సాయిరెడ్డి టార్గెట్ గా విశాఖలో పీకే టీమ్ వర్క్? నెంబర్ టు రాజీనామా చేస్తారా? 

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటారు. ఈ సామెత రాజకీయాల్లో ఎక్కువగా నిజమవుతుంటుంది. అధికారంలో ఓ వెలుగు వెలిగిన నేతలు కొన్ని రోజులకు కనమరుగవుతుంటారు. అనామకులు అందలం ఎక్కుతుంటారు. పవర్ లో హల్చల్ చేసే లీడర్లు.. తలరాత మారితే ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టుగా చెప్పుకునే ఎంపీ విజయసాయి రెడ్డి సీన్ అచ్చం అలాగే ఉందనే చర్చ సాగుతోంది.  వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో, పార్టీలో సాయిరెడ్డి హవా సాగించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా జగన్ తో పాటు జైలుకు వెళ్లిన సాయిరెడ్డి.. వైసీపీలోనూ జగన్ తర్వాత  నెంబర్ టు అనే ప్రచారం జరిగింది. ఆయన వ్యవహారం కూడా అలానే ఉండేది. జగన్ తో ఏం పని జరగాలన్న విజయసాయితో చెబితే సరిపోతుందన్న టాక్ కూడా వచ్చింది. అలాంటిది కొన్ని రోజులుగా సాయిరెడ్డికి సీఎం జగన్ దగ్గర అపాయింట్ మెంట్ కూడా లేదని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీలో ఆయన ఖేల్ ఖతమైందనే చర్చ సాగుతోంది. ఇందుకు కారణం పీకే టీమ్ విశాఖలో పర్యటిస్తుండటమే. గతంలో వైసీపీ కోసం పనిచేసిన  ప్రశాంత్ కిశోర్ టీం మళ్లీ ఏపీలో అడుగుపెట్టింది. విశాఖలో తిరుగుతోంది. రెండు రోజులుగా ఈ టీం విశాఖ ప్రజల నుంచి పలు అంశాల మీద అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. విశాఖలో పీకే టీమ్ తిరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పీకే టీం విశాఖలో ఏం చేస్తోంది.. సీఎం జగన్ వాళ్లకు ఇచ్చిన టాస్క్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎంపీ విజయసాయి రెడ్డి చూస్తున్నారు. దీంతో విజయసాయి రెడ్డి వ్యవహారంపైనే పీకే టీమ్ వివరాలు సేకరిస్తుందనే చర్చ వైసీపీ వర్గాల నుంచి వస్తోంది. సాయిరెడ్డి కార‌ణంగా ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందనే సమాచారం సీఎం జగన్ కు వచ్చిందని అంటున్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. భూ ఆక్రమణలు భారీగా వెలుగు చూస్తున్నాయి. విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు సాయిరెడ్డి తీరుపై సీఎం జగన్ కు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని గ్రహించిన జగన్ రెడ్డి.. పీకే టీమ్ ను అక్కడికి పంపించారని అంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలను కూల్ చేయడంతో పాటు సాయిరెడ్డి అక్రమ బాగోతాలపైనా పీకే టీమ్ ఫోకస్ చేసిందని తెలుస్తోంది. అందుకే  అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న నేత‌ల‌ను పీకే బృందం క‌లిసి వారి అసంతృప్తికి గ‌ల కార‌ణాలు, అధిష్ఠానం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు త‌దిత‌రాల‌పై వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ట‌. పార్టీ ఉత్త‌రాంధ్ర ఇంచార్జీగా ఉన్న సాయిరెడ్డికి ఈ విష‌యం ఇప్ప‌టిదాకా తెలియ‌నే లేద‌ట‌. పీకే బృందం విశాఖ‌లో రంగంలోకి దిగిన వైనం చూస్తుంటే.. ఉత్తరాంధ్ర ఇంచార్జీ బాధ్య‌త‌ల‌ నుంచి సాయిరెడ్డి నుంచి త‌ప్పించ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను జ‌గ‌న్ ముఖ్య స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. కేబినెట్ ర్యాంకులో ఈ ప‌ద‌విలో నియ‌మితులైన దాస్‌.. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ కేంద్రంగా విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుసంధానం క‌ల్పించే కీల‌క బాధ్య‌త‌ల‌ను దాస్ చూడబోతున్నారు. ఇప్పటివరకు ఈ పనిని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత హోదాలో చేస్తున్నారు. అయితే ఆయ‌న‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండానే దాస్‌ను ఢిల్లీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారుగా నియ‌మించేశారు. వైసీపీ త‌ర‌ఫున ప‌దేళ్ల‌కు పైగా రాజ్య‌స‌భ‌ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న సాయిరెడ్డి రెండో టెర్మ్ ప‌ద‌వీ కాలం వ‌చ్చే ఏడాది మే నెల‌తో ముగియ‌నుంది. మ‌రోమారు ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదని అంటున్నారు. రాజ్యసభ ఛాన్స్ మరోసారి లేదన్న సమచారం రావడం వల్లే సాయిరెడ్డి అలిగి సైలెంటుగా కూర్చున్నారని అంటున్నారు.   తాజాగా చోటుచేసుకున్న రెండు కీల‌క ప‌రిణామాల‌తో  విజయసాయి రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆయన ఏకంగా వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికే రాజీనామా చేసేస్తారేమోన‌న్న వాద‌న‌లు కూడా వస్తున్నాయి. జ‌గ‌న్‌తో సాయిరెడ్డికి విడ‌దీయ‌లేని బంధం  ఉంది. త‌న ఆర్థిక వ్య‌వ‌హారాన్నింటినీ చ‌క్క‌బెట్టే సాయిరెడ్డిని జ‌గ‌న్ దూరం చేసుకోర‌ని సొంత పార్టీతో పాటు వైరి వ‌ర్గాలూ భావిస్తున్నాయి. మ‌రి అటు ఢిల్లీలో అధికారాల‌కు క‌త్తెరేసి.. ఇటు ఉత్త‌రాంధ్ర ఇంచార్జీ ప‌ద‌విని తొల‌గించేస్తే మ‌రి సాయిరెడ్డికి ఎలాంటి ప‌దవి అప్ప‌గిస్తార‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా సాయిరెడ్డి భ‌విష్య‌త్తు ఏమిట‌న్న విష‌యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 

పూల పండుగ సంబరాలు షురూ.. బతుకమ్మ ఎందుకు చేస్తారో తెలుసా? 

భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టినిల్లు. మన  దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే బతకుమ్మ ప్రత్యేకమైనది.  బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.  గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ చిన్నా పెద్ద తేడా లేకుండా  మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మ ఆడుతారు. తుమ్మెదా, రామచిలుక, రాచగుమ్మడి, చెలియా, ఉయ్యాల, కోల్‌, వరలో, కోయిలా, సందమామ వంటి వంత పదాలను ఉపయోగిస్తూ పాడే పాటలు ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తాయి. ఒక స్త్రీ పాట పాడగా మిగిలిన వాళ్ళు వంత పాడటం దీని ప్రత్యేకత.  ఈ బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..  బతుకమ్మ పండుగ కథ.. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.  అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు.  బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని 'పెంటమ్మ లేదా పెంటయ్య' అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి 'బిచ్చంగా' తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు 'భిక్షపతి, భిక్షమ్మ' లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు.  పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు 'బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో, బిడ్డాలెందారే.. వలలో' అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారనపెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మనగొప్పసంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లలవల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది.  అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ. జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణాకే పరిమితమైంది. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు. తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.  పెత్రామస నుంచి సద్దుల బతకుమ్మ వరకు.. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.  అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.  ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.  నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..  అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.  వేపకాయల బతుకమ్మ బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.  వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.  సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.  బతుకమ్మ సంబరాలు తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు , శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.

హుజురాబాద్ ఎన్నికల ఎఫెక్ట్.. సింగరేణిలో దసరాకు ముందే బోనస్

తెలంగాణలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది హుజురుబాద్ ఉప ఎన్నిక కేంద్రంగానే ఉంటోంది. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లోనే అమలు చేస్తున్నారు. ఏడేండ్లుగా పెండింగులో ఉన్న కొత్త రేషన్ కార్డుల పంపిణి హుజురాబాద్ లోనే తిరిగి మొదలైంది. 57 ఏండ్లకు పెన్షన్ స్కీం కూడా అక్కడే మొదటగా అమలవుతోంది. తాజాగా సింగరేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్ ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్, ఇది కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే చేశారనే చర్చ సాగుతోంది. మాములుగా దీపావళికి బోనస్ ఇస్తుంటారు. కాని ఈసారి మాత్రం దసరాకు ముందే ఇస్తామని చెప్పడంతో ఈ చర్చ సాగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోనూ సింగరేణి కార్మికుల కుటుంబాలు భారీగానే ఉన్నాయి. అందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.  సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు  29 శాతం వాటాను ఇవ్వనున్నట్లు  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ  దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ  శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరమున్నదన్నారు. బొగ్గుతవ్వకంతో పాటు  ఇసుక,ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని సిఎం తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సింగరేణిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్  నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో  కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని సిఎం అన్నారు. నిబద్దతతో నిరంతర శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గుతవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి ఇనుము తదితర ఖనిజాల తవ్వకాలలో వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు  పనికల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రెండు వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను  కేసిఆర్ ఆదేశించారు.

పీకే టీమ్ షాకింగ్ స‌ర్వే.. సీఎం జ‌గ‌న్‌కు సంచ‌ల‌న రిపోర్ట్‌!

జ‌గ‌న్ త‌ర‌ఫున పీకే టీమ్ మ‌ళ్లీ రంగంలోకి దిగింది. వ‌చ్చే రెండున్న‌రేళ్లు వైసీపీ కోసం ప‌ని చేయ‌నున్నారు. గ‌తంలోలానే ఈసారి కూడా జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేసేందుకు ప‌ని చేయ‌నుంది. తాజాగా, ప్ర‌శాంత్ కిశోర్ బృందం స‌భ్యులు విశాఖ‌కు వ‌చ్చార‌ని తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా పీకే టీం విశాఖలో సీక్రెట్ స‌ర్వే జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. వివిధ అంశాల మీద ప్ర‌జ‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది పీకే టీమ్‌.  విశాఖ‌లో పీకే బృందం స‌ర్వే వైసీపీ నేత‌ల్లో ప్ర‌కంప‌ణ‌లు రేపుతోంది. స‌ర్వే చెక్‌లిస్ట్ అంతా వైసీపీ పాల‌న‌, వైసీపీ నేత‌ల ప‌ని తీరు, నామినేటెడ్ పోస్టులు, అసంతృప్తులు, ప‌బ్లిక్‌ ఇమేజ్‌, ప్ర‌జ‌ల్లో నాయ‌కుల‌పై వ్య‌తిరేక‌త.. ఇలా వైసీపీ లీడ‌ర్స్‌పై పీపుల్స్ ప‌ల్స్ తెలుసుకుంటోంది పీకే టీమ్‌.  స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూస్తున్నాయ‌ట‌. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర ఇంఛార్జ్ విజ‌య‌సాయిరెడ్డికి వ్య‌తిరేకంగా తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. ఏ నాయ‌కుడిని అడిగినా.. ఏ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించినా.. విజ‌య‌సాయిపై ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌. అధికారులు సైతం కేవ‌లం విజ‌య‌సాయి చెప్పినట్టే వింటున్నార‌ని.. మిగ‌తా నేత‌ల‌ను అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. మిగ‌తా నాయ‌కులంద‌రినీ డ‌మ్మీ చేశార‌ని.. విశాఖ‌లో విజ‌య‌సాయి పెత్త‌నం బాగా పెరిగిపోయింద‌ని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయ‌ని తెలుస్తోంది. విజ‌య‌సాయి భూదందాలు, అక్ర‌మాల‌పైనా కుప్ప‌లు తెప్ప‌లు కంప్లైంట్స్ వినిపిస్తున్నార‌ట‌. ఇక పీకే టీమ్ స‌ర్వేతో వైసీపీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. నామినేటెడ్ ప‌ద‌వులు ఆశించి ద‌క్కిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు గుర్తించారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని.. ఆర్థికంగా అండగా నిలిచిన వారికే పదవులు ఇచ్చార‌నే నిరాశ నేత‌ల నుంచి వ్య‌క్తం అవుతోంది.  ఇలా, సంస్థాగ‌తంగా విశాఖ వైసీపీలో లోటుపాట్ల‌ను తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పీకే టీమ్‌కు ఊహించ‌నిరీతిలో నెగ‌టివ్ ఫీడ్‌బ్యాక్ వ‌స్తోంద‌ని స‌మాచారం. ఆ విష‌యాల‌న్నీ క్రోడీక‌రించి.. విశ్లేషించి.. సీఎం జ‌గ‌న్‌కు స‌మ‌గ్ర రిపోర్ట్ ఇవ్వ‌నున్నారు. అయితే, పీకే బృందం విశాఖ‌లో స‌ర్వే చేస్తోంద‌నే విష‌యం తెలిసి.. వైసీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. త‌మ గురించి ఎవ‌రు ఎలాంటి అభిప్రాయాలు చెబుతున్నారో.. ఎవ‌రు ఎవ‌రికి ఎస‌రు పెడుతున్నారోన‌నే అనుమానం స్థానిక వైసీపీ నాయ‌కుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. రానున్న రెండేళ్లూ.. జ‌గ‌న్‌కు కాకుండా, పీకే టీమ్‌కు భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సిందేన‌ని అధికార‌పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.   

విపక్షాల సవాళ్లకు జవాబేది? టీఆర్ఎస్ ఓటమి ఒప్పుకున్నట్టేనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నిక  దగ్గరవుతున్నకొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. వేడి పెరిగే కొద్దీ అధికార తెరాసలో వణుకు పెరుగుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.  ప్రత్యర్ధి పార్టీలు సంధిస్తున్న సవాళ్ళకు తెరాస నాయకులు సమాధానలు చెప్ప లేక కిందా మీదా అవుతున్నారు. నిజానికి మొదటి నుంచీ కూడా అనేక విషయాల్లో డిఫెన్సు పడిపోయిన తెరాస నాయకులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగి పోతున్నారు. అవస్థలు  పడుతున్నారు. అందుకే, ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన కారణాల మొదలు ఇప్పుడు తాజాగా అయన చేసిన రాజకీయ సన్యాసం సవాలు వరకూ ఏ ఒక్క సవాలుకు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఏ ఒక్క నాయకుడు జవాబు చెప్పే సాహసం చేయలేక పోతున్నారు.  తాజాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల నేరుగా, కేసీఆర్ కే సవాలు విసిరారు.ఉప ఎన్నికల్లో తాను ఓడిపోతే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి చెపుతానని, తెరాస ఓడిపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. నిజానికి ఇదే సవాలును ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అద్యక్షు బండి సంజయ్ గతంలోనూ చేశారు. అయినా కేసీఆర్ కాదు, చివరకు తెరాస నాయకులూ ఎవరూ ఆ సవాలు స్వీకరించలేదు. చివరకు, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, సమాధానం చెప్పలేక మోకాలుకు బోడి గుండుకు ముడి పెడుతూ.. బెంగాల్లో భవానీపూర్ నియోజక వర్గంలో బీజేపీ ఓడిపోతే ప్రధాని మోడీ రాజీనామా చేశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఎప్పుడో రెండు నెలల క్రితం దమ్ముంటే, గెలుపు మీద ధీమా ఉంటే, కేసీఆర్ లేదా హరీష్ రావు పోటీచేయాలని ఈటల విసిరిన సవాలుకు, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఇంతవరకు స్పందించలేదు. జవాబు చెప్పలేదు.  అన్నిటికంటే విచిత్రం ప్రతిపక్షాలు ఒకటంటే మీరు నాలుగు అనండి, అని హైదరాబాద్ కార్యకర్తలకు క్లాసు పీకిన, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కేటీఆర్, తన దగ్గరకు వచ్చే సరికి, కోర్టును ఆశ్రయించి, రక్షణకవచం తెచ్చుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ విషయంలోనూ కేటీఆర్, ఎస్కేప్ రూట్ లో పక్కదారి చూసుకున్నారు. నీ సంగతి చెప్పవయ్యా అంటే, కేటీఆర్ సమాధానం చెప్పకుండా రాహుల్’ గాంధీ పరీక్షలు చేయించుకుంటే తానూ చేయించుకు కుంటానని తప్పించుకున్నారు. నిజానికి, కేటీఆర్ సవాలు స్వీకరించక పోవడంతో అంతవరకు రామన్న మంచి బాలుడు అనుకున్న వారిలో కూడా, అనుమానాలు రేకెత్తించింది.  రాజకీయాలలో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలలో ప్రత్యర్ధులు విసిరినా సవాలుకు, సమాధానం చెప్పక పోవడం, చెప్పలేక పోవడం రెండూ కూడా ఓటమిని అంగీకరించడంమే అవుతుందని, అంటారు. అదే నిజం అయితే, తెరాస ఓటమిని అంగీకరించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు. నిజానికి, దళిత బంధు వంటి భారీ పథకాన్ని ఓటర్లకు ఎరవేసినప్పటికీ, రూ.4,700 కోట్ల విలువ చేసే పనులకు జీవోలు జారీ చేసినా, అధికార పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీల సవాళ్ళకు సమాధానం చెప్పలేక పోవడం, నిజంగా అధికార పార్టీ బలహీనతను బయట పెడుతోందని పరిశీలకులు అంటున్నారు. 

రఘునందన్ కు మంచి భవిష్యత్! బీజేపీ ఎమ్మెల్యేకు కేసీఆర్ ప్రశంసలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండగా.. నిండు సభలో బీజేపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రశంసపూర్వక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. అది కూడా నిత్యం తనపై విరుచుకుపడే ఎమ్మెల్యేను పొగడటం ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా జయకేతనం ఎగురవేస్తూ వస్తున్న తమ జైత్రయాత్రకు బ్రేకులు వేసిన ఎమ్మెల్యేపై ఆ కామెంట్లు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇంతకూ సీఎం కేసీఆర్ చేత ప్రశంసలు అందుకున్నది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. గతంలో టీఆర్ఎస్ పని చేశారు రఘునందన్ రావు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు రఘునందన్ రావు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో చేరిన రఘునందన్.. ఏడాది క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి టీఆర్ఎస్ కు, సొంత జిల్లాలో సీఎం కేసీఆర్ కు షాకిచ్చారు. ఆ తర్వాత గులాబీ పార్టీ టార్గెట్ గా మరింత దూకుడు పెంచారు రఘునందన్. బండి సంజయ్ పాదయాత్ర, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా రఘునందన్ రావును ఉద్దేశించి కేసీఆర్ సానుకూల కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  దళిత బంధు పథకంపై సభలో జరిగిన చర్చలో మాట్లాడిన కేసీఆర్...  హుజురాబాద్‌ కోసం దళిత బంధు పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయని అన్నారు. ఈ సందర్బంగా బీజేపీపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. వర్గీకరణ చేయాలని ఇప్పటికే ప్రధానికి చాలాసార్లు చెప్పానన్నారు. కేంద్రంలో ఉన్నారు కదా.. వర్గీకరణ చేసి తీసుకువస్తే.. బేగంపేట నుంచి పెద్ద పెద్ద దండలు వేసి స్వాగతం పలుకుతామన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు యువకుడని, మంచి భవిష్యత్ ఉందన్నారు. ఇంత పెద్ద స్కీమ్‌పై మాట్లాడే ముందు ఆలోచన ఉండాలి కదా అని అన్నారు. ఏదో ఒకటి అనాలనుకునే మాటలు ఇకనైనా మానుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు కేసీఆర్. అణచివేయబడ్డ వారికి సాధికారత రావట్లేదన్నారు. దళిత వర్గాలకు అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారని, అంబేద్కర్ ఆలోచన సరళి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తోందన్నారు. దళితుల గురించి కాంగ్రెస్ ఏం చేయలేదని అనలేమని, వారు చేసేది చేశారని, అయితే అనుకున్నంత జరగలేదనేది తమ వాదన అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ముందు ముందు కూడా తామే అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదన్నారు. ఎన్నికలు వస్తే తమకు అంచనాలు ఉండవా?.. తమది రాజకీయ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం గుర్తించి.. దళితుల రిజర్వేషన్ శాతం పెంచాలన్నారు. బీసీల కులగణన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదని సీఎం నిలదీశారు.  మార్చిలోపే రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామన్నారు. వచ్చే మార్చిలో రూ. 20 వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామన్నారు. రూ.10 లక్షలు లబ్ధిదారుల ఇష్టమని, నిబంధనలు లేవని, ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చునని, తమకెలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోయాయన్నారు. ఎకరం భూమి రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడ దొరకడం లేదన్నారు.ఏడాది కిందటే దళితబంధు పథకం ప్రారంభం కావాల్సిందని, అయితే కరోనా వల్లే ఆలస్యమైందన్నారు. దళితబంధుపై అఖిలపక్షం సమావేశం పెట్టి చర్చించామన్నారు. ఆచరణలో వచ్చే ఇబ్బందులను అధిగమిస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

నరేగాపై ఫలించిన టీడీపీ పోరాటం.. జగనన్న సర్కార్ 12 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీ హైకోర్టు  సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా బిల్లులు మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కొంత చెల్లించి ఉంటే,  మిగతా బకాయిలను పనులు చేసినప్పటి నుంచి 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు కోరుతూ దాదాపు 2 వేల పిటిషన్లు దాఖలు కాగా...  1,013 పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది  ఉపాధి హామీ బిల్లులపై కోర్టు తీర్పు హర్షనీయమని వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. బిల్లులపై న్యాయ పోరాటానికి అండగా నిలిచిన చంద్రబాబుకు ఆయన  ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని  సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. పనులు చేసినవారికి బిల్లులు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు వైబీ రాజేంద్రప్రసాద్. 

కేసీఆర్ కేంద్రంలో చేర‌బోతున్నారా? అందుకే అసెంబ్లీలో అలా అన్నారా?

కేసీఆర్‌. రాజ‌కీయ చాణ‌క్యుడు. ఇటీవ‌ల రోజుల త‌ర‌బ‌డి ఢిల్లీలో మ‌కాం వేశారు. కేంద్ర పెద్ద‌ల‌ను వ‌రుస‌బెట్టి క‌లిశారు. మోదీని మీట్ అయ్యారు. అమిత్‌షాతో రెండు సార్లు భేటీ అయ్యారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో మంత‌నాలు జ‌రిపారు. అన్ని రోజులుండి.. ఇంకా ఎవ‌రెవ‌రిని క‌లిశారో.. ఏం మాట్లాడారో మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఢిల్లీ పెద్ద‌ల‌తో కేసీఆర్ స‌మావేశాల సారాంశం ఎక్క‌డా లీక్ కాకుండా చాలా జాగ్ర‌త్త ప‌డ్డారు. అప్పుడే అనుమానం వ‌చ్చింది. గులాబీ బాస్ అన్ని రోజులు హస్తిన‌లో ఉండ‌ట‌మేంట‌ని? బీజేపీ బాసుల‌తో అంత‌గా మీటింగ్‌లు ఎందుకంటూ.. అప్ప‌ట్లోనే గుస‌గుస‌లు వినిపించాయి. అయితే, నిప్పు ఉన్నా.. పొగ‌ మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా, తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌తో కాస్త క్లారిటీ వ‌చ్చిన‌ట్టైంది. మ‌రోసారి విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏమ‌న్నారంటే... రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ఇదీ ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన డైలాగ్స్‌. కేసీఆర్ లాంటి నేత‌.. ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను అంత ఈజీగా అనేస్తారా? ఆ మేర‌కు ఏదో విష‌యం ఉండి ఉంటేనే ఆయ‌న అలా అని ఉంటార‌నే విశ్లేష‌ణ మొద‌లైపోయింది. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవ‌కాశం కావొచ్చు.. అన్నారంటే గులాబీ పార్టీ కేంద్ర మంత్రివ‌ర్గంలో భాగ‌స్వామ్యం అవుతుంద‌నేగా ఆ మాట‌కు అర్థం? అంటే, కేసీఆర్ ఎన్డీయేలో చేర‌బోతున్నారా? కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు తీసుకుంటారా? అంటూ చ‌ర్చ మొద‌లైపోయింది.  తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. కాంగ్రెస్ క‌నుక ఒక్క‌సారి పైకిలేస్తే.. మ‌ళ్లీ ఆ పార్టీని అణ‌గ‌దొక్క‌డం అంత ఈజీ కాదు. కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన రేవంత్‌ను, కాంగ్రెస్‌ను బ‌లంగా తొక్కేసేయాల‌ని అద‌ను కోసం కేసీఆర్ చూస్తున్నారు. మ‌ధ్య‌లో పాన‌కంలో పుడ‌క‌లా బీజేపీ ఎగిరెగిరిప‌డుతోంది. అటు, బీజేపీకి సైతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్సే ప్ర‌ధాన శ‌త్రువు కానీ, టీఆర్ఎస్ కానే కాదు. అందుకే, హ‌స్తం పార్టీని అణచివేయాల‌నే వ్యూహంలో.. ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల కోసం.. ఆ రెండు పార్టీలు రాజీ ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ మ‌ద్ద‌తిచ్చి.. ఆ మేర‌కు కొన్ని మంత్రి ప‌ద‌వులు ఆశించే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి, కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్‌తో అవ‌స‌ర‌మేంట‌నే అనుమానం రావొచ్చు.  ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌నాథుల‌కు వార్ వ‌న్‌సైడ్ కాక‌పోవ‌చ్చు. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్నాయి. వ‌చ్చేసారి బీజేపీ ఎంపీ స్థానాల‌కు భారీగా గండి ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే, ఆ స‌మ‌యానికి అవ‌స‌ర‌మైతే టీఆర్ఎస్ మ‌ద్ద‌తు తీసుకోవాల‌నేది క‌మ‌లం ప్లాన్‌.  అందుకే.. సీఎం కేసీఆర్ న‌ర్మ‌గ‌ర్బంగా.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు.. అని అసెంబ్లీలో అన్నార‌ని అంటున్నారు. ఇటీవ‌లి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఆ మేర‌కు ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని ఇప్ప‌టికే లీకులు వ‌చ్చాయి. ఉమ్మ‌డి శత్రువైన కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు.. బీజేపీ-టీఆర్ఎస్ క‌లిసినా క‌ల‌వొచ్చు. ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.

ఏకగ్రీవ సంప్రదాయం సరైనదేనా? 

పొరుగు రాష్ట్రం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకలు రేపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. నిజానికి ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు నుంచే అధికార తెరాస, ప్రథాన ప్రత్యర్ధి బీజేపీ ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నాయి. అక్టోబర్ 2 న నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. అయితే అదే రోజున, అదే షెడ్యూలు ప్రకారం పోలింగ్ జరిగే ఏపీలోని కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గంలో మాత్రం సందడి లేదు. ఎన్నికల వాతావరణం పెద్దగా కనిపించడం లేదు.  సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ  నిర్ణయం తీసుకోవడంతో అంతవరకు అంతో ఇంతో ఉన్నట్టు అనిపించిన ఎన్నికల వేడి, ఒక్కసారిగా చప్పగా చల్లారి పోయింది. అంతకు ముందే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ కూడా అధికార పార్టీ దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట సుబ్భయ్య సతీమణి, దాసరి సుధకు టికెట్ ఇవ్వడంతో, తమ పార్టీ అభ్యర్ధిని నిలపడం లేదని ప్రకటించారు.జనసేన మిత్ర పక్షం బీజేపీ పోటీకి దిగుతామని ప్రకటించినా, రాష్ట్రంలో బీజేపీ బలం సున్నాకు ఎక్కువ నోటాకు తక్కువ,  కాబట్టి, బీజేపీ పోటీని ఎవరూ సీరియస్’గా తీసుకోవడం లేదు. ఆటలో అరటి పండులానే చూస్తున్నారు.అందుకే,అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అన్నట్లుగా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్ధి డాక్టర్ సుధ గెలుపు ఖరారైపోయిన నేపధ్యంలో ఎన్నికల వేడి ఇలా పుట్టి అలా చల్లారి పోయింది.   అధికార పార్టీ అభ్యర్ధి, దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట సుబ్భయ్య సతీమణి, దాసరి సుధ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఏపీ సగర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మ, అనుడా చైర్మన్‌ గురుమోహన్‌, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇంతమంది నాయకులు వెంటవచ్చినా, ఏ ఒక్కరిలోనూ ఉత్సాహం అనేది ఏ కొంచెం కనిపించలేదు.నిజానికి, తెలుగు దేశం పార్టీ అందరికంటే ముందే, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా, ఓబులాపురం రాజశేఖర్’ని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది.  ప్రచారం కూడా ప్రారంభించింది. అయితే, అధికార పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే టికెట్ ఇవ్వడంతో, టీడీపీ పోలిట్బ్యూరో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పార్టీలు పాటించిన సంప్రదాయం ప్రకారం, టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది.  అయితే దివంగత ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులు పోటీచేస్తే, ప్రత్యర్ధి పార్టీలు పోటీకి అభ్యర్ధులను నిలపరాదనే సంప్రదాయం విషయంలో ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మేథావి వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ విధంగా దివంగత ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనే భావన కూడా ఉంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఈ సంప్రదాయం ఏర్పడిందో కానీ,(కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరిని నక్సల్స్ హత్య చేసిన సందర్భంలో ఈ సంప్రదాయం మొదలైనట్లు  గుర్తు) అన్ని సందర్భాలలో ఇదే సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించలేదు, విభజిత రాష్టాలలోనూ  పాటించలేదు. తెలంగాణలో దుబ్బాక,నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో అధికార తెరాస దివంగత ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చింది,  అయినా, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధులను నిలిపాయి. దుబ్బాకలో అయితే,దివంగత ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినా, అక్కడ బీజేపీ అభ్యర్ధి విజయం సాదించారు. నిజానికి, ఒక్క దుబ్బాకలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా దివంగత ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు పోటీ చేసి ఒడి పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సంప్రదాయం విషయంలో పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని అంటున్నారు.  అదలా ఉంటే, ఇప్పుడు బద్వేల్’లో అధికార పార్టీ అభ్యర్ధి గెలుపు ఖరారైన నేపధ్యంలో,వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి  దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు ప్రాజెక్టులను ప్రకటించింది.అదే విధంగా బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేపట్టింది. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ వస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు, అవసరం తీరిపోయింది కాబట్టి  ప్రారంభించిన పనులు, వాగ్దానం చేసిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోతాయని ప్రజలు కూడా అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు.

TOP NEWS @ 7pm

1. రెండు, మూడు నెలల్లో ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని చెప్పారు. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగిందని.. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టామ‌న్నారు కేసీఆర్‌. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామ‌ని.. కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పారు.  2. ఏపీ గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌. ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఆశి ట్రేడింగ్ సుధాకర్ వెనుక ఉన్న వైసీపీ పెద్దలు ఎవరో తేలాలన్నారు. పోలీసులు డ్రగ్స్ విషయంలో ఉద్దేశపూర్వంకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిప‌డ్డారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు డీజీపీ, విజయవాడ సీపీ తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు ధూళిపాళ్ల‌.  3. సీఎం జ‌గ‌న్‌కి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవడంలో.. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం జగన్, వ్యవసాయ శాఖ మంత్రి విఫలమయ్యారని మండిప‌డ్డారు. కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు.  4. అట‌వీ హక్కులు అడిగితే కొట్టడం, అరెస్ట్ చేయడం ఆనవాయితీగా మారిందని.. అడవి బిడ్డలపై అకృత్యాలు పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అటవీ హక్కుల చట్టంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అన్యాయమన్నారు. ఇక‌, ఎమ్మెల్యే సీత‌క్క మాట్లాడుతూ.. అడవులున్న చోటే హరిత హారం పేరుతో భూములు గుంజు కుంటున్నారని.. కేంద్రం మీద నెపం నెట్టి తప్పించుకుంటే ఊరుకునేది లేదని సీతక్క హెచ్చరించారు. 5. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1013 పిటిషన్ల బిల్లులను నాలుగు వారాల్లోగా మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. బకాయిలను 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని తీర్పు వెల్ల‌డించింది.  6. కరెంట్ బిల్లులు కట్టకపోతే ఫైన్‌లు వేస్తారు.. ఫ్యూజులు తీస్తారు.. మరీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే ఏం చేయాలి? అని ఎంపీ ర‌ఘురామ ప్రశ్నించారు. మద్యం సహా ప్రజల బలహీనతలతో ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌ బెయిల్ రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. ధర్మం, న్యాయం కోసం చివరివరకు పోరాడతానని స్పష్టం చేశారు ర‌ఘురామ‌.  7. త‌న‌పై పెట్టిన అవిశ్వాసంపై కాకినాడ మేయ‌ర్ సుంక‌ర పావ‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను చేసిన అభివృద్ధి మిన‌హా రెండేళ్లలో వైసీపీ చేసింది ఏమీ లేదని అన్నారు. న్యాయ పరంగా గెలుపు తనదే అని.. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని మేయర్ పావని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మహిళనైన తనను గద్దె దించేందుకు వైసీపీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ రెడ్డి కంకణం కట్టుకున్నారని మండిప‌డ్డారు. 8. ఉప ఎన్నిక‌ల వేళ‌ హుజురాబాద్‌లో భారీగా డ‌బ్బులు చేతులు మారుతోంది. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.10.40 లక్షలు ప‌ట్టుబ‌డ్డాయి. టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసుల ఆధ్వ‌ర్యంలో జమ్మికుంటలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. ఆ డ‌బ్బు ఎవరిదని పోలీసులు ఆరా తీస్తున్నారు. 9. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని నిర్బంధించిన సీతాపూర్‌‌లోని పీఏసీ గెస్ట్ హౌస్ పైన ఓ డ్రోన్ సంచరించినట్టు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ సంచలన ఆరోపణలు చేశారు. 30 గంటలుగా ఆమెను నిర్బంధంలోనే ఉంచారని, ఆమెను ఉంచిన గదిపైన ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించిందని ట్వీట్ చేసారు. భవంతిపై ఎగురుతున్న డ్రోన్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. 10. ప్ర‌కాశ్‌రాజ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు మంచు విష్ణు. ‘‘ప్రకాశ్‌రాజ్‌ గారు.. ‘మంచు’ ఫ్యామిలీ అంటూ ఇంకోసారి నా కుటుంబం పేరు తీస్తే మీ పేరు పక్కన ‘గారు’ అనేది ఉండదు. మీకు దమ్ము, సత్తా ఉండి.. మగాడు అనుకుంటే నా పేరే తీయండి.. మా అక్క, తమ్ముడు, నాన్నను లాగకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యుల‌పైనాన మండిప‌డ్డారు. 10వ తేదీ తర్వాత మనం ముఖాలు చూసుకోవాలి. 11వ తేదీ ప్రకాశ్‌రాజ్‌ ఫ్లైట్‌ ఎక్కి వెళ్లిపోతారు. మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి. ‘మా’ కుటుంబాన్ని దయచేసి విడగొట్టకండి.. అంటూ మంచు విష్ణు ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. 

హుజూరాబాద్ కోసం అబద్ధాలా? త్వ‌ర‌లో 80వేల ఉద్యోగాలు..

దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని.. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం. పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా? అని అన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. 75 లక్షల మంది దళితులుంటే.. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.    ప్రభుత్వ లైసెన్సు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చాం. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ముఖ్య‌మంత్రి. ఇక‌.. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని చెప్పారు. ‘‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ప్రధానికి మారెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తాం. కేంద్ర సహకరిస్తే ఇంకా బలంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతాం. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉటుంది. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలు అడిగితే ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలన్నారు కేసీఆర్‌.

కేటీఆర్‌కు రేవంత్‌ ఫీవ‌ర్ ప‌ట్టుకుందా? అందుకేనా అలాంటి డైలాగ్స్‌?

మంత్రి కేటీఆర్‌ మునుపెన్న‌డూ లేనంత క‌ల‌వ‌ర‌పాటు ప‌డుతున్నారు. గ‌తంలో ఏ అమావాస్య‌కో, పున్నానికో పొలిటిక‌ల్ స్టేట్‌మెంట్స్ చేసే ఏ-క్లాస్ మినిస్ట‌ర్‌.. ఇప్పుడు డైలీ రెండు మూడు సార్లు రాజ‌కీయంగా ఓ రౌండ్ వేసుకుంటున్నారు. కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌న్నీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గురించే. ఇంత‌కుముందు ఇలా ఉండేది కాదు. క‌నీసం రేవంత్‌రెడ్డి పేరెత్తేందుకు కూడా కేటీఆర్ ఇష్ట‌ప‌డే వారు కాదు. ర‌క‌ర‌కాల వంక‌ర పేర్ల‌తో ప‌రోక్షంగా విమ‌ర్శించే వారు. కానీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక సీన్ మారిపోయింది. కేసీఆర్‌కంటే కేటీఆర్‌నే రేవంత్ ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ.. ఆయ‌న ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేస్తుండ‌టంతో.. చిన‌బాస్ సైతం నోటికి పని చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చిందంటున్నారు. రేవంత్‌రెడ్డి ఎంత‌లా డిస్ట‌ర్బ్ చేసుంటే.. కేటీఆర్ రోజూ ఆయ‌న్ను ఏదో ఒకటి అన‌కుండా ఉండ‌లేని త‌ప్ప‌నిస‌రి పరిస్థితి వ‌చ్చుంటుంది.   తాజాగా కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన నిరుద్యోగ జంగ్ సైర‌న్‌.. బాగా స‌క్సెస్ అవుతోంది. తెలంగాణ‌వ్యాప్తంగా జంగ్‌.. హోరెత్తుతోంది. రేవంత్‌రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో మునుప‌టి ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. మొద‌టిరోజు నిర‌స‌న కార్య‌క్ర‌మాలైతే ఓ రేంజ్‌లో సాగాయి. ఎల్బీన‌గ‌ర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసేందుకు.. పోలీసుల లాఠీలు, ఇనుప కంచెల‌ను కాచుకుంటూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రోజంతా దండ‌యాత్ర చేస్తూనే ఉన్నారు. చివ‌రాఖ‌రికి సాయంత్రానికి శ్రీకాంతాచారి విగ్ర‌హానికి పూల దండ వేసి.. కాంగ్రెస్ జెండా ఎగ‌రేయ‌డంలో విజ‌యం సాధించారు. ఆ ప్ర‌య‌త్నంలో ఖాకీల లాఠీ దెబ్బలు తిన్నా.. ఒంటిమీద వాత‌లు తేలినా.. ఏమాత్రం వెన‌కంజ వేయ‌కుండా తెగువ ప్ర‌ద‌ర్శించారు. ఆ ఎపిసోడ్‌లోనే ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడు, హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ న‌ర్సింగ్‌రావు తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రి పాల‌య్యారు. ఇదంతా రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రేసుగుర్రాల్లా మారిన కాంగ్రెస్ శ్రేణుల తెగువ‌, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు.    రేవంత్‌రెడ్డి దూకుడు, కాంగ్రెస్‌లో ఉత్సాహం చూసి.. కేటీఆర్‌లో తీవ్ర‌ క‌ల‌వ‌రం, అస‌హ‌నం పెరిగిపోయిందంటున్నారు. అందుకే, ఇటీవ‌ల మంత్రి కేటీఆర్‌.. ప‌దే ప‌దే రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నార‌ని భావిస్తున్నారు. రేవంత్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప‌నిలో నోటికి ప‌ని చెబుతున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల కేటీఆర్ చేసిన కామెంట్లు ప‌రిశీలిస్తే....  జంగ్ లేదు.. సైరన్ లేదు.. అది జంగు పట్టిన పార్టీ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ‘తుపాకీ లేదు.. ఉత్తి తుపేల్ పార్టీ’ అని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకొని ఉద్యమకారులపైకి రేవంత్‌రెడ్డి వెళ్లారంటూ పాత విష‌యాల‌ను కొత్తగా కెలుకుతున్నారు కేటీఆర్‌. చంపిసోడే సంతాపం తెలిపినట్టు.. శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్ పూలదండ వేశారని.. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్ అంటూ మంత్రి కేటీఆర్ పేలాల్లా పేలుతున్నార‌ని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా.. రేవంత్‌రెడ్డి దూకుడు చూసి.. కేటీఆర్‌లో క‌లుగుతున్న కంగారేన‌ని భావిస్తున్నారు.   

టాప్ న్యూస్ @ 1PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్‌గా  ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందన్నారు సీఎం. బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్‌ అందించడమే 'స్వేచ్ఛ' ఉద్దేశ్యమన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.---------అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూపురం నియోజకవర్గం రాజుపాలెంలోరైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  ------ జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా  గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం  చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.  -------- సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు బిల్లులతో షాక్ కొట్టేలా చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ట్రూ అప్ పేరుతో ప్రజల జేబులను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ బిల్లులతో దళిత కుటుంబాలు చీకటిలో బ్రతకాల్సి వస్తుందన్నారు. జగ్జీవన్ జ్యోతిని ఆర్పాలనే జగన్ ఆలోచనని, ఉచిత కరెంట్ సంగతి ఎలా ఉన్నా, బిల్లులతో సామాన్యుడు బేజారెత్తిపోతున్నాడని, రైతు మెడకు మీటర్లతో ఉచ్చు బిగుస్తున్నారని మండిపడ్డారు ------- కడప ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారుక్ షిబ్లీ నిర్బంధంపై సమితి నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో మైనారిటీలపై పెరుగుతున్న దాడుల గురించి లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్ఆర్సీ పూర్తి వివరాలు పంపాలని కడప ఎస్పీని ఆదేశించింది ------- లఖీంపూర్‌ ఖేరీ ఘటనను మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. యూపీ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్_ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌ను చూసి షాక్, భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు --------- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద  మాట్లాడుతూ కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ‘‘యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?’’ అని ప్రశ్నించారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని షర్మిల వ్యాఖ్యానించారు.  --------- కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు నిర్వహించారు. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు అటువైపు వెళ్లాలంటే భయపెడుతున్నారు. ఫారెస్ట్‌లో క్షుద్రపూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  ------------- లఖింపూర్ కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం కాదని సమాజ్‌‍వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.మంగళవారం లక్నోలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ తాజా ట్వీట్ చేశారు. రైతులను కోల్పోయిన విషాదంలో యూపీ ఉందని, సెలబ్రేషన్లు జరుపుకునేందు ఇదెంత మాత్రం సమయం కాదని అన్నారు ----------  గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 18,346 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 209 రోజుల్లో అత్యల్ప రోజువారి కేసులు నేడు నమోదవడం గమనార్హం. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902 ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 97.93%గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీరీ వీరీ 'గూగుల్‌'పండు.. ఏపీ రాజ‌ధాని పేరేంటి? దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్‌..

వీరీ వీరీ గుమ్మ‌డిపండు వీరి పేరేంటి? అని చిన్న‌పిల్ల‌లు స‌ర‌దాగా అడుకుంటారు. క‌ళ్లు మూసి ఉంటాయి కాబ‌ట్టి ఆ పేరు చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ, గూగుల్ అలాకాదు. ప్ర‌పంచంలో ఏ విష‌యం గురించి అడిగినా.. గూగుల్‌కు ట‌క్కున స‌మాధానం ఇస్తోంది. అలాంటి గూగుల‌మ్మ‌కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే క్వ‌శ్చ‌న్ ఒకే ఒక్క‌టుంది. అది, ఏపీ రాజ‌ధాని ఏంటి? ఈ ప్ర‌శ్న అడిగితే మాత్రం.. గూగుల్ నేరుగా, సూటిగా ఒక ఆన్స‌ర్ చెప్ప‌లేక పోతోంది. డౌట్ ఉంటే మీరే గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి.. వాట్ ఈజ్ ఏపీ కేపిట‌ల్ అని కొట్టి చూడండి.. త‌మాషా ఏంటో మీకే తెలుస్తుంది.. చూశారుగా.. వాట్ ఈజ్ ఏపీ కేపిట‌ల్ అని గూగుల్ త‌ల్లిని అడిగితే.. నాలుగు ఆన్స‌ర్లు ఇస్తోంది. విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి, క‌ర్నూల్‌. అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నాలుగు రాజ‌ధానులు ఉన్నాయ‌ని గూగుల్ భావ‌న‌. ఇంత‌కుముందు ఇలా వ‌చ్చేది కాదు. ఏపీ కేపిట‌ల్ అని కొడితే.. నేరుగా అమ‌రావ‌తి అని చూపించేది. రాజ‌ధానితో జ‌గ‌న్ మూడుముక్క‌లాట త‌ర్వాతే.. ఇలా నాలుగు పేర్లు చూపిస్తోంది. విశాఖ‌, అమ‌రావ‌తి, క‌ర్నూలుతో పాటు ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని కాబ‌ట్టి.. ప‌నిలో ప‌నిగా హైద‌రాబాద్ పేరునూ చూపిస్తోంది. ఇక‌, వికీపీడియాలోనైతే దేశంతో మూడు రాజ‌ధానులున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ కీర్తిస్తోంది కూడా.    సీఎం జ‌గ‌న్ కేపిట‌ల్ గేమ్‌తో గూగుల్ సెర్చ్ ఇంజ‌నే క‌న్ఫ్యూజ్‌ అవుతోందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధానిని క‌నుమ‌రుగు చేసే కుట్ర‌లో.. జ‌గ‌న్ ఆడిన జ‌గ‌న్నాట‌కంలో.. రాజ‌ధాని నాలుగు ముక్క‌లు అయింద‌నేది గూగుల్ అభిప్రాయం. ఒక‌ప్పుడు ఏపీ కేపిట‌ల్ అని సెర్చ్ చేస్తే.. అమ‌రావ‌తి పేరుతో పాటు.. స‌న్ రైట్ స్టేట్ అంటూ.. అంత‌ర్జాతీయ స్థాయి రాజ‌ధానంటూ.. అద్భుత‌మైన ఫోటోలు, అత్య‌ద్భుత‌మైన రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ న‌మూనాలు గూగుల్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేవి. ఒక్క ఛాన్స్ అంటూ జ‌గ‌న్ రాక‌తో.. ఏపీ ఆగ‌మాగ‌మైంది. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని కుప్ప‌కూలిపోయింది. జ‌గ‌న్ ఆడిన మూడు ముక్క‌లాట‌తో.. రాజ‌ధాని పీలిక‌లు, చీలిక‌లుగా మారి.. ఎటూ కాకుండా.. ఎవ‌రికీ కాకుండా పోయింది. అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు.. పేరుకే రాజ‌ధానులు కానీ.. వీటిలో ఏ ఒక్క న‌గ‌రానికైనా జ‌గ‌న్ హ‌యాంలో అభివృద్ధి కానీ, ప్రాధాన్యం కానీ ద‌క్కిందా?  రాజ‌ధాని కోసం కొత్త‌గా ఒక్క బిల్డింగ్ అయినా క‌ట్టారా? ఒక్క ప్రాజెక్ట్ అయినా చేప‌ట్టారా? మ‌రెందుకీ మూడు రాజ‌ధానులు? ఎవ‌రి బాగు కోసం? ఇంకెవ‌రి నాశ‌నం కోసం? అంటూ సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు.   

సీఎంలను ఏకం చేస్తున్న స్టాలిన్.. మోడీ ప్రభుత్వానికి షాకేనా?

పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తన నిర్ణయాలతో విపక్షాలను సైతం మెప్పిస్తున్నారు. జయలలిత పేర్ల మీద ఉన్న పథకాలను కొనసాగించడం, అమ్మ క్యాంటీన్లను అలాగే కంటిన్యూ చేయడం వంటి నిర్ణయాలు ఆయనను గ్రాఫ్ మరింత పెంచాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న తరహాలో పాలనను అందిస్తూ.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలోనూ గతానికి భిన్నంగా విపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు స్టాలిన్. వ్యక్తిపూజ ఎక్కువగా కనిపించే తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. సభలో తనను పొగిడిన డీఎంకే ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.  తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలనానికి తెర తీశారు.  జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో కేంద్రం ఒత్తిడి పెంచేలా ఆయన తీసుకుంటున్న తాజా చర్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీట్ పై తన వైఖరిని స్పష్టం చేస్తూ  పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖలు రాశారు స్టాలిన్. ఎన్టీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. ఏపీ, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా,పంజాబ్,రాజస్థాన్, తెలంగాణ. పశ్చిమ బెంగాల్ తో పాటు గోవా ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నీట్ ను వ్యతిరేకించటమే కాదు.. విద్యా రంగంలో రాజకీయ ఏకాగ్రతను పొందేందుకు.. అందరూ ఏకతాటి మీద రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతో ఆయనీ లేఖలు రాసినట్లుగా చెబుతున్నారు.  ‘మనంతా ఏకగ్రీవం’ కావటానికి అవసరమైన పరిస్థితుల గురించి లేఖలో ప్రస్తావించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. నీట్ ను వ్యతిరేకించటంతో పాటు.. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. తానే స్వయంగా లీడ్ తీసుకున్నారు. నీట్ కు ప్రత్యామ్నాయంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్ కమిటీ నివేదికను కమిటీ నివేదిక తాను రాసిన లేఖకు జత చేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. తాజాగా తాను టార్గెట్ చేసిన అంశాన్ని సమయానికి తగ్గట్లుగా తెర మీదకు తీసుకురావటం ద్వారా ఆసక్తికరంగా మారింది.  ముఖ్యమంత్రులను ఏకం చేసే విషయంలో తమిళనాడు సీఎం  స్టాలిన్ ఎంతవరకు సక్సెస్ అవుతారు.. స్టాలిన్ చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నీట్ విషయంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వీళ్లంతా స్టాలిన్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అనంతలో మంత్రి అనుచరుల దౌర్జన్యం! బాధిత రైతు సెల్పీ వీడియో వైరల్..

మూడు దాడులు.. ఆరు ఆక్రమణలు.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ ఇలానే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని అంటున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వైసీపీ నేతలు తీరు మారడం లేదు. వైసీపీ గ్రామ స్థాయి నేతల నుంచి మంత్రుల వరకూ అందరికి ఇదే పరిస్థితి. రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై బహిరంగంగా వైసీపీ నేతల లంచగొండులుగా మారిపోయారని కామెంట్ చేశారు.  తాజాగా అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూపురం నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో రైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను, మంత్రి అనుచరుల దౌర్జాన్యాన్ని ఆయన సెల్పీ వీడియోలో వెలిబుచ్చారు.  ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  అనంతపురం జిల్లాలో మంత్రి అనుచరుల అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని  వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా  రాజుపాలెంలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని స్వయంగా మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా  గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం  చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.  

హుజూరాబాద్ లో రేవంత్ వ్యూహం ఇదేనా.. అందరి లక్ష్యం ఒక్కటేనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి? పీసీసీ అధ్యక్ష్ బాధ్యతలు చేపట్టిన తొలిక్షణం నుంచే  తెరాస ప్రభుత్వంతో చెడుగుడు ఆడుతూ, ముఖ్యమంత్రి కంటికి కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ విషయంలో ఎందుకు, ఆస్థాయిలో దూకుడు చూపడం లేదు? ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? చివరకు  అభ్యర్థి ఎంపిక విషయంలోనూ నియోజకవర్గంతో అంతగా పరిచయం లేని, విద్యార్ధి నాయకుడు బల్మూర్ వెంకట్ ను  ఎందుకు బరిలో దింపారు? ఇలా చాలానే ప్రశ్నలు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ మ్యాన్ అనుకున్నమాజీ ఎంపీ కొండ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధికి కాకుండా, బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. నిజానికి విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అభ్యర్ధి ఈటలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, కేసీఆర్’కు వ్యతిరేకంగా,  తమ బృందాన్ని ఈటల తరపున ప్రచారానికి దించారు. దీంతో  రేవంత్ రెడ్డి వ్యూహం విషయంలో అనుమానాలు ఇంకొంత బలపడుతున్నాయి. అలాగే, తెరాస నాయకులు రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్ధి ఈటలతో కుమ్ముక్కయ్యారని ఆరోపిస్తున్నారు.  అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం వెనక దీర్ఘకాల వ్యూహం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  ఈటల ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్న ఉద్యమ స్పూర్తికి ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతే కానీ, కేవలం బీజేపీ అభ్యర్ధిగా మాత్రమే ఆయన పోటీచేయడం లేదు.   హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నమాట నిజం. కానీ, గెలిచేందుకు సరిపడే ఓటు బ్యాంక్ అయితే లేదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ హుజూరాబాద్ లో కనీసం ఒక్కసారి కూడా గెలవలేదు. ఈని సార్లు ఎన్నికలు జరిగినా అన్ని సార్లు, రన్నరప్ గానే సంతృప్తి పడవలసి వస్తుంది. బీజేపీ పరిస్థితి ఇంకా అద్వాన్నం, ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా డిపాజిట్ దక్కిందో లేదో కూడా అనుమానమే. అయితే  మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అనివార్యంగా బీజేపీలో చేరిన ఆ పార్టీ అభ్యర్థి ఈటలకు హుజూరాబాద్ పెట్టని కోట. గత 18 ఏళ్లుగా, అక్కడ నుంచి ఆయనే గెలుస్తున్నారు. ఇలా అన్ని కోణాలలో లెక్కలు వేసిన తర్వాతనే, రేవంత్ రెడ్డి, ప్రధాన శత్రువు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించే లక్ష్యంతోనే హుజూరాబాద్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషణలు వినవస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతి అడుగు, కేసీఆర్ టార్గెట్ గానే ఉంటుందని, ఇది కూడా అందులో భాగంగానే చూడాలని విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలదు,కానీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం వలన తెరాస గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. నిజంగానే, చివరకు తెరాస అభ్యర్ధి గెలిస్తే,  కాంగ్రెస్ పార్టీ అపనిందలు మోయవలసి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి తెరాసను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా హుజూరాబాద్ విషయంలో ఇటు తెరాస నుంచి అటు సొంత పార్టీలోని తెరాస అనుకూల వర్గాల నుంచి, వ్యూహాత్మక  వత్తిళ్ళు వచ్చినా, రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల కంటే, 2023 ఎన్నికలపై దృష్టి నిలిపారని అంటున్నారు.  నిజానికి, కొండా విశ్వేశ్వర రెడ్డి సహా కేసీఆర్’ పాలనను వ్యతిరేకిస్తున్న ఉద్యమ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమనాయకులు అందరూ కూడా, ఈటలను బీజేపీ అభ్యర్ధిగా కంటే, తమ ప్రతినిధి గానే చూస్తున్నారు. అందుకే ఈటలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే, హుజూరాబాద్’ ఉప ఎన్నిక పార్టీలు, అభ్యర్ధుల మధ్య జరుగతున్న ఎన్నిక కాదు, కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరుగతున్న ఉప ఎన్నికగానే, పరిశీలకులు కూడా భావిస్తున్నారు. అలాగే, ఇది కేవలం హుజూరాబాద్ కు పరిమితం అయిన ఉప ఎన్నిక కాదు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికగానే పరిశీలకు ప్రజలు భావిస్తున్నారు. అందుకే, సిద్ధాంత  రాద్దంతాలను పక్కన పెట్టి కేసీఆర్’ను ఓడించడమే లక్ష్యంగానే అందరి అడుగులు పడుతున్నాయని అంటున్నారు.

దసరాకి జీతాలు వచ్చేనా.. పండుగ గడిచేదెలా! 

ఉద్యోగులంతా ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ రోజున వచ్చే వేతనం కోసమే వాళ్ల వెయిటింగ్. జీతం రాగానే నెలసరి బడ్జెట్ సెట్ చేసుకుని ఖర్చు చేసేస్తుంటారు. ఒకటో తేదీతో వాళ్ల జీవితాలు అలా ముడిపడి ఉంటాయి. ఈఎమ్ఐలు, నిత్యావసరాల కొనుగోళ్లు ఇతరత్రా పనులన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి. గతంలో ఠంచన్ గా ఒకటో తారీఖే జీతాలు రావడంతో.. ఆ రోజుకే అందరూ అలా సెట్ చేసుకున్నారు. కాని కొన్ని రోజులుగా సీన్ మారిపో.యింది. ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో వేతనాలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సార్లు 15వ తారీఖు వరకు కొందరు ఉద్యోగులకు సాలరీలు అందడం లేదు. గతంలో రాష్ట్రమంతా ఒకేసారి వేతనాలు ఇచ్చేవారు. కాని ప్రస్తుతం జిల్లాకోరోజు... ఇంకా చెప్పాలంటే శాఖల వారీగా ఒక్కోరోజు వేతనాలు జమ చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో తమ వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉంటున్నారు. మొదటి వారంలోనే ఈఎమ్ఐలు కట్టాల్సిన వాళ్లు అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.  తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకలు దసరాకి స్పెషల్. ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలు పేర్చి ఆడిపాడుతారు. దసరా ఉత్సావాలు ఆరవ తేదీ బుధవారం నుంచి మొదలవుతున్నాయి. కాని ఉద్యోగులకు వేతనాలు మాత్రం ఇంకా అందలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు ఆలస్యమవుతున్నాయి. ఆగస్టు జీతాన్ని సెప్టెంబరు 6 వరకు చెల్లిస్తూ వచ్చారు. బతుకమ్మతో పాటు దసరా ఉన్నందున కనీసం సెప్టెంబరు వేతనాన్ని అయినా అక్టోబరు 1న లేదా 4న చెల్లిస్తారని ఉద్యోగులు ఆశించారు. కానీ సోమవారం వరకు ఏడు జిల్లాలవారికే అందాయి. మిగితా 27 జిల్లాల వారికి ఎప్పుడు ఇస్తారన్నది క్లారిటీ లేదు. బతుకమ్మ నేపథ్యంలో.. ఈసారి కాస్తముందుగా అయినా జీతాలు వస్తాయని ఆశించిన మహిళా ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. అతిపెద్ద పండుగ అయిన దసరా ముందు కూడా ఆలస్యంగా ఇవ్వడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐకి వెళ్లిన సంకేతాల మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్‌ జిల్లాల ఉద్యోగులకు మాత్రమే సోమవారం వేతనాలు, పెన్షన్లు జమయ్యాయి. మిగతా 26 జిల్లాల వారికి ఎప్పుడు అందుతాయో, ఏ జిల్లావారికి ముందుగా అందుతాయో ఇంకా స్పష్టత లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రాబడి పెరిగినందున ఈసారైనా 1వ తేదీన చెల్లిస్తారని అనుకుంటే ఎందుకు చెల్లించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు కోసం ఉద్యోగులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారని, వాటికి నెల వాయిదాలు కట్టాల్సి ఉంటుందని అంటున్నారు. కొంతమంది పిల్లలకు ఫీజులు చెల్లిస్తుంటారని, అద్దె ఇళ్లలో ఉండేవారికి మరీ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇలాంటివాటికి వేతనాలపైనే భరోసా ఉంచుతామని.. కానీ అవి ఎప్పుడు చేతికందుతాయో తెలియని అయోమయం నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు.  30 ఏళ్లుగా ఒకటో తేదీన ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తూ వచ్చాయని,  ఇప్పుడే విధానం మారిందని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు పెదవి విప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంతో వివాదం ఎందుకన్న ధోరణితో తప్పించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా ప్రభుత్వం కూడా జీతాలు ఆలస్యంగా మంజూరును తీవ్రంగా తీసుకోవడం లేదని తెలిపారు. దసరాకు దుస్తులు, ఇతర వస్తువులు కొనాల్సి ఉంటుందని కొందరు వివరిస్తున్నారు. పెద్ద పండుగ ముందైనా వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం దురదృష్టమని మండిపడుతున్నారు. 

పర్యాటకులను మోసం చేస్తే జైలుకే.. కొత్త చట్టానికి ఆమోదం

పర్యాటకుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ చట్ట ప్రకారం పర్యాటకులను మోసం చేస్తే జైలుకు వెళ్లేలా కఠిన చట్టాలను బిల్లులో పొందు పరిచారు. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వాళ్ల భద్రత కోసమే కొత్త బిల్లును తీసుకొచ్చామని టీఆర్ఎస్ సర్కార్ ప్రకటించింది.  రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే వారిపై కఠినచర్యలు తీసుకొనేలా చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును సోమవారం అసెంబ్లీలో మంత్రి మహమూద్‌ అలీ ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పర్యాటకులు, ప్రయాణికులను మోసంచేయడం, దురుసుగా ప్రవర్తించడం, దళారీతనానికి ప్రయత్నించడం వంటి చర్యలను నిరోధించడమే దీని లక్ష్యం.  కొత్త బిల్లు ప్రకారం.. పర్యాటకులను మోసంచేసిన వారికి 10 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మోసాన్ని ప్రేరేపించిన వారికి ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా వేస్తారు. మోసగించేందుకు ప్రయత్నించిన వారికి 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దీనితోపాటు సీఎం కేసీఆర్‌ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రవేశపెట్టిన తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో పర్యాటకన అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నదిలో 160 కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉంటున్నదని.. అద్భుత సుందర దృశం ఆవిష్కృతమవుతున్నదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు విద్యుత్తు, వ్యవసాయం, సాగు, తాగునీరు మీద దృష్టి పెట్టడం వల్ల పర్యాటకం, చారిత్రక ప్రదేశాలపై అంతగా దృష్టి పెట్టలేదన్నారు. అన్ని జిల్లాల శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రతిపాదనలు అందించాలని సూచించారు. వాటన్నింటిపై చర్చించి అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక పరంగా కోటలు, బురుజులు విశిష్ట దేవాలయాలు, ప్రాకృతిక ప్రాంతాలు ఇలా అన్ని ప్రముఖ ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.