ఈటల రాజేందర్ పై దాడికి టీఆర్ఎస్ కుట్ర? హుజురాబాద్ లో కలకలం.. 

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అదే సమయంలో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు లీడర్లు. కొన్ని రోజులుగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఉప ఎన్నిక ప్రచారంలో దాడులు జరగవచ్చనే వాదన రావడం కలకలం రేపుతోంది.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్‌పై దాడి జ‌రుగబోతోందంటూ కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  టీఆర్ఎస్ నేతలు ఇదే చెబుతున్నారు. అయితే ఓట్లర్లలో సానుభూతి కోసం ఈటల తనపై తానే దాడి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించి సంచలనానికి తెరతీశారు ఎమ్మెల్యే బాల్కసుమన్.  కోడి క‌త్తి దాడి త‌ర‌హాలోనే రాజ‌కీయంగా లాభ‌ప‌డ‌టానికి ఈట‌ల‌నే.. త‌న‌పై తాను ఈ దాడి చేయించుకోబోతున్నారంటూ ప్ర‌చారం అవుతుండ‌టం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతోంది.  తనపై జరుగుతున్న ప్రచారంపై ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డుతున్నారు. కావాల‌నే త‌న‌పై ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 13, 14 తేదీలలో తన మీదన తానే దాడి చేయించుకుంటున్నా.. అంటూ మంత్రులు అంటున్నారని.. దీని వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. తన మీద దాడికి అధికార పార్టీ నేత‌లు ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు హుజురాబాద్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని అన్నారు. తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. తాను గన్ మెన్‌లపై ఆధారపడి ఉండలేదని, తనలాంటి వాళ్లను కాపాడుకునే కర్తవ్యం తెలంగాణ ప్రజలకు ఉందని ఈటల అన్నారు. ఉద్యమాలు చేసినప్పుడు.. ఇప్పుడూ అలాగే ఉన్నామని స్పష్టం చేశారు.  నీచమైన కార్యక్రమాలకు టీఆర్ఎస్ నేతలు పాల్పడడుతున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని విమర్శించారు.  హుజురాబాద్‌లో టీఆర్ఎస్ రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ధర్మంగా కొట్లాడాలన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు.    

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే విజయం! ఏపీ లేటెస్ట్ సర్వేలో సంచలనం.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుందని ఇటీవల వెల్లడైన కొన్ని సంస్థల సర్వేల్లో తేలింది. ఇండియా టుడే లాంటి జాతీయ ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేలోనూ ఏపీ సీఎం జగన్ ర్యాంక్ దారుణంగా పడిపోయింది. ఏపీ జనాలు కూడా ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అధ్వాన్న రోడ్లు, పతనమైన ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు క్షీణించడం, మహిళలపై పెరిగిపోతున్న దాడులు, ఉద్యోగాల భర్తీ లేకపోవడం వంటి అంశాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. కొన్ని రోజులుగా సీఎం జగన్, వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందనే చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే సాగుతుందని తెలుస్తోంది.  తాజాగా ఎన్నికల సర్వేల్లో ఖచ్చితమైన అంచనాలు ఇస్తుందనే పేరున్న ఆత్మ సాక్షి సంస్థ నిర్వహించిన సర్వేలోనూ సంచలన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థ‌లుగా పేరుగాంచిన ఐఐటీల్లో విద్య‌న‌భ్య‌సించిన నిపుణుల ఆధ్వ‌ర్యంలో ఈ సర్వే జ‌రిగింది. ఏపీలో జ‌గ‌న్ పాల‌న రెండున్న‌రేళ్లు పూర్తి కావ‌స్తోంది. అంటే.. జ‌గ‌న్ త‌న ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో ఇప్ప‌టికే స‌గం మేర పాల‌న‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ఆత్మసాక్ష్మి సంస్థ సర్వే జరిపింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగేతే ఏపీలో టీడీపీదే విజయమని ఆ సర్వేలో తేలింది. ఆత్మ సాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతానికి వైసీపీ కంటే టీడీపీకి మూడు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు.  2019 ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ సీట్ల‌లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఏక‌ంగా 151 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. పోలైన మొత్తం ఓట్ల‌లో దాదాపుగా 50 శాతం ఓట్ల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైన‌ టీడీపీకి 39 శాతం మేర ఓట్లు వ‌చ్చాయి. అంటే. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల‌లో 11 శాతం తేడా ఉంది. అయితే జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న ముగుస్తున్న సమ‌యానికి ఆత్మ సాక్షి సంస్థ సర్వే ప్రకారం  వైసీపీ నుంచి 4.5 శాతం ఓటర్లు దూర‌య్యారు. వీరంతా విప‌క్ష టీడీపీ వైపు మ‌ళ్లారు. దీంతో ఇప్పుడు టీడీపీకి ద‌క్కే ఓట్ల శాతం 43.5 శాతానికి పెరిగింది. వైసీపీ ఓట్ల శాతం 45.5 శాతానికి ప‌డిపోయింది. అంటే.. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 2 శాత‌మే. అయితే ఆత్మ సాక్షి సర్వేలో 4.75 శాతం మంది ఓట‌ర్లు ఎవ‌రి ప‌క్షం వ‌హించలేదు. అంటే ఈ 4.75 శాతం మంది ఓటర్లు ఎవరి వైపు అయినా మళ్లవచ్చు.  జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నాల్లో భారీగా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో త‌ట‌స్థంగా ఉన్న ఈ 4.75 శాతం ఓట‌ర్లు టీడీపీ వైపున‌కు తిరిగే ఛాన్సే ఎక్కువ‌ అంటున్నారు. అదే జ‌రిగితే.. టీడీపీకి ప‌డే ఓట్ల శాతం 48.25 శాతానికి చేరుతుంది. వైసీపీ ఓట్ల శాతం మాత్రం 45.5 శాతం దగ్గరే ఉండనుంది, ఈ లెక్కన  వైసీపీ కంటే కూడా దాదాపు 3 శాతం మేర ఓట్ల‌ను అధికంగా సాధించ‌నున్న టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుంది. జగన్ పాలనపై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఎన్నికల సమయానికి ఓట్ల మార్జిన్ భారీగా పెరుగుతుందని, టీడీపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆత్మ సాక్షి సర్వేను విశ్లేషించిన తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు.  ఆత్మసాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 46 మంది ఓడిపోవ‌డం ఖాయమని తేలింది. వీరిలో 11 మంది మంత్రులు కూడా ఉన్నారు. వైసీపీ ఎంపీలుగా గెలిచిన 23 మందిలో 7 మంది ఏం చేసినా కూడా తిరిగి గెల‌వ‌రట. ఓట‌మి అంచుల్లో ప‌య‌నిస్తున్న మంత్రులు ఏకంగా 11 మంది ఉంటే.. వారిలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. హోం మంత్రిగా కొన‌సాగుతున్న మేక‌తోటి సుచ‌రిత‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప‌శ్రీవాణి, రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ ఉన్నారు. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి శంక‌ర‌నారాయణ‌, కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వ‌నిత‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు, జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ ఓడిపోతారని ఆత్మ సాక్షి సంస్థ సర్వేలో తేలింది. ఆత్మసాక్షి  సర్వే ప్రకారం ఓట‌మి దిశ‌గా సాగుతున్న ఎంపీల్లో బెల్లాన చంద్ర‌శేఖ‌ర్(విజ‌య‌న‌గ‌రం), ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌(విశాఖ‌ప‌ట్నం), మార్గాని భ‌ర‌త్ రామ్‌(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం), ర‌ఘురామ‌కృష్ణ‌రాజు(న‌ర‌సాపురం), నందిగం సురేశ్‌(బాప‌ట్ల), గోరంట్ల మాధ‌వ్‌(హిందూపురం), చింతా అనురాధ‌(అమ‌లాపురం), సంజీవ్ కుమార్‌(క‌ర్నూలు) ఉన్నారు. వైసీపీ పాలన రెండున్నర ఏండ్లు పూర్తైన సమయంలో నిర్వహించిన ఆత్మసాక్షి సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీ నేతలను, సీఎం జగన్ రెడ్డిని కలవరానికి గురి చేస్తున్నాయని తెలుస్తోంది

బ‌ద్వేల్‌తో బీజేపీకి జ‌న‌సేన‌ రాం రాం.. టీడీపీకి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ద‌గ్గ‌ర‌వుతున్నారా?

బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య విభేదాలు. ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌తో దానిపై మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. బ‌ద్వేల్ బై ఎల‌క్ష‌న్‌లో పోటీ చేసేది లేదంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తేల్చి చెప్పేశారు. బీజేపీ మాత్రం తాము బ‌రిలో నిలుస్తామ‌ని చెబుతోంది. ఇలా ఎవ‌రికి వారే.. వేరు వేరు పొలిటిక‌ల్ స్టాండ్స్ తీసుకోవ‌డం.. ఆ రెండు పార్టీలు బ్రేక‌ప్ చెప్ప‌బోతున్నాయ‌నే వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది.  తిరుప‌తి ఎంపీ ఉప‌ ఎన్నిక‌ల్లోనే బీజేపీ-జ‌న‌సేన‌ల మైత్రికి బీట‌లు వారాయి. తిరుప‌తిలో ఆ రెండు పార్టీలు క‌లిసే పోటీ చేసినా.. ఒకే ఒక్కరోజు మాత్ర‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య సంబంధాలు మ‌రింత దిగ‌జారిపోయాయి. క‌డ‌ప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హ వివాదంలో జ‌న‌సేన క‌ల‌గ‌జేసుకోలేదు. తాజాగా, ప‌వ‌న్‌కల్యాణ్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య ఆన్‌లైన్ టికెట్ల గొడ‌వ ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నా.. ప‌ర‌స్ప‌రం బూతులు తిట్ట‌కుంటున్నా.. క‌మ‌ల‌నాథులు పీకేకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు. ఇలా కొంత‌కాలంగా ఎవ‌రి రాజ‌కీయం వారిదే. మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన‌ధికారికంగా జ‌న‌సేన‌-టీడీపీ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుని ప‌లుస్థానాలు గెలుచుకోవ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్.  బ‌ద్వేల్ బైపోల్‌తో బీజేపీ-జ‌న‌సేన‌ల విభేదాలు మ‌రోసారి వెలుగుచూశాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు త‌మ‌ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధా.. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌లు బ‌రిలో నిలిచారు. మ‌రి, బీజేపీ-జనసేన కలిసి అభ్యర్థిని బరిలోకి దింపుతాయా..? లేదా..? అనే విషయంపై ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గా.. బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ విష‌యాన్ని తేల్చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వటంతో.. తాము పోటీ చేయబోమని జనసేన ప్రకటించడం ఆస‌క్తిక‌రంగా మారింది.  బీజేపీతో చ‌ర్చించ‌కుండానే జ‌న‌సేన ఈ నిర్ణ‌యం తీసేసుకుంద‌ని అంటున్నారు. ఓవైపు బ‌ద్వేల్‌లో పోటీ చేసి.. బ‌లం నిరూపించుకోవాల‌ని బీజేపీ బ‌లంగా భావిస్తోంది. ఇటీవ‌ల క‌డ‌ప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఎపిసోడ్‌తో బీజేపీకి మైలేజ్ పెరిగింద‌ని.. ఆ టెంపో కంటిన్యూ చేసేలా ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందులోనూ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో మ‌రింత ప్రాధాన్యంత పెరిగింది. ఇలాంటి కీల‌క త‌రుణంలో.. బీజేపీకి స‌పోర్ట్ చేయ‌కుండా.. జ‌న‌సేన హ్యాండ్స‌ప్ అన‌డం ఆ పార్టీకి మింగుడుప‌డ‌ని అంశం. బీజేపీపై కొంత‌కాలంగా గుర్రుగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. కావాల‌నే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని క‌మ‌ల‌నాథులు అనుమానిస్తున్నారు. ముందుగా ఇరు ప‌క్షాలు క‌ల‌సి చ‌ర్చించుకోకుండా.. ఓ ఏకాభిప్రాయానికి రాకుండా.. స‌డెన్‌గా బ‌హిరంగ వేదిక‌పై ఇలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే.. బీజేపీని పీకే పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది స్ప‌ష్టం అవుతోంది. జ‌న‌సేన త‌ట‌స్థంగా ఉండ‌టం ఎవ‌రికి లాభం? అంటే,, నిస్సందేహంగా టీడీపీకే ప్ర‌యోజ‌నం అంటున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీకి ఓటు వేయ‌రు. ఇక బీజేపీతో విభేదాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో.. ఆ పార్టీకి స‌పోర్ట్ చేయ‌రు. ఇక మిగిలింది టీడీపీ మాత్ర‌మే. క్రిందిస్థాయిలో ఇప్ప‌టికే జ‌న‌సేనికులు, తెలుగు త‌మ్ముళ్లు కులిసి మెలిసి రాజ‌కీయం చేస్తున్నారు. ఇప్పుడు బ‌ద్వేల్‌లో జ‌న‌సేన న్యూట్ర‌ల్‌గా ఉంటే.. ప‌వ‌న్ అభిమానులంతా బీజేపీకి కాకుండా టీడీపీకే ఓటేసే ప‌రిస్థితి ఉంటుంది. ఈ విష‌యం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలియంది కాదు. టీడీపీపై జ‌న‌సేన‌కున్న సాఫ్ట్ కార్న‌ర్‌తోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.  బీజేపీతో చ‌ర్చించ‌కుండా బ‌ద్వేల్ బ‌రి నుంచి జ‌న‌సేన త‌ప్పుకోవ‌డం.. ఆ పార్టీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ దూర‌మ‌వుతున్నార‌నే అనుమానానికి మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. టీడీపీపై జ‌న‌సేన ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల టీడీపీని, క‌మ్మ వ‌ర్గాన్ని వైసీపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోందంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మండిప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌చార‌మే నిజ‌మైతే.. టీడీపీ-జ‌న‌సేన‌ల మైత్రి మ‌రోసారి చూడొచ్చు. ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...

టాప్ న్యూస్ @ 1PM

రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు --------- వైఎస్ జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా 25 వేల కోట్ల అప్పులు తేవడానికి విశాఖలోని విలువైన ప్రభుత్వ భూములను రాత్రిపూట తనఖా పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై విష్ణుకుమార్ మాట్లాడుతూ.. ‘జగన్ సర్కార్.. టెంపరరీ ప్రభుత్వం’ అని వ్యాఖ్యానించారు.  ---------  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు.వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలనే వ్యాఖ్యలను సమర్ధిస్తున్నామన్నారు. దానికి పవన్ సారథ్యం వహించడం స్వాగతిస్తున్నామన్నారు.  ----------- నెల్లూరు రూరల్ పరిధిలో గల నక్కా గోపాల్ నగర్‌లో పేదల గుడిసెలు తగలబడ్డాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు గుడిసెలకు నిప్పటించినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంత కాలంగా స్థానికంగా నివాసముంటున్న దళితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇలా గుడిసెలు తగలబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ----- ఎంజే నాయుడు హాస్పటల్స్ ఆధ్వర్యంలో దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్ విజయవాడ బెంజిసర్కిల్ నుంచి స్టేడియం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగర సిపి శ్రీనివాసులు వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక నూతన విధానాలను అమలు‌ చేస్తుందన్నారు. -------- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటలపై ప్రభుత్వం వేటు వేయడంతో ఆయన రాజీనామా చేశారు.  ----  స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కొత్త చీరలు కొనిచ్చి అవ్వ-అయ్యా, అత్తా-మామ, భర్త కూడా అవుతుండని కామెంట్ చేశారు. లింగాల ఘనాపూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  -------- తెలుగు అకాడమీకి సంబంధించిన రూ. 43 కోట్ల నిధులు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదట 43 కోట్ల నిధులే అనుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తుల డిపాజిట్లను ముఠా కొట్టేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రూ.54 కోట్లతో పాటు ఇతరుల డిపాజిట్లు కూడా మస్తాన్‌వలీ ముఠా కాజేసింది ----------- రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ ఏడాది మొదట్లోనే బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఢిల్లీలో 'బందీ'గా ఉంచారంటూ వ్యాఖ్యానించారు. నెలల క్రితమే బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆయన న్యూఢిల్లీలో నిర్బంధంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ చీఫ్‌ కావాలనుకుని కలలు కంటున్న కొందరు వ్యక్తులు పార్టీలో ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. ------ స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చ‌ేసింది. నాగ చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న‌ పేరును స‌మంత అక్కినేనిగా మార్చుకోగా, కొన్ని నెల‌ల క్రితం అక్కినేని పేరును తొల‌గించింది. త‌న పేరును 'ఎస్' గా పెట్టుకుంది. త‌న పేరులో మొద‌టి అక్ష‌రాన్ని మాత్ర‌మే ఆమె ఉంచింది.  చైతూతో విడిపోతున్నాన‌ని ఆమె అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత మ‌ళ్లీ  'ఎస్' అక్ష‌రాన్ని తొల‌గించి 'స‌మంత'గా మార్చేసుకుంది. --- ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు  

ఆప్ఘన్ డ్రగ్స్ దందా వెనుక విజయసాయి రెడ్డి? బిగ్ బాస్ డైరెక్షన్ లోనే మాఫియా..? 

ఆప్ఘనీస్తాన్ నుంచి ఏపీలోని విజయవాడ అడ్రస్ తో రవాణా అవుతూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కేసులో విచారణ కొనసాగుతోంది. దాదాపు 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ కావడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. డ్రగ్స్ దందా వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. డీఆర్ఐ విచారణలోనూ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన హెరాయిన్ విజయవాడకు రవాణా అవుతుండటంతో ఏపీలో పెను సంచలనమైంది. మచిలిపట్నంతో పాటు కాకినాడ పోర్టులు డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆప్ఘనీస్తాన్ నుంచి రవాణా అవుతున్న డ్రగ్స్ దందా నడిపిస్తున్న మాఫియాకు ఏపీలోని అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకయ్య సంచలన ఆరోపణలు చేశారు.  రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని ఆయన ఆరోపించారు. మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు బుద్దా వెంకన్న. ఈ నేపథ్యంలో వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తెలియవచ్చిందన్నారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్ వ్యవహారం గుట్టుమట్లు బయటపడతాయన్నారు.  డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూ ఆక్రమణల్లో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్‌కు సహకరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బిగ్ బాస్‌కు తెలియకుండా విజయసాయిరెడ్డి ఏమీ చేయరనేది వాస్తవమన్నారు. ఈ విషయం గ్రామాల్లో అరుగుల మీద కూర్చునే ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం విజయసాయి అక్రమార్జన, అవినీతి గుట్టుమట్లను చేధిస్తుందన్నారు. ఏ2 చేసిన అవినీతికి శిక్షలు వేయాలంటే రాజ్యాంగంలో ఇప్పుడున్న శిక్షలు సరిపోవని బుద్దా వెంకన్న అన్నారు. 

కేసీఆరే అందరికి భర్త అయ్యాడట.. నోరు జారిన ఎమ్మెల్యే రాజయ్య! వైరల్ వీడియో..

వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యే టి.రాజయ్య మాట జారారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. జనగామ జిల్లా లింగాలఘణపురంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.  ఎమ్మెల్యే రాజయ్య ఏమన్నారంటే.. ‘బాలింత మహిళలు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చే సూట్‌కేసు పిక్కుటంగా ఉంటది. దాని జిప్‌ తియ్యంగానే బాలింత చీరలు బయటపడుతాయి. మెత్తటి పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్‌లు, తుడుచుకునేందుకు తువ్వాలలు ఉంటాయి. ఎనుకట ముక్కిపోయిన బట్టలు తీసుకుని ముసలోళ్లో, అవ్వగారొళ్లో, నాయనమ్మ బాపమ్మలు పట్టుకొని వచ్చేవారు. సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని నేను ఎందుకు అంటున్నానంటే కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు.. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అయితున్నాడు.. అమ్మా, అయ్యా కేసీఆరే అయితుండు.. భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు’ అని  రాజయ్య చెప్పారు.  కేసీఆరే అందరికి భర్త అయ్యాడంటూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే మట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జారిన ఆ మాట చర్చకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్లు వివాదాస్పమయ్యాయి.    

తెలంగాణలో త్రికోణం తప్పదా? రేవంత్ రాకతో మారిన సీన్.. 

భారతీయ జనతా పార్టీ - బీజేపీ - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలిమజిలీ చేరింది. తొవిడత పాదయాత్ర శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది.ఈ సందర్భంగా హుస్నాబాద్’లో ఏర్పాటు చేసిన బహిరణ సభలో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా కేంద్ర,రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తానికి 36 రోజుల పాటు సాగిన బండి సంజయ్ తొలి విడత పాదయాత్ర ఆశించిన విధంగా ఉప ఎన్నిక జరుగతున్న హుజూరాబాద్’ లో ఎంటర్ కాకుండానే, ఉప ఎన్నికల నగారా మోగింది. దీంతో హుజూరాబాద్’ బదులుగా హుస్నాబాద్’లో ముగింపు సభ జరిగింది. నిజానికి, బండి పాదయాత్ర హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని చేసిన పాదయాత్ర కాదు.2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర ప్రజాసంగ్రామ యాత్ర.  అయితే ఈ పాదయత్ర సక్సెస్ అయిందా అంటే, అయిందనే బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పాదయాత్ర లక్ష్యం, 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అయితే, అది ఇంతటితో, తొలి మజిలీతో తేలే విషయం కాదు. తెలంగాణలో అధికారం అనేది, బీజేపీకి, ఆ మాట కొస్తే, బీజేపే కంటే మరో పది మెట్లు ముందున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సుదూర స్వప్నం. నిజానికి, ఈరోజు ఉన్న  పరిస్థితిని గమనిస్తే, సీట్ల సంఖ్య, ఓట్ల శాతం లేదా పాపులర్ పర్సెప్షన్’ ఏది చూసినా,తెరాస, కాంగ్రెస్ పార్టీల తర్వాత మూడవ స్థానంలో బీజేపీ ఉంది. అంటే, బీజేపీ డైరెక్ట్’గా తెరాసతో తలపడాలి అంటే కాంగ్రెస్’ను వెనక్కి నెట్టి, బీజేపీ ... మరో మెట్టు పైకి ఎక్కవలసి ఉంటుంది. నిజానికి, ప్రజా సంగ్రామ యాత్ర తొలి గమ్యం కూడా అదే. అయితే, ఒక్కప్పుడు అయితే ఏమో కానీ,రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అది అంత ఈజీ టాస్క్ కాదు. రేవంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో   రాజకీయ  సమీకరణలు  వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్ళిన నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు  ఎవరూ వెనక్కి రాకపోయినా వలసలు అయితే ఆగిపోయాయి. పార్టీ పట్ల నాయకుల్లోనే కాదు, ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది.  నిజానికి, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి చిట్ట చివరగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల  ఫలితాలను గమనిస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఒక సీటు ఎక్కువగా \ నాలుగు సీట్లు దక్కాయి. కానీ, ఓట్ల లెక్కలలోకి వస్తే, కాంగ్రెస్,బీజేపీల మధ్య పది శాతం వరకు ఓట్ల వ్యత్యాసం వుంది.బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి పది శాతం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్’కు 29.48 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి వచ్చిన ఓట్లు 19.49 శాతం. తెరాస ఏకంగా 41.29 శాతం ఓట్లతో అందనంత ఎత్తులో ఉంది. సో.. రానున్న రెండేళ్లలో, బీజేపీ, ఇప్పుడున్న బలాన్ని రెట్టింపు చేసుకుంటేనే గానీ,  అధికారం కోసం నేరుగా తెరాసతో తలపడే  పరిస్టితి రాదు.  అలాగని అది అసాధ్యమా అంటే కానే కాదు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్ర పక్షం ఆర్జేడీ అన్నట్లుగా సింకింగ్ బోటు.. మునుగుతున్న పడవ.. బీజేపీ రాష్ట్రంలో ఎలా ఉన్నాజాతీయ స్థాయిలో అక్కడా ఇక్కడా చిన్న చిన్న ఎదురుదెబ్బలు తిన్నా ఎదుగుతున్న పార్టీ ... ఈశాన్య రాష్ట్రాలలో జీరో నుంచి మొదలు పెట్టి కాంగ్రెస్ కంచుకోట అస్సాం, వామ పక్షాల ఎర్ర కోట త్రిపుర సహా మొత్తం ఏడు రాష్ట్రాలలో పాగా వేసింది. అయితే, బీజేపీ  అక్కడ అలా విజయం సాధించింది కాబట్టి, ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది, అనుకోవడం పొరపాటే అవుతుంది. నిజానికి, ఎన్నికల లెక్కలు, ప్రతి ఎన్నికకు మారి పోతూనే ఉంటాయి. ఇదే బీజేపీకి ఇదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీటు ఒకటి, పువ్వు గుర్తుకు పోలైన ఓట్లు  7.1 శాతం. కానీ సంవత్సరం తిరగకుండానే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఏకంగా 12 శాతం మేర పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటుకు పరిమిత మయిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు, అంటే ఇంచుమించుగా 25 అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యతను సాధించింది.  కాబట్టి ఎన్నికల లెక్కలు ఎన్నికల లెక్కలే ... ఆ సమయానికి ఉన్న  లెక్కలను బట్టి ఫలితాలు ఉంటాయి .. తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయముంది. సో .. ఇపుడే లెక్కలు తీయడం.. టూ ఎర్లీ .. తొందరపాటు అవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితి ఇలాగే, కొనసాగితే మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.

ఇదెక్కడి దౌర్భాగ్యం! గాంధీజీకి నివాళి అర్పించని  కేసీఆర్.. 

మహాత్మ గాంధీ.. భారతదేశ జాతిపిత.. బాపూజీ జయంతిని దేశమంతా పండుగలా నిర్వహిస్తారు. పల్లె నుంచి పట్నం వరకూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడుకలు జరుపుతారు. గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని దేశ రాష్ట్రపతి, ప్రధాని వరకూ అంతా గాంధీజీకి నివాళి అర్పిస్తారు. బాపూజీ 152వ జయంతి సందర్భంగా శనివారం దేశమంతా వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని బాపూజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణా శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు నివాళులర్పించారు. దేశానికిమహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనను స్మరించుకున్నారు. దేశమంతా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మాత్రం మొక్కుబడిగా నిర్వహించారు. హైద‌రాబాద్ లోని బాపూఘాట్ వ‌ద్ద ప్ర‌తి ఏటా సీఎం, ప్ర‌జా ప్రతినిధులు, మేధావులు వ‌చ్చి నివాళి అర్పించ‌టం ఆన‌వాయితీ. ప్రతి ఏటా ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేవారు. కాని ఈసారి మాత్రం గాంధీ జయంతిని తూతూమంత్రంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాపూఘాట్ కే రాలేదు. గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బాపూఘాట్ లో గాంధీజీకి నివాళి అర్పించారు. గాంధీకి నివాళి అర్పించడానికి కేసీఆర్ రాకపోవడంతో అందరిని షాక్ కు గురి చేసింది.  గాంధీ జయంతి సందర్భంగా బాఫూఘాట్ కు రాని కేసీఆర్.. కనీసం ఇంట్లో అయిన నివాళి అర్పించిన‌ట్లుగా బ‌య‌ట‌కు స‌మాచారం లేదు. అంతేకాదు బాపు ఘాట్ లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కే ఏర్పాట్ల‌ను అధికారులు తొల‌గించారు. గాంధీ జ‌యంతి రోజున ఆయ‌న మ్యూజియంను మూసివేశారు. గాంధీ జయంతి రోజున టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జాతిపితకు నివాళి అర్పించడానికి సీఎం కేసీఆర్ బాపూఘాట్ రాకపోవడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది. జాతిపిత గాంధీకి పూల‌దండ వేసే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా…? అని  కాంగ్రెస్ సీనియర్ నేతలు  వీహెచ్, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. గాంధీని కేసీఆర్  అగౌర‌వ ప‌రుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సీఎంను గ‌తంలో ఎప్పుడూ చూడలేదన్నారు  కాంగ్రెస్  నేత‌లు. తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌న్నారు. 

వైసీపీకి జనసేన సపోర్ట్! బద్వేలుపై పవన్ కల్యాణ్ సంచలనం..

ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అధికార వైసీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో శ్రమదానం నిర్వహించిన పవన్.. తర్వాత జరిగిన సభలో వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే రాజమండ్రి నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చిన జనసేనాని.. అక్కడి సభలో మాత్రం సంచలన నిర్ణయం ప్రకటించారు. వైసీపీకి ఊరటనిచ్చే ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతోంది. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. బైపోల్ నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ దివంగత ఎమ్మెల్యే సతీమణిని తమ అభ్యర్థిగా ప్రకటించగా... గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ ను మళ్లీ బరిలోకి దింపుతోంది టీడీపీ. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. తిరుపతిలో బీజేపీ పోటీ చేసినందున.. బద్వేలులో జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని కూడా వార్తలు వచ్చాయి. కొన్ని రోజులుగా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటంతో.. బద్వేలు ఉప ఎన్నికను పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. బద్వేలు ఎన్నికలో జనసేన బరిలోకి దిగుతుందని అంతా భావిస్తున్న సమయంలో బాంబ్ పేల్చారు పవన్ కల్యాణ్. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరికి షాకిచ్చారు జనసేన చీఫ్. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని పుట్టపర్తి సభలో ప్రకటించారు పవన్ కల్యాణ్.  పుట్టపర్తి సభలో బద్వేలు ఉప ఎన్నికపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జనసేన పోటీ చేయకపోవడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వ్యూహం ప్రకారమే పవన్ కల్యాణ్ అలా ప్రకటించారని అంటున్నారు. ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేన పోటీ చేయకూడదని నిర్ణయించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

గెల్లుకు వెంకట్ తో చెల్లు.. రేవంత్ దెబ్బకు టీఆర్ఎస్ లో వణుకు!

తేలిపోయింది. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవ‌రో స్ప‌ష్ట‌మైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం-ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షులు బాల‌మూరి వెంక‌ట్‌ను హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది అధిష్టానం. అంత‌గా బ‌లంలేని చోట‌.. బ‌ల‌మైన నాయ‌కులైన పొన్నం, కొండాల‌ను బ‌రిలో దింప‌కుండా వ్యూహాత్మ‌కంగా వెంక‌ట్‌ను రంగంలోకి దింపారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. యువ‌కుడు, విద్యార్థి సంఘం నాయ‌కుడైన బాల‌మూరి వెంక‌ట్‌ను హుజురాబాద్‌లో ప్ర‌యోగించ‌డం వెనుక రేవంత్ వ్యూహం అదుర్స్ అంటున్నారు. ఎంత కాద‌న్నా.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. పార్టీకి సైతం ఆ స్థానంపై అంత‌గా ఆస‌క్తి లేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాబ‌ట్టి.. పోటీ చేయాల్సిందే కాబ‌ట్టి.. బ‌రిలో దిగుతోంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. హుజురాబాద్‌లో ప్ర‌ధాన పోరు.. టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్యే. ఈట‌ల రాజేంద‌ర్ గెలిస్తే.. కేసీఆర్‌కు దిమ్మ తిరిగే షాక్ త‌ప్ప‌దు. హుజురాబాద్ ఫ‌లితంతో కేసీఆర్ ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు కూడా. టెక్నిక‌ల్‌గా ఆయ‌న బీజేపీలో ఉన్నా.. ఈ ఎన్నిక టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ కానే కాదు. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ మాత్ర‌మే. కారు గుర్తుపై గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీలో ఉన్నా.. ఆయ‌న్ను చూసి కాకుండా.. అధికార పార్టీపై రెఫరెండంగానే హుజురాబాద్ ఉప ఎన్నికను చూడాల్సి ఉంటుంది. కేసీఆర్‌ను ఆమోదిస్తే టీఆర్ఎస్‌కు ఓటేస్తారు.. లేదంటే ఈట‌ల‌ను గెలిపిస్తారు.. ఇది వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే ఫైట్ మాత్ర‌మే. ఇలాంటి ప్ర‌త్యేక సంద‌ర్భంలో అన‌వ‌స‌రంగా కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య‌లో దూరి.. కొండా సురేఖ‌లాంటి లీడ‌ర్‌ను నిల‌బెట్టి.. కేసీఆర్ వ్య‌తిరేక ఓటును చీల్చే త‌ప్పిదానికి పోకుండా.. వ్యూహాత్మ‌కంగా కాస్త త‌గ్గి నెగ్గే వ్యూహం ర‌చించారు రేవంత్‌రెడ్డి.  బాల‌మూరి వెంక‌ట్ అభ్య‌ర్థిత్వం విష‌యంలోనూ ప‌క్కాగా స్కెచ్ వేశారు పీసీసీ చీఫ్‌. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ విద్యార్థి సంఘం అధ్య‌క్షులు గెల్లు శ్రీనివాస్ బ‌రిలో ఉండ‌టంతో.. ఆయ‌న‌కు స‌రిస‌మాన స్థాయి ఉన్న ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బాల‌మూరి వెంక‌ట్‌ను పోటీలో నిలిపారు రేవంత్‌రెడ్డి. సో.. ఏ యువ‌త‌నైతే అట్రాక్ట్ చేద్దామ‌ని అధికార పార్టీ భావించిందో.. అదే యూత్ టార్గెట్‌గా బాల‌మూరిని ముందుంచింది కాంగ్రెస్‌. యువ‌త‌, నిరుద్యోగులు, విద్యార్థులు ఓట్ల‌న్నీ.. ఆ ఇద్ద‌రు విద్యార్థి సంఘం నాయ‌కుల మ‌ధ్య చీలిపోతాయ‌నేది హ‌స్తం పార్టీ అంచ‌నా. బాల‌మూరి వెంక‌ట్‌తో టీఆర్ఎస్ ఓట్ల‌కు భారీ గండి పెట్టాల‌నేది కాంగ్రెస్ వ్యూహంలా క‌నిపిస్తోంది. ఇలా, కారుకు ప‌డాల్సిన ఓట్ల‌ను కాంగ్రెస్ పార్టీ చీల్చి.. ఆ మేర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌యోజ‌నం జ‌రిగేలా.. ప‌రోక్ష వ్యూహం ర‌చించార‌ని తెలుస్తోంది.  హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుపు దాదాపు అసాధ్యం అని తెలుసు కాబ‌ట్టే.. తాము ఓడినా.. కేసీఆర్ గెల‌వ‌కుండా చేసేందుకే.. గెల్లు గెలుపును బాల‌మూరితో చెల్లు చేసేలా.. విద్యార్థి సంఘం నాయ‌కుడిని హుజురాబాద్ బ‌రిలో నిలిపార‌ని అంటున్నారు. వారెవా.. రేవంత్‌రెడ్డి వ్యూహ‌మంటూ విశ్లేష‌కులు కొనియాడుతున్నారు.

TOP NEWS @ 7pm

1. నాగచైతన్య–సమంతలు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘ఇక నుంచి మేం భార్యభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు జరిపి ఎంతో ఆలోచించిం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై వేర్వేరుగా సొంత మార్గాల్లో ప్ర‌యాణించాలని అనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహ బంధం కొనసాగినందుకు మేం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మా స్నేహబంధమే వివాహబంధానికి కీలకం అనే చెప్పాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అభిమానుల సపోర్ట్‌ కావాలి. మా ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని చైతన్య, సమంత తమ పోస్ట్‌లో తెలిపారు.   2. త‌న‌ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని.. ఇక నుంచి ఊరుకునేది లేద‌ని.. తొక్కి ప‌ట్టి నార తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. తాను యాక్షన్‌, కట్ అంటే వెళ్లిపోయే వాడిని కాదని.. త‌న సహనాన్ని ఇక పరీక్షించొద్దని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ అన్నారు.  3. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేల మందితో సభ ఎలా నిర్వ‌హిస్తార‌ని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని.. నవంబర్‌ నుంచి రోడ్ల‌ మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 4. అవినీతిపరుల చేతులకు అధికారమిచ్చి గాంధీజీ కోరుకున్న సమాజాన్ని నిర్మించగలమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మత్తు, మాదకద్రవ్యాలు లేని విధంగా దేశం రూపుదిద్దుకోవాలన్నారు. మహాత్ముని కలలు నెరవేరాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలని నారా లోకేష్ అన్నారు.  5. బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 18 ఏళ్లు నిండి, ఆహార భద్రత కార్డ్ ఉన్న ప్రతి ఒక్క అడబిడ్డకూ బతుకమ్మ చీర ఇస్తామని తెలిపారు. మొత్తం 7,28,154 మంది అర్హులుగా గుర్తించి.. ఆ మేర‌కు చీరలను రెడీ చేస్తోంది తెలంగాణ స‌ర్కారు.  6. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని.. అలాంటి తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా? అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి? శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా? అని ప్ర‌శ్నించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే జంగ్ సైరన్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్తత త‌లెత్తింది. దీంతో ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రేవంత్‌రెడ్డి.  7. సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వ‌హించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంపైనే మొదటి సంతకం పెడుతామని ప్రకటించారు. టీఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేరని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 8. తెలుగు అకాడమీ కుంభకోణంపై రిమాండ్ రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు ఉన్నాయి. నకిలీ లెటర్‌ హెడ్‌లతో పాటు నకిలీ సంతకాలతో నిధులను మళ్లించినట్టు గుర్తించారు. ఎఫ్‌డీల వెనుక తెలుగు అకాడమీ డైరెక్టర్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తేల్చారు. అకాడమీ ఖాతా నుంచి నిధులు.. ఏపీ మార్కెట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌కు బదలాయించారు.  9. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స్టేష‌న్ల వారీగా నేర‌గాళ్ల జాబితా సిద్ధం చేస్తూ.. రౌడీల అడ్రస్‌లు, లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. 10. టీఆర్ఎస్‌ అరాచకపాలనకు చరమగీతం పాడాలని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పిలుపు ఇచ్చారు. తెలంగాణలో నిరుదోగ్య సమస్య పెరిగిందని.. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు స్మృతీ ఇరానీ.

కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యార్థి నేత వెంకట్.. హుజురాబాద్ పై రేవంత్ మాస్టర్ ప్లాన్!   

తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరు వెంకట్ పేరు ఖరారైంది. హుజురాబాద్ అభ్యర్థిగా వెంకట్ పేరును అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. సోమవారం వెంకట్ నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజురాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గెల్లు, ఈటలలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్  అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడింది.    హుజురాబాద్ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి సైలెంటుగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ టికెట్ రేసులో పలువురు పేర్లు వినిపించాయి. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ప్రకటన ఆగిపోయిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం హుజురాబాద్ లో తాను పోటీ చేయడం లేదని కొండా సురేఖ ప్రకటించింది. ఆమె పెట్టిన కండీషన్లకు పీసీసీ అంగీకరించకపోవడంతోనే పోటీ పై కొండా సురేఖ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.  కొండా సురేఖ వెనక్కి తగ్గడంతో అభ్యర్థిపై సమీక్ష చేసిన పీసీసీ పెద్దలు.. ఇటీవల కాలంలో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా ఉంటున్న ఎన్ఎస్ యూఐ చీఫ్ బలమూరి వెంకట్ వైపు మొగ్గుచూపారని సమాచారం. పీసీసీ సీఫారస్ చేసిన పేరునే ఏఐసీసీ ఖరారు చేసింది. బల్మూరి వెంకట్ కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత స్పీడ్ పెంచారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పోలీసులకు చుక్కలు చూపించారు వెంకట్. వెంకట్ కు రేవంత్ రెడ్డి అండదండలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీ విద్యార్థి నేతను బరిలోకి దింపినందున... కాంగ్రెస్ కూడా అదే ప్రయత్వం చేసినట్లు కనిపిస్తోంది.  

జల జీవన్ మిషన్ ప్రారంభం.. ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం జనాదరణ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రధాని జనాదరణ గ్రాఫ్ పడిపోతోంది. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం. నిజమే, కావచ్చు ప్రధాని గ్రాఫ్ ఎంత పడిపోయినా, ఇంకా ఆయనదే  పైచేయిగా వుంది. రాహుల్ గాంధీ సహా ఇతర జాతీయ నేతలు ఎవరూ  ప్రజాదరణలో ప్రధాని మోడీకి దగ్గరలో కూడా లేరు. ఒక విధంగా  ప్రస్తుతం ప్రధాని ప్రజాదరణ, ‘ ఏచెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్లుగా ఉంది. అయితే ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకోవడం కుదరదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఉహించడం కూడా కొంచెం చాలా కష్టం. అందుకే, రాజకీయాల్లో వారం రోజులు కూడా  ఎక్కువ సమయమే అంటారు.  అందుకే కావచ్చు ఓ వంక కేంద్ర ప్రభుత్వం మరో వంక బీజేపీ  పడిపోయిన ప్రధాని మోడీ ప్రజాదరణ గ్రాఫ్ ను పైకి పాకించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  మోడీ ఇమేజిని పెంచేందుకు, బీజేపీ సోషల్ మీడియా కొవిడ్ వాక్సినేషన్ సక్సెస్ స్టోరీని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పెట్రోల్, డీజిల ధరల రోజువారీ వడ్డన, గ్యాస్ బండ  మోతను భరించలేక ప్రజలు, ముఖ్యంగా మహిళలలో పెరుగుతున్న అసంతృప్తిపై నీళ్ళు చల్లేందుకు, ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభమై, ఇప్పటికీ నత్తనడకన నడుస్తున్న,‘జల్‌ జీవన్‌ మిషన్‌’ను మరోమారు తెరమీదకు తీసుకోచింది.  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ జలజీవన్ మిషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు అమలు విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ యాప్‌’ను ప్రారంభించారు. దీంతోపాటు ‘రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోశ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎవరైనా, ఏ సంస్థయినా.. గ్రామీణ ఇళ్లలో, బడుల్లో ఇతరత్రా చోట్ల నీటి కనెక్షన్లు అందించేందుకు సాయం అందించొచ్చు. నిజానికి, మోడీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన స్వచ్చ భారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాగానే, జలజీవన్ మిషన్ వలన ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రణత ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగింది. ముఖ్యంగా మహిళల్లో ప్రజాదరణ పెరిగేందుకు ఈ పథకం ఉపయోగిస్తుందని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒక విధంగా మోడీ మహిళల సాధికారిత పేరిట ప్రవేశ పెట్టిన పధకాలు నిశ్శబ్ద ఓటు బ్యాంకును సృష్టించింది.   ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయా గ్రామ పంచాయతీల పెద్దలు, నీటి సమితుల ప్రతినిధులతోనూ మాట్లాడారు. తమ ఇళ్లకు నీళ్లు అందుతున్నాయని, మహిళలు తమ ఖాళీ సమయాన్ని పిల్లల చదువులకు, ఉపాధి పనులకు కేటాయిస్తున్నారని వారు ప్రధానికి వివరించారు, ఒక విధంగా ఈ కార్యక్రమం ఇదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకరంగా సాగింది. ప్రధాని మోడీ, తమదైన శైలిలో మాటల మంత్ర జలాన్ని చల్లారు. జల జేవన్ మిషన్’తో మహిళలు దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలు తప్పుతున్నాయని అన్నారు.ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తుండటంతో వారి సమయం ఆదా అవుతోందని, తద్వారా వారు సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. ఇలా  జల జీవన్ మిషన్ యాప్’ను ప్రారంభించడంతో పాటుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ నల్లా నీటి సదుపాయం కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మిషన్‌ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో నీటి సమితులు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీ(వీడబ్ల్యూఎస్‌సీ)లు ఏర్పాటు చేసింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత.  ఈ మిషన్‌ ప్రారంభం నాటికి దేశంలో 3.23 కోట్ల(17 శాతం) గ్రామీణ ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 8.26 కోట్ల(43 శాతం)కు చేరడం విశేషం. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు గుప్పించారు. 3 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 70ఏళ్లు పడితే .. తమ ప్రభుత్వ హయాంలో కేవలం గత రెండేళ్లలోనే 5కోట్లకు పైగా నల్లా కనెక్షన్లు ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు. అంటే.. మళ్ళీ మాకే ఓటేయండని ... జనాలకు చెప్పకుండానే చెప్పారు. అడక్కుండానే అడిగారు. 

ప్రజా ప్రభుత్వమా... తాలిబన్ రాజ్యమా?.. రేవంత్ రెడ్డి అరెస్టుతో హై టెన్షన్..  

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జంగ్ సైరన్ నిరసన కార్యక్రమం హైదరాబాద్ లో టెన్షన్ పుట్టించింది. ఎల్బీ నగర్ లో జంగ్ సైరన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  రేవంత్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తనను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా..? అని మండిపడ్డారు. అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి. శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాను వెళ్లడానికి ఎస్కార్ట్ ఇవ్వాలని, ఇంటి దగ్గర రోడ్డుపై బైఠాయించి రేవంత్ నిరసన తెలిపారు.   అటు ఎల్బీ నగర్ చౌరస్తాకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. శ్రీకాంతా చారీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ సహా ఇతర పీసీసీ నేతలు పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. 

ఈట‌ల‌పై కోడి క‌త్తి త‌ర‌హా దాడి?.. హుజురాబాద్‌లో సంచ‌ల‌నం..

హుజురాబాద్ ఉప పోరు హోరెత్తుతోంది. ఈట‌ల రాజేంద‌ర్ చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని మ‌రీ నియోజ‌క‌వ‌ర్గ‌మంతా తిరుగుతున్నారు. స‌రైన తిండి లేదు.. వేళ‌కు నిద్ర లేదు.. మూడు నెల‌లుగా ఇదే తీరు. ఇక బైపోల్ డేట్ ఫిక్స్ కావ‌డంతో.. హుజురా..వార్ మ‌రింత ముదిరింది. ఈ ద‌శ‌లో సంచ‌ల‌న విష‌యాలు తెర మీద‌కు వ‌స్తుండ‌టం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈట‌ల‌, టీఆర్ఎస్ మ‌ధ్య తీవ్ర స్థాయిలో ల‌డాయి జ‌రుగుతోంది. ఈట‌ల‌ను ఓడించేందుకు అధికార పార్టీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. తాజాగా, హుజురాబాద్‌లో ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్‌పై దాడి జ‌రుగబోతోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఎవ‌రు ఈ వార్త‌ను లీక్ చేశారో.. ఈట‌ల‌పై ఎవ‌రు దాడి చేస్తారో.. ఎందుకు దాడి చేస్తారో.. ఎలా దాడి చేస్తారో.. తెలీదు కానీ.. ఈట‌ల‌పై అటాక్ కానుందంటూ ప్ర‌చారం మాత్రం జ‌రిగిపోతోంది. దాడి జ‌రిగే డేట్స్ కూడా చెప్పేస్తున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈట‌ల‌పై అటాక్ జ‌రుగుతుంద‌ట‌. డేట్స్‌తో స‌హా చెబుతున్నారంటే ఏమ‌నుకోవాలి?  హుజురాబాద్‌లో ఈట‌ల టార్గెట్‌గా మ‌రో కోడి క‌త్తి దాడి జ‌రుగుతుందా? అనే అనుమానం. ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. కోడి క‌త్తి దాడి త‌ర‌హాలోనే రాజ‌కీయంగా లాభ‌ప‌డ‌టానికి ఈట‌ల‌నే.. త‌న‌పై తాను ఈ దాడి చేయించుకోబోతున్నారంటూ ప్ర‌చారం అవుతుండ‌టం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతోంది.  ఈ ప్ర‌చారంపై ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డుతున్నారు. కావాల‌నే త‌న‌పై ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 13, 14 తేదీలలో తన మీదన తానే దాడి చేయించుకుంటున్నా.. అంటూ మంత్రులు అంటున్నారని.. దీని వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. తన మీద దాడికి అధికార పార్టీ నేత‌లు ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   

యాక్ష‌న్‌లోకి సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌.. రౌడీల‌కు జియో ట్యాగింగ్‌..

సైబ‌రాబాద్ సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర పేరు ప్ర‌క‌టించ‌గానే అక్ర‌మార్కులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అబ్బో.. స్టీఫెన్ వ‌స్తే త‌మ ఖేల్ ఖ‌తం దుకాణం బంద్‌.. అంటూ తెగ వ‌ర్రీ అయ్యారు. వాళ్లు అనుకున్న‌ట్టే అవుతోంది. పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర నేర‌గాళ్లపై యాక్ష‌న్ షురూ చేశారు. సింగం మూవీలో న‌ర‌సింహ వ‌లే.. రౌడీల భ‌ర‌తం ప‌ట్టేందుకు రెడీ అయ్యారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలీస్‌ స్టేషన్‌లో ఎంత మందిపై రౌడీషీట్‌ నమోదైంది? వారంతా ఎలాంటి నేరాలకు పాల్పడేవారు? తరచూ ప్రజలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వారెవరు?  భూక‌బ్జాలు చేస్తున్న‌దెవ‌రు? గంజాయి దందా జ‌రుపుతున్న‌ది ఎవ‌రు? ఇలా ప్రాంతాల వారీగా నేర‌స్తుల‌ జాబితాను సిద్ధం చేయాలని ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. నేరస్థులు, రౌడీషీట‌ర్ల ఇండ్లు, వారి అడ్రస్‌లు, లొకేషన్స్‌ను.. జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు సైబ‌రాబాద్ పోలీసులు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్థులతో పాటు.. పాత రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులను ఎస్‌హెచ్‌వోలు విడతల వారీగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇకపై నేరాలకు పాల్పడినా, పద్ధతి మార్చుకోకపోయినా ఇబ్బందులు తప్పవని త‌మ‌దైన స్టైల్‌లో వార్నింగ్ ఇస్తున్నారు.  ఇక క్రైమ్ డిపార్ట్‌మెంట్‌పైనా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌. స్టేష‌న్ల వారీగా దొంగ‌ల జాబితా దుమ్ము దులుపుతున్నారు. షాపులు కొల్ల‌గొట్టేవారు, తాళం వేసిన ఇళ్ల‌ను దోచుకునేవారు, చైన్ స్నాచ‌ర్స్‌, డైవ‌ర్స‌న్ బ్యాచెస్‌.. ఇలా పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. న‌గ‌రంపై పూర్తిస్థాయిలో ప‌ట్టు, అవ‌గాహ‌న ఉన్న అధికారి కావ‌డంతో.. సైబ‌రాబాద్‌ను మ‌రింత పీస్ ఫుల్ సిటీగా మార్చే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉన్నారు సీపీ స్పీఫెన్ ర‌వీంద్ర‌.   

జోరు వర్షంలోనే జనసేనాని శ్రమదానం.. పవన్ పర్యటనతో పోలీసులకు చుక్కలు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన పోలీసులకు సవాల్ గా నిలిచింది. తెగ టెన్షన్ పుట్టించింది. రాజ‌మండ్రిలో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ల‌డంలో ఆ ప్రాంతంలో పోలీసులు అడుగ‌డుగున ఆంక్ష‌లు విధించారు. ఎయిర్ పోర్టు నుంచి శ్ర‌మ‌దానం చేయాల‌నుకున్న ప్రాంతానికి ప‌వ‌న్ వెంట వెళ్ల‌డానికి కొన్ని వాహ‌నాలకు మాత్ర‌మే అనుమ‌తులు ఇచ్చారు. బాలాజీపేట సెంటర్ స‌మీపంలో, హుకుంపేట-బాలాజీపేట రోడ్డు వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకున్న విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కారుపైకి ఎక్కి పోలీసుల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులు ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేక‌లు వేశారు. అనంత‌రం బాలాజీపేట‌కు చేరుకుని శ్ర‌మ‌దానంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఆ సమయంలో సభ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అయినప్పటీకీ పవన్ వెనక్కి తగ్గకుండానే వర్షంలో నిలబడే పోలీసుల తీరును తప్పుబడుతూ నిరసనకు దిగారు. తనతో వచ్చే ర్యాలీ వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి అనుమతి ఇచ్చేవరకూ ఇక్కడ్నుంచి ‘కదిలేది లేదు’ అని పవన్ అక్కడే నిలబడ్డారు.  పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. ‘సీఎం.. సీఎం.. సీఎం.. ’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపి..‘ ఒక్క నిమిషం ఆగండి.. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవకండి. నేను చాలా అలసిపోయా. ఎందుకు అలసిపోయానో కూడా మీకు వివరంగా చెబుతా. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి.. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవకండి.. మీ నోటి నుంచి ఆ మాటే వినిపించకూడదు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను సీఎం అవ్వాలని మీరు మనసులో దాచుకోండి.. అంతేకానీ ఇలా బయటికి చెప్పకండి..’ అంటూ సభకు తరలివచ్చిన కార్యకర్తలకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేలమందితో సభ ఎలా? అని ప్రశ్నించారు. కొవిడ్‌ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే ఆంక్షలు విధించామని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నవంబర్‌ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

తాట తీసి నార తీస్తా.. వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, జనసేన మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. మరోసారి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు పని కట్టుకుని తనను దూషిస్తున్నారని... తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని చెప్పారు. తాట తీసి నారతీస్తానని హెచ్చరించారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని... పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని పవన్ తేల్చి చెప్పారు. రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని జనసేన అధినేత స్పష్టం చేశారు. జోరు వర్షంలోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ మంత్రులు, తనపై విమర్శలు గుప్పించిన సినీ ప్రముఖులకు ఈ సభా వేదికగా స్ట్రాంగ్  వార్నింగ్‌లు ఇచ్చారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు, బూతులు తిట్టిన వారిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ‘నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..?. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చాను. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటున్నారా?. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు పవన్ కల్యాణ్. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చానని అన్నారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని అన్నారు. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి  మంచిది కాదన్నారు. అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పారు. ఓ వైపు వర్షం.. మరోవైపు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జనసేన తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. బహిరంగ సభ వేదిక దగ్గరకు వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. దీంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు. 

కరోనా మహమ్మారికి అరకోటి మంది బలి 

ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో ఏమోకానీ, కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తాని గజగజ వణికిస్తోంది. చావన్నది లేని ఈ వైరస్ ఇంచు మించుగా గడచిన రెండేళ్లలో, లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. నిజానికి ఈ మహమ్మారి ఎన్ని ప్రాణాలను మింగేసిందో ... ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే, తాజాగా రాయిటర్స్‌ వార్తా సంస్థ వేర్వేరు మార్గాల్లో సేకరించి, విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. అంటే అరకోటిమందిని మిగేసింది. కరోనా తొలికేసు 2019 నవంబర్ 17 దక్షిణ చైనాలోని, హుబేలి ప్రావిన్స్’లో వెలుగు చూసింది. ఆ తర్వాత నెలరోజులకు, అదే ప్రావిన్స్ లోని వూహన్’లో  డిసెంబర్ 20న  శాస్త్ర వేత్తలు కరోనా వైరస్’ను గుర్తించారు. ఆ తర్వాత 2020 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనాను మహమ్మారిగా గుర్తించింది.  కాగా, ఈ ఏడాదిన్నరకు పైగా ఇచుమించుగా 115కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా వెలువడిన రాయిటర్స్‌ వార్తా సంస్థ విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 25లక్షల మందిని వైరస్‌ బలితీసుకోగా.. మరో 25లక్షల మరణాలు కేవలం 236 రోజుల్లోనే సంభవించాయి. చాలా దేశాల్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో అగ్ర రాజ్యం అమెరికా సహ ఐదు దేశాల్లోనే సగానికి పైగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా.. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్‌, మెక్సికో, భారత్‌ దేశాల్లోనూ లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే ఈ సంఖ్య ఏకంగా 7లక్షలు దాటింది. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు 7లక్షల మందికి పైగా మరణించారు. అక్కడ సగటున రోజుకు 1900 మంది కరోనాతో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5.97లక్షల మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇక భారత్‌లోనూ 4.48లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 8000 కరోనా మరణాలు సంభవించినట్లు రాయిటర్స్‌ కథనం వెల్లడించింది. అంటే ఇప్పటికీ ప్రతి నిమిషానికి ఐదుగురు కొవిడ్‌తో మృత్యువాతపడుతున్నారు.అయితే, మన దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉన్నా, వాక్సినేషన్ కార్యక్రమం వేగంగగా సాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతోంది.కానీ,ముప్పు పూర్తిగా తప్పలేదు. మూడో ఉదృతి విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. సో.. కొవిడ్ నిబంధనలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.