సీఎంలను ఏకం చేస్తున్న స్టాలిన్.. మోడీ ప్రభుత్వానికి షాకేనా?
posted on Oct 5, 2021 @ 12:02PM
పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తన నిర్ణయాలతో విపక్షాలను సైతం మెప్పిస్తున్నారు. జయలలిత పేర్ల మీద ఉన్న పథకాలను కొనసాగించడం, అమ్మ క్యాంటీన్లను అలాగే కంటిన్యూ చేయడం వంటి నిర్ణయాలు ఆయనను గ్రాఫ్ మరింత పెంచాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న తరహాలో పాలనను అందిస్తూ.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలోనూ గతానికి భిన్నంగా విపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు స్టాలిన్. వ్యక్తిపూజ ఎక్కువగా కనిపించే తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. సభలో తనను పొగిడిన డీఎంకే ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలనానికి తెర తీశారు. జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో కేంద్రం ఒత్తిడి పెంచేలా ఆయన తీసుకుంటున్న తాజా చర్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీట్ పై తన వైఖరిని స్పష్టం చేస్తూ పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖలు రాశారు స్టాలిన్. ఎన్టీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. ఏపీ, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా,పంజాబ్,రాజస్థాన్, తెలంగాణ. పశ్చిమ బెంగాల్ తో పాటు గోవా ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నీట్ ను వ్యతిరేకించటమే కాదు.. విద్యా రంగంలో రాజకీయ ఏకాగ్రతను పొందేందుకు.. అందరూ ఏకతాటి మీద రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతో ఆయనీ లేఖలు రాసినట్లుగా చెబుతున్నారు.
‘మనంతా ఏకగ్రీవం’ కావటానికి అవసరమైన పరిస్థితుల గురించి లేఖలో ప్రస్తావించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. నీట్ ను వ్యతిరేకించటంతో పాటు.. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. తానే స్వయంగా లీడ్ తీసుకున్నారు. నీట్ కు ప్రత్యామ్నాయంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్ కమిటీ నివేదికను కమిటీ నివేదిక తాను రాసిన లేఖకు జత చేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. తాజాగా తాను టార్గెట్ చేసిన అంశాన్ని సమయానికి తగ్గట్లుగా తెర మీదకు తీసుకురావటం ద్వారా ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రులను ఏకం చేసే విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎంతవరకు సక్సెస్ అవుతారు.. స్టాలిన్ చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నీట్ విషయంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వీళ్లంతా స్టాలిన్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.