జ‌గ‌న్‌ స‌ర్కారుకు కేంద్రం బిగ్ షాక్‌.. ఇప్పుడెలా..?

న‌వ‌ర‌త్నాల పేరుతో ఖ‌జానా ఖాళీ చేశారు. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేశారు. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డ‌మే చాలా క‌ష్టం అవుతోంది. చేసిన ప‌నుల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులే ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ ఖాతాలో పైసా కూడా లేదంటున్నారు. ఈ విష‌యం స్వ‌యంగా అధికారులే హైకోర్టుకు చెప్పారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. డ‌బ్బుల కోసం భూముల వేలానికీ సిద్ధ‌మ‌య్యారు. పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఆదాయం పెరుగుతుంది. అది వ‌దిలేసి.. ఓట్ల కోసం సంక్షేమ ప‌థ‌కాలతో ఊద‌ర‌గొడితే.. ఉన్న సొమ్ముంతా ఖ‌ర్చ‌యిపోతోంది. అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేసినా బాగుండేది.. ఎంతోకొంత ఏపీ ఇమేజ్ పెరిగి కంపెనీలు పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చేవి. సీఎం జ‌గ‌న్ అరాచ‌క విధానాల‌తో రాష్ట్రం దివాళా తీస్తోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆర్థిక క్లిష్ట ప‌రిస్థితుల్లో కేంద్రం రూపంలో మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది.  ఏం చేసినా.. ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏపీ స‌ర్కారుకు అప్పు ముట్ట‌డం లేదు. ఇప్ప‌టికే లిమిట్ దాటేయ‌డ‌మే.. కొత్త అప్పుల‌కు కేంద్ర స‌ర్కారు చెక్ పెట్టింది. తాజాగా, ఏ మేర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన తాఖీదు.. జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేయ‌డం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టే. రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. ఉన్న లిమిట్‌నూ త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  ఇష్టారీతిన చేసిన అప్పులే.. ఇప్పుడీ కొత‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఏపీ పంపిన వివ‌రాలు స‌మ‌గ్రంగా ప‌రిశీలించిన త‌ర్వాత.. రుణ పరిమితిలో భారీ కోత పెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ‌. రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి కన్నా ఇంతకుముందు సంవత్సరాల్లోనే అదనంగా రూ.17,923.94 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం గుర్తించింది. దీంతోపాటు ఇతరత్రా అప్పుల రూపంలోనూ రూ.6,000 కోట్లు మినహాయించింది. అన్నీ కలిపి ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితికి రూ.23,924 కోట్ల కోత పడి... చివరకు రూ.27,668 కోట్లకు చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.27,668 కోట్లకే రుణాన్ని పరిమితం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితి రూ.37,163 కోట్లకు పరిమితమైంది. నికర రుణపరిమితి రూ.51,592 కోట్లకు చేరింది.  అప్పుల‌నే న‌మ్ముకొని సంక్షేమ ప‌థ‌కాల‌తో ఊద‌ర‌గొడుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రం విధించిన ఈ ష‌ర‌తు బిగ్ షాక్ అనే చెబుతున్నారు. అప్పు ప‌రిమితిలో కోత ప‌డ‌టంతో.. ఇప్పుడిక తిప్ప‌లు త‌ప్ప‌వంటున్నారు. మ‌రి ఈ అప్పుల ఊబి నుంచి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.    

సర్కార్ పై ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యుద్ధం! ఏం జరగనుందో... 

వాళ్లిద్దరు అధికార పార్టీ  ఎమ్మెల్యేలు .. అయినా ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఏకంగా యుద్ధమే ప్రకటించారు. సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉద్యమానికి దిగడం సంచలనంగా మారింది. అధికార పార్టీలో గందరగోళానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆదిలాబాద్. ఖమ్మం  జిల్లాల ఏజెన్సీలో  పోడు భూముల వివాదం ముదిరింది. ఆదిలాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోని అడవి భూములున్న ప్రాంతాలకు పాకింది. మంచిగా వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో ఉండాల్సిన పోడు రైతులు పోరు బాట పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా తాము సైతం సై అన్నట్టుగా రైతుల పక్షాన గళం విప్పుతున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో పోడు ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అయితే ఆ ప్రాంతంలో పులులు సంచరించడంతో జనాలు బయటికి రావడానికి భయపడ్డారు. పులి భయానికి కొంత కాలం పోడు వ్యవసాయం  ఆపేశారు. ఇదే అదనుగా భావించిన స్థానిక అటవీశాఖ ఇక్కడి భూములను ఆక్రమించే యత్నం చేసింది. హరితహారం సాకుగా చూపి.. ఇక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేసింది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తమ ప్రభుత్వ అధికారులతోనే పంచాయతీ మొదలైంది. దీంతో పొడు భూముల్లో భీకర వాతావరణం ఎందుకు నెలకొంది.. ఆదివాసీలకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు సార్లు అటవీశాఖ అధికారులపై యుద్ధం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆదివాసీ బిడ్డలు కదలి రావాలి అని పిలుపునిచ్చారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కూడా అటవీశాఖ పై యుద్దానికి సిద్ధం అంటూ ప్రకటన చేశారు.విత్తనాలు నాటకుండా అధికారులు అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయనిహెచ్చరించారు.గతంలో ఇదే నియోజకవర్గంలో పొడుభూముల విషయంలో కొనప్ప తమ్ముడుపై అటవీశాఖ అధికారులపై దాడి చేశాడని కేసులు కూడా పెట్టారు. పొడు భూముల్లో ఆదివాసులకు వ్యవసాయం అనుమతి లేదంటూ ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకోవడం వారికి వీరికి మధ్య గొడవలు జరగడం ఒకానొక సందర్భంలో దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు అటవీశాఖ అధికారులకు ఎంత చెప్పినా సీన్ రిపిట్ అవ్వడం పట్ల పొడు భూములు ఉన్న ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. పొడు భూముల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో  తమ నియోజకవర్గాల్లో ఆదివాసీ ఓటు బ్యాంక్ కలిగిన ఎమ్మెల్యలు  అటూ ప్రభుత్వ అధికారులను ఎదిరించలేక.. ఇటు తమ ప్రజలను కాదనలేక నలగిపోతున్నారట.  

సంచలనం..రేవంత్ రెడ్డి గూటికి దానం నాగేందర్?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయా? టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో పొలిటికల్ సీన్ మారిపోనుందా? అంటే అవుననే తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగిన కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని సమాచారం. ఎవరూ ఊహించని సంచలనాలు త్వరలో జరగబోతున్నాయని అంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని, రాజకీయ పునరేకీకరణపేరున, ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షణ మంత్రంతో ఎగరేసుకుపోయారు గులాబీ బాస్. అప్పుడు అదే దిశలో  కేసీఆర్ కు ఎదురు గాలి మొదలైందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే కేసీఆర్ కు గాంధీ భవన్ సెగ తగులుతోందని సమాచారం. గతంలో గత్యంతరం లేక కాంగ్రెస్ ను వదిలి గులాబీ పార్టీలో చేరిన చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు మళ్ళీ సొంతగూటికి చేరేందుకు సిద్డంవుతున్నారని, అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న, మాజీ మంత్రి, ప్రస్తుత  ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి  నాయకులు చాలామంది తెరాసలో ఉక్కపోతకు గురవుతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో సిటీ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఆసిఫ్ నగర్ నుంచి మూడు మార్లు, ఖైరతాబాద్ ఒకసారి ఎన్నికైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలముందు తెరాసలో చేరారు. ఖైరతాబాద్ నుంచి  తెరాస అభ్యర్ధిగా పోటీచేసి మరో మారు, ఎన్నికయ్యారు. సీనియర్ నేతగా ఉన్నా తెరాసలో నాగేందర్ కు సీనియారిటీ, చురుకుతనానికి గుర్తింపు దక్కలేదు. గుంపులో గోవిందయ్యలా మిగిలి పోయారు. ఇప్పుడు, రేవంత్ రాకతో, కాంగ్రెస్ పునర్జీవనంఫై ఆశలు పెరగడంతో, ఆయన తిరిగి సొంతగూటికి  చేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మాతృ సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు, తనవంతుగా కృషిచేస్తానని, అందు కోసం అవసరం అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నట్లు ఆయన తమ సన్నిహితుల వద్ద దానం నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది.  ఒక్క నాగేందర్ మాత్రమే కాదు, మరి కొందరు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు, ప్రస్తుత తెరాస ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి గాంధీ భవన్ బాట పట్టేందుకు సిద్డంవుతున్నారని, విశ్వసనీయ వర్గాల సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.  అందులో 12 మంది కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే, అందులో చాలా మంది అసంతృప్తితో రగిలి పోతున్నారు. పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హమీలలో ముఖ్యమంత్రి మరిచి పోయారని మంది పడుతున్నారు.  ఇంతకాలం  గత్యంతరం లేక పార్టీలో సర్దుకు పోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రేచుక్క రేవంత్ ఆశతో  తిరిగి సొంత గూటికి చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క  కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరినవారే కాకుండా, తెరాసలో చేరిన రేవంత్ రెడ్డి టీడీపీ పాత మిత్రులు, బీజేపీలో చేరి బయటకు వచ్చిన నాగం జనార్ధన రెడ్డి లాంటి మరికొందరు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ కాంగ్రెస్, మాజీ టీడీపీ నాయకులు కూడా ఆయన టచ్’లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తానికి, కేసీఆర్, గత ఏడేళ్ళుగా సామదానదండో పాయాలతో ప్రయోగించిన ఆకర్ష్ మంత్రం ఇప్పుడు రివెర్స్ గేర్’లో దూసుకు వస్తోందని, తెరాస వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జులై 7 న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ,అసలు సీన్ తెరమీదకు రాదని గాంధీ భవన్ వర్గాల సమాచారం. మరో వంక కేసీఆర్’కు ఇక మ్యూజిక్ తప్పదని, రాత్రులు నిద్ర  కూడా కష్టమేనని, రాజకీయ జ్యోతిష్కులు సైతం శుభం పలుకుతున్నారు.

జగన్ రెడ్డిని కుమ్మేసిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి చీఫ్ గా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెంచారు. మాములుగానే ఫైర్ బ్రాండ్ లీడర్ గా పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా ఎంపికయ్యాక మరింత స్పీడ్ పెంచారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. రోజుకో బాంబ్ పేల్చుతూ రాజకీయ కాక రేపుతున్నారు. రేవంత్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో, ఎవరిని టార్గెట్ చేస్తారో అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలైతే రేవంత్  తనను టార్గెట్ చేస్తారమోనన్న భయంతో వణికిపోతున్నారని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదంపై తన దైన శైలిలో స్పందించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు నీళ్ళు  సంస్కృతి... కానీ అవే నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం గా మారాయని ఆరోపించారు.పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా ...ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్దమన్నారు. రెండు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టీఏంసీల నీరు జగన్ ప్రభుత్వం  తరలించబోతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజు కు 1 టీఎంసీ  నీరు కు మించి తరలించలేరన్నారు.  జూరాలలో మనకు కనిపించిన నీరు...సంగంబండ తర్వాత కనపించదన్నారు రేవంత్ రెడ్డి. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుందని.. దీనికి ప్రధాన కారకుడు కేసీఆరే అని ఆరోపించారు. కృష్ణా నది నుండి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఆ తర్వాతే ప్రగతి భవన్ లో జగన్ కు కేసీఆర్ అథితి మర్యాదలు చేశారని చెప్పారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్  సమావేశం తర్వాతే  రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు కేసీఆర్ అమ్ముడు పోవడం వల్లే ఈ  పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.  తెలంగాణ లో ఉన్న ఆంధ్ర వాల్లకోసమే గట్టిగా మాట్లాడట్లేదని జగన్ అనడం హాస్యాస్పదమ్ననారు రేవంత్ రెడ్డి. తన తండ్రి ని తిడితే నోరు మెదపని వాడు ఏపీకి ఏం న్యాయం చేస్తారని సెటైర్ వేశారు.  వైఎస్ ను తిడితే...అటు జగన్ ,ఇటు విజయమ్మ ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి   కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు ..వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారని చెప్పారు.  జలవివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ ఇదన్నారు. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  జులై 8 వైఎస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ కూతురు తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు.  వైఎస్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారు..  అంతే గాని తెలంగాణ లో ఏం చేసినా చెల్లుతుంది అంటే కుదరదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ,వైఎస్  అంటే సంక్షేమం గుర్తుకు వస్తుందన్న రేవంత్ రెడ్డి.. అలాంటి వారిని తిడితే  కుష్ఠురోగం వస్తుందన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు  ,కేటీఆర్ ఆర్థిక ప్రయోజనం వల్లే సమస్య వచ్చిందన్నారు. తెలంగాణ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు.. ఎవరిని రెచ్చగొట్టడం కోసమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ సెంటిమెంట్ తో కేసీఆర్ గద్దెనెక్కాడో.. అదే సెంటిమెంట్ తో అందపాతాలానికి పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు ,నిధులు ,నియామకాలు.. ఈ మూడే కేసీఆర్ ను గద్దె దించుతాయని స్పష్టం చేశారు.

జగన్ జెండా ఎత్తేశారు..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు  జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ జెండా పీకేశారు. తెలంగాణ విభజనకు ముందు, 2014లో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో  వైసీపీ పోటీ చేసింది. మూడు అసెంబ్లీ ఒక లోక్ సభ  స్థానంలో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జగన్ రెడ్డి, అధికార దాహంతో ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో  ఏపీ మీద దృష్టి పెట్టి తెలంగాణలో తమను నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచేసి, పార్టీని గాలికి వదిలేశారు. దాంతో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ తెరాసలో చేరిపోయారు.అలాగే, తెలంగాణలో వైసీపీ జెండా పీకేయడంతో వైఎస్సార్ పట్ల అభిమానంతో, మంత్రి పదవిని వదులుకుని, వైసీపీలో చేరిన కొండా సురేఖ, ఆమె భర్త కొండ మురళి వంటి అనేక మంది రాజకీయ జీవితమే ప్రశ్నార్ధకంగా మారి  పోయింది. అప్పటినుంచి కొండా దంపతుల పొలిటికల్ జర్నీ అలా గాలిలో దీపంలాగా, కొట్టుమిట్టాడు తోంది. అలాగే, జగన్ రెడ్డిని నమ్ముకుని కాంగ్రెస్’ను వదిలి వచ్చిన ఇతర నాయకులలో కొందరు సొంతగూటికి చేరితే, మరి కొందరు కారెక్కారు.  మరో కొందరు రెంటికి చెడ్డ రేవడిలా  జగన్ రెడ్డి రాజకీయ స్వార్ధానికి రాజకీయంగా బలై పోయారు.   అలా బలై పోయిన నాయకుల్లో వైసీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.  నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, ఉద్యమ నాయకురాలు శంకరమ్మకు గట్టి పోటీ పోటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా, వైఎస్ మీద ఉన్న అభిమానంతో లేదా జగన్ రెడ్డి ఎదో ఒకనాటికి రాష్ట్రంలో పార్టీని నిలబెడతారనే ఆశతో అలాగే పార్టీలో ఉన్నారు.అయితే, ఇటీవల జగన్ రెడ్డి తెలంగాణలో తమ ఆస్తుల రక్షణ కోసం, కేసీఆర్’కు పూర్తిగా సరెండర్ కావడంతో, వైసీపీకి గుడ్ బై చెప్పారు. గురువారం తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి, జగన్ రెడ్డి స్వార్ధ  రాజకీయాలకు, అనేకమంది రాజకీయంగా తెరమరుగయ్యారని ఆవేదన వ్యక్త చేసారు.ఏదేమైనా గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడంతో తెలంగాణలో వైసీపీ సంపూర్ణంగా ... సమాధి అయిందని  అనుకోవచ్చును.

వైఎస్సార్ జయంతి రోజే జగన్ కు గండమా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌ పై కీలక పరిణామం జరిగింది. ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది శ్రీవెంకటేశ్‌ వాదనలు వినిపించారు. అధికారం ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. పిటిషన్‌ వేసిన తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించారని రఘురామ కోర్టుకు తెలిపారు. సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.  ఎంపీ రఘురామ రాజుకు పిటిషన్‌ వేసే అర్హత లేదని జగన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్‌ వేశారన్నారని ధర్మాసనానికి వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు.. రఘురామ ఆరోపణలకు బలమైన ఆధారాలు ఇవ్వలేదని అభిప్రాయపడింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణను జూలై  8కి వాయిదా వేసింది జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురాకృష్ణరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిగింది. గతంలో జరిగిన విచారణ నేపథ్యంలో రఘురామ పిటిషన్ పై జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ కు రఘురామ తిరిగి రీజాయిండర్ ఇచ్చారు.జగన్ కు బెయిల్ వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను రీజాయిండర్ ద్వారా రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న వారికి జగన్ వల్ల జరిగిన ప్రయోజనాలు, మీడియా, విపక్ష నేతలపై జగన్ కక్షసాధింపు విధానాలు, జారీ చేసిన జీవోలు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. తనపై దాఖలైన కేసులకూ జగన్ బెయిల్ రద్దుకూ సంబంధం లేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు. తనపై దాఖలైన కేసులన్నీ ఎఫ్ ఐఆర్ దశలో ఉన్నాయని, తాను దోషిగా ఎక్కడా నిరూపణ కాలేదని రఘురామ రీజాయిండర్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రీజాయిండర్ పై అదనపు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టును కోరారు. ఈ క్రమంలోనే గతంలో వాయిదా పడిన విచారణ గురువారం జరిగింది. రఘురామ రీజాయిండర్లపై కౌంటర్ వేస్తామని జగన్ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది. డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ తరఫు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  జగన్ బెయిల్ కేసులో విచారణకు జూలై 8కి వాయిదా వేయడంతో.. ఈ కేసులో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది. జూలై 8 దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి. అదే రోజును జగన్ బెయిల్ కేసు విచారణ జరగనుండటం మరింత ఆసక్తిగా మారింది. వైఎస్ జయంతి రోజునే జగన్ కు గండం ఉందా అన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరుగుతోంది. దీనిపై  ఎంపీ రఘురామ రాజు కూడా స్పందించారు.  మా వైపు నుండి తుది ముగింపు కోసం మరియు వ్రాతపూర్వక సమర్పణలను ఇవ్వడానికి మేటర్ జూలై 8 న పోస్ట్ చేయబడింది. సిబిఐ కూడా దీనికి ముందు తమ కౌంటర్ దాఖలు చేస్తుంది. కాబట్టి చివరకు ఈ విషయం మా డాక్టర్ వైయస్ఆర్ పుట్టినరోజున ముగుస్తుంది మరియు ఆర్డర్ ప్రకటించడం కొన్ని రోజుల తరువాత కావచ్చు. సత్యవ్మేవ జయతే అంటూ ఎంపీ రఘురామ రాజు ట్వీట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. 

ఉద్యమకారుల దూకుడు.. గులాబీ బాస్ కు గుబులు!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తొలగింపుతో రాజకీయాలు వేడెక్కాయి. నెల రోజుల పాటు అంతా ఆయన చుట్టూనే సాగింది. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడంతో అటెన్షన్ అంతా అటు వైపు మళ్లింది. మొన్నటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీని పోటీ ఇస్తుందని అంతా భావించారు. త్వరలో జరగబోయే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ కారు, కమలం మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేశారు. కాని పీసీసీ బాస్ గా రేవంత్ రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇకపై తెలంగాణలో త్రిముఖ పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  కేసీఆర్ సర్కార్ పై జనాగ్రహం తీవ్రంగా ఉందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. దీంతో ఇదే అదనకుగా కేసీఆర్ టార్గెట్ గా ఉద్యమ సంస్థలు యాక్టివ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ వర్గాల నేతలంతా ఏకమవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కేసీఆర్ వమ్ము చేశారని ఆరోపిస్తున్న ఉద్యమకారులు.. ఆయనపై ఉద్యమించేందుకు ఉమ్మడి వేదిక నిర్మిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమకారుడు, మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ నివాసంలో ఆదివారం  ఉద్యమకారులు సమావేశమై చర్చించారు. కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమ నేత  గాదె ఇన్నయ్య, స్వామిగౌడ్, ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి,  బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సాదానంద్, రవీంద్ర నాయక్ వంటి ఉద్యమ నేతలు హాజరయ్యారు.  అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ఉద్యమ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి వస్తామని చెప్పారు.ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా  ఒకే వేదిక మీదకు రావాలని పిలుపిచ్చారు.  హుజూరాబాద్‌లో ఉద్యమకారులతో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  అందులో భాగంగానే శుక్రవారం మరోసారి సమావేశమవుతున్నారు ఉద్యమ కారులు. ఆదివారం జరిగిన సమావేశానికి హాజరుకాని మరికొందరు ఉద్యమకారులు..శుక్రవారం భేటీకి వస్తారని చెబుతున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈ భేటీకి వస్తారని చెబుతున్నారు. ఈ సమావేశంలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతోంది ఉద్యమకారుల ఉమ్మడి ప్రజా స్వామ్య వేదిక.  తెలంగాణ ఉద్యమకారులు  హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరికి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. అందుకే టీఆర్ఎస్ వర్గాలు కూడా ఉద్యమకారుల కదలికలపై నిఘా పెట్టారని చెబుతున్నారు. 

మీడియా ట్రైల్స్ ప్రామాణికం కాదు :జస్టిస్ ఎన్వీ రమణ 

ఏది సత్యం, ఏది అసత్యం?అసలు ఏది, నకిలీ ఏది?ఏది తప్పు, ఏది ఒప్పు?ఏది మంచి, ఏది చెడు? ...అన్ని విషయాల్లో, అన్ని సందర్భాలలో కాకపోవచ్చును, అందరికీ కాకపోవచును కానీ, చాలా వరకు విషయాల్లో, చాలా సందర్భాల్లో చాలా మందికి  ఇలాంటి  మీమాంస ఎదురు కావడం సహజం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది కాదో తేల్చుకోవడం, చాలా చాలా కష్టం. చివరకు ఎంపీ స్థాయి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు, సత్యాన్ని అసత్యంగా,అసత్యాన్ని సత్యంగా చూపేందుకు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు అనేక చూస్తున్నాం.మంచి చెడులు, సత్యం అసత్యం మధ్య ఉన్న చిన్న సన్నని పొర సోషల్  మీడియాలో చెరిగి పోతోంది. చెదిరి పోతోంది. ఈ మాటలు ఇలాగే, కాకపోయిన ఇదే అర్థం వచ్చేలా అన్నది, ఎవరో కాదు, భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ.  నిజానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి, మరో టిప్పణి, వ్యాఖ్యానం అవసరం లేదు. ఎందుకంటే, స్వేఛ్చ గీత దాటితే, ఏమవుతుందో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి, దాని గురించి మరింతగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. కానీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బుధవారం ‘రూల్ అఫ్ లా’అనే అంశంపై చేసిన జస్టిస్ పీడీ దేశాయ్ 17వ స్మారకోపన్యాసంలోతైన చర్చకు మాత్రమే కాదు, ఆత్మ పరిశీలనకు అవకాశం కలిపించేలా ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసంధర్భంగా, జస్టిస్ రమణ  ఇతర విషయాలతో పాటుగా,, సోషల్ మీడియా ప్రమాణికతను గురించి విశాలంగా చర్చించారు. విలువైన  వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చే ప్రజాభిప్రాయాలను జడ్జీలు ప్రామాణికంగా తీసుకోరాదని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు.  సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని ఆయన హెచ్చరించారు. అరుపులు, ఆర్తనాదాలు, బిగ్గరగా చేసే నినాదాలు, నిజాలకుమెజారిటీ ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.సోషల్ మీడియాకు తాజా సమాచాన్ని అందించే సౌలబ్యం ఉంటుంది, అయితే, ఏది సత్యం, ఏది అసత్యం?అసలు ఏది, నకిలీ ఏది?ఏది తప్పు, ఏది ఒప్పు?ఏది మంచి, ఏది చెడు? అనేది విడమర్చి విశ్లేషించే సామర్ధ్యం ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. అంటే మీడియా ట్రయల్స్ అన్న దాన్ని న్యాయమూర్తులు తమ కేసులను నిర్ణయించేటప్పుడు ప్రామాణిక, మార్గదర్శకాలుగా తీసుకోరాదని ఆయన సూచించారు. కానీ అంతమాత్రాన జరుగుతున్న వాస్తవాలపై న్యాయవ్యవస్థ  పూర్తిగా విస్మరించరాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయ, శాసన వ్యవస్థ తదితరాలపై న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పుల ప్రభావాన్ని కూడా వీరు అంచనా వేయగలిగి ఉండాలన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీ ..ఈ మూడింటికీ రాజ్యాంగంలో సమాన పాత్ర ఉందని పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో జుడీషియరీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలని..దీనిపై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మరొకరి నియంత్రణ ఉండరాదని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే ప్రధాన బాధ్యత కేవలం కోర్టుల మీదే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉందని, న్యాయ వ్యవస్థ పాత్రకు పరిమితులున్నాయని తెలిపారు. తన ముందుకొచ్చిన విషయాలను మాత్రమే అది పరిశీలించగలదని, ఈ పరిమితే రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతలను మిగతా వ్యవస్థలకు అప్పగిస్తోందని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. నిజానికి జస్టిస్ ఎన్వీ రమణ తమ ప్రసంగంలో సోషల్ మీడియాను మాత్రమే ప్రస్తావించినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, మీడియా ట్రైల్స్ ప్రభావం న్యాయ వ్యవస్థ మీద  ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అదే విధంగా ప్రత్యక్ష్యంగా గానీ, పరోక్షంగా గానీ, న్యాయ వ్యవస్థపై  రాజకీయ భావజాలం ప్రభావం చూపుతోందనే ఆందోళన కూడా లేక పోలేదని , న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థతో పాటుగా, మారుతున్నపరిస్థితులు, సాంకేతికంగా ఇతరత్రా వస్తున్న మార్పలను దృష్టిలో ఉంచుకుని, అన్ని వ్యవస్థలో మార్పులు అవసరం అన్న మాట అన్ని వర్గాల నుంచి వినవస్తోంది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటినుంచంటే..!

తెలంగాణ ప్రజలకో గుడ్ న్యూస్. ఎంతో కాలందగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణికి ముహుర్తం కుదిరింది. త్వరలోనే కార్డులను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. గత నాలుగేండ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులతో పాటు సవరణలు, పిల్లలను చేర్చించడానికి జనాలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో అప్లయ్ చేసుకుని ఎప్పుడు ఇస్తారా అని ఆశగా ఉన్నారు. అయితే కేసీఆర్ సర్కార్ మాత్రం రేషన్ కార్డుల జారీని పట్టించుకోలేదు. దీంతో మీ సేవా కేంద్రాలు, అధికారుల చుట్టూ తిరిగి బేజారయ్యారు జనాలు.  ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా.. గత నాలుగేండ్లుగా తాను ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోయాయని  చెప్పారు. ఈటల ఎఫెక్ట్ తగిలిందో ఏమో తెలియదు కాదు.. రేషన్ కార్డుల పంపిణిపై ఫోకస్ చేసింది కేసీఆర్ సర్కార్. పెండింగులో ఉన్న ధరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించింది. దీంతో రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్లును పరిశీలంచగా.. దాదాపు ఐదు లక్షల వరకు పెండింగులో ఉందని తేలింది. వాటన్నింటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. వీలైనంత త్వరగా కొత్త కార్డులు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కేటిఆర్ .. కొత్త రేషన్ కార్డుల పంపిణిపై ప్రకటన చేశారు. జూలై8 నుంచి కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. పెండింగు ధరఖాస్తుల పరిశీలన పూర్తైందని, అర్హులైన వారందరికి కార్డులు  ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గత 70 సంవత్సరాల్లో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడు సంవత్సరాల్లో చేసి చూపించామ‌ని మంత్రి కేటిఆర్ తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్లే మానేరు నిండింద‌న్నారు. మండు వేసవిలో న‌ర్మాల చెరువు మ‌త్త‌డి పడిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండ‌టంతో మ‌త్స్య‌కారులు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే... చెరువులు బాగు ప‌డ్డాయ‌ని అన్నారుయ తెలంగాణ ఏర్ప‌డ్డాకే రాష్ర్టంలో 24 గంట‌ల క‌రెంట్ వ‌చ్చింద‌న్నారు.   ఇక గ్రామాల్లో త్వ‌ర‌లోనే రెండో విడ‌త గొర్రెల పెంప‌కం చేప‌డుతామ‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ర్టంలోని 12,769 గ్రామ పంచాయ‌తీల్లో ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్, న‌ర్స‌రీ ఏర్పాటు చేశామ‌న్నారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ అమ‌లు చేస్తోంద‌న్నారు. హరిత హారం సంధర్భంగా ఊరంతా మొక్క‌లు నాటి పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. క‌రోనా స‌మ‌యంలో ఆక్సిజ‌న్ విలువ అంద‌రికీ తెలిసిందని.అందుకే.. ప్ర‌తి ఇంట్లో ఉన్న ఒక్కొక్క‌రు క‌నీసం ఒక మొక్క నాటి పెంచాల‌ని సూచించారు.హరితహారం ప్రభుత్వ కార్యక్రమమే కాదని.. ప్రజల కార్యక్రమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రూ.5,900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందన్నారు.

ఉప్పెన‌లా మ‌ళ్లీ అమ‌రావ‌తి ఉద్య‌మం.. ఇక త‌గ్గేదే లే..!

600 రోజుల దిశ‌గా అడుగులు. అమ‌రావ‌తి కోసం అలుపెర‌గని పోరాటం. మ‌డ‌మ తిప్ప‌ని, వెన‌క్కి త‌గ్గ‌ని ఉద్యమం. ఎండా-వానాను లెక్క చేయ‌డం లేదు. కేసులు, కుట్ర‌ల‌కు త‌ల వంచ‌డం లేదు. లాఠీ దెబ్బ‌ల‌కు బెద‌ర‌డం లేదు. క‌రోనాకూ భ‌య‌ప‌డ‌టం లేదు. కాల ప‌రీక్ష‌కు నిలిచి ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని కోసం నిర్విరామంగా పోరాడుతున్నారు. క‌నుచూపుమేర‌లో ఫ‌లితం కాన‌రాకున్నా.. క‌ళ్ల‌ల్లో నీళ్లు ఇంకుతున్నా.. గుండెల్లో ధైర్యం మాత్రం స‌డ‌ల‌లేదు. అమ‌రావ‌తి కోసం అవిశ్రాంత పోరాటం ఆప‌డం లేదు.  క‌రోనా విజృంభ‌ణ‌తో అమ‌రావ‌తి ఉద్య‌మం సైడ్‌వేస్‌లోకి వెళ్లినా.. ఇప్పుడు కేసులు త‌గ్గ‌డం, క‌ర్ఫ్యూ స‌డ‌లించ‌డంతో మ‌ళ్లీ ప‌డిలేచిన కెర‌టంలా ఉవ్వెత్తున ఎగుస్తోంది. అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ త‌మ త‌డాఖా చూపిస్తున్నారు. క‌లిసివచ్చే ప్ర‌తీ సంద‌ర్భాన్ని పోరాట అంశంగా మార్చుకుంటున్నారు. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా పోరాడుతాం.. ఒక్క నీటి చుక్క కూడా వ‌దులుకోమంటూ.. వైఎస్ ష‌ర్మిల ట్వీట్ చేయ‌డం అమ‌రావ‌తి రైతుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. త‌మ ప‌క్క‌నుంచి పారే కృష్ణాన‌దిని తెలంగాణ అడ్డుకుంటుంటే.. ఏపీ బిడ్డ అయిన ష‌ర్మిల వారికి ఎలా వంత పాడుతారంటూ.. ఛ‌లో లోట‌స్ పాండ్ నిర్వ‌హించారు ఇక్క‌డి రైతులు. డొంక తిరుగుడు ట్వీట్లు కాదు.. కృష్ణా జ‌లాల‌పై స్ప‌ష్ట‌మైన వైఖ‌రి చెప్పాలంటూ ష‌ర్మిల‌ను నిల‌దీస్తూ హైద‌రాబాద్‌లోని ఆమె ఇంటిని ముట్ట‌డించారు. ఎక్క‌డి అమ‌రావ‌తి రైతులు. ఎక్క‌డి ష‌ర్మిల‌. తానేదో త‌న మానాన తాను మాడిపోయిన మ‌సాలా దోష తింటూ.. వాట‌ర్ వార్‌లో మ‌రింత మ‌సాలా జోడించేందుకు అన్న‌ట్టు.. అప్పుడెప్పుడో బ‌ట్టీ ప‌ట్టేసి వ‌దిలిన పాత డైలాగుల‌ను ఇప్పుడు మ‌ళ్లీ కొత్త‌గా రిపీట్ చేస్తే.. తెలంగాణ వాళ్లే ప‌ట్టించుకోలేదు.. అమ‌రావ‌తి రైతులు ఇంత‌ సీరియ‌స్‌గా తీసుకున్నారేంట‌బ్బా అంటూ ష‌ర్మిల‌మ్మ అవాక్క‌యి ఉంటారు. అమ‌రావ‌తి రైతులా.. మ‌జాకా. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించే ఏ అంశంపైనైనా వారు నో కాంప్ర‌మైజ్ అన్న‌ట్టు పోరాడ‌టం వారి నైజం. అందుకే, రాజ్యం ఎన్ని కుట్ర‌లు చేస్తున్నా.. అమ‌రావ‌తిని ఆగం చేయాల‌ని చూస్తున్నా.. మొక్క‌వోని ప‌ట్టుద‌ల‌తో.. ఇటు హైకోర్టులో, అటు ప్ర‌జాక్షేత్రంలో పోరాడుతున్నారే కానీ.. జ‌గ‌న్‌లా మాట‌త‌ప్పడం.. మ‌డ‌మ తిప్పడం.. చేయ‌డం లేదంటున్నారు. అందుకే, ష‌ర్మిల చేసిన ట్వీట్‌తో వాళ్ల‌కు ఒళ్లుమండి.. ప‌క్క రాష్ట్రం వెళ్లి మ‌రీ.. లోట‌స్‌పాండ్‌ను ముట్ట‌డించడం.. అమ‌రావ‌తి రైతుల ప‌ట్టుద‌లకు నిద‌ర్శ‌నం. వీరిని కాద‌ని అమ‌రావ‌తిని అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డం ఎవ‌రి త‌రం కానేకాదు. ఆఖ‌రికి సీఎం జ‌గ‌న్‌కు సైతం కోర్టులో ఎదురుదెబ్బ త‌ప్ప‌దు. దొంగ‌దారిలో విశాఖ‌కు రాజ‌ధానిని షిఫ్ట్ చేయగ‌ల‌రేమో కానీ, అధికారిక రికార్డుల నుంచి అమ‌రావ‌తి పేరును మార్చ‌డం జేజ‌మ్మ త‌రం కూడా కాదంటున్నారు ఇక్క‌డి రైతులు.   కరోనా కాస్త కంట్రోల్‌లోకి రావ‌డంతో అమ‌రావ‌తి ఉద్య‌మం మ‌ళ్లీ ఉవ్వెత్తున ఎగుస్తోంది. వైఎస్ ష‌ర్మిల ఇంటిముట్ట‌డితో శుభారంభం చేసిన‌ట్టున్నారు రైతులు. ఆ టెంపో కంటిన్యూ చేస్తూ.. బుధ‌వారం సీఎం జ‌గ‌న్ కరకట్ట విసర్తణ పనులకు శంకుస్థాపన చేసి మందడం మీదుగా సచివాలయానికి వెళ్తుండగా.. స్థానికి రైతులు.. జై అమరావతి, సేవ్‌ అమరావతి అంటూ పెద్ద ఎత్తున‌ నినాదాలు చేశారు. దాదాపు 200 మంది పోలీసులను మోహరించినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. షాపులు మూయించి.. పోలీసులు అడ్డుగోడ‌గా నిల‌బ‌డి.. ఉద్యమకారులను గృహనిర్బంధంలో ఉంచి.. ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా.. జై అమ‌రావ‌తి, సేవ్ అమ‌రావ‌తి నినాదాలు జ‌గ‌న్ చెవికి సోక‌కుండా అడ్డుకోలేక‌పోయారు.    మ‌రోవైపు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మ‌రోసారి రాజధాని దళిత రైతుల సెగ తగిలింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత నియోజకవర్గానికి వస్తున్న ఆమెను రాజధాని గ్రామాల నుంచి గుంటూరుకు ర్యాలీగా తీసుకు వెళ్లాలని అనుచరులు భావించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా.. అసైన్డ్ రైతులకు కౌలు, ఫించన్ రూ.5 వేలు, టీడ్‌కో గృహాలు కేటాయించకుండా గ్రామాల్లోకి ఎలా  వస్తారంటూ రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఏం సాధించారని రాజధాని గ్రామల్లో ర్యాలీ నిర్వహిస్తారంటూ.. ఎమ్మెల్యే శ్రీదేవీ ర్యాలీని అడ్డుకునేందుకు దళిత రైతులు ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  క‌రోనా త‌గ్గిందిగా.. ఇది జ‌స్ట్ శాంపిల్ మాత్ర‌మే. ముందుముందు ఉద్య‌మం మ‌రింత ఉధృతం చేస్తాం.. సీఎం జ‌గ‌న్ దిగొచ్చేదాకా.. త‌గ్గేదే లే.. అంటున్నారు అమ‌రావ‌తి రైతులు.   

ప్రియాంకకు పార్టీ పగ్గాలు? రాహుల్ వద్దంటున్న లీడర్లు...

కాంగ్రెస్ పార్టీ అంటే, ఆ ముగ్గురే, కాదు, ఇంకా, కీలక నేతలు చాలా మంది ఉన్నారు. అయినా, పార్టీ  నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మీడియా చివరకు రాజకీయ ప్రత్యర్ధులు, పార్టీలోని అసమ్మతులు అందరూ కూడా, సోనియా, రాహుల్, ప్రియాంకా ఈ ముగ్గురే, కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అనే భావంతో, ఆ ముగ్గురే పార్టీ అనే అభిప్రాయంతో ఉంటారు. ఆ ముగ్గురు చుట్టూనే పార్టీ వ్యవహరాలు నడుస్తున్నాయి. నిజమే, ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ అనే అభిప్రాయమే అందరిలో బలంగా నాటుకు పోయింది.  గత లోక్ సభ ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోమని సీడబ్ల్యుసీ సమావేశంలో సోనియా, ప్రియాంక సమక్షంలో  ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.  అయినా నెలల తరబడి కిందా మీద పడి చివరకు, ఆ బాధ్యతలను పార్టీ వృద్ద నాయకురాలు సోనియాకే అప్పగించారు. ఇప్పటికి కూడా ఆమె ఆ మోయలేని భారాన్ని మోస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో మరో కోణంలోంచి చర్చ మొదలైందని అంటున్నారు. పంజాబ్ కాంగ్రెస్’లో గత కొంత కాలంగా సాగుతున్న అంతర్యుద్ధం వ్యవహారం,చిలికి చిలికి  రాహుల్  గాంధీ, ప్రియాంకా వాద్రాల మధ్య కూడా చిచ్చు పెట్టిందని, చివరకు రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడుతోందని అంటున్నారు. ఇక విషయంలోకి వెళితే, పంజాబ్ కాంగ్రెస్’లో గత కొంత కాలంగా  అంతర్యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాలుగా  పార్టీ చీలిపోయింది. సిద్ధూ వర్గం ముఖ్యమంత్రిపై తిరుగుబాటు జెండా ఎగరేసింది. ముఖ్యమంత్రిని అర్జెంటుగా మార్చేయాలని, లేదంటే... అంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసింది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో పార్టీలో తలెత్తిన ఈ సంకటం, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపధ్యంలోనే ఓ వంక ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో వంక అంతర్గత కలహాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇరు వర్గాలను కలిసి మాట్లాడి, ఓ నివేదికను అధిష్టానానికి సమర్పించింది.  తమ వాదనను వినిపించేందుకు సిద్దూ రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు. అయితే, సిద్దూను కలిసేందుకు రాహుల్ గాంధీ నో’ అనేశారు. ఆయనకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే, అప్పటికే, రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ప్రకటించుకున్న సిద్దూ షాకయ్యారు. మరో వంక రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నిస్తే, ఆయన  చిటపటలాడారు, చిందు లేశారు. ఏం మీటింగ్.. మీరేం మాట్లాడుతున్నారంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో సిద్ధూ... కొంచెం చాలా అవమానానికి గురయ్యారు. కొద్దిగా నొచ్చుకున్నారు. అయితే, ఆ విషయం ఎలాగో ప్రియాంక చెవిన వేసి, ఆమె అప్పాయింట్మెంట్ కోరారు.. అడిగిందే తడవుగా ఆమె అప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా మూడు గంటల సేపు సిద్దూ గోడు  విన్నారు. రాహుల్ కాదన్నా ప్రియాంక తనకు అప్పాయింట్మెంట్ ఇచ్చారని సిద్దూ ఫుల్ జోష్’లోకి వెళ్లారు. ప్రియాంకతో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ బకరా అయ్యారు. రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అంటూ, ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్  బయలు దేరింది. ఇటు సిద్ధూ కూడా రాహుల్’ను కార్నర్ చేసేందుకే  ఫోటోను ట్వీట్ చేశాడా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇదలా ఉంటే, సిద్దూను రాహుల్ గాంధీ అవమానపరిచిన నేపధ్యంలో, గతంలో అస్సాంకు చెందిన కీలక కాంగ్రెస్ నేత, ప్రస్తుత ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను రాహుల్ గాంధీ ఇదే విధంగా అవమాన పరిచిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. రాహుల గాంధీ కుక్క పిల్లతో ఆడుకుంటూ, తనను పట్టించుకోక పోవడంతో అవమానానికి గురైన శర్మ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఈశాన్య రాష్ట్రలలో పట్టుమని పది సీట్లు లేని పార్టీని తిరుగు లేని శక్తిగా బలోపేతం చేశారు.శర్మ కారణంగానే  వరసగా రెండవసారి అస్సాంలో బీజీపీ అధికారంలోకి  వచ్చింది. అంతే కాదు కమ్యూనిస్టుల కంచుకోట త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలు మొత్తాని శర్మ బీజేపీ పట్టులోకి తెచ్చారు.  ఈ నేపధ్యంలో రాహుల్ వర్సెస్ ప్రియాంక అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఎటూ రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి పై ఆసక్తి లేదు, రాజకీయాలు ఆయన ఫస్ట్ ప్రయారిటీ కాదు. కాబట్టి ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న వాదనను కొందరు తెరపైకి  తెస్తున్నారు. నిజానికి, ఇది కొత్తగా వస్తున్న వాదన కూడా కాదు,అయితే, గతంలో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంతగా ఉత్సాహం చూపలేదు, కానీ, ఇప్పడు, అందుకు ఆమె కూడా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, సోనియా గాంధీకి  ఇంకా రాహుల్ మీద ఆశలు ఉన్నాయని, ఆమె ఏమంటారో చూడవలసి ఉందని కొందరు పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి, ప్రియాంకకు పార్టీ పగ్గాలు? ప్రస్తుతానికి ఇంకా ప్రశ్న ? గానే ఉన్నా త్వరలోనే ఆశ్చర్యార్ధక !’ మై నిలుస్తుందని, ఆమే కాబోయే కాంగ్రెస్ అద్యక్షురాలని కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగావినవస్తోంది.

రెండేళ్లుగా ఇంటి పన్ను బాకీ.. జగన్ కు రూల్స్ వర్తించవా! 

సామాన్యుల్లో ఎవరికైనా వంద లేదా 200 గజాల్లో ఇల్లు ఉండి.. దానికి ఆస్తిపన్ను సరిగ్గా కట్టకపోతే ఏం జరుగుతుంది? పెనాల్టీలు, దానిపై వడ్డీలు, చక్రవడ్డీలు వేసి వసూలు చేస్తారు. నోటీసులు అంటిస్తారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌, ఇతర సదుపాయాలు ఆపేస్తారు. పన్ను కట్టాలంటూ ఇంటి దగ్గరకు అధికారులు వెళ్లి నానా హంగామా చేస్తారు.  చెత్తను ఆ ఇంటి ముందు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అధికారుల చేసే ఈ జులూం అంతా పేదలు, మధ్య తరగతి ప్రజలపైనే కనిపిస్తుంది... పెద్దల జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు.. ఏపీలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రభుత్వ పెద్దే ఇంటి పన్ను కట్టని వైనం సంచలనంగా మారింది. అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది...  ఇటీవలే జగన్ రెడ్డి సర్కార్ పన్నులు పెంచింది. అసలే కొవిడ్ తో సమస్యలు పడుతున్న జనాలకు ఇది మరింత భారంగా మారింది. పన్నులు పెంచడం సరికాదని విపక్షాలు మొత్తుకుంటున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు కూడా పెంచేసింది. రిజిస్ట్రేషన్ చార్జీలు ఆఖరికి చెత్తపై కూడా పన్ను విధించారు. అయితే జనాలపై ఇష్టమెచ్చినట్లుగా పన్నులు విధించి  ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న సీఎం జగన్ రెడ్డి మాత్రం..  తన సొంత ఇంటికి పన్ను కట్టడం మరచిపోయారు. ఏదో ఒక నెలో.. రెండు నెలలో కాదు.. ఏకంగా గత రెండేళ్లుగా జగన్ ఇంటికి పన్నులు కట్టడం లేదు .గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీకి జగన్ 16లక్షల రూపాయలపై పైగా బాకీ పడ్డారని లెక్కలు చెబుతున్నాయి. తాడేపల్లి మునిసిపల్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది స్పష్టంగా ఉంది. జగన్‌ సీఎం అయినప్పటి నుంచి ఇంటికి కానీ, కార్యాలయానికి కానీ ఆస్తి పన్ను చెల్లించడంలేదు.  ముఖ్యమంత్రి జగన్‌కు తాడేపల్లిలో భారీ నివాసం ఉంది. అందులో రెండు బ్లాక్‌లున్నాయి. 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు ఉంది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్‌ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి - 522501. ఇక... ఇదే ఆవరణలో 219 చదరపు మీటర్లలో నివాసంఉంది. దీని డోర్‌ నంబర్‌ 12-353/2/5. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండూ సీఎం సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డుల ప్రకారం ఆఫీసు కోసం ఉపయోగిస్తున్న భారీ భవనాన్ని కమర్షియల్‌గా, ఇంటిని నివాస ప్రాంతంగా చూపించారు. వార్షిక రెంటల్‌ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి... ఆ మేరకు ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది.  మునిసిపల్‌శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. అంటే... మునిసిపల్‌ శాఖకు జగన్‌ రూ.13,85,196 పన్ను బాకీ పడ్డారు. ఏళ్ల తరబడి పన్నులు కట్టకుండా ఉంటే మునిసిపల్‌ శాఖ ఊరుకోదు కదా.. ఆటోమేటిక్‌గా పెనాల్టీలు పడతాయి. ఆ జరిమానా రూ.2,82,103. వెరసి అసలూ, జరిమానాలు కలిపి భారతీ రెడ్డి మునిసిపల్‌ శాఖకు రూ.16,67,299 బాకీ పడ్డారు. జగన్ ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే… దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ… జగన్‌ ఇల్లు, సీఎం క్యాంపు ఆఫీసు…ఉన్న భవనాలు ఆయన సతీమణి భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయి. రూల్స్ ప్రకారం ప్రైవేటు నివాసాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఉంటే సంబంధిత భవన యజమానే స్థానిక పన్నులు భరించాలి. ఈ నిబంధన ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లుకు పన్ను భారతీ రెడ్డి చెల్లించాలి. సామాన్యులు ఇంటి పన్ను కట్టకుంటే నోటీసులు పంపి నానా యాగీ చేసే అధికారులు… ఇప్పటిదాకా భారతీ రెడ్డికి కనీసం నోటీసులు జారీ చేయకపోవడమే  విస్మయం కల్గిస్తోంది.  జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఆఫీసు, ఇంటి నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను కట్టడంలేదు. సీఎం అయ్యారు కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం లేదని... ఆయన నివాసం, కార్యాలయానికి ప్రభుత్వమే పన్ను చెల్లించాలని ఎవరైనా అనుకోవచ్చు. కానీ... అది కుదరదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌కు వేతనం, ఇతర అలవెన్సులు ప్రభుత్వ ఖజానా నుంచి లభిస్తాయి. ఆయన తరఫున ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లిస్తుంది. ఒకవేళ ఆయన ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే... దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ... జగన్‌ ఉంటున్నది ప్రైవేటు భవనాలలో. సర్కార్  నిబంధనల ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లు కొలువుదీరిన భవనాలకు వైఎస్‌ భారతీ రెడ్డి పన్ను చెల్లించాలి. 

రెడ్డీస్ లేబొరేటరీస్ కు కేంద్రం షాక్.. 

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దేశంలోని ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కు అనుమతిని నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) నిపుణులు స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ కు అనుమతులపై బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ పై మూడో దశ ట్రయల్స్ చేయడానికి ఎలాంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించట్లేదని, కాబట్టి రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.  “రెడ్డీస్ ట్రయల్స్ చేయాలనుకుంటున్న స్పుత్నిక్ లైట్.. స్పుత్నిక్ వీలో మొదటి డోసే. అంతకుముందు స్పుత్నిక్ వీకి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ ప్రభావం గురించి ముందే తెలిసింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ డేటా చూస్తే అది అంత ప్రభావవంతం కాదని తేలింది. కాబట్టి స్పుత్నిక్ లైట్ పై మరోసారి ట్రయల్స్ చేసేందుకు ఎలాంటి హేతుబద్ధత కనిపించట్లేదు’’ అని ఎస్ఈసీ  నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మేలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి వచ్చాయి. తొలుత లక్షన్నర డోసులను రష్యా పంపించగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు 30 లక్షలకుపైగా డోసులను పంపించింది. రీకాంబినెంట్ డీఎన్ఏ సాంకేతికతతో అడినోవైరస్ వెక్టార్లుగా స్పుత్నిక్ వీని అభివృద్ధి చేశారు. రీకాంబినెంట్ అడినోవైరస్ 26 (ఆర్ఏడీ 26), రీకాంబినెంట్ అడినోవైరస్ 5 (ఆర్ఏడీ 5) అనే రెండు డోసులుగా టీకాను ఇస్తారు. ఇందులో ఆర్ఏడీ 26 మొదటి డోసు కాగా.. ఆర్ఏడీ 5 రెండో డోసు. తర్వాత ఆర్ఏడీ26నే స్పుత్నిక్ లైట్ గా రష్యా ప్రభుత్వం మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

మ‌ళ్లీ కొండా, కూనా..? రేవంత్‌తో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌!

కాంగ్రెస్ ప‌ని ఖ‌తం. ఇప్ప‌ట్లో కోలుకోదు. హ‌స్తం పార్టీ త‌ల‌రాత‌ను ఎవ‌రూ మార్చ‌లేరు. తెలంగాణ‌లో కాంగ్రెస్ శ‌కం ముగిసిన‌ట్టే. ఇలా.. తీవ్ర నిరాశ‌, నిస్పృహ నేత‌ల్లో ఉండేది. వ‌రుస ఓట‌ములు ఆ పార్టీని, నాయ‌కుల‌ను వేధించేవి. నాయ‌క‌త్వ లేమి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించేది. దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ, ఎమ్మెల్సీ, నాగార్జున సాగ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్స్‌.. ఇలా వ‌రుస వైఫ‌ల్యాలు. కేడ‌ర్‌లో తీవ్ర నిరుత్సాహం. గ‌త‌మెంతో ఘ‌న‌మైన కాంగ్రెస్‌కు ఇతంటి ప‌రాజ‌యాల‌ను చూసి త‌ట్టుకోలేక‌పోయారు కొంద‌రు నాయ‌కులు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తేనే పార్టీ బాగుప‌డుతుంద‌ని గ‌ట్టిగా వాదించారు. రేవంత్‌ను పీసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపిక  చేయ‌నీయ‌కుండా సీనియ‌ర్లు అడ్డుపడుతుండ‌టం చూసి త‌ట్టుకోలేక‌పోయారు. ఇక త‌మ వ‌ల్ల కాదంటూ.. కాంగ్రెస్‌లో ఉండ‌లేమంటూ.. వీడ‌లేక వీడిపోయారు. వారిలో ఒక‌రు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. మ‌రొక‌రు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌. కొండా, కూనా. వీరిద్ద‌రూ రేవంత్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితులు. రేవంత్‌కు పీసీసీ పీఠం క‌ట్ట‌బెట్టాలంటూ అంద‌రికంటే ఎక్కువ‌గా డిమాండ్ చేశారు. అది నానాటికీ ఆల‌స్యం అవుతుండ‌టంతో.. అధిష్టానం తీరుకు విసిగివేసారి.. కాంగ్రెస్‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు. ఒక‌వేళ రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టిస్తే.. తిరిగి పార్టీలో చేర‌డంపై ఆలోచిస్తానంటూ కొండా ఆనాడే చెప్పారు. విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడు. ఆయ‌న తాత, మాజీ ముఖ్య‌మంత్రి రంగారెడ్డి పేరు మీద‌నే ఆ జిల్లా ఏర్ప‌డింది. గ్రామ‌గ్రామాన ఇప్ప‌టికీ ఆ కుటుంబానికి మంచి పేరుంది. టీఆర్ఎస్‌తో రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌ల‌తో ప‌డ‌లేక‌.. ఎంపీగా ఉన్న‌ప్పుడే పార్టీని వీడారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయితే, చేరాక తెలిసింది. హ‌స్తం పార్టీకి స‌రైన నాయ‌కుడు లేడ‌ని.. రేవంత్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తేనే కాంగ్రెస్‌కు మ‌నుగ‌డ సాధ్య‌మ‌ని. అందాక తాను కాంగ్రెస్‌లో ఉండ‌లేనంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇప్పుడు ఆయ‌న త‌లచిన‌ట్టే రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేయ‌డంతో కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి మ‌ళ్లీ రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌తో క‌లిసి పని చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న వ‌స్తే.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బ‌లం మ‌రింత పెర‌గ‌డం ఖాయం. రేవంత్‌కు సైతం మ‌రో న‌మ్మ‌ద‌గిన అనుచ‌రుడు దొరికిన‌ట్టే.  ఇక‌, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్‌ది సైతం సేమ్ ఎపిసోడ్‌. హైద‌రాబాద్‌ కాంగ్రెస్‌లో రేవంత్‌కు రైట్‌హ్యాండ్ లాంటి లీడ‌ర్‌. రేవంత్ హైద‌రాబాద్‌లో ఎలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్టినా కూనా ప‌క్క‌న ఉండాల్సిందే. అలాంటి ప్ర‌ధాన అనుచ‌రుడు.. రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు ఇవ్వ‌డం లేద‌నే ఆగ్ర‌హంతో కాంగ్రెస్‌ను కాద‌నుకొని.. బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు దుబ్బాక‌లో రెండు వారాలు మ‌కాం వేసి.. పార్టీ అభ్య‌ర్థి గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు బీజేపీ త‌ర‌ఫున హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ కోసం ప‌ని చేస్తున్నారు. అయితే, త‌న రాజ‌కీయ రోల్‌మోడ‌ల్ రేవంత్‌రెడ్డికి తాను ఆశించిన‌ట్టే.. పీసీసీ పగ్గాలు ద‌క్క‌డంతో ఇప్పుడు ఆయ‌న పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. బీజేపీలోనే కంటిన్యూ కావాలా.. లేక‌, త‌న నాయకుడు అధ్య‌క్షుడిగా ఉన్న కాంగ్రెస్‌లోకి మ‌ళ్లీ వ‌చ్చేయాలా అని తెగ మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్న మాట‌. హుజురాబాద్ ఎన్నిక ముగిశాక ఆయ‌నో నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.  కొండా, కూనాలే కాదు.. రేవంత్‌రెడ్డి ప‌ద‌వితో ప‌లువురు కీల‌క నేత‌లు మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గ‌తంలో టీడీపీలో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన నాయ‌కులు.. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీల‌కంగా లేని నేత‌లు.. టీఆర్ఎస్‌, బీజేపీలో అసంతృప్త వ‌ర్గాలు.. ఇలా అంద‌రి చూపు ఇప్పుడు రేవంత్ వైపే. గ‌తంలో టీడీపీలో కీల‌కంగా నేత‌గా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో అంతా మ‌ర్చిపోయిన.. మాజీ మంత్రి.. నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి తాజాగా రేవంత్‌రెడ్డిని క‌లిసి శుభాకాంక్ష‌లు చెప్పారు. మ‌ళ్లీ ఆయ‌న‌తో క‌లిసి యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు ఉత్సాహం క‌న‌బ‌రిచారు. కొండా సురేఖ దంప‌తులు సైతం రేవంత్‌కు జై కొట్టారు. కేసీఆర్ ప‌క్క‌న‌పెట్టేసిన‌ ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు సైతం రేవంత్‌తో ట‌చ్‌లోకి వ‌స్తున్నార‌ని స‌మాచారం. ఇలా, కాంగ్రెస్‌తో స‌హా అన్ని పార్టీల, అన్ని వ‌ర్గాల నేత‌లు.. రేవంత్‌రెడ్డితో క‌లిసి ప‌ని చేసేందుకు ఉత్సాహం చూప‌డం చూస్తుంటే.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. ఈ లెక్క‌న‌.. కేసీఆర్‌కు ముందుముందు ద‌బిడి దిబిడే.  

కేసీఆర్‌కు మెఘా షాక్! కాళేశ్వరంలో ఏం జరిగింది?

కాళేశ్వరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోథల పథకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలో పూర్తి చేశారు. బ్యారేజీలు, పంపు హౌజ్ లు, వరద కాలువలు, సర్జిపూల్స్  ఈ ప్రాజెక్టులో ప్రత్యేకం. కాళేశ్వరం  ప్రాజెక్టులో మెజార్టీ పనులను మెఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించింది. ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసిందంటూ మెఘా సంస్థను కేసీఆర్ కూడా పలు సార్లు ఓపెన్ గానే ప్రశంసించారు. అయితే ఇప్పుడా మెఘా సంస్థే కేసీఆర్ కు షాకిచ్చిందని తెలుస్తోంది. ఆ సంస్థ తీరుపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.  కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల డిస్కవరీ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన డాక్యుమెంటరీనే తాజా వివాదానికి కారణమని తెలుస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం డాక్యుమెంటరీని ముందుగా హైలెట్​ చేసిన ప్రభుత్వం… నీటిపారుదల శాఖ ఆ తర్వాత తేలిగ్గా తీసిపారేస్తోంది. దాదాపు 55 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో అత్యధికంగా మెఘా ప్రాజెక్టు, సంస్థ ఇంజినీర్లు, సంస్థ ప్రతినిధులనే హైలెట్​చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్​ఇంజినీర్ల భాగస్వామ్యాన్ని తెరకెక్కించడంలో వెనకబడ్డారు. దీంతో ఇది కాళేశ్వరం డాక్యుమెంటరా… మెఘా సంస్థ సొంత వీడియోలా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.​ కాళేశ్వరం ప్రత్యేక డాక్యమెంటరీలో కేవలం నిర్మాణ సంస్థనే హైలెట్​చేసినట్లు ఇరిగేషన్​ఇంజినీర్లు మండిపడుతున్నారు. అసలు ఇంజినీర్లు, ప్రభుత్వం చేసిందంతా పక్కన పెట్టి కేవలం మెఘా నిర్మాణ సంస్థ కష్టంతోనే కాళేశ్వరం పూర్తి చేశారనే విధంగా కథనం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి డిస్కవరీలో కాళేశ్వరం ప్రత్యేక డాక్యుమెంటరీపై ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేసింది. ఆ డాక్యుమెంటరీని తిలకించాలంటూ ప్రకటనలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రగతి దేశ, విదేశాలకు పాకుతుందని, అంతర్జాతీయ వేదికపై కాళేశ్వరం ఆవిష్కృతమవుతుందంటూ నీటిపారుదల శాఖ ఈ కథనానికి ప్రచారం కల్పించింది. కానీ డిస్కవరీలో వచ్చిన పూర్తి కథనంలో నిర్మాణ సంస్థను హైలెట్​ చేసినంతగా ప్రాజెక్టును చూపించలేదు. దీనిలో ప్రభుత్వం, ఇంజినీర్లు చేసిన కృషిని తక్కువగానే చూపించారు. పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో కాకుండా… ఎంత మేరకు పనులు చేశాం, ఎలా పనులు చేశామంటూ మెఘా ఇంజినీర్లతోనే చెప్పించారు. డాక్యుమెంటరీలో మెఘా ఇంజినీరింగ్​సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్​ శ్రీనివాస్​రెడ్డితో పాటు ఇతర స్థాయిల్లోని కంపెనీ ఇంజినీర్లతోనే కథనంలో మాట్లాడించారు.  మొదట్లో ఒకసారి, చివర్లో ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సీఈతో మాట్లాడించారు. కాళేశ్వరం నిర్మాణంలో తమ సంస్థను హైలెట్​ చేసుకునే క్రమంలో  ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ ఎండీ ఐదారు సార్లు మ్యాపులను పరిశీలిస్తూ, పలుమార్లు పనులను పరిశీలిస్తూ, కొన్ని సందర్భాల్లో తమ సిబ్బందికి సలహాలు ఇస్తూ కనిపించేలా చిత్రీకరించుకున్నారు. దీనిపై సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్​శ్రీనివాస్​రెడ్డితో పదేపదే మాట్లాడించారు. కానీ సీఎం కేసీఆర్, ఇంజినీర్లను కేవలం రెండు నిమిషాలకే పరిమితం చేశారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెఘా కంపెనీ చేసిన పూజలు, పనులు… ఇలా అన్నింటినీ పాత వీడియోలతో ఈ కథనం చూపించారు. దీంతో సీఎం కేసీఆర్​ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ గొప్పతనాన్ని కాదని కేవలం నిర్మాణ సంస్థను ఫోకస్​ చేయడంపై ఇరిగేషన్​ ఉన్నతాధికారులపై కూడా కేసీఆర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జల వనరుల శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టును ఒక నిర్మాణ సంస్థ తమ గొప్పతనంగా చూపించుకోవడం డాక్యుమెంటరీలో ప్రధానంగా నిలిచిందని టీఆర్ఎస్​వర్గాలు సైతం అసహనంగా ఉన్నాయి.  ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా సదరు నిర్మాణ సంస్థపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మెఘా కంపెనీ ఇంజినీర్లు, ఆ సంస్థే పని చేసినట్లుగా చూపించుకుని, తమను తక్కువ చేశారంటూ ఆగ్రహిస్తున్నారు. 

నీళ్ల దొంగ‌లా? తోడు దొంగ‌లా? దొందు దొందేనా..?

జ‌గ‌న్ గ‌జ‌దొంగ‌.. వైఎస్సార్ నీళ్ల‌దొంగ‌. ఇదీ తెలంగాణ మంత్రుల ఆరోప‌ణ‌. కాదు కాదు.. జ‌గ‌న్‌, కేసీఆర్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే అనేది ప్ర‌తిప‌క్షాల‌ విమర్శ‌. ఇలా దొంగ‌ల దంగ‌ల్ తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రు దొంగ‌? ఎవ‌రు గ‌జ‌దొంగ‌? ఎవ‌రెవ‌రు తోడు దొంగ‌లు? అనే క‌న్ఫ్యూజ‌న్‌తో వాట‌ర్ పాలిటిక్స్ రంజుగా మారాయి.  తెలంగాణ దూకుడు మీదుంది. ఏపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల‌లో అవ‌స‌రం లేకున్నా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది. దీంతో ఏపీ కుర్రోమెర్రోనంటూ మొత్తుకుంటోంది. ఆ ప్రాజెక్టుల్లో నీళ్లే లేవు.. ఉన్న కాసిన్ని నీళ్ల‌ను క‌రెంట్ కోసం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. ముందుముందు రైతుల ప‌రిస్థితి ఏంటంటూ గ‌గ్గోలుపెడుతున్నారు ఏపీ మంత్రి అనిల్‌. మేం పైనున్నాం.. మా ఇష్టం అనేది తెలంగాణ టెంప‌ర్‌మెంట్‌. అస‌లు మూలాల్లోకి వెళితే.. నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల ప్రాజెక్టులు క‌ట్టిందే విద్యుత్ ఉత్ప‌త్తి కోసం.. సాగునీటికి కాదంటూ లా పాయింట్లతో వాదిస్తోంది తెలంగాణ‌. ఇట్టా అయితే ఎట్టా అంటూ.. కృష్ణాబోర్డుకు, ప్ర‌ధానికి ఫిర్యాదు చేస్తామంటూ.. సీఎం జ‌గ‌న్ గ‌ట్టి రిటార్డ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. చూస్తుంటే.. రెండు రాష్ట్రాలు.. ఇద్ద‌రు సీఎంలు.. జ‌ల‌జ‌గ‌డంలో ప‌ట్టుద‌ల‌కు పోతున్నార‌ని.. త‌మ త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌ట్టిగా పోరాడుతున్నార‌ని అనిపించేలా జ‌ల వివాదం జోరుగా సాగుతోంది.  అయితే.. ఇదంతా ఉత్తుత్తి డ్రామానే అనే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో కేసీఆర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింద‌ని.. ఇటు ఈట‌ల.. అటు రేవంత్‌ల‌తో ఆయ‌న‌కు రాజ‌కీయంగా మ‌ద్దెల ద‌రువు మొద‌లైంద‌ని అంటున్నారు. ఆ డ‌బుల్ బ్యారెల్ గ‌న్ ఫైరింగ్ నుంచి త‌ప్పించుకోడానికే.. జ‌నంలో వాట‌ర్ సెంటిమెంట్ రెచ్చ‌గొడుతున్నార‌నేది కొంద‌రి అనుమానం. నీళ్ల కోసం మా కేసీఆర్ ఏపీతో ఫుల్ ఫైట్ చేస్తున్నార‌నే భ్ర‌మ ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డానికే ఇంత ర‌చ్చ చేస్తున్నార‌ని చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు కావాల‌నే.. ఇంత‌కుముందెన్న‌డూ లేనంత‌గా జ‌గ‌న్‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిడుతున్నార‌ని.. ఇదంతా తెర‌పైన ఉత్తుత్తి తిట్లేన‌ని.. తెర వెనుక వాళ్లిద్ద‌రూ ర‌హ‌స్య స్నేహితులేన‌నేది ప్ర‌తిప‌క్షాల మాట‌. ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల కోసం ఫైట్ చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇవ్వ‌డానికే.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం- ఆర్డీఎస్‌పై హ‌డావుడి చేస్తున్న‌ట్టు సీన్ క్రియేట్ చేస్తున్నార‌ని అనుమానిస్తున్నారు. నేను కాలువ త‌వ్వుతున్న‌ట్టు చేస్తా.. నువ్వు ఆపుతున్న‌ట్టు చేయి.. అనేట్టు ఇద్ద‌రు సీఎంలా వ్య‌వ‌హారం ఉంద‌ని విమ‌ర్శిస్తున్నారు. సీమ కోసం కేసీఆర్‌తో జ‌గ‌న్ పోరాడుతున్నార‌నే అభిప్రాయం క‌లిగేలా ముఖ్య‌మంత్రి మేనేజ్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఇటు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, అటు హైద‌రాబాద్‌లో త‌న ఆస్తుల ర‌క్ష‌ణ‌కే.. జ‌గ‌న్ ఇలా జ‌ల డ్రామా ఆడుతున్నార‌నేది ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌.  తాజాగా, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అవే ఆరోప‌ణ‌లు చేశారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం పెద్ద డ్రామా. ప్ర‌జ‌ల‌ను ఆ ఇద్ద‌రూ పిచ్చోళ్ల‌ను చేసి ఆడుకుంటున్నారు. కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లేనంటూ టీడీపీ చేసిన విమ‌ర్శలపై చ‌ర్చ జ‌రుగుతోంది. లేదంటే.. నిత్యం బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నాని.. జ‌గ‌న్‌ను అన్నేసి మాట‌లు అంటున్నా మౌనంగా ఉండ‌ట‌మేంటి? తెలంగాణ మంత్రులు వైఎస్సార్‌ను నీళ్ల‌దొంగ అన్నా.. ఏపీ నీళ్ల మంత్రి అనిల్ అలా సుతిమెత్త‌గా మాట్లాడ‌ట‌టేంటి? నిజ‌మే,. అంతా డ్రామాలానే ఉంద‌ని అంటున్నారు జ‌నాలు. నేను కొట్టిన‌ట్టు చేస్తా.. నువ్వు ఏడ్చిన‌ట్టు న‌టించు.. అన్న‌ట్టు ఉంది తెలుగు పాల‌కుల‌ తీరు అంటూ ప్ర‌జ‌లు ప‌రేషాన్ అవుతున్నారు.    

హుజురాబాద్ లో హరీష్ స్కెచ్? విపక్షాలకు చుక్కలేనా..? 

హుజురాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలుపు తెరాసకు, అవసరం. ఒక్క తెరాసకు మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కీలకం. అయితే, తెరాసకు  కొంచెం ఎక్కువ అవసరం.ఇది ముఖ్యమంత్రి కేసీఆర్’కి ఇజ్జద్ కి సవాల్.అందుకే,గులాబీ బాస్, హుజురాబాద్ బాధ్యతలను, హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావుకు బాధ్యత అప్పగిస్తే, ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు అనేది, కేసీఆర్ మొదలు తెరాస సాధారణ కార్యకర్త వరకు అందరికీ ఉన్న విశ్వాసం. మొన్నటి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అయితే, అదే మాట హరీష్ రావు స్వయంగా చెప్పుకున్నారు. “నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి గెలుపునే పట్టుకెళతాను” అని చాలా విశ్వాసంతో ప్రకటించుకున్నారు. ఫలితం ఏమిటో వేరే చెప్ప నక్కరలేదు. అయితే, అంత మాత్రం చేత, దుబ్బాక నుంచి ఆయన ఓటమిని పట్టుకెళ్ళారు, కాబట్టి, హరీష్ ఆట అయిపోయిందని అనుకోలేము. ఆ తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆఖరి  నిముషంలో పీవీ కుమార్తె వాణీదేవిని అభ్యర్ధిగా ప్రకటించినా, హరీష్ మరోసారి తన సత్తా నిరుపించుకున్నారు. ఆమెను గెలిపించారు. అందుకే రాజకీయాల్లో అట అయిపోవడం ఉండదు,  24X 7 మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది.   అందుకే మళ్ళీ అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కేసీఆర్, అల్లుడు హరీష్’కు అప్పగించారు. నిజమే, బాధ్యత హరీష్ మీద ఉంచినా, కీసీఆర్ మొదలు చిన్నాపెద్ద నాయకులు అందరూ, హుజురాబాద్ గెలుపు కోసం, మేము సైతం’ అంటూ నడుం బిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులంతా ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ప్రచారం ప్రారంభించారు. ఎవరికి అప్పగించిన పనిని వారు ఇంచక్కా చక్క బెట్టేస్తున్నారు. గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలందరూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  మధ్య మద్యలో మంత్రులు వెళ్లి వస్తున్నారు. అన్నిటినీ మించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదో ఒక పేరున జనంలోకి వెళ్లి ‘లైవ్ ‘ లో ప్రచారం చేస్తున్నారు.  ఇక  హుజురాబాద్ ఉప  ఏన్నిక ఎపిసోడ్’ ప్రధాన పాత్రదారి, మాజీమంత్రి ఈటల రాజేందర్, ఆయన వెంట బీజేపీ సేనలు, ప్రచారం సాగిస్తున్నారు. ఈటల తమ మాజీ బాస్’కు ఏ మాత్రం తీసిపోకుడా ఆయన భాషలో సమాధానం చెపుతున్నారు. ఇరువర్గాల నాయకులు మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జోరుగా సాగుతున్నాయి. నిజానికి, ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాకపోయినా, ఇప్పటికే హుజురాబాద్’ లో ఎన్నికల సందడి మొదలైంది. అదలా, ఇంతవరకు కాస్త స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ  రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగింది. రేపు జులై 7 పీసీసీ ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగంలోకి దిగితే, ఇక అసలు కథ  అప్పుడుమొదలవుతుంది.    ఇంత జరుగుతున్నా  హరీష్ మాత్రం ఇంతవరకు అటుగా వెళ్ళలేదు. హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. హుజురాబాద్ గడప తొక్కలేదు. కథ మొత్తం హైదరాబాద్, సిద్దపేట నుంచే నడిపిస్తున్నారు.అంతా బానే వుంది, అయితే, హరీష్ ఎందుకు దూరంగా ఉంటున్నారు?  దుబ్బాకలో, ‘ఒరేయ్ బండి సంజయ్ ...’ అంటూ గర్జించిన హరీష్ హుజురాబాద్ విషయంలో తెరవెనక పాత్రకే ఎందుకు పరిమితం అవుతున్నారు, అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కూడా  వినిపిస్తున్నాయి. అలాగే ఏవేవో వ్యుహాగానాలు కూడా వినిపిస్తునాయి.  అయితే, హరీష్ తెర మీద కనిపించక పోయినా, ఆయన స్కెచ్ ప్రకారమే కథ నడుస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. హుజురాబాద్, వ్యవహారం అంతా ఆయన  కనుసన్నల్లోనే జరుగుతోందని, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత హరీష్ రియల్ ఎంట్రీ ఉంటుందని పార్టీ  వర్గాలు చెపుతున్నాయి.  ప్రస్తుతం హరీష్ పార్టీలో చేరికలు, సమాలోచనలు కూడా హైదరాబాద్, సిద్దిపేట నుంచే నడిపిస్తున్నారు. నిన్న గాక మొన్న, కొందరు చోటామోటా బీజేపే నాయకులు కూడా హైదాబాద్ వచ్చి అయన చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఒక విధంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని హరీష్ అధికార నివాసం, హుజురాబాద్ తెరాస ఎన్నికల కార్యాలయంలాగా మారిపోయింది. ఏమైనా హరీష్, మామూలోడు కాదు, మామకు తగ్గ అల్లుడు. కేసీఆర్ పదవులకు ఆయన వారసుడు అయినా కాకపోయినా, ఆయన రాజకీయ ఎత్తులు,వ్యూహ ప్రతివ్యుహాల చతురతకు మాత్రం ఆయనే నిజమైన వారసుడు అంటారు.గతంలో,  ఉద్యమ కాలం నుంచి అనేక సందర్భాలాలో అది రుజువైంది. ఇక ముందు కూడా అదే నిజం అవుతుందా లేదా అనేది హుజురాబాద్ ఫలితంతో  తెలుస్తుంది.

షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి.. అంతా ఆయ‌న పెత్త‌న‌మే..నా?

ప్రభుత్వంపై మాటల దాడి పెరిగి..సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడిన టైమ్ లో ఈయన ప్రత్యక్షమవుతారు. పొంతన లేని వాదనలతో ఏదో రకంగా సమాధానం ఇచ్చేస్తారు. మంత్రులు చెప్పాల్సినవి కూడా ఈయనే చెబుతారు. అసలు మంత్రులు ఏదైనా తేడా మాట్లాడితే.. ఈయనకే సమాధానం చెప్పుకోవాలి. అందుకని ఈయన మాట్లాడితేనే బెటరని ఊరుకుంటున్నారు. సీఎం ఎటూ ఎప్పుడుబడితే అప్పుడు టైమ్ ఇవ్వరు. ఈయన మాత్రం పిలిచి మరీ క్లాసు తీసుకుంటారు. అందుకే బాస్ ని షాడో సీఎం అని ఈ మధ్య ముద్దుగా పిలుచుకుంటున్నారు.  వైసీపీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా చాలా డ్రమెటిక్ గా... చాలా స్పీడుగా ఎదిగిపోయారు ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల స్పీడు మామూలుగా లేదు. డీఎస్సీ వేయటం లేదు..టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదంటే.. సమాధానం చెప్పాల్సిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటివరకు కనపడనే లేదు. కాని సజ్జల సార్ మాత్రం వచ్చి టీచర్ల పోస్టులపై ఎదురుదాడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గృహ నిర్మాణాలపై ఆ శాఖ మంత్రితో కలిసి రివ్యూ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం ఎలా నడుస్తుందో సమీక్ష నిర్వహించారు సజ్జల. ఇక ఆ తర్వాత లేటెస్టుగా పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలతో వెళ్లి సందర్శించి.. అధికారులతో సమీక్షించారు. ఇవన్నీ చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి సీన్ బాగా పెరిగినట్లే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి బాస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక పోలీసు డిపార్ట్ మెంటుపై సజ్జల గ్రిప్ సంగతి అందరూ చెప్పుకునేదే. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే పోలీసు అధికారుల బదిలీలు..కానిస్టేబుల్ స్థాయి వరకు లిస్టులు వైసీపీ సెంట్రల్ ఆఫీసులోనే.. అది కూడా సజ్జల చాంబర్ లోనే రెడీ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆ తర్వాత పోలీసులు ఏం చేయాలన్నా.. ఎక్కడ ఎవరిని పట్టుకోవాలన్నా.. ఎవరిని వదిలేయాలన్నా సజ్జల నుంచి ఫోన్లు వెళుతున్నాయని చెప్పుకుంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను డమ్మీ చేసి మరీ సజ్జల నేరుగా అందరు ఆఫీసర్లకు డైరెక్షన్ ఇస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఎంపీ రఘురామ అరెస్టు ఎపిసోడ్ లో అదే జరిగిందని అంటున్నారు. ఈ పరిణామాలతో గౌతమ్ సవాంగ్ కూడా సైలెంట్ అయిపోయారని.. పైగా దిశ యాప్ పై సీఎం పెట్టిన సభలో సైతం డీజీపీ పాల్గొనకపోవడం అందుకు సాక్ష్యం అని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. వైసీపీలో సజ్జల హవా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు వైసీపీ సెంట్రల్ ఆఫీసు బాధ్యతలు అప్పచెప్పినా.. మళ్లీ విజయసాయిరెడ్డి అడ్డం పడటంతో అది ఆగిపోయింది. తర్వాత జిల్లాలను విభజించి సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి లకు పంచారు జగన్. కాని విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు పరిమితం అయిపోయారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీకే పరిమితమయ్యారు. అటు పార్టీపైనా..ప్రభుత్వంపైనా సజ్జల మాత్రం పట్టు పెంచుకున్నారు. క్రమంగా మంత్రులంతా చేతిలోకి వచ్చారు. ఇప్పుడు సజ్జలకు చెబితే జగన్ కు చెప్పినట్లే.. సజ్జల ఆదేశిస్తే జగన్ ఆదేశించినట్లే అన్నట్లు అయిపోయింది పరిస్ధితి. ఇధి మింగుడుపడని విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కౌంటర్ మంత్రాంగం కూడా మొదలెట్టారని తెలుస్తోంది.  

వైవీ సుబ్బారెడ్డి వ‌ర్రీ.. ప‌క్క‌న పెట్టేశారా? ప‌ట్టు సాధిస్తారా?

ఎంపీ టిక్కెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. కోపం వచ్చింది. కనీసం జిల్లాలో తాను చెప్పినవారికి ఇవ్వమన్నా.. వినలేదు. ఈసారి బాగా హర్టయ్యారు. సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చాక..కీలక పదవి అప్పచెప్పారు. అలక తీరిపోయింది. బాగుంది బాగుంది అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను ఒక కోటలో బంధించబడ్డానని.. తన కొలీగ్స్ మాత్రం రాష్ట్రాన్ని ఏలేస్తున్నారని..అర్ధమైంది. అందుకే బాధపడుతున్నారు. ఆ కీలక పదవి ఇక అక్కర్లేదని తెగేసి చెప్పేశారంట. అధినేత ఏమనుకున్నా సరే..ఐ డోంట్ కేర్ అంటున్నారంట. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారంట. వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కీలక నేత.. పార్టీ పంచతంత్రంలో ఒక ముఖ్యమైన తంత్రం. అలాంటిది తనకు వాల్యూ లేకుండా పోయిందని.. కీలకమైనవన్నీ ఇతరులు చేసుకుంటుంటే..తాను మాత్రం తిరుపతికే పరిమితమైపోయానని బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ఈసారి టీటీడీ ఛైర్మన్ పదవి తనకు వద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ ప్రతి ఏడాది నియమిస్తారు. కొనసాగించాలనుకుంటే కొనసాగిస్తున్నట్లు చెబుతారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం ముందు వైవీ సుబ్బారెడ్డి ఈ మాట చెప్పారట. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని చెప్పేశారంట. బాస్ ఇలా అలగడం మొదటిసారి కాదు. 2014 ఎన్నికలప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ప్రకాశంలో ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. అప్పుడు బాలినేనితో సహా కొందరి ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని పార్టీలో చర్చ జరిగింది. అప్పటి నుంచి జగన్ వైవీపై గుర్రుగా ఉన్నారని చెబుతుంటారు. అందుకే 2019 ఎన్నికలప్పుడు ఎంపీ టిక్కెట్ రెండో సారి ఇవ్వకుండా.. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా వైవీ మాటకు విలువ ఇవ్వలేదు. దీంతో హర్టయిన వైవీ సుబ్బారెడ్డి సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చాక.. వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పచెప్పారు. దీంతో వైవీ శాంతించారు. చాలా కమిటెడ్ గా..జగన్ డైరెక్షన్ ప్రకారం టీటీడీ వ్యవహారాలు నడిపిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి. వారనుకున్నట్లే.. టీటీడీలో ఆసాంతం వారి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైములో వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొత్త ఆలోచనలు కలిగించాయని తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా ఎదిగిపోవటం.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతా ఆయనదే నడుస్తుండటం వైవీ సుబ్బారెడ్డికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. అలాగే విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గినట్టు కనపడ్డా..ఉత్తరాంధ్రను సామంతరాజ్యంలా నడిపిస్తూ..ఢిల్లీలో తన పట్టు కొనసాగించుకోవడంతో..ఆయనకు ఏ ఢోకా లేకుండా ఉంది. ఎటొచ్చీ వారిద్దరి కంటే జగన్ కు క్లోజ్ అయినప్పటికీ...తాను మాత్రం దూరమైపోయానా అనే బాధ ఆయన గుండెలను మెలిపెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. తన మనిషి సీఎంగా ఉంటే..తాను మాత్రం ఏడుకొండల మధ్య బందీ అయిపోయానని.. ఇలా కాదని.. తాను కూడా రాష్ట్రమంతా పట్టు సంపాదించాలని పట్టుదల మీదున్నట్లు తెలుస్తోంది. అందుకే  ఈసారి తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని తెగేసి చెప్పేశారంట. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. దానికి వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.