ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్.. 

హైదరాబాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. కరెంట్ కట్ చేసింది. స్టేడియానికి సంబంధించి ఇప్పటిదాకా రూ.కోటికిపైగా కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ కొన్ని నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేశామని ఏడీఈ బాలకృష్ణ తెలిపారు. ఉప్పల్ స్టేడియంకు సంబంధించి కరెంట్ బిల్లుల వివాదం గతంలోనూ జరిగింది.  బిల్లు కట్టకుండా కరెంటు వాడుకుంటుండడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)పై గతంలో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ చౌర్యం కేసు నమోదు చేశారు. దీనిపై హెచ్ సీఏ కోర్టుకు వెళ్లగా విద్యుత్ శాఖకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు చెప్పినా హెచ్ సీఏలో మార్పు రాలేదు. ఇటీవలే విద్యుత్ అధికారులు బకాయిల విషయంపై నోటీసులూ జారీ చేశారు. అయినా చెల్లించకపోవడంతో అధికారులు కరెంట్ కట్ చేశారు.  

జ‌గ‌న్ ఇంట్లో సోదాలు.. కీల‌క డాక్యుమెంట్లు సీజ్‌..

బ్రేకింగ్ న్యూస్. త‌ప్పు చేసిన వాడు ఎప్ప‌టికైనా చట్టానికి చిక్కాల్సిందే. అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన ఎక్కువ రోజులు త‌ప్పించుకోలేరు. పాపం పండే రోజు వ‌స్తుంది. అప్పుడు శిక్ష త‌ప్ప‌క ప‌డుతుంది. ప‌వ‌ర్‌ను అడ్డుపెట్టుకొని.. చెయ్యాల్సిన అరాచ‌కాల‌న్నీ చేశారు. లెక్క‌లేనంత ఆస్తులు పోగేశారు. బినామీల పేరుతో కొన్ని.. బంధువుల పేరుతో ఇంకొన్ని.. అక్ర‌మాస్తులు భారీగా కూడ‌బెట్టారు. క‌ట్ చేస్తే.. వ‌న్ ఫైన్ డే ఆ అరాచ‌కాల పుట్ట ప‌గిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జ‌గన్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా జ‌గ‌న్ ఇంట్లో అవినీతి నిరోధ‌క శాఖ సోదాలు చేస్తోంది.  మాజీ డీఎస్పీ జ‌గన్‌ ఇంట్లో 14 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జగన్‌తో పాటు సెక్యూరిటీ గార్డు రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే పోలీసులు స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.   హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న సమయంలో అక్రమాలు చేసినట్లు జగన్‌పై ఆరోపణలు వచ్చాయి. జగన్‌తో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. బోడుప్పల్‌, కొర్రెముల, జోడిమెట్లలో జగన్‌.. వెంచర్స్‌ వేసినట్టు గుర్తించారు. బినామీ పేరుతో పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నట్టు కూడా ఏసీబీ విచార‌ణ‌లో తేలింది. 

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణకు వచ్చేసింది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు హెల్త్ డెరైక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.  కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.  ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని.. ఆమెకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు డా. శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ కూడా సేకరించినట్లు తెలిపారు. కెన్యా మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకినట్లు డీహెచ్‌ వెల్లడించారు. ఇక హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయిందని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. బాలుడికి సంబంధించిన సమాచారాన్ని బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఒమిక్రాన్ నిర్దారణ అయిన ఇద్దరికి టిమ్స్ లో చికిత్స  అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని.. కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస రావు సూచించారు. 

వన్డే సిరీస్ కు కోహ్లీ డుమ్మా! రోహిత్ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకేనా? 

భారత క్రికెట్ లో ముసలం పుట్టిందా? క్రికెటర్లు రెండు గ్రూపులుగా విడిపోయారా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కలిసి ఆడటానికి కూడా ఇష్టపడటం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా బీసీసీఐలో జరుగుతున్న పరిణామాలు, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ డుమ్మా కొట్టడం వంటి అంశాలతో  భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించడంపై పెద్ద దుమారమే సాగుతోందని తెలుస్తోంది.  ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు.. ఇప్పుడు టీమిండియాలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల వ్యవహారం కూడా అలానే ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇవి బాగా ముదిరాయని సమాచారం. ఈ సమయంలోనే కెప్టెన్ గా కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు అప్పగించడం.. ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెంచేంసిందని తెలుస్తోంది. ఒకరి కెప్టెన్ లో మరొకరు ఆడటానికి కూడా ఇష్టపడటం లేదని అంటున్నారు.  అందుకే టెస్టు సిరీస్ కు కెప్టెన్ గా కోహ్లీ ఉండగా..  దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ కు గాయం పేరిట రోహిత్ శర్మ దూరమయ్యారని అంటున్నారు. హిట్ మ్యాన్ కు కౌంటర్ గా  తాను వన్డే సిరీస్ లో ఆడబోనని విరాట్‌ స్పష్టం చేసినట్టు కథనాలు వినిపిస్తున్నాయి..  యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కాక ముందే విరాట్‌ కోహ్లీ  ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆ మెగా టోర్నీ తర్వాత ట్వీట్వంటీ ఫార్మాట్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతానని, వన్డే.. టెస్టు జట్ల సారథిగా మాత్రం కొనసాగుతానని చెప్పాడు. అయితే పరిమిత ఓవర్లలో ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదని భావిస్తూ.. బీసీసీఐ వన్డేల నుంచి కూడా కోహ్లీ సారథ్యానికి ఉద్వాసన పలికి రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం టీమిండియాలో సంచలనంగా మారింది. ఇది విరాట్ కోహ్లీ కూడా ఊహించలేదని అంటున్నారు. వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టంగా చెప్పినప్పటికీ.. తనను అవమానకరంగా తొలగించారనే భావనలో అతడున్నట్టు సమాచారం. ఇది మనసులో పెట్టుకున్నాడో.. మరేంటో కానీ.. వన్డే సిరీస్ లో ఆడనని కోహ్లీ ఇదివరకే బోర్డుకు సమాచారమిచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ ముగిశాక భారత జట్టు కివీస్ తో టీ20, టెస్టు సిరీస్ లు ఆడింది. ఇందులో టీ20 సిరీస్‌ కొత్త కెప్టెన్‌ రోహిత్‌ ఆధ్వర్యంలో జరగ్గా కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత జట్టు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్‌కు రెస్ట్‌ ఇచ్చారు.  దీంతో కెప్టెన్సీ చేతులు మారాక ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు కలిసి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్టు జట్టును ప్రకటిస్తూనే.. వన్డేలకు కూడా రోహిత్‌ సారథ్యం వహిస్తాడని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది విరాట్‌ను తీవ్ర మనస్థాపానికి గురి చేసినట్టు చెబుతున్నారు. తాజాగా కండరాలు పట్టేయడంతో రోహిత్‌ మూడు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. వన్డే సిరీస్‌ వరకల్లా సిద్ధం కావాలనే ఆలోచనలో అతడుండగా.. ఆ సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తుండడంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.  వచ్చేనెల 11న తన కూతురు వామికా మొదటి పుట్టిన రోజు ఉండడంతో వన్డే సిరీస్ కు విరాట్‌ కోహ్లీ దూరంగా ఉండాలనుకుంటున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే సఫారీ టూర్‌కు క్రికెటర్లంతా కుటుంబసభ్యులతోనే వెళుతున్నారు. అంతా ఒకేచోట ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మొత్తం సిరీస్‌ నుంచే వైదొలగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తన కుమార్తె పుట్టినరోజైన 11వ తేదీనాడే మొదలయ్యే టెస్టులో ఆడనున్న కోహ్లీ.. ఆ తర్వాత వారానికి మొదలయ్యే వన్డే సిరీస్ లో ఆడేందుకు అతనికున్న ఇబ్బంది ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఎలాంటి కారణం చెబుతున్నా.. తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకే కోహ్లీ ఇలా చేస్తున్నాడని రోహిత్‌ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు  దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి కావాలని టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమను ఇప్పటిదాకా కోరలేదని బీసీసీఐ తెలిపింది. వచ్చే నెల 19 నుంచి రోహిత్‌ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. ప్రస్తుతానికైతే కోహ్లీ వన్డే సిరీస్‌ ఆడతాడు..  కెప్టెన్‌ కోహ్లీ సహా అందరు ఆటగాళ్లు తమ ఫ్యామిలీలతో ఒకే చార్టెడ్‌ ఫ్లయిట్‌లో వెళతారు. ఒకవేళ టెస్టు సిరీస్‌ తర్వాత విశ్రాంతి కావాలనుకుంటే అతడు తప్పకుండా సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌కు, జైషాకు సమాచారమిస్తాడు  అని బోర్డు అధికారి తెలిపాడు. 

తప్పు చేసి ఉంటే క్షమించండి.. బహిరంగంగా వేడుకున్న టీడీపీ నేత 

సాధారణంగా రాజకీయ నేతలకు అహం ఎక్కువగా ఉంటుందంటారు. ప్రతి విషయంలోనూ తమదే పై చేయి కావాలని కోరుకుంటారు. కొన్ని సార్లు తాను తప్పు చేసినా ఎక్కడ తగ్గరు. తమ తప్పును కూడా ఒప్పు అనేలా వ్యవహరిస్తూ ఉంటారు.  ఇంక జనాల్లోకి వెళితే నాయకుల తీరు మరోలా ఉంటుంది. తమ ఆధిపత్యం ప్రదర్శించడంతో వాళ్ల  ఎక్కడా తగ్గరు. కాని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తాను తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ బహిరంగంగానే ప్రజలకు, పార్టీ కార్యకర్తలను కోరారు.  తప్పుచేసి ఉంటే క్షమించాలంటూ టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శిరస్సు వంచి పార్టీ కార్యకర్తలను కోరారు. టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో గౌరవసభ నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చా వేదిక నిర్వహించగా, రైతులు ఎండ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సభలో యరపతినేని మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.విభేదాలను పక్కనపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు పాటుపడదామని పిలుపునిచ్చారు.  సమష్టిగా పనిచేసి గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని గెలిపించుకుందామన్నారు యరపతినేని శ్రీవివాస రావు. నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. తాను మారానని, మరింతగా మారతానని చెప్పారు. జనవరి నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాచేపల్లిలో గెలిచిన  టీడీపీ కౌన్సిలర్లు ఏడుగురిని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని సన్మానించారు.  

విదేశాల నుంచి రానివారికి ఒమిక్రాన్.. ముంబైలో డేంజర్ బెల్స్...

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి కొత్త  వైరస్ కేసుల సంఖ్య 57కు చేరింది. మహారాష్ట్రలో తాజాగా మరో 8 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబయి నగరంలో వెలుగు చూశాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది.  అయితే తాజాగా ముంబైలో ఒమిక్రాన్ సోకిన వారిలో ఎవరికీ విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు.  వీరిలో ఒకరు బెంగళూరు, మరొకరు ఢిల్లీ ప్రయాణించినట్టు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన కేసుల్లో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, మిగతా ఐదుగురు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని వివరించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరుగురు ఇంటి వద్దనే ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో విదేశీ ప్రయాణ చరిత్ర లేకుండానే ఒమిక్రాన్ కేసులు వెల్లడికావడం కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి చెందుతోందన్న సంకేతాలు ఇస్తోంది.ఇదే ఇప్పుడు ముంబై వాసులను వణికిస్తోంది. 

ఉద్యోగులకు ప్రజలకు మధ్య పీఆర్సీ చిచ్చు..ఇదేనా జగన్నాటకం?

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కంటే, ప్రభుత్వ ఉద్యోగులజీత భత్యాలు. పెన్షన్ల  వ్యయం ఎక్కువగా ఉందంటే, ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను నమ్మడమే కాదు మనందరినీ నమ్మ మంటున్నారు. నిజానికి పీఆర్సీ పేరిట సాగుతున్న ప్రహసనంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే వినిపిస్తున్నాయి.అయితే,ఇది వ్యూహాత్మకంగా పేల్చిన బాంబుగానే చూడ వలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.  రాష్ట్ర  ప్రభుత్వం సొంత ఆదాయంలో 111 శాతం, అంటే ఆదాయం కంటే, 11 శాతం అధికంగా, ప్రభుత్వ ఉద్యోగుల్ జీతాలు. పెన్షన్లకే పోతోందని, చీఫ్ సెక్రటరీ ప్రకటించడాన్ని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి.  ఇటు ప్రభుత్వ ఉద్యోగులను, అటు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే చీఫ్ సెక్రటరీ తప్పుడు సమాచారాన్ని, ప్రజల ముందు ఉంచారని జనసేన ఆరోపించింది. నిజంగా,రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కంటే, జీతాలు, పెన్షన్లు ఎక్కువగా ఉంటే, ఆ విషయాన్ని బడ్జెట్’లో ఎందుకు ప్రస్తావించలేదని, జన సేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు  సామాన్య ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి ఉద్యోగుల గొంతు నొక్కేందుకు చీఫ్ సెక్రటరీ ద్వారా, ఒక అసత్యాని ప్రచారం చేస్తోందని మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజమే, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సమాన్య ప్రజల్లో ఒక విధమైన ఏహ్య భావం, వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది లంచాల కోసం ప్రజలను వేదిపులకు గురి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్వయం కృతం కావచ్చును, లేక ఇతర కరణాలు ఏవైనా ఉన్నా, ఉద్యోగుల పట్ల ప్రజల్లో సద్భావన లేదు.అయితే  జగన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం మాత్రం సరి కాదు.  ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతాలు,పెన్షన్లకు నెలకు రూ.4600 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని, ఉద్యోగ సంఘాలు పదే పదే చెపుతున్నా, ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉంది? ఇప్పుడు ఎందుకు, రూ. 67,000 కోట్లు ఖర్చవుతోందని ఏ లెక్కన చెపుతున్నారని, మనోహర్ ప్రశ్నించారు. ఆలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది తప్ప ఇతర నియమకాలు ఏమీ జరగలేదు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది జీతాలు కేంద్ర నిధుల నుంచే ఇస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ లేదు గ్రూప్ 1,2,3,4 నియామకాలు జరగలేదు. అలాంతప్పుడు, అదనపు భారం ఎక్కడ నుంచి పడుతుందని, జనసేన ప్రశ్నించింది.  అయితే, ఈ లెక్కలు పద్దులు ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహత్మకంగానే పీఆర్సీ ప్రహసనం నడిపిస్తోందని, ప్రజల్లో సహజంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉండే వ్యతిరేకతను మరింతగా పెంచి, ఉద్యోగుల నోరు  మూయించడమే కాకుండా, రాజకీయంగాను ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గోప్యంగా జరిగిపోయే పీఆర్సీ తంతును నెలల తరబడి సాగించి ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకతను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, అందుకే ఉద్యోగులకు ఇస్తున్న జీతాలే ఎక్కువని, పీఆర్సీఇప్పుడు ఒకే చేసినా వచ్చే సంవత్సరం చివరిలో ఎప్పుడో అమలు చేస్తామని చెప్పడం, ఆ విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టి, జనం ముందు వారిని పాపాల భైరవులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు భావిస్తున్నారు.  

స‌ర్కారు వారి సినిమా ఫ‌ట్‌.. పీఆర్సీ పీట‌ముడి.. రోజా గింగిరాలు.. టాప్‌న్యూస్ @ 7pm

1. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏపీలో ఊహించిన దానికంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మ ఒడి, ఉచిత విద్యుత్‌ లాంటి ఉచిత పథకాల వల్ల ఏపీలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందని తెలిపారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్‌ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆ మేర‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  2. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. పిటీషనర్ల తరఫున న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్‌ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వస్తాయి. 3. పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్‌ చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చలు జ‌రిపారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బుధవారం ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని సజ్జల చెప్పార‌ని అన్నారు.  4. సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్‌ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు.  ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని సజ్జల తెలిపారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనన్నారు.  5. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తాజా రాజ‌కీయ పరిణామాలపై చర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌‌ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. సోమవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు.  6. కేసీఆర్ పతనం మొదలయ్యిందని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ గుళ్ళు గోపురాలని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని కడిగేసుకుందామనా... కేసీఆర్‌ వైకుంఠం వెళ్లినా పాపం పోదన్నారు. తలకిందులు తపస్సు చేసినా పాపం తీరదని విమర్శించారు.  7. ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్ కావలసిన విమానం గంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రోజా సహా ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. టెక్నికల్ సమస్యతో విమానాన్ని ల్యాండింగ్ చేయలేకపోయారని రోజా ఆరోపించారు. అసలు విషయం చెప్పకుండా వాతావరణంమీద సాకులు చెప్పారని అన్నారు. 8. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసింది. నవంబర్‌ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరులో ప్రారంభించిన మ‌హా పాద‌యాత్ర 45 రోజుల‌కు అలిపిరిలో ప‌రిస‌మాప్తమైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 450 కి.మీ.పైగా రైతులు పాదయాత్ర చేశారు. వెంక‌న్న ద‌ర్శ‌నం అనంత‌రం.. ఈనెల 17న తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాజ‌ధాని రైతులు సిద్ధమవుతున్నారు.   9. ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఏపీలో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని రాజ్యసభలో మంత్రి భారతి పవార్‌ తెలిపారు.  10. హైద‌రాబాద్‌ కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్పాచౌద‌రి విచారణ ముగిసింది. బ్యాంక్‌ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు తెలుసుకున్నారు. యాక్సెస్ బ్యాంక్ లాకర్‌లో పోలీసులు ఏమీ గుర్తించలేక పోయారు. ఎటువంటి నగదు కాని బంగారు ఆభరణాలు కానీ ల‌భించ లేదు. ఓ సొసైటీకి సంబంధించిన డాకుమెంట్స్‌ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   

అన్ని సభల్లోనూ ప్రాతినిధ్యం.. మాజీ ప్రధాని ఫ్యామిలీ రికార్డ్ 

భారత రాజకీయాల్లో కుటుంబ వారసత్వ  రాజకీయాల గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏదీ ఉండదు. జాతీయ రాజకీయాల నుంచి ప్రాంతీయ రాజకీయాల వరకు, జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఆనావాయితీగా సాగిపోతున్నాయి. అయితే, ఒకే కుటుంబంలో ఇంచుమించుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక చట్ట సభలో సభ్యులుగా ఉండడం లేదా అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఉభ్ సభల్లో ఫ్యామిలీ రిప్రజెంటేషన్’ ఉండడం  కొంత విచిత్రంగానే అనిపిస్తుంది.  మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం, అదిగో అలాంటి అరుదైన రికార్డును సృష్టించింది. పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో దేవెగౌడ ఫ్యామిలీ మెంబర్ సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్న గెలుపొందారు. దీంతో, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం. లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్ర ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా ఘనత సాధించింది. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగా ఉండగా... ఆయన చిన్న కుమారుడు హెచ్డీ కుమారస్వామి చెన్నపట్నం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్.. హాసన్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సూరజ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.  దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవన్న వారసుడే సూరజ్ రేవన్న. వీరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు సైతం ప్రజా జీవితంలో ఉన్నారు. సూరజ్ తండ్రి హెచ్డీ రేవన్న ప్రస్తుతం హొలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు.మరోవైపు, కుమారస్వామి సతీమణి అనిత రామనగర ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెనకటికి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ నుంచి ఇలాగే ఎనిమిదిమంది చట్ట సభల సభ్యులు ఉన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోనూ ఐదుగురు చట్ట సభల సభ్యులు ఉన్నాఋ.కానీ, వారి సభ్యత్వం మూడు సభలకే పరిమితం అయింది. ముఖ్యమంత్రి కేసీర్’తో పాటుగా  ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేలు, మంత్రులు. కేసీఆర్ కూతురు కవిత శాసన మండలి సభ్యురాలు(ఎమ్మెల్సీ), మరో ఇంటి మనిషి  సంతోష్ రాజ్య సభ సభ్యులు, ఎటొచ్చి లోక్ సభ లోనే కేసీఆర్ ఫ్యామిలీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్..

తిరుగులేని శక్తి అయితే దుబ్బాక, హుజురాబాద్ సంగతేంటి కేటీఆర్.. 

తెలంగాణలో జరిగిన ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నిజానికి ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులే ఎక్కువన్నారు. కాబట్టి వాళ్లే గెలిచారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. టీఆర్ఎస్ రెబెల్ రవీందర్ సింగ్ పోటీ చేయడంతో కరీంనగర్ ఎన్నిక కొంత ఉత్కంఠ రేపింది. కాని ఆ సీటును కూడా కారు పార్టీ అనుకున్నదాని కంటే ఈజీగానే గెలుచుకుంది. ఆరు స్థానాలు గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ లో అయితే హంగామా చేశారు.  ఇక స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని మంత్రి  హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ ను గెలిపించారని చెప్పారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లీడర్లు చేసిన ప్రకటనలే ఇప్పుడు చర్చగా మారాయి. టీఆర్ఎస్ కే మెజార్టీ ఉంది కాబట్టి.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని, దీనికి ఇంతగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిజమైందని కేటీఆర్ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో కారే గెలిచిందన్న కేటీఆర్ కామెంట్లపై నెటిజన్లు, విపక్షాల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిస్తే.. దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచింది ఎవరూ సార్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.  ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన విజయం సాధించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక్కో ఓటుకు అరు వేల రూపాయలు ఇస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. హుజురాబాద్ కోసమే ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారు. దళిత బంధు ద్వారా దాదాపు 20 వేల దళిత కుటుంబాలకు .. ఒక్కొ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించారు. కులాల వారీగా తాయిలాలు ప్రకటించారు.అయినా హుజురాబాద్ పై టీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు ఈటల రాజేందర్. గత ఏడాది నవంబర్ లో జరిగిన మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలోనూ అధికార పార్టీకి షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ జిల్లాలో, టీఆర్ఎస్ కు కంచుకోటగా చెప్పకునే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తమకు తిరుగులేదని చెబుతున్న కేటీఆర్.. గత ఫలితాలను గుర్తు చేస్తున్నాయి విపక్షాలు. హుజురాబాద్, దుబ్బాక ఫలితాలను గుర్తు చేస్తూ కేటీఆర్ కు విపక్షాలు కౌంటరిస్తున్నాయి. గెలిచిన వేళ సంబరాలు చేసుకోవడం కామనే కాని.. పాత విషయాలు మర్చిపోయి ఇలా ప్రకటనలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి.  

సజ్జల హ్యాండ్సప్... పీఆర్సీపై ఉద్యోగులకు షాకేనా? 

పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగులకు షాక్ తప్పదని తెలుస్తోంది.  ఫిట్ మెంట్ ను 14.29 శాతం సిఫారస్ చేస్తూ సీఎం జగన్ కు సోమవారం  సీఎస్ కమిటి నివేదిక ఇచ్చింది. పీఆర్సీ కమిటి 27 శాతం ప్రతిపాదించగా సీఎస్ కమిటి 14.29 శాతమే సూచించడంపై ఉద్యోగ సంఘాలు ఫైరవుతున్నాయి. ఐఏఎస్ ల కమిటిైప భగ్గుమంటున్నాయి. తమకు 30 శాతానికి పైగా పీఆర్సీ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగులకు నిరాశ తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఇదే సంకేతం ఇచ్చారు.  సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్‌ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు.  ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని సజ్జల తెలిపారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి సుప్రీంకోర్టు తీర్పు అవరోధం అయ్యిందన్నారు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి ఉందని సజ్జల  తెలిపారు.  రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరాతి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లడుతూ పీఆర్సీ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో అంతర్గత భేటీ నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల కమిటీ రికమెండ్ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదన్నారు.  తెలంగాణలో ఐఆర్ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రికమెండెషన్స్ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యోగులు సీఎంని కలిసే ముందే మార్గాన్ని సుగమం చేస్తామని సజ్జల తెలిపారు.  మరోవైపు పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్‌ చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చల తర్వాత.. ఆ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ బుధవారం ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల  చర్చలు ఏర్పాటు చేస్తామని సజ్జల తెలిపారన్నారు. అయితే ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత సజ్జల మాట్లాడిన విషయాలను బట్టి పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వచ్చాకే ఉద్యోగ సంఘాల కార్యాచరణ తెలిసే అవకాశం ఉంది

అలిపిరిలో ముగిసిన మ‌హాపాద‌యాత్ర‌.. 17న భారీ బ‌హిరంగ స‌భ‌...

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర చేరగానే.. ర‌థానికి 108 కొబ్బరికాయలు కొట్టి యాత్రకు ముగింపు పలికారు. స్థానికులు గుమ్మడికాయలతో దిష్టితీశారు.  మంగళ హారతులు పట్టారు. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి మారిమోగిపోయింది.  నవంబర్‌ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరులో ప్రారంభించిన మ‌హా పాద‌యాత్ర 45 రోజుల‌కు అలిపిరిలో ముగిసింది. రైతులు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 450 కి.మీ.పైగా పాదయాత్ర చేశారు. చివరి రోజు మహాపాదయాత్రకు రాజ‌ధాని ప్ర‌జ‌లు భారీగా తరలివచ్చారు. అమరావతినే ఏపీకి ఏకైక రాజ‌ధానిగా ఉండాలంటూ నిన‌దించారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గుర‌య్యారు రైతులు. మ‌హాపాద‌యాత్ర ముగియ‌డంతో బుధ‌వారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 500 మంది చొప్పున శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు అమ‌రావ‌తి జేఏసీ ప్ర‌తినిధులు. ఆ మేర‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17న తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాజ‌ధాని రైతులు సిద్ధమవుతున్నారు.  

క‌విత ఫ‌స‌క్‌.. కేటీఆర్ ఖ‌ల్లాస్‌.. కేసీఆర్‌కు సంతోషే కీ ప‌ర్స‌న్‌!

సీఎం కేసీఆర్ త‌మిళ‌నాడు వెళ్లారు. శ్రీరంగంలో కుటుంబ స‌మేతంగా స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. మ‌రి, కేసీఆర్ కుటుంబం అంటే ఎవ‌రు? కేటీఆర్‌, క‌విత‌లేగా? కాదంటున్నాయి తాజా ప‌రిణామాలు. కూతురు క‌వితను చాలా రోజుల నుంచి దూరం పెట్టేశారు. కేటీఆర్‌పైనా తండ్రికి న‌మ్మ‌కం పోయిందంటున్నారు. ఇక‌, సంతోష్ కుమారే కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారాడ‌ని అంటున్నారు. శ్రీరంగం ప‌ర్య‌ట‌న‌తో ఆ విష‌యం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. కేసీఆర్ వెంట కూతురు క‌విత లేదు. కేటీఆర్ ఉన్నా.. వెన‌కే ఉండిపోయారు. సంతోషే కేసీఆర్‌కు స‌న్నిహితంగా మెదిలారు. సంతోష్‌కే కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చూస్తేనే తెలిసిపోతోంది. ఇలా కల్వ‌కుంట్ల కుటుంబంలో పొలిటిక‌ల్ కోల్డ్‌వార్ ఓ రేంజ్‌లో కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది.  క‌ల్వ‌కుంట్ల‌ ఫ్యామిలీ వార్ ఈనాటిది కాదు. ద‌శాబ్దాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్న అల్లుడు హ‌రీష్‌రావును కొడుకు కోసం రాజ‌కీయ బ‌లిప‌శువు చేశారు గులాబీ బాస్‌. కేటీఆర్‌ను నెత్తిన పెట్టుకొని.. పార్టీలో, ప్ర‌భుత్వంలో ఫుల్ ప్ర‌మోట్ చేశారు. మంత్రి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌తో అంద‌లం ఎక్కించారు. ఇక ముఖ్య‌మంత్రి కిరీటం క‌ట్ట‌బెట్ట‌డ‌మే త‌రువాయి అనుకుంటుండ‌గా.. కూతురు క‌విత ఎదురు తిరిగింద‌ని అంటారు. అన్నీ అన్న‌కేనా.. మ‌రి, నాకేంటి..? అంటూ అల‌క పూనింద‌ట‌.  కూతురుకేమైనా త‌క్కువ చేశారా?  తెలంగాణ జాగృతితో మెళ్లిగా రాజ‌కీయాల్లోకి దించారు. ఎంపీని చేసి.. ఢిల్లీకి పంపించారు. ఆ త‌ర్వాత ఓడినా.. ఎమ్మెల్సీని చేశారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌రే పేచీ వ‌చ్చింద‌ని అంటారు. అన్న‌తో పోల్చుకుని చెల్లి.. లొల్లి లొల్లి చేసిందంటారు. ఇటు కొడుకు.. అటు కూతురు.. ఇద్ద‌రి మ‌ధ్య తండ్రిగా కేసీఆర్ న‌లిగిపోతున్నార‌ని చెబుతుంటారు. కూతురు ఇప్ప‌టికీ అల‌క‌పాన్పు వీడ‌నే లేదు. అన్న‌కు రాఖీ క‌ట్ట‌లేదు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బ‌తుకమ్మ ఆడ‌లేదు.. పార్టీ ప్లీన‌రీకి రాలేదు.. ఇప్ప‌టికీ కేసీఆర్‌తో దూరంగానే ఉన్నారు. కూతురును కాద‌నుకున్నారు స‌రే.. మ‌రి, కొడుకుతోనైనా స‌ఖ్య‌త‌గా ఉన్నారా అంటే అదీ లేదంటున్నారు. జీహెచ్ఎమ్‌సీ ఎల‌క్ష‌న్ టైమ్ నుంచీ తండ్రీకొడుకుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని.. అవి ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతున్నాయ‌ని చెబుతారు. సంద‌ట్లో స‌డేమియాలో.. ఇదే మంచి త‌రుణంగా.. కేసీఆర్ మ‌ర‌ద‌లు కొడుకు సంతోష్‌కుమార్ వేగంగా ఎదిగారు. కొడుకు, కూతురును మించి.. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితునిగా మారారు. ఎంపీగా ప్ర‌మోష‌న్ కొట్టేశారు. టీఆర్ఎస్ మీడియాను త‌న గుప్పిట్లో పెట్టుకున్నారు. పెద్ద స్థాయి వ్య‌వ‌హారాలు, ఆర్థిక లావాదేవీల‌న్నీ సంతోష్‌కుమారే చూసుకుంటార‌ని అంటారు. కొండా సురేఖ మాట‌ల్లో చెప్పాలంటే.. కేసీఆర్‌కు మందు గోలీలు ఇచ్చే స్థాయి నుంచి.. కేసీఆర్‌ను క‌ల‌వాలంటే సంతోష్ ప‌ర్మిష‌న్ ఉండాల‌నే లెవెల్ వ‌ర‌కూ.. వేగంగా కేసీఆర్‌ను ఆక్ర‌మించేశారని చెబుతారు. అందుకే, ఈట‌ల రాజేంద‌ర్ సైతం పార్టీని వీడుతూ.. సంతోష్‌కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా కేసీఆర్ కుటుంబ స‌మేతంగా శ్రీరంగం టూర్‌లోనూ ఆయ‌న సంతోష్‌కు ఇస్తున్న ప్రాధాన్యం ఎంత‌టిదో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఆసాంతం సంతోష్‌కుమారే వెంటున్నారు. కేటీఆర్‌ది.. జ‌స్ట్ గెస్ట్ రోల్ మాత్ర‌మే.

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కూటమి! కేసీఆర్ కొత్త ఎత్తు..

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగం వెళ్ళారు. శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.కుమార్తె కవిత మినహా కుటుంబ సభ్యులు అందరూ యాత్రలో ఉన్నారు. అయితే, ఇది కేవలం భక్తి యాత్రేనా లేక భక్తి, ముక్తితో పాటు రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్రా అంటే, అదీ ఇదీ రెండు కలసిన యాత్రగానే పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతున్న నేపధ్యంలో సహజంగానే, ముఖ్యమంత్రి మారుతున్న పరిస్తితులకు తగ్గట్టుగా, తమ వ్యూహాన్ని మార్చుకునే ప్రయత్నాలలో ఉన్నారు. అందులో భాగంగానే,కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని  టార్గెట్ చేసేందుకు, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్’టప్ భేటీ అవుతున్నట్లు సమాచారం.  ఐదు దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాట, తర్వాత తెలంగాణలోనే బీజేపీ కొంత బలంగా ఉంది.మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ఆటలో అరటి పండు. మరోవంక తమిళనాడులో అధికార డిఎంకే, కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షం. గత అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. తెలంగాణ విషయం  వచ్చే సరికి, అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలు. ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉప్పు, నిప్పు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ, కాంగ్రెస్ పార్టీ తెరాసతో సంబంధం పెట్టుకున్న మరు క్షణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో   ఉండరని , ఆయన నైజం తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది.      అలాగే కర్ణాటకలోనూ  బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధి. కేరళలోనూ కాంగ్రెస్, వామ పక్ష కూటమి మధ్యనే పోటీ బీజేపీకి కనీసం ఉనికి కూడాలేదు. ఇక పొరుగు రాష్ట్రం ఏపీ విషయానికి వస్తే, వైసీపీ, టీడీపీల మధ్యనే పోటీ, వైసీపీ లేదా టీడీపీ ఎట్టిపరిస్థితిలోనూ తెరాసతో చేతులు కలిపే అవకాశమే లేదు. అదే జరిగితే అది ఆ పార్టీల ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. కాబట్టి, కేసీఆర్ గతంలో ప్రయత్నించి విఫలమైన థర్డ్‌ఫ్రంట్‌ లానే, దక్షిణాది రాష్ట్రాల ప్రాతీయ పార్టీల కూటమి కూడా మరో విఫల ప్రయోగంగానే మిగులుతుందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, దేశంలో ఇటు దక్షిణాదిలో అయినా అటు ఉత్తరాదిలో అయినా కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఫ్రంట్ ఏదీ కూడా బీజేపీని బలంగా ఎదుర్కొనలేదని, రాజకీయ విశ్లేషకులు చాలా గట్టిగా చెపుతున్నారు.  అందుకే, కాంగ్రెస్ పార్టీని, యూపీఏ కూటమిని కాదని మమతా బెనర్జీ  చేస్తున్న మరో కూటమి ప్రయత్నం అయినా అయ్యే పని కాదనే అంటున్నారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఏదైనా బీజేపీ/ ఎన్డీఏకి ప్రత్యాన్మాయం కాలేదు ...అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ సహా అందరి అభిప్రాయం అదే ... పైకి ఎవరు ఏమి చెప్పినా ... కాంగ్రెస్ లేని ఫ్రంట్ .. నిలబడదు.

ముందస్తు ఎన్నికలకు జగన్? పీఆర్సీతో పొలిటికల్ స్కెచ్!  

మధ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారా? ఆ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయా? పీఆర్సీపై సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదికలో ముందస్తు సిగ్నల్ కనిపిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పీఆర్సీపై సీఎం జగన్ కు సీఎస్ కమిటి ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఉన్నాయి. ఫిట్ మెంట్ ను 14.29 శాతం సిఫారస్ చేసింది సీఎస్ కమిటి. ఇక్కడే మరో కండీషన్ కూడా పెట్టింది. పెరిగిన పీఆర్సీ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమలు కానుంది. అంటే ఏడాది తర్వాత నవంబర్ లో పెరిగిన వేతనం తీసుకుంటారు ఉద్యోగులు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ఉద్యోగులు  30 శాతానికి పైగా పీఆర్సీ కావాలని డిమాండ్ చేస్తుండగా.. సీఎస్ కమిటి మాత్రం 14.29 చాలని చెప్పింది. అది కూడా వచ్చే  ఏడాది నవంబర్ లో ఇవ్వాలని సూచించింది. ఎందుకిలా.. పీఆర్సీని ఇప్పుడు ప్రకటించి 11 నెలల తర్వాత ఇవ్వడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎస్ కమిటీ అంటే సీఎంకు తెలియకుండా పనిచేసే అవకాశం ఉండదు. సీఎస్ కమిటి సిఫారస్ అంటే అవి దాదాపుగా సీఎం ప్రతిపాదనలే.. మరీ ఎందుకు 11 నెలలు వాయిదా వేస్తున్నారు.. నిధుల కొరత వల్లే సర్కార్ ఇలా చేస్తుందా.. అంటే కాదనే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నిధుల కొరత ఉంటే.. వచ్చే నవంబర్ లోనూ అదే పరిస్థితి ఉంటుంది. ఏపీ ప్రభుత్వానికి కొత్తగా వచ్చే ఆదాయం ఏదీ లేదు. ఇంకా చెప్పాలంటే మరో 11 నెలల సమయానికి ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది.  ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసింది జగన్ రెడ్డి సర్కార్. ఇంకా చేస్తూనే ఉంది. ఎక్కడ దొరికితే అక్కడా ఎడాపెడా రుణాలు తీసుకుంటూనే ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ప్రతి నెలా అప్పులు చేస్తూనే ఉంది. చివరికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పు తేవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ లో అదనంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏది లేదు. అయినా ప్రభుత్వం పెరిగిన పీఆర్సీని నవంబర్ నుంచి ఇస్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చే  ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసే యోచనలో  సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. అక్టోబర్ లో అసెంబ్లీని డిసాల్వ్ చేసి మధ్యంతర ఎన్నికలను పోవాలనే జగన్ వ్యూహంలో భాగంగానే..  ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వచ్చే ఏడాది అక్టోబర్ నెల నుంచి ఇస్తామని సీఎస్ కమిటీ సిఫారస్ చేసిందని, ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే జరిగిందని అంటున్నారు.  ఇప్పుడిస్తున్న జీతమే ఎక్కువ.. తగ్గించేద్దాం! సీఎంకు సీఎస్ కమిటి నివేదిక... ఏడాదికి సంబంధించి ఆదాయవ్యయాలను సంబంధించిన లెక్కలన్ని మార్చిలోనే ఖరారవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన రుణాల గురించి మార్చిలో క్లారిటీ వస్తోంది. అందుకే జగన్ సర్కార్ ఈ స్కెచ్ వేసిందని అంటున్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దొరికినకాడికి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు పంపిణి చేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఓట్లే లక్ష్యంగా మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చి..  ఓటర్లకు పంచిపెట్టాలనే యోచనలో వైసీపీ సర్కార్ ఉందంటున్నారు. ఇలా అవకాశం ఉన్నంత వరకు అప్పులు తెచ్చి... జనాలకు అందించి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి.. అమలు మాత్రం మరో 11 నెలల తర్వాత ఉండేలా స్కెచ్ వేశారని తెలుస్తోంది.  నవంబర్ నెలలో కొత్త పీఆర్సీ అందుకోవాల్సిన ఉద్యోగులు.. ప్రభుత్వం రద్దు అయితే చేసేదిమి ఉండదు. పీఆర్సీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు వైసీపీ ఆగ్రహంగా ఉంటారన్న ప్రశ్న రావొచ్చు. వాళ్లంతా జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తారు కదా.. ప్రభుత్వం ఎందుకిలా చేస్తుందని అన్నఅనుమానం కూడా వస్తోంది.  అయితే ఉద్యోగులంతా ఇప్పటికే జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ పాలనతో తీసుకున్న అస్తవ్యస్థ విధానాలతో వాళ్లంతా విసిగిపోయి ఉన్నారు. గత చంద్రబాబు పాలనతో ప్రస్తుతం వైసీపీ పాలనను పోల్చుకుంటూ మండిపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఎప్పుడు జగనన్న ఇంటికి పంపిద్దామన్న అన్న భావనలో ఉన్నారు. సీఎం జగన్ కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే పీఆర్సీ ఇచ్చినా ఉద్యోగులు వైసీపీకి మద్దతుగా ఉండరనే ఉద్దేశ్యంతోనే.. ఇలా స్కెచ్ వేశారని అంటున్నారు. ఉద్యోగులు ఎలాగూ తమకు సపోర్ట్ చేయరు కాబట్టి... వాళ్లతో కొత్తగా వచ్చే సమస్య ఏది ఉండదని జగన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.  పదవి ఫసక్?.. సోము వీర్రాజుకు హైకమాండ్ పిలుపు.. 

న‌గ‌రిలో రోజాకు ఎర్త్‌!.. చ‌క్రం తిప్పుతున్న పెద్ద‌లు!

ఎమ్మెల్యే రోజాకు తెలుగు స్టేట్స్‌లో ఫుల్ పాపులారిటీ. మాజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ ఉంది. జ‌బ‌ర్ద‌స్త్‌తో జ‌బ‌ర్ద‌స్త్ పేరు వ‌చ్చింది. వైసీపీలోనూ క్రేజ్ బాగానే ఉంది. జ‌గ‌న‌న్నకు దేవుడిచ్చిన చెల్లెలిగా సీఎంతో సాన్నిహిత్యం ఉంది. న‌గ‌రిలోనూ ప్ర‌జాధార‌ణ ఉండ‌టంతో ఎమ్మెల్యేగానూ గెలిచారు. అన్నీఉన్నా.. జిల్లా నేత‌ల‌తో మాత్రం అస‌లేమాత్రం స‌ఖ్య‌త లేదు. రోజా ముంద‌రి కాళ్ల‌కు బంధాలు వేసేందుకు.. పెద్ద పెద్ద లీడ‌ర్లంతా త‌మ‌దైన స్టైల్‌లో సంకెళ్లు వేస్తున్నారు. జ‌గ‌న్‌తో క్లోజ్‌నెస్ వ‌ల్ల ఎలాగోలా రాష్ట్ర స్థాయి ర‌చ్చ‌బండ‌లో గెలుస్తూ వ‌స్తున్నా.. న‌గ‌రిలో మాత్రం అడుగ‌డుగునా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌లి స్థానిక సంస్థ‌ల ఎల‌క్ష‌న్ల‌తో ఆ జ‌గ‌డం మ‌రింత ముదిరింది. రోజా వ‌ర్గం.. రోజా వ్య‌తిరేక వ‌ర్గంగా న‌గ‌రి వైసీపీ చీలిపోయింది. జిల్లా మంత్రుల అండ‌దండ‌ల‌తో.. రోజా వ్య‌తిరేకులు రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్నారు. రోజాకు రాజ‌కీయ‌ ముళ్లుల్లా మారుతున్నారు.  నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ముఖ్యనేతలు నగరిలో సమావేశమ‌య్యారు. మ‌రోసారి రోజాను గెలిపించేది లేద‌ని తీర్మానించారు. ఈ ఐదుమండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో మంచి పట్టు ఉన్న వారే. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రోజా విజయానికి వీరంగా కృషి చేశారు. ఆ త‌ర్వాత స‌మీక‌ర‌ణాలు మారుతూ వ‌చ్చాయి. రోజా త‌న సొంత వ‌ర్గాన్ని పెంచుకుంటూ వ‌చ్చారు. ఆ క్ర‌మంలో ప‌లువురు నేత‌లు ఆమెకు దూర‌మ‌య్యారు. వారంతా రోజా వ్య‌తిరేక వ‌ర్గం పెద్ద‌ల పంచ‌న చేరిపోయారు. పెద్దల దీవెన‌లు ల‌భించ‌డంతో.. ఆ ఐదు మండ‌లాల ముఖ్యనేత‌లు రోజాకు వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టారు. ఆమెను ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. గెలిపించ‌డం కాదు.. అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్ద‌ని వారంతా డిమాండ్ చేస్తున్నారు. త‌మ‌ను కాద‌ని రోజాకు పోటీలో నిలిపితే.. గెలిపించే ప్ర‌స‌క్తే లేద‌ని తీర్మానించుకున్నారు.  న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ ముఖ్య‌ నేత‌లంతా ఇలా ఎమ్మెల్యే రోజాపై రివ‌ర్స్ కావ‌డం మామూలు విష‌యం కాదు. పెద్ద‌ల బ్లెస్సింగ్స్ లేనిదే వారంతా సాహ‌సం చేసుండ‌రు. మొద‌టి నుంచీ రోజాకు కంట్లో న‌లుసులా మారిన మంత్రి పెద్దారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామిల ద‌న్నుతోనే న‌గ‌రి వైసీపీ నాయ‌కులు ఇలా మీటింగ్ పెట్టి.. రోజాకు టికెట్ ఇవ్వొదంటూ తీర్మానాలు చేసే వ‌ర‌కూ వెళ్లార‌ని అంటున్నారు. విష‌యం తెలిసి ఎమ్మెల్యే రోజా ఫైర్ అవుతున్నారు. గ‌తంలో మాదిరి క‌న్నీళ్లు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని.. చిన్నా-పెద్ద‌లు అంద‌రితో తేల్చుకుంటాన‌ని మండిప‌డుతున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు మంత్రి మండలి విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మినిస్ట‌ర్ పోస్ట్ ప‌క్కాగా వ‌స్తుంద‌ని.. అప్పుడు వాళ్ల సంగ‌తి చూసుకుంటాన‌ని త‌న స‌హ‌చ‌రుల ద‌గ్గ‌ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు రోజా. 

అమెరికాలో కొత్త చ‌ట్టం!.. డాల‌ర్ డ్రీమ్స్‌పై ప్ర‌భావం...

‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు చట్టంగా ఆమోదం పొందితే తమ డాలర్ డ్రీమ్స్‌కు బ్రేక్లు వేస్తుందనే ఆందోళనను పలువురు భారతీయ టెకీలు వ్యక్తం చేస్తున్నారు. ‘అమెరికా ఉద్యోగాలు అమెరికా పౌరులకే’ అనే వాదనకు ఈ మధ్య కాలంలో స్థానికంగా మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు అమెరికా ప్రతినిధుల సభం ‘కాంగ్రెస్’ ముందుకు వచ్చింది. ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ బ్యాంక్స్ సభలో ప్రవేశపెట్టారు. అమెరికా కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉందన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. నిజానికి అగ్రరాజ్యంలో స్థిరపడాలి, డాలర్స్ రూపంలో దండిగా సంపాదించాలనుకునే వారు ముందుగా లక్షలు ఖర్చు పెట్టి, స్టూడెంట్ వీసాపై అమెరికా వర్శిటీల్లో చదువుకోవాలి. వృత్తిలో అనుభవం సంపాదించేందుకు ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (ఓపీటీ) కోసం విద్యార్థులు ఏదో ఒక అమెరిన్ సంస్థలో జాబ్ కొట్టాలి. ఓపీటీ శిక్షణ పూర్తయ్యే లోగా హెచ్ 1బీ సంపాదించుకున్న విద్యార్థి డాలర్ డ్రీమ్స్ కల నిజం అవుతుంది. ఒక వేళ హెచ్ 1 బీ వీసా రావడం ఆలస్యం అయితే.. స్టూడింట్ వీసాను మరికొంత కాలం పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఓపీటీ, హెచ్ 1బీ వీసా భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు అంత్యంత కీలకం అనే చెప్పాలి. ఓపీటీ, హెచ్ 1బీ వీసా అంశాల్లో అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్ మార్పులు ప్రతిపాదిస్తోంది. హెచ్ 1బీ వీసాదారులకు ఇచ్చే జీతాల్లో మార్పులు చేయడం ఈ చట్టంలోని ప్రధాన అంశం. హెచ్ 1బీ వీసా ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే.. అంతకు ముందు అదే ప్లేస్ లో పనిచేసిన అమెరికన్ కు ఇచ్చిన జీతం కంటే ఎక్కువ ఇవ్వాలని ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా ప్రతిపాదిస్తోంది. లేదంటే హెచ్ 1బీ కలిగిన టెకీకి లక్షా 10 వేల డాలర్లు వార్షిక వేతనంగా చెల్లించాలని చెబుతోంది. ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ కొత్తగా పెడుతున్న ఈ రెండు నిబంధనలు భారతీయ కంపెనీల నెత్తిన పిడుగులా మారతాయని పరిశీలకుల విశ్లేషణ. దీంతో పాటు థర్డ్ పార్టీ కంపెనీలు స్పాన్సర్ చేసే హెచ్ 1బీ వీసా కాలాన్ని ఒక్క ఏడాదికే పరిమితం చేయాలనే ప్రతిపాదన కూడా భారతీయ కంపెనీలకు ఇబ్బందిగా మారనుంది. వీసా పునరుద్ధరణ వ్యయం భారమై.. స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపించకపోవచ్చని నిపుణుల అంచనా. ఇది కూడా డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు చల్లుతుందని అంటున్నారు. మరో పక్కన.. ఓపీటీ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలనేది కొత్త ముసాయిదా ప్రతిపాదన. ఇది కూడా భారతీయుల డాలర్ డ్రీమ్స్ కు బ్రేకులు వేస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓపీటీ సౌకర్యం వల్లే భారతీయ విద్యార్థులు అమెరికాలో లక్షలు ఖర్చుచేసి చదివేందుకు ముందుకు రావడం గమనార్హం. ఓపీటీ తొలగించాలనే ప్రతిపాదనపై అమెరికాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఓపీటీ నిబంధన అమలు చేస్తే.. భారతీయ విద్యార్థులు కెనడా బాట పట్టే ప్రమాదం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది అమెరికా వర్శిటీలనే ఆర్థికంగా నష్టపరిచే అంశం అవుతుందంటున్నారు. ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. ప్రతినిధుల సభలో ఓకే అయితే.. ఎగువ సభ సెనెట్కు వెళ్తుంది. అక్కడా ఆమోదం పొందితేనే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఇదే జరిగితే.. తమ డాలర్ డ్రీమ్స్ పరిస్థితి ఏమిటనే చర్చ భారతీయ టెకీల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

విమానంలో డేంజర్ బెల్స్.. ఎమ్మెల్యే రోజా గుండె గుబేల్.. 

వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం జరిగే ముప్పుందని గ్రహించిన పైలట్.. విమానాన్ని కిందకు దించలేదు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం.. 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు. విమానంలో రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదు. దీంతో 4 గంటల పాటు రోజా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి రోజా వీడియోను కూడా విడుదల చేశారు. డోర్లు కూడా తెరవడం లేదని, తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగళూరులో దింపారని ఆమె అందులో తెలిపారు. గ్రౌండ్ లో పరిస్థితేంటో తెలియదని చెప్పారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినా.. అక్కడ పర్మిషన్ ఉందో లేదో చెప్పట్లేదన్నారు. డోర్లు కూడా తెరవడం లేదని తెలిపారు. మబ్బులున్నాయని, కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని, కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తెలిసిందని ఆమె చెప్పారు. విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకే బెంగళూరుకు వచ్చామని ఫ్లైట్ అధికారులు చెప్పారన్నారు. విమానంలో ప్రయాణికులు భయపడిపోతున్నారని, అరుస్తున్నారని రోజా చెప్పారు. చంపేస్తారా? అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను కిందకు దించేందుకు ఎయిర్ పోర్టు అధికారుల నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదని పైలట్లు చెబుతున్నారన్నారు. విమానంలో ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టుందని ఆమె చెప్పారు. ట్రైన్లైనా, ఫ్లైట్స్ అయినా యాక్సిడెంట్లు అవుతాయన్న భయంతో ట్రావెల్ ను ఆపలేం కదా అని అన్నారు రోజా.  తనకిలా జరగడం ఇది రెండోసారన్నారు. అంతకుముందు హైదరాబాద్ లో విమానం టైర్ పేలిపోయి రాత్రి 10.40 గంటల సమయంలో ఇలాగే డోర్లు క్లోజ్ చేసి పెట్టారని గుర్తు చేశారు.  ఇటీవలే తనకు మేజర్ ఆపరేషన్ అయిందని, ఒకే చోట నాలుగు గంటలు తాను కూర్చోలేనంటూ పైలట్ తో మాట్లాడానని ఆమె తెలిపారు. తన పొట్టకు 29 కుట్లు వేశారన్నారు. దాని వల్ల పొట్ట మీద భారం పడుతుందన్నారు.తనతో పాటు లావణ్య అనే తన కజిన్ విమానంలో ఉన్నారని చెప్పారు. చాలా నొప్పిగా, బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు. మెడికల్ గ్రౌండ్ లో దింపుతామని, అయితే, దానిని చెక్ చేసేందుకు సంబంధిత అధికారులు రావాల్సి ఉందని ఫ్లైట్ అటెండెంట్ చెప్పారని తెలిపారు. అయితే విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్తారన్న దానిపై స్పష్టత లేదని, వెనక్కు తీసుకెళ్తారా? వేరే విమానం అరెంజ్ చేస్తారా? అన్నది చెప్పట్లేదని తెలిపారు. 

జాతీయ పార్టీలలో ఉద్యమ పార్టీల విలీనం?  

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన కీలక నేతలు కొందరు రాష్ట్ర సాధన తర్వాత తెరాసకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను, కుటుంబ పాలనను,  వ్యతిరేకించి బయటకు వచ్చారు.అందులో కొందరు సొంతంగా పార్టీలు పెట్టారు. అయినా,కేసీఆర్ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలను తట్టుకుని నిలవలేక పోయారు. జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండ రామ్   స్థాపించిన తెలంగాణ జన సమితి(టీజేఎస్) సహా ఏ ఒక్క పార్టీ కూడా ఆశించిన మేరకు ప్రజాదరణ పొందలేక పోయింది. చివరకు కోదండరామ్ సహా ఆ పార్టీ తరపున, పోటీచేసిన ఏ ఒక్కరూ ఏఒక్క ఎన్నికలోనూ  గెలవలేదు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరామ్ గెలవలేక పోయారు. ఒక్క కోదండరామ్ మాత్రమే కాదు, తెలాగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన చెరుకు సుధాకర్  ఏర్పాటు చేసిన  తెలంగాణ ఇంటి పార్టీ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ ఏర్పాటు చేసిన ‘యువ తెలంగాణ’ పార్టీలు కూడా తెలంగాణ రాజకీయలను అంతగా ప్రభావితం చేయలేక పోయాయి.   ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రాష్ట్రంలో పట్టుపెంచుకుని, తెరాసకు ప్రత్యాన్మాయంగా నిలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉద్యమ పార్టీలుగానే మిగిలిపోయిన పార్టీలు, నాయకులు  ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరాసను ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీలతో చేతులు కలిపేందుకు, తమ పార్టీలను జాతీయ పార్టీలలో విలీనం చేసేదుకు  సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా చెరుకు సుధాకర్  ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇంటి పార్టీ’, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ ఏర్పాటు చేసిన ‘యువ తెలంగాణ’ పార్టీలు విలీనం  దిశగా అడుగులు వేస్తున్నాయని అంటున్నారు.   రాష్ట్రంలో తెరాస తర్వాత అన్ని విధాలా బలమైనపార్టీ ఏదైనా ఉందంటే అది, కాంగ్రెస్ పార్టీనే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉంది ... బలమైన నాయకులు ఉన్నారు.. ఇంచుమించుగా 20 శాతం ఓటు బ్యాంక్ వుంది. అన్నిటినీ మించి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మీదున్న నాయకుడు. తెరాస నాయకత్వాన్ని, తెరాస ప్రభుత్వాన్ని ఎదుర్కునే సత్తా, సామర్ధ్యం ఉన్న నాయకుడు. అయితే, కాంగ్రెస్ నాయకుల మధ్య అనైక్యత కారణంగా హస్తం పార్టీని తెరాసకు ప్రత్యాన్మాయంగా నిల్దోక్కుకోలేక్ పోతోంది. మరో వంక హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్ వరకు జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం (హుజూర్ నగర్) సహా నలుగు స్థానాల్లో ఓడిపోయింది. మరోవంక, బీజేపీ,అధికార తెరాస సిట్టింగ్  స్థానాలు రెండింటిని ( దుబ్బాక, హుజూరాబాద్ ) సొంతం చేసుకుంది. అన్నిటినీ మించి బీజేపీ కేంద్రంలో అధికారంలో వుంది. జాతీయ నాయకత్వం బలంగా వుంది. ఈ  కారణంగా తెరాసకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం బలపడుతోంది.  ఈ నేపధ్యంలోనే తెలంగాణ ఉద్యమ నాయకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తెరాస నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి, హుజూరాబాద్’ ఉప ఎన్నికలో విజయ కేతనం ఎగరేయడంతో, తెరాస, కేసీఆర్ వ్యతిరేక శక్తులు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నాయి.   అయితే జాతీయ పార్టీలలో ఉద్యమ పార్టీల విలీనం విషయం వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్లుగా వార్తలు అందుతున్నాయి.  ప్రొఫెసర్ కోదండ రామ్ .. టీజేఎస్ ను కాంగ్రెస్  పార్టీలో విలీనం చేసినా చేయక పోయినా కాంగ్రెస్, వామ పక్షాలతో కలిసి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నారని సమాచారం. ఇటీవల టీఎన్జీఓ మాజీ నాయకుడు విఠల్‌, తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిన నేపధ్యంలో  కోదండరామ్ కూడా బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినవచ్చినా, అలాంటి ఆలోచన లేదని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. అలాగే చెరుకు సుధాకర్ కూడా  తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీలు బీజేపీలో విలీనం చేసేందుకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  మరో వంక ఉద్యమ నాయకులతో మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీని ఇంకొక ప్రాంతీయ పార్టీ మాత్రమే దీటుగా ఎదుర్కోగలదని ఆయన అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో  తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్’ తో పొత్తుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సో .. రాష్ర రాజకీయాల్లో ముందు ముందు అనేక మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి.