120 కార్లు సీజ్‌.. ఐటీ రైడ్స్‌తో హ‌ల్‌చ‌ల్‌..

అదేదో సినిమాలో చూపించిన‌ట్టు.. ఐటీ అధికారులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. మొత్తం 300 మంది ఆఫీస‌ర్స్‌. ట‌క్కుగిక్కు వేసుకొని.. ట‌ప‌ట‌పా దూసుకొచ్చారు. ఇన్‌క‌మ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంటూ ఇంట్లో అందరినీ క‌ట్ట‌డి చేశారు. ఇక త‌మ‌దైన స్టైల్‌లో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. అయితే, సినిమాలో మాదిరి వీరేమీ న‌కిలీ ఐటీ అధికారులు కాదు.. నిజ‌మైన ఆఫీస‌ర్సే. తెల్ల‌వారుజామున 5 గంట‌ల నుంచి బెంగ‌ళూరు ఐటీ రైడ్స్‌తో హెరెత్తుతోంది.  ఒక‌టి రెండు కాదు.. 50కి పైగా ప్రాంతాల్లో ఏక‌కాలంలో విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు ఐటీ సిబ్బంది. పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్న ప‌లువురు ఇళ్లు, కార్యాల‌యాలు, ఫామ్‌హౌజులపై వంద‌లాది మంది అధికారులు రైడ్ చేశారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్‌ చేసినట్టు తెలుస్తోంది.  వ్యాపారవేత్తలు, కాంట్రాక్ట‌ర్లు, ఛార్డెట్‌ అకౌంటెంట్ల నివాసాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్‌ నివాసంలోనూ ఐటీ సోదాలు జ‌రుగుతుండ‌టం క‌ల‌క‌లంగా మారింది. ఉమేశ్‌ నివాసం, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  ఇక‌, కర్ణాటక ఇరిగేషన్‌ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇలా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ స‌న్నిహితుల ఇళ్ల‌లో ఐటీ రైడ్స్ జ‌ర‌గ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. దాడుల వెనుక రీజ‌నేంటని తెగ చ‌ర్చించుకుంటున్నారు క‌న్న‌డ క‌మ‌ల‌నాథులు.

జగనన్న సర్కార్ పిచ్చి పీక్స్.. వైసీపీ వెలుగుల్లో బెజవాడ దుర్గమ్మ గుడి! 

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి.. ప్రభుత్వానికి సంబంధించిన ఓ కార్యక్రమానికైనా వైసీపీ రంగులు వేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలకు అవే రంగులు... దీనిపై కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా జగనన్న సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ స్కూళ్లకు వైసీపీ రంగులను వేయడం తీవ్ర వివాదాస్పమైంది. కోర్టు ఆదేశాలతో తిరిగి తొలగించాల్సి వచ్చింది. జగన్ సర్కార్ తీరుతో ఖజానాలు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ప్రభుత్వ వాహనాలకు చివరకు చెత్తను తరలించే వాహనాలకు కూడా అవే రంగులు వేశారు. తాజాగా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ గుడికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ను పుర‌స్క‌రించుకుని ఏపీలోని అన్ని దేవాల‌యాల‌ను ముస్తాబు చేశారు. తిరుమ‌ల‌, శ్రీశైలం ఆల‌యాల‌తో పాటుగా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యానికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయితే తిరుమ‌ల‌, శ్రీశైలం ఆల‌యాల్లో ఏటా క‌నిపించిన మాదిరే వేడుక‌ల ఏర్పాట్లు క‌నిపించ‌గా.. ఒక్క విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ గుడిలో మాత్రం గ‌తేడాది వేడుక‌ల‌కు తాజాగా ఇప్ప‌టి వేడుక‌ల‌కు మాత్రం తేడా కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ ఏడాది ఏర్పాట్ల‌లో భాగంగా ఆల‌యం చుట్టూ అలంక‌రించిన విద్యుద్దీపాలు అచ్చు గుద్దిన‌ట్లుగా వైసీపీ జెండా రంగుల‌తో కూడిన వెలుగుల‌ను విర‌జిమ్మాయి. ఈ చిత్రాలే ఇప్పుు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌భుత్వ కార్యాలయాల‌తో పాటు క‌నిపించిన ప్ర‌తి దానికీ జ‌గ‌న్ స‌ర్కారు త‌న పార్టీ రంగులు వేస్తూ వస్తోంది. దీనిపై కోర్టులు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నాయి. రంగుల విషయంలో హైకోర్టు సీరియస్ కావడంతో ఇక‌పై ఏ ప్ర‌భుత్వ భ‌వ‌నానికి గానీ, వాహ‌నానికి గానీ రంగులు వేయ‌బోమ‌ని, త‌మ త‌ప్పు తెలుసుకున్నామ‌ని తెలిపింది జగన్ రెడ్డి సర్కార్. అయితే క్లీన్ ఏపీ కింద కొనుగోలు చేసిన చెత్త సేక‌ర‌ణ యంత్రాల‌కు వైసీపీ రంగుల‌ను చెరిపేసిన త‌ర్వాత మ‌రోమారు క‌నిపించండంటూ జ‌గ‌న్ స‌ర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే బెజ‌వాడ క‌న‌క‌దుర్గ గుడి చుట్టూ వైసీపీ రంగులు క‌నిపించ‌డం షాకింగ్ గా మారింది. తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడి ఆల‌య‌మే. ఏ ర‌కంగా చూసినా దుర్గ గుడి కంటే తిరుమ‌ల ఆల‌యం పెద్ద‌దే. అయితే దుర్గ గుడి మాదిరిగా తిరుమ‌ల ఆల‌యం చుట్టూ విద్యుద్దీపాలు వెలుగులు విర‌జిమ్మేలా ఏర్పాట్లు చేసినా..అందులో వైసీపీ రంగులు క‌నిపించ‌లేదు.  క‌ర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జుల ఆల‌యంంలో  రాత్రి విద్యుద్దీపాలు వెలుగులు విర‌జిమ్మినా.. జ‌గ‌న్ పార్టీ జెండా రంగులు మాత్రం క‌నిపించ‌లేదు. ఈ రెండు ఆల‌యాల్లో క‌నిపించ‌ని విధంగా ఒక్క బెజ‌వాడ దుర్గ గుడి వెలుగుల్లో మాత్ర‌మే వైసీపీ రంగులు క‌నిపించ‌డంపై ఇప్పుడు పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌ సొంత జిల్లా, సొంత నియోజ‌కవ‌ర్గం అయిన కార‌ణంగానే దుర్గ గుడిలో వైసీపీ వెలుగులు క‌నిపించాయా? అన్న దిశ‌గా చర్చలు సాగుతున్నాయి. బెజవాడ గుడిలో వైసీపీ రంగులను పోలిన విద్యుత్ దీపాలు అలంకరించడంపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. గుళ్లను కూడా వదలలేదా జగనన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు.

దేశానికి నేనే దిక్కు .. మమతా బెనర్జీ హాట్ కామెంట్స్..

“కాంగ్రెస్ పార్టీ పనై పోయింది. బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అందుకే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి,ఆధు నవ భారత నిర్మాణ బాధ్యతను దేశ ప్రజలు తృణమూల్ పై ఉంచారు”, భవానీపూర్ ఉపఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్న తృణమూల్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన బోల్డ్ స్టేట్మెంట్ ఇది.  అంటే ఈ దేశానికి తానే దిక్కని ఆమె చెప్పకనే చెప్పారు. బీజేపీని ఎదిరుంచి నిలిచే శక్తి, యుక్తి, కుయుక్తి తనకు మాత్రమే ఉన్నాయని, ఆమె, ఒక సంచలన ప్రకటన చేశారు. ఇంతవరకు, రాష్ట్రాల్లో ఎలా ఉన్నా,బీహార్ వంటి రాష్ట్రల్లో కాంగ్రెస్ ప్రాతీయ పార్టీల నాయకత్వంలో పోటీ చేసినా, దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి (యూపీఏ)కి కాంగ్రెస్, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి (ఎన్డీఏ)కి బీజేపీనే సారధ్యం వహిస్తున్నాయి. కానీ, ఇప్పుడు విపక్షాల నాయకత్వ పీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించి తృణమూల్’ను ప్రతిష్టించేందుకు మమత సిద్డమయ్యారు.    నిజానికి, మమత  ఇప్పుడు తమ మనసులోని మాటను బయట పెట్టారు. కానీ, ఆమెలో అలాంటి భావన ఒకటి ఎప్పటినుంచో గూడుకట్టుకుని ఉందని, ఆమె సన్నిహితులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. ఆమెలో జాతీయ అకాక్షలు ఉన్నాయన్నది రహస్యమేమీకాదు. అది అందరికీ తెలిసిన నిజం. దేశ ప్రధాని కావలానే, ఆశ ఆకాంక్ష ఆమెలో ఎప్పటి నుంచో నిండుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత మే ఢిల్లీ వెళ్లి ఓ వారం రోజులు అక్కడే  ఉండి, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికీ బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటు  గురించి, ఒక  ప్రయత్నం చేశారు. ఇపుఉడు మళ్ళీ ఆ దిశగా మరో అడుగు వేశారు.  అదేమీ తప్పుకాదు కానీ, ఆమె అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి, అనే విషయంలో మాత్రం ఎవరికుండే అభిప్రాయం వారికుంది. భవానీపూర్ ఉపఎన్నికల్లో గెలిచి, ఈరోజు (గురువారం అక్టోబర్ 7) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న మమతా బెనర్జీ, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక, “జాగో బంగ్లా”లో ‘ఢిల్లీ పిలుస్తోంది’ మకుటంతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆమె, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, త్రుణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో దేశ ప్రజలు  తృణమూల్ వైపు చూస్తున్నారు. దేశ ప్రజలంతా కట్టకట్టుకుని, దేశాన్ని బీజేపీ ఫాసిస్ట్ పాలననుంచి కాపాడే శక్తి సామర్ధ్యాలు ఒక్క తృణమూల్ కాంగ్రెస్’కు మాత్రమే ఉన్నాయనే నమ్మకానికి  వచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  అంతే కాదు  బీజేపీతో బహుముఖ పోరాటం చేసే సత్తా సామర్ధ్యం తమకే ఉన్నాయని కూడా ఆమె చెప్పు కొచ్చారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది.కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. అదలా ఉంటే, తృణమూల్ ముందు ఇప్పుడు మరో సవాలు వచ్చి పడింది. ఢిల్లీ పిలుస్తోంది’ . దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధనాల నుంచి, ప్రజావ్యతిరేక రాజకీయాల నుంచి ఉపశమనం కోరుకుంటున్నారు. ఫాసిస్ట్ శక్తులను ఓడించాలని కోరుకుంటున్నారు, ఆ బాధ్యతను తమపై ఉంచారని’’ఆమె తమ వ్యాసంలో చెప్పు కొచ్చారు. అలాగే, దేశ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ఆలంబనగా నవభారత స్వప్నం కంటున్నారని, ఆమె పేర్కొన్నారు. ఇప్పడు తృణమూల్ బెంగాల్ సరిహద్దులను దాటింది అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. బెంగాల్ ముందుండి (బెంగాల్ అంటే మమత)  దేశాన్ని నడిపించాలని కొరుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీ వ్యతిరేక  పార్టీలు అన్నీ ఒకే వేదికపైకి వచ్చి ప్రజల అకాక్షలు నేరవేర్చాలని మమతా బెనర్జీ వ్యాసంలో పేర్కొన్నారు.   ఒక విధంగా ఇది మమతా బెనర్జీ అహంభావానికి నిదర్శనంగా కనిపించవచ్చును కానీ, మమతా బెనర్జీ వెనకుండి ముందుకు నడిపించే ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని,రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ప్రశాంత్ కిశోర్ ప్రోద్బలంతోనే ఇటీవలనే, గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని వదిలి తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే, అంతకు ముందే, అస్సాంకు చెందిన మహిళా అధ్యక్షురాలు సుమిత్రా దేవ్, కూడా ప్రశాంత్ కిశోర్ చొరవతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. ఆమెను, మమతా బెనర్జీ రాజ్యసభకు పంపుతున్నారు.ఇలా, ప్రశాంత్ కిశోర్, దేశ రాజకీయ చిత్ర పాఠం నుంచి కాంగ్రెస్ పార్టీని తొలిగించి, మమతా కాంగ్రెస్సే భారత జాతీయ కాంగ్రెస్ అనే విధంగా చరిత్రను చిత్రించే వ్యూహం తో ముందుకు సాగుతున్నారు.  అయితే ఎంత ప్రశాంత్ కిశోర్ వ్యూహమే అయినా, మమత అన్నట్లుగా  బీజేపీని ఎన్నికలలో ఎదుర్కోవడంలో వరసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ విఫలమైన మాట నిజమే అయినా, ఒక ప్రాంతీయ పార్టీ  నాయకురాలు, ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకోవడం,అంత ఈజీ విషయం అయితే కాదు. ఇది గతంలో అనేక మార్లు రుజువైంది.   మరోవైపు ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలను కాంగ్రెస్, ఎన్సీపీ,బీజీపీ యేతర పార్టీలు కొంచెం  ఆలస్యంగానే అయినా గుర్తిస్తున్నాయి. అందుకే, రాహుల్ గాంధీ యువ నాయకత్వం సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త హంగులు దిద్దుతున్నారు. అలాగే, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రశాంత్ కిశోర్ ట్రాప్’లో పడేందుకు సిద్దంగా లేవన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి అంటున్నారు. ఎరైనా, చివరకు ప్రశాంత్ కిశోరే,అయినా, కొందరిని కొన్ని సందర్భాలలో మోసం చేయవచ్చును కానీ, ఆదరిని అన్ని సందర్భాలలో మోసం చేయడం కుదరదని, అది అయ్యే పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

టాప్ న్యూస్ @ 1PM

పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరింది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఆ లేఖను పరిశీలించి నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ  తేల్చిచెప్పింది. 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.  ------ నియంత, అసమర్ధుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. జగన్ ఒక్క చాన్స్ తీసుకోని ప్రజలకు బ్రతికే చాన్స్ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ వాళ్ల తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారని కన్నా విమర్శించారు. అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెట్టి దోచుకుంటున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఓట్లు కొనుకొంటున్నారని విమర్శించారు. ------ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై గురువారం హైకోర్టు డివిజినల్ బెంచిలో విచారణ జరిగింది. ఈనెల 4 న రూ.372 కోట్లు పంచాయతీ అకౌంట్లలో జమ చేశామని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. గతంలో పంచాయతీ అకౌంట్లలో జమ చేసిన రూ.1100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేవలం రూ.60 కోట్లు మాత్రమే పంచాయితీ అకౌంట్లలో ఉన్నాయని తెలిపింది. దసరా లోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని  హైకోర్టు ఆదేశించింది. ------ వృద్ధులను  మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.ఫించన్ రూ.3 వేలు పెంచుతామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా.. కనీసం రూ.300 కూడా పెంచకపోగా కుంటి సాకులు చెబుతూ ఉన్న ఫించన్లు కోత కోసి వృద్దుల కడుపు మాడుస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే అంటూ పెన్షన్ వృద్ధుల నోటి దగ్గర కూడును కూడా లాక్కోవడం అత్యంత దుర్మార్గమన్నారు ------- గంజాయి వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బట్ట కాల్చి ముఖంపై వేస్తున్నాయని...తాలిబన్‌కు ఏపీకి సంబంధం అంటగడుతున్నారని అన్నారు. సీఎం ప్రతిష్టను దిగజార్చాలని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలను నివారించడానికి సెబ్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్‌లో డ్రగ్స్ దొరకాయని మోదీకి సంబంధం ఉందంటారా అని ప్రశ్నించారు. ------ బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యర్థి పేరును ప్రకటించారు. జాతీయ పార్టీ ప్రకటించిన జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇటీవ‌లే ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ---- బతుకమ్మలపై నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారు వెళ్లడంపై దుమారం రేగుతోంది. మహిళల, తెలంగాణ రాష్ట్ర పండుగను కించపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా ధర్మారెడ్డి అహంకారానికి ఈ ఘటన నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ---------- పంజాగుట్టలో శ్రీకృష్ణ  జ్యువెల్లెర్స్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు  అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు బయటపడినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ---------- లఖింపూర్ బాధితుల పట్ల యోగి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి బాధితులకు న్యాయాన్ని అందకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. న్యాయం పొందడం ప్రజల హక్కని, బాధితులకు న్యాయం అందే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. ------ ఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.లఖింపూర్ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన కొత్త వీడియోను వరుణ్ గాంధీ షేర్ చేస్తూ రైతుల గుంపుపై కారు నడిపి, వారిని హత్య చేశారని వరుణ్ ఆరోపించారు.  

దేవుని గుళ్ళో దొంగలు పడ్డారు.. జగనన్న పాలనలో కామనేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు వెంకన్న హుండీలో చేయి పెట్టింది. భక్తుల కళ్లు మాత్రమే  కాదు, దేవుని కళ్లు కూడా కప్పి ఒకేసారి ఏకంగా రూ.50 కోట్లు మూట కట్టుకుని పట్టుకు పోయింది. ఇది ఒకసారి ‘చోరీ’ కాదు, ప్రతి సంవత్సరం ఇదే మొతాన్ని దేవుని హుండీ నుంచి సర్కార్ ఖజానా పట్టుకు పోతుంది. అంతేకాదు ప్రతి  ఐదు సంవత్సరాలకు ఈ మొత్తం మరో 10 శాతం పెరుగుతుంది. ఇలా దేవుని హుండీని కొల్లగొట్టేందుకు వైసీపీ  ప్రభుత్వం ఏకంగా  ఆర్డినెన్సు జారీ చేసింది.   వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు, ధర్మదాయ చట్టం (దేవాదాయ ధర్మాదాయ చట్టం) 1987ను సవరిస్తూ ఆర్డినెన్సును జారీ చేసింది. ఈ ఆర్డినెన్సు ద్వారా తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇంతవరకు , సంవత్సరానికి రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే, ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటీటీడీ  ఇకపై సంవత్సరానికి  రూ.50 కోట్లు చేల్లిచవలసి ఉంటుంది. అంటే, భక్తుల కానుకలలో నుంచి  ప్రభుత్వం రూ .50 కోట్లు పట్టుకు పోతుంది.  అంతేకాదు, ఈ మొత్తం ప్రతి ఐదు సంవత్సరాలకు  10 శాతం వంతున పెరిగిపోతుంది.   అంత అర్జెంటుగా ఆర్డినెన్సు తెచ్చి మరీ, చట్టాన్ని సవరించి వెంకన్న హుండీకి కన్నం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది, అంటే, అందులో అంత విశేషం ఏమీలేదు. కోడి మాంసం, కుక్క మాంసం ప్రభుత్వం ఎందుకు అమ్మవలసి వచ్చింది? సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం ప్రభుత్వం ఎందుకు చేయవలసి వచ్చింది? సారా దుకాణాలు ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోంది? ఇది కూడా అందుకే ... పేరు ఏదైనా కావచ్చును, ప్రభుత్వం చెప్పేది ఇంకేదైనా కాకవచ్చును,కానీ, ఈ అన్నిటికీ ఒకటే కారణం, జగన్ రెడ్డి ప్రభుత్వం దివాలా అంచుల్లోకి చేరింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితి నుంచి అధః పాతాళానికి పరుగులు తీస్తోంది. అందుకే ఎక్కడ వీలయితే అక్కడ చేయి పెట్టి, చిక్కి నంత  తెచ్చుకుంటోంది. పుచ్చుకుంటోంది.   తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి ఈ రుణం తీసుకొచ్చింది. ఇందులో రూ.1,000 కోట్లను 7.04 శాతం వడ్డీకి 13 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. మిగతా రూ.1,000 కోట్లను 7.09 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. ఈ నెలలో ఇంకా రూ.3,000 కోట్లు అప్పు తీసుకుంటామని రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సమాచారం ఇచ్చింది. కేంద్రం సెప్టెంబరు 3వ తేదీన అనుమతిచ్చిన కొత్త అప్పులు రూ.10,500 కోట్లలో మంగళవారంతో రూ.7,000 కోట్లు తెచ్చేసింది. ఇంకో రూ.3,500 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. దానిని కూడా అక్టోబరులోనే తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్న ప్రభుత్వం అడపా దడపా వెంకన్న స్వామి మీద పడి, ఏదో రూపంలో సర్కార్ ఖజానాకు కైంకర్యం చేస్తోంది.  అయితే ప్రభుత్వం మాత్రం అసలు నిజాన్ని కప్పిపెట్టి, కామన్ గుడ్ ఫండ్ కోసం, దేవుళ్ళు, దేవాలయ  మధ్య సమన్యాయం సాధించేందుకు అంటూ కట్టు కథలు, పిట్ట కథలు, పుక్కిటి పురాణాలు వినిపిస్తోంది. ఈ 50 కోట్ల రూపాయలను, దేవాదాయ శాఖ పరిధిలోని తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలలో, ధూప, దీప నైవేద్యాలు, అర్చక స్వాముల యోగ క్షేమాలు,సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఆర్డినెన్సు లోనే చెప్పు కొచ్చింది. అయితే, వాస్తవంలో ప్రభుత్వం దేవాలయాల ఆదాయం, ఆస్తులను కొల్లగొట్టి, పాస్టర్లకు జీతాలు చెల్లించి, అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తోంది. చర్చిల నిర్మాణానికి ఖర్చుచేస్తోందని, హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఇది ఆరోపణ కాదు, ఆధారాలతో రుజువైన వాస్తవం.   ఈ ఆర్డినెన్సులో ప్రభుత్వం,తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) కి భక్తులు ఇచ్చే విరాళాలు, దర్శనం టికెట్ల విక్రయం, ఆర్జిత సేవ, ప్రసాదం విక్రయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది, అయినా, కేవలం, రూ.2.5 కోట్లు మాత్రమే దేవాదాయ శాఖకు కామన్ గుడ్ ఫండ్ చెల్లిస్తోంది. విజయవాడ కనక దుర్గమ్మ, సిహచలం, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాలు చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది చాలా తక్కువ, కాబట్టి దేవుళ్ళు, దేవాలయాల మధ్య ఆదాయాలను బట్టి సమన్యాయం సాధించేందుకు టీటీడీ చెల్లింపును రూ. 50కోట్లు పెంచినట్లు చెప్పుకుంది. నిజంగా, చిన్న చిన్నదేవలయాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తే, కాదనేది లేదు. దేవుని సొమ్ము దేవునికి ఖర్చు చేస్తే, అభ్యంతరం చెప్పేది ఉండదు,  కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ట్రాక్ రికార్డు చూస్తే, హిదువుల జేబులు కొట్టి అన్య మతస్తుల జేబులు నింపుతున్న వైనమే కనిపిస్తోంది. అదీ అసలు విషాదం..   

బతుకమ్మలపై నుంచి దూసుకెళ్లిన కారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మహిళల శాపనార్ధాలు.. 

తెలంగాణలో బతుకమ్మ వేడుకలు సంబరంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మను మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు టీఆర్ఎస్ సర్కార్ ఘనంగానే ఏర్పాట్లు చేసింది. అయితే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం బతుకమ్మ రోజే చిల్లరగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.  మహిళలంతా బతుకమ్మలతో వచ్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే  కారు ఆ బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది. దీంతో బతుకమ్మలు చెల్లాచెదరయ్యాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.బతుకమ్మలపై దూసుకెళ్లిన కారు  పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిది.    ఆత్మకూరు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరుకు విచ్చేసిన చల్లా ధర్మారెడ్డి అక్కడ సెంట్రల్‌ లైటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంటర్‌ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని ధర్మారెడ్డి అనుచరులు కోరారు.  ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనివ్వండిని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి కారును గ్రామస్థులు, మహిళలు అడ్డుకుని  ఆయనకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  గ్రామస్థులను పోలీసులు తోసేయడంతో కొందరు సోమ్మసిల్లి కిందపడిపోయారు. ఆత్మకూరు సీఐ రంజిత్‌.. అదనపు పోలీసులను రప్పించి అక్కడి నుంచి ఎమ్మెల్యే వాహనాన్ని పంపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహిళలు ఎంతో గౌరవంగా పూజించే బతుకమ్మలపై కారు పోనివ్వడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

బద్వేలు బీజేపీ అభ్యర్థిగా సురేష్.. టీడీపీ, జనసేన మద్దతు ఎవరికో? 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణి సుధ.. ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తాజాగా బీజేపీ బద్వేలు అభ్యర్థిని ప్రకటించింది.  బద్వేలు ఉప ఎన్నికలో సురేశ్ ప‌న‌తల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. అభ్య‌ర్థి పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన‌ట్లు వివ‌రించారు.'వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోంది బీజేపీ. 14 సంవ‌త్స‌రాలు విద్యార్థి నాయకుడిగా, గత 5 సంవ‌త్స‌రాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేష్ ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం.. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి, మీ సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేయగల ఒక యువనాయకుడిని గెలిపించుకోవాలని కోరుతున్నాను' అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. బద్వేలులో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా.. తాము పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించి అందరికి షాకిచ్చారు పవన్ కల్యాణ్. దీంతో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక టీడీపీ కూడా బద్వేలు బరి నుంచి తప్పుకుంది. మొదట పోటీ చేస్తామని ప్రకటించింది టీడీపీ. తన అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ పేరును ప్రకటించింది. రాజశేఖర్ తన ప్రచారం కూడా ప్రారంభించారు.  తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది టీడీపీ. దివంగత దళిత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నందున.. గత సంప్రాదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేస్తోంది కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు పోటీలో ఉండటంతో... టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధించేలా పావులు కదుపుతోంది. బద్వేలు ఉప ఎన్నిక ఇంచార్జ్ గా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిని నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరో ముగ్గురు మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 

తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్ ధనవంతులు వీళ్లే.. 

తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులు పెరిగిపోతున్నారు. గత ఏడాది కంటే దేశంలోని టాప్ ధనవంతుల జాబితాలో తెలుగు వారి సంఖ్య పెరిగింది. తాజాగా విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021 స్పష్టం చేసింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 69 మంది చోటు సంపాదిస్తే.. వీరి మొత్తం సంపాదనను కలిపితే రూ 3.79లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 54 శాతం  వృద్ధి కనిపించగా.. కొత్తగా 13 మంది జాబితాలో చేరారు.  అయితే జాబితాలోని మొత్తం 69 మంది తెలుగువారిలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. మొత్తం 69 మంది సంపన్నుల్లో ఔషధ రంగానికి చెందిన వారే 21 మంది ఉండటం విశేషం. ఈ జాబితాలో వెయ్యి కోట్ల కు మించి సంపద ఉన్న వారిని పరిగణలోకి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 సంపన్నులు వీళ్లే..  ర్యాంక్   పేరు                       సంపద(రూ.కోట్లల్లో)          కంపెనీ 01       మురళి దివి                    7900                   దివీస్ ల్యబొరేటరీస్ 02      పార్థసారధిరెడ్డి                26100                  హెటెరో ల్యాబ్స్ 03      పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డి        23400                 మేఘా ఇంజనీరింగ్ 04     సతీష్ రెడ్డి                      12300                   డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ 05      అమరేందర్ రెడ్డి            12000                   జీఏఆర్ 06     సత్యానారాయణరెడ్డి        11500                   ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 07      జీవీ ప్రసాద్                    10300                 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 08     వెంకటేశ్వర్లు జాస్తి            9700                   సువెన్ ఫార్మా 09     పీవీఎన్ రాజు                   9300                    గ్లాండ్ ఫార్మా 10      వీసీ నన్నపనేని               9100                    నాట్కో ఫార్మా

తాలిబన్లతో వైసీపీ నేతలకు లింక్స్? డ్రగ్స్ మాఫియా అడ్డాగా ఏపీ? 

గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన ఆప్ఘనిస్తాన్ హెరాయిన్ కు విజయవాడ లింకులు బయటపడటం తీవ్ర కలకలం రేపగా.. ఆ కేసు విచారణలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే ఏపీలో డ్రగ్స్ దందా ఆనవాళ్లకు సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత నెలలో కాకినాడలో బోటు తగలబడి పోవడం కలకలం రేపుతోంది. ఆ బోటును పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.  గత నెల 16న కాకినాడలో ఓ బోటు అగ్నికి ఆహుతైంది.  జగన్నాథపురం బోటు యార్డ్‌ నుంచి సముద్రంలో వేటకు బయలుదేరిన స్పీడ్‌ బోటు తగలబడింది. అయితే ఆ ప్రమాదంపై అనుమానాలు తలెత్తాయి. బోటులో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బోటును పరిశీలించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి మరికొందరు నేతలతో కలిసి బుధవారం కాకినాడ వచ్చారు. అయితే అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంపైనే దాడికి ప్రయత్నించారు. పూటుగా మద్యం సేవించిన కొందరు.. మత్స్యకారుల ముసుగులో..మూడుగంటలపాటు హల్‌చల్‌ సృష్టించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బూతులతో నిరసనకు దిగారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులపై దాడిచేశారు.  టీడీపీ నేతలపై దాడికి యత్నించిన వారంతా కాకినాడ నగర వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులేనని తెలుస్తోంది. వారిలో ఆయన సోదరుడు, బంధువులు, వైసీపీ కార్పొరేటర్లు, కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని అంటున్నారు. పోలీసులు వచ్చినా వీరిని కనీసం చెదరగొట్టకపోవడంతో మరింత గొడవ చేశారు. కార్యాలయం లోపల ఉన్న పట్టాభి.. తాను మత్స్యకారులను అవమానించలేదని వివరణ ఇచ్చారు. అయినా ద్వారంపూడి అనుచరులు శాంతించలేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పట్టాభి, రాజప్ప, కొండబాబు, నవీన్‌తో ఫోన్లో మాట్లాడారు. ద్వారంపూడి తీరును సహించవద్దని, వెనక్కి తగ్గకుండా పోరాడాలని సూచించారు.  టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తాలిబన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.  వాటిని అన్నింటినీ బయట పెడతాం.. డ్రగ్స్‌ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదని చెప్పారు. డ్రగ్స్  మాఫియా నాయకుడైన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన మూకలతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్స్‌ మాఫియా దాడికి దిగితే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో తన పాత్ర బయటపడుతుందన్న భయంతోనే ద్వారంపూడి దాడులకు తెగబడ్డారన్నారు చంద్రబాబు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. దాడికి దిగిన మాఫియా మూకలను తక్షణం అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులకు ఏ హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ, పోలీస్‌ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మానవబాంబుగా మారి భార్యను చంపేసిన భర్త... 

భార్యభర్తల మధ్య గొడవలు సహజం. వివాదాలు తలెత్తడంతో భార్యలను చంపిన భర్తల ఘటనలు చూస్తుంటాం. కొన్ని సార్లు భర్తలు కూడా భార్యల చేతిలో హత్యకు గురైన సందర్భాలుంటాయి. అయితే ఈ ఘటన మాత్రం మరీ దారుణంగా ఉంది. మనస్పర్థలతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించేందుకు ఏకంగా మానవబాంబుగా మారాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని బాంబును పేల్చాడు. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. మానవబాంబుగా మారిన వ్యక్తి 62 ఏండ్లు.  మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో  జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది . రోహ్మింగ్లియానా (62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) భార్యాభర్తలు. ఆమె స్థానికంగా కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. అతడు మాత్రం పనీపాట లేకుండా తరచూ భార్యను వేధించడమే పనిగా పెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న రోహ్మింగ్లియానా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ లో భాగంగా  రోహ్మింగ్లియానా.. తన దుస్తుల లోపల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకుని భార్య కూరగాయలు విక్రయించే మార్కెట్‌కు వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అమాంతం ఆమెను కౌగిలించుకుని మీట నొక్కాడు. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. పేలుడు సమయంలో వారి కుమార్తె కొద్ది దూరంలో ఉండడంతో ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ ఘటనలో మిగితావారెవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గులాబీ గూటీకి మోత్కుపల్లి నర్సింహులు! దళిత బంధు చైర్మన్ పోస్ట్ ఖరారు ? 

గత రెండు, మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోందని తెలుస్తోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు త్వరలోనే దళిత బంధు చైర్మన్‌గా పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరలేదు. కాని సీఎం కేసీఆర్ కు మద్దతుగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లోనే ఆయన అధికారికంగా గులాబీ పార్టీలో చేరనున్నారని సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో చేరిన  తర్వాత ఆయనను దళిత బంధు కమిటీకి చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. బుధవారం  సీఎం కేసీఆర్ ఉదయం అసెంబ్లీకి వచ్చేటప్పుడే మోత్కుపల్లి నర్సింహులును స్వయంగా తానే వెంటబెట్టుకొచ్చారు. రోజు అంతా ఆయన సీఎం కేసీఆర్‌తోనే అసెంబ్లీలోనే ఉన్నారు. దీంతో మోత్కుపల్లి నర్సింహులు కారెక్కడం ఖాయమైపోయిందని చెబుతున్నారు. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులుకు కూడా సీఎం కేసీఆర్ నుండి ఒక స్పష్టమైన హామీ లభించిందని తెలుస్తోంది.జులై 23న బీజేపికి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. అప్పటి నుంచి బీజేపీ వైఖరిపై, హుజూరాబాద్ బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంను సమర్థిస్తూ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అప్పటి నుంచే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అనే టాక్ వినిపించింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచే మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నర్సింహులు. టీడీపీతో పాటు కాంగ్రెస్ , ఇండిపెండెంట్ గా కూడా ఆయన విజయం సాధించారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మోత్కుపల్లి నిజాయితీ గల వ్యక్తని, ఆయనకు దళిత బంధు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే.. ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని కేసీఆర్ నమ్మకం. ఇటీవల జరిగిన దళిత బంధు సమీక్ష సమావేశంలోనూ మోత్కుపల్లికి కేసీఆర్.. అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకోవడం ద్వారా.. దళిత బంధుకు కాబోయే చైర్మన్ ఆయనేనన్న సంకేతాలిచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడారు. మధ్యలో ఓ సారి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పటికీ.. అక్కడ ఇమడలేక.. మళ్లీ టీడీపీ గూటికే చేరారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లిన ఆయన.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సీఎంను ఏకంగా అంబేడ్కర్ కంటే గొప్పవాడిగా కీర్తించారు. 

యూపీ ఎన్నికలపై లఖింపుర్‌ ప్రభావం! బీజేపీకి గండం? 

మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్ లో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా పర్యటన సందర్భంగా లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటలు, ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. ఈ దురదృష్టకర సంఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయినట్లు సమాచారం. ఈ తొమ్మిది మందిలో  రైతులున్నారు. ఇతరులు ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబందించిన ఇతర వివరాలు ఎలా ఉన్నప్పటికీ, తొమ్మిది మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ దుర్ఘటనకు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు,ఆశిష్ మిశ్రా మూల కారణమని రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంగా విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మిశ్రా మీద కత్తులు దూస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు లఖింపుర్‌ ఖేరికి బయలు దేరిన ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది.  లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటలకు సంబందించి,ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా,  మంగళ వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగానే మిశ్రా హోమ్ మంత్రితో సమావేశమయ్యారు. లఖింపుర్ సంఘటన పూపుర్వాపారాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగి మూడు రోజులు అయినా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు ఏమీ తీసుకోక పోవడం, అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.  లఖింపుర్‌ హింసాకాండ నేపథ్యంలో మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మిశ్రా.. అమిత్ షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రా పోలీసులకు లొంగిపోయే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వస్తున్న వార్తలను అజయ్‌ మిశ్రా ఖండించారు. ఘటనకు కారణమైన వాహనం తమదేనని, అయితే అందులో తన కుమారుడు లేడని తెలిపారు. అంతేగాక, ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపుతప్పి రైతుల మీదకు దూసుకెళ్లిందని వెల్లడించారు. ఆ తర్వాత రైతులు జరిపిన దాడిలో వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.  అదలా ఉంటే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ దుర్ఘటన ప్రభావం ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ, ఎన్నికల పై సంఘటన ప్రభావం ఎలా ఉంటుంది అనేది, స్పష్టం కాదని మరో మాట కూడా వినవస్తోంది. 

ప్రపంచంలో ధనవంతులైన బిచ్చగాళ్లు వీళ్లే.. హైదరాబాద్ లోనూ మిలియనీర్లు! 

నగరాల్లోని సిగ్నల్ పాయింట్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, చౌరస్తాలో మనం చాలామంది బెగ్గర్స్‌ని చూస్తూ ఉంటాం. వారు పొట్టకూటి కోసం యాచిస్తూ కనిపిస్తారు. అయితే వీళ్లలో కొందరి  సంపాదన తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. కొంతమంది బిచ్చగాళ్లు మిలియనీర్లుగా కూడా ఉన్నారు. మెట్రోపాలిటన్లలో కొంతమంది యాచకులు బహుళ ఫ్లాట్లు కలిగి ఉన్నారంటే నమ్మాల్సిందే. అడుక్కుంటూ ఇంత సంపాదించారా అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతగా  సంపాదించినా వారు ఇప్పటికీ యాచిస్తూనే ఉంటారు.  ప్రపంచంలోని ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే  షాక్ అవాల్సిందే. వీరికి ధనవంతులలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు. కానీ ఇప్పటికీ వీధుల్లో యాచిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవుంతులైన బిచ్చగాళ్లలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు లండన్ కు చెందిన సైమన్ రెట్. ఇతని మొత్తం ఆస్తి 5 లక్షల యూకే ఫౌండ్లు. లండన్‌లోని పుట్నీ హై స్ట్రీట్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్ వెలుపల చిరిగిపోయిన బట్టలు ధరించి యాచిస్తాడు.సైమన్ సంవత్సరానికి 50 వేల బ్రిటన్ ఫౌండ్లు సంపాదిస్తాడు. ఖరీదైన భవంతిలో నివస్తాడు. సైమన్ గురించి తెలుసుకున్న లండన్ మేజిస్ట్రేట్ షాకయ్యారు. యాచించకుండా అతనిపై నిషేదం విధించారు. అయినా యాచిస్తూ పలుసార్లు పోలీసులకు చిక్కాడు సైమన్ రైట్. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. అయినా ఏదో ఒక చోట పోలీసుల కళ్లుగప్పి యాచిస్తూనే ఉంటాడు.  భారత్ లో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా ముంబైలోని  భారత్ జైన్ ఉన్నారు. ప్రపంచంలో ఇతనిది రెండో స్థానం. భారత్ జైన్ నికర ఆస్తి రెండు కోట్లు. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తాడు. జైన్ రోజుకు  10 గంటలు యాచించడం ద్వారా రోజుకు సుమారు 2500 సంపాదిస్తాడు. ఇతని ఆదాయం సగటు భారతీయ ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ.  ముంబైలోని ఆజాద్ మైదాన్ లేదా ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో భారత్ జైన్ ఎక్కువగా యాచిస్తారు. భరత్ జైన్ కు పటేల్ నగర్‌లో 80 లక్షల రూపాయల విలువ చేసే రెండు 1 BHK అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. భాండుప్‌లో ఒక వాణిజ్య స్థలాన్ని కలిగి ఉన్నాడు. ఈ స్థలాన్ని అతను నెలకు 10,000 అద్దెకు ఒక జ్యూస్ షాపుకు ఇచ్చాడు. సౌదీ అరేబియాకు చెందిన ఈషా నికర విలువ 1 మిలియన్ డాలర్లు. ఈషా చనిపోయాకా ఆమె ఆస్తులు ప్రపంచానికి తెలిశాయి. ఈషా మరణించినప్పుడు ఆమె వయస్సు 100 సంవత్సరాలు. ఆమె మరణం తర్వాత, ఈషా చిన్ననాటి స్నేహితురాలు సయీది 1 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఆమె ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఆమె సంపదలో ఆమె మరణం తర్వాత అధికారులకు అప్పగించిన 4 భవనాలు ఉన్నాయి. సయీదీ చెప్పిన వివరాల ప్రకారం  ఈషా యాభై సంవత్సరాలుగా యాచిస్తోంది.  ఈషా తల్లి, సోదరి కూడా యాచించేవాళ్లు. వీళ్లు ఏడాది పొడవునా, ముఖ్యంగా ఈద్ సమయంలో ఎక్కువగా డబ్బులు సంపాదించేవారు.  ఈషా ఆస్తులలో అనేక కుటుంబాలు ఉచితంగా నివసిస్తున్నాయి. యూఎస్ కు చెందిన ఇర్విన్ కోరీ యాచన ద్వారా సంపాదించి మిలియనీర్ అయ్యారు. ఇర్విన్ మొత్తం ఆస్తి నాలుగు మిలియన్ యూఎస్ డాలర్లు. ఇర్విన్ కోరీ  ప్రముఖ హాస్యనటుడు. అతను విజయవంతమైన కెరీర్‌తో మంచి సంపదను సంపాదించాడు. అతను 3.5 మిలియన్ డాలర్ల విలువైన భవనంలో నివసించేవాడు.  పదవీ విరమణ తర్వాత గత 17 సంవత్సరాలుగా  అతను యాచిస్తున్నాడు. మాన్హాటన్ లోని 35 వ వీధి ఆయన సెంటర్.  ఇర్విన్ ప్రతిరోజు 150-250 ఫౌండ్లు సంపాదిస్తాడు. అంటే అతను గత 17 సంవత్సరాలుగా యాచించడం ద్వారా ఒక మిలియన్ USD కంటే ఎక్కువ సంపాదించాడు. యాచన ద్వారా వచ్చే డబ్బును ఇర్విన్ క్యూబాలోని ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తాడు. ఇక ముంబైకి చెందిన సంభాజీ కాలే ప్రొఫెషనల్ బిచ్చగాడు. కొత్త ముంబైలో నివసిస్తున్నాడు,ఇతని కుటుంబంలో నలుగురు ఉన్నారు. వాళ్ల మొత్తం ఆస్తి కోటిన్నర రూపాయలు.  సంభాజీ కాలేకి సాంప్రదాయక ఉద్యోగం లేదు, అతను మరియు అతని నలుగురు కుటుంబం ముంబై వీధుల్లో డబ్బు కోసం అడుక్కుంటూ రోజు గడుపుతారు.  ప్రతిరోజూ సంభాజీ కుటుంబం వేలాది రూపాయలను ఇంటికి తెస్తుంది. కుటుంబం వారి నెలవారీ ఖర్చుల తర్వాత ప్రతి నెలా 50 వేల రూపాయలు ఆదా చేస్తుంది. కొంత పెట్టుబడి కంపెనీలలో పెడుతుంది. పెట్టుబడులు కూడా సంభాజీకి లాభాలు తెచ్చిపెట్టాయి. సంభాజీకి ముంబైలో ఒక ఫ్లాట్ మరియు షోలాపూర్ సిటీలో రెండు ఇళ్లు ఉన్నాయి. భారతదేశంలోని ధనిక బిచ్చగాళ్ల జాబితాలో మూడో నెంబర్ కోల్‌కతాలో నివసించే లక్ష్మి. ఈమె1964 నుంచి అంటే 16 సంవత్సరాల వయసులో కోల్‌కతాలో యాచించడం ప్రారంభించింది.50 సంవత్సరాలకు పైగా భిక్షాటన ద్వారా లక్షల రూపాయలు సేకరించింది. నేటికీ లక్ష్మి యాచన ద్వారా ప్రతిరోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది. ముంబైలో నివసిస్తున్న గీతా కూడా గొప్ప బిచ్చగాళ్ల జాబితాలోకి వస్తుంది. ముంబైలోని చార్ని రోడ్ వద్ద గీత యాచిస్తూ ఉంటుంది. ఆమెకు సొంత ఫ్లాట్ ఉందని, ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుందని చెబుతారు. గీత యాచించడం ద్వారా ప్రతిరోజూ సుమారు 15 వందల రూపాయలు సంపాదిస్తుంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ బిచ్చగాళ్లకు కొదవలేదు. వేలాది మంది యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రతి ప్రధాన కూడలిలో బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీళ్లలోనూ చాలా మంది లక్షలాధికారులు ఉన్నారని చెబుతారు. కొందరికి ఖరీదైన భవంతులు కూడా ఉన్నాయంటారు. అయినా యాచక వృత్తిని మాత్రం ఆపడం లేదు. 

TOP NEWS @ 7pm

1. ఏపీలో రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని, అవినీతి, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ సీఎం జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘‘ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఎదురైందని.. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.  2. తాలిబన్‌ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్‌ సరఫరా అవుతోందని టీడీపీ నేత పట్టాభి మ‌రోసారి ఆరోపించారు. డ్రగ్స్‌తో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధం ఉన్నా.. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం సరికాదన్నారు. ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని హెచ్చరించారు. ఆధారాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని పట్టాభి తెలిపారు. మ‌రోవైపు, కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత పట్టాభి, ఇతర నాయ‌కులపై వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు.  3. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ‌ హైకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని ర‌ఘురామ‌ స్పష్టం చేశారు.  4. రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రంలో చలనం రాలేదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  రైతులను బయటకు రానివ్వడం లేదని, పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. యూపీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటేనని జగ్గారెడ్డి ఆరోపించారు.  5. జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ చేసిన దర్యాప్తుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్ వేశామని అధికారులు కోర్టుకు తెలిపారు. విదేశాల్లో ఉన్న నిందితులను విచారించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.  6. హైకోర్టు దెబ్బకు జగన్ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు.. పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ ఆయన న్యాయస్థానంలో ప్రమాణపత్రం దాఖలు చేశారు.  7. తెలుగు అకాడమీ నిధుల స్కాం కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. స్కాంలో మూడు కేసులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారించామన్నారు. రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ తెలిపారు. స్కాంలో సాయికుమార్ ప్రమేయం చాలా కీలకంగా ఉందన్నారు.  8. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. వివిధ అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 12వ తేదీన సరస్వతి దేవి అలంకరణ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించ‌నున్నారు.  9. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్ట ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు. 10. లఖింపూర్ ఘటన సున్నిత అంశమని, దీనిని అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నించొద్దని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక చేశారు. మ‌రోవైపు, యూపీ మంత్రి శ్రీనాథ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ బాధిత కుటుంబాలతో సెల్ఫీలు దిగేందుకే ప్రతిపక్ష పార్టీ నేతలు అక్కడికి వెళ్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన కూడా అందుకే అని మంత్రి అన‌డంపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. 

వ‌ద‌ల జ‌గ‌న్.. నిన్నొద‌ల‌.. బెయిల్ ర‌ద్దుకు హైకోర్టులో ర‌ఘురామ పిటిష‌న్‌..

ఏ పేరు వింటే జ‌గ‌న్ ఉలిక్కిప‌డ‌తారో.. ఏ కేసు వింటే జ‌గ‌న్ హ‌డ‌లిపోతారో.. అది ప‌దే ప‌దే జ‌రుగుతోంది. ఎంత వ‌ద్ద‌నుకున్నా.. ర‌ఘురామ పేరు జ‌గ‌న్ చెవిలో కందిరీగ‌లా రోత పెడుతోంది. ఎంత త‌ప్పించుకుంటున్నా.. మ‌ళ్లీ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌తో త‌న వెంటే ప‌డుతున్నారు త‌మ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌. తాజాగా, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేయ‌డం మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది. ఈసారి ఏమ‌వుతుందోన‌నే టెన్ష‌న్ సీఎం జ‌గ‌న్‌లో అప్పుడే స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు. జగన్‌పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులో దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌లో ర‌ఘురామ‌ కోరారు. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టి వేయ‌గా.. ఈసారి హైకోర్టును ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌.  న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని ర‌ఘురామ అంటున్నారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్‌.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది కాబట్టి వెంట‌నే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేసి జైలుకు త‌ర‌లించాల‌ని ర‌ఘురామ కోరుతున్నారు. మ‌రోవైపు, ఈడీ కోర్టుకు జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలని రఘురామ అన్నారు.   

తప్పైపోయింది.. ఇంకోసారి చేయం.. లెంప‌లేసుకున్న వైసీపీ స‌ర్కారు..

గోడ క‌న‌బ‌డితే చాలు గోకుడే. ఉన్న రంగు గోకేసి.. వైసీపీ రంగులు పూసేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది ఏపీ ప్ర‌భుత్వం. గోడ క‌నిపించిన చోట‌ల్లో నీలం, ఆకుప‌చ్చ రంగులు వేసేసింది. గ‌తంలో పంచాయ‌తీ బిల్డింగుల‌ను అన్నింటినీ ఇలా వైసీపీ రంగుల‌తో నింపేయ‌డంతో.. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టూ మొట్టికాయ‌ల మీద మొట్టికాయ‌లు వేసింది. ఆ త‌ల‌బొప్పి త‌గ్గ‌క‌ముందే.. మ‌ళ్లీ చెత్త నుంచి సంప‌ద త‌యారీ కేంద్రాల‌పై క‌న్నేసింది. చెత్త ప్ర‌భుత్వం కాబ‌ట్టి.. చెత్త త‌యారీ భ‌వ‌నాల‌కు పార్టీ రంగులు వేస్తే సింబాలిక్‌గా ఉంటుంద‌నుకున్నారో ఏమో.. వాటికీ ఆ మూడు రంగులు పులుమేసింది. దీంతో.. మ‌రోసారి హైకోర్టు ముందు దోషిగా నిల‌బ‌డింది వైసీపీ స‌ర్కారు. అక్క‌డ గ‌ట్టి వార్నింగ్ ప‌డ‌టంతో.. ఈసారి సుప్రీంకోర్టుకు వెళ్ల‌కుండా.. బుద్దిగా కోర్టు చెప్పిన‌ట్టు చేసి.. లెంప‌లేసుకున్నంత ప‌ని చేసింది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....  ఏపీలో ఇక ప్రభుత్వ ఆస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయబోమని హైకోర్టులో సర్కార్ ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఇప్పటి వరకూ వేసిన రంగులన్నీ తీసేస్తున్నామని చెప్పింది. ఇక ముందు ఆ తప్పు జరగబోదని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ స్వయంగా హైకోర్టుకు తెలిపారు.  టీడీపీ హయాంలో చెత్త నుండి సంపద తయారీ అంటూ వర్మీ కంపోస్ట్ కేంద్రాలను నిర్మించారు. ఇటీవల అధికారులు వాటికి వైసీపీ రంగులేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు ఇదేం పద్దతని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రంగులు తీసేయాలని.. ఇక ముందు సైతం వేయబోమని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన గడువు చివరి రోజు రావడంతో హ‌డావుడిగా ప్రమాణపత్రం దాఖలు చేశారు. రంగులు తీసేశామని.. ఇక ఏ ప్రభుత్వ భవనానికీ రంగులు వేయబోమని ప్రమాణం చేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.  గతంలో పంచాయతీ భవనాలపై రంగులు వేసిన అంశంలోనూ సుప్రీంకోర్టు వరకూ పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన ఏపీ ప్రభుత్వం చివరికి రంగులు తీయాల్సిందేనని తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా హైకోర్టు చెప్పిన వెంటనే రంగులు తీసేసింది. భవిష్యత్‌లో కూడా వేయబోమని ప్రమాణపత్రం దాఖలు చేసింది. కాదూ కూడ‌దంటే.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే ప్రమాదం ఉండటంతో ఉన్నతాధికారులు ఇలా అఫిడవిట్ దాఖలు చేయ‌క త‌ప్ప‌లేదు. ఈ బుద్దేదో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ప్పుడే వ‌చ్చుంటే.. మ‌ళ్లీ ఇలా కోర్టు ముందు దోషిగా నిల‌బ‌డే దుస్థితి వ‌చ్చుండేది కాదుగా? అని ఎద్దేవా చేస్తున్నారు విమ‌ర్శ‌కులు.  

రంజాన్, క్రిస్ట‌మ‌స్‌ల‌కే కానుక‌లా? ద‌స‌రాకి గిఫ్ట్‌లు ఏవి?

ద‌స‌రా పండుగ రాబోతోంది. శ‌ర‌న్న‌వ‌రాత్రుల సీజ‌న్ ఇది. దుర్గ‌మ్మ కొలువున్న ఇంద్ర‌కీలాద్రి భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడ‌పోతోంది. వేడుక‌గా జ‌రిగే ద‌స‌రా పండుగ‌కు ప్ర‌భుత్వం నుంచి ప్రోత్సాహం క‌రువ‌వుతోంది. ఇదే అంశంపై తాజాగా ఎంపీ ర‌ఘురామ స్పందించారు. రంజాన్ పండుగకు తోఫాలు, క్రిస్టమస్‌కు కానుకలు ఇస్తారని.. మరి హిందువుల పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  పండుగ‌ల‌తో పాటు వివిధ అంశాల‌పైనా స్పందించారు ర‌ఘురామ‌. అమరావతిని పాఠ్యాంశం నుంచి తీసేయడం దారుణమన్నారు. అసలు అమరావతి పాఠ్యాంశం ఎందుకు తీసేయాల్సి వచ్చిందని రఘురామ నిల‌దీశారు. నరేగా నిధులపై హైకోర్టు తీర్పు హర్షనీయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదన్నారు. అందరికీ నరేగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెండర్లకు ప్రభుత్వం పిలిచినా.. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో ఎక్కడ టెండర్లు వేసినా తెలుగువారు ముందుంటారు కానీ ఏపీలో టెండర్లు పిలుస్తే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని రఘురామ అన్నారు.   

ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ నిరసన.. లక్నోలో హై టెన్షన్ 

ఉత్తర్ ప్రదేశ్ లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లఖింపూర్‌ లో రైతుల ఆందోళన హింసాత్మకం కావడంతో మొదలైన రగడ రోజురోజుకు ఉధృమవుతోంది. విపక్షాలు పెద్ద ఎత్తున నిరనసలు తెలుపుతుండటంతో రాష్ట్రమంతా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. లఖింపూర్ వెళుతున్న ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమె వాగ్వాదానికి దిగడం రచ్చరచ్చైంది. తాజాగా లఖింపూర్‌కి వెళ్లేందుకు లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన బైఠాయించి నిరసనకు దిగారు.  రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ సీఎం చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేష్ భాఘేల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమానాశ్రయంలో బైఠాయించారు. సొంత వాహనంలో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో వెళ్లాలని పోలీసులు షరతు పెట్టారు. దీనికి రాహుల్ గాంధీ నిరాకరించారు. యోగి ప్రభుత్వం ఏదో ప్లాన్ చేసిందని, తాను తన సొంత వాహనంలో తప్ప మరే ఇతర వాహనంలో వెళ్లనని రాహుల్ తేల్చి చెప్పారు. అయినప్పటికీ పోలీసులు వినకపోవడంతో లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లోనే రాహుల్ నిరసనకు దిగారు. తను కారులోనే లఖింపూర్‌కు వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు రాహుల్ గాంధీ. కానీ పోలీసులు వేరే వాహనంలో వెళ్లాలని అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం వెనుక ఏదో ప్లాన్ ఉందనే అనుమానం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. సొంత వాహనంలో కాకుండా వేరే వాహనంలో వెళ్లబోనని చెప్పారు.  లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు అనుమతి ఇవ్వలేదు. ఎట్టకేలకు బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. ప్రియాంక గాంధీని లఖింపూర్ చేరకుండా రెండ్రోజుల క్రితమే పోలీసులు అడ్డుకుని గెస్ట్ హౌస్‌కు తరలించగా, రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని తీసుకుని న్యూఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక‌, మరో ముగ్గురిని లఖింపూర్‌లో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు యూపీ హోం శాఖ ప్రకటన విడుదల చేసింది.

రూ. 130 కోట్లకు ఐపీ పెట్టి వ్యాపారీ పరారీ.. చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం 

చిత్తూరు జిల్లాలో మరో ఘరానా మోసం బయటపడింది. బట్టలు, వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి వేలాది మందిని మోసం చేసి ఐపి పెట్టి పరారయ్యాడు.విషయం తెలుసుకున్న బాధితులు అతని బట్టల దుకాణం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ షాపు వద్ద ఆందోళన చేపట్టారు. వ్యాపారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు వ్యాపారి సుమారు రూ. 130 కోట్లకు పైగా ఐపి పెట్టి పరారైనట్లు సమాచారం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కేంద్రంలో వస్త్ర వ్యాపారి పాండురంగయ్య శెట్టి గత 60 సంవత్సరాలుగా వస్త్ర దుకాణం నిర్వహించారు. ఆయనపై ఉన్న నమ్మకంతో స్థానికులు ఆయన వ్యాపారానికి అప్పుగా పెద్ద మొత్తం ఇస్తూ వచ్చారు. దాదాపు 998 మందికి పైగా రూ. 130 కోట్ల మేర ముట్ట చెప్పినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారికి సకాలంలో పిలిచి వడ్డీని ఇవ్వడంతో మరికొందరు అప్పు ఇచ్చారు.ఇలా డబ్బు ఆశతో కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోయారు బాధితులు..  గత 5 రోజులుగా ఈ వస్త్ర వ్యాపారి మృతి చెందాడని పుకార్లు వచ్చాయి.  మంగళవారం వస్త్ర వ్యాపారి కోర్టులో ఐపి వేస్తున్నారని సమాచారం రావడంతో  బాధితులు ఆందోళనలో పడ్డారు. వ్యాపారి తన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యం కావడంతో అప్పులిచ్చిన బాధితులు పెనుమూరులోని తమ దుకాణం వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.  వ్యాపారి పాండురంగయ్య శెట్టి ఫ్యామిలీ పరారీలో ఉండటంతో లబోదిబోమంటున్న 998 మంది   బాధితులు. పాండురంగయ్య ఆస్తి 14 కోట్లుగా ఉంటే అతని అప్పు 130 కోట్లు పైగానే ఉందంటున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పులు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి, పేద ప్రజలే ఉన్నారు. పిల్లల చదువుల కోసమని కొందరు, ఆడపిల్లల పెండ్లీల కోసమని మరికొందరు కష్టపడి కూడబెట్టిన డబ్బులు కావడంతో  బోరుమంటున్నారు. పెద్ద మొత్తం కావడంతో జిల్లా కోర్టుకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని న్యాయస్థానం తిరస్కరించడంతో బాధితులు హై కోర్టును ఆశ్రయించినట్లు తెలియవచ్చింది.