డం లేదంటున్నారు. కేసీఆర్ త‌న‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని తెగ ర‌గిలిపోతున్నార‌ట‌. ఇంత సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్‌నైన త‌న‌కు ఎలాంటి కుర్చీ వేయ‌కుండా.. ఇలా ఖాళీగా కూర్చోబెడ‌తారా అని ఆయ‌న ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలుస్తోంది.  ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం ముగిసి చాలా రోజులైనా మళ్లీ పున‌ర్నియామ‌కంపై కేసీఆర్ నుంచి ఎలాంటి హామీ లేదు. ఇక‌, రెండు దశాబ్దాలుగా గుత్తా కుటుంబం చేతుల్లో ఉన్న నార్మాక్స్ డైయిరీకి కొత్త చైర్మెన్ ను నియమించడంతో ఆయ‌న తీవ్ర స్థాయిలో క‌ల‌త చెందారు. అందుకే, త్వ‌ర‌లోనే గుత్తా.. టీఆర్ఎస్‌ను వీడుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి నాయ‌కుల కోస‌మే రెడీగా ఉండే బీజేపీ.. ఆయ‌న‌తో ట‌చ్‌లో ఉంద‌ని అంటున్నారు. రేపో-మాపో-ఎల్లుండో గుత్తా కాషాయం గూటికి చేర‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ఇదే చ‌ర్చ‌. గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి పార్టీ మారుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌. వ‌రుస క‌థ‌నాల‌తో లేటుగానైనా లేటెస్టుగా స్పందించారు గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న‌ వార్తలు అబద్ధమని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలెవరు తనతో చర్చలు జరపలేదన్నారు. ప‌నిలో ప‌నిగా బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. స‌రిగ్గా.. ఇక్క‌డే కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్‌లో ఉనికి లేకుండా పోయిందనే భయంతో గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు.. తానే లీకులు ఇచ్చి, తానే ఖండించు కుంటున్నార‌ని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా న‌ల్గొండ జిల్లాలో పాల ఉత్పత్తి దారుల సంఘాన్ని, రైతులను నిలువునా ముంచి.. మదర్ డైరీని అప్పుల ఊబిలో దించిన గుత్తా సోదరులకు జిల్లాలో ఉనికి లేకుండా పోయిందని విమర్శించారు. గుత్తా సోదరుల అవినీతి, అక్రమాలకు విసిగిపోయి, ఎన్నికల్లో వారిని పక్కకు పెట్టార‌ని.. ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో పాటు రాజకీయాల్లో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భవిష్యత్తులోనైనా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారో లేదో అనే భయంతోనే ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు గుత్తా దిగుతున్నార‌నేది కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌.

గవర్నర్ తో కేసీఆర్ గ్యాప్ పెరిగిపోయిందా? సంచలనాలు జరగబోతున్నాయా? 

తమిళి సైతో  కేసీఆర్ కు విభేదాలొచ్చాయా? ప్రభుత్వ తీరుపై గవర్నర్ గుర్రుగా ఉన్నారా? రాజ్ భవన్ కు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లడం లేదు? ఈ చర్చే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో గవర్నర్ ను కలవడం లేదు సీఎం కేసీఆర్. గవర్నర్ తమిళి సై కూడా ప్రభుత్వ  విధానాలపై ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి రోజున గవర్నర్ తో కలిసి నివాళి అర్పించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిందనే చర్చ జరుగుతోంది.  సెప్టెంబర్ 8తో రాష్ట్ర గవర్నర్ గా తమిళి సై రెండేండ్లు పూర్తి చేసుకున్నారు. అయినా గవర్నర్ ను కలిసి విషెస్ చెప్పలేదు సీఎం కేసీఆర్. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లి ఆమెను కలిశారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌ భవన్‌లో ఆమె విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. గవర్నర్ గా నరసింహన్ ఉన్న సమయంలో తరచూ రాజ్ భవన్ వెళ్లేవారు సీఎం కేసీఆర్. వారానికి ఒకసారి వెళ్లి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు నరసింహన్ ను ఆహ్వానించేవారు. పండుగల సమయంలో గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పేవారు. ఇక నరసింహన్ పుట్టినరోజు వచ్చిందంటే కేసీఆరే ఎంతో హడావుడి చేసేవారు. కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. తమిళి సై గవర్నర్ వచ్చిన మొదట్లో రాజ్ భవన్ కు బాగానే వెళ్లేవారు కేసీఆర్. కాని ఇటీవల కాలంలో రాజ్ భవన్ వెళ్లడం లేదు కేసీఆర్. అంతేకాదు ఆగస్టులో గవర్నర్ తమిళి సై కి మాతృవియోగం కలిగింది. అయినా వెళ్లి ఆమెను పరామర్శించ లేదు కేసీఆర్. రాజ్ భవన్ ను కేటీఆర్ వెళ్లి పరామర్శించి వచ్చారు. గవర్నర్ తో విభేదాలు పెరగడం వల్లే కేసీఆర్ ఆమెను పరామర్సించడానికి వెళ్లలేదంటున్నారు. గవర్నర్ తమిళి సై కూడా ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. ప్రభుత్వ విధానాలపై ఓపెన్ గానే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కొవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పలుసార్లు కామెంట్లు చేశారు. ట్వీట్లు కూడా చేశారు. యూనివర్శిటీల విషయంలోనూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా కామెంట్లు చేశారు. గత నెలలో వచ్చిన తెలంగాణ  విమోచన దినం సందర్భంగా సంచలన ట్వీట్ చేశారు గవర్నర్ తమిళి సై. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. బీజేపీ పెద్ద ఎత్తున  ఆందోళన చేసినా స్పందించలేదు. అలాంటి పరిస్థితుల్లో విమోచన దినం పేరిట తమిళి సై ట్వీట్ చేయడం సీఎం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు.  గవర్నర్ కోటాలో  ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే కేబినెట్ ప్రతిపాదనను ఆమోదించకుండా పెండింగులో పెట్టారు గవర్నర్ తమిళి సై. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా ఆమోదించలేదు. కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు మరింత సమయం కావాలని  ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో అభ్యర్థుల అమోదంపై తాను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాని తెలిపారు.  కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నందునే  కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వానికి గవర్నర్ చెక్ పెట్టారనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనల ప్రకారమే ఆమె అలా నడుచుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆయన రాజ్ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదని అంటున్నారు.  నిజానికి నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ విషయంపై గవర్నర్ ను కలిసి సీఎం చర్చిస్తే సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదని అంటున్నారు. ఎందుకంటే గతంలో నరసింహన్ కొన్ని ఫైళ్లను పెండింగులో పెట్టినప్పుడు సీఎం కేసీఆర్ వెళ్లి ఆయనతో చర్చించేవారు. తర్వాత వెంటనే ఫైళ్లు క్లియరయ్యేవి. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపైనా కేసీఆర్ వెళ్లి గవర్నర్ తో చర్చిస్తే ఆమోదం లభించేదని, గవర్నర్ ను కలవడానికి ఇష్టం లేకపోవడం వల్లే ఆయన వెళ్లడం లేదని చెబుతున్నారు. అంతేకాదు గవర్నర్ తో కలిసి పాల్గొనడం ఇష్టం లేకే గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు బాపూఘాట్ కు కేసీఆర్ వెళ్లలేదని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై అమిత్ షాకు కేసీఆర్ ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలతో గవర్నర్ తమిళి సైతో సీఎం కేసీఆర్ కు గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్రంలో త్వరలో సంచలనాలు ఉండబోతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. చూడాలి మరీ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు ఎటు వైపు దారీ తీస్తాయో

పండోరా పేపర్స్ ప్ర‌కంప‌ణ‌లు.. జ‌గ‌న్‌రెడ్డి పేరు ఉందా? 

ప‌న్ను ఎగ‌వేశారు. విదేశాల్లో షెల్ కంపెనీలు, ట్ర‌స్ట్‌లు స్థాపించారు. వేల, ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం దాచేశారు. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు. 91 దేశాల‌కు చెందిన వంద‌లాది మంది ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌లు.. ఇలా ర‌క‌ర‌కాల పెద్ద మ‌నుషుల బాగోతం ఇది. ఇందులో 380 మంది భార‌తీయులూ ఉన్నారు. అందులో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పేరు ఉందా?  లేదా? అనేది ఆస‌క్తిక‌రం. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగిన‌ ఆ ఆర్థిక గూడుపుఠానీ అంతా పండోరా పేప‌ర్ లీక్స్‌తో బ‌ట్ట‌బ‌య‌టైంది. గ‌తంలో ప‌నామా లీక్స్‌.. ఇప్పుడు పండోరా లీక్స్‌.. యావ‌త్ ప్ర‌పంచాన్ని షేక్ చేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల కిందట ‘పనామా పేపర్ల’ ప్ర‌కంప‌ణ‌ల మాదిరే.. ‘పండోరా పేపర్ల’ పేరుతో ఆదివారం రాత్రి ఎంతోమంది ప్రముఖుల బాగోతాలను వెలుగులోకి తెచ్చాయి. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు వీటిలో ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌- ఐసీఐజే ఈ వివరాలను విడుదల చేసింది. 117 దేశాల్లోని 150కిపైగా వార్తాసంస్థల్లోని 600 మంది విలేకరులు ఈ ఆప‌రేష‌న్‌లో భాగస్వాములయ్యారు. ఇది అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కూటమి వేర్వేరు దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి, గుట్టు రట్టు చేసింది.  పండోరా పేప‌ర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 35 మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీలు ఉన్నారు. మరో 336 మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, మాజీలు, క్రీడాకారులు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. భారత్‌లో మొత్తం 380 మంది దాకా పండోరా పేపర్స్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ పరిశోధనలో పాల్గొన్న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇండియాకు చెందిన‌ 60 మంది జాబితా సంపాదించింది. వారిలో ఆరుగురు దిగ్గజ రాజకీయ నాయకులు కాగా.. మిగ‌తా వారు మాజీ ఎంపీలు. ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చిన జాబితాలో ఉన్న వారిలో.. అనిల్‌ అంబానీ, సచిన్‌ టెండూల్కర్‌, బయోకాన్‌ మజుందర్‌షా భర్త ఉన్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.    పనామా, దుబాయ్‌, మొనాకో, స్విట్జర్లాండ్‌, కేమన్‌ ఐలాండ్స్‌ వంటి చోట్ల గోప్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు.  బ్రిటన్‌లోని ఒక కోర్టులో దివాలా ప్రకటించిన భారత పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి 18 ‘అసెట్‌ హోల్డింగ్‌ ఆఫ్‌షోర్‌ కంపెనీ’లు ఉన్నాయి. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీ భారత్‌ వీడటానికి నెల ముందు ఆయన సోదరి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. బయోకాన్‌ ప్రమోటర్‌ కిరణ్‌ మజుందార్‌ షా భర్త.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి ట్రస్టును నెలకొల్పారు.    2016లో పనామా పత్రాలు బహిర్గతమయ్యాక ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు జాగ్రత్త పడినట్లు తాజా పత్రాలు చెబుతున్నాయి. అనేక మంది భారతీయులు, ఎన్నారైలూ విదేశాల్లోని తమ సంపదను పునర్‌వ్యవస్థీకరించారు. క్రికెట‌ర్‌ సచిన్‌ తెందుల్కర్‌.. పనామా పత్రాలు లీకైన మూడు నెలల తర్వాత బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లోని తన సంస్థను రద్దు చేసుకున్నారు. తెందుల్కర్‌ తరఫు న్యాయవాది దీనిపై స్పందిస్తూ ఆయన పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేనని, పన్ను సంస్థలకు అన్ని వివరాలూ సమర్పించారని స్పష్టం చేశారు.    గతంలో బయటికొచ్చిన పనామా పేపర్లలో.. పన్ను ఎగవేతే లక్ష్యంగా వ్యక్తులు విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల గురించి ఉంది. కార్పొరేట్‌ సంస్థలు సృష్టించిన దొంగ కంపెనీల బాగోతం పారడైజ్‌ పేపర్లలో బయటపడింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అలాంటి డొల్ల కంపెనీల ఏర్పాటును అడ్డుకునేలా కొన్ని దేశాలు నిబంధనలను కఠినతరం చేశాయి. ట్రస్టుల రూపాల్లో ఎలా పన్ను ఎగవేత జరుగుతోందన్నది పండోరా పేపర్లతో వెలుగులోకి వచ్చింది.    ఆఫ్‌షోర్‌ కంపెనీలు, ట్రస్టుల స్థాపనకు ప్రపంచంలోని ఏ దేశం వారికైనా సేవలందించేందుకు 14 అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు పనిచేస్తున్నాయని పండోరా పేపర్స్‌ చెబుతున్నాయి. పన్ను ఎగవేతకు అనుకూలమైన దేశాల్లో ఈ 14 సంస్థలు.. 29వేలకు పైగా ఆఫ్‌-ద-షెల్ఫ్‌ కంపెనీలను, ప్రైవేటు ట్రస్టులను ఏర్పాటు చేసి.. ఆయా దేశాల్లో అక్రమార్కులు, పన్ను ఎగవేతదారులకు సేవలందిస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యున్నత రాజకీయ నాయకులైన 336 మందికి 956 ఆఫ్‌షోర్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో మూడింట రెండు వంతుల కంపెనీలు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోనే ఉన్నాయి.  అయితే, షెల్ కంపెనీలు, సూట్‌కేసు సంస్థ‌లు, విదేశాలకు నిధులు మ‌ళ్లింపు త‌దిత‌ర వార్త‌లు ఎప్పుడు వినిపించినా.. తెలుగు ప్ర‌జ‌ల చూపంతా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వైపే మ‌ళ్లుతుంది. ఎందుకంటే.. గ‌తంలో షెల్ కంపెనీలు, సూట్‌కేసు కంపెనీల‌నే కాన్సెప్ట్‌ను తెలుగువారికి ప‌రిచ‌యం చేసింది ఏ1, ఏ2లైన జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలే కాబ‌ట్టి.. ఇప్పుడూ పండోరా పేప‌ర్స్‌లో వారి పేరు ఉందా అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికైతే కొంద‌రి పేర్లే బ‌య‌ట‌కు వ‌చ్చినా.. రాబోయే రోజుల్లో మరింత స‌మాచారం వెలుగులోకి వ‌స్తుంద‌ని చెబుతుండ‌టంతో.. పండోరా పేప‌ర్స్‌లో జ‌గ‌న్‌రెడ్డి పేరుపై తెలుగునాట‌ ఉత్కంఠ నెల‌కొంది.