chiranjeevi in touch with top politicians in telugu states

పవన్ కు దీటుగా చిరంజీవి కొత్త రాజకీయం... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో పెరిగిన పలుకుబడి..!

సైరా మూవీ ప్రమోషన్లో భాగంగా తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవికి పలుకుబడి పెరిగిందంటున్నారు. ఇండస్ట్రీకి సంబంధించినది ఏదైనాసరే చిరంజీవి ద్వారానే చేస్తామంటూ సీఎం జగన్ చెప్పారనే మాట వినిపించింది. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయంగా అమరావతి కోసం పోరాడుతుంటే, చిరంజీవి మాత్రం జగన్‌కే సపోర్ట్ ఇచ్చారు. ఇక, చిరంజీవి సైరా విడుదల, అదనపు షోస్ విషయంలోనూ ఉదారంగా వ్యవహరించింది. అప్పట్నుంచే సీఎం జగన్ తో చిరంజీవికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అయితే, ఇప్పుడు సడన్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... ఏకంగా చిరంజీవి ఇంటికి వచ్చి సమావేశం కావడం కీలకంగా మారింది.  చిరంజీవి, నాగార్జునతో భేటీలో సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు తలసాని తెలిపారు. అయితే, ఈ భేటీలో సినీ ఇండస్ట్రీ చర్చలతోపాటు, తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి పోషించబోతున్న పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పైగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే చిరంజీవితో మంత్రి తలసాని సమావేశమయ్యారన్న మాట ఉత్కంఠ రేపుతోంది. అయితే, ఇఫ్పటికే ఏపీ సీఎం జగన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న చిరంజీవి... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ మెరుగైన సంబంధాలకు కోరుకుంటున్నారని, దానిలో భాగంగానే తలసాని ...మెగాస్టార్ ఇంటికి వచ్చారని అంటున్నారు. ఇటు తెలంగాణ... అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో చిరంజీవి స్నేహపూరిత సంబంధాలను కోరుకోవడం వెనుక ఆయనకంటూ ఒక వ్యూహముందన్న చర్చ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారట. అందుకే ఎప్పుడూ లేనిది ఈమధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటూ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడు ముందుంటాననే సంకేతాలను పంపారు. తన పనేదో తాను చేసుకుపోవడం తప్పా... ఇంతకుముందెప్పుడూ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాలు, సమస్యలపై స్పందిస్తున్నారు. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు అవసరమని గ్రహించిన చిరంజీవి, అటు జగన్ తోనూ... ఇటు కేసీఆర్ తోనూ... అలాగే, అధికార పార్టీల నాయకులతోనూ టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో, ఇరు ప్రభుత్వాధినేతలు, అలాగే అధికార పార్టీల నేతలు కూడా చిరంజీవికి సహకరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కాపు వర్గంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న చిరంజీవితో కలిసిమెలిసి ఉండటం లాభమే కానీ నష్టమేమీ ఉండదని అధికార పార్టీల అధినేతలు భావిస్తున్నారట. ఇరువైపులా పరస్పర అవగాహనతో సహకరించుకుంటున్నారని అంటున్నారు. అందుకే... ఇటు తెలంగాణ ప్రభుత్వంలో... అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ... చిరంజీవికి పలుకుబడి ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా మారాలని, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే తన వద్దకే రావాలని, తన ద్వారానే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సంబంధించిన పనులు చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

Achcham Naidu Might Be AP TDP New President

రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్న ఏపీ టిడిపి..కళా వెంకట్రావు స్థానంలో వచ్చేదెవరు..?

ఏపి టిడిపిలో జోష్ నింపడానికి భారీ మార్పులకు రెడీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్ర అధ్యక్షుడ్ని త్వరలోనే మార్చబోతున్నారు అనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో తిరుగుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే కళా వెంకట్రావు స్థానంలో వచ్చే ఆ నేత ఎవరు, రాష్ట్ర కమిటీ కసరత్తు ఎప్పటికి పూర్తవుతుంది. ఏపి టిడిపిలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావును నియమించారు. తరువాత ఆయన కేబినెట్ లోకి తీసుకున్నారు కానీ, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న నిస్సత్తువను పోగొట్టేందుకు సమూల మార్పులు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే కళా వెంకట్రావు స్థానంలో మరో నేతకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లోనే టిడిపి రాష్ట్ర కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఆ పని పక్కన పడింది. అయితే ఇప్పటికే ఆలస్యం అవడంతో ఈ నెలాఖరు లోగా పార్టీ కమిటీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించారు. పార్టీ అధ్యక్ష మార్పు జరిగితే శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.  దీంతో అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు స్థానంలో అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, అచ్చెన్నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచే అధ్యక్షుడిని తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటే అచ్చన్నకే ఎక్కువ అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సామాజిక కోణంలో చూసుకున్న బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అధ్యక్ష పదవి అచ్చెన్నకిచ్చిన, రవిచంద్రను ఎంపిక చేసిన కలిగే లాభ నష్టాలపై పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినప్పటికీ మరోవైపునుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఒకవేళ అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆయన స్థానంలో వేరేవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి కమిటీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Court to give final verdict on Hajipur murder cases today

హాజీపూర్ వరుస హత్యల కేసులో ఈరోజే తుది తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇవాళ ఏం తీర్పు వెల్లడించబోతుందోనని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతేడాది వెలుగులోకొచ్చిన హాజీపూర్ సీరియల్ హత్యల కేసులో నల్గొండ పోక్సో కోర్టు తీర్పు చెప్పనుంది. ముగ్గురు మైనర్ బాలికలకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు విచారణను చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు తొంభై రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. జూలై ముప్పై ఒకటిన నల్గొండ లోని ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా చార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబరు పద్నాలుగు నుంచి న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ముగ్గురూ మైనర్ బాలికలే కావడంతో నల్గొండ లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగింది. సుమారు రెండున్నర నెలల పాటు మూడు కేసుల్లో ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించింది. మూడు కేసుల్లో మొత్తం నూట ఒక్క మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించడంతో పోక్సో కోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నిర్భయ కేసులో ఉరిశిక్ష వేయడం, దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం, సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయడం హాజీపూర్ నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిందితుడికి ఉరిశిక్ష విధించినట్లయితే నల్గొండ జిల్లా కోర్టులో ఉరిశిక్ష విధించబడిన తొలి కేసుగా రికార్డుల్లోకి ఎక్కుతుంది.

AP CM ys jagan fire on Collectors

ఇసుక పాలసీ విషయంలో కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ సిఎం జగన్

ఏపీ నూతనంగా తీసుకువచ్చిన ఇసుక పాలసీ అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు సీఎం జగన్. అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇసుక పాలసీపై జిల్లా కలెక్టర్ లతో తన కార్యదర్శి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇసుక పాలసీ అమలులో అలసత్వం వహిస్తే ఊరుకోమని హెచ్చరించారు జగన్. ఒక్కరు నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. చిన్న పొరపాటు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. తాము తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు జగన్. ఒక వైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారదర్శకమైన అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు జగన్. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా కలెక్టర్ లు సీరియస్ గా పని చేయాలని ఆదేశించారు.

Aircraft over Tirumala creates panic

తిరుమల భద్రతలో డొల్లతనం... మూడ్రోజులుగా విమానం చక్కర్లు...

తిరుమల సప్తగిరులపై మూడు రోజులుగా విమానం చక్కర్లు కొట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషిద్ధం. పైగా, తిరుమల ఆలయం నో ఫ్లైయింగ్‌ జోన్‌ కింద ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు ఆలయంపై నుంచి వెళ్లకూడదనే నియమం ఉంది. అంతేకాదు తిరుమల కొండపై దేవతలు సంచరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమనే భావన కూడా ఉంది. అలాగే సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వల్ల విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం ఉంది. బ్రిటీష్ కాలంలో ఇలా రెండు విమానాలు ఈ ప్రాంతంలో పేలినట్లు ఆధారాలు ఉన్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఏడుకొండలవాడిపై ఎప్పటినుంచో ఉగ్రవాదుల కన్ను ఉంది.. నిత్యం లక్షలాది మంది వచ్చి వెళ్లే ఈ పుణ్యక్షేత్రానికి ఆకాశ మార్గం ద్వారా ముప్పు పొంచి ఉందన్నది నిఘావర్గాల వాదన. అందుకే, ఆలయ సమీప ప్రాంతాన్ని  కూడా నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అయితే, ఏడుకొండలపై మూడు రోజుల నుంచి ఎగురుతున్న విమానం భక్తులతోపాటు, అధికారులను కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ భయాలు, ఈ ఆందోళనలు పక్కనపెడితే శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడాన్ని మాత్రం భక్తులు అపచారంగా భావిస్తున్నారు.  అయితే, తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌‌కు ఫిర్యాదు చేశారు. అయితే... దేశ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా... ఐదేళ్లకోసారి విమానాల ద్వారా సర్వే చేయిస్తుంది. అందులో భాగంగానే కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా ఛార్టెర్డ్‌ విమానం శ్రీవారి ఆలయంపై తిరుగుతుందన్నది చెన్నై ఏటీసీ అంటే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అధికారులు చెబుతున్నారు. అయితే... మరోసారి అలా జరగకుండా చూస్తామంటూ హామీ ఇచ్చింది.  భౌగోళిక అధ్యయనాల కోసమే విమానాలు తిరుగుతున్నాయన్న ఏటీసీ అధికారుల వాదనతో తాము ఏకీభవించేది లేదంటున్నారు భక్తులు. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అమెరికాలో ట్విన్‌ టవర్స్‌‌పై జరిగిన వైమానిక దాడులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Galla Jayadev Fires In Parliament Over AP Capital Issue

తుగ్లక్ లా జగన్ అంటూ గల్లా ఘాటు వ్యాఖ్యలు... లోక్ సభలో టీడీపీ-వైసీపీ రాజధాని ఫైట్.... 

ఆంధ్రప్రదేశ్లో రాజధాని రగడ చల్లారడం లేదు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదంటూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టత ఇచ్చినా మూడు రాజధానులపై రాజకీయ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, తాను అనుకున్న మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం చాపకింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే... ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని అమరావతి నుంచి తరలించనివ్వమంటూ రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తూ తమ గోడు చెప్పుకుంటోంది అమరావతి జేఏసీ. రాజధాని కోసం తమ భూములను త్యాగంచేస్తే ఇఫ్పుడు జగన్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందంటూ ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, ఏపీ రాజధాని వివాదం రాష్ట్రం పరిధిలోనిదని, రాజధాని ఏర్పాటుపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనంటూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతనిచ్చినా మరోసారి మూడు రాజధానుల ఇష్యూను లోక్ సభలో లేవనెత్తారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఏపీ రాజధాని ఇష్యూ రాష్ట్రానిది కాదని... జాతీయ సమస్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మూడు రాజధానులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా గల్లా జయదేవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో జగన్ ను తుగ్లత్ తో పోలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దాంతో, గల్లా ప్రసంగానికి వైసీపీ ఎంపీలు అడ్డుతగిలారు. ఇక, స్పీకర్ సీట్లో కూర్చున్న డి.రాజా కూడా గల్లా స్పీచ్ పై అభ్యంతరం తెలిపారు. గల్లా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.  వైసీపీ ఎంపీలు అడ్డుతగులుతున్నా, గల్లా జయదేవ్ మాత్రం వాడివేడిగా తన స్పీచ్ ను కొనసాగించారు. అయితే, గల్లా కామెంట్స్‌కు అదే స్థాయిలో వైసీపీ ఎంపీలు కౌంటర్‌ ఇచ్చారు. అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారని తెలిపారు. అమరావతికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేముంటే అక్కడ కేవలం 20 పీట్ల రోడ్డును మాత్రమే ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

Chandrababu Challenge to CM Jagan Over AP Capital

దమ్ముంటే రా...అంటూ జగన్ కు బాబు సవాల్... మరోసారి పోరాటానికి పవన్ రెడీ...

కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉన్నా... మార్చే హక్కు మాత్రం లేదన్నారు చంద్రబాబు. జగన్ కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి... మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు... మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అమరావతిని కేంద్రం ఆమోదించిందన్న చంద్రబాబు... దాన్నెలా మారుస్తారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కూడా ఇస్తోందని... ఇఫ్పుడు రాజధానిని మారిస్తే ఆ నిధులు కూడా ఆగిపోతాయని వాదిస్తోంది. మరోవైపు, అమరావతి ఆందోళనల్లో మరోసారి పాల్గొనడానికి జనసేనాని రెడీ అవుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న పవన్ కళ్యాణ్... ఫిబ్రవరి పదిన రైతుల ఆందోళనల్లో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. అమరావతి రైతులు, మహిళల ఆందోళనలు, దీక్షలు 50రోజులు దాటిన నేపథ్యంలో స్పందించిన పవన్.... రాజధాని ప్రజలు చేస్తున్న శాంతియుత ఉద్యమం తెలుగు జాతి మొత్తానికి స్ఫూర్తిదాయమన్నారు. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుని కలిసి పయనిస్తోన్న జనసేనాని స్టాండ్ కి భిన్నంగా ఏపీ రాజధాని ఇష్యూపై కేంద్రం ప్రకటన చేయడం పవన్ ను ఇరకాటంలో పడేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర పరిధిలోని అంశమని... రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేయడంతో... అమరావతి రైతులకు పవన్ ఏం చెబుతారో చూడాలి. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ నేతలు ఘాటు విమర్శలు చేశారు. రాజధాని అంశంపై రాష్ట్రం పరిధిలోనిదని... కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం చూస్తుంటే... జగన్, మోడీ కుమ్మక్కయ్యారని అర్ధమవుతోందన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, అందుకే రాజధానిపై అధికారం రాష్ట్రానిదేనంటూ కేంద్రం ప్రకటించిందని విమర్శించారు. అయితే, టీడీపీ, సీపీఐ నేతల వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఏపీ రాజధాని వివాదంపై కేంద్రం స్పష్టత ఇచ్చినా భ్రమ కలిగించేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడుతున్నారు. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రం పరిధిలోని అంశమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్, అలాగే ఎమ్మెల్సీ మాధవ్ తేల్చిచెప్పారు. అయితే, రాజధాని పేరుతో ఏపీలో రాజకీయ, రాక్షస, వ్యాపార క్రీడ జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పులనే జగన్ కూడా చేస్తున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే, అమరావతి పరిరక్షణ సమితి, రైతుల బృందం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తూ రాజధానిపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విన్నవిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసిన జేఏసీ, రైతులు.... ఏపీ రాజధాని తరలింపు వల్ల జరిగే నష్టాన్ని వివరించారు.

High Court serious on AP Govt

ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్.. ఆ ఫోటోలేంటి?.. పార్లమెంట్ పై పీఎం ఫోటో ఉందా?

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులు వేయడంపై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పంచాయితీ కార్యాలయాలపై వేసిన రంగులు, పార్టీ జెండాలు రంగులు వేర్వేరు అని ప్రభుత్వ తరపు న్యాయవాది అనగానే.. రంగులను తాము పోల్చుకోగలమని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచాయితీ కార్యాలయాలపై సీఎం ఫోటోను ఎందుకు ముద్రించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్ర సీఎంగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టే సీఎం ఫోటో ముద్రించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. న్యాయవాది వ్యాఖ్యలపై న్యాయమూర్తి  ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ పై ప్రధాని ఫోటో సుప్రీం కోర్ట్ పై ప్రధాన న్యాయమూర్తి ఫోటో ఉందా? అని నిలదీశారు. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించారు. పార్టీ జెండా, గుర్తులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

Delhi HC rejects Centre plea to hang Nirbhaya convicts separately

నిర్భయ కేసు నిందితుల ఉరికి గడువు పెంచిన హైకోర్ట్...

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుందో అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. నలుగురు దోషుల ఉరిపై స్టే విధిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హై కోర్టు కూడా సమర్థించింది. నిర్భయ దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. దోషుల ఉరితీతపై విధించిన స్టే ఎత్తివేయలేమని తెలిపింది. ఈ కేసులో నలుగురు దోషులను వేరువేరుగా ఉరితీయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పిటిషన్ ను న్యాయ స్థానం కొట్టేసింది. పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, దినేష్ శర్మల కు పిటిషన్ దాఖలు చేసుకోవడాని కి వారం రోజుల గడువిచ్చింది కోర్ట్. నిర్భయ కేసులో అధికారుల అలసత్వంతోనే రివ్యూ పిటిషన్ల పై విచారణ ఆలస్యం అవుతుందని హై కోర్టు స్పష్టం చేసింది. నలుగురు దోషులు క్రూరమైన నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  నలుగురు దోషుల మరణశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం వేసి న పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా సుదీర్ఘంగా వాడి వేడి వాదనలు సాగాయి. ముందుగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులు న్యాయవ్యవస్థని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మొదట జనవరి 22న నలుగురు దోషులు ఊరికి డెత్ వారెంట్ జారీ చేసిన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో శిక్ష అమలు వాయిదా పడింది.  ఫిబ్రవరి 1న ఉరితీయాల్సినప్పటికి  న్యాయపరమైన అంశాలు ఉన్నాయని అవకాశాలున్నాయని స్టే విధించింది ఢిల్లీ కోర్టు. నలుగురు దోషులు ముఖేష్ వినయ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. మరణశిక్షను వాయిదా వేయించుకునేందుకు తమకున్న అన్ని అస్త్రాలనూ ఉపయోగిస్తున్నారు దోషులు. రకరకాల పిటిషన్ లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. హై కోర్టు తాజా తీర్పు తో నలుగురు దోషుల కు ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుందో అర్థం కావట్లేదు. 7 ఏళ్ళ నుంచి తమకు అన్యాయం జరుగుతోందని నిర్భయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులకు ఇన్ని అవాకాశాలను ఎందుకు కల్పిస్తుందో అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. శిక్ష నుంచి కాపాడే ప్రయనం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం.  

AP Govt to borrow 5000 crore from HUDCO to buy land for the poor

పేదల ఇళ్ళ కోసం 5 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం...

ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోసం భూమిని కొనుగోలు చేసేందుకు రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం 5000 కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చేందుకు హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలను ఉగాది నాటికి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 27,000 ల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మరో 15,000 ల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  25 లక్షల ఇళ్ల పట్టాల కోసం 40,000 ల ఎకరాలు అవసరమవుతుందని రెవిన్యూ శాఖ అంచనా వేసినట్లు సమాచారం. ఇందులో 12,000 ల ఎకరాల భూ యజమానుల నుంచి కొనుగోలు చేసి 3,000 ల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం హడ్కో రుణాన్ని ఉపయోగించనున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలోనే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో కొనుగోలు చేయాల్సిన భూ పరిమాణం తగ్గింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 48 గజాల చొప్పున ఉచితంగా ఇళ్ల పట్టాలను అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది

AP Govt Plans to Establish Defence Cluster In Donakonda

దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు!!

ప్రకాశం జిల్లా దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో రక్షణ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పరిశ్రమలశాఖామంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పోలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గౌతంరెడ్డి పరిశ్రమల శాఖ అధికారులు హాజరయ్యారు. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు మంత్రి తెలియజేశారు. దీనికి అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉందని రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇతర ఏరోస్పేస్ పరిశ్రమలు ఇక్కడ తమ యూనిట్ లను ఏర్పాటు చేసుకోవచ్చని డిఫెన్స్ ఎక్స్ పోలో ప్రజెంటేషన్  ఇచ్చారు. ఈ అంశాలను ఫ్రెంచ్ ఇండో రక్షణ పరిశ్రమల సదస్సులో మంత్రి గౌతంరెడ్డి వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారు. ఏరోస్పేస్ రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం కీలకమని స్పష్టం చేశారు. దొనకొండకు అతి చేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులకు అవకాశం ఉందని మంత్రి వివరించినట్లు సమాచారం.

BJP MP GVL About Centre Decision On AP Capital

రాజధాని మార్పు మా చేతుల్లో లేదు... ప్రజలను మభ్య పెట్టొద్దు!! 

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 23 ఏప్రిల్ 2015 న ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో కాపీ కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మార్పు చేయలేదని ఇది రాష్ట్ర ప్రభుత్వం తనంత తానుగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు.  రాష్ట్రంలో రాజధాని మార్పు గురించి కానీ ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులు అన్న విషయం పై కేంద్రానికి అధికారిక సమాచారం ఏమి లేదని మీడియా ద్వారానే విషయాలను తెలుసుకోగలిగామని జీవీఎల్ వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధానిని పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని  ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారం అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని ఆయన వెల్లడించారు.  కొత్త రాజధాని విషయం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి తాను ఇదే విషయాన్ని అనేక  ప్రెస్ మీట్ లలో ప్రస్తావించినట్లు ఆయన అధికారికంగా ప్రస్తావించినట్లు తెలియజేశారు. అయితే అమరావతే రాజధానిగా కొనసాగాలని తాము భారతీయ జనతా పార్టీ ద్వారా అధికారికంగా స్పష్టం చేసినట్లు జీవీఎల్ తెలియజేశారు. అమరావతిలో అక్రమ భూముల దందా కొనసాగిందన్న విషయాన్ని తమ ఎన్నికల మానిఫెస్టోలో కూడా  ఒప్పుకున్నామని  కేవలం ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాజధాని మార్పు చేయడం సరికానిదని జీవిఎల్ తెలియజేశారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని దుర్వి నియోగం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసి రాజధానిని మార్చడం అనేది దుర్మార్గం అవుతుంది తప్పితే అది రాజకీయం కాదని  జీవీఎల్ వెల్లడించారు. రాజధాని మార్పు కేంద్రం చేతిలో ఉందని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పొద్దని అన్నారు. రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేము రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేము కానీ.. ఒక రాజకీయ పార్టీగా మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని జీవీఎల్ అన్నారు.

cm ys jagan met fake farmers

సీఎం జగన్ ని కలిసింది నకిలీ రైతులా.. పెయిడ్ ఆర్టిస్టుల గుట్టు రట్టు!!

జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా... అమరావతి ప్రాంత రైతులు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే రాజధాని కోసం ఆందోళన చేస్తున్న వాళ్ళు రైతులు కాదు.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ.. అధికార పార్టీ వైసీపీ నేతలు పలువురు ఆరోపించారు. దీంతో అధికార పార్టీ నేతలపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ వంటి వారు దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన రైతుల్ని, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించడం సరికాదంటూ ఆ వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీనే.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు మొదలుపెట్టిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని రైతులు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నానిలతో కలిసి వెళ్లి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై మంది రైతులు జగన్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారని, జగన్ వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వార్తలొచ్చాయి. అయితే దీనిలో ఓ ట్విస్ట్ ఉందట. సీఎం జగన్ తో భేటీ అయిన వారు అసలు రైతులే కాదట, వారిలో కొందరు ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువులు, సన్నిహితులు కాగా, మరికొందరు వైసీపీ కార్యకర్తలట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వారి పేర్లు, ఫోటోలు, వారికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉన్న బంధుత్వంతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లిన వారిలో.. చోడిశెట్టి నిర్మలత  అనే మహిళ ఉంది. ఆమె ఆర్కే లాయర్‌ అని తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డి, బోనురెడ్డి, సాంబిరెడ్డి, నాగిరెడ్డిలు.. ఆర్కే బంధువులు మాత్రమే కాదు.. వైసీపీ స్థానిక నేతలని కూడా తెలుస్తోంది. ఇలా పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... అసలైన పెయిడ్ ఆర్టిస్టుల డ్రామా వైసీపీదేనంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  

AP CM YS Jagan makes key comments on AP Capital

ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!!

ఏపీ రాజధాని వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. విజయవాడలో జరిగిన ‘ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాజధాని ప్రస్తావన తెచ్చారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అన్నారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉందని తెలిపారు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని చెప్పారు. అలాగే, అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరోసారి జగన్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రిగా రాజధానిపై నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది’ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. రాజధాని గురించి బాహుబలి లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని అన్నారు. తాను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెప్తాను అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని అనుకోవట్లేదు.. జపాన్, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని అని జగన్ వ్యాఖ్యానించారు.

AP CM Jagan requests PM Modi over Special Category Status

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధానికి సీఎం జగన్ లేఖ...

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పదేపదే తెరపైకి తెస్తున్నారు సీఎం జగన్. హోదాతోనే అభివృద్ధి సాధ్యమని వీలైనంత త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని జోక్యం అవసరం ఉందని లేకపోతే ఏపీ ప్రజలు దురదృష్టవంతులుగా మిగిలిపోతారని జగన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సరైన న్యాయం జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీకి చేయూత ఇవ్వడానికి బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన కూడా లేదని లేఖలో పేర్కొన్నారు జగన్. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కునేందుకు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇప్పటివరకు రాకపోవడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకిచ్చే ప్రత్యేక హోదాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం రెండు వేల పదహారులో ప్రకటించిందని, అయితే పదిహేనవ ఆర్థిక సంఘం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని నివేదికలో పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కానీ, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవడం అనేది తమ పరిధి కాదని పదిహేనవ ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని అన్నారు. దీన్ని బట్టి కేంద్ర ఆర్థిక శాఖకు, పదిహేనవ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. విభజన జరిపిన తీరు వల్ల తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ లబ్ధి పొందిందని ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు జగన్.

ఈరోజు ఓ కొలిక్కి రానున్న నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారం..!

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారంపై ఈరోజు క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉరిపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హై కోర్టు ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల పిటిషన్ లు వేస్తూ సాగతీస్తున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. నిర్భయ దోషుల ఉరి వ్యవహారం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సుప్రీం కోర్టు పిటిషన్ ను తిరస్కరించినా, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ లను పక్కనబెట్టినా నిర్భయ దోషులు మాత్రం ఒక్కొక్కరిగా కోర్టు మెట్లు ఎక్కుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ వినయ్ గుప్తాలకు న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ మూసుకుపోయాయి. అయితే మిగతా వారి పిటిషన్ లు పెండింగ్ లో ఉన్న కారణంగా ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తోంది.  దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే వరకు ఉరితీసే అవకాశం రాజ్యాంగ పరంగా లేకపోవటంతో అనేక పిటిషన్ లు తెరపైకొస్తున్నాయి. డేట్ ఫిక్స్ చేసిన తరువాత ఇప్పటివరకు నిర్భయ దోషుల ఉరి రెండు సార్లు వాయిదా పడింది. దీనిపై నిర్భయ తల్లితో పాటు వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆలస్యం చేయటం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోంది అంటూ కేంద్రం తన అసంతృప్తిని కోర్టుకు తెలిపింది. ఉరి తీయడానికి ఒక్కరోజు ముందు ట్రయిల్ కోర్టు డెత్ వారెంట్ పై స్టే విధించడాన్ని కేంద్రం ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉరిని నిలిపివేయడాన్ని సవాల్ చేసింది. శని, ఆది వారాలు కూడా కోర్టును సమావేశపరిచి ప్రత్యేకంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పు వెల్లడించనుంది. ట్రయిల్ కోర్టు స్టే విధించడాన్ని ఢిల్లీ హై కోర్టు తప్పు పడితే మళ్లీ కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుంది

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇటీవల రెవిన్యూశాఖపై అనేక ఆరోపణలు రావడంతో ఆ వ్యవస్థను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఈ నెల పదకొండున (ఫిబ్రవరి 11) ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ప్రధాన ఎజెండా కూడా రెవెన్యూ ప్రక్షాళన అని అధికార వర్గాల సమాచారం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవిన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలతో చెడ్డ పేరు మూటగట్టుకుంటున్న రెవిన్యూశాఖను మార్చేందుకు అన్ని రకాలుగా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించడంతో పాటు కొత్త రెవిన్యూ చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల పదకొండున ప్రగతి భవన్ లో కలెక్టర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీల తరువాత ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం చేసిందని రెవిన్యూ వర్గాల సమాచారం.  కొత్త రెవిన్యూ చట్టానికి తెలంగాణ భూ చట్టంగా నామకరణం చేసి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీవోటీ, ఇనాం, రక్షిత, కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, అసైన్, సర్వే, హద్దులు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే కలెక్టర్లు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ కొత్త రెవిన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అవినీతికి కారణమవుతున్న క్షేత్రస్థాయి రెవిన్యూ వ్యవస్థకు సమూల చికిత్స చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలు లంచాలకు తావు లేకుండా పకడ్బందీగా భూ రికార్డుల వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.  భూ యాజమాన్య హక్కుల బదిలీ, పాసు పుస్తకాల పంపిణీ దస్త్రాల్లో మార్పు చేర్పుల సందర్భంగా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు సహాయకుల జోక్యం ఉండటం కారణంగా ఈ దుస్థితి ఉందని భావిస్తోంది. ధరణి పోర్టల్ వేదికగా దస్త్రాల నిర్వహణ ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయిలో ఎంతమంది వీఆర్వో, వీఆర్యేల సేవలు అవసరమో గుర్తించి ఈ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోందని సమాచారం. రాష్ట్రంలో భూ దస్త్రాల నవీకరణ అనంతరం తొంభై నాలుగు శాతానికి పైగా దస్త్రాలో స్పష్టత వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. దీనినే టైటిల్ గ్యారంటీ చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్ ను ప్రవేశపెట్టాలన్న వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ రెండింటితో పాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1907 ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చ సాగుతుంది.

మేడారం జాతరకు ఎలా వెళ్లాలి? రూట్ మ్యాప్ మీ కోసం..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు ప్రారంభమైంది. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ మీకోసం.... ----హైదరాబాద్ నుంచి----- హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు... భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు, పసర, తాడ్వాయి మీదుగా లేదా పసర నుంచి నార్లపూర్ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. మేడారం జాతరకు ఇదే ప్రధాన రహదారిగా చెబుతున్నారు.  ----కరీంనగర్ నుంచి---- కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే భక్తులు ...హుజూరాబాద్‌, పరకాల, ములుగు, పసర, నార్లపూర్‌ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. అలాగే, కరీంనగర్‌ నుంచి మరో దారిలో కూడా మేడారం చేరుకోవచ్చు.... పెద్దపల్లి, మంథని, కాటారం, భూపాలపల్లి, బయ్యక్కపేట మీదుగా జంపన్న వాగు సమీపానికి చేరుకోవచ్చు.  ----ఖమ్మం నుంచి---- మరోవైపు ఖమ్మం వైపు నుంచి వచ్చే భక్తులు.... భద్రాచలం మంగపేట లేదా వాజేడు, వెంకటాపురం మీదుగా ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా మేడారం రావొచ్చు.  ----విజయవాడ నుంచి----- ఇక, విజయవాడ నుంచి వచ్చే భక్తులు నందిగామ, ఖమ్మం, ఇల్లందు, పసర, నార్లపూర్‌ మీదుగా జాతర ప్రాంగణానికి చేరుకోవచ్చు.  ----ఛత్తీస్ గఢ్ నుంచి---- అలాగే ఛత్తీస్‌గడ్‌ నుంచి వచ్చే భక్తులు.... వాజేడు గోదావరి బ్రిడ్జి మీదుగా ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారం జాతరకు రావాల్సి ఉంటుంది.  ----మహారాష్ట్ర నుంచి---- ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు... కాళేశ్వరం బ్రిడ్జి మీదుగా మహాదేవపూర్, గారెపల్లి, నార్లపూర్‌ మీదుగా గద్దెల దగ్గరకు రావొచ్చు.  ----రైలు ప్రయాణికులు---- ఇక, రైలు ప్రయాణికులైతే వరంగల్‌ లేదా కాజీపేట స్టేషన్లలో దిగి అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకోవచ్చు. అయితే, రద్దీ దృష్ట్యా ములుగు నుంచి నార్లాపూర్ మధ్య పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు. అలాగే, హన్మకొండ, ములుగు, పసర, తాడ్వాయి రూట్లో వన్ వే ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేప్పుడు నార్లాపూర్, బయ్యక్కపేట, ఘనపురం మీదుగా పరకాల, గుడెప్పహాడ్ వరకు వన్ వే కింద మార్చారు. ఇక, సొంత వాహనాల్లో వచ్చేవాళ్ల కోసం జంపన్నవాగు దగ్గర 10 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ్నుంచి గద్దెల దగ్గరకు వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవాళ్ల కోసం గద్దెలకు చేరువలో ప్రత్యేకంగా స్టాపులను ఏర్పాటు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి నాయకత్వం మార్పు

మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి నాయకత్వం మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణలో పార్టీ బతికి బట్టకట్టాలంటే టీపీసీసీ చీఫ్ ని వెంటనే మార్చాలంటూ హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే అసలు సమస్యల్ని పక్కన పెట్టేసి నాయకత్వ మార్పు చేస్తే కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుందా.. వరుస ఎన్నికల్లో ఓటమితో మరోసారి పాత రాగమే అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ చీఫ్ ను వెంటనే మార్చాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణనిచ్చామని పదేపదే చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినప్పటికీ వరుస ఓటములు పలకరించడంతో ఆ నెపాన్ని నాయకత్వంపై తోసేసి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. అసలు పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుందని ఎన్నడూ రివ్యూల జోలికి వెళ్లకుండా అంతర్గత కుమ్ములాటల్లో బిజీ అయిపోయారు. నాయకత్వం మార్పు అనేది సర్వసాధారణం కానీ, కేసీఆర్ ను ఎదుర్కొనగలిగే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కొందరు, లేదు లేదు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని ఇంకొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. లాయల్ గా ఉండే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినవాళ్లు మరికొందరు. అయితే పార్టీ నాయకులు అసలు లాజిక్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే కేవలం నాయకత్వ మార్పు ఒక్కటే మాత్రం కాదని, అంతర్గత సమన్వయం కూడా అవసరం అంటున్నారు విశ్లేషకులు. గడచిన ఆరేళ్ళలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకోదగ్గ ప్రజా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. ప్రజల పక్షాన రోడ్డెక్కిన నాయకులు లేరు. దీంతో జనంలోకి వెళ్లడమే మానేసి కుమ్ములాటలు పెట్టుకుంటే అధికారం ఎలా దక్కుతుంది అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి అంశాలను వదిలేసినట్టు కనిపిస్తుంది. నాయకుల మధ్య పోటీ అంతర్గత విభేధాలు పక్కనపెట్టేలా చేసి అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అధిష్టానం ఇప్పటికీ చెయ్యటం లేదు. పిసిసి నాయకత్వం అప్పటివరకు జిల్లా స్థాయిలో పర్యటన చేసింది కూడా అంతంత మాత్రమే. పార్టీలో సమస్యలు పరిష్కారం చేస్తూనే నాయకత్వాన్ని మార్చితే పార్టీకీ బెనిఫిట్ కానీ, సమస్యలు పక్కన పెట్టి జాతీయ నాయకుడిని పెట్టినా ప్రయోజనం ఆశించలేం అనేది అధిష్టానం ఎప్పుడు ఆలోచిస్తుందో చూడాలి.