చంద్ర‌బాబు రాజీనామాల స‌వాల్‌.. జ‌గ‌న్‌కు ద‌మ్ముందా?

మా వాళ్లు రెడీ.. మీ వాళ్లు రెడీయా? జగన్‌కు చంద్ర‌బాబు విసిరిన‌ సవాల్ ఇది. విజ‌యంపై ఎంత న‌మ్మ‌కం ఉంటే టీడీపీ అధినేత ఈ స‌వాల్ చేసుంటారు. మ‌రి, ప్ర‌జ‌లంతా మావెంటే అన్నారంటూ విర్ర‌వీగుతున్న వైసీపీ.. చంద్ర‌బాబు విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తుందా? రాజీనామాల‌కు సై అంటుందా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌. ఇంత‌కీ ఏంటీ రాజీనామాల స‌వాల్‌? చంద్ర‌బాబు ఎందుకంత దూకుడు మీదున్నారు?  ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి.. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ సీఎం జగన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు మండిపడ్డారు. "హోదాపై ఎందుకు పోరాడలేక పోయారు? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చెయ్యమనండి. మా ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తారు. హోదా కోసం 25 మంది ఎంపీల రాజీనామాల సవాల్‌కు జగన్ సమాధానం చెప్పాలి." అన్నారు చంద్ర‌బాబు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు పోరాడరని చంద్రబాబు నిల‌దీశారు. హోదా వస్తే ఒంగోలు లాంటి పట్టణం హైద్రాబాద్ అవుతుందని నాడు జగన్ అన్నారు. హోదా వస్తే రాష్ట్రమే మారిపోతుందని జగన్ అనలేదా?హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ప్రత్యేకహోదా తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్‌ గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్ర‌త్యేక హోదాపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడదామన్నారు. ఈ సవాలుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దని జ‌గ‌న్‌కు చంద్రబాబు హితవు పలికారు.    విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం చెబితే ప్రభుత్వం ఏం చేస్తోంది? విభజన హామీల అమలు విషయంలో సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. విశాఖకు రాజధాని తెస్తాం అంటున్న జగన్.. రైల్వే జోన్ గురించి ఏమి చెబుతారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్‌కు ముందే సమాచారం ఉంది. విశాఖ ఉక్కు ఒక పరిశ్రమ మాత్రమే కాదు..సెంటిమెంట్ అని చంద్ర‌బాబు అన్నారు.   వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని.. రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. 

ఇదేంది జగనన్న.. మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే దిక్కులేదు! 

కుయ్ కుయ్ కుయ్.. ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సభల్లో ఎక్కువగా పలికిన పదం. తండ్రి బాటలోనే ఆయన తనయుడు కూడా తన ఎన్నికల సభల్లో ఇదే పదాన్ని ఎక్కువగా వాడుకున్నారు. 108 అంబులెన్సుల గురించి చెబుతూ కుయ్ కుయ్ కుయ్ మంటూ వైఎస్సార్ హయాంలో వచ్చేవని చెప్పేవారు. ఈ మాటలు అనగానే జనాల నుంచి మంచి స్పందన వచ్చేది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా కూడా జగన్ 108ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరూ ఫోన్ చేసినా ఐదు నిమిషాల్లోనే 108 అంబులెన్స్ వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు.  అయితే అనంతపురం జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సీఎం జగన్ కు తీవ్ర ఇబ్బందిగా మారింది.  జగన్ ను ఉద్దేశించి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ``జగనన్నా.. మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే దిక్కు లేదు.. ఇప్పుడు ఏం చెబుతావ్!!`` అని  ప్రశ్నలు సంధిస్తున్నారు.  ఇంతకు అనంతపురం జిల్లాలో ఏం జరిగిందంటే.. అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు గాయపడ్డాడు ఆ సమయంలో అనంతపురం నుంచి అదే రోడ్డు మార్గంలో రాయదుర్గం వెళ్తున్న వైసీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి గాయపడిన యువకుడిని చూశారు. వెంటనే 108 వాహనానికి మూడు సార్లు తానే ఫోన్ చేశారు. అయినా అంబులెన్స్ రాలేదు. ఈ విషయాన్ని సమీప ఆసుపత్రికి కూడా చెప్పారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. అయినా అంబులెన్స్ రాలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఎమ్మెల్యే కాపు ఒక ప్రజా ప్రతినిధి గాయపడిన వ్యక్తి కోసం ఫోన్ చేస్తే రాకపోవడం రాకపోవడం ఏంటని ఆంబులెన్స్ సిబ్బందిపై ఫోన్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎవరూ రియాక్ట్ కాలేదు. చివరకు ఆయనే స్వయంగా గాయపడిన యువకుడిని ప్రైవేటు వాహనంలో అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. `దీనికే మంటావు.. జగనన్నా!`` అంటూ.. నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో 108 సేవలు దారుణంగా ఉన్నాయని, ఎవరూ ఫోన్ చేసినా సరిగా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా మందికి 104 108 సేవలు సమయానికి అందుబాటులో లేవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం  ఇవన్నీ గిట్టనివారు.. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వాదనగా  కొట్టిపారేశారు. అయితే  తాజాగా జరిగిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యేనే నివ్వెర పోవడంతో 108 అంబులెన్సుల పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతోంది. 

చంద్ర‌బాబు వ‌ర్సెస్ ద‌గ్గుబాటి.. ఏంటి గొడ‌వ‌? అస‌లేం జ‌రిగింది?

నారా చంద్ర‌బాబు నాయుడు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. నంద‌మూరి తార‌క‌రామారావు అల్లుల్లు. తోడ‌ల్లుళ్లుగా ఎంతో స‌ఖ్య‌త‌గా ఉండేవారు. టీడీపీలో ఎన్టీఆర్ సుప్రీం లీడ‌ర్‌ అయితే.. పార్టీలో నెంబ‌ర్ 2, నెంబ‌ర్ 3గా నారా, ద‌గ్గుబాటి ఉండేవారు. రామారావుకు కుడి-ఎడ‌మ‌లా ద‌న్నుగా నిలిచేవారు. రాజ‌కీయ చాణ‌క్యం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు మెండుగా ఉన్న చంద్ర‌బాబు.. ద‌గ్గుబాటి కంటే యాక్టివ్‌గా పాలిటిక్స్ చేసేవారు. ఆగ‌ష్టు సంక్షోభంలో చంద్ర‌బాబు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. నాదెండ్ల ఎపిసోడ్‌ను డైన‌మిక్‌గా హ్యాండిల్ చేశారు. ప్ర‌భుత్వంలో, పార్టీలో చురుగ్గా ఉంటూ.. ఎన్టీఆర్‌కు మ‌రింత స‌న్నిహితుల‌య్యారు చంద్ర‌బాబు.  అలా అలా ఏళ్ల పాటు టీడీపీ నావ సాఫీగా సాగిపోయింది. చంద్ర‌బాబు, ద‌గ్గుబాటిల ధ్వ‌యానికి పార్టీలో తిరుగులేకుండా పోయింది. తోడ‌ల్లుళ్లు ఎన్టీఆర్‌తో, ప్ర‌జ‌ల‌తో శెభాష్ అనిపించుకున్నారు. అంత‌లోనే ల‌క్ష్మీపార్వ‌తి రూపంలో.. ఇటు నంద‌మూరి కుటుంబంలో, అటు తెలుగుదేశం పార్టీలో ముస‌లం పుట్టింది. అది సునామీలా మారింది. ల‌క్ష్మీపార్వ‌తి పెత్త‌నం, ఆమె చేతిలో పులిలాంటి ఎన్టీఆర్ పిల్లిలా మార‌డాన్ని ఎదురించ‌క‌ త‌ప్ప‌లేదు. అలాంటి అత్యంత సంక్లిష్ట స‌మ‌యంలో.. చంద్ర‌బాబు-ద‌గ్గుబాటి జోడి.. మ‌రోసారి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. వైశ్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ మొత్తాన్ని వారిద్ద‌రే హ్యాండిల్ చేశారు. నంద‌మూరి కుటుంబ మ‌ద్ద‌తులో.. పార్టీ ఎమ్మెల్యేల స‌పోర్ట్‌తో.. ఎన్టీఆర్ నుంచి పార్టీ, ప్ర‌భుత్వ బాధ్య‌త‌లు త‌న చేతుల్లోకి తీసుకున్నారు చంద్ర‌బాబు నాయుడు. ఇక్క‌డే చంద్ర‌బాబుకు వెంక‌టేశ్వ‌ర‌రావుకు తేడాలొచ్చాయి. అప్ప‌టికే ఎన్టీఆర్ త‌ర్వాత నెంబ‌ర్ 2గా మారిన‌.. పార్టీపై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించిన‌.. మంత్రిగా, నాయ‌కుడిగా నిరూపించుకున్న‌.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికే టీడీపీ శ్రేణులంతా జై కొట్టారు. ముఖ్య‌మంత్రి స్థానానికి చంద్ర‌బాబుతో ద‌గ్గుబాటి స‌రితూగ‌లేక‌పోయారు. త‌న‌కు స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని భావించిన ద‌గ్గుబాటి.. వైశ్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ త‌ర్వాత చంద్ర‌బాబుకు, తెలుగుదేశం పార్టీకి దూర‌మ‌య్యారు. అప్ప‌టి నుంచీ తోడ‌ల్లుళ్ల మ‌ధ్య మాట‌లు లేవు. సఖ్య‌త లేదు. సంబంధాలు లేవు. 25 ఏళ్లుగా ఎవ‌రి దారి వారిదే. ఎవ‌రి రాజ‌కీయం వారివే. ఈ గ్యాప్‌లో చంద్ర‌బాబు మూడు సార్లు సీఎం, మూడుసార్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా రాజ‌కీయాల్లో ద‌గ్గుబాటికి అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయారు. అటు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు-పురందేశ్వ‌రీలు నంద‌మూరి కుటుంబంతో క‌లిసే ఉన్నా.. నారా వారితో మాత్రం దూరం జ‌రిగారు. భువ‌నేశ్వ‌రీతో ట‌చ్‌లో ఉన్నా.. చంద్ర‌బాబుతో మాత్రం ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించేవారు. తర్వాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబుపై కసితోనే వాళ్లు వైఎస్సార్ కు దగ్గరయ్యారని అంటారు. వైఎస్సార్ హ‌యాంలో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా గెలిచిన దగ్గుబాటి  పురందేశ్వరి ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు దగ్గుబాటి వైసీపీలో చేరగా.. పురందేశ్వరి మాత్రం బీజేపీ కండువా కప్పుకున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర్చూరు నుంచి పోటీ చేసిన దగ్గుబాటి ఓడిపోయారు. తర్వాత  వైసీపీలో ఉండీలేన‌ట్టు కాలం వెల్ల‌దీస్తూ వ‌స్తున్నారు. ద‌గ్గుబాటి స‌తీమ‌ణి పురందేశ్వ‌రీ మాత్రం బీజేపీలో జాతీయ‌ నేత‌గా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఇలా.. 25 ఏళ్ల సుదీర్ఘ దూరం త‌ర్వాత‌.. నంద‌మూరి ఫ్యామిలీ వేడుక‌లో తొలిసారి నారా-ద‌గ్గుబాటి కుటుంబాలు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నాయి. తోడ‌ల్లుళ్లు చిర‌కాలం త‌ర్వాత చెయ్యి-చెయ్యి క‌లిపారు. న‌వ్వుతూ మాట్లాడుకున్నారు. సన్నిహితంగా మెదిలారు. ఒకే ఫ్రేమ్‌లో వారిద్ద‌రూ ఉండ‌టం చూసి.. ఎన్నాళ్లో వేచిన రోజంటూ అంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కుటుంబ స‌ఖ్య‌త‌.. రాజ‌కీయ స‌ఖ్య‌త‌గానూ మారుతుందా? తోడ‌ల్లుళ్లు మ‌ళ్లీ ఏకం అవుతారా? గ‌తంలోలా క‌లిసి రాజ‌కీయాల‌ను శాసిస్తారా? అంటే.. ఏమో.. కాల‌మే డిసైడ్ చేయాలి!

జగన్ పై కామ్రెడ్ ఫైర్.. సాయితేజను గుర్తించారు.. శిల్పా చౌదరి రగడ.. టాప్ న్యూస్@1PM

కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన వేద విద్యార్థుల మృతి బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న వేద విద్యార్థులు చనిపోవడం కలచివేసిందన్నారు. నదీ సమీపంలో వేద పాఠశాల ఉన్నందున విద్యార్థుల భద్రత పట్ల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.  ---- ఏపీ సీఎం నిరంకుశ ధోరణి వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు అడ్డంకులు సృష్టించొద్దనని హితవు పలికారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని రాజా పేర్కొన్నారు. సీఎంకు పరిపాలన ఏమాత్రం చేత కాదన్నది తేటతెల్లమైందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. ------- ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయి తేజ భౌతిక కాయాన్ని అధికారులు తరలిస్తున్నారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎగువ రేగడ పల్లి గ్రామానికి సాయి తేజ భౌతికకాయాన్ని తరలించనున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వగ్రామానికి సాయి తేజ భౌతికకాయం చేరే అవకాశం ఉంది.  ---- తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం జగన్ రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎంవో కార్యాలయం ప్రకటించింది.అధికార సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.  -- వైసీపీ పాలనలో దళితులపై వివక్షత కొనసాగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న ఒంగోలుకు చెందిన దళితుడైన వినోద్ కుమార్‌ను పోలీసులు వేధిస్తున్నారని హర్షకుమార్ తెలిపారు.  --  విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 12న నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తెలిపారు. జనసేన అధినేత విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రోడ్డు మీదికి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం కలిసి వస్తే అందరం కలసి పోరాటం చేద్దామన్నా స్పందన లేదన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో నిరహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.  --- తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.  కృష్ణా జిల్లా కైకలూరులో లక్ష్మణరావు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఇనుప కమ్మిపై పడ్డాడు. దీంతో లక్ష్మణరావు శరీరంలోకి మూడు అడుగుల కమ్మి ఇరుక్కుపోయింది. వెంటనే అతడిని స్విమ్స్‌కు తీసుకురాగా.. వైద్యులు 4 గంటలు శస్త్ర చికిత్స చేసి కమ్మిని విజయవంతంగా తొలగించారు.  --- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యాయ సంఘాలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. సీనియార్టీ లిస్ట్ ఫైనల్ కాకుండా ట్రాన్స్ఫర్‌ల ప్రక్రియను కొనసాగించడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేపటి లోపు పూర్తి అవుతున్న ఆప్షన్స్ గడువును మరో వారం వరకు పెంచాలని మంత్రిని ఉపాధ్యాయులు కోరారు.  --- శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్‌ పేరుతో శిల్ప లేడీ క్లబ్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్‌ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు. క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్‌ ఆఫర్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. కస్టడీలో పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ------ దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్  జనరల్ బిపిన్ రావత్ వంటి ధైర్యసాహసాలుగలవారు జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడుతూ, పరిరక్షిస్తూ ఉంటారని, ఫలితంగా జాతీయ పతాకం సమున్నతంగా ఎల్లప్పుడూ ఎగురుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ కేడెట్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌ను ఉద్దేశించి శనివారం కోవింద్ మాట్లాడారు. 

బిపిన్ రావత్ పై కుట్ర జరిగిందా? హెలికాప్టర్ ప్రమాదంపై అన్ని అనుమానాలే..!  

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి నాలుగు రోజులైంది. అయినా హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం రావడం లేదు. ఆర్మీ వర్గాలు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు.  అత్యంత భద్రత, సురక్షితమైనదిగా చెబుతున్న MI-17v5 హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై శుక్రావరం ప్రకటన చేసిన భారత వైమానిక దళం.. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది.   సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించింది రష్య‌న్ మేడ్‌ అత్యంత సుర‌క్షిత‌మైన‌ హెలికాప్ట‌ర్‌. ప్ర‌ధాని మోడీ సైతం ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంఐ హెలికాప్ట‌రే వాడుతారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. అయినా కునూరు ఘ‌ట‌న‌లో హెలికాప్ట‌ర్ నుంచి మంట‌లు చెల‌రేగాయ‌ని అంటున్నారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రయాణించిన హెలికాప్టర్ కు జరిగిన ప్రమాదం మిస్టరీగా మారుతోంది. దట్టమైన పొగమంచే ప్రమాదానికి కారణమని ముందుగా అందరు అనుకున్నా ఇపుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. హెలికాప్టర్ క్రాష్ అయిన  నీలగిరి కొండలు అడవులున్న లోయలున్న ప్రాంతాల్లో ప్రమాదానికి ముందు రోజు భారీ వర్షాలు కురిశాయట. మంగళవారం  కురిసిన భారీ వర్షాల వల్ల కొండలు లోయంతా దట్టమైన పొగమంచుతో కప్పేసిందట. ప్రమాదం జరిగిన బుధవారం ఉదయం కూడా వర్షం కురిసిందట. అంతటి పొగమంచున్నపుడు హెలికాప్టర్లో ప్రయాణించటానికి ఎవరినీ అనుమతించరు. కానీ సీడీసీఎస్ జనరల్ బిపిన్ రావత్ బృందం ఎందుకు వెళ్లిందన్నది అంతుచిక్కడం లేదు. ఎంఐ-17వీ5 సాధారణ హెలికాప్టర్ కాదు. ప్రతికూల వాతావరణంలో కూడా సులభంగా ప్రయాణం చేయగలిగిన సామర్ధ్యం కుంది. బిపిన్ ప్రయాణించిన హెలికాప్టర్ 6 వేల మీటర్ల ఎత్తులో అంటే 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఒకవేళ పొగమంచు దట్టంగా అలముకున్నా పొగమంచుకన్నా ఎత్తులో ప్రయాణించే అవకాశం ఈ హెలికాప్టర్ కుంది. మరీ పైలెట్ ఎందుకు తీసుకెళ్లలేదన్నది మిస్టరీగానే ఉంది.  ఇక సూలూరు-వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీ మధ్య డిఫెన్స్ హెలికాప్టర్లు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తునే ఉంటాయి.  పైలెట్లకు హెలికాప్టర్ నడపటం వాతావరణం కొత్త కూడా కాదు. సూలూరు ప్రాంతంలోని కొండలు లోయలు అడవుల పై పైలెట్లకు పూర్తిస్ధాయి అవగాహన ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పొగమంచును అధిగమించే అవకాశాలు అనుభవజ్ఞలైన పైలెట్లు భౌగోళిక పరిస్ధితులపై పూర్తి సమాచారం ఉన్న పైలెటే హెలికాప్టర్ ను నడిపినా ప్రమాదం జరగటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ హెలికాప్టర్ కు రెండు ఇంజన్లు చెడిపోయినా సేఫ్ గా భూమిపైన ల్యాండింగ్ చేసే సౌకర్యం కూడా ఉండదట. హెలికాప్టర్ ప్రయాణించాల్సిన సమయం కూడా కేవలం 25 నిముషాలు మాత్రమే. మరి ఇంత తక్కువ సమయం ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల పరిస్ధితులను కూడా తట్టుకునే హెలికాప్టర్ కు ప్రమాదం జరిగి కుప్పకూలిపోవడం ఎవరికీ అర్ధం కావటంలేదు. మరలాంటపుడు ప్రమాదానికి కారణాలు ఏమిటనేది సస్పెన్సుగా మారిపోయింది. వాతావరణ ప్రభావం వల్ల ప్రమాదం జరిగుండదని. మరి దర్యాప్తులోనే అన్నీ విషయాలు బయటపడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

జిత్తుల‌మారి శిల్పాచౌద‌రి.. పోలీసుల‌కు సినిమా స్టోరీ..

వీకెండ్ పార్టీ చేసుకుంటే ఎంత ఖ‌ర్చు అవుతుంది? మామూలు వాళ్లైతే.. 5వేలు-10వేల‌తో ఖ‌ల్లాస్‌. అదే రిచ్ పీపుల్ అయితే.. 1 ల‌క్ష‌-5 ల‌క్ష‌లు. కానీ, కిలేడీ శిల్పాచౌద‌రి రేంజే వేరు. గ‌తంలో ఆమె ఇచ్చిన కిట్టీ పార్టీల ఖ‌ర్చెంతో తెలిస్తే.. క‌ళ్లు తిర‌గాల్సిందే. సంప‌న్నుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోస‌మేగా ఆమె కిట్టీ పార్టీలు ఇచ్చింది. అందుకే, తాను వారిక‌న్నా రిచ్ అనే బిల్డ‌ప్ ఇచ్చేందుకు.. ఒక్కో కిట్టీ పార్టీకి 50 ల‌క్ష‌ల నుంచి 5 కోట్లు ఖ‌ర్చు చేసేద‌ని పోలీసులు గుర్తుంచారు. వామ్మో.. ఒక్కో పార్టీకి.. అదికూడా లేడీస్ కిట్టీ పార్టీకి.. 5 కోట్లు అంటే మాట‌లా! శిల్పా చౌద‌రా.. మ‌జాకా!! శిల్పాచౌద‌రిని మ‌రోసారి మూడురోజుల‌ పోలీస్ క‌స్ట‌డీకి తీసుకున్న పోలీసులు.. ఆమె నుంచి మ‌ళ్లీ ఎలాంటి స‌మాచారం రాబ‌ట్ట‌లేక‌పోయారు. విచార‌ణ‌లో శిల్పా.. పోలీసుల‌కు చుక్కలు చూపిస్తున్నారు. తాననే ముగ్గురు మోసం చేశార‌ని.. తానే అధిక వ‌డ్డీలు క‌ట్టాన‌ని.. చెబుతోంది. మ‌హేశ్‌బాబు సోద‌రి, హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ‌ద‌ర్శినితో పాటు రోహిణిరెడ్డి.. త‌న‌ను అధిక వ‌డ్డీల కోసం టార్చ‌ర్ చేశార‌ని చెప్పింది. వీరిద్ద‌రికీ 2016 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. కేవలం వడ్డీల రూపంలో నెలకు 5 లక్షలు చొప్పున‌ చెల్లించే దానినని శిల్పా చౌద‌రి పోలీసుల‌కు తెలిపింది. తాను అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేసేదాన్నని.. అంతకు మించిన వడ్డీకి రాధికారెడ్డికి అప్పు ఇచ్చేదాన్నని.. అయితే, రాధికారెడ్డి త‌న‌ను మోసం చేసిందని శిల్పా చెబుతోంది. కానీ, రాధికారెడ్డి మాత్రం.. తానే శిల్పకు డబ్బులిచ్చి మోసపోయానని అంటోంది. దీంతో.. ఆమె చెబుతున్న విష‌యాలు నిజ‌మో కావో తెలుసుకునేందుకు.. వారందరినీ ముఖాముఖి కూర్చోబెట్టి ప్ర‌శ్నించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు.  ఇంతకు ముందు కస్టడీలో శిల్ప ‘జెంటిల్‌మన్‌’ సినిమా స్టోరీని పోలీసులకు వినిపించింది. ఓ ఆస్పత్రి నిర్మాణానికి ఆమె రూ. కోట్లు ఇచ్చినట్టు చెప్పింది. ఆమె చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఆ ఆస్పత్రి ఎవరిది? ఎక్కడ నిర్మిస్తున్నారు? పెట్టుబడి మొత్తం ఎంత? అందులో శిల్ప వాటా ఎంత? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.  మ‌రోవైపు, విచారణలో పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్టు చెబుతున్నారు. తనపై లేనిపోనివి సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులపై శిల్పా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.  

ఏపీ సర్కార్ కు కేంద్రం చురకలు..  ఇలా అయితే ఇంతే సంగతులు 

'ఆంధ్ర ప్రదేశ్ లో చాలా చిత్రమైన పరిస్థితినెలకొంది’. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్య  వినేందుకు ఇబ్బందిగా  ఉన్నా కాదనలేము. ఇప్పటికే అందరికీ అర్ధమైన అక్షర సత్యం. నిజానికి ఇదొకటే కాదు కేంద్ర మంత్రి మరో ముచ్చటైన మాట కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఉదాహరణలతో సహా వివరించారు.  వివరాలోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక నగరాల ఏర్పాటు పరిస్థితి ఏంటి ?ఎంతవరకు  వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు,టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు, మంత్రి సవివరంగా సమాధాన మిచ్చారు. ఈసందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు, అభివృద్ధి విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వింత పోకడలను బయట పెట్టాయి. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్లు నోడ్‌ను 10వేల ఎకరాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రెండుగా విభజించి అందులో సగం భూమి మాత్రమే ఇస్తాం, మిగతాది తామే అభివృద్ధి చేసుకుంటామని చెబుతోందని పేర్కొన్నారు. ఇక్కడే కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ధోరణిని పరోక్షంగానే అయినా తప్పు పట్టారు, చిన్న చిన్న ప్రాజెక్టులకు పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అయ్యేపని కాదు. ఈ విషయం ఆర్థిక శాస్త్రంలో ఓనమాలు రాని వారికి  కూడా తెలుసు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కొంచెం సుతిమెత్తగా చెప్పారు. మొత్తం 9,800 ఎకరాలు సేకరించాలని ఉద్దేశించిన హైదరాబాద్‌-బెంగుళూరు కారిడార్‌లోని  ఓర్వకల్లు నోడ్‌’ ను రెండు ముక్కలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన చిత్రంగా ఉందని అన్నారు. నోడ్‌ అభివృద్ధికి  4,742 ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నోడ్‌ అభివృద్ధి కోసం ఇంతవరకే గుర్తించినట్లు చెబుతోంది. చిన్న ప్రాజెక్టులకు పెద్ద పరిశ్రమలను ఆహ్వానించడం చాలా కష్టం.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అప్పుడే ఇలాంటి ప్రాజెక్టులను వేగంగా చేపట్టడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి, వరస పెట్టి వాతలు పెట్టారు.  ఓర్వకల్లు నోడ్‌లో పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించిన భూమి పక్కన 4,500 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్కువ మౌలిక వసతులతో సొంతంగా పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ 10వేల ఎకరాలతో ఒక ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించి, ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా కోసి అందులో మీకు సగమే ఇస్తాం, మిగతా సగం మేం సొంతంగా అభివృద్ధి చేసుకుంటాం అంటున్నారు. రెండింటిలో మౌలికవసతులు భిన్నం. ఇక్కడ పనుల డూప్లికేషన్‌ జరగనుంది. ఇప్పుడు రెండు పారిశ్రామిక ప్రాజెక్టుల మధ్య పోటీ నెలకొంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని తొలుత ప్రతిపాదించినట్లుగానే సమీకృత ప్రాజెక్టుగా మార్చడానికి ప్రయత్నించాలని కోరుతున్నా' అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.అలాగే, కృష్ణపట్నం నోడ్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన టెండరింగ్‌ ప్రక్రియపై కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అయినా  రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకున్నప్పుడే అది సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అలాంటి సమర్ధ చర్యలు ఏపీ ప్రభుత్వం తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పారు.  ఒక ప్రాజెక్టుకు సంబదించి భూసేకరణతో పాటు, ఆ భూమి అంతా ఒకేచోట ఉండేలా చూసినప్పుడే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయన్న కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మరో చురక అంటించారు. ఇందుకు ఉదాహరణగా,  చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం నోడ్‌ని అవసరమైన  2,500 ఎకరాల భూమిలో  ఇప్పటివరకు 2,091 ఎకరాలు సేకరించారు. ఇది మంచి పరిణామం. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనుల కోసం కాంట్రాక్టరును నియమించాలి. కేంద్రం ఈ విషయాల్లో జోక్యం చేసుకోదు. కాంట్రాక్టరు నియామకానికి ఉత్తమ టెండరింగ్‌ ప్రక్రియను అనుసరించాలి. ప్రస్తుతం వారి టెండరింగ్‌ ప్రక్రియపై చాలామంది కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసిందని, గోయల్ చెప్పారు.  అంటే  రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనిసరిస్తున్న పోకడలు చిత్ర, విచిత్రంగా ఉన్నాయని కేంద్ర మంత్రి  గోయల్ స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ళ పాలనలో ... ఒక్క పారిశ్రామిక విధానం మాత్రమే కాదు ... ఏ రంగాన్ని, ఏ విధానాన్ని చూసినా  ఇలాగే షాక్ కొడుతుందని అధికారులే అంటున్నారు.  ఇప్పుడే కాదు ఎప్పటినుంచో  ఆర్థిక నిపుణులూ ఇదే చెపుతున్నారు. అయితే, వైసీపే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు.

ముంబయిలో 144 సెక్షన్‌.. ఒమిక్రాన్ తో అధికారుల అలర్ట్ 

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విస్తరిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 32కు చేరింది. మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు వెలుగుచూశాయి. రాజస్థాన్ లో తొమ్మిది, కర్ణాటకలో నాలుగు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఏడు కేసులు ఒక్క శుక్రవారమే బయటపడ్డాయి. ఇందులో ముంబయి నుంచి మూడు, పింప్రీ-చించ్వాడ నుంచి నాలుగు ఉన్నాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేనివారిని కూడా  హోమ్ కార్వంటైన్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.    కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో  మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో మహారాష్ట్రలో చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడిపోయారు. రోడ్లపైనే కొందరు ప్రాణాలు కోల్పోవాల్సి  వచ్చింది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ముంబై అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ముంబయిలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.    మరోవైపు డిసెంబరు 1 నుంచి ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుల ద్వారా 61వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు మహారాష్ట్రకు  వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 10వేల మంది ప్రయాణికులు ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే. వారందరినీ ట్రేస్‌ చేసే పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది అడ్రస్ లు దొరకడం లేదని తెలుస్తోంది. దీంతో వాళ్లను ట్రేస్ చేసేందుకు అధికారులు చాలా కష్టపడాల్సి వస్తోంది.  

సాయితేజ మృతదేహం గుర్తింపు.. విమానంలో స్వస్థలానికి తరలింపు 

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్  ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిలో చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం కూడా ఉన్నట్టు సైన్యం తెలిపింది. నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలు కూడా వున్నాయి. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సైన్యాధికారులు తెలిపారు.  గుర్తించిన వారి మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.  తమిళనాడులోని కూనురు సమీపంలో బుధవారం మధ్యహ్నం ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి కెప్టెన్ వీరేందర్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఘటనాస్థలిలో లభ్యమైన మృతదేహాలను గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదంలో శరీరాలు పూర్తిగా  కాలిపోవడంతో కొన్ని మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. తెలుగు తేజం సాయితేజ మృతదేహం గుర్తింపు కూడా ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం రాత్రి సాయితేజ డెడ్ బాడీని గుర్తించారు. దీంతో అతని మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో సొంతూరు తరలించడానికి సైన్యం ఏర్పాట్లు చేసింది. 

డిస్మిస్డ్ కానిస్టేబుల్ పై వైసీపీ ఎంపీ దాడి! గుంటూరు జిల్లాలో కలకలం.. 

ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తనను కొట్టారంటూ డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలోనూ ఆ ఎంపీపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. టీడీపీ నేతలను ఇష్టమెచ్చినట్లుగా తిడతారనే ఆ ఎంపీపై విమర్శలు ఉన్నాయి. సస్పెండ్ చేసిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరినందుకు ఎంపీ నందిగం సురేశ్ తనపై చేయి చేసుకున్నారని, కులం పేరుతో దూషించారని డిస్మిస్ అయిన కానిస్టేబుల్ బత్తుల బాబూరావు ఆరోపించారు. ఆయన నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి వినపతిపత్రం అందించారు. అనారోగ్యం కారణంగా మూడేళ్లుగా విధులకు హాజరు కాలేకపోయానని, దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాబురావు చెప్పారు. తిరిగి తనను విధుల్లోకి తీసుకునేందుకు సాయం చేయాలని ఎంపీని కోరితే తనపై చేయిచేసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఆరోపించాడు. ఢిల్లీలో ఉన్న ఎంపీకి ఎస్ఎంఎస్ ఇచ్చి ఫోన్ చేసి అడిగినందుకు దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ నెల 7న అర్ధరాత్రి వేళ తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, ఎంపీ, ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి ఫోన్ లాగేసుకున్నారని, అందులోని ఆడియో, వీడియో రికార్డులను తొలగించారని బాబూరావు ఆరోపించారు. తన భార్య, కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచి తెల్లకాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించాడు. అయితే సస్పెండెడ్ కానిస్టేబుల్ బాబురావు ఆరోపణలను ఎంపీ సురేశ్ ఖండించారు. తాను అతడిపై చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. అతడెవరో కూడా తనకు తెలియదని అన్నారు. సాయం కోరుతూ పదేపదే విసిగించాడని చెప్పారు. మరో నంబరుతో ఫోన్ చేసి ఆడియో రికార్డును ఎవరివద్ద పెట్టాలో వారి వద్ద పెడతానని హెచ్చరించడంతో తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయించినట్టు వివరించారు.బాబూరావు ఆరోపణలపై పోలీసులు స్పందించారు.  తాము ఆయనపై చేయి చేసుకోలేదని, ఎంపీకి ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్న ఎంపీ పీఏ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. తాము పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాం తప్పితే చేయిచేసుకోలేదని తుళ్లూరు  డీఎస్పీ పోతురాజు తెలిపారు. 

హెలికాప్టర్ లో సీఎం, కేంద్రమంత్రి... అరగంట పాటు గాల్లో చక్లర్లు.. 

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయిన ఘోర దుర్ఘటనను మరవకముందే కర్ణాటకలో మరో ఘటన అందరిని కలవరపెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అరగంటపాటు గాలిలో చక్కర్లు కొట్టడం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో హుబ్బళ్లికి బయలుదేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆయన వెంట ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హుబ్బళ్లికి చేరుకునే సరికి వాతావరణం సంక్లిష్టంగా మారింది. మంచు దట్టంగా కమ్ముకోవడంతో హెలీ ప్యాడ్ కనిపించలేదు. ఫలితంగా ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో  మంగళూరు తరలించాలని భావించారు. ఈ క్రమంలో హెలికాప్టర్ అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో అప్పటి వరకు ఉత్కంఠగా గడిపిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

జ‌న‌సేనాని ఉక్కు దీక్ష.. ఈసారి మంగళగిరిలో..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకొనేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి తాము అండగా నిలుస్తామని ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో జగన్ ప్రభుత్వం వైపు నుంచి సరైన స్సందన లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష డిసెంబర్ 12వ తేదీన ఉదయం 10.00 గంటలకు ప్రారంభించి.. సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. ఈ దీక్షలో జనసేనాని పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంతోపాటు అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొనున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తొలుత మోదీ ప్రభుత్వంలోని పెద్దలను పవన్ కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సదరు పెద్దలకు లేఖను సైతం పవన్ కల్యాణ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిందని, ఈ ప్లాంట్ ఒక సెంటిమెంట్ అని వారికి పవన్ కల్యాణ్ విపులీకరించడం జరిగింది. అంతేకాదు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆ ప్లాంట్ ప్రాంగణంలోనే కార్మికులకు మద్దతుగా పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను సైతం నిర్వహించారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని జగన్ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు బాధ్యత తీసుకుని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పవన్ కల్యాణ్ సూచించారు. అయితే దీనిపై జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగులు, కార్మికుల చేస్తున్న ఆందోళనలు 300 రోజులు దాటి పోయిన సంగతి తెలిసిందే.

కరోనాను రోగులనూ వదలని కరప్షన్

కరోనా సెకండ్ వేవ్ మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వేల లక్షల ప్రాణాలను బలితీసుకుంది. మన దేశంలో అయితే, కరోనా సెకండ్ వేవ్కరాళ నృత్యమే చేసింది. మృత్యుఘోష వినిపించింది. ఫోన్ మొగిందంటే ఏ చావు కబురు వినవలసి వస్తుందో అని ప్రజలు భయపడిపోయారు. మరో వంక కోవిడ్ బారిన పడి ప్రతి రోజూ వేల మంది ప్రాణం వదిలారు. ఆక్సిజన్, ఔషధాలు లేక ప్రజలు నరకం అనుభవించారు. కుటుంబాలకు కుటుంబాలే  వీధుల పాలయ్యాయి.  అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ దేశంలో అవినీతి రాజ్యమేలింది. ఆసుపత్రులలో, వైద్యులు , నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, వందల వేల మంది ప్రాణాలను కాపాడారు. నిజం, కానీ, అదే సమయంలో ఆసుపత్రుల యాజమాన్యాలు, మధ్య దళారీలు అవినీతికి పాల్పడ్డారు..ప్రాణాలతో వ్యాపారం చేశారు. ఇందుకు సంబంధింఛి ‘లోకల్ సర్కిల్ ‘ సోషల్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన సర్వే లో ఆసక్తికర కాదు భయంకర వాస్తవాలు వెలుగు చూశాయి.   సెకండ్ వేవ్లో కరోనా చికిత్స పొందిన ప్రతి 10మంది పౌరుల్లో నలుగురు ఆరోగ్య సిబ్బందికి, ఆస్పత్రి యాజమాన్యానికి లంచాలు ఇచ్చినట్లు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్, ఔషధాలు వంటి కనీస వసతుల కోసం ప్రజలు ముడుపులు చెల్లించినట్లు వెల్లడైంది. చికిత్స అనంతరం ఆస్పత్రి వేసిన బిల్లును తగ్గించేందుకు 9శాతం మంది లంచం ఇచ్చినట్లు సర్వే స్పష్టం చేసింది. ఐసీయూలో ఉన్న తమ వారి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారిని సందర్శించేందుకు కూడా ప్రజలు ఇదే సంఖ్యలో డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. ఆస్పత్రి పారిపాలనా విభాగం, ఇతర సిబ్బందికి ఈ ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది.  సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా డాక్టర్కు గానీ, నర్సుకు గానీ లంచం ఇచ్చినట్లు చెప్పలేదు. ఆస్పత్రులలో అవినీతి జరగకుండా ప్రభుత్వమే కఠిన నిబంధనలు తీసుకురావాలని అప్పడే డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని వారు అభిప్రాయపడ్డారు.28 శాతం వార్డు బాయ్స్కు లంచాలు ఇచ్చారు. 27శాతం మంది ఆస్పత్రుల్లో పరిపాలానా సిబ్బందికి ముడుపులు చెల్లించారు. 10శాతం మంది స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మరీ ఆస్పత్రి సేవలు వినియోగించుకున్నారు.దేశవ్యాప్తంగా 300 జిల్లాలకు చెందిన 16,000 మంది నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ఇందులో మెట్రో నగరాలకు చెందినవారు 40శాతానికి పైగా ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 30శాతానికి పైగా ఉన్నారు.లోకల్ సర్కిల్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో చేసిన మరో సర్వేలో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం ప్రజలు 13శాతం అధికంగా ఫీజు చెల్లించారు. రెమ్డెసివిర్, ఫాబిఫ్లూ, టాసిలిజుమాబ్ వంటి ఔషధాలను రిటైల్ ధర కన్నా ఎక్కువ వెచ్చింది కొనుగోలు చేశారు. వేరియంట్ను గుర్తించిన తర్వాత భారత్లో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్యకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. రోగుల సంఖ్య ఒక్కసారే లక్షల్లో పెరిగి ఆస్పత్రుల సరిపోక విపత్కర పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఫిల్లింగ్ కేంద్రాల వద్ద జనం సిలిండర్లతో బారులు తీరారు. కొవిడ్ చికిత్సలో అప్పుడు బాగా ఉపయోగించిన రెమ్డెసివిర్ ఔషధం బంగారం రేటును తలపించింది. బ్లాక్ మార్కెట్ మాఫియా ఈ ఔషాధాన్ని అధిక ధరకు విక్రయించింది. సాధరణ పరిస్థితులలోనే అవినీతికి పాల్పడడం చట్ట రీత్యా,ధరం విరుద్ధం. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, ఆసుపత్రుల యాజమాన్యాలు, రాజకీయ నాయకులు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనాను కాసుల పంటగా చేసుకున్నారు.

వీరుడికి వీడ్కోలు.. చంద్ర‌బాబు-ద‌గ్గుబాటి టాక్స్‌.. ప‌వ‌న్‌ దీక్ష‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. ఢిల్లీలో బిపిన్ రావత్ దంప‌తుల అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో ముగిశాయి. 17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు. వారి కుమార్తెలు కృతిక, తరిణి చితికి నిప్పంటించారు. త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  2. రావ‌త్‌ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం లేని ఊహాగానాలు చేయవద్దని భారతీయ వాయు సేన కోరింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవ, మర్యాదలను కాపాడాలని విజ్ఞ‌ప్తి చేసింది. ప్రమాదంపై త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేసినట్టు.. విచారణ వేగంగానే పూర్తవుతుందని, వాస్తవాలు బయటికి వస్తాయని ఐఏఎఫ్‌ ట్వీట్ చేసింది.  3. చాలా కాలం తర్వాత చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కలిశాయి. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు ఎంగేజ్‌మెంట్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించుకుని మనసారా మాట్లాడుకున్నారు. కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య మాటలు లేవు. ఇప్పుడు క‌లుసుకోవ‌డంతో నంద‌మూరి ఫ్యామిలీ సంతోషం వ్య‌క్తం చేసింది. 4. గిరిజ‌నుల‌కు ప‌థ‌కాలు దూరం చేసే అడ్డ‌గోలు నింబ‌ధ‌న‌లు తొల‌గించాల‌ని సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ‌ రాశారు. గిరిజ‌నుల‌కు నిలిపివేసిన పెన్ష‌న్, రేష‌న్‌ను పునుద్ద‌రించాల‌ని డిమాండ్ చేశారు. గిరిజ‌న ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండ‌దని.. అలాంటి వారికి నిబంధ‌న‌ల పేరుతో ప‌థ‌కాలను దూరం చేస్తున్నారని విమ‌ర్శించారు. 300 యూనిట్ల విద్యుత్ వాడ‌కం దాటితే గిరిజ‌నుల పెన్ష‌న్లు, ప‌థ‌కాలు క‌ట్ చేస్తున్నారని లోకేశ్ లేఖ‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 5. డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు కూర్చోనున్నారు. డిసెంబర్ 12 ఉదయం 10.00 గంటలకు దీక్ష‌ ప్రారంభించి.. సాయంత్రం 5.00 గంటలకు ముగించ‌నున్నారు.   6. రిటైర్డ్ ఐఏఎస్ డా.లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపింది. లక్ష్మీనారాయణపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఐడీ చేర్చింది.  7. తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్‌, బండి సంజ‌య్‌లు మాత్రం ఓటు వేయ‌లేదు. 8. ద‌ళితుడి ప‌ట్ల‌ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అరాచకంగా ప్ర‌వ‌ర్తించారు. ద‌ళితుడ‌న బాబూరావు ఎంపీ స‌హాయం కోరుతూ ఆయ‌న‌ ఫోన్‌కు మెసేజ్ పెట్టారు. తనకే మెసేజ్ పెడ‌తావా అంటూ సురేశ్‌.. బాబూరావును ఫోన్లో దూషించారు. త‌న తిట్ల‌ను ఫోన్లో రికార్డు చేశాడ‌నే అనుమానంతో పోలీసుల సాయంతో బాబురావును త‌న ఇంటికి ర‌ప్పించి ఎంపీ సురేశ్ ఆ ద‌ళితుడిని చిత‌క‌బాదిన‌ట్టు తెలుస్తోంది. తనకు న్యాయం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను బాబురావు కలవ‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  9. జగనన్న గృహపథకం వైసీపీ పార్టీని గందరగోళంలోకి నెట్టిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రజా తిరుగుబాటు జరుగుతోందన్నారు. పథకాల కింద ఇచ్చిన ఇళ్లకు రూ.10 వేలు కట్టాలంటూ దిగజారి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని.. అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నారు ర‌ఘురామ‌. 10. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్‌ను.. మూడేళ్లయినా రద్దు చేయలేదని  సీఎం జ‌గ‌న్‌పై ఏపీ జేఏసీ ఉద్యోగులు మండిప‌డ్డారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అనేక రకాలుగా సహకరించాయన్నారు. ప్ర‌భుత్వం పీఆర్సీ ఇచ్చినా.. మిగ‌తా డిమాండ్లు నెర‌వేర్చే వ‌ర‌కూ ఉద్యమాన్ని విరమించేది లేదని తేల్చిచెప్పాయి. సీపీఎస్ రద్దు చేస్తేనే ఉద్యమం విరమిస్తామని స్ప‌ష్టం చేశాయి.   

రావ‌త్‌కు 17 శ‌త‌ఘ్నుల వంద‌నం ఎందుకంటే..?

భార‌త తొలి సీడీఎస్ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో 17 శ‌త‌ఘ్నుల‌తో సైనిక వంద‌నం స‌మ‌ర్పించారు. ఫోర్‌స్టార్ జ‌న‌ర‌ల్‌కు ఇలా 17 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పించ‌డం సంప్ర‌దాయం. ఇంత‌కీ, ఈ గ‌న్ సెల్యూట్ ఎందుకు చేస్తారు? 19 గ‌న్స్‌తోనే ఎందుకు చేస్తారు? ఎవ‌రెవ‌రికి ఎలాంటి గ‌న్ సెల్యూట్ ఇస్తారు?  ఇండియ‌న్‌ ఇండిపెండెన్స్ డే, రిప‌బ్లిక్ డే సందర్భంగా 21 తుపాకులతో త్రివర్ణ పతాకానికి సైనిక‌ వందనం సమర్పిస్తుంటారు. 16వ శతాబ్ధంలో బ్రిటన్‌ నావికాదళం దీనిని ప్రారంభించింది. వంద‌నానికి శతఘ్నులు లేదా తుపాకులు వేటినైనా వాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఆచారాన్ని అనుస‌రిస్తున్నాయి. బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొందిన కామన్‌వెల్త్‌ దేశాల్లో ఈ సంప్ర‌దాయం ఎక్కువ‌గా కనిపిస్తుంది.  దేశాధ్యక్షుడు, విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. సందర్భానికి అనుగుణంగా 19 గ‌న్స్‌, 17 గ‌న్స్ సెల్యూట్‌లు కూడా ఉంటాయి. రాష్ట్రపతికి 21 తుపాకుల వందనం ఇస్తారు. త్రివిధ దళాధిపతులకు 17 గన్‌ సెల్యూట్‌ సమర్పిస్తారు.  సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఫోర్‌స్టార్‌ జనరల్‌. ఆర్మీ చీఫ్‌, నేవీ చీఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌తో సమానమైన ర్యాంక్‌. అయినా, వీరందరిలోకి ప్రథముడు. అందుకే బిపిన్ రావ‌త్‌కు 17 గన్‌ సెల్యూట్‌తో సైనిక వంద‌నం సమర్పించారు. అందుకు వాడిన శ‌త‌ఘ్నుల‌ను 2233 ఫీల్డ్‌ రెజిమెంట్‌ నుంచి తీసుకొచ్చారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాకు సమానమైన ఆరుగురు అధికారులు ఫ్లాగ్‌ బేరర్లుగా వ్యవహరించారు. త్రివిధ దళాల్లోని కీల‌క‌మైన 800 మంది అధికారులు రావ‌త్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. 17 శ‌త‌ఘ్నుల‌తో భార‌త తొలి సీడీఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల‌కు సైనిక లాంఛ‌నాల‌తో తుది వీడ్కోలు ప‌లికారు.   

ఎమ్మెల్సీ పోలింగ్ స‌ర‌ళితో కేసీఆర్‌లో టెన్ష‌న్‌.. ఈట‌ల నుంచి రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌దా?

లెక్క ప్ర‌కార‌మైతే ఆరుకు ఆరు అధికార టీఆర్ఎస్ ఖాతాలో ప‌డాలి. కానీ, ప‌డ‌తాయా?  లేదా? అనే టెన్ష‌న్ ఇప్పుడు కేసీఆర్‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ నుంచి రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌దా? అనే టెన్ష‌న్ ఆయ‌న్ను అస‌హ‌నానికి గురి చేస్తోందిన తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అత్య‌ధికంగా 99.69 శాతం పోలింగ్‌ నమోదు కావ‌డం.. ఎక్క‌డో తేడా కొడుతోంది. కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఝ‌ల‌క్ ఇచ్చేందుకే.. ఓట‌ర్లు ఇంత భారీగా త‌ర‌లివ‌చ్చారా? అనే అనుమానం క‌లుగుతోంది.  టీఆర్ఎస్ రెబెల్ కేండిడేట్‌, క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్ సింగ్ ఇండిపెండెంట్‌గా బ‌రిలో దిగ‌డంతో కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ర‌వీంద‌ర్‌సింగ్‌ను పోటీలో పెట్టింది తానేనంటూ ఈట‌ల ప్ర‌క‌టించ‌డంతో మ‌రింత దిమ్మ‌తిరిగిపోయింది. ర‌వీంద‌ర్ గెలుపు ఖాయ‌మంటూ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ చేయ‌డం.. తెర‌వెనుక స‌మీక‌ర‌ణాలు మార్చేయ‌డం కాక రేపింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సైతం త‌మ ఓట‌ర్ల‌తో క్యాంప్ నిర్వ‌హించ‌డంతో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. హుజురాబాద్ ఎల‌క్ష‌న్ మాదిరే.. ఈట‌ల వ‌ర్గం, కాంగ్రెస్ వ‌ర్గం.. రెండూ క‌లిసి అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ఓడించ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. భారీగా ఓటింగ్ జ‌ర‌గ‌డం అందుకు నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు. అందుకే, ఈ నెల 14న జ‌రిగే కౌంటింగ్‌పై కేసీఆర్‌లో టెన్ష‌న్ నెల‌కొంద‌ని అంటున్నారు.    ఇక‌, తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా జిల్లాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం పోలింగ్‌ నమోదైంది. 1,324 ఓట్లకుగాను 1,320 ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌లో ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.     

వీరుడా మ‌ళ్లీ పుట్టాలిరా.. రావ‌త్‌కు సైనిక లాంఛ‌నాల‌తో వీడ్కోలు..

యావ‌త్ దేశం క‌న్నీరు కార్చింది. యావ‌త్ సైన్యం చ‌లించిపోయింది. ప్ర‌ముఖులంతా త‌ర‌లివ‌చ్చారు. సైనికులంతా సెల్యూట్ చేశారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి సీడీఎస్ బిపిన్‌ రావత్‌ దంపతులకు ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో అంత్య‌క్రియ‌లు ముగిశాయి. కుటుంబ స‌భ్యులు, అధికారులు, ప్రముఖుల నివాళుల అర్పించిన త‌ర్వాత‌.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రావత్‌కు గౌరవసూచికంగా 17 శ‌త‌ఘ్నుల‌ను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్‌ అంత్యక్రియల్లో 800 మంది ర‌క్ష‌ణ సిబ్బంది అధికారికంగా పాల్గొన్నారు.  రావత్‌ అంత్యక్రియలకు పలు దేశాల సైనిక ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. శ్రీలంక సీడీఎస్‌ అండ్‌ కమాండర్‌ జనరల్‌ షవేంద్ర సిల్వా, శ్రీలంక మాజీ అడ్మిరల్‌ రవీంద్ర చంద్రసిరి (నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌లో రావత్‌కు మంచి మిత్రుడు), రాయల్‌ భూటాన్‌ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ డోర్జీ రించన్‌, నేపాల్‌ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బాలకృష్ణ కార్కీ, బంగ్లాదేశ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డివిజన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌తో పాటు పలు దేశాల రాయబారులు హాజరై.. రావత్‌ పార్థివ దేహం ద‌గ్గ‌ర‌ నివాళులు అర్పించారు.     ప్రముఖులు, సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఉదయం కామ్‌రాజ్‌ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు వారికి నివాళులర్పించారు. అనంతరం రెండు గంటల పాటు అంతిమ యాత్ర కొన‌సాగింది. దారి పొడువునా ప్రజలు రావత్‌కు వీడ్కోలు పలికారు. రావత్‌ అమర్‌రహే అంటూ నినదించారు.  అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది అధికారులు పాల్గొన్నారు. 33 మందితో ట్రైసర్వీస్‌ బ్యాండ్‌ ముందు న‌డిచింది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్‌ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించింది. 17 శ‌త‌ఘ్నుల‌ సెల్యూట్‌తో భార‌త తొలి సీడీఎస్ బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. అలా ఒక వీరుడు నేల విడిచి నింగిని చేరాడు. భార‌తమాత ముద్దుబిడ్డ‌ మ‌ళ్లీ పుట్టాల‌ని.. మ‌ళ్లీ సైనికుడిగా దేశ‌ సేవ చేయాల‌ని ప్ర‌జ‌లంతా బ‌రువెక్కిన హృద‌యాల‌తో కోరుకుంటున్నారు. 

ఎంతుంటే అంత ఇచ్చుకోండి.. సీఎంవో ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో వినూత్న పోకడలు పోతోంది. చివరకు ప్రభుత్వ శాఖల వద్ద మిగిలిన చిల్లర పైసలకు కూడా జగన్మోహన్  రెడ్డి ప్రభుత్వం కక్కుర్తి పడుతోందని అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వ శాఖల  వద్ద  ఎంత మిగులుంటే, అది ఎంత చిన్నమొత్తమే అయినా,చివరకు లక్ష రూపాయలే అయినా ఆ మిగులు మొత్తాన్ని స్టేట్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్’లో జమ చేయాలని ముఖ్యమంత్రి కార్యలయమే నేరుగా ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాల సమాచారం. అద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల తలుపులు అన్నీ మూసకు పోయిన నేపధ్యంలో డిపార్టుమెంట్ల వద్ద మిగిలిన పైసా పైసా పోగేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.   కేంద్ర పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నుంచి ప్రభుత్వం స్టేట్ పవర్‌ కార్పొరేషన్‌కు భారీగా అప్పులు తెచ్చింది. అలా తెచ్చిన అప్పుల్లో మేజర్ షేర్ ఇతర అవసరాలకు వాడుకుంది. స్టేట్ పవర్‌ ఫైనాన్సు కార్పొరేషన్‌ ఖాతాలో పైసలు నిండుకున్నాయి, నిజానికి, స్టేట్ పవర్‌ ఫైనాన్సు కార్పొరేషన్ను ప్రభుత్వం ఒక సూటుకేసు సంస్థగా వాడుకుందనే ఆరోపణలున్నాయి. కేంద్ర సంస్థల నుంచి తెచ్చిన నిధులను, ఎందుకోసం తెచ్చారో అందుకు ఉపయోగించలేదు. కేంద్ర సంస్థలకు చెల్లించవలసిన నిధులను సకాలంలో తిరిగి చెల్లించనూ లేదు.    చివరికి ఆ సంస్థల ఉన్నతాధికారులే నేరుగా రాష్ట్రానికి వచ్చి... అప్పు కట్టకపోతే జెన్‌కోను ‘డిఫాల్టర్‌’గా ప్రకటిస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం అప్పటికప్పుడు మారిటైమ్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.1500 కోట్లు అప్పు తెచ్చి... అందులో రూ.900 కోట్లను పీఎ్‌ఫసీకి, ఆర్‌ఈసీకి చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అర్థం కావడంతో... పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ తదుపరి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త పథకం వేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని మిగులు నిధులు, నెల వారీగా వచ్చే ఆదాయాన్ని కొన్ని నెలల పాటు స్టేట్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.విద్యుత్‌ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి అర్జెంట్‌గా డబ్బులు కావాలి. మీ దగ్గరున్న డబ్బులను ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ఇవ్వండి. మీ సొమ్ములకు మంచి వడ్డీ కూడా వస్తుంది, అంటూ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చేశాయని అధికార వర్గాల సమాచరం.నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు రావడంతో, డిపార్టుమెంటు హెడ్స్, తమ దగ్గర ఎంత ఉంటే అంత కార్పొరేషన్ కు సమర్పించుకుంటున్నారు.  ఈ విధంగా ప్రభుత్వ శాఖల వద్ద పైసా మిగలకుండా, మొత్తం మిగులు నిధులు ఈ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేస్తే.. ఆ సొమ్మును మొత్తాన్ని పవర్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం లాగేసుకుంటుందని, అధికారులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రభుత్వశాఖల వద్ద కనీసం లక్ష రూపాయలున్నా వదలొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే ఎంతుంటే అంత కనీసం లక్ష ఉన్నా సరే డిపాజిట్‌గా స్వీకరిస్తాం.అని ముఖ్యమంత్రి కార్యాలయం డిపార్టుమెంటు హెడ్స్’కు సందేశాల మీదసందేశాలు పంపుతోందని తెలుస్తోంది. అంతేకాదు, ఆరు నెలల నుంచి పదేళ్ల కాల పరిమితిపై తీసుకునే డిపాజిట్స్ పై కాలపరిమితిని బట్టి  వడ్డీ శాతాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఆరు నెలల వరకు  5.5 శాతం వడ్డీ, ఆరు నెలల నుంచి ఏడాదికి 6 శాతం, ఏడాది నుంచి మూడేళ్ల పాటు డిపాజిట్‌ చేస్తే 6.4 శాతం, మూడేళ్లు  దాటితే 6.5 శాతం, ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకూ 7 శాతం, పదేళ్లు దాటితే 8 శాతం వడ్డీ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఇతర జాతీయ బ్యాంకులకంటే ఎక్కువ గానే వడ్డీ అందిస్తామని ఆశ చూపారు. మీ దగ్గర ఉన్న వనరులు, అదనపు నిధులు, తాత్కాలిక నిధులను పవర్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేసి విద్యుత్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని  ఆ సంస్థ సీఎ్‌ఫఓ కోరారు.  స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్న తమ ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరారు. డిపాజిట్లు ఇచ్చేవరకే శాఖల పని. ఆ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ సొమ్ములు కావాలంటే ఇస్తారా? డిపాజిట్‌ను మధ్యలో రద్దు చేసుకుని, డబ్బులు వెనక్కి తీసుకోవచ్చా? ఇవేవీ తెలియదు.అయితే అధికారులు మాత్రం ఈ డిపాజిట్స్ వెనక్కి వచ్చేవి కాదని, చివరకు ఐపీ ఖాతాలో చేరిపోతాయని, అయినా, కాదనే వీలులేకుండా నిబంధనలు ఫ్రేమ్ చేశారని అంటున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో చంద్ర‌బాబు-ద‌గ్గుబాటి.. తోడల్లుళ్ల క‌ల‌యిక‌పై ఆస‌క్తి..

రాజకీయంగా వారిద్దరూ విభిన్న ధ్రువాలు. వారిద్దరి మధ్యా చాలా ఏళ్లుగా మాటా మంతీ లేదు. కలుసుకున్నదీ లేదు. తాజాగా హైదరాబాద్ లో వారిద్దరూ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పక్కపక్కనే నిలబడ్డారు. ఆపైన ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారంతా ఎంతో హ్యాపీ ఫీలయ్యారు. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అంటే.. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గురించి. వారిద్దరూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు అల్లుళ్లు అని అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం చెరో పార్టీలో ఉన్నారు. రాజకీయంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒకేచోట కలుసుకోవడం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. చంద్రబాబు- వెంకటేశ్వరరావు కలిసి ఫంక్షన్ లో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో టీడీపీలో ప్రముఖ స్థానంలో వెలుగొందిన వెంకటేశ్వరరావు మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి దూరం అయ్యారు. అప్పటి నుంచీ తోడల్లుళ్లు ఇద్దరూ కలుసుకున్నది లేదనే చెప్పొచ్చు. రాజకీయంగా వారిద్దరి మధ్యా ఏర్పడిన వైరుధ్యాలు, విభేదాలు కారణంగా చంద్రబాబు- వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా కలుసుకోలేదు. చాన్నాళ్లుగా ఎడముఖం పెడముఖంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. కాగా.. చంద్రబాబు- వెంకటేశ్వరరావు హైదరాబాద్ లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో కలుసుకున్నారు. ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు పెళ్లి వేడుక వీరిద్దరి కలయికకు వేదిక అయింది. పెళ్లికూతురు నలుగు కార్యక్రమంలో వీరు సందడి చేశారు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ లో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి పక్కపక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్టీ రామారావు కుటుంబంలోని నందమూరి బాలకృష్ణ దంపతులు సహా వారసులు హాజరయ్యారు. ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు పొల్గొనడం సర్వసాధారణం. శుభకార్యం సందర్భంగా అందరూ కలిసి మాట్లాడుకోవడం, ఆత్మీయంగా పలకరించకోవడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వీరి ఫొటోలు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీరంతా కలిసి మెలిసి ఉండడం మారుతున్న రాజకీయ పరిణామాలకు ఇది సంకేతం కావచ్చని కూడా టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయని సమాచారం.