పెళ్ళికి రెడీ.. అదే టైం లో ప్రియుడితో ఎగిరేందుకు స్కెచ్..

అబ్బాయిది మహబూబ్ నగర్ జిల్లా. అమ్మాయిది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్.. ఇద్దరి కుటుంబాలు వాళ్ళకి పెళ్లి కుదిర్చారు.. వాళ్ళిద్దరి పెళ్లి నిన్న ఉండడంతో అమ్మాయి వాళ్ళు పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శనివారమే వరుడి గ్రామానికి చేరుకున్నారు. పెళ్లి పనిలో ఒక్కడు ఉంటే అదేదో పనిలో ఇంకొకడు ఉన్నట్లు, నిన్న పెళ్లి పీటలపై కూర్చున్న వధువు అదే పనిగా సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండడం, అందరికి అనుమానం వచ్చింది.. ఈ టైం లో ఎవరితో మాట్లాడుతుందని. పెళ్లి ముందు పెట్టుకుని అంత అత్యవసరమైన పని ఏముంటుందని బంధువులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇంతకీ మీరు ఆ విషం ఏంటని అనుకుంటున్నారా.. అవును మీరు అనుకున్నదే కానీ మరో ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ను తెలుసుకోవాలంటే పూర్తి వార్త చదవండి..  పెళ్ళికి రెడీ అయిన ఆ పెళ్లి కూతురికి ఒక లవ్ స్టోరీ ఉంది.. పెళ్లి పెట్టుకుని సెల్ ఫోన్ లో మాట్లాడింది తన ప్రియుడితోనే.. అంటే కాదండోయ్ అతనితో  మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపింది.. ఇది పక్కన పెడితే ఆ పిల్ల ఎంత బద్మాష్ పిల్లనో సుడుర్రి ఇగ.. ఈ వరుడితో పెళ్లి అయ్యాక.. రాత్రికి ప్రియుడితో కలిసి ఎగిరిపోవాలనుకుందంటా.. సూడు ఈ కాలం పిల్లలు ఎలా తయారు అయ్యారో.. పెళ్లి ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పాలిగాని గిట్ల ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని.. ప్రియుడితో చేకేస్తే పాపం గా పిలగాని పరిస్థితి ఏంగావాలి..  ఇక గీవిషయం పెద్దలకు దెల్వడంతో..  ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలన్న యువతి ప్లాన్ బెడిసికొట్టింది. అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన వరుడి తరపు బంధువులు అతడు చెప్పింది విని విస్తుపోయారు. ఆమె, తను గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని సదరు యువకుడు చెప్పాడు. తర్వాత అతడి సెల్‌ఫోన్‌లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను చూసి అంతా షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన పోలీసులు ఎవరూ కేసు పెట్టకపోవడంతో ఇద్దరినీ వదిలేశారు. ఇరు వర్గాల అంగీకారంతో వధూవరులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. 

సర్వేపల్లి, చంద్రగిరికే మందు! ఆనందయ్య కొందరివాడేనా.. 

కృష్ణపట్నం ఆనందయ్య మందు అందరిది.. ఇది నిన్నటి మాట. ఆనందయ్య మందు కొందరిదే... కాదు కాదు రెండు నియోజకవర్గాల జనాలదే.. ఇది ఇప్పటి మాట. ఎన్నో వివాదాలు.. అనుమానాలు మధ్య  ఆనందయ్య మందు పంపిణికి ముందడుగు పడింది. సోమవారం నుంచి మంది పంపిణీకి ఏర్పాటు జరిగాయి. మందు తయారీ కూడా జరిగింది. ఆనందయ్య మందు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుండగా.. వాళ్లందరికి షాకింగ్ న్యూస్ చెప్పారు ఆనందయ్య. మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే మందు ఇస్తానని చెప్పారు. అంతేకాదు కాదు ముందు చెప్పినట్టు కాకుండా తొలి రోజు కేవలం 2 వేల మందికే మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య సిద్ధమయ్యారు.  కనీసం 5 వేల మందికి పంపిణీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ సంఖ్యను మరింత కుదించారు. తొలి రోజు కేవలం 2 వేల మందికి మాత్రమే మందు పంపిణీ చేయనున్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నవారికి మొదట మందు వేయాలని ఆనందయ్య కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇతర ప్రాంతాల వారు ఎవరినీ రానీయడం లేదు. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. వాలంటీర్ల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ.. మెడిసిన్ డోర్ డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు  తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు తయారీని పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రానికల్లా మందు తయారీ పూర్తవుతుందని చెబుతున్నారు. వనమూలికలు సేకరించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్రంగా శ్రమించినట్టు తెలిపారు.మందు పంపిణి కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్యాకింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న బాక్సులను తయారు చేయించారు.  కృష్ణపట్నం…టు…సర్వేపల్లి…వయా చంద్రగిరి. ఇది ఆనందయ్య మందు తయారు చేసే రూటుగా మారింది. కృష్ణపట్నంలో ఆనందయ్య తమ్ముడు నాగరాజు మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. సర్వేపల్లిలో స్వయంగా ఆనందయ్య…చంద్రగిరిలో కొడుకు శ్రీధర్‌ మందు తయారు చేసి పంపిణీకి సిద్ధమయ్యారు. ఆనందయ్యకు…ఆయన అనుచరులకు మధ్య విభేదాలు వచ్చినట్లు కనిపిస్తోంది. మందు పంపిణీకి బ్రేక్‌ పడిందని…ఎవ్వరూ కృష్ణపట్నం, సర్వేపల్లి రావొద్దని ఆయన అనుచరుడు సంపత్ ఖరాఖండిగా చెప్పేశారు. ప్రభుత్వ సహకారం లేనిదే మందు పంపిణీ చేయలేమంటున్నారు. మందు పంపిణీకి బ్రేక్‌ పడలేదని.. సోమవారం నుంచి పంపిణీ జరుగుతుందని ఆనందయ్య చెప్పారు. ముందుగా సర్వేపల్లిలో మందు పంపిణీ జరుగుతుందన్నారు. ఇతర జిల్లాల వారు కృష్ణపట్నం రావొద్దని సూచించారు. త్వరలో ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తంగా ఆనందయ్య మందును సర్వేపల్లి నియోజకవర్గంలోనే పంపిణి చేస్తుండటం.. అటు చంద్రగిరి కోసం తిరుపతిలో తయారు చేస్తుండటం వివాదంగా మారుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందయ్యను బెదిరించి.. తాము చెప్పినట్లుగా చేసేలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేవలం తమ తమ నియోజకవర్గ ప్రజల కోసమే మందును తయారు చేయిస్తుండడంపైనా  ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మందుకోసం ఎదురుచూస్తున్న మిగతా వారంతా ఏమైపోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. సర్వేపల్లి, చంద్రగిరి ఎమ్మెల్యేల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. చంద్రగిరిలో మందు పంపిణి కోసం సీఎం జగన్ ఫోటోలతో ప్యాకింగ్ ఏర్పాట్లు చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఆనందయ్య మందును వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం దారుణమంటున్నారు. 

ఈటల ఇలాఖాలో జోరుగా బేరాలు.. ప్రజా ప్రతినిధులకు కాసుల పంట?

ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ లో రాజకీయం రంజుగా మారింది. ఇప్పుడా నియోజకవర్గంలో జోరుగా బేరాలు జరుగుతున్నాయి. నాయకుడి స్థాయి, పదవిని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారట. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలు, రాష్ర్ట స్థాయి నాయకుడి వరకు ఒక్కొక్కరికి ఒక్కో ధర. ఈటల వెంట ఎవరూ వెళ్లకుండా  కేడర్ ను కాపాడుకోవడానికి.. కారు పార్టీ నేతలు కాసుల సంచులతో దిగారని ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు. అటు తన బలాన్ని నిలుపుకోవడానికి ఈటల కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉండటంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల పంట పండుతుందనే టాక్ వినిపిస్తోంది.  ఈటలను మంత్రివర్గం నుంచే తొలగించినప్పటి నుంచే హుజూరాబాద్ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. మొదట నేతలంతా ఈటలకు మద్దతుగా నిలిచినా.. రోజులు గడిచే కొద్ది సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ముఖ్య నేతల ఎంట్రీతో కొందరు వెనక్కి తగ్గారు. ఒక రోజు  ఈటల వెంట.. మరుసటి రోజు గులాబీ క్యాంపులో ఉంటూ కొందరు నేతలు హల్చల్ చేశారు. దీంతో ఎవరూ ఎవరికి మద్దతుగా ఉన్నారో తెలియని పరిస్థితి కనిపించింది. అయితే కేసీఆర్ డైరెక్షన్ లో రంగంలోకి దిగిన గులాబీ నేతలు.. పార్టీలో పలుకుబడి గల నాయకులను టీఆర్ఎస్ తోనే కలిసి నడిచేలా మంత్రులు, రాష్ర్ట నాయకులు పావులు కదుపుతున్నారు. నాయకులకు పోస్టు ను బట్టి రేటు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  గ్రామ శాఖ అధ్యక్షుడికి రూ.లక్ష ధర పలుకుతోందని సమాచారం. సర్పంచ్ కి ఐదు, మండలాధ్యక్షుడికి పది, ఇంకా స్థాయి పెరుగుతుంటే రేటు పెంచుతూ డీల్ కుదుర్చుకుంటున్నారని సమాచారం. అధికార పార్టీకి చెందిన ప్రముఖులు రంగంలోకి దిగి తమ అనుయాయుల ద్వారా పని పూర్తి చేసుకుంటున్నట్టు వినికిడి. వారికి స్పష్టమైన హామీలు ఇస్తూ, భవిష్యత్ లో మంచి స్థాయి కల్పిస్తామని తెలియజేస్తూ రాజేందర్ వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మండలాల్లో ఉన్న బలమైన నాయకులను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి పిలిపించుకుంటూ పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. ఈటల రాజేందర్ తో అన్యాయానికి గురైన వారిని ఒక్కటి చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నట్టు వినికిడి. ప్రతి గ్రామం నుంచి ఆ కోవకు చెందిన వారి జాబితాను తెప్పించుకుని మండల స్థాయిలో సంఘాలుగా ఏర్పాటు చేయడం, వారితో ఈటల భవితవ్యాన్ని కథలుగా ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.  అదే సమయంలో ఈటల కూడా తనకు వ్యతిరేక వర్గానికి తన మనుషులు చిక్కకుండా యాక్షన్ మొదలుపెట్టారట. తను ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే జాగ్రత్త పడ్డారని సమాచారం. గ్రామస్థాయి లీడర్లను లైన్లోకి తీసుకుని స్వయంగా మాట్లాడుతున్నారట. తానున్నానని, ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడకుండా ఉండాలని ధైర్యం చెబుతున్నారు. కట్టె కాలే వరకు తన అనుకున్న వారిని కాపాడుకుంటూ, వారికి బంగారు భవిష్యత్ ను అందిస్తాననే హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.కొందరికి ఆర్థిక సాయం కూడా రాజేందర్ చేశారని చెబుతున్నారు.  ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు తమవైపు మొగ్గుచూపకుండా చూసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ 50 కోట్ల రూపాయల ఆశ చూపించిందని మాజీ మంత్రి ఈటల ఆరోపిస్తుండగా.. అలాంటి ప్రయత్నాలకు ముందుగా దిగింది ఈటలేనని టీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా, కొందరు ప్రజా ప్రతినిధులకు మాత్రం ఈ బేరసారాలు సందట్లో సడేమియాగా పనికొస్తున్నట్టు తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తీరుగా వారు తమ ‘రేటు’ను అంతకంతకు పెంచుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వేలం పాటలో బేరం కుదుర్చుకుని ‘సెటిల్’ అవ్వాలని చూస్తున్నారట.  మరోవైపు ప్రజలు అడగక ముందే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల చొప్పున రెండు మున్సిపాలిటీల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. చిన్న, మధ్యతరహా పంచాయతీల్లో 20 లక్షలతో, మేజర్‌ పంచాయతీల్లో 30 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సమస్యలను కూడా తెలుసుకొని వారికి చేదోడువాదోడుగా ఉంటామని సంతృప్తిపరిచే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు.

కూతురితో అల్లుడి ప్రేమ డ్రామా.. అల్లుడిని చంపిన మామ..

ఈ రోజుల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడం అంటే.. ఏదో టీ  స్టాల్ కి వెళ్లి టీ తాగినంత ఈజీ అయిపొయింది. ఒక వైపు కరోనా ఎవరి ప్రమేయం లేకుండా మనుషులను త్రిమింగళం మింగినట్లు మింగుతుంది.. మరో వైపు ఇంట్లో అమ్మ నాన్నలు తిట్టారని, లవర్ వదిలి పెట్టి పోయిందని.. పెళ్ళాం మోసం చేసిందని.. అల్లుడు విసిగిస్తున్నాడని.. చంపుకునే వార్తలు నిత్యం వింటున్నాం..మనం ఇప్పుడు మీరు చదివే వార్త కూడా అలాంటిదే.. మరింకెందుకు ఆలస్యం ముందుకు వెళ్ళండి..   ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్. ఫలక్‌నుమా ఫరూక్ అనే వ్యక్తిని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఫారుక్ మరోసారి బాలికను కలిశాడు. ఇంట్లోవారికి చెప్పకుండా ఆమెను తీసుకెళ్లి పెళ్లి  చేసుకున్నాడు. దాదాపు వారి పెళ్లి అయి రెండు ఏళ్ళు అవుతుంది. కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఫలక్‌నుమా అన్సారీ రోడ్డుకు చెందిన అబ్దుల్‌ షారూక్‌ (24) మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అన్వర్‌ కుమార్తెను 2020 మే నెలలో ప్రేమ పేరుతో వేధించడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది. ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఫారుక్ అత్తగారింటికి ఫోన్‌ చేస్తూ....తన భార్యను పంపించాలంటూ షారూఖ్‌ తరచుగా ఫోన్‌ చేయసాగాడు. షారూఖ్‌కు గతంలోనే పెళ్లి జరగడంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న అన్వర్‌ అల్లుడిని హత్య చేయించాలని ప్లాన్ చేశారు. ఆదివారం ఉదయం షారూక్‌కు ఫోన్‌ చేసి శాలిబండ వరకు వెళ్దామని పిలిపించాడు. మామ అల్లుడి మట్టి కరిపించడానికి సిద్ధం అయ్యాడు.. అది మిట్ట మధ్యాహ్నం. 12.30 గంటల సమయంలో యాక్టివాను అల్లుడు నడుపుతున్నాడు..మామ అన్వర్ వెనుక కూర్చున్నాడు. ఇద్దరు వెళ్తున్నారు. ఫలక్‌నుమా డిపో ఎదురుగా రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న చాకుతో అన్వర్,  షారూఖ్‌ గొంతు కోశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జగన్ కు అమిత్ షా షాక్.. ఇక ఆట మొదలైనట్టేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లాలనుకున్నప్పటికీ... కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. జల వనరుల శాఖ మంత్రి షెకావత్‌ మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ ఒక్కరిని కలిసేందుకైనా సీఎం ఢిల్లీ వెళతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర మంత్రులు ‘బిజీ’గా ఉన్నందున ముఖ్యమంత్రి జగన్‌ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ ఆదివారం సాయంత్రం వైసీపీ వర్గాలు వెల్లడించాయి.  నిజానికి సోమవారం అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, సమయం ఇవ్వడం కుదరదని ఆదివారం సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో... కనీసం గురువారమైనా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కోరాయి. దీనిపై హోంశాఖ స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి. అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌తో సహా ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్‌ లభించేలా వైసీపీ ఎంపీలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఎంపీతోపాటు... మరికొందరు సోమవారం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిసింది. వీరు నేరుగా ఆయా కేంద్ర మంత్రుల కార్యాలయాలకు వెళ్లి... అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదాపై రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. జగన్ కు కలిసేందుకు కేంద్రం పెద్దలు ఆసక్తిగా లేరని చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఎంపీ రఘురామ రాజు అరెస్ట్.. దాని తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్రం కోపంగా ఉందని తెలుస్తోంది. బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌.. అటు ర‌ఘురామ అరెస్ట్‌, క‌స్ట‌డీలో టార్చ‌ర్ ఎపిసోడ్‌ను ఢిల్లీ స్థాయిలో న్యాయ‌, శాస‌న‌, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల దృష్టికి తీసుకెళ్ల‌డం.. ఇలా సీబీఐ, సీఐడీ కేసుల‌తో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌మాదంలో ఉన్నార‌ని అంటున్నారు.  తన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సీబీఐ, సీఐడీ కేసుల ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే.. జ‌గ‌న్, అమిత్‌షాల‌ భేటీ ప‌ర‌మార్థం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ఘురామ ఘ‌ట‌నలో అస‌లేం జ‌రిగిందనే విష‌యంపై ఇప్ప‌టికే కేంద్ర‌హోంశాఖ వివ‌రాలు సేక‌రించిందని స‌మాచారం. రఘురాం విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరుపై కేంద్రం చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు డ్యామేజీ జరుగుతుందనే ఆలోచనలో కేంద్ర మంత్రులు ..జగన్ ను దూరం పెట్టారని అంటున్నారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ అంశంలో పలువురు సీఎంలకు జగన్ లేఖ రాశారు. దీనిపై కేంద్రం గుర్రుగా ఉందంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లానుకోవడం.. అంతలోనే వాయిదా పడడం.. చర్చనీయాంశమయింది. మరోవైపు జగన్‌ బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా.. ఆ కేసులో వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ తన వైఖరి స్పష్టం చేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.ఈ ఘటనతో జగన్ ను కేంద్ర సర్కార్ టార్గెట్ చేస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఏపీపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. తమిళనాడు తరహా రాజకీయానికి ప్లాన్ చేసిందంటున్నారు. జగన్ బెయిల్ రద్దై జైలుకు వెళితే.. ఏపీలో చక్రం తిప్పేలా అమిత్ షా టీమ్ పక్కాగా స్కెచ్ వేసిందంటున్నారు. జగన్ పై కేంద్రం తాజా వైఖరి చూస్తూంటే... ఆయనపై ఆట మొదలు పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.  

థర్డ్ వేవ్ తో పిల్లలకు ప్రమాదమా! వైద్య నిపుణులు ఏమంటున్నారు..  

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. ఫస్ట్ వేవ్ తో పోల్చితే అత్యంత వేగంగా వైరస్ విస్తరించింది. వైరస్ ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది. మొదటి వేవ్ తో పోల్చితే.. చాలా రెట్లు ఎక్కువ మంది హాస్పిటల్ పాలయ్యారు. ఫస్ట్ వేవ్ లో వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ కాగా.. సెకండ్ వేవ్ లో యువతపై ఎక్కువప్రభావం చూపింది మహమ్మారి. దేశంలో ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. జూన్ చివరికి కట్టడిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే మరో రెండు నెలల్లోనే థర్డ్ వేవ్ మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. వైద్య నిపుణులు కూడా అదే చెబుతున్నారు.  కొవిడ్ థర్డ్ వేవ్ లో వైరస్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు భయాందోళన కల్గిస్తోంది. థర్డ్ వేవ్ పై వస్తున్న వార్తలతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందనడానికి ఆధారాలు లేవంటున్నారు కొందరు వైద్యులు. పిల్లలపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం లేదంటున్నారు. ఇందుకు కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు పిల్లల డాక్టర్లు.  వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో ఇప్పటి వరకు వచ్చిన వేవ్స్ ని పరిశీలిస్తే పిల్లల పై కోవిడ్ ప్రభావం స్వల్పంగా మాత్రమే ఉందని తెలుస్తుంది. దీనికి శాస్త్రీయ మరియు epidemilogical సాక్షాలు చాలా ఉన్నాయి. భారతదేశ జనాభాలో 18 సంవత్సరాల లోపు వయసు వారి జనాభా శాతం 40%. మొదటి రెండు వేవ్స్ లో ఈ వయసు వారు ఆసుపత్రిలో చికిత్సపొందిన వారి శాతం కేవలం 5%. అంటే, వీరి పై వైరస్ ప్రభావం ఎంత స్వల్పంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కరోనా ప్రభావము 20 రెట్లు తక్కువ. రానున్న వేవ్స్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేందుకు ఎటువంటి సాక్షాలు లేవు. వైరస్ లో మ్యుటేషన్ వచ్చినా ప్రత్యేకంగా పిల్లలను టార్గెట్ చేసే అవకాశం లేదు. ప్రముఖ శాస్త్రవేత్తలు, చిన్నపిల్లల వైద్యనిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. రెండవ వేవ్ లో పిల్లల పై కోవిడ్ ప్రభావం పెరిగిందని, రాబోయే వేవ్ లో ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. కానీ, మొదటి వేవ్ తో పోలిస్తే రెండవ వేవ్ లో సాధారణ కేసుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. అదే నిష్పత్తిలో పిల్లలలో కేసుల సంఖ్య పెరిగింది తప్పించి అదనంగా పెరగలేదు.  మొదటి వేవ్ లో కోవిడ్ బారిన పడ్డ వారు 18 సంవత్సరాల లోపు వారు 11.4%,  రెండవ వేవ్ లో 11.8%. పెద్ద వ్యత్యాసం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.... దేశ జనాభాలో 40% ఉన్న పిల్లలలో 12% కేసులు నమోదయితే, మిగిలిన 60% జనాభా (పెద్దలు) లో 88% కేసులు నమోదయ్యాయి. అంటే వైరస్ ప్రభావం ఎవరిపై ఎక్కువుందో తెలుస్తుంది కదా.  ఒక వేళ పిల్లలకు వైరస్ సోకినా వారిలో ACE 2 RECEPTORS లేకపోవడం, CYTOKINE STORM అవకాశాలు తక్కువ ఉండటం, T CELL DIFFERENTIATION ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాధులు ఉన్న పిల్లలలో మాత్రమే కోవిడ్ ప్రభావం ఎక్కువ, అందరు పిల్లలలో కాదు. అదే విధంగా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న MIS-C కూడా కొత్త జబ్బేమి కాదు, కోవిడ్ సోకిన పిల్లలందరికీ వచ్చేదీ కాదు. కేవలం కొందరిలో అరుదుగా వస్తుంది, చికిత్సలు అందుబాటులో ఉన్నవి. అందువల్ల ఆందోళన వద్దు, అవగాహన మాత్రం అవసరం. పిల్లల కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు.. 1. పిల్లలకు కొవిడ్ లక్షణాలు, నివారణ పై అవగాహన కల్పించండి 2. పోషకాహారం అందించండి 3. ఉదయం, సాయంత్రం ఎండలో ఆడించండి(కోవిడ్ ప్రొటోకాల్ తో) 4. బడులు తెరిచినపుడు, బడులకు పంపండి 5. తల్లితండ్రులు జాగ్రత్తగా ఉంటే పిల్లలు అవే పాటిస్తారు

తెలంగాణను ఫాలో అయితే బెటర్.. వ్యాక్సినేషన్ పై కేంద్రానికి కేటీఆర్..

తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల్లోనూ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు మంత్రి కేటీఆర్.  రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు పది లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్లు వేసే పరిపాలనా పరమైన వ్యవస్థ అందుబాటులో ఉన్నదని అయితే దురదృష్టవశాత్తు ఆ మేరకు అవసరమైన వ్యాక్సిన్ సరఫరా లేదన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు పైన సూచనలు పైన స్పందించారు.   రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చు కునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందన రాలేదన్నారు కేటీఆర్. అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీదారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కన్నా కేవలం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు, కేంద్రానికే వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  వాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూపుల వారీగా నిర్ణయం తీసుకోవడం కొంత అయోమయానికి దారితీస్తుందన్నారు కేటీఆర్.  దీనికి బదులు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధంగా సూపర్ స్పైడర్ లను గుర్తించి వారికి వాక్సినేషన్ వేయడం ద్వారా మరిన్ని సత్ఫలితాలు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు 30 లక్షల మందిని గుర్తించిందని, వారికి సంబంధించిన వాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.  భారతదేశ జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలంటే 272 కోట్ల  వాక్సిన్ అవసరం అవుతాయని దీనికి సంబంధించి 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ మేరకు కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 35 వేల కోట్ల రూపాయలను ఉపయోగించాలని, కానీ  ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వక్సిన్లు 85 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని మిగిలిన 15 శాతం లో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు కూడా ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా లేవన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు మే 1 తర్వాతనే ఆర్డర్లను కంపెనీలకు అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. మూడవ కరోనా నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరాకు సంబంధించిన ఒక ప్రణాళిక ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. భారత దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సిరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ నెలకి పది కోట్లకు మించి ఉత్పత్తి చేయలేవని, అయితే త్వరలోనే దేశ జనాభాలో 80శాతం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ప్రజలకు ఏ విధంగా రెండు డోసులు అందుతాయో కేంద్ర ప్రభుత్వం తెలపాలన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత  లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం అమెరికా కెనడా డెన్మార్క్ నార్వే వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించి ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించి వాటిని భారతదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలో వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవన్న విషయానికి సంబంధించి మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాలు గత సంవత్సరమే మేల్కొని పెద్దఎత్తున ఆయా కంపెనీలకు వ్యాక్సిన్లు సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చాయని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో మేల్కొన్న దన్నారు. దీంతో పాటు ఇతర దేశాలు తమ ప్రజలకి పెద్దఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే భారత సర్కారు మాత్రం వ్యాక్సిన్ మైత్రి మరియు విదేశాలకు వాక్సిన్ ఎగుమతుల ప్రమోషన్ లకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఉందన్నారు. అమెరికా కెనడా వంటి దేశాలు తమ దేశ జనాభాకు అవసరమైన వాటి కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ప్రోకూర్  చేసుకున్నాయని, ముఖ్యంగా కెనడా లాంటి దేశం ఒక వ్యక్తికి తొమ్మిది డోసుల చొప్పున వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.  వ్యాక్సిన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్న అంధ భక్తులకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు చురకలంటించారు. అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభా కి వ్యాక్సిన్ అందిస్తే భారతదేశ వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10  శాతం కూడా దాటలేదన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, యుకె ,జర్మనీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలన్నీ తమ పౌరులకు వాక్సిన్ ఉచితంగా అందిస్తే భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు అతి తక్కువ గా ఉందన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లల పైన అత్యధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా వ్యాక్సిన్ కి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమైనట్టు, దీంతో విదేశాల్లోనూ పలు ఇతర కంపెనీలు కూడా పిల్లలపైన వాక్సిన్ ట్రయల్స్ ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.  

రేవంత్‌రెడ్డికి ట్విస్ట్‌.. తెర‌పైకి క‌ర్ణాట‌క ఫార్ములా.. పీసీసీ పీఠం ఇంకెంత దూరం?

రేపేమాపో టీపీసీసీ అధ్య‌క్షుని నియామ‌కం. వారం రోజులుగా ఇదే బ్రేకింగ్ న్యూస్‌. అంతఈజీగా మేట‌ర్ సెటిల్ అయితే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? రేసులో ఉన్న‌వారంతా గాంధీభ‌వ‌న్ వేదిక‌గా ర‌చ్చ చేస్తున్నారు. హైక‌మాండ్ చుట్టూ చ‌క్క‌ర్లు  కొడుతున్నారు. రేవంత్‌రెడ్డి నుంచి వీహెచ్ వ‌ర‌కూ.. ప‌దుల సంఖ్య‌లో ఆశావ‌హులు ఉన్నారు. ఒక‌రికొక‌రు చెక్ పెట్టుకుంటూ.. 10 జ‌న్‌ప‌థ్‌కు లేఖ‌లు రాస్తూ.. రాజ‌కీయాన్ని రంజుగా మార్చుతున్నారు. టీపీసీసీ ఎంపిక త‌ల‌నొప్పిని భ‌రించ‌లేక అధిష్టానం అనూహ్యంగా ఓ కీల‌క నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. క‌ర్నాట‌క ఫార్ములా. అవును, క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుని ఎంపిక‌లో స‌క్సెస్‌ఫుల్‌గా అమ‌లు చేసిన ఆ వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణ‌లోనూ అనుస‌రించాల‌ని పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ నిర్ణ‌యించార‌ట‌. గ‌తంలో క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం హేమాహేమీలాంటి నేత‌లు పోటీ ప‌డ్డారు. సిద్దరామయ్య, పరమేశ్వర్ , మల్లిఖార్జున ఖర్గే , వీరప్పమొయిలీ, బీవీ పాటిల్, డీకే శివ‌కుమార్‌, జైరామ్ రమేష్.. ఇలా అంతా సీనియ‌ర్లే. అంద‌రూ స‌మ‌ర్థులే. ఎవ‌రిని సెలెక్ట్ చేయాలో.. ఎవ‌రిని ఎంపిక చేస్తే.. ఇంకెవ‌రు అల‌క వ‌హిస్తారో అనే క‌న్ఫ్యూజ‌న్ ఉండేది. సీనియ‌ర్లు అంతా మూకుమ్మ‌డిగా డీకే శివకుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే, కిందిస్థాయి కేడ‌ర్‌తో పాటు మెజారిటీ డీసీసీలు.. డీకే శివకుమార్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. అధిష్టానం అభిప్రాయ సేకరణ కోసం ఓ సీనియర్ నేతను క‌ర్ణాట‌క పంపించింది. ఆయన క్షేత్ర‌స్థాయిలో పూర్తి వివరాలు సేకరించి హైక‌మాండ్‌కు రిపోర్ట్ ఇచ్చిన త‌ర్వాత‌.. డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్య‌క్షునిగా ప్ర‌క‌టించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదీ క‌ర్ణాట‌క ఫార్ములా. దీన్ని.. యధాత‌దంగా తెలంగాణ‌లోనూ అమ‌లు చేసి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయాల‌ని సోనియాగాంధీ ఆదేశించిన‌ట్టు స‌మాచారం.  తెలంగాణలోనూ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క త‌ర‌హా ప‌రిస్థితే ఉంది. డీకే శివ‌కుమార్‌తో.. రేవంత్‌రెడ్డిని పోల్చుతున్నారు. సీనియ‌ర్లు అంతా రేవంత్‌రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. మిగ‌తా పార్టీ కేడ‌ర్ అంతా రేవంత్‌రెడ్డే కావాలంటోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాకుండా.. సీనియ‌ర్లు ఎవ‌రి స్థాయిలో వాళ్లు అడ్డుపుల్ల‌లు వేస్తున్నారు. దీంతో.. క్షేత్ర స్థాయి అభిప్రాయ సేక‌ర‌ణ‌కు పార్టీ పరిశీలకుడిగా సీనియర్ నేత కమల్‌నాథన్‌ను నియమించినట్టు తెలుస్తోంది. ఆయ‌న తెలంగాణ‌లో ప‌ర్య‌టించి.. రెండుమూడు రోజుల్లో అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. క‌ర్ణాట‌క ఫార్ములా ప్ర‌కారం హైక‌మాండ్ ప‌రిశీల‌కుడు నివేదిక ఇస్తే.. అందులో మెజార్టీ మ‌ద్ద‌తు రేవంత్‌రెడ్డికే ఉంటుంద‌ని తెలుస్తుంది. డీసీసీ అధ్య‌క్షులు అధిక మంది రేవంత్‌రెడ్డికే జై కొడుతున్నారు. కేడ‌ర్ సైతం రేవంత‌న్నే కావాలంటున్నారు. ఆ లెక్క‌న‌.. క‌ర్ణాట‌క ఫార్ములా అమ‌లు చేస్తే.. కాబోయే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డే అంటున్నారు. అదే జ‌రిగితే.. సీనియ‌ర్ల స‌హ‌కారం ఏ మేర‌కు ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే.. ఇక చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌.. కేసీఆర్‌పై మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయం అంటున్నారు. అప్పుడు ఉంటుంది తెలంగాణ‌లో అస‌లైన రాజ‌కీయం.   

చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ

దేశవ్యాప్తంగా చర్చగా మారిన, లక్షలాది మంది జనాలు కావాలని కోరుకుంటున్న కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ చిత్తూరు జిల్లాలోనూ చంద్రగిరిలోనూ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో  చంద్రగిరి నియోజక వర్గ ప్రజల కోసం మందు తయారు చేస్తున్నారు.ప్రభుత్వ అనుమతులు వచ్చిన నాటి నుంచి సహజ సిద్ధ  వనమూలికల సేకరణ ప్రక్రియను చేపట్టారు. సాంప్రదాయ మందు తయారీలో ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్య బృందం చంద్రకుమార్, సురేష్, వంశీ కృష్ణ సహకరిస్తున్నారు. మందు తయారీలో కూడా కట్టెల పొయ్యి, రాగి బాండలి వంటి సాంప్రదాయ పద్దతుల్లో చేపట్టారు.  సహజసిద్ధమైన 16 వనమూలికలతో ఆనందయ్య మందు తయారీ కి శ్రీకారం చుట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, నేరేడు, మామిడి, నేల ఉసిరి, పిప్పింట, బుడ్డ బుడవ ఆకులు, కొండ పల్లేరు కాయలు, తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చారు. ఆదివారం ఆనందయ్య మందు తయారీ విధానాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్(పి) ను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజక వర్గంలో 1.60 లక్షల కుటుంబాలకు 5.20 లక్షల మంది ప్రజలకు ఉచితంగా అనందయ్య మందును అందించనున్నట్లు స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నియోజకవర్గ పరిధిలో 142 గ్రామ పంచాయతీలు, దాదాపు 1600 గ్రామాలలో ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి వెల్లడించారు. కరోనా కట్టడికి ఉపయుక్తమైన సాంప్రదాయ మందు తయారీ లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ అభినందన నీయమని ఆనందయ్య తనయుడు శ్రీధర్ అన్నారు. వనమూలికల సేకరణ యజ్ఞంలా చేపట్టారన్నారు. చెవిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శనీయమన్నారు ఆనందయ్య తనయుడు శ్రీధర్.  

తెలంగాణలో రెండో సీఎం! ఎవరో తెలుసా... 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత రోజుకో కీలక అంశం బయటికి వస్తోంది. తాజాగా తెలంగాణలో రెండో సీఎం విషయం వెలుగులోనికి వచ్చింది. టీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్ నేత రెండో  సీఎం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరూ లేరు. తొలి ప్రభుత్వంలో ఇద్దరు డిప్యుటీ సీఎంలుగా ఉన్నా.. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఆ సంప్రదాయానికి తెరదించారు గులాబీ బాస్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్న కేటీఆర్.. ప్రగతి భవన్ లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. సీఎం కేసీఆర్ చూడాల్సిన కొన్ని కార్యక్రమాలను కూడా కేటీఆర్ చూడటం... విదేశీ ప్రతినిధులు ఆయననే కలుస్తుండటంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతుంది. అయితే షాడో సీఎం అనే వ్యాఖ్యలు ఎప్పటినుంచో ఉండగా.. తాజాగా తెరపైకి వచ్చిన రెండో సీఎం అంశంమే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.  ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్‌ పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేసింది. తమ  పట్టు కోల్పోకుండా.. నేతలు, కార్యకర్తలు చేజారకుండా జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ , మాజీ మంత్రి బసవరాజు సారయ్య సమావేశమయ్యారు. అందరూ టీఆర్ఎస్ వెంటనే ఉండాలని ప్రమాణం చేయించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిలా కేసీఆర్ చూసుకున్నారని అన్నారు. తండ్రిలాంటి వాడిని ధిక్కరించి.. కష్టపడి గెలిపించిన తమల్ని కాదని.. ఈటల వెళ్లిపోయాడని విమర్శించారు. ఈటలను ఎవరూ బయటకు పంపలేదని.. తనకు తానుగానే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీయని.. అలాంటి పార్టీలోకి ఈటల వెళ్లడం దారుణమని మండిపడ్డారు సారయ్య. ఈటల రాజేందర్ రెండో సీఎం అంటూ బస్వరాజు సారయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ పేరును 'బానిసల నిలయం'గా మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే.. తాను బతకలేనని ఈటల స్పష్టం చేశారు. తాను బానిసలా ఉండలేకే బయటికి వచ్చానని ఈటల ఆరోపిస్తుండగా.. కేసీఆర్ రెండో సీఎంగా ఈటలను చూశారని సారయ్య చెప్పడం ఆసక్తి రేపుతోంది. 

ఎన్టీఆర్ జెండా.. రాజ‌కీయ అజెండా...

రాను రాను అంటున్నా కూడా అభిమానులు రారమ్మ‌ని పిలుస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల్సిందే అంటూ ప‌ట్టుబ‌డుతున్నారు. ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం.. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ కుప్పం ప్ర‌జ‌లే గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతుండ‌టం ఆస‌క్తిక‌రం. గ‌తంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రాజ‌కీయాల్లోకి తీసుకురావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం అభిమానులు. చంద్ర‌బాబుపైనా ఒత్తిడి చేశారు. ఆ స‌మ‌యానికి చంద్ర‌బాబు స‌ర్ది చెప్పారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న తెలుగు త‌మ్ముళ్లు.. మ‌ళ్లీ జూనియ‌ర్ నినాదాన్ని ఎత్తుకున్నారు. తాజాగా, అదే కుప్పం ఫ్యాన్స్ మ‌రోసారి జూనియ‌ర్ పొలిటిక్ ఎంట్రీపై వినూత్నంగా డిమాండ్  చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఓ జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెల్ల‌టి జెండాపై.. మీసం మెలేస్తున్న‌ ఎన్టీఆర్ ఫోటో చిత్రీక‌రించి.. నుదుట‌ ఎర్ర‌టి తిల‌కం దిద్ది.. జెండాగా ఎగ‌రేశారు అభిమానులు. ఇప్ప‌టికే ఆల‌స్యం అయింద‌ని.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ త్వ‌ర‌గా రాజ‌కీయాల్లోకి రావాలంటూ.. ఇలా జెండా ఆవిష్క‌ర‌ణ‌తో డిమాండ్ చేశారు కుప్పంలోని జూనియ‌ర్ అభిమానులు. ఈ ఘ‌ట‌న టీడీపీలో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  జూనియ‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు ఎన్టీఆర్‌. తాత‌లా ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైత‌న్య‌ర‌థంపై ప‌ర్య‌టిస్తూ.. అద్భుత‌మైన వాగ్దాటితో ప్ర‌సంగిస్తూ.. తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉత్తేజ పరిచారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి పాల‌వ‌డంతో అప్ప‌టి నుంచి మ‌ళ్లీ రాజ‌కీయాల జోలికి రాలేదు జూనియ‌ర్‌. పార్టీతో ఆయ‌న‌కు దూరం బాగా పెరిగింది. జ‌గ‌న్ సీఎం అయ్యాక.. టీడీపీ ప్ర‌భ త‌గ్గాక‌.. మ‌ళ్లీ ఎన్టీఆర్ పేరు అభిమానుల నోటి నుంచి వినిపిస్తోంది. అయితే, ఇటీవ‌ల ఓ సినిమా ఫంక్ష‌న్‌లో అభిమానులు.. జూనియ‌ర్‌ను ఉద్దేశించి సీఎం సీఎం అని నిన‌దించ‌డంతో.. ఆగండి బ్ర‌ద‌ర్‌.. అంటూ ఫ్యాన్స్‌ను కాస్త గ‌ట్టిగానే మంద‌లించారు ఎన్టీఆర్‌. మ‌రో ఈవెంట్‌లోనూ.. ఇది స‌మ‌యం, సంద‌ర్భం కాదంటూ విష‌యాన్ని దాట వేశారు. సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త‌న‌కు ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశ్యం లేద‌న్న‌ట్టే ఉంది జూనియ‌ర్ వ్య‌వ‌హార శైలి. అయితే, ఫ్యాన్స్ వింటేగా. రావాలి ఎన్టీఆర్‌.. కావాలి ఎన్టీఆర్ అంటూ కుప్పం అభిమానులు ఒక‌టే గోల గోల చేస్తున్నారు. తాజాగా, జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండాతో మ‌రోసారి టీడీపీలో అల‌జ‌డి తీసుకొచ్చారు. 

బికినీపై క‌ర్నాట‌క‌ జెండా.. అమెజాన్‌పై గుస్సా..

భార‌తీయుల‌న్నా.. మ‌న భాషా, మ‌న‌ సంస్కృతి, మ‌న‌ సంప్ర‌దాయాల‌న్నా.. పాశ్చాత్యులకు ఎప్పుడూ చిన్న‌చూపే. ఇటీవ‌ల క‌న్న‌డ‌ను వికార‌మైన భాష‌గా పేర్కొని.. ఆ త‌ర్వ‌త క్ష‌మాప‌ణ‌లు చెప్పింది గూగుల్‌. ఆ వ్య‌వ‌హారం మ‌ర‌వ‌క‌ముందే.. తాజాగా అమెజాన్ సంస్థ క‌ర్నాట‌క‌ను కించ ప‌రిచే విధంగా ఉన్న వ‌స్తువుల‌ను అమ్మ‌కానికి పెట్ట‌డం వివాదాస్ప‌ద‌మైంది. అది క‌న్న‌డిగుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.  క‌ర్ణాట‌క రాష్ట్రానికి ప్ర‌త్యేక‌మైన చిహ్నం, జెండా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, క‌ర్నాట‌క స్టేట్ గుర్తు, జెండా రంగుల‌తో కూడిన టూ పీస్‌ బికినీని అమెజాన్‌లో అమ్మ‌కానికి పెట్టారు. అమెజాన్‌కు చెందిన కెనడా వెబ్‌సైట్‌లో ఈ తరహా బికినీలు వెలుగుచూడడం వివాదానికి కారణం.  బికినీ వ్యవహారంపై కర్ణాటక మంత్రి అరవింద్‌ లింబావాలీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో అమెజాన్‌ కెనడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మల్టీ నేషనల్‌ కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం అమెజాన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కన్నడిగుల ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉన్న అమెజాన్‌ తీరుపై నెటిజన్లు తీవ్ర‌ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.  విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో.. వివాదంపై అమెజాన్ స్పందించ‌క‌పోయినా.. క‌ర్ణాట‌క రాష్ట్ర జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీ అమ్మ‌కాల‌ను త సైట్‌ నుంచి తొలగించింది.    

కొవిడ్ బాధితులకు ఊపిరి.. ఆదర్శంగా యువపారిశ్రామిక వేత్తలు 

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. సెకండ్ వేవ్ తో భారత్ కూడా అతలాకుతలమైంది. కొవిడ్ రోగులకు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకలేదు. బెడ్లు దొరికినా ఆక్సిజన్ అందని పరిస్థితి. రోగులు శ్వాస తీసుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బారిన పడిన 45 శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. ఇలాంటి తరుణంలో ఆపద్భాంధవిగా నిలుస్తోంది ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’.వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’ ఈ బృహత్కార్యాన్ని తలపెట్టింది. ఏపీలోని యువ పారిశ్రామిక వేత్తల మదిలో పుట్టిన ఆలోచనే  ‘ఇవో ఏపీ ఫర్ ఊపిరి’. ఆక్సిజన్ కొరతతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూసి చలించిపోయి ఏదో ఒకటి చేసి ఆ జీవితాలకు అండగా నిలవాలని ఆ సంస్థ సభ్యులు ఆలోచించారు. ఏపీలోని ఆ సంస్థ సభ్యులంతా చర్చించుకుని ఓ కొత్త ఆలోచనకు పునాది వేశారు. అలా ఏర్పడిందే ఈ సంస్థ. వైజాగ్ లోని గీతం హాస్పిటల్ కి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చి చేరాయంటే అది ఈ సంస్థ చలవే. ఇలాంటి కేంద్రాలు ఏపీలో మరో ఐదింటిని ఈ సంస్థే ఏర్పాటుచేసింది.   మొదటి దశలో అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లో ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  ఈ కేంద్రాలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్, బీపీ యంత్రాలు, మెడిసిన్స్ వంటిలాంటి ప్రాథమిక వైద్య అవసరాలతో కూడిన పడకలు ఏర్పాటుచేశారు. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, శ్రీకాకుళంలో రిమ్స్ గవర్నమెంట్ హాస్పటల్, టెక్కలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఆక్సిజన్ బ్యాంకు, ఆక్సిజన్ సెంటర్ కూడా ఏర్పాటుచేశారు. విజయవాడలో ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేశారు. విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజీలో ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రానికి 50 చొప్పున ఆక్సిజన్ కాన్ సెన్ ట్రేటర్ల,ను, ఆక్సిజన్ సిలెండర్లను ఇప్పటిదాకా సరఫరా చేశారు. ఏలూరులో జాయింట్ కలెక్టర్ల హిమాంశు శుక్లాకు 45 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందజేశారు. ప్రతి కేంద్రంలోనూ హెల్త్ కేర్ టీమ్స్,భద్రతా సిబ్బంది ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కేంద్రాల్లో ఆహారం, నీరు, వాష్‌ రూమ్‌ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉంటాయి.ఈ ఆరు కేంద్రాల నుంచి సమీప ప్రాంతాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లను పంపించే ఏర్పాటుచేశారు. అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ కొరతతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించే ఏర్పాటుచేశారు. ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లో ఎంటర్ ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ (ఇవో) ఉంది. దాదాపు 15000 పైచిలుకు సభ్యులు ఇందులో ఉన్నారు. తమ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఒకరి అనుభవాలను మరొకరు పంచుకోవడం, పరస్పర సహకారం అందించుకుంటూ ఏర్పడిన సంస్థ ఇది. 1987 నుంచి సేవలందిస్తున్న ఈ సంస్థలో 2018 నుంచి ఏపీ నుంచి 26 మంది యువ పారిశ్రామిక వేత్తలు ఇందులో భాగమయ్యారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్న వార్తలు గత ఏప్రిల్ లో ఈ సంస్థ సభ్యుల దృష్టికి వచ్చాయి.  కొవిడ్ రోగులను ఏదో ఒక విధంగా ఆదుకోవాలని సంకల్పించారు. తమ వంతుగా తలా కొంత మొత్తాన్ని విరాళంగా సేకరించి నిధులు సమకూర్చుకుని కొవిడ్ బాధితుల సేవకు నడుంబిగించారు. రామ్మోహన్ నాయుడు కింజరపు, దివ్య నల్లమోతు, స్మిత వల్లూరుపల్లి, విధాన్ మిట్టల్, రవి మూల్పూరి, రాజీవ్ సెన్నార్, రాజీవ్ బొల్లా, శ్రీహర్ష వడ్లమూడి తదితరులు విరాళాలు ఇచ్చి దాదాపు మూడు కోట్ల రూపాయలను సమీకరించారు. ఈ నిధులతోనే ఈ ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి ఏమేం సౌకర్యాలు అవసరమో వాటిని ఏర్పాటుచేశారు. ఈ మెడికల్ ఆక్సిజన్ సమీకరణకు మూడున్నర కోట్ల రూపాయలు అవసరమవుతుందని భావించి ఆ దిశగా అడుగులు వేశారు. ఈ యువ పారిశ్రామిక వేత్తలు చేస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ తరహాలో సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. కోవిడ్ బాధితులకు ఎవరైనా సహాయ సహకారాలు అందించదలుచుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయవచ్చు. నిధుల సమీకరణకు మీ వంతు సహకారాన్ని కూడా అందించవ్చు. https://fundraisers.giveindia.org/…/help-andhra-and ని చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి.

ఆనందయ్య మందుపై మరో ట్విస్ట్! సోమిరెడ్డిపై చీటింగ్ కేసు.. 

కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారం నుంచి మందును అందిస్తారని ప్రకటించగా.. అక్కడి పరిస్థితులను చూస్తే మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వ సహకారం లేనిదే మందు పంపిణి కష్టమని ఆనందయ్య అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు  కృష్ణపట్నం సమీప గ్రామాల నుంచే ఆదివారం జనాలు భారీగా వచ్చారు. మందు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆనందయ్య సోదరుడు కొందరికి మందు పంపిణి చేశారు. ఆ విషయం తెలిసిన పోలీసులు... అక్కడికి చేరుకుని మందు పంపిణిని నిలిపివేశారు.  ఆనందయ్య  మందుపై నెలకొన్న రాజకీయ వివాదం మరో మలుపు తిరిగింది.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో  చీటింగ్ కేసు నమోదయ్యింది. తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని, మోసపూరిత కుట్ర చేస్తున్నారని శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 468, 379, 506 సెక్షన్లు కింద సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తిగా డెవలప్ చేయని తమ సైట్‌ని సోమిరెడ్డి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని శ్రేశిత టెక్నాలజీస్ ఎండీ నర్మద్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు వల్ల తమ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని.. దీనిపై సోమిరెడ్డి పట్ల చర్యలు తీసుకోవాలని నర్మదా రెడ్డి డిమాండ్ చేశారు Childeal.com వెబ్‌సైట్‌కు సంబంధించి టీడీపీ నేత సోమిరెడ్డి శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందును రూ.167కు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కోటి మందికి మందు అమ్ముకుని 167 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. శ్రేషిత టెక్నాలజీ ద్వారా వెబ్‌సైట్‌ను రూపొందించారని.. ఈ కంపెనీలో వైసీపీ నేతలే డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. వెబ్‌సైట్‌లో మందు వివరాలు, ధరను పేర్కొన్నారని.. కానీ మళ్లీ డిలీట్ చేశారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరిట ఫేక్ వెబ్‌సైట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

ధూళిపాళ్ల‌పై మ‌రో కేసు.. ఈసారి కేసు ఏంటో తెలుసా..?

వ‌ద‌ల బొమ్మాళీ అన్న‌ట్టు.. ధూళిపాళ్లను పోలీసులు వెంటాడుతున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ కేసులు పెట్టి.. నరేంద్ర‌ను జైల్లో పెట్టిన ఖాకీలు.. తాజాగా ఆయ‌న‌పై మ‌రో కేసు న‌మోదు చేశారు. సంగం డెయిరీ వ్యవహారంలో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పైన విజ‌య‌వాడ‌లో కేసు న‌మోదైంది. ఆయ‌న‌తో పాటు సంగం డెయిరీ పాల‌క‌వ‌ర్గ స‌భ్యుల‌పైనా కేసు పెట్టారు పోలీసులు.   కరోనా ఆంక్షలు ఉల్లంఘించి మే 29న ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై పటమట పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా సమావేశం జరిపారనేది ఫిర్యాదు. సంగం డెయిరీ మీటింగ్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధూళిపాళ్లతో పాటు మిగ‌తా పాల‌క స‌భ్యుల‌పై ఐపీసీ 269, 270, రెడ్ విత్ 34, 188 సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు. సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శిని పిలిపించి విచారణ జరిపారు పోలీసులు. అయితే, తమపై కేసు నమోదు చేయడాన్ని సంగం డెయిరీ పాలకవర్గం ఖండించింది. తాము కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే సమావేశం నిర్వహించామని స్పష్టం చేసింది. కావాల‌నే పోలీసులు ఇలా కేసు పెట్టార‌ని ఆరోపిస్తున్నారు సంగం డెయిరీ స‌భ్యులు.

పంజాబ్’లో  వాక్సిన్ కుంభకోణం 

ఓ వంక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కొవిడ్ 19 వాక్సిన్, దేశ ప్రజలు అందరికీ ఉచితంగా ఇవ్వాలని  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ప్రధాని మోడీ ప్రభుత్వం వాక్సిన్ పాలసీ, చెత్తగా, చండాలంగా ఉందని, ఊరూరా తిరిగి విమర్శిస్తున్నారు. దేశంలో కారోనా  సెకండ్ వేవ్’కు మోడీ చేతకాని తనమే కారణమని, చాలా తీవ్రమైన పదజాలంతో ప్రధాని మోడీని దూషిస్తున్నారు. మరో వంక కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రభుత్వం,కేంద్రం ఉచితంగా ఇచ్చిన వాక్సిన్’ను ప్రైవేటు, ఆసుపత్రులకు అమ్ముకుంటోందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా, ఇది చాలా దుర్మార్గపు చర్య. ప్రజలు ప్రాణాలతో వ్యాపారం చేసే నికృష్టపు చర్య.  ఇంతవరకు కరోనా సెకండ్ వేవ్ విషయంలో, అదే విధంగా వాక్సిన్ పాలసీ విషయంలో విపక్ష్లాల విమర్శలకు సమాధానం చెప్పుకోలేక, సతమతముతున్న మోడీ ప్రభుత్వానానికి  పంజాబ్ ప్రభుత్వం ఎదురు దాడికి అస్త్రాన్ని అందించింది. ప్రైవేటు ఆసుపత్రులకు వాక్సిన్ విక్రయానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో, బీజేపీకి అస్త్రంలా చిక్కింది. బీజేపీ కేంద్ర మంత్రి హర్దీప్ పూరీని రంగంలోకి దించింది. పూరీ, శనివారం  పంజాబ్ ప్రభుత్వం పై ఎటాక్ స్టార్ట్ చేశారు. వాక్సిన్ అక్రమ విక్రయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, విచారణ జరిపితే, భయంకరమైన నిజాలు బయటకు వస్తాయని, ‘ముఖ్య’ నేతల గుట్టు రట్టవుతుందని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వాక్సిన్ అక్రమ  అమ్మకాల విషయంలో, వేరే విచారణ అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న జీవో ఉత్తర్వులే అందుకు సాక్ష్యంగా నిలుస్తాయని, కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ప్రభుత్వం రూ.38 కోట్ల అవినీతికి పాల్పడిందని హర్దీప్ పూరీ వరస అస్త్రాలను సంధించారు. అలాగే,  మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్’లో పెద్ద మొత్తంలో  వాక్సిన్’ డంప్’లలో దాచిన విషయాన్నిప్రస్తావిస్తూ, బంతిని, కాంగ్రెస్ కోర్టులోకి నెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్  గాంధీ పంజాబ్ వాక్సిన్ కుంభకోణానికి సమాధానం  చెప్పాలని, బీజేపీ  డిమాండ్  చేస్తోంది.ఇప్పుడు ఈ వ్యవహారం, రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంసంగా మారింది.  ఇక ఈ కుంభకోణం వివరాలలోకి వెళితే, పంజాబ్  ప్రభుత్వం కొవిషీల్డ్ వాక్సిన్’ డోస్ రూ. 412కు కొని, వాటిని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1000కి విక్రయించింది. ఆ ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కొక్క డోసుకు రూ .1500 నుంచి రూ.1560కి ప్రజలకు అమ్ముకున్నాయి. అయితే, విమర్శలు రావడంతో ప్రభుత్వం, ఇందుకు సంబందించి జారీ  చేసిన జీవోను ఉపసంహరించుకుంది. జీవోను అయితే ఉపస్మ్హరించుకుంది కానీ, విమర్శల నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం  కావడం లేదు. ఓ వంక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో వంక పార్టీలో ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూల మధ్య యుద్ధం సాగుతోంది. ఆ ఇద్దరు అగ్ర నేతల మధ్య వివాదం పరిష్కారానికి, కేంద్ర పార్టీ ఏకంగా ఒక కమిటీనే వేసి విచారణ జరుపుతోంది. ఇలాంటి పరిస్థిటిలో వెలుగు చూసిన వాక్సిన్ కుంభకోణం,కాంగ్రెస్ కథను ఏ మలుపు తిప్పుతుందో.. ఎక్కడికి తీసుకుపోతుందో ..

ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌? కేసీఆర్ సారూ.. మీకు చేతకాకనా?

మామూలుగా లేవుగా విమర్శ‌లు. అచ్చ తెలంగాణ భాష‌లో, యాస‌లో కేసీఆర్‌ను కుమ్మేస్తున్నారు. ఇంకా పార్టీనైనా ప్రారంభించ‌లేదు.. అప్పుడే గులాబీ బాస్‌తో చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై సూదుల్లాంటి కామెంట్ల‌తో స‌ర్కారును కుళ్ల‌బొడుస్తున్నారు వైఎస్ ష‌ర్మిల‌. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకై దీక్ష చేసి.. నిరుద్యోగులకు మ‌ద్దతుగా నిలిచి.. ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌తో తెలంగాణ ప్ర‌జ‌ల ముందుకొచ్చారు ష‌ర్మిల‌. అయితే, అంత‌లోనే క‌రోనా విజృంభించ‌డం.. లాక్‌డౌన్ త‌దిత‌ర కార‌ణాల‌తో లోట‌స్ పాండ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు ఈ తెలంగాణ కోడ‌లు.  ఇంటికే ప‌రిమిత‌మైనా.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్‌కావ‌డం లేదు. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. ట్వీట్ల‌తో సీఎం కేసీఆర్‌ను క‌డిగిపారేస్తున్నారు. తాజాగా, తెలంగాణ‌లో ప్ర‌హ‌స‌నంగా మారిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ నాటు ప‌దాల‌తో, ఘాటైన సామెత‌లతో.. వ్యాక్సిన్ల‌పై స‌ర్కారు ఉదాసీన వైఖ‌రిని నిల‌దీశారు.  ప్రైవేట్ ఆసుప‌త్రుల టీకా దందా పేరిట ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఒక్కో డోసుకు రూ.1,250 నుంచి రూ.1,600 తీసుకుంటున్నార‌ని, ఐదు రోజుల్లో రూ.21 కోట్ల బిజినెస్ చేశార‌నేది ఆ స్టోరీ సారాంశం. ప్రైవేట్ వ్యాక్సిన్‌ బిజినెస్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండగా నిలుస్తోంద‌ని ఆ క‌థ‌నంలో ఉంది. ఇదే విష‌యంపై షర్మిల ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు.  'ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ. మీకు చేతకాకనా?  ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?' అంటూ మండిప‌డ్డారు ష‌ర్మిల‌.  'తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి' అని ష‌ర్మిల డిమాండ్ చేశారు. సామెత‌లు, సెటైర్ల‌తో కేసీఆర్‌పై ష‌ర్మిల చేసిన ట్వీట్లు సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆమె చేసిన ట్వీట్స్ ఆలోచింప చేసేవిగా ఉన్నాయ‌ని అంటున్నారు.   

రఘురామ దెబ్బకు‌ విలవిల.. కేంద్రంతో జగన్ కాళ్లబేరమా?

సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌. కేంద్ర హోంశాఖ అమిత్‌షాతో భేటీ. పోల‌వ‌రం, వ్యాక్సిన్లు, మూడు రాజ‌ధానులు, ప్ర‌త్యేక హోదా..ఎప్ప‌టిలానే ఇదీ ఎజెండా. అధికారికంగా ఇదే ప్ర‌క‌ట‌న‌. కానీ, ప్ర‌జ‌లెవ‌రూ ఈ విష‌యాన్ని న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నాయి ప్ర‌తిప‌క్షాలు. జ‌గ‌న్‌రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో.. అమిత్‌షాను ఏ ప్ర‌యోజ‌నాల కోసం క‌లుస్తున్నారో.. అందరికీ తెలిసిన సంగ‌తే అంటున్నారు. గ‌తంలోనూ ప‌లుమార్లు మోదీ, అమిత్‌షాల‌ను జ‌గ‌న్‌రెడ్డి క‌లిశార‌ని.. అయినా రాష్ట్రానికి ఏం సాధించిపెట్టార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పైపైకి ఎజెండా ఏదున్నా.. లోలోన మాత్రం మేట‌ర్ మ‌రోట‌నేది ఢిల్లీ వ‌ర్గాల మాట‌. సీఎం జ‌గ‌న్‌రెడ్డి హ‌స్తిన వెళ్ల‌డానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. అక్ష‌రాలా ర‌ఘురామ‌కృష్ణ‌రాజునే అంటున్నారు. ఎంపీ ర‌ఘురామ ఢిల్లీలో కూర్చొని.. జ‌గ‌న్‌రెడ్డిని చ‌క్ర‌బంధ‌నంలో బంధిస్తూ ఉంటే.. ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా ఒక్కో పావు క‌దుపుతూ.. చెక్ పెడుతుంటే.. ఆ చ‌క్ర‌వ్యూహంలో చిక్కుకుపోయి జ‌గ‌న్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ఆ ఊబిలోంచి బ‌య‌ట‌ప‌డేందుకే.. కేంద్ర హోంశాఖ శ‌ర‌ణుకోర‌డానికే.. జ‌గ‌న్‌రెడ్డి హ‌స్తిన బాట ప‌ట్టాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. అన‌వ‌స‌రంగా ర‌ఘురామ‌తో పెట్టుకొని.. ఇప్పుడు పుట్టెడు క‌ష్టాల్లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఇటు, బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌.. అటు, ర‌ఘురామ అరెస్ట్‌, క‌స్ట‌డీలో టార్చ‌ర్ ఎపిసోడ్‌ను ఢిల్లీ స్థాయిలో న్యాయ‌, శాస‌న‌, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల దృష్టికి తీసుకెళ్ల‌డం.. ఇలా సీబీఐ, సీఐడీ కేసుల‌తో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌మాదంలో ఉన్నార‌ని అంటున్నారు. సీబీఐ, సీఐడీ కేసుల ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే.. జ‌గ‌న్, అమిత్‌షాల‌ భేటీ ప‌ర‌మార్థం అని ప్ర‌చారం జ‌రుగుతోంది.  జగన్‌ బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా.. ఆ కేసులో వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ తన వైఖరి స్పష్టం చేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అటు, ర‌ఘురామ‌ను రాజ‌ద్రోహం కేసులో సీఐడీ అరెస్ట్ చేయ‌డం, కస్టడీలో రఘురామ కాళ్ల‌కు గాయాలవ‌టం.. జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. త‌న‌పై జ‌రిగిన దారుణంపై ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, లోక్‌స‌భ స్పీక‌ర్‌, ఎన్‌హెచ్ఆర్సీకి స్వ‌యంగా ఫిర్యాదు చేయ‌డం.. మోదీ, అమిత్‌షాతో స‌హా పార్ల‌మెంట్ ఎంపీలంద‌రికీ లేఖ‌లు రాయ‌డం.. ఇలా జ‌గ‌న్‌రెడ్డిని జాతీయ స్థాయిలో దోషిగా నిల‌బెట్టారు ర‌ఘురామ‌. ఈ విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరుపై కేంద్రం చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది.  ర‌ఘురామ ఘ‌ట‌నలో అస‌లేం జ‌రిగిందనే విష‌యంపై ఇప్ప‌టికే కేంద్ర‌హోంశాఖ వివ‌రాలు సేక‌రించిందని స‌మాచారం. జ‌రిగిన న‌ష్టాన్ని గుర్తించిన జ‌గ‌న్‌రెడ్డి.. అమిత్‌షాను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు ఆయ‌న‌తో భేటీకి సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు. అటు, బెయిల్ ర‌ద్దు కేసులో సీబీఐ దూకుడుతో బెంబేలెత్తిన జ‌గ‌న్‌రెడ్డికి ఢిల్లీ వెళ్ల‌క త‌ప్ప‌ని 'పొలిటిక‌ల్ ఎమర్జెన్సీ' ప‌రిస్థితి వ‌చ్చింద‌నేది విశ్లేష‌కుల మాట‌.

ఒకసారి కరోనా వస్తే.. 10 నెలలు సేఫ్! 

దేశంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత కొంత తగ్గింది. గత నెలలో రోజుకు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం లక్షకు పైగా వస్తున్నాయి. మరణాలు మాత్రం ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి. కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమన్న వైద్యు నిపుణుల నివేదికలతో... దేశంలో టీకాల పంపిణి ముమ్మరంగా సాగుతోంది. అందుబాటులో ఉన్న టీకాలను యుద్ధ ప్రాతిపదికన జనాలను అందిస్తున్నారు. అయితే కొవిడ్ సోకిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా.. ఎప్పుడు తీసుకోవాలి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొవిడ్ విజేతలకు యాంటీ బాడీలు ఎప్పుడు వస్తాయి.. ఎప్పటివరకు ఉంటాయన్నదానిపైనా భిన్న వాదనలు ఉన్నాయి.  తాజాగా ఒకసారి కొవిడ్ వస్తే.. మళ్లీ ఎంతకాలం పాటు వచ్చే అవకాశం ఎంత ఉంది? ఎప్పుడు ఉంది? అన్న సందేహాలకు సమాధానాల్ని తాజాగా బ్రిటన్ లో చేసిన పరిశోధన చెబుతోంది. కొవిడ్ ఒకసారి వస్తే.. వారికి రోగ నిరోధక శక్తి దాదాపు పది నెలల వరకు ఉంటుందని.. ఈ సమయంలో కొవిడ్ ఇన్ ఫెక్షన్ నుంచి ప్రమాదం లేదని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనను లాన్సెట్ లో ప్రచురించారు.ఇందులో భాగంగా వైద్య సిబ్బందితో కలిసి మొత్తం 2111 మందికి గత అక్టోబరులో పరిశోధన చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పలు ధఫాల్లో పరిశోధనల నిమిత్తం వారికి కొవిడ్ యాంటీబాడీ రక్త పరీక్షల్ని నిర్వహిస్తారు. వీరిలో682 మంది సామాన్యులైతే.. 1429 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో 634 మంది గతంలోనే కొవిడ్ బారిన పడిన వారే.అధ్యయనం సమయంలో 93 మంది సామాన్యులకు.. 111 మంది సిబ్బందికి తొలిసారి ఇన్ ఫెక్షన్ బారిన పడ్డారు. మిగిలిన వారితో పోలిస్తే.. ఒకసారి కొవిడ్ వచ్చి ఇంట్లో ఉంటున్న వారికి.. రీ ఇన్ ఫెక్షన్ ముప్పు 85 శాతం.. వైద్య సిబ్బందికి 60 శాతం తక్కువగా ఉంటుందని తేల్చారు.  కొవిడ్ టీకా వేయించుకున్న వారికి పది నెలల పాటు మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందన్న మాట. తాజా అధ్యయనం మరోసారి వ్యాక్సిన్ అవసరాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి. అయితే కొవిడ్ విజేతలు, వ్యాక్సిన్ వేసుకున్న వారు తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని పరిశోధన తేల్చి చెప్పింది.