అవినీతిలో ఎంత ఘనమైతే....

కుంభకోణాల్లో మీరు కాని,  అవినీతి కేసుల్లో  మీ పేరు కాని ఉండి కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి.. బయటకు వచ్చారా? అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను సంప్రదించండి. మీకు అత్యున్నతమైన పదవులు కాని, హోదాకాని లభించే అవకాశం ఉంది....! నేటి భారతంలో జరుగుతున్న రాజకీయ క్రీడ ఇది.  ఎవరిపై ఎన్ని  ఎక్కువ అవినీతి ఆరోపణలుండి, వారి పాత్ర ఉందని ఎంత ఎక్కువగా రుజువైతే... రాజకీయాల్లో అంత ఎక్కువ పబ్లిసిటీ.! అధికారంలో ఉండాలంటే... అవినీతివీరులను పక్కనే జేర్చుకోవాలలి... లేదా..వారికి మరేదైనా ఉన్నత గౌరవం కట్టబెట్టాలి... అప్పుడే ప్రభుత్వానికి మనుగడ..! అంతేకాని అవినీతిమయంగా మారిన ప్రభుత్వాన్ని నడిపే కంటే తిరిగి ఎన్నికల్లో పాల్గొని గెలిచిన, ఓడినా హుందాగా వైదొలగాలని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడం ఏదీ ముఖ్యమంటే... మాకు అధికారమే ముఖ్యం.  ప్రజలు మా అవినీతిని ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కొన్నిరోజులకు మరచిపోతారు... ఎన్నికలొస్తే తిరిగి మేమే ఎన్నికవుతాం.  అందుకు మా లెక్కలు మాకుంటాయి.. అంటారు...! లేకుంటే కామన్వెల్త్‌ క్రీడల  కుంభకోణంలో  ఆరోపణులుఎదుర్కొని తొమ్మిది నెలలు జైలు జీవితం అనుభవించిన   కాంగ్రెస్‌ ఎం.పి. సురేష్‌ కల్మాడీ,  2జి కుంభకోణంలో  సంవత్సరం పైగా జైలు జీవితం అనుభవించి బెయిల్‌పై విడుదలైన  డిఎంకె ఎం.పి. ఎ. రాజాలను  పార్లమెంటరీ  స్థాయీ సంఘాల్లో సభ్యులుగా నియమించడం చూస్తే పాలకులు ప్రజలకు తప్పుదోవలో నడిస్తే అందలం ఎక్కవచ్చునన్న సంకేతాలుపంపుతున్నట్లుగా ఉందని సగటు మనిషి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఉచిత మందులా...నమ్మాలా!

ఆరోగ్య రక్షణను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యాసవర మందులను ఉచితంగా సరఫరా చేసే పథకం ప్రారంభించాలని  ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి గులాం నబీ ఆజాద్‌ చెప్పారు.  ప్రభుత్వం తీసుకోబోయే ఈ చర్యవల్ల మందులకోసం ప్రజలు చేసే ఖర్చు తగ్గుతుందని,  మందుల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, అనవసరమైన, అశాస్త్రీయమైన, హానికరమైన మందుల వినియోగాన్ని అదుపు చేసేందుకు కూడా ఈ చర్య దోహదపడుతుందని  అన్నారు. మంత్రిగారి ఆలోచన చాలా బాగుంది. అయితే ఆచరణే అనుమానస్పదం. ఎందుకంటే దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజల్లో సంతృప్తికరమైన భావన లేదు. ప్రజలను పీడించే ఆసుపత్రులుగానే వాటిని చూస్తుంటారు. అంతేకాదు డాక్టర్లు ఉండరు, ఉన్నా సమయానికి అందుబాటులో ఉండరు. అలా వున్నా... రోగులను పరీక్షించి తమ తమ స్వంత ఆసుపత్రులను పంపించేస్తుంటారు.  మందులు సైతం కాలం చెల్లినవే రోగులకు ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడిన ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆసుపత్రుల్లో ఉచితంగా రోగులకు మందుల పంపిణీ... ఎంత హాస్యాస్పదం...! కొత్తగా పేషెంట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయితే వార్డుబాయ్‌ దగ్గర నుండి అందరికి ఎంతో కొంత ముట్టచెప్పవలసిందే... రోగి బ్రతికితే సంతోషంగా వారే ఇస్తారు... ఆపరేషన్‌ సక్సెస్‌... పేషెంట్‌ డెడ్‌.. అన్న రీతిలో పేషెంట్‌ మరణిస్తే... అక్కడి నుండి పేషెంట్‌ బయటకు రావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే... ఇప్పుడు ఉచితమందులంటున్నారు.  ఇచ్చేందుకు ఉచితం.. అయినా మాకూ ఖర్చులుంటాయంటూ డబ్బులు వసూలు చేస్తారు... ఎంతోమంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు చశారు. అలాగే ఎంతోమంది అక్కడే పనిచేస్తూ స్వంతంగా ఆసుపత్రులునడుపుతున్న దాఖలాలు గతంలో ఎన్నో వచ్చాయి. తాంబూలాలు ఇచ్చేశాం... తన్నుకుచావండి... అన్న రీతిలో ప్రకటనలు చేశాం. అయిపోయింది అన్నట్లుగా ఉంటాయి ప్రభుత్వ చేతలు... అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల బారిన పడి బయటపడిన ఎంతోమంది సామాన్యులు పలుకుతున్న మాటలివి.

సర్కారు సర్కస్‌ఫీట్లు ` తనిఖీలు ఆరంభశూరత్వమే!

ఎన్నెన్నో కబుర్లు చెప్పారు... కార్పొరేట్‌ కాలేజీల నడ్డి వంచేస్తామన్నారు... ఇంజనీరింగ్‌ కాలేజీల భరతం పట్టేస్తామన్నారు... పేదవిద్యార్థికి క్వాలిటీ చదువును కడు చౌకగా ఇప్పిస్తామన్నారు...! ఇదంతా చూసి ‘అబ్బో... కిరణ్‌ సర్కారు కార్పొరేట్‌ కాలేజీల దందాగిరీపై కొరడా రaళిపించింది... ఇక కార్పొరేట్‌ కాలేజీలు ఆయ్‌మాయ్‌గారడీలు చెయ్యకుండా నాణ్యమైన చదువును ఖచ్చితంగా అందిస్తాయంటూ ‘పాపం అమాయక తల్లిదండ్రులు’ తెగ సంతోషపడిపోయారు! వారి సంతోషంపై నీళ్ళుజల్లేస్తూ తనిఖీలకు తిలోదకాలిచ్చేసింది అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టిస్తూ, ఘనతవహిస్తున్న కిరణ్‌సర్కార్‌! ‘ఇదంతా మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను కాస్సేపు మర్చిపోయేటట్లుగా చెయ్యడంకోసమేనన్నట్లని’ నిరూపిస్తూ కిరణ్‌ ప్రభుత్వం ఇంత కథ నడిపించిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఫీజులవివాదంతో టాస్క్‌ఫోర్సును హడావిడిగా ఏర్పాటుచేసి, దాన్ని సుమారు గత నాలుగునెలలుగా పోషిస్తూ, భారీమొత్తాన్ని వెచ్చిస్తున్న సర్కార్‌, తనిఖీల అంశాన్ని అటకెక్కించగంతో ఖర్చుపెట్టిన ఈమొత్తమంతా బూడిదలో పోసినట్లయ్యింది. సర్కారువారి టాస్క్‌‘ఫార్స్‌’ ఎత్తుగడతో ధర్మాన రాజీనామా అంశం, మంత్రులపై అవినీతి ఆరోపణలు,  సిబిఐ కేసులు... అన్నీ నిజంగానే పక్కదారిపట్టినట్టనిపిస్తోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కరువు ప్రాంతాల్లో గుప్తనిధుల వేట?

తరుచుగా కరువు ప్రాంతాల్లోనే గుప్తనిధుల వేట సాగుతోంది.  ఈ ప్రాంతాల్లో పని దొరకక ఖాళీగా ఉండే వారిని కొందరు వ్యాపారులు గుర్తించి వారిని గుప్తనిధుల తవ్వకాలకు వినియోగిస్తున్నారని సమాచారం. దీంతో వారు తమకు పని, ఆదాయం లభిస్తోందని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు ఏమి చెబితే దాన్ని యథాతథంగా అమలు చేస్తున్నారు. కొన్నేసార్లు పొరబాట్లు జరిగితే వాటిని భరించటానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో గుప్తనిధుల వేట మూడుపువ్వులూ, ఆరుకాయలూలా విస్తరిస్తోందని తేలుస్తోంది. ప్రత్యేకించి ఈ పరిస్థితిని అథ్యయనం చేసిన పోలీసు అధికారులు కూడా ఆశ్చర్యపోయే అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కర్నూలు, కడప, చిత్తూరు తదితర రాయలసీమ జిల్లాల్లో ఇప్పటివరకూ ఈ గుప్తనిధుల తవ్వకాలు బారీస్థాయిలో జరిగాయి. కొత్తగా ఇప్పుడు తెలంగాణా జిల్లాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.రంగారెడ్డి జిల్లా తక్కళ్లపల్లి గ్రామంలోని సాగర్‌ రహదారి దగ్గర గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి. రాక్షసగుహలు ఇక్కడ ఉన్నాయని చెప్పుకుంటారు. అందువల్ల భారీగా లాభం వస్తుందని తవ్వకాలు జరిపేవారు ఆశపడుతుంటారు. ఈ తవ్వకాలకు జెసిబి వినియోగించారంటే తవ్వకందార్లు ఎంత తెలివిమీరారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎనిమిది అడుగుల లోతున తవ్వకాలు జరిగిన అధికార యంత్రాంగం మాత్రం స్పందించలేదు. ఆమ్యామ్యాలు అందుకున్నందునే అథికారులు స్పందించలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తవ్వకందార్లు లాభపడ్డారని మాత్రం తెలుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన తవ్వకాలను బట్టి అన్ని ప్రాంతాలు కరువుకోరల్లో ఉన్నవే కావటం గమనార్హం.

చంద్రబాబుకి ఎన్టీఆర్ స్తుతే గతి!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు ఇంకా ప్రజల గుండెల్లోనే దాగి ఉన్నారు.  ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈయన్ని తలుచుకుంటూనే ఉంటారు. ఇంకా కొన్ని గిరిజన తెగలైతే రాముడు, కృష్ణుని పాత్రల్లో ఉన్న ఎన్టీఆర్‌ పటాన్ని పూజామందిరంలో ఉంచుకున్నారు. అలానే ఎన్టీఆర్‌ను హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలు బాగా ఆదరించారు. ఇప్పటికీ ఆయన అంటే అభిమానాన్ని చూపే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా పాదయాత్రను ప్రారంభించారు. దీంతో ఈ నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకునేందుకు జనాన్ని ఆకర్షించేందుకు బాబు ఎన్టీఆర్‌ను స్తుతించారు. ‘‘ ఎన్టీఆర్‌ నడయాడిన నేల ఈ గడ్డ. నాకు ఈ ప్రాంతమంటే ఎంతో అభిమానం.  అందుకే ఆయన ఆశయాల్లోనే నేను నడుస్తాను. ’’ అని చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌పై అభిమానంతో తాను ఈ ప్రాంత అభివృద్థికి తన వంతు కృషి చేస్తానని కూడా భరోసా ఇచ్చారు.

సర్కారీ బడుల్లో మౌళికవసతుల లోపం వెనుక పాపం ఎవరిదీ?

నిన్న కాక మొన్న కట్టిన ప్రైవేటు స్కూలు మౌళికవసతుల్లో ముందుంటోంది. మరి అరవైఏళ్ల క్రితం ప్రారంభమైన సర్కారీ బళ్లలో మాత్రం మౌళికవసతుల లేమి కొట్టచ్చినట్లు కనబడుతోంది. ఈ లోపం వెనుక పాపం ఎవరిదీ? అని ఒక్కసారి పరిశీలిస్తే నిజాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఈ బళ్లలో చదువుకునే నేతలుగా ఎదిగిన వారు సైతం గతాన్ని మరిచిపోతున్నారన్నది వాస్తవం.  భారతరాష్ట్రపతులు కూడా సర్కారీబళ్లలో చదువుకున్న వారే. గతంలో సర్కారీబళ్లే తప్ప ప్రైవేటు విద్యాలయాలు ఉండేవి కావు. అటువంటి కీలకమైన ఈ బళ్లలో మౌళిక వసతులు కల్పించాలని సీరియస్‌గా అరవైఏళ్ల క్రితం నిర్ణయం తీసుకున్న వారే లేరు. అలాగని అప్పట్లో అవకాశాలు లేవా? అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నిధుల నుంచి స్కూలుభవనాలకు కేటాయింపులు జరిగేవి. కానీ, నిర్మాణంలో నాణ్యతాలోపాలు ఎక్కువ. అయితే మరుగుదొడ్లు, మంచినీరు వంటి వసతుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవానికి విద్యార్థినులు, స్కూలు టీచర్లు(మహిళలు) బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గమనించినా ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. కానీ, ఒక్కసారి తలుచుకుంటే ఈ సమస్యలు పరిష్కరించటం ఏమంత కష్టం కాదు. తాజాగా సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బళ్లలో మౌళికవసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించింది.  దీని కోసం తాము ఇచ్చిన మార్గదర్శకాలను కూడా అనుసరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌21`ఏ ప్రకారం బాలికల మరుగుదొడ్ల వంటి మౌళికవసతుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు ప్రభుత్వ పనితీరును పరిగణించాల్సి వస్తుందని సుప్రీం హెచ్చరించింది. ప్రస్తుతం రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఎంత వరకూ అమలు చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ తీర్పు అమలు కోసం మరోసారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు కావాల్సి ఉంటుందేమో కూడా.

మారని జి.హెచ్‌,ఎం.సి. పని తీరు

నిమజ్జనం జరిగి నాలుగు రోజులు గడచి పోయినా ఇంతవరకు హుస్సేన్‌ సాగర్‌ను క్లీనింగ్‌ పూర్తికాలేదు. అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సులో వేల మంది హైదరాబాద్‌కు వచ్చి ఉండగా కూడా జి.హెచ్‌,ఎం.సి. తన పనితీరును మెరుగు పరచుకోక పోవడం నగరవాసులకు ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్‌కు లాండ్‌ మార్క్‌ అయిన హుస్సేన్‌ సాగర్‌ను పరిశుబ్రం చేస్తేనే బుద్దవిగ్రహం దగ్గరకు వచ్చే విదేశీ అతిధులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఆరకొర చేసిన ఏర్పాట్లవల్ల మొన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యి గుంతలన్నీ నీటితో నిలచి పోయాయి. టూరిజానికి అందివచ్చిన అవకాశాన్ని గ్రేటర్‌ మున్సిపాలిటీ ఏ మాత్రం వినియోగించుకోలేక పోతుంది. ఇంతవరకు టూరిజంకోసం బస్సులుగాని ట్యాక్సీలను గాని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. హోటల్స్‌కు మాత్రం ఈ ఇరవైరోజుల్లో సుమారు 1500 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా త్వరిత గతిని శుబ్రపరచి విదేశీ అతిధులకు రాష్ట్రం పై సదభిప్రాయం కలిగించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.

విద్యార్ధులకు ఆకులు అలమలే గతి

  ఆంధ్రాయూనివర్సిటీలోని విద్యార్దులు ఆకస్మిక ఆందోళన చేపట్టారు. పెంచిన మెస్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని వారు ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడు ఆందోళనలకు దూరంగా వుండే సైన్సు విద్యార్ధులు కూడా ఇందులో పాల్గోన్నారు. గ్యాసు, డీజిల్‌ చార్జీలు పెరిగాయని మెస్‌ బిల్లులను అమాంతం పెంచేయటం తమకు ఇబ్బంది కరంగా వుందని అలాగే హాస్టల్స్‌లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వెలగని ట్యూబ్‌లైట్లు,మంచినీరు, అలాగే భోజన వసతులు ఏమాత్రం బాగుండలేదని వారు ఆరోపిస్తున్నారు. దానికి నిరసనగా విద్యార్ధులు ఆకులు అలములు తింటూ వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి పూర్తి స్ధాయి వైస్‌ చాన్సలర్‌ లేనందువల్ల ప్రస్తుతం ఉన్న వారికే తమ డిమాండ్లను వివరిస్తామన్నారు. బుధవారం భోజనం చేయకుండా వారు రోడ్ల మీదనే బైటాయించి నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ జెఎసి జోరు , కాంగ్రెస్‌ బేజారు

సెప్టెంబరు 30న జరిగిన తెలంగాణ మార్చ్‌ తరువాత కోదడరాం నడిపుతున్న తెలంగాణ జెఎసి మీద అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఆ రోజు జరిపిన మార్చ్‌కు తెలంగాణ ప్రజలనుండి, అన్ని పార్టీల తెలంగాణ నాయకులనుండి  అశేష మద్దతు పెరగటంతో టిజాక్‌ పైనే అందరి ధృష్టీ  పడిరది. ఈ రోజు జరుగుతున్న  కార్యాచరణ సదస్సు పైనే అందరి అంచనాలు ఉన్నాయి. ఎవరి దారి వారిదైనా అందరూ కలసి తెలంగాణ రాష్ట్ర సాధన కోరకు పరిశ్రమించడం పై టిజాక్‌కు అదృష్టం వరించింది. అయితే అధికార కాంగ్రెస్‌ ఎమ్మేల్యేలకు, ఎంపిలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మళ్లీ ఎక్కడ పదవులకు  రాజీనామా చెయ్యమంటారో అని మధన పడుతున్నారు. అదే జరిగితే రానున్న రోజుల్లో రాజీనామా చేస్తే రావల్సిన ఫండ్సు ఆగిపోతాయంటున్నారు. తాము ప్రాతినిద్యం వహించే నియోజక వర్గానికి ఏమీ చెయ్యలేమని దాంతో ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు భయపడుతున్నారు. అందుకే వారు తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తుంది. తెలంగాణ మార్చ్‌ కు అనుమతి తెచ్చింది టి కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలే అయినా వారిలో చాల కొద్ది మంది మాత్రమే పాల్గోన్నారు. మిగతా వారు ఇంటికే పరిమిత మయ్యారు.  ఏది ఏమైనా తెలంగాణ జెఎసి జోరు టి కాంగ్రెస్‌ వారికి తలనొప్పిగా మారింది.

ఇంజనీరింగ్‌ కాలేజీలపై టాస్క్‌ఫోర్సు తనిఖీలు లేనట్లే

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల పని తీరు పెంచుతామని సరైన నిర్వహణకోసం టాస్క్‌ ఫోర్సుతో తనిఖీలు చేయిస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం తన పని తీరును మార్చు కోలేదు. అందుకు ఉదాహరణే ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఈ రోజు నుండి జరపవలసిన టాస్క్‌ఫోర్సు తనిఖీలను ఆపవల్సిందిగా  సాంకేతిక విద్యాశాఖ జారీ చేసిన జీవోలే.  ప్రవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇంతవరకు నెరపిన రాయబారాలు ఫలించాయి. దీంతో  ప్రయివేటు ఇంజనీరింగ్‌లలో మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాలు పెరుగుతాయని ఎదురుచూసిన విద్యార్దులు, వారి తల్లి దండ్రులు ఎంతో నిరాశకు గురి అవుతున్నారు. ప్రతి ఏడాది లక్షలు అడ్డదారిలో సంపాదిస్తున్న ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈ ఏడాది కూడా అనుకూలంగా పరిస్థిలనుమార్చుకున్నారు. ఇప్పటికే కొన్ని కాలేజీలు డిమాండు వున్న బ్రాంచెస్‌లో కృత్రిమ కొరత సృష్టించి అక్రమ పద్దతుల్లో స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో ఐదు లక్షలనుండి మొదలు బెట్టి అందిన కాడికి దండుకుంటున్నారు.ప్రవేటు కాలేజీల ఇష్టారాజ్యంగా మారిందని ఇక పై ఈరాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెరుగుతాయనుకోవడం ఇక కలే నని మేధావులు పెదవి విరుస్తున్నారు

విశాఖలో దోపిడీ దొంగల బీభత్సం

విశాఖను దోపిడీ దొంగలు గజగజ లాడిస్తున్నారు. పూటకో దొంగతనం చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు .చైన్‌ స్నాచింగ్‌లు, కిడ్నాపులు, సైబర్‌నేరాలు, వైట్‌ కాలర్‌ నేరాలు సర్వ సాధారణ మయిపోయాయి. పూటకో చిట్‌ఫండ్‌ సంస్థ ప్రజల డబ్బుతో బోర్డు తిప్పేస్తున్నారు. ఇదివరలో విశాఖపట్టణం మామూలు పట్టణంలాగానే వుండేది అయితే ప్రభుత్వం గ్రేటర్‌ విశాఖగా మార్చిన తర్వాత విశాఖ పరిధి విస్తరించింది. పరిశ్రమలు పెగిగాయి నగర జనాభా 20 లక్షలకు చేరింది. అయితే అందుకు తగ్గట్టుగా పోలీస్‌ స్టేషన్లు పెరగలేదు. అందునా నగర శివార్లలో మరీ తక్కువగా పోలీస్‌ స్టేషన్లు ఉండటంతో దొంగలు విజృంభిస్తున్నారు. ఇదివరలా తాళాలేసిన ఇళ్లను మాత్రమే దోచుకొనడంలేదు. పగలు ఇంట్లో అందరూ ఉండగానే వారు భయోత్పాదం సృష్టించి అందినంతా దోచుకుంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న నగల దుకాణంలో పట్టపగలు దుకాణ యజమానిని తీవ్రంగా గాయపరచి బంగారం ఎత్తుకు పోయారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని అతని కొడుకును తీవ్రంగా గాయపరచి వారు  పెద్దఎత్తున నగదు, నగలు దోచుకున్నారు. ఈ ఘటనలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అతని కొడుకు హత్యకు గురిఅయ్యారు.  అడపాదడప పోలీసులు వచ్చి బెంగాల్‌, మహారాష్ట్ర , ఇరానీ, బీహారీ దోపిడి దొంగల ముఠా అని చెబుతూ నలుగురిని అరెస్టు చేసి మీడియా ముందుకు తెస్తున్నారు తప్ప కట్టు దిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు సరికదా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ కమీషనర్‌ పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి  దోపిడి దొంగలనుండి సత్వరమే రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద చంద్రబాబు ఛలోక్తులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హుషారొచ్చింది. మీకోసం వస్తున్నా 117రోజుల యాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పిల్ల కాంగ్రెస్‌ అని వ్యంగ్యోక్తిని వదిలారు. అసలే పాదయాత్రలకు మద్దతు కూడగడుతున్నారని తెలిసి అప్రమత్తమవుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని తన వ్యంగ్యోక్తి ద్వారా బాబు నిద్ర లేపినట్లు అయింది. ఈ పాదయాత్రను ఎదుర్కోవాలి అని ఆ పార్టీ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటోంది. ఆ విషయం తెలియని బాబు పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు అప్పటికప్పుడు వదులుతున్నారు. మరి ఎంఎ పాలిటిక్స్‌ చదివిన చంద్రబాబు అకస్మాత్తుగా పరిస్థితిని బట్టి విమర్శలను మార్చటంలో దిట్ట అని ఎప్పటి నుంచో పేరు గడించారు కదా! అయితే ఈ విమర్శలను, వ్యంగ్యోక్తులను వదిలేటప్పుడు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుండేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటున్నారు. తమ వంటి పిల్ల కాంగ్రెస్‌ లేకపోతే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ చేతిలో దారుణమైన ఓటమిని బాబు చవిచూడాల్సి వచ్చేదని గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. 17అసెంబ్లీ స్థానాలకు 15స్థానాలు సాధించుకున్న తాము పిల్లకాంగ్రెస్‌ అయితే వెన్నుపోటు ద్వారా అధికారం కైవసం చేసుకున్న బాబు మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా బాబు ప్రసంగాలపై అప్పటికప్పుడే సమాధానం ఇచ్చేందుకు వైకాపా సిద్ధమవుతోంది.

బైర్రెడ్డి రాజకీయభవిష్యత్తు ఏమిటీ? టీజీ సాయంతో కాంగ్రెస్‌ నీడన చేరుతారా?

రాయలసీమను ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండుతో అనంతపురం నుంచి యాత్ర ప్రారంభించిన రాయలసీమహక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడిరది.  ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి పదివిలో ఇంత వరకూ కొనసాగారు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా యాత్ర ప్రారంభించే రోజునే తానూ యాత్ర ప్రారంభించాలని బైర్రెడ్డి నిశ్చయించుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈయన్ని వదిలేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ విషయం ముందుగా తెలుసుకున్న బైర్రెడ్డి తాను ముందుగా రాజీనామా పంపించారు. కనీసం రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం కోసం రాజీనామా చేశానని చెప్పుకోవటానికి రాజశేఖరరెడ్డి ఇది అవకాశంగా తీసుకున్నారు. ఈ అవకాశం వల్ల తాను తెలుగుదేశం పార్టీకి దూరమైన విషయం బైర్రెడ్డికి తెలుస్తూనే ఉంది. అయితే ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ దశలో రాయలసీమ ప్రాంతానికి చెందిన చిన్న, భారీనీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌ కూడా బైర్రెడ్డి మాదిరిగా సీమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గొంతు విప్పారు. తనతో పాటు రెండో గొంతు కలిపిన మంత్రి వెంకటేష్‌ రాయలసీమ హక్కుల వేదిక నేత కూడా అవటంతో బైర్రెడ్డిని ఆయనే కాంగ్రెస్‌పార్టీలోకి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రి వెంకటేష్‌ సీమకు ప్రత్యేకప్యాకేజీ కావాలని డిమాండు చేస్తున్నారు. దీంతో ఒకరకంగా కాంగ్రెస్‌కు బైర్రెడ్డి దగ్గరైనట్లు వాతావరణం కనిపిస్తున్నా మరోవైపు మొత్తం సీమపై పట్టుసాధించాలంటే కొంత కాలం తన రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టాలని ముఖ్యసలహాదారులు ఆయనకు సలహా ఇచ్చారట. ఈ సలహా వల్ల ఆయన ఎంత వరకూ కాంగ్రెస్‌కు దగ్గరవుతారన్నది ఇప్పుడే తేల్చలేకపోతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాక మరో ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ ఒక్కటే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఆప్షన్‌ వెదుకున్న కేసిఆర్‌?

దారులన్నీ మూసుకుపోయాయనుకున్నప్పుడు ఏదో ఒక ఆప్షన్‌ దొరికితేనే జనంలోకి వెళ్లగలమని నేతలకు బాగా తెలుసు. అటువంటి ఆప్షన్‌ వెదుక్కోవటంలో కొందరు సిద్ధహస్తులుంటారు. మరికొందరు ముందుగా మాటపడి తరువాత తమ తడబాటును కప్పిపుచ్చుకోగలుగుతారు. అటువంటి కోవలోకి తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) అధినేత కే చంద్రశేఖరరావు(కేసిఆర్‌) కూడా చేరారు. అసలు ఆయన అనుకున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం కనుక తెలంగాణా ప్రత్యేకప్రతిపత్తి ప్రకటించేసి ఉంటే ఇప్పుడు తన ప్రాంతంలో రారాజులా తిరగగలిగేవారు. అయితే అధిష్టానం తమ స్పందనను తెలియజేయకపోవటంతో కేసిఆర్‌ తన ఇంటికి అత్యవసరపనులపై వెళ్లాల్సి వస్తోంది కాబట్టి మరోదారి వెదుక్కున్నారు. కలవాల్సిన వారికన్నా ఎక్కువమందినే కలిశానని ప్రకటించేసుకున్నారు. దానికి కొనసాగింపుగా ఇంకోసారి తెలంగాణాపై చివరాఖరి చర్చ జరిగి కాంగ్రెస్‌ నుంచి ప్రకటన వెలువడుతుందని సర్దిచెప్పారు. అదేంటి ఇంతకాలం ఢల్లీలో కేసిఆర్‌ ఏమి చేశారని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండానే కలవాల్సిన వారి కన్నా ఎక్కువ కల్సానని చెప్పుకొచ్చారు. అంటే తన సొంత ఊరికి వెళ్లటానికి ఉన్న అడ్డంకులను కేసిఆర్‌ తెలివిగా రెండు వాక్యాల ప్రకటన ద్వారా తప్పించారన్న మాట. ఒకవేళ తాను మళ్లీ ఢల్లీ వెళ్లాల్సి వచ్చినా చర్చలు అని చెప్పటానికి రెండో వాక్యం వదిలారన్న మాట. అంటే ఇంతకాలం అసలు స్పందించాల్సిన వారు స్పందించలేదన్న మాట కేసిఆర్‌ ఎంత తెలివిగా సర్దుకున్నా బయటపడిపోతోంది. అయితే కేసిఆర్‌ను తప్పుపట్టిన తెలంగాణా నేతలు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విమలక్క తదితరులను టిఆర్‌ఎస్‌ నేతలు వెలివేసేందుకు సైతం సిద్ధపడ్డారు. అందువల్ల కేసిఆర్‌ ఆదరణకు లోటు లేదు. మరోసారి అవసరమైతే ఆయన ఆప్షన్‌ వెదుక్కోవచ్చు కూడా.

రైతులను మోసం చేస్తున్న బిటి కంపెనీలు?

సాంప్రదాయక వ్యవసాయానికి రాష్ట్రానికి ఉన్న పేరును బిటి విత్తనాల కంపెనీలు పాడు చేశాయి. ఒకపక్క రైతులను మోసం చేశాయి. మరోపక్క తాము సొమ్ము చేసుకుని రాష్ట్రప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాయి. ఈ కంపెనీలు ఇప్పటికే దేశంలో రెండు వేల కోట్ల రూపాయల వాణిజ్యాన్ని చేస్తున్నాయి. రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ బిటి విత్తనాలు వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి పత్తి ఉత్పత్తి ఎక్కువగా వస్తుందని ఈ విత్తనాలు ఉపయోగించాలని వ్యవసాయశాఖాధికారులు కోడైకూశారు. దీంతో రైతులు అధికారుల సూచనలు నమ్మి ఈ విత్తనాలు ఉపయోగించారు. ఇప్పుడు తాజాగా జరిగిన పరిశోధనల్లో బిటి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని తేలింది. మనదేశ వ్యవసాయంపై దృష్టిసారించిన జపాన్‌ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. పైగా, ఈ బిటి విత్తనాలు ద్వారా వేసిన పంట నుంచి తీసిన నూనె కూడా ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ నూనె వినియోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడటం వైద్యుల చేతిలో ఉండదని కూడా హెచ్చరించారు. తమ స్వార్థం కోసం బిటి కంపెనీలు వ్యవసాయాధికారుల సహకారంతో రాష్ట్ర రైతాంగాన్ని సాంప్రదాయపంటల నుంచి మళ్లించకుండా ఉంటే పరిస్థితి కొంతమేర ఆశాజనకంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ బిటి విత్తనవినియోగం వల్ల భూసారం దెబ్బతిందేమోనని రైతులు తక్షణం ఒకసారి పరిశోధనలు చేయించాలని వారు సూచిస్తున్నారు. జపాన్‌ వంటి దేశాలు కూడా సాంప్రదాయపంటలుగా జొన్న వంటి వాటిపై ఆధారపడినప్పుడు రాష్ట్రరైతులు విదేశీవిజ్ఞానాన్ని వినియోగించుకోవటం మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి వెంటనే అప్రమత్తమై రైతులు తక్షణ జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ నిపుణుల సూచనలను మహారాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్‌ సిడి మహీ కూడా బలపరుస్తున్నారు.

నేటికి సరే... రేపటికి ఏమో....!

దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పుట్టింది. ఆ పార్టీ పేరు త్వరలో వెల్లడికానుంది. అయితే ఆ పార్టీ పెట్టింది ఎవరో కాదు  అవినీతిపై అన్నా హజారేతో కలసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్న ఆయన బృందంలోని ప్రముఖులు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆయనతో పాటు మరికొందరు కలిసి ఇంకా పేరునిర్ణయించని పార్టీని పెట్టారు.  భవిష్యత్‌ ఎన్నికల్లో పోటీచేస్తుందని, అన్నాహాజారేకు తనకు మధ్య విభేదాలు లేవని, మంచి అభ్యర్ధులకు మద్దతిస్తానని హజారే చెప్పారన్నారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘క్రేజీవాల్‌ కొత్తపార్టీని ప్రారంభించారని మీడియా పేర్కొంటోంది. కాని ఇది నా పార్టీ కాదు. మీ పార్టీ... ఇది ప్రజల పార్టీ. అన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతూ ‘గెలుస్తామా ఓడిపోతామా అన్నది నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను పోరాడకపోతే  ఒక అవకాశాన్ని వృధాచేశానని  భవిష్యత్‌లో నా పిల్లలు నిందిస్తారు’ అన్నారు. ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా, అవినీతిరహితంగా పనిచేసే పార్టీ అవసరం. ఇప్పటివరకు అవినీతిపై నిస్వార్ధంగా హజారేతో కలిసి పోరాడి ఇప్పుడు  రాజకీయపార్టీ పెట్టిన క్రేజీవాల్‌  ఓ రాజకీయపార్టీ అధినేతగా అదే అవినీతిపై ఎంతవరకు పోరాడగలరన్నది సామాన్యులను సైతం వేధిస్తున్న ప్రశ్న! రాబోయే కాలంలో ఈ పార్టీ మిగతా అన్ని పార్టీల్లా కాకుండా తన ప్రత్యేకతను నిలుపుకుంటుందో... ఆ పార్టీల సరసన చేరుతుందో... రాబోయే ఎన్నికల దాని భవితవ్యం నిర్ణయిస్తాయి. నేటి రాజకీయాలు  వీరే గనుక ఇప్పుడుంటే... ధర్మరాజును అవినీతిమంతునిగా చేయగల నేర్పు, హరిశ్చంద్రచక్రవర్తితో సైతం అలవోకగా అబద్ధాలు ఆడిరచగల చాకచక్యం ఈనాటి రాజకీయాలకు ఉన్నాయి. అందుకే రాబోయే పార్టీపై సామాన్యుడి సందేహం..

ఈ సృష్టి ఏటు దారితీసేనో....

లడఖ్‌లోని  డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూట్‌ రిసెర్చ్‌ (డిఐహెచ్‌ఎఆర్‌) తీవ్ర చలిలోను తట్టుకోగల  కొత్త సంకరజాతి ఆవులను, మేకలను  అభివృద్ది చేసింది.   అవసరాలకు తగినట్లుగా, సైనికులకు పుష్కలంగా మాంసాహారం, పాల ఉత్పత్తులను అందించే లక్ష్యంతో వీటిని వృద్ధి చేసింది. లడఖ్‌, హిమాలయాలు ఇతర చలి ప్రాంతాల్లో ఉన్న వాతవరణాన్ని ఇవి సమర్ధవంతంగా తట్టుకోగలవు. ఈ సంకరజాతి ఆవులు 25 లీటర్లపాలను  ఇచ్చే సామర్ధ్యం ఉందని తెలిపింది.  దీనివల్ల సైనికులు స్థానిక ప్రాంతాలపై ఆధారపడటం 25శాతం తగ్గిపోతుందని తెలిపింది. చాలా బావుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి ఎన్నిటినో సంకరంచేశారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఎంతోమంది అభిప్రాయపడ్డారు.  ఇప్పుడు సంకరజాతి ఆవులు.  ప్రయోగాలు చేయడం అధిక దిగుబడుల పేరుతో సంకరజాతి ఉత్పత్తులను సృష్టించడం.  వాటిని సామాన్యులు వినియోగించడం. కొంతకాలం తర్వాత వాటి ఉత్పత్తులపై అనుమానాలు, పరిశోధనలు. ఈ ప్రయోగాల ఫలితాలు అన్నిటా మంచి ఫలితాలను ఇస్తే అందరికి సంతోషమే.. అలాకాకుండా కొద్దికాలమనంతరం వాటి ప్రభావం చూపితే అప్పటి పరిస్థితి ఏమిటి! ఇప్పటికే వ్యవసాయంలో సంకరజాతి విత్తనాలను వాడి, ఉపయోగించకూడని ఎరువులను వాడి భూమిలో సారం,  పంటల దిగుబడి తగ్గిపోయింది. అటువంటిదే వీటి విషయంలోనూ జరిగితే... అన్నదే అన్నది సామాన్యుడి ప్రశ్న!

ఇప్పటికైనా...

వాస్తవాలు చేదుగా వున్నా కొన్ని సందర్భాల్లో వాటిని అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఆ వాస్తవాల సృష్టికర్తలు కావచ్చు, వాటి ఎదుగుదలకు కారకులు కావచ్చు, లేదా వాటిని ప్రోత్సహించిన వారు కావచ్చు. ఎంతో ఘనంగా ప్రారంభమైన జీవవైవిధ్యం సదస్సులో  జన్యుమార్పిడిపై జరుగుతున్న చర్చలు అలాగే వున్నాయి.  సదస్సు రెండవరోజు జన్యుమార్పిడి పంటలపై భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.  జన్యుమార్పిడి వల్ల సంభవించిన పరిణామాలపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్వచ్చంధ సంస్థలు, ఉద్యమకారుల వాదనలను  కొన్ని విత్తన కంపెనీలు కొంతమంది రైతుల ద్వారా  సానుకూలంగా చెప్పించేందుకు ప్రయత్నించాయి.  జన్యుమార్పిడి పంటల వల్ల జంతువులకు  ముఖ్యంగా పొలాల్లో ఉండే  ఎలుకలు, కుందేళ్ళలో కాలేయం, మూత్రపిండాల సమస్యలు రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పంటలను మనుషులు తింటూపోత  పరిస్థితులు ఎలా వుంటాయో ఆలోచించాలని కొందరు పరిశోధకులు తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. జన్యుమార్పిడి పంటల వల్ల వరంగల్‌జిల్లాలో మనుషులకు చర్మసంబంధమైన వ్యాధులొస్తున్నట్లు  తమ పరిశోధనల్లో తేలిందని దానికి సంబంధించిన పత్రాలను సైతం సదస్సు ముందుంచారు. కొంతకాలం క్రిందటి వరకు పంటలకోసం రైతులు తమ సొంత విత్తనాలు వాడేవారని,  ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్‌లో లభ్యమయ్యే  విత్తనాలపైనే రైతాంగం ఆధారపడవలసివస్తోందని అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ చెబితే, జీవ వైవిధ్యానికి నష్టం జరిగితే భర్తీచేయలేమని మరో ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇలా ఎంతోమంది జన్యుమార్పిడి పంటలపై తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. వీరు సూచించిన సూచనలు ఆయా ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించి, వెంటనే అమలు చేసినట్లయితే జన్యుమార్పిడివల్ల పంటలతో పాటు వాటిని ఉపయోగించే మనుషులు సరికొత్త రోగాల బారినపడకుండా కాపాడినవారౌతారు. దీనిపై విస్తృతస్థాయిలో చర్చలు జరగాలి. ఇప్పటికే పలుదేశాల్లో నిషేధించిన ఎరువులు, రసాయనాలను కొన్ని ఇతరదేశాల్లో ఉపయోగించడం జరుగుతోంది. అయితే ఈ సదస్సు కేవలం చర్చల వరకేనా... లేకా అమలుకు కృషి జరిగేనా అన్నది కొద్దికాలం ఆగితే కాని తెలియదు. నేడు చాలా ప్రభుత్వాలు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయి. వారికి విరుద్ధంగా చర్యలు చేపట్టడమంటే... పదవులపై ఆశ వదులుకున్నట్లే... ఆ సహసం ఆయా ప్రభుత్వాలు చేయగలవా! అన్నదే  అంతుచిక్కని ప్రశ్న?అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణావాదంలో లుకలుకలు?

ఆది నుంచి ప్రత్యేకతెలంగాణా వాదం ఓ పెద్ద విభేదాలకు తావిస్తూనే ఉంది. తెలుగుమాట్లాడే వారందరిదీ ఒకే జాతి అని జాతీయవాదాన్ని తోసిపుచ్చటానికి ఈ వాదాన్ని సృష్టించారన్నది జగమెరిగిన సత్యం. ఎన్నో రంగులు అద్ది కొత్తపోకడలు తీసుకువచ్చి సృష్టించిన ఈ తెలంగాణావాదం విభజించటానికి ఆజ్యం పోస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలా సమైక్యతాభావానికి ఇది గొడ్డలిపెట్టుగా మారింది. ప్రాంతీయ విభేదాలతో ఒకరిని ఒకరు తీవ్రంగా ద్వేషించుకునే వాతావరణం నెలకొంది. ఒక్క తెలంగాణా మినహాయించి యావత్తు ఆంధ్రప్రదేశ్‌ ఒకే తాటిపై ఉంది. కానీ, తెలంగాణావాదులు మాత్రం తమలో తాము గొడవపడుతూ, మిగిలిన యావత్తు రాష్ట్రంతో గొడవపడుతున్నారు. చెడపకురా చెడేవు అన్న సామెతకు తెలంగాణావాదులను నిదర్శనంగా చూపవచ్చు. పాలకుండలో విషపుచుక్కలా తెలంగాణావాదాన్ని యావత్తు రాష్ట్రానికి ఆపాదించేందుకు ఆ ప్రాంతీయులు సృష్టించిన రగడ యావత్తు రాష్ట్ర అభివృద్థిని దెబ్బతీస్తోంది. ఇప్పటి దాకా తెలంగాణేతరులు పెట్టిన పెట్టుబడులు, కట్టిన ఫ్యాక్టరీలు, తీసుకొచ్చిన సంస్కృతి తెలంగాణా ప్రాంతీయులు అలవర్చుకున్నారు. ఎప్పుడూ కరువుకాటకాలుతోనూ, రాళ్ల భూమిని సాగు చేయలేక వలసకూలీలుగా మారిన ప్రజలతోనూ తెలంగాణా నిత్యం  ఇతర ప్రాంతాలపై ఆధారపడే ఉంది. తెలంగాణావారిని రానీయకూడదని ఆంధ్రులు కూడా నిజాయితీ తీర్మానం చేస్తే ఆ ప్రాంతానికి బతకటానికి కనీసం కూసింత తిండిగింజలు జాన్తానై అంటాయి. ఈ విషయం తెలిసినా ఆ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బతికేందుకు తెలంగాణారాష్ట్ర సమితి, తెలంగాణా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఇంకా మరికొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. ఏకంగా బిజెపి అయితే తెలంగాణాలో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. అది టిఆర్‌ఎస్‌ను చావుదెబ్బ కొట్టయినా(తొక్కేసయినా) సరే పైకి రావాలని కోరుకుంటోంది. ఆ దిశగా బిజెపి అడుగులు కదుపుతూ ఉంటే మిగిలిన తెలంగాణావాద పార్టీలు తమకో జాతీయపార్టీ అండ దొరికిందని చంకలు గుద్దుకున్నాయి. అసలు వాస్తవాన్ని తెలుసుకున్న తెలంగాణారాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధినేత కేసిఆర్‌ ఢల్లీలో తిష్టవేశారు. ఈలోపు జెఎసి ఛైర్మను, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలంగాణామార్చ్‌ రాజధాని వరకూ నిర్వహించారు. ఆయన్ని ఒక సందర్భంలో ప్రశ్నిస్తే టిఆర్‌ఎస్‌ లేకపోతే జెఎసి కూడా లేదన్నారు. అటువంటి కోదండరామ్‌ ఇప్పుడు నేరుగా టిఆర్‌ఎస్‌ను చీల్చి చెండాడేద్దామనుకున్నారు. కానీ, ఆ పప్పులేం ఉడకలేదు. తాజాగా విమలక్క చేసిన వ్యాఖ్యలు అందరినీ రెబ్బగొడుతున్నాయి. ఇలా ప్రారంభమైన టిఆర్‌ఎస్‌ తమతో పాటు కలిసి పని చేయటానికి మిగిలిన పార్టీలు ముందుకు రావాలని కోరకుంటున్నాయి. తెలంగాణాజాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు టిఆర్‌ఎస్‌పై ధ్వజమెతుతున్నాయి.