గెలిచి పరువునిలుపుకున్న టీమిండియా

కొలంబోలో జరిగిన టి20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు మరోసారి సత్తాని చాటి విజయభేరీ మోగించారు. పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించడంద్వారా సెమీ ఫైనల్ ఆశల్ని సజీవంగా నిలబెట్టారు. ఆసాంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ల ధాటికి పాక్ బౌలర్లు, బ్యాట్స్ మెన్ నిలవలకపోయారు. మొదట బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ ఆటగాళ్లను భారత్ బౌలర్లు ఆలౌట్ చేశారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ బ్యాట్స్ మెన్ సత్తాని చాటి ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించిపెట్టారు. సయ్యద్ అజ్మల్ సహా పాకిస్తాన్ బౌలర్లెవరూ విరాట్ కోహ్లీపై ప్రభావం చూపలేకపోయారు. పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటయ్యింది. షోయబ్ మాలిక్ 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉమర్ అక్మల్ 21 పరుగులు సాధించాడు. లక్ష్మీపతి బాలాజీ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లను చేజిక్కించుకున్నారు. బ్యాటింగ్ మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే భారత్ గౌతమ్ గంభీర్ వికెట్ ని కోల్పోవాల్సొచ్చింది. వీరేందర్ సెహవాగ్ తో కలిసి చెలరేగి ఆడిన విరాట్ కోహ్లీ పాక్ బౌలర్ల గుండెల్లో బాంబులు పేల్చాడు. సెహ్వాగ్ 29 పరుగులకే వెనక్కి తిరిగినా మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీమాత్రం జట్టుని విజయతీరాలకు చేర్చాడు. 

నటనలో జీవిస్తున్న శ్వేతామీనన్

మళయాళ నటి శ్వేతామీనన్ ప్రసవ వేదన పడుతోంది. చకచకా ఓ కెమెరా టీమ్ డెలివరీ రూమ్ లోకి ఎంటరయ్యింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం టకటకా లైటింగ్ అరేంజ్ మెంట్స్ చేసేసుకున్నారు. శ్వేతామీనన్ పాపకి జన్మనిచ్చేటప్పుడు పడ్డ ప్రసవవేదనని షూట్ చేశారు. ఇదంతా సినిమాకోసం చేసిన నటనకాదు. నిజ జీవితంలో జరిగిన వాస్తవం. శ్వేత భర్త అనుమతితో, ఆస్పత్రివర్గాల అనుమతితోనే ఇదంతా జరిగింది. నిజజీవితంలో జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించిన సినిమా క్రూ శ్వేత తర్వాతి చిత్రంలో ఈ దృశ్యాల్ని ఉంచబోతున్నారట. బిడ్డ కడుపులోపడ్డ దగ్గర్నుంచి తల్లికి ఎదురయ్యే అనుభవాల సారాంశమే కొత్త సినిమా అని తనే చెబుతోంది. అందుకే నిజజీవితంలోని అనుభవాల్ని చిత్రీకరించి సినిమాకి అనుగుణంగా వాడుకునేందుకు శ్వేతామీనన్ తోపాటు ఆమె భర్తకూడా ఒప్పేసుకున్నాడట. నటనలో జీవిస్తున్న శ్వేతకి నిజంగా ఆస్కార్ కూడా సరిపోదేమో అని ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

నేడు కొత్త... రేపటికి పాతేనా...!

  జాషువాను జాతీయకవిగా గుర్తించేలా కేంద్రానికి తగు సిఫార్సులు చేస్తామని ఉపముఖ్యమంత్రి, తెలుగు అకాడమీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీలో జాషువా పరిశోధనా పీఠాన్ని ఏర్పాటుచేశామన్నారు. జాషువా 117వ జయంతి ఉత్సవాలు నిర్వహణ సందర్భంగా ‘జాషువా సాహితీ పురస్కారాలు`2012’ ప్రదానోత్సవంలో ఆయన ఈ మాటలన్నారు. అదే జరిగితే ప్రతి తెలుగువాడు ఎంతగానో సంతోషిస్తాడు. అయితే అది అమలు జరిగేనా అన్న అనుమానం అభిమానులకు కలుగుతోంది. ఎందుకంటే తెలుగువాడు అంటే కేంద్రానికి చాలా చిన్నచూపు. దీనికి తోడు తెలుగువారికి తెలుగువాడే శత్రువు అన్న కొత్త సామెతను సైతం చాలా సార్లు నిజం చేశారు. దేశంలోనే అత్యధికులు మాట్లాడే రెండో పెద్ద భాషగా గుర్తింపువున్న తెలుగును ఆ స్థాయిలో కేంద్రం గౌరవిస్తోందా... అధికారభాషగా వున్న మన రాష్ట్రం పూర్తిగా అమలుచేస్తోందా.. ఇటువంటివాటిపై ఇప్పటికే ఎన్నో సందేహాలు, వాస్తవాలు ఎంతోమంది పెద్దలకు తెలియనికావు. మరి ఇప్పుడు జాషువా వంటి కవికి జాతీయకవిగా గుర్తించేలా చేస్తారా అన్నది అనుమానం. మహాకవులుగా జనహృదయాల్లో నిలిచిపోయి, జాతికి, తెలుగుకు ఘనకీర్తిని తెచ్చిన ఎందరో కవులున్నారు. అంతేందుకు అందరూ చదివే ప్రతిజ్ఞను తెలుగువాడే వ్రాశాడని ఈ మధ్యనే తెలిసింది. వందమాతరం, జనగణమనలకు ఆయా రచయితల పేర్లున్నట్లే ప్రతిజ్ఞకు దాన్ని వ్రాసిన మన తెలుగాయన పేరు ఉండేలా కృషి చేస్తే మరింత ఆనందిస్తారు. అప్పుడు చెప్పడమే తప్ప, ఆ తర్వాత పట్టించుకోని మనవారి నైజం అందరికి తెలిసిందే కనుక నేటికి కొత్త రేపటికి పాత అన్నట్లుగా ఉంటుందని తెలుగుభాషా ప్రేమికులు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వాస్తవాలు ఆలోచిస్తే....నిజానికి నిజం అంతేనేమో!

ట్రిపుల్‌ ఐటీ సరే... మరి విద్యలో నాణ్యత!

  చిత్తూరుజిల్లా సరిహద్దు.. చెన్నై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోఉన్న సత్యవేడు వద్ద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ)ని 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణంలో...128 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేయబోతున్నారట. ఐటీరంగానికి బాసటగా వుండేలా ఉత్తమ ప్రమాణాలతో ఇంజనీరింగ్‌ విద్యను అందించడం ఈ సంస్థ ప్రధానోద్దేశం. దేశవ్యాప్తంగా 20 ట్రిపుల్‌ ఐటీలను స్థాపించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో ఒక్కొక్క దానికి 128 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం 50 శాతంనిధులను, 35శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 15శాతం నిధులు పబ్లిక్‌ లేదా ప్రైవేటురంగసంస్థలు భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయించాలి. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. దేశానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి మరింత ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యం అభినందనీయం. అయితే ఇప్పటికే ఐటీరంగానికి సేవలందిస్తున్న పలు సంస్థల్లో నాణ్యమైన విద్య లభించడం లేదని, దానికి తోడు విద్యార్థులపై ఆర్థికభారం కూడా ఎక్కువగా ఉందని వాపోతున్నారు ఎంతోమంది విద్యార్ధులు. ఐటీ రంగానికి ఉపయోగపడే దిగువస్థాయిలో చదువుకుంటున్న యువతకు నాణ్యమైన చదువును, ఆర్థికంగా వెనుకబడిన తెలివైన విద్యార్ధులకు ఆర్థిక వెసులుబాటుకు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ట్రిపుట్‌ ఐటీలు ప్రారంభమయ్యేనాటికి భారతదేశానికి కావలసిన అసలైన ఐటీ నిపుణులు తయారవుతారు. ముందు అది ఆలోచించాలని... నాసిరకం విద్యతో నాణ్యమైన పనులు చేయలేరని ఎంతోమంది విద్యార్దుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

మేమింతే...!

  వడ్డించేవాడు మనవాడు అయితే పంక్తిలో చివర్లో కూర్చున్నా వస్తుందన్న మాట నేటి కాలంలో ముమ్మాటికి ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా రాజకీయనేతల అండదండలున్న పెద్దలకు అటువంటిది మంచినీళ్ళు త్రాగినంత పని. రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతు ప్రతినిధులకు సైతం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలిలో పదవులను ప్రాతినిధ్యం కల్పించాలని ప్రత్యేక చట్టం చెబుతోంది. పాలకమండలిలో నలుగురు ఆదర్శరైతులుండాలన్నది నిబంధన. మరి ఈ నిబంధనలు ఎంతవరకు అమలుజరుగుతున్నాయో పాలకులకే తెలియాలి. ఆదర్శం కోటా పేరుతో తిరుపతి పట్టణానికి చెందిన బి. మమత అనే మహిళను ఎంపికచేశారు. ఈమెకు భూములున్నా వ్యవసాయం చేయడంలేదు. అంతేకాదు ఓ బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలు ఈమె. అలాగే ఎంపికైన మరో ఇద్దరు కూడా భూములున్నా వ్యవసాయం చేయడం లేదు. ఇలా ఏమిలేకుండానే ఉన్నాయని అందలం ఎక్కిస్తే ఎవరికి ప్రయోజనం! ఇప్పటికే దేశంలో, అందునా రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి దయనీయంగా వుంది. ఎంతోమంది ఉన్నతులు అధిరోహించిన స్థానాలను కొందరు తమ అవసరాలకోసం పదవుల పందేరా చేయడం ఎంతవరకు సమంజసం! వ్యవసాయంలో పలు ప్రయోగాలుచేస్తూ పంటలను సాగుచేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్న ఎంతోమంది సామాన్యరైతులున్నారు. వారిని ఇటువంటి పదవులకు ఎంపిక చేస్తే .. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది కనుక రైతులకు ఉపయోగపడే నిర్ణయాలను, పద్ధతులపై ఆసక్తిని చూపిస్తారు. అంతేకాని బ్యూటీపార్లర్‌ నడుపుకునేవారిని, వ్యాపారాలు చేసుకునేవారికి విజ్ఞానానికి పట్టుకొమ్మలైన విశ్వవిద్యాలయాల్లో అందునా ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవకాశం కల్పించడమంటే మేం చేసినా చెల్లుబాటవుతుందని, మాకు, మా సంబంధీకులకు పదవులే ముఖ్యం. మిగిలినవి ఏమైపోతే మాకేమి?. అన్నట్లుగా వుంది పాలకుల ఈ చర్య అంటున్నారు ఎంతోమంది విజ్ఞానప్రేమికులు. నిజమే బ్యూటీపార్లర్‌కు వ్యవసాయానికి సంబంధం ఏమిటో? ఎంపికచేసిన వారికే తెలియాలి?

పంతం నెగ్గించుకున్న సిఎం కిరణ్‌? డిజిపిగా దినేష్‌రెడ్డి

డిజిపి నియామకంలో కులసమీకరణ పాటించిన సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తన పేరు నిలబెట్టుకున్నారు. కేంద్రట్రిబ్యునల్‌(క్యాట్‌) ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డిజిపిగా దినేష్‌రెడ్డికి మరోసారి పూర్తిబాధ్యతలను సిఎం అప్పగించనున్నారు. గతంలో దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి గౌతంకుమార్‌ క్యాట్‌ ద్వారా వెల్లడించిన తీర్పును సిఎం ముందు నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు. రాజకీయ నాయకులే స్వయంగా తనను అడ్డుకుంటున్నారని గ్రహించే గౌతం కుమార్‌ తనపై భవిష్యత్తులో ఒత్తిడి వస్తుందని ఉద్యోగానికి విఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. దీనిని వెంటనే ఆమోదించిన సిఎం ఆ తరువాత గౌతంకుమార్‌ తెరమరుగు అయ్యేంత వరకూ తన వంతు పాత్రను పోషిస్తూనే వచ్చారు. క్యాట్‌తో పాటు రాష్ట్రహైకోర్టు కూడా జోక్యం చేసుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిఎం కొంచెం వెనక్కి తగ్గినట్లు నటించారు. ఆ తరువాత పూర్తిస్థాయి అర్హతలున్న డిజిపిగా దినేష్‌రెడ్డి పేరు ఖాయమయ్యేందుకు తెర వెనుక నాటకాన్ని నడిపారు. సిఎం కోరుకున్నట్లుగానే పూర్తిస్థాయి బాధ్యతలతో డిజిపిగా దినేష్‌రెడ్డి కొనసాగేందుకు తాజా ఉత్తర్వులు వచ్చాయి. దీంతో పంతం నెగ్గించుకున్న సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఖ్యాతి గడించారు. రాష్ట్రప్రభుత్వం యుపిఎస్సీకి పంపించిన మూడుపేర్లలో దినేష్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఇంకా రెండేళ్లు సర్వీసు ఉన్నందున దినేష్‌రెడ్డికి అవకాశం లభించిందని సమాచారం.

తెలుగుదేశాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్‌ సిఎంలు? రాజశేఖరరెడ్డి తరువాతి స్థానంలో కిరణ్‌!

తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌ పార్టీనేతలు దెబ్బతీశారు. ఎన్నికల్లో ఓటమి పాలు చేయటమే కాకుండా సిఎంగా పీఠమెక్కాక కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కట్ల పాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించటమే ప్రధానపనిగా పెట్టుకున్న దివంగత సిఎం రాజశేఖరరెడ్డి గురించి ఈ విషయంలో ఒకసారి ప్రస్తావించక తప్పదు. ఆయన అధికారంలోకి రావటం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించారు. అలానే  భూమా దంపతులు వంటివారు కాంగ్రెస్‌లోకి వలస వచ్చేశారు. ఆయన తరువాత ఇదే పథకాన్ని అమలు చేసి తెలంగాణాలోని సమ్మారి సాంబయ్యను సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి ఏకంగా పార్టీ తరుపున పోటీకి నిలబెట్టారు. ఈయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేత. అలానే సిఎం కిరణ్‌ చిన్నం రామకోటయ్య వంటి ప్రముఖులను ఆకర్షించేందుకు కృషి చేశారు. తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు అంటే ప్రాణం అన్నట్లుండే మాజీ ఛైర్మన్‌ శంకరరెడ్డిని కాంగ్రెస్‌ తరుపున పని చేసేందుకు  సిఎం మద్దతు కోరారు. ఆయనకు పార్టీ తీర్థం ఇచ్చి మరీ పని చేయించుకున్నారు. తాజాగా టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర సాధన కమిటీ అధ్యక్షుడు బైర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కూడా సిఎం కిరణ్‌ ఆకర్షిస్తున్నారు. బైర్రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకునేందుకు ఇప్పటికే సిఎం ఏర్పాట్లు చేశారని తెలిసింది. ఇలానే మరికొందరిని సిఎం కిరణ్‌ టార్గెట్‌ చేశారని తెలుస్తోంది. రాజశేఖరరెడ్డి తరువాత సిఎం పీఠాన్ని ఎక్కిన కిరణ్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట రచించిన వ్యూహం మరిన్ని సత్ఫలిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

దామోదర ఆమ్యామ్యా రూ.25వేలట?

డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ ఆమ్యామ్యాలతో రాష్ట్రంలో మంచి పేరు గడించారు. కనీసం రూ.25వేలు ఉంటేనే ఆయన సంతకం చేస్తారని, లేకపోతే ఫైలు వంకే చూడరని రాజనర్సింహపై ప్రచారం జరుగుతోంది. దీనిలో వాస్తవం పాళ్లు తెలుసుకునేందుకు ఓ ఖాయిలాపడి మూసివేతకు గురైన సంస్థను వాకబు చేస్తే నిర్వహించుకోలేక నష్టాలతో సంస్థ మూసివేయటానికి పెట్టిన ఫైలుపై రాజనర్సింహ సంతకం చేయనన్నారని విశ్వసనీయ సమాచారం. ఆ సంస్థ ఆయన్ను కలిస్తే రూ.25వేలు ఇస్తేనే ఆ సంతకం చేస్తానన్నారట. అదేంటీ అంటే నష్టాల్లో ఇదీ నష్టమనుకోమని రాజనర్సింహ సమాధానం ఇచ్చారని ఆ సంస్థ యజమాని వాపోయారు. అసలు రాజనర్సింహ అడ్డాకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రారని తెలిసింది. తన ఆమ్యామ్యాల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తే సిఎంను కూడా తూలనాడతారని తెలిసింది. ఆ రోజు ఎప్పుడూ లేని విధంగా సిఎంవైఖరిపై రాజనర్సింహ కొత్త ప్రకటనలు వెలువరిస్తారని చెప్పుకుంటున్నారు. తన జోలికి వస్తే పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంటుందని సిఎంను హెచ్చరించారని తెలిసింది. దీంతో సిఎం కూడా ఇతర ఒత్తిడులకు తోడు రాజనర్సింహతో తలనొప్పులు ఎందుకని మౌనం వహించినట్లు తెలిసింది. అయితే రాజనర్సింహ అవినీతి సమాచారం కాంగ్రెస్‌ అధిష్టానానికి చేరింది. దీంతో అధిష్టానం ఈయన విషయంలో సీరియస్‌గా పరిగణిస్తోందని తెలిసింది. కొత్తగా ఏ కళాశాల మంజూరు కావాలన్నా రూ.40లక్షల వరకూ డిమాండు చేస్తున్నారని ఓ కళాశాల నిర్వాహకుడు రాజనర్సింహ అవినీతి గురించి వివరించారు.

సీట్లు భర్తీకాక ఆందోళనలో ఇంజనీరింగు కళాశాలలు?

ప్రభుత్వపోకడ, జరిగిన ఆలస్యం వల్ల ఇంజనీరింగు కళాశాలల సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పుడు ఈ సీట్లు భర్తీ అవుతాయో తెలియటం లేదని, ఈ సీట్లు కనుక భర్తీ కాకపోతే తమ కళాశాలకు తీవ్ర నష్టం తప్పదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాల్లోని ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలతో ‘తెలుగువన్‌.కామ్‌’ మాట్లాడితే అన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ 40శాతం సీట్లే భర్తీ అయ్యాయని తెలిసింది. పూర్తిగా సీట్లు భర్తీ చేసుకున్న కళాశాలలు వేళ్లతో లెక్కపెట్టవచ్చని, ఈ రెండు జిల్లాల్లో రెండు, మూడు కళాశాలలు మాత్రమే ఆ స్థితిలో ఉన్నాయని ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పుల పేరుతో తమ కళాశాలల భవిష్యత్తుతో చెలగాటమాడిరదని ఒక ఇంజనీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎక్కువైన ఫీజురీయంబర్స్‌మెంట్‌ వల్ల ప్రభుత్వం కూడా భారీగా నష్టపోతోందన్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే తమను కూడా ప్రభుత్వమే పరోక్షంగా నష్టపరించిందన్నారు. అసలు రీయంబర్స్‌మెంట్‌ ఆశయం గొప్పదైనా ప్రభుత్వం సీట్ల భర్తీ గురించి ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వానికి సీట్ల భర్తీపై ఒక ప్రణాళిక ఉంటే ప్రైవేటు కళాశాలల విషయంలో ప్రవర్తించే తీరే మారేదని ప్రత్యేకించి మంత్రి పితాని సత్యాన్నారాయణ గురించి వ్యాఖ్యానించారు. పితాని ఫీజురీయంబర్స్‌మెంట్‌ విషయంలో ఒక నిబంధనావళిని ప్రకటించటం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేలా ఉందని స్పష్టం చేశారు. లగ్జరీ జీవితాన్ని అనుభవించేవారికి రీయంబర్స్‌మెంట్‌ అందకుండా చర్యలు తీసుకోవటం సాధ్యమయ్యే పని కాదని ఆయన గుర్తించాలని సూచించారు.

తొమ్మిది మంది ఎమ్మెల్యేల మలేషియా పర్యటన మతలబేమిటో?

తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మలేషియాలో పర్యటిస్తున్నారు. మలేషియా అందాలను చూసేందుకు వీరు వెళ్లారని చెప్పుకుంటున్నారు. అయితే దీని వెనకాల మతలబు ఉందని ఈ మూడు జిల్లాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై ‘తెలుగువన్‌.కామ్‌’ చేసిన పరిశీలనలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తొమ్మిది మందినీ ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఈ మలేషియా తీసుకువెళ్లారు. ఆయన సొంతఖర్చులపై ఈ ఎమ్మెల్యేలను తీసుకువెళ్లటానికి మాత్రం ప్రత్యేకమైన రాజకీయ కారణాలు లేవని ఆ ఎమ్మెల్సీ బంధువులు చెబుతున్నారు. ఏ కారణం లేకుండా ఎందుకు తీసుకువెళతారు? అని ప్రశ్నిస్తే కేవలం ఇది ఒక జాలీట్రిప్పు అని వారు కొట్టిపారేస్తున్నారు. కానీ, తాజాగా హైదరాబాద్‌ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం డిప్యూటీ సిఎం పదవికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ప్రకటించే అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ అటువంటి పదవిని ఆశించే ఈ మలేషియా ట్రిప్పు ఏర్పాటు చేసి ఉంటారని రాజధానిలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అంటున్నారు. అయితే చిత్రంగా చివరి నిమషం వరకూ వస్తానని చెప్పిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆగిపోయారు. ఆయన తనకు ఉన్న పనుల రీత్యా ఆగిపోతున్నానని ఎమ్మెల్సీకి చెప్పారట. వాస్తవానికి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెసు నుంచి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కు మారాక అవసరమైనంత వరకే స్పందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అలానే రామచంద్రపురం ఎమ్మెల్యే తోటత్రిమూర్తులు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌, ఇంకా మరికొందరు ఈ ట్రిప్పులో జాయిన్‌ అయ్యారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్లి అక్కడ నుంచి మలేషియా వెళ్లారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ మలేషియా ట్రిప్పు ద్వారా ఎమ్మెల్సీ ఏదో ఆశిస్తున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. ఆయన ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు సహకరిస్తారా? లేక ట్రిప్పు పూర్తయ్యాక మరిచిపోతారా? అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది.

సర్దుకుపోతున్న ద్వారంపూడి...ఇంతకీ ఏ పార్టీ అంటారు?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రతీ విషయంలోనూ సర్దుకుపోతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు, చంచల్‌గూడా జైలులో ఉన్న తరువాత ఈయన కూడా వైకాపాలోకి మారారు. కాంగ్రెసుపార్టీని వదిలి వైకాపాలోకి మారాక ద్వారంపూడి కార్యకర్తలకు కొంత దూరమయ్యారు. దాదాపుగా కాంగ్రెసు కార్యకర్తలు ఈయన అధికారాన్ని వినియోగించుకోవాలనే ప్రయత్నిస్తున్నారు కానీ, ఈయన వెనుక ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని గమనించిన చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్‌ నాయకులతోనూ, మంత్రులతోనూ సఖ్యత నటిస్తున్నారు. మంత్రులు ఏ పని చెప్పినా జిల్లా కేంద్రమైన కాకినాడలో వారి తరుపున తాను స్వయంగా హాజరై ఆ పనిని చక్కబెడుతున్నారు. దీంతో ఈయన్ని కూడా పిలవకతప్పదనే పరిస్థితి ద్వారంపూడి కల్పించుకుంటున్నారు. అయితే కాంగ్రెసుపార్టీ కార్యక్రమాలకు మాత్రం ఈయన్ని పిలవటం లేదు. అడపాదడపా తెలిసిన కార్యక్రమాలకు కూడా హాజరయ్యేందుకు ద్వారంపూడి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ కార్పొరేటర్లను, వార్డుల వారీగా ద్వితీయశ్రేణిలో ఉన్న నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే ఎవరు ఏ పని మీద తన దగ్గరకు వచ్చినా పార్టీ ప్రస్తావన తీసుకురావటం లేదట. అంతేకాకుండా కాంగ్రెసు నాయకులతో తరుచుగా కనిపిస్తుంటే ఇంతకీ ద్వారంపూడి ఏ పార్టీ అన్న సందేహం కూడా ఎక్కువైందంటున్నారు. ఈ విషయం తేల్చేందుకు ప్రయత్నిస్తే తాను వైకాపాలోనే ఉన్నానంటున్నారు. మరి కాంగ్రెసువారితో కలిసి తిరుగుతున్నారంటే ,పార్టీల దేముందండీ అంటూ ఆ ప్రశ్నను అలానే మిగిల్చి మాయమవుతున్నారట. ఇటీవల సాక్షిభవనాల నిర్మాణాల విషయంలో సిబిఐ విచారణ ఎదుర్కొన్న ద్వారంపూడి భవిష్యత్తులో మళ్లీ సిబిఐ ముందుకు అదే జననీ ఇన్‌ఫ్రా కేసులో హాజరవుతారని తూర్పుగోదావరి జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. ఈసారి ఆ సొమ్ముకు లెక్కచెబితే మాత్రం వైకాపాలోకి ద్వారంపూడి మారినట్లు కాకినాడ ఓటర్లు నమ్ముతారు.

విద్యార్థుల ప్రాణాలతో నేతల చెలగాటం?

      పాములకు కోరల్లోనే...రాజకీయనాయకులకు ఒళ్లంతా విషం అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.  చదువుకునే వయస్సు నుంచి రాజకీయాలు నేర్చుకోవాలనుకోవటం పొరబాటు కాదు. కానీ, చదువును  పక్కనపెట్టి రాజకీయాలకు యువకులను అలవాటు చేయటం బాధ్యతారాహిత్యమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకించి విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టి తమ సమస్యలను సాధించుకునేందుకు నేతలు కృషి చేస్తున్నారని వారు బహిరంగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో తమ ఆందోళన కుండా తెలంగాణావాదులు అడ్డుపడుతున్నారని వీరు బాధపడుతున్నారు. ఒక  ప్రత్యేకరాష్ట్రం సాధించాలని దాని కోసం ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రసమితి (టిఆర్‌ఎస్‌) తమ పిల్లలను రెచ్చగొడుతోందంటున్నారు. నేతలు చేసే ప్రసంగాలు నిజమని నమ్మి తమ ప్రాణాలను త్యజించే స్థాయికి విద్యార్థులు రెచ్చిపోతుంటే యూనివర్శిటీ యాజమాన్యం, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయంటున్నారు.  ఎనిమిదేళ్ల క్రితం టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ ప్రారంభించిన ఆందోళన మొదలుకుని ఇప్పటి దాకా నష్టపోయింది ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులేనని సామాజిక అథ్యయనవేత్తలు సైతం స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనలో ఉన్న బాధను ఎవరూ గుర్తించటం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రత్యేకరాష్ట్రం అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశమైనా దాన్ని సీరియస్‌గా విద్యార్థులకు పరిమితం చేసేలా టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రసంగిస్తున్నారని అంటున్నారు. ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ ఓసారి తన ప్రకటనలో ఆత్మత్యాగం చేసైనా తెలంగాణా గౌరవాన్ని కాపాడాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు వందలాది మంది విద్యార్థుల పీకల మీదకు తెచ్చింది. కొందరైతే ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం విలిపించారో కూడా పట్టించుకోకుండా తన ప్రకటనను  కేసిఆర్‌ సమర్ధించుకున్నారు. అంతేకాకుండా, ఇప్పటికీ కేసిఆర్‌ తన పర్యటనలకు ముందు, వెనుక విద్యార్థులతో ముడిపెట్టుకుంటున్నారు. ఇది ఇంకా ఎంత మంది కొంప ముంచుతుందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. తాజాగా తెలంగాణా జెఎసి ప్రకటించిన మార్చ్‌ఫాస్ట్‌ కూడా ఉస్మానియా విద్యార్థులను రెచ్చగొడుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీని రణరంగం చేశారు. పోలీసులతో విద్యార్థులు ఒక యుద్ధమే చేశారు. దీంతో తల్లిదండ్రులు ఏ చెడు వార్త వినాల్సివస్తుందో అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. ఇలానే ప్రతీ ఏడాది ఓ ఐదు, ఆరుసార్లు ఈ యూనివర్సిటీ ఉద్రిక్తప్రాంతంగా మారుతోంది. ఈ తెలంగాణా ఊసే పట్టని అమాయక విద్యార్థులు కూడా ఈ ఉద్యమాల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇకనైనా ఇటువంటి దారుణకాండకు తెలంగాణామార్చ్‌ తరువాత స్వస్తి పలికితే బాగుంటుందని ఉస్మానియా విద్యార్థుల తల్లిదండ్రులు చేతులు ఎత్తి కోరుతున్నారు.

ప్రజలకోసం తర్వాత... ముందు మన విషయం...

  రాష్ట్ర పరిధిలో నిర్వహిస్తున్న టోల్‌గేట్ల నుండి మాజీ శాసనసభ, మండలి సభ్యులకు టోల్‌ రుసుము మినహాయించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ శాసనసభ్యుల ఫోరం కార్యదర్శి కోరారు. సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మాజీలు కనుక టోల్‌గేట్‌ రుసుము నుండి తగ్గించమని అడిగారు. అయితే అసెంబ్లీకి ఎన్నికయ్యే వారిలో ఒకప్పటివారి సంగతి ఏమోకాని ఇప్పటివారిలో ఎంతమంది కేవలం ధనవంతుల్లా కాకపోయినా మధ్యతరగతివారిలా జీవనం సాగిస్తున్నారు... చెప్పడం కష్టం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికై మాజీలైనవారిలో ఎందరో ధనవంతులున్నారు. పలురకాల వ్యాపారాలున్నాయి. అటువంటివారు టోల్‌గేట్‌ రుసుము తగ్గించమనడం ఎంతవరకు సమంజసం. ఇంటింటికి తిరిగి మోటార్‌ బండ్లపై పాలమ్ముకునే సామాన్య పాలవ్యాపారస్తులు... వంటి వారికి, ఉద్యోగం మీద ఆధారపడి ప్రయాణించే మధ్యతరగతి , సామాన్యులకు టోల్‌గేట్‌ రుసుము నుండి మినహాయిస్తే కనీసం అవి వారి పిల్లల పుస్తకాలకైనా ఉపయోగపడుతుంది. గౌరవనీయులైన శాసనసభ్యులు ప్రజలకోసం అడగకుండా కేవలం తమకోసంమాత్రమే ఇలాఅడగటం ఎంతవరకు సమంజసం...? అన్నది ప్రజల ప్రశ్న! టోల్‌గేట్‌ రుసుము వసూలు చేసేదే ప్రజలకోసమని, వారి అవసరాలకోసమని చెబుతుంటారు నాయకులు.. ఇలా ఎవరికివారు మినహాయింపులు పుచ్చుకుంటే... చివరకు మిగిలేది, టోల్‌గేట్‌ రుసుముకు బలయ్యేది సామాన్యుడే గదా...నంటూ సగటుమనిషి తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.

అమ్మగారేం చెబ్తే అది చేస్తాం!

  బస్సు ఛార్జీలు పెంచబోమంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తాము పేర్కొనలేదని రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెబ్తున్నారు. అలాగే సామాన్యుల కోసమే తాము ఆర్టీసీ ఛార్జీలు పెంచామని కూడా ఆయన హస్తినాపురంలో స్పష్టం చేస్తున్నారు. అలాగే రాయితీ వంటగ్యాస్‌ సిలిండర్లు ఆరు నుండి తొమ్మిదికి పెంచాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జారీచేసిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదనీ, పార్టీ ఏది చెబితే అది తాము అమలు చేస్తామంటూ ఆయన అధిష్టానంపట్ల అపారమైన విధేయత వ్యక్తం చేసేశారు. మంత్రిఅంటే బొత్సగారిలాగానే ఉండాలి. ఛార్జీలను ఎంతో దయతో సామాన్యుల మేలుకోసం పెంచారు. అదేమంటే ఛార్జీలు పెంచబోమని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో లేదన్నారు. హరిశ్చంద్రునికి మంత్రిగారికి తడికే అడ్డం. ‘ఎన్నికల ప్రణాళికలో ఏదివుంటే అదేచేస్తాం’ అన్నారు. ఆ లెక్కన ఆయన తమ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో వున్నవన్నీ ఇప్పటివరకు చేయించారా?ఆలోచించుకోవలసివుంది. అధికారం చేతుల్లో వుంది, అధిష్టానం అండ వుంది, ఇంకేం కావాలి... ఏమైనా చెబుతారు. తప్పదు భరించాల్సిందే... అంటున్నారు జనం...!

బాబులేఖ కప్పదాటు వ్యవహారమే!

  తెలంగాణపై కేంద్రానికి లేఖ రాస్తామంటూ చంద్రబాబు ఊరించి ఊరించి చివరకు ఆ లేఖను చప్పగా తేల్చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! అఖిలపక్షం ఏర్పాటు చేస్తే 2008 నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం. కప్పదాటు వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతానికి బాబు ఇకనైనా స్వస్థి చెపితే మంచిదంటూ సలహా ఇస్తున్నారు. పి.సి.సి. అధ్యక్షుడు బొత్స ఢల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి బాబును విమర్శిస్తే, విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఎం.పి. లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్ర విభజన అంశంపై స్పందించేటప్పుడు అన్ని ప్రాంతాల వారి మనోభావాలనూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఒక్క తెలంగాణ ఉద్యమాన్నే కాకుండా సమైక్యవాద ఉద్యమాన్నీ గమనించి లేఖ రాసిఉంటే బావుందంటున్నారు. ఇదిలా ఉంటే` తెలంగాణా విషయంలో ఎటువంటి స్పష్టతా లేకుండా కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేశారంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం... మధ్యలో మనకు చుట్టుకుంటోందీ పాపం’ అంటూ చంద్రబాబు వాపోతున్నట్లు వార్తలొస్తున్నాయి! ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని భరించాల్సిందే కదా!

తంబళ్లపల్లి ప్రవీణ్ రెడ్డి రాజకీయ చరిత్ర

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచం అంచులవరకూ చాటేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ఆశయానికి ఆకర్షితులై ఎంతోమంది రాజకీయరంగంలోకి దూకారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి ఉమాశంకర్ రెడ్డికూడా అలా తెలుగుదేశం పార్టీలోకి దూకిన రాజకీయ యోధుడే. ఎన్టీఆర్ ఆయనకు 83 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చారు. ఉమాశంకర్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పట్టువీడని ఎన్టీఆర్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించి ప్రోత్సహించారు. ఆయన చనిపోయినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ఉమాశంకర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగానే కాక, మంచిమనసున్న మనిషిగా పాడెకూడా మోశారు. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలబడ్డారు. ఉమాశంకర్ భార్యకి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చి రెండుసార్లు పార్టీయే పట్టుబట్టి గెలిపించుకుంది. ఉమాశంకర్ రెడ్డి కొడుకు ప్రవీవ్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీయే చదివించింది. 2009లో ఆయనకు పార్టీ టిక్కెట్టిచ్చి గెలిపించుకుంది. ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఇప్పుడు ప్రవీణ్ చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే అమర్ నాథరెడ్డి చరిత్రకూడా ఇలాంటిదేనని గుర్తుచేస్తున్నారు. అమర్ నాథరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి కుప్పంలో అత్యధిక మెజార్టీతో మూడుసార్లు ఎంపీగా, మరో మూడుసార్లు ఎమ్మెల్యేగాగెలిచారని, 1999లో అమర్ నాథరెడ్డి ఓటమి పాలైనప్పుడు అండగా నిలిచిన పార్టీ.. తనని ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షపదవిని కట్టబెట్టిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు.

అడిగిన వెంటనే ఉపాధి ` అసలయ్యేనా?

  అడిగిన ప్రతి పేదవానికి వెంటనే ఉపాధిపనులు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పథకంపై కూలీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఉపాధి హామీ విభాగం నడుం బిగించింది. గ్రామీణస్థాయిలో పనులు కోరే కూలీలకు దరఖాస్తులు పంపిణీ చేసి, భర్తీచేసిన దరఖాస్తులన స్వీకరించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. పనులు కోరడం, పొందడంపై శ్రమశక్తి సంఘాలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. పని కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని అందేలా అలా పనులు పొందలేని వారికి నిరుద్యోగ భృతి అందేలా చర్యలు తీసుకునేందుకు ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. హర్షించదగ్గ పరిణామం. అందరికి కూడు, గూడు, గుడ్డ ప్రధానం. అయితే అర్థశతాబ్దం దాటినా భారతావనిలో ఇంకా అవి పేదవానికి వరకు చేరలేదు. అంటే పథకాలు చేయలేదని కాదు! చేసిన పథకాలు వారివరకు రాలేదని, వారికి అందలేదని! ఒక రూపాయి పేదవాడికి సహాయంగా ప్రకటిస్తే...అది అందరిని దాటుకుంటూ ఆ పేదవాడిని చేరేసరికి ఐదు పైసలు మిగులుతుంది. అప్పటికి అతను వుంటాడో లేదో కూడా అనుమానమే. ఇటువంటి వ్యవస్థ మనదని సామాన్యులు వాపోతుంటారు. అటువంటప్పుడు అడిగితే చాలు... ఉపాధిపనులు అని చెబితే ఎలా నమ్మటమన్నది పేదవాని సందేహం! ఎవరూ ఏం చెప్పినా...ఎవరూ ఏం చేసినా.. సామాన్యులను బ్రతికించేది అతనికి భవిష్యత్‌పై వున్న ఆశ మాత్రమే అన్నది అక్షరసత్యం!

సౌర విద్యుత్‌కూ సాకులేనేమో !?

  రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు, పరికరాల తయారీ యూనిట్లను ప్రోత్సహించడానికి సంబంధించిన ఉత్తర్వులను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. గ్రిడ్‌తో సంబంధం లేకుండా సొంత అవసరాలకు సౌర విద్యుత్‌నుఉపయోగించుకునేలా, విద్యుత్‌ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడానికి వికేంద్రీకృత, పంపిణీ ఉత్పత్తి పద్ధతిని ప్రోత్సహించాలన్న లక్ష్యాలను ఈ విధానంలో నిర్ణయించారు. ఇది 2017వరకు అమల్లో ఉంటుంది. అంటే భవిష్యత్‌ భారతం అంతా సౌర విద్యుత్‌దే. చాలా సంతోషం ఉంటుంది. అయితే అప్పుడు బొగ్గని, నీరంటూ సాకులు దొరకవు. అంతా సౌర విద్యుత్తే! అందువల్ల పరికరాలకు సంబంధించిన సాకులు మాత్రమే చెప్పగలుగుతారు. ఈ నేపథ్యంలోనే సామాన్యుడికొక సందేహం! సౌర విద్యుత్‌కు కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, సూర్యుడి వేడికి పరికరాలు పాడైపోతున్నాయి... ఈ నెలరోజులు ఎండ బాగా రాలేదు కనుక విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నాం అంటూ వడ్డింపులు మొదలెడతారేమోనన్న భయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే మనకున్న నేతలు, పారిశ్రామికవేత్తలు దేనికైనా సమర్ధులు ! స్పాంటేనియస్‌గా సాకులు చెప్పగల నిష్ణాతులు...!

ఇప్పుడు డీలర్ల వంతన్నమాట!

  నిన్నటి వరకూ ధరల వడ్డింపుతో సతమతమైన సగటుమనిషి బాధలు ఇప్పుడప్పుడే తీరేటట్లు లోవు. ఇప్పుడు పెట్రోలు డీలర్ల వంతొచ్చింది! అదెలాగంటో` నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డామనీ, ఈ ఇబ్బందులు తగ్గించుకోవడంలో భాగంగా అక్టోబర్‌ 15నుండి బంక్‌లను అన్ని వేళలా (24 గంటలు) తెరచివుంచలేమనీ పెట్రోల్‌ బంక్‌ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఎక్కువ కమీషన్‌ కావాలని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అంటే ఇక నుండి 24 గంటలు నడుస్తున్న పెట్రోలు బంక్‌లు కొన్ని గంటలకే పరిమితం కానున్నాయన్నమాట! అయితే ఇది మరో 15 రోజుల్లో ఆయిల్‌ సంస్థలు తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. ప్రభుత్వాలు ధరలు పెంచిన ప్రతిసారీ వ్యాపారవర్గృాలు రేట్లుపెంచడంతోబాటు మరిన్ని వెసలుబాట్లు కావాలంటూ డిమాండ్‌ చేయడం, సమ్మెలు చేయడం నిరంతరంగా జరిగిపోతోంది. అయితే` వీటన్నింటి మూలాన ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది మాత్రం ప్రజలే! ఈ ధరల పెంపుదలవల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు దినదినగండంగా రోజుగడపవలసిరావడం శోచనీయం! ప్రభుత్వానికైనా... కంపెనీలకైనా... ఇలా ఎవరికి కోపం వచ్చినా... నష్టపోయేది సామాన్యులే అన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా ధరలపెంపు విషయంలో సామాన్యుని స్థితిగతులను దృష్టిలో పెట్టుకోకుంటే ప్రజాందోళన ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.