కేసీఆర్ ట్రాప్‌లో కాంగ్రెస్‌.. రేవంత్ వ‌చ్చేదాక అంతేనా?

కేసీఆర్ పిలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖుషీఖుషీగా వెళ్లిపోయారు. క‌ట్టిన‌ప్ప‌టి నుంచీ ఎప్పుడూ చూడ‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను క‌ళ్లారా చూద్దామ‌నుకున్నారో.. లేక పేప‌ర్లో ఫోటోలు ప‌డ‌తాయ‌ని ఆశ‌ప‌డ్డారో.. కార‌ణం ఏంటో తెలీదు కానీ కేసీఆర్ పిల‌వ‌డం.. కాంగ్రెస్ నేత‌లు ఎగేసుకొని వెళ్ల‌డం.. అంతా పావుగంట‌లో జ‌రిగిపోయింది. పిల‌వ‌గానే అలా ఊపుకుంటూ వెళ్లిపోకుండా.. ఒక‌టి నుంచి ప‌ది అంకెలు లెక్క‌పెడితే బాగుండేద‌ని అంటున్నారు. ఒక్క క్ష‌ణం ఆలోచించినా కాస్త క్లారిటీ వ‌చ్చేది. ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ ఇప్పుడే ఎందుకు పిలిచారు? ఏడేళ్లుగా త‌మ‌ను ప‌రుగుల‌ను చూసిన‌ట్టు చూసిన కేసీఆర్‌కు స‌డెన్‌గా తామెందుకు గుర్తుకు వ‌చ్చామ‌ని ఒక్క‌సారి ప్ర‌శ్నించుకోవాల్సింది. తామెవ‌రం డిమాండ్ చేయ‌క‌ముందే.. ముఖ్య‌మంత్రి జోక్యం కోర‌క‌ముందే.. కేసీఆరే స్పందించి.. త‌మ‌ను పిలిపించి.. లాక‌ప్‌డెత్‌లో చ‌నిపోయిన‌ మ‌రియ‌మ్మ కుటుంబానికి న్యాయం చేస్తామ‌ని చెప్ప‌డం అంతా క‌ల‌లా జ‌రిగిపోయింద‌ని అంటున్నారు. కేసీఆర్ ప‌న్నిన వ్యూహంలో కాంగ్రెస్ సీనియ‌ర్లు మరోసారి చిక్కుకుపోయార‌ని.. మంచి అవ‌కాశాన్ని చేజేతులారా చేజార్చ‌కున్నార‌ని అంటున్నారు.  పోలీస్ క‌స్ట‌డీలో ద‌ళిత మ‌హిళ లాక‌ప్ డెత్‌. ఎంత పెద్ద విష‌యం ఇది. ఎంత‌టి దారుణ ఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లో పోలీస్ రాజ్యం న‌డుస్తోంద‌ని ఉద్య‌మించ‌డానికి ప్ర‌తిప‌క్షానికి మంచి అవ‌కాశం ద‌క్కేది. ఘ‌ట‌న తీవ్ర‌త గుర్తించిన కేసీఆర్‌.. అది మ‌రింత వివాదంగా మార‌క‌ముందే.. కాంగ్రెస్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వ‌కుండా ప‌రిష్కారానికి ముందుకొచ్చారు. అప్ప‌ట్లో మంథ‌నిలో ఇసుక దందాకు అడ్డొచ్చాడ‌ని ద‌ళితుడి సజీవ ద‌హ‌నం ఘ‌ట‌న‌.. ఇటీవ‌ల న‌డిరోడ్డు మీద‌ మంథ‌ని లాయ‌ర్ దంప‌తుల దారుణ‌ హ‌త్య లాంటి ఉదంతాలు ఎంతో క‌ల‌క‌లం రేపాయి. వాటిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు కూడా జ‌రిగాయి. అలాంటి సంద‌ర్భంలో కూడా స్పందించ‌ని సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు స‌డెన్‌గా మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్ విష‌యంలో ఆయ‌నే స్వ‌యంగా జోక్యం చేసుకొని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ పిలిపించుకొని వేడి చ‌ల్లార్చారు. కేసీఆర్ ఫోన్ చేయ‌గానే.. హ‌డావుడిగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ వెళ్లి.. వాళ్లూ కొన్ని డిమాండ్లు చేసిన‌ట్టు.. వాటిని సీఎం కేసీఆర్ నెర‌వేర్చిన‌ట్టు చేసి.. ఫోటోలు దిగి.. సంబ‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వెళ్లొచ్చాక కానీ తెలీలేదు.. తాము కేసీఆర్ ట్రాప్‌లో ప‌డ్డామ‌ని.. ఈ ఎపిసోడ్‌తో రాజ‌కీయంగా అంతా కేసీఆర్‌కే లాభం జ‌రిగింద‌ని ఆల‌స్యంగా గుర్తించారు. అయినా, వారేమీ అవాక్క‌వలేదు.. .ఎందుకంటే, గ‌తంలో అనేకసార్లు కేసీఆర్ చేతిలో అబాసుపాలైన చ‌రిత్ర కాంగ్రెస్ నేత‌ల‌ది.  పెద్ద‌లు జానారెడ్డి. కేసీఆర్ నోటినుంచి ప‌దే ప‌దే వ‌చ్చే ఈ డైలాగ్‌.. తెలంగాణ తొలి అసెంబ్లీలో బాగా పాపుల‌ర్‌. అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు జానారెడ్డి ప్ర‌య‌త్నించే ప్ర‌తీ సంద‌ర్భంలోనూ.. పెద్ద‌లు జానారెడ్డి అంటూ సీఎం కేసీఆర్ అడ్డుత‌గిలేవారు. కేసీఆర్ అంత‌టివాడే అసెంబ్లీ సాక్షిగా త‌న‌ను పెద్ద‌లు జానారెడ్డి అంటూ గౌర‌విస్తుండ‌టంతో ఆ మ‌ర్యాద‌కు ఆయ‌న ఉబ్బిత‌బ్బిబ్బు అయ్యేవారు. ఇక తాను ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సిన విష‌యం ప‌క్క‌న‌పెట్టేవారు. ఇదంతా త‌న‌పై ఉన్న గౌర‌వంతో కాద‌ని.. పెద్ద‌లు జానారెడ్డి అంటూ ఆయ‌న్ను కేసీఆర్ బుట్ట‌లో వేసుకునేవార‌నే విష‌యం పాపం జానారెడ్డికి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీక‌పోవ‌చ్చు అంటారు. ఇక ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లోనే అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు సీఎం కేసీఆర్‌. ఇంకేముంది.. ఇక ప్ర‌తిప‌క్షం ఏముంది? అలా తెలంగాణ తొలి అసెంబ్లీ ట‌ర్మ్‌ను ఈజీగా గ‌ట్టెక్కేశారు సీఎం కేసీఆర్‌. చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌రెడ్డి ఒక్క‌రే.. స‌భ‌లో కేసీఆర్‌ను అటాడుకునేవారు. అందుకే, పంతం ప‌ట్టి మ‌రీ ఆయ‌న్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు కేసీఆర్. ఇక రెండో ట‌ర్మ్ అధికారం చేప‌ట్టాక‌.. తెలంగాణ అసెంబ్లీలో అంతా ఏక‌ప‌క్ష‌మే. దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌పై కాస్త సాఫ్ట్ కార్న‌ర్ ఉన్న‌వాళ్లే. కాంగ్రెస్ త‌ర‌ఫున‌ నోరున్న నేత లేక‌పోవ‌డంతో.. ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీనే ప్ర‌ధాన విమ‌ర్శ‌కుడిగా మారారు.  తాజాగా, రేవంత్‌రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌నగా మ‌రోసారి కాంగ్రెస్ నేత‌ల‌పై త‌న చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు కేసీఆర్‌. ఏడేళ్లుగా గ‌డ‌ప కూడా దాట‌నివ్వ‌ని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఎందుకు పిలిచారో.. అస‌లు వెళ్లాలో లేదో.. అని ఆలోచించ‌కుండా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి వెళ్లి.. ముఖ్య‌మంత్రితో భేటీ అయి.. మ‌ళ్లీ కేసీఆర్ ట్రాప్‌లో ప‌డ్డారు కాంగ్రెస్ నేత‌లు. వారికిది కామ‌నే అయినా.. చాలా రోజుల త‌ర్వాత‌ మ‌రోసారి అలా జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేసీఆర్ మాయ‌ల మ‌రాఠి అనే విష‌యం మ‌రిచి... ప్ర‌గ‌తి భ‌వ‌న్ అనే మయస‌భ‌లో అడుగుపెట్టి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ‌కీయంగా ఆగ‌మ‌య్యార‌ని అంటున్నారు. కాంగ్రెస్ త‌ల‌రాత‌ను ఎవ‌రూ మార్చ‌లేర‌ని.. హ‌స్తం పార్టీని వేరే ఎవ‌రో ఓడించాల్సిన ప‌నిలేద‌ని.. వాళ్ల‌కు వారే ఓడించుకుంటార‌నే నానుడి మ‌రోసారి గుర్తు చేస్తున్నారు. పాపం.. కాంగ్రెస్ అంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీప్ అయ్యే  వ‌ర‌కూ ఈ తిప్ప‌లు త‌ప్ప‌వేమో....  

పుట్టిన రోజున  దేవి గుడికి వెళ్లి.. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయారు.. 

ఆ రోజు బాబు పుట్టిన రోజు. పుట్టిన రోజు గుడికి వెళ్లడం మన భారతీయుల ఆనవాయితీ. దేవుడి దగ్గరికి వెళ్లి ఆయుషారోగ్యులు ఇవ్వమని  దేవుడ్ని సహజంగా మొక్కుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్లి వెళ్లారు కనుగ తమకు ఏం జరిగిన దేవుడు కాపాడుతాడని నమ్మకం తో ఉంటారు. ఎవరైన. కానీ దేవుడి దగ్గరికి వెళ్లే దారిలోనో, తిరిగి వచ్చే దారిలోను ఏదైనా జరిగి ప్రాణాలు కూలిపోతే దేవుడు ఉన్నాడు అనాలా? లేదు అని గుర్తించేలా? ఇలాంటి సంఘటలను చాలా జరిగాయి వినాయక చవితి కి, అయ్యప్ప మాల వేసినపుడు కూడా చాలా మంది చనిపోయిన సంఘటనలు మన కళ్ల ముందు చాలానే ఉన్నాయి. తాజాగా దేవుడి దర్శనానికి వెళ్లిన వాళ్ళు ఘోర ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  వివరాల్లోకి వెళితే.. ఈ విషాద సంఘటన బలరాంపూర్‌-తులసిపూర్‌ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. మృతులు గోండ జిల్లాలోని మన్హానా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్‌ సింగ్‌ (38), స్నేహలత (35), శత్రోహన్‌ కుమార్‌ (30), సౌమ్య (18), లిల్లీ (14), ఉత్కర్ష్‌ (12)గా గుర్తించినట్టు బలరాంపూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉత్కర్ష్‌ జన్మదినం సందర్భంగా దేవీ ఆలయానికి వెళ్లి దర్శనం తీసుకోవడానికి వెళ్తుండగా లోక్‌హవా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో కారు చెరువులోకి దూసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చెరువులోకి దూసుకెళ్లిన కారు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఆరుగురిని గ్రామస్థుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. సౌమ్య, లిల్లీ కొన ఊపిరితో బయటపడినప్పటికీ ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు విడిచారని తెలిపారు. ఈ ఆరుగురిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్పీ అరవింద్‌ కుమార్‌ మిశ్రా వెల్లడించారు.

ప్రగతి భవన్ లో మారిన సీన్.. టీవీ చూస్తూ కేసీఆర్ ఫుల్ ఖుషీ..

ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. సీఎం కేసీఆర్ నివాసం ఉండేది అక్కడే. అయితే ప్రగతి భవన్ తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా ఉంది. కేసీఆర్ టార్గెట్ చేసే విపక్ష నేతలు ప్రగతి భవన్ ప్రస్తావన లేకుండా మాట్లాడరు. ప్రగతి భవన్ కాదు అది బానిస భవన్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ లోకి ఎవరికి ఎంట్రీ ఉండదన్నారు. మంత్రులు కూడా ప్రగతి భవన్ లోకి వెళ్లలేరని చెప్పారు. ప్రగతి భవన్ కు వెళ్లి..అనుమతి లేక ఎన్నోసార్లు అవమానపడ్డామని చెప్పారు. బానిస భవన్ కోటలు బద్దలు కొట్టడమే తన లక్ష్యమన్నారు. ఈటలే కాదు కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు కూడా సీఎంను కలిసేందుకు వెళితే ప్రగతి భవన్ లోకి రానియ్యలేదని చాలా సార్లు ఆరోపించారు. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉండదనే ఆరోపణలు జనాల్లోనూ వ్యక్తమవుతుండగా.. తాజాగా కీలక పరిణామాలు చోటు చోసుకుంటున్నారు. ఈటల బీజేపీలో చేరిక తర్వాత అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ప్రగతి భవన్ ను వీడి ప్రజల్లోకి వచ్చారు సీఎం కేసీఆర్. అంతేకాదు ప్రగతి భవన్ గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఏడేండ్లుగా ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టలేకపోయిన కాంగ్రెస్ నేతలకు సడెన్ గా ఎంట్రీ దొరికింది. సీఎల్పీ నేత భట్టీ ఆధ్వర్యంలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. మంతనాలు సాగించారు. ఇదే షాకింగ్ అనుకుంటే.. మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆదివారం దళిత సమస్యలపై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు కేసీఆర్. అన్ని పార్టీల్లోని దళిత నేతలు, ప్రజాసంఘాల నేతలను కూడా ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  ప్రగతి భవన్ లోకి మంత్రులు వెళ్లడానికే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి సామాన్యులు కూడా వెళ్లేలా పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ రూట్ మార్చడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్న ప్రచారంతో పార్టీకి డ్యామేజీ జరుగుతుందని గ్రహించిన కేసీఆర్.. డ్యామేజీ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. అందుకే అందరికి ఆహ్వానం పంపుతూ చర్చలు జరుతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ లో వచ్చి న మార్పుతో గులాబీ లీడర్లే ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత మళ్లీ ప్రగతి భవన్ నిషేదిక కోటగా మారిపోతుందని మరికొందరు విమర్శిస్తున్నారు.  మరోవైపు రోటీన్ కు భిన్నమైన సీన్ కు ప్రగతిభవన్  వేదికైందని తెలుస్తోంది.  సమీక్షలు. సమావేశాలు, వివిధ అంశాల మీద అధ్యయనాలే తప్పించి.. కులాశాగా అందరూ కూర్చొని టీవీ చూడటం అనే కాన్సెప్టు ప్రగతిభవన్ లో కనిపించదు. అందుకు భిన్నంగా శుక్రవారం రాత్రి మాత్రం భిన్నమైన సీన్ కనిపించిందని చెబుతున్నారు. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరుతో ప్రముఖ డిస్కవరీ చానల్ లో ప్రసారమైన కార్యక్రమాన్ని ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రముఖ డాక్యుమెంటరీఫిలిం డైరెక్టర్ రాజేంద్ర శ్రీవత్స దీన్ని రూపొందించారు. దీన్ని తాజాగా డిస్కవరీ చానల్ ప్రసారం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యల్ని.. అనుసరించిన విధానాల్ని ఇందులో చూపించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ కథనాన్ని అసాంతం వీక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు పలువురు నేతలు.. అధికారులు ఈ షోను చూసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లారు.షెడ్యూల్ లో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వారు సైతం.. వాటికి డుమ్మా కొట్టేసి చానల్ లో వచ్చే ప్రోగ్రాంను సీఎం కేసీఆర్ తో కలిసి చూసేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సీన్ ప్రగతిభవన్ లో మరెప్పుడూ చూడలేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. టీవీలో డిస్కవరీ చానల్ ను దాదాపు గంట పాటు చూడటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇదే మొదటిసారి అన్న మాటను కొందరు అధికారులు చెబుతున్నారు. 

రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కేసీఆర్ స్కెచ్‌? ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీటింగ్‌?

రేపేమాపో రేవంత్‌రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు. ఆల‌స్య‌మైనా ఆయ‌న పేరే దాదాపు క‌న్ఫామ్‌. అయితే, అధిష్టానం రేవంత్‌రెడ్డి పేరు అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కూ ఏదైనా జ‌ర‌గొచ్చు. కాంగ్రెస్ రాజ‌కీయం అలానే ఉంటుంది మ‌రి. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేయ‌డానికి ఏ ఒక్క సీనియ‌ర్ నేత కూడా ఒప్పుకోవ‌డం లేదు. వెట‌ర‌న్ బ్యాచ్ అంతా ఏక‌మై ఆ డైన‌మిక్ లీడ‌ర్‌కు చెక్ పెట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అధిష్టానంలో లాబీయింగ్ ఓవైపు.. రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప‌ని మ‌రోవైపు. ఇవేవీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో.. ఇప్పుడిక హైక‌మాండ్‌కు ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చేందుకు కూడా వెన‌కాడ‌లేదు సీనియ‌ర్లు. రేవంత్‌రెడ్డిని అధ్య‌క్షుడిని చేస్తే.. త‌మ దారి తాము చూసుకుంటామ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే, ఢిల్లీకి ఝ‌ల‌క్ ఇవ్వ‌డానికే తాజాగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లి మ‌రీ సీఎం కేసీఆర్‌ను క‌లిశార‌ని చెబుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాట‌య్యాక ఎన్న‌డూ లేని విధంగా ముఖ్య‌మంత్రి సైతం ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్ల‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం తెర‌వ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు.. కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టేందుకే.. కేసీఆర్ ఇలాంటి స్కెచ్ వేశార‌ని అంటున్నారు. ఇటు కేసీఆర్.. అటు కాంగ్రెస్ సీనియ‌ర్స్.. అంతా కావాల‌నే.. త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్‌ను అడ్డుపెట్టుకొని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా పొలిటిక‌ల్ డ్రామా న‌డిపించార‌ని అంటున్నారు. తాజా ప‌రిణామంతో ఇటు కేసీఆర్‌.. అటు కాంగ్రెస్ సీనియ‌ర్స్‌.. అంతా క‌లిసి రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టే నాట‌కానికి తెర తీశార‌ని చెబుతున్నారు.  కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ ఛ‌రిష్మా ఉన్న రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. ఇక కాంగ్రెస్‌లో వ‌న్‌మ్యాన్ షో నే ఉంటుంది. ఇక కేవ‌లం రేవంత్‌రెడ్డి పేరు మాత్ర‌మే వినిపిస్తుంది. కేసీఆర్‌కు నిద్ర‌లేకుండా చేస్తూ.. రేవంత్‌రెడ్డి చిచ్చ‌ర‌పిడుగులా చెల‌రేగిపోవ‌డం ఖాయం. కాంగ్రెస్‌లో రేవంత్‌.. మ‌రో వైఎస్సార్‌గా మారుతార‌ని భావిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను ఆక్ర‌మించేస్తే.. ఇన్నాళ్లూ పార్టీలో హ‌వా చెలాయించిన సీనియ‌ర్ల ఖేల్ ఖ‌తం.. దుకాణం బంద్‌. అందుకే, వాళ్ల‌కు రేవంత్ అంటే క‌ళ్ల‌మంట‌. ఎంత డ్డుకున్నా.. అధిష్టానం మాత్రం రేవంత్‌రెడ్డి వైపే ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌టం.. సీనియ‌ర్ల‌కు మింగుడుప‌డ‌ని అంశం. మేట‌ర్ ఇక క్లైమాక్స్‌కు చేర‌డంతో ఏకంగా హైక‌మాండ్‌కే ఝ‌ల‌క్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు సో కాల్డ్‌ సీనియ‌ర్స్. త‌మ‌ని కాద‌ని రేవంత్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. త‌మ దారి తాము చూసుకోవాల్సి వ‌స్తుంద‌నే మెసేజ్ ఇవ్వ‌డానికే కేసీఆర్‌ను ఇంటికెళ్లి మ‌రీ క‌లిశార‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టేందుకే సీఎం కేసీఆర్ సైతం.. ఏడేళ్లుగా ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు పావుగంట‌లోనే అపాయింట్‌మెంట్ ఇచ్చార‌ని అంటున్నారు. ఉభ‌య ప్ర‌యోజ‌నాల మేర‌కే.. మ‌రియ‌మ్మ సాకుగా ఈ భేటీ జ‌రిగింద‌ని చెబుతున్నారు.    కేసీఆర్‌ను  క‌లిసిన బ్యాచ్‌-- భ‌ట్టి విక్ర‌మార్క‌. శ్రీధ‌ర్‌బాబు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి. ఈ న‌లుగురూ మొద‌టి నుంచీ కేసీఆర్‌కు విధేయులేన‌నే ప్ర‌చారం ఉంది. సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి.. కేసీఆర్‌పై సుతిమెత్త‌గా దాడి చేస్తుంటారు. విమర్శించిన‌ట్టు న‌టిస్తార‌నే అప‌వాదు ఉంది. మ‌ధిర‌లో టీఆర్ఎస్ శ్రేణులో భ‌ట్టిని గెలిపించాయ‌నే రూమ‌ర్ కూడా ఉంది. ఇక మ‌రో ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబు. మొద‌టినుంచో ఆయ‌న‌కు కేసీఆర్‌పై సాఫ్ట్ కార్న‌రే. ఇక రాజ‌గోపాల్‌రెడ్డి. ఆయ‌న టీఆర్ఎస్ వైపు చూడ‌కున్నా.. కాంగ్రెస్‌ను వీడాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించేసుకున్నారు. అందుకే ప‌లుమార్లు కాంగ్రెస్ పార్టీని బ‌హిరంగంగానే విమ‌ర్శించారు కూడా. బీజేపీలో చేరేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ప్ర‌క‌టించ‌గానే  కాంగ్రెస్‌లో ప‌డే ఫ‌స్ట్ వికెట్ రాజ‌గోపాల్‌రెడ్డే కావొచ్చు అంటున్నారు. ఇక జ‌గ్గారెడ్డి గురించి చెప్పేదేముంది. తాను కేసీఆర్‌ను విమ‌ర్శించ‌ను అంటూ బాహాటంగానే ప్ర‌క‌టించేశారు. రేవంత్‌రెడ్డి ప‌గ్గాలు ఇవ్వొద్దంటూ లొల్లి లొల్లి చేస్తున్నారు. ఆయ‌న‌కు హ‌రీష్‌రావుతో ప్రాబ్ల‌మ్ అంతేకానీ ఆయ‌న మ‌న‌సంతా టీఆర్ఎస్సే. అలాంటిది ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో హ‌రీశ్‌రావుకు వంద‌నం చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అందుకే. జ‌గ్గారెడ్డి త్వ‌ర‌లోనే కారెక్క‌డం ఖాయ‌మంటున్నారు. ఇలా రేవంత్‌రెడ్డిపై తీవ్ర‌ అసంతృప్తిగా ఉన్న ఆ న‌లుగురు.. కేసీఆర్‌ను క‌లిసి కాంగ్రెస్ అధిష్టానానికి నేరుగా మెసేజ్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే.. ఆయ‌న‌కు స‌హాయ నిరాక‌ర‌ణ త‌ప్ప‌ద‌ని.. త‌మ దారి త‌మ‌దేన‌నేలా బెదిరింపుల‌కు దిగారని అంటున్నారు. లేదంటే.. రేవంత్‌రెడ్డికి ప‌ట్టాభిషేకం జ‌ర‌గ‌బోయే ఈ కీల‌క స‌మ‌యంలో ఆ న‌లుగురు అలా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డ‌మేంటి? స‌ర్కారుపై ఓవైపు క‌మ‌ల‌నాథులు క‌త్తులు దూస్తూ కాంగ్రెస్ ప్లేస్‌ను బ‌ర్తీ చేస్తుంటే.. బీజేపీకి పోటీగా కేసీఆర్‌పై మ‌రింతగా దూకుడు పెంచాల్సింది పోయి.. ఎంచ‌క్కా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లి కేసీఆర్ ట్రాప్‌లో ప‌డేటంత‌టి అమాయ‌కులేమీ కాదు ఆ న‌లుగురు. అందుకే.. ఊహ‌లు.. గుస‌గుస‌లాడుతున్నాయి..

రెండేళ్ల బిడ్డతో బావిలో దూకి చనిపోయిన నిండు గర్భిణీ.. 

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. తన రెండేళ్ల బిడ్డతో కలిసి బావిలో దూకి నిండు ప్రాణం తీసుకుంది. లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి (28)కి అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప భువనేశ్వరి ఉంది. రాజేశ్వరి స్థానికంగా గ్రామ వాలంటీరుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. భార్యాభర్తల గొడవల కారణంగా ఈనెల 23న పాపను తీసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో తల్లీ బిడ్డల మృతదేహాలు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆమె చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకుంది. ఆ తర్వాత తండ్రి, మేనమామలు అన్ని తామై ఏ లోటూ లేకుండా గారాభంగా పెంచి పెద్ద చేశారు. ఆమెకు నిచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి అవ్వగానే వాళ్ళ అమ్మాయికి పిల్లలు పుట్టాలి వాళ్ళు ఏతుకుని ఆడించాలని ఏ తండ్రి కలలుకనరు చెప్పండి. వాళ్ళు అనుకున్నట్లు గానే  ఏడాది తిరగ్గానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. అందరూ చనిపోయిన వాళ్ళ అమ్మే మళ్ళీ తన కడుపునా ముట్టిందని అనుకున్నారు. ఇక, ఆమె జీవితమంతా ఎత్తు పల్లాలు లేకుండా సాఫీగా సాగుతుందనికున్నారు. ఆమె బంధువులు కూడా మురిసిపోయారు. ఆ తరువాత ఊహించని రీతిలో ఆమె కాపురంలో కలతలు మొదలయ్యాయి. గొడవలు చిచ్చు రేగాయి. అప్పటికి ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. నిత్యం నరకం అనుభవిస్తూ బాధనంతా తన బిడ్డతో పాటు కడుపులోనే  దాచుకుంటూ వచ్చింది. చివరికి విసిగిపోయి ఆ నరకం కంటే మరణమే మార్గమనుకుంది. తాను నిండు గర్భిణి అని కూడా ఆలోచించలేదు.. రెండేళ్ల బిడ్డ అనాథ కాకూడదనుకుంది. తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం సమీప గ్రామాలకు తెలియడంతో కేశవరాయుపాలెం నుంచి కొందరు ఘటనా స్థలానికి చేరుకొని అవి రాజేశ్వరి, భువనేశ్వరి మృతదేహాలుగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. వీరిద్దరూ ఇంటి నుంచి బయలుదేరినరోజే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, అత్తింటి వేధింపులు తాళలేకే రాజేశ్వరి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించేవారని, భర్త కోటేశ్వరరావు నిత్యం మద్యం తాగి వచ్చి తిడుతూ  కొట్టేవాడని రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య, తండ్రి సూర్యనారాయణ పోలీసులకు తెలిపారు. ఇంట్లో నరకం చూపిస్తున్నారంటూ రాజేశ్వరి తరుచూ తమకు చెప్పుకుని బాధపడేదని వాపోయారు. తన సోదరి వెళ్లిపోయినప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. రాజేశ్వరికి సీమంతం చేసి తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు పుట్టింటివారు ఈనెల 30న ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే దారుణం జరగడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో అందరితో సరదాగా ఉండే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

శ్రీవారి సొమ్ము కొట్టేసే స్కెచ్?  స్పెసిఫైడ్‌ అథారిటీపై రఘురామ సంచలనం.. 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు  జూన్ 20తో ముగిసింది. కొత్త పాలకమండలిని నియమించని ప్రభుత్వం..  స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించింది. ఈవో, అదనపు ఈవోలతో ఆ అథారిటీని ఏర్పాటు చేసింది. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు టీడీపీ వ్యవహారాలన్ని స్పెసిఫైడ్‌ అథారిటీనే చూస్తుందని ప్రకటించింది. అయితే ప్రభుత్వం నియమించిన  స్పెసిఫైడ్‌ అథారిటీపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామ నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో మరో  లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ పేరుతో కొత్త వివాదానికి తెరతీశారని అందులో ఆరోపించారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా 126 జీవో తెచ్చారన్నారు ఎంపీ రఘురామ. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే జీవో అంటూ ఆందోళన వ్యక్తమవుతోందని రఘురామ చెప్పారు. హిందూ ధర్మాన్ని ఆచరించే పలువురి నమ్మకాలను గాయపరుస్తున్నారని తెలిపారు. ఇద్దరు సభ్యులతో అథారిటీ ఏర్పాటు చేస్తే నిర్ణయాలపై చర్చకు వీలుండదన్నారు నర్సాపురం ఎంపీ. ట్రస్టు బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోందని చెప్పారు. కొత్త స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం కలగట్లేదన్నారు. శ్రీవారి సొమ్ము దారి తప్పిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అథారిటీ ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలన్నారు. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలయాపన చేయకుండా నూతన బోర్డు ఏర్పాటు చేయాలని తన లేఖలో సీఎం జగన్ ను కోరారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.

కొవిడ్ పై గుడ్ న్యూస్.. థర్డ్ వేవ్ అంత డేంజర్ కాదట..

థర్డ్ వేవ్ ... ఇప్పుడు అందరిని భయపెడుతున్న ఒకే ఒక్క మాట ఇదే. అయితే, కరోనా థర్డ్ వేవ్’ రాదని, వచ్చినా, అంత భయంకంగా ఉండదని, ఓ చల్లని కబురు చెపుతున్నారు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. అలాగని ఇదేమీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. డాక్టర్ భార్గవ మరొకొందరు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు, లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ కు చెందిన నిమ్లాన్ అరినామిన్పతితో కలిసి  సంయుక్తంగా చేసిన అధ్యయనం ఆధారంగా ఆయన ఈ ప్రకటన చేశారు.  ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్)లో ప్రచురించిన గణిత 'మోడలింగ్' విశ్లేషణ ఆధారంగా, వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించడం వల్ల కరోనా వైరస్ థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సెకెండ్ వేవ్ కొనసాగుతున్న మూడు నెలల కాల వ్యవధిలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకాను తీసుకున్న విషయాన్ని అధ్యయనం గుర్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియతో థర్డ్ వేవ్’కు అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించడం వల్ల కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు. సెకెండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకా తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం లేదని చెబుతున్నారు నిపుణులు. ఈ అధ్యయనం కోసం SARS-CoV-2 ట్రాన్స్మిషన్ యొక్క కంపార్ట్మెంటల్ మోడల్ ఉపయోగించి.. మూడో వేవ్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ముమ్మర వ్యాక్సినేషన్ కారణంగా కరోనా వ్యాప్తి తీవ్రతను 60 శాతం వరకూ తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంటోంది.  అయితే, థర్డ్ వేవ్ రాదన్న  భరోసా పనికి రాదని, భార్గవ బృందం హెచ్చరిస్తోంది. అలాగే, కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అది రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలిగితే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, శాస్త్రవేత్తలు  హెచ్చరిస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా రావొచ్చని చెప్పారు. అయితే.. ఇది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వివరించారు.ముమ్మర వ్యాక్సినేషన్ కారణంగా కరోనా వ్యాప్తి తీవ్రతను 60 శాతం వరకూ తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంటోంది.  థర్డ్ వేవ్‌కు సంబంధించిన నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజలలో కరనాను ఎదుర్కొనే రోగనిరోధక సామర్థ్యం కాలక్రమేణా తగ్గవచ్చు. పలితంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని వారు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్ కు ఝలక్.. కేసీఆర్ కు కేంద్ర మంత్రి ఫోన్ 

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. రెండు రాష్ట్రాలు వెనక్కి తగ్గకపోవడంతో మాటల యుద్దం సాగుతోంది. తెలంగాణ మంత్రులతో పాటు టీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు ఏపీ మంత్రులు మాత్రం తాము చర్చలకు సిద్ధమంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కొందరు రాయలసీమ నేతలు టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారు. రెండు రాష్ట్రాలు కేంద్ర జలసంఘానికి, కృష్ణా రివర్ బోర్డుకు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఏపీ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయగా. .శ్రీశైలం నుంచి జల విద్యుత్ పేరుతో తెలంగాణ నీటిని దిగువకు విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం క్లంపైంట్ చేసింది.  రెండు రాష్ట్రాల మధ్య జల  వివాదం సాగుతుండగానే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి ఝలక్ ఇస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెబుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమంత్రికి కేసీఆర్ మరోసారి వివరించినట్టు సమాచారం. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి  దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్లు సమాచారం.  తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పింది సావధానంగా విన్న గజేంద్రసింగ్ షెకావత్.. ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు మరో రెండు రోజుల్లో అధికారులు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తారని కేసీఆర్‌కు కేంద్రమంత్రి చెప్పారని తెలుస్తోంది. అయితే కేంద్ర జలవనరుల శాఖా మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడం చర్చగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం సాగుతున్న సమయంలో ఆయన స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంపై ఏపీ ప్రభుత్వం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో మాట్లాడిన షెకావత్... ఏపీ సీఎం జగన్ ను పట్టించుకోకపోవడం ఆసక్తిగా మారింది. 

భర్త మర్మాంగాలను కోసిన భార్య.. 

ప్రపంచంలో ఏ మతానికైనా మత పెద్దలు ఉంటారు. ఆ మత పెద్దలు ఎవరి వారి మతాల సభ్యులు తప్పులు చేస్తే వారిని సరైన మార్గంలో పెట్టడం ఈ మత పెద్దల పని. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మత పెద్దలు వారి హద్దులు దాటుతున్నారు. ఆదర్శముగా ఉండాలిసిన వాళ్ళు అక్రమ మార్గాలు పడుతున్నారు. మత పెద్దలు అంటే దేవుడితో సమానంగా కొలిచే సమాజం మనది అలాంటిది వాళ్ళే తప్పులు చేస్తే వాటిని సరిదిద్దేవాళ్ళు ఇంకెవరు చెప్పండి. ఇదంతా మీకెందుకు చెపుతున్నాను అనుకుంటున్నారా.  తాజాగా ఓ మత పెద్ద ఒక పని చేశాడు. ఆ పని ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరే చూడండి.  అతని పేరు అహ్మద్. అతని వయసు 57 సంవత్సరాలు.  అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ తర్వాత కూడా  మూడో పెళ్లికి సిద్దమయ్యాడు. ఆ విషయాన్ని తన ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో ముగ్గురి మధ్య గతకొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇక అంతే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో పాకిస్తాన్ బాంబు పడినట్లు పంచాయితీ మొదలైయింది. రోజులాగే గురువారం రాత్రి కూడా మూడో పెళ్లి విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో అహ్మద్ మొదటి భార్య హజ్రాను బండబూతులు తిట్టాడు, తీవ్రంగా కొట్టాడు. ఆమె కూడా చేసేది ఏమిలేక సైలెంట్ గా ఉండిపోయింది.    రాత్రి అవ్వడం అందరు కలిసి ముగ్గురూ  నిద్రపోయారు. ఇల్లు అంత లైట్స్ బంద్ చేసి ఉన్నాయి. అహమద్ నిద్రలోకి జారుకున్నాడు. భర్త కొట్టిన విషయం మనసులో పెట్టుకున్న హజ్రా కళ్ళు తెరిచింది. వంటింట్లోకి నడిచింది. కూరగాయల కసా కసా కోసే కత్తిని తీసుకుంది, అహ్మద్ పడుకున్న దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా అతను ఆమెతో గొడవ పడిన విషయాలు అన్ని ఫ్లాష్ కట్ లో ఆమె కళ్ళముందు కనిపించాయి. కత్తి తీసుకుని అహ్మద్  మర్మాంగాలను తీవ్రంగా గాయపరిచింది. ఆ కత్తిపోట్లకు తీవ్ర రక్తసావ్రమైన అహ్మద్ ప్రాణాలు విడిచాడు. ఈరోజు ఉదయం బంధుమిత్రుల సాయంతో అహ్మద్ అంత్యక్రియలు నిర్వహించటానికి సిధ్దమయ్యింది హజ్రా. రోజు వీరు గొడవ పడటం తెలిసిన …చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  భౌరన్ కలాన్ పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టటంతో హజ్రా నేరం ఒప్పుకుంది. ఇద్దరు భార్యల మధ్యే రోజూ గొడవలు జరుగుతూ ఉంటే, మూడో భార్యను తీసుకువస్తాననే సరికి కోపం పట్టలేక ఆవేశంలో హత్యచేశానని తెలిపింది.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.ఈ  ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.

ఎమర్జెన్సీలో పోరాట కిరణం స్నేహలతా రెడ్డి..

ఎమర్జెన్సీ.. ఈ పేరు వినగానే భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులు గుర్తొస్తాయి. మన దేశంలో ఎమర్జెన్సీకి  జూన్ 25కి 46 ఏండ్లు నిండాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో రెండేళ్ల ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది.  1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. 1975 నుంచి 1977 వరకు 21 మాసాలు పాటు  దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు. 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన ఎందరో జైళ్లకు వెళ్లారు.   అత్యవసర పరిస్థితి విధింపు, ప్రజాస్వామ్య విలువలపై కర్కశ దాడి జరిగిన రోజు అది. భారతీయులే కాదు చట్టబద్ధ పాలన, ప్రజా పరిపాలన, రాజ్యాంగ బద్ధతలకు విలువ ఇచ్చే ప్రతి ఒక్కరు దానిని బ్లాక్​డేగా పరిగణించిన రోజు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో అనేక దుశ్చర్యలు చోటుచేసుకున్నాయి. ఇతర ప్రాథమిక హక్కుల మాట అలా ఉంచి, ‘జీవించే హక్కు’ను కూడా ప్రజల నుంచి లాగేసుకున్న దుస్థితి అది. ఎమెర్జెన్సీ లో రాలిపోయిన ఆపన్నుల స్నేహ హస్తంగా మిలిగారు స్నేహలతా రెడ్డి.  స్నేహలతా రెడ్డి భారతీయ సినీ నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్త. ఈమె ఇంగ్లీష్, కన్నడ, నాటక రంగాలు మరియు కన్నడ సినిమా రంగాలలో రాణించారు. ఈమె సామాజిక కార్యకర్త కూడా. ఈమె తన తొలి రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారంటే ఈమెకు ఎంత కోపం అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ కుటుంబంలో జన్మించినా తిరిగి పూర్తి భారతీయతను స్వీకరించి భారతీయ సంప్రదాయ దుస్తులను, బొట్టును గర్వంగా ధరించేవారు. ఈమె పట్టాభిరామి రెడ్డి అనే రచయిత, దర్శకుడిని పెళ్లి చేసుకుంది. ఈమె సోషలిస్ట్ రాం మోహన్ లోహియా అభిమాని. అనేక పేరున్న ఆంగ్లనాటకాలలో నటించారు.  ముఖ్యంగా యు.ఆర్.అనంతమూర్తి రాసిన, ఈమె భర్త దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం "సంస్కర" లో స్నేహలత జాతీయ దృష్టికి వచ్చింది. ఈ చిత్రం 1970 లో జాతీయ అవార్డును గెలుచుకుంది.  స్నేహలత మరియు ఈమె భర్త అత్యవసర పరిస్థితి విధింపు, నిరంకుశ ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగాఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజకీయవేత్త జార్జ్ ఫెర్నాండెజ్ సన్నిహితురాలు. బరోడా డైనమైట్ కేసులో ఈమెకు కూడా పాత్ర ఉంది అని చెప్పి 1976లో మే నెల 2వ తేదీన అరెస్టు చేశారు. జార్జ్ ఫెర్నాండెజ్  మరో 24 మంది నిందితుల పేర్లు తుది చార్జిషీట్‌లో ఉన్నా స్నేహలత పేరు మాత్రం పేర్కొనబడలేదు. ఆమెను కేవలం "సహచారి" అని మాత్రమే పేర్కొని దోషిగా పరిగణించారు.  ఈమెను బెంగుళూరు సెంట్రల్ జైలులో ఎటువంటి విచారణ లేకుండా ఎనిమిది నెలలు నిర్బంధించారు. సాధారణ కరుడుగట్టిన నేరస్తులపై ప్రయోగించిన హింసాత్మక పద్ధతులను ఈమెపై ప్రయోగించారు. జైల్లో అతి దారుణంగా హింసకు గురయ్యారు. ఈమెకు దీర్ఘకాలంగా ఉబ్బసం ఉన్నప్పటికీ ఈమెకు సక్రమంగా చికిత్స పొందక రెండు సందర్భాలలో  కోమాలోకి వెళ్ళింది. ఈమెను ఏకాంత నిర్బంధంతో ఉంచారు. దీనితో అసలే బలహీనంగా ఉన్న ఈమె ఆరోగ్యం మరింత దిగజారింది.  ఈమెను జైలులో ఉంచినా ఈమె పోరాట పటిమ తగ్గలేదు. ఆమె జైలులో ఉన్నప్పుడు స్త్రీ నిందితులను జైలుకు రాగానే అందరి ముందూ నగ్నంగా పరీక్షలకు లోను చేయడం గట్టిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై మహిళా నిందితులు తిరగబడాలి అని పిలుపు ఇచ్చి చివరకు ఆ జైలులో ఈ అమానవీయమైన పద్ధతి ఆపి వేయించగలిగారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో స్నేహలత చివరికి జనవరి 15, 1977 న పెరోల్‌పై విడుదలైంది.  కానీ జైల్లో ఈమె అనుభవించిన నరకం, సరి అయిన వైద్య సదుపాయాలు లభించకపోవడంతో ఆమె పెరోల్ పై విడుదలైన కొద్ది రోజులకే 1977 జనవరి 20 న మరణించింది. అత్యవసర పరిస్థితుల మొదటి అమరవీరులలో ఆమె ఒకరు. బీజేపీ సీనియర్ నేత LK అద్వానీ తన జీవిత కథలో ఈమె గురించి ప్రస్తావించారు. స్నేహలత జైలు శిక్ష అనుభవిస్తున్న అదే జైలులో ఉన్న మధు దండవతే తన జ్ఞాపకాలులో వ్రాస్తూ, "నేను రాత్రి పూట నిశ్శబ్దం లో ఆమె సెల్ నుండి వచ్చే స్నేహలత యొక్క అరుపులు వినలేకపోయేవాడిని" అని. దురదృష్టం ఏమిటంటే దేశానికి ఒక మహిళ ప్రధానిగా ఉండగా ఇటువంటి సంఘటన జరగడం.పాతవి తవ్వకండి అంటారు. కానీ ఇటువంటి కధలు ఈ తరానికి తెలియాలి అంటే తవ్వి బయటకు తీయాలిసిందే. లేకపోతే వీరి త్యాగాలు ఈ తరానికి తెలియకుండా మరుగున పడిపోతాయి ఇటువంటి ఎందరో బలిదానాల వల్ల ఇందిరా నిరంకుశ పాలన పోయి మళ్లీ భారత ప్రజలకు స్వేచ్చా స్వాతంత్రాలు లభించాయి.

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి కాంగ్రెస్ నేత‌లు.. ఈట‌ల ఎఫెక్ట్ మామూలుగా లేదుగా..

బ్రేకింగ్ న్యూస్‌. కాంగ్రెస్ నేత‌లు సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు శ్రీధ‌ర్‌బాబు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, జ‌గ్గారెడ్డిలు ముఖ్య‌మంత్రిని క‌లిశారు. గ‌తంలో ఎన్న‌డూ లేనిది వీరంతా సీఎంను క‌ల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం కేసీఆర్‌ను క‌లిసింది.. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తారాస్థాయికి చేరిన జ‌ల వివాదం గురించో, తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తున్న మరేదైనా స‌మ‌స్య గురించో కాదు.. యాదాద్రి జిల్లా అడ్డ‌గూడూరు పోలీస్ స్టేష‌న్‌లో మ‌రియ‌మ్మ మృతిపై సీఎంకు ఫిర్యాదు చేశారు. లాక‌ప్‌డెత్ బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. బాధిత‌ కుటుంబానికి త‌గిన‌ న్యాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదీ విష‌యం.  పైపైన చూస్తే విష‌యం ఇంతే. మామూలుగానైతే వేరే ఏ రాష్ట్రంలోనైనా ఇది సాధార‌ణ విష‌య‌మే. సీఎంను ప్ర‌తిప‌క్ష స‌భ్యులు క‌ల‌వ‌డం.. ఫిర్యాదు చేయ‌డం మామూలుగా జ‌రిగేదే. కానీ, ఇది తెలంగాణ కాబ‌ట్టి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాబ‌ట్టి.. ఇప్పుడీ అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌య్యాక‌.. గ‌డిచిన ఏడేళ్ల‌లో ముఖ్య‌మంత్రిని ప్ర‌జ‌లు కానీ, ప్ర‌తిప‌క్ష నేత‌లు కానీ నేరుగా క‌లిసిన సంద‌ర్భాలు దాదాపు లేవ‌నే చెప్పాలి. క‌నీసం స‌చివాల‌యానికి కూడా రాని సీఎం బ‌హుషా దేశంలోనే కేసీఆర్ ఒక్క‌రేనేమో. ప్ర‌తిప‌క్ష నేత‌ల వ‌ర‌కూ ఎందుకు..? క‌నీసం మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల‌ను సైతం నేరుగా క‌లుసుకున్న సంద‌ర్భాలు దాదాపు లేవ‌నే చెప్పాలి.  ఎప్పుడో కేబినెట్ భేటీల‌ప్పుడు, పార్టీ స‌మావేశాల‌ప్పుడు మాత్ర‌మే సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు క‌నిపిస్తారు. అప్పుడుకూడా వారితో మాట్లాడేదేమీ ఉండ‌దు. ఆయ‌న వ‌స్తారు.. చెప్పాల‌నుకున్న‌ది చెబుతారు.. వెళ్లిపోతారు.. అంతే. అక్క‌డ ఇంకే మాటామంతి ఉండ‌దు. చ‌ర్చ‌లు గ‌ట్రా జ‌రిగే ఛాన్సే లేదు. కేసీఆర్ మాట‌ మిన‌హా మ‌రోక‌రి గొంతు వినిపించ‌దు అంటారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరుచుకునేది సీఎం కేసీఆర్ త‌లుచుకున్న వారికి మాత్ర‌మే. ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి బ‌య‌ట‌కు రారు. మ‌రెవ‌రినీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోనికి రానివ్వ‌రు. మంత్రులు, సొంత పార్టీ నాయ‌కుల‌కే సీఎంను క‌లిసే అదృష్టం లేక‌పోతే.. ఇక ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జాసంఘాలు, సామాన్యుల గురించి చెప్పేదేముంది. అలాంటిది.. ఇంత కాలానికి ప్ర‌తిప‌క్ష నేత‌ల బృందానికి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి వెళ్లి ముఖ్య‌మంత్రిని క‌లిసే అవ‌కాశం రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.. అంత‌కుమించి ఆస‌క్తిక‌రం.  సీఎం కేసీఆర్‌లో స‌డెన్‌గా ఇంత‌టి మార్పు ఎలా వ‌చ్చింది? ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేట్లు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు ఎలా తెరుచుకున్నాయి? అనే ప్ర‌శ్న‌కు ఈట‌ల‌నే సమాధానంగా క‌నిపిస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ పార్టీని వీడుతూ ప్ర‌ధానంగా చేసిన ఆరోప‌ణ ఒక్క‌టే. అది ప్ర‌గ‌తి భ‌వ‌న్ కాదు.. బానిస భ‌వ‌న్ అని. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు ఎవ‌రి కోసం తెరుచుకోవని.. క‌నీసం త‌న‌ను కూడా ప‌లుమార్లు లోనికి రాకుండా అడ్డుకున్నార‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అడుగుపెట్ట‌నీయ‌కుండా త‌న‌ను దారుణంగా అవ‌మానించారంటూ.. ఈట‌ల రాజేంద‌ర్ ఆరోప‌ణ‌ల‌న్నీ ప్ర‌గ‌తి భ‌వ‌న్ చుట్టూనే తిరిగాయి. ఈరోజు ఈట‌ల చేసిన ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాయి. జ‌న‌మంతా ఈజీగా న‌మ్మేశారు కూడా. ఎందుకంటే.. స‌చివాల‌యానికే రాని ముఖ్య‌మంత్రి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి ఎవ‌రినీ రానీయ‌రంటూ రాజేంద‌ర్ అంత‌టివాడే చెబితే న‌మ్మ‌కుండా ఎలా ఉంటారు. కేసీఆర్ నియంత అంటూ.. ఎవ‌రినీ త‌న ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌రంటూ జ‌నాల్లో బాగా చ‌ర్చ న‌డిచింది. ఆ విష‌యం తెలిసే.. సీఎం కేసీఆర్‌లో మార్పు మొద‌లైంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈట‌ల లేవ‌నెత్తిన రేష‌న్ కార్డుల ఇష్యూని సాల్వ్ చేసేశారు కేసీఆర్‌. ఇప్పుడిక ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్ల‌ను తెరిచే ప‌ని మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. ఈట‌ల ఆరోప‌ణ‌ల‌తో కేసీఆర్ ఇమేజ్ బాగా దెబ్బతిన‌డంతో.. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగానే ముఖ్య‌మంత్రిలో ఈ మార్పు మొద‌లైంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే, సొంత పార్టీ నేత‌ల‌నే లోనికి రానీయ‌ని కేసీఆర్‌.. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను త‌న ఇంటి గ‌డ‌ప దాటి లోనికి రానిచ్చారంటే ఆశ్చ‌ర్య‌మేక‌దా.. మార్పు మంచిదేగా...

పోలీసులను సస్పెండ్ చేయండి! దళిత మహిళ లాకప్ డెత్ పై సీఎం సీరియస్..

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే  వారిని  ఉద్యోగంలో నుంచి తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..  డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సిఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సిఎం కెసిఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.  చింతకాని కి వెల్లి లాకప్ డెత్  సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డిజిపీని సిఎం ఆదేశించారు. సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.  మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రేస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు సహా, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సిఎం సూచించారు.   ‘‘  దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో,  ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.వీటిని క్షమించం. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదు. అవసరమైతే ఉద్యోగం లోంచి తొలగించాలి’’ అని డీజీపీని మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.  

కన్నీళ్లు పెట్టిన ఎమ్మెల్యే సీతక్క

నిత్యం జనంలో ఉంటూ.. ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కొవిడ్ సమయంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. రాజకీయ నాయకులంటే సీతక్కలా ఉండాలనే జనాలు చెప్పుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నంటూ సేవ చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క కన్నీళ్లు పెట్టారు.  మావోయిస్టు అగ్ర నేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  హరిభూషన్ అలియాస్ జగన్ కరోనా సోకి కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత సీతక్క హరిభూషన్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలంలోని మడగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. హరిభూషన్ కుటుంబసభ్యుల ఇల్లు మామూలు రేకుల ఇల్లు. అక్కడికి వెళ్లిన సీతక్క .. ఆ పరిస్థితులు చూసి చలించిపోయారు. హరిభూషన్ కుటుంబసభ్యులు సీతక్క మీద పడి రోదించారు. దీంతో సీతక్క కూడా కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత వారిని ఓదార్చారు. హరిభూషన్ మరణించడం బాధాకరమైన విషయం అన్నారు సీతక్క. ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. సీతక్క మావోయిస్టుగా ఉన్న సమయంలో హరిభూషన్ తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరి టీం లీడర్ గా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని చెప్పారు.  సీతక్క రావడంతో హరిభూషన్ స్వగ్రామం మడగూడెంలో ఉద్వేగ వాతావరణం కనిపించింది. 

ప్రాణం తీసిన ఈఎంఐ.. 

ఒకప్పుడు మాములుగా మనిషిని చావడానికి ఏ ఆరోగ్య సమస్యలు కారణం ఐతే, ఇప్పుడు మనిషి చనిపోవడానికి కారణాలు కూడా మారుతూవస్తున్నాయి. ఒక వైపు కరోనా కూడా మనిషి ప్రాణాలు తీస్తుంటే.. మరో వైపు ప్రజల భయం కూడా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అన్నింటికంటే మించి నేటి సమాజంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనిషి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈఎంఐ వల్ల చనిపోయాడు. అది ఎలా అనుకుంటున్నాడా ? మీరే చూడండి..  సాధన్ సిన్హా (40) అనే వ్యక్తి ప్లంబర్ గా పనిచేస్తూ.. భార్యా 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వయస్సున్న ఇద్దరు కొడుకులతో ఉంటున్నారు. గతంలో  టూ వీలర్ కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీ నుంచి రూ.లక్ష వరకూ అప్పు తీసుకున్నారు. నెలకు రూ.3వేల 400 చొప్పన చెల్లించాల్సి ఉండగా రెండు నెలలు మే, జూన్ నెలలకు రూ.6వేల 800కట్టలేకపోయాడు.ఈఎమ్ఐ కట్టలేకపోయాడని ఏజెంట్లు వేధింపులు మొదలుపెట్టారు. రోజు ఫోన్ చేసి టార్చెర్ చేసేవాళ్లు అయితే  నెల వాయిదాలు కట్టలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. ఈఎమ్ఐ కట్టేందుకు డబ్బుల్లేక, ఏజెంట్లకు సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. సమయానికి ఈఎమ్ఐ కట్టలేకపోయాడని ఏజెంట్లు వేధింపులు మొదలుపెట్టారు. నెల వాయిదాలు కట్టలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. ఈఎమ్ఐ కట్టేందుకు డబ్బుల్లేక, ఏజెంట్లకు సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. రోజు వచ్చి ఇంటి ముందు గొడవలు పడితే తట్టుకోలేకపోయాడు. తీరా ఇంటి ముందు కూర్చొని వాయిదాలు కట్టకపోతే కదలమంటూ మొండికేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నెలకు రూ.15వేల నుంచి 20వేల వరకూ సంపాదించే వ్యక్తి.. మహమ్మారి కఠిన నిబంధనలతో ఒక్కసారిగా తన సంపాదన ఆగిపోయింది. టూ వీలర్ తీసుకుంటే తక్కువ సమయంలో వేర్వేరు చోట్లకు వెళ్లి, వేరువేరు పనులు చేయొచ్చని దాని ద్వారా ఎక్కువ సంపాదించగలమనుకున్నాడు. కానీ,  కరోనా టైం లో, అందులోను లాక్ డౌన్ ఉండడం వల్ల  సరిగ్గా దొరక్కపోవడంతో రెండు నెలల వాయిదా కట్టలేకపోయాడు.  సాధన్ ఈఎమ్ఐ కట్టకపోవడంతో రికవరీ ఏజెంట్లు బిందుపారా గ్రామంలోని ఇక అంతే గడ్డలు వచ్చి ఇంటిపై వాలినట్లు, ఇంటికి ఉదయం 9గంటలకే వచ్చి కూర్చొన్నారు. కట్టాల్సిన వాయిదా చెల్లించకపోతే అక్కడి నుంచి కదిలేది లేదంటూ మొండికేశారు. నన్నమాటలు అన్నారు. వారిని కొద్దిరోజులు ఆగమని బ్రతిమాలాడు. అయినా  వినలేదు ఆ ఫైనాన్స్ రాబందులు. వాళ్లు ఇంటి బయట కిందే కూర్చొని డబ్బులు ఇవ్వందే వెళ్లమంటూ కూర్చొన్నారు. నా భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు’ అని మమోనీ (మృతుడి భార్య) అంటున్నారు. ఈ ప్రాంతంలో బాగా తిరిగిన వ్యక్తి.. అలా ఏజెంట్లు అవమానించడంతో భరించలేక ఇలా చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఏజెంట్లు ఎంతకూ కదలకపోవడంతో గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకన్నాడు. సీలింగ్ ఫ్యాన్ చప్పుడు వినిపిస్తుండటంతో కిటికీలో నుంచి తొంగిచూసింది. అప్పుడే సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు తెలిసింది. అని మమోనీ చెప్పింది.  

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్! ! వైఎస్సారే ఎందుకు టార్గెట్ ?

కృష్ణా జలాల వివాదం, రాజకీయ వివాదంగా మారుతోంది. ఉభయ తెలుగు రాష్రాల మది మరోమారు చిచ్చుపెట్టేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి వెంట ఒకరుగా తెలంగాణ మంత్రులు, ఆంధ్ర పాలకుల మీద ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు  ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్’గా చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తునారు. గతాన్ని గుర్తు చేసి మరీ అలానాటి ఆంధ్రా పాలకులను దొంగలు, గజ దొంగలు, రాక్షసులు అంటూ విమర్శల తూటాలు పేలుస్తున్నారు.  రెండు మూడు రోజుల క్రితం, వైఎస్ దొంగ, జగన్ గజ దొంగ అంటూ రెచ్చిపోయి తూటాలు పేల్చిన మంత్రి వేముల ప్రశాంత రెడ్డి బాటలోనే మరో మంత్రి శ్రీనివాస గౌడ్  శుక్రవారం తెలంగాణకు అడ్డుపడిన రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికీ రాక్షసుడేనని, కుండబద్దలు కొట్టారు.   అంతే కాదు,  శ్రీనివాస్ మరోఅడుగు ముందుకేసి, అవును వైఎస్  దొంగ మాత్రమే కాదు, నరరూప రాక్షసుడు అంటూ భగ్గుమన్నారు. తెలంగాణ నీటిని దొంగతనంగా తీసుకుపోతుంటే దొంగ అనక ఏమంటారని,మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన కొడుకు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. పీజేఆర్ మరణానికి వైఎస్సార్ కారణమని, సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను జైలుకి పంపిన తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్‌ అని మంత్రి మండిపడ్డారు.  తెలంగాణ నేతల విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ..  వైఎస్ విగ్రహాలు తెలంగాణలోని ప్రతిజిల్లాలో పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర అన్నట్లు ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి  ఢిల్లీలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనుకబాటు తనానికి, పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైఎస్సారే కారణమని చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మండిపడ్డారు.శ్రీనివాస గౌడ్ ఏపీ సీఎం జగన్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు.  ఆయన్నుఊసరవేల్లితో పోల్చడమే  కాకుండా, తండ్రికి భిన్నంగా, జగన్ ఉభయ తెలుగు రాష్ట్రాలను ఒకటిగా చూస్తారని అనుకున్నా, ఆయన మాత్రం తండ్రి వైఎస్సార్ దుర్మార్గపు అడుగుజాడల్లోనే  నడుస్తున్నారని మండిపడ్డారు.  అయితే, ఒక్కసారిగా తెలంగాణ మంత్రులు కృష్ణా జలాల తాజా వివాదాన్ని, అడ్డు పెట్టుకుని ఇంతగా రెచ్చిపోవడానికి జలవివాదమే కాణమా లేక  ఇంకేదైనా కారణం వుందా అంటే, హుజురాబాద్ ఉపఎన్నికలలో సెంటిమెంట్’ను పండించడం కోసమే, తెరాస మంత్రులు వైఎస్సార్, జగన్ రెడ్డి టార్గెట్’గా విమర్శలు చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు వైసీపీ నాయకులు అంటున్నారు. నిజంగా కూడా, ఇంతవరాకు జరిగిన  ఉపఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నికకు చాలా తేడా ఉందని, ఒకవిధంగా  ఇది  ఉద్యమ స్పూర్తికి ఉద్యమ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య పోరుగా భావిస్తున్న నేపధ్యంలో ఈ ఉఅప ఎన్నిక అత్యత కీలకం కానుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలు, తెలంగాణలో పార్టీ రాజన్న రాజ్యం తెస్తానని, సందడి చేస్తున్న వైఎస్ షర్మిలకు మింగుడు పడడం లేదు. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఆమె, అటూ ఇటూ కాని సందిగ్దావస్థను ఎదుర్కుంటున్నారు. అందుకే, ప్రతి విషయంలోనూ స్పందించే షర్మిల తాజా జల వివాదం విషయంలో మౌనంగా ఉండి పోయారని, ఆమెతో కలిసి నడుస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో, జలవాదాలు విషయంలో, రాజీపడే ప్రశ్నే లేదని,  అవసరం అయితే  జగనన్నతో అయినా ఫైట్ కు సిద్దమని ప్రకటించిన ఆమె ఇప్పుడుఇలా ‘యు’ టర్న్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కృష్ణా జలాల వివాదం రాజకీయ మంటలు రగల్చడంతో పాటుగా మళ్ళీ మరోమారు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ... ఎప్పుడంటే..? 

మెగా స్టార్ చిరంజీవి, మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? త్వరలోనే ఆయన మరో మారు, రాజ్య సభ ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమవుతూ వచ్చిన చిరంజీవి, 2017  ఖైదీ నెం.150 తో సినిమా రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇక అక్కడి నుంచి వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా అయన సినిమా రంగంలో చాలా చాలా  బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఆచార్య సినిమా, విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అది గాక లూసిఫర్ రీమేక్ చిత్రంతో పాటుగ మరో మూడు నాలుగు చిత్రాలు కూడా లైన్’లో ఉన్నాయని తెలుస్తోంది.  చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి గత కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్’ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, ఆయన అడుగులు వైసీపీ వైపు వెళుతున్నాయని కూడా అంటున్నారు. కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ స్టాండ్’కు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల  బిల్లును  గట్టిగా సమర్ధించారు. అధికార వికేంద్రీకరణ ద్వారా ఆర్థిక, సామాజిక అసమానతలు తొలిగి పోతాయని. ఇంచుమించుగా వైసీపీ డైలాగులానే ఆయన కూడా వల్లెవేశారు. అలాగే, మరో ఒకటి రెండు సందర్భాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అహో ఓహో అంటూ తెగ మెచ్చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో సారి, దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్’లోనూ ఒకే రోజున రికార్డు స్థాయిలో కొవిడ్ టీకాలు వేశారు. ఈ సందర్భంగానూ చిరంజీవి, అదేదో ఒక్క ఆంధ్ర ప్రదేశ్’లోనే జరిగినట్టు, ముఖ్యమంత్రిని పొగడ్తలతో  ముంచెత్తారు. అంతే కాదు, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో అటు సినిమా ఇండస్ట్రీలో హాట్ టపిక్ అయింది. ఇదే సమయంలో ‘మా’ ఎన్నికలు కూడా రావడం, చిరంజీవి తమ అభ్యర్ధిగా ప్రకాష్ రాజ్’ను బరిలో దించడంతో సిని’మా’ వర్గాల్లో, మా’ ఎన్నికల ఈక్వేషన్స్’తో పాటుగా  చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీతో స్టేట్ పాలిటిక్స్ లో చోటు చేసుకునే క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి, కూడా చర్చ జరుగుతోంది.  వైసీపీకి చెందిన, నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం, వచ్చే సంవత్సరం జూన్ నెలలో ముగుస్తుంది. అంటే అందుకు మరో సంవత్సర కాలం వుంది . ఈలోగా చిరంజీవి చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని, ఫుల్ టైమ్. పొలిటిషియన్’ గా రీఎంట్రీ ఇచ్చేందుకు, సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవి వస్తానంటే ..వద్దంటానా’ అన్న సంకేతాలను ఇచ్చారని పార్టీ వర్గాల సమాచారం. చిరంజీవి వస్తే ఆయనతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం కొంతైనా ఉంటుందని, పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. గతంలో  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, 2009 ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీని అటు టీడీపీ, తెరాస, వామపక్ష పార్టీల మహా కూటమిని ఎదుర్కుని కూడా 71 లక్షల పై చిలుకు ఓట్లతో 18 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.  సరే, ఆ తర్వాత ఆయన చేతికి చిక్కిన చక్కని అవకాశాన్ని, చేజేతులా జారవిడుచుకున్నారు. ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్రంలో సహాయ మంత్రిగా సర్దుకు కూర్చున్నారు . 2014లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో  అధికారం కోల్పోవడంతో రాజ్య సభ సభ్యత్వం గడవు ముగిసేవరకు, కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్లు ఉంటూ వచ్చి, ఆతర్వాత 2017  మెగాస్టార్ అమ్మడు  కుమ్ముడు అంటూ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ స్టార్ మెగా స్టార్’ అంటూ దూసుకు పోతున్నారు. అయితే, ఆయనకు ఇంకా రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లలేదు. అందుకే సినిమా రంగంలో లానేరాజకీయ రంగంలోనూ సెకండ్ ఇన్నింగ్స్’కు సిద్దమై పోతున్నారని అంటున్నారు. అయితే అందుకు మరో సంవత్సరం టైముంది.. , ఈ లోగా, ట్విట్టర్ తెర  మీద  గెస్ట్  పొలిటిషియన్  రోల్స్  ప్లే చేస్తారు , కావచ్చును  

మటన్ పెట్టలేదని.. మరు పెళ్లి చేసుకున్న యువకుడు.. 

చుట్టాలు అనే వాళ్లు మన అవసరాలు తీర్చడానికి రారు.. వాడికి అవసరం ఉంటే వస్తారు. కొంత మంది చుట్టాలు ఐతే పెళ్లి చూసుకుని వచ్చి పెళ్ళిలో గొడవలు పెట్టి వెళ్ళిపోతారు.. ఎందుకంటే ఎదుటి వాడు నాశనం ఐతుంటే సంతోషిచేది ఒక మనిషి మాత్రమే కాబట్టి.  అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసేవాడు కింద మీద పడి, అప్పోసప్పో చేసి పెళ్లి కుదిర్చి తన  బరువు దించుకుందాం అనుకుంటే..మనకు అక్కరకు రాని సుట్టం. వాడి అవసరం కోసం వచ్చి పెళ్లి చెడట్టాడుతుంటారు. తాజాగా ఇలాంటి జరిగింది.. అది ఏంటో మీరే తెలుసుకోండి.   పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలవడమే అనుకుంటారు కానీ.. దాని వెనక ఒక పెద్ద తతంగమే ఉంటుంది. మాకు వ్యాల్యూ ఇవ్వలేదని కొందరు. మమల్ని పలకరించలేదని ఇంకొందరు. మాకు బట్టలు పెట్టలేదని మాకు బొట్టు కూడా పెట్టలేదని నానారకాలుగా ఆడిపోసుకుంటారు బంధువులు. ఇక పిలగాని తరుపున బంధువులు గల్లా ఎగరేస్తారు. అమ్మాయి తరుపున వాళ్ళు అయితే కొంచం అణిగిమణిగి ఉంటారు. ఇక ఇదంతా ఒక అయితే కొంత మంది పెళ్ళికి సంబంధం లేని వాళ్ళు కూడా గొడవలు పెట్టుకుని ఆగిపోయిన పెళ్లిళ్లు కూడా చూశాం.. ఏదైనా కార్యం చెయ్యాలంటే పెద్ద శ్రమ ఉంటుంది కానీ దాన్ని చెడగొట్టడానికి యెంత సేపు చెప్పండి.. కళ్ళు మూసి తెరిచినంత సాపు  చెడగొటేయొచ్చు. అందరూ సతాయించడంతో  పెళ్లి చేసే వాడికి తలలో ప్రాణం తోకలోకి వస్తుంది.   ఇలా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వివాహాలు మనం చూస్తూనే ఉంటాం. గోరంత కారణాలు కూడా కొండంత  వివాదాలుగా మారిపోయి పెళ్లిళ్లు రద్దవుతుంటాయి. ఇలాంటి ఆసక్తికర ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒరిసా లోని జాజ్ పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అయితే విందులో మటన్ పెట్టకపోవడం వివాదానికి కారణమైంది. తమకు మటన్ కావాలని పెళ్లికొడుకు బంధువులు అడగడంతో... మటన్ లేదని పెళ్లికూతురు బంధువులు సమాధానమిచ్చారు. దీంతో గొడవ మొదలైంది. తమ బంధువులకు పెళ్లికొడుకు కూడా వత్తాసు పలకడంతో వివాదం ముదిరించి. చివరకు పెళ్లికొడుకు తన వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, మరుసటి రోజు అతను మరొక యువతిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ఆనంద‌య్య‌కు మ‌ద్రాస్ హైకోర్టు సెల్యూట్‌.. ప్ర‌భుత్వం విఫ‌ల‌మంటూ విమ‌ర్శలు..

ఆనంద‌య్య‌ను ఎంత‌గా ఆగం చేయాలో అంత‌కంటే ఎక్కువే ఆగం చేశారు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు. ఆనంద‌య్య మందు పేరు జ‌నం నోళ్ల‌లో నాన‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఒకప్పుడు అంద‌రికీ ఉచితంగా ల‌భించిన ఆ మందు.. ఇప్పుడు కొంద‌రికే ప‌రిమిత‌మ‌వ‌డం బాధాక‌రం. ఏపీ ప్ర‌భుత్వం ఎంత‌గా రాజ‌కీయం చేసినా.. చేస్తున్నా.. ఆనంద‌య్య మందు ఖ్యాతిని మాత్రం అడ్డుకోలేక‌పోతోంది. రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి.. ఆ వ‌న‌మూలిక‌ల మందుకు ప్రాముఖ్యం ద‌క్కుతోంది.  తాజాగా, ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌. కరుబాకరణ్‌, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేయ‌డం విశేషం.  డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ సందర్భంగా మ‌ద్రాస్ హైకోర్టులో ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయంటూ ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించారు న్యాయ‌మూర్తులు. ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని జస్టిస్ ఎన్‌. కరుబాకరణ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ‌ప‌డింది.  ఇలా ఆనంద‌య్య మందు మ‌ద్రాసు హైకోర్టు న్యాయ‌మూర్తుల‌నైతే మెప్పించింది కానీ, మ‌న రాష్ట్ర పాల‌కుల ద‌య‌ను మాత్రం పొంద‌లేక‌పోతోంది. ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వల్లే తాను అంద‌రికీ మందును ఉచితంగా అందించ‌లేక‌పోతున్నాన‌ని ఆనంద‌య్య స్వ‌యంగా ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం పాల‌కుల స‌హాయ‌నిరాక‌ర‌ణ‌కు నిద‌ర్శ‌నం. ఆయూష్ అనుమ‌తులు ఉన్నా.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా.. జ‌నాల్లో డిమాండ్ ఉన్నా.. మందు మాత్రం అందుబాటులో లేక‌పోవ‌డం దారుణం. మందు త‌యారీకి కావ‌ల‌సిన క‌రెంట్‌, గిన్నెలు, పంపిణీకి సాయం చేయ‌కుండా ఏపీ స‌ర్కారే ఆనంద‌య్య మందుపై కుట్ర చేసింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. కొంద‌రు వైసీపీ నాయ‌కులు ఆనంద‌య్య‌ను హైజాక్ చేసి.. మందు త‌యారు చేయించుకొని.. త‌మ ఫోటోల‌తో రాజ‌కీయ ప్రచారానికి వాడుకున్నారే కానీ.. ఆనంద‌య్య మందును అంద‌రికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున చిన్న ప్ర‌య‌త్నమ‌న్నా చేసిన పాపాన పోలేదు. మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తులే ఆనంద‌య్య‌కు సెల్యూట్ చేశారంటే ఆయ‌న గొప్ప‌త‌నం అలాంటిది మ‌రి. అయినా, మ‌న పాల‌కులు ఆ క‌రోనా మందుపై ఇంత‌టి కుట్ర‌లు చేయ‌డం బాధాక‌రం. ఆనంద‌య్య మందు తీసుకోవాల‌ని అనుకున్నా.. అది ల‌భించ‌క మ‌ర‌ణించిన ప్ర‌తీ ప్రాణానికి ప‌రోక్షంగా ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణమంటున్నారు. మ‌ద్రాసు హైకోర్టు వ్యాఖ్య‌లు చూసైనా బుద్ధి తెచ్చుకోవాల‌ని.. న్యాయ‌మూర్తుల మాట‌లు ఆల‌కించైనా.. ఇప్ప‌టికైనా ఆనంద‌య్య మందుకు ప్రోత్సాహం ఇవ్వాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు.  

జ‌బ‌ర్ద‌స్త్‌గా బీజేపీ పోల్ మేనేజ్‌మెంట్‌.. ఈట‌ల ఇక బిందాస్‌...

క‌మ‌ల‌ద‌ళం దండెత్తితే ఎట్టా ఉంటాదో తెలుసా? కాషాయపార్టీ వ్యూహాలు ఎంత ప‌క‌డ్బందీగా ఉంటాయో తెలుసా? రామ‌భ‌క్తుల మోహ‌రింపు ఏ రేంజ్‌లో ఉంటాదో తెలుసా? ఓట్ల పోరులో ప్ర‌తీ ఓటును ఎంత పక్కాగా ఫోక‌స్ చేస్తారో తెలుసా? ఒక్క ఓట‌ర్ కూడా మిస్ అవ‌కుండా ఇంటింటికీ కాషాయ కండువా ఎట్టా వెళుతుందో తెలుసా? ఇవ‌న్నీ తెలియాలంటే ఓసారి హుజురాబాద్ వైపు చూడాలి. ఇంక ఎన్నిక‌ల న‌గారా అయినా మోగ‌నే లేదు.. అప్పుడే నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌మ‌ల‌నాథులు ఎలా క‌మ్మేశారో చూడండి.. ఒక్కో పట్ట‌ణం.. ఒక్కో మండ‌లం.. ఒక్కో గ్రామం.. ఒక్కో బూత్‌.. ఇలా ప‌క్కాగా ప్రణాళిక వేసుకుని.. హేమాహేమీల్లాంటి నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. బీజేపీకి అత్యంత బ‌లంగా ఉండే పోల్ మేనేజ్‌మెంట్‌ను ఈసారి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే అంతా రెడీ.. ఇక కార్య‌చ‌ర‌ణే ఆల‌స్యం.  బీజేపీకే ఈట‌ల రాజేంద‌ర్‌తో అడ్వాంటేజ్‌.. బీజేపీతో ఈట‌ల‌కు పెద్ద‌గా ప్రయోజ‌నం లేద‌నే వాద‌న‌లు ప‌స లేనివ‌ని తాజా కార్య‌చ‌ర‌ణ‌తో తేలిపోతోంది. అన్ని పార్టీలు ఆహ్వానించినా.. ఈట‌ల ఏరికోరి బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారో స్ప‌ష్ట‌మ‌వుతోంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో క‌మ‌ల‌నాథులు దిట్ట‌. అదే ఇప్పుడు ఈట‌ల‌కు శ్రీరామ ర‌క్ష‌. ప‌క‌డ్బందీగా కాషాయ వ్యూహం సిద్ధ‌మైపోయింది. భారీ క‌స‌ర‌త్తుతో క‌మ‌ల‌దండు హుజురాబాద్ వైపు ప‌య‌న‌మైంది. సేమ్ దుబ్బాక సీన్‌నే అక్క‌డా రిపీట్ చేయ‌బోతున్నారు. సేమ్ దుబ్బాక ఫ‌లితాన్నే హుజురాబాద్‌లోనూ సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే, దుబ్బాక ఉప ఎన్నికకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన మాజీ టీఆర్ఎస్ నేత‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డినే హుజురాబాద్‌ నియోజకవర్గానికీ ఇన్‌చార్జీగా నియమించారు. ఈ ఒక్క నిర్ణ‌యం చాల‌దా దుబ్బాక‌ రిపీట్స్ అని చెప్ప‌డానికి. ఇక‌, జమ్మికుంట పట్టణానికి ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ అరవింద్‌ను నియ‌మించారు. వెల‌మ సామాజిక వ‌ర్గం అధికంగా ఉండే జమ్మికుంట మండలానికి అదే వ‌ర్గానికి చెందిన‌.. హ‌న్మ‌కొండ‌కు చెందిన‌ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధ‌ర్మారావును నియ‌మించారు, హుజూరాబాద్‌ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హుజూరాబాద్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కేటాయించారు. ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డిని, కమలాపూర్‌ మండలానికి ఇటీవ‌ల బీజేపీలో చేరిన‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. వీరి నేతృత్వంలో ఆయా మండలాల్లో ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఓటరును స్వయంగా కలవడం ద్వారా విజయం సాధించాల‌ని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ సొంత జిల్లాతో పాటు ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నందున ఈ ఉప ఎన్నిక‌కు ప్రాధాన్యం పెరిగింది. హుజురాబాద్‌లో విజయం సాధించడం ద్వారా బండి సంజయ్ తన స‌త్తాను బ‌లంగా చాటుకోవాల‌ని భావిస్తున్నారు. అందుకే, ఆయ‌న హుజురాబాద్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు.  హుజురాబాద్‌ నియోజకవర్గంలో 305 పోలింగ్‌ బూత్‌లు, 2,26,553 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌లవారీగా బీజేపీకి కమిటీలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని మూడు పోలింగ్‌ బూత్‌లకు ఒక శక్తి కేంద్రంగా విభజించారు. మొత్తం 102 శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వీటికి ఇన్‌చార్జీలను, కమిటీలను నియమిస్తున్నారు. ఒక్కో బూత్‌ కమిటీలో పార్టీలోని అన్ని విభాగాలకు చెందిన ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తున్నారు. కమిటీకి 10 మంది సభ్యులకు తగ్గకుండా ఉంటారు. బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాల కమిటీలు ప్రతి ఓటరును కలిసి బీజేపీ గెలుపున‌కు కృషి చేయ‌నున్నారు.  ఒక్కో పోలింగ్‌ బూత్‌లో సగటున 700 నుంచి 750 వరకు ఓటర్లు ఉండే అవకాశముంది. బూత్‌ కమిటీ సభ్యులు ఆ ఓటర్లను పంచుకొని ఒక్కో సభ్యుడు 50 నుంచి 60 మంది ఓటర్ల బాధ్యతను తీసుకొని నిత్యం వారిని కలుస్తూ పార్టీకి అనుకూలంగా మార్చడం, పోలింగ్‌ రోజు వారిని తీసుకెళ్లి ఓటు వేయించుకోవడంలాంటివి చేస్తారు. ఇలా, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని అడ్డుకోవడానికి పకడ్బందీ కార్యాచరణతో బీజేపీ ముందుకుపోతోంది. దీంతో.. హుజురాబాద్‌లో దుబ్బాక త‌ర‌హా హోరాహోరీ సంగ్రామం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. క‌మ‌ల‌నాథులు చేస్తున్న పోల్ మేనేజ్‌మెంట్ చూస్తుంటే.. బీజేపీనే ఈట‌ల‌కు అద‌న‌పు బ‌లంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.