మ‌రో y2k మాదిరిగా LOG4J.. టెక్‌ కంపెనీలకు జీరోడే టెన్ష‌న్‌...

y2k. గుర్తుండే ఉంటుంది. 1999 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ టెక్ కంపెనీల‌ను తెగ టెన్ష‌న్ పెట్టిన టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌. 2000 ఏడాది ఎంట‌ర్ కాగానే అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌లన్నీ ప‌ని చేయ‌కుండా పోతాయ‌ని ప్ర‌పంచ‌మంతా ఆందోళ‌న చెందింది. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. కేలండ‌ర్‌లో 2000 వ‌చ్చినా.. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ ఏవీ ఆగిపోలేదు. ఎందుకంటే.. గ‌డువులోగా ఆ ఎర్ర‌ర్‌ను క‌రెక్ట్ చేశారు కాబ‌ట్టి. తాజాగా, y2k స్థాయిలో కాక‌పోయినా.. అలాంటిదే LOG4J పేరుతో మ‌రో స‌మ‌స్య ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్ర‌పంచాన్ని వేధిస్తోంది. యాపిల్ సంస్థ ప్ర‌ధాన బాధితురాలిగా మారే ప్ర‌మాదం పొంచిఉంది. అనేక యాప్స్‌, సాఫ్ట్‌వేర్స్‌కు 'లాగ్‌4జే' ఎఫెక్ట్ భారీగానే ప‌డ‌నుంది. హ్యాక‌ర్ల‌కు ఈ లోపం వ‌రంగా మారి.. యూజ‌ర్ల ప‌ర్స‌న‌ల్ డేటా మొత్తం చోరీకి గుర‌య్యే అవ‌కాశం ఉంది. అందుకే, టెక్ లోక‌మంతా ఇప్పుడు 'లాగ్‌4జే' టెన్ష‌న్‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇంత‌కీ ఏంటీ 'లాగ్‌4జే'..? మ‌న‌కెంత డేంజ‌ర్‌? అప్లికేషన్లలోకి లాగిన్‌ అయ్యేందుకు ఉపయోగించే లైబ్రరీ వంటి సాఫ్ట్‌వేర్‌ను ‘లాగ్‌4జే’ అంటారు. దీనిని ‘అపాచీ లాగింగ్‌ సర్వీస్‌’ సంస్థ అభివృద్ధి చేసింది. ఆ అప్లికేషన్‌లో మన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి ఉంచుతుంది. పలు ప్ర‌ముఖ‌ సాఫ్ట్‌వేర్‌, యాప్‌ సంస్థలు దీనిని విస్తృతంగా వాడుతున్నాయి. 'లాగ్‌4జే' తయారీలో Log4Shell అనే ఒక లోపాన్ని ఇటీవల ఇంటర్నెట్‌లో బహిర్గతం చేశారు. ఇందులో లోపం (జీరోడే) హ్యాకర్లకు అనుకూలంగా మారింది. ప్రముఖ కంపెనీలైన‌ యాపిల్‌ క్లౌడ్‌, గేమింగ్‌ కంపెనీ మైన్‌క్రాఫ్ట్‌ వంటి సంస్థలు దీనిని ఉపయోగిస్తున్నాయి.  తొలుత మైక్రోసాఫ్ట్‌ ‘మైన్‌క్రాఫ్ట్‌’ ఆడే వ్యక్తులు దీనిని కనుగొన్నారు. లాగిన్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసే చోట ఒక కోడ్‌ను నమోదు చేయడం ద్వారా దాని వినియోగదారులను దారి మళ్లించి హ్యాక్‌ చేయవచ్చని గుర్తించారు. ఇది గత పదేళ్లలో ఎన్నడూ చూడని పెద్ద లోపంగా సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు అంటున్నాయి. ‘లాగ్‌4జే’ను వినియోగించే ప్రతి ఒక్కరూ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ లోపం ఉన్న సిస్టమ్స్‌ను గుర్తించి హ్యాక్‌ చేయడానికి వీలుగా టూల్స్‌ కూడా అభివృద్ధి చేశారని వైర్డ్‌.కామ్ తెలిపింది.  'లాగ్‌4జే'పై మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఓ ప్రకటన చేసింది. క్రెడెన్షియల్స్‌, డేటా దొంగతనాలు జరిగే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. ఇంటర్నెట్‌లో ఈ లోపాన్ని వాడుకోవాలని చూసే వారిపై తమ ఇంటెలిజెన్స్‌ బృందం కన్నేసి ఉంచిన‌ట్టు తెలిపింది. ఇప్పటికే చాలా వరకు స్కానింగ్‌ చేయగా.. కొన్ని చోట్ల ఈ లోపాన్ని గుర్తించామని తెలిపింది.  గూగుల్‌ క్లౌడ్ సైతం 'లాగ్‌4జే'లోని లోపంపై ప్రకటన విడుద‌ల చేసింది. ‘‘ప్రస్తుతం గూగుల్‌ క్లౌడ్‌పై  దీని ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం. వినియోగదారులకు అవసరమైన అప్‌డేట్లను అందిస్తున్నాం’’ అని చెప్పింది.  అమెజాన్‌ స్పందిస్తూ.. ‘‘పరిస్థితిని అంచనావేస్తున్నాం. ఏదైనా అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ వినియోగదారుల్లో ఎవరైనా లాగ్‌4జే2 వాడుతున్నా.. లేదా వారి వినియోగదారులకు ఆ సేవలు అందిస్తున్న వాటిని గమనిస్తున్నాం. ‘లాగ్‌4జే2’ వెర్షన్‌ వాడేవారు అప్‌గ్రేడ్‌ చేసుకోవడం ఉత్తమం. అంతకంటే పాత వెర్షన్లు వాడేవారు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది’’ అని సూచించింది. 

రివర్స్ పీఆర్సీ.. అమరావతి రైతులకు రిలీఫ్.. కారు జోరు.. టాప్ న్యూస్@1PM

ప్రజా సమస్యలపై పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. తక్షణమే అక్రమ కేసులు ఉపసంహరించుకోని క్షమాపలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలే లక్ష్యంగా జగన్‌ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధిని వదిలేసి ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకే సమయం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు.  ------- దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఐఆర్ 27 శాతం ఉంటే... 14 శాతం ఫిట్మెంట్ చాలు అని నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రభుత్వ సూచనల ఆధారంగానే ఇచ్చారని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 43 శాతం కావాలి అని అడిగామని... ఇబ్బందులు ఉన్నా ఇచ్చారని తెలిపారు. జీతాలు పెంచమని అడిగితే... తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -- తిరుమల శ్రీవారిని దర్శించుంకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ అనుమతిని ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ తెలిపింది.  అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ  రైతులు మహా పాదయాత్రను చేపట్టారు.  నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభమవగా... 17న తిరుపతిలో పాదయాత్ర ముగియనుంది. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు.  ------ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి.  తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి బయటికి వచ్చారు. కడప ఎస్పీ అన్బురాజన్ కలిసి తనకు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.  ----- గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఈపూరు మండలం ముప్పాళ్ళ లోఎస్సీ కాలనీలో మోసపోయిన వైసీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ వెలసింది. ఎస్సీలను ఎన్నికలలో ఓట్లు కోసం వాడుకున్నారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశారని ఫ్లెక్సీలో రాశారు. తమను అవమానపర్చిన వారికి తగు రీతిలో సమాదానం చెబుతామని, వైసీపీ నేతలు తమ కాలనీ జోలికి వస్తే గాడిదలతో సమానంగా ఆడవాళ్లుతో బుద్ధి చెప్పిస్తామంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.  ----- తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగగా... కౌంటింగ్ లో ఆరు సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా ఎన్నిక సాగిందని ప్రచారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.  ----- తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ట్వీట్టర్ వేదికగా ఎంపీ స్పందిస్తూ.... ‘‘రుణమాఫీ లేదు, పంటను కొనే నాథుడు లేడు, అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు, రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడు’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ------ శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు  కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పాచౌదరిని మరో రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం ఉదయం 10 గంటలకు శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకొని.. అదే రోజు సాయంత్రానికి తిరిగి చంచల్‌గూడ జైల్లో అప్పగించనున్నారు. --- ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం బీఎల్‌డబ్ల్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరును ఈ సమావేశంలో ప్రధాని సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పురోగతికి సంబంధించి సీఎంలు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ---  జమ్మూకశ్మీర్ విషయంలో పదేపదే పాక్ జపం చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూటి సలహా ఇచ్చారు. ''మీకు పాక్ పట్ల మరీ అంత ముచ్చట ఉంటే అక్కడకు వెళ్లి స్థిరపడొచ్చు'' అని అన్నారు.  

'ఆర్ఆర్ఆర్' నాటు పాటతో జగన్ ను ఏకిపారేసిన టీడీపీ నేత 

నా పాట సూడు.. నాటు నాటు నాటు.. సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’సినిమాలోని ఈ పాట ఇప్పుడు సూపర్ హిట్.  వచ్చే ఏడాది రెండో వారంలో విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా విడుదలైన  ఈ మూవీ ట్రైలర్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తారక్, చెర్రీలు పోటాపోటీగా నటించిన ఈ మూవీలోని ఒక నాటు పాట.. సోషల్ మీడియాలో రికార్డులను షేక్ చేస్తుండగా.. రాజకీయ నేతలకు ఆయుధంగా మారింది.  ఘాటు పదాలతో విమర్శలు, ఆరోపణలు చేసే కన్న తెలివిగా పంచ్ లు వేసే ఏ అవకాశాన్ని ఎవరూ వదులుకోవటం లేదు పొలిటికల్ లీడర్స్. ఇందుకోసం తాజాగా ట్రెండింగులో ఉన్న అంశాలను వాడేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సూపర్ హిట్టైన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు పాటను తనకు అనుకూలంగా మలుచుకున్నారు టీడీపీ సీనియరే నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా..  ‘నా పాట సూడు’ అంటూ తారక్.. చెర్రీలు చేసిన నాటు పాటకు ఆయన పేరడీని విడుదల చేశారు.   ఏపీలోని జగన్ సర్కారు తీరును తప్పు పడుతూ ఈ పాటకు పేరడీ పాటను విడుదల చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అప్పులోళ్ల ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్లు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజుఊగినట్లు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండ ఎక్కించినట్టు.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. సుద్ధ వేసటు అంటూ సాగేలా పాటను మార్చిన వైనాన్ని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఈ పేరడి సాంగ్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.  గోరంట్ల ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తూ తమదైన కామెంట్లు పెడుతున్నారు. 

కారు గెలుపా? ఈట‌ల గెలుపా? బండి గెలుపా?

ఆరుకు ఆరు కారుకే. అర‌డ‌జ‌ను ఎమ్మెల్సీ స్థానాలు గంప‌గుత్త‌గా టీఆర్ఎస్‌కే. నిజానికి ఇదేమంత పెద్ద విష‌యం కాదు. టెక్నిక‌ల్‌గా అవ‌న్నీ అధికార పార్టీకి ద‌క్కాల్సినవే. ఈజీగా గెలిచే ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్‌.. క‌రీంన‌గ‌ర్‌లో మాత్రం టెన్ష‌న్ పెట్టాయి. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి 2 ఖాళీలు ఉండ‌గా.. టీఆర్ఎస్ రెబెల్‌గా మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్ బ‌రిలో నిల‌వ‌డం కారును కంగారెత్తించింది. సింగ్‌ను ఎమ్మెల్సీ కింగ్‌ను చేస్తానంటూ.. ఈట‌ల రాజేంద‌ర్ తొడ‌గొట్ట‌డంతో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో రీసౌండ్ మొద‌లైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక మాదిరి ఆగ‌మాగమైంది. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. మ‌రోసారి కంటి మీద కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు క్యాంపులు పెట్టాయి. హ‌స్తం గుర్తుపై ఎవ‌రూ పోటీలో లేకున్నా.. కాంగ్రెస్ సైతం క్యాంప్ పాలిటిక్స్ చేయ‌డం ఉత్కంఠ రేపింది. గాంధీలు ఈసారి కూడా క‌మ‌లానికే జై కొడ‌తారా? అనే టాక్ న‌డిచింది. క‌ట్ చేస్తే.. క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి రెంటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే ద‌క్కించుకుంది. ర‌వీంద‌ర్‌సింగ్ ఆట‌లో ఆర‌టిపండులా మిగిలిపోయారు. ఇంత‌కీ.. క‌రీంన‌గ‌ర్‌లో అస‌లేం జ‌రిగింది? కారు గెలిచిందా? గెలిపించారా? ఈట‌ల రాజేంద‌ర్ ఓడారా? ఓడించారా? క‌మ‌ల ద‌ళ‌ప‌తి హైద‌రాబాద్‌లో కూర్చొని క‌రీంన‌గ‌ర్‌లో చ‌క్రం తిప్పారా? ఇవ‌న్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌.  పైపైన చూస్తే.. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ గెలుపున‌కు అనేక కీలక ప‌రిణామాలు తోడ‌య్యాయి. టీఆర్ఎస్‌కు ఉన్న బ‌లం కంటే.. ఎక్కువ ఓట్లు రావ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. కరీంనగర్ ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1324 ఓట్లు ఉండగా.. ఇందులో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు 960 వరకు ఉన్నారు. ఇక బీజేపీకి 200 వరకు ఓట్లు ఉండగా.. కాంగ్రెస్ కు 160 వరకు ఓట్లున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనతో పాటు కొందరు టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కమలం పార్టీలో చేరారు. ఈ రకంగా చూస్తే కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ కు కలిసి దాదాపు 4 వందల వరకు ఓట్లు ఉంటాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రవీందర్ సింగ్ కు కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ చేశాయనే ప్రచారం జరిగింది. అందుకే రవీందర్ సింగ్ గెలుస్తారని అంతా భావించారు. టీఆర్ఎస్ నుంచి 30-40 ఓట్లు క్రాస్ అయినా రవీందర్ సింగ్ గెలుస్తారని భావించారు. కానీ, కౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది. కారుకు వాళ్లకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. భానుప్రసాద్ రావుకు 584, రమణకు 479.. మొత్తం టీఆర్ఎస్ కు 1063 ఓట్లు వచ్చాయి. అంటే, అస‌లు బ‌లం కంటే మ‌రో 100 ఓట్లు ఎక్కువే ప‌డ్డాయి. ఇదే ఇప్పుడు రాజకీయంగా కీల‌కంగా మారింది. ఆ వంద‌ ఓట్లు ఎవరివి అన్నదే ప్రశ్న? కాంగ్రెస్ ప్రతినిధులు కారుకు ఓటేశారా? లేక బీజేపీ ప్రతినిధులు గులాబీ పార్టీకి జై కొట్టారా? అనేది తేలాల్సి ఉంది.    కాంగ్రెస్ వాళ్లు క్యాంపులు పెట్టి మ‌రీ.. తాము ర‌వీంద‌ర్‌సింగ్‌కు ఓటేస్తామ‌ని చెప్పారు. చెప్పిన‌ట్టే చేశార‌ని పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి తెలుస్తోంది. మ‌రి, చీలిన వంద ఓట్లు ఎవ‌రివి? అంటే అంద‌రి చూపు బీజేపీ వైపే మ‌ళ్లుతోంది. బీజేపీ అభ్య‌ర్థులు అంతా మూకుమ్మ‌డిగా ర‌వీంద‌ర్‌సింగ్‌కు ఓటేయ‌లేద‌ని.. క‌మ‌లం ఓట్లే చీలిపోయాయ‌ని అంటున్నారు. బీజేపీ వాళ్లు కారుకు ఎందుకు ఓటేశార‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రం. అందుకు, కాషాయ‌ద‌ళంలో కోల్డ్‌వారే కార‌ణ‌మ‌ని.. ఈట‌ల వ‌ర్సెస్ బండి సంజ‌య్ ఎపిసోడ్ వ‌ల్లే టీఆర్ఎస్‌కు మ‌రో 100 ఓట్లు అద‌నంగా వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.  అవును, బండి సంజ‌య్‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు అంత‌గా స‌ఖ్య‌త లేద‌ని మొద‌టి నుంచీ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈట‌ల‌ను పార్టీలో చేర్చుకునే విష‌యంలోనూ కిష‌న్‌రెడ్డి, వివేక్‌లే ఎక్కువ చొర‌వ చూపించార‌ని.. బండి కాస్త వెన‌కాలే ఉండిపోయార‌ని అన్నారు. ఇక హుజురాబాద్ ప్ర‌చారంలోనూ సంజ‌య్ అంత దూకుడుగా లేరు. ఈట‌ల‌ను ఒంట‌రిగా వ‌దిలేసి.. ఆయ‌న పాద‌యాత్ర‌తో ప‌క్క దారిలో వెళ్లిపోయారు. తాజాగా, ఎమ్మెల్సీ ఎపిసోడ్‌లోనూ ఈట‌ల రాజేంద‌రే.. పార్టీ అనుమ‌తి లేకుండానే.. త‌నంత‌ట తాను ర‌వీంద‌ర్‌సింగ్‌ను బ‌రిలో నిలిపార‌ని అంటున్నారు. బీజేపీ మ‌ద్ద‌తు సింగ్‌కేన‌నే నిర్ణ‌య‌మూ ఈట‌ల‌దే. ఆయ‌న త‌ర‌ఫున‌ క్యాంపులు పెట్టిందీ రాజేంద‌రే. ఈ ప‌రిణామం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు మింగుడుప‌డ‌లేదు. త‌న‌ను కాద‌ని స్వ‌త‌హాగా పాలిటిక్స్ చేస్తుండ‌టం ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెబుతున్నారు. అందుకే, హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ పోలింగ్‌లో ఓటేయ‌కుండా బండి సంజ‌య్ డుమ్మా కొట్టారు. అప్ప‌టికే జిల్లాలోని త‌న వ‌ర్గానికి.. ర‌వీంద‌ర్‌సింగ్‌కు ఓటేయ వ‌ద్ద‌ని బండి నుంచి ఆదేశాలు వెళ్లాయ‌ని కూడా అంటున్నారు. త‌న ప్ర‌మేయం లేకుండా ర‌వీంద‌ర్‌ను గెలిపించుకుంటే.. పార్టీలో ఈట‌ల లెవెల్ మ‌రింత పెరుగుతుంద‌నో.. లేక‌, త‌న‌కు చెప్ప‌కుండా ఎమ్మెల్సీ విష‌యంలో ఈట‌ల ఒంటెద్దు పోక‌డ పోయార‌ని ఆగ్ర‌హ‌మో.. కార‌ణం ఏదైనా బండి వ‌ర్గం ఓట్లు ర‌వీంద‌ర్‌సింగ్‌కు ప‌డ‌లేద‌ని లెక్క‌లేస్తున్నారు. టీఆర్ఎస్‌కు అద‌నంగా ప‌డిన ఆ 100 ఓట్లు.. బీజేపీవే అని అనుమానిస్తున్నారు. బ‌హుషా అందుకే కాబోలు.. పోలింగ్ ముగిసిన వెంట‌నే మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. ముందు మీ బీజేపీ ఓట్ల‌న్నీ మీకే ప‌డ్డాయో లేదో చూసుకోండంటూ ఎద్దేవా చేశారు. ఫ‌లితాలను బ‌ట్టి చూస్తుంటే.. బీజేపీ ఓట్లే చీలి.. కారుకు ప‌డ్డాయ‌ని అంటున్నారు. గెలిచింది టీఆర్ఎస్సే అయినా.. ఓడింది ఈట‌ల‌.. ఓడించింది బండి.. అని విశ్లేషిస్తున్నారు.   

కడప ఎస్పీని కలిసిన పీఏ కృష్ణా రెడ్డి.. వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి.  ఈ కేసులో ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ సంచలన విషయాలు చెబుతున్నారు. తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి బయటికి వచ్చారు. కడప ఎస్పీ అన్బురాజన్ కలిసి తనకు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.  వైఎస్ వివేకా హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు కృష్ణా రెడ్డి. వీళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీని పీఏ కోరారు. వైఎస్ వివేకా కుటుంబానికి చెందిన ముగ్గురి పేర్లు ప్రస్తావిస్తూ ఎస్పీకి పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. వైఎస్ వివేకాకు కృష్ణారెడ్డి మంచి నమ్మకస్తుడైన పీఏగా గుర్తింపు పొందారు. 30 ఏళ్ల పాటు వివేకా వెంట ఉన్నారు. వివేకా తుదిశ్వాస విడిచేవరకూ పీఏగా కొనసాగారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందనే చర్చ సాగుతోంది. ఇటీవలే వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన సొంత అల్లుడు కూతురు సునీత భర్త అయిన రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని పులివెందులకు చెందిన జర్నలిస్ట్ భరత్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ అనంతపురం ఎస్పీకి యాడికి చెందిన గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు వ్యతిరేకంగా సాక్షం చెప్పాలని తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చిందని ఆరోపించి సంచలన రేపారు గంగాధరా రెడ్డి . తాజాగా పీఏ కృష్ణారెడ్డి ముందుకు రావడంతో హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పదవి ఫసక్?.. సోము వీర్రాజుకు హైకమాండ్ పిలుపు.. 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ పదవి మరికొంత కాలమే అని తెలుస్తోంది. సోము వీర్రాజును ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలవడంతో ఆయన హడావుడిగా హస్తిన వెళ్లారు. దీంతో ఆయను  ఊస్టింగ్ ఖాయమనే చర్చ బీజేపీలోనే జరుగుతోంది. సోము వీర్రాజు తీరుపై గుర్రుగా ఉన్న బీజేపీ పెద్దలు... అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని దాదాపుగా డిసైడైపోయారని చెబుతున్నారు. ఇటీవలే తిరుపతికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పార్టీ పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. అయితే అమిత్ షా వార్నింగ్ ఇచ్చి వెళ్లినా ఏపీ బీజేపీ పనితీరు మారకపోవడంతో సారధిని మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సోము వీర్రాజును తక్షణం ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందని అంటున్నారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ హైకమాండ్. అందులో భాగంగానే సోముకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే... ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా ఏనాడు మాట్లాడలేదు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. తీవ్రంగా స్పందించలేదు. అంతేకాదు అధికార పార్టీపై ఏదో చేయాలన్నట్లుగా కొన్ని విమర్శలు చేస్తూ... చంద్రబాబునే టార్గెట్ చేశారు. సోము వీర్రాజు తీరుపై సొంత పార్టీ నేతలే చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.  దీంతో ఎంతసేపు మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావుడి చేయటమే తప్పించి క్షేత్రస్ధాయిలో వీర్రాజు బలమైన నేతకాదని హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు.  వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు పోరాడలేకపోతున్నారన్న పద్దతిలో ఆయనపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారాలు కట్ చేశారు. కోర్ కమిటీని నియమించారు. అయితే అసలు నాయకత్వమే సైలెంట్‌గా ఉంటూండటంతో కోర్ కమిటీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఆయనపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తేలడంతోనే ఇటీవల ఆయన … ఇక రాజకీయాల్లో ఉండననే ప్రకటనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 తర్వతా రాజకీయ రిటైర్మెంట్ అని ఆయన ప్రకటించుకోవడం.. పార్టీ హైకమాండ్‌కు ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించవద్దని సంకేతాలు పంపడమేనని అంటున్నారు.  అయితే సోము వీర్రాజు పార్టీ కోసం ఏం చేశారన్న నివేదిక రెడీ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది ఒక్కటంటే ఒక్కటీ కనిపించడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్న సమయంలో కన్నా లక్ష్మినారాయణను తొలగించి సోము వీర్రాజుకు చాన్సిచ్చారు. కానీ పూర్తిగా వైసీపీ అనుబంధంగా మార్చేశారు. అమరావతిపై మాట్లాడిన వారిని సస్పెండ్ చేసి .. పార్టీలో చేరిన కొంత మంది నేతలను వైసీపీ తరహాలో కోవర్టులుగా చూస్తూ పార్టీని కోలుకోకుండా చేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. అందుకే ఆయనకు ఫైనల్ క్లాస్ పీకడానికో.., పదవి నుంచి తప్పిస్తున్నామని చెప్పడానికో ఢిల్లీ పిలిపించారని భావిస్తున్నారు.  

కరీంనగర్ సహా ఆరు స్థానాలు కైవసం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు 

తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగగా... కౌంటింగ్ లో ఆరు సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా ఎన్నిక సాగిందని ప్రచారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాద్ కు 584 ఓట్లు రాగా.. ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు 231 ఓట్లు పోలయ్యాయి. 17 ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతొ తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గులాబీ పార్టీ అభ్యర్థులు భానుప్రసాద్, రమణలు విజయం సాధించారు.  నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి. నల్గొండలో మొత్తం 1233 ఓట్లు ఉండగా... టిఆర్ఎస్ కు 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. 50 ఓట్లు చెల్లకుండా పోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి.. ఇండిపెండెంట్ అభ్యర్థి నగేష్ పై 691 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం ఎమ్మెల్సీ సీటును టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు   238 ఓట్స్ మెజారిటీ తో గెలిచారు. మెదక్ లో టీఆర్ఎస్ కు 480 ఓట్లు రాగా..  కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి.ఆదిలాబాద్ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు.  ఆదిలాబాద్ లో కారు గుర్తుకు 741 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్ణరాణికి కేవలం 75 ఓట్లే వచ్చాయి.  ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి పోటీ చేసిన మెదక్ శాసనమండలి సీటును టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మెదక్ స్థానంలో 1018 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డికి 762 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. దీంతో కారు పార్టీ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాలకు గెలుచుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.   

ఒమిక్రాన్ వెరీ డేంజర్.. ఏప్రిల్ నాటికి 75 వేల మరణాలు?

సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ అన్ని దేశాలను వణికిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్‌ పుట్టుకురావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌ మామూలుగా ఉండదని సైంటిస్టులు వార్నింగ్‌ ఇచ్చారు  కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ముప్పు ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇది భౌగోళిక ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఇప్పటికే 60కిపైగా దేశాలకు పాకిందని తెలిపింది. టీకాలు వేసుకోవడం ద్వారా లభించే రక్షణను కూడా ఈ ఇది ఏమార్చుతోందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని వివరించింది. అంతేకాదు  ఇది తీవ్ర పరిణామాలతో మరో విజృంభణకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత గురించి ఓ అంచనాకు రావడానికి ముందు మరింత సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కుగానే ఉన్నప్పటికీ ఒకసారి అది ప్రబలితే మాత్రం ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. అదే జరిగితే మరిన్ని మరణాలు సంభవిస్తాయని తెలిపింది.  తాజాగా యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. ఒమిక్రాన్‌ తొలి మరణం నమోదైనట్లు ధృవీకరించారు యూకే పీఎం బోరిస్‌ జాన్సన్‌. నవంబర్‌ 27న యూకేలో ఒమిక్రాన్‌ కేసులు నమోదైనప్పటి నుంచి, కఠినమైన ఆంక్షలు విధించారు అధికారులు. అయినా, ఒమిక్రాన్‌ కేసుల్లో యూకే మొదటి స్థానంలో ఉంది. ఈ వేరియంట్‌ వ్యాప్తి బ్రిటన్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌ వెల్లడించింది. ముందస్తుగా చర్యలు తీసుకోకపోతే మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ వేరియంట్‌ వల్ల యూకేలో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 60 శాతం పెరగనున్నట్లు తెలిపింది. ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రెండు వారాల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పుడిస్తున్న జీతమే ఎక్కువ.. తగ్గించేద్దాం! సీఎంకు సీఎస్ కమిటి నివేదిక...

ఏపీ ఉద్యోగులకు సీఎస్ కమిటి షాకిచ్చింది. పీఆర్సీ ప్రతిపాదనల్లో ఉద్యోగులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఆర్సీతో వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులు ఆశిస్తుంటే.. సీఎస్ కమిటీ మాత్రం జీతాలు తగ్గేలా ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగులకు ఇప్పుడు ఇస్తున్న జీతభత్యాలే ఎక్కువ. అంత అవసరంలేదు. తగ్గించేద్దామంటూ  సర్కారుకు సిఫారసు చేసింది. అసలు పీఆర్సీ నివేదికను గుట్టుగా దాచేసిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యూహాత్మకంగా సీఎస్‌ కమిటీ నివేదికను బయటపెట్టింది. ఆ కమిటీ సిఫారసులు అమలైతే... ఉద్యోగుల జీతాలు పెరగడం కాదు, భారీగా తగ్గుతాయి. పీఆర్సీ కమిషన్‌ 27 శాతం సిఫారసు చేసిందంటూనే... 14.29 శాతం ఇస్తే చాలు అని సీఎస్‌ కమిటీ పరోక్షంగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ సీపీసీ పదేళ్లకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని తెలిపింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతే ఇచ్చాయని పేర్కొంది. కానీ... ఈ పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో కలిపి ఏకంగా 82 శాతం ఫిట్‌మెంట్‌ లభించిందని... ఇది చాలా ఎక్కువని అభిప్రాయపడింది. సీఎస్‌ కమిటీ సిఫారసు ప్రకారం... ఫిట్‌మెంట్‌ 14.29 శాతం చేస్తే, ఒక్కొక్కరి మూలవేతనంలో 12.71 శాతం తగ్గుతుందని చెబుతున్నారు.  ఫిట్‌మెంట్‌కు ఎసరు పెట్టిన సీఎస్‌ కమిటీ... హెర్‌ఆర్‌ఏలోనూ భారీ మతలబులు చేసింది. ప్రస్తుతం... ఉద్యోగులు నివసిస్తున్న నగరాల జనాభా ప్రాతిపదికన 10 శాతం, 20 శాతం, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలవుతోంది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ ఉద్యోగులందరికీ 30 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తోంది. ‘అంత అవసరం లేదు’ అని సీఎస్‌ కమిటీ అభిప్రాయపడింది. ‘‘రాష్ట్ర విభజన తర్వాత... హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక చర్యగా 30 శాతం హెచ్‌ఆర్‌ఏను, పరిమిత కాలానికి మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు గుర్తించాం. ఉద్యోగులు అమరావతికి వచ్చి ఆరేళ్ల తర్వాత కూడా దీనిని కొనసాగించడం సహేతుకం కాదు. 30 శాతం హెచ్‌ఆర్‌ఏను నిలిపివేయాలి’’ అని తెలిపింది. 5లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులందరికీ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సిఫారసు చేసింది. 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సూచించింది. ఇక... 50 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో నివసించే వారికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని తెలిపింది.  మన రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న నగరం ఒక్కటీ లేదు.సీఎస్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తే సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 30 శాతం నుంచి ఒకేసారి 16కు తగ్గుతుంది. ఇక... కొన్ని జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు అందుతున్న 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కూడా 4 శాతం తగ్గి, 16కు చేరుతుంది. మండల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు 12.5 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుతోంది. సీఎస్‌ కమిటీ సిఫారసుల ప్రకారం... 5 లక్షలలోపు జనాభా ఉన్న అన్ని ప్రాంతాలు/పట్టణాల్లోని ఉద్యోగులకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే అమలవుతుంది. అందరికీ... పల్లె నుంచి రాజధాని అమరావతి దాకా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ఏలో కోత పడుతుంది.  నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ఉద్యోగులకు సిటీ కంపెన్సేటరీ అలవెన్సు (సీసీఏ) అందుతోంది. విజయవాడ, విశాఖ నగరాల్లో పనిచేసే వారికి రూ.400, ఇతర మునిసిపాలిటీల్లోని ఉద్యోగులకు రూ.300 సీసీఏగా అందుతోంది. దీనిని... రూ.వెయ్యి, రూ.700లకు పెంచాలని అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సూచించింది. కానీ... సీఎస్‌ కమిటీ మాత్రం అసలు సీసీఏ అక్కర్లేదని తేల్చేసింది. దానిని పూర్తిగా ఎత్తేసింది.కేంద్రం అనుసరించిన విధానాల ప్రకారమే రాష్ట్రంలో కూడా పీఆర్సీ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ...  కేంద్ర ఉద్యోగుల వేతనాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇళ్లు, వాహనాలు, పర్సనల్‌ కంప్యూటర్ల కొనుగోలు కోసం ఇచ్చే లోన్లను ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చేది. ఇకపై బ్యాంకులతో టైఅప్‌ అయి తీసుకోవాలని... 2.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని మిశ్రా కమిషన్‌ సిఫారసు చేసింది. దీనిని సీఎస్‌ కమిటీ యథాతథంగా ఆమోదించింది. మహిళా ఉపాధ్యాయుల తరహాలో ప్రభుత్వ రంగంలోని ఇతర మహిళా ఉద్యోగులకు కూడా ఏడాదిలో అదనంగా  5 రోజుల క్యాజువల్‌ లీవులు ఇవ్వాలని నిర్ణయించారు. 

పేరుకే శ్రీరంగం... కేసీఆర్ రాజకీయ చదరంగం

హుజూరాబాద్  ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్.. తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ గులాబీ పార్టీలో మొదలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్.. తన క్యాంప్ ఆఫీస్, ప్రగతి భవన్‌లకే పరిమితమయ్యే వారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత.. సీఎం కేసీఆర్... ప్రజల్లోకి రావడానికి.. ఆందోళన చేయడానికి...  ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి రాజకీయ నేతలతో చర్చలు జరపడానికి హుషారు చూపిస్తున్నారనే చర్చ కారు పార్టీలో షికారు చేస్తోంది.   అయితే తాజాగా సీఎం కేసీఆర్... తమిళనాడులోని శ్రీరంగం వెళ్తున్నారు. అదీకూడా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకు వెళ్తున్నారు. కానీ శ్రీరంగంలో కొలువు తీరిన శ్రీరంగనాధ స్వామిని దర్శించుకుని మళ్లీ నేరుగా సీఎం కేసీఆర్.. ఆయన ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చేస్తే ఓకే. కానీ రాత్రికి సీఎం కేసీఆర్.. చెన్నైలో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సీఎం కేసీఆర్.. తన మార్క్ రాజకీయానికి తెర తీయనున్నారని గులాబీ దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో సీఎం కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో సమావేశం కానున్నారని..  ఈ సందర్బంగా ఇద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేశారు. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ బృందంతో మంతనాలు జరిపినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.   మరోవైపు.. సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ.. తాము త్వరలో తమిళనాడులో పర్యటించి.. డీఎంకే పార్టీ నిర్మాణాన్ని పరిశీలించనున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై పలువురు పలు సందేహాలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితుల మధ్య పుట్టింది... ఎలా ఎదిగింది... ఎలా అధికారాన్ని అందుకుంది... అన్న విషయాలు ప్రజలందరికీ తెలిసిందే. మరి అలాంటి పార్టీకి మళ్లీ పార్టీ నిర్మాణం ఏమిటంటూ రాజకీయ విశ్లేషకులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్.. తమిళనాడు పర్యటన వెనక .. తెర చాటు రాజకీయం ఏదో ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక.. సీఎం కేసీఆర్‌లోని ఇగోని హర్ట్ చేసిందని గులాబీ దళంలోని కీలక నేతలే బహిరంగంగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో బీజేపీని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే వ్యూహాంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారని సమాచారం. అందులోభాగంగానే యాసంగి వడ్ల కొనుగోలు అంశాన్ని కేసీఆర్ తెరపైకీ తీసుకు వచ్చారనే టాక్ తెలంగాణలో బలంగా నడుస్తుంది.  అదీకాక.. తెలంగాణలో ఒక వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా దూసుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని ఎక్కాలని గులాబీ బాస్ కలలు కంటున్నారు. ఆ క్రమంలో తమిళనాడులో డీఎంకే విజయానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి?.. అందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత? ప్రతిపక్షాల బలమైన ఓటింగ్ శాతాన్ని మనవైపు తిప్పుకునేందుక దోహదం చేసిన అంశాలు ఏమిటి అనే వాటితోపాటు.. పార్టీ పగ్గాలు తనయుడికి ఇవ్వడం వల్ల.. అటు పార్టీలో కానీ ఇటు కుటుంబంలో కానీ సమస్యలు తలెత్తితే.... ఆ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలు.. అందుకు కరుణానిధి ఫ్యామిలీలో అనుసరించిన వ్యూహాలు.. తదితర అంశాలు ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఏదీ ఏమైనా పేరుకే శ్రీరంగం టూర్.. కానీ ఈ టూర్ వెనుక రాజకీయంగా పావులు కదిపేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా  ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అందరు ఒకటైతేనే మోడీ ఓటమి సాధ్యం..పీకే జోస్యం  

భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తుందా? మోడీ మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అంటే, ప్రస్తుతానికి అయితే అవుననో కాదనో చెప్పే పరిస్థితి లేదు. నిజానికి మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత దినదినాభివృద్ధి చెందుతోంది. ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, నిరుద్యోగం ఒకటని కాదు, అన్ని విధాల జనం సమస్యలతో సతమత మవుతున్నారు. కొవిడ్ కష్టాలు సరే సరి.  ప్రభుత్వం వివాదస్పద సాగు చట్టాల ఉప సంహరణ వంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా,పెద్దగా ఫలితం కనిపించడం లేదు. జనాగ్రహం చల్లారడం లేదు. అయినా ... బీజేపీ, మోడీని ఓడించగలమన్న ధీమా ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. బీజేపీకి,మోడీకి ప్రత్యాన్మాయాన్ని  ప్రతిపక్ష పార్టీలు  , నాయకులు దేశ ప్రజల ముందుంచ లేక పోతున్నారు. అందుకే, దేశంలో రాజకీయ వాతావరణం ఇప్పటికీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లే, కనిపిస్తోంది.  అయితే ఎన్నికల వ్యూహకర్త, పశ్చిమ బెంగాల్’లో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసిన ప్రశాంత్ కిశోర్ (పీకే)మాత్రం ఇందుకు సంబందించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. ‘ఇండియా టుడే’ సంపాదకుడు రాజ్‌ చెంగప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదిరితే, వేగంగా స్పందించే యంత్రాంగం ఉంటే,2024 ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కోగలమనే విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.అయితే, అదే సమయంలో ఆయన బీజేపీకి కాంగ్రెస్‌ ఏకైక ప్రతిపక్షం కానే కాదని స్పష్టం చేశారు. నేరుగా పోటీ పడితే బీజేపీని ఆ పార్టీ ఓడించలేదని, ఆ స్థానంలో ప్రతిపక్షాలు బలోపేతం కావాలని సూచించారు. కాంగ్రెస్‌ మూలాల నుంచి వచ్చిన తృణమూల్‌, ఎన్సీపీ వంటి పార్టీలు ప్రత్యామ్నాయంగా బలోపేతం కావాలన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో 200 ఎంపీ సీట్లకు బీజేపీ 47కే పరిమితమైందని గుర్తు చేశారు. నిజమే, కానీ, ఈ రాష్రాి ల్లో కాంగ్రెస్ సహా మరే పార్టీ కూడా బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలవలేదు.కాంగ్రెస్ పార్టీ అయితే, కేవలం 20 సీట్లు మాత్రమె గెలిచింది. అందులో 13 సీట్లు ఒక్క కేరళ లోనే ఉన్నాయి. తెలంగాణ, తమిల్ నాడు రాష్ట్రాలలో మూడేసి, ఒరిస్సాలో ఒకే ఒక్క సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన  స్థానాల్లో  ప్రాంతీయ పార్టీలుగెలిచాయి. సో ..ఎలా చూసినా, పీకే చెప్పినట్లుగా,బీజేపీయేతర ప్ర్త్యలు అన్నీ ఏకంయితేనే, బీజేపీని ఓడించడం సాధ్యం అవుతుంది.

జగన్ కు నోటీస్.. జైభీమ్ పై సీరియస్.. బుగ్గనకు షాక్.. టాప్ న్యూస్@7PM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్‌షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.  --- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. 377 నిబంధన కింద లోకసభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  -------- ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఉద్దేశించి జైభీమ్ సినిమా ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ చంద్రు కామెంట్లను జస్టిస్  దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు.  ----- కర్నూలు జిల్లాలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. డోన్‌లో పర్యటిస్తున్న బుగ్గనను  దొరపల్లె గ్రామ రైతులు  అడ్డుకున్నారు. వైసీపీ నేతలు తమ పొలాలను కాజేయాలని చూస్తున్నారంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని మంత్రి బుగ్గనకు రైతులు ఫిర్యాదు చేశారు.  -------  ఓటీఎస్‌పై కావాలనే టీడీపీ రాద్దాంతం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రజల్లో ఓటీఎస్‌పై కావాలనే టీడీపీ లేని పోనీ అపోహలు సృష్టిస్తోందన్నారు. పేదవాడికి ఉపయోగ పడే పథకం ఒక్కటి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకు రాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సీఎం జగన్ టార్గెట్ అవుతున్నారని రోజా విమర్శించారు. ------- టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ పీఎస్‌లో ఈపూరు విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదు చేశారు. ఏఈ ఫిర్యాదుతో టీడీపీ నేతలు జీవీ, జగ్గారావులపై కేసు నమోదు చేశారు. పలువురు ఎస్సీకాలనీ వాసులపై కూడా కేసులు నమోదయ్యాయి. అంగులూరు ఎస్సీ కాలనీకి గత మూడ్రోజులు కరెంట్ నిలిపివేశారు. కాలనీ వాసులతో కలిసి జీవీ ఆంజనేయులు నిరసన దీక్ష చేశారు.  ---- తమిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో స‌మావేశం కానున్నారు. రేపు తిరుత్త‌ణిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశమ‌వుతారు. ఈ భేటీ స్టాలిన్ నివాసంలో సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. సోమవారం రాత్రికి త‌మిళ‌నాడులోని ఐటీసీ హోట‌ల్‌లో కేసీఆర్ బ‌స చేయ‌నున్నారు. ------ బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జంతర్‌ మంతర్‌లో తెలుగురాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా నిర్వహించింది. బీసీ సంఘాల ధర్నాకు రేవంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. జంతర్ మంతర్‌లో బీసీలు ధర్నా చేస్తుంటే.. వారికి సంబంధించిన 9 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారని అన్నారు.  -------- హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన దేశ తొలి సీడీఎస్ జనరల్ రావత్, ఇతర సైనికుల పేరిట ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నీలగిరి జిల్లాలోని కూనూరు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. తమ విజ్ఞప్తితో కూడిన లేఖలను ప్రధాని మోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు పంపారు. -------- తనకు వెళ్లాలని అనిపించినప్పుడు పార్లమెంట్‌కు వెళ్తానని వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ, రాజ్యసభ సభ ఎంపీ జస్టిస్ రంజన్ గోగోయ్‌కి పార్లమెంట్‌‌లో నోటీసులు పంపించింది తృణమూల్ కాంగ్రెస్. గోగోయ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ ధిక్కారంగా ఉన్నాయని, సభా గౌరవానికి ఆయన మాటలు భంగం కలిగిస్తున్నాయని, ప్రత్యేక అధికారాలపై కూడా ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నోటీసులో టీఎంసీ పేర్కొంది ---------

పంచ్ ప్రభాకర్ అరెస్ట్ సంగతేంటీ? సీబీఐపై ఏపీ హైకోర్టు అసహనం.. 

సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ తీరుపై ధర్మాసనం  తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. మన వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో జనవరి 25లోపు పూర్తిస్థాయిలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది ఏపీ హైకోర్టు ధర్మాసనం.  పంచ్‌ ప్రభాకర్‌కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ తన కౌంటర్ లో చెప్పడంపై హైకోర్టు తరపు న్యాయవాది అశ్వినీ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బందువులు ఎవరూ, ఆయన ఆస్తులు గురించి సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితుల పరస్పర అప్పగింతలో భాగంగా సీబీఐ ఎందుకు పనిచేయలేకపోతుందని ప్రశ్నించారు. సీబీఐ వేసిన అఫిడవిట్‌లో ఎటువంటి కొత్త విషయాలు లేవని, అందరికి తెలిసిన విషయాలే అందులో ఉన్నాయని.. గుగుల్‌‌లోకి వెళితే ఈ విషయాలు అందరికీ తెలుస్తాయన్నారు అశ్వనీకుమార్.  తమకు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాలు సమాచారం ఇవ్వడంలేదని ధర్మాసనానికి సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. సీబీఐ అడిగిన సమాచారాన్ని తాము ఎప్పటికప్పుడు ఇస్తున్నామని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాల న్యాయవాదులు చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జనవరి 25వ తేదీలోపు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అందులో అంశాలు, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్‌కు తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని  ఆదేశించింది. ఆ తరువాత అఫిడవిట్‌ను పరిశీలించి ఏం చేయాలన్న అంశం‌పై తగిన ఉత్తర్వులు ఇస్తామని  హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

జగన్ పాలనలో అందరికి నరకం.. రాష్ట్రపతి పాలనే శరణ్యం!   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అన్నారు. 377 నిబంధన కింద లోకసభలో లిఖితపూర్వకంగా ఆయన నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ ఇంటిపై సీఐడీ పోలీసుల సోదాలు, కేసుల నమోదు కక్ష్య సాధింపు మాత్రమేనని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.  లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ  వేమూరి రాధాకృష్ణ  ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఆర్కేను ఉండమని చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తిరిగి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా కక్ష్య సాధింపేనన్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను దారుణంగా వాడుకుంటోందని రఘురామ విమర్శించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు చేసే పోలీసులు కూడా శిక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు. రిటైర్డ్ జడ్జి చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరో అంబాసిడర్‌గా తయారయ్యారన్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రుడు మాట్లాడారని, ఆయన వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం అందరికీ హనీ చేస్తోందని రఘురామ రాజు అన్నారు. 

జైభీమ్ చంద్రుపై హైకోర్టు జడ్జీ సీరియస్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఉద్దేశించి జైభీమ్ సినిమా ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ చంద్రు కామెంట్లను జస్టిస్  దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు.  ‘‘ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండి. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా?.’’ అని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.  విజయవాడలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన జస్టిస్ చంద్రు.. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని కామెంట్ చేశారు. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్‌ చంద్రు ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

అమాంతం రేట్లు పెంచేసిన అమెజాన్‌.. అర్థ‌రాత్రి నుంచే అమ‌లు..

అమెజాన్‌. ఆ అడ‌వి అంత పెద్ద‌ది ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌. అమెజాన్‌లో ఏ టూ జెడ్‌.. ఏది కావాల‌న్నా దొరుకుతుంది. అమ్మే వారికి కొనే వారికి వార‌ధిగా మారింది అమెజాన్‌. ఈ అన్‌లైన్ కొనుగోళ్లు ఎంత పాపుల‌రో.. ప్రైమ్‌ వీడియోస్ పేరుతో సినిమాలు, సీజ‌న్స్ కూడా అంతే పెద్ద బిజినెస్‌. అందుకే, అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకున్న వారు కోట్ల‌ల్లో ఉంటారు. తాజాగా, వారందిరికీ షాక్ ఇస్తూ.. అమెజాన్ ప్రైమ్ స‌భ్య‌త్వం ధ‌ర భారీగా పెంచేసింది. ధ‌ర‌ల పెరుగుద‌ల గురించి ముందే స‌మాచారం ఇచ్చినా.. స‌డెన్‌గా ఈ అర్థ‌రాత్రి నుంచే పెరిగిన ధ‌ర‌లు అమ‌లులోకి వ‌స్తుంద‌ని అమెజాన్ ప్ర‌క‌టించింది.  డిసెంబ‌ర్ 13 వ‌ర‌కూ.. అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం రూ.999గా ఉండ‌గా.. డిసెంబ‌ర్ 14 నుంచి ఆ ధ‌ర ఏకంగా రూ.1,400 కానుంది. ఈ పెంచిన ధరలు సోమ‌వారం అర్ధరాత్రి నుంచి (మంగళవారం డిసెంబరు 14) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ తన డీల్స్‌ పేజీలో ప్రకటించింది.  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిఫ్ మూడు రకాలుగా ఉంది. నెల‌.. మూడు నెల‌లు.. ఏడాది టైమ్ పీరియ‌డ్‌కి ప్రైమ్ స‌భ్య‌త్వం అందుబాటులో ఉంది. తాజా పెంపుతో ఈ మూడు ప్యాక్‌ల ధ‌ర‌లూ పెర‌గ‌నున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా, పెంపు త‌ర్వాత రూ.179 కానుంది. అంటే, 38శాతం పెర‌గ‌నుంది. ఇక‌, మూడు నెలల ప్యాక్‌కు రూ.329 ఉండ‌గా అది 39శాతం పెరిగి.. రూ.459 అవుతోంది. వార్షిక సభ్యత్వం రూ.999 నుంచి.. 50శాతం పెంపుతో రూ.1,499కి చేరుతుంది.  2016లో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను భారత్‌లో ప్రారంభించింది అమెజాన్‌. అప్పుడు వార్షిక సభ్యత్వం రూ.499గా ఉండగా, ఆ తర్వాత 2019లో రూ.999కు పెంచింది. 2018లో నెలవారీ సభ్యత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రైమ్‌ వీడియోలు, ప్రైమ్‌ మ్యూజిక్‌తో పాటు, ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఉచిత హోమ్‌ డెలివరీ వంటి ప్రయోజనాలు ఉంటాయి. టాప్‌ డీల్స్‌ను 30 నిమిషాల ముందుగానే పొందే అవకాశమూ లభిస్తుంది. అందుకే, ఇండియాలో కోట్ల‌లో అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులు ఉన్నారు. 

కేసీఆర్ శ్రీరంగం పర్యటన అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భానికి, నాలుగేళ్ళ అనతరం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భానికి పెద్దగా తేడాలేదు. కేసీఆర్ సారధ్యంలో తెరాస తొలిసారి కంటే, రెండవసారి   మరింత ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మూడింట రెండువంతుల (18 మందిలో12) మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కడంతో. కారు జోరుకు తిరుగన్నదేలేకుండా పోయింది. కానీ,2019 లోక్’సభ ఎన్నికలలో తెరాస కథ అడ్డం తిరిగింది. కారు సారూ పదహారు బండి బోల్తా కొట్టింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి. తెరాసకు సవాలు విసిరాయి.  ఇక అక్కడి నుంచి కథ అడ్డం తిరిగింది. ప్రతి పక్షమే ఉండకూడదు అనుకుంటే, ఒకరికి ఇద్దరు తోడయ్యారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, కాళ్ళ కింద భూమి కదిలి పోతున్నట్లుగా షేక్ అవుతున్నారు. ఏదో తెలియని భయం ఆయన్ని భయంకరంగా వెంటాడుతోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల సమాచారం. ఓ వంక రాజకీయంగా వరస ఓటములు వెంటాడుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటమి దెబ్బ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బయట పడేస్తే, హుజూరాబాద్ ఏ గెలుపు భర్తీ చేయలేని భారీ దెబ్బ తీసింది.మరో వంక దాచేస్తే దాగని అవినీతి కుంభకోణాలు వెలుగు  చూస్తున్నాయి.అన్ని దిక్కుల నుంచి ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు అందినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి మరింతగా భయపదుతున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ ఆత్మ రక్షణలో పట్టారు. ఢిల్లీతో వరి పేరున కయ్యానికి కాలు దువ్విన ఆయనే సయోధ్యకు కూడా ప్రయత్నించారని అంటారు. అయినా, నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి వట్టి చేతులతతో వచ్చారు. మరోవంక, కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కైపి రక్షణ వలయం ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈరోజు తమిళనాడులోని శ్రీరంగం వెళ్లారు. శ్రీరంగం రంగనాథస్వామికి కుటుంబ సమేతంగా పూజలు ఆచరించి, మొక్కులు తీర్చుకునిందుకే ముఖ్యమంత్రి తమిళనాడు వెళ్లి నట్లు చెపుతున్నా, ఈ పర్యటనలో స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీరంగం నుంచి చెన్నైవచ్చి, రేపు (మంగళవారం) ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసే అవకాశముందని అంటున్నారు.  నిజానికి ప్రస్తుత చిక్కులోంచి బయట పాడేందుకు స్టాలిన్’తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. అలాగే, స్టాలిన్’తోపాటుగా తెలంగాణ  రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ను కలసి వారి సహకారం తీసుకునేందుకే కేసీఆర్ తమిళనాడు టూర్ ప్లాన్ చేశారని అంటున్నారు. స్టాలిన్ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో చేతులు కలిపే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి స్టాలిన్’ను కలుస్తున్నారని అంటున్నారు. అలాగే  కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్ర వైఖరి, రాజకీయ అంశాలపై స్టాలిన్తో చర్చించనున్నారని అంటున్నారు. అదే విధంగా కేంద్రంతో మంచి సంబంధాలున్న మాజీ గవర్నర్ నరసింహన్ను మర్యాద పూర్వకంగా కలిసి వారి  ఆశీస్సులు తీసుకుంటారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రస్తుత తమిళనాడు టూర్ విషయం,ఈ టూర్ వెనకున్న అసలు కథ ఎలాఉన్నా, కేసీఆర్ సెకండ్ టర్మ్ మొదటి మూడేళ్ళు  రాష్ట్రానికే కాదు, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుటుంబానికి కాసింత కష్టంగానే సాగాయి .. మిగిలిన రెండేళ్ళు ఎలా ఉంటాయో ..ఏమో .. చెప్పడం కష్టమే. 

తెలంగాణలో ఇంటింటికి లిక్కర్! సర్వేతో షాకింగ్.. వ్యాపారుల ఆఫర్స్..

తెలంగాణలో త్వరలో లిక్కర్  డోర్ డెలివరి కానుందా? మద్యం ప్రియులు కూడా అదే కోరుకుంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే మొదలైంది కూడా. అయితే లిక్కర్ డోర్ డెలివరీని ప్రస్తుతం ప్రభుత్వం అందించడం లేదు. మద్యం వ్యాపారులే మొదలు పెట్టేశారు. మద్యం ప్రియుల నుంచి డిమాండ్ వస్తుండటంతో లిక్కర్ ను వాళ్ల ఇంటి దగ్గరే అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లాలోని ఓ మద్యం షాపులో డోర్ డెలివరీని ప్రారంభించగా.. మంచి స్పందన వస్తుందని అంటున్నారు. నిజానికి తెలంగాణలో మద్యం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దక్షిణాదిలోని మిగితా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే లిక్కర్ సేల్స్ ఎక్కువ. సర్కార్ కు ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే తెలంగాణ సర్కార్ ప్రతి ఏటా మద్యం షాపులను పెంచుకుంటూ పోతుంది. డిసెంబర్ నెలలో మొదలైన కొత్త షాపుల టెండర్ల సమయంలోనూ మరో 4 వందలకు పైగా కొత్త షాపులను మంజూరు చేసింది. గతంలో ఒక్కో మండలానికి ఒక వైన్ షాపు ఉండగా... ఇప్పుడు రెండు, మూడు కూడా ఉన్నాయి. దీంతో మద్యం వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఇది కూడా డోర్ డెలివరీకి అవకాశం ఇచ్చిందంటున్నారు.  కస్టమర్స్ ను ఆకర్షించి తమ సెల్స్ పెంచటానికి ఇంటికే  వచ్చే లిక్కర్ అందిస్తామని కొందరు వ్యాపారులు ఆఫర్లు పెట్టారని తెలుస్తోంది. ఇలా ఒకరిని చూసి మరొకరు డోర్ డెలివరీ సిస్టమ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొందరు ఎక్స్ ట్రా డబ్బులు తీసుకుంటగా.. ఇంకొందరు మాత్రం ఫ్రీగానే డోర్ డెలివరీ చేస్తున్నారు.  లిక్కర్ డోర్ డెలివరికి సంబంధించి గత సెప్టెంబర్ జరిగిన ఓ సర్వేలోనూ తెలంగాణకు సంబంధించి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసొసియేషన్(ISWAI) కస్టమర్ పల్స్ నిర్వహించిన సర్వేలో తెలంగాణలో వంద శాతం మంది డ్రింకర్లు డోర్ డెలివరీ కోరుకున్నారు. తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఆ సంస్థ సర్వే జరపగా.. మిగితా ఏడు రాష్ట్రాల్లో 70 శాతం మంది ప్రజలు డోర్ డెలివరీకి మొగ్గు చూపారు. తెలంగాణకు సంబంధించి నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో డోర్ డెలివరీకి సంబంధించి డిమాండ్ కనిపించింది. దాదాపు ఏడున్నర వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే చేసింది ISWAI. అయితే డోర్ డెలివరీకి సర్వీస్ చార్జీ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిటీ ప్రాంత ప్రజలు 50 నుంచి 100 రూపాయలు వసూల్ చేయవచ్చని చెప్పగా... మధ్య తరగతి ప్రజలు మాత్రం 5 నుంచి 10 రూపాయలు మాత్రమే డోర్ డెలివరీకి సర్వీస్ చార్జీ తీసుకోవాలని తమ అభిప్రాయం చెప్పినట్లు సర్వే వెల్లడించింది.  తమ సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలను తెలంగాణ సర్కార్ కు నివేదిస్తామని ISWAI సీఈవో కపూర్ చెప్పారు. ప్రభుత్వమే అధికారికంగా లిక్కర్ డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తామని చెప్పారు. మన దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. కొవిడ్ సమయంలో పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, అసొం, ఒడిషా, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, పుదిచ్చేరి రాష్ట్రాల్లో అమలు చేశారు. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా లిక్కర్ డోర్ డెలివరీని ప్రారంభిస్తే మంచిదనే సూచన వస్తోంది. కొవిడ్ రూల్స్ పాటిస్తూ డోర్ డెలివరీ చేస్తే లిక్కర్ షాపుల దగ్గర రద్దీని కూడా తగ్గించేవచ్చనే అభిప్రాయం వస్తోంది.

ఇటు హైకోర్టు.. అటు పార్ల‌మెంటు.. జ‌గ‌న్‌ను వెంటాడుతున్న ర‌ఘురామ‌..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్‌షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  గ‌తంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ర‌ఘురామ సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఆ కేసులో వాద‌న‌లు వాడివేడిగా జ‌రిగాయి. బెయిల్ ర‌ద్దు నిర్ణ‌యాన్ని కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేసింది సీబీఐ. అటు, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ కూడా ర‌ద్దు చేయాలంటూ మ‌రో పిటిష‌న్ వేశారు ర‌ఘురామ‌. ఆ రెండు కేసులకు క‌లిపి.. ర‌ఘురామ పిటిష‌న్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది సీబీఐ కోర్టు. అయినా, ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. ఈ పిటిష‌న్‌పై తాజాగా విచారణ జరిగింది. జ‌గ‌న్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏపీ సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. మ‌రోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. 377 నిబంధన కింద లోక్‌సభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యమని రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.