కొవిడ్ మృతులకు పరిహారం.. కేంద్రానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆ పరిహారం ఎంత? అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆరు వారాల్లోగా పరిహారంపై మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ అధీకృతసంస్థ (ఎన్డీఎంఏ)కు ఆదేశాలిచ్చింది.  కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం విచారించింది.విధి నిర్వహణలో ఎన్డీఎంఏ విఫలమైందని, కనీస ప్రమాణాలనూ పాటించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టాన్ని తాము పరిశీలించామని, దానిప్రకారం ‘కచ్చితం’ అనేది తప్పనిసరి అని ఉందని తెలిపింది. కానీ, అలాంటి మార్గదర్శకాలను ఎన్డీఎంఏ పాటించినట్టు ఎలాంటి రికార్డూ లేదని వెల్లడించింది. పరిహారం, ఉపశమనం/సాయం వంటి వాటిని నిర్ణయించడంలో సంస్థ కనీస ప్రమాణాలను పాటించాలని ధర్మాసనం సూచించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తాము సూచన చేయవచ్చా? అన్నదే ఇక్కడ ప్రశ్న అని, దీనిపై న్యాయ సమీక్ష విషయం కూడా చర్చించామని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రాధాన్యాలు, సాయం వంటి వాటిని ప్రభుత్వమే నిర్ణయించాలి. బాధితులకు ఆహారం, వసతిని ప్రభుత్వమే కల్పించాలి. ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి”అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఏ దేశానికీ అపరిమిత ఆర్థిక వనరులుండవని, పరిహారం చెల్లింపునకు ఆర్థిక పరిమితులున్నాయని చెప్పింది. చనిపోయిన వారి ప్రతి కుటుంబానికీ రూ.4 లక్షలు ఇవ్వాల్సిందేనని తాము చెప్పడం సరైంది కాదని పేర్కొంది. పరిహారం ఎంతివ్వాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చునని తెలిపింది.  కొన్ని రోజుల క్రితం జరిగిన విచారణ సందర్భంగా.. తాము పరిహారం చెల్లించలేమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగైతే విపత్తు నిధులన్నీ వాడినా అందుకు సరిపోవని, పైగా రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని వివరించింది. అయితే ఎలాంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్ర చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ తాజా ఆదేశాలిచ్చింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆరు వారాల్లోగా నిర్ధారించాల్సిందిగా ఎన్‌డీఎంఏను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్ కాంప్లికేషన్స్‌తో మృతి చెందిన కేసుల్లోనూ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు మార్గదర్శకాలను సులభతరం చేయాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 

రఘురామ లేఖాస్త్రాలతో జగన్ మైండ్ బ్లాకవుతోందా?

తిరిగే కాలు, తిట్టే నోరు ఉరుకోవు, ఇదొక సామెత. ఈ సామెత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామా కృష్ణం రాజుకు ఎంత వరకు వర్తిస్తుందో ఏమో కానీ, ఇంచుమించుగా సంవత్సర కాలం పాటు, సొంత పార్టీని, పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రచ్చబండకు పెట్టి ఉతికి ఆరేసిన ఆయన, చివరకు ప్రభువుల ఆగ్రహానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద కక్షకట్టి, కేసులు పెట్టింది. కేసులంటే, చిన్నా చితక చిల్లర  కేసులు కాదు. ఏకంగా రాజ ద్రోహం కేసు పెట్టింది. అరెస్ట్ చేసింది. వేధింపులకు గురిచేసింది. చివరకు దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీసులు ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారు. అయినా అయన వెనక్కు తగ్గలేదు, కానీ, న్యాయస్థానం విధించిన అంక్షల కారణంగా మీడియా ముందుకు రావడం లేదు.  కానీ, ఇప్పుడు మరో రూటులో అదే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రికి నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరిట  లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ లేఖల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోకడలను ఎండకడుతున్నారు. వ్యంగాస్త్రాలు సంధిస్తూ ముఖ్యమంత్రిని ఎగతాళి చేస్తున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇమేజిని రఘురామ కృష్ణం రాజు అందరికంటే ఎక్కువగా డ్యామేజి చేస్తున్నారు. అందుకే, వైసీపీ నాయకులు ఆయన మీద కారాలు మిరియాలు నురుతున్నారు. బుసలు కొడుతున్నారు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఓం బిర్లాకు అదే పనిగా లేఖలు రాస్తున్నారు. అయినా అటు నుంచి స్పందన లేక పోవడంతో  జగన్ రెడ్డి, చాలా అసహనానికి గురవుతున్నారు. చివరకు చట్ట సభల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని తెలిసినా, ఏ2 విజయసాయి న్యాయవాదుల ద్వారా కోర్టులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే ఫర్ ఎ చేంజ్, రఘురామ కృష్ణం రాజు మంగళవారం రూట్ మార్చారు. ఈ సారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు. అది కూడా ఏపీ రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు దేశ అత్యున్నత  పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలని కోరారు. పీవీ శతజయతి వేడుకలను పురస్కరించుకుని అయన ఈలేఖ రాశారు. ఈ అభ్యర్ధన చేశారు. అలాగే, ఈ లేఖలో కృష్ణం రాజు, పీవీ గొప్ప తనాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా ఆయన  ముందు చూపుతో ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు ఇస్తున్న ఫలాలను ప్రస్తావించారు. అదే విధంగా పీవీకి భారత రత్న ప్రకటిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 కోట్ల తెలుగు వారు మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడు గర్వ పడతారని, అందుకు ఆయన శతజయంతి వేడుకలు సరైన సమయమని పేర్కొన్నారు.   పీవీ నరసింహ రావు తెలుగు నేలకు మాత్రమే కాదు, భారతీయులు అందరికీ, ప్రాతః ప్రాతఃస్మరణీయులు. పరిపాలనా పరంగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన భూసంస్కరణలు, దేశ ప్రధానిగా ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి దిక్సూచిలా నిలిచాయి. అదే విధంగా ఆయన బహుబాషా కోవిదులు, పలు విదేశీ భాషలు సహా  17 భాషలలో ఆయనకు గల ప్రావీణ్యం, ఆయన చేసిన సాహిత్య సేవ, తెలంగాణ విమోచన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర, దేనికవే, చరిత్ర గతిని తిప్పిన మైలు రాళ్ళు.సో.. ఆయనకు భారత రత్న ప్రకటించాలని కోరడం సముచితం. అలాగే, మరో తెలుగు వెలుగు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావుకు కూడా భారత రత్న ప్రకటించాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నారు. ప్రధాని మోడీ, మొన్నీ మధ్యనే తెలుగు భాష గొప్పదనం గురించి గొప్పగా చెప్పారు. తెలుగు వారి గొప్పతనాన్ని కూడా అదే విధంగా గుర్తిస్తారని ఆశిద్దాం.   రఘురామ లేఖాస్త్రాలు జగన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, మైండ్ బ్లాకయ్యేలా చేస్తున్నాయి అంటున్నారు.సమాధానాలు చెప్పుకోలేకనే అర్థరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు .. రాత్రుల్లో ఎవరెవరితోనో ఏవేవో మాట్లాడేసు కుంటున్నారు.అందుకే ఎవరికన్నా  చూపిస్తే మంచిదేమో .. అంటున్నారు.

విశాఖ మొత్తం విజయసాయిదేనా! 

విశాఖపట్నంలో  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఓవరాక్షన్ ఎక్కువైందనే ఆరోపణలు వస్తున్నాయి. జూలైలోనే విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు.. తమ చర్యలతో నగరవాసులకు చికాకు తెప్పిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజుగా ఫీలవుతున్నారనే ఆరోపణలు ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం రోజురోజుకు జుగుప్సాకరంగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన జన్మదినం సందర్భంగా నగరంలో చేస్తున్న హంగామా చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.  విశాఖపట్నంలో ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి హోర్డింగ్స్, కటౌట్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. జులై 1న విజయసాయి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీగా హోర్డింగ్స్, కటౌట్లు ఏర్పాటు చేశారు. నగరమంతా ఆయన ఫోటోలతో నింపేశారు.  వైసీపీ నాయకులు పోటా పోటీగా నగరంలో ఎక్కడపడితే అక్కడ వాటిని ఏర్పాటు చేశారు. ఇది విశాఖపట్నమా? విజయసాయి పట్నమా? అన్నట్లుగా ఆయన ఫోటోలతో ఏర్పాట్లు చేశారు. అసలు వాటికి అనుమతులు ఉన్నాయా? అని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  ప్రమాదకర స్థాయిలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విజయసాయిని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు పోటాపోటీగా చూపిన అత్యుత్సాహమే అధికార పార్టీకి తలవంపుగా మారింది. ప్రమాదకరస్థాయిలో ఇంత భారీగా ఉండే హోర్డింగ్స్, కటౌట్లు ఏర్పాటు చేస్తుంటే జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు, నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాలు, నిర్మాణాలంటూ వీకెండ్‌లో విరుచుకుపడే జీవీఎంసీ అధికారులకు ఇంత పెద్దగా ఉన్న హోర్డింగ్స్, కటౌట్లు  కనిపించడంలేదా? అని నిలదీస్తున్నారు. 

ష్ గ‌ప్‌చుప్‌.. అస‌మ్మ‌తి ఖ‌తం!.. ఇక బాహుబ‌లి రేవంత్‌రెడ్డి..

ఎన్నెన్ని మాట‌లు అన్నారు.. ఎన్నెన్ని విమ‌ర్శ‌లు చేశారు.. అధిష్టానానికి ఎన్నెన్ని చాడీలు చెప్పారు.. ఎన్నెన్ని కుటిల ప్ర‌య‌త్నాలు చేశారు.. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా.. అన్నిటినీ ప‌టాపంచ‌లు చేసుకొని.. బాహుబ‌లిలా యుద్దం చేసి పీసీసీ పీఠం ఎగ‌రేసుకుపోయారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న టీడీపీ నుంచి వ‌చ్చిన వాడు.. అత‌ను చంద్ర‌బాబు ఏజెంట్‌.. మేం కాంగ్రెస్‌లో మొద‌టి నుంచీ ఉన్న‌వాళ్లం.. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వాడికి పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తారా అంటూ సో కాల్డ్ సీనియ‌ర్స్ నానా ర‌చ్చ చేశారు. మ‌మ్మ‌ల్ని కాద‌ని రేవంత్‌ను ప‌ట్టం క‌డితే.. త‌మ దారి తాము చూసుకుంటామంటూ బ్లాక్ మెయిల్ కూడా చేశారు. ఎన్ని బెదిరింపులు చేసినా.. ఎన్ని డ్రామాలు చేసినా.. రేవంత్‌రెడ్డి ప్ర‌మోష‌న్‌ను అడ్డుకోలేక‌పోయారు. అధిష్టానం రేవంత్‌నే న‌మ్మింది. ఆయ‌నే స‌మ‌ర్థుల‌డ‌ని డిసైడ్ అయింది. పీసీసీ చీఫ్‌ను చేసింది. మ‌రిప్పుడు సీనియ‌ర్ల ప‌రిస్థితి ఏంటి? పార్టీని వీడ‌తారా? రేవంత్‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తారా?  కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. త‌న‌కే పీసీసీ పీఠం కావాలంటూ.. మొద‌టి నుంచీ రేవంత్‌రెడ్డి పేరును గ‌ట్టిగా వ్య‌తిరేకించిన నేత‌. అందుకే, ఆ అక్క‌సుతోనే ఢిల్లీ నుంచి రాగానే.. ఓటుకు నోటు, అమ్ముకున్నారు, టీపీసీసీని టీటీడీపీ చేస్తారు, హుజురాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోండి.. ఇలా నోటికొచ్చిన‌ట్టు ఆడిపోసుకున్నారు. గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌నంటూ.. పాద‌యాత్ర చేస్తానంటూ బింకానికి పోయారు. క‌ట్ చేస్తే.. హైక‌మాండ్ గ‌ట్టి షంటింగ్ ఇచ్చింది. మ‌నోడు ఆ మ‌ర్నాటికే సైలెంట్ అయిపోయాడు. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దంటూ లేఖ‌తో లెంప‌లేసుకున్నారు. సో, ముఖ్య‌మైన‌ అస‌మ్మ‌తి వికెట్ డౌన్‌. ఇక, రేవంత్‌రెడ్డిపై మొద‌టి నుంచి నానా న్యూసెన్స్ చేస్తున్న సీనియ‌ర్ మోస్ట్ జూనియ‌ర్ లీడ‌ర్ హ‌నుమంతన్న‌. గిదేందిరా బై అంటూ.. రేవంత్ ఫ్యాన్స్ త‌న‌కు వార్నింగ్ ఇస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ ఆగ‌మై పోతోందంటూ.. గాంధీభ‌వ‌న్‌లో కార్తీకదీపం సీరియ‌ల్ త‌ర‌హాలో ర‌క్త‌క‌న్నీరు పెట్టుకున్నారు. అతి గ‌డుసుత‌నానికి ఏడుపు ఎక్కువ‌నుకున్నారేమో.. పాపం వీహెచ్ ఆవేద‌న‌ను ఎవ‌రూ అర్థం చేసుకోలేదు. పీసీసీ అధ్య‌క్ష‌ప‌ద‌వి ద‌క్కిన వెంట‌నే.. త‌న వ‌ల్ల అంత‌గా బాధ‌ప‌డిన ఆ పెద్దాయ‌ను.. ఆసుప‌త్రి ఐసీయూలోకి వెళ్లి మ‌రీ ఓదార్పు యాత్ర చేశారు రేవంత్‌. ఐస్‌లా క‌రిగిపోయిన హ‌నుమంతు.. రేవంతుకు ఆల్‌ది బెస్ట్ చేప్పేశారు. సెకెండ్ వికెట్ ఆల్‌సో డౌన్‌. పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, జీవ‌న్‌రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, మ‌ధు యాష్కీగౌడ్‌లాంటి వాళ్లు పీసీసీ నాయ‌కుడిగా ఎవ‌రున్నా అడ్జ‌స్ట్ అయిపోతారు. పార్టీకి విధేయులుగా అలా ప‌డుంటారు అంతే. వారు రేవంత్‌కు స‌హ‌క‌రిస్తారంతే. ఇక అస‌మ్మ‌తి బ్యాచ్‌లో మరోనేత జ‌గ్గారెడ్డి. ఆయ‌న రేవంత్‌రెడ్డిని మొద‌టినుంచి వ్య‌తిరేకిస్తున్నారు. కారు ఎక్కాల‌నే సాకుతోనే ఆయ‌న‌లా చేస్తున్నార‌ని అంటారు. జ‌గ్గ‌న్న‌ కేసీఆర్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో కీల‌క నేత సీఎల్పీ లీడ‌ర్‌ భ‌ట్టి విక్ర‌మార్క‌. క్లాస్ లీడ‌ర్ అనే మేక‌ప్‌లో ఎప్పుడు కాంగ్రెస్ కోస‌మే ప‌ని చేస్తారు. ఆయ‌న గొనుగుతారు, న‌సుగుతారే కానీ.. గ‌ట్టిగా అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించే నాయ‌కుడు కాదంటారు. మొద‌టి నుంచీ కేసీఆర్‌తో సాఫ్ట్ వైఖ‌రితోనే ఉన్నార‌ని.. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నా టీఆర్ఎస్‌లో ఉన్న‌ట్టే భావిస్తార‌ని అంటారు. ఇటీవ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లి పార్టీ లైన్‌ను క్రాస్ చేశార‌ని.. ఆయ‌న ప్ర‌స్తుతానికి గోడ మీద పిల్లిలా ఎటు ఉండాలో తేల్చుకోలేక పోతున్నార‌నే టాక్ న‌డుస్తోంది.  ఇలా, ఇప్ప‌టి వ‌ర‌కూ హంగామా చేసిన‌ సీనియ‌ర్లంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ప్ర‌క‌టించేశాక‌.. ఇక చేసేది ఏముంటుంద‌ని.. చెప్పిన ప‌ని చేయ‌డ‌మే క‌దాని డిసైడ్ అయిపోయారు. బాహుబలిలాంటి రేవంత్‌రెడ్డికి ఎదురెళ్లితే త‌మ‌కే డ్యామేజ్ జ‌రుగుతుంద‌ని.. ఆయ‌న‌ నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తే.. పార్టీ అధికారంలోకి వ‌స్తే.. క‌నీసం మంచి మంత్రి ప‌ద‌వులైనా ఆశించొచ్చ‌నే ఆశ‌తో అడ్జ‌స్ట్ అయిపోతున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. కాంగ్రెస్‌లో సునామీ వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డిన ప్ర‌త్య‌ర్థులంతా.. ఇప్పుడిలా పార్టీ నిండు కుండ‌లా తొన‌గ‌కుండా.. ఠీవిగా నిల‌బ‌డ‌టంతో అంతా అవాక్క‌వుతున్నారు. రేవంత్‌రెడ్డా మ‌జాకా అంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.    

కొవిడ్ టీకాకు బదులు రేబిస్ టీకా! నల్గోండ జిల్లాలో నర్సు నిర్వాకం.. 

కొవిడ్ టీకా నియంత్రణకు ప్రధాన ఆయుధమని చెబుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో వేగంగా సాగుతోంది. టీకాపై ఉన్న అనుమానాలతో మొదట వేసుకునేందుకు జనాలు ముందుకు రాకపోయినా.. ప్రస్తుతం మాత్రం సీన్ మారింది. కొవిడ్ టీకాల కోసం జనాలు ఎగబడుతున్నారు. దీంతో తమకు అందుబాటులో ఉన్నంత వరకు వ్యాక్సిన్లను రాష్ట్రాలు పంపిణి చేస్తున్నాయి. అయితే కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఫోన్లలో మాట్లాడుతూ ఒకరికే ఒకేసారి రెండు డోసులు ఇచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. కొందరి డోసు నింపకుండానే ఇంజక్షన్లు ఇస్తున్న వీడియోలు లీకై వైరల్ గా మారాయి. సెకండ్ డోసు విషయంలో ఒకదానికి బదులు మరో వ్యాక్సిన్ వేసిన ఘటనలు భారీగానే బయటకి వచ్చాయి. తాజాగా నల్గొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.  నల్గొండ జిల్లాలో కరోనా టీకా వేయించుకునేందుకు వెళ్లిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి నర్సు రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు మంగళవారం కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. విషయం తెలియని ప్రమీల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది.  కొవిడ్ టీకా ఇవ్వాలంటూ టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా తనకు అంతకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని ప్రశ్నిస్తే నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. బాధితురాలు కొవిడ్ టీకా బ్లాక్‌లోకి వెళ్లకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లడం వల్లే ఈ పొరపాటు జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. నిజానికి ఆమెకు వేసింది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కాదని, టీటీ ఇంజక్షన్ మాత్రమేనని, దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని చెప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ.. ఫోన్లలో మాట్లాడుతూ జనాల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు. 

షర్మిలకు తెలంగాణ సర్కార్ షాక్.. కేసీఆర్ కు కోపం ఎందుకు..?

తెలంగాణలో కొత్త పార్టీని పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. దూకుడుగా వెళుతున్నారు. జూలై8న పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్న షర్మిల.. అంతకుముందే వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ కొవిడ్ మృతుల కుటుంబాలను, రైతులను కలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేస్తున్నారు షర్మిల. కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదు. మీడియా సమావేశాలతో పాటు ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు.  కేసీఆర్ లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న షర్మిలకు సడెన్ గా షాక్ తగిలింది. లోటస్ పాండ్‌లో  టీమ్‌ వైఎస్ఎస్ఆర్ పేరిట ఓ వెబ్‌సైట్ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు లోటస్‌పాండ్ ఆవరణలో ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం రాత్రి పన్నెండు గంటలకు జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ టీం లోటస్ పాండ్‌కు చేరుకుని మొత్తం ఫ్లెక్సీలను తొలగించింది. ఫ్లెక్సీలపై స్థానిక మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో వీటిని తొలగిస్తున్నట్టు తెలిపింది.  ప్రభుత్వ చర్యలపై షర్మిల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్ఎఫ్ బృందం చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్ల ముందు ప్లేక్సీలు వెలిశాయని..వాటిని అన్నింటిని తీసే దమ్ము మున్సిపల్ అధికారులు ఉందా అని ప్రశ్నించారు. ఇటివల నల్గొండ జిల్లాలోని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు చుక్కెదురైంది.. షర్మిల పరామర్శించేందుకు వెళ్లిన యువకుడితో పాటు కుటుంబ సభ్యులు లేకుండా పోయారు. పోలీసులే బెదిరించి వాళ్లను పంపించి వేశారని షర్మిల పార్టీ నేతలు ఆరోపించారు.  నల్గొండ జిల్లాలోనే  రైతులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల కాన్వాయ్‌ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో షర్మిల పార్టీపై కూడా టీఆర్ఎస్ ఫోకస్ పెడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. పార్టీ ఏదైనా ముందునుండే దెబ్బకొట్టాలనే వ్యుహాంలోకి టీఆర్ఎస్ ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. 

ప్రగతి భవన్ గేట్లు తెరవడానికి కారణం ఇదా?

ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. కాని కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలన్ని ప్రగతి భవన్ కేంద్రంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటికి రారని, ప్రగతి భవన్ లోకి ఎవరికి ఎంట్రీ ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో విపక్షాల నేతలు సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లాలని చూసినా అపాయింట్ మెంట్ రాకపోవడంతో వెళ్లలేకపోయారు. విపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతలకు ప్రగతి భవన్ ఎంట్రీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవలే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కమలం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. సీనియర్ మంత్రి అయినా తనకే ప్రగతి భవన్ లోకి చాలా సార్లు ఎంట్రీ దక్కలేదని చెప్పారు. ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లి ఎంట్రీ లేక తిరుగొచ్చి ఎన్నో సార్లు అవమానపడ్డానని తెలిపారు.  అయితే కొన్ని రోజులుగా సీన్ మారింది. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి. సీఎం కేసీఆర్ జోరుగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు గతంలో ఎంతగా ప్రయత్నించినా ఎంట్రీ లభించని విపక్ష నేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపులు వస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను కలిశారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ఈ భేటీ జరిగింది. తర్వాత దళిత ఎంపవర్ మెంట్ స్కీమ్ అమలుపై ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశానికి బీజేపీ మినగా మిగిలిన పార్టీల నేతలు, ప్రజా సంఘాల , దళిత సంఘాల నేతలు, దళిత సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కేసీఆర్ వ్యవహార తీరులో మార్పులు, ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవడంపై రాజకీయ వర్గాల్లో పలు చర్చలు సాగుతున్నాయి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ రూట్ మార్చారని ఇప్పటివరకు అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి.. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవడానికి కారణం ఇదేనంటూ కొత్త విషయం చెప్పారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వగానే, హడావుడిగా ప్రగతిభవన్ తలుపులు తెరిచారని వ్యాఖ్యానించారు. ఖబడ్దార్ కేసీఆర్.... నీ సంగతేంటో చూస్తా అని హెచ్చరించారు. ఇకపై  సాధారణ కరెంటు తీగల్లా కాదు, హైటెన్షన్ వైరులా కొట్లాడతాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి  తండ్రీకొడుకులు చేసింది ఏమీలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. నగరంలో సమస్యలు ఎలాంటివో కేటీఆర్ కు తెలియాలంటే ఆయనను మూసీ నదిలో ముంచి ఓ నాలుగు గంటలు ఉంచాలని సెటైర్ వేశారు. కేటీఆర్ పర్యటనలు అంతా ఫ్యాషన్ పరేడ్ ను తలపిస్తుంటాయని, క్యాట్ వాక్ తరహాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక తాను సోదరిగా భావించే సీతక్క గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీతక్క తనతో సరిసమానం అని వివరించారు. ఒకే కుర్చీ ఉంటే ఆ కుర్చీలో తాను సీతక్కనే కూర్చోబెడతానని ఆమె పట్ల తన గౌరవాన్ని చాటారు. 

ఒక్క మగాడు.. హైటెన్ష‌న్ వైరు..! కేసీఆర్ కు ఇక తీన్మారేనా..?

రేవంత్‌రెడ్డి వ‌చ్చాడు.. ఇంకా పీసీసీ ప‌గ్గాలైనా చేత‌బ‌ట్ట‌లేదు.. అప్పుడే కేసీఆర్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.. క‌రెంట్ తీగ‌లా కాదు, హైటెన్ష‌న్ వైరులా కొట్లాడుతానంటున్నాడు.. కేసీఆర్ క‌బంధ హ‌స్తాల్లో బంధీ అయిన‌ తెలంగాణ‌కు విముక్తి క‌ల్పించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు.. క్యాట్ వాక్ మంత్రి అంటూ కేటీఆర్‌ను.. బండి.. గుండు అంటూ బీజేపీ నేత‌ల‌ను విమ‌ర్శ‌ల‌తో తూట్లు పొడుస్తున్నారు.. అదీ లెక్క‌. ఇప్ప‌టి దాకా ఓ లెక్క‌.. ఇక‌పై రేవంత్‌రెడ్డి ఎంట్రీతో మ‌రోలెక్క‌. తెలంగాణ‌ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని అమాంతం మార్చేసే స‌త్తా.. రేవంత్‌రెడ్డికే ఉందంటున్నారు. అందుకే, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆయ‌న్నే న‌మ్మింది. కేసీఆర్‌ను ఢీకొట్టే ద‌మ్ము, ధైర్యం రేవంత్‌కే ఉంద‌ని భావించింది. రేవంత్‌రెడ్డి త‌ల‌కు పీసీసీ కిరీటం తొడిగి.. ఢిల్లీలో సోనియ‌మ్మ వీర‌తిల‌కం దిద్ది.. కాంగ్రెస్ శ్రేణుల‌ను స‌మ‌రానికి స‌న్న‌ద్దం చేసేలా ద‌ళ‌ప‌తిని కేసీఆర్‌పై దండెత్త‌డానికి పంపించింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రాక‌తో.. ఇక కేసీఆర్‌కు కాక మొద‌లైన‌ట్టే.. అంటున్నారు.    ఏడేళ్లుగా కేసీఆర్‌కు క‌రెక్ట్ మొగుడు త‌గ‌ల్లేదంటున్నారు. రేవంత్‌రెడ్డి రాక‌తో ఇక గులాబీ బాస్‌కు గుండెద‌డ పెరిగిందంటున్నారు. పీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌ను సరిగ్గా ఎదుర్కోలేక‌పోయార‌నే టాక్ ఉంది. రేవంత్ కాంగ్రెస్‌లో కొత్త‌గా చేరడం.. కుదురుకోవ‌డానికి కాస్త టైమ్ ప‌ట్ట‌డం.. సొంత‌పార్టీలోనే సీనియ‌ర్ల నుంచి వ‌స్తున్న దాడిని కాచుకోవ‌డంతోనే ఆయ‌న‌కు స‌రిపోయింది. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన రేవంత్‌.. త‌గ్గాల్సిన చోట త‌గ్గి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా నెగ్గార‌ని అంటున్నారు.  హైక‌మాండ్ సైతం అంత ఈజీగా రేవంత్‌కు ప‌ట్టం క‌ట్ట‌లేదు. అంతా ఆచితూచి.. అన్ని అంచ‌నాలు వేసుకున్నాకే.. ఆయ‌న‌ను ఓకే చేసింది. మాయ‌ల మ‌రాఠీ కేసీఆర్‌ను ఎదుర్కోగ‌ల మాట‌ల మాంత్రికుడు తెలంగాణ‌లో రేవంత్ ఒక్క‌డేన‌నే విష‌యం ఢిల్లీకి స్ప‌ష్టమైంది. కేటీఆర్‌, హ‌రీశ్‌రావు లాంటి క‌ల్వ‌కుంట్ల కోట‌ను ఢీకొట్టి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో దాక్కున్న‌ దొర‌ను బ‌య‌ట‌కు గుంజ‌డం.. చిచ్చ‌ర‌పిడుగు రేవంత్ వ‌ల్లే సాధ్య‌మ‌నేది అధిష్టానం అంచ‌నా. అందుకు, త‌గ్గ‌ట్టే రేవంత్.. కేసీఆర్ అండ్ కో పై రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్‌కు సేవ‌కుడిలా.. కేసీఆర్‌పై దండెత్తే సైనికుడిలా.. ఐద‌డుగుల బుల్లెట్‌లా.. కేసీఆర్ వైపు దూసుకొస్తున్నారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న పిలుపిస్తే.. కేసీఆర్‌పై క‌ల‌బ‌డ‌టానికి.. గులాబీ బాస్‌ను కుమ్మేయ‌డానికి.. గ్రామ‌గ్రామాన రేవంత‌న్న ఫ్యాన్స్‌, కాంగ్రెస్ కేడ‌ర్ రెట్టించిన ఉత్సాహంతో రెడీగా ఉన్నారు.  కాంగ్రెస్‌లో మ‌రింత మంది స‌మ‌ర్థులు ఉన్నా.. కేసీఆర్‌ను గ‌ద్దె దించాల‌నే క‌సి, త‌ప‌న ఒక్క‌ రేవంత్‌రెడ్డిలోనే ఉంద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.  కాంగ్రెస్‌లోని మిగ‌తా నాయ‌కుల్లో చాలామంది కేసీఆర్ విసిరే వ‌ల‌కు చిక్కే చేప‌ల్లాంటి వారే. కాంగ్రెస్‌కు కేసీఆర్‌ను అమాంతం మింగేసే తిమింగ‌ళం లాంటోడు కావాలి. ఆ సామ‌ర్థ్యం ఒక్క రేవంత్‌రెడ్డిలోనే క‌నిపిస్తోంది. పైగా రేవంత్‌కు కేసీఆర్‌పై పాత ప‌గ ఒక‌టి అలానే బాకీ ఉంది. ఓటుకు నోటు కేసులో త‌న‌ను జైలుకు పంపించిన కేసీఆర్‌ను.. ఎప్ప‌టికైనా జైల్లో పెట్ట‌డ‌మే ఆయ‌న జీవిత ల‌క్ష్యం. అదే క‌సితో రగిలిపోతూ.. క‌సిగా ప‌ని చేస్తున్నారు రేవంత్. అందుకే కేసీఆర్‌పై రివేంజ్ తీర్చుకునే క్ర‌మంలో.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తార‌నే అంచ‌నా కాంగ్రెస్‌ది. ఇలా, ఇటు ప‌ర్స‌న‌ల్ రివేంజ్‌.. అటు పార్టీ ఛాలెంజ్‌.. ఇలా డ‌బుల్ బ్యారెట్ గ‌న్‌తో గులాబీ బాస్‌పై వార్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఢిల్లీ నుంచి ప్ర‌క‌ట‌న రాగానే.. ఇప్ప‌టికే తెలంగాణ పాల‌కుల‌ను త‌న గాండ్రింపుతో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు.. ఆయ‌న జోష్ ఇలానే కంటిన్యూ అయితే.. ఇక కేసీఆర్‌కు ద‌బిడి దిబిడే. 2023 గెలుపు కేసీఆర్‌కు క‌త్తి మీద సామే. ఇక‌ కాస్కో కేసీఆర్... అంటున్నారు రేవంత్‌రెడ్డి ఫ్యాన్స్‌.

తహశీల్దార్ పై డీజిల్ పోసిన రైతు.. మెదక్ జిల్లాలో కలకలం...

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయంలో రెండేండ్ల క్రితం దారుణ ఘటన జరిగింది. భూ సమస్యను పరిష్కరించడం లేదనే ఆగ్రహంతో ఓ రైతు ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఎమ్మార్వో కార్యాలయంలోనే సజీవ దహనం కాగా.. నిప్పంటించిన రైతు కూడా తీవ్రంగా గాయపడి.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఈ ఘటన అప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. అలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే రైతు తహశీల్దార్ పై డీజీల్ పోయగానే అప్రమత్తమైన సిబ్బంది... రైతును అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.  మెదక్‌ జిల్లా శివ్వంపేట తహశీల్దార్ ఆఫీస్‌లో ఈ ఘటన జరిగింది.  తహశీల్దార్ ఆఫీస్‌లో రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆగ్రహంతో  తహశీల్దార్ పై డీజిల్‌ పోశాడు. విద్యుత్ షాక్‌తో తాళ్లపల్లితండా రైతు మృతి చెందాడు. మృతదేహంతో ఎమ్మార్వో ఆఫీస్‌ ముందు ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమ భూ సమస్యలు పరిష్కరించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో తహశీల్దార్‌ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే బాలుకు బీమా డబ్బులు రాలేదని రైతులు ఆరోపించారు. మంగళవారం రైతులంతా మాలోత్‌ బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా తహసీల్దార్‌ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఒక్తసారిగా తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్‌ పోశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో సిబ్బందితో ఇతర రైతులు స్పందించి రైతును అక్కడి నుంచి తోసేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని రైతులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు. 

వీళ్లు ఇన్.. వాళ్లు అవుట్! మంత్రివర్గ విస్తరణ జగన్ కు గండమే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ కసరత్తు ప్రారంభించారా? అంటే అవుననే అంటున్నారు ఏపీ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి ఆచి తూచి అడుగులు వేయాలని, లేదంటే, కష్టాలు తప్పవని  పార్టీ సీనియర్లే హెచ్చరిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కట్టి మీద సామే అంటున్నారు.  రెండేళ్ళ క్రితం అనుహ్యంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి, దేశంలో మరెక్కడా  లేని విధంగ ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో ‘వినూత్న’ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్ల కంటే జూనియర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  అదే సమయంలో ఆయన మంత్రులు ఎవరూ కూడా ఐదేళ్ళు అధికారంలో ఉంటామని అనుకోవద్దని, రెండున్నరేళ్ళ తర్వాత పాత వారికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఇక ఇప్పుడు ఆ గడువు సమీపిస్తున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి  మంత్రివర్గ విస్తరణ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో, లెక్కలు మొదలయ్యాయి.   పెద్దల సభ సభ్యప్రస్తుత మంత్రులలో ఎవరు పదవులు పదిలం, ఎవరికి ముప్పు అనే చర్చతో పాటుగా ఆశావహులలో  అదృష్టవంతులు ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  తమ తొలి మంత్రివర్గంలో మొత్తం 25 మందికి అవకాశం కల్పించారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన నేపధ్యంలో, మంత్రివర్గంలోని పెలు పిల్లి సుభాష్ చంద్ర బోసు, మోపిదేవి వెంకట రమణ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు, శాసనమండలి రద్దు ప్రతిపాదన  వెనక్కి తీసుకున్న నేపధ్యంలో, పెద్దల సభ సభ్యులకు మళ్ళీ మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని, పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తిరుపతి మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీకి పార్టీ టికెట్ ఆశించిన ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి, తిరుపతికి ఎంపీ టికెట్ కు  బదులుగా ఎమ్మెల్సీ పదవితో పాటుగా మంతివర్గంలో స్థానం కలిపిస్తామని అప్పట్లోనే జగన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ప్రస్తుత మంత్రులలో కొందరు సీనియర్లతో సహా సగం మందికి ఉద్వాసన తప్పదని అంటున్నారు. దీంతో అప్పుడే చాలామందిలో కనిపిస్తోందన్నది పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం. నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా, ఆయనతో పాటే కరోనా కూడా రావడంతో మంత్రులకు తమ శాఖల పై పూర్తి స్థాయిలో పట్టు ఏర్పడలేదు. అదీ గాక గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు సీనియర్లు అయినా జూనియర్లు అయినా వారికి  నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చఉండేది, జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా వన్ మ్యాన్  షో. అందుకే చాలా వరకు మంత్రులు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నారు కానీ, ఆ అధికార హోదాను ఏ విధంగానూ  అనుభవించలేక పోయారు. ఇంతలోనే దిగిపోయే సమయం రావడంతో  ఆవేదన చెందుతున్నారు.  కొంతమంది సీనియర్లను కీలక శాఖల్లో ఉన్న వారిని తొలిసారి మంత్రి అయిన వారిని కొందరిని కొనసాగిస్తారని తెలుస్తోంది.పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి స్థానంలో మంత్రులుగా వచ్చిన చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజుతో పాటుగా బొత్స, పుష్పలీల, మేకపాటి, అనిల్  యాదవ్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, సుచరిత సీట్లు పదిలం అంటున్నారు. కొత్తగాఛాన్స్ చిక్కేవరిలో వారిలో స్పీకర్ తమ్మినేని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మంత్రి పదవిని కోరుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఉమ్మడి  రాష్ట్రంలో  వైఎస్ మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం ఉన్న ఆనం  రామా నారాయణ రెడ్డి, పార్థ సారధి వంటి మరికొందరి పేర్లు కూడా ప్రముఖంగా వినవస్తున్నాయి. అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, రోజా, జోగి రమేష్, కళావతి వంటి ఇంకొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.  ఇక ప్రస్తుత మంత్రులలో కొందరు కొంత ధీమాగా ఉన్నా, పాడు కబురు ఎప్పుడు వినవలసి వస్తుందో అని మరి కొందరు మంత్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆశావహులు  కూడా  తమకు ఈ సారైనా అవకాశం దక్కుతుందా లేదా అని ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి  మనస్సులో ఏముందో చివరి వరకు తెలియదు. అయితే తొలి  మంత్రివర్గం కూర్పులో చేసిన ప్రయోగాలు మళ్ళీ చేస్తే  మాత్రం  ముఖ్యమంత్రికి తిప్పలు తప్పవని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 

తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్.. ఎందులోనే తెలుసా?

తెలంగాణ రాష్ట్రం ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది.యాసంగిలో  92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇది గత ఏడాది కొనుగోళ్ల కంటే 28 లక్షల టన్నులు అధికమని సివిల్ సప్లయ్ అధికారులు చెప్పారు. 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17 వేల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. 23 జిల్లాల్లో అంచనాలకు మించి వందశాతంపైగా కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. గత ఏడేళ్లల్లో ఒక్క యాసంగిలోనే ధాన్యం కొనుగోళ్లలో 594 శాతం పెరుగుదల సాధించామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ. 84వేల కోట్లు విలువ చేసే 4 కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మారెడ్డి చెప్పారు. “ఇదివరకు యాసంగిలో కంటే వానాకాలంలో ఎక్కువ పంటలు పండేవి ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. వానాకాలంలో పండిన పంట కంటే కూడా యాసంగిలో అధిక పంటలు పండుతున్నాయి. దీనికి ఈ ఏడాది యాసంగిలో ధాన్యం దిగుబడి… కొనుగోళ్లే నిదర్శనం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది 2014 – 15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, నేడు 2021 యాసంగిలో 92లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం….అంటే 594 శాతం కొనుగోళ్లు పెరిగాయి, ఇదీ యావత్తు తెలంగాణ రైతాంగం యొక్క విజయమని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.  ఏప్రిల్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కొరకు 6, 968 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం, దాదాపు రెండున్నర నెలలపాటు కొనుగోళ్ల ప్రక్రియను నిర్విరామంగా సాగించి రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17,300 కోట్లు విలువ చేసే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోళ్లు ముగియడంతో రాష్ట్రంలోని 6,968 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగింది. గత ఏడాది యాసంగి కంటే 28 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12 లక్షలు (13 శాతం) అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 17,300 కోట్లు కాగా రవాణా, గన్నీ సంచులు, సోసైటీ కమీషనకు అదనంగా దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. 23 జిల్లాల్లో ముందస్తు అంచనాలకు మించి వంద నుంచి 225 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. అత్యధికంగా గద్వాల్ లో 125 శాతం, నారాయణపేటలో 95 శాతం, రంగారెడ్డిలో 83 శాతం, నిర్మల్ లో 44 శాతం, వరంగల్  రూరల్ లో 64శాతం, సంగారెడ్డి, 32 శాతం, భూపాలపల్లిలో 33, వికారాబాద్ లో 44 శాతం కొనుగోళ్లు పెరిగాయన్నారు. సమైక్య రాష్ట్రంలో మన అవసరాలకు, పేదలకు రేషన్ బియ్యం ఎక్కడో పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి. అవి కూడా తినడానికి అంత అనువుగా ఉండేవి కావు… కాని నేడు మన రాష్ట్రంలో పండిన బియ్యాన్ని మనం తినడమే కాకుండా దేశానికి కూడా అందిస్తున్నాం. గత ఏడాది భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన బియ్యంలో తెలంగాణ వాట 55 శాతం ఉంటడం మన అందరికి గర్వకారణమన్నారు మారెడ్డి .  రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలు మెట్రిక్ టన్నులు నల్లగొండ 7,83,574 నిజామాబాద్ 7,55,819 సూర్యా పేట 6,49,192 జగిత్యాల 5, 52,794 సిద్దిపేట 5,40,049 కామారెడ్డి 4,51,154 మెదక్ 4,41,130 కరీంనగర్ 4,14,859 యాదాద్రి 4,06859 పెద్దపల్లి 3,89,601

పోలీసులు రావాలంటే దిశ యాప్.. మరి నిందితులు దొరకాలంటే ఏ యాప్? 

జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అప్పుడప్పుడు జడ్జిలు కొన్నిడైలాగులు వేస్తారు..అలాగే యాంకర్లు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటారు. అప్పుడు వాళ్ల మీద కూడా కంటెస్టెంట్లు వెంటనే పంచ్ లు వేస్తారు. అరే భలే స్పాంటేనిటి అనుకుంటే పొరపాటే. ఢీ డ్యాన్స్ షోలోనూ.. అలాగే క్యాష్ లోనూ కూడా అలాంటివే నడుస్తుంటాయి. అన్నీ ముందే రాసుకున్నవే.. అక్కడ డైలాగులు వదులుతారు. ఏదో అప్పటికప్పుడు వాళ్లు అనేసుకుంటున్నట్లు పాపం ప్రేక్షకులు ఫీలవుతుంటారు. సరిగ్గా అలాంటి తంతే ఈవాళ విజయవాడ భవానీపురంలో జరిగింది.  దిశ యాప్ గురించి ముఖ్యమంత్రిగారు ఏం చెప్పాలి.. కలెక్టర్ గారు ఏం మాట్లాడాలి.. అలాగే పోలీసోళ్లు ఏం చెప్పాలి.. కొందరు మహిళామణులు కన్నీరు కారుస్తూ మరీ జగనన్న అంటే ప్రాణమని ఎలా చెప్పాలి.. దిశ యాప్ ఇన్ స్టాల్ చేసి.. నొక్కగానే పోలీస్ స్టేషన్ కు ఫోన్.. ఆ ఫోన్ మాట్లాడేసి.. 4 నిముషాల్లో స్పాట్ కు పోలీసులు వచ్చేశారు.. ఇవన్నీ కూడా ముందే ఫిక్స్ చేసిన ప్రోగ్రాములే.  అంతా స్క్రిప్టెడ్. పాపం దాని కోసం సీఎంగారు.. వారి గణం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంత హైడ్రామాలో డీజీపీ లేకపోవడం మరో హైలెట్. సరే ఇంతకీ ఇంత కష్టం జగన్ గారు ఎందుకు పడ్డారంటే.. అందరికీ గుర్తొచ్చేది కొన్ని రోజుల క్రితమే విజయవాడ సీతానగరంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన. పాపం ఆ బాధితురాలి మొబైల్ లో దిశ యాప్ లేదు.. దానిని వాడటం తెలియదు.. లేదంటే ఆ అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చేది..వారు ఇలాగే ధైర్యం చెప్పి.. నాలుగు నిముషాల్లో వెళ్లేవారు.. కాపాడేవారు. ఆ అమ్మాయి యాప్ వేసుకోకపోవడమే ఇంతటి ఘోరానికి కారణం తప్ప.. తమ వైఫల్యం కాదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు సవినయంగా ఈ తంతు ద్వారా తెలియచేసినట్లుంది. సరే .. ఆడపిల్లలకు ధైర్యం చెప్పాలి.. వారిలో మనోధైర్యం పెంచాలి. అందుకోసం దిశ యాప్ ఉంది..మీరు వాడండి.. మేం కాపాడతాం అని చెప్పడంలో తప్పు లేదు. ఇదంతా టెక్నికల్ వర్క్. మరి పోలీస్ వర్క్ ఏమైంది సార్? ఘటన జరిగి 10 రోజులైనా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదంటే పోలీసులు ఏం వర్క్ చేస్తున్నట్లు? అంటే వాళ్లు కూడా ఏమైనా యాప్ ఇన్ స్టాల్ చేసుకుని నొక్కితే..అప్పుడు స్పాట్ కి వెళ్లి పట్టుకుంటారా? చూస్తుంటే అలాగే ఉంది వ్యవహారం. ఘటన జరిగిన రోజు మొత్తం ఆరుగురు ఉన్నారు. పడవలో ఉండి మందు కొడుతున్నారు. రెగ్యులర్ గా అక్కడ క్యాంప్ వేసి గంజాయి తాగడం వారికి అలవాటు. ఈ మాట ముందే పోలీసులకు తెలుసు. మరి వాళ్లు రెగ్యులర్ గా అలా చేస్తుంటే వారినెందుకు అరెస్ట్ చేయలేదు? వారిని అక్కడకు రాకుండా ఎందుకు చేయలేకపోయారు? అంటే వాళ్లు అలాగే ఉంటారు.. పొరపాటున వారి కంటన పడి ఎవరైనా ఆడపిల్ల బలవుతుంటే దిశ యాప్ మొబైల్ లో ఓపెన్ నొక్కితే.. అప్పుడు పోలీసులు వస్తారన్నమాట. ఈ కేసులో ఇంకో చిత్రం కూడా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిందితులు ఇద్దరూ ఎక్కడికి పారిపోలేదంట. పక్కనే ఉన్న గూడ్స్ షెడ్ దగ్గరే మూడు రోజులు ఉన్నారంట. పోలీసులు మాత్రం 9 టీములను వేసేసి.. తాడేపల్లి అంతా తెగ గాలించేస్తున్నారు.. కాని ఘటన జరిగిన ప్రాంతానికి గజాల దూరంలో ఉన్నచోట మాత్రం చెక్ చేయలేదు. తీరా స్థానికులు చూసి గుర్తుపట్టి పోలీసులకు చెబితే వారు వచ్చి చూస్తుండగానే..కదులుతున్న గూడ్స్ ఎక్కి పారిపోయారు. అదీ మన ఏపీ పోలీస్ పెర్ ఫార్మెన్స్. ఈ పెర్ ఫార్మెన్స్ ను కవర్ చేయడానికి దిశ యాప్ పేరుతో సీఎం గారి పెర్ ఫార్మెన్స్. ఈ ఎపిసోడ్ లో పాపం హోంమంత్రి మేకతోటి సుచరిత గారిది మరో తొందరపాటు. మరి ఏ అధికారి చెప్పాడో గాని.. రెండోరోజే నిందితులు దొరికేసినట్లు ప్రకటించేశారు. కాని దొరికింది పడవలో పారిపోయినవాళ్లు.. అసలు నేరం చేసిన నిందితులు కాదు. పాపం తెలియక చెప్పి..తర్వాత దానిని కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికీ నిందితులను వెతికి పట్టుకోలేని పోలీసులు యాప్స్ఇన్ స్టాల్ చేసుకోమని వెంటపడుతుంటే కామెడీ అనుకోవాలా.. ఇంకేమనుకోవాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్లలందరినీ దిశ యాప్ వేసుకోమని చెబుదాం..సీఎంగారిని, హోంమంత్రిగారిని.. పోలీసులను మాత్రం నిందితులను వెతికి పట్టుకునే యాప్స్ వాళ్ల మొబైల్స్ లో వేసుకోమని చెబితే పోలా?

అగ్గిపెట్టె, పిట్టగూడు? ఇల్లంటే ఇదా? ఆ ఇంట్లో జగనన్న ఉంటారా?

ఇల్లు అంటే.. నాలుగు గోడ‌లు, పైక‌ప్పు కానే కాదు. ఇల్లు అనేది ఓ అనుబంధం. ఇల్లు అనేది ఓ అనుభూతి. ఇల్లు మ‌మ‌త‌ల కోవెల‌లా మారాలంటే.. అందుకు త‌గ్గ‌ట్టు ఆ ఇల్లు ఉండాలి. విశాల‌మైన హాల్, వంటకు స‌రిప‌డా కిచెన్‌, క‌నీసం డ‌బుల్‌బెడ్ ప‌ట్టేంత బెడ్‌రూమ్ త‌ప్ప‌నిస‌రి. అలాంటి ఇంటిలోనే అనురాగాలు విర‌బూస్తాయి. కానీ, అగ్గిపెట్టె, పిట్ట‌గూళ్ల‌లాంటి ఇల్లు ఉంటే.. అందులో క‌ష్టాలు, క‌న్నీళ్లే కానీ, సంతోషాలు, అనుభూతుల మాటే ఉండ‌దు. ఏపీలో ప్ర‌భుత్వం నిర్మిస్తున్న జ‌గ‌న‌న్న ఇళ్ల దుస్థితి అలానే ఉంద‌ని అంటున్నారు. పేరుకే అది ఇల్లు.. ఉండ‌టానికి ఇరుకిరుకు. డాబు కోసం, ప్ర‌చారం కోస‌మే కానీ, పేద‌లు ఉండ‌టానికి ఆ ఇళ్లు పనికిరావ‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ఇళ్ల సంఖ్య‌ను పెంచడానికి.. ఇంటి సైజును బాగా త‌గ్గించేశారంటున్నారు. 30 ల‌క్ష‌ల ఇళ్లంటూ ఆర్బాట‌మే కానీ, అందులో ఏ ఒక్క ఇల్లు కూడా ఉండ‌టానికి ప‌నికొచ్చేలా లేదంటున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలంలో, పట్టణాల్లో సెంటు స్థలం ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇంట్లో హాల్, బెడ్‌రూమ్, కిచెన్‌, బాత్రూమ్‌. పేరుకైతే అన్నీ ఉన్నాయి కానీ, అవి ఉన్న తీరే నివాసానికి ప‌నికిరాకుండా ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లు మరీ చిన్నవిగా అగ్గిపెట్టెల్లా ఉన్నాయంటున్నారు. 24 గ‌జాల్లో బెడ్‌రూమ్‌. అసలేమైనా స‌రిపోతుందా? ఓ ఇద్ద‌రు మ‌నుషులు అందులో ప‌డుకోగ‌ల‌రా? 6 బై 4.. సింగిల్‌కాట్ బెడ్ వేస్తేనే గ‌దంతా నిండిపోతుంది. ఇక అటూ ఇటూ న‌డిచేదెలా? కాస్త పెద్ద సైజు మంచం వేసుకోవాలంటే ఎలా? 24 గ‌జాల్లో ఎవ‌రైనా బెడ్‌రూమ్ క‌డ‌తారా? తాడేప‌ల్లి ప్యాలెస్‌లో సీఎం జ‌గ‌న్ బాత్రూమ్ కూడా ఇంత‌కంటే పెద్ద‌దిగా ఉంటుంది. అలాంటిది.. పేద‌ల‌కు మ‌రీ ఇంత చిన్న బెడ్‌రూమ్ క‌ట్టిస్తే వారు అందులో కాపురం చేసేది ఎలా? అందుకే కాబోలు వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి.. జ‌గ‌న‌న్న ఇళ్ల బెడ్‌రూమ్ కొత్త జంట శోభ‌నానికి ప‌నికి రావు అంటూ ఎద్దేవా చేసింది. మీ పార్టీ ఎమ్మెల్యేనేగా.. ఆయ‌న‌కు ఆ బెడ్రూమ్ చూసి ఎంత ఇబ్బందిగా అనిపిస్తే ఆ మాట అనుంటారు.. కొంచెం ఆలోచించండి జ‌గ‌న‌న్నా.. మ‌రీ ఇంత చిన్న బెడ్‌రూమ్ ఏంట‌న్నా..? ఓసారి మీరొచ్చి ఆ బెడ్‌రూమ్‌లో పడుకొని చూపించండి.. అప్పుడు జ‌నం న‌మ్ముతారు.. ఆ సైజ్ బెడ్‌రూమ్ ప‌డుకోవ‌డానికి ప‌నికొస్తుంద‌ని.. అని అంటున్నారు ల‌బ్దిదారులు.  ఇక‌, క‌నీసం హాల్ అయినా విశాలంగా ఉంటుందా? అంటే అదీ లేదు. అస‌లు దాన్ని హాల్ అని ఎందుకు అనాల‌నే డౌట్‌. ఏ యాంగిల్‌లోనూ అది హాల్ సైజులో ఉండ‌దు. చిన్న రూమ్ అంతే. రెండు కుర్చీలు వేస్తే.. ఇక ఖాళీనే ఉంద‌డు. మ‌రీ అంత చిన్న సైజ్ రూమ్ అది. ఇక హాలే అంత చిన్న‌గా ఉంటే.. ఇక కిచెన్ సైజు గురించి చెప్పేదేమున్న‌ది. అందులోకి వ‌న్‌వే ఎంట్రీనే. ఒకేసారి ఇద్ద‌రు పట్ట‌రు అందులో. ఇక బాత్‌రూమ్ అయితే.. లావుగా ఉన్న‌వాళ్లు అందులోకి వెళ్ల‌నే లేరు. ఇలా.. నాలుగు అగ్గిపెట్టె గ‌దుల‌ను క‌ట్టేసి.. దానికి వైసీపీ రంగులు పూసేసి.. ఇదే జ‌గ‌న‌న్న ఇల్లు.. పండ‌గ చేస్కోండి అంటే ఎలా? పేరు గొప్ప.. ఇల్లు దిబ్బలా ఉంది య‌వ్వారం అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  పోనీ, ఆ పిట్ట గూడు ఇళ్లైనా గ‌ట్టిగా క‌డుతున్నారా? అంటే అదీ లేదు. నాణ్య‌త అంతంత మాత్ర‌మే. గ‌ట్టిగా గాలి వీస్తే ఇల్లు ఊగిపోతుందా? కుప్ప కూలిపోతుందా? అనే అనుమానం. ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో వాడే ఇళ్ల నిర్మాణ శైలితో జ‌గ‌న‌న్న ఇల్లు క‌డుతున్నారు. ఇటుక‌లు లేకుండా ప్లాస్టిక్ వేస్టేజ్‌తో గోడ‌లు క‌డుతున్నారు. ఇవి ఇక్క‌డి వెద‌ర్ కండిష‌న్‌కు స‌రిపోవ‌ని నిపుణులు హెచ్చ‌రించినా.. పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. చీప్‌గా వ‌స్తున్నాయ‌నే క‌క్కుర్తితో.. పేద‌లే క‌దా ఉండేది.. మేము కాదుగా అనే చిన్న‌చూపుతో మ‌రీ నాణ్య‌త లేకుండా జ‌గ‌న‌న్న ఇళ్లను క‌డుతున్నారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.      డ‌బ్బులేమ‌న్నా.. జ‌గ‌న్‌రెడ్డి జేబులో నుంచి పెట్టుకుంటున్నారా? కేంద్ర ప్ర‌భుత్వమే క‌దా ఆ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక‌ సాయం చేసేది. కాస్త మంచిగా, నివాస యోగ్యంగా ఇళ్లు క‌డితే జ‌గ‌న్ సొమ్మేమైనా పోతుందా? అంటూ జ‌నాలు మండిప‌డుతున్నారు. సెంటు స్థ‌లంలో ఇల్లేంటంటూ పెద‌వి విరుస్తున్నారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో క‌ట్టిన అపార్ట్‌మెంట్స్‌తో ఇప్ప‌టి జ‌గ‌న‌న్న ఇళ్ల‌ను పోల్చి చూపి.. అస‌హ్యించుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అని అంద‌ల‌మెక్కిస్తే.. మ‌రీ ఇంత‌టి దౌర్భాగ్య పాల‌నా అంటూ త‌మ‌ను తామే నిందించుకుంటున్నారు.  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పేద‌ల కోసం హైటెక్ భ‌వ‌న స‌ముదాయాల‌ను నిర్మించారు. భూకంపం వ‌చ్చినా చెక్కు చెద‌ర‌ని టెక్నాల‌జీతో అపార్ట్‌మెంట్స్ క‌ట్టించారు. వాటిని బ‌య‌టి నుంచి చూస్తేనే.. సూప‌ర్‌గా ఉంటాయి. ఇక లోప‌లికెళితే అవాక్క‌వ్వాల్సిందే. అంత విశాలంగా, ఉన్న‌త ప్ర‌మాణాల‌తో, మోడ్ర‌న్ ఫ్లాట్స్ నిర్మించారు. అంతా రెడీ.. ఇక ప్రారంభోత్స‌వ‌మే మిగిలింది అనుకున్న త‌రుణంలో ప్ర‌భుత్వం మారింది. పేద‌ల నోట్లో మన్నుకొడుతూ.. ఆ అంద‌మైన అపార్ట్‌మెంట్స్‌ను అలానే నిరూప‌యోగంగా వ‌దిలేశారు. ల‌బ్దిదారుల సంతోషాల‌తో సంక్రాంతి పండుగ‌లా క‌ళ‌క‌ళ్లాడాల్సిన ఆ గృహ‌స‌ముదాయాలు.. ఇప్పుడు నిర్మానుష‌మై.. బూజుప‌ట్టి పోయి.. బూత్ బంగ్లాలుగా మార్చిన క‌క్ష సాధింపు ధోర‌ణి సీఎం జ‌గ‌న్‌రెడ్డిదే అంటూ ల‌బ్దిదారులు మండిప‌డుతున్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండుంటే అంత మంచి ఇళ్ల‌ల్లో ఉండాల్సిన వాళ్లం.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లో ఎలాంటి ఇళ్లు ఇస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాడు-నేడు అంటూ అప్ప‌డు చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టిన ఇళ్ల‌ను.. ఇప్పుడు జ‌గ‌న్ క‌డుతున్న ఇళ్ల‌ను కంపేర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులతో పాటు సెటైర్లూ పెడుతున్నారు. ప‌క్కా ఇళ్లు పోయి తొక్క‌లో ఇళ్లు ఇస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌లు అంటున్నార‌ని కాదుగానీ.. ఓసారి మీరు వ‌చ్చి ఆ ఇంట్లో ఓ రోజు కాపురం ఉండండి జ‌గ‌న్‌రెడ్డి గారు.. అప్పుడు తెలుస్తుంది మీరు క‌ట్టిస్తున్న ఇల్లు.. ఉండ‌టానికి ప‌నికొస్తుందో లేదో... అంటూ కామెంట్ల‌తో  కాక పుట్టిస్తున్నారు.   

కొవిడ్ టీకాకు కులం రంగు పూసిన చెత్త సీఎం.. సాధన దీక్షలో చంద్రబాబు ఉగ్రరూపం..

తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.  ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్‌కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయని అన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్‌ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లు కోరిన విద్యార్థులపై అత్యాచారం కేసులు పెట్టారని, అసలు అత్యాచార నిందితుల్ని పట్టుకోలేక ప్రశ్నించేవారిపై అత్యాచారం కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. చేతనైతే పేదల్ని ఆదుకోవాలన్నారు. తప్పుడు కేసులు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ హయాంలో తాను ఇలానే తప్పుడు కేసులు పెట్టి ఉంటే వైసీపీలో ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చే వారు కాదని చంద్రబాబు అన్నారు.  కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని హెచ్చరిoచినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండవాదం చేశారని, 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని, తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని విమర్శించారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో సీఎం జగన్ తోక జాడించారని చంద్రబాబు అన్నారు.కరోనాకు వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్‌కు కులం రంగు పూయటం నాగరికతా? అలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ ముఖ్యమంత్రికి బుద్ది ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో అటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు, హమాలీలు పనిలేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పరామర్శించే వారు లేరని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు.  సీఎం జగన్  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లు పెట్టారని.. ఇది మంచి ఉద్దేశంతో పెట్టారని, దీన్ని తీసేయడం సరికాదని సీఎం స్టాలిన్ అన్నారని కొనియాడారు. అమ్మ క్యాంటిన్‌లో జయలలిత ఫోటో పెట్టి కొనసాగిస్తున్నారని అది రాజకీయ సంస్కృతికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.మంగళవారం సాధన దీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ సంక్షోభాలకు తానెప్పుడూ భయపడనన్నారు. సమాజాన్ని కాపాడాలనే  ఏకైక ధ్యేయం తనదని స్పష్టం చేశారు. ఆదాయాలు కోల్పోతున్న ప్రజానీకానికి కొనుగోలు శక్తి పెంచకుండా ఇంకా లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు, కార్మికులు, టీచర్లు ఇలా అనేక రంగాల వారు పనిలేకుండా అవస్థలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

యూపీలో నాలుగు స్తంభాలాట..

భారతీయ జనతా పార్టీ, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి, ప్రధానిగా ప్రమాణ స్వీకారం  చేస్తారా? కొవిడ్ సృష్టించిన కల్లోలం నేపధ్యంలో ఈ ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్’లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎప్పుడో  మూడేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, అప్పటి ఏన్నికలపై ఇప్పటి కొవిడ్  ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించడం కొంచెం చాలా కష్టం, రిస్కీ వ్యవహారం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, మరో ఎనిమిది నెలల్లో జరిగే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించగలిగితే, 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అందుకే ఇప్పుడు అందరి దృష్టి యూపీ ఎన్నికలపై ఫోకస్ అయింది.    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఇంటా బయటా కూడా సవాళ్ళను ఎదుర్కుంటున్నారు.  కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభుత్వ ఇమేజిని బాగా డ్యామేజి చేసింది. ముఖ్యమంత్రి ఇమేజి కూడా మసక బారిపోయింది.  కొవిడ్ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, గంగలో తేలిన శవాలు చెప్పకనే చెప్పాయి. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రేపటి ఎన్నికలపై కొవిడ్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా రుచి చూపించాయి. ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దిద్దుబాటు చర్యలు తీసుకున్నా,అవి ఎంతవరకు పనిచేశాయి, ఫలితాలు ఎలా ఉంటాయి  అనేది, ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు.  సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అతివిశ్వాసం, విపక్షాల అనైక్యత బీజేపీకి కలిసిరావచ్చని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాల ఆధారంగా  అఖిలేష్ యాదవ్ ఒక్క సారిగా గుర్రం ఎక్కి కూర్చున్నారు. కాంగ్రెస్, బీస్పీ సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఎస్పీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఇతర నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో, వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే యూపీ  అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ/ చతుర్ముఖ పోటీ తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రతిపక్షాల మధ్య నెలకొన్న అనైక్యత కారణంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ మరోమారు ఆ రాష్ట్రంలో అధికారాన్ని  హస్తగతం చేస్కోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత (2019) లోక్ సభ ఎన్నికలలో ఎస్పీ, బీస్పీ కూటమిగా పోటీచేశాయి. అయితే, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని ఎస్పీ చీఫ్ అఖిలేష్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి, ప్రకటించారు. అలాగే, 2017 అసెంబ్లీ ఎన్నికలలో కలసి పోటీ చేసిన సమాజవాద్ పార్టీ, కాంగ్రెస్ కూడా తాజాగా తలాక్ చెప్పేసుకున్నాయి. నిజానికి లోక్ సభ ఎన్నికలలో పరాజయం అనంతరం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ డీలాపడిపోయాయి. అయితే, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు విపక్షాలలో, ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో కొత్త ఆశలు నింపాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలో, యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖపూర్ ప్రాంతంలో బిజెపి వెనుకబడి ఉండడంతో ఫస్ట్ ప్లేసులో నిలిచిన  ఎస్పీ రాష్ట్రంలో ఇక అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ఈ నేపధ్యంగానే అఖిలేష్  యాదవ్, సింహం సింగిల్ గానే  వస్తుందన్న స్టైల్లో ఒంటరి పోరుకు సిద్దమవున్నారు.  కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడంపై బీజేపీలోని కొన్ని  వర్గాలే ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, నాయకత్వం మార్పు అనే ఊహాగానాలు షికార్లు  చేయడం, బిజెపి అధిష్ఠానం కూడా రాష్ట్రంలోని పరిస్తితులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో `ప్రభుత్వ వ్యతిరేకత’తో ఆదిత్యనాథ్ ప్రభుత్వంను ఓడించవచ్చని అఖిలేష్ భావిస్తున్నారు. అయితే, దిద్దుబాటు చర్యల్లో భాగంగా అంతర్గత విబేధాలను ప్రిష్కరించుకుంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నామని  ప్రతి అగ్ర నేతలు నిర్ణయించారు. పార్టీలోని వారంతా ఇప్పుడు ఒకే మాటతో ఆయన నాయకత్వంలో ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. బిజెపి నాయకత్వంలో కనిపిస్తున్న ధీమాతో పాటు, ప్రతిపక్షాలలో ఏర్పడిన చీలిక కారణంగా ఆదిత్యనాథ్ మరోమారు గెలుపొందడం తధ్యం అనే అంచనాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. మాయావతి మరో గత్యంతరం లేక ఒంటరిగా పోటీ చేస్తున్నా ఆమె ప్రధానంగా ముస్లిం ఓట్లపై కన్నేశారు. వారు మద్దతు ఇస్తే బిజెపిని ఓడిస్తామని బహిరంగంగా ఆమె ప్రకటించారు.  మరో వంక కాంగ్రెస్, ఎస్పీ, బీస్పీ పార్టీల మధ్య ముస్లిం ఓటు చీలిపోతే అది అల్టిమేట్’గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందాని పరిశీలకులు పేర్కొన్నారు. అయితే, ఆ ముగ్గురే కాకుండా నాలుగో భాగస్వామి, ముస్లిం ఓటు హక్కు దారు  ఎంఐఎం 100 సీట్లలో పోటీకి సిద్దమవుతోంది. అదే జరిగితే, బీజేపీ మరో మారు అధికారంలోకి వస్తుందని ఒక అంచనాకు రావచ్చని రాజకీయ పండితులు చెపుతున్నారు. అలాగే  యూపీలో గెలిస్తే, ఆ ప్రభావంతో ఆ తర్వాత రెండేళ్లకు జరిగే లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీ హట్రిక్ సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే, ఇందులో చాలా అయితే గియితే (ఇఫ్స్ అండ్ బట్స్) ఉన్నాయి. ఇప్పటికైతే, యూపీలో చతుర్ముఖ పోరు తధ్యంగా కనిపిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందో.. అప్పుడే చెప్పేలా  లేదు.

మురుగునీటితో కేటీఆర్ కు సన్మానం! మూసీలో నిలబెట్టాలన్న రేవంత్..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో గెలిచిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పని తీరు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఎంపీ రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ చెత్త నగరంగా మారిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. 16 నివాసయోగ్యమైన పట్టణాల గుర్తింపులో హైదరాబాద్‌కు స్థానం  రాలేదంటే ఎంత చెత్తగా కేటీఆర్ పరిపాలన ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ముంబైలో జరిగిన అంశాన్ని ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఓ కాంట్రాక్టరు మోరీలలో చెత్త తీయకపోవడంతో మొత్తం మురుగు నీరు, చెత్త రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆ మురుగునీటిలో కూర్చోబెట్టి, అతనిపై చెత్త వేయించారని చెప్పారు. ఆ విధంగా మంత్రి కేటీఆర్‌కు సన్మానం చేయాలని ఉందని రేవంత్ అన్నారు. అయితే మంత్రి భద్రత మధ్య ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నామన్నారు రేవంత్.   మంత్రి కేటీఆర్‌ను మూసీలో నడుమలోతులో 4 గంటలు ఉంచితే అప్పుడు పేద ప్రజల సమస్యలు అర్ధమవుతాయన్నారు రేవంత్ రెడ్డి. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలున్నాయని విమర్శించారు. హైదరాబాద్ పూర్తిగా చెత్త నగరంగా మారిందని దీనిపైన, నగరంలో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.   హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయ అన్నారు రేవంత్ రెడ్డి. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితం ఉంటుందన్నారు. అన్ని రకాల ట్యాక్స్‌లు పెంచారని... 800 కోట్లతో వరద నివారణ చర్యలు చేస్తామని.. పట్టించుకోలేదని అన్నారు. నాలాలు, చెరువులు కబ్జా చేసుకున్నాక చర్యలు అంటున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక మాఫియాగా ఏర్పడ్డారన్నారు. సీసీ కెమెరాలను నాలాలు, చెరువలు, కబ్జాల ప్రాంతాల్లో పెట్టమని చెప్పామని... అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాఫియాకు అనుకూలంగా ఉండేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం లేదని విమర్శించారు. లింగోజిగూడ కార్పొరేటర్ ప్రమాణ స్వీకరానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 

జీస‌స్ కాలింగ్‌.. వైఎస్సార్‌తో మీటింగ్‌.. జ‌గ‌న్ మెంట‌ల్ కేసా?

దేవుడు క‌ల్లో క‌నిపిస్తే అది భ‌క్తి. చ‌నిపోయిన వాళ్లు క‌ల్లోకి వ‌స్తే అది ప్రేమ‌. ఆ ఇద్ద‌రూ ప్ర‌తీరోజు అలారం పెట్టుకొని మ‌రీ రాత్రి 12 గంట‌ల‌కు బ‌తికి ఉన్న‌వారితో మాట్లాడితే..? అది పిచ్చి.. అని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదేమో. మాన‌సిక ఆరోగ్యం బాగా దెబ్బ తిన్న వారికే అలా జ‌రుగుతుంది. ఇంత‌కీ చ‌నిపోయిన వాళ్లు క‌నిపిస్తే ఆత్మ అనాలా?  దెయ్యం అనాలా? అనే డౌటూ మ‌రోవైపు. ఇక దేవుడు ఆయ‌న‌తో మాట్లాడుతున్నాడంటే.. మ‌తిభ్ర‌మించింద‌ని అనుకోవాలా? లేక‌, అప‌రిచితుడిగా భావించాలా? ఇలాంటి చేష్ట‌లు, అలాంటి మాట‌లు.. బ‌య‌ట ఎవ‌రైనా మాట్లాడితే.. వాడికి దెయ్యం ప‌ట్టిందిరా అని భూత‌వైద్యుడికి చూపిస్తారు. వేప మండ‌ల‌తో నాలుగు గ‌ట్టిగా త‌గిలిస్తే.. మ‌రో నాలుగు చెప్పు దెబ్బ‌లు వేస్తే.. దెబ్బ‌కు ప‌ట్టిన దెయ్యం వ‌దిలిపోతుంది. అంతేకానీ, త‌న‌తో దేవుడు మాట్లాడుతాడ‌ని కానీ, త‌న‌తో చ‌నిపోయిన త‌న తండ్రి డైలీ మిడ్‌నైట్ డిస్క‌ష‌న్స్ పెడ‌తాడ‌ని గానీ బ‌య‌ట ఎవ‌రైనా ఎవ‌రితోనైనా చెబితే.. వాడికి పిచ్చిప‌ట్టిందిరా బాబోయ్ అంటూ మ‌ళ్లీ అత‌నివైపు ఎవ‌రూ క‌న్నెత్తి కూడా చూడ‌రు.  కానీ, ఏపీలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు.. ఆ పిచ్చిప‌ట్టిన లాంటి చేష్ట‌లు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డే చేస్తే...? వామ్మో.. ఊహించుకోడానికే ఆదోలా ఉంది. కానీ, ఇది నిజ‌మంటూ.. వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌తిరోజూ రాత్రి త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో మాట్లాడ‌తారంటూ.. ఈ విష‌యం సీఎం జ‌గ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. న‌మ్మ‌ద‌గ్గ స‌మాచారం ప్ర‌చారంలో ఉంది. కేవ‌లం వైఎస్సార్‌తోనే కాదు.. దేవుడి బిడ్డ అయిన జగ‌న్‌.. జీస‌స్ త‌న‌తో మాట్లాడ‌తాడ‌ని ముఖ్య‌మంత్రే చెప్పిన‌ట్టు అధికార వ‌ర్గంలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు విష‌యాల గురించి ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత బ‌య‌ట పెట్ట‌డంతో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అస‌లేమైంది..? ఆయ‌న మాన‌సిక ఆరోగ్యం ఎలా ఉంద‌నే అనుమానం, చ‌ర్చ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.  ఏపీలో ఇప్పుడు ఏ న‌లుగురు క‌లుసుకున్నా ఇదే చ‌ర్చ‌. నీకు తెలుసా.. జ‌గ‌న్‌తో వైఎస్సార్ రోజూ మాట్లాడ‌తార‌ట‌..! నీకు తెలుసా.. జీస‌స్ క్రైస్ట్ జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉంటార‌ట‌.. అంటూ హాట్ హాట్ డిబేట్‌లు జ‌రుగుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలోనైతే.. సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయ్‌. ఆ మీడియాలో ఈ వార్త వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇటు ఏపీలో, అటు సోష‌ల్ మీడియాలో.. జ‌గ‌న్‌పై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ ఫెస్టివ‌ల్ న‌డుస్తోంది. ఇన్నాళ్లూ క‌రోనాతో క‌ష్టాలు, బాధ‌లు మాత్ర‌మే చూసిన జ‌నాలు.. ఈ విష‌యం తెలిసి పొట్ట‌ప‌గిలేలా న‌వ్వుకుంటున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఇంత‌టి కామెడీ ఎపిసోడ్ వింటున్నామ‌ని.. న‌వ్వాపుకోలేక పోతున్నామంటూ పండ‌గ చేసుకుంటున్నారు. ఇంత‌కీ ఆ మీడియా అధినేత జ‌గ‌న్ గురించి ఏం చెప్పారంటే..... ఇదీ మేట‌ర్‌. 40ఇయ‌ర్స్ మీడియా ఇండ‌స్ట్రీ పెద్దాయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు ఊరికే చేయ‌రు. ఇందులో నూటికి నూరు శాతం నిజం ఉండే ఉంటుంది. అందుకే, ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలోనైతే జ‌గ‌న్‌ను కుమ్మేసుకుంటున్నారు. ఏంటి జ‌గ‌న‌న్న‌.. మీరు ఆ రాత్రి జీస‌స్‌తో మాట్లాడారా? అస‌లు వైర‌స్ లేదూ ఏమీ లేదు.. భ‌య‌ప‌డొద్దు అని జీస‌స్ మీతో చెప్పారా? అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. మీరెంత క‌రుడుగ‌ట్టిన క్రిష్టియ‌న్ అయినా.. ఏటేటా జెరుస‌లేం వెళ్లినా.. మ‌రీ ఇంత‌గా పిచ్చి పీక్స్‌కు చేరడ‌మేంట‌ని అవాక్క‌వుతున్నారు. మీ జీస‌స్ క‌రోనా లేద‌ని చెప్పారుగా.. మ‌రి ఈ కేసులు ఏంటి? ఈ చావులేంటి? ఏపీలో ఈ క‌రోనా క‌ల్లోలమేంటి? అంటే, మీ జీస‌స్ త‌ప్పు చెప్పారా? లేక‌, మీరు అబ‌ద్దం చెప్పారా? లేక‌, జీస‌స్ మీతో చెప్పినట్టు మీరే భ్ర‌మ ప‌డ్డారా?  ఇంత‌కీ మీ మెంట‌ల్ కండీష‌న్ ఓకేనా..? అంటూ సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌ను ఏకిపారేస్తున్నారు. మ‌రికొంద‌రైతే, ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. బాబ్బాబు.. మా ఇంట్లో కోడి క‌నిపించ‌డం లేదు.. అది ఎక్క‌డికెళ్లిందో కాస్త జీస‌స్‌ను అడిగి చెప్పండి ప్లీజ్ అంటూ ర‌క‌ర‌కాల ఫ‌న్నీ కామెంట్స్‌తో జ‌గ‌న్‌ను కుళ్ల‌బొడుస్తున్నారు నెటిజ‌న్స్‌.  ఇక ప్ర‌తీరోజూ రాత్రి 12 గంట‌ల‌కు దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో చ‌ర్చిస్తానంటూ జ‌గ‌న్ చెప్పార‌నే వార్త‌పైనా నెటిజ‌న్లు ఆటాడుకుంటున్నారు. ఈ రాత్రి వైఎస్సార్‌తో డిష్క‌స్ చేసేట‌ప్పుడు.. మీ బాబాయ్‌, వైఎస్సార్ త‌మ్ముడు.. వివేకానంద‌రెడ్డిని ఎవ‌రు చంపారో అడ‌గాలంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం రాలేదు.. ఎప్పుడు వ‌స్తుందో ఆ వైఎస్సార్‌నే అడిగి చెప్పండంటూ ఇంకో సెటైర్‌. ఇలా.. మూడు రోజులుగా ఏపీలో ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. కామెడీ ర‌చ్చ‌.  గ‌తంలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ ఆరోపించిన‌ట్టు సీఎం జ‌గ‌న్ మెంట‌ల్ కండిష‌న్ బాగానే ఉందా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ఇప్ప‌టికే జ‌గ‌న్ మాన‌సిక ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున‌ ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అన‌ర్హుడంటూ కోర్టును సైతం ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. జ‌గ‌న్ జీస‌స్‌తో, దివంగ‌త వైఎస్సార్‌తో మాట్లాడుతార‌నే అంశానికి సాక్షం ఉంటే బాగుండేద‌ని.. ర‌ఘురామ‌కు బాగా ఉప‌యోగ‌ప‌డేద‌ని అంటున్నారు. ఏదిఏమైనా.. ఆ దేవుడి ద‌య‌.. చ‌ల్ల‌ని చూపు.. ఆ మ‌హానేత ఆశీస్సుల‌తో.. ఆ మీడియా అధినేత బ‌య‌ట‌పెట్టిన ఈ ర‌హ‌స్యంతో జ‌గ‌న్ మాన‌సిక వైఖ‌రిపై ప్ర‌జ‌ల్లో అనుమానంతో పాటు భ‌యాందోళ‌న కూడా వ్య‌క్తం అవుతోంది. వాడిన‌లా వ‌దిలేయ‌కండ్రా.. వాడినెవ‌రిక‌న్నా చూపించండ్రా.. అంటూ సెటైర్లు పేలుతున్నాయి.   

యాప్ లక్ష.. యాడ్స్ కోట్లు! జగన్ సర్కార్ మరో వింత..  

అందరిది ఒకదారి.. ఉలిపిరికట్టది మరో దారి అన్నట్లుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన ఉందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ మొదలు... మూడు రాజధానులు, కొవిడ్ , వ్యాక్సినేషన్, పరీక్షలు, ఎన్నికలు.. ఇలా అన్ని విషయాల్లోనూ అన్ని రాష్ట్రాలు ఒకలా వ్యవహరిస్తే ఏపీ సర్కార్ మరోలా ముందుకు వెళ్లింది. జగన్ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. న్యాయ స్థానాలు ఎన్నో సార్లు మొట్టికాయలు వేశాయి.  ఎన్నోసారు అభాసుపాలైనా జగన్ రెడ్డి సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరో వింత చర్యతో విమర్శల పాలైంది. అసలే రాష్ట్రం అప్పులో ఉంటే.. అది చాలదన్నట్లు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది. ఎవ‌రైనా కోటి రూపాయ‌లు పెట్టి ప‌రిశ్ర‌మ పెడితే దానికి ప్ర‌చార బ‌డ్జెట్ మ‌హా అయితే ఓ ప‌ది ల‌క్షలు పెట్టుకుంటారు. అది కూడా చాలా ఎక్కువే. కానీ ఏపీ స‌ర్కారు మాత్రం  అసలు యాప్ త‌యారీ ఖ‌ర్చు కంటే యాడ్స్ ఖ‌ర్చే ఎక్కువ‌ పెట్టింది. మామూలుగా ఓ మంచి మొబైల్ యాప్ త‌యారీకి ఐదు ల‌క్షల రూపాయ‌ల ఖ‌ర్చు అవుతుంది. కానీ ఏపీ స‌ర్కారు తీసుకొచ్చిన దిశ యాప్ అద్భుతమైన ఫీచ‌ర్ల‌తో..హై ఎండ్ యాప్ అనుకున్నా..  ఈ యాప్ ఖ‌ర్చు 50 ల‌క్షల రూపాయలు దాట‌ద‌ని ఐటి నిపుణుల మాట. కానీ ఏపీ స‌ర్కారు ఈ యాప్ ప్ర‌చారం కోసం కోట్ల రూపాయ‌ల్లో ఖర్చు పెట్టింది.   తెలుగు, ఇంగ్లీష్ ప‌త్రిక‌ల్లో దిశ యాప్ పేరుతో జాకెట్ యాడ్స్ పండ‌గ చేసింది జగన్ రెడ్డి సర్కార్. ఈ యాడ్స్ ఖ‌ర్చు త‌క్కువ‌లో త‌క్కువ ఐదారు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుందని చెబుతున్నారు. అంటే 50 ల‌క్షల నుంచి కోటి రూపాయ‌లతో త‌యారు చేసిన యాప్ ప్ర‌చారం కోసం ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు వ్య‌యం చేశారన్నమాట. బ‌హుశా ఇలాంటి వింత సంఘ‌టనలు ఏపీలో మాత్ర‌మే సాధ్యమవుతాయనే విమర్శలు వస్తున్నాయి. దిశ యాప్ అనేది మ‌హిళ‌ల‌కు ర‌క్షణ కోసం ఉద్దేశించింది. ఇది ప్ర‌జ‌ల‌కు..మ‌హిళ‌ల‌కు ప‌నికొచ్చేది కాబ‌ట్టి మీడియా కూడా స‌హ‌జంగా ప్ర‌చారం క‌ల్పిస్తుంది. యాప్ కు విధిగా క‌వ‌రేజ్ ఇవ్వాల‌ని కూడా ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ ఏపీ సర్కార్ మాత్రం అడ్డగోలుగా యాడ్స్ ఇచ్చి ఖజానాను దుబారా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.  గ‌త కొన్ని నెల‌ల తీరు చూస్తుంటే ఇలా నెల‌కు ఓ రెండు యాడ్స్ అయినా ఉండేలా ప‌క్కాగా ప్లాన్ చేసిన‌ట్లే క‌న్పిస్తోంది. ఏదో ఒక కార్య‌క్ర‌మం విడ‌త‌ల వారీగా నిర్వ‌హించ‌టం..విడ‌త విడ‌త‌కూ యాడ్స్ ఇవ్వ‌టం ఏపీ స‌ర్కారుకు నిత్య కార్య‌క్ర‌మంగామారిందనే విమర్శలు వస్తు్ననాయి. మ‌రో వైపు ల‌క్షల రూపాయ‌ల ద‌గ్గ‌ర నుంచి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ స‌ర్కారు ప‌నులు చేసిన వారు బిల్లులు రాక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. స్వ‌యంగా ఈ మ‌ధ్యే స‌ర్కారు బిల్లులు చెల్లించేందుకు డ‌బ్బులు లేవ‌ని కోర్టుకు తెలిపింది. అయినా స‌రే యాడ్స్ మాత్రం ఆప‌టం లేదు జగన్ రెడ్డి సర్కార్.  సీఎం జ‌గ‌న్‌, దిశ యాప్ యాడ్స్ పై టీడీపీ నేత‌ నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు ఉన్నాయ‌ని, మ‌హిళ‌ల‌కు ఏపీలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. 'శ‌వాల‌పై పేలాలు ఏరుకునేవారిని త‌ల‌ద‌న్నుతూ అత్యాచారాల‌పైనా కోట్లు దండుకుంటున్నారు జ‌గ‌న్‌రెడ్డి. త‌న‌ ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్ జ‌రిగి 10 రోజుల‌వుతున్నా నిందితుల్ని ప‌ట్టుకోని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంత‌ప‌త్రిక‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లిచ్చారు' అని లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. సొంత అక్కాచెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌ల‌కే భ‌ద్ర‌త‌లేక ఒక‌రు తెలంగాణ‌లో, ఇంకొక‌రు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. `అక్కచెల్లెమ్మ‌ల భ‌ద్ర‌త‌-జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ బాధ్య‌త‌` అంటూ ఎందుకీ క‌ప‌ట ప్ర‌క‌ట‌న‌లు జ‌గ‌న్‌రెడ్డీ? అని లోకేశ్ ప్రశ్నించారు. 'మీ ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్ జ‌రిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే ప‌ట్టుకోలేని చేత‌గాని ద‌ద్ద‌మ్మ ముఖ్య‌మంత్రీ.. క‌రోనా బాధితుల డిమాండ్ల సాధ‌న‌కు చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకు, 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్‌కే మరోసారి డౌన్ లోడ్ కార్య‌క్ర‌మ‌మా?' అని లోకేశ్ ప్ర‌శ్నించారు. 

'మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ'! జగన్ పై రఘురామ సెటైర్లు.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో  కొన్ని రోజులుగా ఆయన వరుసగా లేఖ‌లు రాస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఆయన రియాక్ట్ అవుతున్నారు. ఈ సారి జగన్  రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఏపీ హౌజింగ్ స్కీమ్ పై స్పందించారు. రాష్ట్రంలో 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత నాసిరకంగా ఉందన్నారు.  ఒకసారి ఇళ్లను నిర్మించే ప్రదేశానికి వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్‌ను కోరుతున్నానని లేఖలో చెప్పారు ఎంపీ రఘురామ రాజు.  ఏపీలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్ర‌ణాళిక‌లు వేశార‌ని లేఖలో ర‌ఘురామ‌ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్ర‌భుత్వం.. తర్వాత అంచాను రూ.70,000 కోట్లకు పెంచింద‌ని చెప్పారు. మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నామంటూ వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ని రఘురామ రాజు ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల చిత్రంలోని 'మా చెల్లి పెళ్లి...జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోందని ఎంపీ రఘురామ రాజు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్ప‌టికైనా ఇటువంటి చ‌ర్య‌లు మానుకోవాల‌ని ర‌ఘురామ సూచించారు. పేద‌వారికి ఇళ్లు ఇచ్చే విష‌యంలో స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.