యాప్ లక్ష.. యాడ్స్ కోట్లు! జగన్ సర్కార్ మరో వింత..  

అందరిది ఒకదారి.. ఉలిపిరికట్టది మరో దారి అన్నట్లుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన ఉందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ మొదలు... మూడు రాజధానులు, కొవిడ్ , వ్యాక్సినేషన్, పరీక్షలు, ఎన్నికలు.. ఇలా అన్ని విషయాల్లోనూ అన్ని రాష్ట్రాలు ఒకలా వ్యవహరిస్తే ఏపీ సర్కార్ మరోలా ముందుకు వెళ్లింది. జగన్ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. న్యాయ స్థానాలు ఎన్నో సార్లు మొట్టికాయలు వేశాయి.  ఎన్నోసారు అభాసుపాలైనా జగన్ రెడ్డి సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరో వింత చర్యతో విమర్శల పాలైంది. అసలే రాష్ట్రం అప్పులో ఉంటే.. అది చాలదన్నట్లు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది. ఎవ‌రైనా కోటి రూపాయ‌లు పెట్టి ప‌రిశ్ర‌మ పెడితే దానికి ప్ర‌చార బ‌డ్జెట్ మ‌హా అయితే ఓ ప‌ది ల‌క్షలు పెట్టుకుంటారు. అది కూడా చాలా ఎక్కువే. కానీ ఏపీ స‌ర్కారు మాత్రం  అసలు యాప్ త‌యారీ ఖ‌ర్చు కంటే యాడ్స్ ఖ‌ర్చే ఎక్కువ‌ పెట్టింది. మామూలుగా ఓ మంచి మొబైల్ యాప్ త‌యారీకి ఐదు ల‌క్షల రూపాయ‌ల ఖ‌ర్చు అవుతుంది. కానీ ఏపీ స‌ర్కారు తీసుకొచ్చిన దిశ యాప్ అద్భుతమైన ఫీచ‌ర్ల‌తో..హై ఎండ్ యాప్ అనుకున్నా..  ఈ యాప్ ఖ‌ర్చు 50 ల‌క్షల రూపాయలు దాట‌ద‌ని ఐటి నిపుణుల మాట. కానీ ఏపీ స‌ర్కారు ఈ యాప్ ప్ర‌చారం కోసం కోట్ల రూపాయ‌ల్లో ఖర్చు పెట్టింది.   తెలుగు, ఇంగ్లీష్ ప‌త్రిక‌ల్లో దిశ యాప్ పేరుతో జాకెట్ యాడ్స్ పండ‌గ చేసింది జగన్ రెడ్డి సర్కార్. ఈ యాడ్స్ ఖ‌ర్చు త‌క్కువ‌లో త‌క్కువ ఐదారు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుందని చెబుతున్నారు. అంటే 50 ల‌క్షల నుంచి కోటి రూపాయ‌లతో త‌యారు చేసిన యాప్ ప్ర‌చారం కోసం ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు వ్య‌యం చేశారన్నమాట. బ‌హుశా ఇలాంటి వింత సంఘ‌టనలు ఏపీలో మాత్ర‌మే సాధ్యమవుతాయనే విమర్శలు వస్తున్నాయి. దిశ యాప్ అనేది మ‌హిళ‌ల‌కు ర‌క్షణ కోసం ఉద్దేశించింది. ఇది ప్ర‌జ‌ల‌కు..మ‌హిళ‌ల‌కు ప‌నికొచ్చేది కాబ‌ట్టి మీడియా కూడా స‌హ‌జంగా ప్ర‌చారం క‌ల్పిస్తుంది. యాప్ కు విధిగా క‌వ‌రేజ్ ఇవ్వాల‌ని కూడా ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ ఏపీ సర్కార్ మాత్రం అడ్డగోలుగా యాడ్స్ ఇచ్చి ఖజానాను దుబారా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.  గ‌త కొన్ని నెల‌ల తీరు చూస్తుంటే ఇలా నెల‌కు ఓ రెండు యాడ్స్ అయినా ఉండేలా ప‌క్కాగా ప్లాన్ చేసిన‌ట్లే క‌న్పిస్తోంది. ఏదో ఒక కార్య‌క్ర‌మం విడ‌త‌ల వారీగా నిర్వ‌హించ‌టం..విడ‌త విడ‌త‌కూ యాడ్స్ ఇవ్వ‌టం ఏపీ స‌ర్కారుకు నిత్య కార్య‌క్ర‌మంగామారిందనే విమర్శలు వస్తు్ననాయి. మ‌రో వైపు ల‌క్షల రూపాయ‌ల ద‌గ్గ‌ర నుంచి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ స‌ర్కారు ప‌నులు చేసిన వారు బిల్లులు రాక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. స్వ‌యంగా ఈ మ‌ధ్యే స‌ర్కారు బిల్లులు చెల్లించేందుకు డ‌బ్బులు లేవ‌ని కోర్టుకు తెలిపింది. అయినా స‌రే యాడ్స్ మాత్రం ఆప‌టం లేదు జగన్ రెడ్డి సర్కార్.  సీఎం జ‌గ‌న్‌, దిశ యాప్ యాడ్స్ పై టీడీపీ నేత‌ నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు ఉన్నాయ‌ని, మ‌హిళ‌ల‌కు ఏపీలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. 'శ‌వాల‌పై పేలాలు ఏరుకునేవారిని త‌ల‌ద‌న్నుతూ అత్యాచారాల‌పైనా కోట్లు దండుకుంటున్నారు జ‌గ‌న్‌రెడ్డి. త‌న‌ ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్ జ‌రిగి 10 రోజుల‌వుతున్నా నిందితుల్ని ప‌ట్టుకోని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంత‌ప‌త్రిక‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లిచ్చారు' అని లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. సొంత అక్కాచెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌ల‌కే భ‌ద్ర‌త‌లేక ఒక‌రు తెలంగాణ‌లో, ఇంకొక‌రు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. `అక్కచెల్లెమ్మ‌ల భ‌ద్ర‌త‌-జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ బాధ్య‌త‌` అంటూ ఎందుకీ క‌ప‌ట ప్ర‌క‌ట‌న‌లు జ‌గ‌న్‌రెడ్డీ? అని లోకేశ్ ప్రశ్నించారు. 'మీ ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్ జ‌రిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే ప‌ట్టుకోలేని చేత‌గాని ద‌ద్ద‌మ్మ ముఖ్య‌మంత్రీ.. క‌రోనా బాధితుల డిమాండ్ల సాధ‌న‌కు చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకు, 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్‌కే మరోసారి డౌన్ లోడ్ కార్య‌క్ర‌మ‌మా?' అని లోకేశ్ ప్ర‌శ్నించారు. 

'మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ'! జగన్ పై రఘురామ సెటైర్లు.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో  కొన్ని రోజులుగా ఆయన వరుసగా లేఖ‌లు రాస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఆయన రియాక్ట్ అవుతున్నారు. ఈ సారి జగన్  రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఏపీ హౌజింగ్ స్కీమ్ పై స్పందించారు. రాష్ట్రంలో 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత నాసిరకంగా ఉందన్నారు.  ఒకసారి ఇళ్లను నిర్మించే ప్రదేశానికి వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్‌ను కోరుతున్నానని లేఖలో చెప్పారు ఎంపీ రఘురామ రాజు.  ఏపీలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్ర‌ణాళిక‌లు వేశార‌ని లేఖలో ర‌ఘురామ‌ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్ర‌భుత్వం.. తర్వాత అంచాను రూ.70,000 కోట్లకు పెంచింద‌ని చెప్పారు. మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నామంటూ వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ని రఘురామ రాజు ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల చిత్రంలోని 'మా చెల్లి పెళ్లి...జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోందని ఎంపీ రఘురామ రాజు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్ప‌టికైనా ఇటువంటి చ‌ర్య‌లు మానుకోవాల‌ని ర‌ఘురామ సూచించారు. పేద‌వారికి ఇళ్లు ఇచ్చే విష‌యంలో స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. 

ఏపీ ముఖ్యమంత్రి మహిళ! అయ్యయ్యో జగనయ్య..

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి మహిళా.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. జగన్ రెడ్డి ఉండగా మహిళ ఎప్పుడు ముఖ్యమంత్రి అయిందని షాకవుతున్నారా.. ఏమో.. ఎందుకంటే  ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డీనే. బహిరంగ వేదికగానే ఆయన ఈ విషయం చెప్పారు. ఏపీకి మహిళ ముఖ్యమంత్రిగా ఉందని గొప్పగా తెలిపారు.  జగన్మోహన్ రెడ్డి చేసిన మహిళా ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో వైరల్ గా మారాయి. జనాల్లో చర్చగా మారింది. విజయవాడలోని గొల్లపూడిలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు తీసుకువచ్చిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా మహిళే ఉన్నారని కామెంట్ చేశారు. సీఎం మాటలు విన్నవారంతా షాకయ్యారు. దీంతో తప్పు  చెప్పానని గ్రహించిన సీఎం జగన్.. వెంటనే  సర్దుకుని హోంశాఖ మంత్రిగా మహిళా ఉన్నారంటూ సరి చేసుకున్నారు.  ఇప్పటికే  వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌తిరోజూ రాత్రి త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో మాట్లాడ‌తారంటూ.. ఈ విష‌యం సీఎం జ‌గ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. న‌మ్మ‌ద‌గ్గ స‌మాచారం ప్ర‌చారంలో ఉంది. కేవ‌లం వైఎస్సార్‌తోనే కాదు.. దేవుడి బిడ్డ అయిన జగ‌న్‌.. డైలీ తాను జీస‌స్‌తో మాట్లాడ‌తాన‌ని ముఖ్య‌మంత్రే చెప్పిన‌ట్టు అధికార వ‌ర్గంలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు విష‌యాల గురించి ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత బ‌య‌ట పెట్ట‌డంతో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అస‌లేమైంది..? ఆయ‌న మాన‌సిక ఆరోగ్యం ఎలా ఉంద‌నే అనుమానం, చ‌ర్చ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. గ‌తంలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజు.. సీఎం జ‌గ‌న్ మెంట‌ల్ కండిష‌న్ సరిగా లేనట్టుందనే కామెంట్ చేశారు. దీంతో జగన్ మానసిక స్థితి సరిగా లేదా అన్న అనుమానాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి. 

క్యాట్ వాక్ మంత్రి.. బండి.. గుండు! రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి.. 

తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎంపికైన ఎంపీ మల్కాజ్ గిరి దూకుడు పెంచారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేశారు. పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించడంపై ఫైరయ్యారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న  సమయంలో కౌన్సిల్ మీటింగ్  విర్చువల్ గా చేయడం వెనక ఉన్న దురుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియా ని  ghmc లోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు.  పాలన అంతా పారదర్శకంగా జరుగుతున్నప్పుడు మీడియా ను ఎందుకు అనుమతించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  హైదరాబాద్ ను చెత్త నగరంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తూతూ మంత్రంగా.. టూత్ పాలిష్ లాగా  పనులు చేస్తూ షో చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని 16 నివాసాయోగ్యమైన  పట్టణాల జాబితాలో హైదరాబాద్ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో జిహెచ్ఎంసి కి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో మహా నగరం నరకంగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నే జిహెచ్ఎంసి అప్పుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. నాలల్లో ముంపు సమస్య తీరలేదని ఆరోపించారు. కనీసం చెత్త కూడా తీయలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాబట్టడంలో బల్దియా అధికారులు విఫలం అయ్యారని విమర్శించారు. ఫ్యాషన్ షో క్యాట్ వాక్..ktr క్యాట్ వాక్  రెండు ఒకేలా ఉంటాయంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచితేనే ఫ‌లితం ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. రూ.800 కోట్ల‌తో వ‌ర‌ద నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేదని అన్నారు. అంతేగాక‌. అన్ని ర‌కాల ప‌న్నులు పెంచారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు కానీ, జీహెచ్ఎంసీకి ప్ర‌భుత్వం చెల్లించాల్సిన ప‌న్నులు మాత్రం చెల్లించ‌డం లేద‌ని చెప్పారు. బీజేపీ నేతలపైనా విరుచుకుపడ్డారు మల్కాజ్ గిరి ఎంపీ. బీజేపీ నేతలు పగటి వేషగాళ్లుగా మారిపోయారని విమర్శించారు.ప్రజా సమస్యలపై పనిచేయట్లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయ్ అని ప్రశ్నించారు. బండి సంజయ్ బండి ఎటుపాయో అంటూ సెటైర్లు వేశారు. బండి పాయో గుండు పాయే అంటూ సంజయ్ తో పాటు ఎంపీ అర్వింద్ ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.  'ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నుల‌కు నిధులు ఇచ్చే విష‌యం దేవుడెరుగు. క‌నీసం ప్ర‌భుత్వ బంగ్లాల ప‌న్నులు చెల్లించ‌డంలేదు, రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టాల్సిన ప్రాప‌ర్టీ ట్యాక్స్ కూడా క‌ట్ట‌ట్లేదు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద ప‌న్ను ఎగ‌వేత‌దారుడు కేసీఆర్.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కూడా రూపాయి ప‌న్ను క‌ట్టలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'ఆ భ‌వ‌న్‌కు నీళ్లు, విద్యుత్ ఆపేయాలి. నేను జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు ఒకటే విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. నాకున్న స‌మాచారం మేర‌కు ప్ర‌భుత్వం 2,600 కోట్ల రూపాయ‌ల ప‌న్నులు క‌ట్టాలి. ఆ పన్నులు రాబ‌ట్టితే జీహెచ్ఎంసీ అప్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌న్నులు చెల్లించ‌డం లేదు. హైద‌రాబాద్ న‌గ‌రం తెలంగాణ గుండె. ఇక్క‌డి నాలాలు, చెరువులు క‌బ్జాకు గురి కాకుండా సీసీ కెమెరాలు పెట్టాలి. కానీ, మాఫియాకు మ‌ద్ద‌తుగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్ట‌ట్లేదు. త్వ‌ర‌లో మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాను' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎక్కడ ఏం జరిగినా..చంద్రబాబేనా..? ఇంకెంత కాలం ఈ డ్రామాలు? 

సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఇది మనకు స్పేస్ సైన్స్ చెప్పే విషయం. కాని తెలుగు రాష్ట్రాల్లో ఆ సైన్స్ వేరేగా వినిపిస్తున్నారు. రాజకీయాల చుట్టూ పార్టీలు తిరుగుతున్నాయి.. ఆ పార్టీల చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని చెబుతున్నారు. ఆ చెప్పేవారు మాత్రం చంద్రుడి చుట్టూనే తిరుగుతున్నారు. ఎక్కడ ఏం జరిగినా...ఆ తీగ తెగకుండా జాగ్రత్తగా లాగి చంద్రుడికి లింకు పెట్టేస్తున్నారు. ఎవరు పార్టీ మారినా.. ఎవరికి ఏ పదవి వచ్చినా.. కర్త కర్మ క్రియ ఈ చంద్రబాబునాయుడే అని కథలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఎలిజబుల్ పొలిటీషియన్ చంద్రబాబునాయుడు. ఆయనను పొగిడేవారున్నారు..నాన్ స్టాప్ గా తిట్టేవారున్నారు. కాని ఎవరు మాట్లాడినా ఆయన పేరు ఎత్తకుండా ఉండలేరు. స్పీచ్ లో ఆయన పేరు లేకపోతే గ్రామర్ కరెక్టుగా ఉండదని ఫీలవుతుంటారు. కంటెంట్ లో ఆయన పేరు లేకపోతే..కంప్లీట్ అవదని వాళ్ల స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. ఎవరు పార్టీ మారినా...ఎవరికి ఏ పార్టీలో ఏ పదవి వచ్చినా దాని వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ మధ్య అధికార పార్టీ మానసపత్రిక అయితే ఏకంగాఎడిటోరియలే రాసింది. టీడీపీ నుంచి బిజెపిలోకి వెళ్లినవారిని, టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినవారిని..టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారిని అందరినీ..చంద్రబాబే పంపిచాడనేది వారు చెప్పే వేదాంతం. కాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినవారిని గురించి మాత్రం ఆ కథనంలో ప్రస్తావన కూడా చేయరు..వారిని కూడా చంద్రబాబే పంపించాడని పొరపాటున కూడా రాయరు. అదే ఆ రాతల్లోని నైపుణ్యం. సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో మొదలవుతుంది ఈ కథ. వారిద్దరినీ బిజెపిలోకి పంపింది చంద్రబాబేనని.. వారిని, బాబును కాపాడటానికే బిజెపిలోకి పంపారని చెబుతున్నారు. ఇక లేటెస్టుగా రేవంత్ రెడ్డిదే హాట్ టాపిక్. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ చేయడానికి బాబుగారు రాహుల్ గాంధీతో మంత్రాంగం నడిపించారనేది వారి ఆలోచన. రేవంత్ ని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా పంపించి.. తెలంగాణను గుప్పిట్లో పెట్టుకోవాలని బాబు ప్లాన్ వేశారనేది వారి ఆరోపణ. ఇక రమణను టీఆర్ఎస్ లోకి పంపి.. అంతకు ముందు పంపిన నేతలతో పాటు..ఈయన కూడా కలిసి... టీఆర్ఎస్ ను కూడా గుప్పిట్లో పెట్టుకుంటారంట. అంటే బిజెపిని, టీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని అన్నిటిని గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేదే వారు చెప్పేది. రేవంత్ రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఏ పార్టీ అయినా వెనకాడడు. బిజెపి, టీఆర్ఎస్ లను టచ్ చేశాకే టీడీపీలో చేరాడు.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడు. ఎక్కడున్నా నాయకత్వ స్థానానికి ఎదగగల సత్తా ఉన్నవాడు కాబట్టే ఎక్కడున్నా ఆ మోతే మోగిస్తాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట వింటారనుకోవడం భ్రమే అవుతుంది. ఇక టీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతల సంగతి అందరికీ తెలిసిందే. అధికారం లేకపోతే బతకలేమనే స్ధితికి వెళ్లిపోయిన రాజకీయ నేతలు ఎలా పార్టీలు మారుతున్నారో ఏపీలో, తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి..వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి ఎలా జంప్ చేశారో చూశాం. తెలంగాణలో కూడా అంతే. ఇవన్నీ వదిలేసి...ప్రతి పార్టీలో జరిగే రాజకీయ పరిణామాలకు చంద్రబాబుకు ముడిపెట్టడం అంటే వారే ఓ సిద్ధాంతాన్ని సృష్టించి రాద్ధాంతం చేయడమే.

కమలంలో కట్టు తప్పిన క్రమశిక్షణ! బండి పట్టాలు తప్పిందా..?

ముఠాలు, కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలోనే కానీ, క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో ఉండవు అని ఎవరైనా అనుకుంటే వారు తప్పులో కాలేసినట్లే ... ఒకప్పడు అధికారానికి దూరంగా ఉన్న రోజుల్లో బీజేపీలో మడీ ఆచార కట్టుబాట్లు ఉంటే ఉండేవేమో కానీ, ఇప్పుడు అంత సీన్ లేదు. అప్పట్లో కాంగ్రెస్, ఇతర మధ్యేవాద పార్టీలకు కొంత భిన్నంగా, విభిన్నంగా బీజేపీ ఉండేదేమో,కానీ, అధికారం రుచి మరిగిన తర్వాత,ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి పోయే వాళ్ళు ఎక్కువైన తర్వాత,అన్ని పార్టీల అవలక్షణాలు కమల దళానికి అంటుకున్నాయి. నిజానికి, ఈమధ్య కాలంలో ఇతర పార్టీలలో కంటే కూడా బీజేపీలో క్రమశిక్షణా రాహిత్యం  కొంచెం ఎక్కువగా కనిపిస్తోందని, కమలదళం పాత కాపులు బాధను వ్యక్తం చేస్తున్నారు.  ఈ మధ్య కాలంలో అయితే బీజేపీలో క్రమశిక్షణ రాహిత్యం, తరచూ వార్తల్లో వినవస్తోంది. కొద్ది కాలం క్రితం, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సారధ్యంలో ప్రతి నాయాకుల బృందం, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్’ ను కలిశారు. పార్టీ నాయకులు బృందం మరో పార్టీ నాయకుడిని కలవడం తప్పు కాకపోయినా, పార్టీకి సమాచారమే లేకుండా, కనీసం పార్టీ అధ్యక్షుడి అనుమతి అయినా లేకుండా కలవడం పార్టీలో దుమారం సృష్టించింది. షోకాజు నోటీసులు, విచారణలు,వివరణలు, సంజాయిషీలు ఇలా చాలా కథ నడిచింది. ఇక ప్రస్తుతానికి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం దళిత సాధికరితఫై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరు కావడం పార్టీలో దుమారం రేపుతోంది. ఎస్సీ సాధికారతపై ముఖ్యమత్రి కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ నాయకత్వం బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా.. పార్టీని కాదని మోత్కుపల్లి హాజరు కావడంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పార్టీ నిర్ణయాన్ని కదాని కేసీఆర్‌తో భేటీకి మోత్కుపల్లి ఎలా హాజరవుతారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మోత్కుపల్లి తమను తాము గట్టిగా సమర్ధించుకుంటున్నారు. అఖిల పక్ష సమావేశానికి హాజరై  బీజేపీని రక్షించానని చెప్పుకుంటున్నారు. లేదంటే బీజేపీపై దళిత వ్యతిరేక ముద్ర పడేదంటూ ఆయన పార్టీ నేతలకు పాఠాలు  చెపుతున్నారు. ఒక విధంగా సవాలు విసురుతున్నారు.  అదలా ఉంటే,అనుమతి లేకుండా మీటింగ్’కు వెళ్ళిన మోత్కుపల్లి, మీడియా ఇంటర్వ్యూ లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో గొప్పగా  పనిచేస్తున్నారని కొనియాడుతున్నారు. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని ప్రశంసిస్తున్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో చర్యలు తీసుకుని.. ప్రభుత్వంపై విశ్వాసం కల్గించారని కితాబు నిచ్చారు.  నిజానికి, మోత్కుపల్లి బీజేపీలో చేరక ముందు నుంచే తెరాసలో చేరుతున్నారని వార్తలొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కారెక్కేందుకు చాలా ప్రయత్నాలు  చేశారు. అయితే, అటునుంచి ఎంతకీ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో .. ఎదురు చూసి చూసి చివరకు బీజేపీ చేరారు. ఇక ప్రస్తుతానికి వస్తే, మోత్కుపల్లి  త్వరలో కారెక్కడం ఖాయంగా కనిపిస్తోందని, బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే స్వలాభం కోసం పార్టీలు మారనని, తాను కేసీఆర్‌కు దగ్గర కాలేదని, భారతీయ జనతాపార్టీలోనే ఉంటానని మోత్కుపల్లి స్పష్టం చేశారు. బహుశా గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్టిలో ఉంచుకుని కావచ్చు,జాగ్రత్త పడుతున్నారు. అందులోనూ అసలే ఆయన కేసీఆర్, ఆయనకు ఎప్పుడు ఎవరు ఎదుకు ముద్దోస్తారో.. ఎవరు ఎప్పుడు కంపవుతారో .. ఆయనకే తెలియదు. అదీ గాక మోత్కుపల్లి తీరని కోరిక ఎదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావడం,ఆ కోరిక తీరాలంటే బీజేపీలో ఉండవలసిందే, అందుకే కావచ్చు.. ఆయన అటూ  ఇటూ అవుతున్నారు. అయితే, కేసీఆర్ పిలిస్తే మాత్రం ... మిత్కుపల్లి నిముషం ఆలోచించకుండా వెళ్లి కారెక్కుతారు. అందులో సందేహంలేడంటున్నారు ఆయన సన్నిహితులు.

వాళ్లు కలిస్తే.. ఊహకే ఉలిక్కిపడుతున్న వైసీపీ

వాళ్లు కలుస్తారని కొందరు అనుకుంటున్నారు. కలిస్తే బాగుండని కొందరు ఫీలవుతున్నారు. కలవకూడదని బలంగా మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆయనేమనుకుంటున్నారో మాత్రం తెలియదు. ఆయన ఫ్యాన్స్ దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కాని రాతల పోటీలు మాత్రం సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయి. కలుస్తారని కొందరు రాస్తుంటే... కలిస్తే అది బ్లండర్ అవుతుందని ఆ నాయకుడికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మరికొందరు.  జగన్ ఈసారి కూడా వచ్చేటట్లు ఉన్నాడు. సంక్షేమ పథకాల పేరుతో జనానికి డబ్బులు వేసేస్తున్నాడు.. మిగతా విషయాలు మాత్రం పట్టించుకోరు. మళ్లీ ఆయనకే వేసేస్తారేమో.  కాని టీడీపీ జనసేన కలిస్తే మాత్రం...ఓడగొట్టేస్తారు భయ్యా...ఇలా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చాలా చోట్ల జగన్ ను తిట్టుకుంటున్నారు..వ్యతిరేకత ఉందనుకున్నా...స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలను గందరగోళంలో పడేశాయి. అప్పటి నుంచే ఈ కొత్త ఈక్వేషన్ గురించి చర్చ మొదలైంది. చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు...పవన్ మనసులో ఏమనుకుంటున్నారో అసలే తెలియదు.. కాని చర్చ మాత్రం నడుస్తోంది. సోషల్ మీడియాలో కొందరు ఈ చర్చను పెడుతుంటే.. కొన్నిఛానళ్లు ఒక అడుగు ముందుకేసి కలిసిపోతున్నారని స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. టీడీపీ కోసం కొందరు ఈ పని చేస్తున్నారనుకోవచ్చు. కాని ఆశ్చర్యం ఏంటంటే.. వైసీపీని బహిరంగంగా సమర్ధిస్తున్న ఓ వెబ్ పోర్టల్ అయితే వారిద్దరూ కలవలేరని.. కలవకూడదని..ఒకవేళ పవన్ అలాంటి నిర్ణయం తీసుకుంటే తప్పు చేసినవాడే అవుతాడని..పైగా బిజెపికి దూరమైతే..భవిష్యత్ ఉండదని హెచ్చరించింది. ఎలాంటి మొహమాటం లేకుండా ఇవే మాటలు డైరెక్టుగా చెప్పేసింది. ఆ కథనం చూస్తే.. టీడీపీ, జనసేన ఎట్టిపరిస్ధితుల్లో కలవకూడదని వైసీపీ బలంగా కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఆ కలయుక ఊహల పట్లే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆ చర్చను కొనసాగించేలా చేసింది. లేదంటే పవన్ కేంద్ర మంత్రి పదవిలా కొన్నాళ్లు నడిచి ఆగిపోయేది. కాని ఇప్పుడు ఆ వెబ్ పోర్టల్ చర్చకు సశేషం మార్క్ పెట్టింది. అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలను సైతం ఆలోచనలో పడేసింది. పవన్ జనసేన పెట్టిన వెంటనే బిజెపికి, ఆ తర్వాత టీడీపీకి మద్దతు పలికారు. 2014 ఎన్నికల్లో అది ఫలితాలను మార్చిందనే చెప్పుకోవాలి.  ఆ తర్వాత అమరావతి విషయంలో పవన్ ఆందోళన చేశారు. తర్వాత టీడీపీ పరిపాలనపైనా ధ్వజమెత్తారు. మరోవైపు జగన్ వైఖరిపైనా మండిపడ్డారు. ఎవరు బలమైన శత్రువో తేల్చుకోలేక గందరగోళంలో పడటం.. టీడీపీతో అవగాహనే అనే అనుమానాలు జనంలో పెరగడంతో ఫలితాలు వేరేగా వచ్చాయి. అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ..మెల్లగా బిజెపికి దగ్గరయ్యారు. కాని అక్కడా సంతృప్తి లేదు. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా తదితర విషయాల్లో బిజెపి వైఖరి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. అలాగే జగన్ పట్ల రహస్య ప్రేమ చూపిస్తూ బిజెపి పవన్ ఆగ్రహానికి గురవుతోంది. అందుకే మళ్లీ పవన్ టీడీపీ వైపు వస్తారా అనే అంచనాలు మొదలయ్యాయి. కలిస్తే ఏంటి..కలవకపోతే ఏంటి అనే చర్చ బలంగా సాగుతుండటంతో.. ఇరు పార్టీల అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మరి ఏం జరగనున్నదో వేచి చూడాల్సిందే.

పీవీని కాంగ్రెస్ వదిలేసుకుందా?

ఆర్ధికవేత్తలకు ఆయనో మార్గదర్శి. బిజినెస్ సర్కిల్స్ కు ఆయనో కరుణామయుడు. మల్టీ నేషనల్, నేషనల్ కంపెనీలకు ఆయన దేవుడే. ఆయన పరిపాలన సామాన్య ప్రజలకు మాత్రం అర్ధం కాలేదు. అందుకే మాస్ లీడర్ కాలేకపోయారు. ఆర్ధికరంగంపై అవగాహన ఉన్నవారంతా నేటికి పీవీకీ థ్యాంక్స్ చెబుతుంటారు... ఎందుకంటే ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టిన వేళ.. ఆ సెగ తాగకుండా కాపాడినవాడని చెప్పుకుంటారు. ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడని కీర్తిస్తారు. సోనియా కుటుంబానికి మాత్రం ఆయనో ద్రోహి అనే టాక్ ఉంది. అందుకే ఆయనకు సరైన గౌరవం ఇవ్వరని ఆరోపిస్తూ ఉంటారు. ఆయనే పీవీ నరసింహారావు. తెలంగాణలో విచిత్ర పరిస్ధితి ఏర్పడింది. పెద్దాయనని కేసీఆర్ భుజాన వేసుకుని మోస్తూ.. ముందుకు పోతున్నారు. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించారు. పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఆయన కాంస్యవిగ్రహాన్ని సైతం ప్రతిష్టించి ఆవిష్కరించారు. అన్నీ ఒక ఏడాదిలోనే జరిగాయి. కాని ఈ ఒక్క ఏడాదిలోనే పీవీ నరసింహారావు టీఆర్ఎస్ నాయకుడా లేక కేసీఆర్ గురువా అన్నంతగా అయిపోయింది. అందరూ మర్చిపోయిన పీవీని గౌరవిస్తున్నాడే అంటూ కేసీఆర్ ను పొగిడేవారు చాలామందే కనపడుతున్నారు.  కేసీఆర్ ఏం చేసినా ఎక్స్ ట్రీమే... అభిమానించినా ఆ రేంజ్ లోనే... ద్వేషించినా అదే రేంజ్ లో.  అరిచి గోల పెట్టగలడు.. వారినే అక్కున చేర్చుకోగలడు. ఏదైనా చేయగల నేర్పరితనం ఆయన సొంతం. ఇప్పుడు పీవీ నరసింహారావు విషయంలో అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రధాని అయిన పీవీ నరసింహారావును ఆల్ మోస్ట్ హైజాక్ చేసేశారు. ఆయనకు ముఖ్యమంత్రి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించి ఆవిష్కరిస్తే.. అదే రోజు గాంధీభవన్ లో ఓ మీటింగు పెట్టి మమ అనిపించారు కాంగ్రెస్ నేతలు. ఆఖరికి బిజెపి సైతం పీవీనరసింహారావును ఎత్తుకోవడంలో పోటీ పడుతోంది. ఆయన పేరున స్టాంప్ రిలీజ్ చేస్తామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనే ఇందుకు సాక్ష్యం.  కాని కాంగ్రెస్ మాత్రం ఈ పరిణామాలను డీల్ చేయడంలో వెనకబడింది. ఆ ఏముందిలే పీవీ నరసింహారావును వాళ్లు ఎత్తుకుంటే ఎత్తుకోనీ అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాని చాలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని గమనించడం లేదు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో చాలామంది పీవీ ఫ్యాన్స్ ఉన్నారు. వీరంతా పైకి కనపడరు.. పెద్దగా ఆ విషయం చెప్పుకోరు. కాని వారంతా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. కేసీఆర్ వైఖరికి వారు లోలోపలే చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పుడు కాంగ్రెస్ వినిపించుకోకపోతే కష్టమే. కొత్త నేత రేవంత్ రెడ్డి అయినా ఈ విషయంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. అసలు తమ నాయకుడి గురించి తాము చెప్పుకోవాల్సింది పోయి.. ప్రత్యర్ధులు చెబుతుంటే వినాల్సిన దుస్ధితి వచ్చిందని వారు ఆందోళన చెందుతున్నారు. పీవీని అభిమానించే కొన్ని వర్గాలు మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నాయి. కేసీఆర్ వ్యూహానికి రేవంత్ ప్రతి వ్యూహం అమలు చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఎక్కువే కనపడుతోంది

రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీటు ఫిక్స్ ! అక్కడ వార్ వన్ సైడే?  

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ అనుమల రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నారు. చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడినా.. రేవంత్ రెడ్డికి పీసీసీ కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అందుకు ఆయన పోరాటమే కలిసివచ్చింది. కేసీఆర్ సర్కార్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి విపక్ష పార్టీల నేతలు జంకిన సమయంలో .. ఎదురించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను బయటికి తీసుకొచ్చారు. అందుకే రేవంత్ రెడ్డికి క్రేజీ భారీగా పెరిగింది. తెలంగాణ యువతకు ఆయనో పోరాట యోధుడిగా మారిపోయారు. తనపై కేసులు పెట్టినా బెదరకుండా ముందుకుపోవడం వల్లే  రేవంత్ కు మద్దతు పెరిగిందని చెబుతారు. పీసీసీ పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేకపోయామనే భావనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్ . ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో అధికారం వస్తుందనే నమ్మకంతో ఉంది. రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. పార్టీలోని నేతలందరిని ఐక్యం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలను కలుస్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.  రేవంత్ రెడ్డికి సంబంధించి మరో అంశం చర్చకు వస్తోంది. ప్రస్తుతం మాల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్.. రాజకీయంగా ఎదిగింది మాత్రం కొడంగల్ నుంచే. ఆ నియోజకవర్గం నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యాంగా ఓడిపోయారు. తర్వాత 2019లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు పీసీసీ చీఫ్  గా రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది  ఆసక్తిగా  మారింది. అయితే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో ఉండాలన్న దానిపై ఇప్పటికే క్లారిటీగా ఉన్నారని చెబుతున్నారు. తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన కొడంగల్ కాకుండా మరో నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ చేయనున్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ పై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా... రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. రేవంత్ వల్లే విజయం దక్కిందని చెబుతున్నారు. లింగోజిగూజ కార్పొరేటర్ ప్రమాణస్వీకరానికి జీహెచ్ ఎంసీ కార్యాలయానికి కూడా వెళ్లారు.గత లోక్ సభ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి ఎల్బీనగర్ లో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచే ఎల్బీ నగర్ అసెంబ్లీపై ఆయన ఫోకస్ చేశారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి.  రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంచుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. వందలాది కాలనీలకు రెడ్లే అధ్యక్షులు, చైర్మన్లుగా ఉన్నారు. ఎంపీగా రేవంత్ గెలవాడనికి వీళ్లంతా సాయం చేశారు. రేవంత్ ను అసెంబ్లీకి పోటీ చేయాలని వీళ్లంతా కోరుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎల్బీ నగర్ పరిధిలో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల జనాలతో పాటు సెటిలర్లు భారీగానే ఉన్నారు. నల్గొండ, పాలమూరు ప్రజల మద్దతు రేవంత్ రెడ్డికి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సెటిలర్లు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. ఇవన్ని కలిసివచ్చే అవకాశాలు ఉండటం వల్లే ఎల్బీనగర్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఎల్బీనగర్ లో రేవంత్ పోటీ చేస్తే.. ఆయనకు కనీస పోటీ ఉండకపోవచ్చనే టాక్ నియోజకవర్గంలో వినపిస్తోంది.. 

కిషన్ రెడ్డి సైలెంట్.. ఈటల గప్ చుప్! కేసీఆరే నడిపిస్తున్నారా..? 

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ప్రకటించిన కాసేపటికే మీడియాతో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి బాంబ్ పేల్చారు. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయి ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఈటలపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయంగా కాక రేపాయి. జనాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఈటల ఎపిసోడ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి అన్నివర్గాల్లో కనిపించింది. అయితే రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఈటల రాజేందర్ గాని, బీజేపీ నేతలు కాని స్పందించకపోవడంతో.. అది నిజమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈటలను దారుణంగా ఇరికించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపించి కాక రేపారు రేవంత్ రెడ్డి. అందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు. బీజేపీలోకి రావాలని ఈటలను ఆహ్వానించేందుకు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఎవరిదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తికి చెందిన ఫ్లైట్ లోనే కిషన్ రెడ్డి వచ్చారన్నారు. తన మంత్రివర్గం నుంచి తొలగించిన ఈటలను బీజేపీలో చేరాలని చర్చించేందుకు వచ్చిన కిషన్ రెడ్డికి.. కేసీఆర్ సన్నిహితుడు ఫ్లైట్ ఎందుకు ఇస్తారని, ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. రేవంత్ రెడ్డి ఆరోపణలు తెలంగాణలో కలకలం రేపాయి. బీజేపీలో ప్రకంపనలు స్పష్టించాయి. నిజానికి ఒక నేతపై ఎవరైనా ఆరోపణలు చేస్తే.. సదరు నేతలు వెంటనే స్పందిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి నేరుగానే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయినా ఇంతవరకు వాళ్లిద్దరు స్పందించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించారు. పలు వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు. పీవీ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. కాని తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాత్రం కిషన్ రెడ్డి స్పందించలేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. కిషన్ రెడ్డి మౌనం దేనికి సంకేతమనే అనుమానాలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి మౌనంగా ఉన్నారంటే.. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిజమేనా అన్న సందేహాలు వస్తున్నాయి.  ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ ది ఇదే పరిస్థితి. సోమవారం నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకుంటానని చెబుతున్న రాజేందర్.. రేవంత్ రెడ్డి ఆరోపణలపై మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఆరోపణలపై వెంటనే స్పందించాల్సి పోయి.. రెండు రోజులైనా సైలెంటుగా ఉండటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఈటల నడుస్తున్నారన్న ఆరోపణపైనా స్పందించపోతే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళుతుందనే ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం ఇవ్వకపోతే.. ఆయన చేసిన ఆరోపణలు నిజం అనే భావన జనాల్లో వస్తుందని, అదే జరిగితే చాలా ప్రమాదమని కొందరు ఈటల మద్దతుదారులు కలవరపడుతున్నారు.  ఇది త్వరలో జరగబోయే ఉప ఎన్నికలోనూ తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. 

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి జోష్.. గంటల్లోనే కోమటిరెడ్డి కూల్..

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్ల మద్దతు పెరిగింది. గతంలో అతనికి వ్యతిరేకించిన నేతలు కూడా రేవంత్ కు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని చెబుతున్నారు. పార్టీ నేతలంతా రేవంత్ జపం చేస్తుండంతో.. వ్యతిరేకంగా ముద్ర పడిన నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. ఇక పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారని ఆరోపించి కాక రేపిన సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కొన్ని గంటల్లోనే కూలై పోయారు. గాంధీభవన్ మెట్లెక్కను గాక ఎక్కను అంటూ శపథం చేసిన ఆయన.. ఇకపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఫోన్ స్విచ్ఛాప్ పెట్టిన కోమటిరెడ్డి...  సోమవారం సాయంత్రం ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు. తన ముందున్న లక్ష్యం ఏంటో ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రజాసమస్యలపై మాత్రం ఏ సమయంలో వచ్చినా స్పందిస్తానని, రాజకీయాల్లోకి మాత్రం తనను లాగొద్దని పేర్కొన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామానికి వెళతానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇలా ఉంది...  ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటాన‌ని.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్ద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌న‌ని.. దానికి స‌హ‌క‌రించాల‌ని జ‌ర్న‌లిస్టుల‌ను కోరారు. త‌ను భువ‌న‌గిరి ఎంపీ ఎన్నికైనా నుంచి అన్ని గ్రామాల్లో ప‌ర్య‌టించలేద‌ని.. క‌రోనా కాలంగా కొద్ది గ్రామాలకు మాత్ర‌మే వెళ్లిన‌ట్లు తెలిపారు. ఇక నుంచి భువ‌న‌గిరి, న‌ల్గొండ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టించి అక్క‌డ తిష్ట వేసిన స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌ని వివ‌రించారు. అలాగే గ్రామాల అభివృద్దికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాడి నిధులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని వెల్ల‌డించారు. గ్రామాల్లో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటిని ప‌రిష్కారానికి పూర్తిగా స‌మ‌యం కేటాయిస్తాన‌ని తెలిపారు. అలాగే పూర్తిస్థాయిలో సేవా కార్యక్ర‌మాల మీదే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతాన‌ని తెలిపారు. న‌ల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రైనా త‌న తలుపు త‌ట్ట‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వ‌ల్ల న‌ల్గొండ జిల్లాలో వేలాది ఎక‌రాలు బీడు వారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు త్వ‌రగా పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తాన‌ని తెలిపారు. అలాగే 90శాతం పూర్త‌యిన బ్ర‌హ్మ‌ణ వెల్లంల ప్రాజెక్టుకు వంద కోట్లు ఖ‌ర్చు చేస్తే పూర్తై వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. వీటితో పాటు భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోని గంధ‌మ‌ల్ల‌, బ‌స్వాపురం రిజ‌ర్వాయ‌ర్లు త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌చ్చేలా స‌ర్కార్‌పై ప్ర‌జ‌ల ప‌క్షాన యుద్దం చేస్తాన‌ని తెలిపారు.

ఎందుకు? ఏమిటి? ఎలా? ఇవేమీ లేకుండానే షర్మిలక్క ట్వీట్..

అక్క మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరికీ వ్యతిరేకంగా కాదని... కేవలం అదికారమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది. ఊరు మార్చింది కాని...తీరు మారలేదు. ఈ ఒడ్డుకొచ్చి.. ఆ ఒడ్డు మీద వారి పేర్లు కూడా చెప్పకుండా పోరాటం చేస్తామనడం మేడమ్ కే చెల్లింది. అసలు అన్యాయం జరుగుతుందా లేదా అన్న విషయం కూడా చెప్పలేదు. తెలంగాణకొచ్చే చుక్క నీరు కూడా వదలరట...దాని కోసం ఎవరితోనైనా పోరాడతారంట... ఇది షర్మిల మేడమ్ ట్వీట్.  ఈ ట్వీట్ పెట్టడానికి కూడా చాలా టైమ్ తీసుకుంది అక్క. ఆర్డీఎస్ కుడికాలువ గొడవ ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ చిచ్చు రేపింది. తాము ప్రాజెక్టు నిండాకే నీళ్లు తీసుకెళ్లడానికే కుడికాలువ నిర్మిస్తున్నట్లు ఏపీ వాదిస్తుంది. అయితే దానికి అనుమతి లేదని..దిగువ ప్రాజెక్టులు నిండకుండానే..వచ్చినవి వచ్చినట్లు నీళ్లు గుంజుకోవడానికే ఈ పని చేస్తున్నారని తెలంగాణ చెబుతోంది. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. ముందు ప్రశాంత్ రెడ్డి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఏపీపై మండిపడ్డారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఆంధ్రోళ్లు అనే పదాలు కూడా వచ్చాయి. అయితే దీని మీద ఏపీ మంత్రులు మాత్రం మెత్తగానే మాట్లాడుతూ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఏపీలోని ప్రతిపక్షాలు కూడా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం ఆపకూడదని డిమాండ్ చేస్తున్నాయి. వ్యవహారం ఇలా నడుస్తుంటే..న్యూఎంట్రీ షర్మిల ఒక ట్వీట్ చేశారు. ఆమె వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి..ఇక్కడ మాత్రం తెలంగాణ కోడలినని చెబుతోంది. తెలంగాణ కోసమే తాను పుట్టానన్నంత రేంజ్ లో డైలాగులు వదులుతూ..రాజకీయ ప్రస్థానం సాగించాలని చూస్తున్నారు.ఇప్పుడీ జలవివాదం కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఏపీ తప్పు చేస్తుందని చెప్పలేరు.. పైగా రాయలసీమ బిడ్డ..ప్రాజెక్టు అక్కడిదే. జగనన్నను అసలే అనలేరు. అలా అని తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సైలెంటుగా ఉంటే రాజకీయంగా నష్టం. అందుకే అటు ఇటు కాకుండా తెలంగాణకొచ్చే చుక్కనీరు వదులుకోం.. ఎవరితోనైనా పోరాటానికి సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం సరైందో కాదో చెప్పలేదు. ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తుందో ఒప్పు చేస్తుందో చెప్పలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనీ చెప్పలేదు. అవన్నీ లేకుండా పోరాటమనే ట్వీట్ మాత్రం చేసేశారు. ఇదే ఇప్పుడు కామెడీ అయిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై కామెంట్లు మొదలయ్యాయి. మొదటి నుంచి ఆవిడేదో జగనన్నతో గొడవపడి వచ్చినట్లు... తెలంగాణ ఏదో మేడమ్ కు బాకీ ఉన్నట్లు..ఇక్కడికొచ్చి పార్టీ పెడుతున్నట్లు చెప్పడం..హైప్ కోసం రకరకాల హైడ్రామాలు నడిపించడం..అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కి ఏదో తానే ప్రత్యామ్నాయం అన్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ డైలాగులు వదులుతుండటం..ఇవన్నీకూడా జనానికి అర్ధం కాకుండా ఉన్నాయి. ఆమె లక్ష్యం అధికారమే..ఈమె ఎవరికి మేలు చేస్తుంది..ఎవరికి నష్టం చేస్తుందనే విశ్లేషణలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఆర్డీఎస్ జల వివాదంపై మేడమ్ ట్వీట్.. ఆమె వైఖరి ఏంటో... ఆమె ప్రోగ్రామ్ ఏంటో అర్ధమయ్యేలానే ఉన్నాయి.

రేవంత్‌తో 'రెడ్ల' క‌ళ్ల‌ల్లో ఆనందం.. అధికారం కోసం ఏక‌మ‌య్యే ప్ర‌య‌త్నం?

రెడ్డి. పాలించ‌డానికే ఉన్నామ‌నేది ఆ వ‌ర్గం భావ‌న‌. అధికారం లేకుండా వాళ్లు మ‌న‌శ్శాంతిగా ఉండ‌లేరంటారు. ప‌వ‌ర్ వాళ్ల చేతిలో లేకున్నా.. ప‌వ‌ర్ సెంట‌ర్ మాత్రం వాళ్లే. తెలంగాణ‌లో ఏండ్లుగా రెడ్డి వ‌ర్గానిదే ఆధిప‌త్యం, అధికారం. ఇప్ప‌టికీ గ్రామాలు వారి గుప్పిట్లోనే ఉంటాయి. తెలంగాణ‌లో అనేక ఊళ్ల‌ల్లో రెడ్డి చెప్పిందే వేదం. ఆయ‌న సూచించిన‌ వారికే ఓటు. ఇక న‌ల్గొండ జిల్లా పాలిటిక్స్‌లోనైతే రెడ్డి డామినేష‌న్ అంతా ఇంతా కాదు. ఏ పార్టీ తీసుకున్నా.. ఏ ప్రాంతం తీసుకున్నా.. రెడ్డి నాయ‌కుల‌దే హ‌వా. వారికి వారే పోటీ. వారికి వారే సాటి. ఆఖ‌రికి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైనా.. రెడ్డి నేత క‌నుస‌న్న‌ల్లోనే పాల‌న న‌డుస్తుంది. ఇంటి పాలేరును.. త‌మ ప్ర‌తినిధిగా అసెంబ్లీకి పంపిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. అంత‌టి ఆధిప‌త్యం ఉన్న రెడ్ల ఆధిప‌త్యానికి తొలిసారి కేసీఆర్ రూపంలో అవ‌రోధం ఎదురైంది. ఏడేళ్లుగా ముఖ్య‌మంత్రి పీఠానికి దూర‌మై.. అదును, అవ‌కాశం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు రెడ్డి నాయ‌కులు.  ముఖ్య‌మంత్రి రెడ్డి కాక‌పోయినా... తెలంగాణ‌లో ముఖ్య‌మైన ప‌ద‌వుల‌న్నీ రెడ్ల చేతిలోనే ఉన్నాయంటారు. మంత్రి వ‌ర్గంలో వారిది చెప్పుకోద‌గ్గ సంఖ్య‌. కేసీఆర్ కుటుంబం మిన‌హా మిగ‌తా వెల‌మ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ద‌క్కిన ఉదాహార‌ణ‌లు త‌క్కువే. సీఎంవో నుంచి కీల‌క ప్ర‌భుత్వ విభాగాల వ‌ర‌కూ.. అన్నిచోట్లా రెడ్డి అధికారుల‌దే హ‌వా. ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా.. వారి ఆధిప‌త్యం లేనిదే ప్ర‌భుత్వ మ‌నుగ‌డ సాధ్యం కాదంటారు.  గ‌త కొంత‌కాలంగా వివిధ విభాగాల్లో ఉన్న‌ రెడ్డి అధికారులు.. రేవంత్‌రెడ్డికి స‌హ‌క‌రిస్తున్నార‌నే టాక్ ఉంది. ప్ర‌భుత్వ అధికారిక స‌మాచారాన్ని లీక్ చేస్తున్నార‌ని.. స‌ర్కారు లొసుగుల‌ను రేవంత్‌రెడ్డికి ఉప్పు అందిస్తున్నార‌నే అనుమానం వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి త‌న వ‌ర్గీయుల ద్వారా రాబ‌ట్టిన వివ‌రాల ఆధారంగానే త‌న స్నేహితుడైన ఓ మీడియా డాన్‌కు ఆ ఇన్ఫ‌ర్మేష‌న్ లీక్ చేసి.. ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ స‌న్నిహితుల ఆర్థిక లావాదేవీల‌ను, అక్ర‌మాల‌ను బ్రేకింగ్ న్యూస్‌గా న‌డిపిస్తున్నార‌ని అంటున్నారు. అంతెందుకు, టీఆర్ఎస్‌పార్టీ అధికారిక మీడియాలో కీల‌క స్థానంలో ఉన్న రెడ్డి ఉద్యోగుల‌ను ఇటీవ‌ల కాలంలో వ‌న్ బై వ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. వారిన‌లా సైడ్ చేయ‌డానికి కార‌ణం.. వారు లోపాయికారీగా రేవంత్‌రెడ్డికి స‌హ‌క‌రిస్తున్నార‌నే స‌మాచారం కేసీఆర్ చెవిన ప‌డ‌ట‌మే అంటున్నారు. ఇలా, ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్ప‌గ‌ల స‌త్తా ఉంది కాబట్టే.. అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లం, బ‌ల‌గం ఎవరినైనా భ‌య‌పెట్ట‌క మాన‌దు. గ‌ట్టిపిండం కేసీఆర్ కాబ‌ట్టి.. ఆ వ‌ర్గాన్ని ఎక్క‌డా త‌క్కువ చేయ‌కుండా, వారి ప్రాధాన్యం అలానే కొన‌సాగిస్తూ.. జాగ్ర‌త్త‌గా మేనేజ్ చేసుకు వ‌స్తున్నారని చెబుతారు.  అయినా.. ఆ వ‌ర్గం సంతృప్తిగా లేద‌ని.. ముఖ్య‌మంత్రి పీఠ‌మే వారి టార్గెట్ అని అంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఎంపిక‌య్యాక‌.. ఇప్పుడు మ‌ళ్లీ వారి క‌ళ్ల‌లో ఆనందం క‌నిపిస్తోంద‌ట‌. త‌మ వాడు ఎప్ప‌టికైనా సీఎం కాక‌పోతాడ‌నే ఆశ‌, అంచ‌నా వారిలో కొత్త ఉత్సాహం నింపుతోంద‌ట‌. అందుకే, వివిధ చోట్ల సెటిల్ అయిపోయిన రెడ్డి వ‌ర్గ‌మంతా మ‌ళ్లీ స‌మాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో రేవంత్‌రెడ్డికి స‌హ‌క‌రించి.. రాష్ట్రాన్ని త‌మ వాడి చేతిలో పెట్టాల‌నే ప్ర‌య‌త్నాలు చిగురు తొడుగుతున్నాయ‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని ఆ సామాజిక వ‌ర్గ‌మంతా త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చూస్తున్నారు. వైఎస్సార్ త‌ర్వాత‌.. తెలంగాణ‌లో త‌మ ఇమేజ్‌ను మ‌ళ్లీ ఆ స్థాయికి తీసుకొచ్చే లీడ‌ర్‌గా రేవంత్‌రెడ్డిపై అంచ‌నాలు పెంచేస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. రేవంత్‌రెడ్డిది అప్ప‌ర్ హ్యాండ్ అయ్యే టైమ్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేసి.. అప్పుడు రెడ్ల పున‌రేకీక‌ర‌ణ చేప‌ట్టేలా ఆ వ‌ర్గం పెద్ద‌లు మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. అయితే.. గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిలాంటి నేత‌.. పీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పోయి.. ఉత్త‌ర‌కుమారుడు వ‌చ్చాడంటూ సెటైర్లు వేయ‌డం.. ఇప్ప‌టికీ అనేక మంది బ‌ల‌మైన‌ రెడ్డి నాయ‌కులు కేసీఆర్ వెన్నంటే ఉన్నార‌నే విష‌యం గుర్తు చేస్తోంది. మ‌రి, చూడాలి.. రేవంత్‌రెడ్డి దూకుడుతో.. రెడ్డి రాజ‌కీయం ఎలా మారుతుందో....

హైదరాబాద్ లో రెండు ఇళ్లున్నాయి.. జాగ్రత్త! నానికి తెలంగాణ మంత్రి వార్నింగ్

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోటాపోటీగా హాట్ కామెంట్లు చేస్తూ కాక రేపుతున్నారు. కృష్ణా జలాల అంశంలో ఏపీ సీఎం జగన్ తో పాటు దివంగత వైఎస్సార్ ను తెలంగాణ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు కొందరు ఏపీ మంత్రులు కౌంటరిచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.  ఏపీ మంత్రి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురుంచి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తమ పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.  పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారన్నారు.  ఆ ఆశలకు  గండికొడుతూ జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారని  శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.  

అన్న‌తో పోరాటానికి చెల్లెమ్మ‌ సై.. జ‌గ‌న్‌పై ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్‌.. ఇక జ‌గ‌డ‌మే..

కొన్నిరోజులుగా రెండు తెలుగురాష్ట్రాల మ‌ధ్య వాట‌ర్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఏకంగా కేబినెట్ మీటింగ్‌లోనే సీఎం కేసీఆర్ ఏపీ ప్రాజెక్టుల‌పై విరుచుకుప‌డ్డారు. కేంద్రానికీ ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ మంత్రులైతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కుల‌ను మాట‌ల‌తో ఓ తూట్లుపొడుస్తున్నారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని.. ఆయ‌న కొడుకు జ‌గ‌న్‌రెడ్డినీ వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు. వైఎస్సార్ నీళ్ల దొంగ అయితే.. జ‌గ‌న్ గ‌జ‌దొంగ అంటూ ఘోరంగా అవ‌మానిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నారంటూ మండిప‌డుతున్నారు. తెలంగాణ మంత్రులు ఇంత‌గా నోరు పారేసుకుంటున్నా.. పౌరుషం ఉన్న క‌డ‌ప‌ బిడ్డ‌న‌ని చెప్పుకునే సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాత్రం నోరు తెర‌వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. అటు, ఏపీ మంత్రులు సైతం సుతిమెత్త‌గా తెలంగాణ మంత్రుల మాట‌ల‌ను ఖండిస్తున్నారే కానీ, ఇంత వ‌ర‌కూ అటునుంచి గట్టి కౌంట‌ర్ ప‌డ‌నే లేదు. ఏపీ విష‌యం ప‌క్క‌న‌పెడితే.... ఏపీ ప్రాజెక్టుల వ‌ల్ల తెలంగాణ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటున్నాయ‌ని మంత్రులంతా మొత్తుకుంటుంటే.. తెలంగాణ కోడ‌లినంటూ, రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ రాజ‌కీయాల్లోకి రాబోతున్న వైఎస్ ష‌ర్మిల ఈ జ‌ల వివాదంపై ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ష‌ర్మిల రాజ‌కీయ చిత్త‌శుద్ధిపై అనుమానాలు కోడై కూస్తున్నాయి. గ‌తంలో తెలంగాణ కోసం అది చేస్తా, ఇది చేస్తానంటూ గొప్ప‌లు చెప్పిన ష‌ర్మిల‌.. రెండు రాష్ట్రాల మ‌ధ్య వాట‌ర్ వార్‌పై ఎందుకు మాట్లాడ‌టం లేదంటూ తెలంగాణ వాదుల నుంచి నిల‌దీత మొద‌లైంది. ఏపీ సీఎంగా త‌న అన్న జ‌గ‌న్ ఉన్నందుకే.. జ‌ల‌జ‌గ‌డంపై ష‌ర్మిల మౌనం వ‌హిస్తున్నారా? అంటూ నిగ్గ‌దీసి అడుగుతోంది తెలంగాణ స‌మాజం. ఇలా, ష‌ర్మిల‌పై అనుమాన‌పు మాట‌ల తూటాలు వెల్లువెత్తుతుండ‌టంతో.. లేటైనా.. లేటెస్టుగా స్పందించారు వైఎస్ ష‌ర్మిల‌.  తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు గ‌తంలో పార్టీ స‌న్నాహ‌కాల్లో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడిన మాట‌ల వీడియోనూ షేర్ చేశారు. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామ‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ‌తా.. కొట్లాడుతా..నంటూ పంచ్ డైలాగ్‌తో ఉన్న వీడియోను ఇప్పుడు మ‌రోసారి షేర్ చేశారు వైఎస్‌ ష‌ర్మిల‌.   అయితే, తాజా జ‌ల జ‌గ‌డంపై ష‌ర్మిల నేరుగా స్పందించ‌కుండా.. డొంక తిరుగుడు స‌మాధానం చెప్పిందంటున్నారు విమ‌ర్శ‌కులు. ఎప్పుడో మూడు నెల‌ల క్రితం చేసిన స్టేట్‌మెంట్స్‌ను సేమ్ టు సేమ్ అలానే ట్వీట్ చేసి.. తాను తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌నే అర్థం వ‌చ్చేలా త‌న స్టాండ్ స్ప‌ష్టం చేశార‌ని అంటున్నారు. అయితే, స్టాండ్ ఓకే.. బ‌ట్‌, ప్ర‌స్తుత గొడ‌వ‌పై జ‌గ‌న్‌ను ఎదిరిస్తారా? లేదా? అని నేరుగా మాత్రం చెప్ప‌లేదు. అయితే, ఆమె మాట‌లని బ‌ట్టి చూస్తుంటే.. అవ‌స‌ర‌మైతే ఎవ‌రితోనైనా పోరాడ‌డానికైనా మేము సిద్ధం.. అంటే.. ఆ ఎవ‌రు ఇంకెవ‌రు.. త‌న అన్న అయిన‌ ఏపీ సీఎం జ‌గన్మోహ‌న్‌రెడ్డితోనేగా పోరాటం అని స్ప‌ష్టం చేస్తున్నారు ష‌ర్మిల అభిమానులు. ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామ‌ని అంటే.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు-ఆర్డీఎస్‌ను కూడా అడ్డుకుంటాన‌నేగా అర్థం అని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ‌తా.. కొట్లాడ‌తా.. అంటూ ఏపీతోనే క‌దా ఆమె కొట్లాడేది.. ఇంత‌కంటే సూటిగా ఇంకేం చెబుతారంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు ష‌ర్మిల అనుచ‌రులు. సో, ష‌ర్మిల తాజా ట్వీట్‌తో ఇక ముందుముందు అన్నాచెల్లెల్ల మ‌ధ్య నీళ్ల‌ యుద్ధం త‌ప్ప‌క‌పోవ‌చ్చు అంటున్నారు. మ‌రి, అన్న మీద ఉత్తుత్తి పోరాటం చేస్తుందో.. లేక‌, జ‌ల‌ఖ‌డ్గం రువ్వుతుందో చూడాలి..  ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏంటంటే.. త‌న తండ్రిని నీళ్ల‌దొంగ‌, త‌న అన్న‌ను గ‌జ‌దొంగ అంటున్న తెలంగాణ మంత్రుల ఆరోప‌ణ‌ల‌ను క‌నీసం ఖండించ‌నూ లేదు వైఎస్ ష‌ర్మిల‌. ఏ రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారో.. అదే రాజ‌న్న‌ను తెలంగాణ నీళ్లు దోచుకున్న నీళ్ల‌దొంగ అంటూ మంత్రులు మాట్లాడినా.. ఆ రాజ‌న్న కూతురైన ష‌ర్మిల ఆ విష‌యాన్ని అస‌లేం ప‌ట్టించుకోన‌ట్టు.. వ‌దిలేయ‌డాన్ని ఏమ‌నుకోవాలి? త‌న అన్న జ‌గ‌న‌న్న‌ను గ‌జ‌దొంగ అంటున్నా.. ఆమె మౌనం వ‌హించ‌డాన్ని ఎలా చూడాలి? అంటే, ష‌ర్మిల మౌనం అర్థ అంగీకారం అనుకోవాలా? వైఎస్సార్ నీళ్ల‌దొంగ‌, జ‌గ‌న్ గ‌జ‌దొంగ అనే ఆరోప‌ణ‌ల‌ను ఆమె ఆమోదిస్తున్న‌ట్టేనా? లేదంటే, ఆ మాట‌ల‌ను ఎందుకు ఖండించ‌లేదు? త‌న పార్టీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం త‌న తండ్రిని, త‌న అన్న‌ను అంతేసి మాట‌లు అంటున్నా.. భ‌రిస్తున్నారా? ఆమె వ‌రుస చూస్తుంటే.. ష‌ర్మిల రాజ‌కీయంగా రాటుదేలిన‌ట్టేనా? ష‌ర్మిల‌ రాజ‌కీయ అరంగేట్రానికి ఆదిలోనే జ‌ల‌వివాదం అగ్నిప‌రీక్ష‌గా నిలవ‌డం ఆస‌క్తి రేపుతోంది....  

చిరంజీవిపై కాంగ్రెస్ నేత సంచలన కామెంట్లు..

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో... తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఏపీలోనూ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ చేసినట్లు ఉంది. అందుకే రెండు రోజుల పర్యటనకు ఏపీ వచ్చారు ఉమెన్ చాందీ. ఏపీలో పార్టీ పరిస్థితిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి. అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ 18 అసెంబ్లీ సీట్లు గెలిచింది. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చిరంజీవి. ఆ తర్వాత చిరంజీవిని రాజ్యసభకు పంపి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్. రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ ఏపీలో ఘోరంగా ఓడిపోవడంతో చిరంజీవి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు చిరంజీవి. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాలు కొనసాగిస్తున్నప్పటికీ.. చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. సినిమాలపై దృష్టి సారించారు.  కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవిపై తాజాగా ఉమెన్ చాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆయన అన్నారు. వచ్చే నెల 7 నుంచి 17 వరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఉమెన్ చాందీ‌తో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే ఈ నిరసనల్లో చిరంజీవి పాల్గొంటారా ? అని కొందరు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఉమెన్ చాందీ.. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో చిరంజీవి బంధం ముగిసిపోయిందనే అంశంపై ఆ పార్టీ దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌తో చిరంజీవి బంధం పూర్తిగా ముగిసిపోయిందని తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపాలని ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఉమెన్ చాంధీ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. 

అసత్యాలు.. ఉత్తమాటలు.. నిరుద్యోగులకు సజ్జల స్పెషల్ క్లాస్! 

మీరు ఏడడుగులే వేయలేకపోతున్నారు... నేను వెయ్యి అడుగులు వేస్తాను..నాకు అవకాశం ఇవ్వండి అంటూ అప్పుడు ఊదరగొట్టారు. సోషల్ మీడియాలో అంతకు మించి అదరగొట్టారు. అవన్నీ చూసి నిజమే అనుకున్నారు చాలామంది. అవకాశం వచ్చింది. ఇప్పుడు వెయ్యి అడుగులు వేయవేమీ సామీ అంటే... అంతకు ముందు ఎన్నిఅడుగులు వేశారు... రెండేళ్లలోనే అన్ని అడగులు వేయాలా.. అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు వైసీపీ నేతలు. తాము చెప్పింది మర్చిపోయి... కంపేరిజన్ కథలు మొదలెట్టారు వారు. ఏదో సామెత చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ.. తిట్లు తింటున్నారు వైసీపీ పెద్దలు. అప్పటిదాకా ఆశతో ఎదురుచూసిన యువత.. ఆ క్యాలెండర్ చూడగానే కడుపు మండి రోడ్డుమీదకొచ్చేశారు. ఇది ఇప్పట్లో చల్లారేలా కూడా కనపడటం లేదు.  నిరుద్యోగుల సెగ గట్టిగానే తగిలినట్లుంది వైసీపీ ప్రభుత్వానికి. అందుకే మాటలు, లెక్కలు అన్నీమార్చేసి మరీ..కొత్త కథ వినిపించడానికి ముందుకొచ్చేశారు ప్రభుత్వ మీడియా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేంటో విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పాల్సిన సమాధానాలను.. ఈయన చెప్పటానికి వచ్చేశారు. అబద్ధాలను నిజాలుగా చెప్పాలన్నా.. దబాయించాలన్నా..కాస్త ట్యాలెంట్ కావాలి కదా...పాపం ఆదిమూలపు సురేష్ గారికి అది కాస్త తక్కువ ఉన్నట్లుంది...ఆ విషయంలో పర్ ఫెక్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి సార్ వచ్చేశారు. ఆయనేం చెప్పారంటే.. టీడీపీ గత ఐదేళ్లలో 34 వేల టీచర్ ఉద్యోగాలే ఇచ్చింది. మేమొచ్చి రెండేళ్లే కదా..అప్పుడే ఎలా ఇస్తాం ..ఇంకా టైమ్ పడుతుంది..వెయిట్ చేయండి అంటూ సెలవిచ్చారు. ఈ ముక్క జగనన్న ప్రచారంలో చెప్పలేదు కదా..అప్పుడు ప్రతి ఏడాది ఉద్యోగాలిస్తామని..డీఎస్సీ నోటిఫికేసన్ ఇస్తామని.. అసలు చుక్కలు చూపించారు కదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఇంకో మాట కూడా సెలవిచ్చారు సజ్జలవారు. అదేంటంటే ..టీచర్లు, విద్యార్ధుల మైండ్ సెట్ మార్చాలంట... ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వస్తున్నాయి..వాటికి తగ్గట్లు మారాలని కూడా అందరూ గైడ్ చేయాలట..అది వదిలేసి ఉద్యోగాలని మా మీద పడతారేంటి అంటూ కొత్త డైలాగులు వేశారు. అంటే ఉన్న టీచర్లు పనికిరారు..వాళ్లనీ మార్చేస్తారా? అసలు ఖాళీలెన్ని ఉన్నాయి.. వాటిని ఎందుకు నింపటం లేదని ప్రజాసంఘాలు సూటిగా అడుగుతున్న ప్రశ్నకు మాత్రం సజ్జల సమాధానం చెప్పలేదు. పైగా ఇంగ్లీషు మీడియం దెబ్బకు ఉన్న టీచర్లే కాకుండా..క్వాలిఫైడ్ నిరుద్యోగులు సైతం వెనక్కి పోవాల్సిందేనన్నట్లు సజ్జల వినిపించారు. ఇంగ్లీషు మీడియం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గ రిక్రూట్ మెంట్ చేయాలి...ఉన్నవారిని ట్రెయినింగ్ చేయాలి..అవన్నీవదిలేసి..ముఖ్యమంత్రి ఏమో ఇంగ్లీషు మీడియం అంటూ ఊదరగొడుతున్నారు. కింద మాత్రం దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం లేదు.. అధికారులకు బడ్జెట్ కనపడుతోంది..అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం కనపడుతోంది. కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు..అడిగిన డిమాండ్లపైన వివరణ ఇవ్వకుండా...ఏదేదో మాట్లాడి వెళ్లడం సజ్జలకే చెల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ సంఘాలు చాలా స్పష్టంగా లెక్కలిచ్చారు. ఎన్నిఖాళీలెన్ని ఉన్నాయో చెప్పారు. కాని అన్ని ఖాళీలు ఉన్నాయా లేవా అన్న స్పష్టత కూడా ఇవ్వలేదు..పైగా మైండ్ సెట్ మారాలంటూ టీచర్లకు, విద్యార్ధులకు, నిరుద్యోగులకు అందరికీ క్లాసు పీకి వెళ్లిపోయారు. ఇంకా కొసమెరుపు ఏంటంటే.. ఉద్యమం చేస్తుంది నిరుద్యోగులైతే..వాళ్లేదో టీడీపీ వాళ్లన్నట్లు...మీ నాయకుడు చంద్రబాబు ఇప్పటికే దెబ్బతిన్నారు.. మీరు కూడా చూసుకోండి అన్నారు..అంటే ఏంటో..ఆయనకే తెలియాలి..మహానుభావుడు.  

ఏడేళ్ళైనా ఇంకా అదే ఏడుపు.. ఓట్ల కోసం చిల్లర ఎత్తులు! 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమే జరిగిందో, అన్యాయమే జరిగిందో, అది ఇప్పుడు అప్రస్తుతం.ఆ చర్చ ఇప్పుడు అనవసరం. రాష్ట్రం  విడిపోయి ఏడేళ్ళు గడిచి పోయాయి. ఈ ఏడేళ్ళుగానూ, తెరాసనే అధికారంలో వుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడేళ్ళలో అద్భుతాలు  సృష్టించామని,  రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, ఆయనే స్వయంగా  చాటింపు వేసుకున్నారు.  ఇదీ అదీ అని కాదు, అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు తీస్తోందని ఆయనే  చెప్పుకుంటారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో, కాళేశ్వరం  సహా అనేక ప్రాజెక్టులు కట్టేశాం, సాగు నీటి  సమస్య తీరిపోయింది, ఇప్పుడు దేశంలోనే ధాన్యం పంటలో పంజాబ్, ఏపీని దాటేసే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాం,అంటారు.అలాంటప్పుడు,ఇంకా ఈ జల వివాదాలు, ఎక్కువ తక్కువ మాటలు ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసం ఎన్ని వేసాహాలు అయిన వేసేందుకు తండ్రీ కొడుకులు సిద్ధమని జనం ఛీ కొడుతున్నారు.   ఆంధ్ర పాలకులను తలచుకోకుండా ఆయనకు పూట గడవదు. ఆంధ్ర ప్రజల ప్రస్తావన లేకుండా, తెలంగాణ  సెంటిమెంట్’ను జత చేయకుండా  ఆయన ఎన్నికల నావ అంగుళం కదలదు. ఎంత సేపు ఆంద్రోళ్ళు, ఆంధ్రపాలకులు అన్యాయం, దోపిడీ అంటూ గొంతు చించుకుని  చిందులేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల  మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక  రకమైన భావదారిద్ర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఏ ఎండకా గొడుగు, అన్నట్లుగా ఎన్నిక ఎన్నికకు తెరాస స్వరం సిగ్గు విడిచి మారిపోతుంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంద్రోళ్ళు మంచోళ్ళు, వారి కాల్లో ముల్లు గుచ్చుకుంటే, ఈయన గారు తమ పంటితో తీస్తారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తారు అవసరం అయితే, శ్రీ కేటీఆర్  స్వయంగా విశాఖ వెళ్లి దీక్ష చేస్తారు. ఇదంతా ఎంతవరకంటే,  జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు. ఆ తర్వాత, ఆంద్రోడు ఆంద్రోడే, లంకలో నివసించే వాళ్ళంతా రాక్షసులే అంటూ విద్వేషం, విషం షరా మాములుగా తెరపి కొస్తుంది. ఇక  ఆ నోటికి హద్దు అదుపు ఉండదని, హైదరాబాద్ ఆంద్రోళ్ళు అంటున్నారు. ఇదీ అందరికీ తెలిసిన తెరాస, కేసీఆర్ నైజం . సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఆయన నైజం. ఇప్పుడు కాదు, ఉద్యమ కాలంలోనో ఇదే తీరు. సెంటిమెంట్’ను ఏటీఎం కార్డులా ఉపయోగించుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తులు.  అందుకే ఇప్పుడు, హుజురాబాద్ ఉపఎన్నిక కోసం తెరాస మంత్రులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరున సెంటిమెంట్స్’ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అన్ని సందర్భాలలో అందరినీ మోసం చేయడం ఎంతటి వారికైనామ చివరకు ఆ విద్యలో ఆరితేరిన మహా మాయగాడు  కేసీఆర్’కే అయినా సాధ్యం కాదని తెలంగాణ ప్రజలే అంటున్నారు.  నిజానికి, తెలంగాణా సెంటిమెంట్’ను కేసీఆర్, తెరాస ఇప్పటికే చాలా ఎక్కువగా, చివరకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్’ను కూడా దాటి  ఉపయోగించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకునే, రాజకీయ పునరేకీకరణ పేరిట  ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. కారెక్కించి, సంతలో పశువులను తోలుకు పోయినట్లు తోలుకు పోయారు.  ప్రతి ఎన్నికల్లోనో సెంటిమెంట్’ను ఉపయోగించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్’తో పొత్తు పెట్టుకుని పోటీచేసిన తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి, సెంటిమెంట్ పండించారు.  ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కృష్ణా జలాల వివాదాన్ని తెచ్చి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా ఎగువ రాష్ట్రాలు జల దోపిడీకి పాల్పడతాయి, దిగువ రాష్ట్రాలు అన్యాయయానికి గురవుతాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా దిగువ  రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందనే అర్థం లేని వితండ  వాదాన్ని వినిపిస్తున్నారు. ఒక విధంగా కేసీఆర్,తనను తానూ మోసం చేసుకుంటూ, ఉభయ తెలుగు రాష్ట్త్రాల ప్రజలను ఫూల్స్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అయితే, అది అన్ని సందర్భాలలో  సాధ్యం కాదని, సామాన్య జనం కూడా గుర్తించారు.  ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో చంద్రబాబు పేరు తీసుకుని,ఆయనే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించారని మోకాలుకు బోడిగుండుకు ముడివేసి,మళ్ళీ మరో సారి తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు నాయుడును బూచిగా చూపించే ఎత్తుగడ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగు  దేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి, ఆయనకు  చంద్రబాబుతో సంబంధాలు, ఆంధ్రా వాసనలు ఉన్నాయని అనుకుంటే, కేసీఆర్ తో  సహా ఆయన మంత్రి వర్గంలో మూడొంతుల మంది  వాళ్ళే కదా ... ఎన్టీఅర్, చంద్రబాబు పుణ్యానే కదా ఈరోజు .. ఈ స్థితిలో ఉన్నారు.  ఏమైనా ... రాష్ట్రం విడిపోయి ఏడేళ్ళు అయినా ఇంకా అదే ఏడుపు ఏడవడం ... కేసీఆర్ దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందనేది నేటి జనవాక్యం.

తిట్టిన వీహెచ్ కు పరామర్శ.. తొలి రోజు రేవంత్ అదుర్స్..

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపికైన ఎంపీ రేవంత్ రెడ్డి తన దైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పార్టీలో నేతలందరిని కలుస్తూ మద్దతు తీసుకుంటున్నారు. దూకుడుగా వెళతారనే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ పగ్గాలు వచ్చాక మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఏఐసీసీ ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అయితే సోమవారం మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుపోయారు. పార్టీలోని సీనియర్ నేతలను కలిశారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.  పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించవద్దని బహిరంగంగానే చెప్పారు మాజీ ఎంపీ వీ హనుమంతరావు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వీహెచ్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. హైదర్ గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  వి.హనుమంతరావును పరామర్శించారు రేవంత్ రెడ్డి. ఆయన అరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు రేవంత్ రెడ్డి.   సీనియర్ నేత వి.హనుమంతరావు సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని అన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడిందన్నారు. హాస్పిటల్‌లో ఉన్నా.. ప్రజా సమస్యలపైనే వీహెచ్ దృష్టి  అన్నారు. వాటిపైనే తనతో చర్చించారని తెలిపారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్‌గా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు వీహెచ్‌ సూచించారని చెప్పారు.  పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు. వీహెచ్ సూచనలను మేడమ్ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తానన్నారు రేవంత్ రెడ్డి.  హాస్పిటల్ లో రేవంత్, వీహెచ్ ఇంకా ఏమనుకున్నారంటే..  వీహెచ్: తమ్మీ కంగ్రాట్స్, నీకు పీసీసీ ఇవ్వొద్దన్నానని మనసులో పెట్టుకోకు రేవంత్ : ఊకో అన్న.. అదేం ఉండదు. నాకు రావద్దని లోలోపల కుట్రలు చేసినోళ్ల కన్నా.... మనసులో మాట డైరెక్ట్ గా చెప్పిన నువ్వంటేనే నాకిష్టం. నీ పాణం మంచిగైనంక ఢిల్లీకి పోయోద్దాం వీహెచ్: గట్లనే తమ్మీ..