ఓవ‌ర్ టూ మోదీ.. ఢిల్లీలో ద‌బిడి దిడిడే...

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వాట‌ర్ వార్ ముదురుతోంది. తెలంగాణ దూకుడుతో నీళ్ల‌లో మంట రాజుకుంటోంది. ఏపీ ఇంకా డిఫెన్స్ గేమే ఆడుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల‌లో అడుగంటిన నీటి నుంచి కూడా తెలంగాణ స‌ర్కారు విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నా అడ్డుకోలేని దుస్థితి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానిది. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర ఇరు రాష్ట్ర పోలీసులు మోహ‌రించ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి. తెలంగాణ మంత్రులు సీఎం జ‌గ‌న్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నా.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నార్థం నోరుమెద‌ప‌డం లేదంటూ మౌన‌రుషిగా మారిపోయారు ఏపీ సీఎం. ఎవ‌రి వాద‌న‌కు వారు క‌ట్టుబ‌డి ఉండ‌టంతో.. జ‌ల వివాదం ఇప్ప‌ట్లో తెగేలా లేదు. ఈ లోపు పుణ్య‌కాలం కాస్తా ముంచిపోతుండ‌టంతో.. సాగునీటికి ఏపీ రైతులు తీవ్ర ఇబ్బంది ప‌డాల్సి రావొచ్చు. అందుకే, మేట‌ర్‌ను వెంట‌నే పీఎం మోదీకి చెప్పాల‌ని డిసైడ్ అయ్యారు జ‌గ‌న్. ఐదు పేజీల లేఖ కూడా రాశారు. జ‌ల‌వివాదాన్ని మీరే తేల్చండంటూ కేంద్రం కోర్టులోకి బంతిని త‌న్ని.. ఇక చేసేదేమీ లేద‌న్నట్టు చేతులెత్తేశారు సీఎం జ‌గ‌న్.  ఉమ్మ‌డి ప్రాజెక్టుల ద‌గ్గ‌ర‌ కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాయ‌డంతో.. తెలంగాణ స‌ర్కారు సైతం అల‌ర్ట్ అయింది. మీరు లెట‌ర్ పోస్ట్ చేస్తే... మేము డైరెక్ట్‌గా వెళ్లి క‌లుస్తామ‌న్న‌ట్టు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. తాడోపేడో ఢిల్లీలోనే తేల్చుకోవాల‌ని ఇరు రాష్ట్రాలు డిసైడ్ అయిన‌ట్టున్నాయి. నీటి వివాదాన్ని తెగేదాకా లాగేందుకు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు రెడీ అయిపోయారు. వారు వారు బానే ఉంటారు.. వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలూ బానే ఉంటాయి. మ‌ధ్య‌లో రైతులే బ‌ల‌య్యేది.   సీఎం కేసీఆర్ దూకుడు మ‌రింత పెంచుతున్నారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు లేకపోయినా.. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడాన్ని ఇటీవలి కేబినెట్‌ సమావేశంలో తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ధర్నా చేస్తామని కూడా వ్యాఖ్యానించారు. అందులో భాగంగా ముందుగా తాను ఢిల్లీ వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రెండు, మూడు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని స‌మాచారం. ప్ర‌ధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసమూ ట్రై చేస్తోంది తెలంగాణ స‌ర్కారు.  ప్రధాని మోదీతో పాటు జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి సీఎం కేసీఆర్‌ ఫిర్యాదు చేస్తార‌ని నీటిపారుదల శాఖ అధికార వర్గాల మాట‌. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956లోని నిబంధనల ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ వేయాలని సీఎం కేసీఆర్‌ కోరనున్నారని అంటున్నారు. ట్రైబ్యున‌ల్‌ ఏర్పాటుకు ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది. ట్రైబ్యునల్‌ కోసం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయగా.. కేంద్రం సూచనతో దానిని వెనక్కి కూడా తీసుకుంది. అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ దిశ‌గా ఎలాంటి అడుగులు ప‌డ‌క‌పోవ‌డంతో మ‌రోసారి పీఎం మోదీని క‌లిసి ట్రైబ్యున‌ల్ ఏర్పాటుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు సీఎం కేసీఆర్‌.  ఇలా, తెలంగాణ స‌ర్కారు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం చ‌ర్చ‌ల‌కు సిద్ధం, లేఖ‌లు రాస్తాం.. అంటూ కాల‌యాప‌న చేస్తున్నార‌నే విమ‌ర్శ విన‌బ‌డుతోంది. త‌న‌ను, త‌న తండ్రి వైఎస్సార్‌నున అంతేసి మాట‌లంటున్నా.. మౌనంగా ప‌డుతున్నారే గానీ.. తిరిగి గట్టిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోవ‌డం వెనుక‌.. మ‌ర్మ‌మేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌లోని ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మే.. గిచ్చితే గిల్లించుకుంటున్నార‌నే ఆరోప‌ణ కూడా ఉంది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల్లో భావోద్రేకాలు రెచ్చ‌గొడుతుండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇద్ద‌రు సీఎంలు ప‌ర‌స్ప‌ర ఫిర్యాదుల‌తో ఇక రెండు రాష్ట్రాల వాట‌ర్ వార్‌.. ఢిల్లీకి షిఫ్ట్ అవుతుండ‌టంతో.. ముందుముందు ఏం జ‌ర‌గ‌బోతుందోన‌నే ఉత్కంఠ నెల‌కొంది.   

శిరీష ప్రొఫైల్ అదుర్స్‌.. అంత‌రిక్షంలో తెలుగు సంత‌కం..

మ‌న అమ్మాయి. మ‌న తెలుగు అమ్మాయి. ఆంధ్ర నుంచి అమెరికా వెళ్లింది. ఇప్పుడు అక్క‌డి నుంచి ఏకంగా అంత‌రిక్షంలోకే వెళ్ల‌నుంది. శూన్యంలో తెలుగు సంత‌కం చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఒక తెలుగుతేజం అంత‌రిక్షం దాకా ఎద‌గ‌డం సాటి తెలుగువారిగా మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. అమెరికా వర‌కు వెళ్ల‌డం కామ‌నే అయినా.. అంత‌రిక్ష ప్ర‌యాణం మాత్రం అసాధార‌ణం. అతికొద్దిమందికే అది సాధ్యం. ఆ గుప్పెడు మ‌నుషుల్లో మ‌న తెలుగు యువ‌తి కూడా ఉండ‌టం విశేషం. శ‌భాష్ శిరీష బండ్ల‌. మీ ఖ్యాతీ అజ‌రామ‌రం.  జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల ఒక‌రు. వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సస్‌, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. శిరీష బండ్లతో పాటు.. చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బెత్‌ మోసెస్‌, లీడ్‌ ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెన్నెట్‌ అంతరిక్ష యానం చేయబోతున్నారు.   శిరీష బండ్ల పుట్టింది.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు. తండ్రి బండ్ల మురళీధర్‌, తల్లి అనురాధ. ఇద్దరూ యూఎస్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్‌. శిరీష చిన్న‌ప్పుడు హోస్టన్‌లో ఉండ‌గా.. వాళ్ల ఇంటికి దగ్గర్లో ఓ స్పేస్‌ సెంటర్‌ ఉండేది. తరచూ వెళ్లేది. ఆస్ట్రోనాట్ కావాల‌నేది ఆమె చిన్న‌నాటి డ్రీమ్‌. ఇంటర్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌పైకి దృష్టిమ‌ళ్లింది.  ఇంజినీరింగ్‌ చదువుతూనే ఓ సంస్థలో ఇంటర్న్‌గా పనిచేసింది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది.. ఉద్యోగంలో చేరింది. ఆ త‌ర్వాత జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి స్పేస్‌ ఇండస్ట్రీలో ఎంబీఏ చేసింది. మాథ్యూ ఇసాకోయిజ్‌ ఫెలోషిప్‌ అవకాశమూ వచ్చింది. స్పేస్‌ పాలసీల గురించి నేర్చుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్స్‌ డిజైనింగ్‌తోపాటు కమర్షియల్‌ స్పేస్‌ ఇండస్ట్రీ పాలసీలపైనా పని చేసింది. 2015లో స్పేస్‌ టూరిజం సంస్థ అయిన వర్జిన్‌ గాలక్టిక్కి మారిపోయింది. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ మేనేజర్‌గా చేరి, వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగింది. 747 విమాన వాహకనౌక ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహం రూపకల్పనలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ‘ఎల్‌-3’ కమ్యూనికేషన్స్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. తాజాగా ఈ సంస్థ‌ ఈ నెల 11న ఒక టెస్ట్‌ స్పేస్‌ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనుంది. దీనిలో సంస్థ వ్యవస్థాపకుడు బ్రాన్‌సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించ నున్నారు. వాళ్లలో 30 ఏళ్ల శిరీష ఒకరు.  అంతరిక్షయానం చేయాలన్న తన చిన్ననాటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు శిరీష. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా-తానా శిరీషకు శుభాకాంక్షలు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిరీషను అభినందించారు. ‘‘శిరీష అంతరిక్షయానానికి ఎంపిక కావడం భారతీయులందరికీ గర్వ కారణం. ఈ బృందం నూతన అంతరిక్ష యుగానికి తెరతీస్తోంది. వారికి నా అభినందనలు’’ అని ట్వీట్‌ చేశారు. అంతరిక్షయానం చేయనున్న బండ్ల శిరీషది గుంటూరు జిల్లా. అమ్మమ్మ ఊరు తెనాలి. నాయనమ్మ ఊరు పల్నాడులోని పిడుగురాళ్ల‌. శిరీష తల్లి డాక్టర్‌ అనూరాధ. శిరీష తండ్రి మురళీధర్‌. తెనాలికి చెందిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బండ్ల పుల్లయ్యకు శిరీష మునిమనుమరాలు. అదేవిధంగా, పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన బండ్ల రాగయ్యకు మనవరాలు. ఈయన ఎన్జీరంగా అగ్రి వర్సిటీ ప్రిన్సిపల్‌ సైంటిస్టుగా పనిచేసి రిటైరయ్యారు. పుల్లయ్య మనవరాలు డాక్టర్‌ అనూరాధ డాక్టర్‌ బండ్ల మురళీధర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ప్రత్యూష, శిరీష ఇద్దరు పిల్లలు. శిరీష తన బాల్యం నుంచే అంతరిక్షయానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాత రాగయ్య తెలిపారు. --శిరీష సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటారు. మేథ్స్‌పై ఆసక్తి లేని వారికీ ఎన్ని మార్గాలున్నాయో తెలియచెప్పడం కోసం స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. --అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ, ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్లకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ కూడా. పర్‌డ్యూ యూనివర్సిటీ యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వయిజరీ కౌన్సెల్‌కు మెంబర్‌. --డాక్యుమెంటరీలు తీయడం శిరీష హాబీ. ఖాళీ సమయాల్లో మారథాన్‌ల్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది. నాన్‌వెజ్‌ అంటే ఇష్టం. పెరిగింది అమెరికాలోనేనైనా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీలున్నప్పుడల్లా మన దేశానికి వస్తుంటుంది. గత ఏడాది తనకు కాబోయే భర్తనూ తీసుకొచ్చింది. త్వరలో అత‌న్ని పెళ్లి చేసుకోబోతోంది.  --అంత‌రిక్ష యానం చేయ‌బోతున్న తెలుగు తేజం శిరీష్ బండ్ల‌కు తెలుగువ‌న్ త‌ర‌ఫున ఆల్ ది వెరీ బెస్ట్‌.

రేవంత్‌రెడ్డి రెడీ.. కాంగ్రెస్ హ‌స్త‌వాసి మారుతోంది..

ఏడేళ్లుగా కాంగ్రెస్‌ది క‌ష్టాల నావ‌. గులాబీ దెబ్బ‌కు హ‌స్తం పార్టీ అత‌లాకుత‌లం అవుతోంది. గెలిచేదే గుప్పెడు మంది. గెలిచాక వారిలో స‌గం మంది చేజారిపోతున్నారు. కారెక్కి తుర్రుమంటున్నారు. కాంగ్రెస్ త‌ల‌రాత మారేదెప్పుడా అని కేడ‌ర్ ఆశ‌గా ఎదురుచూస్తోంది. మ‌ళ్లీ గాంధీభ‌వ‌న్ నేత‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంపిక‌వ‌డంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్‌. మొన‌గాడు వ‌చ్చాడు.. కేసీఆర్‌ను దింపేస్తాడంటూ.. అప్పుడే గెలిచినంత సంబ‌ర‌ప‌డుతున్నారు. రేవంత్‌రెడ్డి రాక కోసం గాంధీ భ‌వ‌న్ ముస్తాబ‌వుతోంది. ఆయ‌న పాద‌స్ప‌ర్శ కోసం స‌రికొత్త హంగులు అద్దుకుంటోంది.  జులై 7న పీసీసీ అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న రాక సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్ దోషాలు స‌రి చేస్తున్నారు. రేవంత్‌తో కాంగ్రెస్‌కు ఎలాగూ మంచి జ‌రుగుతుంది. గాంధీభ‌వ‌న్ కూడా ఆయ‌న‌కు క‌లిసిరావాల‌ని పార్టీ భావిస్తోంది. అందుకోస‌మే.. ఏళ్లుగా గాంధీభ‌వ‌న్‌ను ప‌ట్టిపీడిస్తున్న‌ వాస్తు దోషాల‌ను ఇప్పుడు స‌రి చేస్తున్నారు. రేవంత్ వ‌చ్చేలోగా వాస్తును స‌రిదిద్ది.. గ్ర‌హాల‌న్నీ ఆయ‌న‌కు, పార్టీకి అనుకూలించాల‌ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేస్తున్నారు. గాంధీభ‌వ‌న్ వాస్తుమార్పుతో గ‌డ్డుకాలం పోయి.. మంచికాలం రావాల‌ని త‌పిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.  కొత్త అధ్యక్షుని రాకతో గాంధీభ‌వ‌న్‌కు సరికొత్త మార్పులు రాబోతున్నాయి. పండితుల సూచ‌న మేర‌కు వాస్తుమార్పులకు శ్రీకారం చుట్టారు. వాస్తు పండితుల బృందంతో ఇప్ప‌టికే చ‌ర్చించి మార్పు-చేర్పుల‌పై ప్లాన్ రూపొందించారు. ఆ మేరకు ప్ర‌ధాన మార్గాలు, ఛాంబర్లలో పనులు చేప‌ట్టారు.  గాంధీభవన్కు దక్షిణం వైపు ఒకే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక మీదట తూర్పు నుంచి నేతలు లోపలికి వచ్చి దక్షిణం వైపు నుంచి బయటకు వెళ్లేలా రెండు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు వైపున ఉన్న పార్టీ సామగ్రి అమ్మే గది, సెక్యూరిటీ రూమ్‌ను తొలగిస్తున్నారు.  పీసీసీ అధ్యక్షుని ఛాంబర్‌ను సైతం మార్చ‌నున్నారు. పడమరలో ఉండే ఛాంబ‌ర్‌ను.. తూర్పు వైపున‌కు షిఫ్ట్ చేయ‌నున్నారు. ఇక‌, పడమర వైపున‌.. ఒక‌ వరుసన వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు గదులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ గది స్థానంలో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేస్తారు.  గాంధీభవన్, ప్రకాశం హాల్‌కు రంగులు వేసి.. విద్యుత్ దీపాలతో అలంకరించి.. నిత్యం వెలుగులు విర‌జిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీభవన్ ఆవరణలో అందంగా ల్యాండ్ స్కెపింగ్ ఏర్పాటు చేయనున్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే నాటికి గాంధీభ‌వ‌న్ కొత్త కళ సంతరించుకునేలా శర వేగంగా పనులు జరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాక‌తో.. గాంధీభ‌వ‌న్ వాస్తుతో పాటు కాంగ్రెస్ హ‌స్త‌రేఖ‌లు కూడా మార‌డం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కేడ‌ర్‌లో మునుపెన్న‌డూ లేనంత ఉత్సాహం నెల‌కొంది.   

ఈట‌లే టార్గెట్‌.. ఏసీబీ అటాక్స్‌.. ఉచ్చు బిగిస్తున్నారా..?

ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు.. వెనువెంట‌నే కేసులు.. కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్.. ఆ త‌ర్వాత ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌మిటీ.. అంత‌లోనే ఈట‌ల కుమారుడిపైనా భూక‌బ్జా కేసు.. ఇలా రాజేంద‌ర్‌ను కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది కేసీఆర్ స‌ర్కారు.. ఆ దాడి నుంచి తట్టుకోలేకే.. ఆయ‌న బీజేపీ ర‌క్ష‌ణ‌లో చేరార‌ని అంటారు. ఇక‌, హుజురాబాద్‌లో ఈట‌ల‌ను ఓడించేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగమంతా అక్క‌డే వాలిపోయింది. ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అంతా ఈట‌ల ఇలాఖాలో మ‌కాం వేసి.. గెలుపు వ్యూహాలు ర‌చిస్తున్నారు. కులాల వారీగా మీటింగులు పెట్టి.. ఈట‌ల‌ను ఒంట‌రి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఈట‌ల‌కు మ‌రింత ఉచ్చి బిగించేలా ప్ర‌భుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని అంటున్నారు. అందులో భాగంగానే నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ ఆఫీసులో ఏసీబీ దాడులు జ‌రిగాయ‌ని చెబుతున్నారు.  ద‌శాబ్దాల చ‌రిత్ర‌.. వంద‌లాది మంది స‌భ్యులు.. పార్టీలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా సేవ‌.. నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ అంటే.. చాలామందికి ఏటేటా జ‌రిగే ఎగ్జిబిష‌న్‌.. చేప‌మందు పంపిణీ గ్రౌండ్ గురించి మాత్ర‌మే తెలుసు, ఆ సొసైటీ కింద అనేక ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లు ఉన్నాయి. ప‌లు జిల్లాల్లో ప్ర‌ముఖ కాలేజీలు ఉన్నాయి. ఏటేటా వేలాది మంది విద్యార్థులు చ‌దువుతుంటారు. అనేక వంద‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. సొంతంగా నిర్మించుకున్న‌ పెద్ద పెద్ద భ‌వ‌నాల్లో క‌ళాశాల‌లు న‌డుస్తున్నాయి. నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ ట‌ర్నోవ‌ర్ కోట్ల‌ల్లోనే ఉంటుంది. ఆ సంస్థ‌ల‌కు వంద‌ల కోట్ల ఆస్తులున్నాయి. గ‌త ఆరేళ్లుగా ఈట‌ల రాజేంద‌ర్ ఎగ్జిబిష‌న్ సొసైటీకి అధ్య‌క్షులుగా ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. తాజాగా, ఈట‌ల టీఆర్ఎస్‌తో తెగ‌దెంపులు చేసుకొని బీజేపీలో చేర‌డం.. ఈ ద‌శ‌లో నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్యాల‌యంలో ఏసీబీ సోదాలు జ‌ర‌గ‌డం కాక‌తాళీయం మాత్రం కాక‌పోవ‌చ్చు అంటున్నారు. అది ఈట‌ల టార్గెట్‌గా జ‌రిగిన ఏసీబీ దాడులేనంటున్నారు.  సొసైటీ లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. దుకాణాల కేటాయింపులు, నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు జ‌రిగాయ‌ని తెలుస్తోంది. ఏదో ఒక ఆరోప‌ణ‌తో ఈట‌ల‌పై కేసులు న‌మోదు చేసి.. ఆయ‌న‌పై మ‌రింత కేసుల‌ ఉచ్చు బిగించేందుకే ఏసీబీ దాడులు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంపై సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్‌ స్పందించారు. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని.. ప్రతి సంవత్సరం ఆడిట్‌ చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 250 మంది సభ్యులు ఉన్న నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీలో ఏసీబీ సోదాలు జరగడం ఇదే మొదటిసారి. 

మా ప్రభుత్వంలో అవినీతి కంపు.. బీహార్ మంత్రి సంచలన ప్రకటన

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’కు మంచి నిజాయతీ పరుడనే పేరుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినాయకుడు లాలుప్రసాద్ యాదవ్’ కు అవినీతి పరుడనే ముద్ర ఎలాగైతే చెరగని మరకలా మిగిలిపోయిందో, నితీష్ కుమార్’కు నిజాయతీ పరుడనే పేరు అలా నిలిచిపోయింది. అయితే, ఇప్పడు ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని, ఇంకెవరో అనడం, ఆరోపించడం కాకుండా, అదే ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్నీ ఆరోపిస్తున్నారు. సహజంగా అవినీతి ఆరోపణలు  ఎదుర్కుంటున్న మంత్రులు, ముఖ్యమంత్రుల రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తాయి, కానీ, ఇక్కడ సాహ్నీ, అధికారుల అవినీతి కంపు భరించలేక, తానే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.   ముఖ్యమంత్రి నితీష్ కుమార్’కు అత్యంత  సన్నిహితునిగా గుర్తింపు పొందిన సాహ్నీ, ‘‘నేను ఇక ఈ పదవిలో ఉండను.. రాజీనామా చేసేస్తా. నేను నిర్వహించే శాఖ ముఖ్య కార్యదర్శే నా మాట వినడం లేదు. ఇక నేను పదవిలో ఉండి ఎందుకు? ప్రభుత్వం మొత్తం అవినీతి మయమైపోయింది.. చేతులు తడపనిదే అధికారులు పనిచేయడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. సాంఘిక సంక్షేం శాఖలో తాను ఆమోదం తెలిపిన బదిలీలనూ అధికారులు నిలిపివేయడమేంటని ప్రశ్నించారు. శనివారం రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సమర్పిస్తానని మంత్రి మదన్ సాహ్ని ప్రకటించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాహ్నీ, ప్రజలకు సేవ చేసేందుకు తను రాజకీయాల్లోకి వచ్చానే కానీ, కార్లు,బంగాళా కోసం మంత్రిని కాలేదని కుండ బద్దలు కొట్టారు.అంతే కాదు, అధికారులు తమ మాట వినడం లేదనే బాధతో పాటుగా, తన కళ్ళెదుటే అధికారులు అవినీతికి పాల్పడుతున్నా తానేమీ చేయలేక పోతున్నాననే ఆవేదన కూడా ఆయన మాటల్లో వ్యక్తమైంది. అలాగే, బహుశా చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా లేనివిధంగా సాహ్నీ, తమ శాఖ అధికారుల ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇది తన ఒక్కడి బాధ కాదని, బీహార్’లో అధికారాల రాజ్యం నడుస్తోందని, తమకు  విలువ ఇవ్వడం లేదన్న బాధ మంత్రులు అందరిలోనూ ఉందని ఆయన చెప్పారు.  సాహ్నీ చెప్పిందే సత్యమైతే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయనకు మత్రమే కాదు రాష్ట్ర పజలకు కూడా సంజాయిషీ ఇచ్చుకోవలసి  ఉంటుంది. అంతే కాదు, సాహ్నీ ప్రస్తావించిన విషయం, చేసిన ఆరోపణలు సాధారణ  ఆరోపణలు కాదు. బహుశా ఆయన ఈవిషయాలను ఇప్పటికే  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళడం, లేదా మంత్రివర్గంలో చర్చించడం జరిగుందాలి. అయినా ముఖ్యమంత్రి పట్టిచుకోక పోలేదంటే. నితీష్ నిజాయతీని కూడా సంకించ వలసి  ఉంటుంది, అంటున్నారు.

కేసీఆర్ టేబుల్‌పై ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌!.. హుజురాబాద్‌లో గెలిచేది ఎవ‌రంటే...

కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికిప్పుడు హుజురాబాద్ ఉపన్నికల షెడ్యూలు ప్రకటిస్తే.. జులై నెలాఖరులోగానే ఎన్నికలు నిర్వహిస్తే.. ఏమవుతుంది? అంటే, టీఆర్ఎస్‌ ఖేల్ ఖతం... అవుతుందని అంటున్నారు. ఇంతకీ అలా అని అంటున్నది ఇంకెవరో కాదు, సర్కారీ వేగులే.. ఇంటెలిజెన్స్ వర్గాలే ఆ మాటంటున్నాయి.  అఫ్ కోర్స్ ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదనుకోండి.. అయినా, ఇదొక హెచ్చరికగా తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. నిజానికి, ప్రజల పల్స్ తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యల తీసుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్సీ వర్గాలను రంగంలోకి దింపారని అధికార వర్గాలు అంటున్నాయి.  చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటించే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖరరావు.. ప్రతి ఎన్నికలకు ముందు వివిధ కోణాల్లో, వివిధ సంస్థల ద్వారా సర్వేలు నిర్వహించడం అందరికీ తెలిసిన రహస్యమే. అలాగే, హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్సీ అధికారుల ఇంటింటి సర్వే స్థాయిలో సర్వే నిర్వహించారు. అది కూడా ఒక సారి కాదు, రెండు సార్లు వేర్వేరు టీమ్స్‌తో సర్వే చేయించారు. అయితే  టీములు మారినా, గీతలు మాత్రం మారలేదని సమాచారం. రెండు టీములు ఇచ్చిన నివేదికలు కొంచెం అటూ ఇటుగా ఒకేలా ఉండడంతో, ముఖ్యమంత్రి మెరుపు వేగంతో వ్యూహాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నివేదికల్లో  ఏముందంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని నివేదికల్లో ఉన్నట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్‌ ఎంచుకున్న సెంటిమెంట్ అస్త్రం కూడా  ఈటలకే ఫేవర్ చేసేలా ఉందని, ఇంటెలిజెన్సీ నివేదికలు స్పష్టం చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ ఓటరు, ఉప ఎన్నికను ఈటల కోణం నుంచే చూస్తున్నారు. తెరాస, బీజేపీల మధ్య పోటీగా చూడడం లేదు. ఈ నేపధ్యంలో కేసీఆర్ పట్ల గౌరవం ఉన్నా, ఈటల మీద వేటు వేయడాన్ని అంగీకరించేది లేదని సామాన్య ఓటర్లతో పాటుగా, తెరాస కార్యకర్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. అందుకే, ఈటలనే తెరాస అభ్యర్ధిగా గుర్తించి కారు బదులు కమలం  పువ్వు గుర్తుకు ఓటేయాలని తెరాస కార్యకర్తలు అభిమానులు కూడ భావిస్తున్నారు. ఉద్యమకారులు, కూడా ఈటలను బీజేపీ అభ్యర్ధిగా కంటే ఉద్యమ కార్యకర్తగా చూస్తున్నారు. అందుకే ఆయన బీజేపీలో చేరడం ఇష్టం లేక పోయినా ఈటలను సమర్దించాలని, ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు.ఈ నేపధ్యంలో ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా, గడువు చివరి వరకు  మరో ఐదు  మాసాలు ఆపగలిగితే, ప్రస్తుతం ఆవేశకావేశాలు చల్లబడి వాతావరణం తెరాసకు అనుకూలంగా మారుతుందని ఇంటెలిజెన్సీ అధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే, ఇంతవరకు ద్విముఖ పోటీ అనుకున్నా, ఇప్పడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి తెరాస, బీజేపీలకు ధీటుగా పక్కా వ్యూహంతో బరిలో దిగేందుకు సిద్దమువుతున్నారు, దీంతో ఇప్పుడు త్రిముఖ పోటీ ఖరారై పోయింది.  ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది, నిర్ణయించేది కేంద్ర ఎన్నికల సంఘం.  అంతే కాకుండా, బెంగాల్ సహా అనేక ఇతర రాష్ట్రాలలోనూ  వేర్వేరు కారణాలతో ఖాళీ అయిన, అసెంబ్లీ  లోక్ సభ స్థానాలకు సెప్టెంబర్ 10 లోపు ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో స్థానిక కరోనా పరిస్థితుల ఆధారంగా ఎక్కడికక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, తెరాస విజయం అనుమానంగా మారుతుంది. అందుకే ఎన్నికలను సాధ్యమైన మేరకు వాయిదా వేసేందుకు, అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు తెరాస సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ‌ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరితే.. ఉప ఎన్నిక డిసెంబర్‌లో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పాలని నిర్ణ‌యానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈటల మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా.. ఎన్నికలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. చివరకు ఏమవుతుంది అనేది ఇప్పుడే తేలేలా లేదు.  

మ‌రో తెలంగాణ పోరాటం.. ఉద్య‌మ‌కారుల ఐక్య కార్య‌చ‌ర‌ణ‌..

తెలంగాణ స్వ‌ప్నం ఏ ఒక్క‌రితోనో సాకారం కాలేదు. వంద‌లాది బ‌లిదానాలు.. వేలాది ఉద్య‌మ‌కారులు.. ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు.. కొట్లాడి సాధించుకున్నదీ ప్ర‌త్యేక రాష్ట్రం. చీమ‌ల పుట్ట‌లో పాము చేరిన‌ట్టు.. తెలంగాణ రాష్ట్రాన్ని అన‌కొండ‌లాంటి కేసీఆర్ త‌న క‌బంద హ‌స్తాల్లోకి లాగేసుకున్నారనే విమ‌ర్శ ఉంది. గులాబీ బాస్ ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి.. త‌న రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారని అంటారు. తెలంగాణ‌ను కేసీఆర్ ఫ్యామిలీ క‌బ్జా నుంచి విముక్తి చేయ‌డానికి మ‌రో ఉద్య‌మ పోరాటం త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు. అందుకే, ఆనాడు జ‌నంతో క‌లిసి.. జ‌నంలో పోరాడిన‌.. ఉద్య‌మ‌కారులు మ‌ళ్లీ ఒక్క‌తాటి మీద‌కు వ‌స్తున్నారు. మేధావులూ వారికి జ‌త క‌లుస్తున్నారు. స‌మిష్టిగా ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌ ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌నే హామీని తుంగ‌లో తొక్కి.. ఏడేళ్లుగా తానే అధికారం చెలాయిస్తూ.. హ‌క్కుల‌ను, ఉద్య‌మ గ‌ళాల‌ను, క‌లాల‌ను, క‌ల‌ల‌ను.. అణిచివేస్తున్న కేసీఆర్‌కు గుణ‌పాఠం చెప్పేందుకు ఇదే సరైన స‌మ‌యం అని భావిస్తున్నారు అస‌లైన ఉద్య‌మ‌కారులు. అంద‌లం ఎక్క‌గానే.. ఏ ఉద్య‌మకారుల‌నైతే కేసీఆర్ తొక్కేసారో.. ఇప్పుడు అదే ఉద్య‌మ నాయ‌కులు.. గోడ‌కు కొట్టిన బంతిలా తిరిగొస్తున్నారు. కేసీఆర్‌కు గుణ‌పాఠం చెప్ప‌డానికి మ‌ళ్లీ ఏకం అవుతున్నారు. ఓకే గొడుగు కింద క‌లిసిక‌ట్టుగా.. బ‌డుగుల బంగారు తెలంగాణ కోసం మ‌రో ఉద్య‌మ‌ పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు.   గాదె ఇన్న‌య్య‌, ఎ.చంద్ర‌శేఖ‌ర్‌, విజ‌య‌రామారావు, క‌పిలవాయి దిలీప్ కుమార్, య‌న్నం శ్రీనివాస‌రెడ్డి, స్వామిగౌడ్‌, బెల్ల‌య్య నాయ‌క్‌, బండి స‌దానంద్‌, రాములు నాయ‌క్‌, రాణి రుద్ర‌మ త‌దిత‌రులతో కూడిన‌ ఉద్య‌మ‌కారుల‌.. ఉద్య‌మ ఆకాంక్ష‌ల పోరాట స‌మితి ఏర్పాటుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన‌.. ప్ర‌జాక్షేత్రంలో ముందుండి కొట్లాడిన.. ఉద్య‌మ‌కారులంతా వ‌రుస భేటీల‌తో భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అప్ప‌టి ప్ర‌ముఖ‌ ఉద్య‌మ‌కారులంతా ఒకే ప్లాట్‌ఫామ్ మీద‌కు వ‌చ్చి.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సామాజిక‌, సాంఘీక‌ పున‌రేకీక‌ర‌ణకు కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా సమావేశ‌మై భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై ఓ క్లారిటీకి వ‌చ్చారు. భావ‌సారుప్య వ‌ర్గాల‌ను క‌లుపుకొని.. రానున్న కాలంలో ప‌టిష్ట ఉద్య‌మ రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ఉద్యమకారులంతా క‌లిసి పోరాడాల‌ని నిర్ణ‌యించారు. త‌మ భావ‌జాలం, కార్య‌చ‌ర‌ణ‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు.. ఈ నెల 9న హైద‌రాబాద్‌లో, 12న‌ వ‌రంగ‌ల్‌లో, 15న‌ క‌రీంన‌గ‌ర్‌లో మీడియా స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. అందులో, ఉద్య‌మ‌కారుల ఉమ్మ‌డి పోరాటంపై మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. హుజురాబాద్ కేంద్రంగా భారీ స‌భ‌తో ప్రజాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌ పోరాటానికి నాంది ప‌ల‌కాల‌ని భావిస్తున్నారు. 

రేవంత్‌ చెంత‌కు దానం నాగేంద‌ర్‌!.. కాంగ్రెస్‌లో చేరిక‌పై క్లారిటీ...

దానం నాగేంద‌ర్. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నేత‌. వైఎస్సార్ అనుచ‌రుడు. మాజీ మంత్రి. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన నాయ‌కుడు. అయితే, గులాబీ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న అసంతృప్తిగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా, రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్ర‌క‌టించ‌డంతో దానం పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని అంటున్నారు. ఒక‌ప్ప‌టి వైఎస్సార్ టీమ్ అంతా రేవంత్ వైపు అడుగుడులు వేస్తుండ‌టంతో.. అదే బాట‌లో దానం నాగేంద‌ర్ సైతం త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరుతారంటూ విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా, త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై స్వ‌యంగా దానం నాగేంద‌రే క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ, ఆయ‌న ఏం చెప్పారు? టీఆర్ఎస్‌ను వీడుతున్నారా? మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారా? రేవంత్‌రెడ్డితో చేతులు క‌లుపుతున్నారా? దానం నాగేంద‌ర్ కాంగ్రెస్‌లో చేర‌బోతున్నార‌నే వార్త‌ల‌తో ఆయ‌న ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టున్నాయి.. కొంప‌లు అంటుకుపోయిన‌ట్టు హ‌డావుడిగా దానం మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేది లేద‌ని.. టీఆర్ఎస్‌లోనే ఉంటానంటూ ప్ర‌స్తుతానికైతే క్లారిటీ ఇచ్చారు.  త‌న‌ చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్‌తోనే ఉంటాన‌ని.. విధేయతతో కేసీఆర్‌, కేటీఆర్ నాయ‌క‌త్వం కింద ప‌ని చేస్తాన‌ని.. దేవుడిపై ఆన అన్న రేంజ్‌లో గట్టిగా నొక్కి వ‌క్కానించారు దానం. తాను పార్టీ మారుతున్న‌ట్టు ప్ర‌చారం చేసిన వారిపై సైబ‌ర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాన‌న్నారు. సోషల్ మీడియాకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయంటూ సూక్తులు కూడా చెప్పారు.  తెలంగాణలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతోందని.. తాను మంత్రిగా ఉండి కూడా చేయ‌లేనంత డెవ‌ల‌ప్‌మెంట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో క‌నిపిస్తోంద‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీయే చిరకాలం తెలంగాణలో ఉంటుందంటూ జోస్యం కూడా చెప్పారు. త‌న ఇంటికి ఎవరు వచ్చినా గులాబీ కండువా కప్పుకుని రావాల్సిందేన‌ని.. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టాలని చూసే వారికి పుట్టగతులు ఉండవంటూ శ‌పించేశారు కూడా.   ఇంకా చాలానే అన్నారు దానం నాగేంద‌ర్‌.. కాంగ్రెస్‌లో త‌న‌కు చాలా అవమానాలు జరిగాయని.. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌లోనే వందింతలు ఎక్కువ గౌరవం దొరుకుతోందంటూ పార్టీపై త‌నకున్న నిబ‌ద్ద‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు దానం నాగేంద‌ర్‌. ప‌నిలో ప‌నిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపైనా పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. దానం తీరు చూస్తుంటే.. ఆయ‌న‌కు టీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమకంటే.. కేసీఆర్ మీద ఉన్న భ‌య‌మే ఎక్కువగా క‌నిపిస్తోందంటున్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు. అయితే, దానం ప్ర‌స్తుతానికి తాను కారు పార్టీలోనే ఉంటాన‌ని చెబుతున్నా.. ఏ క్ష‌ణంలోనైనా ఆయ‌న ర‌న్నింగ్ కారు దిగేసి.. రేవంత్‌రెడ్డి చేయి ప‌ట్టుకునే ఛాన్స్ లేక‌పోలేదనే వాద‌నా వినిపిస్తోంది. గ‌తంలో సైతం ఆయ‌న రాత్రికి రాత్రి వైఎస్సార్‌ను వీడి టీడీపీలో చేరిన చ‌రిత్ర‌ను గుర్తు చేస్తున్నారు. ఆనాడు తాను ఎమ్మెల్యేగా గెలిచినా.. టీడీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేర‌డం.. ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం.. వైఎస్సార్ ఆశీస్సుల‌తో మంత్రి కావ‌డం.. ఇలా దానం చ‌రిత్ర అంతా త‌వ్విపోస్తున్నారు. అధికారం ఉన్న‌చోటే దానం నాగేంద‌ర్ ఉంటార‌ని.. రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతార‌ని భావిస్తే.. ఆయ‌న ఏ క్ష‌ణంలోనైనా మ‌న‌సు మార్చుకోవ‌చ్చ‌ని అంటున్నారు.   

మోదీ ఎల‌క్ష‌న్‌ కేబినెట్‌.. ద‌క్షిణాదికి మొండిచేయేనా?

కేంద్ర మంత్రి వర్గం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక ముహూర్త నిర్ణయం మాత్రమే మిగిలింది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి, ఇంకా ముందు నుంచి కూడా మంత్రివర్గ విస్తరణపై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మీడియాలో చర్చ జరుగుతూనే వుంది. అందుకు తగినట్లుగానే ఢిల్లీ, నాగపూర్లలో కదలికలు చోటు చేసుకున్నాయి.   గత నెలరోజులకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ మంత్రిత్వశాఖల పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ఆ సమీక్షలు ముగింపుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలకు సమాంతరంగా  పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కీలక నేతలు ముఖ్యంగా రాష్ట్రాల‌ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శులు, ఇతర ముఖ్యులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. అలాగే, మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల నుంచి గౌండ్ రిపోర్టులు కూడా సేకరించారని సమాచారం.  బీజేపీ, మోడీ రాజకీయ భవిష్యత్కు అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్కు విస్తరణలో అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అంతే కాదు, మంత్రివర్గ విస్తరణకు నెల రోజులకు పైగా సాగుతున్న  భారీ కసరత్తు  పూర్తిగా  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే, మూల బిందువుగా సాగిందని పార్టీ వర్గాల సమాచారం.  అదే విధంగా ప్రస్తుత మంత్రివర్గ విస్తరణకు రాజకీయంగానూ చాలా చాలా ప్రాధాన్యత ఉందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్ ఎన్డీఎ నుంచి తప్పుకోవడంతో మంత్రి వర్గంలో మిత్ర పక్షాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం మంత్రి వర్గంలో  స్థానం లేని జనతా దళ్ (యు), అప్నాదళ్, ఎల్జీపీ వంటి పార్టీలకు ప్రాతినిధ్యం కలిపిస్తారని తెలుస్తోంది.  2019 సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. కనీసం వివిధ కరణాల చేత ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. కేంద్ర మంత్రివర్గం సంఖ్య 81. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీ మంత్రివర్గంలో 53 మంది మాత్రమే ఉన్నారు. ఈ విస్తరణలో మొత్తం ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా, మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుత మంత్రులలో కొందరి పార్టీ  బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ కొన్ని సూచనలు చేసిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ  చాలా భారీగా ఉంటుందని అంటున్నారు.    మంత్రివర్గంలో మధ్య ప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింథియాకు, అస్సాం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీకి మంత్రి వర్గంలో స్థానం ఖరారైందని తెలుస్తోంది. అలాగే, మహారాష్ట్ర నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహ రావుతో సహా నలుగురు లేదా ఐదుగురికి ఇదుగురికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ నుంచి బెర్త్ దక్కే పేర్లలో వరుణ్ గాంధీ పేరు కూడా ప్రముఖంగా వినవస్తోంది.అలాగే, బీజేపీ మిత్ర పక్షం అప్నాదళ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు అనుప్రియ్ పటేల్ పేరు ఖరారైన జాబితాలో ఉందని తెలుస్తోంది.  బీహార్ నుంచి బీజేపీ కోటాలో మాజీ ఉపముఖ్యంత్రి సుశీల్ కుమార్ మోడీతో పాటుగా, ఎల్‌జేపీ నుంచి రాంవిలాస్ తమ్ముడు పశుపతి పారస్‌కు, జేడీ(యు)నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆర్పీ సింగ్, సంతోష్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఒకరిద్దరికి మంత్రి  వర్గంలో బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్లు  సమాచారం. అయితే ఈ విస్తరణలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యత దక్కపోవచ్చని తెలుస్తోంది. అయితే, అదే జరిగితే, దక్షిణాది రాష్ట్రాలలో విస్తరణ కలలు కంటున్న కమల దళానికి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇప్పటికే దక్షిణాది పట్ల వివక్ష చూపుతోందన్న ఆరోపణ ఎదుర్కుంటున్న బీజీపీ ఇంట భారీ విస్తరణలో దక్షణాది రాష్ట్రాలకు మోడీ చేయి చూపిస్తే, ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాది రాష్ట్రాలపై అసలు వదులుకోవడం మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆఖరి క్షణంలో పునరాలోచించే అవకాశం లేక పోలేదని తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు ఆశాభావంతో ఉన్నారు. అయితే, ఆ ఆశ ఎంతవరకు నెరవేరుతుందనేది  ప్రస్తుతానికి ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న.

వీసీ ప్రసాదరెడ్డి.. వైసీపీలో చేరితే బెటర్..!

తెగించినోడికి తెడ్డే లింగం.. బరి తెగించినోడికి బ్రేకే ఉండదు.. ఇలా ఎన్నయినా చెప్పుకోవాలనిపిస్తోంది కొందరికి. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి.. ఓపెన్ గా రాజకీయాలు చేస్తుంటే.. చర్యలు తీసుకోవాల్సినవారే చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటే.. ఇక ఈ నిబంధనలు ఎందుకు? ఈ రాజ్యాంగం ఎందుకు? అవి కూడా మార్చేసుకుంటే పోలా.. అనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు వేసే హక్కు ఉన్నా.. అది పోస్టల్ బ్యాలెట్ ద్వారానే వేసుకోవాలి. నేరుగా వారు వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయరు. ఎందుకంటే వారు ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సిన వాళ్లు.  వీరు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకూడదు.. ఉంటే..ఆ ప్రభావం ప్రజలపై ఉంటుందని.. అధికారం ఉన్నవీరు అలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే ఆ నిబంధన పెట్టారు. గతంలో ఏదైనా రాజకీయ పార్టీ జెండు పట్టుకున్నా ఉద్యోగం పోతుందనే భయం ఉంది. కాని పరిస్ధితులు మారిపోయాయి. ఇప్పుడు బహిరంగంగా జెండా పట్టుకోకపోయినా..మాటల్లోనే వారు ఎవరివైపో అర్ధమయ్యేలా చెబుతున్నారు. లేటెస్టుగా ఆ తెగింపు బరితెగింపుగా మారింది. ఓపెన్ గా రాజకీయపార్టీల నేతలతోనే తిరిగేస్తూ..వారికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాదరెడ్డి. సార్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయినా డోంట్ కేర్ అంటున్నారు. ఎందుకంటే ఆయన కోసం కేర్ తీసుకునే పెద్దలున్నారు. ఇదే ఇప్పుడు క్యాంపస్ లో వినపడుతున్న మాట. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు సామంతరాజులా వ్యవహారం చేస్తున్నారనే టాక్ ఎటూ ఉంది. అలాంటి కీలక నేత బర్త్ డే వేడుకలను యూనివర్శిటీ క్యాంపస్ లో అది కూడా తన చాంబర్ లో జరిపారు ప్రసాదరెడ్డి. ఆయన ఒక వైస్ ఛాన్సలర్ అయి ఉండి కూడా దగ్గరుండి కేక్ కట్ చేయించి.. బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించారు. ఆయనొక ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉండి.. అది కూడా విశ్వవిద్యాలయం హెడ్ గా ఉండి కూడా ఇలా వ్యవహరించారంటే.. ఆయన ఈ విషయంలో అసలు ఫీలే కావటం లేదని అర్ధమవుతోంది. బహుశా ఆయన ఒక ఎంపీ బర్త్ డే జరపడంలో తప్పేంటని దబాయించొచ్చు. ఇలా చేయడం సార్ కి కొత్త కాదు. గతంలో స్థానిక ఎన్నికలప్పుడు రెడ్డి కులస్తుల సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు. అది కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ప్లానింగ్ లోనే జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరిగింది. రెడ్లు అందరూ వైసీపీకే ఓటేయాలని..అక్కడకు హాజరైనవారంతా వేయించాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఇచ్చేటప్పుడు ఆయన పక్కనే ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాదరెడ్డి ఉన్నారు. ఆయన కూడా జై కొట్టి.. చప్పట్లు కొట్టి సమావేశానికి వచ్చినవారిని ఉత్సాహపర్చారు. అప్పుడు ఆయన తనకు పదవి ఇప్పించినందుకు విజయసాయిరెడ్డికి లాయల్ గా ఉంటున్నారని అనుకున్నారు. అప్పుడు అది పెద్ద వివాదమే అయింది. ఇప్పుడు మళ్లీ అదే పని రిపీట్ చేయడమే కాక..ఏకంగా క్యాంపస్ లోనే ..తన చాంబర్ లోనే చేశారంటే..ఇక ఆయన ఈ విషయంలో ఎలాంటి రూల్స్ పట్టించుకోకూడదని ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇక ప్రభుత్వం ఎటూ అస్మదీయులదే కాబట్టి..ఎటూ చర్యలు ఉండవు..ఇక విద్యార్ధులు, ప్రజలే చర్యలు తీసుకోవాలేమో.

ఎయిర్‌పోర్టా? కుక్క‌ల దొడ్డా? రాజ‌మౌళికి చేదు అనుభ‌వం.. ఆగ్ర‌హం..!

విమానాశ్ర‌యం అంటే ఎట్టా ఉండాలి? అంత‌ర్జాతీయ ప్ర‌యాణీకులు వ‌చ్చే మార్గం ఇంకెట్టా ఉండాలి? అది దేశ రాజ‌ధానికి మెయిన్ ఎంట్ర‌న్స్ అయితే ఎంత గ్రాండ్‌గా ఉండాలి? మ‌రి, మ‌న దేశ ప‌రువు పోయేలా.. అధ్వాహ్నంగా, చెండాలంగా ఉంటే ఎంత అవ‌మాన‌క‌రంగా ఉంటుంది? ఆ దుస్థితిని క‌ళ్లారా చూసిన క‌ళాద‌ర్శ‌కుడికి ఎంత చిరాకు తెప్పించి ఉంటుంది? ఇంకెంతం ఆగ్ర‌హం క‌లిగించి ఉంటుంది? దేశం గ‌ర్వించ‌ద‌గిన డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళికి స‌రిగ్గా ఇలానే ప‌రిస్థితే ఎదురైంది ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌మంలో. అక్క‌డి ప‌రిస్థితి చూసి ఆయ‌న తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యారు. ఒళ్లు మండినా.. ఆ మంట‌ను మన‌సులోనే దాచేసుకొని.. సుతిమెత్త‌గా ట్వీట్‌తో దేశం దృష్టికి తీసుకొచ్చారు. జ‌క్క‌న్న చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు ఇండియాలో వైర‌ల్‌గా మారింది. "లుఫ్తాన్సా ప్లయిట్‌ ద్వారా ఎయిర్‌పోర్టులోకి  వచ్చినప్పుడు ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్స్‌ కోసం ప్రయాణీకులకు పత్రాలను అందించారు. ఆ పేప‌ర్స్‌ నింపడానికి ప్రయాణీకులు కొందరు నేలపై కూర్చుని ఉంటే మరికొందరు గోడపై పత్రాలు పూరిస్తున్నారు. టేబుల్స్‌ను ఏర్పాటు చేయడం అనేది చాలా సాధారణ సర్వీస్‌.. దాన్ని అందించాల్సింది. అలాగే వెలుపల ద్వారం వద్ద ఉండే హ్యాంగర్‌ దగ్గర వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు విదేశీయులకు మనదేశంపై కలిగే మొదటి అభిప్రాయం మరోలా ఉంటుంది. ఈ విషయంపై దృష్టి సారించండి..ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

శ‌భాష్ శిరీష‌.. అంతరిక్షంలోకి తెలుగుతేజం..

క‌ల్ప‌నా చావ్లా.. సునీతా విలియ‌మ్స్.. అంత‌రిక్షయానం చేసిన ఎన్నారైలు. భార‌తీయ కీర్తిప‌తాకాన్ని స్పేస్‌లో ఎగ‌రేసిన ధీర‌వ‌నిత‌లు. తాజాగా, ఓ తెలుగమ్మాయి తొలిసారి అంత‌రిక్షంలో అడుగుపెట్ట‌బోతున్నారు. స్పేస్‌లో తెలుగు సంత‌కం చేయ‌బోతున్నారు. ఆమె పేరు శిరీషా బండ్ల‌. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ్మాయే. ఏపీలోనే పుట్టిన శిరీష‌.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి వాషింగ్ట‌న్‌లో స్థిరపడ్డారు. తెలుగు నేల‌పై జ‌న్మించినా.. అమెరికా గ‌డ్డ‌పై చ‌దువుల్లో రాణించారు. ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగారు. తాజాగా, ఏకంగా అంత‌రిక్షంలోకి ఎగిరిపోతున్నారు. తెలుగు మూలాలున్న మ‌హిళ అంత‌రిక్ష‌యానం చేయ‌బోతుండ‌టం.. తెలుగు వారిగా మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల ఒక‌రు. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు.  అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టింది. జులై 11న న్యూ మెక్సికో నుంచి స్పేస్‌ఫ్లైట్‌ బయల్దేరనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. ప్రయాణికులను తీసుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సస్‌, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. శిరీష బండ్లతో పాటు.. చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బెత్‌ మోసెస్‌, లీడ్‌ ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెన్నెట్‌ అంతరిక్ష యానం చేయబోతున్నారు.   అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్ త్వ‌ర‌లో చేయ‌నున్న‌ అంతరిక్ష యాత్ర‌కు పోటీగా వర్జిన్‌ గెలాక్టిక్ ఈ స్పేస్ టూర్‌కు ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. జులై 20న జెఫ్ బెజోస్‌.. తన సంస్థ బ్లూ ఆరిజిన్‌ ప్రయోగించే వాహక నౌకతో స్పేస్ జ‌ర్నీ చేసేందుకు రెడీ అవుతున్నారు. బెజోస్‌కు పోటీగా.. ఆయ‌న‌కంటే 9 రోజులు ముందుగానే వర్జిన్‌ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్ అంత‌రిక్షంలోని ఎగిరిపోనుంది. అందులో, మ‌న తెలుగుతేజం శిరీష బండ్ల కూడా ఉండ‌టం విశేషం. తెలుగుజాతికే గ‌ర్వ‌కార‌ణం.  

మంత్రుల‌కు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌.. జ‌గ‌న్‌పై వైసీపీ ఎంపీ విమ‌ర్శ‌లు..

జ‌ల జ‌గ‌డం మిత్రుల‌ను శ‌త్రువులుగా చేస్తోంది. ఇన్నాళ్లూ క‌లిసున్న నేత‌ల‌ను.. ఇప్పుడు క‌త్తులు దూసేలా ప్రేరేపిస్తోంది. ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. మంత్రులు ప‌ర‌స్ప‌రం తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. తాజాగా, ఆ కేట‌గిరిలో రోజా కూడా చేరారు.  ఎమ్మెల్యే రోజా. ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్. ఆక‌ట్టుకునేలా మాట్లాడ‌టం.. సూటిగా, వాడి, వేడిగా విమ‌ర్శించ‌డంలో ఆమెకు ఆమే సాటి. వైసీపీలో యాక్టివ్‌గా ఉండే రోజా.. తెలంగాణ నేత‌ల‌తోనూ సామ‌రస్యంగా ఉంటారు. కేసీఆర్‌-రోజాల మ‌ధ్య మంచి స్నేహ‌పూరిత బంధం ఉంది. గ‌తంలో తిరుప‌తి వెళ్లిన‌ప్పుడు సీఎం కేసీఆర్‌, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు. ఇటీవ‌ల రోజాకు రెండు మేజ‌ర్ స‌ర్జ‌రీలు జ‌రిగితే కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఆమెను ప‌రామ‌ర్శించారు. వారిద్ద‌రి మ‌ధ్య అంత స్నేహం ఉన్నా.. ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్పే.. పాలిటిక్స్ పాలిటిక్సే అన్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. తాను ఎంతో అభిమానించే జ‌గ‌న‌న్న‌తో పాటు వైఎస్సార్‌ను తెలంగాణ మంత్రులు అంత‌గా తిడుతుంటే.. వింటూ ఊరుకోలేక‌పోయారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే మ‌ర్యాద‌గా ఉండ‌దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.   దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తెలంగాణ అక్రమంగా నీటి జలాలను వాడుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చెయ్యడమే అన్నారు. ఏపీకీ అన్యాయం చేస్తే సీఎం జ‌గ‌న్‌తో పాటు తాము కూడా సహించమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాన్ని పరిష్కరించి...తమ వాటాను తమకు కేటాయించాలని మోదీ, షేకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. ఏపీ నీటిని వినియోగిస్తూ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వంతో ఫ్రెండ్లీగా ఉండే ఎమ్మెల్యే రోజా.. ఇలా ఫైర్ అవ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది. ఇటు వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలంగాణ మంత్రుల‌కు వార్నింగ్ ఇస్తే.. అటు వైసీపీ ఎంపీ మాత్రం జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు సంధించారు. జగన్‌, కేసీఆర్‌లు రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. నవసూచనల పేరిట ఏపీ సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. నదీ జలాల అంశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్‌.. జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు.  తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానికి లేఖలు రాయడం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు తెలియంది కాదని.. తక్షణం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై వీలైనంత త్వరగా జలవివాదాలను పరిష్కరించాలని రఘురామకృష్ణరాజు సూచించారు.   వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల విమ‌ర్శ‌లు ఇలా ఉంటే.. జ‌ల వివాదంపై ఏపీ సైతం దూకుడు పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం ద‌గ్గ‌ర ఏపీ పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద‌గ్గ‌ర‌ తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం ద‌గ్గ‌ర ఏపీ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత మ‌రింత పెరిగింది.  తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4 టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని.. లేదంటే సీమ ప్రాంతం ఎడారి అవుతుందనేది ఏపీ ప్రభుత్వ అభ్యంత‌రం. ఇరు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో జూరాల, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల ద‌గ్గ‌ర‌ పోలీసు బందోబస్తు కొనసాగుతుండ‌టంతో ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. నీళ్ల‌లో మంట రాజుకుంటోంది.   

వ్యాక్సిన్ వేసుకున్నా వైర‌ల్‌ లోడ్.. డ‌బుల్ డోస్‌..ఎంత సేఫ్‌?

కొవిడ్ నుంచి కాపాడే ఏకైక మార్గం వ్యాక్సిన్‌. స‌బ్బు నీళ్లకే చ‌చ్చిపోయే వైర‌స్ నుంచి వ్యాక్సిన్ మిన‌హా మ‌రేదీ కాపాడ‌లేదు. ఎంత సుర‌క్షితంగా ఉన్నా.. కరోనా ప్ర‌మాదం పొంచే ఉంటుంది. అందుకే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీకాయే శ్రీరామ ర‌క్ష‌. అందుకే, భార‌త్‌తో స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా సాగుతోంది. జ‌నాల్లో కొన్ని అపోహ‌లు ఉన్నా.. వ్యాక్సిన్ ప‌నితీరు బ్ర‌హ్మాండంగా ఉంది. అయితే, వ్యాక్సిన్ విష‌యంలో మ‌రింత క్లారిటీ ఇస్తున్నారు అంత‌ర్జాతీయ సైంటిస్టులు.  వ్యాక్సిన్ వేసుకుంటే వైర‌స్ సోక‌క‌పోవ‌డం అంటూ ఏమీ ఉండ‌దు. కాక‌పోతే.. మ‌న శ‌రీరంలో వైర‌ల్ లోడు చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ప్రాణానికి ప్ర‌మాదం లేకుండా చేస్తుంది. ఎందుకంటే, ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం సుర‌క్షితం కాదు. కాబ‌ట్టి, టీకా తీసుకున్నా.. వైర‌స్ సోకితే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వైర‌ల్ లోడ్ విస్త‌రించ‌కుండా.. చాలా త‌క్కువ స్థాయికే క‌ట్డ‌డి చేస్తుంది.  టీకా పొందాక కూడా కొవిడ్‌-19 బారిన పడిన వారిలో.. వైరల్‌ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ అంశాన్ని నిర్ధారించారు. అన్నిర‌కాల కరోనా టీకాలు ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడంలో సమర్థంగానే పనిచేస్తున్నాయి. అయితే, ఏ టీకాకూ వంద శాతం సమర్థత ఉండదు. వ్యాక్సిన్‌ పొందాక కూడా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు.  ‘‘టీకా వల్ల దాదాపు 90 శాతం మేర కొవిడ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌ బారినపడినా.. అతడిలో వైరస్‌ తక్కువగానే ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా ఒక మోస్తరుగానే ఉంటుంది’’ అని ఆరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకుడు జెఫ్‌ బర్జెస్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 14 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 10 వరకూ అమెరికాలో 3,975 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందిన ఐదుగురికి.. పాక్షికంగా టీకా పొందిన 11 మందికి.., వ్యాక్సిన్ అస‌లే తీసుకోని 156 మందికి కొవిడ్‌ సోకింది.  టీకా పొందని వారితో పోలిస్తే.. పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందిన వారిలో వైరల్‌ లోడు 40శాతం తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు. వ్యాక్సిన్ వేసుకున్నవారిలో కొవిడ్‌తో పాటు జ్వరం వచ్చే అవకాశం 58శాతం తక్కువని తేలింది. రెండు డోసులు పొందిన వారికి కరోనా నుంచి 91 శాతం, ఒకే డోసుతో 81శాతం మేర రక్షణ లభిస్తున్నట్లు అమెరిక‌న్ సైంటిస్టులు తేల్చారు. అయితే, ఇండియా విష‌యానికి వ‌చ్చే స‌రికి ఈ లెక్క‌లు కాస్త మారే అవ‌కాశం ఉంది. మ‌న ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ టీకాల సామర్థ్యం సుమారు 75శాతమే. సో, వ్యాక్సిన్ వేసుకున్నా వైర‌స్ బారిన ప‌డే ప్ర‌మాదం అమెరికాతో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర కాస్త‌ ఎక్కువేన‌ని చెప్పాలి. అందుకే, రెండు డోసులు తీసుకున్న వారు మ‌రింత సుర‌క్షితంగా ఉండే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి, వ్యాక్సిన్‌ను అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందే. ఒక్క డోసు మాత్ర‌మే వేసుకుంటే.. వైర‌స్ ప్ర‌మాదం పొంచే ఉంటుంది. టీకా అస్స‌లు తీసుకోక‌పోవ‌డం మ‌రింత ప్ర‌మాద‌క‌రమని హెచ్చ‌రిస్తున్నారు సైంటిస్టులు.   

ర‌ఘురామ సేఫ్‌.. సుప్రీం కీల‌క తీర్పు.. వేటు అంత వీజీ కాదు..!

సీఎం జ‌గ‌న్‌రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్న ఒకే ఒక్క‌డు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. ఆయ‌న పెడుతున్న టార్చ‌ర్ మామూలుగా లేదు. పార్టీలోనే ఉంటూ.. పార్టీ లైన్‌కు క‌ట్టుబ‌డే ఉంటూ.. ఎక్క‌డా చిక్క‌కుండా.. చిక్కుల్లో ప‌డ‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌గా జ‌గ‌న్‌రెడ్డికి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇంత‌కుముందు ర‌చ్చ‌బండ‌తో రోజూ జ‌గ‌న్ స‌ర్కారును బండ‌కేసి కొడుతూ ర‌చ్చ రంబోలా చేశారు. ఇప్పుడిక లేఖాస్త్రాల‌తో ముఖ్య‌మంత్రికి మ‌తిపోగొడుతున్నారు. త‌న‌ను ఇంత‌లా వేధిస్తున్న ర‌ఘురామ‌ను.. ఏసీబీ కేసుతో కుమ్మేయాల‌ని చూసినా.. కేర్‌ఫుల్‌గా త‌ప్పించుకొని.. ఢిల్లీలో మ‌కాం వేసి.. దేశ‌వ్యాప్తంగా జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప‌నిలో బిజిగా ఉన్నారు రాజు గారు. అందుకే, ఎలాగైనా.. ర‌ఘురామ‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని పంతం ప‌ట్టింది జ‌గ‌న్ పార్టీ. వైసీసీ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసి.. త‌మ వంతు ప్ర‌య‌త్నాలు జోరుగా చేస్తోంది.  ఇప్ప‌టికే స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి ప‌లుమార్లు విజ్ఞ‌ప్తులు చేశారు. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ మొర‌బెట్టుకున్నారు. తాజాగా, ఎంపీ విజ‌య‌సాయి సైతం స్పీక‌ర్‌కు ఇదే విష‌యంపై లేఖ రాశారు. స్పీక‌ర్ త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాలంటూ వైసీపీ ఎంత‌గా ఒత్తిడి చేస్తున్నా.. ఆయ‌న‌ నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ర‌ఘురామ పార్టీ లైన్ దాట‌కుండా స‌ల‌హాలు, సూచ‌న‌ల రూపంలో అతిజాగ్ర‌త్త‌గా కుళ్ల‌బొడుస్తుండ‌టంతో టెక్నిక‌ల్‌గా ఆయ‌న్ను ఇరికించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. స్పీక‌ర్ నుంచి ఉలుకూప‌లుకూ లేక‌పోవ‌డంతో.. ఇక సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతోంది వైసీపీ. ఆ మేర‌కు ఇటీవ‌ల‌ న్యాయ నిపుణుల‌తో విజ‌య‌సాయిరెడ్డి  చ‌ర్చించినట్టు తెలుస్తోంది.  అయితే, ఆదిలోనే హంస‌పాదు ఎదురైన‌ట్టు.. ర‌ఘురామ విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌నే ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే చెక్ ప‌డిన‌ట్టైంది. అన‌ర్హ‌త వేటు కేసుల్లో తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇర‌కాటంలో ప‌డేశాయి. అనర్హతలపై సుప్రీంకోర్టు నిస్సహాయత వ్య‌క్తం చేసింది. చట్టసభలకు ఎన్నికైన సభ్యుల అనర్హత కోసం దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో లోక్ సభతో పాటు చట్టసభల స్పీకర్ల పాత్రపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  అనర్హత వేటు కోసం కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్న ఫిర్యాదులను స్పీకర్లు సకాలంలో పరిష్కరించకపోవడంపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై క్లారిటీ ఇచ్చింది. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకునే విషయంలో మన దేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం మాత్రమే ఉంది. అది స్పీకర్లకే సర్వాధికారాలు కట్టబెట్టింది. దీంతో ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. అనర్హతలపై నిర్ణయం తీసుకునే అధికారం చట్ట సభల స్పీకర్లకే ఉందంటూ వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్లు కాల పరిమితితో నిర్ణయం తీసుకునేలా చేయాలంటే పార్లమెంటే చట్టం చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. సో, సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య‌ల‌తో అన‌ర్హ‌త వేటుపై స్పీక‌ర్‌కే విచ‌క్ష‌ణ అధికారం ఉంటుందని స్ప‌ష్ట‌మైంది. అన‌ర్హ‌త వేటు నిర్ణ‌యంపై కాల ప‌రిమితి కానీ లేద‌ని తేలిపోయింది. ఈ లెక్క‌న‌.. వైసీపీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా.. స్పీక‌ర్ ఇప్పుటికిప్పుడు అర్జెంటుగా వేటు వేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట‌. అటు, సుప్రీంకోర్టూ ఈ విష‌యంలో హ్యాండ్స‌ప్ అన్న‌ట్టే. సో, ఈ లెక్క‌న ఎంపీ ర‌ఘురామ‌పై అత్య‌వ‌స‌రంగా వేటు వేయించాల‌నే వైసీపీ కోరిక‌, ఆశ‌పై.. సుప్రీంకోర్టు నీళ్లు చ‌ల్లిన‌ట్టు అయింది. స్పీక‌ర్ ఆశీస్సులు ఉన్నంత వ‌ర‌కూ ర‌ఘురామ సేఫ్‌...  

జ‌గ‌న్‌ స‌ర్కారుకు కేంద్రం బిగ్ షాక్‌.. ఇప్పుడెలా..?

న‌వ‌ర‌త్నాల పేరుతో ఖ‌జానా ఖాళీ చేశారు. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేశారు. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డ‌మే చాలా క‌ష్టం అవుతోంది. చేసిన ప‌నుల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులే ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ ఖాతాలో పైసా కూడా లేదంటున్నారు. ఈ విష‌యం స్వ‌యంగా అధికారులే హైకోర్టుకు చెప్పారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. డ‌బ్బుల కోసం భూముల వేలానికీ సిద్ధ‌మ‌య్యారు. పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఆదాయం పెరుగుతుంది. అది వ‌దిలేసి.. ఓట్ల కోసం సంక్షేమ ప‌థ‌కాలతో ఊద‌ర‌గొడితే.. ఉన్న సొమ్ముంతా ఖ‌ర్చ‌యిపోతోంది. అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేసినా బాగుండేది.. ఎంతోకొంత ఏపీ ఇమేజ్ పెరిగి కంపెనీలు పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చేవి. సీఎం జ‌గ‌న్ అరాచ‌క విధానాల‌తో రాష్ట్రం దివాళా తీస్తోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆర్థిక క్లిష్ట ప‌రిస్థితుల్లో కేంద్రం రూపంలో మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది.  ఏం చేసినా.. ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏపీ స‌ర్కారుకు అప్పు ముట్ట‌డం లేదు. ఇప్ప‌టికే లిమిట్ దాటేయ‌డ‌మే.. కొత్త అప్పుల‌కు కేంద్ర స‌ర్కారు చెక్ పెట్టింది. తాజాగా, ఏ మేర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన తాఖీదు.. జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేయ‌డం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టే. రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. ఉన్న లిమిట్‌నూ త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  ఇష్టారీతిన చేసిన అప్పులే.. ఇప్పుడీ కొత‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఏపీ పంపిన వివ‌రాలు స‌మ‌గ్రంగా ప‌రిశీలించిన త‌ర్వాత.. రుణ పరిమితిలో భారీ కోత పెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ‌. రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి కన్నా ఇంతకుముందు సంవత్సరాల్లోనే అదనంగా రూ.17,923.94 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం గుర్తించింది. దీంతోపాటు ఇతరత్రా అప్పుల రూపంలోనూ రూ.6,000 కోట్లు మినహాయించింది. అన్నీ కలిపి ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితికి రూ.23,924 కోట్ల కోత పడి... చివరకు రూ.27,668 కోట్లకు చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.27,668 కోట్లకే రుణాన్ని పరిమితం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితి రూ.37,163 కోట్లకు పరిమితమైంది. నికర రుణపరిమితి రూ.51,592 కోట్లకు చేరింది.  అప్పుల‌నే న‌మ్ముకొని సంక్షేమ ప‌థ‌కాల‌తో ఊద‌ర‌గొడుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రం విధించిన ఈ ష‌ర‌తు బిగ్ షాక్ అనే చెబుతున్నారు. అప్పు ప‌రిమితిలో కోత ప‌డ‌టంతో.. ఇప్పుడిక తిప్ప‌లు త‌ప్ప‌వంటున్నారు. మ‌రి ఈ అప్పుల ఊబి నుంచి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.    

సర్కార్ పై ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యుద్ధం! ఏం జరగనుందో... 

వాళ్లిద్దరు అధికార పార్టీ  ఎమ్మెల్యేలు .. అయినా ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఏకంగా యుద్ధమే ప్రకటించారు. సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉద్యమానికి దిగడం సంచలనంగా మారింది. అధికార పార్టీలో గందరగోళానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆదిలాబాద్. ఖమ్మం  జిల్లాల ఏజెన్సీలో  పోడు భూముల వివాదం ముదిరింది. ఆదిలాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోని అడవి భూములున్న ప్రాంతాలకు పాకింది. మంచిగా వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో ఉండాల్సిన పోడు రైతులు పోరు బాట పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా తాము సైతం సై అన్నట్టుగా రైతుల పక్షాన గళం విప్పుతున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో పోడు ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అయితే ఆ ప్రాంతంలో పులులు సంచరించడంతో జనాలు బయటికి రావడానికి భయపడ్డారు. పులి భయానికి కొంత కాలం పోడు వ్యవసాయం  ఆపేశారు. ఇదే అదనుగా భావించిన స్థానిక అటవీశాఖ ఇక్కడి భూములను ఆక్రమించే యత్నం చేసింది. హరితహారం సాకుగా చూపి.. ఇక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేసింది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తమ ప్రభుత్వ అధికారులతోనే పంచాయతీ మొదలైంది. దీంతో పొడు భూముల్లో భీకర వాతావరణం ఎందుకు నెలకొంది.. ఆదివాసీలకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు సార్లు అటవీశాఖ అధికారులపై యుద్ధం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆదివాసీ బిడ్డలు కదలి రావాలి అని పిలుపునిచ్చారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కూడా అటవీశాఖ పై యుద్దానికి సిద్ధం అంటూ ప్రకటన చేశారు.విత్తనాలు నాటకుండా అధికారులు అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయనిహెచ్చరించారు.గతంలో ఇదే నియోజకవర్గంలో పొడుభూముల విషయంలో కొనప్ప తమ్ముడుపై అటవీశాఖ అధికారులపై దాడి చేశాడని కేసులు కూడా పెట్టారు. పొడు భూముల్లో ఆదివాసులకు వ్యవసాయం అనుమతి లేదంటూ ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకోవడం వారికి వీరికి మధ్య గొడవలు జరగడం ఒకానొక సందర్భంలో దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు అటవీశాఖ అధికారులకు ఎంత చెప్పినా సీన్ రిపిట్ అవ్వడం పట్ల పొడు భూములు ఉన్న ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. పొడు భూముల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో  తమ నియోజకవర్గాల్లో ఆదివాసీ ఓటు బ్యాంక్ కలిగిన ఎమ్మెల్యలు  అటూ ప్రభుత్వ అధికారులను ఎదిరించలేక.. ఇటు తమ ప్రజలను కాదనలేక నలగిపోతున్నారట.  

సంచలనం..రేవంత్ రెడ్డి గూటికి దానం నాగేందర్?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయా? టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో పొలిటికల్ సీన్ మారిపోనుందా? అంటే అవుననే తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగిన కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని సమాచారం. ఎవరూ ఊహించని సంచలనాలు త్వరలో జరగబోతున్నాయని అంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని, రాజకీయ పునరేకీకరణపేరున, ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షణ మంత్రంతో ఎగరేసుకుపోయారు గులాబీ బాస్. అప్పుడు అదే దిశలో  కేసీఆర్ కు ఎదురు గాలి మొదలైందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే కేసీఆర్ కు గాంధీ భవన్ సెగ తగులుతోందని సమాచారం. గతంలో గత్యంతరం లేక కాంగ్రెస్ ను వదిలి గులాబీ పార్టీలో చేరిన చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు మళ్ళీ సొంతగూటికి చేరేందుకు సిద్డంవుతున్నారని, అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న, మాజీ మంత్రి, ప్రస్తుత  ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి  నాయకులు చాలామంది తెరాసలో ఉక్కపోతకు గురవుతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో సిటీ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఆసిఫ్ నగర్ నుంచి మూడు మార్లు, ఖైరతాబాద్ ఒకసారి ఎన్నికైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలముందు తెరాసలో చేరారు. ఖైరతాబాద్ నుంచి  తెరాస అభ్యర్ధిగా పోటీచేసి మరో మారు, ఎన్నికయ్యారు. సీనియర్ నేతగా ఉన్నా తెరాసలో నాగేందర్ కు సీనియారిటీ, చురుకుతనానికి గుర్తింపు దక్కలేదు. గుంపులో గోవిందయ్యలా మిగిలి పోయారు. ఇప్పుడు, రేవంత్ రాకతో, కాంగ్రెస్ పునర్జీవనంఫై ఆశలు పెరగడంతో, ఆయన తిరిగి సొంతగూటికి  చేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మాతృ సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు, తనవంతుగా కృషిచేస్తానని, అందు కోసం అవసరం అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నట్లు ఆయన తమ సన్నిహితుల వద్ద దానం నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది.  ఒక్క నాగేందర్ మాత్రమే కాదు, మరి కొందరు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు, ప్రస్తుత తెరాస ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి గాంధీ భవన్ బాట పట్టేందుకు సిద్డంవుతున్నారని, విశ్వసనీయ వర్గాల సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.  అందులో 12 మంది కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే, అందులో చాలా మంది అసంతృప్తితో రగిలి పోతున్నారు. పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హమీలలో ముఖ్యమంత్రి మరిచి పోయారని మంది పడుతున్నారు.  ఇంతకాలం  గత్యంతరం లేక పార్టీలో సర్దుకు పోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రేచుక్క రేవంత్ ఆశతో  తిరిగి సొంత గూటికి చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క  కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరినవారే కాకుండా, తెరాసలో చేరిన రేవంత్ రెడ్డి టీడీపీ పాత మిత్రులు, బీజేపీలో చేరి బయటకు వచ్చిన నాగం జనార్ధన రెడ్డి లాంటి మరికొందరు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ కాంగ్రెస్, మాజీ టీడీపీ నాయకులు కూడా ఆయన టచ్’లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తానికి, కేసీఆర్, గత ఏడేళ్ళుగా సామదానదండో పాయాలతో ప్రయోగించిన ఆకర్ష్ మంత్రం ఇప్పుడు రివెర్స్ గేర్’లో దూసుకు వస్తోందని, తెరాస వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జులై 7 న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ,అసలు సీన్ తెరమీదకు రాదని గాంధీ భవన్ వర్గాల సమాచారం. మరో వంక కేసీఆర్’కు ఇక మ్యూజిక్ తప్పదని, రాత్రులు నిద్ర  కూడా కష్టమేనని, రాజకీయ జ్యోతిష్కులు సైతం శుభం పలుకుతున్నారు.

జగన్ రెడ్డిని కుమ్మేసిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి చీఫ్ గా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెంచారు. మాములుగానే ఫైర్ బ్రాండ్ లీడర్ గా పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా ఎంపికయ్యాక మరింత స్పీడ్ పెంచారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. రోజుకో బాంబ్ పేల్చుతూ రాజకీయ కాక రేపుతున్నారు. రేవంత్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో, ఎవరిని టార్గెట్ చేస్తారో అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలైతే రేవంత్  తనను టార్గెట్ చేస్తారమోనన్న భయంతో వణికిపోతున్నారని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదంపై తన దైన శైలిలో స్పందించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు నీళ్ళు  సంస్కృతి... కానీ అవే నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం గా మారాయని ఆరోపించారు.పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా ...ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్దమన్నారు. రెండు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టీఏంసీల నీరు జగన్ ప్రభుత్వం  తరలించబోతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజు కు 1 టీఎంసీ  నీరు కు మించి తరలించలేరన్నారు.  జూరాలలో మనకు కనిపించిన నీరు...సంగంబండ తర్వాత కనపించదన్నారు రేవంత్ రెడ్డి. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుందని.. దీనికి ప్రధాన కారకుడు కేసీఆరే అని ఆరోపించారు. కృష్ణా నది నుండి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఆ తర్వాతే ప్రగతి భవన్ లో జగన్ కు కేసీఆర్ అథితి మర్యాదలు చేశారని చెప్పారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్  సమావేశం తర్వాతే  రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు కేసీఆర్ అమ్ముడు పోవడం వల్లే ఈ  పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.  తెలంగాణ లో ఉన్న ఆంధ్ర వాల్లకోసమే గట్టిగా మాట్లాడట్లేదని జగన్ అనడం హాస్యాస్పదమ్ననారు రేవంత్ రెడ్డి. తన తండ్రి ని తిడితే నోరు మెదపని వాడు ఏపీకి ఏం న్యాయం చేస్తారని సెటైర్ వేశారు.  వైఎస్ ను తిడితే...అటు జగన్ ,ఇటు విజయమ్మ ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి   కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు ..వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారని చెప్పారు.  జలవివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ ఇదన్నారు. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  జులై 8 వైఎస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ కూతురు తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు.  వైఎస్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారు..  అంతే గాని తెలంగాణ లో ఏం చేసినా చెల్లుతుంది అంటే కుదరదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ,వైఎస్  అంటే సంక్షేమం గుర్తుకు వస్తుందన్న రేవంత్ రెడ్డి.. అలాంటి వారిని తిడితే  కుష్ఠురోగం వస్తుందన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు  ,కేటీఆర్ ఆర్థిక ప్రయోజనం వల్లే సమస్య వచ్చిందన్నారు. తెలంగాణ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు.. ఎవరిని రెచ్చగొట్టడం కోసమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ సెంటిమెంట్ తో కేసీఆర్ గద్దెనెక్కాడో.. అదే సెంటిమెంట్ తో అందపాతాలానికి పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు ,నిధులు ,నియామకాలు.. ఈ మూడే కేసీఆర్ ను గద్దె దించుతాయని స్పష్టం చేశారు.