పోసాని ఇంటిపై అర్థ‌రాత్రి రాళ్ల దాడి.. రెచ్చిపోయిన దుండ‌గులు..

అర్థ‌రాత్రి. 2 గంట‌ల స‌మ‌యం. అంతా సైలెన్స్‌. గ్రామ‌సింహాల ఘోంకారాలు త‌ప్పా మ‌రెలాంటి శ‌బ్ద‌మూ లేదు. అలాంటిది స‌డెన్‌గా ఓ అగంత‌కుల ముఠా పోసాని కృష్ణ‌ముర‌ళి ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మైంది. పోసానిని బండ‌బూతులు తిడుతూ.. ఆయ‌న ఇంటిపై రాళ్ల దాడి చేశారు. నానావీరంగం సృష్టించారు. దుండ‌గుల రాళ్ల దాడి, అరుపుల‌తో వాచ్‌మెన్ హ‌డ‌లిపోయారు. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడ‌లోని పోసాని ఇంటిపై అర్థ‌రాత్రి జ‌రిగిన దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. పీకేను పోసాని ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా బండబూతులు తిట్ట‌డంతో జ‌న‌సైనికులు ఆరోజే ఆయ‌న‌పై దాడికి య‌త్నించారు. పోలీసుల అండ‌తో పోసాని బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక మంగ‌ళ‌గిరి మీటింగ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం రెచ్చిపోయారు. త‌న‌పై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే.. తాట తీస్తాం, తోలు వ‌లుస్తాం, బ‌య‌ట‌కు లాక్కొచ్చి తంతాం.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే స్పూర్తిగా తీసుకున్నారో ఏమో.. పీకే చెప్పిన‌ట్టే చేశారు కొంద‌రు అగంత‌కులు. అర్థ‌రాత్రి పోసాని ఇంటి కొచ్చి.. నోటికొచ్చిన‌ట్టూ తిడుతూ.. రాళ్ల‌తో దాడి చేశారు. వాచ్‌మెన్.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వాచ్ మెన్ ఫిర్యాదుతో పోలీసులు స్పాట్‌కు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే, పోసాని కృష్ణమురళి కుటుంబం కొన్ని నెలల క్రిత‌మే ఆ ఇల్లు ఖాళీ చేసి.. వేరే చోట నివాసం ఉంటోంది. ఆ విషయం తెలియని దుండగులు, పోసాని ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లోనే ఉంటున్నారనుకుని దాడికి పాల్పడ్డారు. దాడి చేసింది ప‌వ‌న్ ఫ్యాన్స్ అని అనుమానిస్తున్నారు.   

అన్న‌, చెల్లికి పీకేనే అడ్వైజ‌ర్‌.. దొందు దొందేనా?

అదో జ‌గ‌న్నాట‌కం. అస‌లేమీ అర్థం కాదు. అన్నాచెల్లిల మ‌ధ్య ఏముందో ఎవ‌రికీ తెలీదు. బ‌య‌ట‌కు మాట్లాడుకోరు. విడిపోయామంటారు. ఆస్థిగొడ‌వ‌లతో వేరుప‌డ్డామంటారు. అలిగి పుట్టింటి నుంచి అత్తారింటికి వ‌చ్చేశానంటుంది. తండ్రి స‌మాధి సాక్షిగా ఎడ‌ముఖం- పెడ‌ముఖం పెట్టుకుంటారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ. తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ. ఏందో.. ఈ రాజ‌కీయ డ్రామా. కొంద‌రు ష‌ర్మ‌ల జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణ‌మే అంటే.. మ‌రికొంద‌రు కేసీఆర్ బాణ‌మ‌ని.. బీజేపీ బాణ‌మ‌ని.. ఎవ‌రికి తోచిన విశ్లేష‌ణ‌లు వాళ్లు చేశారు. ఆ గుస‌గుస‌లు అలా సాగుతుండ‌గానే.. తెలంగాణ కోడ‌లినంటూ వైఎస్సార్‌టీపీ స్థాపించేశారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్ష చేస్తూ.. చిత్త‌శుద్ధి చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ అంతంత మాత్ర‌మే. తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు కొల్ల‌గొట్టే ప‌ని ఆశించినంత మేర వ‌ర్క‌వుట్ అవ‌డం లేదు. మంచి పేరున్న నేత‌, కాస్త ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయ‌కుడు.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఆ పార్టీలో చేర‌లేదు. ఓ మీడియా సంస్థ స‌హాయంతో మాత్ర‌మే ఎలాగోలా రాజ‌కీయ బండి లాక్కొస్తున్నారు ష‌ర్మిల‌.  ఇక‌, ఇలాగైతే వ‌ర్క‌వుట్ కాద‌ని.. దేశంలోకే టాప్ మోస్ట్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్‌ను హైర్ చేసుకున్నారు. డ‌బ్బుకు డోకా లేక‌పోవ‌డంతో.. భారీ మొత్తానికే ఒప్పందం కుదుర్చుకున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు మీడియా సంస్థ‌ల‌కు, మీడియా ప్ర‌ముఖుల‌కు పెద్ద మొత్త‌మే స‌మ‌ర్పించుకున్న ష‌ర్మిల‌.. ఇక పీకే.. క‌న్స‌ల్టెన్సీకీ క‌ళ్లు తిరిగే పైకం ఇచ్చేందుకు డీల్ కుదిరింది. ఆ వెంట‌నే పీకే టీమ్ లోట‌స్‌పాండ్‌లో వాలిపోయింది. మేడ‌మ్‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిగాయి. తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు, మిగ‌తా ప్ర‌తిప‌క్షాల బ‌లాబ‌లాలు, ఇక్క‌డి స‌మ‌స్య‌లు, ఇక్క‌డి భావోద్రేకాలు, అనుచ‌రించాల్సిన వ్యూహాలు ఇలా అన్నిటిపైనా ప్రాధ‌మిక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఆ మేధోమ‌ధ‌నం ఓ కొలిక్కి వ‌చ్చాక‌.. ఇక వ‌చ్చే రెండేళ్ల‌లో వైఎస్సార్‌టీపీ అనుస‌రించాల్సిన ఎత్తుగ‌డ‌ల‌ను పీకే టీమ్ రెడీ చేయ‌నుంది.  ఆస‌క్తిక‌రంగా స‌రిగ్గా ఇదే స‌మ‌యంలోనే అటు ఏపీలో వైఎస్సార్‌సీపీ కోసం వ‌ర్క్ చేసేందుకు ప్ర‌శాంత్ కిశోర్ బృందం రంగంలోకి దిగింది. వారం గ్యాప్‌లో రెండు రాష్ట్రాల్లో, రెండు వేరు వేరు పార్టీల‌కు, అందులోనూ విభేదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం అవుతున్న అన్నాచెల్లిల కోసం పీకే టీమ్ ప‌ని చేయ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్‌. అయితే, పీకేతో ఎవ‌రికి వారే వేరు వేరుగా డీల్ కుదుర్చుకోలేద‌ని.. ఇటు తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీకి, అటు ఏపీలో జ‌గ‌న్ పార్టీకి ప‌ని చేయాల‌ని.. రెండు డీల్స్ కాబ‌ట్టి పొలిటిక‌ల్ డిస్కౌంట్ ఇవ్వాల‌ని బాగానే బేరం ఆడార‌ని అంటున్నారు. చెల్లి కోస‌మూ అన్న‌నే సంప్ర‌దింపులు జ‌రిపార‌ని చెబుతున్నారు. 1+1 డీల్‌తో పీకే టీమ్‌ను వైఎస్ ఫ్యామిలీ హైర్ చేసుకుంద‌ని తెలుస్తోంది. దీంతో, అన్నా-చెల్లిల మ‌ధ్య గొడ‌వ‌ల‌నేది వ‌ట్టి డ్రామానేనా? తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోడానికి కావాల‌నే త‌మ మ‌ధ్య విభేదాలున్నాయ‌నేలా సీన్ క్రియేట్ చేశారా? అనే అనుమానం క‌లుగుతోంది.  అందుకు, మ‌రింత బ‌లం చేకూర్చేలా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల త‌న‌కు అన్న‌తో అంత‌పెద్ద‌గా గొడ‌వ‌లేమీ లేవ‌ని.. కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌సిపోతాయ‌ని.. జ‌గ‌న్ త‌న‌తో ట‌చ్‌లోనే ఉన్నాడ‌ని, రెగ్యుల‌ర్‌గా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నామ‌ని తేల్చేసింది. దీంతో, ఇదంతా తెలంగాణ‌లో చెల్లిని రాజ‌కీయంగా సెట్ చేయడానికి జ‌గ‌నన్న ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామానేన‌ని.. ష‌ర్మిల జ‌గ‌న్ వ‌దిలిన బాణ‌మేన‌ని తేలిపోతోంద‌ని అంటున్నారు. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు.. చిత్తూరు జిల్లాలో భూవివాదం..

తెలుగు దేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు నమోదైంది. భూ వివాదంలో ఆయనపై చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకో ఎంపీ  గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు, ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువమాఘం గ్రామంలో దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం భవనాలు నిర్మించారు. ఆ భవనాలకు ఆనుకుని ఉన్న తన పొలాన్ని ఆక్రమించుకున్నారని... భారీగా ప్రహరీ గోడ నిర్మించారని రైతు గోపీకృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకపోవడంతో 2 నెలల క్రితం కోర్టును ఆశ్రయించానని తెలిపారు.కోర్టు ఆదేశాలతో ఎంపీ గల్లా జయదేవ్ తదితరులపై ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సల నాయుడు, ఎం.మోహన్ బాబు, గ్రామ సర్పంచ్, కార్యదర్శి, లాయర్ చంద్రశేఖర్ పై కేసులు నమోదు చేశామని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. 

పీకే డైరెక్షన్.. పోసాని యాక్షన్! బూతులు వింటూ జగన్ రెడ్డి ఎంజాయ్?

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న మటాల యుద్ధం హద్దులు దాటింది. వ్యక్తిగత దూషణలు శృతి మించాయి. పవన్ కల్యాణ్ పై బండ బూతులతో విరుచుకుపడుతున్నారు వైసీపీ మంత్రులు, నేతలు. ఇక ఈ వివాదంలో ఎంటరైన పోసాని కృష్ణ మురళీ... పీకేపై మాట్లాడిన పచ్చి బూతులు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. పవన్ తో పాటు కుటుంబ సభ్యులపైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పోసాని. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ బూతు పురాణంపై జనాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతగా దిగజారి బూతులు తిట్టడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే ఈ గొడవ వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ వస్తోంది. వైసీపీ నేతలు ప్లాన్ ప్రకారమే ఈ దాడి కొనసాగిస్తున్నారని, తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే వైసీపీ నేతలు పవన్ ను రెచ్చగొడుతున్నారని అంటున్నారు.  తాజాగా పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న వార్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ఉందని ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ కళ్యాణ్ గారి తల్లి, భార్య, కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదని అచ్చెన్న ప్రశ్నంచారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపే పార్టీ నేతలపై ఉంటుందని అన్నారు.  రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుండా దాటవేసి బూతులు, తిట్లతో మహిళా లోకాన్ని బజారుకీడ్చడాన్ని ఏమంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు అచ్చెన్నాయుడు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో? అన్నారు. బూతులు, జుబుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను, ప్రజా ప్రయోజనాలను బలిపెట్టకూడదన్న అచ్చెన్న.. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజా స్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు ఏపీ టీడీపీ చీఫ్. డ్రగ్ మాఫియాతో వైసీపీ నేతలు చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు దోపిడి చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ డ్రగ్స్ మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. హెరాయిన్ తో పాటు, గంజాయి, గుట్కా, తలనీలాలు, ఎర్రచందనం, బియ్యం, శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో దోపిడి పెరిగిపోయిందన్నారు అచ్చెన్నాయుడు. విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజీల్ ధరలు, ఇసుక రేట్లు, మద్యం రెట్లు, ఆస్తి పన్ను, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పీకే ఎపిసోడ్ లో బీజేపీ మౌనం.. కమలంతో జనసేన కటీఫ్? 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతోంది. సినిమా టికెట్ల వ్యవహరంగా మొదలైన మాటల యుద్ధం, మలుపులు తిరిగి రాజకీయ రచ్చకు దారి తీసింది.  ఒక్కసారిగా రాజకీయ మలుపు తీసుకుంది. మరో వంక  పోసానీ కృష్ణ మురళీ ఎంట్రీతో మాటల యుద్ధం బూతుల యుద్ధంగా మారిపోయింది. మొత్తానికి,రెండు పార్టీల మధ్య సాగుతున్నమాటల యుద్ధంలో  వ్యక్తిగత విమర్శలు, వికారాలు అన్నీ బయటకు వస్తున్నాయి.  మంత్రులు కూడా మర్యాద గీతను దాటి  పవన్ కళ్యాణ్’పై  వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారారు. దేవుని సన్నిది అని కూడా చూసుకోకుండా ఏడూ కొండల పైన సాక్షాత్తు అమాత్యులు బూతులు మాట్లాడేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అందులోనూ మంత్రివర్గ పక్షాళన, సమయం సమీపిస్తున్నదేమో, మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. మరో వంక  పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ  నాయకులు, కార్యకర్తలు, పవన్ ఫాన్స్ మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి, ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటాల యుద్దంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పే పరిస్థితి లేదు. దొందూ ..దొందే ...ఇద్దరూ బూతు భాగోత్తుములే అందులో ఏ సందేహం లేదు.  రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా జనసేన మిత్ర మిత్రపక్షం బీజేపీ స్పందించక పోవడం దేనికి సంకేతం? బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందనే విషయంలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి, బీజీపీ, జనసేన మిత్ర పక్షాలే అయినా రెండు పార్టీల మధ్య సంయోధ్యత లేదనే విషయం తిరుపతి ఉప ఎన్నికలలోనే తేలిపోయింది. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి కూర్చున్న సందర్భాలు కూడా ఇంచుమించుగా లేవనే చెప్ప వచ్చును. మారిన పరిస్థితులలో బీజేపీ, వైసీపీకి దగ్గరవుతోందనే అనుమానలున్నాయి.తెలుగు దేశం పార్టీ నాయకులు పలు సందర్భాలలో, ఇందుకు సంబందించిన కొన్ని ఆధారాలను బయట పెట్టారు. మరోవంక బీజేపీతో లాభం లేదని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించిన జనసేన, 2024 ఎన్నికల్లో   టీడీపీతోకలిసి పోటీచేసే అవకాశం ఉందని ఉభయ పార్టీల్లోనూ వినవస్తోంది. నిజానికి,మొన్నటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా జనసేన వోటు షేర్ పెరిగింది. సో .. ఈకారణంగా కూడా బీజేపీ మౌనం వహించిందనే అనుమానాలు కూడా లేక పోలేదు. మరో వంక పోసానికృష్ణ మురళీ హద్దులు దాటి చేసిన దాడిని, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గట్టిగా ఖండించారు. పోసాని మురళి పెయిడ్‌ ఆర్టిస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. పోసాని భాష,. ఆయన మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న టీడీపీ నేత.. పోసాని చేత ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ మాట్లాడిస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బహిరంగంగా ఎందుకు వారించడంలేదని ప్రశ్నించారు. అయితే ఇంత కథ నడిచిన తర్వాత, ఏమనుకున్నారో ఏమో, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సీన్ ‘లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్’పై వైసీపీ నాయకులు చేసినవ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్‌  విషయంలో వైసీపీ నాయకులు గీత దాటి దుర్భాషకు దిగుతున్నారని అన్నారు. విమర్శను తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలన్నారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకమని చెప్పారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలని సెటైర్లు వేశారు జీవీఎల్ న‌ర‌సింహారావు.ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జీవీఎల్ వ్యాఖ్యలను సమర్ధించారు. ఆయన చేసిన ట్వీట్ ను ఈయన రీట్వీట్ చేశారు. అయితే బీజేపీ, జనసేనల మధ్య ఇప్పటికే పెరిగిన దూరం తాజా దుమారంతో మరింత పెరిగింది. నిజానికి, జనసేన బీజేపీతో  విడాకులకు ఎప్పుడోనే సిద్దమైంది. ముహూర్తం ఖరారు కావడమే మిగిలిందని.. ఆరెండు పార్టీలలో కీలక పదవుల్లో ఉన్నవారే అంటున్నారు. 

కేటీఆర్ ప్రధాని అయితే సీఎం ఎవరో? 

తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే  కేసీఆర్ సీఎం పదవి తీసుకోరని ప్రచారం జరిగింది. తర్వాత కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారనే చర్చ బయటికి వచ్చింది. మూడేండ్లుగా ఇది సాగుతూనే ఉంది. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినా... ఎన్నికలు జరిగినా ఈ అంశం తెరపైకి వస్తుంది. కాని ఇది ప్రచారంగానే మిగిలిపోతోంది. కొన్ని సార్లు సీఎం కేసీఆరే స్వయంగా ముఖ్యమంత్రి మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అయినా కేటీఆర్ పట్టాభిషేకంపై ప్రచారం మాత్రం ఆగలేదు.  సీఎం కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనలతో మరోసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అంశం ప్రచారంలోకి వచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోంది. అయితే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం సాగుతుండగా.. జీవన్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రి పదవికే గురి పెట్టారు. దేశ భవిష్యత్ ప్రధాని కేటీఆరేనని జోస్యం చెప్పారు. మరో 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావడం పక్కా అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ఈ దెబ్బతో తమకు భవిష్యత్ లేదని కాంగ్రెస్, బీజేపీలు కలత చెందుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలో ఇలాంటి లీడర్ ఉండటం గ్రేట్ అని జాతీయ స్థాయిలో కేటీఆర్ పై చర్చ నడుస్తుందని కూడా చెప్పారు జీవన్ రెడ్డి. కేటీఆర్ కాబోయే ప్రధాని అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం ఉన్న సమయంలో ప్రధానమంత్రి అవుతారని ఎందుకు చెప్పారన్న దానిపై రకరకాల వాదనలు వస్తున్నాయి. కేటీఆర్ ఇప్పట్లో సీఎం అయ్యే అవకాశాలు లేకపోవడం వల్లే పీఎం అంటూ జీవన్ రెడ్డి కామెంట్ చేశారని అంటున్నారు. కేటీఆర్ కాకుండా మరొకరిని సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎమ్మెల్సీ కవిత కూడా సీఎం కేసులో ఉన్నారని, కుటుంబంలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి మార్పు జరగడం లేదని గతంలో ప్రచారం కూడా జరిగింది.  ఇక కేటీఆర్ ను ప్రధానిగా చెప్పడం ఏంటనే ప్రశ్న కూడా వస్తోంది. కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జీవన్ రెడ్డి అతిగా మాట్లాడారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే సాగుతోంది. విపక్షాలు మాత్రం జీవన్ రెడ్డి ప్రకటనపై సెటైర్లు వేస్తున్నాయి. సీఎం సీటుకు దిక్కు లేదు ప్రధానమంత్రి అవుతారా అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షాలు దూకుడు పెంచాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజవ దండోరా యాత్రలతో దూసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమా కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీంతో తమకు మరోసారి అధికారం రావడం కష్టమని గులాబీ నేతలు గ్రహించడం వల్లే... ఇప్పుడు కొత్తగా పీఎం అంటూ ప్రకటనలు చేస్తున్నారనే చర్చ కొన్ని వర్గాల నుంచి వస్తోంది. కేటీఆర్ పీఎం అవుతారని చెప్పడం ద్వారా.. పరోక్షంగా సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పకనే చెప్పారనే చర్చ కూడా సాగుతోంది. 

వైసీపీ ఎమ్మెల్యేపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్ లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు ఉచ్చు బిగిసుకుంటోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ శ్రేణులు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయి. మాజీ ముఖ్యమంత్రిపై దౌర్జన్యానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి.  ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలన సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అయినా పోలీసులు అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్ దండయాత్రగా రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై  టీడీపీ వర్గాలు సీరియస్ గా స్పందించాయి.జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. తాజాగా  రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు లేఖల రూపంలో ఫిర్యాదులు చేసింది.  టీడీపీ గ్రామ కమిటీల్లోని నేతలు తీర్మానాలు చేసి సంతకాలు చేసిన లేఖలను పోస్టు ద్వారా పంపినట్లు టీడీపీ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్, అతని అనుచరులు దండయాత్రగా రావడం రాష్ట్రంలోని రాక్షస పాలనకు పరాకాష్ఠ అని పేర్కొంది. ఈ దాడికి డీజీపీ, సీఎంల మద్దతు ఉందని జోగి రమేశ్ బహిరంగంగా ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ.. డీజీపీని రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. సీఎం నేతృత్వంలో ఇలాంటి దాడి జరగడం ప్రజాస్వామ్యానికే చీకటి రోజని టీడీపీ అభిప్రాయపడింది.  ప్రతిపక్ష నేతలను బెదిరించడం, ఇళ్లపై దాడులు చేయడం వంటి హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని టీడీపీ నాయకులు అన్నారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. టీడీపీ నేతల ఫిర్యాదు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ నేతలు మాత్రం జోగి రమేష్ పై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాయి.   

కేటీఆర్ మిస్సింగ్.. హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం..

తెలంగాణ‌లో అతిభారీ వ‌ర్షాలు. హైద‌రాబాద్‌లో కుండ‌పోత వాన‌. కేసీఆర్ ప్ర‌భుత్వం ఏకంగా ఒక‌రోజు సెల‌వు కూడా ఇచ్చేసింది. వ‌ర‌ద ఉధృతి కార‌ణంగా భాగ్య‌న‌గ‌రంలోని ముషారాంబాగ్ బ్రిడ్జిని సైతం మూసేశారు. ముసీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. ముసీ గ‌ట్టు మీద ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఎప్ప‌టిలానే లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ వ‌ర‌ద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మూడు రోజులుగా న‌ర‌కం చూస్తున్నారు జ‌నాలు. మ‌రి, ఇంత జ‌రిగితే ప‌ట్ట‌ణ‌శాఖ మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌రేం? గ‌త‌సారి హైద‌రాబాద్‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు కేటీఆర్ న‌గ‌రంలో విస్తృతంగా చ‌క్క‌ర్లు కొట్టారు. కుటుంబానికి 10వేలు కూడా ఇచ్చారు. అదికూడా కొంద‌రికే. అప్పుడు జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌లు ఉండ‌టంతో అలా చేశారంటూ అంతా విమ‌ర్శించారు. ఇప్పుడు ఎన్నిక‌లు లేవు కాబ‌ట్టి ఇటు వైపు కూడా చూడ‌టం లేదంటూ హైద‌రాబాదీలు మండిప‌డుతున్నారు. ఇక జిల్లాల్లోనూ ఇదే తీరుగా ఉంది ప‌రిస్థితి. త‌న సొంత ఇలాఖా సిరిసిల్ల నీట‌మునిగితే వెళ్లి చూశారు కానీ.. మిగ‌తా జిల్లాలు జ‌ల‌మ‌య‌మైతే ప‌ట్టించుకోరా అంటూ మంత్రి కేటీఆర్‌ను నిల‌దీస్తున్నారు బాధితులు.  ఇక భాగ్య‌న‌గ‌ర వాసులు మ‌రో అడుగు ముందుకేసి.. త‌మ‌దైన స్టైల్‌లో నిర‌స‌న తెలిపారు. ‘కేటీఆర్ మిస్సింగ్’ అంటూ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో పోస్ట‌ర్లు అంటించారు. ఎక్క‌డ వ‌ర‌దుంటే అక్క‌డ కేటీఆర్ మిస్సింగ్ అనే వాల్ పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తుండ‌టం అధికార పార్టీని క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. పోనీ, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిద్దామా అంటే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఇంకెన్నాళ్లీ దుస్థితి అంటూ నిల‌దీసే ప‌రిస్థితి ఉంది. ఆ భ‌యంతో మంత్రి కేటీఆర్‌ అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదంటున్నారు. ఆయ‌న రాక‌పోయే స‌రికి కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్ట‌ర్ల‌తో త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు వ‌ర‌ద బాధితులు.  మ‌రికొంద‌రు క్రియేటివ్ పీపుల్స్ ఆ పోస్ట‌ర్ల‌కు వ‌ర‌ద విజువ‌ల్స్ కూడా జ‌త చేసి.. మీమ్స్‌తో వీడియోలు రెడీ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు. అవి తెగ వైర‌ల్ అవుతుండ‌టంతో కేటీఆర్ ఫుల్‌గా బ‌ద్నామ్ అవుతున్నారు. పోతే ఓ లొల్లి. పోక‌పోతే ఇంకో లొల్లి. ఇదేందిబై అంటూ కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి బ‌య‌ట‌కు రావ‌ట్లేదని అంటున్నారు.   

హుజూరాబాద్ లో నిర‌స‌న‌ నామినేషన్లు.. కారుకు గండమేనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడంతో, రాజీకీయ పార్టీల పరుగులు మొదలయ్యాయి. ముందు నుంచే నువ్వా ... నేనా అన్నవిధంగా పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్న తెరాస, బీజేపీ ప్రచారాన్ని మరింత ఉదృతం చేశాయి. హుజూరాబాద్’ను గెలిచి తీరాలని పట్టుమీదున్నఅధికార తెరాస మంత్రి హరీష్ రావు సారధ్యంలో అన్ని స్థాయిలలో సేనలను మొహరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరిని రంగంలోకి దింపింది.ఇక డబ్బు మూటలు, ‘మందు’ మార్బలం సంగతి అయితే చెప్పనక్కరలేదు. మరో వంక బీజేపీ,పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్’ని ముందు పెట్టి, కమల దళం వెనకనుంచి  వెనకనుంచి ప్రచారం సాగిస్తోంది. హుజూరాబాద్’లో పోటీ, రెండు పార్టీల మధ్యకాదు, ఇద్దరి వ్యక్తుల మధ్య అనే విధంగా బీజేపీ ప్రచార వ్యూహాన్ని నడిపిస్తోంది. మరోవంక  కాంగ్రెస్ పార్టీ కూడ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధిని ఖరారు చేసి, కదన రంగంలోకి దూకేందుకు సిద్దమవుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటన్నది, ఇంకా స్పషం కాలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో హుజూరాబాద్’లో పోటీకి సంబంధించి పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే ప్రధాన పార్టీల బలాలు బలహీనతలు,ప్రచార, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నా, ఈ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమం నుంచి, తెరాస వ్యతిరేక అజెండాతో  పుట్టిన పార్టీలు, అదే విధంగా ఇటీవల కాలంలో, వైఎస్సార్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోదరి షర్మిలా పెట్టిన వైఎస్సార్టీపీ, దళిత బహుజన వాదంతో రాజకీయ అరంగేట్రం చేసి, బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్రవీణ్ కుమార్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయి అనేది కూడా చాలా కీలకంగామారింది. అయితే, ఇందులో చాలా వరకు పార్టీలు, ఉద్యమ సంస్థలు పార్టీ (బీజేపీ) తో సంబంధం లేకుండా ఉద్యమ స్పూర్తితో ఈటల రాజేందర్’కు ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు బహ్విస్తున్నారు. ఈటల బీజేపీలో చేరి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయడం ఇష్టం లేకున్నా, శతృవు, శతృవు మిత్రుడు అనే నానుడి ఆధారంగా, తెరాసను ఓడించే సత్తా ఉన్నఈటలకు మద్దతు ఇవ్వాలని మెజారిటీ ప్రజాసంఘాలు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే, కాంగ్రెస్ అభ్యర్ధి, కాంగ్రెస్ వ్యూహం స్పష్టమైతేనే కానీ, ఎవరు ఎటు అనేది స్పష్టం కాదని అంటున్నారు.    తెలంగాణ ఉద్యమంతో గానీ, తెలంగాణ ప్రజల సెంటిమెంట్స్’తో కానీ సంబంధం లేకుండా, వైఎస్సార్ సంక్షేమ పథకాలు, రాజన్న పాలన ప్రచార అస్త్రాలుగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల హుజూరాబాద్’లో పోటీ చేయడం లేదు. అయితే, ఆమె తాను సాగిస్తున్న నిరుద్యోగ పోరాటంలో భాగంగా, నిరుద్యోగ యువకులను బరిలో దించుతున్నారు. అయితే, ఆమె లక్ష్యం నిరుద్యోగులను గెలిపించడం కాదు, నిరుద్యోగుల నిరసనను తెలియ చేసేందుకు, ఎంతమంది నిరుద్యోగ యువకులు ముందు కొస్తే అంతమందికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని షర్మిల ప్రకటించారు. కాగా, తాజాగా ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారైన నేపధ్యంలో,  నామినేషన్లు వేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులు, ఇతరులకు సహకరిస్తామని వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టీపీ వెల్లడించింది. ఈ మేరకు  పార్టీ నామినేషన్ల కో ఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.  అయితే నిరుద్యోగ యువకులు పెద్ద సంఘ్యలో బరిలో దిగితే, అది పరోక్షంగా అధికార తెరాసకే మేలు చేస్తుందని,విశ్లేషకులు అంటున్నారు. నిజానికే ఉప ఎన్నికల్లో ఒక్క నిరుద్యోగ యువకులు మాత్రమే కాదు, కాంట్రాక్టు లెక్చరర్స్, ఇతర వృత్తి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో నిరశన నామినేషన్లకు సిద్ధ మవుతున్నారు. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు.

TOP NEWS @ 7pm

1. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? అంటూ జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. 2. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి నానితో ప‌లువురు నిర్మాత‌లు భేటీ అయ్యారు. ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. చిరంజీవి సైతం త‌న‌తో విచారం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు పేర్ని నాని. 3. దళిత బంధు లాంటి పథకాలు కాదు.. ద‌ళితుల‌ వర్గీకరణ కావాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు.   తెలంగాణ ఎంత కీలకమైందో.. ఎస్సీ వర్గీకరణ కూడా అంతే కీలకమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు పెడితే కాంగ్రెస్ త‌ర‌ఫున మద్దతిస్తామ‌న్నారు. కాలుకు శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ‌మాదిగ‌ను రేవంత్‌రెడ్డి పరామ‌ర్శించారు. 4. లోటస్ పాండ్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలతో ప్ర‌శాంత్ కిశోర్‌ టీమ్ సభ్యులు సమావేశమయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చలు జ‌రిపారు. ఇకపై షర్మిల పార్టీ కార్యక్రమాలు పీకే వ్యూహరచనలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.  5. ఎయిడెడ్ పాఠశాలలను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వెంటనే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వలన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో విద్యా చట్టం నిబంధనలకు వ్యతిరేకమని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.  6. డ్రగ్స్ రవాణా విషయంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విచారించాలని టీడీపీ ఎంపీ కనకమేడల ర‌వీంద్ర డిమాండ్ చేశారు. డ్రగ్స్ రవాణాకు కాకినాడ పోర్టు కేంద్రంగా మారిందనే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మహ్మద్ ఆలిషాకు వైసీపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయని క‌న‌క‌మేడ‌ల ఆరోపించారు.  7. ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వందల ఐటీ కంపెనీలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎల్ఎఫ్ రెండో యూనిట్ హైదరాబాద్ రాకుండా కేటీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేతకాని తనంతోనే అతిపెద్ద ఐటీ కంపెనీ వేవ్‌రాక్ హైదరాబాద్‌ను వీడిందని తెలిపారు.  8. టీటీడీ కేసు విచారణలో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరన్నారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదనే పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వారంలోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్‌కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది.  9. మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న ప్ర‌కాశ్‌రాజ్‌పై మా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేశ్ ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. ప్రకాష్ రాజ్ ఒక్కసారైనా మా ఎన్నికల్లో ఓటేశారా? ఒక్క మా మీటింగ్‌కైనా అటెండ్ అయ్యారా? ఎన్నిసార్లు మా నుండి సస్పెండ్ అయ్యారో చెప్పాలి?  పోటీకి మీరే వచ్చారా? ఎవరైనా తెచ్చారా? అని ప్ర‌శ్నించారు న‌రేశ్‌. 10. కాంగ్రెస్ పార్టీకి సారథి లేరని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తనకు తెలియదన్నారు. కేంద్రంలో కూర్చున్న 20 మందితో ప్రజాస్వామ్యం కొనసాగదని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ కాంగ్రెస్ సంక్షోభంలో పడిన నేపథ్యంలో క‌పిల్ సిబల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.   

పారిపోను.. భయం ఏంటో చూపిస్తా! వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కొన్ని రోజులుగా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీ పర్యటనలో భాగంగా మంగళగిరి కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు జనసేనాని. ఈ సమావేశంలో అధికార పార్టీపై ఆయన పంచ్ లు విసిరారు. జన సైనికుల సింహ గర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమని అన్నారు. గ్రామ సింహాలు అంటే కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చికుక్కలు, ఊరకుక్కలు అన్నారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం బాగా పుష్కలంగా ఉన్నాయన్నారు. వారికి లేనిదల్లా భయం.. ఆ భయం అంటే ఏమిటో నేర్పిస్తా అంటూ  పవర్ స్టార్ హెచ్చరించారు.  తాను పారిపోయే వ్యక్తిని కాదని, కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన చీఫ్ స్పష్టం చేశారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్‌ హెచ్చరించారు. తాను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తానని చెప్పారు. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా అన్నారు. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడటం లేదని చెప్పారు తన వ్యక్తిగత జీవితం బ్లాక్‌ అండ్‌ వైట్‌ అన్న పవన్ కల్యాణ్.. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనదని చెప్పారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. 2014లో టీడీపీ, బీజేపీకి అభివృద్ధి కోసమే మద్దతిచ్చానన్నారు. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా. రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయగలను. నిజమైన ప్రెసిడెంట్‌ మెడల్‌ రావాలంటే యుద్ధాలు చేయాలి. ఏపీ ప్రభుత్వం నెలకు రూ.5000 ఇస్తే ప్రెసిడెంట్‌ మెడల్‌ ఇస్తుంది. రూ.5000కే ప్రెసిడెంట్‌ మెడల్‌, మద్యం అమ్ముతున్నారు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెత జగన్  ప్రభుత్వం నిజం చేస్తుందని పవన్ కల్యాణ్ విమర్శించారు.  వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు.. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తామని తెలిపారు. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు. ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నాన అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  

ఏపీ డ్ర‌గ్స్ దందా వెనుక బిగ్‌బాస్? డీఆర్ఐ విచారణలో సంచలనాలు...

డ్ర‌గ్స్‌. డ్ర‌గ్స్‌. డ్ర‌గ్స్‌. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌.. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌. అది కూడా ఆప్ఘనిస్తాన్ నుంచి మ‌న విజ‌య‌వాడ అడ్ర‌స్‌తో పెద్ద మొత్తంలో డ్ర‌గ్స్ దందా జ‌రుగుతోందంటే మాట‌లా?  ఆ న్యూస్ తెలిసి యావ‌త్ రాష్ట్రం ఒక్క‌సారిగా షాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకోక‌ముందే మరిన్ని షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి.  ఎక్క‌డో ఆప్ఘనిస్తాన్ నుంచి రవాణా అయి గుజ‌రాత్ ముంద్రా పోర్టులో డ్ర‌గ్స్ ప‌ట్టుకుని.. ఆ తీగ లాగితే ఇక్క‌డ‌ ఏపీలో భారీ డ్ర‌గ్స్‌ డొంక క‌దులుతోంది. ఆ తీగ అటుతిరిగి ఇటుతిరిగి వైసీపీ పెద్ద‌ల మెడ‌కు చిక్కుకుంటోంది. ఆ చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు పోలీసులు త‌మ‌వంతు సాయం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇలా కొన్నిరోజులుగా సాగుతున్న ఆప‌రేష‌న్ డ్ర‌గ్స్ ఎపిసోడ్‌లో లేటెస్ట్‌గా కాకినాడ పోర్టు తెర‌పైకి రావ‌డం.. స‌ముద్ర‌పు డాన్ పేరు వినిపిస్తుండ‌టం.. ఆ లింకులు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధి చుట్టూ తిరుగుతుండ‌టం.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా, సుకుమార్ సినిమా స్క్రీన్‌ప్లే త‌ర‌హాలో న‌డుస్తోంది ఏపీ డ్ర‌గ్స్ య‌వ్వారం. తాలిబాన్ టూ తాడేప‌ల్లి.. డ్ర‌గ్స్ దందా వెనుకున్న బిగ్‌బాస్ ఎవ‌రు? ఇలా కొన్నిరోజులుగా ఏపీని డ్ర‌గ్స్ ఎపిసోడ్ కుదిపేస్తోంది. కేసును త‌వ్వుతున్న కొద్దీ సంచ‌ల‌న విష‌యాలు తెలుస్తున్నాయి. ఇటీవ‌ల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కేంద్ర అధికారులు టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో దిగుమ‌తి అవుతున్న‌ హెరాయిన్‌ను భారీ స్థాయిలో ప‌ట్టుకున్నారు. ఆ డ్ర‌గ్స్ దిగుమ‌తి.. విజయవాడ చిరునామాతో ‘ఆశి ట్రేడింగ్‌ కంపెనీ’ పేరుతో మాచవరపు సుధాకర్ ద్వారా జ‌రిగిన‌ట్టు గుర్తించారు.    ముంద్రా పోర్టులో డ్రగ్స్‌ స్వాధీనం అనంతరం కేంద్ర సంస్థలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, గాంధీధామ్‌, మాండ్వి, విజయవాడలో తనిఖీలు చేపట్టారు. కన్‌సైన్‌మెంట్‌ రవాణాకు ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ కోడ్‌ అందించిన లైసెన్స్‌ హోల్డర్ మాచవరపు సుధాకర్‌, ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే, ఇంత పెద్ద డ్ర‌గ్స్ రాకెట్ లింకులు తాజాగా కాకినాడ పోర్టు వైపు దారి తీస్తున్నాయి. ఈ హెరాయిన్ సరఫరాకు కాకినాడతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.. స‌డెన్‌గా సముద్రపు డాన్ గా చెప్పుకునే మహ్మద్ షేక్ అలీషా పేరు తెర‌మీద‌కు రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  అశి ట్రేడింగ్ కంపెనీతో పాటు కాకినాడ పోర్టులోనూ ఆ డాన్ అలిషా లింకులు బయటపడుతున్నాయి..  కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందనే ఆరోపణలు మ‌రింత సంచ‌ల‌నంగా మారాయి. అసలు మహ్మద్ షేక్ అలీషా.. స‌ముద్ర‌పు డాన్‌గా ఎలా ఎదిగాడు?  వేల కోట్ల‌ ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్స్ బిజినెస్ చేసేంత నెట్‌వ‌ర్క్ ఎక్క‌డిది? అత‌నికి ఎవ‌రు ఫండింగ్ చేస్తున్నారు? అతని వెనుక ఎవరున్నారు? అలిషాకు వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉంది? మాచవరం సుధాకర్ కు దీనికి లింకు ఏంటీ? ఇలా అనేక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మ‌హ్మ‌ద్ షేక్ అలీషాకు చెందిన శాన్ మెరైన్ అనే కంపెనీలో మాచ‌వ‌రం సుధాకర్ గతంలో ప‌ని చేశాడని తెలుస్తోంది.. అలిషా ఆదేశాల ప్రకారమే అశి ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటైందని అంటున్నారు.. తెర మీద త‌న పేరు ఎక్క‌డా వినిపించ‌కుండా అలిషా చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించాడని... సుధాకర్ ను ముందుంచి అత‌నితో కంపెనీ పెట్టించి డ్ర‌గ్స్ దందా న‌డించాడ‌ని తెలుస్తోంది.  ముంద్రా పోర్టులో  దొరికిన 21వేల కోట్ల విలువైన హెరాయిన్‌.. గుజరాత్ ముద్రా పోర్టు నుంచి వ‌యా మచిలీపట్నం పోర్టు మీదుగా విజయవాడకు రవాణా బుక్కైనట్లు డాక్యుమెంట్లలో ఉందని తెలుస్తోంది.. నిజానికి మచిలిపట్నం పోర్టులో ఎగుమతులు , దిగుమతు లేవు.. మచిలిపట్నం పోర్టు పేరుతో కంటైనర్లు తెచ్చి.. వాటిని కాకినాడ పోర్టులో దిగుమతి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ గోల్‌మాల్ వ్య‌వ‌హార‌మంతా డాన్‌ అలిషా డైరెక్షన్ లో జరుగుతుందని అంటున్నారు... గుజరాత్ నుంచి కాకినాడ.. కాకినాడ‌ నుంచి విజయవాడ.. అక్కడి నుంచి ఏపీ వ్యాప్తంగా.. అలా దేశమంతా డ్ర‌గ్స్ ర‌వాణా అవుతున్న‌ట్టు స‌మాచారం. ఇక కాకినాడ పోర్టు నుంచే విదేశాలకు సైతం స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని తెలుస్తోంది. కాకినాడ పోర్టు అడ్డాగా సాగుతున్న డ్ర‌గ్స్ దందా అంతా ఓ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధి క‌నుస‌న్న‌ల్లో సాగుతోంద‌ని చెబుతున్నారు.  కాకినాడ పోర్టులో మెరైన్ కంపెనీలో అలిషా గతంలో ఆఫీస్ బాయ్‌గా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత డాన్‌గా ఎదిగాడు. ప్రస్తుతం శాన్ మెరైన్ సహా పలు కంపెనీలకు ఓనర్.. అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే అతను అంత‌లా ఎదిగాడ‌ని.. వ్యాపారాలు విస్తరించాడ‌ని అంటున్నారు... లేక‌పోతే వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ ర‌వాణా.. ప్ర‌భుత్వ పెద్ద‌ల సాయం లేకుండా ముందుకు సాగ‌దు. అందుకే, డ్ర‌గ్స్ దందా వెనుకున్న బిగ్‌బాస్ ఎవ‌రో తేలాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.  ఇక పోలీసుల తీరుపైనా చాలా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హెరాయిన్  పట్టుబడిన 24 గంటల్లోనే.. స‌రైన విచారణ జరగకుండానే పోలీసులు హ‌డావుడిగా ప్రెస్ మీట్ పెట్ట‌డం ఎవ‌రిని కాపాడ‌టానికో అర్థం కావ‌ట్లేదని అంటున్నారు. డ్ర‌గ్స్‌ కేసును డీఆర్ఐ విచారణ చేస్తుండగా.. విజయవాడ సీపీ ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చిన‌ట్టు..?  డ్ర‌గ్స్ ర‌వాణాకు విజయవాడతో సంబంధం లేదు, కేవ‌లం కంపెనీ మాత్రమే ఇక్క‌డ‌ రిజిస్టర్ అయిందని ముందే ఎలా చెబుతారు..? విచారణ జరుగుతుందని చెబుతూనే.. విజయవాడకు సంబంధం లేదని ఎలా కన్ క్లూజన్ కు వస్తారు..? సీపీ, డీజీపీ....ప్రకటనల్లో విరుద్దమైన అంశాలు ఎందుకు ఉన్నాయి..? రాజకీయ నేతల గురించి డీజీపీ మాట్లాడటం ఏంటీ..? డీఆర్ఐ ఉండగా డీజీపీ స్పందించాల్సిన‌ అవసరం ఏమొచ్చింది..?  సమాచారం లేకుండా.. విచారణ సాగుతుండగానే... ప్రకటనలు చేయవచ్చా..? అలా ముంద‌స్తు  స్టేట్‌మెంట్స్ ఇవ్వ‌డం ఎవ‌రిని కాపాడ‌టానికి? ఏ పెద్ద‌ల ఆదేశాల‌తో అలా చేస్తున్నారు? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి అనుమానాలు వినిపిస్తున్నాయి.  పోలీసుల తీరు వల్లే డ్రగ్స్ , గంజాయి రవాణాకు ఏపీ అడ్డాగా మారిందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ మొత్తం డ్ర‌గ్స్ దందాలో.. సముద్రపు డాన్ మ‌హ్మ‌ద్ షేక్ అలీషా కీల‌క వ్య‌క్తిగా క‌నిపిస్తున్నాడు. ఇక డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు కాకినాడ పోర్టుతో లింకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అశి ట్రేడింగ్ వ్య‌వ‌హారం.. సుధాకర్ పాత్ర‌..  డ్ర‌గ్స్ దందాతో వైసీపీ నేతల సంబంధాలు.. అండ‌దండ‌లు.. మచిలిపట్నం పోర్టు పేరుతో కాకినాడ పోర్టులో ట్రాన్స్ పోర్టు.. ఇలా అనేక విష‌యాలు నిగ్గు తేలాల్సి ఉంది. ఆ గుట్టు బ‌య‌ట‌ప‌డాలంటే.. డీఆర్ఐ  విచారణకు, కేంద్ర సంస్థలకు ఏపీ పోలీసులు స‌హ‌క‌రించాలి. సున్నితమైన, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో పోలీసుల నిస్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాలి. డ్ర‌గ్స్ డొంక వెనుకున్న‌ పెద్దల పాత్ర బ‌య‌ట‌పెట్టాలి. ఆ గుట్టు ర‌ట్టు అయితేనే గానీ.. అస‌లు డ్ర‌గ్స్ దందా వెనుకున్న‌ బిగ్‌బాస్ ఎవ‌రో బ‌య‌ట‌కు వ‌చ్చేది.

పోసానిని వైసీపీనే రెచ్చ‌గొట్టిందా? దాడి జ‌రిగేలా తిట్టించిందా?

జ‌న‌సేన కీల‌క నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆయ‌న చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టారంటూ ప‌రోక్షంగా పోసాని కృష్ణ‌ముర‌ళిని ఉద్దేశించి అన్నారు. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహాలు వేస్తారని విమర్శించారు. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉన్న నాదేండ్ల మనోహర్ ఇలా పోసానిని వైసీపీ నేత‌లే రెచ్చ‌గొట్టార‌ని.. పోసానిపై దాడి జ‌రిగేలా వ్యూహం ప‌న్నార‌ని ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కాస్త ఆలోచిస్తే.. నాదేండ్ల చేసిన ఆరోప‌ణ నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ వాళ్ల‌ను తిట్టారు. వైసీపీ మంత్రులు తిరిగి పీకేపై ఎదురుదాడి చేశారు. ఆ త‌ర్వాత జ‌న‌సేనాని ట్వీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేశారు. అందుకు మంత్రి పేర్ని నాని సైతం ట్విట్ట‌ర్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. అక్క‌డితే మాట‌ల‌కు మాట చెల్లు. క‌థ ముగిసిపోయింది అనుకున్నారంతా. కానీ, మ‌ధ్య‌లో పాన‌కంలో పుడ‌క‌లా పోసాని ఎంట‌రై ఇష్యూను ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇలా స‌డెన్‌గా పోసాని ఊడిప‌డ‌టం, పీకేపై తిట్ల‌పై విరుచుకుప‌డ‌టం, బూతుల‌తో కంపు కంపు చేయ‌డం.. అంతా వైసీపీ వ్యూహంలో భాగ‌మేన‌నే అనుమానం. ఎలాగంటే.... మొద‌ట సోమ‌వారం త‌న ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌గ‌న్‌ను తిట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పోసాని. కాస్త అటూఇటూగా ఓ మాదిరి నోటికి ప‌ని చెప్పారు. పోసాని ఎంట‌ర్ చేసి.. టాపిక్‌ను వాళ్లిద్ద‌రి వైపు డైవ‌ర్ట్ చేయాల‌నేది వైసీపీ స్కెచ్ అంటున్నారు. కానీ, సోమ‌వారం ఆ డ్రామా అనుకున్నంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ప‌వ‌న్ నుంచి కానీ, ఆయ‌న ఫ్యాన్స్ నుంచి పెద్ద‌గా రియ‌క్ష‌న్ రాలేదు. దీంతో.. ఇలా అయితే కుద‌ర‌ద‌నుకున్నారో ఏమో.. మంగ‌ళ‌వారం మ‌రోసారి పోసానితో ప్రెస్‌మీట్ పెట్టించారు. కానీ, ఈసారి వెన్యూ మార్చేశారు. పోసాని ఇంట్లో బ‌దులు, అంద‌రికీ తెలిసేలా.. అంద‌రూ ఈజీగా వ‌చ్చేలా.. సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు లొకేష‌న్ షిఫ్ట్ చేశారు. రెండోరోజు మ‌రింత ఘాటుగా, బండ బూతుల‌తో పోసాని విరుచుకుప‌డేలా ఎత్తుగ‌డ వేశారు.  పోసాని లైవ్ లో మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న తిట్టే తిట్లు భ‌రించ‌లేక‌.. జనసేన యూత్ కార్య‌క‌ర్త‌లు పోసానిపై దాడి చేసేందుకు ప్రెస్ క్ల‌బ్‌కు పెద్ద ఎత్తున‌ వ‌చ్చారు. పోసానిపై దాడికి ప్ర‌య‌త్నించారు. పోలీసులు భారీగా మోహ‌రించి పీకే ఫ్యాన్స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో పోసాని బ‌తికిపోయారు. ఇదే వైసీపీకి కావ‌ల‌సింది. పోసానిపై దాడి చేసేలా జ‌న‌సేన‌ను ఉసిగొల్పడ‌మే వైసీపీ వ్యూహం అంటున్నారు. నాదేండ్ల చెప్పిన‌ట్టు.. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహాలు వేసారని అనుమానిస్తున్నారు.  అయితే.. ఇంట్రెస్టింగ్‌ పాయింట్ ఏమంటే.. మొదటి రోజు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. రెండోరోజున మాత్రం అందుకు భిన్నంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఎందుకు వచ్చినట్లు? ఇంట్లో కాకుండా ప‌బ్లిక్‌కు అందుబాటులో ఉండే ప్లేస్‌లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినట్లు?  దీని వెనుక వైసీపీ స్కెచ్ దాగుంద‌ని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ను, జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకే పోసాని కావాలనే రెండోరోజు ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టార‌ని అనుమానిస్తున్నారు. పోసాని ఇల్లు.. ఐటీ కారిడార్‌లోని ఓ ల‌గ్జ‌రీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటుంది. అక్క‌డ‌ హై సెక్యురిటీ  ఉంటుంది. త‌న‌ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప‌వ‌న్‌ను ఎన్ని తిట్టినా.. అక్కడకు వచ్చి ఆందోళ‌న‌ చేయ‌డం పీకే ఫ్యాన్స్‌కు అంత ఈజీ కాదు. కాస్త కష్టమైన పని. అందుకే.. వారికి అంత‌గా క‌ష్ట‌పెట్ట‌కుండా.. చాలా సులువుగా త‌న‌పై దాడి జ‌రిగేలా.. ఇష్యూను మ‌రింత ర‌క్తి క‌ట్టించి.. హాట్ హాట్‌గా మార్చేలా.. ప్రెస్‌మీట్ లొకేష‌న్‌ను త‌న ఇంటి నుంచి ప్రెస్‌క్ల‌బ్‌కు మార్చారు పోసాని. అందుకే, జ‌న‌సేన ప్ర‌ధాన నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ అలాంటి ఆరోప‌ణ చేశార‌ని అంటున్నారు. నాదేండ్ల అన్న‌ట్టు.. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి.. అలజడి సృష్టించడానికి.. సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా.. వ్యూహం వేసిన మాట నిజ‌మే అనిపిస్తోందని అంటున్నారు.    

పంజాబ్ లో రాజ్యాంగ  సంక్షోభం తప్పదా?

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, ప్రియాంకా వాద్రా, సిద్దూను శాంతింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరో వంక సిద్దూకు మద్దతుగా మంత్రి రజియా సుల్తానా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఒకరిద్దరు పార్టీ నాయకులు కూడా రాజీనామాచేశారు. మరికొందరు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.అదే నిజమయితే, పంజాబ్’ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం మరింత ముదిరి  రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.  సిద్దూ ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న మాత్రం డైరెక్ట్ సమాధానం చిక్కని ప్రశ్నగానే మిగిలి పోయింది. కాంగ్రెస్  అధిష్టానం ఆయన కోరిన కోరికలన్నింటినీ కాదనకుండా నెరవేర్చింది. పీసీసీ అధ్యక్షపదవి అడిగారు, ఆప్పటి ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ నాయకుడు, కెప్టెన్ అమరీందర్ సింగ్’కు ఇష్టం లేక పోయినా, సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కెప్టెన్’ను ఒప్పించి సిద్దూకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అక్కడికీ సిద్దూ సంతృప్తి చెందకపోవడంతో ముఖ్యమంత్రిని మార్చి సిద్దూ కోరుకున్న చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నిని ముఖ్యమంత్రిని చేశారు...అయినా సిద్దూ పార్టీ నాయకులు,సోనియా,రాహుల్,ప్రియాంక త్రయంలో ఏ ఒక్కరికీ మాట మాత్రంగా అయినా, చెప్పకుండా, ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నట్లుగా, సిద్దూ నిలకడలేని మనిషే అనుకున్నా ఆయన ఎందుకు రాజీనామా చేశారు, అనేది మాత్రం ఇంకా భేతాళ ప్రశ్నగానే ఉందని అంటున్నారు.  ఇతర కారణాలున్నా  ప్రధానంగా కొత్త క్యాబినెట్‌ కూర్పు పట్ల అసంతృప్తితోనే ఆయన పదవి నుంచి వైదొలగినట్టు సమాచరం.ఇటీవలే ముఖ్యమంత్రిగా నియమితులైన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని గత ఆదివారం నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ముందు, ఇసుక తవ్వకాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రణగుర్జీత్‌ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దని కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు సిద్దూకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇవే ఆరోపణలపై అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గం నుంచి రణగుర్జీత్‌ సింగ్‌ ఉద్వాసనకు గురయ్యారు.అయితే సీఎం చన్ని ఆయనకు మళ్లీ మంత్రిపదవి కట్టబెట్టడాన్ని సిద్దూ అడ్డుకోలేకపోయారు. దీంతోపాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ఇంకొందరిపైనా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు.  పీసీసీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ చబేవాల్‌కు మంత్రివర్గంలో స్థానం కోసం సిద్దూ కొంతకాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే రాజ్‌కుమార్‌కు పదవి దక్కకపోగా... చన్నీకి బంధువైన అరుణా చౌధరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. అరుణా చౌధరి తన సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు చాలాకాలంగా ప్రచారంలో ఉంది.తాజా క్యాబినెట్‌ కూర్పులో కులాల సమీకరణ పట్ల కూడా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ జనాభాలో 30శాతం ఉన్న మజాబీ సిక్కులను పక్కనబెట్టి... తన సొంత కులానికే సీఎం చన్ని అధిక ప్రాధాన్యం ఇచ్చారని సిద్దూ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే రాహుల్‌ గాంధీ, పీసీసీ ఆమోదం తర్వాతే మంత్రివర్గం ఎంపిక జరిగిందని చన్ని మద్దతుదారులు అంటున్నారు. తాజాగా సిద్దూ, “నిజం” కోసం తుది శ్వాస ఉన్నంత వరకూ పోరాడుతానని చెప్పారు.సిద్దూ తన రాజీనామాకు సమబందించి మీడియాలో జరుగతున్న ప్రచారానికి సమాదానంగా ఈ రోజు ట్విట్టర్‌‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత ఎజెండా కోసం పోరాడలేదని, పంజాబ్ సంక్షేమం కోసమే కొట్టాడుతున్నానని, ఈ విషయంలో ఎప్పటికీ రాజీపడేదే లేదని వీడియోలో సిద్ధూ స్పష్టం చేశారు.ఎటువంటి త్యాగాలకైనా తాను సిద్ధమేనని, కాంగ్రెస్ హైకమాండ్‌ను తాను తప్పుదారి పట్టించలేనని సిద్ధూ తెలిపారు. పంజాబ్‌లో కొత్తగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు, అధికారులతో కొత్త వ్యవస్థను నడపలేమని అన్నారు. విలువల కోసం తాను పోరాడుతున్నానని, ఈ విషయంలో తాను వెనుకడుగేసేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. నిజం కోసం తుది శ్వాస వరకు పోరాడతానన్నారు.  ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని అంటున్నారు. ఇప్పటికే సిద్దూకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇచ్చారని, ఇంకా ఆయన కోరిన విధంగా మంత్రివర్గంలో మార్పులు చేస్తే, అధిష్టానం ప్రతిష్ట ఇంకా దిగజారి పోతుందని అంటున్నారు. మరోవంక,పంజాబ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపరిపక్వ రాజకీయ అనుభవం వల్లనే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఈ స్థాయికి చేరిందని పార్టీ వర్గాల్లో చర్చ నడిస్తోంది. రాష్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అన్నా చెల్లెలు  (రాజీవ్,ప్రియాంక) అనుభవ రాహిత్యం పార్టీకి ప్రమాదకర ముప్పుగా పరిణమిస్తుందని బహిరంగంగానే హెచ్చరించారు. మరో వంక పార్టీ ఇంత సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నా,సీనియర్ నాయకులు ఎవరూ పెదవి విప్పక పోవడం కాంగ్రెస్ పార్టీ సంక్షోభానికి సంకేతమని అంటున్నారు.

ఎమ్మెల్యేను సింహంతో పోల్చుతూ పొగడ్తలు.. అనంతలో బరి తెగిస్తున్న పోలీసు అధికారులు! 

అనంతపురం జిల్లాలో పోలీసు అధికారులు బరి తెగిస్తున్నారు. బహిరంగంగానే అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోస్టుల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి.. వైసీపీ నేతల మత్తులో జోగుతున్నారు. తాజాగా గుత్తి సీఐ రాము.. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సింహంతో పోల్చుతూ పొగడ్తల్లో ముంచెత్తడం రచ్చగా మారింది. ‘‘మన ఎమ్మెల్యే సింహంలాంటోడు. ఎవరికి ఎలాంటి సాయం చేయాలో మన ఎమ్మెల్యే సార్ చేస్తాడు. అడగక పోయినా సాయం చేసే వాడే లీడర్’’ అంటూ ఓ రేండ్ పొగిడేశారు. సీఐ రాము తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్‌లా కాకుండా అధికార పార్టీ కార్యకర్తలా సీఐ రాము మారిపోయారని జనాలు మండిపడుతున్నారు. ఇక తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము వ్యవహారం వివాదాస్పమవుతోంది. డీఎస్పీ, సీఐ తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు. ఇలాంటి అడ్డమైన దారులు తొక్కే వారి మాటలు విని అందర్నీ ఇబ్బంది పెడుతూపోతే వ్యవస్థ నాశనం అవుతుందని లేఖలో ఎస్ఐ రాయడం దుమారం రేపుతోంది.  ఉన్నతాధికారులు నిజాయితీగా పనిచేసేవారిని ప్రోత్సహించాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు. యూనిఫాం తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసే వారిని సపోర్ట్ చేస్తే తమ కుటుంబాలకు సమాజానికి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డ్‌గా కూడా పనికి రాని గుత్తి సీఐ రామును తమ కులానికి చెందినవారని సపోర్ట్ చేయడం నేరం సార్ అంటూ లేఖలో ఘాటుగా నిలదీశారు ఎస్ఐ సుధాకర్.  ‘‘నన్ను సస్పెండ్ చేసినా... నేను కట్టిన 36 కేసులకు 36 ఛార్జ్ మెమోలు ఇచ్చినా గర్వంగానే ఉంటాను’’ అంటూ తాడిపత్రి డిఎస్పీ చైతన్యనుద్దేశించి ఎస్సై సుధాకర్ యాదవ్ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. పోలీస్ శాఖను షేక్ చేస్తోంది. 

సీఎం సారూ ఎన్నికల హామీలు ఏమాయే.. బండి రెండో ప్రశ్న పత్రం 

తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతికి సంబంధించి మంగళవారం పది బాణాలు సంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్, బుధవారం మరో కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈసారి బండి, తెరాస ఎన్నికల మేనిఫెస్టో మీద దృష్టిని కేంద్రీకరించారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లా విషయంలో తెరాస ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఎండకట్టారు.  2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు..? ఎన్ని అమలు చేయలేదు..? దీనిపై చర్చించడానికి మీరు సిద్ధమేనా..?అని బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్’కు సవాలు విసిరారు. అలాగే, కేసీఆర్ మాటలను ఆయనకే అప్పగిస్తూ. ఇరుకైన ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడమే కష్టం.. అల్లుడు బిడ్డా వస్తే తలదాచుకునేదెలా..? గత ప్రభుత్వాలు ఇరుకైన ఇళ్లు పేదలకు ఇచ్చింది.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లో మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?అని ప్రశ్నించారు.  అలాగే ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చింది గుర్తుచేస్తూ, జనవరి 11, 2015న వరంగల్ లో 4 నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ఈ హామీఏమైంది, ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కట్టించారు..? అని ప్రశ్నించారు. అంతే కాదు, ఇంకా తెరాస ఎన్నికల ప్రణాళిక, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలకు సంబదించి బండి సంజయ్ సంధించిన మరికొన్ని ప్రశ్నలు  1.    కేసీఆర్ సారూ… అల్లుడు, బిడ్డ వస్తే ఎక్కడ పడుకోవాలి..? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారు..? మీరిచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు..? 2. 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ 14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు..? ఎన్ని పేదలకు ఇచ్చారు..? వాటికి లెక్కలు చెప్పగలరా..? 3. 2018 ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు అందించడం జరుగుతుందని మీరు హామీ ఇచ్చారు. కనీసం ఒక్కరికైనా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందా..? 4.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇళ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని పూర్తి చేశారు..? వాటి వివరాలను ఇవ్వగలరా.. 5. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం మొత్తం ఎన్నిదరఖాస్తులు వచ్చాయి..? అందులో అర్హత ఉన్నవి ఎన్ని..? వాటి వివరాలు ఇవ్వగలరా..? 6. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో ఇళ్లు పొందడానికి అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం లేదు..? ఇందులో ఏమైనా మతలబు ఉందా..? 7. కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన 2.91 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తే… తెలంగాణలో పేదల కోసం మరో 10 లక్షల ఇళ్లు కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యత బీజేపీ తెలంగాణ శాఖది. కేంద్రం మంజూరు చేసిన 2.91 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామని మీరు హామీ ఇవ్వగలరా..? 8. వందల కోట్ల రూపాయలతో మీరు ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్ ను సంవత్సర కాలంలోనే నిర్మించుకున్నారు. మీరు 2014లో నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే 26.31 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారు. 7 ఏళ్లు పూర్తవుతున్నా వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారు..? పేదల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా..? 9. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు..? ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి..? అఖిలపక్ష నేతలను తీసుకెళ్లి, నిర్మాణాల్ని చూపించే దమ్ము, ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా..? 10. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఈ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత..? ఖర్చు చేసిందెంత..? కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులెన్ని..? వాటి వివరాలను అందించగలరా..? 11.     గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని కట్టారు..? అంటూ ముఖ్యమంత్రి పైకి  ప్రశ్నలు సంధించారు. అంతే .. ఈ ప్రశ్నల పరంపర ఇలాకొనాసగుతూనే ఉంటున్నదని, బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన మరిన్ని ప్రశ్నలు సంధిస్తానన్నారు బండి సంజయ్

వాడిని ఎవ‌రిక‌న్నా చూపించండ్రా.. అలా వ‌దిలేయ‌కండ్రా..!

పోసాని కృష్ణ‌ముర‌ళి. నాగ‌బాబు మాట‌ల్లో మొరిగే కుక్క‌. పీకే ఫ్యాన్స్ దృష్టిలో పిచ్చి కుక్క‌. పోసాని తాను జ‌గ‌న్ అభిమానిన‌ని.. వైసీపీ మ‌నిషిన‌ని ఆయ‌నే చెప్పుకుంటారు. ఇక వైసీపీ వాళ్లంటే తెలుసుగా.. ఓ కొడాలి నాని, ఓ అనిల్‌కుమార్ యాద‌వ్‌.. ఓ పోసాని కృష్ణ‌ముర‌ళి. ఇలా ఇంకా చాలామందే ఉన్నా.. ఈ ముగ్గురూ ఓ జాతికే చెందిన వాళ్లంటారు. కొడాలి నాని, అనిల్‌కుమార్‌లు బూతుల మంత్రులగా ఫేమ‌స్ అయితే, ఆ ఇద్ద‌రూ రెండేళ్ల‌లో సంపాదించుకున్న ఆ చెత్త పేరును.. పోసాని మాత్రం ఇక్క‌రోజులోనే సాధించేశారు. అది నోరా.. సెప్టింగ్ ట్యాంకా? అనేలా దుర్గంధం వెద‌జ‌ల్లారు.  ఏం బాష అది? ఏం తిట్లు అవి?  మీడియా ముందు ఎవ‌రైనా అలా వాగుతారా?  పోసానికి ఏమైనా మ‌ర్యాద‌, ప‌ద్ద‌తి ఉందా? అంటూ స‌భ్య‌స‌మాజం చీద‌రించుకుంటోంది. అమ్మ‌-అక్క‌ల నుంచి వాడ‌లేని, విన‌లేని, రాయ‌లేని భాష‌లో బూతులు మాట్లాడి ప్ర‌జ‌లంద‌రితో ఛీ..అనిపించుకుంటున్నారు. ఏదైనా విమ‌ర్శ చేస్తే అర్థం ఉంటుంది.. ఉప‌యోగ‌మూ ఉంటుంది. చేసిన విమ‌ర్శ ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది.. ఆలోచింప జేస్తుంది.. చ‌ర్చ జ‌రుగుతుంది.. ఫ‌లితం వ‌స్తుంది. కానీ, తిడితే ఏమొస్తుంది? తిట్టినోడిపైనే అస‌హ్యం పుడుతుంది. కొడాలి నాని, అనిల్‌కుమార్‌లు స్టార్ట్ చేసిన ఈ పైత్యాన్ని పోసాని పీక్స్‌కు తీసుకెళ్లారు. ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా కంపు కంపు మాట్లాడి.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. అంతా చేసి ఏం సాధించారు? అంద‌రి ముందు అబాసుపాల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్టి.. అంద‌రితో తాను తిట్లు తింటున్నారు. పవన్ మీద కోపంతో.. పవన్ తల్లిని.. పెళ్లాన్ని కూడా వదిలిపెట్టనంటూ ఆయన అనేసిన మాటల పైత్యంపై చూసినోళ్లంతా మండిపడుతున్నారు. పవన్ వైసీపీ నేతల్ని తిట్టారు. వైసీపీ నేతలు ఆయన్ను తిట్టారు. సన్నాసి అని పవన్ అంటే.. పీకేను సన్నాసిన్న‌ర అంటూ పేర్ని నాని అన్నారు. లెక్క అంతవరకు సరిపోయింది. మ‌ధ్య‌లో పోసానికి ఎందుకింత‌లా పొడుచుకొచ్చిందో అర్థం కాదు. ఆయ‌నే ఇలా ఓవ‌ర్‌గా రియాక్ట్ అయ్యారా?  లేక‌, వైసీపీ వాళ్లే పోసానిని ప‌వ‌న్ మీద‌కు ఎగ‌దోశారా? అనే అనుమానం అయితే ఉంది. ఏదో వ‌చ్చాడు.. అన్నాడు.. పోయాడు.. అనేలా ఉండ‌కుండా.. అలా నోటికొచ్చిన‌ట్టు.. అమ్మ‌..నా..బూతులు తిట్ట‌డం అస‌లేమాత్రం క‌రెక్ట్ కాదంటున్నారు. పీకే ఫ్యాన్స్ పోసాని ఫ్యామిలీని టార్గెట్ చేసి తిడితే అందుకు ప‌వ‌న్ ఎలా బాధ్యులు?  ఫ్యాన్స్ అలా తిట్ట‌డం త‌ప్పే. మ‌రి, అదే త‌ప్పు పోసాని ఎలా చేస్తారు? అభిమానుల నోటి దూల‌కు ప‌వ‌న్ క‌ల్యాన్ కుటుంబాన్ని ఎందుకు బ‌లి చేయ‌డం? పవన్ ని పోసాని వ్యక్తిగతంగా విమర్శిస్తూ భార్య.. కూతురు పైనా వీరంగం వేయడంపై అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే, పోసాని తాట తీసేందుకు ప్రెస్ క్ల‌బ్‌కు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు జ‌న‌సైనికులు. పోలీసుల సాయంతో పోసాని త‌ప్పించుకున్నా.. ఆయ‌న లేపిన గ‌బ్బు..కంపును.. పినాయిల్‌తో కాదు యాసిడ్ పోసి క‌డిగాల్సి ఉంది. 

కొండా పోటీలో లేన‌ట్టేనా? రేవంత్‌రెడ్డి వ్యూహం మార్చారా?

రాజ‌కీయం ఏ రోజుకు ఆ రోజు మారిపోతుంటుంది. ఇవాళ క‌రెక్ట్ అనుకున్న‌ది.. రేపు రాంగ్ కావొచ్చు. అలానే రాంగ్ సైతం రైట్ అవ్వొచ్చు. రాజ‌కీయ‌మంటే అదే. కొన్నిసార్లు నెగ్గినా ఓడిన‌ట్టే. మ‌రొకొన్నిసార్లు త‌గ్గినా నెగ్గిన‌ట్టే. కాంగ్రెస్‌కు హుజురాబాద్ ఎన్నిక అలానే కానుందా? కౌశిక్‌రెడ్డి గోడ దూకాక‌.. హ‌స్తం పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేకుండా పోయారు. హుజురాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ పోటీ చేస్తారంటూ మొద‌ట్లో లీకులొచ్చాయి. పొన్నం త‌ర్వాత అనూహ్యంగా కొండా సురేఖ పేరు తెర‌మీదికొచ్చింది. కొండంత బ‌ల‌మున్న కొండా అయితేనే.. రేసుగుర్రంలా హుజురాబాద్‌ను గెలుచుకొస్తుంద‌ని భావించారు. రేపోమాపో కాంగ్రెస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారంటుండ‌గా.. స‌డెన్‌గా జాబితాలో కొండా సురేఖ పేరు లేదంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజంగా కొండా సురేఖ బ‌రి నుంచి త‌ప్పుకున్నారా?  లేక‌, త‌ప్పించారా? వ్యూహాత్మ‌క‌మా? ఉద్దేశ్య‌పూర్వ‌క‌మా? ఇలా అనేక అనుమానాలు. తాను హుజురాబాద్‌లో పోటీ చేయాలంటే.. రాబోవు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి టికెట్లు కేటాయించాల‌నేది కొండా ఫ్యామిలీ పెట్టిన డిమాండ్లు. అయితే, భూపాల‌ప‌ల్లిలో గండ్ర స‌త్య‌నారాయ‌ణ కాంగ్రెస్‌లో చేరుతుండ‌టంతో ఆయ‌న‌కే టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. సో, వ‌రంగ‌ల్‌, ప‌ర‌కాల స్థానాల్లో తామే పోటీ చేస్తామంటూ కొండా దంప‌తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విష‌యంలో కాంగ్రెస్‌కూ పెద్ద‌గా అభ్యంత‌రం లేదు. గెలిచే స‌త్తా ఉన్న నాయ‌కులు కావ‌డంతో ఆ రెండు సీట్లూ ఇచ్చేందుకు పార్టీ సై అంటోంది. అయినా, కొండా సురేఖ హుజురాబాద్ నుంచి పోటీ చేయ‌ట్లేద‌నే వార్త‌లు వ‌స్తుండ‌టం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే క‌నిపిస్తోంది.  నిస్సందేహంగా కొండా బ‌ల‌మైన కేండిడేటే. కానీ, హుజురాబాద్‌లో ఆమె గెలుస్తారా? అంటే సందేహ‌మే. కేవ‌లం పోటీ చేయ‌డానికి, పోటీ ఇవ్వ‌డానికి మాత్ర‌మే అయితే.. కొండా లాంటి స్ట్రాంగ్ లీడ‌ర్‌ను అన‌వ‌స‌రంగా బ‌రిలో దింపి వారి ఇమేజ్‌ను త‌గ్గించ‌డం ఎందుక‌నేది రేవంత్‌రెడ్డి ఆలోచ‌న అంటున్నారు. అందులోని హుజురాబాద్ స్థానిక నాయ‌క‌త్వం కొండా పేరును తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. స్థానికుల‌కే టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. స్థానికంగా స‌మ‌ర్థుడైన నాయ‌కుడిని ఇప్ప‌టి నుంచే రెడీ చేస్తే.. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో కాక‌పోయినా నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికైనా గెలిచేలా బ‌లం పుంజుకునే అవ‌కాశం ఉందంటున్నారు. అది కూడా క‌రెక్టే. అందుకే.. అధిష్టానానికి పంపిన తాజా జాబితాలో కొండా సురేఖ పేరు లేద‌ని అంటున్నారు. లేటెస్ట్ లిస్ట్‌లో.. క్రిష్ణారెడ్డి.. రవికుమార్.. ప్యాట రమేశ్.. సైదులు పేర్లు ఉన్న‌ట్టు స‌మాచారం.  కాంగ్రెస్‌కు ఎలాంటి ఉప‌యోగం లేని హుజురాబాద్‌ ఉపపోరులో.. పొన్నం, కొండాలాంటి పెద్ద స్థాయి నేతల్ని బరిలోకి దింపి భంగపడే కన్నా.. పోటీ చేశామా? అంటే చేశామనేలా అనిపించేలా.. ఉంటే చాల‌నే అభిప్రాయంలో రేవంత్‌రెడ్డి ఉన్నార‌ని తెలుస్తోంది. బ‌ల‌మైన నేతల్ని బరిలోకి దింపినా.. ఆస్థాయిలో ఓట్లు రాక‌పోతే.. అది పార్టీకి మ‌రింత చేటు చేస్తుంద‌ని పీసీసీ చీఫ్‌ భావిస్తున్నారు. అందుకే, కేసీఆర్‌-ఈట‌ల మ‌ధ్య సాగే హుజురాబాద్ కొట్లాట‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా చేయి పెట్ట‌కుండా.. చేయి కాల్చుకోకుండా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. కాస్త త‌గ్గి.. ప‌రోక్షంగా నెగ్గాల‌నే ఎత్తుగ‌డ అమ‌లు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ముందు పొన్నం, కొండా అంటూ కావాల‌నే హ‌డావుడి చేసి.. టీఆర్ఎస్‌, బీజేపీల‌కు అలా ఝ‌ల‌క్ ఇచ్చి.. తుద‌కు స్థానికుల్లో ఎవ‌రో ఒక‌రిని బ‌రిలో దింపి.. ఈవీఎంలో చేతి గుర్తు ఉండేలా చూసుకోవ‌డం మిన‌హా.. హుజురాబాద్ ఎన్నిక‌కు అంత‌కుమించి ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌ద‌నేది పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యూహంలా క‌నిపిస్తోంది.   

టాప్ న్యూస్ @ 1PM

జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్‌ రాగానే.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తుండటం కాక రేపుతోంది.  -------- స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం పవన్‌పై దూషణ పర్వంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులు జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు నారాయణ స్వామి.  --------  రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నడపాల్సింది బ్యాంకులా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు కేంద్ర నిధుల తాకట్టుతో మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కోసం బ్యాంకులను అప్పు అడగడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా డైవర్షన్ చేశారని ఆరోపించారు. ప్రతి కేంద్ర పథకానికి ప్రత్యేక ఖాతా తెరవాల్సినా, కేవలం 5 ఖాతాలతో మేనేజ్ చేయడం సూట్ కేస్ కంపెనీల నిర్వాహణ లాంటిదేనని మండిపడ్డారు. ------ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు అన్నీ పరిశీలిస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. గత ఎన్నికల్లో కాపులు తటస్థంగా ఉన్నారని...కాపులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే దేనికి దారితీస్తాయో చెప్పలేమని తెలిపారు. ఎస్వీబీసీ  చైర్మన్ పృథ్విని బయటకు పంపడం, అవంతిపై హనీ ట్రాప్ చేయడం, సామినేని ఉదయభాను ప్రతిష్ట దెబ్బ తీయడం జరిగిందన్నారు. ----- తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము  తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు. ------- విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా  అతలాకుతలం అయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. ఎయిర్ పోర్ట్‌లోకి నీరు రావడంతో...ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ రూపురేఖలు మార్చేస్తామని అన్నారు..ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.  ------- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెరిగిపోతున్న గంజాయి దందాపై తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకప్పుడు పంజాబ్‌లో ఎలాంటి దందా జరిగిందో ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి దందా జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విజయశాంతి ప్రశ్నించారు.కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి గంజాయి మత్తు నుంచి యువతరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిదన్నారు.  ---- కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో గల ఎస్‌బీఐ బ్యాంక్ ముందు దళితుల క్యూ కట్టారు. తమ అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయో లేదో అని లబ్దిదారులు తనిఖీలు చేసుకుంటున్నారు. కొందరికి డబ్బులు అకౌంట్‌లో జమ అయినట్లు మెసేజ్‌లు రాగా...మరికొందరికి మెసేజ్ రాకపోవడంతో లబ్ధిదారులు బ్యాంక్‌కు తరలివచ్చారు. -------- దేశం కోసం కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ప్రాణాలర్పించారని ఒక్క బీజేపీ నేత కూడా ఈ జాబితాలో లేడని ప్రతిపక్షనేత సిద్దరామయ్య పేర్కొన్నారు. బ్రిటీష్‌ వారికి గతంలో తొత్తులుగా వ్యవహరించి, నేడు కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తున్న బీజేపీ నుంచి దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. బీజేపీ నేతల మనిస్థితిని తాను తాలిబాన్లతో పోల్చానని గట్టిగా సమర్థించుకున్నారు.  --------- కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు ఢిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధించింది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఢిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు సర్కారు తెలిపింది. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు.  ------