తెలంగాణ మార్చ్‌ తేల్చి చెప్పిన నగ్న నిజాలు

తెలంగాణ తెచ్చేదెవరు? ఇచ్చేదెవరు? అన్న విషయానికి సంబంధించి తెలంగాణ మార్చ్‌ తేల్చిచెప్పిన నిజాలు రాజకీయవర్గాలకు మింగుడు పడేలా లేదు. పసి పిల్లలను ఎత్తుకుని వర్షంలో తడుస్తూ, ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచీ ఆడపిల్లలు మార్చ్‌కు హాజరుకావడం, ఆరేళ్ళ నుంచీ 70 ఏళ్ళ వరకూ అన్ని వర్గాల నుంచీ ప్రజలు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మార్చ్‌ తేల్చిచెప్పింది. అంతేకాదు తెలంగాణ సాధనకు రాజకీయ సాధన ఆశించిన స్థాయిలో లేదని కూడా తేల్చి చెప్పింది. తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం నాలుగు గంటలు అవకాశం ఇస్తే నిరాఘాటంగా 12 గంటల పాటు నిర్వహించిన ఘనత మార్చ్‌ నిర్వాహకులకు దక్కుతుంది. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్న  రాజకీయనేతలు లేకుండా పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ సభ సజావుగా నిర్వహించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టింది. ముఖ్యంగా సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి భారతీయ జనతాపార్టీ, సిపిఐ, న్యూడెమోక్రసీ పార్టీల జెండాలు కలిసి ఎగరడం ఒక ప్రజా ఉద్యమంలో ఇదే తొలిసారేమో. ప్రజల ఆకాంక్షలను గుర్తించి, దానిని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే అధిక శాతం పార్టీలు కృషి చేసిన విషయాన్నికూడా తెలంగాణవాదులు గుర్తించారు. అందుకే రాజకీయపార్టీల వ్యవహారాన్ని విస్మరించి ప్రభుత్వంలోనే కాదు సామాజికంగా ఎన్ని విభాగాలుంటే అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావడం తెలంగాణ మార్చ్‌ ప్రత్యేకం. తెలంగాణ మార్చ్‌ జరిగిన తీరుతెన్నులను గమనిస్తే తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయాల ప్రమేయం లేకుండా జెఎసి చేతుల్లోకి తీసుకున్నట్లు అర్థమవుతున్నది. అంతేకాదు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా తెలంగాణ తమకు దగ్గరలోనే ఉందన్న విషయాన్నీ తెలంగాణవాదులు అర్థం చేసుకున్నారు.
    తెలంగాణ పది జిల్లాల్లో ప్రతీ జిల్లా నుంచి లక్ష మంది వరకూ తెలంగాణ మార్చ్‌కు తరలారు. ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులుగా నిలిచారు. ప్రజాఆకాంక్షతో వచ్చిన వారు కనుక ఎన్ని కష్టాలకయినా ఓర్చి మార్చ్‌కు తరలారు. ప్రతీ బృందం తమ ఆహారం, నీళ్ళు మోసుకుంటూ వచ్చారు. స్వచ్ఛందంగా ఆహార, నీళ్ళు పొట్లాల పంపిణీ జరిగింది. తమ తెలంగాణ సభకు ఎవరు ఆహారం ఇవ్వడం ఏమిటని తామే కొనుక్కుని మరీ భోజనం చేశారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం. భారీ వర్షం పలుసార్లు కురియడంతో తెలంగాణ అభిమానులు నిరవధిక మార్చ్‌ కొనసాగించలేకపోయారు.
    

రాజకీయ వ్యవహారానికి వస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పోరాడినా, 1969 నుంచీ ఉద్యమం ఏదో రూపంలో ప్రజల్లో నిక్షిప్తమై తీవ్ర ఉద్యమం ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం  సాధ్యం కాలేదు. ప్రజల ఆకాంక్షలను అన్ని పార్టీలూ గుర్తించాయి. తమదైన శైలిలో పోరాటాన్ని ప్రారంభించాయి. టిఆర్‌ఎస్‌లో కుటుంబపాలన కొనసాగుతుందని, ఛాందసవాదంతో బిజెపి ఉన్నదని పలు రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. ప్రజా ఆకాంక్షను సాఫల్యం చేసేందుకు రాజకీయ పక్షాలను ఏకం చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఆవిర్భవించింది. తొలుత అన్ని పక్షాలూ జెఎసిలో చేరాయి. జెఎసిపై గౌరవం ఉంచుతూ వివిధ రకాల కారణాలు చూపిస్తూ కొన్ని పార్టీలు వైదొలిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు జెఎసిలో స్పష్టంగా పాలుపంచుకోలేదు. అయితే ఆ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా  కోరుతూ వచ్చాయి. తెలంగాణమార్చ్‌లో తెలుగు దేశం, కాంగ్రెస్‌, లోక్‌సత్తా జెండాలు మినహాయించి అన్ని పార్టీల రంగులూ కనిపించాయి. అయితే ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాజకీయ పార్టీలు తమదైన శైలిలో కైవసం చేసుకునేందుకు పలు రాజకీయ పార్టీలు ప్రయత్నించాయనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే అన్ని రాజకీయపార్టీలూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలని ఉద్యమంతో మమేకం అయ్యాయి. ఎవరి లాభం వాళ్ళు చూసుకోవడంతో తెలంగాణ జెఎసి అన్ని సంఘాలనూ ఒక తాటిపైకి తేగలిగింది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంతో జెఎసి ఛైర్మన్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన బాధ్యత తెలంగాణ మంత్రుల పరిధిలోకి నెట్టింది. ఇప్పటి వరకూ అదో ఇదో చెబుతూ వస్తున్న రాష్ట్ర మంత్రులకు అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి తీసుకురావడంలో అయిదుగురు మంత్రులు మాత్రమే కీలకపాత్ర వహించారు. మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్‌, ఒకదశలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహలు కీలక పాత్రవహించారు. వీరిలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, హోంమంత్రి సబితారెడ్డిలు ప్రభుత్వం పక్కన కూడా బాధ్యత వహించాల్సి కూడా ఉన్నది. అయితే జెఎసి ప్రతినిధులతో లిఖిత పూర్వకంగా తీసుకున్న తరువాతే అనుమతి ఇవ్వడాన్నికూడా తెలంగాణ సంఘాలు తప్పుబడుతున్నాయి. అయితే అనుమతిస్తే తమపై బాధ్యత తీరిపోతుందని, మిగిలిన విషయాలను పోలీసులే చూసుకుంటారని అధికారపక్షం భావించినట్లుంది. అందుకే కావచ్చు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంలో పోలీసులు సఫలమయ్యారు. ప్రత్యేక తెలంగాణకావాలని, ఎలాగైనా సరే మార్చ్‌కు హాజరు కావాలన్న యూనివర్సిటీల విద్యార్థులను నిర్బంధించినా మార్చ్‌ విజయవంతమైంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం బాధ్యత అంటూ షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడం తెలంగాణవాదులకు మంచిఫలితాన్నే ఇచ్చింది. సంఖ్య విషయాన్ని పక్కనబెడితే అన్ని వర్గాల నుంచీ ప్రజలుహాజరు కావడం జెఎసికి సంతృప్తిని కలిగించింది. ప్రజలకూ విషయం అర్థమైంది. ఇకమిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగడమే.


  

 ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమై ఆరు దశాబ్దాలు గడచింది. దశాబ్ద కాలంనుంచీ ఇది తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో బంద్‌లు, వంటావార్పూ కార్యకమ్రాలు, ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌ విజయవంతమయ్యాయి, తాజాగా తెలంగాణ మార్చ్‌ నిర్బంధంలో సైతం విజయం సాధించింది. అయితే తెలంగాణ రావడానికి అడ్డేమిటి? ఈ విషయంపైనే తెలంగాణ జెఎసి దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. పార్టీపెడుతూనే స్థానిక సంస్థల ఎన్నికలకుఉరికిన టిఆర్‌ఎస్‌పై విశ్వాసాన్ని తగ్గించి, అన్ని దశల్లోనూ తమ ఆకాంక్షను వ్యక్తం చేసిన తెలంగాణవాదులు, ప్రజలపై విశ్వాసాన్ని ఉంచి పోరాట పటిమతో తెలంగాణ జెఎసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాల్సిన అవరం ఉన్నది..

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”