రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీటు ఫిక్స్ ! అక్కడ వార్ వన్ సైడే?
posted on Jun 29, 2021 @ 10:45AM
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ అనుమల రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నారు. చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడినా.. రేవంత్ రెడ్డికి పీసీసీ కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అందుకు ఆయన పోరాటమే కలిసివచ్చింది. కేసీఆర్ సర్కార్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి విపక్ష పార్టీల నేతలు జంకిన సమయంలో .. ఎదురించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను బయటికి తీసుకొచ్చారు. అందుకే రేవంత్ రెడ్డికి క్రేజీ భారీగా పెరిగింది. తెలంగాణ యువతకు ఆయనో పోరాట యోధుడిగా మారిపోయారు. తనపై కేసులు పెట్టినా బెదరకుండా ముందుకుపోవడం వల్లే రేవంత్ కు మద్దతు పెరిగిందని చెబుతారు.
పీసీసీ పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేకపోయామనే భావనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్ . ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో అధికారం వస్తుందనే నమ్మకంతో ఉంది. రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. పార్టీలోని నేతలందరిని ఐక్యం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలను కలుస్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డికి సంబంధించి మరో అంశం చర్చకు వస్తోంది. ప్రస్తుతం మాల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్.. రాజకీయంగా ఎదిగింది మాత్రం కొడంగల్ నుంచే. ఆ నియోజకవర్గం నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యాంగా ఓడిపోయారు. తర్వాత 2019లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో ఉండాలన్న దానిపై ఇప్పటికే క్లారిటీగా ఉన్నారని చెబుతున్నారు. తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన కొడంగల్ కాకుండా మరో నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ చేయనున్నారని సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ పై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా... రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. రేవంత్ వల్లే విజయం దక్కిందని చెబుతున్నారు. లింగోజిగూజ కార్పొరేటర్ ప్రమాణస్వీకరానికి జీహెచ్ ఎంసీ కార్యాలయానికి కూడా వెళ్లారు.గత లోక్ సభ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి ఎల్బీనగర్ లో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచే ఎల్బీ నగర్ అసెంబ్లీపై ఆయన ఫోకస్ చేశారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంచుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. వందలాది కాలనీలకు రెడ్లే అధ్యక్షులు, చైర్మన్లుగా ఉన్నారు. ఎంపీగా రేవంత్ గెలవాడనికి వీళ్లంతా సాయం చేశారు. రేవంత్ ను అసెంబ్లీకి పోటీ చేయాలని వీళ్లంతా కోరుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎల్బీ నగర్ పరిధిలో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల జనాలతో పాటు సెటిలర్లు భారీగానే ఉన్నారు. నల్గొండ, పాలమూరు ప్రజల మద్దతు రేవంత్ రెడ్డికి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సెటిలర్లు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. ఇవన్ని కలిసివచ్చే అవకాశాలు ఉండటం వల్లే ఎల్బీనగర్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఎల్బీనగర్ లో రేవంత్ పోటీ చేస్తే.. ఆయనకు కనీస పోటీ ఉండకపోవచ్చనే టాక్ నియోజకవర్గంలో వినపిస్తోంది..