రేవంత్‌రెడ్డి కేక‌.. కోమ‌టిరెడ్డి కాక‌.. కాంగ్రెస్‌లో అంతే...!

కాంగ్రెస్‌ను ఎవ‌రూ ఓడించన‌వ‌స‌రంలేదు. హ‌స్తం పార్టీని సొంత పార్టీ నేత‌లే ఓడిస్తారు. ఏళ్లుగా వినిపిస్తున్న ఫేమ‌స్ డైలాగ్ ఇది. రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించాక.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి చేసిన కామెంట్లు చూశాక‌ మ‌రోసారి ఈ సామెత గుర్తుకు వ‌స్తోందంటున్నారు. ఇప్పుడే పీసీసీ చీఫ్‌ను ప్ర‌క‌టించారు. ఇంకా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించ‌నే లేదు. అప్పుడే లుక‌లుక‌లు, రుస‌రుస‌లు,, అల‌క‌లు, రాజీనామాలు మొద‌లైపోయాయి. కాంగ్రెస్‌లో అంతే.. అని మ‌రోసారి రుజువు చేస్తున్నారు.  కాంగ్రెస్‌కు సీనియ‌ర్ నేత కేఎల్ఆర్ రాజీనామా చేశారు. మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి త‌న పార్టీ ప‌ద‌విని వ‌దిలేశారు. ఇక పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రేవంత్‌రెడ్డితో స‌మానంగా పోటీప‌డిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. అప్పుడే ఎర్ర‌జెండా ఎగ‌రేశారు. నోటికి ప‌ని చెప్పారు. రేవంత్‌తో పాటు తెలంగాణ ఇంఛార్జ్‌పై డైరెక్ట్ అటాక్ చేశారు. ప‌నిలో ప‌నిగా ఇక తాను గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌బోనంటూ శ‌ప‌థం కూడా చేసేశారు.  కోమ‌టిరెడ్డి అభ్యంత‌ర‌మంతా ఒక్క‌టే.. మొద‌టి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న త‌న‌ను కాద‌ని.. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డ‌మేంట‌నేది ఆయ‌న క‌డుపుమంట‌లా ఉంది. ఎప్పుడు వ‌చ్చామ‌న్న‌ది కాద‌న్న‌య్యా.. బుల్లెట్ దిగిందా లేదా అనేది రేవంత్‌రెడ్డి వ‌ర్ష‌న్‌. ఇద్ద‌రులో ఎవ‌రు క‌రెక్ట్? రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. కోమ‌టిరెడ్డి బ‌ల‌మంతా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకే ప‌రిమితం. కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల‌కు రేవంత్‌రెడ్డి అంద‌రికంటే ముందుంటారు. కోమ‌టిరెడ్డి ఎండాకాలంలో వ‌ర్షంలా అప్పుడ‌ప్పుడు అలా హ‌డావుడి చేసి మ‌ళ్లీ సైడ్ అయిపోతుంటారు. కోమ‌టిరెడ్డికి న‌ల్గొండ వ్యాప్తంగా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. రేవంత్‌రెడ్డికి జిల్లాల్లోనూ అభిమాన సంఘాలు ఉన్నాయి. కోమ‌టిరెడ్డికి కేసీఆర్‌పై ఎలాంటి వ్య‌క్తిగ‌త క‌క్ష్య‌ల్లాంటివి లేవు. అదే, రేవంత్‌రెడ్డి జీవిత‌ల‌క్ష్యం కేసీఆర్‌ను దెబ్బ‌కొట్ట‌డం. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సోద‌రుడు రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ తీరుపై ప‌లుమార్లు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు.  కోమ‌టిరెడ్డి చేసిన అత్యంత కీల‌క‌మైన ఆరోప‌ణ‌.. ఓటుకు నోటు మాదిరే.. పీసీసీ చీఫ్ ప‌ద‌వి అమ్ముకున్నార‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌.. డ‌బ్బులు తీసుకొని ప్రెసిడెంట్ ప‌ద‌విని అమ్ముకున్నారంటూ ప‌రోక్షంగా హైక‌మాండ్‌పైనే ఆరోప‌ణ‌లు చేసి కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌గా మారారు. రేవంత్‌రెడ్డి పొలిటిక‌ల్ కెరీర్‌లో ఉన్న ఏకైక మ‌చ్చ‌.. ఓటుకు నోటు కేసు. అందుకే, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆ ఇష్యూనే మెయిన్‌గా టార్గెట్ చేస్తూ రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారంటూ.. ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌ని ఖ‌తం అనే అర్థం వ‌చ్చేలా వెంక‌ట్‌రెడ్డి కామెంట్లు చేశారు. చంద్ర‌బాబే రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇప్పించారంటూ మ‌రింత కాక రేపారు. కోమ‌టిరెడ్డి విమ‌ర్శ‌ల‌పై అప్పుడే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిపోయాయ‌ని చెబుతున్నారు. కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై హైక‌మాండ్ సైతం సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, తాను మాత్రం కాంగ్రెస్‌ను వీడేది లేద‌ని.. త‌న‌నెవ‌రూ క‌ల‌వ‌ద్దొంటూ త‌న ఇలాఖాలో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు కోమ‌టిరెడ్డి. అయితే, తాను అంద‌రినీ క‌లుపుకొని వెళ్తాన‌ని.. త‌న‌కు ఎవ‌రితోనూ విభేదాలు లేవంటూ రేవంత్‌రెడ్డి కూల్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం కొస‌మెరుపు.   

తెలంగాణలో రాజకీయ సెగలు.. పాదయాత్ర చేయనున్న ముఖ్య నేతలు  

తెలంగాణ మీడియాకు ఫుల్లు పని...జనానికి రోజూ న్యూసే...పాదయాత్రల సీజన్ వచ్చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు రెడీ అవుతున్నారు పాదయాత్ర చేయడానికి. ఇప్పటికే బండి సంజయ్ హూజూరాబాద్ టార్గెట్ గా రెండు నెలల పాటు పాదయాత్ర చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి సైతం.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు కొత్త పార్టీ వైఎస్సార్టీపీ నేత షర్మిల కూడా పాదయాత్ర ప్లానింగ్ లో ఉన్నారు. ఇలా భారీ ఎత్తున పాదయాత్ర ల ప్లానింగులు నడుస్తున్నాయి. ఇది గాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ మొదలైతే.. రాష్ట్రంలో సందడే సందడి. మీడియాకు కవరేజ్ చేసే పని మస్తుగా పడుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఓ రాజకీయ ముందడుగుగా మార్చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావటమే కాదు...ప్రజల అవసరాలకు తగ్గట్టు సంక్షేమ పథకాలు తెచ్చారు. ఆ పాదయాత్రతో ప్రజల్లో నాయకుడిగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సైతం తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర తర్వాత తెలంగాణ రావటం..విభజన జరగటంతో లెక్కలు మారిపోయాయి. అయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. దీంతో పాదయాత్ర చేస్తే పవర్ వచ్చి తీరుతుందనే సెంటిమెంట్ వచ్చేసింది.  అయితే ఎప్పుడూ కూడా ఇలా ఒకసారే ఇద్దరు ముగ్గురు నేతలు పాదయాత్రలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో అదే జరగబోతుంది. ఇలా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, షర్మిల ముగ్గురూ పాదయాత్రలు చేస్తే.. ఆ హంగామా మామూలుగా ఉండదు. కాకపోతే కేసీఆర్ సార్ కి ఫికర్ లేకుండా పోవచ్చు..ఇంతమంది గట్టిగా చేస్తే..వాళ్లల్లో వాళ్లు ఓట్లు చీల్చుకుంటరు..మనం బాజాప్తా మళ్లీ పవర్ లోకి వస్తామనే సోచాయిస్తున్నారనే టాక్ వినపడుతోంది.బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇప్పటికే వచ్చేసింది. ఇప్పటికే దూకుడుతో..పంచ్ డైలాగులతో బండి సంజయ్ బిజెపి నేతల్లో హైలెట్ అయిపోయారు. ఇక పాదయాత్ర కూడా చేశారంటే..తిరుగు లేకుండా పోవచ్చు. బిజెపి సీఎం క్యాండేట్ గా మరొకరికి ఛాన్స్ లేకుండా చేయొచ్చనే ప్లాన్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డికి అయితే అవసరం కూడా.  ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్ట్రాంగ్ గా రేవంత్ పై మాటల దాడి చేశారు. ఏకంగా పీసీసీ ఎంపిక ఓటుకు నోటులాగే జరిగిందంటూ అధిష్టానంపై కూడా గుస్సా చూపించారు. పైగా తన జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇలా స్వపక్షంలోనే విపక్షం వినపడకుండా ఉండాలంటే పాదయాత్ర సక్సెస్ కావాలి... లీడర్ గా స్ట్రాంగ్ కావాలే..అప్పుడే రేవంత్ అధికారపక్షంపై గట్టిగా పోరాడగలరు..రేవంతన్న పాదయాత్రకు హైకమాండ్ అనుమతి కూడా వస్తుందని ఆయన మనుషులు చెబుతున్నారు. షర్మిల పార్టీ అయితే మొదటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో పోతుంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చి పాపం వారి ప్లాను ఖరాబు చేసింది కాని.. లేదంటే ఇంకా బాగా రక్తి కట్టించేవారు. నాన్న లాగా, అన్నలాగా పాదయాత్ర చేసేసి.. స్ట్రాంగ్ అయిపోవాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ పాదయాత్రను ఎప్పుడు చేయాలనే షెడ్యూల్ ఫిక్సింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో... షర్మిల మరింత తొందరపడుతున్నట్లు సమాచారం.

కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు ? ఏ పార్టీలో చేరబోతున్నారో.. 

పీసీసీ చీఫ్ ఎంపిక తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా ఓ వైపు కేడర్ సంబరాలు చేసుకుంటుంగా.. మరోవైపు కొందరు సీనియర్లు మాత్రం కామెంట్లతో కాక రేపుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంపికపై సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పీసీసీ పోస్టును పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్ కూడా కోమటిరెడ్డి మాటలపై ఆరా తీశారని సమాచారం. కొందరు ముఖ్య నేతలకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారట ఠాగూర్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కొందరు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మహేష్ గౌడ్ .. కోమటిరెడ్డిపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి ఎన్నో పదవులు అనుభవించారని చెప్పారు. ఆ పదవులన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారన్న వ్యాఖ్యలు తీవ్రమైనవని చెప్పారు. వెంటనే కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఐసీసీ ప్రోగామ్స్ పర్యవేక్షణ కమిటి చైర్మన్ గా నియమించబడిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. ఏదో ఆవేశంలో కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఉన్నారన్నారు. పార్టీ నేతలమంతా సమిష్టిగా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని తెలిపారు మహేశ్వర్ రెడ్డి.  ఢిల్లీ నుంచి సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి కార్యకర్తకు  ఇస్తారు అనుకున్నానని కాని అలా జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పీసీసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని రేవంత్ కు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టి కాంగ్రెస్ ను  టి టీడీపీ లాగా మార్చవద్దన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు వెంకట్ రెడ్డి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతానన్నారు.

బీజేపీ, TRS కలిసినా కాంగ్రెస్ దే విజయం.. రేవంత్ రెడ్డి మరో సంచలనం

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ చీఫ్ ఎంపిక, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, బీజేపీ పరిస్థితి ఏంటీ, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది అన్న చర్చే జనాల్లో సాగుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత రాజకీయ పార్టీల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. బీజేపీకి సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు షాకిచ్చారు. ఆయన త్వరలోనే గులాబీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ లో అసమ్మతి గళం క్రమంగా పెరుగుతోంది. పీసీసీ ప్రకటన వచ్చిన వెంటనే సీనియర్ నేత కేఎల్లార్ పార్టీకి రాజీనామా చేయగా.. ఆదివారం పార్టీ సమన్వయ కమిటికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ పోస్టు కోసం రేసులో నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంపికపై హాట్ కామెంట్స్ చేసి కాక రేపారు. బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాటల దాడి మొదలు పెట్టారు.  బీజేపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నా, సొంత పార్టీ నేతలు కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన కొంత స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు...సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. తెలంగాణ లో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తన పాదయాత్ర ఉండే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అది ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.  ఇపుడున్న పరిస్థితులలో ఎన్టీఆర్, వైఎస్సార్ లను విమర్శించడం వికృతమైన చర్య అన్నారు రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇప్పడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం వచ్చిందన్నారు. టిఆర్ఎస్,బిజెపి కలిసి పోటీ చేసిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు రేవంత్ రెడ్డి.  లింగోజి గూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినదుకు బిజెపి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.  

కేసీఆర్ టార్గెట్ గా ఉద్యమకారుల ఉమ్మడి వేదిక.. హుజురాబాద్ లో త్వరలో భారీ సభ.. 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా పార్టీలన్ని అప్పుడే దూకుడు పెంచాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ పై కసి తీర్చుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ఆత్మగౌరవానికి , కేసీఆర్ అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందని చెబుతున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలను గెలిపిస్తానంటున్నారు ఈటల. అటు టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ లో తన బలగాన్ని మోహరించింది. ఎట్టి పరిస్థితులోనూ ఈటలను ఓడించేందుకు పావులు కదుపుతోంది. మండలాల వారీగా మంత్రులను ఇంచార్జులుగా నియమించారు గులాబీ బాస్. తమకు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల గెలుపు కోసం అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులు కూడా హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని, ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చెబుతున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. తామే  నేరుగా రంగంలోది దిగాలని డిసైడయ్యారు.  హుజూరాబాద్ కేంద్రంగా ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.   తెలంగాణ ఉద్యమకారుడు, మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ నివాసంలో ఆదివారం  ఉద్యమకారులు సమావేశమయ్యారు. స్వామిగౌడ్, ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సాదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు. అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ఉద్యమ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి వస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ‌ ఆకాంక్షలు నెరవేరలేదని వారంతా అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా  ఒకే వేదిక మీదకు రావాలని పిలుపిచ్చారు.  హుజూరాబాద్‌లో ఉద్యమకారులతో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.   హుజూరాబాద్ ఉప ఎన్నికను ఉద్యమకారులు అవకాశంగా తీసుకోవాలని స్వామిగౌడ్‌ అన్నారు.  ఈటల గెలుపు కోసం ఉద్యమకారుల్ని ఏకం చేస్తున్నామని చెప్పారు, కేసీఆర్ పాలనలో ప్రజ్వాస్వామ్యం మంట కలిసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించటానికే ఉద్యమకారులు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పదవి ఇస్తేనే దళితులు కేసీఆర్‌ను నమ్ముతారని చంద్రశేఖర్‌ అన్నారు. దళితులతో రాజకీయాలు చేయటం మానుకోవాలని సూచించారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితులపై కేసీఆర్‌ ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు.  

సంచలనం... చంద్రబాబు వల్లే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?  

తెలంగాణ పీసీసీ ఎంపిక వ్యవహారం కాక రేపుతోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతుండగా.. అదే సమయంలో అసమ్మతి గళం వాయిస్ పెరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఘాట్ కామెంట్స్ చేశారు.  పీసీసీ పదవి కార్యకర్తకు  ఇస్తారు అనుకున్నానని కాని అలా జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పీసీసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని రేవంత్ కు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టి కాంగ్రెస్ ను  టి టీడీపీ లాగా మార్చవద్దన్నారు.  రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు వెంకట్ రెడ్డి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతానన్నారు. తనను  కలవడానికి ఎవరు రావద్దన్నారు సూచించారు వెంకట్ రెడ్డి.   పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీతో చంద్రబాబు మాట్లాడటం వల్లే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి అన్నారు. 2018లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేశాయని, అప్పటినుంచి రాహుల్ తో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు.  అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందన్న వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తు్ననారు. చంద్రబాబుకు అంత అవకాశం ఉంటే ఏడు నెలలుగా పీసీసీ పదవిని ఎందుకు భర్తీ చేయలేకపోయారని చెబుతున్నారు. కొందరు నేతలు తమ రాజకీయ పబ్బం కోసం సంబంధం లేని విషయంలో చంద్రబాబును లాగుతున్నారని మండిపడుతున్నారు. 

కుటుంబంలో జగనన్న చిచ్చు! అత్తపై వేడి నూనే పోసిన కోడలు..

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఎక్కువగానే అమలవుతున్నాయి. అర్హులను గుర్తించి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జన చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. అయితే ప్రభుత్వ పథకాలు కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. సర్కార్ అందించిన నగదు విషయంలో గొడవలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నగదు కోసం అత్తా, కోడలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో అత్తపై కోపంతో  కోడలు వేడి నూనే పోసిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేసింది.  కృష్ణాజిల్లా గుడివాడ శివారులోని మందపాడుకు చెందిన చుక్కా లక్ష్మి బ్యాంక్ అకౌంట్ లో కూడా వైఎస్ఆర్ చేయుత నగదు డబ్బులు పడ్డాయి. దీంతో ఆ డబ్బులు ఇవ్వాల్సిందిగా కోడలు స్వరూప గొడవకు దిగింది.  ఈ క్రమంలో అత్త లక్ష్మి నిద్రిస్తుండగా.. కోడలు స్వరూప వేడివేడి నూనెపోసి హత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కొడుకు చుక్కా శివ నారాయణ, కోడలు లక్ష్మీలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు  

చంద్ర‌బాబు నుంచి రాహుల్‌ వ‌ర‌కు.. రేవంత్‌రెడ్డి డైన‌మిక్ పాలిటిక్స్‌..

తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఆ త‌ర్వాత కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏకంగా టి-కాంగ్ ప్రెసిడెంట్‌. రేవంత్‌రెడ్డికి అంత ఈజీగా రాలేదు ఈ ప‌ద‌వులు. నంద‌మూరి కుటుంబ‌మూ కాదు.. గాంధీ వార‌స‌త్వ‌మూ లేదు. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగారు రేవంత్‌రెడ్డి. ఇప్ప‌టికి జ‌స్ట్ రెండుసార్లు మాత్ర‌మే ఆయ‌న ఎమ్మెల్యే. అయినా, ఓ ముఖ్య‌మంత్రికి ఉన్నంత పాపులారిటీ ఆయ‌నది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్నా.. స్టూడెంట్ లీడ‌ర్‌గా ఉన్న‌ప్పుడే ఆయ‌న‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయాల్లో తొలి అడుగు వేశారు. టీడీపీలో ఆయ‌న ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకున్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాజ‌కీయంగా రాటుదేలారు. ఆ రోజుల్లో చంద్ర‌బాబుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మెదిలారు రేవంత్‌రెడ్డి. టీడీపీ అధినేత సైతం రేవంత్‌రెడ్డికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. యువ‌కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచే ప్రోత్సాహం అందించారు. ఎమ్మెల్యేగా పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా.. పార్టీలో కీల‌క నేత‌గా రేవంత్‌రెడ్డికి గుర్తింపు ఇచ్చి.. ఆయ‌న్ను నాయ‌కుడిగా ప్ర‌మోట్ చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే.  అప్ప‌టికే టీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు రేవంత్‌రెడ్డి అంటే క‌ళ్లుమంట అంటారు. నిత్యం చంద్ర‌బాబు ప‌క్క‌నే ఉండే ఎర్ర‌బెల్లి.. ప్ర‌తీ స‌భ‌లోనూ చంద్ర‌బాబు పక్క సీటే కావాల‌ని డిమాండ్ చేసే ద‌యాక‌ర్‌రావు.. రేవంత్‌రెడ్డికి అధినేత ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను చూసి ఓర్వ‌లేద‌ని చెబుతారు. 2014లో తెలంగాణ అసెంబ్లీలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును టీడీపీ ఫ్లోర్ లీడ‌ర్ చేసి.. టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డిని నియ‌మించారు చంద్ర‌బాబు. రేవంత్‌రెడ్డిని ఎలాగైనా దెబ్బ తీయాల‌నే దురుద్దేశ్యంతో.. ఓటుకు నోటు ఆప‌రేష‌న్‌పై ప్ర‌భుత్వానికి ఉప్పందించింది అప్ప‌టి టీడీపీ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావేన‌నే ఆరోపణ ఉంది. అదే నిజ‌మైతే, ఎర్ర‌బెల్లి కొట్టిన దొంగ‌దెబ్బ‌కు.. రేవంత్‌రెడ్డి జైలు పాల‌వ‌డం.. తెలంగాణ‌లో టీడీపీకి బాగా డ్యామేజ్ జ‌ర‌గ‌డం.. ద‌యాక‌ర్‌రావు కారెక్క‌డం.. ఇప్పుడాయ‌న మంత్రి కావ‌డం.. ఇలా తెలంగాణ‌లో ప‌లు కీల‌క ప‌రిణామాలు రేవంత్‌రెడ్డి కేంద్రంగానే జ‌రిగాయ‌ని గుర్తు చేస్తున్నారు.  ఓటుకు నోటు ఎపిసోడ్ రేవంత్‌రెడ్డి పొలిటిక‌ల్ కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పింది. తాను జైలు పాల‌వ‌డానికి కార‌ణ‌మైన కేసీఆర్‌ను ఢీ కొట్ట‌డం టీడీపీతో సాధ్యం కాద‌ని భావించి.. వీడ‌లేక చంద్ర‌బాబును వీడి.. కాంగ్రెస్‌లో చేరారు రేవంత్‌రెడ్డి. ఇక‌, కాంగ్రెస్ గురించి తెలిసిందేగా. అక్క‌డ ప్రోత్స‌హించే వారికంటే.. కాలుప‌ట్టి లాగే వాళ్లే ఎక్కువంటారు. కాంగ్రెస్‌లో ఎవ‌రి ఆట వాళ్లే ఆడుకుంటారు. అలా ఆ ఆట‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో చేరిన అన‌తికాలంలోనే రాహుల్‌గాంధీ దృష్టిలో ప‌డ్డారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అంద‌రికంటే రేవంత్‌రెడ్డినే ముందుంచారు రాహుల్‌. ప్ర‌చార బాధ్య‌త‌లతో పాటు పార్టీని గెలిపించే బ‌రువు బాధ్య‌త‌లు సైతం రేవంత్‌రెడ్డి భుజాల‌పైనే మోపారు. చిచ్చ‌ర‌పిడుగులాంటి రేవంత్‌రెడ్డిని.. సుడిగాలిలా తెలంగాణ మొత్తం తిప్పేందుకు ప్ర‌త్యేకంగా ఆయ‌న కోస‌మే ఓ హెలికాప్ట‌ర్‌ను సైతం కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ, కేసీఆర్ రేవంత్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టి.. కేసులు, కుట్ర‌లు, అరెస్టుల‌తో ఆయ‌న్ను కొడంగ‌ల్‌కే క‌ట్ట‌డి చేసి.. రేవంత్‌ను అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అయితే, నేల‌కు కొట్టిన బంతిలా.. మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి.. ఏకంగా పార్ల‌మెంట్ స్థాయికి ఎదగడం రేవంత్‌రెడ్డి స‌త్తాకు నిద‌ర్శ‌నమ‌నే చెప్పాలి.  ఓట‌మితో, కేసీఆర్ దూకుడుతో జ‌వ‌స‌త్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. మ‌ళ్లీ పున‌ర్ వైభ‌వం తీసుకొచ్చేందుకు కొత్త పీసీసీ నియామ‌కానికి పూనుకుంది హ‌స్తం పార్టీ అధిష్టానం. ఆ జాబితాలో రేవంత్‌రెడ్డి పేరే అంద‌రిక‌న్నా ముందున్నా.. సీనియ‌ర్లు ఓ పట్టాన ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌లో అంతే. పార్టీ బాగుకంటే కూడా త‌మ బాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు నేత‌లు, రేవంత్ విష‌యంలోనూ అనేక కొర్రీలు పెట్టారు. కేసులున్నాయ‌ని.. వేరే పార్టీ నుంచి వ‌చ్చాడ‌ని.. ఇలా సిల్లీ రీజ‌న్స్ చెప్పారు. సీనియ‌ర్లు ఎన్నిచెప్పినా.. ప్ర‌జా క్షేత్రంలో ఎవ‌రి బ‌లం ఎంతో హైక‌మాండ్‌కు తెలియంది కాదు. రాహుల్‌గాంధీకి సైతం రేవంత్‌రెడ్డి మీదే న‌మ్మ‌కముంది. సోనియా స‌రేనంది. 150 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పీసీసీ ప‌గ్గాలు రేవంత్‌రెడ్డి చేతిలో పెట్టింది. ఆయ‌న నెత్తిన మోయ‌లేనంత భారం మోపింది. రేవంత్‌రెడ్డి అయితేనే కాంగ్రెస్ ర‌థ చ‌క్రాల‌ను తెలంగాణ వ్యాప్తంగా దూసుకెళ్లేలా చేస్తార‌ని.. కేసీఆర్‌ను ఢీకొట్టి గ‌ద్దెదింపే సామ‌ర్థ్యం రేవంత్‌రెడ్డికే ఉంద‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ డిసైడ్ అయింది. అందుకే, డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్‌రెడ్డికి పీసీసీ కిరీటం తొడిగింది.. ఇక, కేసీఆర్‌పై దండ‌యాత్రే మిగిలింది.. క‌మాన్ రేవంత్‌.. లెట్స్ ప్రూవ్‌.. అంటూ స‌మ‌రోత్సాహంలో ఉంది కాంగ్రెస్‌. 

రేవంత్ ఫ‌స్ట్ టార్గెట్ హుజురాబాద్‌!.. ఈట‌ల‌కు తీన్మార్‌?

నెల రోజులుగా తెలంగాణ‌లో ఈట‌ల రాజేంద‌ర్ పేరు మారుమోగిపోతోంది. ఇప్పుడిక రేవంత్‌రెడ్డి పేరు డైన‌మైట్‌లా పేలుతోంది. ఇన్నాళ్లూ హుజురాబాద్ ఉప పోరుపై అనేక విశ్లేష‌ణ‌లు వినిపించాయి. ఈట‌ల ఈజీగా గెలుస్తారా? కేసీఆర్‌దే పైచేయి అవుతుందా? ఈట‌ల‌తో బీజేపీకి బూస్ట్ వ‌స్తుందా? ఈట‌ల కేసీఆర్‌కు ఏకు మేకవుతారా? ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు. ఇప్పుడు వాట‌న్నిటినీ మ‌ళ్లీ రీరైట్ చేసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఎందుకంటే ఇన్నాళ్లూ హుజురాబాద్‌లో వేసిన లెక్క‌ల్లో కాంగ్రెస్ పాత్ర అతి త‌క్కువ‌. కానీ, రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావ‌డంతో లెక్క‌ల‌న్నీ మారిపోయే ప‌రిస్థితి రావొచ్చు అంటున్నారు. తెలంగాణ పొలిటిక‌ల్ స్క్రీన్‌పై రేవంత్‌రెడ్డి మ‌రో లీడ్ రోల్ ప్లే చేయ‌నున్నారు. పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేపట్టాక‌ రేవంత్‌రెడ్డి ముందుకొచ్చే ఫ‌స్ట్ టాస్క్‌--హుజురాబాద్ బైపోల్‌. ఇదే ఇప్పుడు రాజ‌కీయంగా అత్యంత ఆస‌క్తిక‌రం. హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేసే ప‌రిణామం. సెప్టెంబ‌ర్‌లోనే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక వ‌స్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి సత్తాకు హుజురాబాద్ ఎల‌క్ష‌న్ స‌వాల్‌గా నిలవ‌నుంది. త‌న‌ను పీసీసీ చీఫ్ చేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మే అని నిరూపించుకోవాలంటే.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపించుకు తీరాల్సిందే. హుజురాబాద్ గెలుపు.. ఈట‌ల‌, కేసీఆర్‌కు ఎంత ముఖ్య‌మో ఇప్పుడిక రేవంత్‌రెడ్డికి సైతం అంతే ముఖ్యం. ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.  హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. రేవంత్ పేరు ఢిల్లీ స్థాయిలో రీసౌండ్ అవుతుంది. తెలంగాణ‌లోనూ రేవంత్‌రెడ్డి మొన‌గాడ‌నే ఇమేజ్ మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. హుజురాబాద్‌లో ఈట‌ల‌ను, కేసీఆర్‌ను దెబ్బ‌కొడితే.. మ‌రో మూడేళ్ల వ‌రకూ.. అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ.. ఆయ‌న‌కు ఎదురులేకుండా పోతుంది. ఒక్క హుజురాబాద్ విజ‌యం.. రేవంత్‌రెడ్డిని అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు తెలంగాణ‌లోనూ హీరోని చేస్తుంది.  ఒక‌వేళ హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెల‌వ‌లేక‌పోతే.. పార్టీకి పెద్ద‌గా న‌ష్టం లేక‌పోయినా.. రేవంత్‌రెడ్డికి మాత్రం ఇబ్బందులు సృష్టించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రేవంత్ ఎంపిక‌పై సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్ప‌టికే అధిష్టానానికి ఆయ‌న‌పై అనేక ఫిర్యాదులు చేశారు. ఇక నుంచి మ‌రింత కీన్‌గా రేవంత్‌రెడ్డిని అబ్జ‌ర్వ్ చేస్తుంటారు. ఏమాత్రం సందు దొరికినా.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ‌తారు. హుజురాబాద్‌లో క‌నుక కాంగ్రెస్ ఓడిపోతే.. సీనియ‌ర్స్ చేతికి అస్త్రం దొరికిన‌ట్టే. రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నా.. ఏం చేయ‌లేక‌పోయాడు.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు కూడా రాలేదంటూ సోనియాగాంధీ చెవిలో ఊద‌ర‌గొడ‌తారు. ఇటు, తెలంగాణ స‌మాజంలోనూ రేవంత్‌రెడ్డి స‌త్తాపై అనుమానాలు మొద‌ల‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే కొడంగ‌ల్‌లో ఓట‌మి ప్ర‌జ‌ల‌కు ఇంకా గుర్తుంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌కు ఊపు తీసుకొచ్చింది ఏమీ లేద‌నే విమ‌ర్శ ఉంది. అందుకే, హుజురాబాద్ బైపోల్ రూపంలో రేవంత్‌రెడ్డి సామ‌ర్థ్యానికి అగ్నిప‌రీక్ష రెడీగా ఉంది.  హుజురాబాద్ ఉప ఎన్నిక సంథింగ్ డిఫ‌రెంట్‌. అక్క‌డ ప్ర‌స్తుతానికి ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ న‌డుస్తోంది. హుజురాబాద్‌ ప్ర‌జ‌లు కూడా ఈట‌ల‌నా? కేసీఆరా? త‌మ‌కు ఎవ‌రు కావాలో తేల్చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అందుకే, ఆ ఎన్నిక‌ను ప్ర‌త్యేకంగా చూడాల్సి ఉంటుంది. హుజురాబాద్ గెలుపోట‌ములను రేవంత్‌రెడ్డికి అంట‌గ‌ట్ట‌లేమ‌ని అంటున్నారు. పీసీసీ చీఫ్‌గా నిరూపించుకునేందుకు రేవంత్‌రెడ్డికి కూడా కొంత స‌మ‌యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే, ఇప్ప‌టికిప్పుడు హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌లో రేవంత్‌రెడ్డి త‌ల‌దూర్చి చేసేదేమీ ఉండ‌క‌పోవ‌చ్చు అంటున్నారు. అయితే, గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కాస్త ఊపు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి బ‌రిలో దిగ‌బోతున్న కౌశిక్‌రెడ్డి స్ట్రాంగ్ కేండిడేట్‌. ఆయ‌న‌కు రేవంత్‌రెడ్డి మ‌ద్ద‌తూ తోడైతే.. ప్ర‌చారంలో కాక రేపొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఈట‌ల, కేసీఆర్‌లు హుజురాబాద్‌ను స‌వాల్‌గా తీసుకున్నారో.. అలానే రేవంత్‌రెడ్డి సైతం గ‌ట్టిగా ట్రై చేస్తే.. గెలుపు అంచుల వ‌ర‌కూ చేరుకోవ‌చ్చు. ఈ స‌మ‌యంలో గ‌ట్టి పోటీ ఇచ్చినా.. అది రేవంత్‌రెడ్డి ఇమేజ్‌కు అద‌న‌పు అడ్వాంటేజ్ అవుతుంది. గ‌తంలో కంటే ఓ 10వేలు ఓట్లు ఎక్కువ వ‌చ్చినా.. ఆ క్రెడిట్ రేవంత్ ఖాతాలోనే ప‌డుతుంది. త‌గ్గితే మాత్రం రేవంత్‌కు వ‌చ్చే ప్రాబ్ల‌మ్ ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు. అంటే.. వ‌స్తే కొండ‌.. పోతే వెంట్రుక‌.  మ‌రి, రేవంత్‌రెడ్డి హుజురాబాద్ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా? అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. ఎందుకంటే, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్ర‌క‌టించ‌గానే.. ఆయ‌న మొద‌టి రియాక్ష‌న్‌లో ఈట‌ల ప్ర‌స్తావ‌నే తీసుకొచ్చారు. ఈట‌ల‌ను బీజేపీలో చేర్చింది కేసీఆరే అంటూ ఆస‌క్తిక‌ర‌ కామెంట్లు చేశారు. అంటే, ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ వార్‌లో రేవంత్‌రెడ్డి త‌ల‌దూర్చిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇక‌, పీసీసీ చీఫ్‌గా హుజురాబాద్ ఎల‌క్ష‌న్ త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు స‌వాల్‌గా నిలుస్తుంద‌ని.. రేవంత్‌రెడ్డి త‌న స్టామినా ఎంతో చూపించుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. అదే గ‌నుక జ‌రిగితే.. ఇటు కేసీఆర్‌ను అటు రేవంత్‌రెడ్డిని ఎదుర్కొని గెల‌వాల్సి ఉంటుంది ఈట‌ల రాజేంద‌ర్‌. గ‌త ఎన్నిక‌ల్లో ఈట‌ల‌కు వ‌చ్చిన 1.24ల‌క్ష‌ల ఓట్లు ఈసారి ఎవ‌రికి ప‌డ‌తాయో.. ఆ ఓట్ల‌ను చీల్చేదెవ‌రో.. కొళ్ల‌గొట్టేదెవ‌రో.. అంత ఈజీగా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇటు ఈట‌ల‌, అటు కేసీఆర్‌.. మ‌ధ్య‌లో రేవంత్‌... హుజారాబాద్‌లో ఇక తీన్మార్‌.....

మళ్ళీ రాజుకున్న సీట్ల పంచాయతి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం  2014 లో ఇచ్చిన అనేక హామీల్లో, నియోజక వర్గాల పునర్విభజన కూడా ఒకటి. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్ళు పూర్తయినా, కేంద్రం ఆ ఊసే ఎత్తలేదు సరికదా, 2026 వరకు దేశంలో ఎక్కడా నియోజక వర్గాల పునర్విభజన  చేపట్టే  అవకాశమే లేదని  తేల్చేసింది. అయితే, జమ్మూ కశ్మీర్’కు రద్దయిన రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఆ రాష్ట్రంలో నియోజక నియోజక వర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకోసంగా రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీని ఏర్పాటు చేసింది. చివరకు గత గురువారం, జమ్మూ కశ్మీర్ రాజకీయ నేతలతో నిర్వహించిన సమావేశంలో, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అంటే, ఆయన తమ నోటితో చెప్పక పోయినా, రాజకీయ పార్టీలు కోరుకుంటున్న, రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ జరగాలంటే నియోజక వర్గాల పునర్విభజనకు రాజకీయ  పార్టీలు సహకరించి తీరాలని, మెడ మీద కత్తి పెట్టారు. జమ్మూ కశ్మీర్ పార్టీలు, నియోజక వర్గాల పునర్విభజనను కోరుకోవడం లేదు, కాదు, వ్యతిరేకిస్తున్నాయి. అందుకే,దేశాయ్ కమిటీ ఏర్పడి ఇంచుమించుగా సంవత్సరం అయినా, ప్రాంతీయ పార్టీల సహాయ నిరాకరణతో, కమిటీ పని కదలడం లేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. అందుకే, ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి నియోజక వర్గాల పునర్విభజనకు ప్రాంతీయ పార్టీలను ఒప్పించారు.  కానీ, అదే సమయంలో ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా నియోజకవర్గాల విభజన చేపట్టాలని కోరుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కోరుతున్నా ససేమిరా అటున్నారు. ఎందుకీ ద్వంద వైఖరి అంటే, జమ్మూ కశ్మీర్’లో నియోజక వర్గాల పునర్విభజన వలన బీజేపీకి ప్రయోజనం, తెలుగు రాష్ట్రాలలో ఇక్కడి పాలక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ప్రయోజనం, అందుకే అక్కడో నీతి, ఇక్కడో నీతి పాటిస్తున్నారు, అనుకోవలసి వస్తుంది.  అయితే, ఇప్పుడు ఈ ద్వంద నీతి కారణంగానే తెలుగు రాష్ట్రాలలో మరోమారు, సీట్ల పంచాయతీ రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్’ కేంద్ర ప్రభుత్వ ద్వంద నీతిని ప్రశ్నిస్తూ, జమ్మూ కశ్మీర్ సూత్రాన్నే తెలుగు రాష్ట్రాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం  2014 ప్రకారం వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని వినోద్  శనివారం డిమాండ్ చేశారు.రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను తక్షణం పెంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబిచ్చారని ఆయన పేర్కొన్నారు. మరి ఈ సూత్రం జమ్మూ, కాశ్మీర్ ము ఎందుకు వర్తించదని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్ లో రాజకీయ కోణంలో అక్కడ అసెంబ్లీ సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. జమ్మూ,కాశ్మీర్ లో అఖిలపక్ష సమావేశంతో ఈ విషయం తేలిపోయిందని ఆయన తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని విమర్శించారు. రాజకీయ కుయుక్తులు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు తక్షణమే పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 కు పెంచాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు. అయితే, నియోజక వర్గాల పునర్విభజన వలన తెలంగాణలో తెరాస కు, ఏపీలో వైసీపీ, తెలుగు దేశం పార్టీలకు ప్రయోజనం చేకురుతుందే తప్ప బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఉండదు. అందుకే ఇంతవరకు , కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల డిమాండ్’ను పట్టించుకోలేదు. ఇప్పుడైనా పట్టించుకుంటుందా,అంటే, డౌటే అంటున్నారు.

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్..  మోత్కుపల్లి గుడ్ బై ? 

ఈటల రాజేందర్ చేరికలో జోష్ మీదున్న బీజేపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. మరికొందరు అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగానే తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కమలానికి హ్యాండిచ్చారు. ప్రగతి భవన్ లో ఆదివారం దళితుల సమస్యలపై సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. అన్ని పార్టీలు దళిత ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అయితే సీఎం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. తమ పార్టీ నుంచి ఎవరూ ప్రగతి భవన్ కు వెళ్లరని ప్రకటించింది. అదే సమయంలో కేసీఆర్ సమావేశానికి పోటీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దళిత నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే బీజేపీలో దళిత నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు.. పార్టీ నిర్వహించిన సమావేశానికి కాకుండా సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరయ్యారు. ఇదే ఇప్పుడు బీజేపీలో కాక రేపుతోంది. పార్టీ వద్దని చెప్పినా మోత్కుపల్లి ప్రగతి భవన్ వెళ్లారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొంత కాలంగా బీజేపీలో మోత్కుపల్లి నర్సింహులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు కూడా సరిగా హాజరు కావడం లేదు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ లోనూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు, రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆటలను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని మోత్కుపల్లి సమర్ధించారు. అంతేకాదు మాములు కార్యకర్తగా ఉన్న ఈటలను ఎన్నో పదవులు ఇచ్చిన కేసీఆర్ చాలా గొప్పవాడని చెప్పారు. ఈటలపై చేసిన వ్యాఖ్యలు, తాజాగా ప్రగతి భవన్ సమావేశానికి మోత్కుపల్లి హాజరు కావడంతో... ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మోత్కుపల్లిని తమ పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలుస్తోంది. 

రేవంత్‌రెడ్డి దెబ్బ‌.. కారుకా? క‌మ‌లానికా? దిమ్మ తిరిగేది ఎవ‌రికి?

రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ ప‌ట్టాభిషేకం చేసింది. తెలంగాణ సింహాస‌నంపై సింహాన్ని కూర్చోబెట్టింది. ప్ర‌త్య‌ర్థుల‌పై గాండ్రించేందుకు ల‌య‌న్ రేవంత్‌రెడ్డి రెడీ అవుతున్నారంటూ ఫాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం అంటూ జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. రేవంత‌న్న వ‌చ్చాడు.. ఇక హ‌స్తం పార్టీకి పున‌ర్‌వైభ‌వం తీసుకొస్తాడంటూ కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు. ఇక కాస్తో కేసీఆర్‌.. ముఖ్య‌మంత్రికి ముచ్చ‌మ‌ట‌లేనంటూ సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో హోరెత్తిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం క‌ట్ట‌బెట్ట‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపెన్న‌డూ లేనంత ఉత్సాహం.. వెయ్యి ఏనుగుల బ‌లం. అయితే, కాంగ్రెస్ బ్యాచ్ ఇంతగా హ‌డావుడి చేస్తున్నా.. టీఆర్ఎస్ మాత్రం బిందాస్‌గా క‌నిపిస్తోంది. రేవంత్‌రెడ్డితో త‌మ‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌న్న‌ట్టు.. తామేమీ హైరానా ప‌డ‌ట్లేదంటూ కులాసాగా ఉంది. ఇంత‌కీ, టీఆర్ఎస్‌లో అంత ధీమాకు కార‌ణ‌మేంటి?  రేవంత్‌రెడ్డితో టీఆర్ఎస్‌కే క‌దా మెయిన్ ఎఫెక్ట్‌? అంటే డివైడ్ టాక్ వినిపిస్తోంది. అవును, రేవంత్‌రెడ్డి టార్గెట్ అంతా కేసీఆర్‌పైనే ఉంటుంది. ఇక రోజూ కేసీఆర్‌కు రేవంత్ నుంచి మ‌ద్దెల ద‌రువు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. గులాబీ బాస్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారుతాడ‌న‌డంలో డౌటే అవ‌స‌రం లేదంటున్నారు. అయినా, టీఆర్ఎస్‌పై రేవంత్ ఎఫెక్ట్ అంతంత మాత్ర‌మే ఉంటుంద‌ని చెబుతున్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏం చేశాడు..? ఇప్పుడు ప్రెసిడెంట్‌గా ఇంకేం చేస్తాడు..? అన్న‌ట్టు కారు పార్టీ లైట్ తీసుకుంటోంది. అస‌లైన దెబ్బ బీజేపీకి త‌గులుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. అందుకు కేసీఆర్ లెక్క మ‌రోలా ఉంది.... రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఎంతగా విమ‌ర్శిస్తే అంత హీరో అవుతారు. ఏళ్లుగా ఇదే ఆయ‌న చేస్తున్న ప‌ని. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న‌కంటే.. కేసీఆర్ అండ్ కో పై విమ‌ర్శ‌ల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తార‌నే అభిప్రాయం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. ఇక‌పైనా కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల డోసు మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది. ఆయ‌న నోరే ఆయ‌న బ‌లం. ఆక‌ట్టుకునేలా మ‌ట్లాడ‌టం.. సూటిగా, ఘాటుగా మాట‌ల దాడి చేయడం రేవంత్ స్పెషాలిటీ. అదే ఆ డైన‌మిక్ లీడ‌ర్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఎంత‌గా ఫోక‌స్ పెంచితే.. ఆయ‌న‌పై ప్ర‌జ‌ల అటెన్ష‌న్ అంతగా పెరుగుతుంది. రేవంత్ కూడా ఇక‌పై అదే ప‌ని చేస్తారు. ప‌బ్లిక్‌లో ఆయ‌న ఇమేజ్ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్‌లో మ‌రో వైఎస్సార్‌లా తిరుగులేని నాయ‌కుడిగా మారుతారు. టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ను బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా నిల‌బెడ‌తారు రేవంత్‌రెడ్డి. ఇదే జ‌రిగితే... కారు పార్టీ కంటే క‌మ‌లానికే ఎక్కువ న‌ష్ట‌మ‌నేది విశ్లేష‌కుల మాట‌. కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ దూసుకొస్తోంది. బ‌స్తీ మే స‌వాల్ అంటూ క‌మ‌ల‌నాథులు కేసీఆర్‌పై తొడ‌గొడుతున్నారు. ఆ మేర‌కు జ‌నాల్లోనూ పువ్వు గుర్తుకు పాపులారిటీ పెరుగుతోంది.. దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీలో ఆ మేర‌కు మంచి ఫ‌లితాలు రాబ‌ట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ పెద్ద‌గా యాక్టివ్‌గా లేదు. రేవంత్‌రెడ్డి కాస్త‌ సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. అందుకే, వార్‌.. టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా మారింది. కానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి బ‌రిలో దిగారు. సింహంలా పంజా విసిరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ పంజా దెబ్బ‌.. టీఆర్ఎస్‌కంటే బీజేపీకే ఎక్కువ డ్యామేజ్ చేస్తుందనేది ఓ వాద‌న‌. రేవంత్ డైన‌మిక్ పాలిటిక్స్‌తో ప్ర‌భుత్వ వ్య‌తిరేక వ‌ర్గ‌మంతా కాంగ్రెస్ వైపు క‌న్సాలిడేట్ అయితే..? అది బీజేపీకే న‌ష్టం. ఇన్నాళ్లూ కేసీఆర్‌కు యాంటీగా జ‌నాలు బీజేపీ వైపు మొగ్గు చూపితే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌తో ఆ వ్య‌తిరేక‌తంతా హ‌స్తం వైపు మ‌ళ్లుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అటు, ఈట‌ల రాజేంద‌ర్ ఇటీవ‌ల బీజేపీలో చేర‌గా.. ఆయ‌న సైతం హుజురాబాద్ ఉప ఎన్నిక త‌ర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి కాషాయం పార్టీని బ‌లోపేతం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇటు రేవంత్‌, అటు ఈట‌ల‌.. ఇద్ద‌రు క‌లిసి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను చీల్చే అవ‌కాశం ఉంది. అంటే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి అలానే ఉంటుంది. కానీ, వ్య‌తిరేక ఓటు కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య చీలిపోతుందని చెబుతున్నారు. అది టీఆర్ఎస్‌కే లాభం చేసి.. ఆ మేర‌కు బీజేపీని దెబ్బ‌తీస్తుందని అంటున్నారు. అలా జ‌రిగితే.. ఎప్ప‌టిలానే కేసీఆర్ మ‌ళ్లీ బిందాస్‌......

జగన్ సర్కార్ కు మరో షాక్.. గండం గట్టెక్కేదెలా.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలని ఇటీవల వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అన్ని రాష్ట్రాలకు భిన్నంగా పరీక్షల నిర్వహణపై పంతానికి పోయిన జగన్ సర్కార్... సుప్రీంకోర్టు అక్షింతలతో దిగొచ్చి పరీక్షలను రద్దు చేసింది. మాన్సాస్ ట్రస్ట్, సంగం డెయిరీ, విశాఖ భూముల అమ్మకం.. ఇలా అన్ని అంశాల్లోనూ ఏపీ సర్కార్ కు కోర్టుల్లో చుక్కెదురైంది. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య కాక రేపుతున్న రాయలసీమ ఎత్తిపోథల పథకం విషయంలోనూ జగన్ రెడ్డి సర్కార్ కు వరుస షాకులు తగులుతున్నాయి.  తెలంగాణ సర్కార్ చేసిన ఫిర్యాదుతో ప్రాజెక్టు పనులు ఆపాలని ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ విరుద్ధంగా పనులు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ ఏపీ సీఎస్ ను ఉద్దేశించి కామెంట్ చేసింది. కృష్ణా ప్రాజెక్టులపై రెండు దెబ్బలకు తోడుగా మరో షాక్ తగిలింది. తాజాగా ఏపీ సర్కారుకు షాకిచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ.  రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల్ని వాయిదా వేసింది.ప్రాజెక్టుకు సంబంధించి ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలని కోరింది కేంద్ర పర్యావరణ శాఖ. ప్రాజెక్టు స్పష్టమైన డ్రాయింగ్స్.. లేఅవుట్ లు.. చార్ట్ లను ఇవ్వాలని ఏపీ సర్కారుకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తులో స్పష్టత మిస్ అయినట్లుగా చెబుతున్నారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎంత నీటిని వాడుకోవాలన్న సమాచారాన్ని కేంద్రం కోరింది.  మరోవైపు  ఏపీ సర్కారు నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. మంత్రులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దివంగత మహా నేత వైఎస్ మొదలు..ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను ఘాటుగా తిట్టేస్తున్నారు. అయినప్పటికి వైసీపీ నేతలు  మాత్రం ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తున్నారే తప్పించి.. తమ సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించటం లేదు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేసే తీరును ఏపీ అధికారపక్ష నేతలు అస్సలు ప్రదర్శించటం లేదు. 

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క

ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పటి నుంచి ఓ లెక్క... ఆడొచ్చాడు.. రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పు... అంటూ రేవంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియో హోరెత్తిస్తున్నారు. నిజంగానే తెలంగాణ రాజకీయాలు ఇక నుంచి మరో లెక్కలో వెళతాయనడంలో డౌటే లేదు. ఇప్పటిదాకా.. మంచాన్ని నాలుగు వైపుల నుంచి లాగినట్లే లాగారు కాంగ్రెస్ నేతలు.. ఎవరూ ముందుకు వెళ్లకుండా..వెనక్కు లాగుతూనే ఉన్నారు. ఎవరికి వారు తామే కింగులమంటూ రెచ్చిపోవడం కాంగ్రెస్ లో అలవాటు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైములో చెరిగిపోయింది.  ఆయనే రాజు ఆయనే మంత్రిలా వ్యవహారం నడిచింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో అలాంటి నాయకత్వం అందించడం బహుశా రేవంత్ రెడ్డికే సాధ్యం. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో వన్ సైడ్ డ్రైవింగ్ నడవబోతుందనే చెప్పాలి.  రేవంత్ రెడ్డి దూకుడు, ఆయనకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్..ముఖ్యంగా కేసీఆర్ శత్రువుల్లో ఆయన పట్ల ఉన్న క్రేజ్..ఇవన్నీ.. ఓ రేంజ్ లీడర్ షిప్ అందించే దిశగా వెళతాయనే ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక బిజెపియే ప్రతిపక్షం..కేసీఆర్ ని ఢీకొట్టేది ఇక బిజెపియే అంటూ టాక్ మార్మోగింది. దుబ్బాక ఎన్నికతో ఆ టాక్ మరింత చెలరేగిపోయింది.  గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన ఓట్లతో బిజెపి ఇక రాబోయే అధికారం వారిదేనని ఫిక్స్ అయిపోయింది. కాని తర్వాత కేసీఆర్ వేసిన ఒకే ఒక పాచికతో అవన్నీ కొట్టేసినట్లు అయిపోయింది.  ఢిల్లీలో కేసీఆర్ దోస్తీ ఉందనే వార్తలు రావడంతో.. రాష్ట్రంలో బిజెపి నేతలు కమెడియన్స్ అయినంత పని అయింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికతో అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు హూజురాబాద్ తో మళ్లీ జూలు విదిల్చాలని చూస్తున్నారు. ఈ టైమ్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా బిజెపికి గట్టి స్ట్రోకే. అయితే హూజురాబాద్ ఈటల రాజేందర్ బొమ్మతో నడుస్తుంది కాబట్టి.. అక్కడ ఫలితాలు వేరేగా ఉంటాయి. కాని ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుమ్ము రేపుతుందని...ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ఆపటానికి ప్రయత్నించిన వారంతా ఇక నుంచి ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీహెచ్ లాంటి నేతలతో సమస్య లేదు..ఎందుకంటే సీనియారిటీ ఉన్నా మాస్ మద్దతు లేదు. శ్రీధర్ బాబు పరిస్దితి కూడా అంతే. ఎటొచ్చీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లా మొత్తం ప్రభావం చూపించగలిగిన వాడు. పైగా రేవంత్ తో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినవాడు. కాబట్టి సహకరిస్తాడా..లేక నల్గొండ వరకు చూసుకుంటాడా అనేది కూడా చూడాలి. పైగా రేవంత్ తనకు నచ్చినవారిని నేతలుగా రంగంలోకి దింపాలనుకుంటే..ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడటం ఖాయమే. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటూ బిజెపిలోకి వెళ్లిపోవడం కూడా అంతే ఖాయం. ఇప్పటివరకు అన్నకు పదవి వస్తుందేమోనని  ఆగిన రాజగోపాల్ రెడ్డి ఇక ఆలస్యం చేయకుండా బిజెపిలోకి వెళ్లిపోతారనే చెబుతున్నారు. అయితే అసంతృప్తిగా ఉండే నాయకుల్లో కొందరిని కేసీఆర్ మేనేజ్ చేసి..కాంగ్రెస్ లో నే కుంపటి రగిలేలా చేసే అవకాశం అయితే ఉంది. దానిని రేవంత్ రెడ్డి ఎలాఎదుర్కొంటారనేదే చూడాలిక.

ఫ్రైర్ బ్రాండ్ లీడర్.. రాజకీయ సంచలనం రేవంత్ రెడ్డి

ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి.. ఫైర్ బ్రాండ్ లీడర్. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి.  జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. అనతి కాలంలోనే ఎన్నో కీలక పదవులు సాధించారు.  ఎన్ని ఒడిదుడుకులు ఎదొర్కున్నారు. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు.తెలంగాణలో తనకంటూ ఓ పత్యేక అనుచర గణాన్నిఏర్పరుచుకున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌కు ధీటైన నాయకుడిగా ఎదిగారు. గత కొన్నేండ్లుగా కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న పోరాటంతో ఆయనకు మరింత క్రేజీ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్నా  రేవంత్‌పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయననే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. 1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జన్మించారు రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్ కు మద్దతుదారుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదువుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి అఖిలభారత విద్యార్థి పరిషత్‌ సభ్యుడిగా ఉన్నారు. 24 ఏళ్ల వయసులోనే రేవంత్ రెడ్డికి వివాహమైంది. వారికి నైమిష అనే కుమార్తె ఉంది.  2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ కు మద్దతుగా పని చేశారు. అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంతంతమాత్రంగానే ఉంది. మిడ్జిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా ఏ పార్టీ ఇవ్వకపోవడంతో సొంతంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేశారు. అప్పుడు కూడా స్వతంత్రంగానే పోటీ చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ సపోర్ట్ చేసింది. ఎమ్మెల్సీగా  అప్పటి అధికార పార్టీ అభ్యర్థిపై గెలిచి సంచలనం స్పష్టించారు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఆయన రాజకీయం గమనం వేగంగా మారిపోయింది.  కొంత కాలానికే రేవంత్ రెడ్డి  చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు.  తన సొంతూరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కొడంగల్ కు మకాం మార్చారు రేవంత్ రెడ్డి. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న గురునాథ రెడ్డి ఉన్నారు. ఆతనికి ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదనుకున్నారు. 2009 ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి చాలా కష్టాలు పడ్డారని చెబుతారు. అయితే ఆ ఎన్నికలో అనూహ్య విజయం సాధించారు రేవంత్ రెడ్డి.  2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అయినా.. రేవంత్ రెడ్డి హవా నడిచేది. ఆయన ఏం చేసినా చెల్లుబాటయ్యేది. అసెంబ్లీలో కూడా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అయినా.. రేవంత్ రెడ్డి లేచి నిలబడితే అధికార పార్టీ నేతల కళ్లు ఎర్రబడేవి. ఓ దశలో కవిత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు వ్యవహారం వెళ్లింది.  2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకుగాను ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఆ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి అయినా వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజులు జైలులో ఉన్న రేవంత్ రెడ్డి.. విడుదలయ్యాక కూడా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు.తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు.. ఈ రెండింటినీ బేరీజు వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఓ న్యాయవాది ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయడంతో ఇన్‌కం ట్యాక్స్ దాడులు నిర్వహించింది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల సమయంలో కొడంగల్‌లో చోటుచేసుకన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

ల‌య‌న్ రేవంత్‌రెడ్డి క‌మింగ్‌.. ఇక కాస్కో కేసీఆర్‌...

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి. రామ్‌గోపాల్‌వ‌ర్మ మాట‌ల్లో చెప్పాలంటే సింహాన్ని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించి సూప‌ర్ ఫెంటాస్టిక్ డెసిష‌న్ తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడిక పులుల‌న్నీ ఆ సింహాన్ని చూసి భ‌య‌ప‌డాల్సిందే. తెలంగాణ రాజ‌కీయం ఇప్ప‌టి దాకా ఓ లెక్క‌. రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఇప్పుటి నుంచి ఇంకోలెక్క‌. ఆ లెక్క‌.. అనేక మంది త‌ల‌రాత‌లు మార్చేసే అవ‌కాశం ఉంది. సింహం వేటాడితే ఎట్టా ఉంటాదో ఇక‌పై చూడ‌బోతోంది తెలంగాణ స‌మాజం. చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్‌గా ప‌గ్గాలు చేత‌బ‌ట్టి.. కేసీఆర్‌పై దండ‌యాత్ర‌కు దూసుకొస్తున్నారు. రేవంత్‌రెడ్డి టార్గెట్ ఒక్క‌టే.. అది కేసీఆర్‌ను గ‌ద్దె దింప‌డం. ఆయ‌న్ను ఒక్క‌రోజైనా జైల్లో పెట్ట‌డం.  లేటైనా.. లేటెస్ట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకొస్తున్నారు డైన‌మిక్ లీడ‌ర్‌ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో ఇంత స్పీడ్‌గా ఎదిగిన మ‌రో నేత మ‌న‌కు క‌నిపించ‌రు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక‌.. ఇక టీడీపీతో వ‌ర్క‌వుట్ కాద‌ని.. హ‌స్తం పార్టీలో చేరారు. అన‌తికాలంలోనే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ పోస్ట్ సాధించారు. ఆ ప‌ద‌వే ఆయ‌న్ను ఏరికోరి వ‌రించింది. సీనియ‌ర్లు ఎన్ని కొర్రీలు పెట్టినా.. అధిష్టానానికి ఎన్ని లేఖ‌లు రాసినా.. వీహెచ్ లాంటి నేత‌లు ఎంత‌గా ర‌చ్చ చేసినా.. అవేవీ రేవంత్ స్పీడ్‌కు బ్రేకులు వేయ‌లేక‌పోయాయి. రాహుల్‌గాంధీ ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌టం.. క్షేత్ర స్థాయిలో నివేదిక‌ల‌న్నీ రేవంత్‌రెడ్డికే అనుకూలంగా ఉండ‌టంతో.. ఆయ‌న పేరునే ఖ‌రారు చేయ‌క త‌ప్ప‌లేదు అధిష్టానానికి. చేష్ట‌లుడిగి.. చేవ చ‌చ్చిన కాంగ్రెస్‌కు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డే పెద్ద దిక్కు. రేవంత్ హ‌స్తం పార్టీ హ‌స్త రేఖ‌లు మార్చే మొన‌గాడు. అందుకే, కాంగ్రెస్ ఈసారి ఎలాంటి త‌ప్పు చేయ‌కుండా.. రేవంత్‌రెడ్డికి పీసీసీ కిరీటం క‌ట్ట‌బెట్టింది. ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో ఆ పార్టీ తీసుకున్న మంచి నిర్ణ‌యాల్లో ఇదొక‌టిగా నిలిచిపోతుంద‌ని అంటున్నారు.  తెలంగాణ‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. కేసీఆర్ దూకుడు ముందు హ‌స్తం పార్టీ అస్త‌వ్య‌స్థం అవుతోంది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. ద‌మ్మున్న మొన‌గాడు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్డ‌డంతో ఇక కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చినట్టేనంటూ అప్పుడే ఊరూరా సంబ‌రాలు చేసుకుంటున్నారు రేవంత‌న్న అభిమానులు.  ఇక‌, ఇవాళ రాత్రి కేసీఆర్ ప్ర‌శాంతంగా నిద్ర‌పోలేర‌ని ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్‌వాదులు. ఎందుకంటే ఇక‌పై కేసీఆర్‌కు మ‌న‌శ్శాంతి క‌రువవుతుంద‌ని చెబుతున్నారు. రేవంత్ రంగంలోకి దిగితే మామూలుగా ఉండ‌దు మ‌రి. కేసీఆర్‌కు చుక్క‌లే. పీసీసీ అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ.. రేవంత్‌రెడ్డికే ఒక‌టే ప‌ని.. ఒక‌టే ధ్యాస‌.. ఒక‌టే ల‌క్ష్యం.. అది కేసీఆర్‌ను దెబ్బ‌కొట్ట‌డం. ఉద‌యం నిద్ర లేచిన‌ప్ప‌టి నుంచీ.. రాత్రి నిద్ర పోయేదాక.. కేసీఆర్ ప‌ని ప‌ట్ట‌డ‌మే రేవంత్‌రెడ్డి ప‌ని. రేవంత్‌ రంగంలోకి దిగితే కేసీఆర్‌కు మామూలుగా ఉండ‌దిక‌. దేత్త‌డి.. పోచమ్మ గుడే... ఇక కాస్కో కేసీఆర్‌.....

ఈటలను బీజేపీలో చేర్చిందే కేసీఆర్! పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సంచలనం...

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమించబడిన కొద్ది సేపటికే సంచలనానికి తెర తీశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తో పాటు బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చింది సీఎం కేసీఆరే అంటే సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ తో మాట్లాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ కేసీఆర్ సమకూర్చిందే అన్నారు. కేసీఆర్ సన్నిహితుడికి చెందిన విమానంలోనే కిషన్ రెడ్డి వచ్చి.. బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ను ఆహ్వానించారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో వర్గపోరు లేదన్నారు. అభిప్రాయలు వేరువేరుగా ఉన్నాయే తప్ప విభేదాలు కావన్నారు. ఎవరూ ఏమైనా మాట్లాడే స్వేచ్చ కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి కావాలని ఎవరికైనా అడిగే హక్కు ఉంటుందన్నారు. ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందరిని కలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ నేతలమంతా సమిష్టిగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన కుటుంబ సభ్యులన్నారు రేవంత్ రెడ్డి. వీహెచ్ ను కలిసి మద్దతు కోరుతానని తెలిపారు. కొన్నేళ్లుగా కేసీఆర్  సర్కార్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి... పీసీసీ చీఫ్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేయడమే తన లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. అరాచక పాలనకు చరమ గీతం పాటి... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. 

YSRలా రేవంత్ రెడ్డి పాదయాత్ర? సీఎం పోస్టే టార్గెట్ ?

అందరు అనుకుంటున్నట్లే తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎంపీ రేవంత్ రెడ్డికి దక్కాయి. రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి సాధించిన రేవంత్ రెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి పోస్టేనంటూ నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మద్దతుదారుల హంగామాతో గాంధీభవన్ సందడిగా మారింది.  అనుకున్నది సాధించిన రేవంత్ రెడ్డి... నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ముందునుంచే ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డి.. భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. నెక్ట్స్ మూడేళ్ల‌కు స‌రిప‌డా మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారట.  కేసీఆర్‌పై దండ‌యాత్రే ఆయ‌న ల‌క్ష్యమని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా తన దూకుడును మరింత పెంచనున్నారు.  అసెంబ్లీ సంగ్రామానికి ఇంకా రెండున్న‌రేళ్ల గడువుంది. అందుకే, ఇప్ప‌టి నుంచే ఆవేశ‌ప‌డకుండా.. తుదిపోరుకు ఎన‌ర్జీ సేవ్ చేసుకునేలా ఆచితూచి అడుగులు వేయాల‌నేది రేవంత్‌రెడ్డి స్ట్రాట‌జీలా క‌నిపిస్తోంది. గతంలో  వైఎస్సార్ అనుస‌రించిన ఎత్తుగ‌డ‌ల‌నే రేవంత్‌రెడ్డి ఇంప్లిమెంట్ చేసేలా స‌న్నద్ద‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. అధికారంలోకి వచ్చేందుకు  వైఎస్సార్ వేసిన తిరుగులేని ఎత్తుగ‌డ‌.. పాద‌య‌త్ర‌. అదే ఆయ‌న రాజ‌కీయ జీవితానికి మ‌రో ప్ర‌స్థానంగా బాట‌లు ప‌రిచింది. చేవెళ్ల‌లో వేసిన తొలి అడుగు.. వైఎస్సార్‌ను ముఖ్య‌మంత్రి పీఠం వ‌ర‌కూ తీసుకెళ్లింది. ఆ పాద‌యాత్ర‌ తర్వాతే వైఎస్సార్‌. కాంగ్రెస్‌లో తిరుగులేని నేత‌గా ఎదిగారు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి పదవినే చేపట్టారు.  వైఎస్సార్ లానే సేమ్ టూ సేమ్ ఇదే స్ట్రాట‌జీని రేవంత్‌రెడ్డి సైతం ఫాలో కాబోతున్నార‌ని తెలుస్తోంది. జిల్లాల వారిగా ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి విశేష అనుచ‌ర‌గ‌ణం ఉంది. వారిలో స‌మ‌ర్థుల‌కు, త‌న అనుకున్న వారికి.. డీసీసీ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌ట‌. ఇప్ప‌టికే ఆ జాబితా కూడా రెడీ చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా త‌న మ‌నుషుల‌తో పార్టీలో బ‌లం పుంజుకొని.. అప్పుడిక వైఎస్సార్ మాదిరే మ‌హా పాద‌యాత్ర‌తో.. అస‌లైన దండ‌యాత్ర‌కు శ్రీకారం చుడతార‌ని అంటున్నారు. తెలంగాణ‌లో గ్రామ‌గ్రామాన కాలిన‌డ‌క‌న ప‌ర్య‌టించి.. ఊరూరా త‌న పాద‌ముద్ర వేసి.. ఆ అడుగుల స‌వ్వ‌డితో కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకువచ్చేందుకు స్కెచ్ వేశారట రేవంత్ రెడ్డి.  కేసీఆర్ పాల‌న‌లోని లోటుపాట్ల‌ను ఇంటింటికీ వెళ్లి ఎండ‌గ‌డుతూ.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తార‌ని రేవంట్ రెడ్డి అనచరులు అంటున్నారు. అయితే, ఈ పాద‌యాత్ర ఇప్పుడే చేస్తారా? లేక‌, ఎల‌క్ష‌న్ల ఏడాది చేయాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. అనుకోకుండా ఈట‌ల రాజేంద‌ర్ పాన‌కంలో బుడ‌గ‌లా బ‌య‌ట‌కు రావ‌డం.. అందులోనూ బీజేపీలో చేరి.. త‌న‌కు పోటీగా నిలిచే అవ‌కాశం ఉండ‌టంతో.. పాద‌యాత్ర‌కు ఇదే మంచి స‌మ‌యం అని అంచ‌నా వేస్తున్నార‌ట‌. గ‌తంలో పాద‌యాత్ర‌ను న‌మ్ముకున్న ఏ ఒక్క‌రు వైఫ‌ల్యం చెంద‌లేద‌ని.. వైఎస్సార్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్‌.. ఆ ముగ్గురూ పాద‌యాత్ర‌తోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించార‌ని.. అలానే రేవంత్‌రెడ్డి సైతం పాద‌యాత్రతో సీఎం అయ్యేలా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి, పాద‌యాత్ర‌తో రేవంత్‌రెడ్డి హిస్ట‌రీ రిపీట్ చేస్తారా? కాంగ్రెస్‌లో మ‌రో వైఎస్సార్‌లా తిరుగులేని నేత‌గా నిల‌బ‌డ‌తారా?

బిగ్ బ్రేకింగ్.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది .ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే మల్కాజ్ గిరి ఎంపీ , ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. తెలంగాణ పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరి వరకు మాత్రం రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి నిలిచారు. అయితే రాష్ట్ర నేతల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణలో మెజార్టీ నేతలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.  పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా 10 మందిని నియమించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం కొనసాగుతున్న మహ్మద్ అజారుద్దీన్ తో పాటు మాజీ మంత్రి గీతా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మహేష్ గౌడ్ ను అపాయింట్ చేసింది. ఇక సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా సీనియర్ నేతలు సంభాని చంద్రశేఖర్, మల్లు రవి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే పొదెం వీరయ్య , సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, కుమార్ రావు, జావెద్ అమీర్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ​ టీపీసీసీ కమిటితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఛైర్మన్, అజ్మదుల్లా హుస్సేన్ కన్వీనర్ గా ప్రచార కమిటీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఛైర్మన్ గా ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటి, నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆలేటీ మహేశ్వర్ రెడ్డి చైర్మన్ గా ఏఐసీసీ ప్రోగామ్ ఆర్గనేజింగ్ కమిటీని కూడా ఏఐసీసీ ప్రకటించింది.