ఎంపీ రఘురామను చూసి చలించిన స్పీకర్! న్యాయం చేస్తానని హామీ..
posted on Jun 3, 2021 @ 10:34AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగిస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వీల్ చైర్ లోనే తన పవరేంటో చూపిస్తున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. తన అరెస్టుకు దారితీసిన అంశాలను వివరించారు. జగన్మోహన్రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్కు రఘురామ వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వినతిపత్రం సమర్పించారు.
తన కేసులో సీఎంజగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయ్పాల్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎంపీ రఘురామ కోరారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. తాను సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని, తన అరెస్టుకు ముందు స్పీకర్గా మీకు సమాచారం కూడా ఇవ్వలేదని ఎంపీ రఘురామ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.తనను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కోరారు. తనకు అయిన గాయాలపై గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన అసత్యాల నివేదికపై హైకోర్టు, సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పోలీసులు బేఖాతరు చేశారన్నారు. వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ అయినట్టు గుర్తు చేశారు.
తాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తనకు గాయాలున్నట్లు ధ్రువీకరించి నివేదికను సమర్పించడంతో తనకు బెయిల్ మంజూరు చేసిందని స్పీకర్కు రఘురామ వివరించారు. ప్రస్తుతం తాను ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిపారు. రఘురామరాజు రెండు కాళ్లూ కట్లతో కనిపించడంతో ఓంబిర్లా చలించినట్లు తెలిసింది. ఎంపీ చెప్పినవన్నీ సావధానంగా విని.. వాటిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుని తగు న్యాయం చేస్తామని, ధైర్యంగా ఉండాలని స్పీకర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తొలి రోజు తన కేసుపై మాట్లాడే అవకాశం కల్పించాలని రఘురామ కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.