ఎవరు ఎవరి సంక నాకుతున్నారో చూస్తూనే ఉన్నాం.. రఘురామ రాజు ఫైర్

గత మూడు రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ పై మరో సారి రెచ్చిపోయారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ముందు నుండి సైలెంట్ అయిన రఘురామ రాజు తాజాగా సొంత పార్టీ నేతల పై దారుణమైన సెటైర్లు వేశారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. "బీజేపీలో తన చేరికపై వైసీపీ నేతలు కొందరు పేలుతున్నారని... అయితే ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశామని" తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తాము మంత్రులం అయిపోయామని... వైసీపీ నేతలు బుస్సు కబుర్లు చెబుతున్నారని, నవంబరులో కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని" అయన అన్నారు. అయితే వీళ్లు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని అయన ఎద్దేవా చేశారు.   "ఇప్పటికే తమకు ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టంగా చెప్పింది .. కానీ వైసీపీ మాత్రం సొంత ప్రచారం చేసుకుంటోంది. వీళ్లను కేబినెట్‌లోకి రావాలని బతిమాలుతున్నట్టు... అయితే వీళ్ళు మాత్రం ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు అంత ప్రేమ ఉందా? ప్రత్యేక హోదా కావాలంటే కేబినెట్‌ నుంచి బయటకు రావాలని... అప్పట్లో టీడీపీని డిమాండ్‌ చేశారు కదా? హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. వైసిపి ఎంపీలు కనుక ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే... నేను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్ధం’’ అని అయన అన్నారు.   అయినా దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని అయన ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్... ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని అయన నిలదీశారు. సీఎం జగన్‌ చెబుతున్నట్టు 20 ఏళ్లు అధికారంలో ఉండాలంటే... అయన నిర్మాణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలని రఘురామరాజు అన్నారు.

ఆన్ లైన్ వెనక గ్రేటర్ ప్లాన్! విపక్ష నేతలే టార్గెటా? అమ్మ కేసీఆర్..

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జనాల ఆస్తుల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు. అయితే సరైన మార్గదర్శకాలు లేకుండా హడావుడిగా సర్కార్ ఆదేశాలివ్వడంతో.. ఫీల్డ్ లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తుల కొలతలపై ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గందరగోళంగా, అయోమయంగా ఉన్న ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారన్న చర్చ జనాల్లో జరుగుతోంది. కొన్నేండ్లుగా కొత్త రెవిన్యూ చట్టం తెస్తామని మాత్రమే ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. కొత్త రెవిన్యూ బిల్లును అసెంబ్లీలో పాస్ కూడా చేయించుకున్నారు. తర్వాత సడెన్ గా ఎవరూ ఊహించని రీతిలో ఆస్తుల ఆన్లై న్ చేపట్టాలని నిర్ణయించారు. అంతే హడావుడిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతో క్లిష్టమైన ఆస్తుల ఆన్ లైన్ పై కేసీఆర్ కు ఎందుకంత తొందర అన్న విమర్శలు వస్తున్నాయి.                      ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ వెనక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే టార్గెట్ గా ఆయన ఈ ప్రక్రియను చేపట్టారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు గడువుకన్నా ముందే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల కసరత్తును కూడా ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికార పార్టీకి మరింత ప్రాధాన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో కోటి జనాభా, దాదాపు 70 లక్షల మంది ఓటర్లున్నారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో నాలుగో వంతు మంది ఇక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజల తీర్పు గ్రేటర్ లో రాబోతోంది. గ్రేటర్ లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. అధికార పార్టీపై రాష్ట్రంలోని మెజార్టీ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లే. అది తర్వాత ఆ పార్టీకి గండంగా మారుతుంది. అందుకే  బల్దియా ఎన్నికలను సవాల్ తీసుకున్న కేసీఆర్.. ఎలాగైనా మరోసారి పాగా వేసేలా పావులు కదుపుతున్నారు.  గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే విపక్ష నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.   గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేస్తే కోట్ల రూపాయల్లోనే ఖర్చు చేాయాల్సి వస్తోంది. పది నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కూడా కొందరు వెనుకాడరు. గ్రేటర్ లో పోటీ చేయాలనుకునే అశావాహులు.. ఖర్చు కోసం తమ ఆస్తులను అమ్ముతుంటారు. ప్రతి ఎన్నికల ముందు ఇదే జరుగుతుంది. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. తెలివిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెచ్చారని చెబుతున్నారు. అందరి ఆస్తులు ఆన్ లైన్ చేస్తారు కాబట్టి... ఎవరూ తమ ఆస్తులు అమ్మినా ఇట్టే సర్కార్ కు తెలిసిపోతుంది. దీంతో విపక్ష నేతలెవరు ఆస్తులు అమ్ముతున్నారో తెలుసు కోవచ్చు. తర్వాత వారికి చెక్ పెట్టవచ్చు. తమ దారికి తెచ్చుకోవచ్చు. వినకపోతే అక్రమాస్తులు ఉన్నాయంటూ వేధించవచ్చు. మొత్తంగా తమకు పోటీగా ఉంటారని భావించే నేతలకు ఇలా చెక్ పెట్టవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఈ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చారని విపక్ష పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు.    రెవిన్యూ సంస్కరణలు,  కొత్త రెవిన్యూ చట్టం, ఆస్తుల ఆన్ లైన్ విధానాలపై సీఎం కేసీఆర్  ఏకపక్షంగా వెళుతున్నారనే చర్చ ఐఏఎస్ ల్లో  జరుగుతుందని చెబుతున్నారు. వీటిపై ఉన్నతాధికారులతోన సీఎం సమగ్రంగా  చర్చిచంలేదని, తన ఆలోచనల ప్రకారమే ఆయన ముందుకు పోతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ చేపట్టబోయే పథకాల గురించి విన్న కొందరు అధికారులు.. సరైన మార్గదర్శకాలు లేకుండా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే చాలా సమస్యలు వస్తాయని సీఎంకు చెప్పాలని చూసినా ఆయన స్పందించలేదట.  అందుకే కొందరు సీనియర్ అధికారులు ముందే జాగ్రత పడి బదిలీపై వేరే శాఖలకు వెళ్లినట్లు చెబుతున్నారు. సిన్సియర్ అధికారిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ చిరంజీవులు కూడా కేసీఆర్ చేస్తున్న పనులు నచ్చకే వేరే శాఖకు వెళ్లారనే చర్చ తెలంగాణ సచివాలయంలో ఉంది. హడావుడిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే  సమస్యలు వస్తాయని సహచర అధికారులతో చిరంజీవులు చెప్పినట్లు చెబుతున్నారు.    గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు అస్తవ్యస్థ విధానాలు చేపట్టడమేంటనే ప్రశ్న ప్రజా సంఘాల నుంచి వస్తోంది. ప్రజలకు ఆస్తులంటే సెంటిమెంట్. అలాంటి సున్నితమైన విషయంలో హడావుడిగా ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోతోంది.. కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ టూర్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీయేలో చేరే అంశంపై ప్రధాని మోడీతో జగన్ చర్చించారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, విపక్ష నేతలు మాత్రం కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని ఆరోపిస్తున్నారు.   జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. మీరు ప్రధానితో మాట్లాడింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే ఎందుకు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ప్రధానితో 40 నిమిషాల పాటు ఈ విషయం మాట్లాడాను, హోదా ఇవ్వాల్సిందే అని నిలదీశామన్న మాట మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని నిలదీశారు. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉండి.. ప్రత్యేక హోదాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. హోదా కోసం పార్లమెంట్‌ ఆవరణలో వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాడలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పార్లమెంట్‌లో పోరాడితే మేం మద్దతిస్తాం అని రామ్మోహన్‌ నాయుడు అన్నారు.   ఢిల్లీలో జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించలేదని అన్నారు. జగన్ ను రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నామని.. ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసులు మాఫీ చేయించుకోవడానికా? లేక రాష్ట్ర ప్రయోజనాలపై పోరాటం చేయడానికా? అని నిలదీశారు. "మీపై 11 సీబీఐ కేసులు సహా 31 కేసులు ఉన్నట్టు మీరే అఫిడవిట్ లో రాసుకున్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వకుండా ఉంటే అనుమానం రాదా? మీరు వివరణ ఇవ్వకపోతే కేసుల మాఫీ కోసమే వెళ్లారని భావించాల్సి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీరు కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేయడం సరికాదు" అంటూ రామ్మోహన్ నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఏపీ సీఐడీ తీరుపై హైకోర్టు అసహనం.. ప్రభుత్వానికి ఒక న్యాయం, కోర్టులకి ఒక న్యాయమా?

న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వివిధ సోషల్‌ మీడియా కంపెనీలకు హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆ పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ లను కంపెనీలకు అందించాలని సీఐడీకి సూచించింది.    ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై కొందరు సోషల్‌ మీడియాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులపై సీఐడీ కేసులు నమోదు చేసింది.   అయితే, సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో పురోగతి లేదని, సోషల్‌ మీడియా కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణలో హైకోర్టు ఆర్‌జీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన అఫిడవిట్ ​లో సవరణ చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ కౌంటరు దాఖలు చేయడానికి స్వల్ప గడువు కోరారు. అనుబంధ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటరు వేసేందుకు ధర్మాసనం గడువిచ్చింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.    తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్​ లో న్యాయవాది మురళీధర్‌రావు వాదనలు వినిపించారు. హైకోర్టుపై సోషల్‌ మీడియాలో అభ్యంతర పోస్టింగుల వెనుక కుట్రకోణం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివరాలను దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచించింది. న్యాయవాది బదులిస్తూ.. దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదన్నారు. హైకోర్టు 94 మందిపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు చేస్తే కొంతమందిపైనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవ్యవస్థపై పోస్టింగుల వెనుక ఉండి మొత్తం చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్‌ కిషోర్‌ కు చెందిన ఐ ప్యాక్‌ టీమ్‌కు కోట్ల రూపాయలు చెల్లించి వైసీపీ నియమించుకుందని, ఈ టీమ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా తమ వ్యతిరేకులపై ప్రజల్లో ద్వేషం కలిగించడంలో సిద్ధ హస్తులని పిటిషనర్‌ శివానందరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా స్లీపర్‌ షెల్‌ల తరహాలో వ్యవహరిస్తున్నారని, హైకోర్టు జడ్డీలను అపకీర్తి పాలుచేయడం వైసీపీ వ్యూహంలో భాగమేనన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక స్పష్టమైన కుట్ర దాగుందన్న శివానంద రెడ్డి... దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా చేధించాలని కోరారు.   సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఓ తీర్పు ప్రకారం అభ్యంతర పోస్టింగులను తొలగించాల్సి ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. మీరెందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. పేపర్లపై పని చేసినట్లు కనిపించడం కాదని.. చర్యలు వాస్తవ రూపంలో ఉండాలని వ్యాఖ్యానించింది. నిజంగా న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే ఆ పోస్టింగుల తొలగింపునకు తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.   మరోవైపు, ఏపీ సీఐడీ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి ఒక న్యాయం, కోర్టులకి ఒక న్యాయమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై.. ముసలీ ముతకా అని కూడా చూడకుండా సీఐడీ కేసులు నమోదు చేసింది. అంతేకాదు విచారణ పేరుతో తమ కార్యాలయాల చుట్టూ తిప్పించింది. అయితే, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై మాత్రం సీఐడీ అదే దూకుడు చూపలేకపోతోంది. వారంతా అధికార పార్టీ సానుభూతిపరులు కావడంతోనే సీఐడీ దూకుడుగా వ్యవహరించట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఫలితాలు ఇచ్చాక పోస్టింగులకు లేటెందుకు! మండలి కోసమేనా.. 

ఎన్నికలకు ముందు ఓటర్లకు తాయిలాలు కురిపించడం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అన్ని ఎన్నికల్లోనూ ఆయన అలాగే చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. జనాల్లో తమపై వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన ప్రతిసారి కేసీఆర్ ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తుంటారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు టీఆర్ఎస్ కు సవాల్ గా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు కేసీఆర్ సర్కార్ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మండలి ఎన్నికల్లో తమకు ఇబ్బంది అవుతుందని భావించిన టీఆర్ఎస్.. దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. మండలి ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్ల కోసం కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.    1,595 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి 2018లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ విడుదల చేసింది. రాత పరీక్షను అక్టోబర్ 7, 2018న నిర్వహించింది. మొత్తం 1,867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే పరీక్ష జరిగిన రెండేండ్లు అవుతున్నా టీఎస్‌పీఎస్సీ ఫలితాలు విడుదల చేయలేదు. ఫలితాలు ఇవ్వాలంటూ అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు. అయినా కేసీఆర్ సర్కార్,  టీఎస్‌పీఎస్సీ గాని స్పందించలేదు. కాని సడెన్ గా ఇప్పుడు ఫలితాలు విడుదల చేసింది.     రెండు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని ఆరు జిల్లాల పట్టభద్రులు ఓటేయనున్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరుద్యోగులు, యవకులు ఆగ్రహంగా ఉన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలోనూ ఇదే తేలిందట. ప్రభుత్వంపై యువత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టులోనూ వచ్చిందని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రెండేండ్ల క్రితం జరిగిన గ్రూప్ 4 ఫలితాలను సడెన్ గా విడుదల చేసిందనే చర్చ జరుగుతోంది.    రెండేండ్ల తర్వాత గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసినా అందులో మరో మెలిక పెట్టింది టీఎస్‌పీఎస్సీ. నియామకాలు మాత్రం డిసెంబర్ తర్వాత చేపడుతామని ప్రకటించింది. దీనిపై అభ్యర్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు సంవత్సరాల తర్వాత ఫలితాలు విడుదల చేసి.. మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలి ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని మండిపడుతున్నారు. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.    కేసీఆర్ సర్కార్ వచ్చాక టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏ పరీక్షలు సాఫీగా జరగలేదు. టీఎస్‌పీఎస్సీ తప్పులతో పరీక్షలు, ఫలితాలు, నియామకాల ప్రక్రియలన్ని వివాదంగానే మారాయి. అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం, విచారణల పేరుతో వాయిదా పడటం జరిగాయి. గ్రూప్ 2 ఫలితాలు వచ్చినా.. కోర్టుల కేసులతో ఇప్పటికి పూర్తిస్థాయిలో నియామకాలు జరగలేదు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీజీటీ, పీజీటీ పరీక్షలు ఇంతే. పరీక్షలు జరిగాకా చాలా కాలానికి ఫలితాలు ఇచ్చారు.తర్వాత పోస్టింగులు ఇవ్వడానికి మరింత సమయం తీసుకున్నారు. 2017లో పరీక్షలు జరిపి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా నియామకాలు చేపట్టారు. అవి కూడా ఇంకా పూర్తి కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీజీటీ, పీజీటీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు షో చేసిన ప్రభుత్వం.. తర్వాత మళ్లీ పట్టించుకోలేదు.    ట్రైనడ్ గ్రాడ్యువేట్ టీచర్ పోస్టులలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలంటూ టిజిటి మెరిట్ అభ్యర్థులు కొన్ని రోజులుగా  ధర్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని కూడా  ముట్టడించారు. 2017  జరిగిన టిజిటి అర్హత పరీక్షలో తాను మెరిట్ సాధించామని ...  1:1 ఎంపిక ద్వారా తాము ఉద్యోగం కోల్పోయామని చెబుతున్నారు అభ్యర్థులు.  టిజిటిలో ఉన్న ఖాళీలను మెరిట్ సాధించిన తమకు కేటాయించాలని  కోరుతున్నారు. ఏళ్ళు గడుస్తున్నా ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా... నిరుద్యోగులకు మనోవేదన మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు, పెండింగ్ ఫలితాలు ఇస్తూ.. ఎన్నికలు ముగిశాక మళ్లీ కాలయాపన చేయడం మానుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడటం మానుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు చేసే ట్రిక్స్ ను ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రభుత్వ తీరు మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరుద్యోగులు, విపక్షాలు, ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఓట్ల కోసం హక్కులు తాకట్టు? ఇద్దరు సీఎంల సెంటిమెంట్ రాజకీయాలు!

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారా? సెంటిమెంట్ రగిలిస్తూ ఓట్లు దండుకునేందుకు రాష్ట్రాల హక్కులను తాకట్టు పెడుతున్నారా ?  జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రుల తీరుతో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి.ప్రాజెక్టులపై ఉన్న అభ్యంతరాలపై కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సింది పోయి.. కేంద్రానికి పెత్తనం అప్పగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నామని చెప్పుకున్న కేసీఆర్, జగన్ లు.. జల అంశాలపై ఎందుకు మాట్లాడుకోవడం లేదనే చర్చ జనాల్లో సాగుతోంది.    కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ ఆ రెండు బోర్డుల పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టం చేసింది. త్వరలోనే గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై నోటిఫికేషన్‌ జారీ చేస్తామని  తెలిపింది. అంటే ప్రాజెక్టులను పరోక్షంగా కేంద్రమే  కంట్రోల్‌’ చేస్తుంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కూడా ఆదేశించింది. డీపీఆర్‌లను సమర్పించడమంటే.. ఈ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని అంగీకరించడమే. కేంద్రం తాజా ఆదేశాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. సొంత ప్రయోజనాల కోసం ఇద్దరు సీఎంలు.. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టారనే  ఆందోళన అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుందని, దాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టడం.. రెండు రాష్ట్రాలకూ మంచిది కాదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.    బేసిన్లు, భేషజాలూ లేవు. కలిసి మెలిసి ఉందాం. నీళ్లు పంచుకుందాంమన్నకేసీఆర్‌ ఇప్పుడు ఆంధ్రా ప్రాజెక్టులపై ఎందుకు కస్సుమంటున్నారన్నది చర్చగా మారింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరై... గోదావరికి పూజ చేసిన జగన్‌... తెలంగాణ ప్రాజెక్టుకు అనుమతులెక్కడున్నాయని ప్రశ్నించడంపై అనుమానాలు వస్తున్నాయి. కలిసి మెలిసి సాగిన ఇద్దరు బ్రదర్స్‌  నీళ్లపై నిప్పులు కురిపించుకోవడం కొందరికి వింతగానే కనిపిస్తోంది. అయితే ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు చేస్తున్న డ్రామాగా చెబుతున్నారు. అంతర్గతంగా స్నేహంగా ఉంటూ బయటికి మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటాన్నారని చెబుతున్నారు.  నీరంటే జనాలకు సెంటిమెంట్. నీటి కోసం పోరాడే నేతలను హీరోగా చూస్తుంటారు. తెలంగాణ ఉద్యమంలోనూ, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్.. జలాలనే ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అందుకే జల వివావాన్ని,  జనాల్లో సెంటిమెంట్ ను రగిలిస్తూ.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన మిత్రుడైన జగన్ కూడా ఇదే రకంగా వేళ్లేలా కేసీఆర్ సెట్ రైట్ చేశారని చెబుతున్నారు.    జల వివాదాలు సున్నితమైనవి. నీటిపై హక్కును వదులుకునేందుకు ఏ రాష్ట్రమూ సిద్ధపడదు. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుంది. కేంద్రానికి ఎలాంటి పెత్తనం ఉండదు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల వివాదాల పరిష్కారం, కేటాయింపులపై ట్రైబ్యునల్‌ ఆదేశాలే ఫైనల్‌. అందుకే జల వివాదాలు దశాబ్దాలపాటు సాగుతూనే ఉంటాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ఇంకా తేలలేదు. ఒక రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టుపై పక్క  రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం కామన్.  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు పరస్పరం చర్చించుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ.. మధ్యేమార్గంగా  ముందుకు సాగుతుంటారు. అనుమతులన్నీ వచ్చాకే ప్రాజెక్టులు కట్టాలనేది కేవలం కాగితాలకే పరిమితమైన రూల్. అభ్యంతరాలు ఉన్నా, అనుమతులు రాకున్నా ప్రాజెక్టులూ కడుతూనే ఉంటారు. 75 శాతానికిపైగా పూర్తయిన పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికీ అనేక అనుమతులు రావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పై  ఛత్తీస్ గఢ్‌, ఒడిసా రాష్ట్రాల అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా పోలవరం ప్రాజెక్టు ఆగలేదు. ఎన్టీఆర్‌ మొదలుపెట్టిన తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇప్పటికీ పర్యావరణ అనుమతులు రాలేదు. అయినా  ప్రాజెక్టు పూర్తయింది. వంశధార ప్రాజెక్టుపై ఒడిసా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణమూ కొనసాగుతోంది.   గతంలో ఆలమట్టి డ్యామ్‌ ఎత్తుపై తలెత్తిన వివాదాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చలతోనే పరిష్కరించుకున్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నర్మదా సరోవర్‌ ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో అనుమతులు లభించలేదు. అయినా... దాని నిర్మాణం పూర్తి చేసి, జాతికి అంకితం చేసేశారు. అభ్యంతరాలు, అనుమతుల పేరిట ఏ రాష్ట్రమూ తమ ప్రాజెక్టులను ఆపడంలేదు. అలాగని వాటిని కేంద్రం చేతుల్లో కూడా పెట్టడంలేదు. దేశంలో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం ఆధిపత్యం చెలాయించే అవకాశం కలుగుతోంది. దీని పరిణామాలు భవిష్యత్తులో కనిపిస్తాయని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. జగన్, కేసీఆర్ ల రాజకీయ ఎజెండా వల్లే ఇది జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.    మొత్తానికి  నదీ జలాల అంశంలో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పెత్తనం కేంద్రానికి ఇవ్వడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల కోసం... రాష్ట్రాల హక్కులను హరిస్తూ  ఇద్దరూ ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు, మేథావులు చెబుతున్నారు. రాష్ట్రాల విశేషాధికారాన్ని జారవిడుచుకుంటున్నారని ఆక్షేపిస్తున్నారు.

క్విడ్‌ ప్రోకో-2 మొదలెట్టిన జగన్.. యనమల తీవ్ర విమర్శలు 

ఏపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన విశాఖలో రూ.120 కోట్లతో అభివృద్ధి చేసిన బేపార్క్ చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. 2004-09 మధ్య జగన్ క్విడ్‌ ప్రోకో-1 చేసారని... ఇప్పుడు క్విడ్‌ ప్రోకో-2 చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ బినామీ వ్యవహారాలపై అత్యున్నత విచారణ జరపాలని అయన డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా జరుగుతున్న కాకినాడ సెజ్‌, విశాఖ బేపార్క్‌ వ్యవహారాల పై తాము కేంద్రానికి ఫిర్యాదు చేసి.. జగన్‌ క్విడ్‌ప్రోకో గుట్టురట్టు చేస్తామన్నారు. జగన్‌రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్‌లో మరో లావాదేవీ విశాఖ బేపార్క్ అని యనమల పేర్కొన్నారు. హెటిరో కంపెనీ ముసుగులో విశాఖ బేపార్క్‌ను జగన్ హస్తగతం చేసుకున్నారన్నారు.   రూ.300 కోట్ల విలువైన రుషికొండ భూములను బినామీల పేర్లతో సీఎం జగన్ హస్తగతం చేసుకున్నారని అయన అన్నారు. దాదాపు రూ.120 కోట్లతో అభివృద్ధి చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిదని ఈ సందర్భంగా యనమల ప్రశ్నించారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు విశాఖ బేపార్క్ మేజర్ వాటాలు హెటిరో పరం అయ్యాయని అయన నిలదీశారు. మొన్న కాకినాడ సెజ్, ఈరోజు విశాఖ బేపార్క్ జగన్ బినామీల పరమైందని అయన ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే... జగన్ మాత్రం బినామీ వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అప్పటి కేసులలో జగన్ సహనిందితులకే... ఇప్పటి పాలనలో మేలు జరుగుతోందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్.. పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు?

ఖమ్మం నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్తాఫా నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో 13 ఏళ్ల గిరిజన బాలిక పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మైనర్ బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగెత్తిన బాలికని స్థానికులు చూసి ఆసుపత్రిలో చేర్పించారు. 70 శాతం కాలిన గాయాలతో బాలిక ప్రాణాలతో పోరాడుతోంది.    రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. డబ్బు ఇప్పించేలా మధ్యవర్తుల ద్వారా బాలిక తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారని సమాచారం. అయితే, ఈ విషయం స్థానికంగా వెలుగులోకి రావడంతో.. ఎట్టకేలకు బాధితురాలి తల్లిదండ్రులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన సుబ్బారావు కొడుకు మారయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.    మరోవైపు, ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, ఖమ్మం ఆసుపత్రిలో రెండు వారాల పాటు చికిత్స కొనసాగింది. అయితే, ఆసుపత్రి యాజమాన్యం మాత్రం కనీస సమాచారం ఇవ్వలేదు. డబ్బు కోసం ఆశపడిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చికిత్స చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య శాఖను జిల్లా పోలీసు యంత్రాంగం కోరింది.     మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) సీరియస్ అయ్యింది. పలు పత్రికలలో, టీవీ ఛానల్స్‌లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించి, విచారణకు ఆదేశించింది. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారని,  పోలీసులకు ఆస్పత్రి యాజమాన్యం ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. ఈ ఘటనపై నవంబరు 6లోగా వివరణ ఇవ్వాలంటూ ఖమ్మం సీపీకి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.    బాలిక కుటుంబసభ్యులను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎన్డీయేలోకి వైసీపీ.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ..

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరాలని వైసీపీని బీజేపీ ఆహ్వానించినట్లు.. దీంతో ఆ పార్టీ కేంద్ర కేబినెట్ లో చేరుతున్నట్లుగా రెండు మూడు రోజుల నుండి తెలుగు మీడియాలో విస్తృతంగా చర్చ జరిగిన సంగతి తెల్సిందే. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా దీని పై ఒక నిర్ణయానికి వస్తారని కూడా చర్చ జరిగింది. ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో చేరితే రెండు క్యాబినెట్ మంత్రి పదవులు, ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి ప్రధాని మోడీ సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం.. ప్రధాని మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ వేసి తిరిగి అమరావతికి రావడం జరిగింది. అయితే వైసీపీ కేంద్రంలో చేరుతుందా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.   ఇది ఇలా ఉండగా సీఎం జగన్ ను ఎన్డీయేలోకి ఆహ్వానిచినట్లు వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ అధికార వైసీపీతో గానీ ప్రతిపక్ష టీడీపీతో గానీ కలిసే పరిస్థితి లేదని మాధవ్ అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధిష్టానం ఆలోచన చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అయినా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఎన్డీయేలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోందని, ప్రభుత్వంలో చేరాలని బీజేపీ అడుగుతోందనే ప్రచారాన్ని వైసీపీనే చేస్తుందనే అనుమానం కలుగుతోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

కరోనా వ్యాక్సిన్ పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ తీపి కబురు.. 

కొద్ది కాలం క్రితం వరకు కరోనాకు వ్యాక్సిన్ అంత తొందరగా వచ్చే అవకాశం లేదని కొన్ని సార్లు.. అసలు కరోనాకు వ్యాక్సిన్ సాధ్యం కాదని మరోసారి ప్రకటించిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(WHO), తాజాగా ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది చివరికి అంటే డిసెంబర్ నాటికీ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నామని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధనామ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్ర‌యోగాలు ఆ దిశగా ఆశలు చిగురించేలా చేస్తున్నాయ‌ని టెడ్రోస్‌ అధనామ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.   వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే.. వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంద‌ని టెడ్రోస్‌ అధనామ్ చెప్పా‌రు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగ పరీక్షల్లో ఉన్నాయని, 2021 ముగిసేలోగా మొత్తం 200 కోట్ల డోస్ లను అందించాలన్న లక్ష్యంతో తాము ప్రణాళికలు రూపొందించామని అయన తెలియజేశారు.

ట్రంప్ అస్సలు మారడు.. ఫేస్ బుక్, ట్విట్టర్ లకు పెద్ద హెడేక్

ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టెది మరో దారి అని ఫేమస్ తెలుగు సామెత. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఈ సామెతకు చక్కగా సరిపోతుంది. ఒక పక్క అమెరికాను కరోనా వణికిస్తున్నా కూడా ప్రజలందరికి ఆదర్శంగా ఉండాల్సిన ట్రంప్ మాత్రం పేస్ మాస్క్ వాడడానికి నిరాకరించి తీవ్ర విమర్శల పాలయ్యారు. అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం అయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా అయన పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ లకు పెద్ద తలనొప్పిగా తయారైనట్లుగా కనిపిస్తోంది. తాజాగా అయన పెట్టిన మరో పోస్టును అవి తొలగించాయి. తనకు కరోనా సోకడంతో... ఆ వ్యాధి ఎలాంటిదో అనుభవం ద్వారా తనకు తెలిసిందన్న ట్రంప్... అక్కడితో ఆగకుండా... ఓ సెన్సేషనల్ కామెంట్ పెట్టారు. మాములుగా సీజన్‌లో వచ్చే జ్వరం కంటే... కరోనా ఏమంత ప్రాణాంతకం కాదని అయన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఒకరకంగా ప్రజలను తప్పుదారి పట్టించేది కావడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్... అప్రమత్తం అయి ఆ పోస్టును తొలగించాయి. "ఫ్లూ జ్వరం సీజన్ వస్తోంది. వ్యాక్సిన్ ఉన్నా... ఏటా లక్ష మందికి పైగా సీజనల్ జ్వరాలతో చనిపోతున్నారు. అందుకని మనం మన దేశాన్ని మూసేసుకుంటున్నామా (లాక్‌డౌన్ చేసుకుంటున్నామా)... లేదు కదా... మనం సాధారణ జ్వరంతో జీవించడం ఎలా నేర్చుకున్నామో... అలాగే కరోనాతోనూ జీవించడం నేర్చుకోవాలి. చాలా చోట్ల కరోనా ప్రాణాంతకంగా లేదు" అని ట్రంప్ మరో ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. ఐతే ఈ ట్వీట్ ను ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూసే వీలు కల్పిస్తున్నట్లుగా ట్విట్టర్ తెలిపింది.   ఇది ఇలా ఉండగా తనకు కరోనా తగ్గిపోయిందని ట్రంప్ చెబుతున్నా... ఆయనకు నెగెటివ్ వచ్చిందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ట్రంప్ ఇలా హడావిడిగా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌ నుండి వెనక్కి వచ్చేయడానికి కారణం... అధ్యక్ష ఎన్నికలో భాగంగా అక్టోబర్ 15న ట్రంప్ తన ప్రత్యర్థి జో బిడెన్‌తో రెండోసారి డిబేట్‌లో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం అయన సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరో పక్క వైట్‌హౌస్‌లో ట్రంప్... మాస్క్ పెట్టుకోకుండా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా అంత ప్రాణాంతకం కాదన్న ట్రంప్ కామెంట్లను అయన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్ తప్పుపట్టారు. ఇదే మాట... కరోనాతో చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి చెప్పాలన్నారు. జో బిడెన్ వేసిన ఈ కౌంటర్ ట్రంప్‌కి పెద్ద షాకే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఐతే ట్రంప్ తీరుతో ఇప్పుడు వైట్ హౌస్‌లో చాలా మంది సిబ్బందికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా వైట్ హౌస్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ తనకు కరోనా సోకినట్లుగా వెల్లడించారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మరో షాక్...!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వైసీపీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు కేసులతో సతమతమౌతున్న అయన పై మరో కేసు నమోదయ్యింది. తాజాగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీపై తాడిపత్రి పీఎస్‌లో ఈ కేసు నమోదయ్యింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డితో పాటు 32 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్న జేసీ సోమవారం నాడు తాడిపత్రికి చేరుకున్నారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి భారీ ర్యాలీతో కార్యకర్తలు, అనుచరులు స్వాగతం పలికారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఇలా ర్యాలీ చేయకూడదని ఇది నిబంధనలకు విరుద్ధమని చెపుతూ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయమై జేసీ బ్రదర్స్ కానీ.. అస్మిత్ రెడ్డి కానీ స్పందించలేదు. ఇప్పటికే జేసీ ప్రభాకర్, అయన కుమారుడు అస్మిత్ కొన్ని రోజుల పాటు కడప సెంట్రల్ జైల్‌లో కూడా ఉన్న సంగతి తెలిసిందే.

మొన్న బెంజ్ కారు, నేడు భూకబ్జా.. మరో వివాదంలో మంత్రి జయరాం

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి.   మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని, బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంత్రి కుటుంబ సభ్యులు, బినామిలపై రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. ఒకేసారి 400 ఎకరాలు తీసుకునేందుకు ప్లాన్ చేశారని, అయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండడంతో 204 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. అంతేకాదు, ఆక్రమించుకున్న భూములపై కర్నూలులోని కోపరేటివ్ బ్యాంక్‌ లో రుణాలకు కూడా అప్లై చేశారని ఆరోపించారు. అయితే ఈ విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసిందని, వాళ్లు బెంగళూరులో ఉన్నందున అక్కడ పోలీస్ స్టేషన్‌ లో మంత్రిపై ఫిర్యాదు చేశారని అయ్యన్న తెలిపారు.   మంత్రి జయరాం భూకబ్జాకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంత్రి ల్యాండ్ స్కాంపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు కొట్టేసిన జయరాం కన్ను.. ఆలూరులోని 400 ఎకరాల భూమిపై పడిందని, ఇట్టినా కంపెనీకి చెందిన ఈ భూమిని మంత్రి గ్యాంగ్ తప్పుడు పత్రాలు సృష్టించి కొట్టేసిందని బుద్ధా ఆరోపించారు. జగన్ గారూ, ఈ భూస్కాంలో అడ్డంగా దొరికిపోయిన మంత్రి జయరాంపై చర్యలు తీసుకోండి.. లేకపోతే ఇందులో మీ వాటా ఎంతో చెప్పండి? అంటూ బుద్ధా నిలదీశారు.   మరోవైపు, ఇట్టినా ప్లాంటేషన్‌ కంపెనీ పేరున కొన్న భూములను తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2006లో తక్కువ ధరకు పొలాలు కొనుగోలు చేసి, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మంత్రి కుటింబీకులకు భూములు అమ్మిన కంపెనీ యజమాని మంజునాథ్‌ పై 420 కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.   భూకబ్జా ఆరోపణలతో మంత్రి ఇరుకున పడినట్టే అనిపిస్తోంది. పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు భూములిస్తే.. ఆ భూములను మంత్రి కుటింబీకులు ఆక్రమించుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ కంపెనీ యజమాని మంజునాథ్‌.. మంత్రి కుటుంబీకులకు అమ్మారనుకున్నా.. అసలు పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక, ఒకవేళ కంపెనీ యజమాని అమ్మితే.. మళ్ళీ కంపెనీ యాజమాన్యం ఎందుకు మంత్రిపై ఫిర్యాదు చేస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఆ పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతా.. మాజీ మంత్రి తీవ్ర హెచ్చరిక  

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ను టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అయన మొట్టమొదటి సారిగా కొవ్వూరు వెళుతూ జవహర్ ర్యాలీ నిర్వహించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని స్థానిక పోలీసులు కేసులు పెట్టారు. తాజాగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసుల తీరుపై మండిపడ్డారు. "తనపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల పై ప్రైవేట్ కేసు పెడతా. పోలీస్ రాజ్యం ఎక్కువ కాలం సాగదని తెలుసుకోండి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఖాకీలు గుర్తుంచుకుంటే మంచిది. తప్పుడు కేసులు పెట్టి.. తనను వేధించిన సీఐ, ఎస్సైలపై ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకి లాగుతా. తనపై కేసులు పెట్టిన ఇదే పోలీసులు.. సీఎం జగన్‌, బియ్యపు మదుసూధన్ రెడ్డి, రోజాలపై ఎందుకు కేసులు పెట్టలేదు? అసలు డీజీపీ, కొవ్వూరు సీఐ మూర్తి, ఎస్సై వెంకటరమణల వైఖరి చూస్తుంటే.. వీరంతా వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేలా ఉన్నారు". అని జవహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. కేంద్రమంత్రి ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ నుంచి, తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.    దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. కృష్ణా జలాల వివాదంపై రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. నాలుగు అంశాలను ఏజెండాగా నిర్ణయించినప్పటికీ వాటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.   పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఏపీ స్పష్టం చేసింది. తాము వాడుకుంటున్నది మిగులు జలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ తన వాదనలు వినిపించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకే అప్పగించాలని తెలంగాణ కోరింది. అయితే, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకే అప్పగించాలని ఏపీ సూచించింది.   అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు రాష్ర్టాలు లేవనెత్తిన అంశాలపై చర్చించినట్టు తెలిపిన ఆయన.. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కొత్త నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.   కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లను సమర్పించాలని ఇరు రాష్ర్టాల సీఎంలను కోరామని షెకావత్ అన్నారు. డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ర్టాల సీఎంలు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరిందన్న షెకావత్.. ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ కోరారని అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. విభజన చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామని షెకావత్ అన్నారు.

హథ్రాస్ ఘటనలో మరో మలుపు.. అందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు

శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న సమాచారం వల్లే హథ్రాస్ మృతురాలి అంత్యక్రియులను రాత్రికి రాత్రి జరపాల్సి వచ్చిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక అఫిడవిట్‌ ను సుప్రీంకోర్టుకి సమర్పించింది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుందని, అది కూడా బాధితురాలి కుటుంబ సభ్యుల సమ్మతితో, వారి సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించిందని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.   హథ్రాస్ ఘటనపై చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమను అప్రతిష్ట పాలుచేసే లక్ష్యంతో కొన్ని పార్టీలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని యూపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఘటనను కుల, మత పరమైన రంగు పులిమే అవకాశాలున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం రాత్రికి రాత్రి అంత్యక్రియలు పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. రెండు కులాలకు చెందిన వ్యక్తులతో కలిసి వివిధ రాజకీయల పార్టీల నేతలు, మీడియా సిబ్బంది సహా వేలాది మంది మరుసటి రోజు ఉదయం గ్రామానికి చేరనున్నారనే సమాచారం కూడా అందినట్టు తెలిపింది. బాధితురాలి మృతి, పోస్ట్ మార్టం జరిగి అప్పటికే 20 గంటలు అయిందని, మరుసటి రోజు ఉదయం అంత్రక్రియలు నిర్వహిస్తే పెద్దఎత్తున హింస జరిగే అవకాశం ఉందని గ్రహించిన జిల్లా యంత్రాగం, అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఒప్పించినట్టు అఫిడవిట్‌లో వివరించింది.   హథ్రాస్ మృతురాలి అంత్యక్రియులను కుటుంబ సభ్యుల సమ్మతితోనే నిర్వహించామని యూపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కుటుంబసభ్యుల వ్యాఖ్యల మాత్రం మరోలా ఉన్నాయి. ఇటీవల మృతురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. అర్థరాత్రి దహనం చేసిన మృతదేహం తన సోదరిదో కాదో తెలియదని, ఒకవేళ తన మృతదేహమే అయితే అలా అర్థరాత్రి రహస్యంగా అంత్యక్రియలు ఎందుకు చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, యూపీ ప్రభుత్వం కుటుంబ సభ్యుల సమ్మతితోనే అంత్యక్రియలు నిర్వహించామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనపై అక్కడి పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నవేళ.. ఈ తాజా అఫిడవిట్‌ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, కరోనా పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అలాగే అమరావతి విషయంలో తలెత్తుతున్న సమస్యలతో పాటు విభజన చట్టంలోని వివిధ అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 17 అంశాలపై జగన్ ప్రధానికి  నివేదించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా, జీఎస్టీ చెల్లింపులు, రాష్ట్ర విభజన హామీల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.   మరోవైపు, కేంద్ర కేబినెట్ లో చేరాలని జగన్ కు ఆహ్వానం అందిందని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యనటకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీకి రెండు కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వైసీపీ నేతలు మాత్రం.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను కేంద్రం నెరవేరుస్తామంటే తాము ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్డీయే లో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానమూ లేదని, అలాగే వైసీపీ సైతం ఆ ప్రతిపాదన చేయలేదని చెబుతున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరే అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. 

ఏపీ హైకోర్టులో అమరావతిపై విచారణ.. ప్రభుత్వానికి కీలక ఉత్తర్వులు జారీ 

రాజ‌ధాని అమ‌రావ‌తి త‌ర‌లింపు, మూడు రాజ‌ధానుల అంశంపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగనున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది తదుపరి విచారణ వరకు అమల్లో వుంటుందని హైకోర్టు ప్రకటించింది. ఈరోజు జరిగిన విచారణలో భాగంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్ర‌భుత్వం త‌రుపున వాదనలు వినిపించారు. అయన తన వాదనలలో సీఎం క్యాంప్ ఆఫీసు, కార్పోరేష‌న్ల‌పై కోర్టు దృష్టికి కొన్ని కీల‌క అంశాల‌ను తీసుకొచ్చారు. ప‌రిపాల‌న‌ వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్ర‌కారం సీఎం ఎక్కడినుండి పనిచేస్తారో అదే క్యాంప్ కార్యాలయమని ఏజీ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్లు అమరావతితో పాటు ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయన్నారు. గతంలో ప‌నిచేసిన‌ సీఎం చంద్రబాబుకు నారావారిపల్లిలో, హైదరాబాద్‌లో కూడా క్యాంప్ ఆఫీసులున్నాయన్నారు. క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం తరుఫున పూర్తిస్థాయి అఫిడవిట్‌ను శుక్రవారం అందజేస్తామని అయన తెలిపారు. దీంతో అడ్వొకేట్ జనరల్ అభ్యర్థన మేరకు విశాఖ గెస్ట్‌హౌస్‌పై విచారణను కోర్టు ఈనెల తొమ్మిదో తేదికి అంటే శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే రాజధాని బిల్లులపై జనవరిలో శాసన మండలిలో జరిగిన చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను సీడీలు, సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.