విదేశాల నుంచి రానివారికి ఒమిక్రాన్.. ముంబైలో డేంజర్ బెల్స్...
posted on Dec 14, 2021 @ 8:49PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి కొత్త వైరస్ కేసుల సంఖ్య 57కు చేరింది. మహారాష్ట్రలో తాజాగా మరో 8 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబయి నగరంలో వెలుగు చూశాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది.
అయితే తాజాగా ముంబైలో ఒమిక్రాన్ సోకిన వారిలో ఎవరికీ విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఒకరు బెంగళూరు, మరొకరు ఢిల్లీ ప్రయాణించినట్టు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన కేసుల్లో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, మిగతా ఐదుగురు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని వివరించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరుగురు ఇంటి వద్దనే ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో విదేశీ ప్రయాణ చరిత్ర లేకుండానే ఒమిక్రాన్ కేసులు వెల్లడికావడం కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి చెందుతోందన్న సంకేతాలు ఇస్తోంది.ఇదే ఇప్పుడు ముంబై వాసులను వణికిస్తోంది.