వరదల్లో మంత్రి.. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ

ఉత్తర భారతంలో వానలు దంచి కొడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి.కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల గ్రామాలకు గ్రామాలే జలమయమయ్యాయి. దాతియా జిల్లాలో వందలాది గ్రామాలను వరద ముంచెత్తింది. రెండు బ్రిడ్జీలు వరదల ధాటికి పూర్తిగా కూలిపోవడంతో చాలా గ్రామాలకు.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  దాతియా జిల్లాకే చెందిన హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. వరద నీటిలోనే మంత్రి చిక్కుకుపోయారు.వరద బాధితులను రక్షించేందుకు హోంశాఖ మంత్రి బోటులో వెళ్తుండగా..  దగ్గరలోని ఓ చెట్టు ఆ బోటుపై పడడంతో అది ఆగిపోయింది. అప్పటికే ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆ ఇంటివారంతా ఇంటి రూఫ్ పైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అతి కష్టం మీద నరోత్తం మిశ్రా కూడా ఆ ఇంటిని చేరారు. అయితే చుట్టూ నీరు ప్రవహిస్తుండడంతో ఆయన కూడా వారితో బాటు ఆ ఇంటిపైనే చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లే దారి లేక ఆయన అధికారులకు ఫోన్ లో సమాచారమిచ్చారు. దీంతో మంత్రిని రెస్క్టూ చేసేందుకు అధికారులు ఆర్మీ సాయం కోరారు. వైమానిక దళాన్ని సంప్రదించి ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్ పంపారు జిల్లా అధికారులు. అందులోని సిబ్బంది హెలికాఫ్టర్ నుంచి తాడును కిందికి వదలడంతో దాన్ని పట్టుకుని మంత్రి పైకి చేరగలిగారు. ఇతర సహాయక సిబ్బందిని, బాధితులను కూడా ఇలాగే సిబ్బంది రక్షించారు. తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలను విజిట్ చేసి మిశ్రా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని.. అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి నరోత్తం మిశ్రా చర్యను కాంగ్రెస్ పార్టీ ఓ స్టంట్ గా అభివర్ణించింది. ఏదో చేయాలనుకుంటే.. ఏదో జరిగిందంటూ సెటైర్లు వేశారు. 

4 ద‌శాబ్దాల స్వ‌ప్నం.. హాకీలో ఒలింపిక్ ప‌త‌కం.. చెక్‌దే ఇండియా..

భార‌త జాతీయ క్రీడ ఏంటి? నేటి యువ‌త క్రికెట్ అనుకుంటారేమో. హాకీ అని ఎంత మందికి తెలుసు? అలాంటి జాతీయ క్రీడ‌ను క్రికెట్ పూర్తిగా స్వాహా చేసేసింది. దేశంలో హాకీ ప్రాభ‌వం క‌నుమ‌రుగైంది. ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో హాకీపై ఆస‌క్తి క‌న‌బ‌రిచే వాళ్ల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. నాణ్య‌మైన కోచింగ్ సైతం అందుబాటులో ఉండ‌దు. పంజాబ్ రాష్ట్రం పుణ్యమా అని హాకీ అంతోఇంతో బ‌తికే ఉంది. 41 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో మ‌నోళ్లు నిరాశే మిగిలిస్తున్నారు. అలాంటిది.. ఫినిక్స్ ప‌క్షిలా టోక్యో ఒలింపిక్స్‌లో దుమ్మురేపుతూ.. హాకీలో ఇండియా స‌త్తా ఏంటో చాటుతూ.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. కాంస్య ప‌త‌కంతో క‌నువిందు క‌లిగించారు. పున‌ర్‌వైభ‌వం దిశ‌గా.. భార‌త‌మాత‌ మెడ‌ను బ్రాంజ్‌ మెడ‌ల్‌తో అలంక‌రించారు.  4 ద‌శాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది హాకీ ఇండియా. ఉత్కంఠ‌భ‌రితంగా జర్మనీతో జరిగిన కాంస్య పోరులో అద్భుత‌ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. ఇండియా త‌ర‌ఫున సిమ్రన్‌ జీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌ పాల్‌ సింగ్‌ గోల్స్‌ చేశారు.  స్వర్ణం చేజారింద‌నే బాధ‌తో బ‌రిలో దిగిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ గోల్ కొట్టి భార‌త్‌పై ఒత్తిడి పెంచింది. రెండో క్వార్ట‌ర్‌లో భార‌త్ రెచ్చిపోయింది. ఏకంగా మూడు గోల్స్ చేసింది. ఇండియా ఆట‌గాళ్ల పొర‌బాట్ల వ‌ల్ల జ‌ర్మ‌నీకి సైతం గోల్స్ వ‌చ్చాయి. ఆట ముగిసే స‌రికి 5-4 తేడాతో హాకీ ఇండియాదే విజ‌యం. 41 ఏళ్ల త‌ర్వాత చ‌రిత్ర‌లో నిలిచేలా ఒలింపిక్స్ కాంస్య‌ ప‌త‌కం. క‌నీసం ఒలింపిక్స్ మెడ‌ల్ సాధించాకైనా.. ఇండియాలో జాతీయ క్రీడ‌కు పున‌ర్‌వైభ‌వం సాధ్య‌మేనా? క్రికెట్ క్రేజ్‌ను త‌ట్టుకుని హాకీ నిల‌బ‌డ‌గ‌ల‌దా? 

లోక్ సభలో రఘురామ రాజే టాప్.. వైసీపీ ఎంపీలు తుస్..

పార్లమెంట్ సభ్యులు ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తుంటారు. ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిద్యం వహించే ఎంపీలు.. ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతారు. కేంద్ర సర్కార్ సాయం కోరుతుంటారు. తమ వాగ్దాటితో కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు సభల్లో జరిగే కీలక చర్చల్లో పాల్గొని తమ పార్టీ వాయిస్ , తమ వాయిస్ వినిపిస్తుంటారు. అయితే పార్లమెంట్ లో కొందరు ఎంపీలు యాక్టివ్ రోల్ పోషిస్తుండగా.. మరికొందరు మాత్రం మొక్కుబడిగా వెళ్లి వస్తున్నారు. ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్లుగానే కొందరు వ్యవహరిస్తుంటారు. కొందరు ఎంపీలైతే సభలకు కూడా డుమ్మా కొడుతుంటారు. లోక్ సభ సభ్యుల పనితీరుకు సంబంధించి తాజాగా ఓ సంస్థ అధ్యయనం చేసింది.  పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు సంబంధించి సంచలన అంశాలు వెలుగులోనికి వచ్చాయి. పార్లమెంట్ అధికారిక సమాచారాన్ని అసరాగా చేసుకొని ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో కొందరు ఏపీ ఎంపీల పనితీరు చాలా దారుణంగా ఉంది. కొందరైతే అసలు సభలకే వెళ్లడం లేదు. మరికొందరు సభకు వెళ్తున్నా.. సైలెంటుగా కూర్చుని వస్తున్నారు. అధికార వైసీపీ ఎంపీల పనితీరు చాలా దారుణంగా కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. లోక్ సభ హాజరు విషయంలో చివరి స్థానంలో నిలిచారు.  కడప ఎంపీ హాజరుశాతం కేవలం 32 శాతంగా ఉంది.  వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు హాజరు విషయంలో టాప్ లో నిలిచారు. రఘురామ లోక్ సభ హాజరు 96 శాతంగా ఉంది. లోక్ సభలో ఎంపీ రఘురామ రాజు ఇప్పటివరకు మొత్తం 50 డిబేట్లలో పాల్గొనటంతో పాటు.. 145 ప్రశ్నల్ని అడిగారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు తక్కువగా ఉన్నప్పటికి.. సభకు హాజరైన సమయంలో ఆయన ఉత్సాహంగా ప్రశ్నలు వేస్తున్నట్లు నివేదికలో తేలింది. అవినాష్ రెడ్డి ఇప్పటివరకు  146 ప్రశ్నల్ని సంధించారు. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్  హాజరు 89 శాతం ఉంటే.. 54 డిబేట్లలో పాల్గొని మొత్త 133 ప్రశ్నల్ని వేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని  హాజరు విషయంలో గల్లా జయదేవ్ కు సమానంగా ఉన్నారు. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో మరో ఆసక్తికర అంశం బయటికొచ్చింది. హాజరు విషయంలో అంతంతమాత్రంగానే ఉన్న నందిగం సురేష్.. సభకు హాజరైన రోజుల్లోనూ సైలెంటుగా కూర్చుని వెళుతున్నారు. ఆయన ఇప్పటివరకు లోక్ సభలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడగని ఘనత సాధించారు. ఒక్క డిబేట్ లోనూ నందిగం సురేష్ పాల్గొనలేదు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రతిపక్ష టీడీపీ ఎంపీల పనితీరు కొంత బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీల తీరు మాత్రం దారుణంగా ఉంది. లోక్ సభ సభ్యుల పదవీకాలం ఇప్పటికే సగం పూర్తైంది. ఇకనైనా ఎంపీలు మేల్కొని లోక్ సభలో ప్రజా సమస్యలకు లెవనెత్తితే బాగుంటుందని ఏపీ జనాలు కోరుకుంటున్నారు.

ఊడిపోయిన పులిచింతల గేటు.. కృష్ణా జిల్లాలో ముంపు భయం 

నిండుకుండలా ఉన్న పులిచింతల ప్రాజెక్టు దగ్గర అనూహ్య ఘటన జరిగింది. ప్రాజెక్టు ఒక గేటు ఊడిపోయింది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసే క్రమంలో  ఊడిపోయింది 16 నంబర్ గేటు. దీంతో ఆ గేటు ద్వారా భారీగా నీరు దిగువకు వెళుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1 లక్ష క్యూసెక్కులు ఉండగా..  అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో  గేటు ఊడిపోయింది. దీని ఫలితంగా మరో 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా దిగువకు వెళుతోందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ప్రాజెక్టు దగ్గరకు చెరుకున్న ఇరిగేషన్ అధికారులు ఎమర్జెన్సీ గేటును బిగిస్తున్నారు. మధ్యాహ్నానికి గేటు బిగించడం పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద‌ ఉధృతి పెరుగుతోంది. కృష్ణా , గుంటూరు జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ నది దాటే ప్రయత్నం చేయవద్దని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. పులిచింతల ప్రాజెక్టులో  ప్రస్తుతం గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో  నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి ప‌రిస్థితిని పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జ‌రిపారు.  స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌ని కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ చెప్పారు. పులిచింత‌ల డ్యామ్ గేటు ఊడిపోవ‌డంతో కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

పోలీస్ + క్రిమినల్ + పొలిటీషియన్ = మాధవ్! 

పోలీస్ అయితే ఒక రకంగా వార్నింగ్ ఇస్తారు..క్రిమినల్ అయితే ఇంకో రకంగా వార్నింగ్ ఇస్తారు.. ఎంపీ అయితే మరో రకంగా వార్నింగ్ ఇస్తారు..కాని మూడూ అయితే.. ఆ రేంజే వేరుగా ఉంటుంది. హిందూపురం ఎంపీ మాధవ్ పోలీసుగా పనిచేశారు... ఆయనపై ఒక రేప్ కేసు, ఒక మర్డర్ కేసు ఉన్నాయి.. ఆయన వచ్చి నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణ రాజును మళ్లీ టీవీ ముందుకొచ్చి మాట్లాడావంటే నీ అంతు చూస్తా అన్నాడంట. ఆ పెద్దమనిషి పైన కేసులున్న సంగతి చాలామందికి తెలియదు. అసలాయన 2014లో జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలి తిప్పి మాట్లాడినప్పుడే డౌట్ రావాల్సింది. అప్పుడు అది ఆయన పౌరుషం అనుకున్నారు. కాని తర్వాతే అర్ధమైంది.. బాస్ యాటిట్యూడే అదని. అందరికంటే పాపం కియో మోటార్స్ మేనేజ్ మెంట్ ని అడిగితే ఇంకా బాగా చెబుతారు సార్ గురించి.. సార్ వార్నింగుల గురించి. ఏకంగా సీఎం హాజరైన ప్రోగ్రామ్ లోనే .. ఆయనుండగానే బెదిరించాడంటే.. బాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవాలి.అలాంటోడు మరి పార్లమెంట్ లోనే రఘురామకు వార్నింగ్ ఇచ్చాడంటే .. మాధవ్ బ్యాక్ గ్రౌండ్ తెలిసినోడు ఎవడూ ఆశ్చర్యపోడు. అసలు రేప్, మర్డర్ కేసులు జేసీ బ్రదర్స్ తో గొడవైతే పెట్టించారని కొంతమంది వైసీపీ సోషల్ మీడియాకార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేసులు ఆయన కర్నూలులో పని చేస్తుండగా 2012లోనే రిజిస్టర్ అయ్యాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే ఈ డేటా ఉంది. గెలిచిన ఎంపీల అఫిడవిట్లు పరిశీలించి జాతీయ మీడియా చెప్పేవరకు.. మనకు తెలియనే లేదు. జేసీతో గొడవపడే సమయానికి అనంతపురంలోనే ఉన్నారు..అది 2014. మామూలుగా ఒక కానిస్టేబుల్ పై కేసు బుక్ అయితేనే సస్పెండ్ చేస్తారు. కేసు ప్రూవ్ అయితే డిస్మిస్ చేస్తారు. మరి మనోడు సీఐగా ఎలా కొనసాగాడు అనేదే అర్ధం కావటం లేదు. అంత సీరియస్ కేసులుంటే సస్పెన్షన్ లో ఉండాలి గాని..డ్యూటీలో ఉండి మరీ మీసాలు కూడా మెలితిప్పాడంటే.. మనోడి లాబీయింగ్ మామూలుగా లేదని అర్ధమవుతూనే ఉంది. అలాంటి సూపర్ కాప్ ను ఎంపీగా గెలిపించుకున్న హిందూపురం ప్రజలకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఎంపీగానే ఇంత అరాచకం చేస్తుంటే.. ఇక సీఐగా ఉన్నప్పుడు ఇంకెన్ని అరాచకాలు చేశాడో .. అక్కడి లోకల్ వాళ్లను అడిగితేనే తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా జీనియస్.. ఆయన మైండ్ సెట్ కు తగ్గవాడిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్స్ పర్ట్.. అందుకే మాధవ్ లాంటివాడిని హిందూపురం అభ్యర్ధిగా పెట్టుకుని గెలిపించాడంటే.. గ్రేటే మరి.ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏకంగా ప్రధానికి, స్పీకర్ కి మాధవ్ సార్ వార్నింగుల గురించి కంప్లయింట్ పెట్టారు. మరేం జరుగుతుందో చూడాలి.

యడ్డీ కథ అడ్డం తిరిగింది.. బొమ్మై సినిమా భళేగా ఉంది! 

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై,మంత్రి వర్గాన్ని పునః వ్యవస్థీకరించారు. కొత్త మంత్రిమండలిలో 29 మందికి స్థానం కల్పించారు. పాత కొత్తల కలియికగా తీర్చి దిద్దిన నూతన మంత్రి మండలిలో, తాజా మాజీ ముఖ్యమత్రి యడ్యూరప్ప సామాజిక వర్గం, లింగాయత్ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. ఎనిమిది మంది లిగాయత్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పిచారు. అలాగే, ఇతర సామాజిక సమీకరణల విషయంలోనూ సమతూకం పాటించారు. అయితే, యడ్యూరప్ప ఆశల మీద మాత్రం చల్ల చల్లని కూల్ కూల్ వాటర్  కుమ్మరించారు.  రాజకీయ టక్కు టమార విద్యలలో ఆరితేరిన యడ్యూరప్ప, తన ముఖ్యమంత్రి పీఠం కదిలినా, కుమారుడు విజయేంద్రకు కీలక శాఖలతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయంగా దక్కుతుందని ఆశించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి పదవి సంగతి దేవుడికెరుక, విజేంద్రకు  అసలు మంత్రివర్గంలో స్థానమే దక్కలేదు. ఉప ముఖ్యమంత్రి పోస్టునే పీకి పారేసిన ముఖ్యమంత్రి బొమ్మై, విజయేంద్ర విషయంలో తన పాత్ర ప్రమేయం లేదని, యడ్యూరప్ప, విజయేంద్రతో చర్చలు జరిపిన తర్వాతనే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని చేతులు దులుపుకున్నారు.  నిజానికి, యడ్యూరప్పకు పార్టీలో ఏమి జరుగుతోంది, పార్టీ అధినాయకత్వం ఏమి ఆశిస్తోంది, అనేది తెలియదని అనుకోలేము. అంతే కాదు, పార్టీ అధిష్ఠానాన్ని ఎదిరించే పరిస్థితి లేదని కూడా ఆయనకు తెలియంది కాదు. అయినా. ప్రజల్లో, ముఖ్యంగా తమ వర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలలో తమ ఇమేజిని నిలుపుకునేందుకు ఆయన ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర రాజకీయ భవిష్యత్తుకు పటిష్ట పునాదులు ఏర్పరిచేందుకు, ఆయన తాపత్రయ పడుతున్నారని, అందుకే గోడ మీద బోమం క్లియర్ గా ఉన్నా, ఏమీ తెలియనట్లు నటిస్తుననారని ఆయన వర్గం  నేతలే గుసగుసలు పోతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? రాష్ట్ర, పార్టీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది, చూడవలసి వుంది.  ప్రస్తుతానికి అయితే, యడ్యూరప్ప ఆయన కుమారుడు విజయేంద్ర, అయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చేయగలిగింది ఏమీ లేదని, ఆయన సన్నిహిత వర్గాలే అంగీకరిస్తున్నాయి. యడ్డీ విషయంలో పార్టీ అధినాయకత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని అంటున్నారు. ప్రధానంగా రెండు విషయాల్లో పార్టీ అధినాయకత్వం యడ్డీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.రాష్ట్రంలో  బీజేపీ పాలక పక్ష హోదాను పొందడంలో యడ్డీ కష్టాన్ని గుర్తిస్తూనే, ఇక ఆయన పార్టీ నియమావళిని పాటించి  క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని, అదే సమయంలో పార్టీ మీద కుటుంబ రాజకీయాల ముద్ర పడకుండా చూడవలసిన బాధ్యత  కూడా ఆయనపైనే ఉందని అధినాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. యడ్యూరప్ప ఇకనైనా, తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలే హితవు చెపుతున్నారు.  మంత్రి మండలి పునః వ్యవస్థీకరణ యడ్డీ వర్గంలో అసంతృప్తిని నింపింది అనేది మాత్రం కాదన లేని నిజం. యడ్యూరప్ప తనకు అత్యంత ఆప్తుడు అయిన బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయితే, తన మాట వేదం వాక్కుగా చెల్లుబాటు అవుతుందని ఆశించారు, కానీ బొమ్మై , యూ టూ బ్రూటస్,అవతారం దాల్చారు. అధిష్టానాన్ని అడ్డుపెట్టుకుని యడ్డీ ఆశలకు, ఆలోచనలకూ ఎక్కడికక్కడ గండి కొడుతున్నారు. దీంతో, ఒక్క యడ్డీనే కాదు, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా, నిరాశకు గురయ్యారు. అయితే, ఈ అసంతృప్తి ఇప్పటికిప్పుడు అసమ్మతిగా రూపాంతరం చెందుతుందా, అంటే, ఇప్పటికిప్పుడు అసమ్మతి విచ్చుకునే అవకాశం లేదని అంటున్నారు.  పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి బొమ్మై ఈ సున్నిత సమస్యను ఎలా ట్యాకిల్ చేస్తారనే దానిపైనే భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

హుజురాబాద్ కు కేసీఆర్ షాక్.. వాసాలమర్రిలోనే దళిత బంధు స్టార్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన దళిత బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. ఈనెల 16న ప్రారంభిస్తానని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాసాలమర్రిలో దళిత బంధును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు.  వాసాలమర్రిలో దళిత కుటుంబాలపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 24 గంటల్లోనే బ్యాంకు అకౌంట్లలో పది లక్షలు జమ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో  పర్యటించారు. ముందుగా దళిత వాడలో తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు.  ప్రభుత్వం అందించే  డబ్బు ను సరైన దిశలో ఉపయోగించాలని సీఎం కేసీఆర్ కోరారు. వాసాల మర్రిలో దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా డబ్బుకు డబ్బును సంపాదించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మంచి వ్యాపారం చేసి ఆర్థికంగా దళితులు బాగు పడాలని సూచించారు. దళిత బంధు ముందుగా వాసాల మర్రి ప్రజలకే వస్తున్నందున మీ పై పెద్ద బాధ్యత ఉందన్నారు. పథకం ముందు ముందు మరింత బాగా చేసేందుకు వాసాల మర్రి ప్రజలను ఆదర్శంగా తీసుకునేలా ఉండాలన్నారు దళిత బంధు ఇచ్చినందుకు ఇతర పథకాలు దళితులకు బంద్ కావన్నారు కేసీఆర్. వాసాల మర్రి ఊరందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్లు, ఇతర పథకాలు అలాగే కొనసాగిస్తామన్నారు. ఊళ్లో అందరికీ కొత్త ఇళ్లు ఇస్తామన్నారు. ఈ పది లక్షలకు ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ లేదన్నారు.  అన్ని పథకాలతో పాటు అదనంగా ఇచ్చే ఈ సాయాన్ని మంచిగా వినియోగించుకోవాలన్నారు. ఏడాది పాటు పది లక్షల నుంచి ఖర్చు చేయకుండా డబ్బులు జమ చేయాలన్నారు. మర్వాడీల మాదిరిగా డబ్బుకు డబ్బు సంపాదించే మార్గాన్ని నేర్చుకోవాలని సూచించారు. తొందర పడకుండా మంచి వ్యాపారం ఏం చేయాలన్నది నిర్ణయించుకొని కలెక్టర్ కు చెప్పాలన్నారు. అల్రెడీ డబ్బులు మంజూరైనందున పదిహేను రోజులైనా సరే మంచి వ్యాపారం చేయండన్నారు. సీఎం కేసీఆర్ పర్యటనలో వాసాలమర్రిలో గందరగోళం నెలకొంది. సీఎం సమావేశానికి దళితులను మాత్రమే అనుమతించడంపై గ్రామస్తుల అభ్యంతరం తెలిపారు. మొదట దళితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామంలోని 150 మందికి అనుమతి ఉందని చెప్పిన అధికారులు సీఎం సమావేశానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. సీఎం పర్యటనలో ప్రధానంగా వాసాలమర్రిలోని దళితవాడలను పరిశీలన, గ్రామంలోని రైతువేదిక భవనంలో ప్రజలతో సమావేశం నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఆతర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు కేసీఆర్ తిరుగుప్రయాణమవుతారు.

ప‌త‌నం అంచున‌ జ‌గ‌న్ స‌ర్కారు!.. ర‌ఘురామ లేఖ‌తో మ‌రింత ముప్పు..

అవును, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం బాగా ఆలస్యం అవుతోంది. కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఈ మాట‌లన్న‌ది మ‌రెవ‌రో కాదు. ముఖ్య‌మంత్రి త‌ర్వాత ముఖ్య‌మంత్రి అంత‌టి వారైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ఆయ‌న ఇలా అన్నారంటే.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎంత దుర్బ‌రంగా ఉందో అర్థం అవుతోంది. ఒక‌విధంగా ఇది స‌ర్కారు చేతులెత్తేయ‌డ‌మే. ఏపీలో ఎక‌నామిక్ క్రైసిస్ వ‌చ్చిన‌ట్టే. ఆర్థిక అత్య‌వ‌స‌ర స్థితికి ఇది హెచ్చ‌రికే.  తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ కొత్త రుణాల కోసం ప్రపంచబ్యాంకు ముందు మోక‌రిల్లుతోంది. ‘సాల్ట్‌’ ప్రాజెక్టు అమలు కోసం సుమారు రూ.1,870 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు వైసీపీ ప్రభుత్వం ఓకే అనేసింది. ప్ర‌పంచ బ్యాంకు ష‌ర‌తులు ఎలా ఉంటాయో తెలుసుగా.. ఉద్యోగాలు ఇవ్వొద్దు.. జీతాలు పెంచొద్దు.. ప‌న్నులు, క‌రెంటు బిల్లులులాంటివి భారీగా పెంచేయాలి.. చెత్త ప‌న్నులాంటి కొత్త కొత్త ప‌న్నులు వేయాలి.. ఇలా వ‌ర‌ల్డ్ బ్యాంక్ రుణ‌మంటే ప్ర‌జ‌ల‌కు మూడిన‌ట్టే. అందులో భాగంగానే ఏపీలో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నా డీఎస్సీ ఊసెత్తకుండా స‌ర్కారు కాలయాపన చేస్తోందని.. జాబ్ క్యాలెండ‌ర్‌తో త‌క్కువ పోస్టులే భ‌ర్తీ చేయ‌డానికీ ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు.  మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టు.. ఇంటి గుట్టు ర‌ట్టు చేసేలా ఏపీ ఆర్థిక దుస్థితిని కేంద్రానికి పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిస్తూ ఎంపీ ర‌ఘురామ రాసిన లేఖ‌తో మ‌రింత ఇర‌కాటంలో ప‌డింది స‌ర్కారు. రఘురామ రాసిన లేఖపై కేంద్రం రియాక్టు అయింది. ఏపీ అప్పులపై క‌న్నెర్ర జేస్తూ.. కొత్త పరిమితులు విధించడంతో ప్ర‌భుత్వం గిల‌గిలా కొట్టుకుంటోంది.  ఎవ‌రైనా మ‌ద్యం అమ్మి ఆదాయం సంపాదిస్తారు కానీ, వ‌చ్చే 20ఏళ్ల మ‌ద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి అప్పులు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే కాబోలు. ఈ మేట‌ర్ ర‌ఘురామ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి చేర‌డంతో.. ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ.. భవిష్యత్తు ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పు బ‌డుతూ కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఏపీ సర్కారుకు కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలో.. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణ సేకరణ సరికాదని కూడా త‌ప్పుబ‌ట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3), ఆర్టికల్ 266(1)కు విరుద్ధంగా ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటైందని కేంద్రం స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రం. తమ దృష్టికి వచ్చిన అంశాలపై వివరణ కోరుతూ సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాల్ని కాగ్ నివేదిక బయటపెట్టగా.. అందులో ఏపీ మొదటి స్థానంలో నిలవ‌డం మ‌రింత దారుణమైన విష‌యం.  ఎంపీ ర‌ఘురామ లేఖ‌తో కేంద్రం ఏపీ ఆర్థిక దుస్థితిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌డంతో ప్ర‌భుత్వంలో క‌ల‌వ‌ర‌పాటు పెరిగింది. ఇన్నాళ్లూ ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించ‌గా.. ఇక‌పై ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని మెద‌లాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. అమ‌ర‌రాజాలాంటి ఉన్న కంపెనీలే వెళ్లిపోయేలా చేస్తూ.. కొత్త కంపెనీలు రాష్ట్రం పేరెత్తితేనే భ‌య‌ప‌డేలా చేస్తుంటే.. ఏపీ అభివృద్ధి సాధ్య‌మా? కేవ‌లం సంక్షేమ‌మే ఉంటే స‌రిపోతుందా? చేసిన అప్పులు ఎలా తీరుస్తారు? కొత్త అప్పులు ఎలా తెస్తారు? ఇక‌, ఏపీ ఆర్థికంగా దివాళా తీసిన‌ట్టేనా?   

పెద్దలు చెబితే వినరా? జగన్ తో ఏపీకి జల గండమా?

ఆవేశం అజ్ఞానానికి, అజ్ఞానం అవివేకానికి, అవివేకం అనర్థానికి దారి తీస్తుందని గీతాచార్యుడు ఏనాడో చెప్పి ఉన్నాడు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు పాటిస్తున్నవాళ్లు జీవిత పోరాటంలో అనేక  విజయాలు నమోదు చేస్తున్నారు. పెడచెవిన పెట్టినవారు అపకీర్తి అనే పాతాళానికి దిగజారిపోతున్నారు. తాజాగా జగన్ సర్కారు తీసుకున్న దుందుడుకు నిర్ణయం కూడా అలాంటిదేనంటున్నారు రాజకీయ నిపుణులు.  కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కారుకు... సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి సూచించిన హిత వచనాలు కూడా రుచించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆప్తుడైన జస్టిస్ ఎన్వీ రమణ.. రెండు రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని ఆలోచించి.. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కన్నా కూర్చుండి చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదని సూచించారు. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కూడా ఆయన అన్నారు. ఒకవేళ న్యాయ పరమైన పరిష్కారమే కావాలనుకుంటే వేరే ధర్మాసనానికి కేసు బదిలీ చేస్తానని కూడా సీజేఐ జస్టిస్ రమణ చెప్పారు. ఇదంతా దేన్ని సూచిస్తుంది? సమస్యలో మిళితమై ఉన్న సెంటిమెంట్లు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్న అభిలాష మేరకే రమణ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా దశాబ్దాల తరబడి రెండు ప్రాంతాల రైతుల మధ్య అపనమ్మకాలు రాజేసిన ఇలాంటి జీవజలాల సమస్యను సహృదయ వాతావరణంలో కూర్చుండి మాట్లాడుకోవడం కన్నా మేలైన పరిష్కారం ఉండదని నిపుణులంతా చెబుతున్నారు. ఇలా చేస్తే పరిష్కారం కూడా త్వరగా తేలిపోతుందన్న విషయం కూడా జగమెరిగిన సత్యమే.  కానీ జగన్ మాత్రం మొండిగా న్యాయపోరాటానికే ఓటేయడం అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు తావిస్తోంది. ఎన్వీ రమణ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పట్ల ఎంతో నమ్మకాన్ని, గౌరవాన్ని కనబరచారు. వారిద్దరి కలయికలోనే ఈ సమస్యకు ఓ మంచి సొల్యూషన్ రావడానికి బీజం పడిందని భావిస్తున్నారు. అయితే జస్టిస్ రమణ సూచించిన పారదర్శకమైన సూచనను జగన్ పట్టించుకోకపోవడం ఆయనలోని మొండివైఖరికి నిదర్శనమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర సర్కారు కూడా సీజేఐ ధర్మాసనమే విచారించాలని కోరడాన్ని గమనించాలి. అయినప్పటికీ కేంద్రానికి కూడా రమణ ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పడం ఆయనలోని స్వచ్ఛతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యాయరంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తే న్యాయపరమైన పరిష్కారం కాకుండా మధ్యవర్తిత్వమే మంచిదని చెప్పిన మాటలను జగన్ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తెలివైన పని కాదంటున్నారు జలరంగ నిపుణులు. న్యాయపరమైన విచారణ వల్ల ఏళ్లపాటు విచారణ సాగుతుందని, నీటిపంపకాల విషయంలో పెనవేసుకొని ఉన్న అనేక టెక్నికల్ అంశాల కారణంగా సమస్య కొలిక్కి రావడం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి అసలు జగన్ కు సమస్య పట్ల చిత్తశుద్ధే లేదని, ఏపీలో జగన్ పరపతి అడుగంటుతున్న క్రమంలో వ్యక్తిగత రాజకీయాల కోసమే రెండు ప్రాంతాల మధ్య గల సున్నితమైన సమస్యను కెలుకుతున్నారని, ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఏపీకి ఏవిధంగా లాభం జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ తెలిసితెలిసీ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

రఘువీరా రీ ఎంట్రీ నిజమేనా? ఆయనతో టచ్ లో ఉన్నదెవరు? 

ఒక వెలుగు వెలిగిన సీనీ తారలు ఫేడ్ అవుట్  అయి కొంత కాలం తెర చాటున ఉండిపోవడం, ఆ తర్వాత  మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేయడం సినిమా లోకానికి తెలిసిన విషయమే. అలాగే ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన లేదా పదవీ విరమణ చేసిన అధికారులు ఇతర రంగాలవైపు, ముఖ్యంగా రాజకీయాలా వైపు రావడం సహజం. నిన్న మొన్ననే, ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తమ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. త్వరలోనే ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  సహజంగా రాజకీయ నాయకులకు అలాంటి, అవసరం, అవకాశం రెండూ ఉండవు. ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. జీవిత చరమాంకమ వరకు రాజకీయ నాయకులు రాజకీయాలే సర్వస్వంగా బతికేస్తుంటారు. అయితే, అప్పుడు అడప్పుడు కొందరు ఒక వయసు దాటిన తర్వాత ఇక రాజకీయాలు చాలని  స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పు కుంటారు. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్ 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాత స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మధ్య ప్రదేశ్  లో అత్యంత వెనకబడిన గోండ్వా ప్రాంతంలో  అంత్యోదయ స్పూర్తితో ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 60 నిండిన తర్వాత అధికార పదవుల నుంచి తప్పు కుంటానని ప్రకటించారు కానీ, ఆయనకు ఆ అవకాశం రాలేదు. 60 ఏళ్ళు నిండకుండానే అయన 2009 లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఒకే సారి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్వేల్ మాజీ  ఎమ్మెల్యే, వైఎస్ ఆప్త మిత్రుడు డాక్టర్ శివరామ కృష్ణా రావు, ఆద్యాత్మిక జీవితంపై మక్కువ పెంచుకుని ఈ సంవత్సరం (2021) ఏప్రిల్ 2 వతేదీన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా నిజ సన్యాసం స్వీకరించారు. స్వామి శివరామ సరస్వతి గా మారి పోయారు.   అసలు విషయం ఏమంటే, వైఎస్ మంత్రివర్గంలోనే కాకుండా ఆ తర్వాత అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన, రఘువీరా రెడ్డి, చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన, అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పూర్తిగా చచ్చుపడి పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు.ఆశించిన ఫలితం రానందుకో, ఇంకేందుకో ఆయన,2019లో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఆకక్ది నుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ నిర్మాణానికి నడుం బిగించి, దిగ్విజయంగ ఆలయ నిర్మాణం  పూర్తి చేశారు. కొద్ది రోజుల క్రితం ఆలయ నిర్మాణం పూర్తయింది. జూన్ నెలలో విగ్రహ ప్రతిష్ట ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయ రీఎంట్రీ గురించి, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఓ వంక కాంగ్రెస్ నాయకులు రఘువీరతో టచ్ లోకి  వచ్చారు. ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లు సమాచారం. మరో వంక దేవాలయ పున్నః నిర్మాణ పవిత్ర కార్యాన్ని పూర్తిచేసిన రఘువీరను, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభినందించారు. అలాగే జేసీ సోదరుడు, తాడిపత్రి టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి స్వయంగా రఘువీరాను కలిసి,  రాయలసీమ నీటి హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని సూచించారు. అయితే రఘువీర ఎలానూ స్పందించలేదు. మౌనంగా ఉండి పోయారని సమాచారం. ఆయన మనసులో ఏముందో ... ఆయన ఏలాంటి నిర్ణయం తెసుకుంటారో .. చూడవలసి వుంది. ప్రస్తుతానికి అయితే రఘువీర ఒక విధంగా తమ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని మరిచిపోయి, టీవీఎస్ 50 ద్విచక్రవాహనం మీద తిరుగుతూ .. రచ్చబండ రాజకీయాలకు పరిమితం అయ్యారు.  రేపు ఏమవుతుందో ..?

తెలంగాణ రాజధానిగా వరంగల్? హైదరాబాద్ యూటీ కాబోతోందా..? 

హైదరాబాద్.. తెలంగాణ రాజధాని. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గత సంవత్సరం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా హైదరాబాద్ కు సంబంధించి కీలక అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు మల్లన్న. వరంగల్ లో జరిగిన సభలో ఆయన  డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ విస్తరించడం వల్ల జనాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని.. అందుకే వరంగల్ ను రాష్ట్రానికి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు బీజేపీ నేతలు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని చెబుతుండటం.. ఇటు తెలంగాణకు వరంగల్ రాజధాని చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం చర్చగా మారాయి. రాష్ట్రంలో త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారు మల్లన్న. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు తీన్మార్ మల్లన్నకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ ను తెలంగాణ రాజధానిగా చేయాలని ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్లన్న  పబ్లిసిటీ కోసమే ఇలా అన్నారా లేక హైదరాబాద్ పై ఆయనకు ఇతరత్రా ఏమైనా సమచారం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీనిపై గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పటి కేంద్ర సర్కార్ అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 వరకు ఇది వర్తించనుంది. ఇటీవల కోవిడ్ రోగులతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో హైదరాబాద్ కు మాకు హక్కులున్నాయని కొందరు ఏపీ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఏపీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాయని చెబుతున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దేశానికి రెండో రాజధానిగా చేసే యోచనలో ఉందంటున్నారు. హైదరాబాద్ ను యూటీగా చేస్తే తెలంగాణ నేతల నుంచి వ్యతిరేకత వస్తుంది కాని..దేశానికి రెండో రాజధానిగా చేస్తే అలాంటి సమస్య ఉండబోదని కేంద్రం పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఓ జాతీయా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కూడా దేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయితే తమకు సంతోషమేనని చెప్పారు. అందుకే ఈ దిశగా కేంద్ర సర్కార్ సీరియస్ గానే కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. అలా చేస్తే తెలంగాణ, ఏపీలోనూ తమకు లాభిస్తుందనే అంచనాలో కమలం నేతలు ఉన్నారని అంటున్నారు.  మొత్తానికి బీజేపీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం ఉన్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రాజధాని చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మల్లన్న ప్రకటన ఆషామాషీగా వచ్చిందేమి కాదని, దీని వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చూడాలి మరీ.. ముందు ముందు ఏం జరగనుందో... 

కేసీఆర్ డిన్న‌ర్ పాలిటిక్స్‌.. దావ‌త్‌ల వెనుక రీజ‌న్‌ అదేనా?

మటన్.. తలకాయ కూర.. బొటీ.. నాటుకోడి కర్రీ.. చికెన్ ఫ్రై.. చేపల కర్రీ.. ఫిష్ రోస్ట్‌.. పప్పు.. సాంబార్.. పెరుగు.. గారెలు.. స్వీటు. టేబుల్‌పై అన్ని రకాల వెరైటీస్‌. ఘుమ‌ఘుమ‌లాడుతున్నాయి. నోరూరిస్తున్నాయి. త‌న వ‌య‌సును, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను అన్నిటినీ ప‌క్క‌న పెట్టేశారు. ఏ ఒక్క వెరైటీ వ‌ద‌ల‌కుండా అన్నిటినీ టేస్ట్ చూశారు. తృప్తిగా, క‌డుపు నిండుగా విందు ఆర‌గించారు. ఇదీ కేసీఆర్ భోజ‌నం. తాజాగా నాగార్జున‌సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే భ‌గ‌త్ ఇంట్లో సీఎం కేసీఆర్ స్వీక‌రించిన ఆతిథ్యం.   కేసీఆర్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంతా క‌లిసి టేబుల్‌పై భోజ‌నం చేశారు. ఎమ్మెల్యే భగత్ స్వయంగా వడ్డిస్తుంటే.. తమతో కలిసి కూర్చొని తినాలని ప‌ట్టుబ‌ట్టారట‌ కేసీఆర్. భగత్ సతీమణి భవానీ సీఎం కేసీఆర్‌కు ద‌గ్గ‌రుండి వంట‌ల‌న్నీ కొస‌రికొస‌రి వ‌డ్డించ‌గా.. ఆయ‌న వ‌ద్ద‌న‌కుండా, అస్స‌లు మొహ‌మాట ప‌డ‌కుండా అన్నిటినీ లాగించేశార‌ట‌. ఐట‌మ్స్ అన్నింటిని రుచి చూసిన ఆయన.. వంటలు బాగున్నాయని ప్రశంసించారు కూడా. సీఎం కేసీఆర్ కాంప్లిమెంట్స్‌తో ఎమ్మెల్యే భగత్ కుటుంబం ఫుల్ ఖుషీ.  స‌రిగ్గా.. ఇలాంటి స్ట్రాట‌జీనే కేసీఆర్ ప‌దే ప‌దే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ఎవ‌రొచ్చినా.. కేసీఆర్ ఏ ఊరికి వెళ్లినా.. భోజ‌నంతో క‌ట్టిప‌డేస్తారు. స్వ‌త‌హాగా భోజ‌న‌ప్రియుడైన కేసీఆర్‌.. మిగ‌తా వారినీ త‌న భోజ‌నంతో, ఆతిథ్యంతో ఆక‌ట్టుకుంటారు.  కేసీఆర్ చేసేవ‌న్నీ డిన్న‌ర్ పాలిటిక్సే అంటారు. ఎంత‌టి కీల‌క‌మైన రాజ‌కీయ సమావేశ‌మైనా.. భోజ‌నం బ్రేక్ ఉండాల్సిందే. ఎంత పెద్ద ప్ర‌ముఖులైనా.. ఎంత చిన్న కార్మికులైనా.. వారితో క‌లిసి భోజ‌నం చేయాల్సిందే.  ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మీటింగ్ అంటే అధికారుల‌కు సంబ‌ర‌మేన‌ట‌. సీఎం ర‌మ్మ‌న్నారంటే ప‌లువురు ప్ర‌ముఖులు, వివిధ వ‌ర్గాల నాయ‌కులు ఎగిరిగంతేస్తార‌ట‌. చెవుల్లో అమృతం పోసే మాట‌ల‌తో పాటు, జోకులు, సెటైర్లతో, అద్భుత‌మైన ప్ర‌సంగాల‌తో.. వ‌చ్చిన వారెవ్వ‌రికీ విసుగెత్త‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి కేసీఆర్‌ ఒక్క‌రే మాట్లాడుతుంటారు. ఏ స‌మీక్ష అయినా, ఏ మీటింగ్ అయినా.. దాదాపు రోజంతా ఉంటుంది. మ‌ధ్య‌లో లంచ్ బ్రేక్ త‌ప్ప‌నిస‌రి. ఆ గంటసేపు మ‌రింత మ‌జా మ‌జా. కేసీఆర్ పెట్టే లంచ్‌.. ఓ రేంజ్‌లో ఉంటుంద‌ట‌. తిన్న వాళ్లు రెండు మూడు రోజులు ఆ రుచి మ‌రిచిపోర‌ట‌. అంత బాగుంటుంద‌ట కేసీఆర్ ఆతిథ్యం.  అలాంటి ఆతిథ్యాన్నే తన ప‌ర్య‌ట‌న‌ల్లోనూ పాటిస్తార‌ట‌. మీ ఊరికి వ‌స్తా.. గ్రామ స‌మ‌స్య‌ల‌న్నీ తీరుస్తా.. మంచిగా మాట్లాడుకుందా.. అక్క‌డే క‌లిసి తిందాం.. దావ‌త్ చేసుకుందాం.. ఇలా సాగుతుంది కేసీఆర్ ద‌త్త‌త‌ గ్రామాల ప‌ర్య‌ట‌న‌. అది వాసాల‌మ‌ర్రి అయినా, చిన్న‌ముల్క‌నూర్‌, మూడుచింత‌ల‌ప‌ల్లి అయినా.. కేసీఆర్ వ‌చ్చిండ్రంటే.. దావ‌త్ ఉండాల్సిందే. ఎండ త‌గ‌ల‌కుండా మంచి షామియానాలు వేసి.. టేబుళ్లు ప‌రిచి, కుర్చీలు వేసి.. వంద‌లాది మందికి వేడివేడిగా భోజ‌నం వ‌డ్డిస్తారు. వారితో పాటే క‌లిసి కూర్చొని కేసీఆర్ సైతం అక్క‌డే భోంచేస్తారు. క‌డుపునిండా తృప్తిగా భోజ‌నంతో పాటు.. తాము కేసీఆర్‌తో క‌లిసి తిన్నామ‌నే జ్ఞాప‌కం సైతం వారికి క‌ల‌కాలం ఉండిపోతుంది. ఇక అన్నంపెట్టిన‌వాడిని, త‌మ‌తో క‌లిసి తిన్న‌వాడిని.. జ‌నాలు అంత ఈజీగా ఎలా మ‌ర్చిపోగ‌లుగుతారు.  ఇక కేసీఆర్ ఎప్పుడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చినా.. కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంట్లోనే విడిది చేస్తారు. అక్క‌డే భోజ‌నం చేస్తారు. ఉద్య‌మ‌కాలం నుంచి ఇదే అల‌వాటు, సెంటిమెంటు కూడా. ఆ ఇంటి భోజ‌నం అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఆ రుచి మ‌రిచిపోలేకే.. ఎప్పుడొచ్చినా అక్క‌డే దిగుతార‌ని అంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ వ‌రంగ‌ల్‌కు ఓ వంద‌సార్లు వ‌చ్చార‌ని అనుకుంటే.. అందులో 99సార్లు కెప్టెన్ ఇంట్లోనే బ‌స‌. కానీ, ఆశ్చ‌ర్యంగా ఇటీవ‌ల మాత్రం క‌డియం శ్రీహ‌రి ఇంట్లో విందు ఆర‌గించారు ముఖ్య‌మంత్రి. బ‌హుషా, ఎమ్మెల్సీలేక‌, స‌రైన గుర్తింపులేక‌ అసంతృప్తితో ఉన్న క‌డియం.. కారు దిగి పారిపోకుండా ఉండేందుకు కాబోలు.. అలా ఆయ‌న ఇంట్లో విందు రాజ‌కీయం నెర‌పార‌ని అంటారు. ఇలా, భోజ‌నాన్ని జిహ్వ చాప‌ల్యానికి, రాజ‌కీయానికీ వాడుకునే స‌మ‌ర్థుడు కేసీఆర్‌. 67 ఏళ్లు వ‌చ్చినా.. అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా.. భోజ‌నం విష‌యంలో మాత్రం కాంప్ర‌మైజ్ కార‌ట కేసీఆర్‌. ఇష్టంగా తింటార‌ని.. రుచిగా ఉంటే అడిగి మరీ వడ్డించుకోవడానికి ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌ర‌ని అంటారు. ప‌సందైన విందులో.. దావాత్‌ల‌లో.. డిన్న‌ర్ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు.   

ఇంత నిర్లక్ష్యమా.. కోర్టులంటే లెక్కలేదా?  జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో వరుసగా జగన్ రెడ్డి సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులపైనా ధర్మాసనం సీరియస్ అయింది. కొందరికి శిక్షలు కూడా వేసింది. అయినా సర్కార్ లాగే అధికారులు కూడా నిర్లక్ష్యం వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఓ కేసు విచారణలో భాగంగా జగన్ ప్రభుత్వంతో పాటు అధికారుల తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చివాట్లు పెడుతూ ఘాటు వ్యాఖ్యలతో  హెచ్చరికలు జారీ చేసింది.  ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని రాష్ట్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలియదా? అంటూ నిలదీసింది. బిల్లులపై విజిలెన్స్ విచారణలో తేలిన అంశాలు ఏమిటని ప్రభుత్వ ప్రతినిధులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఉపాధి హామీ పనుల బిల్లులకు సంబంధించి కోర్టు అడిగిన మేరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమాధానం ఇవ్వలేకపోయారు.దాంతో హైకోర్టు ధర్మాసనం మరింత అసహనానికి లోనైంది. విచారణలో ఉన్న అంశాలపై తగినంత సమాచారం లేకుండా ఎలా వస్తారని మొట్టికాయలు వేసింది.విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రాకపోవడంపైనా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.  వాదనల సందర్భంగా  ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇప్పటిదాకా రూ.413 కోట్లు చెల్లించామని, మరో 4 వారాల్లో రూ.1.117 కోట్లు చెల్లిస్తామని తెలిపారు.అయితే ప్రభుత్వం బిల్లుల కోసం చెల్లించింది రూ.40 కోట్లేనని  పిటిషర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఏ గ్రామ పంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.  

రోడ్డు ప్రమాదాల్లో అందరూ సేఫయ్యేలా కొత్త రూల్..

రోడ్డు ప్రమాదం జరిగితే ఇప్పుడెవరి ప్రాణాలకూ గ్యారెంటీ ఉండటం లేదు. కార్లలోని ఫ్రంట్ సీట్లకు పనికొచ్చేలా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారణంగా డ్రైవర్ తో పాటు ఇవతలి వైపు కూర్చుండేవారికి మాత్రమే రక్షణ లభిస్తోంది. వాళ్లు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ గలుగుతున్నారు. ఇక మిగతావారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయి వారి బంధువులకు తీరని విషాదం మిగులుస్తున్నారు. ఎంతో మంది అనాథలుగా మారిపోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాన్రానూ ఇదో సామాజిక సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు.  ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ యువతి బోనాల పండుగ కోసం వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని ఇంటికెళ్లే సమయంలో కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆ వేగానికి కారు నాలుగు పల్టీలు కట్టిన దృశ్యం షాకింగ్ గా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కారణంగా డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుకసీట్లో కూర్చున్న ఈ యువతి కారులోంచి బయటపడి స్పాట్ లోనే చనిపోయింది. ఇకపై అలాంటి కష్టాలకు చెక్ పడబోతోంది. కేంద్ర రోడ్ రవాణా, స్పోర్ట్స్ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో ఈ ప్రమాదాలకు చెక్ పడబోతోంది. అన్ని ఫోర్ వీలర్ వాహన కంపెనీలు ఇకపై అన్ని సీట్లకూ ఎయిర్ బ్యాగ్స్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఫోర్ వీలర్స్ లో వెనుక ఎంతమంది కూర్చుంటారో అందరికీ కూడా సీట్ బెల్ట్స్ తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఫిక్స్ చేయాలని గడ్కరీ కోరడంతో వివిధ కంపెనీల యాజమాన్యాలు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం విశేషం. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ విచ్చుకొని శరీరం కారు బాడీకి తగలకుండా రక్షణగా ఉంటుంది. అయితే ప్రయాణికులు ఎయిర్ బ్యాగ్ వల్ల కూడా ఇంజ్యురీస్ కాకుండా సీట్ బెల్ట్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇప్పటికైతే రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారనే లెక్క మీద అంచనాలున్నాయి కానీ.. ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారనే విషయంలో లెక్కాపత్రం లేదు. మొత్తానికి ఈ చర్యతో వాహన ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు తగ్గుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు  వాహన తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాడేలా ఇంజన్లు రూపొందించాలని కూడా గడ్కరీ కోరడం విశేషం. పెట్రోల్, డీజిల్ తో పాటు ఇథనాల్, గ్యాసోలిన్ వంటి ఇంధనాలు కూడా ఇంజిన్లు ఉపయోగించుకునేలా రూపొందించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల దిగుమతి కోసం ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది. అయితే 2027 నాటికి ఇంజిన్లలో అలాంటి మార్పులు తేవడానికి సాధ్యమవుతుందని వాహన కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పీకే ప్రసంగాలకు పవర్ కట్.. ఇదేం రాజకీయం సారూ! 

హుజూరాబాద్ లో గెలిచి తీరాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకోసం హడావుడిగా దళితబంధు స్కీముతో పాటు నాగార్జునసాగర్ వంటి నియోజకవర్గాలకు ఇదే అదునుగా వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే రాజీనామా చేసి ఆ వెంటనే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు బెంగపడుతున్నాయి. దళిత-బహుజనవాదానికి కాన్షీరాం తాత్వికతను జోడించి కొత్త తరహాలో రోజుకో జిల్లాలో ప్రవీణ్ కుమార్ ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. కేసీఆర్ మోసకారితనం, మాట మీద నిలకడ లేనితనం, కేసీఆర్  చేసే ఎలక్షన్ రాజకీయాల మీద పదునైన మాటల బాణాలు వదుల్తున్నారు. ఆయన ఉపన్యాసాల ప్రభావం యావత్ రాష్ట్రం మీద పడుతున్నా.. ఇప్పటికిప్పుడు హుజూరాబాద్ ఎన్నికలను కూడా గణనీయంగా ప్రభావితం చేసేలా ఉందన్న బెంగ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.  హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్.. తన ఉపన్యాసాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తాజాగా ప్రవీణ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. గత మూడు రోజులుగా జరుగుతున్న అన్ని సమావేశాల్లోనూ తాను మాట్లాడే సమయానికే పవర్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తను మాట్లాడకుంటా కరెంట్ కట్ చేస్తున్న పాలకులు.. రేపు తామే వారి పవర్ ను కట్ చేయబోతున్నామని ట్వీట్ చేస్తూ తాజా ఫొటోను కూడా జత చేశారు. పీకే ట్వీట్ కు ట్వీట్లు, రీట్వీట్లు పడిపోతున్నాయి. స్వేరో సైన్యంతో పాటు పీకే ఫ్యాన్స్ పెద్దఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు పవర్ కట్ చేయడం ఖాయమని కొందరు స్పందిస్తున్నారు. మరికొందరేమో.. పీకే అప్పుడే ఫక్తు పొలిటికల్ డ్రామాలు నేర్చుకున్నారని, తెలంగాణ పల్లెల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నడుస్తున్నాయని..  ఈ క్రమంలో పవర్ పోయుంటుంది తప్ప పీకేకు భయపడి కేసీఆరే తీయించినట్లు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు దేశంలో ఎక్కడా లేనట్టు తెలంగాణలో 24 గంటల పవర్, రైతులకు ఉచిత పవర్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకరిద్దరైతే... ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నప్పుడు స్వయంగా ఓ జనరేటర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సార్.. అంటూ సూచిస్తున్నారు.  మొత్తానికి కరెంటు పోయిన రీజన్ ఏంటో తెలీదు గానీ.. ఈ అంశాన్ని ట్విట్టర్లో పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్న పీకే ఓట్లదృష్టిని మాత్రం పలువురు ప్రశంసిస్తున్నారు.

గంగుల‌కు ఈడీ షాక్‌.. రివేంజ్ పాలిటిక్స్‌? దూకుడు బండి..!

హుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఈట‌ల‌పై తెలంగాణ స‌ర్కారు భూఆక్ర‌మ‌ణ కేసులు పెడితే.. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు గ్రానైట్ అక్ర‌మ ర‌వాణాపై ఈడీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప‌రిధిలో ఈట‌ల‌పై టీఆర్ఎస్ త‌న ప‌వ‌ర్ ప్ర‌యోగిస్తే.. కేంద్ర ప‌రిధిలో గంగుల‌పై బీజేపీ ఈడీని ఉసిగొల్పింద‌ని అంటున్నారు. గంగుల కంపెనీల‌పై గ‌తంలో బండి సంజ‌య్ చేసిన ఫిర్యాదు కూడా కార‌ణమ‌ని తెలుస్తోంది. ఇలా రివేంజ్ పాలిటిక్స్‌తో తెలంగాణ రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. ఈట‌ల‌ను కారు నుంచి గెంటేయ‌డానికి అసైన్డ్ భూముల కేసును తెర‌పైకి తీసుకొచ్చింది కేసీఆర్ స‌ర్కారు. వెంట‌నే క‌మిటీ వేసి.. ఈట‌ల‌ను కేబినెట్ నుంచి వెళ్ల‌గొట్టి.. పార్టీ నుంచే వెళ్లిపోయేలా చేశారు. ఆనాటి నుంచి ఈట‌ల‌పై దాడికి మంత్రి గంగుల‌ను ముందుంచింది. రాజేంద‌ర్ బీజేపీలో చేరి.. టీఆర్ఎస్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తున్న‌ట్టున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉండే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌-ఈడీ తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కంపెనీల‌కు నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  క‌రీంన‌గ‌ర్‌లో గ్రానైట్ అక్రమ రవాణపై ఈడీ కొరడా ఝులిపించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట మంత్రి గంగుల కమలాకర్‌‌కు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చింది. గంగులకు చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులివ్వ‌డం రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్యేనంటున్నారు.  ఫెమా నిబంధనలు ఉల్లంగించారంటూ గంగుల‌పై.. గతంలో ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై తాజాగా ఈడీకి ఇద్ద‌రు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. తక్కువ పరిణామం చూపించి.. ఎక్కువ మొత్తంలో గ్రానైట్ ఎగుమతి చేసినట్టు కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు మేర‌కు.. విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.  గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు ఈడీకి ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి ఆ మేర‌కు పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. లెక్క‌ల్లో చూపిస్తున్న దానికి విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప‌క్కా స‌మాచారంతోనే ఈడీ రంగంలోకి దిగింద‌ని.. గంగుల క‌మ‌లాక‌ర్‌కు చెందిన గ్రానైట్ ర‌వాణా కంపెనీల‌కు నోటీసులు ఇచ్చార‌ని అంటున్నారు. కరీంనగర్ ప్రాంత‌ గ్రానైట్ అక్రమాలపై ఈడీతో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఈడీతో పాటు సీబీఐ కూడా రంగంలోకి దిగే అవకాలునట్టు తెలుస్తోంది. ఈట‌ల వ‌ర్సెస్ గంగుల మాత్ర‌మే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తోనూ గంగుల‌కు ఏళ్లుగా రాజ‌కీయ వైరం ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్‌.. గంగుల క‌మ‌లాక‌ర్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఎంపీగా గెల‌వ‌డం, పార్టీ ప‌గ్గాలు చేతికి రావ‌డంతో బ‌ల‌వంతుడిగా మారిన బండి.. త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి గంగుల‌కు వ్య‌తిరేకంగా పావులు క‌ద‌ప‌డం స్టార్ట్ చేశారు. గ‌తంలోనే సంజ‌య్‌.. గంగుల గ్రానైట్ దందాపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. అందుకు కౌంట‌ర్‌గా బండి సంజ‌య్ గ్రానైట్ వ్యాపారుల నుంచి కోట్లు వ‌సూలు చేశారంటూ గంగుల వ‌ర్గం ఆరోపించింది. ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ రగులుతుండ‌గానే.. ఈట‌ల ఎపిసోడ్ మొద‌ల‌వ‌డం.. రాజేంద‌ర్‌పైనా మంత్రి గంగుల దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఇక ఆల‌స్యం చేయ‌కుండా ఆయ‌న‌కు చెక్ పెట్టాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయ ప్రోద్బలం ఉందోలేదో తెలీదుకానీ(?).. క‌రీంన‌గ‌ర్‌-హుజురాబాద్ రాజ‌కీయం హాట్‌హాట్‌గా సాగుతున్న ఈ స‌మ‌యంలోనే గంగుల కంపెనీల‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌డం పొలిటిక‌ల్‌గా క‌ల‌క‌లం రాజేస్తోంది.   

కులాల వారీగా పదవులు, పంపకాలు! హుజురాబాద్ లో గులాబీ వ్యూహాలు..

హుజురాబాద్.. తెలంగాణలో ఇదే ఇప్పుడు సెంటర్ పాయింట్. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీల మంత్రాంగంతా దానిపైనే ఉంది. పార్టీలే కాదు ప్రభుత్వ పాలన కూడా హుజురాబాద్ కేంద్రంగానే సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలన్ని ఉపఎన్నికకు ముడిపడే ఉంటున్నాయి.  2004 నుంచి హుజురాబాద్ లో గెలుస్తూ వస్తున్నారు ఈటల రాజేందర్. ఆరుసార్లు పోటీ చేయడంతో నియోజకవర్గం ఆయనకు కంచుకోటగా మారింది. అయితే ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈటల రాజేందర్.. ఈసారి మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరోసారి గెలిచి తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి తొలగించారనే సానుభూతి ప్రజల్లో ఈటలపై కనిపిస్తోంది. అటు ఈటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నిర్వహించిన సర్వేల్లో మాత్రం ఈటల వైపే మొగ్గు ఉందని తేలిందట. రెండు, మూడు సార్లు సర్వే చేసినా అదే ఫలితం రావడంతో  గులాబీ బాస్ కలవరపడుతున్నారట. అందుకే ఎలాగైనా గెలిచేందుకు సీఎం కేసీఆర్ అన్ని అస్త్రాలు బయటికి  తీస్తున్నారని అంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కులాల వారీగా లెక్కలు తీస్తూ పంపకాలకు దిగుతున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పథకాలతో తాయిలాలు ఇస్తున్నారు. పంపకాలే కాదు పదవుల్లోనూ కులాల వారీగా నియమిస్తూ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇటీవల నామినేటెడ్ చేసిన పోస్టులన్ని హుజురాబాద్ కే దక్కాయి. ఇకపైనా దక్కబోతున్నాయని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని నామినేట్ చేయగా.. ఇటీవల కాంగ్రెస్ నుంచి కారెక్కిన హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి దక్కింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించగా.. అది కూడా హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ కు దక్కింది. ప్రభుత్వ పథకాల అమలు కూడా హుజురాబాద్ కేంద్రంగానే  మొదలవుతున్నాయి.  హుజురాబాద్ నియోజకవర్గంలో  నాలుగు మండలాలు ఉండగా.. మొత్తం 2 లక్షల 29వేల పైచిలుకు ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు 64శాతం, ఎస్సీలు 20శాతం, ఓసీలు 10శాతం ఎస్టీలు 2శాతం, ఇతరులు 4శాతం ఉన్నారు. కులాల వారీగా, మాల మాదిగలు 45వేలు, కాపులు 29వేలు, పద్మశాలీలు 28వేలు, గౌడ, ముదిరాజ్‌లు 26 వేల చొప్పున, గొల్లకుర్మలు 25వేలు, రెడ్డీలు 22వేలు, ముస్లింలు 12వేలు, ఎస్టీలు 6500 ఓటర్లున్నారు. నియోజకవర్గంలో దళితుల ఓట్లు 45 వేలకు పైగా ఉన్నాయి. అందుకే వీళ్ల టార్గెట్ గానే దళిత బంధుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. ఈ స్కీం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం చేయనున్నారు. మొదట నియోజకవర్గానికి100 కుటుంబాలకే ఇవ్వాలని నిర్ణయించినా.. తర్వాత మార్చేశారు కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలకు మొత్తంఅందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలకు సాయం చేయనున్నారట. ఈ లెక్కన 10 లక్షల రూపాయలు అందించి.. మాల మాదిగల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.  హుజురాబాద్ నియోజకవర్గంలో కాపుల ఓట్లు 29 వేలు ఉన్నాయి. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత కాపులంతా కమలానికి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ల ఓట్లపైనా ఫోకస్ చేసిన కేసీఆర్.. కాపు సామాజిక వర్గానికే చెందిన మంత్రి గంగుల కమలాకర్ ను నియోజకవర్గంలో తిప్పుతున్నారు. అంతేకాదు కాపు వర్గానికి చెందిన జమ్మికుంట మాజీ సర్పంచ్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్య పేరును టికెట్ కోసం పరిశీలిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఆయనకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని  కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. కాపుల్లో మంచి పట్టున్న మల్లయ్యతో ఆ ఓట్లకు గాలం వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 28 వేల పద్మశాలీ ఓటర్లున్నారు. ఇటీవల కారెక్కిన ఎల్ రమణతో వాళ్ల ఓట్లకు టెండర్ పెట్టారట. నియోజకవర్గానికి చెందిన పద్మశాలి వర్గానికి చెందిన నేత సరగం రవిని కూడా తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సరగం రవికి ప్రజల్లో మంచి పేరుంది. వీళ్లద్దరి ద్వారా పద్మశాలి ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు గులాబీ బాస్.  హుజురాబాద్ నియోజకవర్గంలో ముదిరాజులతో సమానంగా గొల్ల కుర్మల ఓట్లు దాదాపు 28 వేలు ఉన్నాయి. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని ఆలోచించడానికి ఇదే కారణమని తెలుస్తోంది. గెల్లుకు టికెట్ వస్తుందని లీకులు ఇస్తూ ఆ వర్గం మద్దతు కొట్టేయాలని చూస్తున్నారట కారు పార్టీ నేతలు. గెల్లుకు టికెట్ వచ్చినా .. రాకున్నా యాదవ ఓట్లు తమకే పడేలా.. మూడేండ్లుగా పెండింగులో ఉన్న గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇది కూడా తమకు కలిసివస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గానికే చెందిన బీసీ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓట్లను కౌశిక్ రెడ్డి కవర్ చేస్తారని భావిస్తున్నారు. ఆ కోణంలోనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని అంటున్నారు. ఇక ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు.. ఎలాగు బీజేపీని ఓడించేందుకు తమకే సపోర్ట్ చేస్తారని లెక్కలు వేస్తోంది టీఆర్ఎస్. ఇటీవలే గులాబీ గూటికి చేరిన పెద్దిరెడ్డికి క్రిస్టియన్ వర్గంలో మంచి ఓటు బ్యాంక్ ఉందని చెబుతున్నారు.  ఇలా కులాల వారీగా పంపకాలు చేస్తూ, పదవులు ఇస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలతో విపక్షాలు కూడా షాకవుతున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఈటల వెంట ఉన్న నేతలకు కూడా గాలం వేస్తున్నారట గులాబీ లీడర్లు..

తెలుగునేల‌పై అఘోరాలు.. ఆ శివాల‌యంలో పూజ‌లు.. ప్ర‌త్యేక‌త ఏంటి?

అఘోరాలు. రుద్రం, రౌద్రంకు ప్ర‌తిరూపాలు. స‌మాజంలో క‌ల‌వ‌ని శివ సైనికులు. కేవ‌లం శివ ఆరాధ‌నే వారికి స‌ర్వ‌స్వం. శ‌రీర‌మంతా విభూతిధార‌ణ‌. ఖండించ‌ని కేశాలు. న‌గ్న శ‌రీరాల‌తో.. చూట్టానికి భ‌క్తికంటే భ‌య‌మే ఎక్కువ క‌లిగించే సాధువులు. న‌ర‌మాంసం తింటార‌నే ప్ర‌చారం ఉన్నా అదంతా ఒట్టితేనంటారు. కాక‌పోతే, మామూలు శివ ఆరాధ‌కుల కంటే వారి స్వ‌భావం విభిన్నంగా ఉంటుంది. అలాంటి అఘోరాలు కుంభ‌మేళాలు జ‌రిగే చోటే ద‌ర్శ‌న‌మిస్తారు. మిగ‌తా స‌మ‌యమంతా వారు ఎక్క‌డ ఉంటారో.. ఏమి చేస్తారో.. ఎవ‌రికీ తెలీదు. కుంభ‌మేళా ప్రాంతం మిన‌హా మ‌రెక్క‌డా, మ‌రే స‌మ‌యంలోనూ వారి ఉనికి క‌నిపించ‌క‌పోవ‌డం కాస్త ఆశ్చ‌ర్య‌మే. హిమాల‌యాల్లో ఉంటార‌ని కొంద‌రు, కాశీలో, ఆ స‌మీపంలోని దట్ట‌మైన అర‌ణ్యాల్లో ఉంటార‌ని మ‌రికొంద‌రి అంచ‌నా. అందుకే, అఘోరాలు అంటే అంద‌రికీ కాస్త భ‌యంతో కూడిన‌ ఆస‌క్తి. తాజాగా, అలాంటి అఘోరాల బృందం ఒక‌టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచరించ‌డం ఆస‌క్తిగా మారింది. పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. అఘోరాలు వచ్చారన్న విషయం తెలుసుకొని స్థానికులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఇలా పాల్వంచ‌కు అఘోరాలు రావ‌డం.. ఆత్మ‌లింగేశ్వ‌రాల‌యంలో పూజ‌లు చేయ‌డం.. అక్క‌డే స‌హ‌పంక్తి భోజ‌నం చేయ‌డం.. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆ విష‌యం వైర‌ల్‌గా మారింది.  పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం చాలా పురాతనమైనది. స్థానికంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత. ఆత్మలింగేశ్వరరాలయాలు దేశంలోనే చాలా అరుదు. అందుకే, అఘోరాలు ఈ ఆల‌యానికి రావ‌డం, పూజ‌లు చేయ‌డంపై స్థానికంగా, సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.  అయితే, అఘోరాలు పాల్వంచ‌లోని ఆల‌యం సంద‌ర్శించ‌డానికే ప్ర‌త్యేకంగా రాలేదంటున్నారు. వారంతా ఇటీవ‌ల కాశీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు కాలిన‌డ‌క‌న‌ వ‌చ్చార‌ని.. మ‌ళ్లీ కాశీకి తిరిగి వెళుతుండ‌గా.. మార్గ‌మ‌ధ్యంలో పాల్వంచ ఆల‌యాన్ని సంద‌ర్శించార‌ని చెబుతున్నారు. అఘోరాలు ఎక్క‌డ శివాల‌యం క‌నిపించినా అక్క‌డ‌ పూజ‌లు చేయ‌డం సాధార‌ణ విష‌య‌మేన‌ని ఇందులో ఎలాంటి ప్ర‌త్యేక‌త లేదంటున్నారు. ఏదిఏమైనా.. అఘోరాలు పాల్వంచ‌లో కొన్నిగంట‌లు విడిది చేయ‌డం ఆ ప్రాంతంలో హ‌ల్‌చ‌ల్ చేసింది.   

ఆర్థికశాఖ ఉద్యోగుల‌పై వేటు.. జ‌గ‌న్ స‌ర్కారు రివేంజ్‌!.. స‌స్పెన్ష‌న్‌ అందుకేనా..?

అప్పుల కుప్ప‌గా మారిన ఆంధ్రప్ర‌దేశ్‌. మ‌ద్యం షాపుల ఆదాయాన్ని ష్యూరిటీగా చూపించి మ‌రీ అప్పులు తెచ్చిన ఘ‌న‌త‌. ప్ర‌భుత్వ లెక్క‌ల‌కు అప్పుల‌కు లింకు కుద‌ర‌డం లేద‌నే ఆరోప‌ణ‌. పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌ ప్ర‌శ్న‌ల‌కు ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న పొంత‌న‌లేని స‌మాధానాలు. బుర్ర‌క‌థ‌లు మిన‌హా.. అస‌లు క‌థ బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌. ఇలా ఏపీ స‌ర్కారు అడ్డ‌గోలుగా చేసిన అప్పుల‌పై పీఏసీతో పాటు ప్ర‌తిప‌క్ష‌ టీడీపీ.. ప్ర‌భుత్వ ప‌రువంతా తీసి పారేసింది. ఖ‌జానా డొల్ల‌త‌నాన్ని బ‌ట్ట‌లిప్పి న‌డిరోడ్డు మీద నిలుచోబెట్టినంత ప‌ని చేసింది. ప్ర‌తిప‌క్షం సంధించిన ఒక్కో ప్ర‌శ్న‌కు.. గుట‌క‌లు మింగ‌డం మిన‌హా స‌ర్కారు స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోయింద‌ని అంటున్నారు. ఎంతో ర‌హ‌స్యంగా సాగించిన ఆ అప్పుల లెక్క‌ల గూడుపుఠాని సంగ‌తి అస‌లు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌నే సందేహం ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు క‌లిగింది. ఆర్థిక‌శాఖ ఉద్యోగుల‌పై అనుమానం మొద‌లైంది.  క‌ట్‌చేస్తే.. తాజాగా ముగ్గురు ఉద్యోగుల‌పై వేటు ప‌డింది. ఏపీ ఆర్థికశాఖలో ప‌ని చేస్తున్న ఇద్దరు సెక్షన్‌ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ధికశాఖలో సెక్షన్‌ అధికారులుగా పనిచేస్తున్న శ్రీనుబాబు, వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఆ ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. ఆర్థిక‌శాఖ‌లో ముగ్గురు ఉద్యోగులను స‌ర్కారు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. వేటుపై స్ప‌ష్ట‌మైన కార‌ణాలు తెలీక‌పోయినా.. ఆర్థిక శాఖ స‌మాచారాన్ని లీక్‌ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఉద్యోగ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.