తెలంగాణ మార్చ్ తేల్చి చెప్పిన నగ్న నిజాలు
తెలంగాణ తెచ్చేదెవరు? ఇచ్చేదెవరు? అన్న విషయానికి సంబంధించి తెలంగాణ మార్చ్ తేల్చిచెప్పిన నిజాలు రాజకీయవర్గాలకు మింగుడు పడేలా లేదు. పసి పిల్లలను ఎత్తుకుని వర్షంలో తడుస్తూ, ఇంటర్మీడియట్ స్థాయి నుంచీ ఆడపిల్లలు మార్చ్కు హాజరుకావడం, ఆరేళ్ళ నుంచీ 70 ఏళ్ళ వరకూ అన్ని వర్గాల నుంచీ ప్రజలు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మార్చ్ తేల్చిచెప్పింది. అంతేకాదు తెలంగాణ సాధనకు రాజకీయ సాధన ఆశించిన స్థాయిలో లేదని కూడా తేల్చి చెప్పింది. తెలంగాణ మార్చ్కు ప్రభుత్వం నాలుగు గంటలు అవకాశం ఇస్తే నిరాఘాటంగా 12 గంటల పాటు నిర్వహించిన ఘనత మార్చ్ నిర్వాహకులకు దక్కుతుంది. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్న రాజకీయనేతలు లేకుండా పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ సభ సజావుగా నిర్వహించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టింది. ముఖ్యంగా సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి భారతీయ జనతాపార్టీ, సిపిఐ, న్యూడెమోక్రసీ పార్టీల జెండాలు కలిసి ఎగరడం ఒక ప్రజా ఉద్యమంలో ఇదే తొలిసారేమో. ప్రజల ఆకాంక్షలను గుర్తించి, దానిని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే అధిక శాతం పార్టీలు కృషి చేసిన విషయాన్నికూడా తెలంగాణవాదులు గుర్తించారు. అందుకే రాజకీయపార్టీల వ్యవహారాన్ని విస్మరించి ప్రభుత్వంలోనే కాదు సామాజికంగా ఎన్ని విభాగాలుంటే అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావడం తెలంగాణ మార్చ్ ప్రత్యేకం. తెలంగాణ మార్చ్ జరిగిన తీరుతెన్నులను గమనిస్తే తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయాల ప్రమేయం లేకుండా జెఎసి చేతుల్లోకి తీసుకున్నట్లు అర్థమవుతున్నది. అంతేకాదు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా తెలంగాణ తమకు దగ్గరలోనే ఉందన్న విషయాన్నీ తెలంగాణవాదులు అర్థం చేసుకున్నారు.
తెలంగాణ పది జిల్లాల్లో ప్రతీ జిల్లా నుంచి లక్ష మంది వరకూ తెలంగాణ మార్చ్కు తరలారు. ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులుగా నిలిచారు. ప్రజాఆకాంక్షతో వచ్చిన వారు కనుక ఎన్ని కష్టాలకయినా ఓర్చి మార్చ్కు తరలారు. ప్రతీ బృందం తమ ఆహారం, నీళ్ళు మోసుకుంటూ వచ్చారు. స్వచ్ఛందంగా ఆహార, నీళ్ళు పొట్లాల పంపిణీ జరిగింది. తమ తెలంగాణ సభకు ఎవరు ఆహారం ఇవ్వడం ఏమిటని తామే కొనుక్కుని మరీ భోజనం చేశారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం. భారీ వర్షం పలుసార్లు కురియడంతో తెలంగాణ అభిమానులు నిరవధిక మార్చ్ కొనసాగించలేకపోయారు.
రాజకీయ వ్యవహారానికి వస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పోరాడినా, 1969 నుంచీ ఉద్యమం ఏదో రూపంలో ప్రజల్లో నిక్షిప్తమై తీవ్ర ఉద్యమం ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. ప్రజల ఆకాంక్షలను అన్ని పార్టీలూ గుర్తించాయి. తమదైన శైలిలో పోరాటాన్ని ప్రారంభించాయి. టిఆర్ఎస్లో కుటుంబపాలన కొనసాగుతుందని, ఛాందసవాదంతో బిజెపి ఉన్నదని పలు రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. ప్రజా ఆకాంక్షను సాఫల్యం చేసేందుకు రాజకీయ పక్షాలను ఏకం చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఆవిర్భవించింది. తొలుత అన్ని పక్షాలూ జెఎసిలో చేరాయి. జెఎసిపై గౌరవం ఉంచుతూ వివిధ రకాల కారణాలు చూపిస్తూ కొన్ని పార్టీలు వైదొలిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జెఎసిలో స్పష్టంగా పాలుపంచుకోలేదు. అయితే ఆ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కోరుతూ వచ్చాయి. తెలంగాణమార్చ్లో తెలుగు దేశం, కాంగ్రెస్, లోక్సత్తా జెండాలు మినహాయించి అన్ని పార్టీల రంగులూ కనిపించాయి. అయితే ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాజకీయ పార్టీలు తమదైన శైలిలో కైవసం చేసుకునేందుకు పలు రాజకీయ పార్టీలు ప్రయత్నించాయనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే అన్ని రాజకీయపార్టీలూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలని ఉద్యమంతో మమేకం అయ్యాయి. ఎవరి లాభం వాళ్ళు చూసుకోవడంతో తెలంగాణ జెఎసి అన్ని సంఘాలనూ ఒక తాటిపైకి తేగలిగింది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంతో జెఎసి ఛైర్మన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన బాధ్యత తెలంగాణ మంత్రుల పరిధిలోకి నెట్టింది. ఇప్పటి వరకూ అదో ఇదో చెబుతూ వస్తున్న రాష్ట్ర మంత్రులకు అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. తెలంగాణ మార్చ్కు అనుమతి తీసుకురావడంలో అయిదుగురు మంత్రులు మాత్రమే కీలకపాత్ర వహించారు. మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమకుమార్రెడ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్కుమార్, ఒకదశలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహలు కీలక పాత్రవహించారు. వీరిలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, హోంమంత్రి సబితారెడ్డిలు ప్రభుత్వం పక్కన కూడా బాధ్యత వహించాల్సి కూడా ఉన్నది. అయితే జెఎసి ప్రతినిధులతో లిఖిత పూర్వకంగా తీసుకున్న తరువాతే అనుమతి ఇవ్వడాన్నికూడా తెలంగాణ సంఘాలు తప్పుబడుతున్నాయి. అయితే అనుమతిస్తే తమపై బాధ్యత తీరిపోతుందని, మిగిలిన విషయాలను పోలీసులే చూసుకుంటారని అధికారపక్షం భావించినట్లుంది. అందుకే కావచ్చు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంలో పోలీసులు సఫలమయ్యారు. ప్రత్యేక తెలంగాణకావాలని, ఎలాగైనా సరే మార్చ్కు హాజరు కావాలన్న యూనివర్సిటీల విద్యార్థులను నిర్బంధించినా మార్చ్ విజయవంతమైంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం బాధ్యత అంటూ షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడం తెలంగాణవాదులకు మంచిఫలితాన్నే ఇచ్చింది. సంఖ్య విషయాన్ని పక్కనబెడితే అన్ని వర్గాల నుంచీ ప్రజలుహాజరు కావడం జెఎసికి సంతృప్తిని కలిగించింది. ప్రజలకూ విషయం అర్థమైంది. ఇకమిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగడమే.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమై ఆరు దశాబ్దాలు గడచింది. దశాబ్ద కాలంనుంచీ ఇది తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో బంద్లు, వంటావార్పూ కార్యకమ్రాలు, ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతమయ్యాయి, తాజాగా తెలంగాణ మార్చ్ నిర్బంధంలో సైతం విజయం సాధించింది. అయితే తెలంగాణ రావడానికి అడ్డేమిటి? ఈ విషయంపైనే తెలంగాణ జెఎసి దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. పార్టీపెడుతూనే స్థానిక సంస్థల ఎన్నికలకుఉరికిన టిఆర్ఎస్పై విశ్వాసాన్ని తగ్గించి, అన్ని దశల్లోనూ తమ ఆకాంక్షను వ్యక్తం చేసిన తెలంగాణవాదులు, ప్రజలపై విశ్వాసాన్ని ఉంచి పోరాట పటిమతో తెలంగాణ జెఎసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాల్సిన అవరం ఉన్నది..