జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ కలకలం! అరెస్ట్ చేశామన్న సూర్యాపేట పోలీసులు 

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత కాలంగా కథనాలు రాస్తున్న తొలివెలుగు యూట్యూబ్​ చానల్​ జర్నలిస్ట్​, యాంకర్​ రఘు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది. మల్కాజిగిరిలోని ఆయన ఇంటి సమీపంలో ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేసినట్టు వార్తలు వచ్చాయి. నెంబర్ ప్లేట్ లేని జీపులో... తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. "కోకాపేట కాందిశీకుల  భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్" అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు రఘు కుటుంబ సభ్యులు తెలిపారు.  తొలివెలుగు యూట్యూబ్​ చానల్​లో గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. తెలంగాణ వాదులను, టీఆర్​ఎస్​ను గట్టిగా వ్యతిరేకించే వాళ్లను రఘు నిత్యం ఇంటర్వ్యూలు చేస్తుంటారు. కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆయన ఇటీవల తొలివెలుగులో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ క్రమంలో ఆయన కిడ్నాప్​ సంచలనంగా మారింది. అయితే రఘు కిడ్నాప్ ప్రచారానికి తెర దించుతూ తామే అరెస్ట్ చేసి తీసుకెళ్లామని ప్రకటించారు సూర్యాపేట జిల్లా పోలీసులు.  గతంలో సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో అసైన్డ్​ భూములు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడి ఎమ్మెల్యే ఈ భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​  గుర్రంపోడు వెళ్లారు. అయితే బీజేపీ నేతలు గుర్రంపోడు వెళ్లినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సదరు న్యూస్​ను కవర్​ చేసిన జర్నలిస్ట్​ రఘుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే రఘును అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా పోలీసులు ప్రకటించారు. జర్నలిస్ట్ రఘుపై ఐపీసీ IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈకేసులో రఘు A-19గా ఉన్నాడు. ఈ విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో మల్కాజ్‌గిరిలోని తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నామని మట్టపల్లి పోలీసులు రఘు భార్యకు నోటీసులు ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు పంపుతామని నోటీసుల్లో స్పష్టం చేశారు. జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేయడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియా గొంతు నొక్కెందుకే రఘును పోలీసులే అరెస్టు చేసి వుంటారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆరోపించింది.  రఘును తక్షణం విడుదల చేయాలని టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యకర్శి బసవపున్నయ్య  డిమాండ్ చేశారు.

సీతక్క తల్లికి సీరియస్.. రక్తం ఇచ్చేందుకు వెళుతున్న యువకులకు బ్రేక్! పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్ 

తెలంగాణలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. ఎవరిని రోడ్డు మీదకు అనుమతించడం లేదు. లాక్ డౌన్ అమలు బాగానే ఉన్న కొందరు అధికారుల తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. కొందరు పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి రక్తదానం చేసేందుకు వెళ్తుండగా.. తమ బంధువులను పోలీసులు అడ్డుకున్నారని సీతక్క మండిపడ్డారు. ఈ-పాస్ ఉన్నప్పటికీ కనీస కనికరం లేకుండా ప్రవర్తించారని మల్కాజ్‌గిరి డీసీపీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీతక్క తల్లికి ఆరోగ్యం బాగాలేదు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. రక్తం అవసరం ఉండడంతో.. సీతక్క బంధువులు రక్తదానం చేసేందుకు ములుగు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.  ములుగు జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నారు. ఐతే హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వారిని మల్కాజ్‌గిరి డీసీసీ రక్షిత అడ్డుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆపేశారు. తాము ఈపాస్ తీసుకున్నామని చెప్పినా వినలేదని.. సీతక్క ఆరోపించారు. వీడియో కాల్ చేసి.. తన తల్లిని చూపించినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఎమ్మెల్యేకే ఇలాంటి అనుభవం ఎదురయితే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మండిపడ్డారు సీతక్క. డీసీపీ రక్షిత తన డ్యూటీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. కింది స్థాయి సిబ్బంది వారిని అనుమతించినట్లు సీతక్క చెప్పారు. అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఎవరి పరిస్థితి ఏంటో.. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకోవాలని ఆమె సూచించారు. కనీసం మానవత్వంతో వ్యవహరించాలని.. ఇలాంటి వారుంటే చాలా మంది ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు సీతక్క. ఫైన్లు, చలానాల కన్నా మానవత్వం ముఖ్యమని విమర్శించారు. మల్కాజ్‌గిరి డీసీసీ తీరుపై ట్విటర్ ద్వారా డీజీపీకి ఫిర్యాదు చేశారు సీతక్క. పోలీసుల తీరును మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు తీవ్రంగా ఖండించారు.  ఎమ్మెల్యే సీతక్క కుటుంబ సభ్యులకు ఎదురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. లాక్ డౌన్ ఆంక్షల పేరుతో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే జనాలు మండిపడుతున్నారు. రక్తదానం చేసేందుకు వెళుతున్న వారినిఅడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా వినకపోవడం మరీ దారుణమంటున్నారు. రక్తం సమయానికి అందక రోగి చనిపోతే... దానికి ఎవరూ బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు. 

ఆ ఇద్దరు కలిశారా? సీఎం జగన్ రెడ్డి చాప్టర్ క్లోజ్?

సీఎం జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దుకు అభ్యంత‌రం చెప్ప‌ని సీబీఐ. జ‌గ‌న్‌పై లేటెస్ట్‌గా న‌మోదైన 18వ కేసులో విజ‌య‌సాయిరెడ్డి పేరు తొల‌గింపు. కొంత కాలంగా విజ‌య‌సాయిని విశాఖ‌కే క‌ట్ట‌డి చేసిన జ‌గ‌న్‌. అటు తాను ముఖ్య‌మంత్రి అయితే త‌ప్పేంటంటూ పెద్దిరెడ్డి వ్యాఖ్య‌లు.  ఆయ‌న‌పై జ‌గ‌న్‌రెడ్డి నిఘా పెట్టారంటూ ప్ర‌చారం..  ఏదో తేడాగా లేదూ? స‌మీక‌ర‌ణాలు మారిపోతున్న‌ట్టు అనిపించ‌డం లేదూ?  రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు జ‌రుగుతున్న‌ట్టు లేదూ? జ‌గ‌న్‌పై కొత్త‌గా సీబీఐ కేసు న‌మోదు అవ‌డం.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణరాజు వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ వెంట‌వెంట‌నే జ‌రుగుతుండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. బెయిల్ ర‌ద్దు నిర్ణ‌యం మీ ఇష్ట‌మేనంటూ కోర్టుకే సీబీఐ ఆప్ష‌న్ వ‌దిలేయ‌డం కీల‌కాంశం. ఎక్క‌డో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దులుతున్నాయ‌ని.. ఆ ఉచ్చు సీబీఐ కోర్టులో బిగుసుకుంటోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా.   జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి కొన్ని శ‌క్తులు. అందులో అంద‌రిక‌న్నా ముందు ఉండేది ఎంపీ ర‌ఘురామ అయితే.. ఆ త‌ర్వాత శ‌క్తి మంత్రి పెద్దిరెడ్డే అంటున్నారు. కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. జ‌రుగుతున్న ర‌హ‌స్య ప‌రిణామాల గురించి తెలిస్తే న‌మ్మాల్సిందే. మంత్రి పెద్దిరెడ్డి.. అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడు. ఆర్థికంగానూ బాగా నిల‌దొక్కుకున్న నేత‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీకి పెద్ద మొత్తంలో ఫండింగ్ చేశాడు. ప్ర‌స్తుతం వైసీపీలోని ప‌లువురు ఎమ్మెల్యేలు ఆయ‌న మ‌నుషులే. జ‌గ‌న్ జైలుకు వెళితే..? అనే ప్ర‌శ్న తలెత్తిన‌ప్పుడ‌ల్లా వినిపించే పేరు పెద్దిరెడ్డిదే. అందుకే, ఆయ‌న‌లో తాను ఎప్ప‌టికైనా ముఖ్య‌మంత్రిని అవుతాన‌నే ఆశ ఎప్ప‌టినుంచో బ‌లంగా నాటుకుపోయింది. అప్ప‌టిదాకా వేచిచూడ‌టం ఎందుక‌న్నట్టు.. ఇప్ప‌టి నుంచే కార్య‌చ‌ర‌ణ మొద‌లుపెట్టార‌ట‌ని అంటున్నారు. అందుకే, ఇటీవ‌ల ఆయ‌న త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు కూడా. అవును, తాను ముఖ్య‌మంత్రిని అయితే త‌ప్పేంటి? అంటూ ఓ మీడియా స‌మావేశంలో బ‌య‌ట‌కు అనేశారు.  తాజాగా, సీబీఐ కోర్టులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసుపై వేగంగా విచార‌ణ జ‌రుగుతుండ‌టం.. జ‌గ‌న్‌కు త్వ‌ర‌లోనే కేంద్రం చెక్ పెట్ట‌డం ఖాయ‌మంటూ ఢిల్లీ నుంచి లీకులు వ‌స్తుండ‌టంతో.. మంత్రి పెద్దిరెడ్డి అల‌ర్ట్ అయ్యార‌ట‌. వైసీపీలో ఉన్న త‌న గ్రూపు ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్య మంత‌నాలు సాగిస్తున్నార‌ని అంటున్నారు. ఆ అనుమానంతోనే సీఎం జ‌గ‌న్‌.. కొంత‌కాలంగా పెద్దిరెడ్డిపై నిఘా పెట్టార‌ట‌. మంత్రి గూడుపూటానిపై ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రికి స‌మాచారం ఇచ్చాయ‌ని తెలుస్తోంది. అందుకే, ఇటీవ‌ల వారిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త చెడింద‌ని చెబుతున్నారు. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీకి 6 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌ని అనుకున్నా.. ఆధిక్యం 3 ల‌క్ష‌ల లోపున‌కే ప‌డిపోవ‌డానికి.. మంత్రి పెద్దిరెడ్డే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ ఆయ‌న్ను మ‌రింత దూరం పెట్టారని పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.    మంత్రి పెద్దిరెడ్డి సైతం ఒంట‌రివాడేం కాదంటున్నారు. ఆయ‌న‌తో మ‌రో మాస్ట‌ర్ మైండ్ జ‌త‌క‌లిశార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ కేసుల్లో ఏ2గా జైలుకెళ్లినా.. ఇంకా తన‌ను జ‌గ‌న్ అనుచ‌రుడిగానే చూస్తున్నార‌ని.. త‌న‌ను ఎవ‌రూ నాయ‌కుడిగా గుర్తించ‌డం లేద‌నే అక్క‌స్సుతో ఉన్నార‌ట విజ‌య‌సాయిరెడ్డి.  తాజా సీబీఐ కేసు, బెయిల్ ర‌ద్దు కేసుతో జ‌గ‌న్‌రెడ్డికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే పాయింట్‌పై .. పెద్దిరెడ్డి, విజ‌య సాయిరెడ్డిలు ఏక‌మ‌య్యార‌ని చెబుతున్నారు. కేంద్రంతో, ఢిల్లీ లెవెల్‌లో మాంచి ప‌రిచ‌యాలున్న విజ‌య‌సాయి.. తాను కేసుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. జ‌గ‌న్ కంటే మోదీని న‌మ్ముకుంటేనే బెట‌ర్ అనే భావ‌న‌లో ఉన్నార‌ట‌. అందుకే, బీజేపీతో, కేంద్రంతో, ప్ర‌త్యేకించి ప్ర‌ధాని మోదీతో విజ‌య‌సాయిరెడ్డి విప‌రీతంగా అంట‌కాగుతున్నార‌ని సీఎం జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే రిపోర్ట్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అందుకే, ఆయ‌న‌ను కొంత‌కాలంగా విశాఖకే ప‌రిమితం చేశార‌ని.. స్టేట్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేకుండా.. విజ‌య‌సాయి స్థాయిని త‌గ్గించార‌ని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల అయిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ విజ‌యోత్స‌వాల్లోనూ విజ‌య‌సాయి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్‌, విజ‌య‌సాయి మ‌ధ్య దూరం బాగా పెరిగిపోయింద‌ని అంటున్నారు.  ఈ విష‌యం గుర్తెరిగే.. ఎన్నాళ్లైనా జ‌గ‌న్ చెంత‌న ఉంటే త‌న ప‌ర‌ప‌తి పెర‌గ‌ద‌ని.. మంత్రి పెద్దిరెడ్డితో క‌లిసి.. అనూహ్య నిర్ణ‌యం తీసుకోవడానికి రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. విజ‌య‌సాయికి కేంద్రం ఆశీసులు దండిగా ఉండ‌టం.. తాజాగా, ఓ సీబీఐ కేసు నుంచి ఆయ‌న‌కు విముక్తి ల‌భించ‌డం.. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌రెడ్డిపై కేసులు చ‌క‌చ‌కా ముందుకు సాగ‌డం.. ఆ రాజ‌కీయ‌ ప‌ర్య‌వ‌సానంలో భాగ‌మే అంటున్నారు. అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో విజ‌య‌సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారుతార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది.  సీబీఐ కేసులు కొలిక్కి వ‌చ్చి.. ర‌ఘురామ వేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ ఫ‌లించి.. జ‌గ‌న్‌రెడ్డి జైలుకు వెళితే.. ఆయ‌న స్థానంలో ఏ విజ‌య‌మ్మనో.. భార‌త‌మ్మనో.. ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెడ‌తారు జ‌గ‌న్‌. ఇన్నేళ్లూ పార్టీకి అంతలా సేవ చేసిన పెద్దిరెడ్డి.. జ‌గ‌న్ కోసం జైలుకు సైతం వెళ్లొచ్చిన‌ విజ‌య‌సాయిరెడ్డిలు.. ఎప్ప‌టికైనా ముఖ్య‌మంత్రి పీఠానికి బానిస‌లుగానే ప‌డుండాలి. అంతేగాని.. వారు జ‌గ‌న్ స్థానంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. ఈ త‌ర్కం ఆల‌స్యంగా బోధ‌ప‌డిన‌ ఆ ఇద్ద‌రు నేత‌లు.. ఇప్పుడిప్పుడే వాస్త‌వంలోకి వ‌స్తున్నారు. క‌ట్ట‌ప్ప వార‌సులుగా మిగ‌ల‌డం ఇష్టం లేక‌.. ఆర్థిక‌, అంగ బ‌లంతో మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్రం ద‌న్నుతో విజ‌య‌సాయిరెడ్డిలు త‌మ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసుకుంటున్నారు. బీజేపీ డైరెక్ష‌న్‌లో వారిద్ద‌రు క‌లిసి ముందుకు సాగేలా.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకునేలా.. ర‌హ‌స్య క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే కీలక పరిణామాలకు వైసీపీ వేదిక కాబోతోంద‌ని అంటున్నారు. సీఎం జగన్ కేసుల్లో ఏదైనా జరగవచ్చనే చర్చ జరుగుతోంది. అందుకే అంటారు కాబోలు రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌ని.....

అమ్మిరెడ్డి అవుట్.. తర్వాత అతనేనా? రఘురామ రఫ్పాడిస్తున్నారుగా..

రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన పోరాటం కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రఘురామ.. అక్కడి నుంచే తన పవరేంటో చూపిస్తున్నారు. కాలి గాయాలు తగ్గకపోవడంతో వీల్ చైర్ తోనే ఉంటున్న రఘురామ.. తన అరెస్టు అక్రమమని ఆరోపిస్తూ.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు.  రఘురామ రాజు ఎఫెక్ట్ తో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలోను, ఆ తర్వాత అమ్మిరెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. తనకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చి సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో చే రేలా ఉత్తర్వులిచ్చినా.. అక్కడి నుంచి డిశ్చార్జ్‌ కాగానే తనను అరెస్టు చేసేందుకు అమ్మిరెడ్డి ప్రయత్నించారని, ఇందుకోసం పోలీసులను ఆస్పత్రి వద్దకు పంపారని రఘురామరాజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అకస్మాత్తుగా అమ్మిరెడ్డిని బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రఘురామ కేసు విషయంలో మరో అధికారిపై వేటు పడనుందని తెలుస్తోంది. టీటీడీ అదనపు ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డిని కేంద్రం వెనక్కి పిలవడం ఖాయమని చెబుతున్నారు. రక్షణ శాఖలో అధికారిగా పనిచేస్తున్న ధర్మారెడ్డి డిప్యుటేషన్‍పై మొదటగా టిటిడి ప్రత్యేక అధికారిగా.. తరువాత ఆ పోస్టును అదనపు ఈవోగా మార్పించుకుని.. తాజాగా ఇంఛార్జి ఈవో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన కుట్రకు సూత్రదారి, తెర వెనుక పాత్రదారి ధర్మారెడ్డే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాధ్‍సింగ్‍కు ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఎంపీ రఘురాంకృష్ణం రాజు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనను మరోసారి అరెస్టు చేసేందుకు ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్‌ కేపీ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి కుట్ర పన్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.  గుంటూరు నుంచి ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఆర్మీ ఆస్పత్రికి పంపడం, కొద్ది రోజులు వారు అక్కడే మకాం వేసి ఉండటం, అక్కడి మెస్‌లో వారు భోజనాలు చేయడం వంటి ఆధారాలను కూడా  కేంద్ర మంత్రికి ఎంపీ రఘురామ అందజేశారు.రక్షణ శాఖకు చెందిన అధికారి అయిన ధర్మారెడ్డిపై ఆధారాలతో తాను ఫిర్యాదు చేశానని. ఆయనపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని ఎంపీ రఘురాంరాజు అంటున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఆర్మీ ఆసుపత్రి ఎపిసోడ్‍లో పరోక్ష భాగస్వామిగా వ్యవహరించిన గుంటూరు అర్బన్‍ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసినందున..  ధర్మారెడ్డికి కూడా అదే పరిస్థితి ఎదురవటం ఖాయమంటున్నారు. ఎప్పటికైనా టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ధర్మారెడ్డి కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు సిఎంవో అధికారులు, సలహాదారుల సూచనలతో ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్‍ కెపి.రెడ్డితో ఉన్న పరిచయాన్ని అనుకూలంగా మలుచునేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అయితే  ఆ ప్రయత్నాలు ముందుగానే తెలుసుకున్న రఘురాంరాజు ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ధర్మారెడ్డికి, కెపి.రెడ్డికి, పాలకులకు తిరిగి కోలుకోలేనంతగా షాక్‍ ఇచ్చారని చెబుతున్నారు. ఇక అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించని.. ధర్మారెడ్డిపై పాలకులు,  సలహాదారులు కూడా అసంతృప్తిగా ఉన్నారని.. ధర్మారెడ్డి విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

అవును.. ఆ ఇద్దరూ కలిస్తే! ఆయన బలైనట్టే? 

మాజీ మంత్రి ఈటల రాజేందర్  బీజేపీలో చేరడం ఖరారై పోయింది.ఈటల మరో వారంలో తమ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రకటించారు. సో ... ఇక ఈటల రాజకీయ భవిష్యత్’పై వినవచ్చిన ఊహగానాలు, వ్యూహాగానలకు తెరపడినట్లే అనుకోవచ్చును. అయితే ఒక ప్రశ్న మాత్రం అలాగే వుంది. భవిష్యత్’లో బీజేపీతో తెరాస చేతులు కలిపితే? ఈ సదేహం ఎవరికో వచ్చింది కాదు. స్వయంగా ఈటల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందుంచిన ప్రశ్నగా ప్రచారం జరుగుతోంది. భవిష్యత్’లో కారు కమలం చేతులు కలిపితే, మా గతేంటని ఈటల నేరుగా నడ్డానే ప్రశ్నించినట్లు.. అందుకు నడ్డా, అలాటిదేమీ ఉండదని హామీ ఇచినట్లు, తెలంగాణాలోనూ బెంగాల్లోలా దూకుడు పెంచుతామని చెప్పినట్లు ... కథలు, కథనాలు చాలానే వచ్చాయి.   అందులో నిజానిజాలు ఎలా ఉన్నా  రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును. ఇది అందరికీ తెలిసిన విషయం. రాజకీయాలు డైనమిక్’గా మారుతూ ఉంటాయి, నిశ్చలంగా నిలిచిపోవు. ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీ మిత్ర పక్షం,  వాజపేయి మంత్రి వర్గంలో మంత్రి. ఇప్పుడు అదే మమతా బెనర్జీ బీజేపీ పై ఒంటి కాలుమీద లేస్తున్నారు. 2009లో టీడీపీ, తెరాస మిత్ర పక్షాలు. వామపక్షాలను కలుపుకుని మహా కూటమిగ ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేశారు. మొన్నటి బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వామ పక్షాలు, బెగాల్’లో కలిసి పోటీ చేశాయి, కేరళలో ప్రాధాన ప్రత్యర్ధులు. టీడీపీ, బీజేపీలు కలుస్తూ, విడిపోతూ, విడిపోయి కలుస్తూ...  ఇలా చెప్పు కుంటూ పోతే, రాజకీయాలలో శతృమిత్ర సంబధాలలో ఏదీ శాశ్వతం కాదని అర్థమవుతుంది. అందుకే, రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరంటారు. .  భవిష్యత్ లో బీజేపీతో తెరాస చేతులు కలిపే అవకాశం ఉందా అంటే, లేదని చెప్పలేము. అలాగని ఉందనీ అనలేము. ఎన్నికల సమయానికి ఉన్నపరిస్థితిని, సమీకరణాలు, లెక్కలు సరిచూసుకుని, పొత్తులు ఎత్తులు నిర్ణయం అవుతాయి. అయితే,కొన్ని సందర్భాలలో ముందు నుంచి కూడా ఒక, వ్యూహం ప్రకారం పావులు కదుపుతూ రావచ్చును.ఈ విషయంలో, బీజేపీకి ఒక స్పష్టమైన వ్యూహం ఉందని, అనేక రాష్ట్రాలలో ఆ పార్టీ వ్యవహరించిన తీరును బట్టి అర్థమవుతుంది. బీజేపీ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే బీజేపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా చూస్తుంది. కాబట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొంత పుంజుకుని, తెరాసకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి వస్తే, బీజేపీ, తెరాసతో చేతులు కలిపేందుకు ఏమాత్రం సంకోచించదు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు అంతగా లేవనే పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, దేశంలో ఎలా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ క్యాడరుంది. పటిష్ట  ఓటు  బ్యాంక్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే,పట్టణ ప్రాంత పేదల్లో, కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ ఇంకా బలంగానే వుంది. అయితే,అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని  అన్నట్లుగా, నాయకుల మధ్య ఐక్యత లేదు. ప్రస్తుత పీసీసీ నియామకం విషయాన్నే తీసుకుంటే,  ఆలూ లేదు చూలు లేదు, అయినా కొడుకు పేరు ఎదో అన్నట్లుగా, ఢిల్లీలో చిన్నకలయిక రాగానే ఇక్కడ గాంధీ భవన్’లో గందరగోళం మొదలైంది. రేసులు మొదలయ్యాయి. పాత కాపులు, కొత్త ముఖాల మధ్య ఫైట్ మొదలైంది. అలాగే, ఈటల రాజేందర్ విషయంలో కూడా పార్టీ సీనియర్ నాయకుడు హనుమంత రావు, తమదైన శైలిలో పార్టీ రాష్ట్ర నాయకులను తప్పు పట్టారు. నిజానికి, సిద్దాంత పరంగా, భావసారుప్యత పరంగా ఎలా చూసినా  ఈటల కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి..కానీ, బీజేపీని ఎంచుకున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్’కు భవిష్యత్ లేదనే అవగాహానాతోనే కావచ్చును. అది నిజం అయినా కాకపోయినా, అలంటి పర్సెప్షన్ అయితే ఏర్పడింది. అయితే, ఎన్ననుకున్నా, రాజకీయలలో శాశ్వత మిత్రులు, శాశ్వత  శత్రువులు ఉండరు. రేపు ఈటల’ మళ్ళీ సొంత ఇంటికి చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు . అదే రాజకీయం.

క‌రోనాతో చ‌నిపోతే రూ.10 ల‌క్ష‌లు, ఐదేళ్లు జీతం.. సేవ‌లోనూ శ్రీమంతుడు..

సంప‌ద‌లోనే కాదు.. సేవ‌లోనూ తాము సంప‌న్నుల‌మేన‌ని నిరూపించుకుంటున్నారు కొంద‌రు. ప్ర‌స్తుత కొవిడ్ క‌ల్లోల స‌మ‌యంలో ఉద్యోగుల‌కు మేమున్నామంటూ భ‌రోసాగా నిలుస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఇప్ప‌టికే టాటా స్టీల్ సంస్థ త‌మ ఉద్యోగి క‌రోనాతో చ‌నిపోతే ఏడాది పాటు అత‌ని కుటుంబానికి నెల నెలా జీతం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. తాజాగా, టాటాల బాట‌లో రిల‌యెన్స్ కూడా చేరింది. కంపెనీ స్థాయికి త‌గ్గ‌ట్టే.. సేవ‌లోనూ అంద‌రికంటే ముందుంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక‌ కొవిడ్ హాస్పిట‌ల్, ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్స్‌, పేద‌ల‌కు భోజ‌నంతో సామాజిక సేవ‌లో ఉందున్న రిల‌య‌న్స్ సంస్థ‌.. తాజాగా త‌మ ఉద్యోగుల్లో ధైర్యం నింపే మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది.  సంస్థ‌ ఉద్యోగి ఎవ‌రైనా.. కొవిడ్‌ బారిన పడి మృతి చెందితే, అత‌ని కుటుంబానికి రూ.10 లక్షల ప‌రిహారం ఇవ్వ‌నుంది రిల‌యెన్స్. అలాగే, క‌రోనాతో మృతి చెందిన ఉద్యోగి.. చివరి నెల జీతం ఎంత తీసుకుంటారో అంతే జీతం ఐదు ఏళ్ల పాటు మృతుని కుటుంబానికి అందించనున్నట్టు వెల్లడించింది.  అంతేకాకుండా మరణించిన ఉద్యోగి పిల్లల చ‌దువుల‌కు అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. హాస్టల్‌ వసతి, ట్యూషన్‌ ఫీజు, ఇతర విద్యకు సంబంధించిన ఖర్చులన్నీ చెల్లిస్తామని ప్ర‌క‌టించింది.  ఎవ‌రైనా ఉద్యోగి కరోనా బారిన పడిన సమయంలో వారు కోలుకునే వరకు.. పూర్తి కాలానికి కొవిడ్‌ సెలవులను పొందవచ్చని తెలిపింది. క‌రోనా సోకిన ఉద్యోగుల‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తామ‌ని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ త‌మ‌ ప్ర‌క‌ట‌న‌లో స్పష్టం చేశారు. ఇది క‌దా కావ‌ల‌సింది. ఇలాంటి ధైర్య‌మే.. క‌రోనాతో పోరాడేలా బాధితుల్లో స్పూర్తిని నింపుతుంది. ఎంత సంపాదించామ‌నే కాకుండా.. ఎంత తిరిగిచ్చామ‌నే మ‌న‌సు ఉండ‌టం కూడా ఈ రోజుల్లో గొప్ప విష‌య‌మే. అందుకే, ర‌త‌న్ టాటా, ముకేశ్ అంబానీలు నిజ‌మైన శ్రీమంతులు.

వాన‌ల‌తో హాయ్ హాయ్‌.. తెలుగురాష్ట్రాల్లో జాయ్ జాయ్‌..

జూన్ మొద‌టివారం. అంద‌రినీ మురిపించే వారం. నైరుతి నాట్యం చేసే కాలం. రుతుప‌వ‌నాలు ర‌య్ ర‌య్ మంటూ దూసుకొచ్చే స‌మ‌యం. నైరుతి రాక‌కు చిహ్నంగా.. తెలుగురాష్ట్రాలు మేఘావృత‌మ‌య్యాయి. చినుకు చినుకు సంద‌డితో.. ప్ర‌జ‌లంతా ఎండ వేడి నుంచి సేద తీరుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ వ‌ర్షాల‌కు త‌డిసి ముద్ద‌వుతోంది.  ఆగ్నేయ అరేబియా సముద్రంలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే రాష్టంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  కోస్తాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు ప‌డుతున్నాయి. వ‌ర్ష బీభ‌త్సానికి పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.  అరకులోయలో పిడుగుపాటుకు 13 ఆవులు, 6 మేకలు మృత్యువాత పడ్డాయి. ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి.  అటు, తెలంగాణ‌లోనూ దాదాపు అన్ని జిల్లాల్లో ముసురు ప‌ట్టేసింది. బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కుర‌వ‌గా.. సూర్యుడి చుట్టూ రంగుల వ‌ల‌యం ఆవిష్కృత‌మై.. ఆకాశంలో అద్భుతం ద‌ర్శ‌న‌మిచ్చింది. గురువారం సైతం న‌గ‌ర‌మంతా వాన ప‌డుతోంది. జిల్లాల్లోనూ ఉద‌యం నుంచి నాన్‌స్టాప్ రెయిన్‌. ఉరుములు, పిడుగుల‌తో.. వాతావ‌ర‌ణం ద‌డ పుట్టిస్తోంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ‌లు ఇంకా భారీగా ఉండ‌టంతో.. వాన‌ల‌కు త‌డిసి ముద్ద‌వుతున్నాయి. రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. 

ఎంపీ రఘురామను చూసి చలించిన స్పీకర్! న్యాయం చేస్తానని హామీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగిస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వీల్ చైర్ లోనే తన పవరేంటో చూపిస్తున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. తన అరెస్టుకు దారితీసిన అంశాలను వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్‌కు రఘురామ వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వినతిపత్రం సమర్పించారు. తన కేసులో సీఎంజగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్‌పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎంపీ రఘురామ కోరారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని  తెలిపారు. తాను సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని, తన అరెస్టుకు ముందు స్పీకర్‌గా మీకు సమాచారం కూడా ఇవ్వలేదని ఎంపీ రఘురామ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.తనను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కోరారు. తనకు అయిన గాయాలపై గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన అసత్యాల నివేదికపై హైకోర్టు, సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పోలీసులు బేఖాతరు చేశారన్నారు. వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ అయినట్టు గుర్తు చేశారు.  తాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తనకు గాయాలున్నట్లు ధ్రువీకరించి నివేదికను సమర్పించడంతో తనకు బెయిల్‌ మంజూరు చేసిందని స్పీకర్‌కు రఘురామ వివరించారు. ప్రస్తుతం తాను ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిపారు. రఘురామరాజు రెండు కాళ్లూ కట్లతో కనిపించడంతో ఓంబిర్లా చలించినట్లు తెలిసింది. ఎంపీ చెప్పినవన్నీ సావధానంగా విని.. వాటిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుని తగు న్యాయం చేస్తామని, ధైర్యంగా ఉండాలని స్పీకర్‌ భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తొలి రోజు తన కేసుపై మాట్లాడే అవకాశం కల్పించాలని రఘురామ కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.    

ఈటల రాజీనామాపై ట్విస్ట్! బైపోల్ కు బీజేపీ భయపడుతుందా..

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతలను కలవడంతో.. ఆయన కమలం గూటికి చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బీజేపీలో చేరినా.. ఆయన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్నది తేలడం లేదు. నిజానికి మంత్రివర్గం నుంచి తొలగించిన వెంటనే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. తన అనుచరులతో జరిగిన సమావేశంలోనూ ఈటల రాజీనామా చేస్తాననే సంకేతం ఇచ్చారు. కారు సింబల్ పై గెలిచిన పదవి తనకు అక్కరలేదని చెప్పారు. అయితే  రాజీనామాను ఈటల ప్రకటించలేదు. కొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయాలని సవాల్ చేసినా... రాజేందర్ మాత్రం స్పందించలేదు. ఇప్పుడు బీజేపీలో చేరినా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాపై మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని తెలిపారు. న్యాయ సలహా తర్వాతే రాజీనామాపై ఈటల నిర్ణయం తీసుకంటారని తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలను బట్టి... రాజేందర్ ఇప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవచ్చని తెలుస్తోంది. అసలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి న్యాయ సలహా తీసుకోవడం ఏంటన్న చర్చ వస్తోంది. గతంలో ఎంతో మంది నేతలు.. వేరే పార్టీలో చేరినప్పుడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఈటల రాజీనామా చేయాలని కోరుకుంటోంది. ఇలాంటి సమయంలో న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరం ఏంటన్నది ఎవరికి అర్ధం కావడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలు, ఈటల రాజేందర్ కదలికలను బట్టి.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాకుండా ఉండాలని వాళ్లు కోరుకుంటున్న ట్లు కనిపిస్తోంది. ఈటలను కేబినెట్ నుంచి తొలగించిన వెంటనే హుజురాబాద్ పై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. పార్టీ కేడర్ తో మాట్లాడాలని మంత్రి గంగుల కమలాకర్ ను పంపించారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అదే పనిలో ఉన్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గ నేతలతో హరీష్ రావు చర్చలు జరపడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇటీవలే మండలానికో నేతను ఇంచార్జ్ గా నియమించారు కేసీఆర్. వాళ్లంతా నియోజకవర్గంలో తిరుగుతూ.. గులాబీ కేడర్ అంతా పార్టీలోనే ఉండేలా చూస్తున్నారు. ఇతర పార్టీల నేతలకు గాలం కూడా వేస్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొందరు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కారు ఎక్కనున్నారని తెలుస్తోంది.  హుజురాబాద్ పై కేసీఆర్ ఫోకస్ చేయడంతో.. ఉప ఎన్నికకు బీజేపీ భయపడుతుందని తెలుస్తోంది. తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అన్ని అంశాలు పరిశీలంచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఈటలతో పాటు కమలం నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.  మరోవైపు ఈటల రాజేందర్‌ ఈ నెల 4న టీఆర్ఎస్ కు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ఈ నెల 8 లేదా 9 న బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఈటెల గురువారం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ముందు ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బీజేపీలో చేరతానని రాజేందర్‌ అన్నట్లు సమాచారం. ఈటల సహా మొత్తం అయిదుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. 

సాహో రంజిత్.. సొంత కారులో కరోనా రోగుల తరలింపు

కరోనా వైరస్‌ సోకిందంటే చాలు రోగిని తమవాళ్లే వదిలేస్తున్న పరిస్థితి.. వాళ్లవైపు చూడటానికి కూడా పక్కింటివాళ్లు భయపడిపోతున్నారు. పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రాణ స్నేహితులు కూడా పత్తా లేకుండా పోతున్నారు.. కరోనాతో చనిపోతే అనాథలుగా అంత్యక్రియలు జరుగుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరు మాత్రం ప్రాణాలకు తెగించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. కొవిడ్ రోగులకు తమ వంతు సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు.  సొంతవాళ్లే దగ్గరకు రాని సమయంలో కరోనా రోగులకు అన్నీ తానై ఔరా అనిపించుకుంటున్నారు ఖమ్మంకు చెందిన  యువకుడు నల్లమళ్ల రంజిత్. ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తుంటారు రంజిత్. అయితే కరోనా సోకిన రోగులు హాస్పిటల్ కు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను గమనించారు. అంబులెన్సుల కోసం వేలకు వేల చెల్లించలేక పడే బాధలను చూశాడు. కరోనా రోగులకు తాను ఏదో ఒకటి చేయాలని తలంచాడు. అంతే మంచి ఆలోచన చేశాడు. తన కారునే అంబులెన్సుగా మార్చేశారు నల్లమల్ల రంజిత్.  కరోనా బాధితులను తన ఇన్నోవా కారులో ఆస్పత్రులకు చేరుస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. జిల్లాలోని ఇతర గ్రామాల నుంచి ఖమ్మానికి, అవసరమైతే హైదరాబాద్ కు తనకారులో కరోనా రోగులను ఉచితంగానే తీసుకువెళుతున్నాడు రంజిత్. ఇందుకోసం కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రోగులకు ఆక్సిజన్ పెట్టేందుకు సౌకర్యాలు కల్పించారు. వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులను హైదరాబాద్‌కు కూడా తన వాహనంలో తీసుకుని వెళ్తున్నారు నల్లమల్ల రంజిత్.  హైదరాబాద్ తీసుకెళ్లడమే కాదు.. అక్కడి నుంచి తిరిగి సొంత గ్రామాలకు తీసుకువస్తున్నాడు. హాస్పిటల్ లో ఎవరైనా చనిపోయినా.. అతని కుటుంబ సభ్యులు సాయం కోరితే.. తన కారులోనే శవాలను కూడా తరలిస్తున్నాడు నల్లమల్ల రంజిత్. కరోనా పాజిటివ్ అని తేలగానే సొంత కుటుంబ సభ్యులే ముఖం చాటేస్తున్న రోజుల్లో.. ఆస్పత్రికి తరలిస్తూ ఆపద్బాంధవుడు అయ్యారు నల్లమల రంజిత్.ఇంటి వద్ద చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన రోగులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాల్సి ఉంటుంది. అటువంటివారు సాయం అంటూ ఫోన్ చేస్తే స్పందిస్తున్నారు రంజిత్. సొంత వాహనంలో పదుల సంఖ్యలో కరోనా రోగులను ఖమ్మంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సొంత వాళ్లే దగ్గరికి రాని పరిస్థితుల్లో రంజిత్ చేస్తున్న సేవ అద్బుతమంటూ అతన్ని స్థానికులు కొనియాడుతున్నారు. ఖమ్మం జిల్లా నందమూరి యువసేన నాయకులు,  తెలుగు యువత అధ్యక్షులు కూడా అయిన నల్లమల రంజిత్.. నందమూరి ఫ్యామిలీ పట్ల వీరాభిమానిగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పేద కుటుంబాలకు ఆర్ధికంగా  సహకారం చేస్తుంటారు. కరోనా సమయంలోనూ తన సేవలను కొనసాగిస్తున్నారు.  బాధితులకు పలు రకాలుగా రంజిత్ అండగా నిలుస్తున్నారు. రంజిత్ చేస్తున్న సేవలను తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ.. అతనికి ఫోన్ చేసి అభినందించారు. కరోనా తగ్గాక ఖమ్మం జిల్లాకు వస్తానని కూడా చెప్పారు. బాలకృష్ణ అభినందనలతో మరింత ఉత్సాహంగా  కరోనా రోగులకు సేవ చేస్తున్నారు నల్లమల్ల రంజిత్. 

భర్తల కోసం గృహహింస చట్టం లేక‌పోవ‌డం దురదృష్టం.. చెప్పుల సామెత చెప్పిన హైకోర్టు..

498A. గృహహింస చట్టం. భార్య‌ల చేతిలో బ్ర‌హ్మాస్త్రం. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం కేసు పెడితే చాలు. ఇక ఆ భ‌ర్త‌కు చుక్క‌లే. కోర్టులు చుట్టూ తిర‌గ‌లేక.. తోక ముడ‌వాల్సిందే. భ‌ర్తే తాను భార్య‌ను హింసించ‌లేద‌ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కేసు పెట్టిన వెంట‌నే ఎలాంటి విచార‌ణ లేకుండా అరెస్ట్ చేసే అధికార‌మూ ఉంటుంది. ఇన్ని ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్స్ ఉన్నాయి కాబ‌ట్టే.. 498A, గృహహింస చట్టం పేరు విన‌గానే భ‌ర్త‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతుంటాయి. అయితే.. ఈ చ‌ట్టాన్ని చాలామంది భార్య‌లు దుర్వినియోగం చేస్తున్నార‌ని.. త‌ప్పుడు కేసులు పెట్టి.. భ‌ర్త‌ల‌ను అన‌వ‌స‌రంగా వేధిస్తున్నార‌నే అభియోగ‌మూ ఉంది. అందుకే, తాజాగా ఓ గృహ‌హింస కేసులో మ‌ద్రాసు హైకోర్టు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది.  భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి.. భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ వ్యాఖ్యానించింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌ద్రాసు హైకోర్టు ముందుకు వ‌చ్చిన ఆ కేసులో అనేక ట్విస్టులు ఉన్నాయి. 2015లో, ప్ర‌భుత్వ ఉద్యోగి శశికుమార్‌పై అతడి భార్య గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా, తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ శశికుమార్ సైతం ఫిర్యాదు చేశారు. కేసుపై కోర్టులో విచార‌ణ జ‌రిగి.. విడాకులు రావడానికి 4 రోజుల ముందు స‌ద‌రు భార్య.. భ‌ర్త‌ను ఇరికించే మ‌రో ప‌ని కూడా చేసింది. భ‌ర్త ప‌నిచేసే యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్‌కూ తన భర్తపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. దీంతో శశికుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ మర్నాడే, ఆ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డంపై శ‌శికుమార్ హైకోర్టులో కేసు వేశారు. తాజాగా, ఆ కేసు విచారణలో భాగంగా జస్టిస్ వైద్యనాథన్.. పిటిషనర్‌ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందని అన్నారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంచి ఉప‌దేశ‌మూ ఇచ్చారు.  భార్యాభర్తలు తమ అహాన్ని పాదరక్షల్లా చూడాలని, ఇంటి బయటే దానిని వదిలేసి రావాలని సూచించారు. లేదంటే దాని ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఓ వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యమని.. తలపాగా తీసేసినంత ఈజీగా బంధాన్ని తెంచుకోవద్దని సూచించారు జ‌స్టిస్ వైద్య‌నాథ‌న్‌. పిటిష‌న‌ర్ శశికుమార్‌ను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 

ఆ జిల్లాలో థర్డ్ వేవ్ మొదలైందా? ఒకే నెలలో 10 వేల మంది చిన్నారులకు కరోనా.. 

దేశంలో విలయతాండవం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుముఖం పట్టింది. సెకండ్ వేవ్ లో ఊహించని విధంగా విరుచుకుపడిన వైరస్.. వేలాది మందిని బలి తీసుకుంది. హాస్పిటల్స్ లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర నరకయాతన అనుభవించారు. కరోనా రోగులతో కొన్ని ప్రాంతాల్లో అత్యంత దయనీయ పరిస్థితులు కనిపించాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించని తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు.. థర్డ్ వేవ్ వార్తలు భయాందోళన కల్గిస్తున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో థర్డ్ వేవ్ రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశ అంటూ వస్తే చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపవచ్చన్న ప్రచారం జరుగుతోంది.  థర్డ్ వేవ్ పిల్లలకు గండమనే వార్తలు వస్తుండగానే మహారాష్ట్రలో షాకింగ్ న్యూస్ వెలుగులోనికి వచ్చింది. ఆ రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో మే నెలలో దాదాపు 10 వేల మంది మైనర్లు కరోనా భారీన పడటం కలకలం రేపుతోంది. మే నెలలో మొత్తం 9,928 మంది చిన్నారులకు కరోనా సోకిందని అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు. ఇందులో 97 శాతం మంది చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు. కొవిడ్ సోకిన మొత్తం 9,928 మంది మైనర్లలో 11-18 ఏళ్ల వయసు గల వారు 6,787 మంది ఉండగా.. 1-10 సంవత్సరాల లోపు చిన్నారులు 3052 మంది ఉన్నారు. మరో 89 మంది ఏడాది లోపు పిల్లలు. మేలో అహ్మద్‌నగర్ జిల్లాలో మొత్తం 86 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.  అహ్మద్ నగర్ జిల్లాలో దాదాపు 10 వేల మంది చిన్నారులు కరోనా భారీన పడటంతో.. ఆ జిల్లాలో థర్డ్ వేవ్ మొదలైందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే చిన్నారుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అహ్మద్ నగర్ జిల్లా పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ మెంబర్ సచిన్ సోలత్ చెబుతున్నారు. మే నెలలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో చిన్నారుల శాతం 11.5 మాత్రమే,, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదన్నారు. కొవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన 97 శాతం మంది చిన్నారుల్లో కరోనా లక్షణాలు లేవన్నారు.  ఉమ్మడి కుటుంబాల్లో అందరూ ఒకేచోట నివసిస్తున్నందున చాలా మందికి పెద్ద వాళ్ల నుంచే కరోనా సోకి ఉండొచ్చని సచిన్ సోలత్ తెలిపారు. మరోవైపు అహ్మద్ నగర్ జిల్లాలో 10 వేల మంది చిన్నారులకు కరోనా సోకిందన్న వార్తలతో మహారాష్ట్రలోని ఇతర ప్రాంత ప్రజల ఆందోళన పడుతున్నారు. మూడో దశ వచ్చేసిందని, తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలంటూ భయపడిపోతున్నారు. కరోనా సోకకుండా తమ పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆనందయ్య మందు తయారీ షురూ.. పంపిణీ ఎప్పుడంటే? 

దేశ వ్యాప్తంగా చర్చగా మారిన, లక్షలాది మంది కోరుకుంటున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో మందు తయారీపై దృష్టి సారించారు ఆనందయ్య.  కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి  ఏర్పాట్లను మొదలు పెట్టారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా అకాడమీని ఎంచుకున్నారని తెలుస్తోంది.  కృష్ణపట్నం పోర్టు అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్  నిర్మిస్తున్నారు. షెడ్ నిర్మాణం కోసం ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం.. ఇతర సదుపాయాల కల్పన పూర్తవుతుంది. తర్వాత  మందు తయారీని మొదలు పెట్టి… సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆనందయ్య. గతంలో చేసినట్లే తన తోటలోనే మందు తయారీకి ఆనందయ్య సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం అంగీకరించలేదు. ఆనందయ్య తోటలో కాకుండా…మందును కృష్ణపట్నం పోర్టులో తయారు చేయాలని సూచించింది. బహిరంగ ప్రదేశంలో మందు తయారు చేయడం సరికాదనే తెలిపింది.  తోటలో మందు తయారీ చేయడం సెంటిమెంట్‌గా ఫీలవుతున్నట్లు ఆనందయ్య చెప్పినప్పటికి …అధికారులు వినకపోవడంతో చివరికి కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఆనందయ్య అంగీకరించారు.  కరోనా మందు తయారికి కావాల్సిన వనమూలికలు సమకూర్చుతున్నారు ఆనందయ్య మనుషులు.  గురువారం నుంచి మందు తయారు చేయనున్నారు. నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ఈనెల 7వ సోమవారం నుంచి మందు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్‌ పద్ధతిలో మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్, కర్ఫ్యూ నిబంధనల నేపధ్యంలో ఎవరూ కృష్ణపట్నం రావద్దంటున్నారు అధికారులు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు మందును పంపిణీ చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో యాప్‌ ద్వారా మందు కోసం బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు.  ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ రూపకల్పన పూర్తయిన తర్వాత అందులో వివరాలు ఎలా పొందుపరచాలో.. ఎంతమేర మందును వినియోగించాలో.. బాధితులు మందును ఎలా వాడాలో కూడా ఆ యాప్‌లో పొందుపరుస్తామని కలెక్టర్ చక్రధర్‌. అయితే ఈ యాప్‌ని ఎవరు తయారు చేస్తున్నారు…అది ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మిగిలిన ఐదు రోజుల్లో ఇదంతా సాధ్య పడే విషయమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు www.childeal.in పేరుతో website ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనందయ్య కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సైట్ లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేస్తామని చెప్పారు.

మావోయిస్టులపై కరోనా పంజా! 12 మంది అగ్రనేతలకు సీరియస్?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి మారుమూల గ్రామాలకు పాకింది. సెకండ్ వేవ్ లో పట్టణాల్లో కంటే పల్లెల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పల్లెల్ల్లో కాదు కారడవులను కరోనా చుట్టేసింది. అడవుల్లో ఉండే మావోయిస్టులు వైరస్ భారీన పడి అల్లాడిపోతున్నారని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలోని పలువురు సీనియర్లు, కీలకమైన నేతలు కరోనా సోకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఓ మావోయిస్టు కీలక నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారించగా సంచలన విషయాలు తెలిశాయని తెలుస్తోంది. కరోనా వైరస్‌ బారిన పడి తగిన చికిత్స కోసం చత్తీస్‌ఘడ్‌ నుంచి వరంగల్‌కు వస్తున్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ అలియాస్‌ శోభ్రాయ్‌ అలియాస్‌ మోహన్‌తో పాటు మరో కొరియర్‌ను వరంగల్ పోలీసులు ములుగు రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మావోయిస్టును జుడీషియల్‌ రిమాండ్‌కు పంపే క్రమంలో చేసిన వైద్య పరీక్షల్లో అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కోణంలో ఆరా తీశారు. మావోయిస్టు ఉద్యమంలోని పలువురు కీలక నేతలను సైతం కరోనా చుట్టుముట్టిందని అతను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.   మావోయిస్టు పార్టీలోని కీలకమైన పన్నెండు మంది నేతలు కొవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్నారని పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలుస్తోంది. అగ్ర నేతలు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవుజి, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి అలియాస్‌ వికల్ప్‌, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాస దడ, కంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, ముచ్చకి ఉజల్‌ అలియాస్‌ రఘు, కొడి మంజుల అలియాస్‌ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్‌ బుర్రా కరోనా సోకిన వారిలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి కూడా ఈ విషయాలను ధృవీకరించారు. వీరంతా బయటకు వస్తే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు.   కొవిడ్ సోకిన వారికి చికిత్స అందించే విషయంలో మావోయిస్టు పార్టీలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోందని తెలుస్తోంది. పరిస్థితి అత్యంత విషమంగా  ఉన్న సమయంలోనే చికిత్సకు అనుమతి ఇస్తున్నారట. మారుమూల గిరిజన గూడేల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో కరోనా సోకిన మావోయిస్టులు పరిస్థితి విషమంగా మారుతుందని చెబుతున్నారు.చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్‌ జిల్లా సిల్గేర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ మేనెల మూడో వారంలో చత్తీస్‌ఘడ్‌,  తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన వేలాది మంది గిరిజనులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారిని మావోయిస్టు నాయకులు కలవడం వల్ల వారికి వైరస్‌ సోకిందని భావిస్తున్నారు.  మరోవైపు అడవుల్లో ఉండే మావోయిస్టులకు కరోనా సోకడంతో దండకారణ్యంలో భయాందోళన వ్యక్తమవుతోంది. గిరిజన, ఆదివాసి తండాలకు వైరస్ వ్యాప్తిస్తే పరిస్థితి చాలా కఠినంగా మారుతుందని, వైరస్ ను  కంట్రోల్‌ చేయడం కష్టమన్నది వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు గిరిజన తండాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా లేదు. తాజాగా వెలుగుచూసిన ఘటనతో ప్రభుత్వ యంత్రాంగాలు కలవరపడుతున్నాయి. 

మతం మారితే  ఉద్యోగం  ఉష్ ..కాకీ ..

దేశంలో రిజర్వేషన్ల దుర్వినియోగం గురించి, ఎప్పటికప్పుడు ఎన్నో విధాల చర్చ జరుగుతోంది.అలాగే, కోర్టు తీర్పులు, వస్తూనే ఉన్నాయి, అయినా, దుర్వినియోగం సాగుతూనే వుంది. ఇందుకు సంబంధించి,తాజాగా మద్రాస్ హై కోర్టు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. మార్గదర్శకాలను జారీచేసింది. మతం మారిన వ్యక్తి, అప్పటికే పొందిన రిజర్వేషన్ సదుపాయంతో పాటుగా, భవిష్యత్ ప్రయోజనాలను కూడా కోల్పోతారని, మద్రాస్ హై కోర్టు తాజా తీర్పులో పేర్కొంది.  వివరాలలోకి వెళితే, కోయంబత్తూర్’లోని భారతియార్ యూనివర్సిటీలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (లైబ్రరీ) నియామకం, తదనంతరం టెక్నికల్ ఆఫీసర్’గా పొందిన  పదోన్నతికి సంబంధించి దాఖలైన పిటీషన్’పై విచారణ జరిపిన హై కోర్టు నాయయమూర్తి, జస్టిస్ ఆర్. మహదేవన్, ‘మతం ప్రాతిపదికన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ పరిధిలో ఉద్యోగం పొందిన వ్యక్తి నియామకానికి ముందు లేదా తర్వాత మతం మారితే, వారు  ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కును కోల్పోతారు, అలాంటి  ఉద్యోగిని ఉద్యోగం నుంచి తక్షణం తొలిగించాలి’ ఆని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతే కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా, నియామకం జరిపిన సెలక్షన్ కమిటీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి యూనివర్సిటీని ఆదేశించారు. అయితే, దురదృష్టం ఏమంటే, కోర్టు ఆదేశాలను యూనివర్సిటీ పట్టించుకోలేదు. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్’గా నియామకం పొంది, టెక్నికల్ ఆఫీసర్’గా పదోన్నతి పొందిన గౌతమ్, నియామకం రద్దు చేయలేదు. ఈలోగా ఆయన, పదవీ విరమణ చేశారు. కాగా,ఇప్పుడు తాజాగా నాయయస్థానం ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయమని ఆజ్ఞాపించింది. అంతే కాదు, సదరు వ్యక్తి అనర్హుడని తెలిసినా, యూనివర్సిటీ రిజిస్టార్’ నిబంధనలను పెడచెవిన పెట్టి అక్రమాలు కొంసగించారు, కాబట్టి, అక్రమ నియామకాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా అభ్యర్ధులు ఉద్దేసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఉద్యోగం పొందినా , వెంటనే ఉద్యోగం నుంచి తోలోగించదాంతో పాటుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి  పేర్కొన్నారు.   నిజానికి, మద్రాస్ హై కోర్టు ఒక నిర్దిష్ట కేసుకు సంబంధించి ఇచ్చిన డైరెక్షన్స్ అయినా, దేశంలో మతపరమైన రిజర్వేషన్లు అనేక విధాల దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు అనేక వెలుగు చూస్తున్నాయి. ఉదాహరణకి, ఆంధ్ర ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి అనేక ఆరోపణలున్నాయి. అంతే కాదు, ఏపీలో ఎండోమెంట్స్ డిపార్టుమెంటులోనూ అక్రమమార్గంలో నియమకాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.  ఈ నేపధ్యంలో,  విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతున్న ఉదంతాలకు సంబంధించి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర పాటి దృష్టికి తీసుకెళ్ళింది. ఈ నేపధ్యంలోనే  కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ (సోషల్ వెల్ఫేర్ విభాగం)ని కోరింది. అయితే, కోయంబత్తూర్ యూనివర్సిటీ’లానే ఏపీ ప్రభుత్వంలో కూడా చలనం లేదు. కేంద్రం నుంచి తాఖీదులు అంది సుమారు సంవత్సరం పైనే అయింది. మరోవంక వైసీపీ, రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, ఇదే విషయంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు  చేశారు.  అదలా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో, పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతకు ముందు లేదా ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న ఉదంతాలున్నాయి. ఏపీ హోం మంత్రిపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి..మరి వీరి మీద చర్యలుండవా ... వీరిపై అనర్హత వేటు పడదా ? చట్టం ముందు అందరూ సమానం కాదా ..

డాక్ట‌ర్‌ను చిత‌క్కొట్టిన రోగి బంధువులు.. సీఎం సీరియ‌స్‌.. 24మంది అరెస్ట్‌..

వైద్యో నారాయ‌ణో హ‌రి. రోగి బ‌తికితే.. ఆ వైద్యుడు దేవుడ‌వుతాడు. అదే ఆ రోగి మ‌ర‌ణిస్తే.. ఆ వైద్యుడిని హంత‌కుడిగా చూస్తారు. ఓ కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో అదే జ‌రిగింది. త‌మ బంధువు మృతికి కార‌ణం అయ్యాడ‌నే కోపంతో.. జూనియ‌ర్ డాక్ట‌ర్‌పై దారుణంగా దాడి చేశారు. ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. ప‌దుల సంఖ్య‌లో బంధువులు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతు.. ఆ వైద్యుడిని గొడ్డును బాదిన‌ట్టు బాదారు.  అసోంలోని హోజాయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయ‌న చికిత్స చేస్తున్న క‌రోనా బాధితుడు చ‌నిపోవ‌డంతో.. ఆ డాక్ట‌ర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఇలా బ‌రితెగించారు. 24 మంది క‌లిసి.. ఒక్కసారిగా వైద్యుడి మీద ప‌డి కుమ్మేశారు. చేతికి దొరికిన వ‌స్తువుల‌తో దాడి చేశారు.  దాడి వీడియో సోష‌ల్ మీడియాకు ఎక్క‌డం.. అది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఈ కేసును స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నట్టు.. దాడి కేసులో 24 మంది నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు ముఖ్య‌మంత్రి హిమంత బిస్వాశ‌ర్మ ట్వీట్ చేశారు. బాధిత వైద్యుడికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. వైద్యుడిపై దాడి అనాగరిక చర్య అని.. ఫ్రంట్‌లైన్ కార్మికులపై దాడులకు పాల్పడితే.. సహించేది లేదని హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు.  యువ వైద్యుడిపై దాడి ఘటనను అసోం ఐఎంఏ ఖండించింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. సినిమా సీన్ క్రియేట్ చేసింది.. 

ఓపెన్ చేస్తే.. ఆమె పేరు రషీదా షేక్ వయసు 28 ఏళ్ళు. ఆమె  భర్త రయీస్ షేక్ కొన్ని రోజులుగా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఫార్మాలిటీస్ ప్రకారం  ఆమెను కొన్ని ప్రశ్నలు సంధించారు. నీ భర్తకు ఎవరైనా ఎవరైనా శత్రువులు ఉన్నారా? గతం లో అప్పులు ఉన్నాయా? మీ బంధువులతో గానీ, మీ భర్త ఫ్యామిలీలో ఆస్తి గొడవలు ఉన్నాయా..? ఇలాంటి ప్రశ్నలు పోలీసులు ఆమెను అడిగారు. ఆమె ఆలోచించడం మొదలు పెట్టింది. చాలా దీర్ఘాంగా, చాలా లోతుగా ఆలోచించి. ఆమె కొంతమందిపై అనుమానం ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.  కంప్లైంట్ తీసుకున్న పోలీసులు. కేసుకు సంబందించిన దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా. రయీస్ షేక్ సోదరుణ్ని స్టేషన్‌కు పిలిపించారు. అతనిపై కూడా పోలీసులు  వారి లా ప్రకారం ప్రశ్నలు విసిరారు. మీ తమ్ముడు మిస్సింగ్ గురించి  మీకు తెలియదా.?  ఆ విషయంపై కంప్లైంట్ ఇవ్వాలని మీకు అనిపించలేదా?  అని. అంతే రయీస్ షేక్ అన్న మాట్లాడం స్టార్ట్ చేశాడు. ఇవ్వాలనే  అనుకున్నాను సార్.. నాకు ఫీవర్  ఉండి నిన్న రావడం కుదరలేదు.  ఇంతలో ఆమె ఇచ్చేసింది అని చెప్పాడు. అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు. మేం పిలిచినప్పుడు స్టేషన్‌కి రావాలి. అన్నారు. సరే సార్ అంటూ వెళ్లిపోయాడు. అయినా పోలీసులకు ఆ మిస్టరీ ఏంటో అర్థం కాలేదు. ఎవరు చేసి ఉంటారో అంతు చిక్కలేదు. పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత పోలీసులు కొంచం టెక్నికల్ గా ఇన్వెస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే రషీదా షేక్ , రయీస్ షేక్. మొబైల్ నంబర్ల కాల్ లిస్ట్, వాట్సాప్ చాటింగ్ అన్నీ చెక్ చేశారు.  కట్ చేస్తే.. అప్పటి వరకు రహస్యం గా ఉన్న ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆమెకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెను పోలీసులు మరోసారి స్టేషన్‌కు పిలిపించారు. ఈసారి  డోసు పెంచి కాస్త గట్టిగా అడిగితే... అప్పుడు కూడా ఆమె. తనకేమీ తెలియదని.. ఆ యువకుడితో పరిచయం ఉన్నట్లు ఒప్పుకుంది, ఆ సంబంధం  మాత్రమే ఉందంటూ బోరున ఏడ్చింది. మహానటి మాదిరి నమ్మబలికింది. కట్ చేస్తే.. ఇందులో మరో ట్విస్ట్ ఉండి. అదేంటో మీరే చూడండి. ఆమె వెంట ఉన్న టీనేజ్ పాప అంటే ఆమె కూతురు మాట్లాడుతూ .. "మా నాన్నను అమ్మ, అతను చంపేశారు" అంది. అంతే... ఇక అంటే ఆ తల్లి ముఖం మాడిపోయింది. వెంటనే కూతురి నోరు మూసింది. ఇంకేం  మాట్లాడనివ్వకుండా చేసేందుకు ట్రై చేసింది. అప్పటి వరకు క్లూ దొరికాక పోలీసులు ఒక్కసారిగా క్లూ దొరికితే ఊరుకుంటారా పోలీసులు.. లేడీ కానిస్టేబుళ్లను రంగంలోకి దింపారు ..రషీదాకు కోటింగ్ ఇప్పించారు. ఇలా కోటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో... నిజం ఒప్పేసుకుంది. తమ మధ్య సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనీ... అతన్ని చంపేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్లాన్ ప్రకారం... 12 రోజుల కిందట... భర్తకి పెట్టే భోజనంలో నిద్రమాత్రల పొడి వేసింది. భోంచేశాక... మద్యం తాగకుండానే మత్తులోకి వెళ్లిపోయాడు. చీకటి పడ్డాక ప్రియుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి... భర్త తలను నరికేశారు. ఆ తర్వాత... బెడ్‌రూంలోనే... గొయ్యి తీసి... శవాన్ని పూడ్చిపెట్టేశారు. దానిపై దుప్పట్లు, పాత వస్తువుల వంటివి పెట్టి... ఎలాగో కవర్ చేశారు. కానీ... పక్క గదిలో నిద్రపోతున్న పాప... నిద్రలేచి... తలుపు సందులోంచీ... జరిగిన దారుణాన్ని చూసేసిందనే విషయం వాళ్లకు తెలియదు.

మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇప్పించాలి.. తల నరికేస్తే ఏం లాభం? హైకోర్టు షాకింగ్ కామెంట్స్‌..

క‌రోనా విష‌యంలో అన్నిటికంటే స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్న‌ది కేవ‌లం న్యాయ‌వ్య‌వ‌స్థ మాత్ర‌మే. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వాల‌ను హెచ్చ‌రిస్తూ.. త‌ప్పులు స‌వ‌రిస్తూ.. అధికారుల‌కు మొట్టికాయ‌లు వేస్తూ.. క‌రోనా క‌ట్ట‌డికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. తెలంగాణ‌లో క‌రోనా చికిత్స పేరుతో కాసుల వ్యాపారం చేస్తున్న హాస్పిట‌ల్స్‌పై మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలంటూ స‌ర్కారును ఆదేశించింది. అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న ఆసుప‌త్రుల లైసెన్సులను ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంపై హైకోర్టు సంచ‌ల‌న కామెంట్లు చేసింది.  ‘‘మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇప్పించాలి కానీ.. తల నరికేస్తే ఏం లాభం?.. లైసెన్స్‌లు రద్దు చేశాక ఆసుపత్రులు బాధితులకు సొమ్ము తిరిగి ఇవ్వకుండా  మొండికేస్తాయి కదా!’’ అని హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.  కొవిడ్ చ‌ర్య‌ల‌పై హైకోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా.. ప్రైవేటు ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని, 21 ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సల లైసెన్స్‌లు రద్దు చేశామని తెలంగాణ‌ డీహెచ్‌ హైకోర్టుకు వెల్లడించారు. ఆసుపత్రుల కొవిడ్‌ చికిత్సల లైసెన్స్‌ రద్దు చేస్తే సరిపోతుందా? ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు బాధితులకు తిరిగి చెల్లించాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్స్‌ల రద్దు కన్నా బాధితులు చెల్లించిన అధిక ఛార్జీలు తిరిగి ఇప్పించడం ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికంగా వసూలు చేసిన ఛార్జీలు తిరిగి ఇవ్వకపోతే  లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించాలని హైకోర్టు అభిప్రాయపడింది. బాధితులకు ఛార్జీలు తిరిగి ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్‌ వివరణ ఇచ్చారు.  ప్రైవేటు ఆసుపత్రుల చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలు ఖరారు చేశారా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మొదటి దశలోనే గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చామని డీహెచ్‌ తెలపగా.. రెండో దశలో ఎందుకు సవరించలేదని హైకోర్టు ప్రశ్నించింది. గరిష్ఠ ధరలు మరోసారి సవరిస్తామని డీహెచ్‌ వివరణ ఇవ్వగా.. గరిష్ఠ ధరలు ఖరారు చేసి వెబ్‌సైట్‌లో పెట్టి అఫిడవిట్‌  దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.   మూడోదశ కరోనా ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని హైకోర్టు తెలంగాణ డీహెచ్‌ను ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని పడకలు ఆక్సిజన్‌ పడకలుగా  మారుస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి చర్యలు చేపట్టాం. సొంతంగా ఆక్సిజన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు చెప్పాం. ఈనెల 10 నాటికి 14 కొత్త ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి’’ అని డీహెచ్ హైకోర్టుకు వివ‌రించారు. 

సూర్యుని చుట్టూ రంగుల వ‌ల‌యం.. ఎలా సాధ్యం? సైన్స్ ఏం చెబుతోంది?

ఆకాశంలో రంగుల వ‌ల‌యాన్ని అంతా ఆశ్చ‌ర్యంగా చూశారు. రోజూ చూసే సూర్యున్ని వింత‌గా, ప్ర‌త్యేకంగా చూశారు. ఇంద్ర‌ధ‌న‌స్సును ఇన్నాళ్లూ అర్థ చంద్ర‌కారాంలో మాత్ర‌మే చూసుంటారు. తొలిసారిగా పూర్తి వృత్తాకార రంగుల వ‌ల‌యాన్ని చూసిన వారంతా అవాక్క‌య్యారు. అరే.. భ‌లే ఉందే అంటూ ట‌కాట‌కా ఫోటోలు తీసేశారు. సోష‌ల్ మీడియాలో స్టేట‌స్‌ల‌తో హోరెత్తించారు.  ఆకాశంలో అద్భుతాన్ని చూసి ఎంజాయ్ చేసిన వాళ్లు కొంద‌రైతే.. ఆ సంపూర్ణ ఇంద్ర‌ధ‌న‌స్సు ఎలా ఏర్ప‌డుతుంద‌ని ఆరా తీసిన‌వారు మ‌రికొంద‌రు. వాటిని 22డిగ్రీ వృత్తాకార వలయాలు అంటార‌ని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  హైద‌రాబాద్‌లో వ‌ర్షం కుర‌వ‌డంతో ఆ అద్భుతం సాధ్య‌మైంది. వాతావరణంలో ఉండే నీటిబిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు.. తెల్ల‌ని కాంతి రంగులుగా విడిపోయి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఒక్కోసారి సూర్యుడి చుట్టూ రంగురంగుల‌ వృత్తాకార వలయాలు ఏర్పడుతాయి. భూమిపై ఏదైనా ప్రదేశం నుంచి సూర్యున్ని చూస్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన వృత్తం వ్యాసార్థం 22 డిగ్రీలుగా ఉంటుంది.  గాల్లోని నీటి బిందువుల ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు.. అది వక్రీభవనంతో పాటు పరావర్తనం చెంది మెరవడం వల్ల ఇలాంటి వృత్తాలు కనిపిస్తాయి. ఇంద్రధనస్సు ఏర్పడే మాదిరిగానే ఇవి సూర్యుడి చుట్టూ, అలాగే చంద్రుడి చుట్టూ ఏర్పడుతుంటాయి. సూర్యుని చుట్టూ ఏర్ప‌డితే 'స‌న్ హాలో' అని.. చంద్రుడి చుట్టూ కనిపించే వృత్తాలను ‘మూన్‌ రింగ్‌’గా పిలుస్తారు.  ప్ర‌స్తుతం ఆకాశంలో ఆవిష్కృత‌మైన ఆ అద్బుతం.. 'స‌న్ హాలో'. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాద‌మూ లేదు. ఎలాంటి పుకార్ల‌నూ న‌మ్మ‌వ‌ద్ద‌ని.. హాయిగా ఎంజాయ్ చేయొచ్చ‌నేది సైంటిస్టులు మాట‌.